44వ చెస్ ఒలింపియాడ్ శుభారంభం.. భార‌త్‌కే విజ‌యావ‌కాశాలు

చ‌ద‌రంగం అన‌గానే దానికి పుట్టిల్లుగా మారిన చెన్నై అంద‌రికి గుర్తుకు వ‌స్తుంద‌ని, ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గ్రాండ్ మాస్ట‌ర్ల‌కు ఈ ప్రాంతం నిల‌యంగా మారింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ  గురువారం 44వ ప్ర‌పంచ చెస్ ఒలింపి యాడ్‌ను ఆరంభించి ప్ర‌సంగించారు.  చెస్ ఒలింపియాడ్ టీమ్ స్పిరిట్‌ను చాటే క్రీడోత్స‌వ‌మ‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈ కార్య క్ర‌మానికి ప్ర‌ధాని త‌మి ళునిలా పంచ‌క‌ట్టు, భుజాన కండువాతో రావ‌డం అంద‌రినీ ఎంతో ఆక‌ట్టుకుంది.  ఈ కార్య‌క్ర‌ మంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎం.కే. స్టాలిన్ త‌ద‌త‌రులు హాజ‌ర‌య్యారు. ఈ చెస్ ఒలింపియాడ్  ఆగ‌స్టు ప‌దో తేదీ వ‌ర‌కూ జ‌రుగుతాయి. భారత్ స్టార్లు అద్భుతంగా ఆడి త‌ప్ప‌కుండా ప‌త‌కాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నా య‌ని చెస్ విశ్లేష‌కులు అంటున్నారు.  కాగా, ప్ర‌పంచ‌స్థాయి చెస్ ఒలింపియాడ్‌కు భార‌త్ ఆతిథ్య‌మీయ‌డం ఇదే తొలిసారి. అంత‌ర్జాతీయ చెస్ ఫెడ‌రేష‌న్ ర‌ష్యాపై వేటు వేయ డంలో ఈ ఆతిథ్య అవ‌కాశం భార‌త్‌కు ద‌క్కింది. మొత్తం 190 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు భార‌త బృందానికి చెస్ దిగ్గ‌జం గ్రాండ్ మాస్ట‌ర్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్  ప్లేయ‌ర్‌గా కాకుండా మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.  శుక్రవారం పోటీలు ఆరంభమ‌వుతాయి. ఈ పోటీల్లో  భారత్‌ రికార్డుస్థాయిలో ఆరు జట్లను బరిలోకి దించుతోంది. ఓపెన్‌ కేటగిరీలో మూడు, మహిళల విభాగంలో మూడు టీమ్‌లు . కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మెగా ఈవెంట్‌ ఓపెన్‌ కేటగిరీలో 188 జట్లు, మహిళల విభాగంలో 162 టీమ్‌లు పోటీపడనున్నాయి. ఓపెన్‌ కేటగిరీలో ఆడనున్న 15 మంది భారత ప్లేయర్లూ గ్రాండ్‌ మాస్టర్లే కావడం గ‌మ‌నార్హం.ఓపెన్‌లో ఫేవరెట్‌గా పరిగణిస్తున్న గ్రాండ్‌ మాస్టర్లు హరికృష్ణ, అర్జున్‌ ఇరిగేసి, విదిత్‌ గుజరాతి, ఎస్‌ఎల్‌ నారాయణ్‌, శశికరణ్‌ కృష్ణన్‌తో కూడిన భారత్‌-ఎ జట్టుకు రెండో సీడ్‌ దక్కింది. చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద ఉన్న భారత్‌-బి టీమ్‌కు 11వ సీడ్‌, భారత్‌-సి టీమ్‌కు 17వ సీడ్‌ లభించాయి.మహిళల కేటగిరీలో గ్రాండ్‌ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్‌-ఎ జట్టు టాప్‌ సీడ్‌ దక్కించుకోగా.. భారత్‌-బి, భారత్‌-సి టీమ్‌లకు 11వ, 16వ సీడ్‌లు లభించాయి. ఇదిలా ఉండ‌గా, చెస్ ఒలింపియాడ్‌ను కూడా రాజకీయ వ‌క్ర‌బుద్ధి చూపిన‌ పాకిస్థాన్‌ పై భారత్ తీవ్రంగా ఆగ్రహించింది. ఈ ఒలింపి యాడ్ నుంచి పాకిస్థాన్ తప్పుకోవడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌ను కూడా రాజ కీయం చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. చెస్ ఒలింపియాడ్ నుంచి తప్పుకుంటున్నట్టు పాకిస్థాన్ అకస్మా త్తుగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. పాకి స్థాన్ జట్టు భారత్ చేరుకున్న తర్వాత కూడా పాకిస్థాన్ ఇలాంటి ప్రకటన చేయడం అత్యంత దురదృష్ట కరమని అన్నారు. ఒలింపి యాడ్ టార్చ్ రిలే జమ్మూకశ్మీర్ మీదుగా వెళ్తుండడాన్ని సాకుగా చూపి ఈవెంట్ నుంచి పాకిస్థాన్ తప్పుకున్నట్టు ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్‌లు భారత్‌లో అంతర్గత భాగమని, అవి అలానే ఉంటాయని బాగ్చి తేల్చి చెప్పారు. 

కేఆర్ఆర్ స్టోరీలో కొత్త ట్విస్ట్ ... తెర మీదకు దిగ్విజయ్ సింగ్

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే  కోమటి రెడీ రాజగోపాల రెడ్డి ఇంకా బీజేపీలో చేరలేదు, కానీ, చేరినట్లే అనుకోవచ్చనే స్పష్టమైన సంకేతాలు అయితే ఇచ్చారు. అంతే కాదు, ఎందుకు తాను పార్టీ మారాలని అనుకుంటున్నది కూడా అంతే స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనను ఎదిరింఛి ఓడించే శక్తి సామర్ధ్యాలు ఒక్క బీజేపీకి  మాత్రమే  ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పట్ల గౌరవం ఉన్నా, ప్రస్తుత కేసేఆర్ ను ఎదుర్కునే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో  చేరడం, ‘చారిత్రిక అవసరం’ గా పేర్కొన్నారు. మరోవంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరుతున్నారని, మీడియా సాక్షిగా ధృవీకరించారు. ఇక ముహూర్తం ఖరారు కావడమే మిగిలుందని, అంటున్నారు.  అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా రాజగోపాల రెడ్డిపై ఆశలు వదులుకోలేదని తెలుస్తోంది. రాజగోపాల రెడ్డి గత రెండు సంవత్సరాలుగా ఇదే చెపుతున్నా, పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు ఇప్పడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ వంటి నేతలు సమావేశమై రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపైనే ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేక షోకాజ్ నోటీసు ఇవ్వడమో చేస్తారని వార్తలు వచ్చాయి. ముఖ్య్మగా రేవంత్ రెడ్డి అలాంటి సంకేతాలు ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పెద్దలు తొందర వద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే రాజగోపాల్ రెడ్డి పార్టీలో కొనసాగుతారని తమకు నమ్మకం ఉందని మాణిక్యం ఠాగూర్ విశ్వాసం వ్యక్త పరిచారు.  నిజానికి, అంతకు ముందే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క వ్యక్తిగతంగా రాజగోపాల రెడ్డిని కలిసి, పార్టీ వీడద్దని కోరారు.అయినా, తన నిర్ణయంలో మార్పు లేదని  రాజగోపాల రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో, కేసీఆర్ ను ఓడించాలనే కసి కనిపించడం లేదని, అందుకే, కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈటల రాజేందర్, కాంగ్రెస్ లో కాకుండా, ఆ కసి, శక్తి సామర్ధ్యాలు ఉన్న బీజీపీలో చేరారని చెప్పు కొచ్చారు. అంటే తనది కూడా అదే బాటని రాజగోపాల రెడ్డి చెప్పు కొచ్చారు.   ఆదలా ఉంటే కాంగ్రస్ నాయకత్వం చివరి ప్రయత్నంగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర  ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి  దించినట్లు తెలుస్తోది. దిగ్విజయ్ సింగ్‌తో కోమటిరెడ్డి సోదరులకు గతంలో మంచి సంబంధాలున్నాయని , అందుకే ఆయన్ని రంగంలోకి దించారని అంటున్నారు. త్వరలోనే ఆయన రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరపబోతున్నారని సమాచారం.  శుక్రవారం( జులై 29)ఢిల్లీలో  రాజగోపాల రెడ్డి, దిగ్విజయ్ సింగ్ తో సమావేశం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే, రాజగోపాల రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని, అయితే, దిగ్విజయ్ సింగ్ తో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన్ని కలిసి, తాను కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాలని అనుకుంటున్నది,వివరంగా చెప్పేందుకు ఢిల్లీ వెళుతున్నారని కోమటి రెడ్డి క్యాంపు సమాచారం.

ఒక్క ఐడియా.. గొప్ప ఫ‌లితం!

కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల్లో యువ‌త భ‌విష్య‌త్తును గంద‌ర‌గోళానికి నెట్టేసింది. కాస్తంత చ‌దువు కుని ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యువ‌త భ‌విష్య‌త్తును అగ‌మ్య‌గోచ‌రం చేసింది. ఒక్క‌సారిగా ఉద్యోగం, వృత్తి దూర‌మ‌య్యే స‌రికి తిరిగి కాస్తంత మంచి ఉద్యోగం కోసం వెతుకులాడ‌టంలో ఎంద‌రో విసిగె త్తారు, జీవితం మీద విర‌క్తీ వ‌చ్చేసింది. కానీ బ‌హు త‌క్కువ‌మంది త‌మ భ‌విష్య‌త్ మార్గాన్ని మ‌లుపు తిప్పు కోగ‌లిగారు. వారిలో ఆకాష్ హ‌స్కే, ఆదిత్య కీర్త‌నే ఉన్నారు.  మ‌హారాష్ట్ర ఔరంగాబాద్‌కి చెందిన ఈ బాల్య‌స్నేహితులు ఇద్ద‌రూ ఇంజ‌నీరింగ్ చ‌దివి ఒక సంస్థ‌కు  ప‌ని చేస్తుండేవారు. కానీ కోవిడ్‌తో ఆ కంపెనీ చాలామందికి విశ్రాంతినిచ్చింది. వారిలో ఈ స్నేహితులూ ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఉద్యోగ‌స్తులు  సాధార‌ణంగా మ‌ల్లీ ఉద్యోగాల వేట‌లో ప‌డ‌తారు. కానీ వీరిద్ద‌రూ ఎటు వెళ్లాలో తేల్చుకోలేక‌పోయారు. స‌రిగ్గా ఆ స‌మ‌యంలో  మాంసం, పౌల్ట్రీ ప్రాసెసింగ్‌లో అక్క‌డి వ‌ర్సిటీ ఇస్తున్న వృత్తికోర్సులో చేరారు. అది త‌ప్ప‌కుండా వారికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని న‌మ్మా రు. కొద్దికాలం శిక్షణ అనంత‌రం స్వంత‌గా వ్యాపారం ఆరంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.  అంతే వెంట‌నే త‌మ ప్రాంతంలోనే వందగ‌జాల స్థ‌లంలో 25 వేల రూపాయ‌ల‌తో చిన్న‌స్థాయిలో వ్యాపా రం ఆరంభించారు. వారి కంపెనీకి చిత్రంగా అపిటైట్ అనే పేరు పెట్టారు.  చిత్రంగా దిన‌దినా భివృద్ధి చెందింది. ఇపుడు నెల‌కు నాలుగు ల‌క్ష‌లు ట‌ర్నోవ‌ర్ తో న‌డుస్తోంది. నిజానికి ఔరంగాబ‌ద్‌లో మాంసం అమ్మ‌కాలు అన్న‌ది పూర్తిగా అసంఘ‌టిత విభాగమ‌ని వీరి ప్ర‌ధాన వాటాదారుడు ఫాబీ సంస్థ డైరెక్ట‌ర్ ఫాహ‌ద్ అన్నారు. ఆయ‌న వీరితో ప‌దికోట్ల రూపాయల మేర వాణిజ్యం ఒప్పందంకూడా చేసుకు న్నార‌ట‌. ఇపుడు ఔరంగా బాద్ మాత్ర‌మేకాకుండా చిన్న‌పాటి ప‌ట్ట‌ణాలకీ వీరి వ్యాపారం విస్తరించింది. 

దోస్తుల్లో దడదడ

చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఈ రెండు పేర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్,తెలంగాణా లో  పలువురు నాయకులూ,సెలబ్రటిలు గుండెల్లో రైళ్ళు పెరుగేతిస్తున్నాయి.ఇంతకాలం రహస్యం గా సాగిన వారి చీకటి వ్యాపారం ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) దెబ్బతో బట్టబయలైపోయింది. కేసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాలతోపాటు.. మరో ఆరు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రవీణ్.. ల్యాప్‌టాప్‌, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం విచారణకు హాజరుకావాలంటూ ప్రవీణ్‌ను ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కేసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌‌పై ఈడీ దాడులు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  గుడివాడలో ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన కేసినోపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి విదితమే. గుడివాడలో కేసినో నిర్వహణ వెనుక నాటి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని హస్తం ఉందంటూ నాడు విమర్శలు వెల్లువెత్తిన సంగతి విదితమే.    టీడీపీ నేతలు అయితే వరుస ప్రెస్ మీట్లతో కేసీనో వ్యవహారంపై   విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో కేసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌తో కృష్ణాజిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు లింకులు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందుంచారు. కానీ టీడీపీ నేతల ఆరోపణలను జగన్ ప్రభుత్వం లైట్‌గా  తీసుకుంది.  దీంతో టీడీపీ నేతలకు  గుడివాడలో   కేసినో వ్యవహారంపై ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారమంతా కామ్ అయిపోయింది.    కానీ తాజాగా ఈడీ సోదాలతో కేసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మళ్లీ కేసినో తుట్టె మళ్లీ కదిలింది.  మరోవైపు చికోటి ప్రవీణ్.. నిర్వహిస్తున్న ఈ భాగోతం వెనుక బడా బడా నేతలే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనిపై సోమవారం ఈడీ విచారణలో ప్రవీణ్ పెదవి విప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక చికోటి ప్రవీణ్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇండో నేపాల్ సరిహద్దుల్లో నిర్వహించిన కేసినోకి వెళ్లిన కస్టమర్ల జాబితాలో  16 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని చెబుతున్నారు.   ఇక తెలంగాణలో కేసీఆర్ కేబినెట్‌లో కీలక మంత్రికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ను.. చికోటి ప్రవీణ్ స్నేహితుడు  మాధవరెడ్డి కారుకు తగలించుకొని.. తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలిగా తిరిగేస్తున్నాడట. ఈ విషయంపై సదరు మంత్రి ని మీడియా ప్రశ్నించగా... ఆ కారు స్టిక్కర్ తనదేనంటూ అంగీకరించారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే ఆ స్టిక్కర్‌ను తొలగించానని.. దానిని ఎవరు తీసుకుని వాడుతున్నారో.. తనకు తెలియదని ముక్తాయించారు. మరోవైపు ప్రవీణ్‌, మాధవ్ రెడ్డిపై ఈడీ కన్ను పడడంతో.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీల్లో దడ మొదలైనట్లు సమాచారం. గుడివాడలో కేసినో నిర్వహణకు ముందు గన్నవరం ఎమ్మెల్యే వంశీ తన స్నేహితుడు, మంత్రి అంటూ కొడాలి నానిని చికోటి ప్రవీణ్‌కు పరిచయం చేశారనే ఓ టాక్ కూడా అప్పట్లో  కృష్ణా జిల్లాలో బలంగా వినిపించిందట. అంతేకాదు.. గుడివాడలో కేసినో నిర్వహణకు ముందే గన్నవరంలో కూడా కేసినో నిర్వహించారని.. కానీ నాడు ఇది అంతా ఫేమస్ కాకుండా.. గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిందని సమాచారం. అది  కూడా చికోటి ప్రవీణ్ డైరెక్షన్‌లో జరిగిందని తెలుస్తోంది. ఏదీ ఏమైనా..  చికోటి ప్రవీణ్‌ని విచారించిన ఈడీ అధికారులు త్వరలో ఈ దోస్తులను కూడా విచారించే అవకాశం ఉందనే టాక్ అయితే ఉమ్మడి కృష్ణాజిల్లాలో జోరుగా సాగుతోంది.

పాల్‌గారూ.. మీ సాయం ఎందుకు జాప్యం?

పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు, తెలిసిన‌వే చెప్పేవాడు గురువు, తెలియ‌పోయినా  చెప్ప గ‌లిగిన వాడు ఒక్క‌డే.. పేరు కే.ఏ. పాల్‌!  అవును స‌రిగ్గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి  గ్రామీణు లకు తెలిసిన  కార‌ణ‌మే  కాల‌జ్ఞాని  ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు  కే.ఏ.పాలు కూడా చెప్పారు.  కాకినాడలో జిల్లా పార్టీ నాయకుల సమావేశం సందర్భంగా  ఆయన విలేకరులతో మాట్లాడారు. 13 జిల్లాల ను 26 చేసి అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్‌ ఇప్పుడు వరద బాధితులను ఆదుకు నేందుకు తక్షణ సాయాలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌ క్షులు వ‌ర‌ద బాధితుల కు త‌మ వంతు సాయం గురించి మాత్రం ఒక్క మాటా మాట్లాడ‌లేదు. కేవ‌లం ఉపోద్ఘాతాలు, శాంతి ప్ర‌వ‌చనాల‌తో కాకుండా నిజంగా బాధితుల‌కు అత్య‌వ‌స‌ర  స‌మ‌యంలో స‌హాయ‌ ప‌డాలి. అది కాద‌ని మామూలు ఓట‌రులాగా ప్ర‌భుత్వాన్ని, అధికారుల‌ను తిట్ట‌డంలో కాల‌యాప‌న చేశారు.  సెప్టెంబరు 25 లోపు తెలంగాణ, ఆంధ్రలో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం సాయం ప్రక టించాలని, లేకుంటే తానే ఆర్థిక సహాయం ప్రకటిస్తానని.. అందుకు కేంద్రప్రభుత్వం నిలిపివేసిన తన పాస్ పోర్టు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉభయరాష్ట్రాల రాజధానిగా హైదరాబాదే ఉండాలని, హైదరాబాద్‌ నుంచి ఆంధ్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కానీ ప్ర‌పంచ నాయ‌కుల‌తో గ‌ట్టి ప‌రిచ‌యాలు, కొంత సాన్నిహిత్య‌మూ ఉన్న పాల్ ఇప్పుడీ ప‌రిస్థి తుల్లో ఎలాం టి విదేశీ నాయ‌కుల‌నూ సంప్ర‌దించ‌డం లేదు. మ‌రి  దేశం క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉండ‌గా  పాల్ వంటి  విశాల హృద‌యు లు అలా సినిమా చూస్తున్న‌ట్టు కూర్చుంటే ప్ర‌జ‌లు  ఏమ‌యిపోవాలనే  అభిప్రా యాలూ  ఉన్నాయి.  కాగా, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై పాల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకో వాలంటూ ఆ పార్టీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్‌కుమార్‌తో కలిసి నాయకులు నిరసన తెలిపారు. 

నిమ్మ‌ల  స‌మ‌య‌స్ఫూర్తి

న‌దులు ఉప్పొంగి వ‌ర‌ద‌లు ఊళ్ల‌ను ముంచెత్తే స‌మ‌యంలో ఇల్లూ, గోతం పిల్ల‌ల ర‌క్ష‌ణ గురించే ఆలో చ‌న ఉంటుంది. వ‌స్తువులు, వాహ‌నాలు కొట్టుకుపోతుంటాయి. ఇప్ప‌టి తాజా వ‌ర‌ద‌ల్లోనూ దాదాపు అదే ప‌రిస్థితి. అంద‌రికీ అవి పోతున్నాయి, ఇల్లంతా కూలి డ‌బ్బు, వ‌స్తువులు పాడ‌యిపోయాయి అనే గోడు ఎక్కువ‌. కానీ చాలా కొద్దిమందికే అయ్యో ప‌శువులు ప్రాణాలు కోల్పోతున్నాయ‌న్న ఆలోచ‌న ఉం టుంది. వాటిని ర‌క్షించాలన్న ఆతృతా ఉంటుంది. అదుగో అలాంటి మ‌నిషే ఎమ్మెల్యే నిమ్మ‌ల రామా నాయుడు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జోరువాన‌, వ‌ర‌ద‌ల ప్ర‌భావంతో ప్ర‌జ‌లు బికుబికుమంటుంటే వారిని ఆదుకోవ డానికి గొడుగు ప‌ట్టి అడుగు ముందుకువేశారు పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల‌. అంతేకాదు వ‌ర‌దతాకిడి ప్రాం తాల్లో ప‌శువుల‌కు ఆహారం ఎలా అని ఆలోచించారు. ఆయా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగితే వాటి సంగ తే మిట‌న్న ఆలోచ‌న చేశారు.  ఆయ‌న వ‌ర‌ద‌లో మునిగిన గ్రామాల్లోని  ప‌శువుల‌కు ప‌శుగ్రాసం  అందజేశా రు.  త‌న పిలుపు మేర‌కు ఉండి మండలం కలిగొట్ల గ్రామం నుండి రెండు ట్రక్కులతో 200 పచ్చగడ్డి మోపుల ను అక్క‌డి రైతులు తీసుకొచ్చారు. ఈ గ‌డ్డి మోపుల‌ను చూసిన పాడి రైతుల క‌ళ్ల‌ల్లో చాలా ఆనందం క‌నిపిం చిందంటూ నిమ్మ‌ల తెలిపారు. ప‌శుగ్రాసం పంపిణీకి సంబంధించిన వీడియోను ఆయ‌న సోష‌ల్ మీడియా లో పంచుకున్నారు. వ‌ర‌ద తాకిడితో ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డం, వారిని ఆదుకోవ‌డానికి రాజ‌కీయాలు, పార్టీల‌తో సంబంధం లేకుండా ముందుకు వ‌చ్చి తోచిన‌, చేయ‌ద‌గ్గ స‌హాయం చేయ‌డ‌మే నాయ‌కుని ల‌క్ష‌ణం. ఈ స‌మ‌యంలో ఆదుకోన‌పుడు ప్ర‌భుత్వాలు, నాయ‌కులు ఉండి ప్ర‌యోజ‌న‌మేమిటి. కాకున్నా, మాన‌వతాదృక్పథంతో తోటి వారికి అలాంటి స‌మ‌యాల్లో చేయూత‌నీయాలి. ఎమ్మ‌ల్యే నిమ్మ‌ల ఒక్కంత ముందు ఆలోచించి మూగ జీవాల సంర‌క్షణ విష‌యం ప‌ట్టించుకోవ‌డం హ‌ర్ష‌ణీయ‌మే. 

సుధాక‌రా.. స్వామిభ‌క్తి నీకు బ‌హు మెండు!

చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించ‌డంలో బీజేపీ వారిని మించిన‌వారు వేరొక‌రు ఉండ‌రు.  ప్ర‌తీ రాష్ట్రం, ప్ర‌తీ ప్రాంతం లోనూ కాషాయం బాగా మెర‌వాలి, పువ్వు జండా ఆకాశం ఎత్తున క‌న‌ప‌డాలి, మోదీ  వీరాంజ‌నేయుడిలా పోస్ట‌ర్ల మీద క‌నిపించాలి. ఇవేవీ జ‌ర‌గ‌క‌పోతే క‌మ‌ల‌నాధుల‌కు ఆగ్ర‌హం వ‌స్తుంది. గుజ‌రాత్ కాదు  ప్ర‌తీ రాష్ట్రంలోనూ ఆ సూత్రాలు ఖ‌చ్చితంగా పాటించి తీరాలి. గాంధీగారి బొమ్మ లేక‌పోయినా ఫ‌ర‌వా  ఇల్లే.. ప‌ల్చటి తెల్ల‌టి గ‌డ్డంతో మోదీగారి చిర్న‌వ్వు చిత్రం ప్ర‌తీచోటా ఉంటే దేశం సుభిక్షంగా ఉన్న‌ట్టు లెక్క‌.  ఇది బీజేపీ వ‌ర్గాలు కంఠ‌స్త పాఠం, అమ‌లు చేయాల్సిన ధ‌ర్మ‌ప‌థం. ఇదే పొంగులేటి సుధాక‌రూ చెబు తున్నా రు.  మ‌హాబ‌లిపురంలో జ‌రుగనున్న అంత‌ర్జాతీయ చెస్ పోటీలు భార‌త ప్ర‌ధాని మోదీ ఆరంభించ‌నున్నారు. అందుకు అస‌లా ప్రాంత‌మంతా క‌టౌట్లు, పోస్ట‌ర్లూ స‌ర్వం మోదీ మ‌యం అయి ఉండాల‌న్న‌ది బీజేపీ వీరాభిమానుల అభీష్టం. కానీ ఎక్క‌డా ఇంత‌వ‌ర‌కూ పెద్దాయ‌న ఫోటో కూడా ఏర్పాటు చేయాలేద‌ని బీజేపీ నేత పొంగులేటి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మీద ఒంటికాలిమీద లేస్తున్నారు. ఇది త‌ప్ప‌కుండా ప్రొటోకాల్ సంబంధించిన అంశం. ఏ రాష్ట్ర‌మైనా ప్ర‌ధానిని గౌర‌వించి తీరాలి. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ సంగ‌తి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పొంగులేటి తెగ బాధ‌ప‌డిపోతున్నారు. ఫోటోలు, క‌టౌట్ల‌తోనే  ప్రోటోకాల్ పాటిం చ‌డం అవుతుందా అని త‌మిళులూ ప్ర‌శ్నిస్తే పొంగులేటి ఏం స‌మాధానం చెబుతారు.   ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ పేర్కొ న్న విధంగా ఆగస్టు 9వ నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.  జాతీయ ప‌తాకం, దేశ‌భ‌క్తి ప్ర‌త్యేకించి బీజేపీవారి తీరులో ప్ర‌ద‌ర్శించాల‌న్న నియ‌మ‌నిబంధ‌న వారి  దేశ‌భ‌క్తి కంటే బీజేపీ పాల‌నా సామ‌ర్ధ్యాన్ని, ఇత‌ర రాష్ట్రాలు, విప‌క్షాల మీద దబాయింపుల‌ను తెలియ‌జేస్తుంద‌నే విమ ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు ఏం చేయా ల‌న్న‌దీ కేంద్ర‌మే నిర్ణ‌యిస్తే రేపో మాపో ఏం తినాలో కూడా దేశ‌భ‌క్తి పూరిత సూత్రాన్ని సెలవిస్తారేమో చూడాలి.  

ఆజాద్ ను పొగిడింది అందుకేనా ?

ప్రధాని నరేంద్ర మోడీని ఎవరైనా, ఎందుకైనా ద్వేషించ వచ్చును, దూషించావచ్చును. కానీ, ఆయన రాజకీయ చతురతను చులకన చేయడం మాత్రం కుదిరే వ్యవహారం కాదు. భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే, అది అంత శ్రేయస్కరం కూడా కాదు. గత ఎనిమిది  సంవత్సరాలలో మోడీ రాజకీయ చతురత అనేక మార్లు రుజువైందని వేరే చెప్పనక్కరలేదు.  అసలు ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకుండా, 20 ఏళ్లకు పైగా రాజకీయ చదరంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం సాధారణ విషయం కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలో, ఒకటనేమిటి రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ ఆయన అవపోసన పట్టారు.  కాబట్టే, ఆయన జాతీయ రాజకీయాల్లో ఆ స్థాయికి చేరుకున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.   ఒక సంవత్సరం క్రితం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీలో చాలా కాలం ట్రబుల్ షూటర్ గా చక్రం తిప్పిన గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగిసిన  సమయంలో, పెద్దల సభ ఆయనకు వీడ్కోలు పలికింది. ఆ సందర్భంగా మోడీ చేసిన భావోద్వేగ ప్రసంగం విన్న ఎవరైనా, మోడీ, ఆయనకు ఏదో కీలక పదవి ఇస్తారని అనుకున్నారు. గులాం నబీ ఆజాద్ ను మోడీ ఎంతగానో మెచ్చుకున్నారు. ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌నంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని, విప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ హుందాగా మాట్లాడ‌తార‌ని, ఎప్పుడూ అసభ్య పదజాలం ఉపయోగించర‌ని కొనియాడారు. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని కూడా చెప్పు కొచ్చారు. చివరకు, భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు కూడా  పెట్టుకున్నారు. ఆజాద్ పట్ల అంట గౌరవం ఉన్నమోడీ ఆయన సేవలను తప్పక వినియోగించుకుంటారనే అంతా  అనుకున్నారు.  అప్పటికే గులాం నబీ ఆజాద్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు (జీ23) కాంగ్రెస్ అధిష్టానంపై తిరుబాటు జెండా ఎగరేశారు. సో ..ఆజాద్  బీజేపీకి దగ్గరవుతారనే ఉహగానాలు కూడా వినిపించాయి. ఇక అక్కడి నుంచి, గులాం నబీ ఆజాద్ పేరు రాష్ట్ర పతి, ఉప రాష్ట్రపతి అశావహుల మీడియా ఉహల జాబితాలో చేరిపోయింది. నిజంగా ఆజాద్  ఆ పదవులను ఆశించారో లేదో తెలియదు. అలాగే, మోడీ అయినా అలాంటి ఆలోచన చేశారో  తెలియదుకానీ  మీడియాలో అయితే పుంఖాను, పుంఖాలుగా కథనాలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత మోడీ ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకు రాలేదు మోడీ నిజానికి మోడీ ఆశించింది అదే, అదే అయన చతురత. నాలుగు మంచి మాటలు,కాసిన్ని కన్నీళ్ళతో ఒక సమర్ధుడైన, నాయకుడిని ముఖ్యంగా, ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరమైన నాయకుడిని,  కాంగ్రెస్ కు మరింత దూరం చేయగలిగారు.  అదే మోడీ చతురత అని అంటున్నారు. అయితే, ఎంత మోడీ అయినా, ఆయనకు జంటగా ఉన్న అమిత్ షా అయినా, అన్ని సందర్భాలలో అందరినీ ‘మోళీ’చేయడం కుదరదని కూడా అంటున్నారు.

కేంద్రానికి  తెలుగు ప్రేమ‌!

కేంద్రానికి తెలుగు రాష్ట్రాల ప‌ట్ల ప్రేమ ఎక్కువ‌యింది.  రాజ‌కీయ ప్రేమ మాత్రం మ‌రీ ఇబ్బందిక‌రం అని మోదీ స‌ర్కారే తెలియ‌జేస్తోంది.  గ‌తంలో  ఒక మాట ఇప్పుడు  మ‌రో మాట తోచిన విధంగా ఉప‌ న్యాసాలు, ఉపోద్ఘాతాలు.. ఇవి  చాల‌క  మీదే అస‌మ‌ర్ధ పాల‌న అంటూ  ప్ర‌చారం చేయించ‌డం. మోదీ స‌ర్కార్‌కి ఇలాంటి  చాతుర్యం  పుట్టుక‌తో వ‌చ్చిన  గొప్ప విద్య‌.  అందుకే టీడీపీ నేత‌, మాజీ మంత్రి  సోమిరెడ్డికి కోపం వ‌చ్చింది.  చ‌ట్టం అన్న‌ది  దేశ‌మంత‌టికీ  ఒకే విధంగా  అమ‌లు కావాలి. కానీ మోదీ స‌ర్కార్  ఒక్కో  రాష్ట్రానికి   ఒక్కో చ‌ట్టం అమ‌లు చేస్తారా అని  టీడీపీ నేత ట్విట‌ర్ ద్వారా ప్ర‌శ్నించారు.  తెలుగు రాష్ట్రాల్లో  అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన  2031 వరకు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా  ఉంద న్నారు.  విభజనచట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలన్నారు. కాశ్మీ‌ర్‌ లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరంలేని చట్టసవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా?  అని ప్రశ్నించారు.  ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి  సరికాదన్నారు.  విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే  నెరవేర్చాలని సోమిరెడ్డి  డిమాండ్ చేశారు.

స్మగ్లర్ల అతి తెలివి.. అమాయకులను ఇరికించేస్తోంది!

స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. నిఘా నేత్రాల కన్ను కప్పి మరీ తమస్మగ్లింగ్ కొనసాగించేందుకు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. వ్యూహాలు పన్నుతున్నారు. దొరికిపోయినా తాము మాత్రం పట్టుబడకుండా అమాయకులను దీనిలో ఇరికిస్తున్నారు. ఇటువంటి ఘటనే  జైపూర్ విమానాశ్రయంలో వెలుగు చూసింది.   దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా యథేచ్ఛగా  గోల్డ్ రవాణా ఎదేచ్చగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు కేజీ బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 52.10 లక్షలు ఉండొచ్చునని అంటున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు దుబాయ్ నుంచి జైపూర్ వచ్చిన స్పైస్ జెట్ విమానంలో  కస్టమ్స్ అధికారులు   తనిఖీలు చేశారు. ఆ తనిఖీలో  ఓ సీట్ కింద అనుమానాస్పద బ్యాగ్‌లో కేజీ బంగారం బిస్కెట్ కనిపించింది. సీటు నెంబర్ ఆధారంగా ప్రయాణీకుడిని గుర్తించిన పోలీసులు అతడిని   విచారించారు.  అతడి సమాధానం విని కస్టమ్స్ అధికారులే కంగుతిన్నారు. అసలు విషయమేమిటంటే  ఆ ప్రయాణీకుడు దుబాయ్ లో విమానం ఎక్కడానికి ముందు ఒక అగంతకుడు అతడిని కలిశాడు. ఓ పార్శిల్ ఇచ్చి సీటు కింద పెట్టుకోమని కోరాడు. ఆ పని చేసి పెట్టమంటూ పది వేల రూపాయలు అతడి అక్కౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో విమానయాన సిబ్బంది హస్తం కూడా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు.

బుద్ధిలేని అమ్మాయి.. రూ.కోటి ప్ర‌జాధ‌నం వ్య‌ర్ధం!

త‌ప్పిపోయింద‌నుకుని  టామీ కోసం ఊరుఊరంత‌టినీ ఖంగారెత్తించిందో త‌ల్లి.. సాయింత్రానికి  ఆ టామీ వొళ్లు విరుచుకుంటూ నాలుగు వీధుల‌ కూడ‌లి స్థంభం వెన‌క‌నుంచి వచ్చింది. తిరిగి తిరిగి ఆయాస‌ ప‌డిన వారు దాన్ని కొట్టి చంపాల‌ను కున్నారు. ఎంత‌యినా పెంచుకున్న‌ది .. కాస్తంత తిండిపెట్టారు. జ‌నం, పోలీసాయ‌న కోపంతో ఊగి పోయారు. కొంత ఇలానే ఉంది సాయి ప్రియ ఉదంతం.  విశాఖ‌ప‌ట్నానికి చెందిన 21 ఏళ్ల సాయిప్రియ 2020లో పెళ్లి చేసుకుంది. భ‌ర్త శ్రీ‌నివాస‌రావు హైద‌రా బాద్‌లో ఒక ఫార్మాకంపెనీలో ప‌నిచేస్తున్నాడు. త‌మ మ్యారేజ్ యానివ‌ర్స‌రీ జ‌రుపుకోవ‌డానికి అత‌ను విశాఖ వెళ్లా డు. ఆరోజు సాయింత్రం అలా బీచ్‌కీ  తీసికెళ్లాడు. బీచ్ అన‌గానే స‌ర‌దాగా గ‌డ‌ప‌డ‌మే క‌దా.  ఏవో నాలుగు క‌బుర్లు, రెండు ఐస్క్రీమ్ ల‌తో  సాయింత్రం గ‌డిపేయ‌చ్చ‌ని, మాట్లాడుకోవ‌చ్చ‌ని వాళ్లి ద్ద‌రే వెళ్లారు. కొంత సేప‌టికి  శ్రీ‌నివాస్‌కి  ఫోన్ వ‌చ్చి కొద్దిగా అవ‌త‌ల‌కి న‌డుస్తూ ఫోన్ మాట్లాడాడు. అయి పోయి  వెనక్కి తిరిగి చూస్తే అమ్మ‌డు  క‌న‌ప‌డలేదు. రాకాసి అల లాక్కెళ్లిందేమో అని భ‌య‌ప‌డ్డాడు. బీచ్ అంతా  క‌ల‌య తిరి గాడు. కానీ ఎక్క‌డా ఆమె జాడ లేదు. అంతే అక్క‌డి పోలీసులు రంగంలోకి దిగారు. అంతా  వెతికినా వారికీ క‌నిపించ‌లేదు. ఏకంగా శ్రీ‌నివాస్ నీ  కొంత‌మంది అనుమానించారు.  యావ‌త్ విశాఖ ఖంగారెత్తింది.. ఇలాంటివీ జ‌రుగుతాయా అని శ్రీ‌నివాస్ అత్తింటివారు, స్నేహితులు జ‌ల్లెడ ప‌ట్టినా ఆ అమ్మాయి చున్నీ కూడా దొర‌క‌లేదు. ఇదేం మాయ‌రా నాయ‌నా అని అనుకున్నారు. బాద‌పడ్డా రు. అంత‌లో ఒక‌వేళ నిజంగానే ఏదో పెద్ద అలా స‌ముద్రంలోకి లాక్కెళ్లిందేమోన‌ని సందేహాలు వ్య‌క్త‌మ య్యాయి. చాలామంది అదీ జ‌ర‌గ‌వ‌చ్చ‌నుకున్నారు. అంతే వెంట‌నే భ‌ద్ర‌తాద‌ళాలు, హెలి కాప్ట‌ర్ల‌తో  సిద్ధ మ‌య్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లకూ ఇది మ‌రింత ఆసక్తిక‌ర అంశ‌మైంది. అమ్మాయి దొర‌క‌లేదు గాని కోటిరూపాయ‌ల ఖ‌ర్చు అయింది. ఆ త‌ర్వాత ఆ అమ్మాయి నుంచి వీడియో కాల్ వ‌చ్చింద‌ని అమ్మాయి తండ్రే పోలీసుల‌కు చెప్పారు. విష‌య‌మేమంటే, ఆమెగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ర‌వి అనే అబ్బాయిని విశాఖ‌లో ప్రేమించేసింది. అత‌నితో  బంగ‌ళూరులో ఉంది. అక్క‌డికి వెళ్ల‌డా నికి పెద్ద స్కెచ్ వేసింది. దానికి బ‌ల‌యింది శ్రీ‌నివాస్‌, త‌ల్లిదండ్రుల ప‌రువు.  ప్ర‌జాధ‌నం కోటి రూపాయ‌ ల ఖ‌ర్చు.  మ‌రో షాకింగ్ సంగ‌తేమిటే, ఆ రోజు బీచ్‌కి స‌ద‌రు ప్రేమికుడు కూడా రావ‌డం!  

కుమార్తె పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?.. బాబుతో మోహన్ బాబు భేటీ

 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ఇటీవల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో దాదాపు రెండు గంటల పాటు వీరు భేటీ అయ్యారు. ఈ భేటీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ భేటీపై మీడియాలో పలు కథకాలు వెల్లువెత్తయాయి.   చిత్తూరు జిల్లాలో మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యా నికేతన్‌లో సాయిబాబ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించారంటూ టీడీపీ వర్గాలు ఈ భేటీ వెనుక అసలు కారణాన్ని క్లియర్ కట్ గా చెప్పేశాయి. అ యితే కేవలం ఆహ్వానించడానికి వెళ్లి రెండు గంటల సేపు ఎందుకు సమావేశమయ్యారు? ఈ రెండు గంటల భేటీలో వీరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి? అన్న ప్రశ్నలకు ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు ఇచ్చుకుంటున్నారు.   వీరి మధ్య ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. టాలీవుడ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు.. ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్‌ల బంద్.. తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు పోలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబుకు మోహన్ బాబు వివరించినట్లు తెలుస్తోంది. అదీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చంద్రబాబుకు మోహన్ బాబు చెప్పినట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ నుంచి చిన్న కుమారుడు లేదా కుమార్తె మంచు లక్ష్మీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  దీనిపై చంద్రబాబు... కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీకి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల్లో మంచి పేరే ఉంది. దీంతో  జిల్లాలో సైకిల్ పార్టీకి మంచు ఫ్యామిలీ మద్దతు లభించినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.   ఈ భేటీ తరువాత మోహన్ బాబు కుటుంబం నుంచి మంచు లక్ష్మి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.  

జ‌గ‌న‌న్నా.. ఎం సెప్తిరి.. ఏం సెప్తిరి!

తాజ్‌మ‌హ‌ల్ ఎవ‌రు క‌ట్టించిరి.. షాజ‌హాన్‌., మీ ఊళ్లో పెద్ద సినిమా హాలు ఎవ‌రు క‌ట్టించారు.. మా పెద్దిరెడ్డి గారు, మీ ఊళ్లో మంచినీళ్ల చెరువు ఎవరు తవ్వించారు.. మా చిన్నినాయుడుగారు.. ప‌దిరూపాయ‌ల‌నోటు మీద బొమ్మ‌.. గాంధీ బొమ్మ‌..మ‌న ప్ర‌ధాని.. న‌రేంద్ర‌మోదీ.. ఇవ‌న్నీ ఓ టీచ‌రు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఓ ఏడో త‌ర‌గ‌తి పిల్లాడు చెప్పిన స‌మాధానాలు. మ‌రి ఆ నోట్లు ఎక్క‌డ నుంచి వ‌చ్చును..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక్కడు.. ఇంకెవరు మన జగనన్న.  ప్ర‌శ్న‌ల‌కు స‌రిగా స‌మాధానాలు రాసిన‌ వారే ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణుల‌వుతారు. క‌నీసం స‌గం రాసిన‌వార‌యినా పాస్ కావ‌డానికి కాస్తంత అవ‌కాశ‌మూ ఉంది. కానీ ఎలాంటి నిజాయితీ లేకుండా కేవ‌లం క‌బుర్లు, వాగ్దానాలు, ప‌థ కాల పేర్ల‌తో పాల‌న‌ను కొన‌సాగించ‌డం మాత్రం  జ‌గ‌న్‌కే  చెల్లుతుంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ తీరు తెన్నులు, పాల‌నా లోపాల గురించి, అప్పుల గోల గురించి ఎవ‌రు ఎన్ని ప్ర‌శ్నించినా కేంద్రం మీద‌కి నెట్టేయ‌డం ఆయనకు అధికారంతో అబ్బిన విద్య.  ప్ర‌తీదీ కేంద్రానికే ముడిపెట్ట‌డంతో అల‌వాటులో పొర‌పాటుగా వ‌ర‌ద‌ బాధితుల‌తో మాట్లాడే ట‌పుడు కూడా అవే చిలకపలుకులు పలికి జ‌గ‌న్ తన ప్రత్యేకతను మరింత  ప్ర‌త్యేక‌ంగా బయటపెట్టుకున్నారు.    గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వరద ప్రభావిత జిల్లాల్లో జగన్ పర్యటించారు. ఆ సందర్భంగా   ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారం గురించి చిరు ఉప‌న్యాసం ఇచ్చారు. ఆ ప్రసంగంలో తనకు మాత్రమే ప్రత్యేక మైన జ్ణాన్నాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వం నోట్లు ప్రింటు చేసిస్తే అన్ని ప‌నులూ అయిపోతాయన్నారు. అయితే కేంద్రం ఆ పని చేయడం లేదని, కేంద్రం ఆ పని మొదలెట్టేసి డబ్బులు ఇవ్వగానే అన్ని సమస్యలనూ చిటికెలో పరిష్కరించేస్తానని జగన్ చెప్పారు. కేంద్రప్ర‌భుత్వం నోట్లు ప్రింటు చేసేదేమిట‌ని అటుగా వెళుతూన్న ప‌శువుల కాప‌రి త‌ల‌గోక్కున్నాడు. అల‌గెలావుద్ది మగానుబావా! అనుకున్నాడు. కాబోతే ఆ కుర్రాడు కాస్తంత దూరంగా ఉన్నాడు గ‌నుక పైకి వినిపించేలా అనేశాడు. కానీ సీఎం జ‌గ‌న్ చుట్టూరా వున్న‌వారు మాత్రం త‌ప్ప‌కుండా లోలోప‌ల అదే ప్ర‌శ్న‌ను వేల‌ సార్లు వేసుకుని, క‌డుపులో క‌త్తులు దించు కునీ మ‌రీ బాధ‌ప‌డి ఉంటారు. కానీ సీఎంగారి జ్ఞాన గుళిక తీసుకొన‌క‌పోతే అమ‌ర్యాదేమోన‌ని అవునా సార్ అని త‌ల‌గుడ్డ మ‌ళ్లీ త‌ల‌కు చుట్టుకున్నారు. సీఎం జ‌గ‌న్ అలా చిరున‌వ్వుతో మ‌రో గ్రామానికి ప‌య‌న మ‌య్యారు. 

బెంగాల్లో బీజేపీ మైండ్ గేమ్

పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలే చేసింది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోం మంత్రి అమిత్ షా, సారధ్యంలో బీజేపీ శక్తి యుక్తులన్నీ ప్రయోగించి  పోరాడింది. అయినా ఫలితం దక్కలేదు. రెండు వందల పైచిలుకు స్థానాలు లక్ష్యంగా అమిత్ షా పావులు కదిపినా, బీజేపీ నంబర్స్ రెండంకెల సఖ్యను దాటలేదు. మూడింట రెండు వంతుల మెజారిటీతో తృణమూల్ కాంగ్రెస్, ముచ్చటగా మూడవసారి విజయ కేతనం ఎగరేసింది. మమతా బెనర్జీ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. మరో వంక బీజేపీ  అధికారం అందుకోలేక పోయినా, కేవలం నాలుగు స్థానాల నుంచి 70కి పైగా స్థానాలుకు సంఖ్యా బలాన్ని పెంచుకుంది. కాంగ్రెస్,వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడంతో తృణమూల్ కు ఏకైక ప్రతిపక్షంగా కమల దళం నిలిచింది. అసెంబ్లీలో  లోపల వెలుపల కూడా తృణమూల్ కు ఏకైక ప్రత్యర్హ్దిగా  బీజేపీ నిలిచింది.  అదలా ఉంటే, ఇటీవల మహారాష్టలో విజయవంతంగా శివసేన అధినేత, ఉద్ధవ్ థాకరే సారధ్యంలో, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల మహా వికాస్ అఘాడీ ( ఎంవీఎ) ప్రభుత్వాన్ని కూల్చిన కమల దళం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్’లో అదే తరహ ఆట మొదలు పెట్టిందని అంటున్నారు.నిజమే, మహారాష్ట్రలో ఎంవీఎ ప్రభుత్వాన్ని పడగొట్టినంత తేలిగ్గా  బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడం  అయ్యే పని కాదు. 294 మంది సభ్యులున్న సభలో తృణమూల్ కాంగ్రెస్’ కు 220 కి పైగా స్థానాలున్నాయి. బీజేపీ టికెట్’పై గెలిచిన ఎమ్మెల్యేలలోనూ నలుగురైడుగురు తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. అయినా బీజేపీ బెంగాల్లో, ‘మహా’ క్రీడకు శ్రీకారం చుట్టిందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని,  సినిమ హీరో, బీజేపీ నేత, మిథున్‌ చక్రవర్తి చేసిన సంచలన వ్యాఖ్యలు, అదే సూచిస్తున్నాయని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ వంక ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్టైన సమయంలోనే బీజేపీ ముఖ్యనాయకుడు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్థా కేసులో తృణమూల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వత్తిడి ఎదుర్కుంటున్నారు. కుప్పలుగా పోసిన నోట్ల కట్టలు బయట పడడంతో, సామాన్య ప్రజల్లో తృణమూల్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో, ప్రత్యక్షంగా చూస్తున్నారు. ట్రక్కులలో తరలిస్తున్న నోట్ల కట్టలు తృణమూల్ నాయకత్వాన్ని డిఫెన్సులోకి నెట్టి వేశాయి. ఇదలా ఉంటే పార్థా కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కుప్పలుగా పోసిన నోట్ల కట్టలతో  పాటుగా, రాసులుగా పోసిన బంగారు  ఆభరణాలు కూడా బయట పడుతున్నాయి.  మరో వంక ఈడీ ఇప్పటికే పార్థా ఛటర్జీ, ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఇంట్లో ఈడీ జరిపిన తొలి  సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేస్కున్నామని ఈడీ అధికారికంగా ప్రకటించింది.  ఆ సొమ్ము  సొమ్ము మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదేనని విచారణలో అర్పిత ఈడీ అధికారులకు తెలిపారు. కాగా,  పార్థా చటర్జీ అర్పిత ముఖర్జీకి చెందిన మరో ప్లాట్ లో ఈడీ నిర్వహించిన తాజా సోదాలలో కూడా భారీగా నగదు, బంగారం పట్టుబడింది.పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండో సారి పట్టుబడిన సొమ్ము కూడా కొలువుల కుంభకోణానికి సంబంధించిన సొమ్మేనని అనుమానిస్తున్నారు.  అదలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని,  మిథున్‌ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, సమయం చూసి, బెంగాల్లో ‘మహా’ క్రీడకు బీజేపీ మైండ్ గేమ్’కు శ్రీకారం చుట్టిందని అయితే చెప్పవచ్చని పరిశీలకులు అంటున్నారు.

ఒక సిరంజ్..30మంది విద్యార్దుల‌కు ఇంజ‌క్ష‌న్‌!

ఆరోగ్యం మ‌హాభాగ్యం అన్నారు. ఎవ‌రూ అనారోగ్యం కోరి తెచ్చుకోరు. కానీ సిరంజ్‌లు కొర‌త‌వ‌ల్లో, మ‌రే కార‌ణం చేత‌నో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఏకంగా 30 మంది విద్యార్ధుల‌కు ఒకే సిరంజ్‌తో ఇంజ‌క్ష‌న్ ఇచ్చారు! మ‌రి ఆ పిల్ల‌ల్లో, వారి త‌ల్లిదండ్రుల్లో లేని భ‌యాన్ని సృష్టించారు. దీనికి ప్ర‌భుత్వం, ఆరోగ్య‌శాఖ అధికారులు స‌మాధానం చెప్పాలి. కేవ‌లం ఆ క్యాంప్ నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే స‌రిపోతుందా?  అస‌లే కోవిడ్ మ‌హ‌మ్మారి ఇంకా భ‌య‌పెడుతూనే ఉంది. ఇపుడు మంకీపాక్స్ అనేది విస్త‌రిస్తోంది. రోజు రోజుకీ ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న ప‌రిస్థితుల్లో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ద‌గ్గు త‌మ్ము, జ‌లుబు.. జ్వ‌రం.. అన్నీ వెర‌సి మంచాన ప‌డేస్తున్నాయి. కాస్తంత నీర‌సంగా, ఒళ్లు నొప్పులు ప‌ట్టి నా డాక్ట‌ర్లు వేయి జాగ్ర‌త్త‌లు చెప్ప‌డంతో పాటు గుప్పెడు మందులిచ్చి మ‌రీ భ‌య‌పెడుతున్నారు.  ఈ  ప‌రిస్థితుల్లో కోవిడ్‌-19 ఇంజ‌క్ష‌న్ ఇపుడు స్కూలు విద్యార్ధులకు మ‌రింత వీలు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో అన్నిరాష్ట్రాల్లోనూ విద్యార్ధుల‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు, ఇంజ‌క్ష‌న్‌లు ఇవ్వ‌డం ముమ్మ రంగానే సాగుతోంది. కానీ ఎక్క‌డిక‌క్క‌డ ఏర్పాట్లు క‌ట్టుదిట్టంగానే తీసుకుంటున్నారు.  మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కూడా ఆరంభ‌మ‌య్యాయి. కానీ మ‌ధ్య‌ప్ర‌దేశ్ సాగ‌ర్ సిటీలో ని  ఒక స్కూల్లోనే  ఇంజ‌క్ష న్‌లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ సిరంజ్‌లు త‌గిన‌న్ని లేక‌పోవ‌డ‌మే చిత్రం. స్కూలు అన్న‌పుడు చాలామంది పిల్ల‌లు ఉంటారు, అంద‌రికీ ఇంజ‌క్ష‌న్‌లు ఇవ్వాలి. కానీ సిరం జ్‌లు ఎన్ని అవ‌స‌ర‌మ‌వుతాయ‌న్న అంచ‌నా లేకుండానే కార్య‌క్ర‌మానికి  సిద్ధ‌ప‌డ్డారు. కోవిడ్  వాక్సికేష‌న్ ఆషా మాషీ వ్య‌వ‌హారం కాద‌ని ఆ క్యాంప్ నిర్వాహకుల‌కూ తెలుసు కానీ నిర్ల‌క్ష్యం వ‌హించారు. ఇది బొత్తిగా క్షంత‌వ్యం కాదు. ఒకే ఒక్క సిరంజ్‌తో ఏకంగా ముప‌ప‌యిమంది విద్యార్ధుల‌కు ఇంజ‌క్ష‌న్ ఇవ్వ‌డానికి ఎలా సిద్ధ‌ప‌డ్డార‌న్న‌ది అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.  జ‌రిగిన త‌ర్వాత అలా ఎలా చేశార‌ని ఇపుడు ప్ర‌శ్నించుకోవ డం, ఆ క్యాంప్ నిర్వాహ‌కుల‌పై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన‌డంలో అర్ధం లేదు.  సాగర్ సిటీలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ సమయంలో  ఈ ఘటన జరిగింది. 30మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ తీసుకుంటుండటం చూసిన పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఏఎన్ఎమ్ జితేంద్ర రాయ్.. స్పందిస్తూ తనకు డిపార్ట్‌మెంట్ హెడ్ నుంచి ఒకేసిరంజీతో వ్యాక్సిన్ వేయాలంటూ ఆదేశాలు అందాయని పేర్కొన్నాడు. వాళ్లు కేవలం ఒక సిరంజీ మాత్రమే ఇచ్చారు. నేనడిగితే అదే చెప్పారు. అందుకే 30మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ ఇచ్చాను అని పేర్కొన్నాడు. సాగర్ జిల్లా యాజమాన్యం ఈ  ఘటన గురించి  జితేంద్రపై ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది.  ఒక సూదిని ఒక్క‌సారే ఉప‌యోగించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం పెట్టిన  నిబంధనను అతిక్రమించడం పట్ల కేసు ఫైల్ అయింది. శాఖాప‌ర విచార‌ణ  జరుపుతున్నామని.. వ్యాక్సిన్లు పంపేందుకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డా. రాకేశ్ రోషన్ ఎంక్వైరీకి ఆదేశించారని అన్నారు. కానీ ఇలా  క్యాంపులు చేప‌ట్టి  విద్యార్ధుల్లో, త‌ల్లిదండ్రుల్లో లేని భ‌యాలు క‌ల్పించార‌నే అనాలి. ఒకే సిరం జ్‌ని  వినియోగించి 30 మందికి ఇంజ‌క్ష‌న్‌లు ఇవ్వ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌మాద‌మేమిట‌న్న‌ది ఇపుడు వారిని భాయందోళ‌న‌కు గురిచేస్తోంది.  ఇలా చేస్తే విప‌రీతాలు జ‌రిగే ప్ర‌మాదం ఉందా లేదా అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ కేంద్రం, ఆరోగ్య శాఖ కూడా ఎలాంటి సూచ‌న‌లూ చేయ‌లేదు. 

గెలుపు వాకిట తెలుగుదేశం.. తేల్చేసిన అంతర్గత సర్వే

వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ  ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంబించింది.అందుకోసం పార్టీ నిర్వహించిన అంతర్గాతసర్వే లో వచిన్న పలితాలు మంచిగా రావడం తో పార్టీ శ్రేణులు ఉత్సాహం గా ఉన్నారు. అదే ఉత్సాహాన్ని ఎన్నికల వరకూ కొనసాగించే విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వరుస కార్యక్రమాలతో రాష్ట్రం చుట్టేస్తున్నారు. ఆయన పర్యటనలతో దేశం శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఆయన పర్యటనలకు వస్తున్న జనస్పందన చూస్తుంటే విజయం తథ్యమన్న భావన కలుగుతోందని తెలుగు దేశం శ్రేణులు అంటున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు అధినేత చంద్ర‌బాబు ఒక‌వైపు చెమటోడుస్తుంటే,  కొందరు పార్టీ సీనియర్లు మాత్రం పెద్దగా స్పందన లేకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఆయ‌న తమ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు ఏదో కొంత హడావుడి చేయడం తప్ప పెద్దగా పార్టీ కోసం శ్రమ పడటానికి  సుముఖత వ్యక్తం చేయడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పని చేయని నేతలను పక్కన పెట్టాలని శ్రేణుల నుంచి డిమాండ్ వస్తున్నది.  రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు ల‌భించే ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా తెలుగుదేశం పార్టీ ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. విజ‌యావ‌కాశాలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎటువంటి అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని శ్రేణుల‌కు అధినేత చంద్ర‌బాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌పైనే ఆశలు పెట్టుకుని నిర్లిప్తంగా ఉండొద్దని,  క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని ప్రజలలో మమేకం కావాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తన జిల్లాల పర్యటనల్లో కూడా పార్టీ క్యాడర్ కు సమయం కేటాయిస్తూ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.   పార్టీ శ్రేణులు కష్టపడి పని చేస్తే వచ్చే ఎన్నికలలో సునాయాసంగా 79 నియోజ‌క‌వ‌ర్గాల‌లో పార్టీ విజయం సాధిస్తుందని అంతర్గత సర్వేలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవి గత ఎన్నికలలో పార్టీ విజయం సాధించిన  23 స్థానాలకు అదనం. అంటే పార్టీ అంతర్గత సర్వేను బట్టి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 102 నియోజకవర్గాలలో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని  అంతర్గత సర్వేలో వెల్లడైందని అంటున్నారు.   ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం వెయ్యి నుంచి 2వేల ఓట్ల తేడాతో చేజార్చుకున్న‌వేనని,  ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలుగుదేవం అధినేత క్యాడర్ కు సూచిస్తున్నారు. ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పనిచేయాలంటూ చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. సమాచారం. ఇవి కాక  వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌పై పూర్తిగా దృష్టిపెట్టాల‌ని అధినేత చంద్రబాబు నిర్ణ‌యించిన‌ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం విజ‌యం సునాయాసమని భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు వ్యూహాత్మకంగా పని చేస్తే   45 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అధినేత భావిస్తున్నారు.   అభ్య‌ర్థుల ఎంపిక‌, సామాజిక స‌మీక‌ర‌ణాలు,   ఈ 45 నియోజకవర్గాల్లో ప్ర‌భావం చూపుతాయని అంటున్నారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరాహోరీ పోరు న‌డుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పొత్తులు కుదిరితే తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి మరింత మెరుగుప‌డుతుంద‌ని అంటున్నారు.  పొత్తుల‌తో సంబంధం లేకుండా ఒంట‌రిగా వెళ్లినా ఘ‌న‌ విజ‌యం సాధించ‌గ‌లిచగలమని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో  ఒంట‌రిగా బరిలోకి దిగాలని పార్టీ శ్రేణులు అధినేతకు సూచిస్తున్నారు. అయితే  పొత్తుల విషయం పక్కన పెట్టి పార్టీని ఒంటరిగానే గెలుపు తీరాలకు చేర్చేలా పార్టీని సమాయత్తం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు.  ముందుగా ప్రకటించిన అభ్యర్థులు, ఇన్ ఛార్జిలుగా ఉన్నవారు తమ పనితాము చేసుకుంటూ వెళ్లాలని బాబు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  గెలుపు వాకిట   తెలుగుదేశం పార్టీ నిలబడిందని, నాయకులు, కార్యకర్తలు అనుసరించే విధానాలను బట్టి ఫలితాలు ఆధారపడివుంటాయని, ఎట్టి పరిస్థితుల్లోను అలసత్వానికి తావులేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. పొత్తుల‌తో సంబంధం లేకుండా ముందుగా ఎవ‌రి ప‌ని వారు చేసుకోవాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.  

మ‌నుషులు దొర‌క‌లేదా.. బ్రో!

పిల్లుల‌తో ఆడ‌తారు, కుక్క‌ల‌తో ఆడ‌తారు.. అదో స‌ర‌దా. కానీ  ఈ మ‌హానుభావుడు బాస్కెట్‌బాల్  ఆడ‌టాన‌కి ఎవ్వ‌రూ దొర‌క‌న‌ట్టు ఎద్దుతో ఆడుతున్నాడు.  ఎవ‌రు, ఎక్క‌డ అన్న సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. ఎవ‌ర‌యినా బాస్కెట్‌బాల్‌ను  ఆగ‌టానికి  కోర్టు, మంచి ప్లేయ ర్లు అవ‌స‌రం. పోటాపోటీగా జ‌రుగుతుంది. బాస్కెట్‌బాల్‌కు విదేశాల్లో మంచి క్రేజ్ ఉంది. మ‌న దేశంలోనూ ఆడుతున్నారు. ప‌ల్లెల్లోకి ఇప్పుడిప‌ప్పుడే  విస్త‌రించింది. టీవీల్లో జాతీయ‌, అంత‌ర్జాతీయ పోటీల ప్ర‌ద‌ర్శ న‌ల పుణ్య‌మా అని చాలామంది ప్లేయ‌ర్లూ త‌యార‌వుతున్నారు. అయితే ఈ మ‌హానుభావుడు ఎద్దుతో ఆడాల‌ని ఆలోచించ‌డ‌మే చిత్రం.  దానికి అర్ధ‌మ‌య్యేలా ఆడ‌టం బం తిని ఎలా త‌న్ని నెట్‌లో వేయాలో చెప్ప‌డం అనేది బ‌హు క‌ష్ట్‌. అయినా అత‌ను ఎంత‌లా ప్రాక్టీస్ చేయిం చాడోగాని అత‌నితో ఆ ఎద్దు స‌ర‌దాగానే కాదు కాస్తంత సీరియ‌స్‌గానూ రోజూ ఆడేస్తోందిట‌.   మ‌నిషితో చిన్న‌పాటి జంతువులు ఆడ‌టానికి సిద్ధ‌ప‌డ‌తాయి, త్వ‌ర‌గా శిక్ష‌ణ‌కి వీలుప‌డుతుంది. కానీ ఎద్దు ని ఆట‌కు పాట్న‌ర్‌గా ఎలా చేసుకున్నాడ‌న్న‌ది పెద్ద ప్ర‌శ్నే. అత‌ను బంతిని గోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిం చిన ప్ర‌తీసారి ఎద్దు చాలా చాక‌చ‌క్యంగా అడ్డుకుంటోందిట‌. ప్రేక్షకులు వీడియో తీసి నెటిజ‌న్ల‌కు క‌ను విందు చేశారు. ల‌క్ష‌ల‌మంది చూసి ఆనందించారు, క‌డు ఆశ్చ‌ర్యాన్ని ప్ర‌క‌టించారు.  చూసిన వారు వారి స‌మీప ప్రాం తాల్లో ఎద్దుల్ని కూడా ఆట‌లోకి దింప‌డానికి ప్ర‌య‌త్నిస్తారేమో! అస‌లే వీడియోల ప్ర‌భావం అంతా ఇంతా కాదు. ప్ర‌యోగాలు చేయ‌వ‌చ్చు కాని, అదేమీ ఎద్దుతో సెల్ఫీ తీసుకోవ‌డంకాదు. క‌నుక  దానితో స‌ర‌దా అనేది క‌ష్టం. ముందు మ‌న‌కు ఆట తెలియాలి, ఆడాలి, త‌ర్వాత దాన్ని మ‌న దారిలోకి తెచ్చుకోవాలి. ఈ చివ‌రిదే చాలా క‌ష్టం. ఎవ‌ర‌న్నా చేయ‌గ‌లిగితే ఓ వీర‌తాడు వేయ‌వ‌చ్చు!

నాడు ముద్దులు.. నేడు ఆలింగనాలు

పూటకో మాట.. రోజుకో వేషం అన్నట్లగా ఉంది జగన్ తీరు. ప్రజలలో జగన్ సర్కార్ పై విశ్వసనీయత కోల్పోతున్న సంగతి ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో వారిని మళ్లీ వైసీపీవైపు మళ్లించడానికీ, తన పై విశ్వసనీయత పెరిగేలా చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఇళ్లూ వాకిలీ వదిలేసి నిత్యం జనంలోనే తిరిగి ఒక్క చాన్స్.. ఒకే ఒక్కచాన్స్ అంటూ అదేదో సినిమాలో హీరోయిన్ లా జనాలను ప్రాధేయపడిన ఆయన తీరా అధికారం చిక్కిన తరువాత జనం మొహం చూసిన సందర్భాలు అతి స్వల్పం. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడమే గగనం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. గత ఎన్నికలకు ముందు జనంలో తిరుగుతూ అవ్వలు, తాతలు, అక్కమ్మలు, చెల్లెమ్మలు అంటూ కనిపించిన వారికల్లా ముద్దులు పెట్టి, నెత్తిన చేయి పెట్టి ఆశీర్వదించిన జగన్... అధికారంలోకి వచ్చిన తరువాత ముద్దులు, ఆశీర్వచనాల సంగతి అలా ఉంచి పన్నులు, వడ్డింపులూ అంటూ గుద్దులు మొదలెట్టారు. మూడేళ్లు గడిచిపోయిన తరువాత ఇప్పుడు మళ్లీ జనం గుర్తుకు వచ్చారా అని జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా చేసిన హడావుడి, మళ్లీ జనంలో మమేకం కావడానికి పడిన తాపత్రయం చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటనలో ‘సెలెక్టడ్’ జనం మాత్రమే ఆయన దగ్గరకు వెళ్లగలిగారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన వరద బాధితులెవరూ జగన్ పర్యటన పట్ల ఆసక్తి చూపలేదనీ అంటున్నారు. స్థానిక నేతలు ఎంపిక చేసిన వారు మాత్రమే జగన్ కు చేరువగా వెళ్లి ఆయనతో ఫొటోలు దిగారంటున్నారు. గతంలో ముద్దులతో మురిపించిన జగన్ ఈ సారి వరద బాధితుల పరామర్శ పర్యటనలో ఆలింగనాలకు పని చెప్పారు. ఇది చూసి నాడు ముద్దులు..నేడు ఆలింగనాలు తప్ప వాస్తవంగా ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంకీపాక్స్ వైరస్ కు వ్యాక్సిన్ తయారీకి ఐసీఎమ్ఆర్ పిలుపు

ఒక దాని వెంట ఒకటి.. ఒకదానితో కలిసి మరొకటి అన్నట్లుగా ప్రపంచాన్ని వైరస్ లు చుట్టేస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగనే లేదు. కరోనా ప్రొటోకాల్ పాటించి తీరాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అంతలోనే ఉరుములేని పిడుగులా మరో వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆ వైరస్ పేరే మంకీ పాక్స్. దేశ వ్యాప్తంగా 71కి పైగా దేశాలలో ఈ వ్యాధి ఇప్పటికే విస్తరించింది. నెలల వ్యవథిలోనే ప్రపంచ వ్యాప్తంగా16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్ కు మంకీ పాక్స్  వైరస్ ముప్పులేదంటూ చెబుతూ వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు అదీ  దేశంలో ఒక మంకీ పాక్స్ వైరస్ కేసు నిర్ధారణ అయ్యి, మరో అరడజను అనుమానిత కేసులు నమోదు అయిన తరువాత అప్రమత్తమైంది.ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ    గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ  ప్రకటించింది. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా వ్యాధి దేశంలోకి ప్రవేశించిన తర్వాత దీన్ని నియంత్రించేందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లుగానే, ఇప్పుడు మంకీపాక్స్ వ్యాధికి కూడా వ్యాక్సిన్ తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రయత్నాలు ప్రారంభించింది. మంకీపాక్స్ వైరస్‌ను అడ్డుకునే వ్యాక్సిన్ తయారీకి కంపెనీలను ఆహ్వానించింది. అలాగే వ్యాధిని త్వరగా గుర్తించే విట్రో డయాగ్నస్టిక్ కిట్లు కూడా తయారు చేయాలని కంపెనీలను కోరింది. మంకీపాక్స్ వైరస్ వ  జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది.  జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు మంకీపాక్స్ వైరస్ బారిన పడిన వ్యక్తిలో కనిపిస్తాయి.   ప్రస్తుతం అర్హత కలిగిన కంపెనీల నుంచి ఐసీఎమ్ఆర్ వ్యాక్సిన్ తయారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వారానికి కనీసం లక్ష డోసుల వ్యాక్సిన్లైనా తయారు చేయగలిగే సామర్ధ్యం ఉండాలని ఐసీఎంఆర్ అంటోంది. కోవిడ్ సందర్భంగా దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్ రూపొందించినట్లుగానే ఈ వ్యాక్సిన్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ కంపెనీలకు రాయితీ కూడా కల్పిస్తుంది. నిపుణుల సహకారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది.