నటుడు శోభన్‌బాబు అభిమానిగా వచ్చా: సీఎం

సినిమా పరిశ్రమ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం మద్దతిస్తుందని, ఆ సంగ తి చెప్పేందుకే వచ్చానని సీఎం కిరణ్ అన్నారు. తనకు శోభన్‌బాబుతో పరిచయం లేకపోయినా ఆయన అభిమానిగానే హాజరయ్యానన్నారు. శోభన్‌బాబు, తాను హీరోలు కాక ముందునుంచే మంచి మిత్రులమని, ఆయనతో తొలి పరిచయం రైల్లో జరిగిందని హీరో కృష్ణ చెప్పారు. తన 'తేనె మనసులు' సినిమా గురించి చెబితే పెద్ద హీరో అవుతావని ఆశీర్వదించినట్లు తెలిపారు.   సెక్యూరిటీ వాళ్లు అతి చేయడంవల్ల ఇబ్బందులకు గురైన వీవీఐపీలకు మా బావ శోభన్‌బాబు అభిమానుల తరఫున క్షమాపణలు చెబుతు న్నాను అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. శోభన్‌బాబు వజ్రోత్సవం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శనివారం రాత్రి వైభవంగా జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడారు. "రాముడు వనవాసానికి వెళ్లినా తిరిగిరాగానే ప్రజలు పట్టాభిషేకం చేశా రు. శోభన్ నటనకు దూరమైనా ఆయన అభిమానులు ఇలాంటి వేడుక చేయడం ఆనందంగా ఉంది. దిలీప్‌కుమార్ తర్వాత ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడు శోభన్. ఒకే ఏడాది ఎనిమిది శతదినోత్సవ చిత్రాలిచ్చిన హీరో అని ప్రశంసించారు.

తెలంగాణా,ఆంధ్ర నీటిగొడవలు

దేన్నయినా రాజకీయం చేయగల తెలంగాణానాయకులకు మరో ఆయుధం దొరికింది. ఋతుపవనాలు రాక, వర్షాలకోసం చూచి చూచి వేసారిన కృష్ణా డెల్టా  రైతులు, వారు వేసిన నారుమళ్లు ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నీరు విడుదల చేయమని కోరారు. వారి అభ్యర్థనమేరకు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు అంగీకరించింది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు నారుమడులకు నీరు వస్తుందని  ఆనందించేలోపే తెలంగాణానాయకులు డెల్టాకు నీరందించడాన్ని తెలంగాణ,ఆంద్రా నీటి రగడగా చిత్రీకరించారు. ఒక వేళ అదే జరిగితే అన్నపూర్ణగా విలసిల్లే ఆంధ్రప్రదేశ్‌  పట్టెడన్నం దొరకని దుర్బిక్షాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది. ఇప్పటికే క్రాప్‌ హాలిడే ప్రకటించి సంగం మందిరైతులు పంట పండిరచడంలేదు. మిగతా రైతులకు గోరిచుట్టుమీద రోకలిపోటులా నాయకులు తెలంగాణ రాజకీయాలకు తెరలేపారు. వారు కేవలం రాజకీయాలకే పరిమితం  కాకుండా సాదాసీదా ప్రజలకొరకు కూడా ఆలోచించ వలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రతో ఉన్న నీటి గొడవలు చాలవన్నట్లు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర నీటిగొడవలు మొదలయ్యాయి. తెలంగాణాను ఎండబెట్టి కృష్ణాడెల్టాకు నీళ్లా అంటూ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని లేదంటే టిఆర్‌యస్‌ ఎమ్మేల్యేలంతా వెళ్లి నీటి విడుదలను అడ్డుకుంటామని టిఆర్‌ యస్‌ శాసనసభ ఉపపక్షనేత హరిశ్‌రావు హెచ్చరించారు. కృష్ణాడెల్టాకు 15 టియంసిల నీటిని విడుదల చేస్తూ తెలంగాణాకు దేవుడే దిక్కు అని వాఖ్యానించిన భారీ నీటి పారుదల మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. తెలంగాణా మంత్రులందరూ జరుగుతున్న  నీటి వివక్షకు ఎందుకు స్పందించడంలేదని అక్కసు వెళ్లగక్కారు. సీమాంద్రనాయకుల వల్లే ఇదంతా జరుగుతుందని తెలంగాణా ప్రజల గొంతు తడవకుండా ఇక్కడి నీళ్లు తరలించుకుపోతున్నారన్నారు. సీమాంద్రకు వెళ్లే సాగర్‌ కుడి కాలువకే నీరు విడుదల చేసి ఎడమకాలువకు ఎండబెడుతున్నారన్నారు.  కాగా సాగర్‌ రిజర్యాయర్‌లో 511 క్యూబిక్‌ మీటర్‌ లెవల్‌ వరకు మాత్రమే నీళ్లున్నాయని దానిలో ఒక అడుగు తగ్గినా హైదరాబాద్‌కు నీళ్లుండవని వివరించారు. నల్గొండ, మహబూబ్‌నగర్‌,హైదరాబాద్‌లకు తాగు నీరుండదని వెల్లడిరచారు. అయితే ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని  హామీ ఇచ్చింది. ప్రతియేటా సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు జూన్‌ మొదటి వారంలోనే నీరు ఇస్తామని  ఈ సారి జాప్యం అయిందని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు.  

జగన్ పార్టీలోకి పెరిగిన వలసలు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మరిన్ని వలసలు, కులరాజకీయాలతో పార్టీలలో చిచ్చు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తనయుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టినప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వివిధ పార్టీల నుండి వలసల పర్వం ఆనాడే ప్రారంభమయ్యింది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలే కాకుండా ఎన్ని ఆంక్షలు విధించినా అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు సైతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆ ఎమ్మెల్యేలపై అధికార కాంగ్రెస్‌ పార్టీ కక్షసాధింపు చర్యలు చేపట్టడం, అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం లాంటి చర్యల ఫలితంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెరిగిన సానుభూతి నేపధ్యంలో యిటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు జగన్‌ పార్టీకి పట్టంకట్టడంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సైతం నివ్వెరపోయింది. కేంద్ర ప్రభుత్వం కుటిల రాజకీయలు, రాష్ట్ర ప్రభుత్వంలో నాయకత్వ లోపం, వర్గ విభేదాలు, అమలువుతున్న ప్రజావ్యతిరేక విధానాలు ఫలితంగా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిరది. దివంగత నేత వైఎస్‌ఆర్‌ హయాంలో వివిధ సంక్షేమ పధకాల ఫలాలను పేదలు అనుభవించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని నాయకులు ప్రజాసమస్యలు విస్మరించి, ఆధిపత్య పోరుతో ప్రజా పాలన పట్ల వైఫల్యం చెండటంతో విసుగు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యమ్నాయంగా తమ రాజకీయ మనుగడ కోసం జగన్‌ స్ధాపించిన వైఎస్‌ఆర్‌ సిపిలోకి పోతున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే జగన్‌ పార్టీ ప్రభావం ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందిగా మారిందంటే అతిశయోక్తి కావు.     సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి రాజకీయ ఆరంగ్రేట్రంతో ప్రారంభమైన కుల రాజకీయల చిచ్చు నేడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు అంటుకుంది. గతంలో ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ టిడిపిని స్ధాపించినా, అనంతరం  రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేసేందుకు చంద్రబాబు కృషి చేసినా, అప్పట్లో ఈ సామాజిక వర్గాల గోల, కుల రాజకీయాల పోరు, ఎక్కడా వినపడలేదు. అయితే నేటి  రాజకీయ పరిస్ధితులను అధ్యయనం చేస్తే పెరిగిన కుల చిచ్చు ఆయా పార్టీల ఉనికికి భంగం కలిగించే ప్రమాదం కూడా ఉందని   పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. యిదిలా ఉంటే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మాత్రమే మద్ధతివ్వాలని, అలాగే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే మద్ధతివ్వాలని ఆయా పార్టీల అధినేతలు వారి వారి పార్టీలకు దిశనిర్ధేశాలను ఖారారు చేసుకుంటే, మరి భవిష్యత్‌లో ఆయా పార్టీల రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల నియంత్రణలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయనే విషయం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పూర్తిగా తెలిస్తే భవిష్యత్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరిన్ని రాజకీయ వలసలు పోయే ప్రమాదం లేకపోలేదని ప్రజలంటున్నారు.

ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 40 మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లాలోని నాగార్జున ఆగ్రో కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది. ఈ పేలుడు సంభవించిన సమయంలో సుమారు 200 మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎంత మంది మృతి చెందారో అధికారింగా ధృవీకరించలేదు. కాగా ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలియవచ్చింది. ఫ్యాక్టరీలోని ఐదో బ్లాక్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. నాలుగో బ్లాక్‌కు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇందులో 15 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.   సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 10 కిలో మీటర్ల మేర ఆంక్షలు విధించారు. కాగా ఫ్యాక్టరీలో ఒకదాని నుంచి మరో రియాక్టరుకు మంటలు వ్యాపించి వరుసగా పేలుతుండడంతో మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని యాజమాన్యం తెలపటంతో చుట్టుప్రక్కల ప్రజలను అధికారులు ఖాలీ చేయిస్తున్నారు.

జగన్‌ మద్దతు ప్రణబ్‌ కేనా ?

రాష్ట్రపతి ఎన్నికలో వై.ఎస్‌.ఆర్‌ .కాంగ్రెస్‌ పార్టీ శానన సభ్యులు, ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులు యు.పి.ఎ. అభ్యర్ది  ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ కే మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. నిజానికి వీరు ప్రణబ్‌ కు మద్దతు ఇవ్వకపోయినా ఆయన గెలవడం ఖాయం. అయితే అత్యధిక మెజార్టీతో ఆయన్ని  గెలిపించాలన్న ఉద్దేశ్యంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. దీనిలో భాగంగానే ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ చంచల్‌ గూడా జైలులో ఉన్న జగన్‌ను కలిసి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని కోరారు. మతతత్వ పార్టీ అయిన బి.జె.పి. మద్దతుతో పోటీ చేస్తున్న సగ్మాకుకి ఎట్టి పరిస్ధితుల్లోనూ  మద్దతు ఇవ్వవద్దని కోరారు. ఇది జరిగిన కొద్ది రోజులకు సంగ్మా చంచల్‌ గూడా జైలులో ఉన్న జగన్‌కు కలిసి మద్దకు కోరడానికి ప్రయత్నించారు. అయితే జగన్‌కు కలుసుకునేందుకు జైలు అధికారులు అంగీకరించకపోవడంతో ఆయన విజయమ్మను కలిసి మద్దతు కోరారు. పార్టీనాయకులతో కలిసి తమ నిర్ణయం తెలియజేస్తామని ఆమె చెప్పారు. కాని జగన్‌ మాత్రం గత్యంతరం లేని పరిస్ధితుత్లో యు.పి.ఎ. అభ్యర్ది ప్రణబ్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో యుపిఎ అభ్యర్దికి మద్దతు ఇవ్వకపోతే సి.బి.ఐ కేసుల్లో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన భయపడుతున్నట్లు తెలిసింది. బెయిల్‌పై బైట పడేదాకా జాగ్రత్తగా ఉండాలని, అసదుద్దీన్‌ ఒవైసీ కోరినట్లు గానే ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది.

జగన్‌పై జోరు పెంచిన జైలు అధికారులు

జగన్‌ బెయిల్‌పై గురువారం సిబిఐకి, జగన్‌ న్యాయవాదులకు మద్య సీబీఐ కోర్టులో జరిగిన వాదనల తర్వాత జగన్‌తరపు న్యాయవాది రాంజెఠ్మలానీ జగన్‌ను చంచల్‌గూడా జైలులో కలిసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్‌కు కనీస సదుపాయాలు కల్పించటంలో జైలు అధికారులు విఫలమవుతున్నారన్నారు. తన క్లయింటు రాజకీయ నాయకుడని అతనికి మరింత స్వేచ్చనివ్వాలని, అండర్‌ ట్రయిల్‌ ఖైదీలకు కొన్ని సదుపాయాలను రాజ్యాంగం కల్పించిందని ఆయన అన్నారు. అవి జైలు అధికారులు కాలరాస్తున్నారని అందుకు నిదర్శనంగా జగన్‌కలిసేందుకు రాష్ట్రపతి అభ్యర్దిగా రేసులో ఉన్న పిఎ సంగ్మా, జగన్‌ బాబాయి వివేకానందలకు జైలు అధికారులు అనుమతించని విషయాన్ని రాంజెఠ్మలానీ గుర్తుచేశారు. మొదట  వారానికి మూడు ములాఖత్‌లకు ఒప్పుకున్న జైలు అధికారులు సాక్షీ మీడియా సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అధికారిక సెల్‌ఫోన్‌ నుండి వెళ్లిన  కాల్‌లిస్టు బహిర్గతం చేసిన తర్వాత  జగన్‌కు వారానికి రెండు మిలాఖత్‌లు మాత్రమే మంజూరు చేయటం గమనించాల్సిన విషయం.శుక్రవారం ములాఖత్‌ సందర్భంగా జగన్‌ కుటుంబ సభ్యులు కలిశారు. జైల్లో జగన్‌ ఉల్లాసంగా ఉత్సాహంగానే ఉన్నారని తెలిసింది.

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్లు: 22 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన భారీ ఎన్ కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా స్టేషన్ బసాగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు సీఆర్‌పీఎఫ్ జవానులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రామ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు, మావోయిస్టులకు మధ్య సమావేశం జరుగుతున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. పోలీసుల అదుపులో ఓ మావోయిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నారాయణపూర్ జిల్లా అబూజ్‌మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్‌లు, నాలు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.

దేశం దివాళా తీస్తోందా?

నిజమే భారతదేశం దివాళాతీయనుంది. ఇది ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్తు ఆర్ధినిపుణులు దేశం ఎదుర్కొవలసిన గడ్డు పరిస్థితిని వివరిస్తూ చేసిన ప్రకటన. మన దేశంలోని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోతే ఏర్పడే పరిస్థితుల గురించి చెబుతున్న మాట. కాలంచెల్లిన ఆర్ధికవిధానలతో ఏర్పడే పతనావస్థ. రెండు దశాబ్ధాలతో పోలిస్తే ఈ ఏడాది మరీ ఘోరంగా వుంది. పైపైన డాంబికాలు పలికినా ప్రభుత్వం నానా కష్టాలు పడుతుంది. జనవరి -మార్చి మద్య ఎకనామిక్‌ గ్రోత్‌ 8.4 శాతం ఉంటే ఏప్రిల్‌ -జూన్‌ మద్యకాలంలో 7.7 శాతానికి దిగిపోయింది. ఇందుకు ఎన్నోకారణాలు చూపుతుంది మన ప్రభుత్వం. దానిలో కొన్ని వడ్డీరేట్లు ఎక్కువచేయడం, డాలర్‌తోచూస్తే రూపాయివిలువ పడిపోవడం, ఇన్వెస్టిమెంట్లు ,ఎగుమతులు మందగించడం చెప్పుకుపోతే చాలానే ఉన్నాయి. ద్రవ్యలోటే మన కొంపముంచుతుంది. దీనికి కారణం ప్రణబ్‌ దాదా అనే చెప్పక తప్పదు. రెండకెల స్దాయిలో కదలాడిన ద్రవ్యోల్బణం రిజర్వ్‌బ్యాంకుకు సమస్యలు తెచ్చిపెట్టింది. లిక్వడిటీ, ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూడటం రిజర్యుబ్యాంకు బాధ్యత.        ప్రస్తుత పరిస్థితుల్లో ధరలను కట్టడిచేస్తూ వృద్దికి చర్యలు తీసుకోవడం ఆర్‌బిఐకు తలకు మించిన భారంగా తయారయ్యింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 57.92 స్థాయి తాకింది. ఏడాది వ్యవధిలో రూపాయి ఇప్పటివరకూ 21 శాతం క్షీణించింది. దీనివల్ల దిగుమతుల బిల్లు పెరిగింది. ఇప్పటికీ కళ్లు తెరవకపోతే దారుణపరిణామాలను ఎదుర్కొవలసిందేనని ఆర్ధికనిపుణుల హెచ్చరిక.  వరుణదేవుడి కరుణలేక రైతులూ, ఉద్యోగాలులేక యువత, జీతాలకీ ఖర్చులకీ సయోధ్యకుదరక సామాన్యులు బ్రతుకు భారంగా వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే  అమెరికా, యూరప్‌ దేశాల  ముందుచూపులేని  ప్రణాళికల వల్ల ఆర్ధికవ్యవస్త కుప్పకూలింది. లండన్‌లో మరోమూడేళ్లకి సగటు కుటుంబ ఆదాయం ఏడాదికి ఏడువేల పౌండ్లకన్నా తక్కువగా పడిపోతుందని హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌ అక్కడి ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఏదిఏమైనా మన రూపాయిని స్ధిరంగానిలబెట్టే చర్యలు ఆర్ధికమంత్రిగా కూడా ఉన్న మన్‌మోహన్‌సింగ్‌ తీసుకుంటారని ఆశిద్దాం. 20 ఏళ్లక్రితం దేశంలో   ఉన్న ఆర్ధిక సమస్యలే దాదాపుగా ఇప్పుడు ఉన్నాయి. అప్పటిలా అంతర్జాతీయంగా బంగారం తాకట్టు పెట్టేంత పరిస్థితి లేకపోయినా పరిస్థితులు తీవ్రంగానే ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. మన్మోహన్‌ మరోసారి తన సత్తాచాటి దేశాన్ని ఆర్ధికస్వావలాంబన దిశగా నడిపిస్తారని ఆశిద్దాం.

ఆసక్తి పెంచుతున్న లక్కు కిక్కు

 మద్యం నూతనపాలసీకి ‘లక్కు`కిక్కు’ పేరిట మంచి ప్రచారమే లభించింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ లక్కు`కిక్కు గురించే చర్చలూ నడిచాయి. లక్కీడీప్‌ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించటం రాష్ట్రప్రజలకు ఆసక్తిని కలిగించింది. మద్యం దుకాణాలు మహిళల పేరిట ప్రకటించటం కూడా ఇదే తొలిసారి. వీరు కుటుంబసమేతంగా ఈ లక్కీడ్రాకు హాజరవటం కూడా పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రోజంతా కష్టపడి అలిసిన వారికి మద్యం ఉపశమనం కలిగించేది. ఇది గతం. ఇప్పుడు మారిన కాలంతో పాటు మారే పరిస్థితులను గమనిస్తే మద్యం తాగటం ఒక ఫ్యాషన్‌ అయింది. విదేశీసంస్కృతిని అనుసరించే యువత రాత్రయ్యేటప్పటికి మద్యం సేవిస్తున్నారు. ఆ మత్తులో ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా మద్యం మాత్రం ఒక నాగరికతగా భావిస్తున్నారు. అన్ని వయస్సుల వారు తాగేస్తున్నారు.  ప్రత్యేకించి 5శాతం భారతీయ మహిళలు కూడా ఈ మద్యానికి బానిసవుతున్నారని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. దీంతో అన్ని వ్యాపారాల్లోకి మద్యం ఒక్కటే లాభసాటి. ఇందులో కేసులు ఎదుర్కొన్న పాత సిండికేటులోని వ్యాపారుల లాభమే నూరుశాతం దాటి సంపాదించటం చిన్నవ్యాపారులను ఆకర్షించింది. చిన్నకాంట్రాక్టులు చేసేవారు, వ్యాపారులు తమ లక్కు పరిశీలించుకోవటానికి ధరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం పలుప్రాంతాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యాపారంతో తమ జాతకం మార్చుకోవాలనుకున్న వారి బలహీనతను జ్యోతిష్కులూ సొమ్ము చేసుకున్నారు. ఆ లక్కు నీకే ఉందోయ్‌! భేషుగ్గా ధరఖాస్తు చేసుకో అంటూ జ్యోతిష్కులు కొందరిని ప్రోత్సహించారు. అలానే నీ పేరు కాకుండా మీ సతీమణి పేరు పెట్టేయ్‌ లక్కు నీదేనోయ్‌ అని సెలవిచ్చిన జ్యోతీష్కులూ ఉన్నారు. వీరి ప్రోద్బలం క్యూను పెంచిందని ఎక్సయిజ్‌ సిబ్బంది తెలిపారు.       గతంలో కన్నా ఈ ఏడాది మద్యం దుకాణాల కేటాయింపు చాలా కష్టతరమైందని ఎక్సయిజ్‌ సిబ్బంది స్పష్టం చేశారు. అయితే లక్కు కొద్దీ తమకు దుకాణం వస్తే వెంటనే సొమ్ము చేసుకోవటానికి పాతమద్యం వ్యాపారికి అమ్ముడుపోయేందుకూ కొందరు సిద్ధమయ్యారు. కొందరైతే పాత వ్యాపారి పేరును పార్టనర్‌గా చూపుతూ ధరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఖమ్మం ఏజెన్సీలో మాత్రం పీసా చట్టం ప్రకారం దుకాణాలు కేటాయించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడ 71దుకాణాలకు లాటరీ నిలిచిపోయింది. మళ్లీ జాబితా పరిశీలించి అర్హులను నిర్ణయిస్తామని ఎక్సయిజ్‌ సిబ్బంది ధరఖాస్తుదారులను తిప్పి పంపించారు. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో 212దుకాణాలకు గాను 354 ధరఖాస్తులు అందాయి. వీటిలో 154దుకాణాలకు  మాత్రమే లాటరీ తీయవచ్చు. మిగిలిన 81 దుకాణాలకు ఒక్క ధరఖాస్తు వచ్చింది. మొత్తంగా పరిశీలిస్తే ఈ ధరఖాస్తులను బట్టి 71దుకాణాలకే పోటీ ఉంది. ధరఖాస్తులు అందని దుకాణాలకు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఎక్సయిజ్‌ కమిషనర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని పాతమద్యం సిండికేట్లు కొత్తయోచన చేశాయి. మొత్తం దుకాణాల కేటాయింపు పూర్తయ్యాక ప్రాంతాల వారీగా పార్టనర్‌గా చేరి వ్యాపారం సొంతం చేసుకోవాలని వారు ఉబలాటపడుతున్నారు.

నకిలీ విత్తనాల వ్యాపారిపై నందిగామరైతుల ఆగ్రహం?

నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వ్యాపారిపై కృష్ణాజిల్లా నందిగామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాపారిపై చర్యలు తీసుకోకుంటే తమ ఆందోళన తీవ్రతరమవుతుందని రైతులు అధికార్లను హెచ్చరించారు. నందిగామ నల్లబజారులో మైకోకంపెనీకి చెందిన నీరజ పత్తివిత్తనాలు మొలకెత్తకపోవటంతో రైతులు వ్యాపారి ఆదినారాయణను కలిశారు. ఆయన కోపంగా రైతులను దూషించారు. దీంతో అగ్గిమీద గుగ్గిలంలా శాంతిభద్రతల సమస్యలా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి రైతులను ఎమ్మార్వో కార్యాలయానికి రావాలని కోరారు. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో బి.శ్రీనివాసరావు, వ్యవసాయాథికారి ఖాసిం, ఎస్‌ఐలకు రైతులు తమ గోడు వినిపించుకున్నారు. తమకు ఆదినారాయణ 41నీరజ్‌ డబ్బాలను రూ.2750, కొన్నింటిని రూ.1750కు అమ్మారని తెలిపారు. పర్మిట్ల ప్రకారం తాము కొన్న విత్తనాలు మొలకెత్తినా, ఆదినారాయణ అమ్మిన విత్తనాలు మొలకెత్త లేదని వివరించారు. వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే రైతుల ఆందోళనను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు అధికార్లను హెచ్చరించారు.

లెక్కతేలని ఆ 49 యూనిట్ల సూదిమందు చేతివాటమేనా

అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రి అక్రమాలకు నెలవుగా మారింది. ఇక్కడ డయాలసిస్‌ తరువాత మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు చేసే సూది మందులో 49యూనిట్లు లెక్కతెలియకుండానే మాయమైంది. ఒకవేళ ఇక్కడికి వచ్చే రోగులకు ఇచ్చి ఉంటే రిజిష్టర్‌లో బంధువుల సంతకాలైనా కనిపించేవి. ఎటువంటి సంతకాలూ లేకుండా ఈ యూనిట్లు ఎలా కాజేశారనే అంశంపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సూదిమందు యూనిట్‌కు రూ.1200 ఖర్చు అవుతుంది. అంతఖరీదైన సూది మందు ఏమైందని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ప్రధానస్టోరు నుంచి రెండు విడతలుగా ఈ సూదిమందును 432 యూనిట్లు పంపిణీ చేశారు. డయాలసిస్‌ తరువాత రోగికి అక్కడే సూది మందు చేస్తారు. అప్పుడు బంధువులు రిజిష్టర్‌లో సంతకం చేస్తారు. ఒకవేళ బయటకు ఇచ్చినా కూడా బంధువుల సంతకం రికార్డు అవుతుంది. సూదిమందు పంపిణీకి, వాడకానికి మధ్య వ్యత్యాసం 49యూనిట్లు కొట్టొచ్చినట్లు కనిపించటంతో కలెక్టర్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.

నిఘా పెంచినా ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్‌

ఒకవైపు తమిళనాడు, మరోవైపు కర్నాటక రాష్ట్రాలకు ఆంధ్రాలోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలు చేరువగా ఉన్నాయి. అందుకే ఈ మూడు జిల్లాలకు ఆ రెండు రాష్ట్రాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు వలస వస్తూనే ఉన్నారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు తుపాకులతో తిరగటం, పోలీసులతో ఎదురుకాల్పులకు దిగటం ఈ మూడు జిల్లాల్లో సంచలనమైంది. దీంతో అటవీశాఖ స్మగ్లర్లను అరెస్టు చేస్తోంది. అలానే కేసులతో వారిని కట్టడి చేస్తోంది. ఈ రెండు చర్యలతో పాటు అటవీప్రాంతాల నుంచి ఈ మూడు జిల్లాల్లోకి ప్రవేశించే వాహనాల తనిఖీలూ ముమ్మరం చేసింది. ఇలానే అనంతపురం జిల్లా తలపుల వద్ద కుర్లి అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది ముమ్మరంగా తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం లోడున్న లారీని కొందరు దుండగులు చింతవనంలో వదిలేసి పారిపోయారు. ఎపి02యు9041 నెంబరు ఉన్న ఆ లారీలో పైభాగాన్న అరటిగెలలు వేశారు. వాటి అడుగు భాగాన్న 300 ఎర్రచందనం దుంగలను ఉంచారు. దీని విలువ చాల ఎక్కువని కదరి వెళ్లాక లెక్కలేస్తామని అటవీశాఖ ఆ లారీని తీసుకువెళ్లింది. ఈ సంఘటన స్మగ్లర్లు ఆంధ్రాకు వలస రావటానికే ఇష్టపడుతున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అయితే వీరి ఆగడాలకు చెక్‌ చెప్పటం కోసం అటవీశాఖ ఇంకా శ్రమించాల్సిందే. ఎర్రచందనంకు ఉన్న డిమాండు కూడా ఒకేసారి ఎక్కువడబ్బులు సంపాదించాలన్న కాంక్ష ఉన్నవారిని స్మగ్లర్లుగా మారుస్తోంది. వారిని అదుపు చేసి ప్రత్యామ్నాయంగా ఉపాథిదారికి మళ్లించే దిశలో ప్రభుత్వం యోచించి ప్రయత్నించాలని సూచనలు వస్తున్నాయి.

మార్కెట్టుయార్డులో లైసెన్స్‌ ముడుపుల మేళా

ప్రపంచస్థాయి గుర్తింపునందుకున్న గుంటూరు మిర్చి మార్కెట్టుయార్డులో కమిషన్‌ లైసెన్స్‌లు పొందేందుకు కొత్తవ్యాపారులు భారీగా ముడుపులు చెల్లిస్తున్నారు. యార్డులో నిబంధనల ప్రకారం కొత్తగా కమిషన్‌ లైసెన్స్‌ మంజూరు చేయడానికి వీలుపడదు. అందుకని కొత్తవ్యాపారులు ముందుగా పాతవారి లైసెన్స్‌ల్లో భాగస్వాములుగా చేరి ఆ తరువాత తమ పేరిట మార్చుకునేందుకు ముడుపులు చెల్లిస్తున్నారు. మార్కెట్టులో ఉన్న డిమాండును బట్టి 10 నుంచి 25లక్షల రూపాయల వరకూ ఈ లైసెన్స్‌ ముడుపులు చెల్లిస్తున్నారు. ఇలా పాతలైసెన్స్‌ల్లో మార్పుల ద్వారానే కాకుండా ప్రయత్నిస్తే పోయేదేమీ లేదన్నట్లు మార్కెట్టుయార్డు ఉద్యోగులు కొత్తగా 7లైసెన్స్‌లు మంజూరుచేశారు. వీటిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. యార్డు ఇన్‌ఛార్జి పదవీవిరమణ త్వరలో ఉన్నందున ఈ అక్రమాలకు తెరలేపారు.

తాడిపత్రిలో ఎరువుల శాంపిల్స్‌ సేకరణలో నాటకం?

అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో తాడిపత్రి ఓ పెద్ద జంక్షన్‌. ఇక్కడ ఎరువుల వ్యాపారం మూడుపువ్వులూ ఆరుకాయలులా విరాజిల్లుతోంది. వ్యాపారులూ అక్రమాలకు పెట్టింది పేరుగా చెలమణి అవుతున్నారు. వీరి ఆగడాలు అరికట్టాల్సిన వ్యవసాయాధికారి ఏడేళ్లుగా ఇక్కడే ఉంటూ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. అసలు మామూలుగా అయితే ఈయన తనిఖీ చేయరు. ఒకవేళ ఎవరి ఒత్తిడిపైనైనా తనిఖీ చేస్తే మాత్రం నాణ్యమైన ఎరువులనే శాంపిల్స్‌గా సేకరించి పరిశీలనకు పంపిస్తారు. ఈ శాంపిల్స్‌ నాటకంలో నాణ్యమైన దాని పక్కనే ఉన్న కల్తీ ఎరువుల శాంపిల్‌ అసలు సేకరించరు. ఒకవేళ సేకరించినా పైకి మాత్రం పంపించరు. వ్యాపారులతో కలిసిపోయిన ఈ అధికారి గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. దీంతో ఇక్కడ రైతుల గోడు అరణ్యరోదనే అవుతోంది. మంత్రులు హెచ్చరించినా అధికారి వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ఇటీవల విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు నిర్వహించి రెండు షాపుల్లో స్టాకును సీజ్‌ చేశారు. అయినా సరే వ్యాపారులు బరితెగించినట్లు ఎరువులను ఎంఆర్‌పి కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీనిపై ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి. ముందు వ్యవసాయాధికారినైనా మార్చండి లేదా వ్యాపారులనైనా కట్టడి చేయాలని జిల్లా అధికార్లకు రైతులు మొరపెట్టుకుంటున్నారు.

గుంటూరులో గుబులురేపుతున్న క్లీనికల్‌ ల్యాబ్‌లు

గుంటూరులో క్లీనికల్‌ల్యాబ్‌లు రోగులకు గుబులుపుట్టిస్తున్నాయి. ఉన్న జబ్బు లేనట్లుగానూ, లేని జబ్బు ఉన్నట్లుగానూ తప్పుల తడకల రిపోర్టులను అందిస్తున్నాయి. ఇటీవల ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు ఎయిడ్స్‌ ఉన్న దంపతులు వెళితే వారికి క్లీన్‌చిట్‌ లభించింది. హెపటైటీస్‌`బి లేకపోయినా ఉన్నట్లు ఒక క్లీనికల్‌ల్యాబ్‌ నివేదిక ఇచ్చేసింది. దీంతో ఈ బాధితుడు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిని కలిసి ఫిర్యాదు చేశాడు. తమ వ్యాపారం పెంచేందుకు వైద్యులకు 30శాతం ఆఫర్‌ చేస్తున్న ల్యాబ్‌లు, డయోగ్నోస్టిక్‌ సెంటర్లు కోట్లు సంపాదించాలనే కసి కొద్దీ పని చేస్తున్నాయి. జిల్లాలో 500 ల్యాబ్‌లు, డయోగ్నోస్టిక్‌ సెంటర్లున్నాయి. ఇంకా ఆసుపత్రులకు అనుబంధంగా 400ల్యాబ్‌లు పని చేస్తున్నాయి. మొత్తం 900 ల్యాబ్‌ల్లో 660సెంటర్లను స్మాల్‌స్కేల్‌ కింద, 200 సెంటర్లను మీడియం కింద, 20 సెంటర్లను లార్జ్‌ స్కేల్‌ కింద గ్రేడిరగ్‌ చేశారు. ఈ గ్రేడిరగ్‌లో కూడా రోజుకు వంద వరకూ పరీక్షలు నిర్వహించేవాటిని స్మాల్‌ కింద, 505 వరకూ పరీక్షలు చేసేవాటిని మీడియం కింద, ఆపైన  ఎక్కువ పరీక్షలు చేసేవాటిని లార్జి కింద గుర్తించారు. అయితే ఈ సెంటర్లను జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో రిజిస్టర్‌ చేసుకుని ఆయన సూచనల ప్రకారం నడపాలి. ఇప్పటి వరకూ అటువంటి గుర్తింపు పొందిన ల్యాబ్‌ ఒక్కటి కూడా లేదని  ప్రచారమైంది.

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి పట్టాభిరామారావు

 బెయిల్ ఫర్ సేల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన మాజీ జడ్జి పట్టాభిరామారావును రెండు రోజుల ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం ఉద యం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు, న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగనుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పట్టాభిని ఏసీబీ ప్రశ్నించనుంది.  గాలి బెయిల్ వ్యవహారంలో పట్టాభి రామారావునే అంతిమ లబ్ధిదారని ఏసీబీ కోర్టుకు తెలిపింది. పట్టాబి రామారావుతో సంప్రదింపులు జరిపింది ఎవరో తేలాలంటే కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇప్పటికే ఈ కేసులో పట్టాభి కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్‌ జడ్జి చలపతిరావులను కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. కాగా పట్టాభి రామారావును విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం జైలుకు తరలించాలని కోర్టు ఏసీబీని ఆదేశించింది.

వన్యప్రాణి విభాగానికి సవాల్‌గా నిలిచిన అనంతపురం రైలు ప్రమాదం

వన్యప్రాణి విభాగానికి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం అనంతపురం వద్ద రైలు ప్రమాదం పెనుసవాల్‌గా మారింది. ఈ ప్రమాదంలో ఒక చిరుత, 350గొర్రెలు ఒకేసారి మృతిచెందాయి. అసలే చిరుత జాతి అంతరిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో ఈ సంఘటన వన్యప్రాణివిభాగాన్ని కలవరపెట్టింది. ఒక్కసారిగా 350గొర్రెల మందను వేటాడేందుకు చిరుత రైల్వేలైనుపైకి చేరుకుంది. ఆ మందపై సరిగ్గా చిరుత దూకేసమయానికి ఎక్కడ నుంచో వచ్చిన రైలు ఆ వన్యప్రాణుల ప్రాణాలు హరించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం అనంతపురం వద్ద వేసిన రైల్వేలైను దాదాపు అడవి మధ్యలోనే ఉన్నట్లుంటుంది. వన్యప్రాణులు ఈ లైనుపైకి రాకుండా ఎటువంటి భద్రతాచర్యలూ తీసుకోలేదు. అవి అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఈ లైనుపైకి వచ్చి పోతుంటాయి. అలానే వచ్చి రైలు ఢీకొనటంతో ప్రాణాలు వదిలేశాయి. ఇది వన్యప్రాణి ప్రేమికులను బాధించింది. ప్రకృతి సమతుల్యతకు ఇటువంటి సంఘటనలు గొడ్డలిపెట్టువంటివని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.     చిరుత జాతి రానురాను అంతరించిపోతోందని, అవి జీవించే స్వచ్ఛమైన వాతావరణ పరిస్థితులు రానురాను తగ్గిపోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్‌టైగర్‌’ అన్న నినాదాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా చిరుతను చంపుతామంటే వద్దని చెప్పాలని వన్యప్రాణివిభాగం కోరుతోంది. అందుకే ఇటీవల తిరుపతి కాలిబాటపై చిరుత ఓ వ్యాపారిని గాయపరిచినా గస్తీ పెంచుతాం కానీ, చిరుతను మాత్రం చంపబోమని అటవీఅథికార్లు స్పష్టంగా తమ నిర్ణయం తెలియజేశారు. బోను వంటివి కూడా అవసరం లేదనీ భద్రత గట్టిగా ఉంటే చిరుత రాదని ఆ శాఖాధికార్లు టిటిడిని ఒప్పించారు. ఎప్పటికప్పుడు అడవుల్లో చిరుతల సంఖ్య తెలుసుకుంటూనే ఆ జాతిని పెంచేందుకు వన్యప్రాణి పరిశోధకులు నడుంబిగించారు. దీనిలో భాగంగానే హైదరాబాద్‌ నేతాజీ పార్కు నుంచి ఆసియా చిరుతను విశాఖ ఇందిరాగాంధీ జ్యూలాజికల్‌ పార్కుకు తరలించారు. ఈ మూడు నెలల చిరుత ద్వారా సంతానోత్పత్తి సాధించి ఆ జాతిని పెంచేందుకు కృషి చేయాలని పరిశోధకులు ప్రభుత్వ అనుమతి పొందారు. ఆ చిరుత విశాఖ చేరిన  రోజే సోంపేట మండలం అనంతపురంలో ఓ చిరుత రైలు ఢీకొని మరణించింది. రైల్వేలైన్లపైకి వన్యప్రాణులు రావటం సహజమేనని స్థానికులు అంటున్నారు.  రాత్రులు చీకటిలో రైళ్లు వెళ్లకుండా శ్రీశైలం అడవిలోకి నిషేధం విధించినట్లే ఈ లైను విషయంలోనూ రైల్వే అధికార్లు నిర్ణయం తీసుకోవాలని వన్యప్రాణివిభాగం కేంద్రరైల్వే మంత్రిత్వశాఖను కోరుతోందని సమాచారం.