ఇక ... కేంద్రం పై కేసీఆర్ . న్యాయ పోరాటం?
posted on Jul 29, 2022 @ 8:13PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ గత మూడు నాలుగు రోజులుగా దేశ రాజదాని ఢిల్లీలో ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్లారు, ఏమి చేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత ఉన్నట్లు లేదు. చివరకు, టీవీ డిబేట్స్ లో పాల్గొనే తెరాస అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలకు కూడా, ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్ళారో చెప్పలేక పోతున్నారు. నిజంగా వారికి తెలియదో, తెలిసినా చెప్పలేని పరిస్థితో ఉన్నారో తెలియదు కానీ, ‘ది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అన్న పద్దతిలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా తెలంగాణకు మంచి మాత్రమే చేస్తారని అంటున్నారు. అంతే, కానీ ఆ ‘మంచి’ ఏమిటో మాత్రం బయట పెట్టడం లేదు.
మరో వంక అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారానని బట్టి , ముఖ్యమంత్రి కేసీఆర్ బహుముఖ వ్యూహాలతో ఢిల్లీలో అడుగు పెట్టారని తెలుస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటుగా, రాష్ట్రం ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విధించిన రుణ పరిమితికి సంబందించి సీరియస్ స్టెప్స్ తీసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్డం అవుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అవసరం అయితే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును వెళ్లేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారనీ అంటున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి, ఇప్పటికే సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, విద్యుత్తు శాఖ కార్యదర్శి సునీల్ శర్మతో పాటు పలువురు అధికారులు, న్యాయనిపుణులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించడం కాకుండా, ముందు కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా లేఖ రాయాలని, అందుకు సరైన జవాబు రాకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు, న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం. ఇదే విషయంగా ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచే చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
ఈ కసరత్తులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2022 మార్చి 31న రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి రాసిన పది పేజీల లేఖపై అధికారులు చర్చలు జరిపారని సమాచారం. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాల జీఎస్డీపీలో 3.5 మేరకు నికర రుణ పరిమితిని విధించామని కేంద్రం ఆ లేఖలో పేర్కొందని, నిజానికి ఆర్థిక సంఘం అదే సమయంలో ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పూర్తిగా సవరించాలని సూచించిందన్నారు. కేంద్రం మాత్రం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ నికర రుణ పరిమితిని పాటించకుండా రాష్ట్రాలపై ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక విద్యుత్తు రంగం పని తీరును బట్టి అదనపు రుణ పరిమితిని జీఎస్డీపీలో మరో 0.5% పెంచుతామని కేంద్రం లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమని, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా పరిమితులు విధించడం చెల్లదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కార్పొరేషన్లు, ఇతర సంస్థలు చేసే రుణాలపై కేంద్రం ఎలా ఆంక్షలు విధిస్తుందని ? వాటికి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోనవసరం లేదనీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రం కేంద్రం నుంచి, మార్కెట్ నుంచి చేసే అప్పులకు మాత్రమే రుణ పరిమితిని వర్తింపజేయాలని.. కార్పొరేషన్లు చేసే అప్పులనూ రాష్ట్ర రుణాలుగా పరిగణించే అధికారం కేంద్రానికి లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేందుకే అయితే ఢిల్లీ వెళ్ళడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఢిల్లీ నుంచి సమాలోచనలు జరపడం ఎందుకు? అదీ కాక, ఈ సమాలోచనలో చర్చించినట్లు చెపుతున్న అన్ని అంశాలపైన, రాష్ట్రంలో చాలా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది.
ఈ అన్ని విషయాలపైనా ముఖ్యమంత్రికి పూర్తి స్పష్టత వుంది. విలేకరుల సమావేశాల్లో, ఇతరత్రా ఆయన ఈ విషయాలను ఒకటికి పదిసార్లు ప్రస్తవించారు. నిజానికి కేంద్రానికి లేఖ రాసే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గతంలోనే చూచాయగా చెప్పారు.అదలా ఉంటే, ఇటీవల సుప్రీం కోర్టు ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెపుతూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను నియంత్రించ వలసిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. సో.. అప్పులు చేస్తాం అనుమతివ్వండి .. అంటే సుప్రీం కోర్టు అయినా అంగీకరిస్తుందా .. అనుమానమే అంటున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రకు, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలనే ఆలోచనకు లింక్ కుదరడం లేదని అంటున్నారు. అందుకే, ముఖ్యంత్రి ఢిల్లీ ఎందు కెళ్ళారు ... అనేది జవాబు లేని ప్రశ్నగానే మిగిలి పోయిందని, అంటున్నారు.