3 ల‌క్ష‌ల కోట్లు.. 3 ల‌క్ష‌ల దొంగ ఓట్లు.. 3 ల‌క్ష‌ల్లోపు మెజార్టీ.. ఇదేమి గెలుపు? 

తిరుప‌తిలో 2,71,592 ఓట్ల‌తో వైసీపీ విజ‌య‌కేత‌నం. గ‌తంలో కంటే ఇంకొంచెం మెజారిటీ. ఎలాగోలా అధికార పార్టీ మ‌ళ్లీ గెలిచింది. తిరుప‌తి మ‌రోసారి వైసీపీ ఖాతాలో చేరింది. ఈ విజ‌యం అంత సునాయాసంగా రాలేదు. ఈ గెలుపు అస‌లు గెలుపే కాదు. ఖ‌జానా ఖాళీ చేసి.. జ‌నాన్ని బెదిరించి.. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. దొంగ ఓట్లు గుప్పించి.. గురుమూర్తిని గెలిపించారు. తిరుప‌తిలో గెలిచి.. ఓడిపోయారు.  న‌వ ర‌త్నాల పేరుతో చిల్లి గ‌వ్వ కూడా లేకుండా ఖ‌జానా ఖాళీ చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాల కోసం సుమారు 3 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తోంది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. చేతికి ఎముకే లేన‌ట్టు.. కులాల వారీగా, వ‌ర్గాల వారీగా, వ‌య‌సుల వారీగా, వృత్తుల వారీగా.. సంక్షేమం పేరుతో జ‌నానికి బిస్కెట్లు విసురుతూనే ఉన్నారు. ఏపీలో ప్ర‌తీ ఇంటికీ, ప్ర‌తీ మ‌నిషికి ఏదో ఒక రూపంలో.. ఏదో ఒక ప‌థ‌కం పేరుతో డ‌బ్బులు అందుతూనే ఉన్నాయి. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార పార్టీ పంచే ఓటుకు నోట్లు, మందు, బిర్యానీ ప్యాకెట్లు అద‌నం. ఇంత చేస్తే.. అంతా క‌లిపి.. ముచ్చ‌ట‌గా మూడు ల‌క్ష‌ల మెజారిటీ కూడా రాక‌పోవ‌డం అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం.  తిరుప‌తి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 17 ల‌క్ష‌ల ఓట్లు ఉన్నాయి. ఇందులో 11 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఓట్లు పోల‌య్యాయి. పోలైన ఓట్ల‌కు వైసీపీకి వ‌చ్చింది 6,26,108 ఓట్లు. అంటే దాదాపు 45శాతం ఓట‌ర్లు అధికార పార్టీని వ్య‌తిరేకించారు. అంతేకాదు వైసీపీకి పోలైన ఓట్ల‌న్నీ ఆ పార్టీ మీద అభిమానంతో వేసిన‌వి కానే కాదు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయ‌క‌పోతే.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఆపేస్తామంటూ బెదిరింపులు.. అక్ర‌మ కేసుల‌తో కుట్ర‌లు.. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. దొంగ ఓట్ల దారుణం. వినిపిస్తున్న ఆరోప‌ణ‌ల ప్ర‌కారం.. తిరుప‌తి ప‌రిధిలో ఏకంగా 3 ల‌క్ష‌ల వ‌ర‌కూ దొంగ ఓట‌రు కార్డులు త‌యారు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో.. పోలింగ్ నాడు దాదాపు రెండు ల‌క్ష‌ల వ‌ర‌కూ దొంగ ఓట్లు వేయించుకున్న‌ట్టు స‌మాచారం. ఇలా లెక్కేసి చూస్తే.. వైసీపీకి వ‌చ్చిన 6 ల‌క్ష‌ల ఓట్ల నుంచి 2 ల‌క్ష‌ల దొంగ ఓట్ల‌ను మైన‌స్ చేయాల్సి ఉంటుంది. అంటే, అధికార పార్టీ మెజార్టీ మొత్తం మాయ‌మైపోతుంది. 3 ల‌క్ష‌ల కోట్ల విలువైన‌ సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేసి.. 3 ల‌క్ష‌ల దొంగ ఓట‌రు కార్డులు సృష్టించి.. ఇంటింటికీ 3 వేల వ‌ర‌కూ డ‌బ్బులు పంచి.. 3 ల‌క్ష‌ల లోపు మెజార్టీతో బ‌య‌ట‌ప‌డ‌టం అధికార పార్టీకి అవ‌మాన‌క‌రంగా మారింది. ప్ర‌జ‌ల్లో ఆ పార్టీకి ఉన్న వ్య‌తిరేక‌త స్ప‌ష్టం అవుతోంది.  అదే తిరుప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిపక్ష టీడీపీకి 3,54,516 ఓట్లు వ‌చ్చాయి. టీడీపీ అధికారంలో లేదు. టీడీపీ బెదిరింపుల‌కు దిగ‌లేదు. టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల‌తో కోట్లు కుమ్మ‌రించ‌లేదు. టీడీపీ దొంగ ఓట్లు వేయించ‌లేదు. టీడీపీ ఓట‌ర్లను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేయ‌లేదు. అయినా.. మూడున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా ఓట‌ర్లు టీడీపీని న‌మ్మారు. తిరుప‌తిలో టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌మేమీ మారిపోదు. అయినా, జ‌గ‌న్‌రెడ్డిపై త‌మ‌కున్న అసంతృప్తిని చాటేందుకే.. టీడీపీకి అన్ని ల‌క్ష‌ల మంది ఓటేశార‌ని అంటున్నారు. ఒక‌టా, రెండా.. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అనేక అక్ర‌మాలు. ల‌క్ష‌లాది పేద‌ల‌కు క‌డుపు నిండా అన్నం పెట్టిన‌.. అన్నా క్యాంటీన్ల‌ను అడ్డంగా మూసేశారు. పేద‌ల క‌డ‌పు కొట్టారు. ఇసుక నుంచి కాసులు పిండుకుంటున్నారు. స‌రైన ఇసుక విధానం లేక నెల‌ల త‌ర‌బ‌డి ఏపీలో నిర్మాణాలు ఆగిపోయాయి. ఇసుక దొర‌క్క రోజువారీ కూలీలు రోడ్డున ప‌డ్డారు. ఇప్ప‌టికీ ఏపీలో ఇసుక ఖ‌రీదైన వ్యాపార‌ వ‌స్తువే. ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లను ఏదో ఒక రూపంలో దెబ్బ కొట్టింది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. ఆఖ‌రికి మందు బాబులు సైతం సీఎం జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో మండిప‌డుతున్నారు. ఊరూ,పేరూ లేని బ్రాండులు తీసుకొచ్చి.. డ‌బుల్‌, త్రిబుల్ రేట్లు పెట్టి.. మందుబాబుల‌ను అడ్డంగా దోచుకుంటున్నారు. టీడీపీ ఆరోపిస్తున్న‌ట్టు.. ఒక చేత్తో వంద రూపాయ‌లు ఇచ్చి.. మ‌రో చేత్తో వెయ్యి రూపాయ‌లు లాగేస్తోంది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. అందుకే, వైసీపీ పాల‌న‌పై అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.  అయితే, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త వేరు.. ఎన్నిక‌ల్లో గెలుపు వేరు. తాయిళాల‌తోనో, బెదిరింపుల‌తోనో, ఏక‌గ్రీవాల‌తోనో, దొంగ ఓట్ల‌తోనే.. ఎలాగోలా దారుణాల‌తో, దౌర్జ‌న్యాల‌తో.. వ‌రుస ఎన్నిక‌ల్లో గెలుస్తూ వ‌స్తోంది వైసీపీ. తిరుప‌తిలోనూ అదే జ‌రిగింది. టెక్నిక‌ల్‌గా గెలిచి.. నైతికంగా ఓడిపోయింది. ప్ర‌జాక్షేత్రంలో దోషిగా నిల‌బ‌డింది. ప‌రిస్థితి చూస్తుంటే.. ముందుముందు భ‌విష్య‌త్తు అంతా టీడీపీదే అనిపిస్తోంది. ప్ర‌జానాడి అలా ఉంది మ‌రి. అధికార పార్టీపై వెల్లువెత్తుతున్న వ్య‌తిరేక‌త‌.. తెలుగుదేశానికి పెరుగుతున్న‌ ప్ర‌జాదర‌ణ.. తిరుప‌తి ఫ‌లితాల్లో అంత‌ర్లీనంగా స్ప‌ష్టం అవుతోంది.     

దేశంలో కఠిన లాక్ డౌన్! కేంద్రానికి ఎయిమ్స్ రిపోర్ట్ 

దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించబోతున్నారా? లాక్ డౌన్ పై కేంద్రం నుంచి ఏ క్షణమైనా ప్రకటన రానుందా? అంటే కేంద్ర సర్కార్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.  దేశంలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్నందున.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత లాక్ డౌన్ పెడతారని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రావడం.. అంతలోనే ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో దేశంలో లాక్ డౌన్ విధించడం ఖాయమని తెలుస్తోంది.  దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండవరోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా రోజురోజుకు ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. మే రెండో వారానికి దేశంలో కరోనా విజృంభణ పీక్ స్టేజీకి చేరుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత ఉన్న కొన్న రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అయినా కరోనా కట్టడి కావడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో గతేడాది మాదిరిగానే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. కొవిడ్-19 సంక్షోభంతో దేశం కొట్టిమిట్టాడుతున్న వేళ ఈ తరహా ఆంక్షలు తప్పదని ఆయన స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ విధించాలని ఎయిమ్స్ డైరెక్టర్ తేల్చి చెప్పారు.  ప్రస్తుతం భారతదేశం కొవిడ్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోందనీ.. ఈ మమ్మారిని నిలువరించేందుకు నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధించి ప్రయోజనం లేదని డాక్టర్ గులేరియా అన్నారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా సహా ఇతర రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు విధించడం వల్ల పెద్దగా ఏమీ ప్రయోజనం కనిపించలేదని ఆయన వివరించారు. ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఆక్సిజన్ అందక మరణించడం పైనా డాక్టర్ గులేరియా స్పందించారు. ఆ వైద్యుడు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసుననీ.. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు కూడా తీవ్ర నష్టమని అన్నారు. ఈ వైరస్‌ తీవ్రతను ప్రపంచంలోని ఏ ఆరోగ్య వ్యవస్థ ఇంతవరకు నిలువరించ లేకపోయిందనీ.. వైరస్ నియంత్రణకు చెక్ పెట్టాలంటే పూర్తిస్థాయి లాక్‌డౌన్ లేదా కఠిన ఆంక్షలే కీలకమని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు.  మరోవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతోపాటు ఆక్సిజన్ కొరత వేధిస్తుండటంతో నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లుగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. నైట్రోజన్ ఉత్పత్తి చేసే 14 పరిశ్రమలను ఆక్సిజన్ ఉత్పత్తికి మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే విధంగా మరొక 37 పరిశ్రమలను మార్చబోతున్నారు. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను సమీపంలోని ఆసుపత్రుల వద్దకు చేర్చాలని నిర్ణయించారు. ఆ విధంగా ఆసుపత్రుల వద్దకు ఈ ప్లాంట్లను చేర్చడం సాధ్యం కాకపోతే, తయారు చేసిన ఆక్సిజన్‌ను ప్రత్యేక సిలిండర్లతో ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయించారు.   

నందిగ్రామ్ లో మమత ఓటమి... కోర్టుకు వెళతామన్న టీఎంసీ 

టీట్వంటి మ్యాచ్ ను తలపించేలా సాగిన నందిగ్రామ్ అసెంబ్లీ ఫలితాన్ని ఎట్టకేలకు అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించినట్లు ఈసీ ప్రకటించింది. సమీప ప్రత్యర్థి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 1,736 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు తెలిపింది. నందిగ్రామ్ లో  తొలి రౌండ్‌ నుంచి  హోరాహోరీగా ఫలితం వచ్చింది. రౌండ్ రౌండ్ కు లీడ్స్ మారాయి. కొన్ని రౌండ్లలో సువేందకు ఆధిక్యంలో ఉంటే.. మరికొన్ని రౌండ్లలో మమత ముందున్నారు.  అయితే  సాయంత్రానికల్లా మమతా బెనర్జీ 12 వందల ఓట్లతో గెలిచినట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే మమత ఓడిపోయారని, సువేందు 16 వందలకు పైగా ఓట్లతో గెలిచారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై గందరగోళం కొనసాగుతుండగానే... నందిగ్రామ్ లో ఇంకా లెక్కింపు కొనసాగుతుందని, గెలుపును ప్రకటించలేదని ఈసీ ప్రకటించింది. దీంతో అసలు నందిగ్రామ్ లెక్కింపులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. టీఎంసీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్ర దగ్గర ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది.  అయితే రీ వెరిఫికేష్ తర్వాత  సువేందు అధికారి గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.  బిజెపి అభ్యర్థి సువెందు అధికారి విజయం.టీఎంసీ అభ్యర్థి సీఎం మమతా బెనర్జీ పై 1,736 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఆర్వో ప్రకటన చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామన్న తృప్తి టీఎంసీ శ్రేణులకు దక్కలేదు.ఈ ఫలితంపై పెద్దగా బాధపడాల్సిన పనిలేదని మమతా పార్టీ నేతలను ఊరడించారు. అయితే, ఓట్ల లెక్కింపులో తేడా జరిగిందని, తాము దీనిపై కోర్టుకు వెళతామని ఆమె వెల్లడించారు.   

ఏపీలో భయం, భయం.. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరుగులు తీస్తుంది. ఒకే రోజు ఆకాశంలోకి రాకెట్ దూసుకుపోయినట్లు కరోనా కేసులు దూసుకుపోయాయి. కొత్తగా వచ్చిన కరోనా కేసులను చూసి ఏపీ ప్రజలు గందరగోళంలో పడ్డారు. ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం కరోనా కంగు తినిపించింది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత తొలిసారి 23వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను  ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 పరీక్షలు నిర్వహించగా.. 23,920 కేసులు నిర్ధారణ కాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,45,022 మంది వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,66,02,873 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.   కొవిడ్‌తో తూర్పు గోదావరిలో 12 మంది; విశాఖ, అనంతపురం, కృష్ణాలో 8 మంది చొప్పున; ప్రకాశం, విజయనగరంలో ఏడుగురు చొప్పున; చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; గుంటూరులో ఐదుగురు; కర్నూల్‌లో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,136కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,411 మంది బాధితులు కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 9,93,708కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,178 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 2,945 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్‌ బారినపడ్డారు.   జిల్లాల వారీగా కేసులు..      

జానారెడ్డి రాజకీయ సన్యాసం.. సాగర్ ఓటమితో సంచలనం 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు కుందూరు జానా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు జానారెడ్డి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత.. ఈ సంచలన నిర్ణయం ప్రకటించారు జానా రెడ్డి. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయరని, ఆయన తనయుడు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తమకు అత్యంత కీలకమైన ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పెద్దలంతా జానారెడ్డిని పోటీ చేయాలని కోరారని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం జానారెడ్డి తీవ్రంగా శ్రమించారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఆయన ప్రచారం చేశారని చెబుతున్నారు. అయినా ఫలితం వ్యతిరేకంగా రావడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని జానారెడ్డి నిర్ణయించారని చెబుతున్నారు.  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలు కంటే మిన్నగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేల 8 వందల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ భగత్ కు లీడ్ వచ్చింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకుపోయారు భగత్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాలు ఉండగా.. అనుమల తప్ప మిగితా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ లీడ్ సాధించింది.  నాగార్జున సాగర్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు , జానారెడ్డికి కంచుకోటగా ఉంది. గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండగా.. 2009లో జరిగిన పునర్విభజనలో నాగార్జున సాగర్ నియోజకవర్గంగా మారింది. ఇక్కడి నుంచి 11 సార్లు పోటీ చేసిన జానారెడ్డి.. ఏడు సార్లు గెలిచారు. తొలిసారి తొలిసారి పోటీ చేసిన ఓడిపోయిన జానారెడ్డి.. 1985 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 1999లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో దివంగల నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. నోముల మరణంతో జరిగిన ఉపఎన్నికలో ఆయన తనయుడు నోముల భగత్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు జానారెడ్డి. దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

ఏపీలో పరీక్షలు లేవు.. 

కరోనా ఆ పేరు వింటే.. గుండెల్లో విశాఖ రైల్ పరుగెడుతోంది. సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయం అంతా ఇంత కాదు. ఇలాంటి టైం లో స్టూడెంట్స్ ప్రమాదం అవుతుందని ఆలోచించకుండా జగన్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధం అయింది.  ప్రతి పక్షాలు ఎన్ని విమర్శలు చేసిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం  తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోశాయి. చివరికి ఈ విషయం పై ఏపీ న్యాయస్థానం కూడా జోక్యం చేసుకుంది. అయినా ఎవరు ఎన్ని చెప్పిన జగన్ ప్రభుత్వం మాట వినలేదు. పగ్గాలు లేకుండా పరుగెడుతున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేకులు వేసింది. మెడలు వంచింది. ఏపీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కరోనా  క్రమంలో ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్‌ మీడియట్‌ పరీక్షల నిర్వహణ మీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దొంగ ఓట్లే లీడ్! ఓడి గెలిచిన టీడీపీ

అంత‌న్నారు. ఇంత‌న్నారు. ఏకంగా 6 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుంద‌న్నారు. మంత్రులంతా తిరుప‌తిని చుట్టుముట్టారు. వైసీపీకి ఓటేయ‌క‌పోతే ప‌థ‌కాలు అంద‌వంటూ బెదిరించారు. వాలంటీర్ల‌నూ విచ్చ‌ల‌విడిగా వాడేసుకున్నారు. ఇక‌  పోలింగ్ నాడైతే దొంగ‌నోట్ల దండ‌యాత్రే. పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వంద‌లాది బ‌స్సులు, వాహ‌నాల్లో దొంగ ఓటర్లు దిగిపోయారు. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని విధంగా తిరుప‌తిలో దొంగ ఓట్ల‌తో ప్ర‌జాస్వామ్యం అబాసుపాలైంది. ఇంతా చేస్తే.. అంత గట్టిగా ప్ర‌య‌త్నిస్తే.. వ‌చ్చింది కేవ‌లం రెండు ల‌క్ష‌ల పైచిలుకు మెజార్టీ మాత్ర‌మే.  ప్ర‌చార స‌మ‌యంలో జిల్లా మంత్రి త‌మ‌కు 5 ల‌క్ష‌ల ఆధిక్యం కాయ‌మంటూ మీసం మెలేశాడు. మరో మంత్రి ఆరు లక్షల మెజార్టీ ఖాయమన్నాడు. జిల్లాకు వ‌చ్చిన మంత్రులు సైతం 5 ల‌క్ష‌ల మెజార్టీ ఖాయ‌మ‌న్నారు. గెలుపు త‌మ‌దేనంటూ గొప్ప‌ల‌కు పోయారు. తీరా.. తిరుప‌తి ఫ‌లితం వ‌చ్చాక అంతా ఖంగు తిన్నారు. ఇదేంటి ఇంత త‌క్కువ మెజార్టీ ఏంటంటూ ఉలిక్కిప‌డుతున్నారు. 5 ల‌క్ష‌ల ఎక్క‌డ? 2 ల‌క్షలు ఎక్క‌డ‌?  తిరుప‌తిలో వైసీపీ గెలిచిన‌ట్టా? ఓడిన‌ట్టా? మంత్రి చెప్పిన లెక్క‌ ప్ర‌కారం.. సుమారు 3 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో అధికార పార్టీ తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోయింద‌ని అంటున్నారు. ఛీ.. ఇదీ ఓ గెలుపేనా అంటున్నారు వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు లాంటి వారు.దొంగ ఓట్లు వేయించకుంటే వైసీపీ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. తిరుపతి పోలింగ్ రోజున వేలాది మంది బయటి వ్యక్తులు ఓటేయడానికి రావడం మీడియా సాక్షిగా బహిర్గతమైంది. వందలాది మందిని టీడీపీ, బీజేపీ నేతలు పట్టుకున్నారు. తిరుపతిలో అయితే ఎక్కడ చూసినా ఫేక్ ఓటర్లే కనిపించారు. దొంగ ఓటర్ల దండుతో నిజమైన స్థానిక ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. తిరుపతిలో పోలింగ్ తగ్గటానికి ఇదే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు సీఈసీకి లేఖ కూడా రాశారు. ఇంత చేసినా వైసీపీ మెజార్టీ రెండు లక్షల్లోనే ఉండటం.. అధికార పార్టీ నేతలను షాకింగ్ కు గురి చేస్తుందంటున్నారు.  నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనే మూడున్నర లక్షల మెజార్టీ సాధించాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. కౌంటింగ్ లో మాత్రం అతి కష్టం మీద లక్ష దాటిందని అంటున్నారు. గూడురు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో  వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ సాగింది. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అవ‌లంభిస్తున్న అడ్డ‌గోలు విధానాల‌పై ఓట‌ర్లు విసుగు చెందార‌ని చెప్ప‌డానికి తిరుప‌తి ఎన్నిక‌లే ఓ ఉదాహ‌ర‌ణ‌. అధికార పార్టీ చెబుతున్నట్టు జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌పై అంత ప్రేమే ఉంటే.. వాళ్లు చెప్పిన‌ట్టుగా.. 5ల‌క్ష‌ల‌కు పైగా మెజార్టీ వ‌చ్చుండేది. అంత ఆధిక్యం రాలేదంటే.. జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ట్టేగా? ప్ర‌భుత్వ పాల‌న‌పై మెజార్టీ ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్న‌ట్టేగా? అంటున్నారు.  ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది. ఆ ఎన్నిక‌ల్లో ఎలా గెలిచిందీ అంద‌రికీ తెలిసిందే. బ‌లం, బ‌ల‌గం, బ‌ల ప్ర‌యోగంతో ప్ర‌తిప‌క్షాల‌ను, ఓట‌ర్లను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి.. ఏక‌గ్రీవాల‌పై ఒత్తిడి చేసి.. న‌యానో భ‌యానో.. స్థానిక సంస్థ‌ల‌ను త‌మ ఖాతాలో వేసుకుంది వైసీపీ. అలానే, తిరుప‌తిలోనూ వార్ వ‌న్ సైడ్ అవుతుంద‌ని ఊహించింది. కానీ, ప్ర‌చార స‌మ‌యంలో టీడీపీ నుంచి వ‌చ్చిన అనూహ్య పోటీతో ఒక్క‌సారిగా డిఫెన్స్‌లో ప‌డిపోయింది అధికార పార్టీ. టీడీపీ దూకుడు చూసి.. చంద్ర‌బాబు, లోకేశ్ ప్ర‌చార ర్యాలీలు చూసి.. అస‌లు గెలుస్తామ‌నే న‌మ్మ‌కం కూడా వ‌దిలేసింది. అందుకే, 5 ల‌క్ష‌ల మేర‌ అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తామంటూ మైండ్ గేమ్ మొద‌లుపెట్టారు వైసీపీ నాయ‌కులు. గెలుపు మూడ్‌ టీడీపీ నుంచి వైసీపీకి మ‌ళ్లేలా.. అధికార పార్టీ మెజార్టీపై ప్ర‌చారం, బెట్టింగ్‌లు పెంచేశారు. ఓట‌ర్ల దృష్టిని వైసీపీ ఓట‌మి నుంచి మెజార్టీపైకి మ‌ళ్లించారు. అవ‌స‌రం ఉన్నా లేకున్నా.. 5 ల‌క్షల మెజార్టీ వ‌స్తుందంటూ తిరుప‌తి వ్యాప్తంగా ఊద‌ర‌గొట్టారు. తీరా.. ఇప్పుడు రిజ‌ల్ట్స్ వ‌చ్చాక‌.. మెజార్టీ 2 ల‌క్ష‌లకే ప‌రిమితం కావ‌డంతో.. అధికార పార్టీ ప‌రువు పోయినంత ప‌నైంది. గెలిచినా.. ఆ గెలుపును ఆస్వాదించ‌లేని దుస్థితి వైసీపీది.  వైసీపీపై ఎంత మేర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోందో.. అదే స్థాయిలో టీడీపీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంది. తిరుప‌తి ఉప ఎన్నికే ఇందుకు సాక్షం. తిరుప‌తి ఎంపీ నియోజ‌క‌వర్గ ప‌రిధిలో చంద్ర‌బాబు ప్ర‌చార స‌భ‌ల‌న్నీ జ‌నంతో కిక్కిరిసిపోయాయి. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం చంద్ర‌బాబు ర్యాలీల్లో క‌నిపించింది. నారా లోకేశ్ షోలు సైతం అంతే గ్రాండ్ స‌క్సెస్ అయ్యాయి. ఎక్క‌డికెళ్లినా.. టీడీపీకి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్ర‌బాబును, నారా లోకేశ్‌కు జేజేలు ప‌లికారు. ప్ర‌జా తీర్పు.. ప్ర‌చార స‌మ‌యంలోనే వ‌చ్చేసింది.  ఆ ర్యాలీలు, ఆ స‌భ‌లే.. టీడీపీని నైతికంగా గెలిపించేశాయి. ప్ర‌స్తుతం.. దొంగ ఓట్ల‌తోనో, అధికార బ‌లంతోనో, బెదిరింపుల‌తోనో.. టెక్నిక‌ల్‌గా వైసీపీ గెలిచినా.. ప్ర‌జ‌లు మాత్రం టీడీపీ ప‌క్షానే ఉన్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. వైసీపీకి 5 ల‌క్ష‌ల మెజార్టీ రాక‌పోవ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం. అందుకే, తిరుప‌తిలో వైసీపీ గెలిచి ఓడింది.. టీడీపీ ఓడి గెలిచింది... అంటున్నారు జ‌నం. ఆ విష‌యం జ‌గ‌న్ మ‌న‌స్సాక్షికి కూడా తెలుసు.

గెలిచిన , ఓడిన ప్రముఖులు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వచ్చాయి. హోరాహోరీ పోరు సాగిన పశ్చిమ బెంగాల్ లో ఎవరూ ఊహించని విధంగా రెండు వందలకు పైగా సీట్లులో విజయం సాధించింది తృణామూల్ కాంగ్రెస్. ముచ్చటగా మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టారు మమతా బెనర్జీ. అయితే నందిగ్రామ్ లో మాత్రం గెలుపు కోసం దీదీ చివరి వరకు పోరాడారు. ఆమె తన ప్రధాన ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారిపై పన్నెండు వందలకు పైచిలుకు ఓట్ల తేడాతో నెగ్గారు.  కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మమతా, సువేందు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఒక రౌండ్ లో మమతా ఆధిక్యంలో ఉంటే, మరో రౌండులో సువేందు ఆధిక్యంలోకి వస్తుండడంతో విజయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.చివరకు స్వప్య ఆధిక్యంతో గట్టెక్కారు మమతా బెనర్జీ. శిబపూర్ నియోజవర్గంలో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇండియన్ క్రికెటర్ మనోజ్ తివారి గెలపొందారు. టోలీగంజ్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి బబూల్ సుప్రియో ఘోరంగా ఓడిపోయారు.  కేరళలో ధర్మదాం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ గెలిచారు. పూతుపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఉమెన్ చాందీ గెలిచారు. కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ తాను పోటీ చేసిన కొణ్ణి, మంజేశ్వర్ రెండు సీట్లలోనూ ఓడిపోయారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రో శ్రీధరన్ పాలక్కాడ్ లో పరాజయం పాలయ్యారు. త్రిస్సూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు సురేష్ గోపి ఓడిపోయారు.  తమిళనాడులో డీఎంకే చీఫ్ స్టాలిన్, ముఖ్యమంత్రి పళనీ స్వామి ఎడప్పాడిలో విజయం సాధించారు. శశికళ మేనల్లుడు దినకరన్ ఓడిపోయారు. చెపాక్ లో ఉదయనిది స్టాలిన్ గెలుపొందారు. దక్షిణ కోయంబత్తూరులో కమల్ హాసన్ విజయం సాధించారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ సుందర్ ఓడిపోయారు. యానాంలో మాజీ సీఎం రంగస్వామి స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 

పీకే సంచలనం.. రెస్ట్ తీసుకుంటానని ట్వీట్ 

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సహా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకే అధికారం కైవసం చేసుకోగా.. కేరళలో గత సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండోసారి లెఫ్ట్ కూటమి విజయం సాధించింది. అసోంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా.. పుదిచ్చేరిలో ఎన్డీఏ కూటమి గెలిచింది. పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఊహించని విక్టరీ కొట్టింది మమతా బెనర్జీ. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ రెండు వందలకు పైగా సీట్లు గెలుచుకుంది టీఎంసీ. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల్లో ఎలా గెలవాలో పార్టీలకు సలహాలు, సూచనలు ఇస్తూ దేశంలో సరికొత్త ట్రెండ్ కు ఆద్యుడైన ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం చేశారు. జీవితంలో మరేదైనా చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.ప్రస్తుతం చేస్తున్న పనిని ఇకపై కొనసాగించలేనని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బెంగాల్ గెలిచిందని, అందుకు తాను ఎంత చేయాలో అంతా చేశానని వివరించారు. కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.  పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకేల కోసం పీకే పనిచేశారు. ఈ రెండు పార్టీలు తాజా ఎన్నికల్లో విజయం సాధించాయి. బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు జరగ్గా.... బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిశోర్ పదేపదే సవాల్ చేశారు. ఆయన సవాల్ కు తగ్గట్టుగానే బెంగాల్ లో బీజేపీ వంద సీట్లు సాధించలేకపోయింది.ప్రశాంత్ కిశోర్ గతంలో జేడీయూ పార్టీలో చేరినా, ఎన్ పీఏ, ఎన్నార్సీ అంశాల్లో పార్టీ వ్యతిరేక వైఖరి అవలంబించారంటూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.

ఏపీలో ఘోరం.. ఆక్సిజన్ అందక 15 మంది మృతి..

ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజువారీగా పదివేలకు పైగానే కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వలన కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనాకు వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సమాచారం. తీరా ఘోరం జరిగాక యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ఆస్పత్రిని వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా డీఎంహెచ్‌వో స్పందించారు. కేఎస్ కేర్ ఆస్పత్రికి కొవిడ్ చికిత్స అనుమతి లేదన్నారు. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందినట్లు సమాచారం అందినదని పేర్కొన్నారు.మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులో లేదని తెలిపారు. మరో వైపు..   రాష్ట్రంలో ఆక్సిజన్ అందుబాటులో లేక ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా అనంతరం జిల్లా జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు అందక కళ్ల ముందే తమ వారు చనిపోతుండటంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలియడంతో హాస్పిటల్లో తనిఖీ చేసి జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్యులను విచారించారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తమ వారు మరణించారని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.     

బీజేపీ క‌థ కంచికే.. ప‌వ‌న్‌కు దిక్కు చంద్ర‌బాబే..

తిరుప‌తి. టెంపుల్ సిటీ. కాషాయం యాక్టివిటీ కాస్త ఎక్కువ‌. అందుకే, మిత్రప‌క్షం జ‌న‌సేన‌తో పోరాడి మ‌రీ తిరుప‌తి ఎంపీ స్థానంలో బ‌రిలో నిలిచింది బీజేపీ. ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. క‌మ‌లానికి స‌పోర్ట్‌గా ప్ర‌చారం కూడా చేశారు జ‌న‌సేనాని. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోద‌ర్‌.. ప‌లువురు కేంద్ర‌మంత్రులు, తెలంగాణ బీజేపీ నేత‌లు.. ఇలా కాషాయ ద‌ళం పెద్ద ఎత్తున తిరుప‌తిలో దిగిపోయింది. బీజేపీ అభ్య‌ర్థి, రిటైర్డ్ ఐఏఎస్ ర‌త్న‌ప్ర‌భ గెలుపు కోసం బీజేపీ-జ‌నసేన‌లు ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నం చేశారు. ఇంతా చేస్తే.. బీజేపీకి వ‌చ్చిన ఓట్లు ఎన్నంటే.. 50వేలకు కాస్త అటూఇటూ. ఇంత మాత్రానికే బీజేపీ అంత బిల్డ‌ప్ ఇచ్చిందా అంటూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీలో బీజేపీ క‌థ ముగిసిన‌ట్టేన‌ని జోస్యం మొద‌లైపోయింది. బీజేపీతో క‌లిసుంటే జ‌న‌సేన‌కూ రాజ‌కీయ అంధఃకార‌మేనంటూ విశ్లేష‌ణ న‌డుస్తోంది. ఏపీ రాజ‌కీయాల్లో బీజేపీ-జ‌న‌సేనల మైత్రీ.. మునిగే టైటానిక్ షిప్‌లాంటిదంటున్నారు.  చంద్ర‌బాబుతో స్నేహం.. టీడీపీతో పొత్తు ఉన్నంత కాల‌మే ఏపీలో బీజేపీకైనా, జ‌న‌సేన‌కైనా మ‌నుగ‌డ సాధ్య‌మైంది. ఎప్పుడైతే ప్ర‌ధాని మోదీ ఏపీకి అన్యాయం చేయ‌డం మొద‌లైందో.. వెంట‌నే బీజేపీతో ఫ్రెండ్‌షిప్ క‌ట్ చేసుకున్నారు చంద్ర‌బాబు. ఆనాటి నుంచి బీజేపీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాలిట ద్రోహిగా, దోషిగా చూస్తున్నారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. అందుకే, టీడీపీతో జ‌ట్టు క‌ట్టి.. 2014 ఎన్నిక‌ల్లో 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగి.. బోణీ కూడా కొట్ట‌లేక‌పోయింది. ఆనాటి నుంచి ఏపీలో క‌మ‌ల వికాసం క్ర‌మంగా క‌నుమ‌రుగు అయింది. అది తిరుప‌తి ఎన్నిక‌ల్లోనూ సుస్ప‌ష్టంగా క‌నిపించింది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ, వైసీపీ మ‌ధ్య కొన‌సాగుతున్న చీక‌టి స్నేహం.. క‌మ‌ల‌ద‌ళానికి పెద్ద మైన‌స్‌. అందుకే, తిరుప‌తిలో ఇంత‌టి ఘోర ప‌రాభ‌వం. అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం బీజేపీని, కేంద్రాన్ని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టాడు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో గాని.. అదే బీజేపీతో ఇప్పుడు అంట‌కాగుతున్నాడు. 2019లో తిరుప‌తి ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ఓడించిన ప్ర‌జ‌లే.. ఇప్పుడు కూడా తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల్లో పీకే మ‌ద్ద‌తిచ్చిన ర‌త్న‌ప్ర‌భ‌ను ఓడించారు. ఏపీలో ప‌వ‌ర్ స్టార్‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ.. అది ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేందుకు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌టం లేదు. మునిగే నావ‌లాంటి బీజేపీని న‌మ్ముకోవ‌డ‌మే ప‌వ‌న్ చేస్తున్న మిస్టేక్ అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇదే ప‌వ‌న్‌.. చంద్ర‌బాబుతో క‌లిసుంటే.. ఫ‌లితాలు మ‌రోలా వ‌చ్చేయ‌ని అంటున్నారు. గ‌త స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తిచ్చిన అభ్య‌ర్థుల‌కు వ‌చ్చిన ఓట్ల శాతాన్ని క‌లిపి.. విశ్లేషిస్తే.. ఈ రెండు పార్టీల పొత్తు.. అధికార వైసీపీకి చెక్ పెట్ట‌డం ఖాయ‌మంటున్నారు. కానీ, లెక్క‌లేనంత తిక్క ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఇలాంటి పొలిటిక‌ల్ లెక్క‌లు త‌లకెక్కితేగా? 2019 నుంచి ఇప్ప‌టి తిరుప‌తి బైపోల్ వ‌ర‌కూ.. బీజేపీ ఎక్క‌డా, ఏమాత్రం ఉనికి చాటడం లేదు. ఏపీలో ఆ పార్టీకి కొంద‌రు లీడ‌ర్లైతే ఉన్నారు కానీ... కార్య‌క‌ర్త‌లు, ఓటర్లు మాత్రం దాదాపు లేన‌ట్టే. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పేరుతో కాస్తోకూస్తో క‌మ‌ల‌నాథుల‌ హ‌డావుడి క‌నిపించేది ఒక్క తిరుప‌తిలోనే. ఇప్పుడు అక్క‌డా ఓట్లు ప‌డ‌క‌.. డిపాజిట్ కోసం క‌ష్ట‌ప‌డిన బీజేపీకి.. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ భ‌విష్య‌త్తు క‌ష్ట‌సాధ్య‌మే. ఆ విష‌యంలో తిరుప‌తి ఉప ఎన్నిక‌తో స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. క్లారిటీ రావాల్సింది ఒక్క జ‌న‌సేనానికే. ఇప్ప‌టికైనా మించి పోయింది లేదు.. గ‌తంలో కామ్రేడ్ల‌తో దోస్తీ చేసి.. ఆ త‌ర్వాత వారికేమైనా బాకీ ప‌డ్డానా అంటూ.. క‌మ్యూనిస్టుల‌కు హ్యాండ్ ఇచ్చిన‌ట్టుగానే.. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోవ‌డం ఎంతైనా బెట‌ర్‌. లేదంటే.. తాను నిండా మున‌గ‌డ‌మే కాకుండా.. జ‌న‌సేన‌నూ ప్ర‌జాక్షేత్రంలో ముంచేయ‌గ‌ల‌దు క‌మలం పార్టీ. ఆంధ్రుల‌కు అండ‌గా ఎప్ప‌టికీ నిలిచే పార్టీ ఏదైనా ఉందంటే.. అది ఒక్క తెలుగుదేశం పార్టీనే. అధికార పార్టీ అగ‌డాలు, అరాచ‌కాల‌ను ఎదురించ‌గ‌ల స‌త్తా.. అడ్డుకోగ‌ల స‌త్తువా.. ఒక్క టీడీపీకే సొంతం. అందుకే, ఎన్న‌టికైనా వైసీపీకి ప్ర‌త్యామ్నాయం తెలుగుదేశ‌మే. బీజేపీ, జ‌న‌సేన కానేకావు. ఆ పార్టీల‌కు ఏపీలో అంత సీన్ లేదు. ఆ విష‌యం తిరుప‌తి ఎన్నిక‌తో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. భ‌విష్య‌త్ టీడీపీదేన‌ని తేలిపోయింది. బీజేపీ భ్ర‌మ‌లో ఉన్న‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఇప్ప‌టికైనా రాజ‌కీయంగా జ్ఞానోద‌యం అయితే అది రాష్ట్రానికే మంచిది. బీజేపీ, వైసీపీ క‌లిసి ఆడుతున్న పొలిటిక‌ల్ డ్రామాలో.. పీకే.. పావుగా మారాడ‌నేది విశ్లేష‌కుల మాట‌.

డిపాజిట్ గల్లంతు.. తెలుగు రాష్టాల్లో బీజేపీకి షాక్ 

దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. నరేంద్ర మోడీ, అమిత్ షా సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రెండు స్థానాల్లోను డిపాజిట్లు కోల్పోయారు బీజేపీ అభ్యర్థులు.  గత నవంబర్ లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన బీజేపీ.. తెలంగాణలో స్పీడ్ పెంచింది. తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతం ఇచ్చింది. అయితే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సీన్ మారిపోయింది. ఎంతగా పోరాడినా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది కమలదళం. నాగార్జున సాగర్ లో డిపాజిట్ కోల్పోయి పరువు పోగొట్టుకుంది బండి సంజయ్ టీమ్. సాగర్ లో మొత్తం లక్షా 89 వేల ఓట్లు పోల్ కాగా... బీజేపీ అభ్యర్థి రవి నాయక్ కు కేవలం 6 వేల 810 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీ కేవలం 4 శాతం ఓట్లు మాత్రం సాగర్ లో సాధించింది. గిరిజన అభ్యర్థిని బరిలోకి దింపి ప్రయోగం చేసినా.. ఆ సామాజిక వర్గం ఓట్లను కూడా దక్కించుకోలేకపోయింది. దుబ్బాక ఉపఎన్నిక మీద బీజేపీ కనబరిచిన దూకుడు సాగర్ లో  పెద్దగా కనిపించలేదు. నాగార్జున సాగర్ లో బీజేపీ మొదటి నుంచి గందరగోళంగానే వ్యవహరించింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. ఎలాగు ఓటమి తప్పదని కమలనాధులు ముందే ఊహించి అంతగా శ్రద్ధ పెట్టలేదని గుసగుసలు వినిపించాయి.  ఏపీలోని తిరుపతి ఉపఎన్నికను మాత్రం ఏపీ బీజేపీ, జనసేన పార్టీలు సీరియస్‌గా తీసుకున్నా ఫలితం కనిపించ లేదు. అధ్యాత్మిక కేంద్రంలో తమకు కలిసి వస్తుందని భావించింది. తిరుపతిలో జనసేనతో కలిసి పోటీ చేసింది బీజేపీ. తమ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభను బరిలోకి దింపింది. ప్రచారంలోనూ శ్రమించారు కమలం నేతలు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా రోడ్ షో నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు. అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది బీజేపీ.కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏమాత్రం పోటీని ఇవ్వకపోగా, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకపోవడం బీజేపీకి పెద్ద దెబ్బగా పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. తిరుపతిలో గెలవకపోయినా.. రెండో స్థానంలో నిలవాలని బీజేపీ భావించింది. అయితే కౌంటింగ్ లో మాత్రం అ పార్టీకి ఘోరంగా దెబ్బతిన్నది. ప్రధాన ప్రతిపక్షం అనుకున్న దానికంటే మంచిగానే ఓట్లు సాధించగా.. బీజేపీ మాత్రం ఘోరంగా చతికిలపడింది 

ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య.. 

ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య, అవును. ఇది తెలుగులో వచ్చిన సినిమానే.. కానీ ఈ వార్తలో ఆ కథకి అసలు సంబంధం లేదు. ఈ కథ నెక్స్ట్ లెవల్ ఉంటది. అది ఏంటి అనేది మీరే చదవండి. అతని పేరు ఉమామహేశ్వరావు. అతను ఒక ఉపాద్యాయుడు. ఉపాధ్యాయుడంటే ఉత్తముడు అనే రోజులు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఉపాధ్యాయులు జల్సాలో మునిగితేలుతున్నారు. దండాలు చేస్తున్నారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన పంతులు సొంత కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నారు. చాక్ పీస్, బెత్తం పట్టుకోవాల్సిన చేతితో కత్తి పట్టుకున్నాడు.. కత్తి పట్టుకున్నాడు ఓకే ఏ ఉల్లిపాయలు, ఏదైనా కూరగాయలు కొయ్యడానికో అయితే బాగుండేది. కానీ కోపం తో రగిలి పోయిన ఈ పంతులు ఏకంగా తన భార్య గొంత కోశాడు. ఎందుకు తన భార్య గొంతు కోశాడు అనుకుంటున్నారా..? అయితే సెకండ్ పేరా చదవాల్సింది.   ఓపెన్ చేస్తే.. ఉమామహేశ్వరావు విడాకుల విషయంలో భార్యాభర్తల నడుమ ఏర్పడిన వివాదం జరిగేది. గుంటూరుకు చెందిన ఉమామహేశ్వరరావు నరసరావుపేట మండలంలోని యలమంద ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య విజయకుమారితో కుటుంబ కలహాలుండడంతో వారు విడివిడిగా నివాసం ఉంటున్నారు. పొన్నూరులో నివాసం ఉంటున్న విజయకుమారి తనను వేధిస్తున్నారంటూ భర్త, అతని కుటుంబ సభ్యులపై గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.  కట్ చేస్తే.. ఉమామహేశ్వరరావు శనివారం పొన్నూరు వచ్చి విడాకులు ఇవ్వాలంటూ భార్యతో వాదనకు దిగాడు. ఆమె ఒప్పుకోలేదు. ఆ విషయం అతనికి నచ్చలేదు. ఉమామహేశ్వరావు ఒక సారిగా ఉగ్రరూపం దాల్చాడు. తన పధకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో తన భార్య మీద విరుచుకు పడ్డాడు.  ఒక్క సారిగా ఆమె గొంతు కోశాడు. స్థానికులు స్పందించి వెంటనే ఆమెను పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏఎస్‌ఐ సుభానీ ఆమె వాగ్మూలం నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.       

బెంగాల్ దీదీదే.. బీజేపీకి ద‌బిడి దిబిడే..

నరేంద్ర మోదీ వ‌ర్సెస్ దీదీ.  అమిత్‌షా వ‌ర్సెస్ మ‌మ‌త‌. జేపీ న‌డ్డా వ‌ర్సెస్ బెన‌ర్జీ. బీజేపీ వ‌ర్సెస్ తృణ‌మూల్‌. మునుపెన్న‌డూ లేనంత ఉత్కంఠ‌. బెంగాల్ దీదీ మ‌మ‌తా బెన‌ర్జీపై క‌మ‌ల‌నాథుల మూకుమ్మ‌డి దాడి. 8 ద‌శ‌ల‌ పోలింగ్‌తో కుతంత్రం.. కొవిడ్ స‌మ‌యంలోనూ ప్ర‌ధాని మోదీ 20 వ‌ర‌కూ స‌భ‌లు.. కేంద్ర‌ హోంమంత్రి అమిత్‌షా 30 ర్యాలీలు.. ప్ర‌చారానికి 22 మంది కేంద్ర మంత్రులు, ఆరుగురు ముఖ్య‌మంత్రులు.. భారీగా భ‌ద్ర‌తా బ‌ల‌గాల మోహ‌రింపు.. పోలింగ్ వేళ న‌లుగురి కాల్చివేత‌.. ఇలా బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ర‌ణ‌రంగంగా మార్చి.. గ‌డ్డిపూల తోట‌లో క‌మ‌లాన్ని విక‌సింప‌జేయాల‌నే బీజేపీ ప్ర‌య‌త్నం అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. క‌మ‌లాన్ని కాలితో తొక్కి.. న‌లిపేసింది మ‌మ‌తా బెన‌ర్జీ. బ‌డాబ‌డా బీజేపీ నాయ‌కుల‌కు.. బెంగాల్‌లో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి.. ప‌రిగెత్తించి.. పొలిమేరలు దాటే వ‌ర‌కూ త‌రిమేసింది బెంగాల్ టైగ‌ర్‌.  బెంగాల్ మ‌ళ్లీ బెంగాలీ బిడ్డ‌కే ద‌క్కింది. "బంగ్లా నిజెర్ మెయెకీ చాయె".. "బెంగాల్ త‌న సొంత కూతురినే కోరుకుంటోంది" అంటూ ఎన్నిక‌ల బ‌రిలో దిగిన దీదీ.. అనూహ్య మెజార్టీతో మ‌ళ్లీ విజ‌యం చేజిక్కించుకున్నారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నారు.  బెంగాల్‌ను కొల్ల‌గొట్టేందుకు క‌మ‌ల‌నాథులు ఎంత చేయాలో అంత‌కంటే ఎక్కువే ప్ర‌య‌త్నం చేశారు. ఏళ్లుగా మ‌మ‌త‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. శార‌దా కుంభ‌కోణం, ఈడీ, సీబీఐ కేసులతో తృణ‌మూల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఎన్నిక‌ల షెడ్యూల్ విష‌యంలోనూ మ‌మ‌త‌ను బాగా ఇబ్బంది పెట్టారు. కేవ‌లం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏకంగా 8 ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హించ‌డం వెనుక‌ కేంద్రం ఒత్తిడే కార‌ణం. ఇంత చేసినా.. బీజేపీ ఏం సాధించింది?  బెంగాల్ టైగ‌ర్ పంజా దెబ్బ‌కు ఇప్పుడు గిలిగిలా కొట్టుకుంటోంది. 200కు పైగా స్థానాల్లో గెలిచి.. బెంగాల్ పీఠాన్ని మ‌ళ్లీ మ‌మ‌త‌నే ద‌క్కించుకుంది. ఆ ఆడ సివంగి ఘాండ్రింపు ముందు.. క‌మ‌ల‌నాథులు పిల్లిలా పారిపోయారు. వంద లోపు స్థానాల‌తో కాసింతైనా ప‌రువు నిలుపుకున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ బెంగాల్ మాదే.. ముఖ్య‌మంత్రి పీఠ‌మూ మాదేనంటూ బీరాలు ప‌లికిన‌.. మోదీ, అమిత్‌షాలు.. వీల్ ఛైర్‌లో ఉండి చ‌క్రం తిప్పిన దీదీ ముందు బేజారయ్యారు. బెంగాలీలు బీజేపీని బండ‌కేసి కొట్టి ఓడించారు. దీదీకే మ‌రోసారి ప‌ట్టం కట్టి.. స్వాభిమానం, ఆత్మాభిమానం చాటుకున్నారు.  ఒక‌రు నాకు ఎదురొచ్చినా వారికే డేంజ‌ర్‌.. నేను ఒక‌రికి ఎదురెళ్లినా వారికే డేంజ‌ర్‌.. ఇదీ మ‌మ‌తా స్టైల్‌. కాట‌న్ చీర‌, హ‌వాయి చెప్పులు, చేనేత సంచి.. అంతే. మ‌మ‌త అంటే ఇంతే. ఇంత సింపుల్‌గా ఉంది క‌దాని లైట్ తీసుకుంటే ఇక అంతే. అప‌ర కాళిలా విరుచుకుప‌డుతుంది. క‌మ‌ల‌నాథులు ఆమెను త‌క్కువ‌గా అంచనా వేశారు. మా ముందు మ‌మ‌త ఎంత అన్న‌ట్టు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. హిందుత్వ ఎజెండాని, అధికార బ‌లాన్ని బెంగాల్‌పై ప్ర‌యోగించారు. స్వ‌త‌హాగా పోరాట స్పూర్తి క‌లిగిన బెంగాలీల ముందు బీజేపీ అస్త్రాల‌న్నీ తుస్సు మ‌న్నాయి. 8 ద‌శ‌ల్లో నిర్వ‌హించిన పోలింగ్ మ‌మ‌త‌ను నిలువ‌రించ‌లేక‌పోయాయి. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి.. మోదీ, అమిత్‌షాలు చేసిన ర్యాలీలు, పొలిటిక‌ల్ వేషాలు.. దీదీ ముందు పార‌లేదు. బెంగాల్‌లో బీజేపీ ప‌ప్పులు ఉడ‌క‌లేదు.  మ‌మ‌తా బెన‌ర్జీ. ఆమె మామూలు మ‌హిళ కాదు. రాజ‌కీయ బెబ్బులి. గ‌తంలో ద‌శాబ్దాల పాటు బెంగాల్‌ను పాలించిన కామ్రేడ్ల‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలించినా.. ఇప్పుడు బెంగాల్‌ను ఆక్ర‌మించుకోవడానికి ర‌థ‌యాత్ర చేసిన క‌మ‌ల‌నాథుల‌ను త‌రిమికొట్టినా.. అది దీదీకే సాధ్య‌మైంది. ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో కాలికి గాయ‌మై.. వీల్ ఛైర్‌కే ప‌రిమిత‌మై.. ఆ కుర్చీలోంచే.. ఇప్పుడు సీఎం కుర్చీ వైపు అడుగులేసింది మ‌మ‌తా బెన‌ర్జీ. క‌మ‌ల‌దండును అధికార పీఠం ద‌రిదాపుల్లోకి కూడా రానీకుండా.. దూరం పెట్ట‌గ‌లిగిన స‌త్తా ఆ బెంగాలీ బిడ్డ‌కే సొంతమైంది.  పొలిటిక‌ల్ మాస్ట‌ర్ మైండ్ ప్ర‌శాంత్ కిశోర్ ర‌చించిన‌ వ్యూహాలు బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. నందిగ్రామ్ నుంచి మ‌మ‌త బ‌రిలో నిల‌వ‌డం బెంగాల్ ఎల‌క్ష‌న్స్‌కే హైలైట్‌. అది పీకే స్కెచ్ అని అంటారు. బెంగాలీ కూతురినంటూ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. వీల్ ఛైర్‌లో క‌లియ తిరిగి.. క‌మ‌లం పువ్వుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ తొక్కిప‌డేసింది. బెంగాల్ అంత‌టా గ‌డ్డి పూలను పూయించింది. స్ప‌ష్ట‌మైన మెజార్టీతో మ‌ళ్లీ బెంగాల్‌ను సొంతం చేసుకుంది దీదీ.  బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాల‌ని స‌ర్వ శ‌క్తులూ ఒడ్డిన క‌మ‌ల‌నాథుల‌కు బెంగాలీలు షాక్ ఇచ్చారు. అధికారానికి ఆమ‌డ దూరంలోనే ఉంచేశారు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో.. 18 ఎంపీ సీట్ల‌తో, 40శాతం ఓట్లతో ఊపు మీద ఉన్నట్టు క‌నిపించిన క‌మ‌ల‌ద‌ళం.. ప్ర‌స్తుత‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట్ల శాతం ప‌డిపోయి.. ప‌రాభ‌వం పాలైంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్లు, సీట్లు.. బలుపు కాదు వాపు అని తేలిపోయింది. ఈసారి ఎలాగైనా బెంగాల్‌ను కైవ‌సం చేసుకొని.. మ‌మ‌త‌కు షాక్ ఇవ్వాల‌ని భావించిన బీజేపీకే ఇప్పుడు ఓటర్లు థౌజెండ్ వాట్స్ ప‌వ‌ర్‌తో ఖ‌త‌ర్నాక్ షాక్ ఇచ్చారు.  మ‌రోవైపు.. బెంగాల్ దంగ‌ల్‌ తృణ‌మూల్ వ‌ర్సెస్ బీజేపీలానే సాగింది. కాంగ్రెస్‌కు ఖాతా తెర‌వ‌డ‌మే క‌ష్ట‌మైంది. ఒక‌ప్పుడు బెంగాల్‌ను ఏళ్ల త‌ర‌బ‌డి ఏలిన క‌మ్యూనిస్టులు.. ఇప్పుడు బోణీ కొడితే చాలు అనుకునే స్థానానికి ప‌డిపోయారు. బీజేపీని, కాంగ్రెస్‌ను, కామ్రేడ్ల‌ను అంద‌రినీ గంప గుత్త‌గా ఓడించి.. బెంగాల్ నాదే.. సీఎం స్థానమూ నాదే.. నంటూ గ‌ర్జిస్తోంది బెంగాల్ టైగ‌ర్ మ‌మ‌తా బెన‌ర్జీ. ప్ర‌చారంలో ఆమె అన్న‌ట్టుగానే.. దీదీ నెక్ట్స్ టార్గెట్‌ ఢిల్లీనే.. ఇక బీజేపీకి ద‌బిడి దిబిడే... 

పారని జానారెడ్డి పాచిక.. సాగర్ లో టీఆర్ఎస్ ఘనవిజయం

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలు కంటే మిన్నగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేలకు పైగా  ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ భగత్ కు లీడ్ వచ్చింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకుపోయారు భగత్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నాగార్జున సాగర్ లో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ గల్లంతైంది.  మొదటి తొమ్మిది రౌండ్లలో భగత్ కు లీడ్ రాగా.. పదో రౌండ్ లో మాత్రం జానా రెడ్డికి స్వల్ప ఆధిక్యం వచ్చింది. 11,12,13 రౌండ్లలో మళ్లీ కారుకు లీడ్ రాగా.. 14వ రౌండ్ లో హ్యాండ్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. తర్వాత అన్ని రౌండ్లలోనూ గులాబీనే గుబాళించింది. మండలాల వారీగా చూస్తే మొదట లెక్కించిన గుర్రంపోడులో టీఆర్ఎస్ కు 2008 ఓట్ల ఆధిక్యత వచ్చింది. పెద్దవూర మండలంలో టీఆర్ఎస్ కు 4 వేల 640 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. తిరుమలగిరి సాగర్ లో   2 వేల 713 ఓట్ల లీడ్  కారుకు వచ్చింది. ఇక కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుమలలో.. టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. అనుమల మండలంలో జానారెడ్డికి 447 ఓట్ల స్వల్ప ఆధిక్యత వచ్చింది. హాలియా పట్టణంలోనే జానారెడ్డికి వెయ్యి ఓట్లకు పైగా ఎక్కువ ఓట్లు రాగా.. అనుమల రూరర్ లో మాత్రం భగత్ లీడ్ సాధించారు. నిజానికి అనుమల మండలంలో భారీగా లీడ్ తమకు వస్తుందని పోలింగ్ తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకున్నారు.  ఇక  నిడమనూర్ మండలంలో వార్ వన్ సైడ్ గానే జరిగింది. అనుమల మండలానికి సంబంధించి నాలుగు రౌండ్లలో లెక్కింపు జరగగా.. అన్ని రౌండ్లలోనూ భగత్ కు తిరుగులేని మెజార్టీ వచ్చింది. నిడమనూర్ మండలంలో నోముల భగత్ కు ఏకంగా 5 వేల 642 ఓట్ల మెజార్టీ వచ్చింది. తక్కువ ఓటర్లున్న మాడ్గులపల్లి మండలంలోనూ టీఆర్ఎస్ లీడ్ సాధించింది.  త్రిపురారం మండలంలో కాంగ్రెస్ కు లీడ్ వస్తుందని భావించినా... అక్కడ కూడా కారు పార్టీ దుసూకుపోయింది.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 7 వేల 640 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు భగత్.. అంతకంటే డబుల్ మెజార్టీ సాధించడం విశేషం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంచార్జీగా ఉన్న పెద్దవూర మండలంలో టీఆర్ఎస్ కు 4 వేల 640 ఓట్ల లీడ్ వచ్చింది. బీజేపీ గిరిజన అభ్యర్థిని బరిలోకి దింపినా.. వాళ్ల ఓట్లలోనూ 10 శాతం ఓట్లు కూడా సాధించలేకపోయారు రవి నాయక్. చలకుర్తి, నాగార్జున సాగర్ తో కలిసి 12వ సారి పోటీ చేసిన జానారెడ్డి.. నాలుగోసారి ఓడిపోయారు. వరుసగా రెండో సారి పరాజయం పాలయ్యారు. 

ధూళిపాళ్ల కస్టడికి బ్రేక్..  సంగం కేసులో సర్కార్ కు షాక్ 

సంగం డెయిరీ కేసులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు షాక్ తగిలింది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడికి బ్రేక్ పడింది. సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంను ఏసీబీ అరెస్ట్ చేసింది. వారిని ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే   ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిం ఏపీ హైకోర్టు... ధూళిపాళ్ల నరేంద్ర సహా మిగితా నిందితుల ఏసీబీ కస్టడీని నిలిపేసింది. అలాగే, వారిని రాజమహేంద్రవరం సెంట్ర‌ల్ జైలుకి తరలించాలని చెప్పింది. ఈ కేసులో త‌దుప‌రి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం  ముగ్గురిని జైలు నుంచి విజయవాడకు తరలించి ఏసీబీ కార్యాలయంలో విచారించారు.  ఈ నేప‌థ్యంలో నరేంద్ర భార్య‌ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. త‌న భర్తను అక్రమంగా కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోప‌ణ‌లు చేశారు. ఏ అంశంపై కేసు నమోదు చేశారో కూడా స్పష్టత లేదని తెలిపారు. నరేంద్రను రాజమహేంద్రవరం జైలు నుంచి విచార‌ణ నిమిత్తం విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నార‌న్నసమాచారంతో ఆయన కుమార్తె వైదీప్తి.. ఉదయమే అక్కడికి చేరుకుని తన తండ్రితో మాట్లాడ‌నివ్వాల‌ని కోరారు. కారులో ఉన్న‌ తండ్రిని అద్దంలో నుంచి చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఆయ‌న‌తో మాట్లాడ‌తాన‌ని కోరిన‌ప్ప‌టికీ అధికారులు అందుకు అంగీకరించలేదు.

ఓటమి దశగా మమతా! బెంగాల్ లో సంచలనం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమవుతున్నాయి. మెజార్టీ ఎగ్టిట్ పోల్స్ సంస్థలు చెప్పినట్లే బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం దిశగా తృణామూల్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. తొలి ట్రెండ్స్ లో హోరాహోరీగా పోరు సాగినట్లు కనిపించినా.. రౌండ్లు సాగే కొద్ది టీఎంసీకి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్ లో టీఎంసీ 190కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉండగా.. బీజేపీ 90 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148.  అయితే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ మూడోసారి అధికారం దిశగా దూసుకుపోతున్నా.. సీఎం మమతా బెనర్జీకి మాత్రం షాక్ తప్పేలా లేదు. నందిగ్రామ్ మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. టీఎంసీలో కీలక నేతగా ఉండి... బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్ లో విజయం దిశగా పయనిస్తున్నారు. నాలుగు రౌండ్లు ముగిసేసరికి సువేందు అధికారి.. మమతపై దాదాపు 8 వేలకు పైగా ఓట్ల లీడ్ లో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మమత వెనుకంజలోనే ఉన్నారు. దీంతో నందిగ్రామ్ ఫలితం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. నందిగ్రామ్ లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం మమతా బెనర్జీ గెలవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటేసి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 118 మేజిక్ ఫిగర్ కాగా, డీఎంకే 160 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలను ప్రారంభించాయి. అన్ని జిల్లాల కార్యాలయాలతో పాటు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద హడావుడి మొదలైంది.అసోంలో రెండోసారి అధికారం దిశగా బీజేపీ కనిపిస్తోంది. అసోంలో కమలదళానికి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. కేరళలో గత సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండోసారి లెఫ్ట్ కూటమి అధికారం కైవసం చేసుకోబోతోంది. పుదుచ్చేరిలో మాత్రం అన్నాడీఎంకే, బీజేపీ కూటమి గెలుపు దిశగా పయనిస్తోంది. 

టీకాల కోసం పెద్దల వార్నింగ్స్.. బ్రిటన్ కు సీరం సీఈవో జంప్! 

దేశంలో కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకూ 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు రోజుకు దాదాు 4 వేల వరకు వస్తున్నాయి. మే రెండో వారానికి దేశంలో కరోనా విజృంభణ పీక్ స్టేజీకి వెళుతుందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. దీంతో దేశంలో కొవిడ్ టీకాలక డిమాండ్ పెరిగింది. ఆ సమయంలోనూ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దేశానికి ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్ అందిస్తున్న పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా సడెన్ గా దేశం విడిచి వెళ్లారు. ఆయన బ్రిటన్ లో మకాం పెట్టారు. సీరం  ఇన్‌స్టిట్యూట్‌ లో కోవిషీల్డ్ టీకా తయారవుతోంది.  సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో ఇండియా నుంచి జంప్ కావడంతో కోవిషీల్డ్ టీకాల పంపిణిపై సస్పెన్ష్ నెలకొంది. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని  అదర్‌ పూనావాలా తెలిపారు. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం డిమాండ్‌ చేస్తూ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఒత్తిడిని అధిగమించడానికే లండన్‌లోని తన భార్యా పిల్లల దగ్గరకు వచ్చానని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ది టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.మరోసారి అలాంటి ఒత్తిడిలోకి వెళ్లదలచుకోలేదని.. అందుకే లండన్‌లో మరింత కాలం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీకాలను అందించే బాధ్యత మొత్తం తనపైనే పడిందని.. కానీ, తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని తెలిపారు.  భారత్‌లో టీకాల కోసం కొంతమంది అంచనాలు, ఆవేశాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని అదర్‌ పూనావాలా తెలిపారు. ప్రతిఒక్కరూ తమకే వ్యాక్సిన్‌ కావాలని కోరుకుంటున్నారని.. ఇతరులకు దాని అవసరం ఎంతో గుర్తించడం లేదని అభిప్రాయపడ్డారు. యూకేకి వెళ్లడంలో వ్యాపారపరమైన కారణాలు కూడా ఉన్నాయని  సీరం సీఈవో చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీని భారత్‌ వెలుపల కూడా చేపట్టేందుకు యోచిస్తున్నామని వెల్లడించారు. దీనిపై రానున్న కొన్ని రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. పరిస్థితులు ఈ స్థాయికి దిగజారుతాయని చివరకు దేవుడు కూడా అంచనా వేసి ఉండరన్నారు.  కొవిషీల్డ్‌ టీకా ధరలపై మాట్లాడుతూ.. ప్రపంచంలో కొవిషీల్డ్‌ కంటే చౌకైన వ్యాక్సిన్‌ మరొకటి లేదని అభిప్రాయపడ్డారు.

జూన్ లో ఈటల కొత్త పార్టీ! టీఆర్ఎస్ సీనియర్ల సపోర్ట్? 

భూకబ్జా ఆరోపణలతో మంత్రి ఈటల రాజేందర్ ను వైద్యశాఖ నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. ఆయనపై విచారణ జరుగుతుండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ నివేదిక వచ్చాకా ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తనపై జరుగుతున్న తతంగాన్ని గమనిస్తున్న ఈటల రాజేందర్.. నివేదికను చూశాకే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తనకు మద్దతుగా వచ్చిన అనుచురలతో ఆయన చర్చలు కూడా జరిపారు. తనపై ప్లాన్ ప్రకారమే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్న ఈటల... భవిష్యత్ కార్యాచరణపై దాదాపు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఈటల  సన్నిహితులు చెబుతున్నారు.  జూన్ లో ఈటల రాజేందర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తోంది. తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చివరి ఏడాదంతా ఎన్నికలతో సరిపోతోంది. అందుకే జూన్ లో పార్టీ ప్రక్రియ మొదలు పెడితే.. రెండు,మూడు నెలలు అంతా సెట్ కావడానికి పోతోంది. దీంతో ఏడాది పాటు జనంలోకి వెళ్లేందుకు, ప్రజా పోరాటాలకు అవకాశం ఉంటుందని ఈటల భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా... ఈ జూన్ లోనే పార్టీ పెట్టాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈటల పార్టీ పెడితే మద్దతు ఇచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న నేతలంతా ఈటలతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని కొందరు నేతలు కూడా రాజేందర్ తో కలిసి నవడవచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ నేతగా రాజకీయంగా ఎదిగిన ఈటలకు మద్దతుగా బీసీ నేతలు, సంఘాలు కలిసివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   నిజానికి  భూకబ్జాలు చేశానంటూ కేసీఆర్ అనుకూల మీడియాలో తనపై వార్తలు రావడంతోనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈటల డిసైడయ్యారట. రాజీనామా లేఖను సిద్దం చేసుకుని మీడియా సమావేశానికి సిద్దమయ్యారట. అయితే ఆయన సన్నిహితులతో పాటు కొందరు టీఆర్ఎస్ నేతలు రాజీనామా వద్దని ఆయనను వారించారని చెబుతున్నారు. కొందరు మంత్రులు కూడా ఈటలతో మాట్లాడారని.. రాజీనామా చేస్తే తప్పు అంగీకరించినట్లు అవుతుందని, ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూశాక నిర్ణయం తీసుకోవాలని సూచించారట. అలా చేస్తే జనాల్లో సింపతి మరింత వస్తుందని చెప్పారట. అందుకే శుక్రవారం రాత్రి రాజేందర్ ప్రెస్ మీట్ ఆలస్యం అయిందంటున్నారు. అయితే వైద్యశాఖను తప్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో.. తన భవిష్యత్ కార్యాచరణపై ఈటల నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. అదే సమయంలో విపక్షాలపై కూడా జనాల్లో నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ అవసరమనే అభిప్రాయం ఉంది. పొలిటికల్ స్పేస్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు నేతలు కొత్త పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి కూడా కొత్త పార్టీ యోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే పక్కా బ్యూరోక్రాట్ అయిన కొండా.. పార్టీని నడపలేరనే అభిప్రాయం బయటికి వచ్చింది. అందుకే అతనితో ఎవరూ టచ్ లోకి వెళ్లలేదంటున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు సమస్యగా ఉంది. రేవంత్ పార్టీ పెడితే... ఆ కేసుతో సర్కార్ ఇబ్బంది పెడుతుందనే చర్చ జరిగింది. తాజాగా ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సత్తుప్లలి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని లీకులు వస్తున్నాయి. అదే జరిగితే సండ్రతో కలిసి రేవంత్ ను మరింత ఇబ్బంది పెట్టే అవకాశం సీఎంకు ఉంటుంది. అందుకే రేవంత్ పార్టీ వైపు లీడర్లు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.  ఈటల రాజేందర్ విషయానికి వస్తే.. రాజకీయాల్లో ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా ఉద్యమాన్ని నడిపించారు. టీఆర్ఎసిఎల్పీ నేతగా, మంత్రిగా ఆయనకు సుదీర్ఘ అనుభవంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఉంది. అంతేకాదు బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమకారుల మద్దతు ఉంది. ముఖ్యంగా ప్రజలతో మమేకం అవుతారనే పేరు ఉంది. ఇవన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే.. కొత్త పార్టీతో ఈటల సక్సెస్ అవుతారనే టాక్ వస్తోంది. కోదండరామ్ లాంటి ఉద్యమ నేతలంతా ఈటలతో కలిసి నడిచే అవకాశం ఉంది.  భూకబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి ఈటల రాజేందర్‌కు టీజేఎస్ అధినేత, ప్రొఫెసర్ కోదండరాం ఓపెన్ గానే మద్దతు తెలిపారు.  కేసీఆర్‌ను గద్దె దింపటానికి ఉద్యమకారులు ఏకం కావాల్సిన సమయయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు విడి విడిగా ఉండటం వలనే కేసీఆర్ రెచ్చిపోతున్నాడని విమర్శించారు.  మరోవైపు  పక్కా స్కెచ్‌తోనే త‌న‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నార‌ని ఈటల ఆరోపిస్తున్నారు. కట్టు కథలతో త‌న క్యారెక్టర్‌ని పాడుచేసే ప్రయత్నం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఎవ‌రి చ‌రిత్ర ఏమిటో త‌న‌కు తెలుసు అని.. కానీ వాటిని విప్పాల‌నుకోవ‌డం లేద‌ని అన్నారు. సమయం వచ్చినప్పుడు అందరి బండారం బయటపెడతానని చెప్పారు. దీంతో ఈటల ఎవరి చరిత్ర బయటికి తీస్తారోనన్న ఆందోళన గులాబీ లీడర్లలో కనిపిస్తోంది. 2004 నుంచి ఉద్యమంలో, 2014 నుంటి ప్రభుత్వంలో ఉన్న ఈటలకు...టీఆర్ఎస్  పార్టీ నేతల చరిత్ర అంతా తెలుసంటున్నారు. అందుకే ఈటల ఏం చేయబోతున్నారని, ఎవరిపై బాంబ్ పేల్చబోతున్నారనే టెన్షన్ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయని, ఈటల కొత్త పార్టీ పెట్టడం ఖాయమని చెబుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ కూడా జనాల్లో జరుగుతోంది.