యువతకు దిశా నిర్దేశం స్వామి వివేకానంద బోధనలు
posted on Jul 4, 2023 @ 1:48PM
చిన్న కష్టానికే హడలిపోతున్నారు. అర్ధం లేని కారణాలకు ఆత్మ త్యాగాలను చేస్తున్నది ఈ జనరేషన్. కారణం ఇంట్లో సరి అయిన మార్గనిర్దేశం చేయాల్సిన తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపారాలలో పడి పిల్లలతో సరిగా మాట్లాడలేకపోవడం. ఎవరి పరుగు వాళ్లది. అయితే ఈ తరం వాళ్లలో స్ఫూర్తి నిండాలంటే స్వామి వివేకానందను చదవాలి. స్వామి వివేకానంద కొత్త తరాలను జాగృతం చేసే గొప్ప మాటలను గ్రంథస్తం చేశారు. యువతే భావిభారత నిర్మాణానికి పునాదులని, వారి చైతన్యమే దేశ భవిష్యత్ కు కరదీపమని భావించి గొప్ప సూక్తులను ఉపదేశించారు. ఆ క్రమంలో ఎన్నో సందేశాలను ప్రవచించారు. ప్రతి పౌరుడు హృదయంలో చెరగని సంతకంగా నిలిచిపోయారు.
కాలం మారింది, సామాజిక పరిస్థితులు మారాయి పాశ్చాత్య పోకడలు నవీన నాగరికతను నిర్వచిస్తున్నాయి. ఈ సమయంలోనే మనం తరం జాగృతం కావాలి " బలమే జీవనం - బలహీనతే మరణం" (strength is life - weakness is death) అంటారు వివేకానంద. ప్రకృతి ఉపద్రవాలు వైపరీత్యాలు, మనిషి ఉనికినే ప్రశ్నిస్తున్న కరోనా లాంటి వాటిని దీటుగా ఎదుర్కొని నిలబడాలంటే మానిసికంగా ఎంతో బలపడాల్సి ఉంది. బలహీనతల్ని ఐక్యతతో ఎదుర్కోవాల్సి ఉంది. ఇంకా ఆర్ధిక అసమానతలతో నిరుద్యోగ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి అదే బలహీనతగా దారి తీసి చీకటి అగాధంలోకి జారిపోయి ఆత్మ త్యాగాలను చేసే ఎంతోమంది అమాయక యువతను మానసికంగా శారీరకంగా బలమే జీవనం అని నమ్మి నవ ఉత్తేజంతో ముందుకు సాగాలంటే వివేకానంద పుస్తకాలను చదవడమే మార్గం. ఎవరైతే తనని తాను విశ్వసించడో వాడే పెద్ద నాస్తికుడు" అంటారు స్వామి వివేకానంద. ప్రస్తుతం యువత ఆస్థికతకు నాస్తికతకు మధ్య ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు. దేవుడు- నమ్మకం గురించి అనవసర చర్చలు జరిపి దేశ యువతిని భారతీయతకు దూరం చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీంతో కల్పిక నాస్తికతపై ఎక్కువ చర్చ జరిగి యువ సమాజం అయోమయంలో పడిపోతున్నది. ఇలాంటి యువతకు వెలుగు మార్గం చూపే సందేశాలను స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. దేవుడి కంటే ముందు నిన్ను నువ్వు నమ్ము అంటాడు వివేకానంద. ఇలా ప్రతి సంక్షోభానికి వివేకానందను చదివితే పరిష్కారం దొరుకుతుంది. ఇలా తన జ్ఞాన తేజస్సుతో స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటల్ని మూటకట్టి విజ్ఞాన బాండాగారాన్ని మనకోసం వదిలేసి వెళ్లిపోయారు. అందుకే ఆయన చెప్పిన మాటలు నిత్యం మనం స్మరణం చేసుకుంటే చాలు. నిరాశ నిస్తేజం కి చోటు ఉండదు.
(స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా)