వైనాట్ 175 నినాదమెక్కడ? జగన్ కి బొమ్మ కనబడిందా?

రాజకీయాలలో ఒక్కో పార్టీకి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఏపీలో వైసీపీకి ఓ స్టైల్ ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం ఒక నినాదాన్ని ప్రకటించి.. ప్రజల చెవులలో మారుమ్రోగేలా కార్యకర్తల చేత ఆ నినాదాన్ని ఊదించడం వైసీపీ స్టైల్. గత ఎన్నికలలో టీడీపీ రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ అనడం నుండి ఒక్క ఛాన్స్ ప్లీజ్ వరకూ వైసీపీ చాలానే గిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేసింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసాక ఈ నాలుగేళ్ళలో కూడా వైసీపీ అలాంటి  కొన్ని నినాదాలను బలంగా ప్రజలలోకి పంపేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలోనే ఆ మధ్య వైసీపీ నుండి వై నాట్ 175 అనే నినాదం  బయటకొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ అందరూ వై నాట్ 175 అంటూ మీడియా మైకుల ముందు ఊదరగొట్టేసే వారు.  అయితే, ఇప్పుడు ఆ నినాదం మరుగున పడింది. ఈ మధ్య కాలంలో వై నాట్ 175 నినాదం వైసీపీ నేతల నోటి నుండి రావడం లేదు.  దీంతో వైసీపీకి తత్వం బోధ పడిందా? అందుకే వై నాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టేశారా? అసలు ఈ నినాదం వైసీపీ ఎందుకు వదులుకుంది అనే చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతుంది. నిజానికి వైసీపీ నినాదం అయితే వదిలింది కానీ అది సాధ్యమయ్యే పని కాదు. గత ఎన్నికలలో 151 రావడం వెనక సవాలక్ష కారణాలు ఉన్నాయి. వైసీపీ అందుకున్న ఒక్క ఛాన్స్ ప్లీజ్ నుండి అమరావతి మీద ఆరోపణలు చేయడం, మేధావులుగా పిలవబడే కొందరు నిత్యం మైకుల ముందు టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లడం, వివేకా హత్యకేసు, కోడికత్తి కేసు సానుభూతి, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం ప్రణాళికలు, జగన్ పాదయాత్ర ఇలా చాలా రకాలుగా కలిసి వస్తేనే వైసీపీకి 151 సీట్లు గెలుచుకున్నారు.  కానీ, ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే బలంగా వినిపిస్తుంది. సీఎం సొంత ప్రాంతం రాయలసీమలోనే ఈసారి జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉండకడం కష్టమే అంటున్నారు. క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో సగానికి సగం మంది రెబల్స్ అయ్యారు. అటు వైపు చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా లాంటి వారికే ఎదురుగాలి వీస్తుంది. ఇటు గుంటూరు లాంటి జిల్లాలో పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాట ప్రజలలో చులకన చేసింది. మరోవైపు ముక్కలైన వైఎస్ కుటుంబం, బాబాయ్ వివేకా హత్య కేసులో అబ్బాయిలే నేరస్తుల్ని సీబీఐ స్టేట్మెంట్లు ఇవ్వడం, కోడికత్తి శీను జైల్లోనే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం ఇలా అన్నీ ప్రజలే చూస్తున్నారు. మరోవైపు వైసీపీ సృష్టించిన అరాచకాలు, నేతలు చేసిన దందాలు, కక్ష్యపూరిత రాజకీయాలు, ఇసుక కోసం పడిన పాట్లు, చెత్తకు కడుతున్న ట్యాక్సులు ఇలాంటివి కూడా ప్రజలు అంత సులభంగా మర్చిపోయేవి కాదు.  ఇవన్నీ కలిసే ప్రజలలో ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకత పెరిగింది. నాడు వైపీపీ విజయానికి ఏ అంశాలైతే దోహదపడ్డాయో అవి ఇప్పుడు వైసీపీకి గుదిబండలుగా మారి ఓటమి భయాన్ని కలిగిస్తున్నాయి. గడపగడపకి కార్యక్రమంలో ఈ వ్యతిరేకతే వైసీపీ నేతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా ప్రజలు మీరేం చేసారని పలు చోట్ల నిలదీశారు. దీంతో కొంత మంది గడపగడపకు కు డుమ్మా  కొట్టేశారు. ఆ వ్యతిరేకత చూసిన తర్వాత వైసీపీ వై నాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి నినాదాలు ఇచ్చి ఆ తర్వాత కొత్త ఇబ్బందులు తెచ్చుకోవ‌డం ఎందుక‌నే కొంద‌రు సీనియ‌ర్ల అభిప్రాయంతోనే ఈ నినాదం మాయమైనట్లు కనిపిస్తుంది. అందుకే నాలుగు నెలల ముందు ఇచ్చిన వై నాట్ 175 నినాదం ఇప్పుడు   సీఎం సహా వైసీపీ నాయకుల నోటి వెంట రావడం లేదు. సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. కొన్నాళ్ల కింద‌ట వైనాట్ 175 అనేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పాల్గొనే స‌భ‌ల్లో  ఆయన నోట  వైసీపీని గెలిపించండి అన్న అభ్యర్థన మాత్రమే వినిపిస్తోంది. వై నాట్ 175 మాట దేవుడెరుగు అత్తెసరుగానైనా సరే అధికారాన్ని నిలబెట్టుకుంటే అదే పదివేలన్న బేలతనం కనిపిస్తోంది. 

స్పీడ్ న్యూస్ 1

1. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆమె భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ ఉదయం బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారికి పురందేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు.  2.యూకే వెళ్లాలనుకునే వారికి ఇకపై అక్కడి వీసా ఖర్చులు పెరగనున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్వయంగా ప్రకటించారు. వైద్య ఖర్చుల కోసం వీసాదారులు చెల్లించే హెల్త్ సర్‌చార్జ్ ఇతర ఫీజులు పెరుగుతాయని ఆయన  స్పష్టం చేశారు. 3.ఏపీ సీఎం వైఎస్ జగన్ తనకు శత్రువు కాదని, అతనికి అంత సీన్ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. గురువారం తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో సమావేశమయ్యారు.  4.ప్రాజెక్టుల విషయంలో కేంద్ర వైఖరిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి రెండో దశ పర్యావరణ అనుమతుల కోసం గురువారం కేంద్రానికి లేఖ రాశారు. 5.బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలు ఉన్నారని ఆ పార్టీ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు పదవిపై ఎలాంటి వ్యామోహం లేదన్నారు.  6.ఉమ్మడి పౌర స్మృతికి  తాము వ్యతిరేకమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. అందరికీ ఒకే విధానమన్న విధానానికి తాము వ్యతిరేకమని తెలిపారు. యూసీసీని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ లా కమిషన్ కు లేఖ రాశారు. 7.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు, రేపు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.   మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.  8.. తగ్గినట్టే తగ్గి బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దమ్కీ ఇచ్చాయి.  బంగారం వచ్చేసి రూ.60 వేలకు చేరితే.. వెండి కిలోపై ఏకంగా రూ.2000 పెరిగింది. ఇంత భారీగా పెరగడం అనేది ఈ ఏడాదిలోనే జరగలేదని చెప్పాలి. 9.సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరదీసిందని టీడీపీ సీనియర్ నేత, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పేరిట రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చారని వెల్లడించారు.  10.ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత పెదనాన్నను వాలంటీర్ ప్రవీణ్ దారుణంగా హత్య చేశాడు. పొలం తగాదా నేపథ్యంలో ఈ పెదనాన్నను హతమార్చాడు. 11.దుండిగల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే బి.ప్రభాకర్ రెడ్డి అనే ఎస్సై 35 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఆయనను జీనోమ్ వ్యాలీ పీఎస్ కు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 12.ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత విద్యార్థులకు ప్రాన్స్ శుభవార్త చెప్పింది. మాస్టర్స్ వంటి ఉన్నత చదువుల కోసం పారిస్ వచ్చే భారత విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక ఐదేళ్ల పాటు పనిచేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఐదేళ్ల వర్క్ వీసా ఇవ్వనున్నట్లు తెలిపింది.  13.స్నేహితుడిపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం  యూపీలోని సోన్‌భద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో  జరిగిందీ ఘటన. బాధితుడు, నిందితుడు ఇద్దరూ మంచి స్నేహితులు. జవహర్ పటేల్ స్నేహితుడు గులాబ్ కోల్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత అతడిపై మూత్రవిసర్జన చేసినట్టు ఎస్పీ యస్వీర్ సింగ్ తెలిపారు.   14. జనసేనాని కార్యక్రమాలకు ఇచ్చే ఎంట్రీ పాసులకు నకిలీలు సృష్టిస్తున్నారు. ఈ బెడద తప్పించేందుకు జనసేన పార్టీ వినూత్నంగా ఆలోచించింది. రూపాయి నోటును పోలిన పాసులను తయారు చేసింది. అచ్చంగా రూపాయి నోటులానే ఉండే ఈ పాస్ పై జనసేన స్టాంప్ ను ముద్రించి పంచుతోంది. 15.రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. యమునా నది వరదల నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితిపై ఆరా తీసినట్లు వెల్లడించింది. ఈమేరకు రాత్రి పీఎంవో ఓ ట్వీట్ చేసింది. 16.తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక కడతేర్చిందో భార్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఈ ఘటన వెలుగు చూసింది.  భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ ఇటీవల ఓ రోజు అతడి తలపై చెంబుతో బలంగా కొట్టి చంపేసింది.  17.తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియలెస్టేట్ వ్యాపారి తిరుపతి రెడ్డి కిడ్నాప్ కు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆల్వాల్ లో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన భర్త కిడ్నాప్ కు గురయినట్టు ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18.టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చెందిన యానిమేటెడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. 13 రోజుల్లోనే ఏకంగా 10 మిలియన్ వ్యూస్‌కు చేరువవుతోంది. టైటాన్ విషాదంలో పాకిస్థాన్ బిలియనీర్, ఆయన కుమారుడు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.  19.జాతుల మధ్య వివాదంలో క్రైస్తవ సమాజం పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్.వన్‌రామ్‌చువంగా రాజీనామా చేశారు. ఈ మేరకు మిజోరం బీజేపీ చీఫ్ వన్లాల్హ్ముకాకు లేఖ రాశారు. మణిపూర్‌లో క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలపై తాను తీవ్రంగా కలత చెందినట్టు అందులో పేర్కొన్నారు.  20. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 145 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలుగు రాష్ట్రాలపై ఆశలకు బీజేపీ తిలోదకాలు?!

దక్షిణాదిపై మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై తనకు ఉన్న చిన్న చూపును బీజేపీ హైకమాండ్ మరోసారి తేటతెల్లం చేసింది.  పేరుకు తెలుగు రాష్ట్రాలపై తనకు అపారమైన గౌరవాభిమానాలున్నాయని చెప్పుకునే బీజేపీ అధిష్ఠానం ఆచరణలో మాత్రం ఆ రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యత కూరలో కరివేపాకు చందమేనని మరో సారి చాటుకుంది.   జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను చూస్తే తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీకి ఉన్న చిన్న చూపు ఎంత అన్నది అర్ధమౌతుంది.  రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ శూన్య హస్తాన్నే చూపింది. రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి వరకూ  గుజరాత్‌ నుంచి బాబు బాయి జేసంగ్‌ బాయ్‌, కే శ్రీదేవన్స్‌ జాలా, బెంగాల్‌ నుంచి అనంత్‌ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే గుజరాత్‌ నుంచి కేంద్రమంత్రి జైశంకర్‌ పేరును నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.   అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క బీజేపీ నేతకు కూడా అవకాశం ఇవ్వలేదు. ముందుగా అయితే   బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు పేరు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయని బాగా ప్రచారం అయ్యింది.  అయితే బీజేపీ హై కమాండ్ మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ పరిశీలించలేదని తేలిపోయింది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ అంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ తెలంగాణపై బీజేపీ భారీ ఆశలు పెంచుకుంది. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తరువాయి అన్నంతగా హడావుడి చేసింది. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రంమే తెలంగాణలో బీజేపీ వాపును చూసి బలుపు అనుకుందన్న విషయం బయటపడింది. దక్షిణాదిలో పాగా వేయాలన్న ఆకాంక్షలు ఇప్పటిలో నెరవేరే అవకాశాలు లేవని రూఢీ అయిన తరువాత బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్రాలలో నేతలకు   రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఉపయోగం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమౌతోంది. అలా ఇచ్చినా కూడా ఆయా రాష్ట్రాల పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ నింపే అవకాశాలు ఇసుమంతైనా లేవన్న నిర్ణయానికి బీజేపీ హై కమాండ్ వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై ఇసుమంతైనా ఆశలు లేకపోవడం వల్లనే రాజ్యసభ విషయంలో ఆ రాష్ట్రాల నుంచి ఎవరినీ కనీసం పరిశీలించలేదన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వ్యక్తమౌతోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి లక్ష్మణ్, ఏపీ నుంచి జీవీఎల్ ను ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపిన సంగతి విదితమే. అయితే వారి వల్ల తెలుగు రాష్ట్రాలలో పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని బీజేపీ హై కమాండ్ భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.    

స్వాహాయజ్ణంలో జగన్ సర్కార్ స్టైలే వేరు!

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఆర్థిక  నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ పథకాన్ని చూసినా అవినీతే రాజ్యమేలుతోంది.  దోపిడీ కోసం ఏకంగా కార్పొరేషన్ ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు తీసుకోవడం గతంలో ఎన్నడూ చూడని కొత్త స్టైల్.   ప్రభుత్వ తాజాగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   కరువు నివారణ అంటూ కార్పొరేషన్ పేర అప్పులు తీసుకువచ్చి ఆ రుణాల సొమ్మును ప్రైవేటు ఖాతాలకు మళ్లించారంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఒక్క ఈ రూపేణా దాదాపు 900 కోట్ల రూపాయలు దారి మళ్లాయని కేశవ్ ఆరోపిస్తున్నారు. నిధుల దోపిడీ విషయంలో ఏపీ సర్కార్ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. అప్పుల సొమ్ముతోనూ స్కామ్ చేయడం ఒక్క జగన్ సర్కార్ కే చెల్లిందని పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా అయిన పయ్యావుల కేశవ్ అన్నారు.  గురువారం (జూలై 13)  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పయ్యావుల కేశవ్  రుణాల సొమ్ముదారి మళ్లింపు స్కాంపై  సీబీఐ విచారణ కు డిమాండ్ చేశారు. రాయలసీమలో కరువు నివారణ కోసం అంటూ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పేరుతో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నిమిత్తం అప్పు చేసింది. అసలా పనులు చేపట్టకుండానే.. పూర్తై పోయాయని చెబుతున్నారు.  తీసుకున్న రుణానికి చెల్లింపులూ జరిపేస్తున్నారు. ఆ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అ రుణం 900 కోట్ల రూపాయలూ నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లించారు. విషయమేమిటంటే.. ప్రభుత్వం ఈ యేడాది మార్చి 29న బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్ జారీ చేస్తే మూడు రోజుల్లో రుణం మంజూరైపోయింది.  అయితే ఆ సొమ్ములు కార్పొరేషన్ ఖాతాలోకి రాకుండానే నేరుగా కాంట్రాక్టర్ కు బదలీ అయిపోయాయి. ఏ పనుల నిమిత్తం అయితే రుణం తీసుకున్నారో ఆ పనులు జరగనే లేదు. అయినా పనులు పూర్తైపోయాయంటూ సర్కార్ సర్టిఫై చేసేసింది. అప్పుల సొమ్మును కూడా స్వాహా చేసే భారీ కుంభకోణం జగన్ సర్కార్ లో జరుగుతోందనీ.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలనీ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నారు.     ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణం ప్రభుత్వ ఖాతాలో జమ కాకుండానే  నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లింపు అయిపోయింది. ఇప్పుడీ రుణాన్ని ప్రభుత్వ తన ఖాతాల నుంచి చెల్లిస్తున్నది.  పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నట్లు ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వ అప్పుల కుంభకోణాలన్నీ బయటపడతాయని పరిశీలకులు అంటున్నారు.   అసలు జగన్ ప్రభుత్వాన్ని నడపడానికి పూర్తిగా అప్పులపైనే ఆదారపడుతున్నారు. దశలవారీ సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రారంభించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని మరీ అప్పులు తీసుకువస్తున్నారు. భవిష్యత్ లో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకువస్తున్నారు. తాజాగా మద్యం తాకట్టు ద్వారా మరో 8 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి రెడీ అయిపోయారు.  మొత్తంగా ఒక్క చాన్స్ అభ్యర్థనతో అధికారంలోకి వచ్చిన జగన్ మరో చాన్స్ దక్కదన్న నిర్ణయానికి వచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిపిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.  మొత్తం రుణాలతో ప్రభుత్వాన్ని నడుపుతూ  రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి పంపేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. 

పవన్ దూకుడు.. బాబు వ్యూహమేనా?

ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి విజయ యాత్రతో ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాడు. అధికార పార్టీ నేతలపై.. ముఖ్యంగా సీఎం జగన్‌పై పోట్లగిత్తలా కాలుదువుతున్నాడు. ఈ క్రమంలో వైసీపీ నేతల మాట తీరుకు సరిఅయిన సమాధానం ఇస్తున్నాడు. ఇన్నాళ్లు మాజీ సీఎం, టీ-డీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీ-డీపీ నేతలను ఓ ఆట ఆడుకున్న వైసీపీ నేతలు ప్రస్తుతం ఆ ఫోకస్‌ను పవన్‌ వైపుకు మళ్లించారు. ఇటీ-వల ఏలూరులో జరిగిన వారాహీ యాత్రలో వాలంటీ-ర్స్‌ వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాక్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం వెనుక కొందరు వాలంటీర్స్‌ ఉన్నారని, వారు సేకరించిన డేటా తప్పుడు పనులకు ఉపయోగపడుతుందని పవన్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ వాక్యలపై వాలంటీర్స్‌, వైసీపీ నేతలు భగ్గుమన్నారు. వాలంటీర్స్‌ పవన్‌ కళ్యాణ్‌ దిష్టిబొమ్మలు దహనం చేయగా, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి పవన్‌ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ వర్సెస్‌ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వాలంటీర్‌ ఫిర్యాదుతో పోలీసులు పవన్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు సైతం నమోదు చేశారు. వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌పై దృష్టిసారించడంతో చంద్రబాబు, టీడీపీ నేతలు కొంత ఊపిరిపీల్చుకున్నట్లయింది. ఇన్నాళ్లు చంద్రబాబు, టీడీపీ నేతలపై ఒంటికాలుపై లేచిన వైసీపీ మంత్రులు ప్రస్తుతం వారి దృష్టిని పవన్‌ వైపు మళ్లించారు. మరోవైపు చంద్రబాబు అండ్‌ కో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రౌండ్‌ లెవల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది. పొత్తుతో వెళ్లాలా.. పొత్తు పెట్టుకుంటే జనసేనతో పాటు బీజేపీతోనూ చేతులు కలపాలా? అనే విషయాలపై సర్వేలు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. సర్వేల ఆధారంగా పొత్తు పెట్టుకుంటే జనసేనకు ఎన్ని సీట్లు  ఇవ్వాలి. బీజేపీకి ఎన్నిస్థానాలు కేటాయించాలి..? వారికి ఏం నియోజకవర్గాలు కేటాయించాలనే విషయంపై చంద్రబాబు లెక్కలువేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కనీసం 120 నుంచి 130 స్థానాల్లో పాగా వేయాలని చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఈ క్రమంలో దీంతో ఓ వ్యూహంతో వారు ముందుకెళ్తున్నారన్న ప్రచారమూ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. అధికార పార్టీపై పవన్‌ కళ్యాణ్‌ దూకుడు వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఓ బలమైన సామాజిక వర్గం ఓటర్లను తమవైపుకు మళ్లించడమే చంద్రబాబు, పవన్‌ టార్గెట్‌ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యూహంలో భాగంగానే ఇన్నాళ్లు టీడీపీ నేతలే టార్గెట్‌ విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోకస్‌ను పవన్‌ కళ్యాణ్‌ తనవైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గం వైఎస్‌ జగన్‌ వైపు ఎక్కువగా ఉంది. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువే. పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ నేతలను టార్గెట్‌ చేయడంద్వారా ఆటోమేటిక్‌గా వైసీపీ నేతలు పవన్‌కు కౌంటర్‌ ఇస్తుంటారు. ఈ క్రమంలో కాపు ఓటర్లు పవన్‌ వైపు సానుభూతి చూపే అంశాలు లేకపోలేదు. దీనికితోడు వారాహి యాత్రల్లో మీరంతా కలిసిఉంటే తాను సీఎం అవుతానంటూ పవన్‌ పదేపదే చెబుతున్నాడు. కావు సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఒకరు సీఎం అవ్వాలని ఆ సామాజిక వర్గం భావిస్తుండటం సహజమే. గతంలో చిరంజీవికి బలమైన మద్దతుగా ఆ సామాజిక వర్గం నిలిచింది. కానీ, చిరంజీవికి సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. కాపు సామాజిక వర్గం జగన్, పవన్ మధ్య చీలిపోయి ఉంది. కాపు సామాజిక వర్గంను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి దూరం చేయాలంటే పవన్‌ కళ్యాణ్‌ ఫ్రంట్‌లైన్లో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహంలో భాగమని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌కు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. వైసీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేయటానికి పెద్దగా ఏమీ ఉండవు. కేవలం బూతులు తిట్టడం మాత్రమే.  ఈ నేపథ్యంలోనే పవన్‌ను ఫ్రంట్‌లైన్లో పెట్టడం ద్వారా కాపు సామాజిక వర్గంతో పాటు చంద్రబాబు అంటే గిట్టనివారు. ప్రస్తుతం వైసీపీకి తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు పలుకుతున్న వారు ఆ పార్టీకి దూరమై పవన్‌ వైపు వస్తారన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. అలా పవన్‌ కళ్యాణ్‌కు బలమైన ఓటు బ్యాంక్‌ చేరుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పొత్తుతో వెళ్లాలని ఇప్పటికే పవన్‌, చంద్రబాబు నిర్ణయించుకున్న క్రమంలో ఆ ఓటు బ్యాంకు వైసీపీ ఓటమికి ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల వ్యూహంగా తెలుస్తోంది. దీంతో వారిద్దరు అనుకున్నట్లే సీఎం జగన్‌ వారి వ్యూహంలో చిక్కారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. 

ఖాకీవనంలో గంజాయి మొక్కలు

పోలీస్ శాఖకు పర్యాయపదం.. బాసిజం. ఆ శాఖలో ప్రతీ దశలో బాసిజమే రాజ్యమేలుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి శాఖలో క్రమానుగత శ్రేణిని బట్టి పరిశీలిస్తే.. ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకోవడం అనేది అనాదిగా ఉన్నదే.  అయితే అటువంటి శాఖలో మహిళా అధికారులు అతి కొద్దిమందే ఉన్నా.. వారిలో పలువురు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదని.. వారి చర్యలతో ఖాకీ దుస్తుల ప్రతిష్ట మసకబారేలా ఉందన్న  చర్చ  ప్రస్తుతం ఊపందుకొంది.   పోలీసు అధికారుల్లో పురుషులు కరుకుగా, అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే అందులో అర్థం.. పరమార్థం ఉందనుకోవచ్చు. కానీ ఖాకీ దుస్తులు వేసుకొన్న ఆడవారు సైతం.. ఫురుషులతో పోటీ పడేలా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం, శాంతిభద్రతలు పరిరక్షణలో భాగంగా ప్రజలతో   రుబాబుగా , దురుసుగా వ్యవహిరిస్తున్న పలు సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకొంటున్నాయి. అలాంటి సంఘటనలపై ప్రజాస్వామిక వాదులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్... తన రెండు చేతులతో జనసేన పార్టీకి చెందిన వ్యక్తి చెంపలను వాయించారు. అందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు.. సీఐ వ్యవహార శైలిపై ఇప్పటికే స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే విశాఖపట్నంలో ఆర్మీ రిజర్వుడు సీఐ స్వర్ణలత సైతం నోట్ల మార్పిడి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి..  ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. మరోవైపు.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారి సౌమ్య మిశ్రా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో నగరంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆమె బదిలీపై వెళ్లిపోతూ.. ప్రస్తుత టీడీపీ నాయకుడు వంగవీటి రాధా తల్లి వంగవీటి రత్నకుమారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి మరీ వెళ్లిపోయారు.  అలాగే సౌమ్య మిశ్రా విశాఖ డీజీపీగా ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టి.. తనపై అధికారి సౌమ్య మిశ్రాను కలిసేందుకు విశాఖలోని ఆమె కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమె లేకపోవడం.. తాను వచ్చిన విషయాన్ని పర్యటనలో ఉన్న ఆమెకు తెలియజేశారు. అయితే తాను పర్యటనకు వచ్చానని. తాను వచ్చే పరకు తన కార్యాలయంలో వేచి ఉండాలంటూ.. సూచించారు.  కానీ ఆమె తన కార్యాలయానికి రావడం ఆలస్యం కావడంతో.. శ్రీకాంత్.. తన నివాసం శ్రీకాకుళం వెళ్లిపోయారు. ఆ తర్వాత సౌమ్యా మిశ్ర.. శ్రీకాంత్‌పై కక్ష సాధింపు చర్యలకు సదరు డీఐజీ శ్రీకారం చుట్టారనే ఓ ప్రచారం సైతం నాడు ఊపందుకొంది. ఇలా పోలీస్ శాఖలోకి ప్రవేశించే స్త్రీ శక్తులు.. తమ శౌర్య ప్రతాపాలతో.. ప్రజా రక్షణ కోసం తహతహలాడాల్సింది పోయి.. అక్రమ నగదు కోసం ఒకరు.. ఖాకీ పవర్ చూపించడం కోసం మరొకరు.. ఈగోల సమస్యలతో ఇంకొకరు.. కనిపించని నాలుగో సింహం అయిన ఖాకీవనంలో గంజాయి మొక్కలుగా మిగిలిపోక తప్పదని ప్రజాస్వామిక వాదులు ఓ విధమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని లేని రాష్ట్రం అంటూ బొత్స పరువు తీసిన తెలంగాణ మంత్రి!

మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కనీసం పరీక్షలు కూడా నిర్వహించుకోలేని స్థితిలో తెలంగాణ ఉందని ఏపీ మంత్రి అంటే.. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మీరు కూడా మమ్మల్ని అంటారా అంటూ తెలంగాణ మంత్రి కౌంటర్ వేశారు. టీఎస్పీఎస్సీపై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితిలో తెలంగాణలో ఉందన్నారు. అంతేకాదు, తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో స్కామ్ ఎలా జరిగిందో అంతా చూస్తూనే ఉన్నామని.. అన్నీ చూచి రాతలే అన్నారు. ఈ పేపర్ లీకేజీ స్కాం వ్యవహారంలో ఎంతమంది అరెస్టు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయని.. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితిలో తెలంగాణ ఉందంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు.  మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు వెంటనే స్పందించారు. బొత్స వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ రాష్ట్రమేంటో, మా రాష్ట్రమేంటో మాకు తెలియదా? అని ప్రశ్నించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రాజధాని కూడా లేని రాష్ట్రం అది అన్నారు. బొత్స అలా మాట్లాడటం సరికాదని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. గతంలో ఏపీపీఎస్సీలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలంటూ బొత్సకు సూచించారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్పత్రులు కట్టుకున్నారనేది అందరికి తెలుసునని.. ఇప్పటికీ అక్కడివారికి అనారోగ్యం వస్తే చికిత్స కోసం ఎక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు. నెలకొకసారైనా హైదరాబాద్‌కు రాకుంటే ఆయన ప్రాణం ఊరుకోదని.. అలాంటిది హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని బొత్సు  శ్రీనివాస్ గౌడ్ హితవుపలికారు.  ఇప్పుడు ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలతో మరోసారి ఏపీ రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీకి రాజధాని ఏదని గతంలో అదే మంత్రి బొత్సను మీడియా అడిగితే సమాధానం చెప్పలేక కాసేపు నీళ్లు నమిలి త్వరలోనే చెప్తామన్నారు. కానీ, ఏళ్ళు గడిచినా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎక్కడో స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నది. కాగా, ఇప్పుడు అదే మంత్రి బొత్సకి పక్క రాష్ట్రాల నుండి కూడా కౌంటర్లు పడుతున్నాయి. ఒకరకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరువు తీసేశారు. అలాగే జగన్ పరువుకూడా తీసేశారు. రాజధానే లేని రాష్ట్రం మీరా మమ్మల్ని అనేది అంటూ వైసీపీ నేతలు అందరికీ చురకలంటించారు. దీంతో ఇప్పుడు ఏపీలో మరోసారి రాజధాని అంశంపై చర్చలు సాగుతున్నాయి.  ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం నిదానంగా సాగుతూ, ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేయలేకపోయారని విమర్శించిన వైసీపీ.. ఇప్పుడు చివరికి అసలు రాజధానే లేకుండా రోడ్డున పడేసిందని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతిని నాశనం చేసేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రం ఇప్పుడు రాజధాని లేకుండా మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇప్పుడు ఇలా పక్క రాష్ట్రాల నేతలు సైతం మొత్తం రాష్ట్రాన్ని ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి వచ్చిందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి శ్రీనివాస్ అన్నట్లు వైద్యానికి కూడా ఏపీ ప్రజలు హైదరాబాద్ కు పరుగులు పెట్టడాన్ని కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయమే అనీ.. ఏపీలో వసతుల కొరత ఏ స్థాయిలో ఉందో ఈ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని పేర్కొంటున్నారు. మారి ఈ అంశంలో వైసీపీ నేతల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

నవ జాతిరత్నాలు!

2019 ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ అధికారాన్ని అందుకొందంటే... అంతకు ముందు  ప్రతిపక్ష నేతగా ఆయన తన పాదయాత్రలో నవరత్నాల పేరిట పథకాలను ప్రకటించడంతోనే సాధ్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నవరత్నా పథకాలు ప్రకటించి   జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఈ నాలుగేళ్ల పాలన.. ఎలా ఉందో.. ప్రజలందరికీ బాగానే అర్థమైంది. ఈ జగన్ ప్రభుత్వంలో సీఎంతో సహా తొమ్మిది మంది కీలక నేతలు ఉన్నారని.. వారి వ్యవహారశైలిని, మానసిక స్థితిని బట్టి.. నవరత్నాల్లోని ఏ ఏ రత్నం పెట్టుకుంటే వారికి మంచిదంటూ సెటైరికల్‌గా చెబుతున్న..ఓ చిత్ర రాజం  సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  ఆ చిత్ర రాజంలో తొలుత వైఢూర్యం స్థానంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫొటో ఉంది. జనాలకు పంగనామం పెట్టువాళ్లు ధరించుట మంచిదంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక ఆ తర్వాత స్థానంలో అంటే రెండో స్థానంలో ముత్యం ఉంది. ఆ స్థానంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అన్ని విషయాల్లో వేలు పెట్టే వారికి శ్రేయస్కరమంటూ రాసి ఉంది. ఇక ముచ్చటగా మూడో స్థానం... అంటే పగడం.. ఈ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇసుక, మట్టి, మద్యం వ్యాపారులు ఈ పగడం ధరించడం ఉత్తమమని స్పష్టం చేసి ఉంది. ఆ తర్వాత నాలుగోస్థానం.. గోమేథకం స్థానంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఇది మానసిక రోగులు ధరించుట అన్ని విధాల శ్రేయస్కరమని వివరించి ఉంది.  ఆ తర్వాత స్థానం... అంటే పంచమస్థానం... కనక పుష్యరాగం స్థానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ ఉన్నారు.  నటనలో ప్రతిభ ఉన్నవారు ఈ రత్నాన్ని ధరిస్తే.. మంచిందని స్పష్టం చేసి ఉంది. అలాగే షష్టమ స్థానం అంటే ఆరు...నీలం రాయి. ఆ స్థానంలో  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారు ఈ రాయిని ధరిస్తే.. ఉత్తమొత్తమమని రాసి పెట్టి ఉంది.  ఇక సప్తమ స్థానంలో వజ్రం ఉంది. ఆర్బాటం, అవివేకం ఉన్నవాళ్లు ఇష్టపడతారంటూ.. ఆ స్థానంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు చిత్రం ఉంది. అదే విధంగా అష్టమ స్థానం.. ఇందులో కెంపు ఉంది. తంబాకు నమిలే వారికి ఇది అన్ని విధాలా మంచిదని రాసి ఉంది.  ఈ స్థానంలో కొడాలి నాని చిత్రం ఉంది. ఇక చిట్టచివరి స్థానం అంటే నవమ స్థానంలో పచ్చ ఉంది. పగటి నిద్రలో కలల విహారం చేసే వారు ధరిస్తే.. మంచిదంటూ.. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ధరిస్తే శ్రేయస్కరమని రాసి ఉంది.  2014 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ వైయస్ జగన్ ప్రతిపక్షానికి పరిమితమైయ్యారు. ఆ తర్వాత అంటే.. 2017 చివరిలో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టి.. 4 వేల కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే.. నవరత్న పతకాలు, సంక్షేమ పథకాలతో  రాజన్న రాజ్యం వస్తుందంటూ ఆయన పేర్కొన్నారు.  దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలంతా ఓట్లన్నీ జగన్ పార్టీకి గంపగుత్తగా  గుద్దారు. అయితే  జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత, ఎక్కడ, ఏమిటీ అంటే చెప్పే నాథుడే లేకుండా పోయాడు. అలాగే జగన్ పార్టీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానే అయి వ్యవహరిస్తున్నారు.  దీంతో ఆయనకు సకల శాఖల మంత్రి అనే ట్యాగ్ లైన్‌ని సైతం ప్రతిపక్ష టీడీపీ తగిలించేసింది.  అలాగే ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఫ్యాన్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే. అదే విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్ విషయం కూడా విదితమే. ఇక ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న విడదల రజినీ.. ఏపీ పాలిటిక్స్ ‌లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది... ఆ తర్వాత.. ఆమె పోలిటికల్ గ్రాఫ్ ఎలా పెంచుకొంటూ వెళ్లిందనేది ప్రతీ ఒక్కరికి తెలిసిందే.  ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. అయితే సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. జగన్ పార్టీలో చేరి.. ఎంపీగా గెలుపొందారు. గతేడాది ఆయన నగ్న వీడియో అంటూ ఓ వీడియో   వెలుగులోకి వచ్చి.. అటు మీడియాలో..ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆర్కే రోజా.. ప్రస్తుతం మంత్రిగా ఉండి.. ప్రతిపక్ష పార్టీలపై ప్రెస్ మీట్ పెట్టి కారాలు మిరియాలు నూరుతారన్న సంగతి తెలిసిందే. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం... శాసనసభ స్పీకర్ పదవి అంటే.. రాజ్యాంగ బద్దంగా ఉంటూ.. అన్ని పార్టీల వారిని సమ దృష్టితో చూడాలి. కానీ సదరు స్పీకర్ తమ్మినేని మాత్రం పక్కా అధికార పార్టీ నేతగా వ్యవహరించడం కొసమెరుపు. అంతేకాదు అసెంబ్లీలో సభ సాక్షిగా అప్పుడప్పుడు స్పీకర్‌ కూర్చిలో ఆసీనులై ఆయన కునికి పాట్లు పడుతోన్న పలు వీడియోలు, ఫోటోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని సైతం నెటిజన్లు తమదైన శైలిలో వివరిస్తున్నారు.

మరో సీఐ వీరంగం!

పోలీస్‌శాఖలో హోంగార్డుల నుంచి జిల్లా ఎస్పీల వరకు అందరూ తమ పని తాము  పద్దతిగా.. చేసుకుపోతుంటే.. సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు మాత్రం.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకొంటున్నాయి.   తాజాగా శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ అలియాస్ చావలి అంజమ్మ.. స్థానికంగా ఆందోళన చేస్తున్న ఓ జనసేన కార్యకర్త చెంపలు.. ఆమె రెండు చేతులతో వాయిస్తున్న ఓ వీడియో సూపర్ స్పీడ్‌తో అటు మీడియాలో... ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ ఘటనపై నెటిజన్లు  అంజు యాదవ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అదీకాక ఇప్పటికే ఆమె వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమైందన్న సంగతి అందరికి తెలిసిందేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అంతేకాదు ఆమె వ్యవహారశైలిపై జాతీయ మహిళ కమిషన్ సైతం మండిపడిందని.. ఆ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ రాష్ట్ర డీజీపీని ఆదేశించినా.. ఇప్పటి వరకు అంజుయాదవ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఓ చర్చ  ఖాకీవనంలోనే జోరుగా కొనసాగుతోంది.  శ్రీకాళహస్తిలో రాత్రి 9 గంటల సమయంలో హోటల్ ఎందుకు మూయలేదంటూ.. హోటల్ యజమాని భార్యపై సీఐ అంజూయాదవ్ చెయ్యి చేసుకోవడం.. అందుకు సంబంధించిన వీడియోలు సైతం గతంలో వైరల్ అయినాయి. అలాగే మద్యం విక్రయాలు సాగిస్తున్నారంటూ.. మరో మహిళపై సదరు సీఐ  దాడి చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.   సదరు సీఐ అంజుయాదవ్ గారి బాదుడు కార్యక్రమం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయినా సీఐ అంజూయాదవ్ గారి ఖాకీ పవర్.. శ్రీకాళహస్తి సర్కిల్‌ పరిధిలో పలువురికి ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ తగిలే ఉంటుందనే ఓ చర్చ   స్థానికంగా నడుస్తోందని వారు వ్యంగ్యంగా అంటున్నారు. అంతే కాదు.. రేపో.. మాపో.. అటో ఇటో.. ఏటో వైపు నుంచి వచ్చి.. ఎవరిపైన అ దాడి చేస్తుందోననే ఓ విధమైన ఆందోళన శ్రీకాళహస్తి వాసుల్లో అంతర్గతంగా ఉందనే ఓ ప్రచారం సైతం సాగుతోందని అంటున్నారు.  ఇప్పటికే విశాఖపట్నం ఆర్మీ రిజర్వుడు సీఐ స్వర్ణలత.. నోట్ల మార్పిడి వ్యవహారంలో చిక్కి.. ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కిస్తున్నారనీ, అలాగే గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి సీఐగా గోరంట్ల మాధవ్  వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీఐగా ఆయన గారు చేసిన ఓవర్ యాక్షన్‌కి ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఫిదా అయిపోయి.. ఆ తర్వాత ఆయన్ని పార్టీలోకి ఇలా ఆహ్వినించడంతో.. అలా ఆయన తన సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి.. హిందూపురం ఎంపీ టికెట్‌పై గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందేనని వారు పేర్కొంటున్నారు.  ఏదీ ఏమైనా.. పోలీసులు అంటే ప్రజలకు రక్షక భటులని.. ఆ క్రమంలో ప్రజలు చెల్లించే పన్నులను జీతాలుగా తీసుకోంటూ.. ఆ ప్రజలకు అండగా.. రక్షణగా నిలవకుండా.. తాము దైవలోకం నుంచి ఊడి పడ్డామని.. ఓ చేతిలో లాఠీ, మరో చేతిలో తుపాకీ చూసుకోని తమకు తాము దైవాంశ సంభూతులమనుకొంటూ.. పోలీసు శాఖలోని పలువురు పోలీసులు తమకు తాము పరువు మాపుకొంటున్నారని నెటిజన్లు ఓ విధమైన ఆందోళనతో పేర్కొంటున్నారు.

స్పీడ్ న్యూస్- 2

21.హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. రాత్రి నుంచి గాలిస్తున్నా ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని భావిస్తున్నారు. 22.తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతి రోజు చూస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు.  23.చైనా లోన్‌యాప్ ఏజెంట్ల వేధింపులకు మరొకరు బలయ్యారు. పెరుగుతున్న వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం  బెంగళూరులో వాటిల్లింది.  24.ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి పయనమయ్యారు.  25.కేరళలో ప్రొఫెసర్‌ చేతిని నరికిన ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఆరుగుర్ని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. దోషులపై మోపిన అన్ని  అభియోగాలు రుజువయ్యాయి.  26.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అ, ఆలు కూడా రావని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్‌కు వారాహికి, వరాహికి తేడా తెలియదన్నారు. 27. సినీ నిర్మాత బండ్ల గణేశ్ హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చేతికి సెలైన్ కూడా ఉండటంతో ఆయనకు ఏమయిందనే చర్చ జరుగుతోంది. 28. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తిరుమల చేరుకున్నారు. సతీమణితో కల్సి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.  30.ఉత్తర భారత దేశాన్ని భారీ వర్షాలు కుదుపేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీలో ఓ కొండ కుప్ప కూలిపోయింది. 31 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ పలు వేదికల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లే ముందు మరోసారి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 32.మంత్రి రోజా తిరుమల దర్శనానికి వెళ్లారు. ఆమెతో పాటుగా శ్రీముఖి ఫ్యామిలీ కూడా వెళ్లింది. ఇలా మంత్రి రోజాతో కలిసి జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర తారలు నిత్యం తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.   33.కుండపోత వర్షాలు  హిమాచల్‌ ప్రదేశ్‌‌లో  బీభత్సం సృష్టించాయి. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ రహదారులు, నివాసాలు కొట్టుకుపోయాయి.  34.దేశ వ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. అన్ని  అయితే ఇటీవల భారీగా పెరిగిన చికెన్ ధరలు.. నేల చూపులు చూడటంతో కిలో చికెన్‌ రూ.150 నుంచి రూ.180 మధ్య అమ్ముతున్నారు.  35.గ్రేటర్ నోయిడా పరిధిలోని హోషియార్ పూర్ పరిధిలో నివసించే శైలజా చౌదరీ అనే మహిళకు గత శుక్రవారం ఒక ఈ- చలాన్ వచ్చింది. ఆమె పేరిట ఎటువంటి బైక్, కారు రిజిస్టర్ కానప్పటికీ ట్రాఫిక్ పోలీసులు 1000 రూపాయల చలానా విధించారు. 36. టమాటాలకు బౌన్సర్లు పెట్టుకున్న యూపీకి చెందిన కూరగాయల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో వారణాసికి చెందిన  సమాజ్‌వాది పార్టీ కార్యకర్త తన దుకాణం వద్ద బౌన్సర్లు కాపలాగా ఉంచిన విషయం తెలిసిందే.  37.దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు శిక్ష పడింది. గోకుల్ చాట్‌, లుంబినీ పార్క్‌, దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్లతోనూ వీళ్లకు సంబంధాలు ఉన్నాయి.  ఎన్‌ఐఏ  కోర్టు శిక్షలను ఖరారు చేసింది.  38.తెలంగాణలో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం  లక్ష రూపాయల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 26తో ముగిసింది.  39. ఇంటి కుక్కే కదా అని కుక్కకాటును నిర్లక్ష్యం చేసినందుకు  40 ఏళ్ల జ్యోతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో చోటు చేసుకుంది. సకాలంలో కుక్క కాటుకు వైద్యం అందిస్తే ఆ మహిళ బతికేదని వైద్యులు అంటున్నారు.  40.ఆవర్తనం కారణంగా వచ్చే రెండ్రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  ఇక భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌కు ఎల్లోఅలర్ట్‌ జారీ చేశారు. 41. తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.  రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని సీల్పీ నేత భట్టి విక్రమార్క  మండిపడ్డారు.  42. 'జయం' చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ సదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తనకు పెళ్లి అంటే ఆసక్తి లేదని స్పష్టం చేసింది.  43.బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ చిత్రం కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 44. టెస్లా ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజ సంస్థ భారత మార్కెట్‌లోకి మాత్రం ఇప్పటిదాకా ప్రవేశించలేదు.ఈ నేపథ్యంలో భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా అడుగుపెట్టేందుకు టెస్లా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. 45.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆసీనులయ్యారు. 46. చంపేస్తానని బెదిరించి 9వ తరగతి విద్యార్థి నుంచి లక్షలు గుంజాడో పదో తరగతి విద్యార్థి. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిందీ ఘటన. 47. ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని  బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు కలుస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలను ఇచ్చిందని చెప్పారు.  48.షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదని అన్నారు. అర్జెంట్‌గా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటే కుదరదని చెప్పారు. 49.దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఇప్పుడు కొత్త వైరస్ ఒకటి తీవ్రంగా కలవర పెడుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ క్రమంలోనే ఏం చేయాలో పాలు పోని చిలీ సర్కార్.. 3 నెలలు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 50.చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ నమూనాను చెంగాలమ్మ అమ్మవారి ముందు ఉంచి, ప్రయోగం సాఫీగా జరగాలని ప్రార్థించారు.

టీటీడీకి ఆర్టీఐ మినహాయింపు సమర్థనీయమేనా?

రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నది సామెత. మరి దేవుడి సొమ్ము.. అందులోనూ భక్తులు ముడుపుల రూపంలోనూ, విరాళాల రూపంలోనూ ఇచ్చిన సొమ్ము ఎవరి పాలు అవుతోంది. అది తెలుసుకునే హక్కు  భక్తులందరికీ ఉంటుంది. అటువంటిది ప్రపంచ  ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఒక సారి భగవంతుడికి సమర్పించుకున్న తరువాత ఆ ముడుపుల సొమ్ము, హుండీ కానుకల సొత్తు ఎలా వ్యయం అవుతోంది. సద్వినియోగం అవుతోందా? లేదా? అన్న విషయాలను ఆరా తీసే హక్కు ఎవరికీ లేదంటోంది. భక్తులు స్వామి వారికి చెల్లించే మొక్కులు, విరాళాలతో తిరుమలలో భక్తులకు సౌకర్యాలు సమకూరుతాయని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, జీర్ణదేవాలయాల ఉద్ధరణ  తదితర ధార్మిక కార్యక్రమాలకు వ్యయం చేస్తారన్నది భక్తుల విశ్వాసం. సాధారణంగా ప్రజలు ఇచ్చే విరాళాలతో చేపట్టే పనులకు పబ్లిక్ ఆడిట్ ఉండాలి. అంటే ఎలా ఖర్చు చేశారు? ఎందుకు ఖర్చు చేశారు అని అడిగితే జవాబు చెప్పే జవాబుదారీ తనం ఉండాలి. అయితే తిరుమలలో మాత్రం ఆ ప్రశక్తే లేదు అంటున్నారు.   చివరాఖరికి టిటిడి ఆదాయ వ్యయాల వివరాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా రావుట. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది.    దేశ రక్షణ రహస్యాలకు సంబంధించిన అంశాలు తప్ప, మిగిలిన అన్ని రంగాలకూ సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. చివరాఖరికి కోర్టులు కూడా ఈ చట్ట పరిధిలోకే వస్తాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఈ చట్ట పరిధిలోకి రాదు అంటోంది టీటీడీ.  ఏమైనా అంటే తమది స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అంటోంది.  టీటీడీకి ప్రభుత్వంలో సంబంధం లేదని చెప్పుకుంటోంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, జేఈవో వంటి అధికారులను నియమించేది ప్రభుత్వమే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులను నియమించేది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జంబో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే కోర్టులు అభ్యంతరం చెప్పాయి కూడా. నిజమే టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థే అయినా ప్రభుత్వ అధీనంలో, ప్రభుత్వ అజమాయిషీలో పని చేస్తుంది. అటువంటి టీటీడీకి ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) పరిథిలోకి రాకుండా మినహాయింపు ఇవ్వడమేమిటన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.    వేల కోట్ల రూపాయలు విరాళాలు పోగయ్యే ఒక దేవాలయంలో, తామిచ్చిన విరాళాలు ఏమవుతున్నాయో.. తెలుసుకునే హక్కు భక్తులకు లేదనడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు.  అన్నిటికీ మించి గత కొన్నేళ్లుగా  తిరుమల తిరుపతి దేవస్థానం  నిధులు  పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ,  శ్రీవాణి ట్రస్టు  లో అవకతవకలు జరిగాయంటూ రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తున్న తరుణంలో టిటిడీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  గతంలో స్వామి వారి పింక్‌ డైమండ్‌ మాయమైందని, అది చంద్రబాబు ఇంట్లో ఉందంటూ నాటి ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. దానిపై అప్పటి టీటీడీ పావకవర్గం వారిపై పరువునష్టం దావా దాఖలైంది. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయల ఫీజును టీడీపీ కోర్టుకు చెల్లించింది. ఇప్పుడు ఆ డబ్బు కోర్టులోనే డిపాజిట్‌ రూపంలో ఉంది. ప్రభుత్వం మారి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇన్చార్జి జేఈఓ ధర్మారెడ్డి.. అసలు వెంకన్నకు పింక్‌ డైమండ్‌ లేదని, మీడియా సమక్షంలోనే వెల్లడించారు. అంటే వ్యక్తులు చేసిన ఆరోపణలకు, టీటీడీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందన్న మాట. మరి ఆ 2 కోట్ల రూపాయలు ఎవరి ఖాతా నుంచి వసూలు చేస్తారన్నది ప్రశ్న. రోజుకు ఎన్ని టిక్కెట్లు అమ్ముతున్నారు? వాటికి వచ్చేదంత? రోజుకు వీవీఐపీల దర్శనాలు ఎన్ని అనుమతిస్తున్నారు? అందులో జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది? అన్న వివరాలను భక్తులకు ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ అధికారులదేనంటున్నారు. తమ డబ్బుకు లెక్క అడిగే హక్కు తమకుందన్నది భక్తుల వాదన. జస్టిస్‌ కోదండరామ్‌ సింగిల్‌బెంచ్‌ జడ్జిగా ఉన్నప్పుడు.. 2018లో ప్రభుత్వ నిధులతో సంబంధం లేని దేవాలయాలను, ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇస్తూ తీర్పు వెలువ డింది. అయితే, దానిపై అనేక రిట్‌ అప్పీళ్లు అప్పటినుంచీ ఇంకా పెండింగ్‌లోనే  ఉన్నాయి.   సేవా టికెట్లు, వీఐపీ, ప్రొటోకాల్‌ దర్వనాలు, టీటీడీ చానెల్‌కు భక్తులిచ్చే విరాళాల్లో అవకవతకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఇన్ని ఆరోపణలను ఎదుర్కొంటున్న టీటీడీకి ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇవ్వడం ఎంత మాత్రం సమంజసం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  టీటీడీ రక్షణ శాఖ కాదనీ,  అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే టీటీడీనీ ఆర్టీఐ పరిథిలోకి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.  

నానక్ రామ్ గూడాలో వాలంటీర్ల హెడ్ ఆఫీస్!

ఏపీలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని వారాహీ రెండో విడత యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణం అనేలా పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల  సమాచారాన్ని వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించగా.. పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. అయితే, పవన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు.  వాలంటీర్ల పొట్టకొట్టాలని తానెప్పుడూ అనుకోలేదని అంటూనే కోడిపిల్లలను గద్దలు తన్నుకు వెళ్ళినట్లుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల జీతం భూమ్ భూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ కు ఎక్కువ అని సానుభూతి చూపిస్తూనే చాలా చోట్ల వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని, ఈ వ్యవస్థలో కొందరు కిరాతకులు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదంటూ.. కొందరు వాలంటీర్లు ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో పట్టుబడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలు భయపెట్టి, వాళ్లు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని కొందరు వాలంటీర్లు భయపెడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో ఏపీలో వాలంటీర్లు సేకరించే డేటా మొత్తం హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హెడ్ ఆఫీసుకు వెళ్తుందని మరో కొత్త ఆరోపణను తెర మీదకి తెచ్చారు. వాలంటీర్ల వ్యవస్ధ హెడ్ ఆఫీసు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉందని, ఇక్కడ 700 మంది ఉద్యోగులున్నారని పవన్ చెప్పారు. నానక్ రామ్ గూడలోని సంస్థలో ఏపీ డేటా ఎందుకు పెట్టారని.. ఏపీ ప్రజల డేటాను ఆ సంస్థలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్‌ క్రాస్‌ సంస్థకు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ అధిపతిగా ఉన్నారని.. మరి సీఎం జగన్‌ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి అని ప్రశ్నించారు. జగనన్నే నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చారు.. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో కొందరు వాలంటీర్లు ఉన్నారని సెటైర్లు వేశారు.  పవన్ చేసిన మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా నానక్ రామ్ గూడకి తరలివెళ్తున్న ఏపీ డేటా ఆరోపణ మాత్రం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నది. నిజంగానే ఏపీ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల వద్ద ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. ఈ డేటాను వైసీపీకి సంబంధించిన ప్రైవేట్ కార్యాలయాలకు తరలిస్తున్నారా? లేక ఈ డేటా వ్యవహారాన్ని వైసీపీ ఏదైనా ప్రైవేట్ సంస్థకు అప్పగించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేపు ఎన్నికలలో ఈ డేటా ఉపయోగించి ప్రజలను బెదిరించి, ఆశజూపి, మభ్యపెట్టి ఓట్లుగా మలచుకునే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీ ఆ తరహా ఆలోచనతోనే ప్రజల డేటాను నానక్ రామ్ గూడ కార్యాలయానికి తరలిస్తున్నదా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి.  నానక్ రామ్ గూడ ఆఫీసు గురించి ఎలాంటి సమాచారం లేకుండా అయితే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపించడం లేదు. ఏదో సమాచారం సేకరించే నానక్ రామ్ గూడ పేరు బయటకి చెప్పినట్లు కనిపిస్తుంది. ఇది తీవ్రమైన అంశం, తీవ్రమైన ఆరోపణ కనుక ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

వైసీపీకి విశాఖ జిల్లా అధ్యక్షుడి రాజీనామా.. పార్టీలో గౌరవం దక్కకేనని వివరణ

జ‌గ‌న్ సార‌థ్యంలోని వైసీపీలో అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం ప్రాణం పెట్టయినా పని చేస్తామనే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.   పార్టీ నాయ‌కుడికే షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న వారి సంఖ్య  కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణంగా  అధికార ప‌క్షానికి విప‌క్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది, స‌మ‌స్య‌లూ ఉంటాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీలో మాత్రం వ్య‌వ‌హారం రివర్స్ లో  ఉంది.  పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారు, పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేసేవారు  రోజు రోజుకూ ఎక్కువ‌వుతున్నారు. ఇంటి గుట్టు ఇంటి వారే బ‌య‌ట‌ ప‌డేసుకుంటున్నారు. పార్టీలో రెబెల్ వ్య‌వ‌హారా లు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇప్పటికే  నెల్లూరు జిల్లాలో  వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మాజీ మంత్రి బాలినేని కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెడ్డి  వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి   రాజీనామా చేశారు. ఆయన పార్టీలోనే ఉన్నా అసమ్మతి సెగ మాత్రం పార్టీకి గట్టిగానే తగిలేలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకటి రెండు అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ వైసీపీలో అసమ్మతి రగులుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షపదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు. తన రాజీనామా సందర్భంగా పార్టీలో  కనీస గౌరవం కరవవ్వడంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.  ఎన్నో ఆశయాలు, ఆశలతో రాజకీయాల్లోకి వచ్చానని అవి చేసే పరిస్థితి లేనపుడు పదవిలో కొనసాగడం సరికాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని చెప్పిన పంచకర్ల కనీసం అధిష్ఠానం తన మాట వినేందుకు కూడా సిద్ధంగా లేకపోవడంతో తన మాట వినే అవకాశం లేనందునే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

స్పీడ్ న్యూస్ 1

1.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.  శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటల 35 నిమిషాలకు  రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది.  2. భారత రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో భారీగా పెరిగింది. అంతకుముందు నెలలో 4.31గా ఉన్న రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో 4.81కి చేరుకుంది.  3.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర  ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.  4.తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో టీటీడీ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఒక బాలుడిపై చిరుత దాడి తెలిసిన విషయమే. 5.సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బుధవారం మరో ఇద్దరు అరెస్టయ్యారు. కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, అతని కూతురు సాహితీలను ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.  6. ముఖ్యమంత్రి జగన్ కొంతకాలంగా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని జగన్ ను పవన్ నిలదీశారు. తాడేపల్లిగూడెం లో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని మాట్లాడారు. 7. జగన్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాలలో నాశనం అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.  ఉండవల్లిలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో బాబు మాట్లాడారు. రాష్ట్రానికి ఇప్పుడు సంపద సృష్టించే ప్రభుత్వం కావాలని మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు చెప్పారు. 8.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.  9.రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు  కన్నుమూశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కృష్ణంరాజు మృతి చెందారు.  10.వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 11. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీ సమీపానికి వరదనీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో  ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు.  12.మరో రెండేళ్లలో ఇంటర్నెట్ అంతమైపోతుందంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో వచ్చిన కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంటర్నెట్‌లోనూ ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  13.  వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్ చాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రిమల్లారెడ్డి మాట్లాడుతూ రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అని, తనను కూడా బ్లాక్ మెయిల్ చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 14.రాజస్థాన్‌లో దారుణం జరిగింది. హత్యకేసు నిందితులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న ఓ ముఠా పోలీసుల కళ్లలో కారం చల్లి నిందితులపై కాల్పులు జరిపింది.  15.వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలానికి విండీస్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. కేవలం 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్ అయింది.  16.భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు వాడిన ఓ వ్యక్తి కాపురం కూలిపోయింది. భర్తపై మండిపడ్డ ఆ ఇల్లాలు తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది.  17.స్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టారు. ఆపై టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. 18. హర్యానాలో అసాధారణ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది.  19.అదుపుతప్పిన స్మార్ట్‌ఫోన్ వినియోగం బాల్యాన్ని చిదిమేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌కు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో తాజాగా వెలుగు చూసింది.  20. కోల్‌కతా లోకల్ రైలులో కొందరు మహిళలు జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోను ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో  ట్విట్టర్ లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వసూల్ రాణి రజనీ.. మాజీ మంత్రి ప్రత్తిపాటి ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అభివృద్ధి అనవాలు లేకుండా తుడిచేయడానికే కంకణం కట్టుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రులు పలువురు సొంత పనులలో పడి అభివృద్ధిని విస్మరిస్తున్నారని పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఇక విపక్షాలు కూడా పలువురు మంత్రుల అవినీతి, అక్రమార్జనలపై ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ అక్రమార్జన, అస్తులపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన విమర్శలపై ఇంకా చర్చ జరుగుతుండగానే  మంత్రి రజనీపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ కు సంక్షేమం పేరిట బటన్ లు నొక్కేందుకే ఎక్కడ లేని సొమ్మూ సరిపోవడం లేదనీ, ఆదాయం లేని రాష్ట్రంలో అప్పులు తెచ్చి మరీ అరకొర సంక్షేమం కోసం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తుంటే ఆయన కేబినెట్ లోని మంత్రులు మాత్రం తమతమ నియోజకవర్గాల అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెడతారని ప్రత్తిపాటు అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాళా దిశగా నడుపుతుంటే.. ఆయన మంత్రి రజనీ నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఇంటిని  చక్కబెట్టుకునే పనిలో పడ్డారని, ఆ క్రమంలో వసూల్ రాణిగా మారారని ప్రత్తిపాటి విమర్శించారు.    మంతి రజనికి అభివృద్ధిపై శ్రద్ధ లేదనీ, ఆమె దృష్టి అంతా వసూళ్లపైనే కేంద్రీకరించారనీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో మంత్రులందరూ యథారాజా తథా ప్రజా అన్నట్లుగా రాష్ట్ర ప్రగతిని విస్మరించి సొంత పనులు చక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి రజనీపై చేసిన విమర్శలు, సవాళ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ఓలేరువాగుపై వంతెన, మురుగునీటి శుద్ధి కేంద్రం వంటివి పురోగతి లేకుండా పడి ఉన్నాయన్నారు. మంత్రి రజనికి నియోజవర్గ అభివృద్ధి పట్టదనీ, ఎంత సేపూ వసూళ్లపైనే శ్రద్ధ చూపుతూ వసూల్ రాణిగా మారారని విమర్శించారు. ఓలేరు వాగు వంతెన వద్ద, మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద సెల్ఫీ దిగిన ప్రత్తిపాటి  మీడియాతో మాట్లాడుతూ మంత్రి రజిని అసమర్థత, చేతకానితనం, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం, ఓట్లేసిన ప్రజలకు కనబడకుండా పోవడం, ప్రజలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం లేకపోవడంతోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.  తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.16 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభించామని... వైకాపా అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్ల మూడు నెలల కాంలో ఈ పనులు ఒక్క  అంగుళం కూడా కదల్లేదని ప్రత్తిపాటి చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం మురుగునీటి శుద్ధి కేంద్రం మంజూరు చేయగా, ఈ కేంద్రానికి 2018లో శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. దానిని పూర్తి చేసి ఉంటే ప్రజలు అంటువ్యాధులు, అనారోగ్యాల బారినపడకుండా ఎంతో ఉపయోగపడేదని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. అదే విధంగా ఓలేరు వాగు వంతెనకు నాడు  రూ.7.68 కోట్లు మంజూరు చేశారని, కానీ జగన్ హయాంలో ఇప్పటి దాకా ఈ వంతెన నిర్మాణం ముందుకు సాగలేదన్నారు.   రూ.7.68 కోట్ల పనులను పూర్తి చేయలేని అసమర్థ మంత్రి రజిని నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రజనికి మంత్రి పదవి మంత్రి కుటుంబం బాగుపడటాకే ఉపయోగపడిందని ప్రత్తిపాటి అన్నారు. ఆమె మంత్రి పదవి వల్ల నియోజకవర్గానికి జరిగిన మేలు ఏదీ లేదని ప్రత్తిపాటి విమర్శించారు.  ఎక్కడ ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వాటిపై ఉన్న దృష్టి ఓట్లేసిన ప్రజల  ప్రయోజనాలపై లేదన్నారు.   వైకాపా ప్రభుత్వానికి, మంత్రి రజినికి ప్రజలు వీఆర్‌ఎస్ ఇవ్వడం ఖాయమని ప్రత్తిపాటి తెలిపారు.

పవన్ పై రోజా విమర్శలు బూమరాంగ్

జగన్ ను మెప్పించేందుకు మంత్రి రోజా చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా వైసీపీ ఇరుక్కుంది. జగన్ సర్కార్ తరచూ చెప్పే రివర్స్ ఇప్పుడు రోజాకు ఎదురైంది. జనసేన పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నంలో రోజా ప్రదర్శించిన  అత్యుత్సాహం బూమరాంగ్ అయ్యింది. వైపీపీనే డిఫెన్స్ లో పడేసింది.   ఏపీలో మహిళలు మాయం,  కిడ్నాపుల వెనుక వాలంటీర్లు, వైసీపీ నేతలు ఉన్నారన్న పవన్ ఆరోపణలపై వైపీపీ మంత్రులు ఘాటుగా స్పందించారు.  పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కొందరు మహిళా వాలంటీర్ల ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు కూడా పంపింది.   ఐదువేల రూపాయల కోసం రాష్ట్ర ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని, జీవితాలు త్యాగం చేసిన వాలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్.. తక్షణం   క్షమాపణ చెప్పి, వాలంటీర్ల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలంటూ మంత్రి రోజా పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు.  అలాగే పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు.  దీంతో జనసేన శ్రేణులు రాష్ట్రంలో వాలంటీర్లు చేసిన అరాచకాలను ఆధారాలతో సహా బయటపెడుతూ మంత్రి రోజాకు ప్రశ్నలు సంధించారు. జనసేనాని మొత్తం వాలంటీర్లనందరినీ విమర్శించలేదనీ, వారిలో కొందరు అరాచకాలను ఎత్తి చూపారనీ, అసలు అలాంటి వాటికి అవకాశం ఇస్తున్న వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించారనీ జనసైనికులు అంటున్నారు. మంత్రి రోజా పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలకు స్పందిస్తూ.. వాలంటీర్లు పాల్పడిన అత్యాచారాలు, పొరుగురాష్ట్రం నుంచి మద్యం బాటిళ్లు తీసుకువస్తూ పట్టుబడిన ఉదంతాలు, వితంతులను వేధించిన ఘటనలను, పెన్షన్లను కొట్టేసిన సంఘటనలను ఆధారాలతో సహా వెల్లడిస్తూ అటువంటి వారికి మంత్రి రోజా మద్దతు ఇస్తున్నారా అంటూ ప్రశ్నలు గుప్పించారు.  అలాగే జగన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో వాలంటీర్ల చేతిలో అత్యాచారానికి గురైన బాలికలు, వేధింపులకు గురైన ఒంటరి మహిళలు, కిడ్నాప్ అయిన బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదులతో కూడిన వీడియోక్లిప్పింగులను జత చేస్తూ సామాజిక మాధ్యమంలో రోజాపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో వాలంటీర్ల అత్యాచారాలు, అకృత్యాలకు సంబంధించి ఆధారాలతో సహా జనసైనికులు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టడంతో  వైసీపీ డిఫెన్స్ లో పడింది. రోజా అత్యుత్సాహంతో  వలంటీర్లను వెనకేసుకొస్తూ  చేసిన విమర్శలు బూమరాంగ్ అవ్వడంతో వైసీపీ అడ్డంగా బుక్కైనట్లు అయ్యింది.  వలంటీర్లు  అకృత్యాలు, అరాచకాలు, అమానుషానికి పాల్పడినప్పుడు నోరు విప్పని మంత్రి రోజా ఆ అకృత్యాలు చేసిన వారిని సమర్ధిస్తూ మాట్లాడటాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.   

ఎంపీ అభ్యర్థుల కోసం వైసీపీ వేట!?

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం వచ్చేసింది.  తెలంగాణలో ఈ ఏడాదే ఎన్నికలు జరగనుండగా.. అక్కడ రాజకీయం కాకమీదుంది. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు అందుకు సమాయత్తమవుతున్నాయి. మరో వైపు కేంద్రం మినీ జమిలీకి వెళ్లే ఆలోచన ఉందనే ప్రచారం  కూడా ఏపీ పొలిటికల్ హీట్  పెంచేసింది. దీంతో ఈ నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క అన్నట్లుగా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముందుగా తమ పార్టీలో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ మొదలు పెట్టారు.  ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు చేయించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇటీవల   పనితీరు బాలేని ఎమ్మెల్యేలకు క్లాసు  కూడా పీకారు. ఒక రకంగా చెప్పాలంటే పర్ఫామెన్స్ రిపోర్టర్ వీక్ గా ఉన్న వారందరికీ తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ వర్క్ షాప్ మొదలు పెట్టారు. ఇకనైనా పని తీరు మార్చుకోకపోతే 20 నుండి 25 మందికి టికెట్లు ఇవ్వడం కష్టమేననని తేల్చేసినట్లు తెలిసింది.  మరో 20 మంది ఎమ్మెల్యేలకు అయితే అసలు టికెట్లు ఇచ్చేది లేదని, మహా అయితే ఈ ఏడాదిలో ఇప్పటి నుండి పర్ఫామెన్స్ బావుంటే ఒకరిద్దరికి నియోజకవర్గ బదిలీ చేసే అవకాశం మాత్రమే ఉంటుందని కూడా చెప్పేశారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  ఇప్పుడు వైసీపీ ఎంపీల టికెట్ల వ్యవహారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ చేసినట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీలు 22 మంది విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు  రెబ‌ల్‌గా మారి సొంత పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత జరిగినా ఆయన్ను పార్టీ ఇప్పటి వరకూ సస్పెండ్ చేయలేదు.. ఆయనా రాజీమానా చేయలేదు.  ఆ సంగతి అలా ఉంచితే వైసీపీకి ఇప్పుడు 21 మంది ఎంపీల బలం ఉంది. ఇప్పటికే వీరిలో నలుగురు ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎంపీగా పోటీ చేయ‌లేమ‌ని అధిష్టానానికి చెప్పేసినట్లుగా తెలుస్తుంది. వీరిలో అనకాపల్లి ఎంపీ బీశెట్టి స‌త్య‌వ‌తి, అరకు ఎంపీ గొట్టేటి మాధ‌వి, విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. ఈ నలుగురూ కూడా  ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది తమ భావనగా అధిష్టానానికి  ఇప్పటికే చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్నది. దానికి వైసీపీ నుండి ఎలాంటి స్పందనా రాకపోవడంతో చాలాకాలంగా ఈ నలుగురు పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నాలుగు స్థానాలలో వైసీపీ కొత్త వారిని వెతుక్కోవాల్సిందే. ఆ నలుగురు వారికి వారే ఈసారి పార్లమెంటుకు వెళ్ళేది లేదని నిర్ణయించుకోగా మరో నలుగురు ఎంపీలను పార్టీ అధిష్టానమే ఈసారి అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఉన్నారు. ఈ నలుగురినీ అసెంబ్లీలో తమకి అండగా ఉంటారనే కారణంగా అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు వైసీపీ కొత్త అభ్యర్థులకు దించాల్సి ఉండగా.. మరో ముగ్గురు ఎంపీలు వారి వారి స్థానాలలో గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవని  రిపోర్టర్లు వచ్చినట్లు తెలుస్తుండగా వారిని కూడా మార్చాలని వైసీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అంటే మొత్తంగా 21 మందిలో పది మంది పాత వారికి మాత్రమే ఎంపీ టికెట్లు ఇవ్వనుండగా 11 లోక్ సభ నియోజకవర్గాలలో  కొత్త వారినే  బరిలోకి దించాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  ఈ 21 కాకుండా మిగతా 4 స్థానాలలో ఎంపీ ఆర్ఆర్ఆర్ స్థానంతో పాటు మరో స్థానంలో కొత్త వారికి అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

కేసీఆర్ సర్కార్ కు హిమాన్షు షాక్.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై ఆవేదన

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనవడు హిమాన్షు బీఆర్ఎస్ పార్టీ గాలి తీసేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పరువును నిలువుగా గంగలో ముంచేశారు.  గౌలిదొడ్డిలోకి కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు తన స్నేహితులతో కలిసి రూ.40 లక్షలు కంట్రిబ్యూట్ చేసి పాఠశాలకు సకల సౌకర్యాలూ కల్పించారు. ఇది హర్షించదగ్గ విషయమే. ముఖ్యమంత్రి మనవడు బాధ్యత వహించి పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించవచ్చ. కానీ అదే సమయంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సర్కారు స్కూళ్ళ దుస్థితి ని పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ పాఠశాలను సందర్శించిన హిమాన్షు ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కళ్ల వెంబడి నీళ్లోచ్చాయని పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి  బీఆర్ఎస్ సర్కార్ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద పీట వేశాం, సౌకర్యాలు కల్పించాం అని చెప్పుకుంటున్నదంతా మాటలకే పరిమితమని స్వయంగా సీఎం మనవడే చెప్పినట్లైంది.  రాష్ట్రం  అభివృద్ధి చెందుతూ బంగారు తెలంగాణ దిశగా  పరుగులు పెడుతోందంటూ మంత్రులు, బీఆర్ఎస్ నేతలూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సమయంలోనే కేశవనగర్ పాఠశాల దుస్థితిపై హిమాన్షు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ప్రభుత్వ ప్రచారం చూస్తుంటే సర్కార్ తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ సామెతను గుర్తుకు తెస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమం వేదికగా కేసీఆర్ సర్కార్ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదనడానికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనమంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.    స్వంత చొరవతో సమకూర్చిన నిధులతో బాగుపడిన ఆ స్కూల్‌లోని కొత్త తరగతి గదులు, ఫర్నీచర్, ఇతర సౌకర్యాలను హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం( జూలై 12) ప్రారంభించారు.  ఆ సందర్భంగా హిమాన్షు ప్రసంగం క్షేత్ర స్థాయిలో మన వూరు  మన బడి కార్యక్రమం ఎంత సుందరముదనష్టంగా అమలు అవుతోందో కళ్లకు కట్టింది.