10వేల దిశ‌గా కేసులు.. ఏపీలో క‌రోనా క‌ల్లోలం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా క‌ల్లోలం రేపుతోంది. సెకండ్ వేవ్‌లో వైర‌స్ సోకిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల‌తో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండ‌టం మ‌రింత ఆందోళ‌న‌క‌రం. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 39,619 మందికి పరీక్షలు చేయ‌గా.. 9,716 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,86,703 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.   ఒక్క రోజులోనే క‌రోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు.. తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో నలుగురేసి.. చిత్తూరు, ప్రకాశంలో ముగ్గురు.. గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. అనంతపురంలో ఒక్కరు.. కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,510కి చేరింది.  24 గంటల వ్యవధిలో 3,359 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,18,985కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 60,208 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,57,93,298 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా శ్రీకాకుళంలో 1,444, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి. 

ఆక్సిజన్ ట్యాంకర్ దొంగిలించారు! రెండు రాష్ట్రాల మధ్య ఫైట్

రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు ఎక్కువగా ఉంటాయి. జల వివాదాలు తీవ్రంగానే చూశాం. ఇప్పటికి పలు రాష్ట్రాల మధ్య జల జగడాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడిన సందర్భాలు ఉన్నాయి. కాని కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ కోసం గొడవలు జరుగుతున్నాయి. తమ రాష్ట్రానికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ను పక్క రాష్ట్రం దొంగతనంగా తరలించుకుపోయిందని ఓ రాష్ట్ర మంత్రి ఆరోపించడం కలకలం రేపుతోంది. దేశంలో కరోనా తీవ్రత ఎంతలా ఉందో స్పష్టం చేస్తోంది.  తమ రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒకదాన్ని ఢిల్లీ ప్రభుత్వం దొంగతనంగా తీసుకెళ్లిందని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మండిపడ్డారు. ఫరీదాబాద్ కు నిన్న వస్తున్న ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం తీసుకెళ్లిందని తెలిపారు. అప్పటి నుంచి ఆక్సిజన్ ను తీసుకొస్తున్న వాహనాలకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటి పనులకు పాల్పడితే, ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. తమ ఆక్సిజన్ ను ఢిల్లీకి పంపించాలని ఒత్తిడి వస్తోందని... వారికి ఆక్సిజన్ పంపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే తాము ఆ పని చేయగలమని స్పష్టం చేశారు. అనిల్ విజ్ హర్యానా హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజిన్ సరిపడా అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఏమి చేయలేకపోతున్నారు. తమ రాష్ట్రానికి ఎక్కువ ఆక్సిజన్ పంపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు ముఖ్యమంత్రులు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండటంతో హర్యానాకు తరలించాల్సిన ట్యాంకర్ ను మధ్యలోనే ఢిల్లీకి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం రాష్ట్రాలు బహిరంగంగానే ఘర్షణలు పడుతుండటం దేశంలో కరోనా వైరస్ కల్లోలం ఏ స్థాయిలో ఉందో సూచిస్తోంది. 

వారంలో 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ రోగులకు అవసరమైన రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత రాకుండా జాగ్రత్తపడుతోంది. వారంలోగా ప్రభుత్వ ఆస్పత్రులకు 4 లక్షలకు పైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మంత్రి కేటీఆర్ బుధవారం రెమిడేసివిర్ ఉత్పత్తిదారులతో చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనం మేరకే ఈ చర్చలు జరిపామని కేటీఆర్ స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత పెరిగింది. వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి వైద్యులు ఆక్సిజన్‌తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్‌లను ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ లోడ్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నాయి. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యతో పాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం సైతం పెరిగింది.ఉత్పత్తి తగ్గడం.. చాలాచోట్ల ఇంజక్షన్లు లభించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు.

600మంది ఉద్యోగుల‌కు క‌రోనా.. స‌గం స్టాఫ్‌తో బ్యాంకు సేవ‌లు..

తెలంగాణ‌లో క‌రోనా సెకండ్ వేవ్ కుమ్మేస్తోంది. ప్ర‌జ‌ల‌తో నిత్యం సంబంధాలు ఉండే వారంద‌రికీ వైర‌స్ సోకుతోంది. తాజాగా, బ్యాంకు ఉద్యోగులు భారీగా కొవిడ్ బారిన ప‌డుతున్నారు. తెలంగాణ‌లో ఏకంగా 600 మంది ఎస్‌బీఐ ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. ఆ మేరకు ఎస్‌బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు.  క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఖాతాదారుల‌తో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్ భారిన ప‌డుతున్నారు అని తెలిపారు. క‌రోనా విజృంభ‌న కార‌ణంగా.. గురువారం నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు స‌గం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వ‌ర్తిస్తార‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లోని కోటి, సికింద్రాబాద్ ఎస్‌బీఐ కార్యాల‌యాల్లో ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ చేప‌ట్టామ‌ని తెలిపారు.

బుద్ధుందా? ఇదేనా సంస్కారం?

విజ‌య‌సాయిరెడ్డి. వైసీపీలో ఓవ‌రాక్ష‌న్ లీడ‌ర్‌గా పేరు. ట్విట్ట‌ర్‌లో చంద్ర‌బాబుపై, టీడీపీపై నిత్యం నోరు పారేసుకునే నాయ‌కుడు. అలాంటి విజ‌య‌సాయి.. పుట్టిన రోజు నాడు సైతం చంద్ర‌బాబును ఆడిపోసుకున్నాడు. 420 అంటూ.. ఏ2 విజ‌య‌సాయి నోటి కొచ్చిన‌ట్టు మాట్లాడాడు. సీఎం జ‌గ‌న్ సైతం హుందాగా ప్ర‌తిప‌క్ష నేత‌కు బ‌ర్త్‌డే విషెష్ చెబితే.. విజ‌య‌సాయిరెడ్డి మాత్రం చంద్ర‌బాబును పుట్టిన రోజున‌ అవ‌హేళ‌న చేసిన‌ట్టు మాట్లాడటాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు త‌ప్పుబ‌డుతున్నాయి. మ‌రీ, ఇంత మ్యానర్స్ లేకుండా ప్ర‌వ‌ర్తించాలా? అంటూ త‌ప్పుబ‌డుతున్నాయి. తాజాగా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విజ‌య‌సాయిపై మండిపడ్డారు. ప్రత్యర్థిని కూడా గౌరవించాలని రామాయణం చెపుతోందని.. చిన్నప్పటి నుంచి అలాంటి గ్రంధాలు చదివి ఉంటే మంచి లక్షణాలు వచ్చుండేవని విజ‌య‌సాయిని ఏకి పారేశారు. పార్టీ జాతీయ కార్యదర్శివి, రాజ్యసభ సభ్యుడివి, పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలందరికీ నాయకుడివి.. ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. అసలు బుద్ధుందా? ఇదేనా సంస్కారం? అని మండిప‌డ్డారు రఘురామకృష్ణరాజు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్, తాను కూడా చాలా సంస్కారంతో శుభాకాంక్షలను తెలియజేశామని.. మీరు చేసిన ట్వీట్ దారుణంగా ఉందని అన్నారు. ఇలాంటి సంకుచిత స్వభావాన్ని వీడండని విజ‌య‌సాయికి సూచించారు. చెత్త మాటలు మాట్లాడితే మీకేదో గండపెండేరం తొడుగుతారని భావిస్తున్నారేమో.. మీరు ఇతరులను గౌరవిస్తేనే, సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందని రఘురాజు హితవు పలికారు. మీరు చేసే దిక్కుమాలిన ట్వీట్లను సోషల్ మీడియాలో తప్ప, సంస్కారం ఉన్న వాళ్లెవరూ ఇష్టపడరని అన్నారు. మీరు చేస్తున్న దిక్కుమాలిన, దగుల్భాజీ ట్వీట్ల వల్ల తటస్థంగా ఉన్న 15 శాతం ఓట్లు పార్టీకి దూరమవుతాయని చెప్పారు. మీ వికృత చేష్టల వల్ల.. మీరు ఎవరినైతే విమర్శిస్తున్నారో, వాళ్లకే ఆ ఓట్లు పోతాయని అన్నారు. ఇప్పటికైనా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని విజయసాయికి రఘురాజు సూచించారు. మీరు మీ పంథాను ఇలాగే  కొనసాగిస్తే.. పార్టీ జాతీయ కార్యదర్శిగా మీ స్థానంలో మరొకరిని జగన్ నియమిస్తే బాగుంటుందని అన్నారు. విజయసాయిరెడ్డి స్థానంలో సంస్కారం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి పెద్దలను నియమించడం బెటర్ అని స‌ల‌హా ఇచ్చారు రఘురామకృష్ణరాజు. ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా వరుసగా ట్వీట్లు చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత 'పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని' ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ 'బ్రీఫ్ డు అవసరం లేదు అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 38 ఏళ్ల క్రితం ఏర్పడిన పార్టీ ఈరోజు జెండా పీకేసే దశలో ఉన్నా చంద్రబాబు తన జన్మదిన వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. ‘పార్టీ లేదు బొక్కా లేదని’ అచ్చెన్న అన్నది యధార్థమే. ఈ ఒక్క రోజు అన్నీ మర్చిపోయి కుటుంబంతో హాయిగా గడపండి మరో మరో ట్వీట్ చేశారు విజయసాయి.  

ఆక్సిజన్ లీకై 22 మంది మృతి! మహారాష్ట్రలో ఘోరం

కరోనా మహమ్మరితో అతలాకుతలం అవుతున్న మ‌హారాష్ట్రలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్‌ ఆసుప‌త్రి స‌మీపంలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ నింపుతుండ‌గా ఒక్క‌సారిగా అది లీకైంది. దీంతో ఆ ఆస‌ప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై ఉన్న రోగుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్ కారణంగా రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను ఆపేయాల్సి వ‌చ్చింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం వ‌ల్లే రోగులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన అధికారులు, సిబ్బంది ఆక్సిజ‌న్ లీకేజీని ఆపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు. ఆక్సిజ‌న్ ట్యాంక్ లీక్ అయిన స‌మ‌యంలో ఆసుప‌త్రిలో 171 మంది రోగులు ఉన్నారు. కొంద‌రు రోగుల‌ను ఇత‌ర ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు  విచార‌ణ‌కు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే మహారాష్ట్ర మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగనే తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ ట్యాంకర్‌లో ఆక్సిజన్‌ను వేరొక ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా నింపుతున్న సమయంలో ప్రాణవాయువు బయటకు పెల్లుబికింది. దీంతో సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని డాక్టర్ షింగనే తెలిపారు. దీనిపై సవివరమైన నివేదికను తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వదిలిపెట్టేది లేదన్నారు.  మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మాట్లాడుతూ, నాసిక్‌లో ట్యాంకర్ వాల్వులు లీక్ అయినందువల్ల పెద్ద మొత్తంలో ఆక్సిజన్ లీక్ అయినట్లు తెలిపారు. దీని ప్రభావం ఆసుపత్రిపై కూడా ఉండే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటువంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం మరింత బాధాకరం.

15 మంది ప్రాణాలు కాపాడిన ఎస్ఐపై కేసు

కరోనా విలయతాండవం చేస్తున్న మహారాష్ట్రలో ఓ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆపద్భాందవులుగా మారాయి. ఎంతో రిస్క్ తీసుకుని 15 మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు. అయితే 15 మందికి ప్రాణం పోసిన ఆ పోలీసులపై మాత్రం కేసు నమోదైంది. రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సహా సిబ్బందిపై కేసు నమోదు చేశారు.  మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ  ఘటన. ఆదివారం రాత్రి జరిపట్కలోని తిరుపూడి ఆసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ అయిపోయిందంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిపట్క పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేదని, అత్యవసరంగా 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కావాలని మొరపెట్టుకున్నారు. కనీసం 10 సిలిండర్లయినా కావాలంటూ పోలీసులను కోరారు.  హాస్పిటల్ వినతితో వెంటనే స్పందించారు ఎస్సై మహాదేవ్ నాయక్ వాదె. తన సిబ్బందితో కలిసి స్థానికంగా ఉన్న ఆక్సిజన్ తయారీ ప్లాంట్ కు వెళ్లారు. కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ కావాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే పర్మిషన్ లెటర్ లేకుండా ఆక్సిజన్ ఇవ్వబోనని ఆ యజమాని తేల్చి చెప్పడంతో.. అక్కడ ఎమర్జెన్సీ గురించి ఎస్సై మహాదేవ్ వివరించారు. దీంతో ఏడు సిలిండర్లను ఆ యజమాని అందించాడు. ఆ సిలిండర్లను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన సిబ్బంది పరిస్థితి విషమంగా ఉన్న 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించారు. వాళ్ల ప్రాణాలు నిలిచాయి. అయితే  ఆక్సిజన్ సిలిండర్లను తీసుకురావడంపై ఎస్ఐ మహాదేవ్ నాయక్ వాదెపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి సిలిండర్లు తీసుకొచ్చారన్న ఆరోపణలతో మహాదేవ్, ఆయనతో పాటు వెళ్లిన సిబ్బందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఆక్సిజ‌న్ అమ్మేసుకున్నారు.. 9వేల ట‌న్నులు హుష్‌కాకి..

దేశమంతా క‌రోనా క‌ల్లోలం. వేలాది మందికి ప్రాణ సంక‌టం. ప్రాణ‌వాయువైన ఆక్సిజ‌న్‌కి ఫుల్ డిమాండ్‌. ఆక్సిజ‌న్ నిల్వ‌లు నిండుకున్నాయంటున్నాయి రాష్ట్రాలు. వెంట‌నే ఆక్సిజ‌న్‌ను పంపాలంటూ కేంద్రాన్ని కోరుతున్నాయి. ఆక్సిజ‌న్ కొర‌త గుర్తించిన కేంద్రం ప్ర‌త్యేకంగా ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ల‌ను ప్రారంభించింది. ప‌రిమితంగా ఉన్న ఉత్ప‌త్తి కేంద్రాల నుంచి ఆక్సిజ‌న్ సేక‌రించి రాష్ట్రాల‌కు పంపుతోంది. ఇదంతా ఇప్ప‌టి విష‌యం. మ‌రి, సెకండ్ వేవ్ ముంచుకొస్తుంద‌ని ఎప్ప‌టి నుంచో హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నా.. కేంద్రం త‌ర‌ఫున ముంద‌స్తు చర్య‌లేవి?  దేశంలో ఆక్సిజ‌న్ నిల్వ‌లేవి? నిల్వ సంగ‌తి త‌ర్వాత‌.. ఏడాదిగా భారీగా ఆక్సిజ‌న్‌ను బ‌య‌టి దేశాల‌కు అమ్మేసుకుంది కేంద్రం. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా 9వేల ట‌న్నుల ప్రాణ‌వాయువు దేశం దాటేసింది. ఈ జ‌న‌వ‌రిలోనైతే మ‌రీ టూమ‌చ్‌. ఏకంగా 734 శాతం ఆక్సిజ‌న్ ఎగుమ‌తులు పెంచేసింది.  గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు భారత్ 9 వేల టన్నులకుపైగా ఆక్సిజన్ ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తంగా 4,500 టన్నులు ఎగుమతి చేయ‌గా.. కేవ‌లం ఈ ఒక్క‌ జనవరిలోనే ఏకంగా మరో 4,500 టన్నులకు పైగా ఎగుమతి చేసినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఎగుమతుల లెక్కలను ఇంకా ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు.  ప్ర‌భుత్వం తీరుపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిప‌డుతోంది. సెకెండ్ వేవ్ ముంచుకు రాబోతోందంటూ కొన్ని నెల‌లుగా సైంటిస్టులు సూచిస్తున్నా.. ఆక్సిజ‌న్ డిమాండ్ ఉంటుంద‌ని తెలుస్తున్నా.. ఇంత ఉదాసీనంగా ప్రాణ‌వాయువును అంగ‌టి స‌రుకుగా అమ్ముకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వంద కోట్ల‌కు పైగా ఉన్న దేశంలో వ్యాక్సిన్, ఆక్సిజ‌న్ ఎంత ఉన్నా త‌క్కువేన‌ని.. ఇంత చిన్న విష‌యం మ‌రిచి.. కేంద్రం టీకాల‌ను, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌డం ముమ్మాటికీ త‌ప్పేనంటూ రాహుల్‌గాంధీ తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ప‌రోప‌కార‌మంటూ కేంద్రం క‌వ‌ర్ చేసుకుంటున్నా.. ఇది స‌ర్కారు వైఫ‌ల్య‌మేన‌ని మండిప‌డుతున్నారు.  మ‌రోవైపు.. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త‌పై టాటా గ్రూపు త‌మ వంతు సాయం అందిస్తోంది. 24 లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజనిక్ కంటైనర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు ప్రకటించింది.

కరోనా కల్లోలంలో ఎన్నికలా? ప్రాణాల కంటే పవరే ముఖ్యమా? 

కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోంది. చాలా ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటిపోయింది. హాస్పిటల్స్ నిండిపోవడంతో కరోనా రోగులు చికిత్స కోసం నరకయాతన పడుతున్నారు. ఆక్సిజన్ సకాలంలో అందక పిట్టల్లా రాలిపోతున్నారు. తమ కండ్ల ముందే రోగులు చనిపోతున్నా వైద్యులు ఏమి చేయలేని పరిస్థితి. తాము ఏం చేయలేకపోతున్నామని రోదిస్తూ ముంబైకి చెందిన ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తేనే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో ఆరుగురు ముఖ్యమంత్రులు, అనేకమంది కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కరోనాకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలో అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాము ఇప్పటి వరకు ఇన్ని శవాలను ఎన్నడూ చూడలేదు.. శవాల కుప్పల మధ్య శ్మశానంలో కాలు పెట్టలేకలేపోతున్నాము అని లక్నో ముక్తిధామ్ శ్మశాన వాటికలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి చెప్పడం కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాంతమైన గోరఖ్‌పూర్  పరిస్థితి దారుణంగా ఉన్నది. లక్నోలో ఒక మాజీ జడ్జి భార్యకు మూడు రోజుల పాటు ఆసుపత్రిలో బెడ్ వసతి లభించక మృతి చెందారు. వారణాసిలో ఒక వ్యక్తి వారం రోజుల పాటు ఆసుపత్రిలో అడ్మిషన్ లభించక మరణించాడు. ఆ తర్వాత శవాన్ని తరలించేందుకు కూడా అంబులెన్స్ లభ్యం కాకపోవడంతో అతడి భార్య ఈ-రిక్షాలో తీసుకువెళ్లిన ఘటన సంచలనం రేపింది. వారణాసి హరిశ్చంద్ర ఘాట్‌లో కూడా కుప్పలు తెప్పలుగా అంత్యక్రియలు జరుగుతున్నాయని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి కచ్చితంగా కరోనా సోకినట్లు తేలుతోంది. ఫోన్ ఎత్తితే చాలు కనీసం ఒక బెడ్ అయినా ఏదో ఒక ఆసుపత్రిలో ఇప్పించమని అభ్యర్థన వస్తోంది. ఢిల్లీ వాట్సాప్ గ్రూప్‌ల్లో కరోనా మరణ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో దాదాపు వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించడమే పరిస్థితికి అద్దం పడుతోంది.  కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నా రాజకీయ పార్టీలు, నేతల తీరు మాత్రం మారడం లేదు. తమకు ప్రజల ప్రాణాల కంటే ఓట్లు, సీట్లే ముఖ్యమన్నట్లుగా ప్రవరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతోంది. కరోనా కట్టడి కోసం జనాలంతా ఇండ్లలోనే ఉండాలని చెబుతున్న ప్రధాని... బెంగాల్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళుతున్నారని విపక్షాలు, పలు సంస్థలు నిలదీస్తున్నాయి.  బెంగాల్‌లో బహిరంగసభల్లో, రోడ్ షోలలో విస్తృతంగా పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చి అక్కడ అభివృద్ధి అధ్వాన్నంగా ఉన్నదని చెప్పిన యోగి ఆదిత్యనాథ్ స్వయంగా కరోనాకు గురయ్యారు.  లక్షలాది మంది మాస్కులు లేకుండా సభల్లో, ప్రచారాల్లో పాల్గొన్నప్పటికీ బిజెపి నేతలు ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కుంభమేళాకు ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనలు పోస్టర్ల రూపంలో ఉత్తరాఖండ్ అంతటా వెలిశాయి. కరోనా పరిస్థితి విషమిస్తున్న దృష్ట్యా మిగిలిన నాలుగు దశలను ఒకే దశలో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మమతా బెనర్జీ ప్రచారాన్ని ఒకరోజు పాటు నిలిపివేసేందుకు చూపిన ఉత్సాహం ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రచారాన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో చూపలేదనే ఆరోపణలు వస్తున్నారు.  కరోనా కారణంగా తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను బిజెపి నేతలు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే రాహుల్ ఎన్నికల సభలను రద్దు చేసుకున్నారని కేంద్ర ఐటి, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. దేశంలో అందరికీ వాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాసినందుకు కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దాడి చేశారు. కొవిడ్ విషమ పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలు ప్రవర్తించడం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా అన్నారు. కాని ఈ దేశంలో నాయకులు మాత్రం కొవిడ్ రూల్స్ పాటించారా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోని పాలకులు ఓట్ల రాజకీయంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఉప ఎన్నిక జరగడంతో తిరుపతి లోక్ సభ పరిధిలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రస్తుత కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కోవిడ్ భయపెడుతున్నా పంతానికి పోయి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించింది జగన్ రెడ్డి సర్కార్. ఆ ఎన్నికల తర్వాత ఏపీలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో అయితే మరీ దారుణం. ప్రస్తుతం పరిస్థితి  చేయిదాటి పోయే పరిస్థితుల్లో ఉన్నా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. ఏప్రిల్ 30న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉన్నా.. నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎన్నికలున్న ప్రాంతాల్లో జనాలు భయంతో వణికిపోతున్నారు. తమ ప్రాణాలతో ఆటలాడుతూ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాల్సి అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏండ్ల కొద్ది ప్రత్యేక అధికారుల పాలన సాగిన సందర్బాలు ఉన్నాయని... అయినా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పట్టుబట్టి మరీ ఎన్నికలు జరపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కరోనాతో అల్లాడుతున్న ఢిల్లీలో మరో ముప్పు!

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో ఢిల్లీ అల్లాడిపోతోంది. ఢిల్లీలో కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి  కరోనా సోకినట్లు తేలుతోంది. ఫోన్ ఎత్తితే చాలు కనీసం ఒక బెడ్ అయినా ఏదో ఒక ఆసుపత్రిలో ఇప్పించమని అభ్యర్థన వస్తోంది. ఢిల్లీ వాట్సాప్ గ్రూప్‌ల్లో కరోనా మరణ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో దాదాపు వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించడమే పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనాతో అల్లాడుతున్న దేశ రాజధానికి మరో గండం ముంచుకొస్తోంది.  కరోనా కేసులతో వణికిపోతున్న ఢిల్లీని ఇప్పుడు మరో భయం వేధిస్తోంది. ఢిల్లీలో డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రికార్డు  స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గత వారం రోజుల్లో కొత్తగా నలుగురు వ్యక్తులు డెంగీ బారినపడ్డారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13కు పెరిగింది.ఇదే సమయంలో 2018లో ఢిల్లీలో 12 మంది డెంగీ బారినపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మంది నగరంలో డెంగీకి చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. 1996 నుంచి ప్రతి సంవత్సరం ఢిల్లీలో జులై-నవంబరు మధ్య డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. డెంగీ అనేది వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నివాస పరిసరాల్లో దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.  గతేడాది డిసెంబరు 5 నాటికి ఢిల్లీలో దాదాపు 1000 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా భయపెడుతున్న సమయంలో డెంగీ కూడా విస్తరించడంతో అధికారులు కలవరపడుతున్నారు. జనాలు కూడా ఏదీ డెంగీ జ్వరమో.. ఏదీ కరోనా జ్వరమో తెలియక ఆందోళన పడుతున్నారు.   

కొవాగ్జిన్‌ భేష్‌.. వ్యాక్సిన్‌పై వ‌ర్రీ వ‌ద్దు..

భారత్‌ బయోటెక్ త‌యారీ కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తోందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి-ఐసీఎంఆర్‌ ప్రకటించింది. సార్స్‌కోవ్‌-2, దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్‌  రకాన్ని కూడా అడ్డుకుంటోందని తెలిపింది. యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను కొవాగ్జిన్‌ బలంగా నిలువరించినట్టు వెల్ల‌డించింది. ఇటీవలే భారత్‌లో కనిపిస్తున్న డబుల్‌ మ్యూటెంట్‌  రకంపై కూడా కొవాగ్జిన్‌ బలంగా పనిచేస్తోందని ఐసీఎంఆర్ ట్వీట్ చేసింది.  కొవిడ్‌ టీకా  తీసుకొన్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు. ఇంజెక్షన్‌ రూపంలో తీసుకొనే కొవిడ్‌ టీకా ఊపిరితిత్తుల కింద భాగాన్నే వైరస్‌ నుంచి రక్షిస్తుందని పై భాగాన్ని కాదని వివరించారు. వ్యాక్సిన్‌ తీసుకొన్న తర్వత కూడా వైరస్‌ శరీరంలోకి  ప్రవేశించినా..  ప్రాణాంతకంగా మారకుండా ఉంటుందని ఆయన వివరించారు. అయితే, టీకా తీసుకొన్నా మాస్క్‌ ధరించడం తప్పనిసరి.  కొవిడ్‌-19 కేసుల తీవ్రత పెరగడం, టీకాకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీని గణనీయంగా పెంచాలని ప్రతిపాదించింది. ఏడాదికి 70 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారీ సామర్థ్యం జులై-ఆగస్టుకు సమకూరుతుందని  భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోని భారత్‌ బయోటెక్‌ యూనిట్లలో దశల వారీగా టీకా ఉత్పత్తి పెంచుతారు. మ‌రోవైపు.. ప్రైవేట్ మార్కెట్లో అమ్మే కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున టీకాను విక్రయిస్తామని తెలిపింది.  ‘‘కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి, 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందజేయనున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయిస్తాం. విదేశీ టీకాలతో పోలిస్తే మా వ్యాక్సిన్‌ ధరలు అందుబాటులోనే ఉన్నాయి’’ అని సీరమ్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధిగమిస్తామంది. 4, 5 నెలల తర్వాత రిటైల్‌ మార్కెట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీర‌మ్ వెల్ల‌డించింది. 

వ్యాక్సిన్ వ‌ర్రీస్‌.. ఎవ‌రికి టీకా వ‌ద్దంటే...

దేశ‌మంతా వ్యాక్సిన్ ఉత్స‌వం న‌డుస్తోంది. అర్హ‌త ఉన్న‌వారంతా టీకాల కోసం ఎగ‌బ‌డుతున్నారు. అయితే, అదే స్థాయిలో వామ్మో వ్యాక్సిన్ మాకొద్దు అనే వారూ ఉన్నారు. చాలా మందిని వ్యాక్సిన్ భ‌యం వేధిస్తోంది. టీకా తీసుకోవాలా వ‌ద్దా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?  చిన్న పిల్ల‌ల‌కు కూడా టీకాలు వేయించాలా?  వేరే రోగం ఉంటే ఎలా? ఇలా అనేక డౌట్స్‌. అందుకే, ఎందుకైనా మంచిద‌ని టీకాల‌కు దూరంగా ఉంటున్న‌వారూ ఎక్కువ మందే ఉన్నారు. ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు తొల‌గించేందుకు, ఎవ‌రెవ‌రికి వ్యాక్సిన్ స‌రికాదో తెలుపుతూ కొన్ని మార్గ ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది కేంద్ర ప్ర‌భుత్వం.   జ్వరంగా ఉన్నప్పుడు కరోనా టీకా వ‌ద్దు. జ్వరం ఉంటే.. పూర్తిగా తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ వేసుకోవాలి. అలర్జీ ఉన్నా.. అది తగ్గిన తర్వాతనే టీకా. బలహీనమైన వ్యాధినిరోధకత ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్నవారు టీకా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. బ్లీడింగ్‌ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలి.  ఇప్ప‌టికే క‌రోనా సోకి.. ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కొవిడ్‌ రోగులు ఈ టీకాలను వేయించుకోకపోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.  అలాగే, ఏ వ్యాక్సిన్‌కైనా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండటం సహజం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో కూడా అంతే. ఒక వేళ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు తీసుకోవాలి.  మొదటి డోస్‌ తర్వాత ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే.. రెండో డోసు తీసుకోకూడదని కేంద్ర‌ మార్గదర్శకాల్లో తెలిపారు.   వ్యాక్సిన్లు వచ్చాయి కదా అని తొందర పడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. 

లెక్కా? తిక్కా? ప‌వ‌న్‌కి క్లారిటీ ఉందా? బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోందా?

లెక్క‌లేనంత తిక్కున్నా.. దానికో లెక్కుంద‌నేది సినిమా డైలాగ్‌. మ‌రి, రాజ‌కీయాల్లోనూ సేమ్ స్ట్రాట‌జీ అప్లై అవుతుందా? తిక్క వ‌ర‌కూ ఓకే కానీ, లెక్కే మిస్ మ్యాచ్‌ అవుతోందా? ప‌వ‌న్ పాలిటిక్స్ ఫ్యాన్స్‌నే క‌న్ఫ్యూజ‌న్‌కి గురి చేస్తున్నాయా? ఇలా జ‌న‌సేన రాజ‌కీయ విధానాల‌పై అనేక ప్ర‌శ్న‌లు.. అంత‌కు మించి అనుమానాలు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాస్త క్లారిటీగానే ఉన్నారు. ఏది ఏమైనా బీజేపీతో పొత్తు కంటిన్యూ చేస్తున్నారు. తిరుప‌తి సీటు త‌మ‌కు రాకున్నా.. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. తెలంగాణ విష‌యం వ‌చ్చే స‌రికే అంతా ఆగ‌మాగం. బీజేపీతో పొత్తు ఉన్న‌ట్టా?  లేన‌ట్టా? ఏమీ అర్థం కాదు. ఓసారి స‌పోర్ట్ చేస్తారు. మ‌రోసారి క‌టీఫ్ చెబుతారు. మ‌ళ్లీ ఓచోట దోస్తీ క‌డ‌తారు. మ‌రోచోట చేతులెత్తేస్తారు. తెలంగాణ‌లో జ‌న‌సేన లెక్క‌.. తిక్క తిక్క‌గా ఉందంటున్నారు విశ్లేష‌కులు.  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన‌.. ప‌క్క‌నే ఉన్న వ‌రంగ‌ల్‌లో మాత్రం క‌మ‌ల‌నాథుల‌కు హ్యాండ్ ఇచ్చింది. ఇలా, తెలంగాణ‌లో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒక్కోసారి.. ఒక్కోచోట.. ఒక్కో విధంగా.. రాజ‌కీయం చేస్తుండ‌టం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డ‌మే అనే విమ‌ర్శ వినిపిస్తోంది. జ‌న‌సైనికులు మాత్రం త‌మ అధినేత ఏమి చేసినా దానికో లెక్క ఉంటుందంటూ పార్టీ స్టాండ్‌కు క‌ట్టుబ‌డి ప‌ని చేస్తున్నారు. గ్రేట‌ర్‌లో బీజేపీకి బేష‌ర‌తు మ‌ద్ద‌తిచ్చింది జ‌న‌సేన‌. క‌మ‌ల‌నాథుల కోరిక మేర‌కు పోటీ నుంచీ త‌ప్పుకుంది. జీహెచ్ఎమ్‌సీలో బీజేపీకి పెద్ద సంఖ్య‌లో సీట్లు రావ‌డానికి జ‌న‌సైనికుల స‌హ‌కారం లేక‌పోలేదు. గ్రేట‌ర్‌లో గెలిచామ‌న్న అహంకారంతో తెలంగాణ బీజేపీ త‌మ‌ను త‌క్కువ చేసి చూస్తోందంటూ ఆ త‌ర్వాత జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆఖ‌రి నిమిషంలో స్టాండ్ మార్చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. బీజేపీని కాద‌ని.. ప‌రోక్షంగా, బ‌హిరంగంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవికి మ‌ద్ద‌తు ప‌లికారు. వాణీదేవి గెలుపున‌కు జ‌న‌సేన ఉడ‌తా భ‌క్తి సాయం చేసిందంటున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో దాదాపు త‌ట‌స్థంగా ఉంది జ‌న‌సేన‌. క‌ట్ చేస్తే.. అంత‌లోనే వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈసారి జ‌న‌సేన స్టాండ్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంతా ఆస‌క్తిగా చూశారు. తెలంగాణ జిల్లాల్లోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. హోరాహోరీగా జ‌రిగే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌తీ ఓటూ కీల‌క‌మే. అలాంటిది.. జ‌న‌సేన ఆ రెండు చోట్ల రెండు విధానాలు పాటిస్తోంది. ఖ‌మ్మంలో బీజేపీతో పొత్తుపెట్టుకుంది జ‌న‌సేన‌. వ‌రంగ‌ల్‌లో మాత్రం పొత్తు-గిత్తూ జాన్తా నై అంది. అదేంటి? ఖ‌మ్మంకో రూల్‌. వ‌రంగ‌ల్‌కు మ‌రో రూలా? అస‌లు, జ‌న‌సేన‌కు ఓ స్ప‌ష్ట‌మైన పొలిటిక‌ల్ విధాన‌మంటూ ఉందా? అనే డౌట్ తెలంగాణ‌వాదుల్లో. జ‌న‌సేన‌నే క‌న్ఫ్యూజ్ అవుతోందా?  లేక‌, బీజేపీనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో గేమ్స్ అడుతోందా? అనే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఇంటికెళ్లి మ‌రీ మ‌ద్ద‌తు అడిగారు క‌మ‌ల‌నాథులు. మంచి మాట‌లు చెప్పి పోటీ నుంచీ విత్‌డ్రా చేశారు. తీరా గెలిచాక, అవ‌స‌రం తీరాక‌.. లైట్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గ్రాడ్యుయేట్స్ ఓట్లే కాబ‌ట్టి.. అవి ఎలాగూ త‌మ‌కే ప‌డ‌తాయ‌నే ధీమాతో.. ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోలేదు. అదే ఆయ‌న‌కు కాలింది. లాస్ట్ మిన‌ట్‌లో బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు.  అక్క‌డి వ‌ర‌కూ ఓకే. మ‌రి, ఆ త‌ర్వాతైనా దోస్తీ కొన‌సాగిందా అంటే అదీ లేదు. సాగ‌ర్ బైపోల్‌లో  ఒక‌రిని ఒక‌రు పట్టించుకోలేదు. అదే, కార్పొరేష‌న్ ఎల‌క్ష‌న్స్ వ‌చ్చే స‌రికి మ‌ళ్లీ ఈక్వేష‌న్ మారిపోయింది. వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో బీజేపీకి బ‌లం ఉండ‌టం, కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఉండ‌టంతో విద్యార్థి యూనియ‌న్లు యాక్టివ్‌గా ఉండ‌టం, గ‌తంలో వ‌రంగ‌ల్ లో ఓసారి బీజేపీ ఎమ్మెల్యే గెల‌వ‌డం.. విద్యావంతులు అధికంగా ఉండే ప్రాంతం కాబ‌ట్టి బీజేపీకి అనుకూల‌త ఉండ‌టం.. ఇలా అనేక కార‌ణాల‌తో జ‌న‌సేన‌ను ట‌చ్ కూడా చేయ‌లేదు క‌మ‌ల‌నాథులు. అదే ఖ‌మ్మం విష‌యం వ‌చ్చే స‌రికి.. వ‌రంగ‌ల్ లాంటి అద‌న‌పు అనుకూల‌త‌లేమీ లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ జ‌న‌సేన మ‌ద్ద‌తు అనివార్య‌మైంది. ఖ‌మ్మంలో ఆ రెండు పార్టీల పొత్తు పొడిచింది.  ఇలా.. బీజేపీ మైండ్‌గేమ్‌తోనే జ‌న‌సేన గంద‌ర‌గోళానికి గురైతోంద‌ని విశ్లేషిస్తున్నారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్ట‌లేని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. క‌మ‌ల‌నాథుల‌కు అవ‌స‌రానికి ప‌నికొచ్చే పావులా మారుతున్నార‌ని అంటున్నారు. క‌మ‌ల వ్యూహంతో గాజుగ్లాసు ముక్క‌ల‌వుతోంద‌ని.. అందుకే ఎల‌క్ష‌న్‌ను బ‌ట్టీ, ప్రాంతాన్ని బ‌ట్టీ జ‌న‌సేన స్ట్రాట‌జీ మారిపోతోంద‌ని.. ఇదంతా క‌మ‌ల మాయే కానీ.. ప‌వ‌న్ లెక్కో.. తిక్కో.. కాద‌ని అనేవారూ లేక‌పోలేదు. అవ‌స‌రం లేనిచోట ప‌వ‌న్‌ని ప‌ట్టించుకోకుండా ఆయ‌న‌కు తిక్క రేపి.. అవ‌స‌రం ఉన్న‌చోట ఆయ‌న్ను మ‌చ్చిక చేసుకొని.. బీజేపీ మైండ్‌గేమ్ అడుతోంద‌నేది కొంద‌రి మాట‌. 

తెలంగాణలో ఆక్సిజన్ కొరత! ఈటల సంచలన వ్యాఖ్యలు 

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో 24X7 పనిచేస్తోందని  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.  వైద్య ఆరోగ్య శాఖకు తోడుగా హైదరాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి కరోనా రోగులకు చికిత్సను, వాక్సినేషన్ ను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సీఎం స్వయంగా కరోనా వైద్యానికి అవసమైన రెమిడెసివర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూస్తున్నారని, ఇప్పటికే  3-4 లక్షల డోసులను  ప్రోక్రూర్ చేసి పెట్టామన్నారు.  తెలంగాణ ఆక్సిజన్ కొరత ఉందన్న వార్తలపై స్పందించారు మంత్రి ఈటల. ఆక్సిజన్ అనేది రాష్ట్ర పని కాదని. దేశవ్యాప్తంగా ఉన్న ఉక్కు కర్మాగారాల వద్ద స్టోర్ చేసి తీసుకురావాలని చెప్పారు. మనకు దగ్గరగా ఉన్న  విశాఖ, బల్లారి స్టీల్ ప్లాంట్ల నుంచి కేటాయింపులు తగ్గించి,  ఎక్కడో 3800 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూర్కీ నుంచి మనకు కేటాయించారన్నారు. దీంతో ఒక్క ట్యాంకర్ రావడానికి ఏడెనిమిది రోజులు పడుతోందన్నారు ఈటల. ట్రాన్స్ పోర్టు ఇబ్బందిగా ఉందని, తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ కేటాయించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కోరామన్నారు. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు మంత్రి ఈటల.  తెలంగాణ తో పాటు అనేక రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు పేషెంట్లు వస్తున్నారన్నారు ఈటల. అందుకే ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం చూడాలన్నారు. ఇప్పటికైతే ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని, కానీ పేషెంట్లు పెరిగితే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందన్నారు మంత్రి. పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారనే, ఏడుస్తున్నారనో అవసరం లేకున్నా ఆక్సిజన్ ఇవ్వొద్దన్నారు. అవసరమైతే తప్ప ఆక్సిజన్ పెట్టవద్దను డాక్టర్లను కోరుతున్నామని తెలిపారు ఈటల. ఆక్సిజన్ ఉపయోగిస్తున్న పేషెంట్లను వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తూ పొదుపుగా వాడాలన్నారు. కావాలనుకున్నప్పుడు ఆక్సిజన్ దొరకదు కాబట్టి అనవసరంగా వృథా చేయవద్దని సూచించారు మంత్రి ఈటల.  రాత్రి కర్ఫ్యూ పెట్టినప్పటికీ ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండాలని హెచ్చరించారు మంత్రి ఈటల. నగరాలు, పట్టణాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాత్రి పూట కర్ఫ్యూ పెట్టామని చెప్పారు. వరికోతలు, కొనుగోళ్ల సమయం సమయం కాబట్టి స్వీయ నియంత్రణతో పనిచేయాలని సూచించారు. పల్లెల్లో కరోనా విస్తరించకుండా గ్రామ పంచాయితీ పాలకమండళ్లు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్రజలు కూడా ఎవరో చెప్పాలని చూడకుండా జాగ్రత్తగా ఉండాలని, మున్సిపాలిటీల్లో కూడా కరోనా నియంత్రణ చర్యలు సమర్ధవంతంగా అమలు చేయాలని ఈటల రాజేందర్ తెలిపారు

హ‌నుమంతుడు మ‌న‌వాడే.. శ్రీరామ‌న‌వ‌మి వేళ శుభ‌వార్త‌..

రామ‌భ‌క్తుడు హ‌నుమాన్‌. ఆ ఆంజ‌నేయుడు మ‌న‌వాడే. మ‌న తెలుగు నేల‌పైనా చిరంజీవి జ‌న్మించాడు. ఆ మేర‌కు టీటీడీ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. సప్తగిరుల్లో ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని టీటీడీ తెలిపింది. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. హనుమంతుడి జన్మస్థానంపై అన్వేషణకు టీటీడీ కమిటీ వేసింది. క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశమై.. చ‌రిత్ర ఆధారాల‌ను ప‌రిశీలించి.. లోతుగా ప‌రిశోధ‌న చేసి.. హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించారు. ఆంజనేయస్వామి జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని ఆచార్య మురళీధర శర్మ చెప్పారు. అన్వేషణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.  కమిటీలో మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. టీటీడీ ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీరామ‌న‌వ‌మి వేళ‌.. రాములోరి క‌ల్యాణం సమ‌యంలో.. టీటీడీ అధికారికంగా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం రామ‌భ‌క్తుల‌ను ఆనందంలో ముంచెత్తింది. హ‌నుమంతుడు మ‌న‌వాడే నంటూ తెలుగువారంతా గ‌ర్వ‌ప‌డే సంద‌ర్భం ఇది. మ‌నంద‌రికీ ఇవాళ నిజ‌మైన పండుగ‌. జై బోలో రామ‌భ‌క్త హ‌నుమాన్ కీ.. జై....

కాంగ్రెస్ చెబుతుంటే.. మోదీ చేస్తున్నారా?

కొవిడ్ వ్యాక్సిన్స్. ప్ర‌స్తుత స‌మ‌యంలో ప్ర‌పంచానికి మోస్ట్ వాంటెడ్‌. టీకా ఉత్ప‌త్తిలో భార‌త్ ప్ర‌ముఖ స్థానంలో నిలుస్తోంది. దేశ ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌పంచ దేశాల‌కూ స‌ప్లై చేస్తోంది. ఇది మ‌న ఉదార‌త అంటోంది కేంద్రం. అది మీ ఉదాసీన‌త అని విమ‌ర్శిస్తోంది కాంగ్రెస్‌. అందుకే, వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం, ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిపై బీజేపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య డైలాగ్‌ వార్ న‌డుస్తోంది.  వ్యాక్సిన్‌ ఎగుమ‌తుల‌పై కొంత‌కాలంగా కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర విధానాన్ని రాహుల్‌గాంధీ త‌ప్పుబ‌ట్టారు. వెంట‌నే ఎగుమ‌తులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ విమ‌ర్శించిన కొన్ని రోజుల‌కే కేంద్రం వ్యాక్సిన్ ఎగుమ‌తుల‌ను ర‌ద్దు చేయ‌డం ఆస‌క్తిక‌రం.  అంతేకాదు, 45 ఏళ్ల పైబ‌డిన వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ ఇవ్వ‌డాన్ని రాహుల్‌గాంధీ నిల‌దీశారు. దేశ ప్ర‌జ‌లంద‌రికీ వెంట‌నే వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాల‌ని డిమాండ్ చేశారు. విచిత్రంగా.. రాహుల్ వ్యాఖ్య‌ల త‌ర్వాతే కేంద్రం త‌న విధానాన్ని మార్చుకుంది. 18 ఏళ్ల పైబ‌డిన వారంద‌రికీ మే నెల 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. దేశంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెంచేందుకు సైతం కంపెనీల‌కు ఆర్థిక సాయం చేసేలా నిర్ణ‌యం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర నియంత్ర‌ణ‌లో మాత్ర‌మే ఉన్న వ్యాక్సిన్ స‌ప్లై.. ఇక‌పై రాష్ట్రాలు, బ‌హిరంగ మార్కెట్లోనూ అందుబాటులో ఉండేలా కేంద్రం పాల‌సీ మార్చుకుంది. ప‌లు రాష్ట్రాలు త‌మ ద‌గ్గ‌ర వ్యాక్సిన్ నిల్వ‌లు లేవంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశాక‌గానీ కేంద్రం దిగిరాలేదు. టీకాలు లేక తెలంగాణ స‌ర్కారు ఏకంగా ఒక రోజు వ్యాక్సినేష‌న్‌ను ఆపేయ‌డం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. అటు, కాంగ్రెస్ విమ‌ర్శ‌లు.. ఇటు రాష్ట్రాల నుంచి ఒత్తిడితో మోదీ న‌ష్ట నివార‌ణా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే, ఆ చ‌ర్య‌ల‌న్నీ రాహుల్‌గాంధీ విమ‌ర్శ‌ల త‌ర్వాతే తీసుకోవ‌డం కాక‌తాళీయ‌మో.. లేక‌..? మ‌రోవైపు, రాహుల్‌లానే ప్రియాంక గాంధీ సైతం విమ‌ర్శ‌ల్లో ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు. సూటిగా, ఘాటుగా మోదీపై విమ‌ర్శ‌లు చేయ‌డంలో దిట్ట ఆమె. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ధానిపై హాట్ కామెంట్స్‌తో విరుచుకుప‌డుతుంటారు. తాజాగా, దేశంలో వ్యాక్సిన్‌, ఆక్సిజ‌న్ కొర‌త‌పై మోదీని ఏకిపారేశారు ప్రియాంక‌. మూడు నెలల్లో భార‌త్ నుంచి 6 కోట్ల కొవిడ్ టీకాలు ఎగుమ‌తి అయ్యాయ‌న్నారు ప్రియాంక‌.  "జ‌న‌వ‌రి-మార్చి మ‌ధ్య భార‌త్‌లో 3-4 కోట్ల మందికి టీకాలు వేశారు. గ‌త 6 నెల్లో 1.1 మిలియ‌న్ల రెమిడెసివిర్ ఇంజెక్ష‌న్లు భార‌త్ నుంచి ఎగుమ‌తి చేశారు. ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంలో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉన్నప్ప‌టికీ, దేశంలో ఆక్సిజ‌న్ కొర‌త ఎదుర్కొంటున్నాం" అని ప్రియాంక విమ‌ర్శించారు.  అటు, ప్ర‌ధాని మాత్రం దేశంలో ఆక్సిజ‌న్‌కు కొర‌త లేద‌ని, కావ‌ల‌సినంత స్టాక్ ఉంద‌ని అంటున్నారు. రాష్ట్రాలు మాత్రం ఆక్సిజ‌న్ నిల్వ‌లు నిండుకున్నాయ‌ని చెబుతున్నాయి. అయితే, చాలా ఆల‌స్యంగానైనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి పెంచేందుకు కేంద్రం భారీగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం. త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులో టీకా! క‌రోనా ముక్త్ భార‌త్‌! సాధ్య‌మే..నా?

ముంబైలో దారుణ పరిస్థితులు..రోదిస్తున్న వైద్యులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆసుపత్రులలో ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల కొరత తాండవిస్తోంది. సమయానికి ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. హాస్పిటల్ ఆవరణలోనే కొందరి ప్రాణాలు పోతుండగా.. మరికొందరు అంబులెన్స్ ల్లోనే చనిపోతున్నాయి. ముంబై హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కోసం రోగులు పడిగాపులు పడుతున్న దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లోనూ ఇలాంటి దారుణ పరిస్థితులే నెలకొన్నాయి. ముంబైలో వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. వైద్య సదుపాయాలు అందక కరోనా బాధితులు ప్రాణాలు వదులుతున్నారు.  ముంబై పరిస్థితులపై ఒక వైద్యురాలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో డాక్టర్ తృప్తి గిలాడా రోదిస్తూ కనిపిస్తున్నారు.... ‘చాలామంది వైద్యుల మాదిరిగానే నేను కూడా ఎంతో ఆందోళన పడుతున్నాను. ముంబైలో పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. ఇక్కడి ఆసుపత్రులలోని ఐసీయూలలో ఖాళీలు లేవు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదు. మేము నిస్సహాయులం. ప్రస్తుత పరిస్థితిలో ఎమోషనల్ బ్రేక్‌డౌన్ అనేది డాక్టర్లందరిలోనూ ఎంతోకొంత ఉండనే ఉంది. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలి... అని డాక్టర్ తృప్తి గిలాడా ఆవేదన వ్యక్తం చేశారు.

గంటకు 12 వేల కేసులు! దేశంలో కరోనా కల్లోలం 

దేశంలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. రోజురోజుకు మరింతగా విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. మంగళవారం దేశంలో రికార్డ్ స్థాయిలో 2 లక్షల 95 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు 2 వేలు క్రాస్ అయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా 2023 మందిని వైరస్‌ బలితీసుకుంది.  మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,39,357 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,95,041 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కి  చేరింది.  ఇదే సమయంలో కొవిడ్‌తో 2023 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,82,553కి చేరింది. మహారాష్ట్రలో 62,097, యూపీలో 29,754, దిల్లీలో 28,395, కర్ణాటకలో 21,794 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 519, ఢిల్లీలో 277, ఉత్తరప్రదేశ్‌లో 162 మరణాలు నమోదయ్యాయి.   గడిచిన 24 గంటల్లో మరో 1,67,457 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1,32,76,039 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 85.56శాతంగా ఉంది.   దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,57,538 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌  ఏప్రిల్‌ నెలలో మహమ్మారి కట్టలు తెంచుకుంది. ఈ నెల 18వ తేదీ సోమవారం నమోదైన 2,73,500 కేసులు, 1,619 మరణాలను గంటల ప్రాతిపదికన లెక్కిస్తే.. గంటకు 11 408 కేసులు రాగా, 67 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 2.93 లక్షల కేసులు- 2023 మరణాలను లెక్కిస్తే గంటకు 12,293 మంది వైరస్‌ బారినపడగా, 84 మంది చనిపోయారు. ఏప్రిల్‌ 1న దేశంలో 72,330 పాజిటివ్‌లు, 459 మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన నాడు గంటకు నమోదైన కేసులు 3,013 అయితే.. మరణాలు 19 మాత్రమే. 20 రోజుల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో బాధితులు, మృతులు పదిరెట్లపైగా పెరిగారు. 1వ తేదీన యూపీలో గంటకు 108 కేసులు నమోదయ్యాయి. మూడు గంటలకొకరు చనిపోయారు. 18వ తేదీన గంటకు 1,271 పాజిటివ్‌లు రాగా, ఐదుగురు చనిపోయారు. కేసులపరంగా ఢిల్లీలో ఇదే పరిస్థితి నెలకొంది.   మరణాలు యూపీ కంటే  రెట్టింపు ఉంటున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్‌ 1న గంటకు 1,647 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. తాజాగా 2,859 పాజిటివ్‌లు వస్తుండగా, 20 మంది చనిపోతున్నారు.

దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడండి! దేశ ప్రజలకు ప్రధాని వినతి 

దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలని దేశ ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లాక్ డౌన్ అవసరం లేకుండానే కరోనా మహ్మమారిని కట్టడి చేద్దామని పిలుపిచ్చారు. లాక్ డౌన్ చివరి అస్త్రంగానే ఉండాలన్నారు ప్రధాని. ప్రజలెవరు బయటికి రావొద్దని సూచించారు. అందరూ జాగ్రత్తగా ఉంటే కరోనా ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి మరోసారి తుపాన్‌లా విరుచుకుపడుతోందని  అన్నారు. దేశం మరోసారి భీకర యుద్దం చేస్తుందన్నారు. అందరం కలిసి కట్టుగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాను అంతమొందించే పోరులో ముందున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను ప్రశంసించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మరీ వారు దేశం కోసం పోరాడుతున్నారని తెలిపారు. వైద్య సిబ్బందికి సెల్యూట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.  గత కొన్ని రోజుల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్‌ ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా అవసరమున్న ప్రతిఒక్కరికీ ఆక్సిజన్‌ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆక్సిజన్‌ను ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఔషధాల తయారీని పెంచేందుకు సైతం తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఔషధ తయారీ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు. శాస్ర్తవేత్తలు రాత్రిపగలు కష్టపడి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్‌ సంస్థల కృషిని ప్రధాని ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా టీకాలు అందిస్తున్న దేశంగా భారత్‌ కొనసాగుతోందన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా ఇప్పటికే వైద్యారోగ్య సిబ్బందికి ఫలాలు అందుతున్నాయన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించనున్నామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. నగరాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేగంగా వ్యాక్సిన్‌ అందించాలన్న ఉద్దేశంతోనే 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. వివిధ నగరాల్లో పనిచేస్తున్న శ్రామికులకు వారున్న చోటే టీకా అందిస్తామన్న భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా వారిలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన మౌలిక వసతులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఈ ఘనత దేశప్రజలందరికీ వర్తిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతిఒక్కరూ సహకిరిస్తేనే కరోనాపై విజయం సాధించగలమన్నారు.