కేజ్రీవాల్ కు ప్రధాని మోడీ క్లాస్
posted on Apr 23, 2021 @ 6:25PM
కొవిడ్ విజృంభణ, ఆక్సిజన్ కొరత, వైరస్ కట్టడి చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం హాట్ హాట్ గా సాగింది. వర్చువల్ గా సాగిన ఈ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. కరోనా పరిస్థితులపై ప్రధాని సమక్షంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర విషాదం తప్పదని అన్నారు. తాము ఈ పరిస్థితులను ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ముఖ్యమంత్రుల సమావేశంలో కేజ్రీవాల్ తీరుపై ప్రధాని మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగంగా అసహనం ప్రదర్శించారంటూ కేజ్రీవాల్ కు క్లాస్ పీకారు. కేజ్రీవాల్ వైఖరి ఆక్షేపణీయం అని, ప్రోటోకాల్ కు విరుద్ధమని మోడీ స్పష్టం చేశారు. సమావేశ సంప్రదాయం ఇది కాదని స్పష్టం చేశారు. దీనిపై కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. తన మాటల పట్ల చింతిస్తున్నానని, భవిష్యత్ లో ఇలా జరగకుండా చూస్తానని ప్రధానికి హామీ ఇచ్చారు.
ప్రధాని సమావేశంలోనూ ఆక్సిజన్ అంశమే ప్రధానంగా మారింది. కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉందని... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినీ తనను క్షమించాలని కోరారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని డిమాండ్ చేశారు.