మాస్క్ రచ్చ.. కార్పోరేటర్ పై కక్ష..
posted on Apr 28, 2021 @ 2:58PM
ఉన్నమాట అంటే ఊరికి నాకు చేటు అన్నట్లు ఉంది.. ఇప్పుడు సమాజంలో పరిస్థితి. యువకులు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.
మాస్క్ పెట్టుకోలేదని మందలించాడని. ఓ యువకుడు ఏకంగా కార్పొరేటర్ పైనే చేయి వేసుకున్నాడు.
కరోనా విజృంభిస్తున్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని 32వ డివిజన్ కార్పొరేటర్ వెంకటకృష్ణచారి ఇవాళ ఉదయం బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడీపేట నాలుగో లైన్లోని సాయిచరణ్ బాయ్స్ హాస్టల్ వద్ద యువకులు గుమిగూడి ఉండటాన్ని గమనించారు. అక్కడికి వెళ్లిన కార్పొరేటర్ మాస్కు ధరించని యువకుడిని గట్టిగా మందలించారు. ఈ విషయంలో మాటామాటా పెరిగి ఓ యువకుడిపై కార్పొరేటర్ చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు ‘మా తల్లిదండ్రులే నన్ను కొట్టరు.. మీరు కొడతారా?’ అంటూ కార్పొరేటర్పై తిరగబడ్డాడు. తన స్నేహితులతో కలిసి కార్పొరేటర్ వెంకటకృష్ణచారిని తిరిగి కొట్టాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ అనుచరులు అక్కడికి చేరుకుని వసతి గృహంలోని యువకులను బయటకు తీసుకొచ్చి దాడి చేశారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు యువకుల్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
విషయం తెలుసుకున్న నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు వచ్చి ఘటనపై ఆరా తీశారు. కార్పొరేటర్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్కులు లేకుండా తిరగటం ప్రమాదకరమని చెబితే ఇలా దాడి చేయడమేంటని కార్పొరేటర్ ప్రశ్నించారు. బ్రాడీపేటలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున హాస్టళ్లను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.