దేశ వ్యాప్తంగా లాక్ డౌన్? మే తొలి వారంలో ప్రకటన?
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదా? మే తొలివారంలో లాక్ డౌని విధించబోతున్నారా? అంటే దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత, కేంద్ర సర్కార్ నిర్ణయాలతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి రావొచ్చంటున్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని, ‘చివరి అస్త్రం’గా మాత్రమే లాక్డౌన్ ఉండాలని ఇటీవలే ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో చివరి అస్త్రాన్ని ప్రయోగించే చాన్సే ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో జరుపుతున్న సంప్రదింపులు.. ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే, జూన్ నెలలకు సంబంధించి ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించింది. పేద ప్రజలకు ఉచితంగా 5 కేజీల ఆహార ధాన్యాలు అందించబోతున్నారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దీనిని అందించబోతున్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూరుతుంది. అయితే గతంలో లాక్ డౌన్ సమయంలో పేదలకు ఉచిత రేషన్ పంపిణి చేసిన విధంగానే ఇప్పుడు కూడా ఉచిత రేషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో మే నుంచి అంటే ఎన్నికల రిజల్ట్స్ తరువాత దేశంలో .. ఏ క్షణమైనా లాక్ డౌన్ విధిస్తారని అనుమానాలు కలుగుతున్నాయి.
మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన అందరికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి వ్యాక్సిన్ అందించడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పటికే పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఇలానే ఉంటె మరిన్ని విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి మొదలు మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, మంత్రిత్వశాఖల ఉన్నత కార్యదర్శులు కరోనా బారిన పడడం, కొద్దిమంది మృతిచెందడం, దేశవ్యాప్తంగా తీవ్రంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడం, అనేక వందల శ్మశానాల్లో 24 గంటలూ శవాలు కాలుతూనే ఉండడం, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, రెమిడెసివిర్ ఇంజక్షన్లకు షార్టేజీ, ఐసీయూ బెడ్లన్నీ ఫుల్ కావడం, కరోనా టెస్టింగ్ మొదలు ఆస్పత్రిలో అడ్మిషన్, శ్మశానంలో అంత్యక్రియల వరకు ప్రతిదానికీ వెయిటింగ్.. ఇలాంటి అనేక అంశాలు భారత్లో వైరస్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి.మిచిగాన్ విశ్వవిద్యాలయం ఎపిడమాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఈ నెల చివరికల్లా రోజూ ఐదు లక్షల కొత్త కేసులు, మూడు వేల కరోనా మృతుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలాంటివే ఇప్పుడు లాక్డౌన్ నిర్ణయానికి కారణమవుతున్నాయని అంటున్నారు . బహుశా అందుకే ముందుగానే రెండు నెలలకు రేషన్ ప్రకటించి లాక్ డౌన్ విధించే అవకాశం ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా కోసం ఆర్మీని రంగంలోకి దించారు. కంటోన్మెంట్ ఆసుపత్రులను సాధారణ ప్రజల చికిత్స కోసం అనుమతించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా అనేక అంశాలపై వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశారు. దేశంలో ‘ఎమర్జెనీ తరహా’ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. మే 2వ తేదీ తర్వాత ఎప్పుడైనా లాక్డౌన్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ పరిస్థితులు విషమిస్తే ఈ లోపే అలాంటి నిర్ణయాన్ని ఎంపిక చేసిన రాష్ట్రాలు, నగరాల్లో తీసుకునే అవకాశం ఉంది.
లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతాయని, దినకూలీపై ఆధారపడి బతికేవారి జీవనోపాధి దెబ్బతింటుంటుందని, ఆకలి చావులు పెరుగుతాయనే సందేహాలున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నివారణకు మరో మార్గం లేదని కేంద్రం భావిస్తున్నట్టు తెలిసింది.
గతేడాది లాక్డౌన్ నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకున్నందున పేదలు, సామాన్యులు పడిన ఇబ్బందులు ఈసారి పురావృతం కాకూడదన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఒక్కొక్కటిగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఐదు కిలోల బియ్యం, గోధుమల పంపిణీ అందులో భాగమని కేంద్ర ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి.