జగన్‌పై మరో కేసు దాఖలు

 అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై మంగళవారం మరో కేసు దాఖలైంది. మొదటి చార్జీషీటుకు అనుబంధ చార్జీషీటును సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఒక్కో ఛార్జీ షీటు ఒక్కొక్క కంపెనీపై దాఖలు చేస్తోంది. తాజా అనుబంధ చార్జీషీటు హెటిరో డ్రగ్స్ వ్యవహారంపై ఇచ్చింది. దివంగత వైఎస్ హయాంలో లబ్దిపొందిన హెటిరో లంచం రూపంలో రూ. 35 కోట్లు పెట్టుబడులు పెట్టారని సీబీఐ చార్జీషీటులో పేర్కొంది. పిసి యాక్ట్ సెక్షన్ 9, 10, 11 క్రింద సీబీఐ అధికారులు ఈ కేసును నమోదు చేశారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాధికారులను ప్రభావితం చేశారని సిబిఐ తాజా ఛార్జీషీటులో పేర్కొంది. జగన్ కంపనీలలోకి లంచాల రూపంలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. హెటెరో తదితర కంపెనీలు జగన్ కంపెనీలలో రూ.146 కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఇవన్నీ లంచాల రూపంలోనే వచ్చాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తాము దాఖలు చేసిన ఛార్జీషీట్లలోని రూ.35 కోట్లు లంచం రూపంలోనే జగన్ కంపెనీలలోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా సిబిఐ కోర్టుకు ఆధారాలను సమర్పించింది. ఇద్దరు సాక్ష్యులను తమ ఛార్జీషీటులో ప్రస్తావించింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలుత మొదటి ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ ఆ తర్వాత మూడింటిని అనుబంధ ఛార్జీషీట్లుగా కోర్టుకు సమర్పించింది.  

ఈడి వేలికేసిన ముడిని కాలికేస్తున్న జగన్‌

వేలికి ముడేస్తే కాలికి ముడేసేవాడుంటాడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నిరూపించారు. అత్యంత తెలివైన వ్యక్తిగా పేరొందిన జగన్‌ తెలివితేటలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై కౌంటర్‌పిటీషన్‌ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇటీవల అక్రమాస్తుల కేసులో జగన్‌ సిబిఐ ద్వారా కస్టడీలోకి వచ్చి చెంచల్‌గూడా జైలులో ఉన్నారు. సిబిఐ విచారించిన తరువాత కేంద్ర సంస్థ అయిన ఈడి కూడా రంగంలోకి దిగింది. ఇదే కేసులో జగన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడి దాదాపు 15రోజుల క్రితమే సిబిఐ కోర్టును కోరింది. అయితే కోర్టు ఈ నెల 6వతేదీన తీర్పు ఇవ్వనుంది. ఈలోపు జగన్‌ తరుపున కౌంటర్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. జగన్‌ తరుపున న్యాయవాది అశోక్‌రెడ్డి వాదించారు. ఈడి కోరినట్లు తాను ఇప్పుడు జగతి పబ్లికేషన్స్‌కు ఛైర్మన్‌నో, డైరెక్టర్‌నో కాదని జగన్‌ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. జగతిపబ్లికేషన్స్‌లోకి హవాలా రూపంలో పెట్టుబడులు వచ్చాయని, దీనిపై జగన్‌ను విచారించాలని ఈడి కోర్టుకు విన్నవించింది. జగతి పబ్లికేషన్స్‌కు తాను ఇస్పుడు జైలులోకి వచ్చాక డైరెక్టర్‌ కాదని స్పష్టం చేశారు. తనను విచారించేందుకు అనుమతి ఇవ్వరాదని జగన్‌ సిబిఐ కోర్టును కోరారు. ఈడి దాఖలు చేసిన ఫిర్యాదు మెయింటనబుల్‌ కాదని  జగన్‌ పేర్కొన్నారు. తాను ప్రస్తుతం జైలులో ఉన్నందున తనకు కంపెనీ వ్యవహారాలేవీ తెలియవన్నారు. తనకు ఫెమా, పిఎంఎల్‌ చట్టం వర్తించదని జగన్‌ పేర్కొన్నారు. ఇలా ఈడి ఒక ముడి వేలికేస్తే జగన్‌ కాలికి వేశారు. ఈడి తరుపున న్యాయవాది సుభాష్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలూ విన్న నాంపల్లి సిబిఐకోర్టు న్యాయమూర్తి ఈ నెల 6న తీర్పు ఇస్తామని కేసును వాయిదా వేశారు.

ఈడికి జగన్‌ భయపడుతున్నారా

ఇప్పటి దాకా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఎవరికీ, ఏ విచారణ సంస్థకు భయపడలేదు. ప్రత్యేకించి తనను అరెస్టు చేసిన సిబిఐకు ఆయన కనీసం జంకినట్లుగా కూడా కనిపించలేదు. అయితే సిబిఐ నుంచి పూర్తి వివరాలు, కేసు షీట్లను, ఆధారాలను తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాను సొంతంగా ఢల్లీి నుంచి అధికారులను హైదరాబాద్‌ పంపించింది. వీరు వచ్చినది మొదలు ఈడి విచారణ ప్రారంభమైంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో చెంచల్‌గూడా జైలులో ఉన్న నిందితులను ఈడి విచారించింది. వీరితో పాటు జగన్‌ను విచారిస్తామని నాంపల్లిలోని సిబిఐకోర్టులో పిటీషను దాఖలు చేసింది. అయితే ఈడి రంగంలోకి దిగినది మొదలు విచారణలో తన దాకా రాకుండా జగన్‌ పలురకాల జాగ్రత్తలు  తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే తన తరుపున న్యాయవాది అశోక్‌రెడ్డిని జగన్‌ రంగంలోకి దించారు. ఈయన జగన్‌ తరుపున దాఖలు చేసిన రీకౌంటర్‌లో ఈడి గురించి ప్రస్తావించిన ప్రతీ చోటా విచారణకు మాత్రం అనుమతి ఇవ్వవద్దని సిబిఐకోర్టును జగన్‌ కోరుతున్నారు. ఇలా కోరటంలోనే ఈడి విషయంలో తనకున్న భయాన్ని జగన్‌ వెల్లడిరచారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏ కేసు విచారించినా నిందితులే తాము నిర్దోషులమని ఆధారాలతో సహా చూపాలి. లేకపోతే కోర్టు ద్వారా శిక్షలు పడతాయి. ఈడి విభాగం ఏర్పడినప్పటి నుంచి ప్రతీకేసులోనూ నిందితులు సాక్షాలు చూపలేక పోతే జైలుజీవితం అనుభవిస్తున్నారు. అందువల్ల తన జీవితం జైలుకు పరిమితమవుతుందన్న భయం వల్ల కూడా జగన్‌ మనస్సులో ఈడి విచారణ ప్రకంపనలు సృష్తిస్తున్నాయి. ఈడిని ఆపాలని కోర్టుకు జగన్‌ మొరపెట్టుకున్నారు.

ప్రమాదాలకు నిలయంగా మారిన విశాఖస్టీల్‌ప్లాంట్‌

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన భారీప్రమాదం మరువకముందే రెండోసారి ప్రమాదం ఎదురవటం కార్మిక సంఘాలను కలిచివేస్తున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదం కారణంగా తీవ్రఅస్వస్థతకు గురైన ఆరుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ధృవీకరించారు. స్టీలుప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌`1 పంప్‌హౌజ్‌ వద్ద మరమ్మత్తులు నిర్వహిస్తుండగా గ్యాస్‌ లీకయింది. దీంతో అక్కడే పని చేస్తున్న ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా విషవాయువుని పీల్చినందున ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వివరించారు. తాము చికిత్స ద్వారా వారు త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు స్పష్టం చేశారు. అయితే ఫ్యాక్టరీలో తరుచూ ప్రమాదాలు ఒకదాని తరువాత మరొకటి ఎలా జరుగుతోంది? అసలు నాణ్యతాప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ఒకవేళ పాటిస్తే కార్మికులు ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తరుచుగా ప్రమాదాలు జరిగేటప్పుడు యాజమాన్యం అప్రమత్తం అవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. వీలైనంత త్వరలో ఈ మేరకు చర్యలు  తీసుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలానే అస్వస్థులైన ఆరుగురు కార్మికకుటుంబాలని ఆదుకోవాలని డిమాండు చేశారు.

పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న దివీస్‌ ,శ్రీని కంపెనీలు

నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ పరిసర ప్రాంతాలను దివీస్‌, శ్రీని మందుల తయారీ కంపెనీలు కలుషితం చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ రెండు కర్మాగారాలకు ఎఫ్యులెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటులు ఉన్నాయి. కానీ, వీటి నిర్వహణకు ఖర్చు ఎక్కువవుతుంది. అందువల్ల ఈ కంపెనీలు వీటిని వాడకుండా వ్యర్థాలను  అక్రమంగా భూమిలో నిల్వ చేయడ్‌, బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయం,  తగుల పెట్టడం వంటి పద్దతులను అవలంబిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దివీస్‌  మరో ముందడుగు వేసి ప్లాంటు నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాలను విశాఖపట్టణంలోని తమ రెండో యూనిట్‌కు తరలిసున్నదని  అక్కడి నుంచి ఈ వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా సముద్రజలాల్లో కలిపేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ రెండు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయన కాలుష్యాన్ని తరలించేందుకు స్థానికులనే ఈ రెండు కర్మాగారాలు  ఏజెంట్లుగా పెట్టుకున్నాయి. చౌటుప్పల్‌తో పాటు చిట్యాల, పోచంపల్లి రంగారెడ్డి జిల్లాకు చెందిన వందమంది ఈ వ్యవహారంలో నిమగ్నమై ఉన్నారు. నిత్యం ఈ రెండు ప్లాంట్లు నుంచి పది, హేను ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయానాలను రాత్రి వేళల్లో తరలించి నిర్మానుష్యమైన అటవీ ప్రాంతాల్లో పారబోస్తున్నారు. 12వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక్కొ ట్యాంకరు తరలించేందుకు 80వేల నుంచి లక్ష రూపాయల వరకూ ముట్టజెపుతున్నారు. ఈ పరిశ్రమలు లాభాపేక్షతో పర్యావరణానికి తీవ్రమైన ముప్పుతెస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఉత్తరాంధ్రపై కన్నేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌ఘడ్‌, ఒడిస్సాలో కిడ్నాప్‌లు, దాడులతో భీభత్సం సృష్టిస్తున్న మావోయిస్టులు తాజాగా ఉత్తరాంధ్రపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ నాయకులను విడిపించుకోవటానికి మావోయిస్టులు ఉత్తరాంధ్రలో కిడ్నాప్‌లు జరపవచ్చనన్న సమాచారం అందటంతో ఆయా జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు ఈ జిల్లాల్లోని ఐ ఎ ఎస్‌ లు, లేదా ప్రజాప్రతినిధులను టార్గెట్‌ చేయవచ్చనన్న అనుమానాన్ని ఇంటిలిజెన్స్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తమకు తెలియకుండా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని పోలీసులు ప్రజాప్రతినిధులు, ఐఎఎస్‌ అధికారులను హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత చెడ్డా భూషణాన్ని విడిపించుకోవడానికి మావోయిస్టులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణంలో ఎవరు దొరికినా కిడ్నాప్‌ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఐటిడిఎ పిఓ శ్రీకాంత్‌ ప్రభాకర్‌, కొయ్యూరు మండలం గుజరాళ్ల పంచాయతీలో పర్యటించినప్పుడు ఆయన్ను కిడ్నాప్‌ చేయటానికి మావోయిస్టులు ప్రయత్నించారు. అయితే ప్రభాకర్‌ ఐఎఎస్‌ కాదని తెలుసుకుని వారు తమ కిడ్నాప్‌ యత్నాలను మానుకొన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలతో వారి ఆచూకీని తెలుసుకునేందుకు ఏరియల్‌ సర్వే ముమ్మరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.

మహారాష్ట్ర ఇసుకను కూడా వదలని ఆంధ్రా సిండికేట్లు

రాష్ట్రంలో మద్యం మాఫియా కన్నా ప్రమాదకరంగా తయారైన ఇసుక సిండికేట్లు పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రపై కన్నేశాయి. గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రా, మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరానదిలో కోట్లాది రూపాయల విలువైన ఇసుకను కొల్లగొట్టేశారు. మంజీరానదిలో ఇసుక క్వారీలను రాష్ట్రప్రభుత్వం రెండేళ్ల క్రితం నిషేధించింది. అయితే మహారాష్ట్రలో అటువంటి నిషేధం లేకపోవటంతో రాష్ట్రానికి చెందిన ఇసుక సిండికేట్లు అక్కడ వాలిపోయారు. మహారాష్ట్ర అధికార్లను లంచాలతో మేనేజ్‌ చేసి ఇసుకను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. దాదాపు పదికిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నదీ గర్భంలో ఇప్పటికే లక్షలాది టన్నుల ఇసుకను కొల్లగొట్టారు. ఇది చాలదన్నట్లు ఆంధ్రాప్రాంతంలోని నదీగర్భ ఇసుకను కూడా గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోతున్నారు.   నదీపరివాహప్రాంతంలో సరిహద్దులు సరిగా లేకపోవటంతో ఇసుక సిండికేట్ల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిద్దామని రాష్ట్ర అధికారులు కోరుతున్నప్పటికీ మహారాష్ట్ర అధికారులు పట్టించుకోవటం లేదు. మహారాష్ట్ర ఇసుక క్వారీ ద్వారా మన రాష్ట్రానికి అపారంగా నష్టం జరుగుతోంది. అక్రమంగా ఇసుక తవ్వటంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. మహారాష్ట్ర క్వారీల నుంచి ప్రధానంగా మన రాష్ట్రంలోకి ఇసుక రావాణా అవుతోంది. క్వారీల వేలం ద్వారా మహారాష్ట్ర కోట్లాది రూపాయలు ఆశిస్తుండగా, ఇసుకను రవాణా చేస్తున్న భారీ వాహనాల కారణంగా ఆంధ్రాప్రాంతంలో రహదార్లు దెబ్బతింటున్నాయి.

వేటగాడే వేటాడబడుతున్న వేళ

రియల్‌హీరో, కనిపించని నాలుగో సింహం మేరా పోలీస్‌ అనిపించుకున్న జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. నేరస్తులను వేటాడలసిన ఆయన ఇప్పుడు వివాదాలకు గురవడమే కాక మీడియాకు లీక్‌లు చేసి హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.ఈయన ఎవరిపై విచారణ చేస్తున్నారో వారే లక్షీనారాయణ కాల్‌లిస్ట్‌ను సేకరించి ఆయన్ను ఇరుకున పెట్టడం విశేషం. ఇంజనీరింగ్‌ డిగ్రీని రీజినల్‌కాలేజ్‌ (ప్రస్తుతం నిట్‌గా పిలవబడుతుంది) వరంగల్‌ లో చేసి, చెన్నయ్‌ ఐఐటిలో ఎంటెక్‌ చేశారు. సివిల్స్‌లో టాపర్‌గా నిలచిన లక్ష్మీనారాయణ మహరాష్ట్ర కేడర్‌లో సెలక్ట్‌ అయ్యారు. మొదట నాందేడ్‌ భాద్యతలు చేపట్టిన ఈయన తర్వాత యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌లో పనిచేశారు. డిఐజి ర్యాంకులో జూన్‌ 12, 2006 సంవత్సరం హైదరాబాద్‌ నగరంలో సిబిఐ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు. లక్ష్మీనారాయణ అదే సంవత్సరం ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నారు. షాబుద్దీన్‌ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసు, సత్యం రామలింగరాజు తప్పుడు ఎకౌంట్లకేసు, అక్రమ మైనింగ్‌లో గాలి జనార్థన్‌ కేసు ఈయన ఆధ్యర్యంలో ఇన్వస్టిగేట్‌ చేసిన కేసులు. ఇవన్నీ లక్ష్మీనారాయణకు పేరు తెచ్చిన కేసులనే చెప్పాలి. సత్యం రామలింగరాజు కేసులో ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఇన్వెస్టిగేషన్‌ చేసి వేలకొలది పేజీలు సమర్పించారు. అయితే అక్రమ మైనింగ్‌ కేసులో సీనియర్‌ ఐపియస్‌ అధికారిణి శ్రీలక్షిని అరెస్టు చేసి, సబితా ఇంద్రారెడ్డిని వదిలివేశారనే విమర్శలు ఎదుర్కోన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని రెడ్డివర్గమంతా కలసి శ్రీలక్ష్మిని బలిచేశారనే అపవాదువుంది. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే లక్ష్మీనారాయణది, శ్రీలక్ష్మీది ఒకటే కమ్యూనిటీ అయినప్పటికీ ఆయన చలించలేదు. మే 27, 20012 న జగన్‌ అరెస్టుతో ఆయన మరింత ప్రచారంలోకి వచ్చారు. జెడి లక్ష్మీనారాయణకు ఈ సమయంలోనే వై కాటగిరి భద్రతను ప్రభుత్వం ఇచ్చింది. ఎమ్మార్‌ కేసులో అవినీతికి పాల్పడ్డారని ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తున్న  బిపి ఆచార్యను అరెస్టు చేశారు. ఇదే కేసులో రఘురామకృష్ణంరాజు అనే ఇండస్ట్రియలిస్ట్‌కి ముచ్చెమటలు పట్టించారు. ఈయన రాజ్యసభ సబ్యులైన కెవిపి రామచంద్రరావుకు బందువుకూడా .రఘరామకృష్ణంరాజును  విచారణ జరుపుతున్నప్పుడే లక్ష్మీనారాయణ ఒక వర్గం మీడియాకు సమాచారం అందిస్తున్నారని కృష్ణంరాజు కాల్‌లిస్టును కోర్టుకు అందించారు. అప్పటినుండే జెడి లక్ష్మీ నారాయణను కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని చెప్పవచ్చు. క్విడో ప్రో కో అంటూ జగతి పబ్గికేషన్స్‌ ఇన్వస్టర్లని అరెస్టు చేశారు. ఇందుకు వైయస్‌ జగన్‌ను కూడా బాధ్యుడిని చేసి అతనితో పాటు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలను  సిబిఐ అరెస్టుచేసింది. జగతిపబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టినందుకు గాను మాట్రిక్స్‌ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌ని, ఇండియాసిమెంట్స్‌ అధినేతను, చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ సాయిరెడ్డిని, ఎమ్మార్‌ కేసులోని పారిశ్రామిక నేతల్ని, నెలలతరబడి విచారణ పేరుతో వేధింపులకు పాల్పడ్డారనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. కాని ఇప్పుడు పరస్ధితి తారుమారైంది. నేరసుస్ధులను వేటాడటానికి వచ్చిన లక్షీనారాయణను ఆ నేరస్తులే వేటాడుతున్న పరిస్ధితి ఏర్పడిరది. కాల్‌ లిస్ట్‌ వ్యవహారంలో ఆయనే హైకోర్టు బోను ఎక్కి తలవంచుకుని నిలబడాల్సి వస్తోంది.

నాగార్జున అగ్రీకెమ్‌ మూసివేత సాధ్యం కాదా ?

శ్రీకాకుళంలోని నాగార్జున అగ్రీకెమ్‌ ప్లాంటు కాలుష్యమయమైంది. దీంతో దీన్ని మూసివేయాలన్న డిమాండు తెరపైకి వచ్చింది. ప్లాంటు నుంచి ఉత్పత్తిని కూడా ఆపేశారు. ఇదే ప్లాంటులో రియాక్టర్‌ పేలుడు వార్త ఇటీవల యావత్తురాష్ట్రాన్ని కలవరపెట్టింది. దీనిపై ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన కాలుష్యనియంత్రణాధికారులు ఫ్యాక్టరీలో ఉన్న లోపాలను గమనించారు. దీన్ని వెంటనే మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. అలానే ఉత్పత్తిని ఆపేయాలని సూచించారు. ఈ రసాయనిక పరిశ్రమ యాజమాన్యం కూడా ఉత్పత్తిని ఆపేసింది. అల్లీనగరం గ్రామస్తులు ప్లాంటును మూసివేయాలన్న డిమాండుపై ధర్నా చేపట్టారు. పరిశ్రమకు తాళం వేయాలని వారు డిమాండు చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాస్తారోకో చేవారు. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయమై కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించిన చిలకపాలెం, ఎచర్లగ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతితక్కువ డబ్బుకు కూలీలు దొరికే ఈ ప్రాంతాన్ని వదులుకునేందుకు యాజమాన్యం సిద్ధంగా లేదు. రవాణా వసతి కూడా అందుబాటులో ఉంది. అందుకే యాజమాన్యం గొడవ సద్దుమణిగాక కార్మికులను ఓదార్చేందుకు సిద్ధమైంది.

సీబీఐ జేడీ లక్ష్మినారాయణపై హైకోర్టు ఆగ్రహం

వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మినారాయణపై సోమవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాతో అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని, దర్యాఫ్తు సంస్థతో మీడియాకు ఏం సంబంధమని హైకోర్టు ప్రశ్నించింది. మీడియాతో మాట్లాడటంపై ఈ నెల 9వ తేది లోగా వివరణ ఇవ్వాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ అంశంపై సిబిఐ ఖచ్చితమైన వివరణ ఇవ్వాలని సూచించింది.మీడియాతో జెడి ఫోన్‌లపై భవనం భూషణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు సిబిఐ జెడికి నోటీసులు జారీ చేసింది. కాగా మీడియాతో మాట్లాడలేదని కోర్టును తప్పుదోవ పట్టించిన సిబిఐ జెడి లక్ష్మీ నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన భూషణ్ బి.భవనం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ జెడి ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్సెమ్మెస్‌ల వివరాలను సమర్పించేలా బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్‌ను ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ప్రభుత్వ జాప్యంతో ఆంధ్రా అక్నూ మధ్య ఫీజుల పోరు?

ఉభయగోదావరి జిల్లాల్లోని 240కళాశాలలను అక్నూ(ఆదికవినన్నయ్య యూనివర్సిటీ) పరిథిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉన్నత విద్యాశాఖ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. కనీసం పెద్దగా జోక్యం కూడా చేసుకోవటం లేదు. ఈ రెండు జిల్లాల్లో 500 కోట్ల రూపాయల ఆస్తులున్న ఆంథ్రాయూనివర్సిటీ కూడా ఆ కళాశాలలను వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే 350కళాశాలలు ఆంథ్రాయూనివర్సిటీ అనుబంధంగా నడుస్తున్నాయి. వీటిలో 240 కళాశాలలను వదులుకుంటే ఆస్తులను కూడా ధారదత్తం చేయాల్సి వస్తుందని ఆంథ్రాయూనివర్సిటీ భావిస్తోంది. అందుకని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించినా ఆ 240కళాశాలలను ఫీజులు తమకే చెల్లించాలని కోరింది. ఈ నెల 15వతేదీలోపు వాటిని అందజేయాలని ఆదేశించింది. అక్నూ కూడా తమ పరిథిలోని కళాశాలలను ఈ నెల 15వతేదీలోపు ఫీజులు చెల్లించాలని కోరింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు తలపట్టుకుని కూర్చున్నాయి. ఒకవైపు ప్రభుత్వఆదేశాలు, మరోవైపు ఆంథ్రా యూనివర్సిటీతో తమ కళాశాలకు ఉన్న అనుబంధం యాజమాన్యానికి తలనొప్పి తెప్పిస్తోంది. రెండున్నర లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. తమ ఆదేశాలను కొనసాగిస్తూ మరో రిమైండర్‌ను ప్రభుత్వం పంపటం ద్వారా ఆంథ్రాయూనివర్సిటీని కట్టడి చేయాలని విద్యా రంగ సీనియర్లు కోరుతున్నారు. ఇటు కళాశాలలను, అటు అక్నూను ఆంథ్రాయూనివర్సిటీ దోషిగా చూస్తే దానికి ప్రభుత్వమే కారణమవుతుందని  వారు స్పష్టం చేస్తున్నారు. ఏమైనా ప్రభుత్వం జాప్యం చేయకుండా ఈ రెండు యూనివర్సిటీల తగవు తీర్చాలని పలువురు కోరుతున్నారు.  

ఓయూ హాస్టల్స్‌ వదలని పీజీ విద్యార్థులకు నోటీసులు

పీజీ పూర్తయినా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో హాస్టల్స్‌ను విద్యార్థులు వదలటం లేదు. దీంతో ఆగ్రహించిన యాజమాన్యం పోలీసుల సహాయంతో విద్యార్థులను ఒక నెలరోజుల్లోపు ఖాళీ చేయాలని గడువు ఇచ్చింది. సుమారు 20 రోజుల క్రితం పీజీ విద్యార్థులు హాస్టల్స్‌ ఖాళీ చేయాలని యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. దీన్ని వారు బేఖాతరు చేశారు. దీంతో ఆగ్రహించిన యాజమాన్యం మహిళా హాస్టల్స్‌లోనూ విద్యుత్తు, నీటిసరఫరా నిలిపివేశారు. దీన్ని సైతం భరిస్తూ విద్యార్థులు కొనసాగుతున్నారు. ఈలోపు కొత్తగా తమకు గదులు కేటాయించాలని ప్రవేశం పొందిన విద్యార్థులు హాస్టల్స్‌ నిర్వాహకులను కోరారు. దీనికి స్పందించిన హాస్టల్‌ నిర్వాహకులు తమకు సమయం ఇస్తే గదులు కేటాయిస్తామని, సీనియర్లు ఖాళీ చేశాక ఇది సాథ్యమవుతుందని స్పష్టం చేసింది. యాజమాన్యం దృష్టికి హాస్టల్‌ నిర్వాహకులు ఈ సమస్యను తీసుకువెళ్లారు. ముందుగా విద్యుత్తుసరఫరా నిలిపివేశారు. ఆ తరువాత నీటివసతి ఆపుజేశారు. చివరి అస్త్రంగా నోటీసులు జారీ చేశారు. అయినా సరే! విద్యార్థులు స్పందించకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నోటీసుల్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయాలని కోరారు. తమకు నెలరోజుల గడువు ఇప్పించాలని పీజీ పూర్తయిన విద్యార్థులు చెప్పటంతో హాస్టల్‌ నిర్వాహకులు అంగీకరించారు. బకాయిలు కూడా తీర్చేసి మరీ ఖాళీ చేస్తామని ఆ విద్యార్థులు హామీ ఇచ్చారు. దీంతో మరో నెలరోజుల్లో కొత్త విద్యార్థులకు గదులు కేటాయిస్తామని, అంతవరకూ ఇతర అవకాశాలు చూసుకోవాలని హాస్టల్‌ నిర్వాహకులు కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు తెలియజేశారు. కొసమెరుపు ఏమిటంటే పీజీ పూర్తయిన విద్యార్థికి ఉద్యోగావకాశాలు కూడా యూనివర్శిటీ ద్వారానే వస్తాయి కాబట్టి సర్టిఫికేట్లు వచ్చి వాటిని రిజిష్టర్‌ చేసేంత వరకూ విద్యార్థులు గడువు కోరారని తెలిసింది.

ఆస్తుల వివరాలు దాచేస్తున్న ఐపీఎస్‌లకు కేంద్రహోంశాఖ హెచ్చరిక

ఆస్తుల వివరాలను దాచేస్తున్న 550మంది ఐపీఎస్‌ అధికారులకు కేంద్రహోంశాఖ కొంచెం ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 15వతేదీలోపు స్థిరాస్తుల వివరాలు(ఐపీఆర్‌) సమర్పించకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ ఐపీఎస్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29మంది ఉన్నారు. ఇప్పటికి రెండుసార్లు (జనవరి 31, జూన్‌ 15) గడువు ఇచ్చినా మొత్తం 550మంది తమ ఆస్తుల వివరాలు పంపలేదని హోంశాఖ పేర్కొంది. 2011సంవత్సరానికి సంబంధించిన  ఐపీఆర్‌లను అధికార్లు సమర్పించలేదని వివరించింది. ఈ నెల 15లోపు ఐపీఆర్‌లను సమర్పించకుంటే పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు నిలిపేస్తామని హెచ్చరించింది. దేశంలో మొత్తం 3,325మంది ఐపీఎస్‌లు ఉన్నారని తెలిపింది. అఖిలభారత సర్వీసుల నిబంధనల ప్రకారం జనవరి 31వ తేదీకల్లా అంతకు ముందు ఏడాది ఐపీఆర్‌ను సమర్పించాలి.  ఉత్తరప్రదేశ్‌లో 317మంది, ఇంకో 81మంది ఐపీఎస్‌లు రిటర్న్స్‌ దాఖలు చేయలేదు.  కర్నాటక 76, జార్కండ్‌ 33, ఆంధ్రప్రదేశ్‌ 29, జమ్మూకాశ్మీర్‌ 26, మహారాష్ట్ర 23, హిమాచల్‌ ప్రదేశ్‌ 20,గుజరాత్‌ 18, తమిళనాడు 17, ఒడిస్సా 8 మంది ఐపీఆర్‌ సమర్పించలేదు. ఐపీఎస్‌ అధికారులు స్వచ్ఛందంగా తమ ఆస్తుల వివరాలను కేంద్రహోంశాఖకు పంపించటానికి ఎందుకు సుముఖంగా లేరన్న విషయం తెలియటం లేదు. లెక్కల్లో చూపలేనంత ఆస్తులు కూడగట్టారా అన్న ప్రశ్న వీరి చర్యలను బట్టి ఉదయిస్తోంది. ఉద్యోగి అన్న ప్రతీ ఒక్కరూ ఆస్తుల వివరాలు సమర్పిస్తుంటే ఐపీఎస్‌లు ఎందుకు మినహాయింపు కోరుకుంటున్నారు? అన్న విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఒకవేళ మినహాయింపు కోరుకుని ఉంటే కనీసం దానిపైన ఒక లేఖ అయినా రాయాలి కదా! విధుల నిర్వహణలో ఎంత మునిగిపోయినా ఈ వివరాలకు కొంత సమయం కేటాయించి నివేదించకపోతే కేంద్రహోంశాఖను కించపరిచినట్లే అని ఐపీఎస్‌లు గుర్తించాలి సుమా!  

మోడల్‌స్కూళ్ల నిర్మాణానికి ఇసుక గండం?

మోడల్‌స్కూళ్ల నిర్మాణానికి ఇసుక గండం? ఆరువేల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం! హైకోర్టు విధించిన నిషేధం వల్ల ఇసుక దొరక్క రంగారెడ్డి జిల్లాలో 19 మోడల్‌స్కూల్స్‌ నిర్మాణం ఆగిపోయింది. ఏలాగైనా ఈ విద్యాసంవత్సరంలో ఈ స్కూల్స్‌ను ప్రారంభించేయాలని నిర్ణయం తీసుకుని విద్యాశాఖ ఆరువేల మంది విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు స్వీకరించింది. ఆ ధరఖాస్తులు తీసుకున్నాక స్కూల్స్‌ నిర్మాణం పూర్తికాకపోవటంతో ప్రైవేటుభవనాల కోసం తిరిగి అవీ కుదరక విద్యాశాఖ మౌనం వహించింది. అయితే ఈ విద్యార్థులను ఏ స్కూల్‌లోనూ చేర్చకుండా తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. స్కూల్స్‌ ప్రారంభమై పాఠాలు కూడా చెప్పేస్తుంటే ఈ ఆరువేల మంది విద్యార్థుల గురించి విద్యాశాఖ ప్రత్యామ్నాయం వెదకాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈ 19పాఠశాలలు విషయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మాత్రమే జరిగాయి. ఒక్కొక్క స్కూలుకు రూ.3.02కోట్లు కేటాయించారు. 75శాతం కేంద్రం, 25శాతం రాష్ట్రం వాటాలతో స్కూలు భవనాలు నిర్మించాల్సి ఉంటే రాష్ట్రప్రభుత్వం రూపాయి కూడా మ్యాచింగ్‌ గ్రాంటూ మంజూరు చేయలేదు. మొత్తం 25 మోడల్‌ స్కూల్స్‌ను జిల్లాకు మంజూరు చేశారు. వీటిలో 19 ముందుగా ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ఇంకా కొన్ని స్కూళ్లకు భూసేకరణ కూడా జరగలేదు. లీజుకు భవనాలు దొరక్కపోవటం, ఇసుక అందుబాటులో లేకపోవటం విద్యాశాఖను ఇబ్బందుల పాలు చేస్తోంది. అటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమి చెప్పాలో అర్థం కాని స్థితిలో ఆ శాఖాధికారులు మౌనం వహించారు. దీంతో తల్లిదండ్రుల ఆందోళన నానాటికీ పెరుగుతోంది. జిల్లా అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. దీనిపై పైస్థాయిలో మాట్లాడి చర్యలు తీసుకుందామని వారు ఇచ్చిన సలహాతో విద్యాశాఖ ఎదురుచూపులు చూస్తోంది. ఈ స్కూళ్ల నిర్మాణం కోసమైనా ఇసుకపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని, విద్యార్థుల సమస్యను అధికారయంత్రాంగం త్వరగా తేల్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

ఆ రెండు బస్తాల పత్రాల్లో నేతల గుట్టు?

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో నిందితుడైన రౌడీషీటరు యాదగిరిరావు ఇంటి నుంచి ఏసిబి స్వాధీనం చేసుకున్న రెండు బస్తాల విలువైన పత్రాల్లో ఏముందీ? దీనిలో ఏమైనా రాజకీయ నేతల గుట్లు దాగున్నాయా? అన్న ప్రశ్నలు రాష్ట్రంలో సంచలనమయ్యాయి. అత్యంత విలువైన పత్రాలు లభించాయని ఏసిబి తెలపటంతో యాదగిరిరావుతో ఆర్థిక సంబంధాలున్న నేతలు గతుక్కుమన్నారు. ఈ పత్రాల ద్వారా ఇప్పటి వరకూ వెలుగుచూడని కొత్త పాత్రలను ఏసిబి తెరపైకి తెస్తుందన్న ఆసక్తి కూడా ఎక్కువైంది. సాక్షాత్తూ జ్యూడీషియల్‌ స్థాయినే మేనేజ్‌ చేయగలిగిన యాదగిరిరావు ఇంకెంత మందిని తన గుప్పెట్లో దాచారని ఆసక్తి ఆపుకోలేక ఇప్పటికే కొందరు ఏసిబి కార్యాలయంలో పని చేసే సిబ్బందిని ప్రశ్నిస్తున్నారట. అయితే విచారణ నేపథ్యంలో అన్ని విషయాలు మీడియాకు వస్తాయి కదా అని సిబ్బంది కూడా తెలివిగా సమాధానమిస్తున్నారని సమాచారం. కర్నాటక రాష్ట్రంలోని బిజెపి నేత గాలిజనార్దనరెడ్డి, ఆయన అనుయాయులు కూడా యాదగిరిరావు చిరపరిచితులే. అందుకే వారి పనులు చేస్తూ తన జీవితాన్ని కులసాగా లాక్కొస్తున్న యాదగిరిరావు గుట్టు సిబిఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కేసును ఏసిబికి అప్పగించారు. ఫలితంగా హైదరాబాద్‌ నాచారంలోని యాదగిరిరావు ఇంటిపై ఏసిబి దాడులు చేసి బెయిల్‌ కేసులో లబ్ది పొందిన రెండు కోట్ల 25 లక్షల రూపాయలను ఇంటిపై వాటర్‌ట్యాంకులో దాచుకుంటే బయటికి తీయించి ఏసిబి స్వాధీనం చేసుకుంది. ఆ ఇంటికి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో రహస్యంగా దాచిన రెండు బస్తాల పత్రాలనూ స్వాధీనం చేసుకుంది. దీంతో ఇప్పటిదాకా యాదగిరిరావును నమ్మినవారంతా హతాశులయ్యారు. ఆ పత్రాల్లో తమ వివరాలు ఉంటే వాటిని కూడా ఏసిబి పరిశీలిస్తుందని ఇప్పటి వరకూ తెరకు పరిచయం కాని పాత్రధారులు వాపోతున్నారు. యాదగిరిరావుకు ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల్లో ఉన్నతస్థాయి అధికారులతో సంబంథాలున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే యాదగిరిరావు ద్వారా లబ్ది పొందిన వారందరూ తెరవెనుక పావులు కదుపుతున్నారని తెలిసింది. ప్రత్యేకించి కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలకు ఈయనతో సంబంధాలున్నాయని కీలకసమాచారం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా ఆ పార్టీ నేతలను వణికిస్తోంది. ఈ కేసులో ఇంకెన్ని సంచలన సమాచారాలు తెలుస్తాయోనన్న ఆసక్తి మాత్రం ఎక్కువైంది.

సిండికేట్లకు సవాల్‌గా మారిన కొత్త మద్యం పాలసీ

కొత్తమద్యం విధానంతో లాటరీ ద్వారా మద్యం సిండికేట్లకు గండిపడినా అత్యధిక దుకాణాలు సిండికేట్ల కనుసనల్లోనే ఉన్నాయి. పాత సిండికేట్లతోపాటు లాటరీలో వచ్చిన వారికి కూడా మధ్యం ఈ ఏడాది అమ్మకాలు సవాల్‌గా మారాయి. ఏడాది గడువులో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుతోపాటు నిబంధనలకు లోబడి మద్యం విక్రయాలు జరపాలి. ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మాత్రమే విక్రయించాలి. అదీ ఎమ్మార్పీరేట్లకే మద్యం విక్రయించాలి. బెల్టు దుకాణాలు పెడితే లైసెన్సులు రద్దు చేస్తారు. షాపుల వద్ద విడిఅమ్మకాలు జరిగినా,అనుమతి లేని గదుల్లో తాగినా కేసులు నమోదు చేస్తారు. 21 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి మద్యం అమ్మకూడదు. ప్రస్తుత విధానం బాగున్నప్పటికి ఏదోవిధంగా అమ్మకాలు పెంచుకోవాలనుకునే సిండికేట్లకు ఈ విధానం మింగుడుపపడం లేదు. నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వానికి ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తే ఆదాయం తగ్గే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు కఠినంగానే వ్యవహరించాలనుకుంటున్నారు. షాపులన్నిటికీ ఈ నెల 1 నుండి 15 వరకు ప్రొవిజినల్‌ లైసెన్సు వుంటుంది. రుసుము చెల్లింపు, బ్యాంకు గ్యారెంటీలతో పాటు అన్నీ ఒప్పందాలు పూర్తిచేసిన 15 రోజులలో శాశ్వత అనుమతి పత్రాలను జారీ చేస్తారు. అనుమతి కాలం వచ్చే సంవత్సరం జూన్‌ 30 వరకు ఉంటుంది. లైసెన్సు ఫీజులో ఆరు రెట్లు అమ్మకాలు జరిగిన తర్వాత జరిగే అమ్మకాలపై 8 శాతం ప్రివిలైజ్‌ రుసుం 5.5 శాతం వ్యాట్‌ విధిస్తారు. ఇది ఇలా వుండగా మద్యం షాపులపై మహిళలు తిరగబడటంతో షాపు యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

సాగునీటపై తెలంగాణ మంత్రులపై పెరుగుతున్న వత్తిడి

సాగర్‌నీరు డెడ్‌స్టోరేజ్‌లో ఉన్నా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తుండడం పట్ల తెలంగాణా వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సీమాంద్ర నేతలు వారి ప్రజల ప్రయోజనం కోసం తాపత్రయ పడుతుంటే తెలంగాణా మంత్రులు  ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలంగాణా ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. మంత్రుల వైఖరి మారకపోతే వారి ఇళ్ళవద్ద ధర్ణా  చేస్తామని హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లా గొంతుఎండుతున్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ నోరు ఎత్తక పోవడం శోచనీయం అని జాక్‌ నేతలు  అన్నారు. తెలంగాణాకు సాగర్‌ నీరు విడుదల చేయకపోయినా తమ ప్రాంత  నాయకులు అభ్యంతరం తెలపకపోవడం గర్హనీయమని ఓయు జెఎసి చైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి,టీఎస్‌జెఎసి అధికార ప్రతినిధి తుంగబాలు ప్రకటించారు. అనంతరం యూనివర్సిటీ ఆధ్వర్యంలో వారు మంత్రి దిష్టి బొమ్మలు తగులబెట్టారు.కృష్ణా డెల్టాకు నీరు ఆపకుంటే మంత్రుల ఇళ్లను, డ్యామ్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పై తిరుగుబాటు ప్రకటించాలని తెలంగాణ ఓట్లతో గెలిచిన మంత్రి సుదర్మన్‌ రెడ్డి ఇక్కడి ప్రజలకు దేవుడే దిక్కు అని వ్యాఖ్యానించటం సిగ్గుచేటని వారు అన్నారు. ఇదిఇలా ఉంగా కృష్ణాడెల్టాలో నారుమళ్లు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నందువల్లే నాగార్జున సాగర్‌ నీటిని విడుదల చేయడం జరిగిందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్ధసారధి వివరణ ఇచ్చారు.. తెలంగాణ ప్రజలు దీనిని అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ విషయమై అనవసర రాద్దాంతం చేసి సమస్యను మరింత జఠిలం చేయవద్దని ఆయన కోరారు.

మెడికల్‌ సీట్ల కెటాయింపులో తెలంగాణ నాయకులు ఆరోపణ

మెడికల్‌ సీట్ల విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణా వాదులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మెడికల్‌ కాలేజీల్లోనూ మౌలిక సదుపాయాలు సరిగా  లేవని ప్రభుత్వానికి తెలిపిన మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సీమాంధ్ర వారికి మాత్రమే 150 సీట్లు  ఎందుకిచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఆంద్రయూనివర్సీటీలో మౌలిక సదుపాయాలు లేవని,దానికి హెల్త్‌ యూనివర్సిటీ సెక్రటరీ బాధ్యత స్వీకరిస్తేనే సీట్ల పెంపకానికి అంగీకరిస్తామని ఎంసిఐ గతంలో  పేర్కొంది. దానికి అంగీకరించి హెల్త్‌ యూనవర్సిటీ లెటర్‌ పంపిన తర్యాత సీట్ల జరిగింది దీన్నికూడా తెలంగాణా వాదులు తప్పుపడుతున్నారు.  విజయవాడ మెడికల్‌ కాలేజీలో రేడియాలజీ, రూరల్‌హెల్త్‌ భవనాలు లేనప్పటికీ సీట్లు మంజూరు చేయటంపట్ల వారు అభ్యంతరం తెలిపారు. గాంధీకాలేజీలో ఒపి తక్కువగా వుందని, వరంగల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ కాలేజీ రిపోర్టును తగిన సమయంలో డిఎంఇ కి ఇవ్వకపోవడం వల్ల ఆయా కాలేజీల తనిఖీకి ఎం.సి.ఐ. అధికారులు  వెళ్ళలేదు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఇది జరిగిందని  తెలంగాణా వాదులు అంటున్నారు. నిజాం కాలేజీకి సిబ్బందిని నియమించి, భవనాలు త్వరగా పూర్తిచేయగలిగితే కాలేజీ ప్రారంభమయ్యేదన్నారు. నిజాం మెడికల్‌ కాలేజి 2010 సంవత్సరంలో భవన నిర్మాణం పారంభం చేసినా ఇంకా పూర్తిచేయకపోవడంతో ఇప్పటికీ సీట్లు తెచ్చుకోలేక పోయిందని తెలిపారు. ఉస్మానియాలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా సీట్లు  పెంచలేదని అదే సీమాంద్రలో మాత్రం భవనాలు లేకపోయినా సీట్ల కెటాయింపు జరిగిందని వారు విమర్శించారు.

రంగారెడ్డి జిల్లాకే యూత్‌ కాంగెస్ర్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి

పోటా పోటీగా జరుగుతున్న యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన రవికుమార్‌ యాదవ్‌ పోటీలో ముందున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36,000 ఓట్లున్న యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి 12,000 నుంచి 13,000 ఓట్లు తెచ్చుకున్నవారు అధ్యక్షులు కావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. రాష్ట్ర స్థాయిలో బరిలో 27మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికి వచ్చిన ఓట్లను బట్టి రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటవుతుంది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 850 ఓట్లకు పైగా ఉన్నాయి. ఈ బరిలో ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ కుమారుడు రవికుమార్‌ ప్రధాన అభ్యర్థి. గతంలో ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు, జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన వంశీచందర్‌రెడ్డికికూడా జిల్లాలోని బూత్‌ కమిటీలు మద్దతు పలికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ కూడా రంగంలో ఉన్నారు. దేవినేని నెహ్రూతనయుడు అవినాశ్‌, రాష్ట్ర మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌, ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కుమారుడు పురువర్‌రెడ్డి కూడా రంగంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 11, 12 తేదీలలో జరగనున్న ఎన్నికల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది.     కొత్త విధానం ప్రకారం జిల్లా అధ్యక్షులు కాకుండా అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్‌ నియోజకవర్గం, అనంతరం రాష్ట్ర అధ్యక్ష పదవికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. సీనియర్‌ నాయకులకు మింగుడు పడని ఈ విధాన్నా యువ నేతలు ఆకళింపు చేసుకుని తమ అభ్యర్తిత్వాలను లక్ష్యంగా చేసుకుని సభ్యత్వ నమోదును చేయించడం గమనార్హం. ఈ విధంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనే పోటీ ప్రభావం నెలకొని ఉన్నది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి అభ్యర్థి రవికుమార్‌కు హోంమంత్రి సబితారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి దన్నుగా నిలుస్తున్నాడు. కార్తీక్‌రెడ్డి కోరుకుంటున్న చేవెళ్ళ పార్లమెంట్‌ స్థానంలో ఆయన అనుయాయుడు రణధీర్‌రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేవెళ్ళ పార్లమెంట్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని తలపోస్తున్న కార్తీక్‌రెడ్డికి రవికుమార్‌ యాదవ్‌కే మద్దతు తెలుపక తప్పని పరిస్థితి ఎదురవుతున్నది. రాష్ట్రఅధ్యక్ష పదవికి ప్రధానంగా రవికుమార్‌కు, మహబూబ్‌నగర్‌కు చెందిన వంశీచందర్‌ ముందున్నప్పటికీ ఓట్ల విషయంలో రాష్ట్రంలో రెండవ స్థానంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉన్నది. మొదటి స్థానంలోఉన్న నెల్లూరు నుంచి అధ్యక్షపదవి పోటీలో ఎవరూ లేరు. దీంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి. వంశీ చందర్‌రెడ్డి కోస్తా ప్రాంతం నుంచి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కనీసం 10 నియోకవర్గ్ణాల్లో పూర్తి స్థాయి మద్దతుంటే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడం ఖాయం. అయితే ఇప్పటి వరకూ పోటీ చేసే అభ్యర్థుల పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీలు మినహాయించి రాష్ట్రంలో ప్రముఖులెవరూ జోక్యం చేసుకోవడం లేదని తెలిసింది. కనుక అభ్యర్థుల అంగ, అర్థబలాలపైనే ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.