ఏపీలో పరీక్షలు.. ప్రధాని జోక్యం!
posted on Apr 28, 2021 @ 4:24PM
ఏది ఏమైనా పరీక్షలు నిర్వహించి తీరుతాం అంటోంది ఏపీ సర్కారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే ఎగ్జామ్స్ అంటున్నారు సీఎం జగన్. పరీక్షలపై జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకు పోతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోయింది. పరీక్షలకు వెళితే.. తమ పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. పరీక్షలకు వెళితే ఓ టెన్షన్.. వెళ్లకపోతే మరో ప్రాబ్లమ్. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో సహా దేశంలోని పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు, వాయిదా వేస్తుంటే.. ఏపీలో సీఎం జగన్రెడ్డి తీరు తమ పిల్లల పాలిట ముప్పుగా మారిందనేది పేరెంట్స్ భయాందోళన. అందుకే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ ఆయనకు లేఖ రాశారు నరసాపురం ఎంపీ.
ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను విద్యార్థి లోకం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనిపై ఏపీలో ఒకింత అధిక ఆందోళన నెలకొని ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే లక్షల్లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైరస్ బారినపడే అవకాశాలున్నాయని, వారు వ్యాప్తికి కారకులు కావడమో, లేక వారే బలికావడమో జరుగుతుందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారుకు ఇదేమీ కనిపిస్తున్నట్టుగా లేదని, అందుకే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు.
"ప్రధాని గారూ కరోనా కట్టడికి మీరు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మీరు జోక్యం చేసుకుని తీరాల్సిన అత్యంత కీలక సమయం ఇది. పరీక్షలు రద్దు చేశామనో, వాయిదా వేశామనో చెబుతూ ఎలాంటి ప్రకటన సీఎం కార్యాలయం నుంచి రావడంలేదు. ఏపీ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మీరే ఆదేశాలు ఇవ్వండి" అని తన లేఖలో కోరారు రఘురామ.