పంచాయతీకే పోరంబోకులపై అథికారం?

పంచాయతీ పోరంబోకు భూములంటే అందరికీ లోకువే. ఆక్రమించుకోవాలనుకున్న వాడూ ముందుగా ఎంచుకునే భూమి కూడా పోరంబోకు భూములే. కబ్జాలతో కునారిల్లుతున్న ఈ పోరంబోకు భూముల వ్యవహారంలో నేతలు కూడా ఆక్రమణదారుల పక్షాన్న నిలుస్తారు. అయితే పంచాయతీలు కూడా ముందు బెట్టుచేసినా పోరంబోకు భూములను ఆక్రమణదారులకే కట్టబెడుతున్నాయి. నేతల ఆబ్లిగేషన్‌ అంటూ ఆ ఆక్రమణలకు సర్దుకుంటున్నారు. ప్రత్యేకించి కోట్లాది రూపాయల భూమిని అలా వదిలేస్తున్నారు. దీనికి తోడు ఆక్రమణదారుడు కనుక జిల్లా కలెక్టర్‌, మంత్రుల నుంచి ఏమైనా పత్రాలు తీసుకువస్తే దానికే పోరంబోకు భూములను పంచాయతీ సభ్యులు కట్టబెట్టేస్తున్నారు.     కలెక్టర్‌ను ఎదిరించి భూములను సొంతం చేసుకోలేమన్న భావన సభ్యులకు ఉంది. ఇంకోరకంగా జిల్లాలోని అన్ని పంచాయతీలకు ఛైర్మన్‌ తరహాలో కలెక్టర్‌ వ్యవహరిస్తారు. అందుకని పంచాయతీ సభ్యులు కొన్ని పోరంబోకులు కలెక్టర్‌ ఆదేశాలపై పట్టాలుగా పంపిణీ చేస్తున్నారు. తాజాగా హైకోర్టు మొత్తం విషయం తెలుసుకుని పంచాయతీకే పోరంబోకుభూములపై అథికారం ఉంటుందని తేల్చింది. భూ పరిపాలన శాఖ ప్రథానకమిషనర్‌కు కూడా ఎటువంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్‌ వంటి ప్రముఖులు సిఫార్సు చేసినా పట్టించుకోనక్కరలేదని పేర్కొంది. జస్టీస్‌ వివిఎన్‌ రావు, జస్టీస్‌ కృష్ణమోహనరెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.

టిడిపిని వీడేందుకు నిర్ణయించుకున్న కోడాలి నాని

కొడాలి నాని టిడిపిని వీడేందుకు నిర్ణయించుకున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జగన్ పార్టీలోకి చేరేందుకు తన అనుచరులను, సన్నిహితులను ఒప్పించడాని అంటున్నారు. చంద్రబాబు చెప్పినా జగన్ పార్టీలో చేరే వార్తలను కోడాలి నాని ఖండించలేదు. జైలులో జగన్ ని కలిసిన తరువాత తన నిర్ణయం ప్రకటిస్తాడని, అయితే టిడిపికి రాజీనామా చేసిన తరువాతె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని జగన్ అన్నట్టు సమాచారం. ఈ నెల 9న కాని 18న కాని నాని టిడిపికి రాజీనామా చేయనున్నారని సమాచారం.   ఈ మేరకు వచ్చిన మీడియా కధనాల ప్రకారం, నాని సన్నిహితులు గత వారం రోజులుగా జగన్ ను కలిసి మంతనాలు జరుపుతున్నారని, అవి ఓ కొలిక్కి వచ్చాయని, ఇక నాని టీడీపీని వీడడమే తరువాయి అని అంటున్నారు. లోగడ నానీ టీడీపీ సభ్యత్వం తో పాటు అస్సెంబ్లీ సీటుకు కూడా రాజీనామా చేయాలంటూ జగన్ షరతు పెట్టినట్లు ప్రచారం లో వుంది. కాని తాను అస్సెంబ్లీ కి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు ఏర్పడి ఆ తర్వాత 2014 లో మళ్ళీ, ఇలా రెండు సార్లు ఎన్నికలు ఎదురుకోవలసి వస్తుందని నానీ వెనకాడినట్లు సమాచారం. అయితే, ఈ రెండు సార్లు కూడా టికట్టు తో పాటు ఎన్నికల ఖర్చును కూడా జగనే భరిస్తానని మాట ఇచ్చారని, అలా అయితే సరేనన్న నానీ వైకాపా లో చేరుతున్నారని తెలిసింది.

కోపం వచ్చినా ఆనందం వచ్చినా తలసాని తీరే వేరు

తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాసయాదవ్‌తో పరిచయమున్న అందరూ ఆయనకు కోపం వచ్చినా ఆనందం వచ్చినా పట్టుకోలేమంటున్నారు. నిన్నటికి నిన్న ఘాటైన విమర్శలతో తెలుగుదేశంపై ఒంటికాలిపై లేచిన తలసాని ఇప్పుడు ఈ పార్టీ తీరే వేరని గొప్పగా చెబుతున్నారు. పైపెచ్చు బోనాల పండుగకు మా పార్టీ నేత చంద్రబాబును ఆహ్వానించానని కాలరెగరేసి మరీ చెబుతున్నారు. ఇదేమిటీ నిన్నేమో తిట్టేశారు ఈ రోజేమిటీ మా బాబుని పిలిచేశానని గొప్పగా చెబుతున్నావు అని ఎవరైనా అడిగారో వారికి ఓ పెద్దక్లాసే పీకుతున్నారు. మా సొంత పార్టీపై అలుగుతాను, కోప్పడతాను, అలానే గొప్పగా చెప్పుకుంటాను అది నా ఇష్టమే కదా! అని తిరిగి ప్రశ్నించేస్తున్నారు. దీంతో ఇదేం తలనొప్పిరా బాబు అనుకుని అడిగిన వారు మౌనంగా దిక్కులు చూడకుండా బయటకు వెళ్లిపోతున్నారు. పోనీ! ఎవరైనా ఇప్పటికైనా సర్దుకున్నావా అని ప్రశ్నిస్తే వారికీ క్లాసు తప్పదు. సేమ్‌పొజిషన్‌లో మౌనంగా వెనుతిరగాల్సిందే.     ఇప్పటి దాకా కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యాలయానికి దూరంగా ఉన్న తలసాని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని అంచనాలు వినిపించాయి. ఆయన కూడా జగన్‌ను మాత్రమే అరెస్టు చేశారు, మరి మిగిలిన మంత్రుల సంగతేమి చేశారని కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు. దీంతో ఈయన కనఫర్మ్‌గా వై.కా.పా.లో చేరిపోతారనుకున్నారు. ఈలోపు మనస్సు మార్చుకుని చంద్రబాబుతో ప్రత్యక్షమయ్యారు. తాను కొన్నాళ్లు దూరంగా ఉన్నా పార్టీని మాత్రం వదలనని బాబు ఎదుటే ప్రకటించారు. అంటే బుజ్జగింపు కార్యక్రమం కూడా జరిగే ఉంటుందని ఎవరైనా అనుకుంటే పప్పులో కాదుకాదు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తలసాని దేశంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాతే బాబును కలిశారు కాబట్టి బుజ్జగించే పని లేకుండా తలసాని లొంగిపోయారన్న మాట.

రెవెన్యూశాఖను వీడని అవినీతి

రెవెన్యూశాఖను అవినీతి వీడటం లేదు. దీనిపై ఎసిబి దృష్టి పెట్టినా ఏదో ఒకచోట ఈ అవినీతి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా నెలకు కనీసం రెండు మూడు కేసులు నమోదవుతున్నాయి. ఇలా సంవత్సరానికి కనీసం 36 కేసులు రెవెన్యూశాఖకు సంబంధించే ఎసిబి నమోదు చేస్తోంది. ఎంఆర్‌ఓ స్థాయి నుంచి రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌, విఆర్‌ఓ వరకూ అవినీతి వాటాదారులవుతున్నారు.     తాజాగా కరీంనగర్‌ జిల్లా రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ తిరుపతి గ్యాస్‌ ఏజెన్సీని పదివేల రూపాయలు ఇస్తేనే పని చేస్తానని డిమాండు చేశారు. దీంతో గ్యాస్‌ ఏజెన్సీ అథిపతి, మేనేజర్‌ ఎసిబిని ఆశ్రయించారు. ఎసిబి దీనిపై ఆథారాలు సేకరించింది. పూర్తి ఆథారాలతో ఆ ఆర్‌ఐ తిరుపతిని వలపన్ని పట్టుకుంది. ఇలానే   కర్నూలు, తూర్పుగోదావరి, ఖమ్మం తదితర జిల్లాల్లో రెవెన్యూశాఖ సిబ్బంది కూడా  ఎసిబి పలుమార్లు వలపన్ని పట్టుకుంది.

నైతికశిక్షణ లేక రక్షకులే కీచకులవుతున్నారా?

కాపాడాల్సినవారే కామాంధులైతే...రక్షించాల్సిన చేతులు కీచకపర్వానికి తెరలేపితే...వంటి హెడ్డింగులు తరుచుగా పోలీసుశాఖలో కొత్తగా చేరిన కొందరి గురించి తరుచుగా పత్రికల్లో కనిపిస్తుంటాయి. అయినా సరే! కొత్తగా సర్వీసుల్లో చేరేవారిని పోలీసు ఉన్నతాథికార్లు అదుపు చేయలేకపోతున్నారు. ఆ తరువాత బాధితుల ఆరోపణలకు దర్యాప్తు చేసేటప్పుడు ఉన్నతాధికారి అలా ఎందుకు చేశావని సిబ్బందిని ప్రశ్నిస్తుంటారు. అంటే చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా పోలీసు శిక్షణ ఉంటోందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోలీసుశిక్షణలో నైతికతకు ఉన్నతాథికారులు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. నైతికప్రవర్తనపైనే శిక్షణ ప్రారంభిస్తే హోంగార్డు, కానిస్టేబుల్‌ స్థాయిల్లో అత్యాచారాలు, నేరాలు గురించి ఫిర్యాదులు వచ్చే అవకాశం లేదు. ఆ తరువాత సర్వీసు నుంచి సస్పెన్షన్‌లు ఇతర తలనొప్పులు తగ్గుతాయి.     తాజాగా సిఎం సొంతమండలంలో ఓ కీచకపర్వానికి తెరలేచింది. చిత్తూరుజిల్లా కలికిరి మండలంలో ఇంజనీరింగ్‌ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఒడిశా నుంచి కూలీలు వచ్చారు. వారిలో నలుగురు యువతులు కూడా ఉన్నారు. ఈ కూలీలు ఇందిరమ్మకాలనీలో బస చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇద్దరు కానిస్టేబుల్స్‌, ఇద్దరు హోంగార్డులు పహారా పేరిట పథకం ప్రకారం ఆ నలుగురు యువతులపై అత్యాచారం చేశారు. ఎవరికి చెప్పినా ఊరుకోమని బెదిరించి వెళ్లిన తరువాత ఉదయం ఆ నలుగురూ ఏడుస్తుంటే విషయం కనుక్కున్న మేస్త్రీలు పోలీసుస్టేషన్‌కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్స్‌ యూసఫ్‌, రమేష్‌, హోంగార్డులు భాస్కర్‌, నాగరాజు అత్యాచారం చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. మదనపల్లి డిఎస్పీ రాఘవరెడ్డి బాధ్యులపై చర్య తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

మాజీమంత్రుల భార్యలకు జైలుశిక్ష

రాజకీయం నేర్చుకోమని భర్తల ప్రోత్సాహం ఒక్కోసారి విపరీత పరిస్థితులకు దారి తీస్తుందని గుండ్లకుంటలో జరిగిన సంఘటన నిరూపిస్తోంది. ఈ సంఘటనలో కీలకపాత్ర పోషించిన మాజీమంత్రుల భార్యలకు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు కోర్టు జైలు శిక్ష విధించింది.  ఆ ప్రోత్సాహం వల్ల మాజీ మంత్రి పి.శివారెడ్డి భార్య లక్ష్మిదేవమ్మ, మరో మాజీమంత్రి భార్య పి.ఇందిర తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి 2006 నవంబర్‌1న పెద్దమాడిదం మండలం గుండ్లకుంట గ్రామంలోని వెలుగుపాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని, అధికారులను నిలదీశారు.   ఈ సందర్భంగా మాటల యుద్ధం జరిగింది. అది కాస్తా ముదిరి ఇరువర్గాల ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యేను అడ్డుకోవటంతో మొదలై వర్గవిభేదాలుగా మారటంతో మాజీమంత్రుల భార్యలపై అధికారులు కేసు పెట్టారు. 2006లో జరిగిన ఈ కేసు ప్రొద్దుటూరు కోర్టులో వాదనలు పూర్తయి తీర్పుకొచ్చింది. ఇద్దరు మాజీ మంత్రుల భార్యలకు రెండేళ్ల జైలు శిక్ష, పదివేలు రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు.

రాయలతెలంగాణా వ్యతిరేకిస్తున్న సీమ దేశం

రాయలతెలంగాణా ప్రతిపాదనను రాయలసీమ తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. దీనిపై రాయలసీమ పరిరక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టేందుకు దేశం కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి ఆందోళన ప్రారంభిస్తామన్నారు. కమిటీ సూచించిన విధంగా తాము ఆందోళనలో పాలుపంచుకుంటామని స్పష్టం చేశారు. తమ నేత చంద్రబాబునాయుడుకు విషయం తెలిసిందన్నారు.     ఆయన అనుమతితోనే ఈ ఆందోళనను అవసరమైతే ఉధృతస్థాయికి తీసుకువెళతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ సత్తా చాటుతామని హెచ్చరించారు. తాము రాజకీయ ప్రయోజనాలు ఆశించటం లేదనీ, కేవలం పార్టీ కాకుండా అందరినీ కలుపుకుపోతున్నామనీ వివరించారు. గతంలో ఆంథ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు రాజధానిని మార్చటం ద్వారా రాయలసీమ ప్రజలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దానితో మొదలైన రాయలసీమ ప్రజల త్యాగం నేటికీ కొనసాగుతోందన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందంలో అన్యాయం జరిగినా నోరువిప్పలేదనీ, నిజాం హయాంలో మరోప్రాంతానికి రాయలసీమను బహుమతిగా ఇచ్చినా ఏమీ మాట్లాడలేకపోయారనీ, కర్నాటకలో బళ్లారిని విలీనం చేసినా చూస్తూనే ఉండిపోయామనీ ఆందోళన వ్యక్తం చేశారు.

నీటి విడుదల సమంజసం కాదు : దానం

డెడ్ స్టోరేజీ నుంచి నీటిని విడుదల చేయడం బాచావత్ కమిటీ నిబంధనలకు విరుద్ధమని మంత్రి దానం నాగేందర్ అన్నారు.ఇలాగైతే హైదరాబాద్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తపరిచారు. ఇప్పటికే హైదరాబాద్‌లో నీటి కొరత తీవ్రంగా ఉందని దానం పేర్కొన్నారు. దీనిపై తాను, మంత్రి ముఖేష్ కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ ఇచ్చినట్లు దానం తెలిపారు. డెల్టాకు నీటి విడుదల సమంజసమేనన్న జానా వ్యాఖ్యలను మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. అటు మెడికల్ సీట్ల కేటాయింపుపైనా దానం మండిపడ్డారు. మెడికల్ సీట్లు ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని ఆరోపించారు. లగడపాటి, జానారెడ్డి హైదరాబాద్‌లో అన్ని ప్రాంతావారున్నట్లు గుర్తించాలని ఆయన హితవు చేశారు.  

జగన్‌ను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్ట్ అనుమతి

అక్రమాస్తుల కేసులో  చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్‌రెడ్డిని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అనుమతి లభించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ హోదాలో జగన్‌ను ఈడీ ప్రశ్నించనుంది. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు విచారించనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో జగన్‌ను ఈడీ ప్రశ్నించనుంది. మొదటగా దాఖలైన మూడు చార్జీషీట్లకు సంబంధించి జగన్‌ను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. జగతి పబ్లికేషన్‌లో పెట్టిన పెట్టుబడులు, మనీ లాండరింగ్‌కు సంబంధించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

బిజి మెట్రోపాలిటన్‌ లైఫ్‌లో మూగపోయిన రేడియో

రెండుదశాబ్ధాల క్రింద విపరీతంగా వినియోగంలో ఉన్న రేడియో తన ప్రాభవాన్ని కోల్పోయింది.ఈ మధ్యకాలంలో ఎఫ్‌ఎంఛానళ్ల సందడి ఎక్కువయ్యింది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్‌ రద్దీ  తెలుసుకోవడం కోసం ఎక్కువగా ఎఫ్‌.ఎం. వార్తలు వింటున్నారు.  అయితే టీవీ చానళ్ల సక్సెస్‌తో పోల్చితే ఎఫ్‌.ఎం. రేడియో సక్సెస్‌ తక్కవనే చెప్పాలి.  కోల్‌కత్తాలో మాత్రం రేడియో వినియోగం మిగతా నగరాలతో పోలిస్తే ఎక్కువే.హైదరాబాద్‌లో ఎఫ్‌ఎం చానళ్లు 32.7 శాతం మంది వింటున్నారని తెలుస్తోంది.   టీవీల పై ఆసక్తి ప్రతి ఇంట్లో టివి ఉంది. కేబుల్‌ ప్రసారాలు వచ్చిన తర్వాత ప్రతినిముషం ఏదో ఒక కార్యక్రమంతో ఛానళ్లు  సందడి చేస్తున్నాయి. టివీల వల్ల మానవ సంబంధాలు  దెబ్బతింటున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టి.వి. పుణ్యమాని ఇప్పటికే ఇరుగుపొరుగు బంధాలు తెగిపోయాయి. నగరాల్లో అయితే పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ప్రపంచం గ్లోబల్‌ విలేజ్‌ అయిపోయింది ఈ ఇంటర్నెట్‌ పుణ్యానే దేశవిదేశాల సమాచారాన్ని మన అరచేతిలో ఉంచుతుంది ఇంటర్నెట్‌. ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లో పనులన్నీ ఇప్పుడు దీని సొంతం. అత్యధిక వేతనాల్ని తెచ్చిపెట్టే ఉద్యోగాలలో కంప్యూటర్‌ ఉద్యోగాలే ముందుంటున్నాయి. కంప్యూటర్లవాడకం నానాటికి పెరిగిపోతుంది. మూడిరట ఒక వంతు ప్రజలు కంప్యూటర్‌ వాడుతున్నారు. అలాగే 20 శాతం మంది ఇంటర్నెట్‌వాడుతున్నారు. భవిష్యత్‌లో ఇంటికో కంప్యూటర్‌ అనివార్యంగా కనిపిస్తుందని మార్కెట్‌ వర్గాల అంచనా. మొబైల్‌ ఫోన్లదే హవా ప్రతి ఒక్కరిచేతిలో నేడు కనిపించేది మొబైల్‌ఫోన్‌ .ప్రస్తుతం దేశంలోకి వందలాది మోడళ్ళ  మెబైల్స్‌ దిగుమతి అవుతున్నాయి. మెబైల్‌ వాడకం దార్లు సగటున రెండు హ్యాండ్‌ సెట్లు వాడుతున్నట్లు అంచనా . 120 కోట్ల భారతదేశంలో జనాభాకంటే సిమ్‌కార్డులు ఎక్కువున్నాయి. మెట్రోనగరాల్లో 92 శాతం మంది సెల్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. పట్టుమని పది శాతం మంది కూడా ల్యాండ్‌ ఫోన్లు వాడటం లేదు. సౌకర్యం, సౌలభ్యం, సేవలను దృష్టిలో ఉంచుకొని సెల్‌ ఫోన్ల వినియోగానికే ప్రజలు పట్టం కడుతున్నారు. మెట్రోనగరాల అద్దె బ్రతుకులు మెట్రోనగరాలవాసులు చాలా వరకు అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ఇల్లుకావాలని ధరఖాస్తు చేసుకున్నవారు సుమారు మూడు లక్షల మంది ఉన్నారు. వీళ్లందరికీ ఇళ్లుకాదుకదా కనీసం స్ధలం చూపటం కూడా కుదరదని అధికారులు చేతులు ఎత్తేశారు.చెన్నైలో హైదరాబాద్‌కన్నా కిరాయి ఇళ్లలో ఉండేవారు మూడు శాతం ఎక్కువ. ముంబైలో మాత్రం మిగతా మెట్రోనగరాలైన కలకత్తా చెన్నై, హైదరాబాదు, డిల్లీ లతో పోలిస్తే సొంత ఇళ్లు కలిగిన వారు అధింకంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. మన నగరవాసుల పొదుపు ఈ మధ్య మన నగరాల్లో పొదుపు పెరుగుతుంది. జల్సాలు కొంచెం తగ్గించుకోవడానికే నగరవాసులు ఇష్టపడుతున్నారు. చాలా మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. కోల్‌కత్తాలో ఎక్కువమంది బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. హైదరాబాద్‌ వాసులు బ్యాంకు ఖాతాల విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. రవాణా వాహనాలు హైదరాబాద్‌  నగరవాసులు దేశంలోని మిగిలిన మెట్రో నగరవాసుల కన్నా ఎక్కువగా వాహనాలను వినియోగిస్తున్నారు. ముంబైలో హైదరాబాదు వాసులకంటే తక్కువ ద్విచక్ర, చతుర్‌చక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. అందుకు కారణం అక్కడ ప్రభుత్వం కల్పించే మాస్‌ ట్రాన్స్‌పోర్ట్‌  రవాణాసాధనాలేనని తెలుస్తోంది. అక్కడ రైలు మార్గం విస్తరించటం. అది చౌకగా ఉండటం ప్రధాన కారణం. అక్కడ బైకులను 15.6 శాతం, కార్లను 12 శాతం మంది మాత్రమే వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని సగం మంది ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తున్నారు. కార్లను కూడా ముంబై, చెన్నై, కలకత్తా వంటి నగరాల కంటే మన హైదరాబాద్‌ వాసులే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో వాహనకాలుష్యం ఎక్కువగా ఉంటుంది. చెన్నైలో సైకిల్‌వాడకం ఎక్కువగా ఉంది. వీటిని ప్రభుత్వం మరింత ఎక్కువగా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పాల్యాయిని దెబ్బకొట్టిన పబ్లిసిటి

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన పాల్యాయి గోవర్దనరెడ్డికి ఎఐసిసి జనరల్‌ సెక్రటరీ రాహుల్‌గాంధీ నుండి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయనతో రాష్ట్రరాజకీయాలు, అదేవిదంగా తెలంగాణా రాష్ట్ర విభజన గురించి మాట్లాడతారని అందరూ ఆశించారు. పిలుపు వచ్చిందే చాలని పాల్యాయి ఆఘమేఘాలమీద డిల్లీ చేరుకునే సరికి రాహుల్‌ గాంధీ ఆఫీసునుండి అపాంట్‌మెంట్‌ కాన్సిల్‌ సంగతి తెలిసింది. అదే సమయంలో రాష్ట్రంలోని మరో నాయకుడికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని తెలిసింది. చేసేదేమీ లేక వెంటనే పాల్యాయి తిరుగు ప్రయాణం అయ్యారు. దీనికంతటికీ కారణం పాల్యాయి మీడియాలో తనకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన విషయంతో పబ్లిసిటీ చేసుకోవటమే కారణం అని తెలుస్తోంది. అనవసరంగా మీడియాలో అధిక ప్రచారం చేసుకోవడం రాహుల్‌గాంధీకి చిరాకు తెప్పించిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. గోవర్ధనరెడ్డి స్థానంలో అపాయింట్‌మెంట్‌ పొందిన నద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డితో రాహుల్‌ మాట్లాడారు. అనేక క్లిష్టపరిస్తితిల్లో కూడా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆంద్రప్రదేశ్‌ 2014 ఎన్నికల తరువాత ప్రతిపక్షంగానే మిగిలిపోవాల్సి ఉంటుందని, వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనాన్ని కొడుకు వైయస్‌ జగన్‌ అందిపుచ్చుకున్నారని ఆయన  చెప్పినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి పని తీరు, రైతుల సమస్యలపై ప్రస్తుత సర్కారు అవలంబిస్తున్న విధానాలు జగన్‌ కు వరంగా మారాయని ఆయన తెలియచేసినట్లు సమాచారం.

బొత్స సత్యనారాయణ వైరాగ్యానికి కారణం ఏమిటి?

రాష్ట్రరాజకీయాలలో తన దైన ముద్రవేసికొని హల్‌చల్‌ చేసిన బొత్ససత్యన్నారాయణ ఈ మద్య ఎందుకనో వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్‌ అయిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఫలితాలు ధారుణంగా ఉండడం ఆయన్ని మానసికంగా ఎంతో కలచి వేసిట్లు తెలిసింది.  ఒకప్పుడు పెద్ద మద్యం సిండికేట్‌కు అధిపతి అయిన బొత్స ఇప్పుడు మద్యనిషేదాన్ని అమలు చేయాలంటున్నారు. ఇటీవల జరిగిన మద్యం షాపుల విక్రయాల్లో  కూడా ఆయన మనుషులు పాలు పంచుకోలేదు. ఉప ఎన్నికలముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పై అనేక ఆరోపణలు గుప్పించి, ఢల్లీి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అవటానికి ఎంతో కష్టపడ్డ బొత్స ఇప్పుడు ఉదాసీనంగా కనిపిస్తున్నారు.   ఈ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పైచేయిగా వుందని చెప్పవచ్చు. బొత్స చేసిన హడావిడికి కిరణ్‌కుమార్‌రెడ్డి బొత్స మద్యం సిండుకేట్ల బండారం బయటపెట్టి  చెక్‌పెట్టారు. ఆతరువాత అధిష్టానం అదిలింపులతో ఇద్దరూ సమైఖ్యంగా ఎన్నికల ప్రచారం చేసినప్పటికి ఎండదెబ్బతప్ప ఏమీ మిగలలేదు. ఇప్పుడు రాజకీయాలలోనూ ప్రతిష్ట దెబ్బతిని అదే సమయంలో ఆదాయవనరుల్ని వదులుకొని నిరుత్సాహంతో ఉన్నారు. కొన్నిచోట్ల వ్యక్తిగత ప్రతిష్టకోసం అభ్యర్థులకు తన జేబులో డబ్బులు ఖర్చుపెట్టినా ఫలితం శూన్యం. ఎంత డబ్బు, సమయం ఖర్చుచేసినా నాకు మిగిలిందేమిటి ఇదంతా ఎందుకోసం చేసినట్టు ఎవరికోసం చేసినట్టు అని వైరాగ్యంలో ఆయన  ఉన్నట్లు సన్నిహితుల సమాచారం.

వర్షాభావతో రైతులు విలవిల

రైతులపై వరుణదేవుడు పగబట్టాడు. గతేడాది నుండి ఇదేపరిస్దితి . చినుకులేక సేద్యం సాగక రైతన్నలకు ఏంచేయాలో పాలుబోవడం లేదు. జూన్‌ మొదటివారంలో మొదలవ్వాల్సిన ఖరీఫ్‌ సేద్యం ఇంతవరకు వర్షాలు లేక ప్రారంభంకాలేదు. అక్కడక్కడ కురిసిన వర్షాలకు తోడు వాతావరణశాఖ  అందించిన భారీ వర్షసూచన సమాచారం మేరకు రైతులు వరుణదేవునిపై  ఆశపెట్టుకుని వేసిన ప్రత్తి ఇతర పంటలు వర్షాలు పడకపోవడంతో ఎండిపోయి రైతులకు పెట్టుబడి వృదా అయింది. గత ఏడాది కూడా  ఇదేపరిస్థితి కనిపించింది.   జూన్‌ ప్రారంభించవలసిన ఖరీఫ్‌ పంటలను జూలై, ఆగసు ్టవరకు వేశారు. అప్పటికి వర్షాలు అంతంత మాత్రంగా ఉండటం వల్ల మెట్ట ప్రాంతాల్లోనూ, ఏజన్సీ ప్రాంతాలలోనూ వరిపంట నీరు లేక ఎండిపోయింది.   కరెంటు లేక బోరు బావుల కింద సాగే వ్యవసాయం కూడా దెబ్బతింది,దాంతో ధాన్యం దిగుమతి గణనీయంగా పడిపోయింది. గత ఏడాది కోస్తాంద్రలో క్రాఫ్‌ హాలిడే ప్రకటించడం వల్ల మరో లక్ష ఎకరాలు పంటకు నోచుకోలేదు. గత ఖరీఫ్‌సీజన్‌లో ప్రతి జిల్లాలో 120.2 మిల్లీ లీటర్ల వర్షం కురవాల్సివుండగా అందులో సగం కూడా ఏ జిల్లాలో నమోదు కాకపోవడం గమనార్హం. సెప్టెంబరు అక్టోబరులో పరిస్థితి కూడా ఇలాగే సాధారణ వర్షపాతం కంటే 70 శాతం తక్కువగా వుంది. దీంతో వరి తో పాటు మెట్ట పంటలు కూడా దెబ్బతిన్నాయి. మెట్టపంటలైన ప్రత్తి,మొక్కజొన్న, అపరాలు,కర్రపెండలం,మిరప వంటి వాణిజ్య పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు అప్పుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు రాక రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

సుప్రీంలో పొన్నాలకు చుక్కెదురు, పదివేల జరిమానా

మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. తన ఎన్నికపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ పొన్నాల దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. పొన్నాల ఎన్నికపై రీకౌంటింగ్ జరపాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. అంతే కాకుండా మంత్రికి పదివేల రూపాలయల జరిమానా విధించింది. 2009 ఎన్నికల్లో జనగాం నుండి 236 ఓట్ల తేడాతో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కె. ప్రతాప్‌రెడ్డిపై పొన్నాల విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో అక్రమాలు జరిగాయని, ఓడిన పొన్నాలను గెలుపొందినట్లు ప్రకటించారని నాటి నుండి టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఇదే వాదనతో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి హైకోర్టును ఆశ్రయించగా, పొన్నాల ఎన్నికపై 2010లో కోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తీర్పును పొన్నాల సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.  

ప్రభుత్వంపై ప్రజాపద్దులసంఘం ఆగ్రహం

 పులిచింతల ప్రాజెక్టు గుత్తేదార్లపై చర్య తీసుకోవాలని విజిలెన్స్‌ చేసిన సిఫార్సును ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రభుత్వంపై  ప్రజాపద్దుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభాకమిటీ హాలులో ఛైర్మన్‌ రేవూరి ప్రకాశరెడ్డి అథ్యక్షతన  సమావేశమైన పీఎసి కల్వకుర్తి ఎత్తిపోతల, పులిచింతల ప్రాజెక్టు గురించి చర్చించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం 2788 కోట్ల రూపాయల్లో 80శాతం చెల్లింపులు పూర్తయినా నీరెందుకు విడుదల చేయలేదని సభ్యులు ధ్వజమెత్తారు. చెల్లింపులు తప్పించి ప్రజోపయోగమైన ఈ ప్రాజెక్టుల పరిస్థితి గమనించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు గుత్తేదార్లతో అధికార్లు కుమ్మక్కు అయ్యారని విజిలెన్స్‌ గుర్తించి చర్యలకు సిఫార్సు చేస్తే ప్రభుత్వాన్ని దాన్ని పట్టించుకోకపోవటంపై నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సమగ్రమైన నివేదికను ఒక్కరోజులో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమార్కులను వదిలేయటానికి ఒప్పుకోమని కూడా హెచ్చరించారు.  

దైవకణం గురించి మనమే ముందు కనుక్కున్నామా?

భారతీయ పురాణాలు దైవశక్తిని చాటుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తూ ‘‘అణువు కన్నా చిన్నదైన పరమాణువు దాని కన్నా చిన్నదానికీ మూలం తానే’’ అని పరోక్షంగా దైవకణం గురించి ప్రస్తావించారు. అలానే 32 ఏళ్ల పాటు దకోలార్‌గోల్డ్‌ఫీల్డ్స్‌లో దైవకణం గురించి పరిశోధనలు చేశారు. కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ బంగారుగనుల్లో ఈ పరిశోథనాకేంద్రం నడిచింది. 1960 నుంచి 1992 వరకూ ఇక్కడ పరిశోధనలు జరిగాయి. గనుల అంతర్భాగంలో సుమారు రెండు కిలోమీటర్ల లోతున పరిశోథనా కేంద్రం ఉంది. ఇక్కడ న్యూట్రినోలపై విశ్లేషణ సాగించారు. కాస్మిక్‌కిరణాలు భూ అంతర్భాగంలో నశించి వేలాది కోట్ల న్యూట్రినోలు ఉత్పత్తి అవుతాయని పరిశోథకులు గుర్తించారు.   ఇటీవల తాజాగా 2100మంది సెర్న్‌ శాస్త్రవేత్తల బృందం ‘హిగ్సిబోసన్‌’ పేరిట దైవకణం ఉందని నిగ్గు తేల్చారు. బ్రిటన్‌ శాస్రవేత్త హిగ్స్‌, భారతీయశాస్త్రవేత్త సత్యేంధ్రనాథ్‌బోస్‌ రెండు పేర్లు కలిపి ఆ కణానికి పెట్టారు. అయితే ఈ పరిశోథనకు ముందుగా జరిగిన కోలార్‌ గనుల్లో పరిశోధనలోనూ న్యూట్రినోలకు మూలం ఉందని గమనించారు. ఇదే కాకుండా ఆథ్యాత్మిక బాటలో నడిచే ప్రముఖులు కొన్ని ప్రాంతాల్లో చూసిన కాంతిపుంజాలను దైవాంశగా భావిస్తారు. మానససరోవర్‌ వెళ్లిన యాత్రికులకు ఈ కాంతిపుంజమే దారి చూపుతుందని నమ్మకం. అదీ దైవకణాలతో మిళితమైనదని సాధువులు చెబుతుంటారు. చారిత్రకనేపథ్యంతో ఉన్న ఏకైకజాతి భారతజాతి, దీని పుట్టుక కొన్ని వేల యుగాల క్రితమే జరిగిందని భావిస్తుంటారు.

తెలిసినా తప్పని ఎన్నికల భారం?

అన్నీ తెలిసినవారే ప్రచారం చేస్తే లోకమంతా దాన్ని అనుసరిస్తుంది...మేథావులు ఎలా చెబితే అలా వారి బాటలోనే ప్రజలు నడుస్తారు. శాసనకర్తలను అనుసరించక తప్పనిస్థితి ఓటర్లది...ఇలా ఎన్ని వాక్యాలు రాసినా ఎన్నికల గురించి ఇంకా రాయటానికి ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. ఇంత సోదంతా ఎన్నికల కోసమే అనుకుంటే దాని భారం మోపుతున్న ప్రజాప్రతినిథుల గురించి కూడాను. స్వేచ్ఛ పేరు చెప్పి ఐదేళ్లు పాలించాల్సిన శాసనసభ్యుడు రెండేళ్ల తరువాత పార్టీ మారినా ఏమీ చేయలేని దైన్యస్థితిలో ఓటర్లుంటున్నారు. దీని ఫలితంగా మళ్లీ ఎన్నికలు మరోప్రతినిధి ఎంపిక. ప్రభుత్వానికి ఎన్నికల్లోనే వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది. ఈ విషయాన్ని పాలకులు గమనించలేదా? అందరికీ తెలుసు అయినా మౌనం వహించటమే వారి గొప్పదనం. ఈ విషయంపై ఎవరూ పెద్దగా స్పందించలేదు కూడా. అయితే దీన్ని భరించలేక గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు పార్లమెంటు నైతిక ప్రవర్తనా నియమావళి కమిటీకి ఒక లేఖరాశారు. దాని సారాంశం ఏమిటంటే ఒకసారి రాజీనామా చేసిన ప్రతినిథిని రెండు ఎన్నికలకు పోటీ నుంచి తప్పించాలి అని రాయపాటి కోరారు.  

గౌతమ్‌కుమార్‌ గొంతు నొక్కేసిన ప్రభుత్వం?

రాష్ట్ర ప్రభుత్వం ఓ ఐపిఎస్‌ అథికారి గొంతునొక్కేసింది. డిజిపి స్థాయి నియామకంలో సీనియార్టీ తప్పారని కేంద్ర ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ధృవీకరించినా తన తప్పును సరి చేసుకోలేదు. వారం రోజుల గడువు ఇచ్చినా క్యాట్‌ను తోసిరాజనిపించుకుంది. పైగా మనస్థాపంతో తాను పని చేయలేనని విఆర్‌ఎస్‌కు ధరఖాస్తు చేసుకున్న గౌతమ్‌కుమార్‌ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా ముఖ్యమంత్రి విఆర్‌ఎస్‌ను ఆమోదించేశారు. అంతే కాకుండా కేంద్రానికి ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదని మంజూరు సమయంలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనటం ఆయన ఆశ్రితపక్షపాతాన్ని చాటుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు రాష్ట్రప్రభుత్వం ఈయన విషయంలో ఎలా స్పందిస్తుందో చూద్దామని ఎదురుచూసిన వారికి తన శాసనసత్తాను సిఎం చాటుకున్నారు. దీంతో గౌతమ్‌కుమార్‌ విషయమై ఇంత వరకూ జోక్యం చేసుకోని పలు పోలీసు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తనను ఎవరు సవాల్‌ చేసినా సహించబోమన్న హెచ్చరిక సిఎం చర్యలో దాగి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత డిజిపి దినేష్‌రెడ్డి కన్నా తాను సీనియర్‌నని, తనకు అన్యాయం జరిగిందని ఐపిఎస్‌ అధికారి గౌతమ్‌కుమార్‌ క్యాట్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌ మొత్తం రికార్డులను పరిశీలించి రాష్ట్రప్రభుత్వం డిజిపి నియామకంలో తప్పు చేసిందని తేల్చింది. రికార్డుల పరిశీలన తరువాత ఈ విషయం తేల్చటంతో ఆగకుండా వారం రోజుల్లో రాష్ట్రప్రభుత్వం తన తప్పును సరి చేసుకోవాలని ఆదేశించింది. సర్వీసునిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించరాదన్న నీతిని రాష్ట్రప్రభుత్వానికి అర్థమయ్యేలా క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తోసిపుచ్చారు. తనకు కావాల్సిన డిజిపి దినేష్‌రెడ్డిని కాపాడుకోవాలని గౌతమ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చేందుకూ ఆయన ప్రయత్నాలు ప్రారంభించబోయారు. అయితే ఈ విషయం ముందే పసిగట్టిన హోంశాఖా కార్యదర్శిగా ఉన్న గౌతమ్‌కుమార్‌ తనకు విఆర్‌ఎస్‌ ఇప్పించాలని ధరఖాస్తు చేసుకున్నారు. సిఎం దీన్ని ఆమోదించటం ద్వారా తన తప్పుకు నిజాయితీ రంగుపులుముకున్నారు. పైపెచ్చు కేంద్రానికి ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు గౌతమ్‌కుమార్‌కు జరిగినట్లే భవిష్యత్తులో తమకూ తప్పదా అన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి.

కాంగ్రెస్‌లో కలిసేందుకే విజయమ్మ పర్యటన?

కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఉవ్విళ్లూరుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వై.కా.పా.నేతల ఢల్లీ పర్యటన దీన్ని బలపరుస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. జగన్‌ కోసం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను, రైతుల పేరిట వ్యవసాయశాఖా మంత్రి శరద్‌పవార్‌ను వై.కా.పా. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కలిశారు. అయితే వీరిద్దరి దగ్గర విజయమ్మ పెద్దగా మాట్లాడిరదేమీ లేదని తెలుస్తోంది. ముందస్తు పరిచయాలు ఆ తరువాత ఉపోద్ఘాతం వినిపించి వచ్చేసరికి ఆలస్యమైందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పైపెచ్చు విజయమ్మ ఒక్కరే వీరిద్దరితో మాట్లాడటం వల్ల జగన్‌ విడుదల గురించే శ్రద్ధ చూపారని తెలుస్తోంది.     అయితే రాజశేఖరరెడ్డి కుమారుడైనందున కక్ష సాధిస్తున్నారన్న కొత్తవాదనను ఆమె ఢల్లీి పెద్దల ముందుంచారు. అసలు కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదని ఆ ఇద్దరూ అన్నారని తెలిసింది. ఇప్పటికైనా కేసుల నుంచి తన కుమారుడిని రక్షించాలని విజయమ్మ కోరారు. దీనికి ఇద్దరూ మౌనంన వహించారని తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని కూడా విజయమ్మ ఎర వేశారని తెలిసింది. దీనికీ అంతగా స్పందించలేదని సమాచారం. విజయమ్మ ఢల్లీ వచ్చిన వెంటనే తాను రైతుల సమస్యలపై వచ్చానని అన్నందున దానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని, వ్యవసాయశాఖామంత్రి ఇద్దరూ భావించినట్లు తెలిసింది. ఏది ఏమైనా విజయమ్మ తన బాధను కాంగ్రెస్‌ పెద్దలకు పంచారు. ఇక వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. జగన్‌ బయటికి వచ్చాక కాంగ్రెస్‌లో పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తేనే కాంగ్రెస్‌ కలగజేసుకుంటుందని రాష్ట్రనేతలు అంటున్నారు. అప్పుడైనా అవినీతిపరుడిని అక్కున చేర్చుకున్న అపకీర్తి తప్పదు కదా అని ఆలోచనలో పడ్డారట. అయితే విజయ్మ అండ్‌ కో ఢల్లీి వెళ్లింది కాంగ్రెస్‌లో చేరటానికేనని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాదరావు ఆరోపించారు.