వర్షం కోసం ఎదురు చూస్తున్న వాన్‌పిక్‌భూముల రైతులు?

నిన్న సొంతం చేసుకున్న వాన్‌పిక్‌భూముల్లో నేడు సాగుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులందరూ సమైక్యంగా వచ్చి ఆ భూముల్లో దుక్కిదున్నారు. వర్షాధారంపై పండే ఆ భూము ల్లో విత్తనాలు నాటేందుకూ రైతులు సిద్ధంగా ఉన్నారు. వర్షం రావటమే ఆలస్యమని ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్‌ సంస్థ కోసం సేకరించిన భూముల వల్ల తాము నష్ట పోయామని రైతులు కంచెను తొలగించి భూమిని సొంతం చేసుకున్నారు. గతంలో లాగ గట్లు కట్టుకుని ఎవరి పొలం వారు విడదీసుకున్న రైతులు ట్రాక్టర్ల సహాయంతో దుక్కి దున్నారు.   వర్షం వస్తే విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరులో ఈ రైతుల చైతన్యం ఆదర్శప్రాయమని జిల్లాలోని రైతుల సంఘాలు కొనియాడుతున్నాయి. రైతుల్లో ముఖ్యంగా చైతన్యం కొరవడి ప్రభుత్వాలు, వ్యాపారులు కూడా నష్టపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారన్న వార్త దావానంలా వ్యాపించింది. దీంతో తమ భూములను సొంతం చేసుకున్న రైతులకు జిల్లాలోని పలుప్రాంతాల నుంచి సంఫీుభావం ప్రకటించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డొక్కామాణిక్యవరప్రసాద్‌ ఏరువాక సాగించిన భూముల్లోనే రైతులు ఈ సాగుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అసలు ఇక్కడ రైతులు సాగు చేస్తుంటే అడ్డుకునేందుకు ఎవరైనా వస్తే ఏమి చేస్తారన్న ఆసక్తి కొద్ది కొందరు రైతులు దుక్కి దున్నేంత వరకూ వేచి చూశారు. ఎటువంటి అలికిడి, అలజడి లేకపోవటంతో సందర్శనకు వచ్చిన వారు సాయంత్రం తిరిగి వెళ్లారు.

ఒక్కోసారి యాక్షన్‌...మరోసారి రియాక్షన్‌ ఏమిటీ లగడపాటి?

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ ఎవరికీ అర్థం కావటం లేదు. ఆయన ఒక్కోసారి యాక్షన్‌ చేస్తున్నట్లు, మరోసారి రియాక్షన్‌లాగానూ ప్రవర్తిస్తుంటారు. ఈయన ఎవరికీ అంత తొందరగా అర్థం కావటం లేదని రాజకీయనేతలు అంటున్నారు. అయితే ఒక్కవిషయం మాత్రం అందరికీ అర్థమైంది. లగడపాటి కాలీకాలని నిప్పులా ఫైర్‌ అయి సైలెంట్‌ కూడా అయిపోతుంటారు. ఈ భిన్న మనస్తత్వాలు రాజకీయంలో రాణించాలనుకునే వారికి అవసరమే కానీ, ఎదిగిన నేతల్లో ఉంటే అది ఒకరకంగా ఉపయోగపడుతుంది. లగడపాటి ఇంకా ఎదగాలనుకుంటూ తానే మొత్తం కాంగ్రెస్‌ పార్టీ అని ఫీలయ్యి మరీ రియాక్షన్‌ ఇస్తుంటారు. పక్కా సమైక్యవాది మార్కు కొట్టేసేందుకు తెలంగాణావాదాన్ని వ్యతిరేకించటం వరకూ సమంజసమే కానీ, అక్కడి అన్ని సమస్యల్లోనూ, ఘటనల్లోనూ జోక్యం చేసుకోవాలనుకుంటే మాత్రం తెలంగాణావాదులు ఆయనపై చిరాకుపడుతున్నారు.   తాము ఏమైనా ఆరోపణలు చేసినప్పుడు మాట్లాడాల్సిన లగడపాటి ఎవరూ స్పందించరని భావించే సమస్యకు తానే కాంగ్రెస్‌ అయినట్లు సమాధానమిస్తారు. ఇటీవల ఉప ఎన్నికల జోస్యం చెప్పేసి సంచలనం సృష్టించిన అంతటితో ఆగకుండా పరకాల నియోజకవర్గం గురించి సరైన సమాచారాన్నే గుర్తించారు. అసలు తెలంగాణావాదానికి పరకాల ఎన్నికలు పరీక్ష అనుకున్న వారికి లగడపాటి కళ్లు తెరిపించారు. దీంతో ఆగకుండా లగడపాటి ఎక్కడ తెలంగాణావాదులు కనిపించినా యాక్షన్‌తో పని లేని రియాక్షన్స్‌ ఇవ్వటం మొదలుపెట్టారు.   తాజాగా తెలంగాణాలో వైద్యసీట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలంగాణా న్యాయవాదులు ఆరోపించారు. వీరు ఏకంగా లగడపాటి ఇంటిని ముట్టడిరచేందుకు ప్రయత్నించి పోలీసుల చేతికి చిక్కారు. యాక్షన్‌ ఉంటేనే రియాక్షన్‌ ఇస్తే బాగుంటుందన్న న్యూట్రన్‌ సూత్రాన్ని లగడపాటి ఇకనైనా నమ్మాలని పలువురు కోరుతున్నారు.

ఉజ్జయినీ మహంకాళి జాతరలో రాజకీయం?

రాజకీయం చేసేందుకు జాతరలను కూడా వేదిక చేసుకుంటున్నారు. జనబాహుళ్యాన్ని దగ్గర చేసుకోవాలంటే ఇటువంటి జాతరలు ఉపయోగపడతాయని పార్టీలు భావిస్తుంటాయి. అందుకే కాబోలు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఈ జాతర నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అందుకనే తెలుగుదేశం పార్టీ అథినేతకు చంద్రబాబునాయుడుకు సాదర స్వాగతం లభించింది. ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కారు వద్దకు కూడా భక్తులు, తెలగుదేశం కార్యకర్తలు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాసయాదవ్‌, బాబుకు సంతృప్తికరంగా వీడ్కోలు కూడా పలికారు. దీనికి ముందు సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి వస్తే దర్శనానికి ముందుకు ఒకసారి సిఎం డౌన్‌డౌన్‌ అని నినాదాలు చేశారు. వెనుదిరిగి వెళ్లేటప్పుడు కూడా మళ్లీ అవేనినాదాలు చేశారు. అయితే ఆయన అమ్మవారికి పట్టుచీర సమర్పించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పూజలు సక్రమంగా చేసి ప్రజలను ఆదరించాలని నిర్వాహకులను కోరారు. అతితక్కువ సమయంలోనే వెనక్కి వెళ్లిపోయారు. అయినా సరే! ఈ ఆలయ పెద్దలు తెలుగుదేశం పార్టీకి చూపినంత ఆదరణ సిఎంకు ఇవ్వలేదు. విఐపిల దర్శనం వల్ల ఆలస్యమైనందున భక్తులు ఇలా నినాదాలు చేశారని కొందరు సర్ధిచెప్పారు. రాజకీయవేదికగా తెలుగుదేశం పార్టీ ఈ జాతరను వినియోగించుకోటం అందరినీ విస్మయపరిచింది.

కళంకిత మంత్రులకు ప్రభుత్వ న్యాయ సహాయం ఎందుకు చేయాలి?

స్వాతంత్య్రం వచ్చాక మొదటి తరం రాజకీయాలన్నా, నాయకులన్నా, మంత్రులన్నా ప్రజలకు గౌరవాభిమానాలు ఉండేవి. అందుకు కారణం వారు ప్రజలకు సేవచేయటానికే వచ్చారని నమ్మకం కలిగించటం. అందుకు నాయకులు, మంత్రులు పాటించిన నైతికతే నిదర్శనం. ఏదైనా ఒక ఆరోపణ వస్తే అదినిరూపించుకునే వరకు రాజీనామా చేసేవారు. అది వారి నిబద్దకు నిదర్శనం....అనంతరం ఎన్ని ఆరోపణలు, స్కాంలు, కుంభకోణాలు ఏమైనా సరే పదవికి ఏమీ అడ్డుకాదనే నాయకులు ముందుకొచ్చారు. ఇప్పుడు మోడరన్‌ తరం వచ్చింది. సరికొత్త సాంప్రదాయం తెరపైకి తెచ్చారు. అవినీతి ఆరోపణలు, సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులకు వారి పదవులకు ఏమీ అడ్డంకి కాదు. కావాలంటే న్యాయ సహాయం కూడా వారి వారి శాఖలనుండి ఖర్చుపెడతారు. ఎంత ఎదిగిపోయాం..... ఎదిగింది రాష్ట్ర ప్రజలు కాదు. రాష్ట్ర మంత్రి వర్గం . అదికూడా ఏ ఒకరికో ఇద్దరికో కాదు. ఏకంగా నలుగురు మంత్రి వర్యులకు. అందులో ఇద్దరికి ముందు లేదన్నా తరువాత వారికి కూడా అందిస్తామన్నారు. ఇంత దిగజారుడు తనం ఏ రాష్ట్రంలోనైనా వుందా .   ప్రజలు మాత్రం కరెంటులేని అంధకార రాష్ట్రంలో ఉండాల్సిందే. పంటలు వేయటానికి విత్తనాలు, ఎరువులు లేవు. బ్లాకులో తెచ్చివేసిన గింజలు మొలవవు. పోనీ మెట్ట పంటలు వేద్దామంటే వానలు పడవు. బోర్లుకింద పండిద్దామనుకుంటే కరెంటు లేదు.కాని బిల్లుల మోత మాత్రం పెరిగిపోతుంది....పరిశ్రమలది ఆదే దారి. పంటలు పండక రైతులు, చాలీ చాలని సదుపాయాలతో కాలేజీ చదువులు, తల్లిదండ్రులకు పెను భారం. స్కాలర్‌షిప్పుల ఊసేలేదు. రీఎంబర్స్‌మెంట్‌ వస్తుందోరాదో తెలియదు. బయటికి వెళితే ఇంటికి వస్తామో రాలదో తెలియదు. ఎందుకంటె రహదారులన్నీ రక్తసిక్తం. చేనేత పరిశ్రమ పడక వేసింది. పట్టించుకునేవారే కరువు. రోగం వస్తే సర్కారు ధవాఖానాలో డాక్టర్లు ఉండరు. డాక్టర్లు ఉన్నా మందులుండవు.   కార్పొరేట్‌ ఆసుపత్రుల కెళితే ఆస్తులు అమ్ముకోవల్సిందే. పెరిగిన నిత్యావసర ధరలు చుక్కల్లో ఉన్నాయి అందుకోలేని సామాన్యడి అసహాయత ...ఇదేమీ ఇప్పటి పాలకులకు అవసరం లేని విషయాలు. వాటికి ఉన్నది ఒకటే ఎజెండా పదవి ఉందా లేదా ఎలా పదవిని పది కాలాల పాటు పదిలంగా కాపాడుకుందామా అనే. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటానికి, లేదా వారి వారి పదవుల్ని కాపాడుకోవటానికే. ఉదయం, సాయంత్రం దేశరాజధాని తిరిగేది ప్రజాసమస్యలపై కాదు. వారు అక్కడనుండి ఒక్క పధకం గాని, ఒక్క పైసాగాని ప్రజలకోసం తెచ్చింది లేదు.   రాష్ట్ర ప్రజలకు ఆ ఆశకూడా లేదు. కాని మంత్రుల ఆవినీతి ఆరోపణలకు న్యాయ సహాయం పేరిట ప్రజల డబ్బుని అంతగా దుర్వినియోగపరచడానికా మనం ఎన్నుకున్నది.....దేశంలో నాలుగో పెద్దరాష్ట్రం. అధిక జనాభాలో ఐదవ రాష్ట్రం. అన్నిటికంటె ముందు భారత దేశానికి ఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణ. దేశంలో అత్యధిక వరి పండిరచే రాష్ట్రం. ఇదంతా గతం ....ఇక ముందంతా అంధకార రాష్ట్రంగానో లేదా అవినీతి ప్రభుత్వ రాష్ట్రంగానో మనంల్ని మనం పరిచయం చేసుకుందాం. ఇలాంటి నేతల్ని ఎన్నుకుంటే అంతే మరి.......

లగడపాటిపై గౌతమాస్త్రం...మౌనమే సమాధానం!

ఏ ఎండకాగొడుకు పట్టటం కొద్దిమందికి పుట్టుకతో వస్తుంది.దానికి మినహుయింపు కానిది విజయవాడ ఎంపి లగడపాటి. కాంగ్రెస్‌ పార్టీలోకి మామగారిని అడ్డంపెట్టుకొని పరిచయాలు పెంచుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పేదలకోసం మండుటెండలో కాలినడకతో రాష్ట్ర పర్యటన మొదలు పెట్టినప్పుడు ఆయన వెనుక ఎ. సి. వాహనంలో అనుసరించి ఆ యాత్ర మొత్తాన్ని తానే స్పాన్సర్‌ చేసినట్లు బిల్డప్‌ ఇచ్చారు. ఆ సమయంలోనే లగడపాటి వైయస్సార్‌కు ఓ మంచి ఫారెన్‌ షూ కూడా ప్రజెంట్‌ చేశారు. నడిచేటప్పుడు కాళ్లకు నెప్పులు రాకుండా, బొబ్బలు రాకుండా. చేసిన సేవలకు ప్రతిఫలంగా లగడపాటి లోక్‌సభ టిక్కెట్‌ పొందారన్న ప్రచారం జరిగింది.. ఈ రోజు లగడపాటి రాజకీయాలలో ఉన్నారంటే అందుకు కారణమైన వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిని తన రాజకీయ గురువుగా కొలవక పోయినా పర్వాలేదు కాని వైయస్‌ అకాల మరణం తర్వాత ప్లేటు ఫిరాయించడం వెనుక కారణం ఏమైఉంటుందున్న చర్చ బెజవాడలో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు లగడపాటికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న గౌతం రెడ్డి ఇప్పుడు ఆయనకు బద్ద శతృవయ్యాడు. లగడపాటిని మీడియా పరంగా ఎదుర్కోనే పనిని వై.ఎస్‌.ఆర్‌ . కాంగ్రెస్‌ పార్టీ గౌతం రెడ్డికి అప్పగించినట్లుంది.   దీనితో గౌతం రెడ్డి ఒంటికాలిపై లగడపాటిపై లేస్తున్నారు. వైయస్‌ పదవినడ్డుపెట్టుకొని జగన్‌ అక్రమ ఆస్తులు సంపాదించారని, జగన్‌ నేరస్తుడని, విజయమ్మ జగన్‌ని సరిగా పెంచెలేదని లగడపాటి అంటుంటే వైయస్‌ మరణం తర్వాత గాని లగడపాటికి అక్రమ ఆస్థులు గుర్తుకు రాలేదా. అంత అక్రమ ఆస్తులున్న సాక్షి దినపత్రికల్లో లగడపాటి సక్రమ ఆస్థులను 30 కోట్లు పెట్టడం దేనికి? ప్రాజెక్టులన్నింటిలో అవినీతి జరిగింది అని చెబుతున్న లగడపాటి తెలుగుగంగ ప్రాజెక్టుకు కాంట్రాక్టు పనులు ఎలా తీసుకున్నారో సెలవివ్వాలని గౌతం రెడ్డి అంటున్నారు. ఇన్ని ఆరోపణలు వైయస్సార్‌ చనిపోక ముందు చేస్తే లగడపాటి మాటకు విలువ వుండేదని కూడా గౌతం రెడ్డి అంటున్నారు. ఆస్ట్రేలియాలో వర్ధమాన్‌ ఫెర్టిలైజర్‌ ని లగడపాట మోసం చేశారని, వెస్ట్రన్‌ అస్ట్రేలియా సుప్రీం కోర్టులో ల్యాంకో కంపెనీపై 16 వేల కోట్లు నష్టపరిహారం దావా వేసారని , ల్యాంకోలో పెట్టుబడి పెట్టిన షేరు హొల్డర్లకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించటానికి కారణం లగడపాటి అనైతిక వ్యాపారాలే కారణమని గౌతం రెడ్డి ఆరోపిస్తున్నారు. దివాళాతీసిన గ్రిఫ్‌ కోల్డ్‌మైన్స్‌ ను ఐసిఐసిఐకి తాకట్టు పెట్టి 3000 కోట్ల రూపాయలు అక్రమ పద్దతిలో పొందిన ల్యాంకో పై మీరు మీ నియోజక వర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుడిగా వుంటూ సిబిఐ ఆఫీసరు లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్‌పై హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత లగడపాటి వయనను వెనుకేసుకు రావడం వెనుక కారణం మీ తమ్ముడ్ని జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టినా జె.డి. విచారణ చేపట్టక పోవడమేనా ఇంకేమైనా లాభాపేక్షవుందా అని ప్రశ్నిస్తున్నారు గౌెతం రెడ్డి. న్యాయవాది కూడా అయిన గౌతంరెడ్డి ఇలా ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తున్నప్పటికి రాజగోపాల్‌ ఒక్క సమాధానం కూడా చెప్పకపోవడం విశేషం.

సి.బి.ఐ. మాన్యువల్స్‌ ఉల్లంఘించి పుల్‌గా బుక్కయిన లక్షీనారాయణ

కాలం  కలసివస్తే మనం చేసేది ఏదైనా చెల్లుబాటవుతుంది .చెల్లుతుంది కదా అని  ఏమైనా చేసేసి ఏమౌతుంది అనుకుంటే ఏదో ఒక రోజు అందుకు తగ్గ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అవినీతిపరుల పాలిట ఆరివీర భయంకరుడుగా పేరు తెచ్చుకున్న సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ హైకోర్టుకు చిక్కారు. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఒక ఉన్నతాధికారికి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏముంటుంది. అంతమంది అవినీతి పరుల్ని విచారణచేపట్టిన ఆఫీసరుగారికి ఎలా చట్టానికి చిక్కిపోతామో తెలియకనా లేదా మనల్ని ఎవరేమి చేస్తారని భరోసానో తెలియదు గాని ఉన్నదున్నట్లుగా సమాచారాన్నంతటిని లీకు చేయటమేమిటి. దీని వెనుక పాత్ర ఎవరిదో కూడా కోర్టు విచారణ చేపట్టవలసి ఉంది. ఈ కేసుకే ఇలా జరిగిందా ఇంతకు ముందు కేసుల్లో కూడా ఇలాంటి తతంగం జరిగిందో కూడా కోర్టులు పరిశీలించవలసి ఉంది. వెనకటికి ఒక ఇల్లాలు ఇంటికి నిప్పుపెట్టి అత్తా నాకు భయమేస్తుంది అన్నట్లు చేసిందంతా చేసిన లక్ష్మీనారయణ తన పర్సనల్‌ కాల్స్‌ని ట్రాప్‌చేసి నాఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఎదురు కంప్లెంట్‌ ఇవ్వటం విశేషం. విజయవాడలో పోలీస్‌కమీషనర్‌ గా పని చేసిన రామాంజనేయులు వృత్తిలో ఉన్నత ప్రమాణాలు  పాటించినప్పటికిని ఆయన సెల్‌ నుండి వేరే వారికి ఫోన్లు వెళ్లాయని ఎంత రగడ జరిగిందో తెలిసి ఇంతగా  ఎలా తెగబడ్డారో తెలియటం లేదు. లక్ష్యంవైపు పరుగులు తీసి లక్ష్యాన్ని చేరుకోగానే ఎందుకు దిగజారతారనే విషయం ఎంతకీ అంతుబట్టటం లేదు. సివిల్స్‌లో టాపర్‌గా నిలిచిన లక్ష్మీనారాయణ సిబిఐ నిబంధనలు అంతగా ఎందుకు తుంగలో తొక్కారో అర్ధంకాదు. సిబిఐ దర్యాప్తు జరిపే సమయంలో ఇష్టం వచ్చిన వారికి సమాచారం చెప్పేస్తే కుదరదని సిబిఐ మాన్యువల్‌ చెబుతోంది. కీలకమైన కేసుల్లో చార్జిషీటు దాఖలు చేసినప్పుడు గాని దానికి సంబందించిన నిందితులను అరెస్టు చేసినప్పుడు మాత్రమే సంబందిత విషయాన్ని సిబిఐ లో సూపర్నిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ స్థాయిలో ఉన్న అధికారి కాని,  ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో  అధికారి గాని, ప్రెస్‌నోట్‌ ద్వారా  సమాచారాన్ని ఇవ్వవచ్చని  సిబిఐ మాన్యవల్‌లోని  24:13:1 లో పేర్కొన్నారు. జాయింట్‌ డైరెక్టర్‌ స్ధాయి అధికారి అసలు సమాచారం లీక్‌ చేయకూడదని  సిబిఐ మాన్యువల్‌ లోని 24 :31 స్పష్టంగా చెబుతుంది. ఒక వేళ ఎవరైనా విలేకర్లు సమాచారం అడిగినా సమాచారం ఇచ్చే అధికారం తనకు లేదని సి.బి.ఐ.లోని  డిప్యూటీ ప్రిన్సిపల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసరుకు మాత్రమే ఆ అధికారం ఉందని వారు విలేకర్లకు చెప్పవలసి ఉంది.  ఏదో నోరుజారి ఒక  విషయం బయటికి వచ్చిందనుకుంటానికి కూడా లేకుండా తుమ్మింది దగ్గింది కూడా వెళ్లిందంటే ఇది ఆశామాషీ విషయం కాదని తెలుస్తుంది. విచారణ సమయంలో ఏదైనా లీకు అయ్యిందంటే సామాన్యంగా క్రింది స్ధాయి ఉద్యోగులెవరి మీదకైనా అనుమానం వస్తుంది. అయితే కాల్‌ లిస్టులో నెంబర్లు లక్ష్మీనారాయణ అఫీషియల్‌ ఫోను నుండే వెలువడటం ఆయన నైతికతను ప్రశ్నింస్తుంది. అదీ చిన్న స్దాయి రిపోర్టర్లకు ...ఏదో  మర్డర్‌ కేసుల్లో కాస్తోకూస్తో అవాస్తవాలను చొప్పించి క్రైంస్టోరీలు తయారు చేసే ఒకే వర్గానికి  చెందిన విలేకర్లకు చెప్పటం...ఇప్పుడు ఇదే వర్గం జగన్‌కు నార్కోఎనాలిసిస్‌ టెస్టులు జరపమంటం కూడా ఏదో కుట్ర వుందనే అనుమానాలకు తావిస్తుంది. మీడియాదేముంది ఇష్టమయితే నెత్తికెక్కించుకుంటుంది. కాదనుకుంటే కాళ్లతో తొక్కుతుంది. కాని రేపు విచారణంటూ చేపడితే సోకాల్డ్‌ మీడియా ఎంత వరకు లక్షీనారాయణ  వెంటనడుస్తుందనేది ప్రశ్నార్ధకమే!

అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు, సిఎం కిరణ్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఉదయం లష్కర్ బోనాల జాతరకు విచ్చేశారు. ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు వివిఐపిలు కూడా అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అయితే సిఎం కాన్వాయ్‌ని చూడగానే భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.సిఎం రావడంతో భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కిరణ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం కూడా వెనుదిరిగి వచ్చే సమయంలో మరోసారి సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ బండ కార్తిక రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ, పెద్దపల్లి ఎంపి వివేక్ కుటుంబ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత ఇంద్రసేనా రెడ్డి, సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

మాజీ మంత్రి మోపిదేవికి న్యాయ సహాయం చేయాలి: మంత్రి బొత్స

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు న్యాయ సహాయం చేయాల్సిందేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం అన్నారు. వివాదాస్పద జివోల జారీ వ్యవహారంలో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న మోపిదేవికి కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలని కోరుతూ తాను ప్రభుత్వానికి వ్యక్తిగతంగా లేఖ రాస్తానని చెప్పారు.   వివాదాస్పద జివోల వ్యవహారంలో సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్న నలుగురు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, గీతారెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణలకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పొన్నాలకు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మోపిదేవికి సహాయం లేకపోవడంపై బొత్స స్పందించి, సిఎంకు లేఖ రాస్తానని ఈరోజు చెప్పారు. సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నానిలతో తమకు సంబంధం లేదని బొత్స అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో వారు ఎవరికి ఓటేస్తారో తమకు అవసరం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలోపే పిసిసి కార్యవర్గ నియామకాలు ఉండవచ్చునని చెప్పారు.

టానిక్ పబ్ పైన పోలీసులు దాడులు: 60 మంది అరెస్ట్

హైదరాబాదు బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో ఉన్న టానిక్ పబ్ పైన పోలీసులు ఆదివారం ఉదయం ఐదు గంటలకు దాడి చేశారు. సుమారు 60 మంది యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. టానిక్ పబ్‌ను సీజ్ చేసి, ఎక్సైజ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. పట్టుబడ్డ వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన వారు యువకులు. వీరిలో ప్రముఖుల తనయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టానిక్ పబ్ పైన ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పబ్‌ను సీజ్ చేశామన్నారు. పట్టుబడ్డ వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు ఉన్నారని, వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ ఇస్తామని రవీంద్ర చెప్పారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతి వేడుకలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఆయనకు నివాళులర్పిస్తాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌ సమాధిస్థలి దగ్గర అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఉద్వేగానికి లోనయిన విజయమ్మ, షర్మిల కంటతడిపెట్టారు. ప్రార్థనల్లో మహానేత వైఎస్‌ఆర్‌ సేవల్ని స్మరించుకున్నారు. రాజశేఖరరెడ్డి చెరగని చిరునవ్వును గుర్తు చేసుకున్నారు. సమాధి స్థలి దగ్గర ప్రార్థనల తర్వాత కుటుంబ సభ్యులంతా ఘాట్‌ ప్రాంగణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని సందర్శించారు. విగ్రహానికి పుష్పమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ విజయమ్మ, షర్మిల బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ భారతి, వైఎస్ పురుషోత్తంరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కమలమ్మ, విమలమ్మ తదితరులు వైఎస్సార్ కు నివాళులర్పించారు.

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి జన్మదినాన్ని ప్రభుత్వం జరుపుతుందా ?

వైయస్‌ జన్మదినం ఆదివారం కావడంతో రాష్ట్రమంత్రి వర్గానికి ఏంచేయాలో పాలుపోవడం లేదు. జన్మదినాన్ని జరిపితే వైయస్సార్‌ అక్రమార్జన కేసులో కొడుకును సీబీఐ కేసుల్లో ఇరికించి జన్మదినం చేయటమేమిటని కాంగ్రెస్‌ నాయకులు నిలదీస్తారనేది నిజం. ఒకవేళ జరపకపోతే సానుభూతిని వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకి జమఅవుతుందేమోనని భయం నాయకులను వేధిస్తుంది. అందువల్ల దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు అయిన వైయస్‌ జన్మదినాన్ని ప్రభుత్వం జరుపాలా లేదా అనేది ఇంకా తేలలేదు. ఇంతకు ముందు ప్రభుత్వం తమ పార్టీనేతగానే గుర్తించి జన్మదిన వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడని విషయం ఏమంటే వైయస్సార్‌ని తమ నేతగా ప్రకటించి అభివృద్ది పధకాలగురించి వివరించి అవి కాంగ్రెస్‌విగా చెప్పుకోవాలా లేదా అవినీతిలో పాలు పంచుకొని అక్రమ సంపాదన కొడుక్కి ఇచ్చారని చెప్పాలా అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్‌ నుండి విడివడి వైయస్సార్‌ కాంగ్రెస్‌గా ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంటు సీటుతో విజయ దంధుభి మ్రోగించిన జగన్‌పై గరం గరంగా ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతుంది. జన్మదిన వేడుకలు జరుపకపోతే ప్రజల్లో ఇంకా చులకనౌతామని ఒకవైపు, జరిపితే జగన్‌ అది తన ఖాతాలో జమచేసుకుంటారని మరోబాధ మొత్తానికి ఎటూ తేల్చుకోలేని ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిఇలావుండగా వైసిపి పార్టీమాత్రం వైయస్‌ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరపాలని నిర్ణయించింది.  వైయస్సార్‌ జన్మదినాన్ని వైసిపి కాంగ్రెస్‌ ఇంతకు ముందెన్నడు ప్రజలమద్య జరపలేదు. అదికుటుంబకార్యక్రమంగానే  జరిపారు. అయితే ఉప ఎన్నికల్లో విజయం తర్యాత ప్రజల మద్య జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు, నాయకులు ప్రజలమద్యకు వెళ్లే అవకాశంగా భావిస్తున్నారు. జిల్లాస్ధాయిలోనూ ,డివిజన్‌ స్దాయిలోనూ దీన్ని   విజయవంతంగా జరపటానికి స్దానిక నాయకత్యం బాధ్యతలను నిర్వహిస్తుందని వైసిపి నాయకులు తెలిపారు. ఎప్పుడైనా స్ధానిక ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నందున కార్యకర్తలందరినీ   సన్నధం చేయండని వైసిపి గౌరవాద్యక్షురాలిగా విజయమ్మ చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలను జరుపుతున్నట్లు తెలుస్తుంది.

సిబిఐ పనితీరుపై విమర్శల వెల్లువ

ఇటీవల జరిగిన సిబిఐ విచారణల తీరు తెన్నులను పరీశీలించినట్లయితే రాష్ట్రనికొక పద్దతి చొప్పున దానిపనితీరు ఉండటం మేధావులనే కాక సామాన్యప్రజానీకానికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బయటి రాష్ట్రాలలో జరిగిన కేసులను పరిశీలించినట్లయితే ఆదర్శ్‌, 2 జి సెక్ట్రమ్‌, తాజ్‌ కారిడార్‌ స్కాముల్లోని నిందుతులు త్వరగానే  జైలునుండి వారు బయటకు వచ్చారు. వీరిపై కేసులు పెట్టిన  సి.బి.ఐ వివాదాలకు గురయింది. తాజాగా మాయావతి కేసు విషయంలో సిబిఐ ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.  మన రాష్ట్రానికి సంబందించి మాత్రం సిబిఐ పనితీరు కూడా వివాదాస్పదంగా ఉంది. ఇక్కడ నిందుతులంతా నెలలతరబడి బెయిలు కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. వారి విషయంలో సిబిఐ పనితీరు పలు అనుమానాలకు తావిస్తుంది.     సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ అయిన బిపి ఆచార్య, వై శ్రీలక్ష్మీ, రిటెర్డ్‌ ఆఫీసర్‌ విడి రాజగోపాల్‌, ( గాలి గనుల కేసులో ) బివి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ , యన్‌ శ్రీనివాసరెడ్డి, వైయస్‌ జగన్‌మోహనరెడ్డి మొదలైన వారంతా జైల్లోనే మగ్గటానికి కారణం వారు దేశం విడిచి వెళతారనో లేదా వారు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారనో కాదు. కేవలం సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ వీరి బెయిల్‌ పిటీషన్లను బలంగా నిరోధించటం వల్లే ఇలా జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు.  బహుశ ఆదర్శ్‌కుంభకోణంలోనూ, 2జి స్సెక్ట్రమ్‌కేసులోనూ, తాజ్‌కారిడార్‌ స్కామ్‌లోలా నిందుతులు కాంగ్రెస్‌ అధినేతలను ప్రసన్నం చేసుకున్నందువల్లే  బెయిలు వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా వైసిపి నాయకులు కాంగ్రెస్‌తో కాంప్రమైజ్‌ అయితే జగన్‌  బెయిలు రావడం తేలికవుతుందని ప్రచారం జరుగుతోంది.

మెదక్‌ సియస్‌ఐ చర్చి పీఠాధిపతుల నియామక వివాదం

ఎంతో చరిత్ర, పవిత్రత కలిగిఉన్న మెదక్‌ సియస్‌ఐ చర్చిలో వివాదాలు తారాస్థాయినందుకున్నాయి. ఎక్కడెక్కడినుండో భక్తులు ఇక్కడికి అచంచల భక్తి విశ్వాసాలతో వస్తారు. అయితే ఇక్కడ జరిగిన అనూహ్య పరిణామాలతో ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం డయాసిస్‌ పీఠాధిపతి టి కనకపు ప్రసాద్‌ అవినీతికి పాల్పడుతున్నారంటూ డయాసిస్‌ హౌస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సభ్యులు సియస్‌ఐ సినార్డ్‌లో 2012 జూన్‌ మొదటివారంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ఎలాంటి ఎలాంటి తనిఖీలు చేపట్టకుండానే బిషప్‌ కనకపు ప్రసాద్‌ను జూన్‌ 9న తొలగించారు. అనంతరం విజయవాడ బిషప్‌గా ఉన్న దైవాశీర్యాదాన్ని ఇన్‌చార్జ్‌ బిషప్‌గా కొనసాగుతారని సినార్డు అధికారులు ఉత్తర్వులు అందచేశారు. అయితే ప్రస్తుతం బిషప్‌గా కొనసాగుతున్న ప్రసాద్‌ విచారణచేపట్టకుండా, తనపదవీకాలం ముగియకుండా తొలగించటం పై కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈనెల 23 వరకు  కనకప్రసాద్‌ను బిషప్‌ గా కొనసాగాలని హైకోర్టు స్టే ఇచ్చింది.అయితే ఇది గిట్టని అపొజిషన్‌ వర్గం అడ్మిన్‌స్ట్రేటివ్‌ సభ్యులు సంగారెడి కోర్టు  నుండి  స్టే ఆర్డరును తీసుకువచ్చి  దైవాశీర్వాదంను హడావుడిగా చర్చిహౌస్‌కి తీసుకువచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు. విషయం తెలుసుకున్న బిషప్‌ కనకప్రసాద్‌ చర్చిహౌస్‌కి  చేరుకోగానే ఇరువర్గాల మద్య వాదోపవాదం జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది.       దీంతో పోలీసులు కారాక్యలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం సికింద్రాబాద్‌లోని ఎస్‌ డీ రోడ్డులోని కనకప్రసాద్‌ ఇంటిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సీయస్‌ఐకి సంబందించి ఎలాంటి అక్రమాలకు తాను పాల్పడలేదని, సీబీఐ ఎంక్వరీ తను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తాను బిషప్‌గా బాధ్యతలు స్వీకరించే నాటికే అడ్మిన్‌స్ట్రేట్‌ సభ్యులు చర్చి స్ధలాలను అక్రమంగా లీజ్‌కు ఇచ్చి సొమ్ము చేసుకున్నారన్నారు. ఈ విషయంలో సహకరించాల్సిందిగా బృదం సభ్యులు, బిల్డర్లు తనపై వత్తిడి తెచ్చారని వారినుండి తనకు బెదిరింపు ఫోన్‌ కాల్సు వస్తున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌ లోని స ియస్‌ ఐ చర్చిలకు సంబందించిన మెడికల్‌ కాలేజీలకు అప్పగించిన 17 కోట్లను కాజేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం బిషప్‌ దైవాశీర్వాదం తో కలసి సికింద్రాబాద్‌ చర్చిలకు సంబందించిన స్థలాలను కాజేయటానికి చూస్తున్నారని ఆయన ఆరోపిస్తూ తనకు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

తలాసానీ నీవు పార్టీలో ఉన్నట్లా లేనట్లా?

పార్టీకార్యకర్తలకు కౌ౦న్సిలింగ్‌లు ఇస్తూ రానున్న రోజుల్లో మనదే హవా అంటూ తనని తాను ఓదార్చుకొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే పనిలో పడ్డారు చంద్రబాబునాయుడు. హైదరాబాద్‌లో జరిగే మహంకాళీ అమ్మవారి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులతోపాటు టిడిపి నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టిడిపి అధినేత చంద్రబాబుని ఆహ్వానించాడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అంతే చంద్రబాబుకి తలసాని శ్రీనివాసయాదవ్‌ అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు.   ఏమండీ సీనియర్‌ అయ్యుండి మీరు ఇలా చేస్తే ఎలా పార్టీ మారిపోతున్నారంటూ వార్తలు వస్తే కనీసం ఖండి౦చడంలేదు. అసలే పార్టీ కష్టకాలంలో ఉంది, మీరు పార్టీకార్యక్రమాలకు కూడా గత నాలుగునెలలుగా రావడంలేదు, ఇంతకీ పార్టీలో ఉన్నట్లా లేనట్లా అంటూ తలసానిని కడిగిపారేశారు. నగరంలో కరెంటు సమస్యపై విద్యుత్‌సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా కు గాని, రైతుల సమస్యలపై ఇందిరాపార్కు దగ్గరకూ రాలేదని బాబు ఆక్రోషం వెళ్లగక్కారు. ఎన్టీఆర్‌ వర్దంతి ఇలా ప్రతిదానికి గైరుహాజరవటంపై తలసానిని  బాబు ప్రశ్నించారు. పార్టీలోఉంటూనే పార్టీ పరువు తీస్తున్నారని కూడా అన్నారు. ఇవన్నీ అమ్మవారి జాతరకు వచ్చిన ఆలయ కమిటీ మెంబర్లను బయటికి పంపి మరీ క్లాసు పీకినట్లు తెలిసింది. దానికి గాను తలసాని  పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పార్టీనిర్ణయాల్లో  ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.   చంద్రబాబునాయుడుతో చర్చల అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ వ్యవహారంగా అనునయించుకొన్నారు. అయితే ఈ వ్యవహారంపై సీనయర్‌ తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతూ తలసాని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు నడుపుతున్నారని, ఏపార్టీలోనూ స్ధానం లేకనే మళ్లీ బాబువద్దకు చేరారన్నారు. పార్టీ పోలిట్‌బ్యూరోలో స్ధానంకోసమే తలసాని ఇలాంటి ట్రిక్కులు ప్లేచేస్తున్నారని హైదరాబాద్‌ టిడిపి పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు ఆరోపించారు.

జగన్ ఆస్తుల కేసు: మంత్రులకి ప్రభుత్వం న్యాయ సహాయం

వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులలో నలుగురికి న్యాయ సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉదయం జీవోను జారీ చేసింది. వివాదాస్పదమైన 26 జీవోలపై సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న మంత్రులకు మంత్రుల తరపున లాయర్లకు ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డిలకు ప్రభుత్వం ఆయా శాఖల పద్దుల నుంచి ఫీజు చెల్లించనుంది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే అరస్టయి జైల్లో ఉన్న మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐటీ (ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ) శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలకు న్యాయ సహాయ అభ్యర్థనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదించనట్లు తెలుస్తోంది.

త్వరలో జిల్లాల వారీగా సామాజిక భద్రతాబోర్డులు?

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతాబోర్డులను జిల్లాల వారీగా ఏర్పాటు చేయనుంది. ప్రాథమిక పరిశీలన కింద రాష్ట్రసామాజిక భద్రతాబోర్డును నియిమంచింది. ఈ బోర్డు సామాజికభద్రతా పథకాల అమలును సమీక్షిస్తుంది. అలానే అవసరమైన చర్యలూ తీసుకుంటుంది. దీనిపై ప్రభుత్వం ఒక జీఓను విడుదల చేసింది. రాష్ట్రబోర్డుకు ఛైర్మన్‌గా కార్మికశాఖామంత్రిని నియమించారు. సభ్యకార్యదర్శిగా కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి, బిసి సంక్షేమం, సాంఘిక, మైనార్టీ, మత్స్య, ఎక్సయిజ్‌, అటవీ, పర్యావరణ, పురపాలక, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అసంఘటిత కార్మిక ప్రతినిధులుగా ఆరువిభాగాల వారితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. వీరందరూ కార్మిక సమస్యలపై చర్చించి వీలైనంత త్వరగా రాష్ట్రబోర్డు పరిథిలో పరిష్కరిస్తారు. అయితే ఈ బోర్డు పనితీరు పరిశీలించాక జిల్లాల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ బోర్డులు ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఈ బోర్డులకు జిల్లాకలెక్టర్లు ఛైర్మన్లుగానూ, జిల్లా లేబర్‌ కమిషనర్‌  కార్యదర్శిగానూ, ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల జిల్లా క్యాడర్‌ సభ్యులుగా ఉంటారు. పరిపాలనను సులభతరం చేస్తూ కార్మికసమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు ఈ బోర్డులు దోహదపడతాయని భావిస్తున్నారు.

ఒంగోలు, భీమవరం డంపింగ్‌యార్డులపై హైకోర్టు ఆగ్రహం?

    ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరపాలక సంస్థ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నగరపాలక సంస్థలు తమ డంపింగ్‌యార్డులను పంచాయతీల స్థలంలో ఏర్పాటు చేయటంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరం శుభ్రంగా ఉంచేందుకు సేకరించిన చెత్తను పంచాయతీల పరిథిలో పోస్తే అది గ్రామాలను కలుషితం చేస్తోందని వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది.  జస్టీస్‌ వివిఎన్‌ రావు, జస్టీస్‌ కృష్ణమోహనరెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ రెండు కార్పొరేషన్లు తమ పరిధిలో వేసుకోవాల్సిన చెత్తను పంచాయతీల్లో పోయటం వల్ల అక్కడ సాగునీటి వ్యవస్థకు ఇబ్బంది ఎదురవుతోందని గుర్తించింది.     అంతేకాకుండా అనారోగ్యం ప్రబలే అవకాశాలూ ఉన్నాయన్న అభిప్రాయాన్ని కూడా హైకోర్టు ఏకీభవించింది. నగర పరిధిలోనే కార్పొరేషన్లు చెత్త వేసుకోవాలని డంపింగ్‌యార్డులను తొలగించాలని ఒంగోలు, భీమవరం కార్పొరేషన్లకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. పర్యావరణ పరిరక్షణ సమితి ఇచ్చిన అనుమతులను కూడా ధర్మాసనం రద్దు చేసింది. పర్యావరణ పరిరక్షణ సమితి ఇకపై ఇటువంటి అనుమతులు ఇవ్వరాదని, పంచాయతీలకే పోరంబోకుభూములపై అధికారమున్నందున తక్షణం డంపింగ్‌యార్డులు మార్చాలని ఆదేశించింది.  

వరాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ జాతీయనేతలు రెడీ?

కోరినా కోరకపోయినా వరాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ జాతీయనేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి దాకా జాతీయనాయకుల ముఖం చూడాలని కాళ్లు అరిగేలా తిరిగిన వారందరికీ గతంలో తీసుకున్న అపాయింట్‌మెంట్‌ ఆధారంగా ఫోను వచ్చేస్తోంది. జాతీయ నాయకుల అపాయింట్‌మెంట్‌ డేటు, సమయంతో సహా ఫోనులోనే చెప్పేస్తున్నారు. ప్రత్యేకించి ఈ అపాయింట్‌మెంటు అంతా ఆంథ్రులకే పరిమితం. ఎందుకంటే ఉప ఎన్నికల్లో వచ్చిన చేదుఅనుభవం తిరిగి ఎదురవకూడదని ఎఐసిసి భావిస్తోంది. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణా అంశాన్నీ, ఇతర సమస్యలనూ తేల్చేయాలని ఉత్సాహపడుతోంది. ప్రత్యేకించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ విజయానికి కాంగ్రెస్‌లోని ద్వితీయశ్రేణి, తెలుగుదేశంలోని కిందిస్థాయి కార్యకర్తలు కారణమని కొత్త పరిశీలన ఎఐసిసి ముందుచేరింది. దీంతో ఇది ఎంతవరకూ కరెక్టో తేల్చుకోవాలని జాతీయనేతలు ఆంధ్రులతో సమావేశానికి ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని పటిష్టపరచాలంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాకాంగ్రెస్‌ క్యాడర్‌లను బలపరచాలని మంత్రివర్గ ఉపసంఘం ఎఐసిసికి విశదీకరించింది. గులాంనబీఆజాద్‌తో ఈ విషయమై ఆ సంఘాధ్యక్షుడు, మంత్రి ధర్మానప్రసాదరావు సమావేశమై తెలియజేశారు. చివరిగా సిఎం, పీసిసి చీఫ్‌లతో మాట్లాడి  ఫైనల్‌ చేసేద్దామని ఆజాద్‌ తెలియజేశారు. దీంతో ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వానికి పార్టీ పని లభించినట్లు అయింది. అలానే ఏ సమస్య పరిష్కారం కోసం వెళ్లినా సులభంగా నేతలు సహకరిస్తున్నారు.    అఖిలభారత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవాలని రాష్ట్రంలోని పలు జిల్లాల నేతలు ఉత్సుకత చూపారు. కొద్దిపాటి క్యాడర్‌ ఉండి నాయకునిగా గుర్తింపు ఉంటే వారికి సోనియా అపాయింట్‌మెంట్‌ లభిస్తోందని అథికారిక సమాచారం. అలానే ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంథీ రాష్ట్రంలో పరిస్థితిపైనే దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన పాల్వాయిగోవర్థనరెడ్డికి ఫోను చేయించి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈయన తరువాత పాలడుగు వెంకట్రావుకూ అలానే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. వీరిద్దరూ వయస్సు రీత్యా ఆ సమయానికి చేరుకోలేక వదిలేశారు.   వారం క్రితం పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రాయలసీమ నేత ఒకరు రాహుల్‌ని కలిసి మాట్లాడి వెళ్లారు. ఎంపిలు వి.హనుమంతరావు, ఎ.కె.ఖాన్‌ కూడా రాహుల్‌ను కలిశారు. మరికొందరు తాజాగా ఫోను చేసి రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. అసలు ఎవరు కలిసినా వీరిద్దరూ కూడా రాష్ట్రపరిస్థితులతో పాటు తెలంగాణా అవసరమా? కాదా? అన్న అంశాన్ని అడిగి పరిస్థితిని గమనిస్తున్నారు. రాహుల్‌గాంధీ అయితే ఇటీవల వారంలో ఐదు రోజుల పాటు ఆంథ్రారాజకీయాలపై దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది.