సుభిక్ష‌పాల‌న‌కు బ‌ట‌న్ నొక్క‌లేదేమి?

చిటికేస్తే యువ‌రాణి పావురం అయిపోయి ఎగిరిపోతుంది, ఈల వేస్తే బ‌స్సాగి పోయి వ‌ర్షం వ‌స్తుంది.. ఇవన్నీ సినిమాల్లో జ‌రిగే మాయా మంత్రాలు. అన్నీ అలా చిటికెలో, బ‌ట‌న్ నొక్కేస్తే అయిపోయేట్ల‌యితే దేశంలో ఎప్పుడో దారిద్య్రం, అవినీతి, దోపిడీలు పోయి ఉండేవి. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. ఎవ‌రికీ అలాంటి అతీత‌ శ‌క్తులు లేవు. ఈ అత్యాధునిక కంప్యూట‌ర్ కాలంలో కీబోర్డు బ‌ట‌న్‌లు త‌ప్ప హ‌ఠాత్తుగా అన్నీ జ‌రిగిపోయే మంత్ర‌శ‌క్తి ఉన్న బ‌ట‌న్ ఎక్క‌డా ఎవ‌రికీ క‌న‌ప‌డ‌టం లేదు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కి మాత్రం ఇట్టే అయిపోయే ప‌ద్ద‌తి తెలిసిపోయింది. డీబీటీ పేరుతో బ‌ట‌న్ నొక్కితే ల‌బ్దిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జ‌మ అయిపోతాయ‌ని సెల‌విచ్చారు. కానీ అలా జ‌రుగుతుందా.. అంటే సీఎం గారి దృష్టిలో అవుతుంది. కానీ వాస్త‌వ ప్ర‌గ‌తి, ప్ర‌జా సంక్షేమానికి మాత్రం ఆ బ‌ట‌న్స్ ఏవీ ప‌నిచేయ‌డం లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.  ప్ర‌చారాలు, ఆర్భాటాల  ప‌టాటోపం త‌ప్ప అభివృద్ధి, ప్ర‌జా సంక్షేమం జాడ‌లు రాష్టంలో ఎక్క‌డా క‌న‌ప‌డ‌టం లేద‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు. చాలాకాలం నుంచి ఉన్న అమ‌రావ‌తిని అభివృద్ధి చేసి, మిగ‌తా ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయాల‌ని  ఏపీ సీసీ అధ్య‌క్షులు ఎస్‌.శైల‌జానాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల తాకిడితో ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటే సీఎం మాత్రం బ‌ట‌న్ నొక్కితే అన్నీ అయిపోతాయ‌న్న భ్ర‌మ‌లోనే ఉన్నార‌ని ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తు న్నాయి. డీబీటీతో రాష్ట్ర అభివృద్ధి చేసిన‌ట్ల‌వుతుందా అని శైల‌జానాథ్ ప్ర‌శ్నించారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చక పోయినా..జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

తెలంగాణా సాధ‌న‌కు బీజేపీ చ‌ద‌రంగం

ప‌క్క‌రాజ్యం మీదకి యుద్ధానికి వెళితే ఏమేర‌కు గెలుస్తాము, వారి సైన్యం ఎంత  సామర్థ్యం తెలుసుకోవ‌డానికో రాజులు వేగుల్ని రంగంలోకి దింపేవారు. స‌రిగ్గా అదే పంధాను ఇప్ప‌డు బీజేపీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు రానున్న ఎన్నికలకు  అనుస‌రిస్తున్నార‌నిపిస్తోంది. వారికి తెలంగాణాలో దొరికిన గొప్ప తెలివిమంతుడు, స్వ‌ర పేటికా బాగా ఉన్న‌వాడు, అన్నింటికీ మించిన వేగుచుక్క బండిసంజ‌య్. తెలంగాణాలో రాజ‌కీయ ప‌రిస్థితులే గాకుండా పార్టీల‌ వారీగా బ‌ల‌మైన నేత‌ల జాబితాను కూడా త‌యారుచేసి మ‌రీ నివేదిక‌తో పాటు పంపిన‌ట్టు తెలు స్తోంది. బీజేపీ అధిష్టానం తెలంగాణాలో కూడా గోవా మోడ‌ల్ అమ‌లు చేయాల‌న్న దృష్టిలో ఉంద‌ని, గెలుపు గుర్రాలనే గుర్తించి చెప్ప‌మ‌ని బండి వారిని బీజేపీ అధిష్టానం కోరిందట. పనిలో పనిగా  రాష్ట్రంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రత్యర్థి పార్టీలలోని ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల్లో చురుకైన‌వారినీ గుర్తించ మ‌ని తెలంగాణా బీజేపీ అధ్య‌క్షుడికి బాధ్య‌త‌ను కమలం టాప్ బ్రాస్ అప్పగించిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అంటే కేంద్రం తెలంగాణా మీద ఎంత దృష్టి కేంద్రీక‌రించిందో అర్ధ‌మ వుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్తగా పావులు క‌దిపే ప‌నిలో ఉంది.  తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ఎంతో ప‌క‌డ్బందీగా వ్యూహ‌ర‌చ‌న చేస్తోంద‌నే అనాలి. మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌వ‌ర్గాల‌ను నాలుగు క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించి ప్ర‌తీ నాలుగు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక కేంద్ర మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియ‌మించారు.  ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లకుఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా,  హైదరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి ఇన్‌చార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ ఇన్‌చార్జ్‌గా మహేంద్రనాథ్ పాండే, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి బీఎల్ వర్మను నియమించారు. వీరితో పాటు ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక కేంద్రమంత్రిని నియమించారు. ఆదిలాబాద్, పెద్దపల్లికి పురుషోత్తం రూపాల, జహీరాబాద్‌కు నిర్మలా సీతారామన్, మెదక్‌కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చేవెళ్ల, మల్కాజ్ గిరికి ప్రహ్లాద్ జోషి, భువనగిరికి దేవీసింగ్ చౌహాన్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్‌కు మహేంద్రనాథ్ పాండే, నల్లగొండకు కైలాశ్ చౌదరి, వరంగల్‌కు ఇంద్రజిత్ సింగ్,  హైదరాబాద్‌కు జ్యోతిరాధిత్య సింధియా, మహబూబాబాద్, ఖమ్మం‌కు బీఎల్ వర్మను నియమించారు.తెలంగాణ నుంచి పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్‌గా ప్రేమేందర్ రెడ్డి, కోకన్వీనర్లుగా ఉమారాణి, జయశ్రీని నియమించారు.

వాన్ పిక్ కేసును కోర్టు నిజంగానే కొట్టేసిందా?

వాన్ పిక్ కేసు కోర్టు కొట్టివేసిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతుంటే అదే నిజమైపోతుందా? ఆవును కొనుక్కు తీసుకు వెళుతున్న వ్యక్తికి నలుగురు దొంగలు ఒకరి తరువాత ఒకరు అది ఆవు కాదు కుక్క అంటూ చెప్పేసరికి నిజమని నమ్మినా ఆయన దానికి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడని ఓ కథ ఉంది. ఇప్పుడు వాన్ పిక్ విషయంలో సాంకేతిక కారణంపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మొత్తం వాన్ పిక్ కేసునే కోర్టు కొట్టివేసిందని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చినంత మాత్రాన ఆ కేసు కొట్టేసినట్లు అవుతుందా? ఇక వాన్ పిక్ క్విడ్ ప్రొకో కేసు విచారణ కోర్టులో జరగదా? అన్న సందేహాలు ఎవరికైనా వచ్చి తీరుతాయి. నిజానికి వాన్ పిక్ కేసులో కోర్టు ఇచ్చిన ఉత్వర్వులు దేనికి సంబంధించిని అంటే ఆ కేసు నుంచి వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన కంపెనీ పేరును తొలగింపునకు సంబంధించి మత్రమే. అంతే కాని వాన్ పిక్ క్విడ్ ప్రొకో కేసు అలాగే ఉంది. ఆ కేసులో నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్ కి కానీ ఇతరులకు కానీ ఎటువంటి ఊరటా లభించేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వ లేదు. క్విడ్ ప్రొకో కేసులో వాన్ పిక్ చైర్మన్ నిందితుడుగా ఉన్నంత మాత్రాన ఆ కంపెనీని నిందుతుల జాబితాలో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అందుకే కంపెనీ పేరు తొలగించాలంటూ వాన్ పిక్ వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ  హైకోర్టు అనుమంతి ఆ కంపెనీ పేరును నిందితుల జాబితా నుంచి తొలగించింది. వాన్ పిక్ కంపెనీ పేరును నిందితుల జాబితా నుంచి తొలగించినంత మాత్రాన కేసు మొత్తం కొట్టివేసినట్లు అవ్వదు. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులపై విచారణ కొనసాగుతుంది.    అంతే కానీ కేసు మొత్తాన్ని కొట్టి వేయలేదు. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సీఎం జగనమోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ సహా వాన్ పిక్ స్కాంలో ఉన్న వారందరిపై విచారణ కొనసాగుతుంది. 

బాలినేని ఉలికిపాటు ఎందుకో తెలుసా ?

బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి,. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబినెట్ లో అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్ వైఎస్సార్, రోశయ్య మంత్రి వర్గాల్లోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి అదే నియోజక వర్గం నుంచి  ఆరు సార్లు పోటీ చేసి ఒక్క సారి మాత్రమే ఓడి పోయారు. ఉమ్మడి ఒంగోలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఆయన కీలక పాత్రను పోషించారు. ముఖ్యంగా క్యాష్ డీల్స్ లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటారు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలే కాకుండా బధుత్వం కూడా ఉన్న బాలినేని ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రికి కొంత దూరమయ్యారు. అసంతృప్తి స్వరాలకు వేదిక అయ్యారు. అదలా ఉంటే, ఇప్పుదు ఆయనకు మరో సమస్య వచ్చిపడింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో వెలుగు చూసిన చీకోటి ప్రవీణ్ కేసినో , హవాలాలో కేసులో ఆయనకు సంబంధం వుందో లేదో కానీ, ఆయనకు సంబంధాలే కాదు, అయన రోల్ కీలకమనే ప్రచారం అయితే జరిగింది.జరుగుతోంది.  ఎక్కడ ఏ  నేరం జరిగిన పాత నేరస్తులు ఉలిక్కి పడడం సహజమే, కానే మాజీ మంత్రి, అధికార వైసీపీ ఎమ్మెల్యే బాలినేని ఈ విషయంలో ఎందకు ఉల్లిక్కి పడ్డారు? ఎందుకు మీడియా ముందు వచ్చి, కేసినో నిర్వాగకుడు చీకోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని  ఎందుకు చెప్పుకున్నారు? అంటే, ఏదో ఉండి అందుకే, ముందుగానే సంజాయషీ ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే, ఏ సంబంధం లేక పోతే మాజే మంత్రి ఎందుకు, బుజాలు తడుము కుంటున్నారు, అని ప్రశ్నిస్తున్నారు.  అయితే, బాలినేని మాత్రం, ‘నేను పేకాట ఆడతాను. అప్పుడప్పుడూ కేసినోకీ పోయివస్తూంటాను’ అని ఒప్పుకుంటూనే, అంత మాత్రాన చీకోటి ప్రవీణ్ కేసినోతో కానీ ఆయన హవాలా దండాతో  కానీ తనకు సంబంధం ఉన్నట్లు కాదన్నారు. అయితే, బాలినేనిపై ఇలాంటి  కేసినో, హవాల ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి, కాదు. ఆయమ మంత్రిగా ఉన్న రోజుల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పేకాట, కేసినో వ్యసనపరుడని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అప్పట్లో అయన ఆ ఆరోపణలను ఖండించినా, ఇప్పడు మాత్రం ’అవును .. నాకు పేకాట, కేసినోకు పోయివచ్చే అలవాటు ఉందన అంగీకరించారు. దీంతో అనుమనాలు ఇంకా ఎక్కవ అయ్యాయని అంటున్నారు.  గతంలో అయన మంత్రిగా ఉన్నరోజుల్లోనే, ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తున్న రూ. ఐదు కోట్ల నగదును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో ఆ నగదు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి హవాలా రూపంలో పంపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఇమేజ్ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కేసినోలు.. హవాలా కేసుల గురించి చర్చ వచ్చినా ఆయన పేరు ప్రచారంలోకి వస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కేసినో, హవాల మచ్చలు మాత్రం బాలినేని, పుట్టుమచ్చల్లా, వదలడం లేదు.

ఇక ... కేంద్రం పై కేసీఆర్ . న్యాయ పోరాటం?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ గత మూడు నాలుగు రోజులుగా దేశ రాజదాని ఢిల్లీలో ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్లారు, ఏమి చేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత ఉన్నట్లు లేదు. చివరకు, టీవీ డిబేట్స్ లో పాల్గొనే తెరాస అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలకు కూడా, ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్ళారో చెప్పలేక పోతున్నారు. నిజంగా వారికి తెలియదో, తెలిసినా చెప్పలేని పరిస్థితో ఉన్నారో తెలియదు కానీ, ‘ది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అన్న పద్దతిలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా తెలంగాణకు మంచి మాత్రమే చేస్తారని అంటున్నారు. అంతే, కానీ ఆ ‘మంచి’ ఏమిటో మాత్రం బయట పెట్టడం లేదు.  మరో వంక అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారానని బట్టి , ముఖ్యమంత్రి కేసీఆర్ బహుముఖ వ్యూహాలతో ఢిల్లీలో అడుగు పెట్టారని తెలుస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటుగా, రాష్ట్రం  ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు, ముఖ్యంగా  కేంద్ర ప్రభుత్వం విధించిన రుణ పరిమితికి సంబందించి సీరియస్ స్టెప్స్ తీసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్డం అవుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అవసరం అయితే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును వెళ్లేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారనీ  అంటున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి, ఇప్పటికే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌ కుమార్‌, విద్యుత్తు శాఖ కార్యదర్శి సునీల్‌ శర్మతో పాటు పలువురు అధికారులు, న్యాయనిపుణులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.  అయితే నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించడం కాకుండా, ముందు  కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా లేఖ రాయాలని, అందుకు సరైన జవాబు రాకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు, న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం. ఇదే విషయంగా ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచే చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.  ఈ కసరత్తులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2022 మార్చి 31న రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి రాసిన పది పేజీల లేఖపై అధికారులు చర్చలు జరిపారని సమాచారం. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాల జీఎస్డీపీలో 3.5 మేరకు నికర రుణ పరిమితిని విధించామని కేంద్రం ఆ లేఖలో పేర్కొందని, నిజానికి ఆర్థిక సంఘం అదే సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని పూర్తిగా సవరించాలని సూచించిందన్నారు. కేంద్రం మాత్రం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ నికర రుణ పరిమితిని పాటించకుండా రాష్ట్రాలపై ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక విద్యుత్తు రంగం పని తీరును బట్టి అదనపు రుణ పరిమితిని జీఎస్డీపీలో మరో 0.5% పెంచుతామని కేంద్రం లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమని, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా పరిమితులు విధించడం చెల్లదని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లు, ఇతర సంస్థలు చేసే రుణాలపై కేంద్రం ఎలా ఆంక్షలు విధిస్తుందని ? వాటికి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోనవసరం లేదనీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రం కేంద్రం నుంచి, మార్కెట్‌ నుంచి చేసే అప్పులకు మాత్రమే రుణ పరిమితిని వర్తింపజేయాలని.. కార్పొరేషన్లు చేసే అప్పులనూ రాష్ట్ర రుణాలుగా పరిగణించే అధికారం కేంద్రానికి లేదని పేర్కొన్నట్లు  తెలుస్తోంది.  అయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేందుకే అయితే ఢిల్లీ వెళ్ళడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఢిల్లీ నుంచి సమాలోచనలు జరపడం ఎందుకు? అదీ కాక, ఈ సమాలోచనలో చర్చించినట్లు చెపుతున్న అన్ని అంశాలపైన, రాష్ట్రంలో చాలా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది.   ఈ అన్ని విషయాలపైనా  ముఖ్యమంత్రికి పూర్తి స్పష్టత వుంది.  విలేకరుల సమావేశాల్లో, ఇతరత్రా ఆయన ఈ విషయాలను ఒకటికి పదిసార్లు ప్రస్తవించారు. నిజానికి కేంద్రానికి లేఖ రాసే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గతంలోనే చూచాయగా చెప్పారు.అదలా ఉంటే, ఇటీవల సుప్రీం కోర్టు ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెపుతూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను నియంత్రించ వలసిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. సో.. అప్పులు చేస్తాం అనుమతివ్వండి .. అంటే సుప్రీం కోర్టు అయినా అంగీకరిస్తుందా .. అనుమానమే అంటున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రకు, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలనే  ఆలోచనకు లింక్ కుదరడం లేదని అంటున్నారు. అందుకే, ముఖ్యంత్రి ఢిల్లీ ఎందు  కెళ్ళారు ... అనేది జవాబు లేని ప్రశ్నగానే మిగిలి పోయిందని, అంటున్నారు.

ముంద‌స్తు మ‌ర‌ణ సర్టిఫికెట్‌!

ఇంటికీ, భూమికీ స‌ర్టిఫికెట్లు ఉన్న‌ట్టే, పుట్టిన తేదీతో  స‌ర్టిఫికెట్ తీసుకోవ‌డం ఉంటుంది. కానీ చిత్రంగా మ‌ర‌ణ స‌ర్టిఫికెట్ కూడా ఉంటుంద‌ని ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా కి తెలియ‌వ‌చ్చింది! ఆయ‌న ఈమ‌ధ్య త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో ఈ విచిత్ర స‌ర్టిఫికెట్‌ను పోస్ట్ చేశారు. ఇది అమెరికా నార్త్ క‌రోలినా లోని ఒక పోర్ట‌ల్ లో ఉండ‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అస‌లు  ఇలాంటివీ ఉంటాయ‌ని! ఆ స‌ర్టిఫికెట్‌లో కేవ‌లం రెండు ఆప్ష‌న్లే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న‌వారు వాటిలో ఒక‌దాన్ని ఎంచుకోవాలి. అంటే ఈ స‌ర్టిఫికెట్ ఎవ‌రికి తీసుకుంటున్నార‌న్న‌ది స్ప‌ష్టం చేయాలి. అలా ఉన్న‌పుడు మ‌నం స‌హ‌జంగా మ‌న‌వాళ్ల‌దో, బంధువుల‌దో, స్నేహితుల‌దో పేరు రాయాల‌నే ఉంటుంద‌ని అనుకుంటాం. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.  మొద‌టి ఆప్ష‌న్ .. మీకా?  రెండో ఆప్ష‌న్ .. మ‌రెవ‌రికైనానా? ... అని! మ‌ర‌ణించిన త‌ర్వాత జీవితం మీద అపార న‌మ్మ‌కం ఉన్న‌ది మ‌నమే కాదు విదేశీయులు ప్ర‌గాఢంగా విశ్వ సిస్తార‌న్న‌ది ఈ స‌ర్టిఫికెట్ సుస్ప‌ష్టం చేస్తోంద‌ని ఎవ‌రో దానికి కాప్ష‌న్‌గానూ పెట్టారు.  ఈ పోస్టును ఇప్ప‌టికి 21 ల‌క్ష‌ల మంది చూశార‌ట‌!  మొద‌టిది .. మైసెల్ఫ్ అని క్లిక్ చేయ‌డ‌మే మంచిదేమోన‌ని ఒక వ్యూయ‌ర్ త‌మాషాగా స‌మాధానం ఇచ్చాడు.   చిత్ర‌మేమంటే అమెరికాలో స్కూలు పిల్ల‌లు ఎవ‌ర‌యినా స్కూలు డుమ్మా కొట్టాలంటే.. అంటే ఎవ‌ర‌యినా మ‌ర‌ణిస్తే సెల‌వు పెట్టాలంటే ఇలాంటి ఆన్‌లైన్ లో ఈ స‌ర్టిఫికెట్‌ను పూర్తిచేయాలేమో అని మ‌రొక‌రు అనుమానం వ్య‌క్తం చేశారు! ఏమైనా  ఇది నెటిజెన్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న పోస్టు.

తానే మారెనో.. సోము స్వరమే మార్చెనా?

కాఫీ అడిగితే తిట్టుకున్న చిన్న‌కోడ‌లి కంటే  కాసిని చ‌ల్ల‌టి కాఫీ ఇచ్చే పెద్ద కోడ‌లే న‌యం  అనుకుని పెద్దామె ఎంత‌యినా పెద్ద‌దే మంచిదే.. అన‌కుంది. అదుగో అలా ఉంది బీజేపీ నేత సోము వీర్రాజు వ్య‌వహారం. మొన్న‌టి దాకా టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు పైనా కారాలు మిరియాలు నూరిన సోము హ‌ఠాత్తుగా స్వ‌రం మార్చారు. రాజ‌కీయ‌ ప‌రిస్థితుల‌ను అనుస‌రించి, వాతావ‌ర‌ణాన్ని అనుస‌రించి  ఎవ‌ర యినా మారిపోతారనడానికి ఇదో పెద్ద ఉదాహ‌ర‌ణ‌. గత  ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏను వీడకుండా బీజేపీ తోనే ఉండి ఉంటే  వైసీపీ అధికారంలోకి వచ్చేదే కాదని కొత్తగా సెలవిచ్చారు. వైసీపీ మూడు రాజ‌ధానుల అంశాన్ని బాగా ప్ర‌చారం చేసుకుంటూ, ఇది తప్ప‌ని ప‌రిస్థితి అంటూ జ‌నాల మీద అభిప్రాయాన్ని రుద్దే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌పుడు సోము వీర్రాజు పెద‌వి విప్ప‌లేదు.  ఆ ఆలోచ‌న అమ‌లు ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అన్న ముక్క మాట్లాడ‌లేదు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ను  తిర స్కరిస్తూ రైతాంగం కోర్టు మెట్లెక్కి వారికి తీర్పు అనుకూలంగా వచ్చిన త‌ర్వాత‌నే  బీజేపీ నేత స్వ‌రం స‌రిచేసు కుని అవును అమ‌రావాతినే రాజ‌ధాని చేయాల‌న్న‌దే తాము మొద‌టి నుంచి చెబుతూవ‌చ్చామ‌న్నారు.   అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చేయ‌డానికి బీజేపీ కంక‌ణం క‌ట్టుకున్నట్టు సోము చెబుతున్నారు.  అమ‌రావ‌తి నే రాజ‌ధానిగా చేయాలన్న సంక‌ల్పంతోనే బీజేపీ ఏకంగా పాద‌యాత్ర చేయ‌డ‌మేగాక రాజ‌ధాని నిర్మాణా నికి కేంద్రం నిధులు, స‌హాయాన్ని బాగా ప్ర‌చారం చేసుకుంటోంది. కేంద్రం రాజధాని అమరావతి కోసం 4వేల కోట్లు  ఒక‌సారి, 2500 కోట్లు మరోసారి  నిధులు ఆనాడు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు.  అస‌లు రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కారుకు ప‌రిస్థితులు  అన‌నుకూల‌ంగా ఉన్నాయని  గ్ర‌హించే బీజేపీ ఇపుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకి భ‌జ‌న‌చేయ‌డానికీ సిద్ధ‌ప‌డ్డార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  కానీ టీడీపీ తో పొత్తు అంశాన్ని మాత్రం సోము వీర్రాజు మాట్లాడటం లేదు. జనసేన అనుభవం తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పరిమితులను ఆయన గుర్తించినట్లున్నారు. అయితే ప‌రిస్థితులు బాగా మారుతు న్న‌నేప‌థ్యంలో బీజేపీ వైసీపీ ప‌ట్ల న‌మ్మ‌కం కోల్పోయింద‌నేది సోము మాట‌ల్లో తేటతెల్లమౌతోంది. మొత్తంగా వైసీపీ, బీజేపీల మధ్య బయటకు కనిపించని సెగలేవో రగులుతు న్నాయనడానికి అటు వైసీపీ స్వరం కూడా మారుతుండటమే నిదర్శనం.

అథ్లెట్ల‌కు ప్ర‌యాణ అసౌక‌ర్యం.. ఆగ్ర‌హించిన భండారీ

కామ‌న్‌వెల్త్‌గేమ్స్ విలేజ్  నుంచి అలెగ్జాండ‌ర్ స్టేడియానికి టాక్సీలో కేవ‌లం 30నిమిషాల  ప్ర‌యాణం. ఒలింపిక్ ర‌జ‌త ప‌త‌కం సాధించిన భార‌త్ బాక్స‌ర్ ల‌వ్లీనా, ఆమె స‌హ ప్లేయ‌ర్ ముహ‌మ్మ‌ద్ హుస్సీముద్దీన్ త‌మ ప్రాక్టీస్ స్టేడియాకి వెళ్లాల‌ని అనుకున్నారు. వాళ్ల మ్యాచ్ కి  స‌మ‌యం ఉండటంతో ప్రాక్టీస్ చేయడానికి వెళ్లాల‌నుకున్నారు. అందువ‌ల్ల గేమ్స్ ప్రారంభోత్స‌వ ఉత్స‌వానికి మ‌ధ్య‌లోనే  బ‌య‌లు దేరారు. కానీ ఒక్క టాక్సీకూడా దొర‌క‌లేదు.  వాళ్ల‌కు బ‌స ఏర్పాటు చేసిన స్టేడియాకు వెళ్ల‌డానికి  ఏ  ఒక్క ఆటో కూడా దొర‌క్క పోవ‌డంతో సుమారు రెండు గంట‌ల‌పాటు గేమ్స్ ప్రారంభోత్స‌వ విలేజ్ వ‌ద్ద‌నే వేచి ఉండా ల్సి వ‌చ్చింది. కాగా తెల్ల‌వారుతుండ‌గా మొద‌టి బస్సుప‌ట్టుకుని నేష‌న‌ల్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్ నుంచి బ‌యలు దేరారు. వాస్త‌వానికి భార‌త్ బృందానికి మూడు కార్ల‌ను నిర్వాహ‌కులు ఏర్పాటుచేశారు. అథ్లెట్లు, సంబం ధిత బృం దాల అధికారులు గేమ్స్ విలేజ్‌కి స‌ర‌యిన స‌మ‌యంలో  చేరేందుకు వీలుగా  ఆ  కార్లు, డ్రైవ‌ర్ల నూ ఏర్పాటు చేశారు. కానీ  డ్రైవ‌ర్లు  ఆ రాత్రిబాగా  అల‌సిపోవడంలో  ప్రారంభోత్స‌వానికి  మ‌న బృందం బ‌స్సుల్లో వెళ్ల‌వ‌ల‌సి వ‌చ్చింది. ఈ  విష‌యం తెలిసి భార‌త బాక్సింగ్ ఫెడ‌రేష‌న్ ఉపాధ్య‌క్షుడు, భార‌త్ కామెన్ వెల్త్ గేమ్స్ బృందానికి ఛీఫ్  కూడా  అయిన రాజేష్ భండారి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.  ప్రారంభోత్స‌వం జ‌రుగుతుండ‌గా మ‌ధ్య‌లోనే  ల‌వ్లీనా, మ‌రో బాక్స‌ర్ ముందుగానే ప్రాక్టీస్ కోసం వెళ్లార‌ని, అలాంటపుడు వారు అస‌లు ప్రారంభోత్స‌వానికి రాకుండా ఉండాల్సింద‌ని, త‌మ‌కు కూడా త‌గిన వాహ‌నా లు ఏర్పాటు జ‌ర‌గ‌క పోవ‌డంప‌ట్లా అయ‌న ఆగ్ర‌హించారు. వాస్త‌వానికి చాలామంది అథ్లెట్లు శిక్ష‌ణ కార‌ణంగా ప్రారంభోత్స‌వానికి రావాల‌ని అనుకోలేదని, దీన్ని గురించి బాక్సింగ్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడ‌తా న‌ని భండారీ అన్నారు.  ప్రారంభోత్స‌వ వేడుక‌లో మొత్తం 164మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొన్నారు. 

భుజాలు తడుముకున్నకొడాలి నాని

వెనుకటికి ఎవడో గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట.సరిగ్గా అలా ఉంది ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి.   గుడివాడ క్యాసినో వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే తీరు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అంటే ‘దొంగే.. దొంగ దొంగ అరిచినట్టు’ కొడాలి నాని తెలుగుదేశం నేతలకు సవాల్ వసురుతున్నారని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలో క్యాసినోను తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి అందజేసి తనను అరెస్ట్ చేయించాలంటూ కొడాలి చేసిన సవాల్ పట్ల టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. చేసిందంతా చేసి, ఇప్పుడు ఈ మేకపోతు గాంభీర్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.  విషయం ఏంటంటే.. గత జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున క్యాషినో నిర్వహించారు. అది కూడా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సొంత ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం సంచలనంగా మారింది. అప్పటికే భూ దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించడంలో నానికి అందెవేసిన చెయ్యి అనే పేరుంది. అయితే.. అప్పుడు ఇలా గోవా తరహాలో క్యాషినో నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలైతే ఓ రేంజ్ లో కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. నిజనిర్ధారణ కోసం గుడివాడ వస్తున్న టీడీపీ నేతలను పోలీసలు, కొడాలి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.  శ్రీలంక, నేపాల్, గోవాల్లో క్యాషినోలు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో  ఇటీవల హైదరాబాద్ లో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిల ఇళ్లు, నగర శివార్లలోని ప్రవీణ్ ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. చీకటి వ్యాపారాల్లో సిద్ధహస్తుడైన చీకోటి ప్రవీణ్ కు- గుడివాడలో జరిగిన క్యాషినోకు సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిదే. చీకోటి ప్రవీణ్ ను కొడాలి నానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిచయం చేశారని, ఆ క్రమంలోనే కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో క్యాషినో నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ఎత్తి చూపుతూ.. చీకోటి ప్రవీణ్ తో వల్లభనేని వంశీ కలిసి ఉన్న ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు. గోవా తరహాలో గుడివాడలో క్యాషినో నిర్వహించడం వెనుక చీకోటి ప్రవీణ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ హస్తం ఉందని వర్ల రామయ్య ఆరోపించారు. అయితే.. గుడివాడలో క్యాషినో తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి సమర్పించి తనను అరెస్ట్ చేయించాలని కొడాలి నాని టీడీపీ నేతలకు బహిరంగంగా సవాల్ విసిరారు. ‘బురద పాము కోపం’ అనే సామెత ఒకటి ఉంది.. విషం లేని బురద పాము కరిచినా ప్రమాదం ఉండదు. అలాగే ఒక పక్కన మంత్రి పదవి కోల్పోయి, మామూలు ఎమ్మెల్యేగా ఉంటున్న కొడాలి నాని హవా ఇప్పుడు స్థానికంగా అస్సలు లేదట.   స్థానిక అధికారులు కూడా ఆయన మాటను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులే కాదు స్వయంగా ఆయనే చెప్పుకుంటున్నారు. చెత్తపై పన్ను వసూలు చేయొద్దని కొడాలి చెప్పినా గుడివాడ మున్సిపల్ అధికారులు పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే మాట విని విధులు నిర్వర్తించకుండాఉండమని ఆయనకే ఖరాకండీగా చెప్పేశారు. దీంతో కోరలు పీకిన పాములా కొడాలి నానిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. అందుకే చెత్త పన్ను విషయంలో సీఎం జగన్ తోనే మాట్లాడతానంటూ   తనలాగే అమాత్య పదవి కోల్పోయిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సాయంకోరినట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. టీడీపీ నేతల నుంచి, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో కొడాలి నాని భుజాలు తడుముకుంటున్నారని, దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు చేస్తున్నారంటున్నారు. చేతనైతే తనన అరెస్ట్ చేయించాలంటూ కొడాలి నాని సవాల్ విసరడం వెనక ఆయనలోని ఉలికిపాటు బట్టబయలైందంటున్నారు.

ఏమని పిలవాలి? ఇంకేమని పిలవాలి?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గురించి, కాంగ్రెస్ ఎంపీ అధీర రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్య చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. పార్లమెంట్ లోపల వెలుపల కూడా చౌదరి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.అనుమానం లేదు. కాంగ్రెస్ ఎంపీ మర్యాద గీత దాటారు. అయితే ఉద్దేశపూర్వకంగా తానా వ్యాఖ్యలు చేయలేదని, పొరపాటున మాట దొర్లిందని సంజాయషీ  ఇచ్చారు. అయినా ఆ వివాదం సర్దుమణగ లేదనుకోండి అది వేరే విషయం. అయితే, మహిళలు రాష్ట్రపతి పదవిని చేపట్టినప్పుడు, వారిని ఎలా పిలవాలి?ఎలా సంభోధించాలి ? అనే విషయంలో ఇప్పుడు కాదు, రాజ్యాంగ నిర్మాణానికి ముందు నుంచి కూడా సందేహాలు, సందిగ్దతలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి,  రాజ్యాంగ సభలో ‘రాష్ట్రపతి’ సంబోధన అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  మహిళలు  ‘రాష్ట్రపతి’ పదవిని చేపట్టినప్పుడు, వారిని రాష్ట్రపతిగా పిలవడం సరికాదని...‘నేత’ అని సంబోధించాలని రాజ్యాంగ సభ సభ్యుడు కె.టి.షా అభిప్రాయపడ్డారు. అలాగే, మరికొందరు ‘కర్ణధార్‌’ (కెప్టెన్‌)గా, సర్దార్‌గా పిలవాలని సూచించారు. అయితే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆ వివాదానికి అప్పుడే చుక్క పెట్టారు. రాష్ట్రపతి స్త్రీ అయినా పురుషుడు అయినా, లింగ భేదంతో సంబంధం లేకుండా, వారిని ‘రాష్ట్రపతి’గానే పిలవాలని నెహ్రూ నిర్ణయించారు.  అయితే  నెహ్రూ కాలంలో కానీ, అనంతర కాలంలో కానీ, రాష్ట్రపతి సంభోదనకు సంబంధించి ఏలాంటి చర్చ జరగలేదు. అలాంటి అవసరం,సందర్భం కూడా రాలేదు. 2007 లో ప్రతిభా పాటిల్ దేశ 12వ రాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఎనికయ్యారు. తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో, ఇదిగో ఇప్పటిలానే, మహిళా రాష్ట్రపతిని ఎలా సంభోదించాలనే విషయంలో చిన్నపాటి చర్చ జరిగింది కానీ, ఇప్పటిలా వివాదం అయితే కాలేదు. అయితే, ప్రధానమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, గవర్నర్లను ఆడ, మగ తేడ లేకుండా ఒకేలా  సంభోదిస్తున్నప్పుడు,ఒక్క రాష్ట్రపతి విషయంలో మాత్రమే వివాదం ఎందుకు, అనే వాదన కూడా వుంది. అందుకే,  భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ, పదవులకు లింగ భేదం ఎందుకనే ఉద్దేశంతోనే కావచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి అని  తేల్చేశారు

అప్పులపై కేంద్రం, రాష్ట్రాల పరస్పర నిందా పర్వం

చవటాయను నేను.. నీకంటే పెద్ద చవటాయను నేను అని పాత సినిమాలో ఓ పాట ఉంది. ఇప్పుడు దానినే కొంచం తిరగేసి కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు పాడుకుంటున్నట్లుగా ఉంది. అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాలను నిందిస్తుంటే.. గురివింద గింజ సామెతలా ఉంది కేంద్రం తీరు అంటూ రాష్ట్రాలు నిప్పులు చెరుగుతున్నాయి.    అప్పుల విషయంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య నడుస్తున్న రగడ నేను చవటనే కానీ నాకంటే మీరు మరింత పెద్ద చవట అని పరస్పర నిందన యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం రాష్ట్రాల అప్పులను ప్రశ్నిస్తుంటే.. మా సంగతి సరే మీ సంగతేంటని రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.  మీరు అప్పులు ఎక్కువ చేశారంటే మీరు ఎక్కువ అప్పులు చేశారంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రజలు దొందూ దొందే అనుకుని పరిస్థితి కల్పించారు. అప్పుల తగాదాలోకి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ చేరవు. అలా చేరాల్సిన అవసరమూ వాటికి లేదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట ఆయా రాష్ట్రాల నిబంధనల ఉల్లంఘనను, అప్పుల అరాచకాన్ని కేంద్రం ఎత్తి చూపుతుంటే... అప్పుల విషయంలో కేంద్రం చిల్లులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిగ్గు తేలుస్తున్నాయి. ఈ మోత్తం రగడలో రాష్ట్రాల తప్పిదాల కంటే కేంద్రం తప్పిదమే ఎక్కువ ఉందని పరిశీలకులు ఖరాఖండీగా చెప్పేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల అప్పులకు కేంద్రం అనుమతి ఉండాలి. నిబంధనలకు మించి ఒక్క రూపాయిఎక్కువ అప్పు చేయాలన్నా గ్రీన్ సిగ్నల్ఇవ్వాలి. ఇంత కాలం గుట్టు చప్పుడు కాకుండా కేంద్రం, రాష్ట్రాలు ఇష్టారీతిన అప్పులు చేసేసి తీరా చేతులు కాలక తప్పదన్న పరిస్థితి వచ్చే సరికి ఆకుల కోసం వెదుక్కుంటున్నాయి. శ్రీలంక పరణామలు సంభవించి ఉండక పోతే కేంద్రం, రాష్ట్రాలూ కూడా తోడు దొంగల్లా అప్పు భారతీయాన్ని అలా కొనసాగిస్తూనే ఉండేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అప్పులపై పార్లమెంటు వేదికగా కేంద్రం ప్రకటన చేసిన రోజునే.. ఏపీకి పెద్ద మొత్తంలో అప్పుకు అనుమతించడమే నిదర్శనంగా పరిశీలకులు చూపిస్తున్నారు. నిజమే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఎఫ్ ఆర్ఎంబి( ఫెనాన్స్ రెస్బాన్స్ బులిటీ- బడ్జెట్ మేనేజ్ మెంట్)ను మించి అప్పులు చేశాయి. విచ్చల విడిగా ఆర్థిక క్రమశిక్షణకు తిలోదకాలిచ్చి మరీ ఉచిత హామీలు నెరవేర్చి తదుపరి ఎన్నికలలో విజయానికి పెట్టుబడిగా ఉపయోగించేశాయి. కానీ ఆ రాష్ట్రాలు అలా చేయడానికి కారణం కేంద్రం చూసీ చూడనట్లు వ్యవహరించడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేంద్రం, రాష్ట్రాలూ రెండూ కారణమేనని వారు వివరిస్తున్నారు. ఇంత కాలం కేంద్రం, రాష్ట్రాలూ కూడా తేలుకుట్టిన దొంగల్లా అప్పుల విచ్చలవిడితనంపై మౌనంగా ఉండి.. శ్రీలంక సంఘటనలతో ఒక్కసారి ఉలిక్కిపడి తప్పు మీదంటే మీదని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ పంచాయతీ అని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పరిమితిని మించి అప్పులు చేశాశాయంటే కేంద్రం, ఆర్బీఐ ఎత్తి చూపిన రాష్ట్రాలలో దాదాపు అన్నీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలే కావడం వెనుక ఉన్నది రాజకీయ కారణమే తప్ప మరొకటి కాదనడంలో సందేహాలకు తావులేదని వాస్తవమే అయినా.. ఆయా రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయనడంలోనూ, అందుకు పరిమితికి మించిన అప్పులే కారణమనడంలోనూ ఎటువంటి సందేహమూ లేదు. రాష్ట్రాల పరిస్థితి ఎలా తయారైందంటే.. చేసిన అప్పులు తీర్చడం మాట అటుంచి వాటికి వడ్డీలు కట్టడానికే మళ్లీ  అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది రాష్ట్రం పరిస్థితి అయితే కేంద్రం ఏం తక్కువ తినలేదు. ఈ సంగతీ తమను వేలెత్తి చూపిన కేంద్రంపై రాష్ట్రాలు ప్రతి విమర్శలు చేయడంతోనే బయట పడింది. కేంద్రం రుణాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్ల చేతనే  ఇంత కాలం కేంద్రం రాష్ట్రాల అప్పులపై నోరెత్తలేదు. అలాగే కేంద్రం రుణాలపై రాష్ట్రాలు నోరెత్త లేదు. ఇప్పుడైనా కేంద్రం, రాష్ట్రాల బండారం బయటపడటానికి శ్రీలంక పరిణామాలే కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో జనాలకు వెల్లడయ్యేందుకు కారణమైన శ్రీలంకకు ప్రజలు ధ్యాంక్స్ చెప్పుకోవాలి.కేంద్రం అప్పులూ దేశాన్ని దివాళా దిశగా తీసుకు వెళ్లేలాగే ఉన్నాయనడానికి ఆ అప్పులు దేశ   స్థూల జాతీయోత్పత్తిలో 60 శాతానికి మించిపోవడమే తార్కానం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం తన ఖాతాలోనే జమ వేసుకుంటూ రాష్ట్రాలు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోవడానికి పరోక్షంగా కేంద్రమే కారణమైంది. అవి చాలవన్నట్లు  విదేశీ బాండ్ల రూపంలో అప్పుల సేకరణ లేదా సమీకరణకు కేంద్రం తెరతీసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేసింది. ఇవన్నీదేశ  ఆర్థిక వ్యవస్థ వేగంగా సంక్షోభం దిశగా పయనిస్తున్నదనడాకి తార్కానాలు. ఇంత పంచాయతీ జరుగుతున్నా కేంద్రం, కానీ రాష్ట్రాలు కానీ అప్పులను నియంత్రించుకుని పొదుపు పాటించాలని భావించడం లేదు. వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలూ కూడా జనాలకు నగదు పంపిణీయే పెట్టుబడి అని భావిస్తున్నాయి. దేశం మరో శ్రీలంక అయినా వాటికి పట్టింపు లేదు. అధికారం చేజిక్కించుకుంటే చాలు అన్న ధోరణిలోనే ఉన్నాయి. ఒక చేత్తో ఉచితాల పేరున ప్రజలకు పంపిణీ చేస్తున్న ప్రభుత్వాలే మరో వైపునుంచి జనం నుంచి పన్నుల రూపంలో రెండు చేతులా పిండేస్తున్నారు.  

నాన్నా..ఇంకో ముక్క‌! 

. .  . నీకో ముద్ద .. నాకో ముద్ద .. అంటూ ఏదో ఒక కూనిరాగం తీస్తూనే తల్లి పిల్ల‌కి తినిపిస్తుంటూంది. వ‌య‌సు పెరిగేకొద్దీ ఈ పాట మాధుర్యం బంధాల్ని మ‌రింత క‌ట్టిప‌డేస్తుంటుంది. త‌రాలు మార‌తాయి, ఇలాంటి సంద‌ర్భాలు కొన‌సాగుతూనే ఉంటాయి. తెలీకుండానే ఒక‌రికోసం ఒక‌రు అన్న భావ‌న బ‌ల‌ప‌డుతుంది. ప‌రిస్థితుల్లో మార్పు రావ‌చ్చు.. త‌ల్లిదండ్ర‌లు, పిల్ల‌ల మ‌ధ్య మాత్రం ఏ కాల‌మూ, ఏ మార్పూ అంత‌గా ప్ర‌భావం చూప‌దు. ఆడ‌పిల్ల‌ల‌యితే త‌ల్లినే త‌ల‌పిస్తారు. తండ్రి ఎలాంటివాడ‌యినా, తండ్రి ఏ స్థితిలో ఉన్నా.. తండ్రే. త‌న‌వి లాలించ‌లేని ప‌సి వ‌య‌సు అయినా, ఒక్క ముద్ద పెట్టి ఆయ‌న స‌మ‌స్య‌ను తెలుసుకునే వ‌య‌సు, కాకున్నా క‌ళ్లు తుడిచి చేతికందిన పండు ముక్క‌యినా పెట్ట‌డానికి సాహ‌సించే గొప్ప మ‌న‌సు పిల్ల‌ది! దాని ముందు ప్ర‌తీదీ దిగ‌దుడుపే.   పిల్ల‌ల మ‌న‌సు తెల్ల కాయితం. అందుకే అంతగా ప్రేమిస్తారు. అంత‌గా బాధాప‌డ‌తారు. నువ్వు తింటేనే నేనూ తింటానంటారు.  పిల్ల‌లు దైవ‌స్వ‌రూపులు.. కాదు.. మాతృ మూర్తులు. ఇక్క‌డో చిన్నారి త‌న తండ్రికి ఓ పండు ముక్క పెడుతోంది. అత‌నికి వెండిగిన్నెలో ఎంతో ఖ‌రీద‌యిన తిండి తిన్నంత ఆనం దం. ద‌ట్ ఈజ్ బ్యూటీ ఆఫ్ లైఫ్‌! ఈ దృశ్యం ముంబై లోక‌ల్ ట్రైన్‌లో దృశ్యం. దీన్ని ఇప్ప‌టికి ల‌క్ష‌ల‌ మందే చూసి ఉంటారు. వారికీ తండ్రి ప్రేమ గుర్తొచ్చే ఉంటుంది. 

మమత దూకుడుకు మో(ఈ)డీ చెక్!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ దెబ్బలన్నిటి వెనుకా కేంద్రం ఉందన్నది పరిశీలకులు అంటున్న మాట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇందుకూ పరోక్షంగా కేంద్రమే కారణం. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మమత నేతృత్వంలో అందరూ మద్దతు పలికిన యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆ పరాజయం మమత నేతృత్వంలోని విపక్షాల ఐక్యత డొల్ల అని తేల్చేసింది. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం వెనుకా మోడీ షా వ్యూహం ఉంది. ఇక తాజాగా ఉపాధ్యాయుల నియామక స్కాం లో మమత కేబినెట్ లో విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ అడ్డంగా దొరికి పోయి అరెస్టయ్యారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. తనకు సన్నిహితుడైన మంత్రివర్గ సహచరుడిని స్వయంగా మమతే మంత్రివర్గం నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం ఈడీ దాడుల్లో ఆయన అడ్డంగా దొరికిపోవడమే అయినా.. ఆ ఈడీ దాడుల వెనుక ఉన్నది మోడీయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మళ్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దగ్గరకు వస్తే.. అష్టదిగ్బంధనంలా మారిన కేంద్రం షరతులతో ఆర్థిక వెసులుబాటుకు మమత సర్కార్ దూరమైంది. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే గగపమైన పరిస్థితుల్లో ఎన్నికలలో మమత ఇచ్చిన హామీల అమలు, పథకాల అమలులో అనివార్యంగా కోత పడుతోంది. ఇది ఒక విధంగా జనంలో దీదీ పాపులారిటీ వేగంగా తగ్గిపోవడానికి కారణమౌతోంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యవ్వంత్ సిన్హా ఓటమితో విపక్షాల ఐక్య కూటమికి నేతృత్వం వహించాలన్న మమత కలలు దాదాపు కల్లలైనట్లే. విపక్షాల ఐక్యత విషయంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాలు నిలబెట్టిన అభ్యర్థికి తృణమూల్ ఓటేయదని స్వయంగా మమతా బెనర్జీయే ప్రకటించి విపక్షాల ఐక్యతా యత్నాలు డొల్లేనని చెప్పకనే చప్పే పరిస్థితి ఏర్పడింది. దీని వెనుక ఉన్నదీ మోడీ వ్యూహమే. పైగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన నిలబెట్టింది.. బెంగాల్ ప్రభుత్వానికి అడుగడుగులా అడ్డంకులు సృష్టించిన ఆ రాష్ట్ర గవర్నరనే. ఇక ఇది చాలదన్నట్లు ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ కుంభకోణం. ఈ కుంభకోణంలో ఏకంగా ఒక మంత్రి అడ్డంగా దొరికిపోవడంతో జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల ఐక్యతకు మమత ప్రయత్నాలకు పూర్తిగా చెక్ పడినట్లే.  గత అసెబ్లీ ఎన్నికలలో పరాభవానికి, పరాజయానికి మోడీ మమతపై ఈ రకంగా ప్రతీకారం తీర్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మమతా బెనర్జీని మరింత డిఫెన్స్ లో పడేసే విధంగా  పులి మీద పుట్రలా పాఠశాలల్లో నియామకాల కుంభకోణం వెలుగు చూసింది. ఇంకేముంది అదును చూసి మోడీ మమతను దెబ్బ కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఫలితంగా జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగే అవకాశం కల్పించారు. ఈ పరిణామాల మధ్యే 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బిజేపి తో కాంటాక్ట్ లో ఉన్నారు అంటూ అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో, ఇప్పడు బీజేపీ సీనియర్ నాయకుడు  మిథున్ చక్రవర్తి బాంబులాంటి వ్యాఖ్య చేశారు. ఆయన అక్కడితో ఆగకుండా మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ లో శాంతి భద్రతలు క్షీణించాయనీ, రోహింగ్యాల రాజ్యం నడుస్తోందనీ విమర్శలు గుప్పించారు.   మోడీ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందంటే.. తన కేబినెట్ మంత్రిని ఈడీ అరెస్టు చేసినా కనీసం ఖండన ప్రకటన కూడా చేయలేని పరిస్థితి మమతకు కల్పించారు. కళ్లెదుట నోట్ల కట్టలు కనిపిస్తుంటే.. ఎంత కేబినెట్ సహచరుడైనా మమత ఆయనకు మద్దతుగా ఎలా నిలుస్తారు. అరెస్టుకు ముందు పార్థా చటర్జీ మమతకు పలుమార్లు ఫోన్ చేసినా ఆమె కనీసం రెస్పాండ్ కాలేదు. దీంతో ఆయనా ఆగ్రహించినట్లున్నారు. తనను అరెస్టు చేస్తే తెలియజేయాల్సిన వారి జాబితాగా ఇచ్చే మెమోలో మమత పేరును చేర్చారు. దీంతో మమతా బెనర్జీ కేబినెట్ నుంచి పార్థా చటర్జీని బర్త్ రఫ్ చేశారు.  ఈ వరుస పరిణామాలతో మమతా బెనర్జీ ఇక ఇప్పట్లో జాతీయస్థాయిలో రాజకీయాల వైపు దృష్టి సారించే అవకాశాలు దాదాపు మృగ్యమేనని.. ఆ విధంగా మోడీ వ్యూహాత్మకంగా మమతను బెంగాల్ కే పరిమితం చేయగలిగారనీ అంటున్నారు. ఇక తరువాతి వంతు కేసీఆర్ దేనని ఆయనను కూడా తెలంగాణకు పరిమితం చేసేందుకు మోడీషా ద్వయం పావులు కదుపుతున్నారనీ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

విజయమ్మ  క‌రివేపాకేనా..!? 

కొంద‌రికి కొంద‌రు క‌లిసివ‌స్తారు. క‌లిసొచ్చిన కాల‌మంతా వారి మాట‌, చెలిమికి లేదా ప్రేమాభిమానాల‌కు అపూర్వ ప్ర‌త్యేక‌త‌నిచ్చి ఆన‌క ఆట‌లో అర‌టిపండులా భావించి దూరం చేస్తుంటారు. ఇదంతా రాజ‌ కీయాల్లోనూ సాధ్యం. ఎందుకంటే పార్టీల‌కు, నాయ‌కుల‌కు ఉన్నంత సెంటిమెంట్ పిచ్చి మ‌రెవ్వ‌రికీ ఉండ‌దు. ఫ‌లానా ఆయ‌న పార్టీలోకి రాగానే అంతా బ్ర‌హ్మాండం అంటారు. ఈయ‌నతో ప్ర‌చారానికి వెళితే అంతే మ‌హాద్భుత‌మ‌న్న‌వారే ఆ త‌ర్వాత మ‌రేదో కార‌ణంగా మ‌రేదో జ‌రిగితే మొద‌టి స్నేహాన్ని కాదం టారు. అస‌లా మాట‌కి వ‌స్తే రాజ‌కీయ చ‌ద‌రంగంలో కుటుంబ సెంటిమెంట్ల‌కి బొత్తిగా అవ‌కాశం లేద‌న్న‌ది వైసీపీ గౌర‌వాధ్య‌క్ష ప‌ద‌వి నుంచి వై.ఎస్‌.విజ‌య‌ల‌క్ష్మిని తొల‌గించ‌డం స్ప‌ష్టంచేస్తుంది. ఇక్క‌డ క‌న్నాం బ‌లు, రుష్యేంద్ర‌మ‌ణి, గుమ్మ‌డి .. ఈ వ్య‌వ‌హారాల‌కు తావులేదు. అందుకే ఆమె చాలా సైలెంట్‌గా కుమార్తె నీడ లోకి వెళ్లారు. త‌న కుమారుడికి ఒక్క అవ‌కాశం ఇవ్వ‌మ‌ని విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌జ‌ల్ని కోర‌డంతో ప్ర‌జ‌లు పెద్ద మ‌న‌సు చేసు కుని అధికారం అప్ప‌గించారు. కానీ అధికారం తాలూకు ప్ర‌భావం జ‌గ‌న్‌ను విర్ర‌వీగేలా చేసింద‌నే అభిప్రా యాలే విన‌వ‌స్తున్నాయి. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ను వై.ఎస్ కుమారుడ‌న్న అభిమానం తోనూ ఉండ‌నీయడానికి  ప్ర‌జ‌లు ఇష్టప‌డ‌టంలేదు. కార‌ణం జ‌గ‌న్ పాల‌న అంతగా ప్ర‌భావం చూప‌క పోగా, అన్నివిధాలా విఫ‌ల‌మ‌యిందని విశ్లేష‌కులు అంటున్నారు.  క‌నుక‌నే అంద‌లం ఎక్కించిన ప్ర‌జ‌లే ఇపుడు దిగిపోతే బావుండున‌ని అనుకుంటున్నారు. విజ‌య‌మ్మ త‌న‌కొడుకు వెన‌కే ఉండి రాజ‌కీయాల్లో ముందుకు న‌డిచేలా  త‌న భ‌ర్త ఆలోచ‌న‌ల‌ను కొడుకు  ద్వారా అమ‌లు చేయాల‌ని ఆమె అనుకోవ‌చ్చు. కానీ అలాగేమీ జ‌ర‌గ‌క‌పోగా ఆమెను కేవ‌లం ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి ఒక బ్ర‌హ్మాస్త్రంగానే జ‌గ‌న్ ఉప‌యో గించుకున్నారని రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌.   ఇటీవ‌లి వరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉండి పార్టీకి  తన  అవసరం ఎప్పుడు వచ్చినా వెంటనే సహాయం చేసేవారు. కొడుకు కష్టం లో ఉన్నపుడు, అలాగే జైలు లో ఉన్న 18 నెలలు పార్టీ లో ఎలాంటి  అసమ్మతి రాకుండా పార్టీ ని ఒక్కతాటి పై నడిపించారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో, కొన్ని గ్రహాల ప్రోద్బ లంతో తల్లి తో పార్టీ సభ్య‌త్వానికి  రాజీనామా చేయించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు.  మొద టగా చెల్లిని పార్టీ నుంచి పంపించి, పార్టీ పరంగా, అలాగే కుటుంబ పరంగా విభేదాలు కల్పించారు. ఇప్పు డు తల్లిని  ప్లీనరిలోనే తన రాజీనామా ఇచ్చేలా చేసారు. ఈ పరిణామాల వెనక జగన్మోహన రెడ్డి  భార్య భారతి  ఉన్నట్టుగా కొంతమంది ఆ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. కుమార‌ర‌త్నం చేసిన దానికి విజ‌య‌మ్మ ఊహించ‌ని షాక్‌కి గుర‌య్యార‌నే అనాలి. ఇహ ఆమెకు మిగిలింది త‌న కుమార్తె షర్మిలకి సపోర్ట్ గా నిలవడ‌మే. అందుకే   ఇక్కడ పార్టీ కి రాజీనామా  చేస్తున్నాన‌ని చెప్పిన విజయమ్మ తను రాజీనామ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఆలోచించారో లేదో న‌నే అభిప్రాయాలున్నా యి.  ఇప్పటికే  ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తున్న నేపద్యంలో జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణ యం అతని నిరంకుసత్వ ధోరణికి అద్దం పడుతోంది. తనే రాజు తనే మంత్రి అన్న విధంగా ఉన్న నిర్ణయాలు జగన్ని పాతాళానికి తొక్కేస్తాయ‌నే విషయం అర్ధం తేటతెల్లమ‌ వుతోంది.  జగనన్న వదిలిన బాణం, రాజన్న కుమార్తెన‌ని,  అన్నకోసం మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్న జైలులో ఉండగా పార్టీకి,  కుటుంబానికి  అండగా ఉండి, అన్నకి  ఒక్కసారి అధికారం ఇవ్వమని ప్రజల్ని కోరిన షర్మిల కి జగన్  ఇచ్చిన ప్రతిపలం చూసి రెండు  రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలు వేసుకు న్నారు. ఇక్కడనుంచి వెళ్లి తెలంగాణా లో సొంత కుంపటి పెట్టుకుని, పాదయాత్ర ల పేరుతొ ఊరూరా తిరుగుతూ రాజన్న రాజ్యం తెలంగాణాలో తీసుకువస్తా అని చెప్పి తిరుగుతున్న ఈ బాణం గురి తప్పు తుందేమోన‌ని విశ్లేషకుల అభిప్రాయం. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్  పాలనా చూసిన వాళ్ళు ఎవరైనా ఈమెకి  అవకాశం ఇస్తారా అనే సందేహాలు లేకపోలేదు. ఐతే ఇప్పటికే  తెలంగాణా వ్యాప్తం గా షర్మిల వివిధ రకాల గా ప్రజలని కలుస్తున్నారు.కొంచం రాజశేకరరెడ్డి హావభావాలు ప్రదర్శించడం, ప్రభుత్వ తప్పిదాలు ప్రజ ల్లోకి తీసుకువెళ్ళడం, దొరపాలన లాంటి పదునైన పదాలతో మాట్లాడడం చేస్తున్నారు. కానీ మాటలతో పనులు జరుగుతాయ అంటే కష్టం అని తెలుసుకోవాలి. దీక్షల పేరుతో కొన్నివర్గాలని ఆకట్టుకునేందుకు తీవ్ర‌యత్నం చేస్తున్నారు. ఐతే తెలంగాణా లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపద్యంలో షర్మిల  ఆగష్టు నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర చేస్తున్నారని తెలిస్తోంది. ఆమెతో పాటు విజయమ్మ కూడా కొంత పాదయాత్రలో  పాల్గొంటారని సమాచారం. అయితే ఇక్కడ విజయమ్మకి  తెలంగాణా వైసీపీ లో ఎలాంటి స్థానం కల్పిస్తారోన‌నే  ఆసక్తి అందర్లో నెలకొంది. అప్పుడు కొడుకు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవరకు ఎంతో అండగా ఉండి సహాయ సహకారాలు అందించిన విజయమ్మ, మరి ఇప్పుడు కూతురి బాధ్యతని కూడా తీసుకున్నారా అంటే అవు ననే చెప్పాలి. అయితే ప్రస్తుతం విజయమ్మ గారు షర్మిల గారి  కి సహాయ సహకారాలు అందించడానికి మాత్రమే ఇక్కడకి వచ్చారని చెప్తున్నారు కానీ అసలు విషయం కొడుకుతో  విభేదాలే అసలు కారణం అని షర్మిల స‌న్నిహితుల మాట. షర్మిలని  కూడా వచ్చే తెలంగాణా ఎన్నికలలో గెలిపించి అసెంబ్లీ కి పంపా లనే దృఢ నిశ్చ‌యంతో  వచ్చినట్టు ఉన్నారు విజయమ్మ. ప్రస్తుతం తల్లిని తెలంగాణా ఎన్నికలు  దృష్టి లో పెట్టుకుని తనతో తెచ్చుకున్నట్టు షర్మిల మాటల  అంతరార్దం. కేవలం తల్లిని ఎన్నికలలో గెలుపు కోసమే వాడుకోవడంతో అటు జగన్  ఇటు షర్మిల  ఇద్దరూ  రాజకీయ నాయకులలాగే ప్రవర్తించారు కానీ కుటుంబ విలువలకి ఎక్కడా ప్రాదాన్యం ఇచ్చి నట్టు కనిపించట్లేదు. కేవలం తల్లిని రాజకీయాలలో విజయం సాధించడానికి  ఒక అస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారు. తెలుగు ప్రజల సెంటిమెంట్ని ఉపయోగించుకోవడం లో రాజన్న పుత్రుడు సఫలం అయ్యాడు,మరి పుత్రిక విషయం లో ఏం జరుగుతుందో కొంతకాలం ఎదురు చూడక తప్పదు.

అధీర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలై  శుక్రవారం (జులై 29) నాటికి పది రోజులు. కానీ, ఇంతవరకు ఒక్క రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగింది లేదు. ఏ రోజుకారోజు ఏదో ఒక వివాదంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇంతవరకు పార్లమెంట్ ఉభయ సభల నుంచి  ఓ పాతిక మంది వరకు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. నిజానికి, ఇలా పార్లమెంట్ సమావేశాల పేరిట ప్రజాధనం వృధా పద్దులో కొట్టుకు పోవడం,ఇదే మొదలు కాదు. ఇంతకు ముందు కూడా ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే ప్రజాధనం వృధా అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.   అయితే ప్రస్తుత సమావేశాలలో రెండు కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమావేశాలలో గౌరవ సభ్యులు, స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా, ఓ గిరిజన మహిళ, ద్రౌపతి ముర్మును భారత రాష్టపతిగా ఎన్నుకున్నారు. ఒక గిరిజన దళిత మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకుని గౌరవించిన సభలోనే, అదే గిరిజన దళిత మహిళకు అవమానం జరిగింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి, పొరపాటునే కావచ్చును, ‘రాష్ట్రపత్ని’ అని  సంభోదించారు. నిజానికి, అధిర్ రంజన్ చౌదరి తప్పు తెలుసు కున్నారు. భారత రాష్ట్రపతిని అగౌరవ పరచాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, పొరపటున నాలుక దొర్లిందే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసిన వ్యాఖ్య కాదని విచారం వ్యక్త పరిచారు. రాష్ట్రపతి ముర్ముకి క్షమాపణ చెప్పడానికి కూడా అంగీకరించారు. అయితే చౌదరి క్షమాపణ చెపితే సరిపోదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని, మహిళా మంత్రులు నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ సహా బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పక్ష నేత అధీర రంజన్ చౌదరి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతిని అవమానించారని, ఆయన వ్యాఖ్యలు రాష్ట్రపతి హోదాను కించపరిచేలా ఉన్నాయని,  భారతీయ విలువలకు విరుద్ధమని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సోనియా గాంధీకి, స్మృతీ ఇరానీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభ మరోరోజు వాయిదా పడింది. అదలా ఉంటే, అధీర రంజన్ చౌదరి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంట్ లోపలే కాదు,  వెలుపల కుడా దుమారం రేపుతున్నాయి. మధ్య ప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  మరోవంక జాతీయ మహిళా కమిషన్ కూడా అధీర్ రంజన్ చౌదరికి నోటిసు ఇచ్చింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని, లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.  నిజమే, అధీర్ రంజన్  చౌదరి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసిన వ్యాఖ్యలే అయినా, సారీతో సరిపుచ్చుకునేంత చిన్న పొరపాటు కాదు. చాలా పెద్ద పొరపాటు. పొరపాటు కుడా కాదు. ఒక మహాపరాధం, అందులో సందేహం లేదు. అందుకే, ఆయన లోక్ సభ సభ్యత్వాని రద్దు చేయాలనే డిమాండ్ కుడా వినవస్తోది. నిజమే, పార్లమెంట్ సాక్షిగా జరిగిన పరాభవానికి, అయన పై కఠిన చర్యలు అవసరం.  ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు, కాంగ్రస్ పార్టీ తీసుకుంటుందా. లోక్ సభ స్పీకర్ తీసుకుంటారా? అనేది పక్కన పెడితే, ఆయనన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం సముచితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే, అదే అయితే, అయన వ్యాఖ్యలపై సభలో చర్చ, చోటుచేసుకున్న వాదోపవాదాలు, సభ ఔనత్యాన్ని, రాష్ట్రపతి గౌరవాన్ని కానీ, ఇనుమడించేలా  ఉన్నాయా? మరింత అవమాన పరిచేలా ఉన్నాయా?అనేది కూడా ఆలోచించవలసి ఉంటుందని అంటున్నారు.

ముంపుగ్రామాల ప్ర‌జ‌ల మొహాల్లో చంద్ర హాసం!

ప్ర‌జానాయ‌కులు స‌మాజ‌శ్రేయ‌స్సు కోసం జ‌న్మిస్తారు. వారికి ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్క‌డ‌యినా వారి దృష్టి ప్ర‌జాసంక్షేమ‌మే. వారికి రాజ‌కీయాలు, వ్యూహాలు, ద్రోహాల ఆలోచ‌న ఉండ‌దు. ఏ స‌మ‌యంలో నైనా,  ప‌ద‌విలో ఉన్నా, లేకున్నా  ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం  వారి  స‌హ‌జ ల‌క్ష‌ణం. దానికి ప‌డ‌నివారు అనేక పేర్లు పెట్ట‌వ‌చ్చుగాక‌. మ‌న‌సారా ఆద‌రించే జ‌నం, వీరాభిమానులు ఉన్నంత కాలం కుతంత్రాలు, కుట్ర‌ల రాజ‌కీయ నాయ‌కుల దృష్టి ఇలాంటివారి మీద ప‌నిచేయ‌దు. రాజ‌కీయాల్లో కుట్ర‌ల‌వ‌ల్ల‌, రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రేద‌యినా కార‌ణావ‌ల్లా ప‌ద‌వికి దూరం కావ‌చ్చు కాని మ‌న‌సులో మాత్రం ప్ర‌జ‌లే ఉంటారు. ఇది చాలా త‌క్కువ మందికి ఉంటుంది. అలాంటి అరుద‌యిన నాయ‌కులు  నారా చంద్ర‌బాబునాయుడు. అస‌లు నాయ‌కుడికి ప‌ద‌వితో ప‌నిలేద‌న్న‌ది చాలా స్ప‌ష్టం చేసిన ఘ‌నుడాయ‌న‌.  రాష్ట్ర ప‌రిస్థితుల‌తో పాటు ప్ర‌కృతి వైప‌రీత్యాలు మ‌రింతగా ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.  భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల తాకిడికి ఉభ‌య‌గోదార‌వ‌రి జిల్లాలు అల్ల‌క‌ల్లోల‌మ‌య్యాయి. ప్ర‌జ‌లు ఆర్త‌నాదాలు చేస్తున్నారు. త‌మ‌ని ర‌క్షించ‌మ‌ని. ప‌రిస్థితులు ఎలా ఉన్నా వారి గోడు విని అమాంతం త‌న వ‌య‌సునీ  లెక్క‌జేయ‌క రంగంలోకి దిగిన నాయ‌కుడు చంద్ర‌బాబు. ఆయ‌న ప‌రిస్థితుల‌ను లెక్క‌జేయ‌క ముంపుగ్రామాల్లో బాధి తుల స్థితిగ‌తుల‌ను స్వ‌యంగా  తెలుసుకోవ‌డానికి ముంద‌డుగు వేశారు. ఇది  ప్ర‌జ‌లు నిజంగా  ఎంతో హ‌ర్షించద‌గ్గ అంశం.  ముంపు గ్రామాల ప‌ర్య‌ట‌న‌లో ఎంతో అల‌సిపోయారు. 72 ఏళ్ల వ‌య‌సులో త‌న మ‌న‌సులో ప్ర‌జ‌ల‌కు మ‌రిం త మేలు చేయాల‌న్న త‌ప‌నే క‌న‌ప‌రిచారు. ఇది అస‌లు సిస‌లు నాయకుల ల‌క్ష‌ణం. అందుకే బాధితులు వారి మొర చెప్పుకోను ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి ఉత్సాహప‌డ్డారు. అందుకు పెద్ద ఉదాహ‌ర‌ణే భ‌ద్రాచ‌లంలో బాధితులు చంద్ర‌బాబును క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుని ఆయ‌న్నుంచీ ధైర్యాన్ని పొందాల‌ని ఉత్సాహ ప‌డ‌టం. రాత్రి రెండు దాటిన త‌ర్వాత కూడా ఆయ‌న్ను క‌ల‌వాల‌ని వేచి ఉన్నారు. ఆయ‌న అప్ప‌టికే తిరిగి తిరిగి అల‌సిన‌ప్ప‌టికీ త‌న‌కోసం వ‌చ్చిన‌వారికి ధైర్యం చెప్పాల‌ని, బ‌తుకుఆశ‌కు జీవంపోయాల‌న్న త‌ప‌న‌తో వారిని క‌లిశారు. వారికి ఎంతో ధైర్యం చెప్పారు. ప్ర‌భుత్వాన్ని ముక్కుపిండి అంద‌రికీ కావ‌ల‌సిన మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని, ప్ర‌భుత్వం నుంచి రావ‌ల‌సిన ఆర్ధిక మ‌ద్ద‌తు వ‌చ్చేట్టు చూస్తామ‌ని హామీనిచ్చారు.  వారి ముఖాల్లో న‌వ్వు వెల్లివిరిసింది. ధైర్యంగా  అంత‌టి చీక‌టిలోనూ ఇళ్లు చేరారు.  చిత్రం ఏమంటే భ‌ద్రా చ‌లం తెలంగాణా ప్రాంతంలోనిదే. కానీ తెలంగాణా ప్ర‌జ‌లు కూడా ఈ విధంగా  చంద్ర బాబుకి ఆద‌ర‌ణ చూప‌డం మ‌రీ గొప్ప‌విష‌యం. అయితే ఒకప్ప‌టి స‌మైక్యాంధ్రలోనిదే గ‌దా. వారికి  వారి అప్ప‌టి ముఖ్య మంత్రిగానే బాబు ప‌ట్ల వీరాభిమానం ఉంది. దీనికి తోడు వారికి  తెలంగాణా  ప్ర‌భుత్వం నుంచి కూడా  ఇలాంటి ప్రేమ‌, మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌న్న‌ది అర్ధ‌మ‌వుతుంది. ప్ర‌జ‌లు ప్ర‌జ‌ల మ‌నిషినే గుర్తించి ఆద‌రి స్తారు. తెలుగు ప్ర‌జ‌ల‌కు వారికి కావ‌ల‌సిన నాయ‌కుడు తెలుసు. అందులోనూ ఆంధ్రా వారికి ఎప్ప‌టికీ చంద్ర‌బాబే నాయకుడు. ఆయ‌న‌కే నీరాజ‌నాలు ప‌లికారు, ప‌లుకుతారు. 

మంచి దొంగ‌!

దొంగ‌ల్లో దొర‌, దొర‌ల్లో దొంగ లాంటి సినిమాలు చూసే ఉంటారు. వాళ్ల‌కి మించిన కాస్తంత స‌ద్భుద్ధిగ‌ల మంచి దొంగ ఈమ‌ధ్య‌నే మ‌రింత విచిత్రం చేసి తాను అస‌ల్కి దొంగ‌నే కాన‌ని నిరూపించుకున్నాడు. శ్రీ‌కాకుళంజిల్లా బూర్జ‌మండ‌లం కొల్లివ‌ల‌స‌కు చెందిన చ‌క్ర‌ధ‌ర రావు కుటుంబ స‌మేతంగా త‌మ బంధు వుల ఇంటికి వెళ్లి వ‌చ్చే స‌రికి ఇంటి తాళం తీసి, డ‌బ్బులు న‌గ‌ల బీరువా తాళం తీసి క‌నిపించేస‌రికి గుండె ఆగినంత ప‌న‌యింది. ఆయ‌న ప‌రుగున వెళ్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.   మొత్తం బీరువాలోని రూ.11.20 లక్ష‌లు చోరీ అయిన‌ట్టు చ‌క్ర‌ధ‌ర‌రావు గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం తనిఖీలు నిర్వహిం చారు. ఇంత‌లో చాలా సినిమాటిక్‌గా ఆ చోరుడు మ‌న‌సు మార్చుకుని అదే యింటికి వెళ్లి తాను దొంగిలించిన సొమ్ము అణా పైస‌ల‌తో స‌హా మూట‌గ‌ట్టి ఇంట్లోనే పెట్టి వెళిపోయాడు. పైగా త‌న‌ను దొంగ అని అపార్ధం చేసుకోవ‌ద్ద‌ని ఓ లేఖ కూడా రాసి పారి పోయాడు. అది ఆ ఇంటి య‌జ మాని మ‌ర్నాడు చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. పోలీసులు డ‌బ్బును స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్ప‌గించారు.   ఈ విచిత్ర చోరుడు డ‌బ్బుతో పాటు ఓ ఉత్త‌రాన్ని కూడా వ‌దిలి వెళ్లాడు. పోలీసులు, కేసు, జైలు శిక్ష చిప్ప‌కూడు అన్నీ గుర్తుకు వ‌చ్చేస‌రికి మ‌రి చోరుడికి భ‌యంతో ఒళ్లు ఒణికి న‌ట్టుంది. ప‌రుగున అదే ఇంటికి వెళ్లి డ‌బ్బు మూట‌ను పెట్టి వ‌చ్చేశాడు. పోయింద‌నుకున్న సొత్తు మొత్తం దొరికినందుకు ఆ కుటుంబం ఎంతో ఆనందించింది. వ‌చ్చిన‌వాడు మ‌రీ అనుభ‌వ‌జ్ఞుడు గాక పోవ‌డంతో వీరికి ప్ర‌శాంత‌త చేకూరింది. ఎందుకంటే వాడు దోచిన సొమ్మంతా మ‌ళ్లీ పైసాతో సహా దొంగత‌నంగా అదే ఇంటికి వ‌చ్చి దాచిపెట్టాడు. లేఖ సారాంశ‌మేమంటే, అన్నా, వ‌దినా, ఈ దొంగ‌త‌నం చేయ‌డం ఇదే మొద‌టిసారి. క్ష‌మించి న‌న్ను వ‌దిలేయండి, అలాగే కోర్టు, కేసు అంటూ ర‌చ్చ‌చేయ‌వ‌ద్దు. పోలీసులు ప‌ట్టుకుంటే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సి వ‌స్తుంది. క‌నుక వ‌దిలేయండి అంటూ తెగ ప్రాధేయ‌ప‌డ్డాడు.  ఆ లేఖ చూసి ఆ కుటుంబం న‌వ్వుకుంది.. త‌మ అదృష్టానికి.. ఆ వ‌చ్చిన‌వాడు దొంగ‌త‌నం మొద‌టిసారిచేసి త‌న త‌ప్పును తెలుసుకుని డ‌బ్బును తిరిగి ఇచ్చేసినందుకు! మంచిదొంగే...అనుకున్నారంతా!

సంప‌ద త‌గ్గినా ఆసియా ధ‌నికురాలు యాంగ్‌!

కాలం క‌లిసిరాకుంటే ఆస్తులు క‌రిగిపోవ‌చ్చు, షేర్ మార్కెట్లో ఢ‌మాల్ మ‌ని కూల‌వ‌చ్చు. ఎంత కోటీశ్వ‌రు డ‌యినా త‌న షేర్ విలువ‌లు పెరుగుతున్నాయా, లేదా అనే దానిమీదే దృష్టిపెట్టి తెల్ల‌వార్లూ అదే ఆలోచ న‌లో ఉంటాడు. కానీ ఊహించ‌ని ఆర్ధిక ప‌రిణామాలు కూల‌దోసేస్తాయి. యాంగ్ హూయాన్ కు అదే జ‌రి గింది. యాంగ్ ఆసియాలోనే అత్యంత ధ‌నికురాలు. ఊహించ‌నివిధంగా ఆమె సంప‌ద 24 బిలియ‌న్ల నుంచి 11 మిలియ‌న్ల‌కు ఈ ఏడాది ప‌డిపోయింది.  కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ అధిప‌తి అయిన 41 ఏళ్ల యాంగ్ ఎంతో పెద్ద రియ‌ల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తోంది. వాస్త‌వానికి ఆమె సంప‌దంతా తండ్రి యాంగ్ గ్యూకియాంగ్ నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన‌దే. ఆయ‌న‌కు ఫోషాన్ అనే పెద్ద కంపెనీ ఉండేది. కాగా కంట్రీ గార్డెన్ స్టాక్ ఈ ఏడాది స‌గానికి పైగా ప‌డిపోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.  కంట్రీగార్డ‌న్ నిర్వ‌హ‌ణంతా చూసుకుంటున్న యాంగ్ హ్యాయాన్ ఫోషాన్ నగ‌రంలో 2016 జూన్ 16న జ‌రిగిన ప్ర‌ముఖుల స‌ద‌స్సులో పాల్గొన్నారు. సంప‌ద‌లో స‌గం పోగొట్టుకున్న‌ప్ప‌టికీ, యాంగ్ ఆసియాలో కెల్లా అత్యంత ధ‌నికురాలిగా నిల‌వ‌డం విశేషం.  నిక‌ర ఆదాయం విష‌యంలో చైనాలో త‌న‌తో స‌మానం గా ఉన్న ఇత‌ర పారిశ్రామిక‌వేత్త‌ల వ్యాపార‌ల‌తో పోలిస్తే పెద్ద‌గా తేడా లేకండా పోయింది. యాంగ్ సంప‌ద విష యంలో ఫాన్  హోంగ్వీన్ కంటే వంద మిలియ‌న్ డాల‌ర్లే అధికంగా క‌లిగి  ఉంది.  ఫాన్ చైనాలో కెల్లా ప్ర‌ముఖంగా చెప్పుకునే పెట్రోకెమిక‌ల్ ఫైబ‌ర్ ఉత్పాద‌న సంస్థ చైర్మ‌న్‌.  ఇదిలా ఉండ‌గా, ఇటీవ‌లి కాలంలో చైనాలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో సంక్షోభం త‌లెత్త‌డంతో విల్లాలు, గృహాల‌కు ముందుగానే కొంత సొమ్ము చెల్లించిన  దారులు వేలాదిమంది మిగ‌తా సొమ్ము చెల్లించ‌డానికి నిరాక‌రించారు. నిర్మాణంలోనే నిలిచిపోతుండంతో వారు చివ‌రి ఇన్‌స్టాల్మెంట్లుకూడా చెల్లించ‌మ‌ని ఎదురుతిరిగారు. ఇలాంటి స‌మ‌స్య‌నే కంట్రీగార్డెన్ కూడా ఎదుర్కొన్న‌ది. 

తెలంగాణలో బాబుకు బ్రహ్మరథం

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల తరువాత తెలంగాణను అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో జట్టు కట్టి తెలంగాణలో ప్రచారంలో పాల్గొన్నారు. అంతే ఆ తరువాత తెలంగాణలో పార్టీని నడిపే బాధ్యత దాదాపుగా ఆయన ఇక్కడి నాయకత్వానికే వదిలేశారు. సరే తెలంగాణలో పార్టీ ఉనికి నామమాత్రంగా మారిపోయిందని అందరిలానే ఆయనా భావించారు. కానీ జనం మాత్రం తెలుగుదేశం పార్టీని మరిచిపోలేదు. ఇప్పటికీ గుండె నిండుగా ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ అధినేతగా తెలంగాణ జనం హృదయాలలో చంద్రబాబు స్థానం పదిలంగా ఉందని తాజాగా రుజువైంది. 2019 ఎన్నికల సందర్భంగా ఆయన తెలంగాణలో పర్యటించిన ప్రతి చోటా జనం ఆయనకు నిరాజనాలు పలికారు. అదే విధంగా ఇప్పుడు ఇటీవలి వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని పరామర్శించేందుకు ఆయన పోలవరం ముంపు గ్రామాల పర్యటనకు వెళుతూ భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. మహిళలు పూల వర్షం కురిపించారు. దీంతో చంద్రబాబు ఆగి వారితో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు భద్రాచలం జిల్లా పర్యటనకు రావడం ఇదే తొలిసారి. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తరువాత తొలిసారిగా ఆయన భద్రాచలం జిల్లాలో అడుగుపెట్టారు. ఒక రాజకీయ నాయుడు అంత కాలం దూరంగా ఉంటే జనం ఆ నేతను మరచిపోవడం సహజం. కానీ చంద్రబాబును జనం గుర్తు పెట్టుకున్నారు. తమ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా నీరాజనాలు పలికారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరేమో కానీ.. క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉందనడానికి చంద్రబాబుకు లభించిన ఘనస్వాగతమే నిదర్శనమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.