ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై చిరంజీవి ట్వీట్‌..

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? అంటూ ప్ర‌శ్నించారు మెగాస్టార్ చిరంజీవి. విశాఖ ఉక్కు రోజుకు 100 ట‌న్నుల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేస్తోంది. ఎన్నో రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్ అందించి.. ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడుతోంది. స్పెష‌ల్ ట్రైన్‌లో 150 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను విశాఖ నుంచి మ‌హారాష్ట్ర‌కు పంపించారు. అలాంటి విశాఖ ఉక్కు క‌ర్మాగారం న‌ష్టాల్లో ఉంద‌ని ప్రైవేటు ప‌రం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం???  మీరే ఆలోచించండి.. అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.  అయితే, ఎక్క‌డా కేంద్రం పేరు ప్ర‌స్తావించ‌కున్నా.. ప‌రోక్షంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారు మెగాస్టార్‌. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము సైతం అంటూ చిరంజీవి స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 

గ్రేటర్ లో మళ్లీ కంటైన్ ‌మెంట్ జోన్లు.. లిస్ట్ ఇదిగో..

హైద‌రాబాద్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండ‌టంతో జీహెచ్ఎమ్‌సీ అల‌ర్ట్ అయింది. కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది. 30 స‌ర్కిళ్ల ప‌రిధిలో మొత్తం 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయ‌నున్నారు. ఆయా జోన్ల‌లో నిరంత‌రం శానిటేష‌న్ చేప‌డ‌తారు. 5 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను మినీ కంటైన్‌మెంట్ జోన్లుగా ప‌రిగ‌ణిస్తారు. ఒకే అపార్ట్‌మెంట్‌లో కేసులు వ‌స్తే హౌజ్ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు చేస్తారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు శానిటేష‌న్‌తో పాటు వైద్య సిబ్బందిని, మందుల‌ను అందుబాటులో ఉంచుతారు. జీహెచ్ఎమ్‌సీ సిబ్బంది నిత్యం ఆయా జోన్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంటారు.

ప‌రీక్ష‌ల పంతం.. ప్ర‌భుత్వం మొండిఘ‌టం!

స‌ర్కారు మ‌రీ మొండికేస్తోంది. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై పంతానికి పోతోంది. ఓవైపు ఏపీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. ప‌రీక్ష‌ల ర‌ద్దుపై నిర్ణ‌యానికి వెన‌కాడుతోంది. ప‌రీక్ష‌ల పేరుతో విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోందంటూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వ స‌బ్ క‌మిటీ స‌మావేశ‌మైనా.. ఎగ్జామ్స్ ర‌ద్దుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంపై త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. మ‌రోసారి స‌మీక్ష త‌ర్వాతే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామంటూ మంత్రి సురేశ్ ప్ర‌క‌టించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.  అంత‌కుముందు, ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. ప‌ది, ఇంట‌ర్ విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రై క‌రోనా బారిన ప‌డితే.. సీఎం జ‌గ‌న్ బాధ్య‌త తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం మొండిగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని చూస్తోంది. విద్యార్థుల జీవితాల‌కే ప‌రీక్ష పెడుతోంది. దేశంలో అనేక ప్ర‌భుత్వాలు ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్నా.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు నిర్ణ‌యంలో మాత్రం మార్పు రావ‌డం లేద‌ని నిల‌దీశారు.  ప్ర‌భుత్వం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే 80శాతం విద్యార్థులు కొవిడ్ బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని స‌ర్కారును హెచ్చ‌రించారు నారా లోకేశ్‌.

టెస్టుల ఫియ‌ర్‌.. 300మంది ప‌రార్‌..

క‌రోనా అంటే భ‌యం. క‌రోనా టెస్టుల‌న్నా భ‌యం. ఎక్క‌డ పాజిటివ్ వ‌స్తుందో.. ఎక్క‌డ క్వారంటైన్‌లో ఉండాలోన‌నే టెన్ష‌న్‌. అదే భ‌యం వారిని అక్క‌డి నుంచి పారిపోయేలా చేసింది. క‌రోనాతో దాగుడు మూత‌లు ఆడుతూ.. దేశంలో వైర‌స్ వ‌ర్రీ పెంచేస్తున్నారు ఇలాంటి వాళ్లు.  త‌మ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే కొవిడ్ టెస్టులు త‌ప్ప‌నిస‌రి చేశాయి కొన్ని రాష్ట్రాలు. అందుకే, వివిధ ప‌నుల నిమిత్తం వేరే ప్రాంతాల‌కు వెళ్లే వారు అక్క‌డి ప‌రీక్ష‌లకు మ‌స్కా కొడుతున్నారు. అధికారుల‌కు చిక్క‌కుండా చిక్కులు తెచ్చిపెడుతున్నారు. ఇటీవ‌ల బిహార్‌లోని ఓ రైల్వే స్టేష‌న్‌లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోకుండా కొంద‌రు ప్ర‌యాణికులు ప‌రుగులు తీసి కాసేపు క‌ల్లోలం రేపారు. లేటెస్ట్‌గా అస్సోంలోని ఓ ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. టెస్టులు వ‌ద్దంటూ.. ఏకంగా 300 మంది ప్యాసింజ‌ర్లు విమానాశ్ర‌యం నుంచి పారిపోయారు.   కరోనా కట్టడిలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కరోనా టెస్టులను తప్పనిసరి చేసింది అస్సాం ప్రభుత్వం. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి పరీక్షలు చేస్తోంది.సిల్చార్ ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టుల నిమిత్తం వైద్య సిబ్బంది ప్రయాణికులను ఆపగా.. కొందరు వారితో వాగ్వాదానికి దిగారు. పరీక్షలకు ధర రూ. 500 ఉండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గందరగోళంలోనే ప్యాసింజ‌ర్లు అక్కడి నుంచి పారిపోయారు.    ఆ విమానాశ్రాయానికి 6 విమానాల్లో 690 మంది ప్రయాణికులు వ‌చ్చారు. వారిలో 300 మందికి పైగా పరీక్షలు చేయించుకోకుండా ఎస్కేప్ అయ్యారు. మిగతా వారికి క‌పరీక్షలు జరపగా.. ఆరుగురికి పాజిటివ్ వ‌చ్చింది. ప‌రారీ అయిన ప్ర‌యాణికుల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొన‌సాగుతోంది. ప్రయాణికులు అందరి వివరాలు తమ ద‌గ్గ‌ర ఉన్నాయని, వారిని ట్రేస్‌ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు. మ‌రోవైపు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ అస్సోం ప్రభుత్వం తాజాగా నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠినం చేసింది.

కొవిడ్ కట్టడి చర్యలు ఇలాగా?  ఏపీ సర్కార్ పై హైకోర్టు అసహనం

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో మరణాలు పెరిగిపోయాయి. ఏపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కోవిడ్‌ నియంత్రణ చర్యలపై కౌంటర్‌ దాఖలు చేయకపోవటం పట్ల ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈనెల 26లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో తోట సురేష్‌ బాబు దాఖలు  చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.  ప్రాధాన్యతా అంశాన్ని పట్టించుకోకపోవటంపై జగన్ రెడ్డి సర్కార్ కు  ప్రశ్నించింది ధర్మాసనం. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు తదితరం అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రవేటు ఆసుపత్రులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని పేర్కొంది.  రెమిడీ ఫీవర్‌ ఇంజక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకటం లేదని చెప్పారు. ఈ వివరాలన్నింటితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 27లోపు అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే ప్రభుత్వంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.  మరోవైపు కోవిడ్-19ను కట్టడి చేయడంలో భాగంగా హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌ ద్వారా కీలక సర్క్యులర్‌ విడుదలైంది. సబార్డినేట్‌ కోర్టులు సహా ట్రిబ్యునల్‌, లేబర్‌ కోర్టులు, న్యాయసేవా సంస్ధలు, జిల్లా యూనిట్లలో 50 శాతం మంది మాత్రమే సిబ్బంది విధులకు హాజరుకావాలని మిగిలిన 50 శాతం మంది తరువాత రోజు విధులకు రావాలని హైకోర్టు పేర్కొంది. ఎవరైతే విధులకు హాజరు కారో వారు ఫోన్‌ కాల్‌లో అందుబాటులో ఉండి అవసరమైతే అత్యవసరంగా విధులకు హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొంది. న్యాయస్ధానాల ఉద్యోగులు ఎవరూ ముందస్తు అనుమతులు లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లకూడదని, హైకోర్టులోకి ప్రవేశించేముందు పూర్తిస్ధాయిలో శానిటైజేషన్‌ చేసుకొని, మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించి హాజరుకావాలని సూచించింది. 

మీవ‌ల్లే క‌రోనా క‌ల్లోలం.. వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలి..

దేశ పౌరులంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇదీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్‌. వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అనుసరిస్తున్న విధానం వివక్షాపూరితంగా, పక్షపాతంతో కూడుకుందని ఆరోపించారు. 18ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్‌ అందివ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.   ‘కరోనా వైరస్‌ మహమ్మారి గత ఏడాది నుంచి పౌరులకు కఠినమైన బాధలను కలిగిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష, పక్షపాత విధానాలను అనుసరిస్తూనే ఉంది. ఇలాంటి నిర్ణయాలు ఇప్పటికే ఉన్న సవాళ్లను మరింత పెంచుతాయి’ అని వ్యాక్సిన్‌ విధానంపై ప్రధానికి రాసిన లేఖలో సోనియాగాంధీ త‌ప్పుబ‌ట్టారు. దేశ యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను మరచినట్లు స్పష్టంగా తెస్తుందని నిల‌దీశారు.  మూడో విడత వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా.. తయారీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి 50శాతం కరోనా టీకా డోసులు అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటుకు మరో 50శాతం డోసులను సరఫరా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. దీంతో కొవిషీల్డ్‌ టీకాను కేంద్ర ప్రభుత్వానికి డోసుకు రూ.150, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400, ప్రైవేటుకు రూ.600గా ధరను నిర్ణయిస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. ఇలా భిన్న ధరలను నిర్ణయించడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌కు మూడు రకాల ధరను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. సామాన్య పౌరులు టీకాల కోసం భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకూ తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందని అభిప్రాయపడింది. దీనిపై ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకొని వ్యాక్సిన్‌ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.  అటు, రాహుల్ గాంధీ సైతం ప్ర‌సంగాలు కాదు, ప‌రిష్కారాలు చూపాలంటూ మోదీని నిల‌దీశారు. ఇప్ప‌టికే తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఒకే దేశంలో, ఒకే వ్యాక్సిన్‌కు వేరు వేరు ధ‌ర‌లు ఉండ‌టంపై కేంద్రాన్ని నిల‌దీస్తూ ట్వీట్ చేశారు. ఇలా వ్యాక్సిన్ విధానంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. కేంద్ర ప్ర‌భుత్వం మూడో విడ‌త వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 28 నుంచి 18 ఏళ్ల పైబ‌డిన వారుకి వ్యాక్సిన్ రిజిష్ట్రేష‌న్ల‌ను ప్రారంభించింది కేంద్రం.

మా దగ్గర ఉత్పత్తయ్యే మందులు మాకే!  

కొవిడ్ నియంత్రణ చర్యలు, ఆక్సిజన్ , రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరాలో కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రాష్ట్రాలకు 4 వందల రూపాయలుగా నిర్ణయించడంపై కేటీఆర్ మండిపడ్డారు. ట్వీట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు కేటీఆర్ . తాజాగా వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా కేంద్రం తీరును ఎండగట్టారు. తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు.  రెమ్‌డెసివిర్ స‌ర‌ఫ‌రాను కేంద్ర ప్ర‌భుత్వం తన అధీనంలోకి తీసుకుందని చెప్పారు ఈటల. తెలంగాణ‌ ప్రభుత్నం 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కోసం ఆర్డర్లు ఇస్తే 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. దీనిపై నిరసన తెలుపుతున్నామ‌ని అన్నారు. తెలంగాణ‌లో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు.  హైదరాబాద్‌లో తెలంగాణకు చెందిన‌ రోగులే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కర్ణాటకకు చెందిన‌ రోగులు కూడా చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. అందుకే తెలంగాణకు ఎక్కువ డోసులు ఇవ్వాల్సిందేనని రాజేందర్ స్పష్టం చేశారు.  తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందన్నారు ఈటల రాజేందర్. గాంధీ ఆసుప‌త్రిలో మొద‌టిసారి 600 మందికిపైగా రోగులు ఐసీయూలో ఉన్నారని  చెప్పారు. కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు డ‌బ్బులు క‌ట్ట‌ని రోగుల‌ను గాంధీకి పంపుతున్నాయని చెప్పారు.  రోగుల ప‌రిస్థితి విష‌మిస్తే కూడా కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు గాంధీ ఆసుప‌త్రికి పంపుతున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆసుప‌త్రులు రోగిని చేర్చుకున్న‌ప్ప‌టి నుంచి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, మంచి వైద్యం అందించాల‌ని ఈటల చెప్పారు. 

ఆక్సిజ‌న్ కావాలా? విశాఖ‌ ఉక్కు అమ్మ కం ఆపేస్తారా?

ప్రాణం తీయాలని అనుకున్నారు. అదే ఇప్పుడు ప్రాణం పోస్తోంది. అడ్డంగా అమ్మేస్తున్నారు. అదే ఇప్పుడు అంద‌రినీ ఆదుకుంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌. ప్ర‌స్తుత క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో దేశానికి ప్రాణ‌వాయువు అందిస్తున్న ప్లాంట్‌. ఉక్కు క‌ర్మాగారంలో ఆక్సిజ‌న్ ఘ‌ని. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విలువేంటో.. ఆ కంపెనీ దేశానికి ఎంత కీల‌క‌మో మ‌రోసారి తెలిసొస్తోంది.  దేశంలోనే త‌క్కువ ధ‌ర‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్‌. ప్ర‌భుత్వ రంగంలో ఉండ‌టం వ‌ల్లే ఇదంతా సాధ్య‌ప‌డుతోంద‌ని.. ఇప్ప‌టికైనా ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని మానుకోవాల‌ని కేంద్రాన్ని కోరుతున్నారు కార్మికులు.  లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు. చాలామంది క‌రోనా బాధితుల‌కు మెడిక‌ల్‌ ఆక్సిజ‌నే ప్రాణం నిలుపుతోంది. ఆక్సిజ‌న్ లేక‌పోతే ప్రాణం పోతోంది. ఇంత‌టి అత్య‌వ‌స‌ర‌మైన మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌కు దేశ‌వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో దేశాన్ని ఆదుకుంటోంది విశాఖ స్టీల్ ప్లాంట్‌. నేనున్నానంటూ క‌రోనా రోగుల‌కు ఊపిరి పోస్తోంది. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇక్క‌డ అత్యధికంగా మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్పత్తి అవుతోంది. రోజూ 100 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేస్తోంది. అత్యవసర అవసరాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  ఆక్సిజన్‌ కోసం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుకర్మాగారాలపైనే ఆధారపడుతున్నాయి. ఏపీలో మూడో వంతు ఆస్పత్రులకు విశాఖ నుంచే ఆక్సిజన్‌ సరఫరా అవుతుండగా.. అదనంగా మహారాష్ట్రకు 150 టన్నుల ఆక్సిజన్‌‌ను విశాఖ స్టీల్ ప్లాంట్ సరఫరా చేస్తోంది. మరికొన్ని రాష్ట్రాలకు ప్రాణవాయువును సరఫరా చేయనుంది. ఇప్పటికే 500 ట‌న్నుల లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజన్​ను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సరఫరా చేసింది.  విశాఖ ఉక్కు కర్మాగారంలో ఐదు ఆక్సిజన్‌ తయారీ యూనిట్‌లు ఉన్నాయి. ఈ యూనిట్లల్లో 24 గంటలూ ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం దాదాపు మూడు వేలు ఉంది. ఇందులో 2,700 టన్నులు వాయురూపంలో ఉండగా, 250 టన్నులు ద్రవరూప ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తారు. సరాసరిన ప్రతి రోజూ గరిష్ఠంగా 2 వేల 800 టన్నుల వరకు ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతోంది. రోజుకి 50 నుంచి 60 టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ ను కొవిడ్‌ ఆస్పత్రులు, ఇతర అవసరాల కోసం సరఫరా చేస్తోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో రోజుకు 120 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్థ్యం ఉందని విశాఖ ఉక్కు క‌ర్మాగారం వర్గాలు తెలిపాయి. ఏపీ, తెలంగాణా, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు గత వారం రోజులుగా దాదాపు 500 టన్నుల వరకు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసింది విశాఖ ఉక్కు క‌ర్మాగారం.  ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ దేశం ఊపిరి నిలుపుతున్నా.. కేంద్రం మాత్రం క‌ర్మాగారం ఊపిరి తీసేందుకే సిద్ద‌మ‌వుతోంది. క‌రోనా స‌మ‌యంలోనూ కేంద్రంలో ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. పాడి ఆవులాంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అంగ‌టి స‌రుకుగా మార్చి రెడీ ఫ‌ర్ సేల్ బోర్డు పెట్టేసింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణ త‌తంగ‌మంతా పూర్తైన‌ట్టు తెలుస్తోంది. త్వరలో అధికార ప్రకటన రావడమే త‌రువాయి. 

త్వరలో సోము వీర్రాజు అవుట్ ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు సోము వీర్రాజు. అయితే ఆయనకు ఆ పదవి మరికొంత కాలమే అని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత సోముకు ఊస్టింగ్ ఖాయమనే చర్చ బీజేపీలోనే జరుగుతోంది. సోము వీర్రాజు తీరుపై గుర్రుగా ఉన్న బీజేపీ పెద్దలు... అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని దాదాపుగా డిసైడైపోయారని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ హైకమాండ్. అందులో భాగంగానే సోముకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే సోము వీర్రాజు మాత్రం ఏపీలో అధికారంలో ఉన్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే... ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నా ఏనాడు మాట్లాడలేదు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. తీవ్రంగా స్పందించలేదు. అంతేకాదు అధికార పార్టీపై ఏదో చేయాలన్నట్లుగా కొన్ని విమర్శలు చేస్తూ... చంద్రబాబునే టార్గెట్ చేశారు. సోము వీర్రాజు తీరుపై సొంత పార్టీ నేతలే చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.  దీంతో ఎంతసేపు మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో హడావుడి చేయటమే తప్పించి క్షేత్రస్ధాయిలో వీర్రాజు బలమైన నేతకాదని హైకమాండ్ గుర్తించిందని అంటున్నారు.  సోము వీర్రాజుకు సొంతజిల్లా తూర్పుగోదావరిలోనే పట్టులేదట. ఆయన ఇంతవరకు ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది లేదు. వీర్రాజుకున్న ప్రజాబలం ఏమిటనేది ఉపఎన్నికల సందర్భంగా జాతీయ నాయకత్వానికి బాగా అర్ధమైపోయిందని సమాచారం. ఉపఎన్నికలో ప్రచారం కోసం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చినపుడు కూడా జనసమీకరణ పెద్దగా జరగలేదు. దాంతో వీర్రాజు పై  నడ్డా బాగా అసంతృప్తిగా ఉన్నారనేది సమాచారం. ఉపఎన్నికలో పోటీ చేయటం కోసమని జాతీయ నాయకత్వంపై వీర్రాజు బాగా ఒత్తిడి తెచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ణు ఒప్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు నెలల ముందే తిరుపతిలో ప్రచారాన్ని ప్రారంభించిన వీర్రాజు పోటీచేయబోయే అభ్యర్ధిని నిర్ణయించటంలో మాత్రం ఫెయిలయ్యారు. చివరకు పార్టీలోనే చాలామందికి తెలీని కర్నాటక క్యాడర్ ఐఏఎస్ రిటైర్డు అధికారి రత్నప్రభను రంగంలోకి దింపారు. అభ్యర్ధి ఎంపికతోనే పార్టీ ఓటమి ఖాయమని తేలిపోయింది.  బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ ఇంత పూర్ గా ఉంటుందని ఎవరు ఊహించలేదు. తిరుపతి నగరాన్ని మినహాయిస్తే మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో  ఎక్కడ కూడా బీజేపీ నేతలు పెద్దగా  కనబడలేదు. చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఏజెంట్లను కూడా నియమించలేకపోయారట. ప్రచారంలోనూ జాతీయ నేతలు వచ్చిన్పపుడు హడావుడి చేయడం తప్ప... క్షేత్రస్థాయిలో ఘోరంగా విఫలమయ్యారనే రిపోర్టు హైకమాండ్ కు వెళ్లాయంటున్నారు. పేరుకు మాత్రం పెద్ద నేతలు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళంతా ఎయిర్ పోర్టు బ్యాచ్ అన్న విషయం ఇపుడు జాతీయస్ధాయిలో కూడా అందరికీ అర్ధమైపోయింది. క్షేత్రస్ధాయిలో పట్టుమని వంద ఓట్లు తీసుకువచ్చేస్ధాయి నేతలు ఒక్కళ్ళు కూడా లేరన్న విషయం నడ్డాకు మూడు రోజుల పర్యటనలో అర్ధమైపోయిందట. పార్టీ కమిటిలు వేసుకోకుండా, సమర్ధులైన నేతల సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకోకుండా ఎన్నికల్లో ఎలా గెలుస్తామని అనుకున్నారంటు నేరుగా వీర్రాజునే నడ్డా నిలదీశారనే టాక్ నడుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక, తర్వాత ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత తొందరలోనే పార్టీ పగ్గాలు మారిపోతాయనే ప్రచారం ఊపందుకుంది. ఏపీ బీజేపీ నేతలు కూడా త్వరలోనే సోము వీర్రాజుకు పదవి గండం ఖాయమని పక్కాగా చెబుతున్నారు.

ఎంపీ సంతోష్ కు కరోనా! సీఎంతో కలిసి ఫాంహౌజ్ లో క్వారంటైన్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉండే  రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీనాయకులు తనకు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు ఎంపీ సంతోష్ కుమార్.  రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సంతోష్ కుమార్.. సీఎం కేసీఆర్ కు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటారు. కేసీఆర్ ఎక్కడికెళ్లినా ఆయన వెంట సంతోష్ ఉంటారు. నాలుగు రోజుల క్రితమే కేసీఆర్ కు కరోనా సోకింది. ఈనెల 14న నాగార్జున సాగర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఆ సభలోనే కేసీఆర్ కు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. సాగర్ సభకు కేసీఆర్ తో పాటు ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. దీంతో ఎంపీకి కూడా సాగర్ సభలోనే కరోనా సోకవచ్చని భావిస్తున్నారు. కరోనా సోకడంతో తన ఫాంహౌజ్ లోనే క్వారంటైన్ లో ఉన్నారు కేసీఆర్. బుధవారం సాయంత్రం యశోద హాస్పిటల్ కు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్ తో పాటు సంతోష్ కూడా యశోద హాస్పిటల్ కు వచ్చారు. కేసీఆర్ తో పాటు ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారని, అందులో కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని తెలుస్తోంది. 

కరోనా కట్టడికి యాక్షన్ ఏది? కేంద్రంపై సుప్రీం ఫైర్ 

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. జనాలు ప్రాణ భయంతో బతుకుతున్నారు. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చడంతో ఈ  అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది.  కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్, ముఖ్యమైన మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానంపై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది.  క‌రోనా ఉద్ధృతి దృష్ట్యా దీనిపై పూర్తి విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, వ్యాక్సినేష‌న్ పంపిణీ వంటి అంశాల‌పై విచార‌ణ జ‌రుపుతామ‌ని పేర్కొంది. దేశంలోని ఆరు హైకోర్టుల్లో కోవిడ్-19 మహమ్మారి సంబంధిత కేసులు విచారణలో ఉన్నాయి. ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో పడకలు, యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టులు విచారిస్తున్నాయి.  భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే గురువారం మాట్లాడుతూ ఈ సమస్యపై స్వీయ విచారణ జరపాలనుకుంటున్నట్లు తెలిపారు. వీటి పరిష్కారానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని తెలిపారు.  కొవిడ్ మహమ్మారికి మందులు అందుబాటులో లేని సమయంలో చోద్యం చూడటం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, విధానంపై జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాక్‌డౌన్‌ను ప్రకటించే అధికారం రాష్ట్రాలకే ఉందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్నదంతా గందరగోళంగా, అయోమయంగా ఉందన్నారు. వనరుల దారి మళ్లింపు జరుగుతోందన్నారు. ఈ సమస్యలపై కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు అమికస్  క్యూరీగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ను నియమించారు. తదుపరి విచారణ శుక్రవారం జరుగుతుందని తెలిపారు.  కరోనా కట్టడిలో  కేంద్ర ప్ర‌భుత్వం విఫలమైందని రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కరోనా సోకడంతో  తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, అయితే  దేశం నలుమూలల నుంచి ప్ర‌తిరోజు బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం దేశంలో క‌రోనా ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయ‌ని రాహుల్ అన్నారు.  దేశంలో నెల‌కొన్న ఈ క్లిష్ట‌ పరిస్థితులకు కారణం కొవిడ్ మాత్ర‌మే కాదని, కేంద్ర ప్ర‌భుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా అని ఆయ‌న మండిప‌డ్డారు. టీకా ఉత్స‌వ్ వంటి పనికిరాని ఉత్సవాలు, ఒట్టి మాట‌లను క‌ట్ట‌బెట్టి ప్ర‌స్తుతం నెల‌కొన్న‌ సంక్షోభానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంద‌ని ఆయ‌న చెప్పారు.     

లాక్‌డౌన్ టెన్ష‌న్‌.. హైద‌రాబాద్‌కు బై బై!

ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూ. ప్ర‌తీ రోజూ 4వేల‌కు పైగా కేసులు. ఆసుప‌త్రుల్లో బెడ్స్ ఖాళీ లేవంటూ ప్ర‌చారం. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అంతంత మాత్ర‌మేనంటూ పుకార్లు. డ‌బుల్ కాదు.. ఏకంగా త్రిబుల్ మ్యూటేష‌న్ అంటూ వార్త‌లు. దేశంలో ఇప్ప‌టికే అనేక న‌గ‌రాల్లో వీకెండ్ లాక్‌డౌన్‌. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లోనూ లాక్‌డౌన్ త‌ప్ప‌దంటూ అంచ‌నాలు. ఇలా వ‌రుస భ‌యాల‌తో వ‌ల‌స జీవులంతా హైద‌రాబాద్‌ను విడిచిపెడుతున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్‌కే క‌రోనా సోక‌గా.. ఇక త‌మ‌లాంటి వారి పరిస్థితి ఏంటంటూ.. బ‌తుకు జీవుడా అనుకుంటూ.. వ‌ల‌స వెళుతున్నారు. దీంతో.. హైద‌రాబాద్ న‌గ‌రం ఖాళీ అవుతోంది. రోడ్ల‌న్నీ బోసిపోయి క‌నిపిస్తున్నాయి. వివిధ ప‌నుల నిమిత్తం హైద‌రాబాద్ వ‌చ్చిన వారంతా తిరిగి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోతున్నారు. ప‌లు కంపెనీల్లో ప‌ని చేసే వ‌ల‌స కూలీలు త‌మ స్వ‌రాష్ట్రాల‌కు ప‌య‌న‌మ‌వుతున్నారు. గ‌తంలో మాదిరి స‌డెన్ లాక్‌డౌన్ పెడితే.. తాము ఇక్క‌డే చిక్కుకుపోతామ‌ని భ‌య‌ప‌డుతున్నారు. అందుకే ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌క‌ముందే సొంతింటికి చేరుకుంటే బెట‌ర్ అనుకుంటూ తిరుగు ప్ర‌యాణం క‌డుతున్నారు.  కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ వలస కార్మికులు దాదాపు 18 లక్షల మందికి పైనే ఉంటారు. వీరిలో దాదాపు 60 శాతం మంది వారం క్రితమే నగరాన్ని విడిచిపెట్టారని తెలుస్తోంది. మిగిలిన వారు కూడా వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నట్టు క‌నిపిస్తోంది. పెద్ద ఎత్తున తరలిపోతున్న వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి  బయలుదేరే రైళ్లు నిండిపోతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్ నాలుగైదు రోజుల ముందే పూర్తయిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజుకు సగటున 2.60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, స్వగ్రామాలకు జనం తరలుతుండడంతో నగరంలోని రోడ్లు చాలా వరకు ఖాళీగా ఉంటూ.. ట్రాఫిక్ లేక‌ బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల్లో క‌రోనా భ‌యం మామూలుగా లేదు మ‌రి.

500 మంది డాక్టర్లకు కరోనా.. డేంజ‌ర్ బెల్స్‌..

కొవిడ్‌పై వైద్య సిబ్బంది వీరోచితంగా పోరాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రోగులకు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. పేషెంట్ల అవ‌స్థ చూసి క‌న్నీరు పెడుతూ, బాధ ప‌డుతూ ఓర్పుగా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎంతోమంది డాక్టర్లు వైరస్‌ కాటుకు గురవుతున్నా వెన‌క‌డుగు వేయట్లేదు. తాజాగా బిహార్‌లోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడటం క‌ల‌క‌లం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో బిహార్‌లోని ఎయిమ్స్‌, పట్నా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 500 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిమ్స్‌లో మొత్తం 384 మంది సిబ్బందికి వైరస్‌ సోకగా.. ఇందులో అత్యధికంగా డాక్టర్లు, నర్సులు ఉన్నారు. పట్నా మెడికల్‌ కాలేజీలో 70 మంది వైద్యులు సహా 125 మంది ఆరోగ్య సిబ్బందికి కొవిడ్ సోకింది.    బిహార్‌ రాజధానిలో ఎయిమ్స్‌, పట్నా మెడికల్‌ కాలేజీతో పాటు నలంద మెడికల్‌ కాలేజీలో అత్యధికంగా కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ ఆసుపత్రుల్లోని సిబ్బందికి కూడా ముప్పు పెరిగిందని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఆయా ఆసుపత్రుల్లో సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచారు. అయితే డాక్టర్లు అధిక సంఖ్యలో కరోనా బారినపడటంతో అక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఆసుపత్రుల్లో మిగతా వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.    కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు అందిస్తామని బిహార్‌ ప్రభుత్వం ప్రకటించింది. 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రద్దు?

కరోనా కల్లోల సమయంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఏప్రిల్ 30న జరగాల్సిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బుధవారంలో ఉపసంహరణ గడువు ముగియనుంది. అయితే రాష్ట్రంలో కరోనా పంజా విసురుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నగర, పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఎన్నికల నిర్వహణకే ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఎన్నికల వాయిదా కోసం హైకోర్టుకు వెళ్లారు  కాంగ్రెస్ నేతలు.  మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్‌ను కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని షబ్బీర్అలీ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని పేర్కొన్న పిటీషనర్.. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి రిప్రజెంట్ చేయాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు అనుమతి ఇవ్వకపోవడంతో షబ్బీర్ అలీ రెగ్యులర్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న వరంగల్, ఖమ్మంతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపల్ ప్రజలు కూడా ఎన్నికలు వాయిదా వేయాలనే కోరుతున్నారు. స్థానిక నేతలు కూడా ఎన్నికలకు భయపడుతున్నారు. కరోనా వణికిస్తున్న సమయంలో తాము ప్రచారం చేయడం కూడా కష్టమనే భావనలో ఉన్నారు నేతలు. ఈ నేపథ్యంలో ఎన్నికల వాయిదాపై హైకోర్టు ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. 

50,000 కోట్లు.. తెలంగాణ పాలు.. ఏపీ అథోగ‌తే!

5వేల కోట్లు. ఇటీవ‌ల కొన్ని నెల‌లుగా ఏపీ నుంచి తెలంగాణ‌కు బ్యాంకుల ద్వారా ట్రాన్స్‌ఫ‌ర్ అయిన న‌గ‌దు. ఇదంతా వైట్ మ‌నీనే. అంతా అఫీషియ‌ల్ లావాదేవీలే. ఉన్న‌త స్థాయిలో ఉన్న బ్యాంకింగ్ వ‌ర్గాల నుంచి అందిన అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారమిది. ఇదంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్యాపారులు, రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులేన‌ని వారు చెబుతున్నారు. ఏపీలో వ్యాపారాలు, రియ‌ల్ ఎస్టేట్ చేయ‌లేక‌.. వారంతా త‌మ పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌కు షిఫ్ట్ చేస్తున్నార‌ట‌. అందులో భాగంగానే.. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ఉన్న బ్యాంకుల‌కు ఏపీ నుంచి దాదాపు 5వేల కోట్ల న‌గ‌దు ఇటీవ‌ల కాలంలో తిరుగొచ్చింద‌ని అంటున్నారు. లెక్కా, ప‌త్రం ఉండే సొమ్మే 5వేల కోట్లు ఉంటే.. ఇక అన‌ధికారికంగా వెన‌క్కి మ‌ళ్లే బ్లాక్ మనీ ఇంత‌కు ప‌దింత‌లు ఉండ‌టం ప‌క్కా. ఆ లెక్క‌న‌.. సుమారు 50వేల కోట్ల పెట్టుబ‌డులు ఏపీ నుంచి తెలంగాణ‌కు త‌ర‌లిపోయాయ‌నేది వాస్త‌వం.  ఒక‌ప్పుడు ఈ సొమ్మంతా ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు త‌ర‌లిందే. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత, చంద్ర‌బాబు సీఎం అయ్యాక‌.. ఏపీలో వ్యాపార రంగం కొత్త పుంతలు తొక్కింది. రియ‌ల్ఎస్టేట్‌కి రెక్క‌లొచ్చాయి. ఏపీ వ్యాప్తంగా పెట్టుబ‌డులు వెల్లువెత్తాయి. హుద్‌హుద్ స‌మ‌యంలో చంద్ర‌బాబు పని తీరుకు ఇంప్రెస్ అయి.. వైజాగ్ చుట్టుప‌క్క‌ల రియ‌ల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించాక ఇక అంతే. పెట్టుబ‌డుల‌కు ఏపీ భూత‌ల స్వ‌ర్గంగా మారింది. అమ‌రావ‌తి ప్రాంతంతో పాటు గుంటూరు, ప్ర‌కాశం జిల్లాలు సైతం బంగారు భూములుగా మారాయి. విశాఖ‌లో పెట్టుబ‌డుల సద‌స్సు.. కాకినాడ‌లోసెజ్‌.. సీమ‌కు పట్టిసీమ నీళ్ల‌తో.. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం పెట్టుబ‌డుల రాష్ట్రంగా మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్ కేంద్రంగా రియ‌ల్ ఎస్టేట్ నిర్వ‌హించే సంస్థ‌లన్నీ ఏపీకి క్యూ క‌ట్టాయి. స్థానికుల‌తో పాటు దేశంలోని ప్ర‌ముఖ రియ‌ల్ట‌ర్లు ఏపీకి త‌ర‌లివ‌చ్చారు. ప్లాట్లు, ఫ్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులు, ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లు.. ఇలా ఒక‌టేమిటి రియ‌ల్ రంగం ఆ రోజుల్లో తారాస్థాయిలో ఉండేది. తెలంగాణ‌తో పాటు దేశ న‌లుమూల‌ల నుంచి వేల కోట్లు పెట్టుబ‌డులు ఏపీకి త‌ర‌లివ‌చ్చాయి. క‌ట్ చేస్తే..  ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. అరాచ‌కాల‌కు నిల‌యం. రాజ‌ధానితో మూడు ముక్క‌ల ఆట ఆడుతున్నాడు. అభివృద్ధి అనే ప‌ద‌మే వినిపించ‌డం లేదు. అంతా రివర్స్ పాలన. గతంలో వచ్చిన ప్రాజెక్టులనే రివర్స్ టెండరింగ్ పేరుతో బొంద పెట్టారు.  కొత్త ప్రాజెక్టులు, కొత్త పెట్టుబ‌డుల ఊసే లేదు. అమ‌రావ‌తి నిండా మునిగింది. విశాఖ వైసీపీ నేత‌ల ప‌ర‌మైంది. మిగ‌తా జిల్లాల‌ను ప‌ట్టించుకునే నాయ‌కుడే లేడు. సంక్షేమం మాటున ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప‌రిస్థితులు ఇంత దారుణంగా ఉంటే.. ఇక ఇన్వెస్ట‌ర్లు ఎలా వ‌స్తారు? కంపెనీలు ఎవ‌రు పెడ‌తారు? ఉన్న ప్రాజెక్టులే త‌ర‌లిపోతుంటే.. ఇక కొత్త‌వి ఎలా వ‌స్తాయి? అందుకే, ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ రంగం అమాంతం కుప్ప‌కూలిపోయింది. ఇప్ప‌టికే వ‌చ్చిన రియ‌ల్ ప్రాజెక్టులు ఎక్క‌డివి అక్క‌డే ఆగిపోయాయి. పోతే పోనీ అనుకుని.. పెట్టుబ‌డిదారులంతా త‌ట్టా-బుట్టా స‌ర్దుకొని ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లిపోతున్నారు.  అందుకే  ఇటీవ‌ల కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భూముల రేట్లు దారునంగా ప‌డిపోతే.. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ రియ‌ల్ భూమ్ ఏర్ప‌డింది. గ‌త అసెంబ్లీ సెష‌న్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు.. ప్ర‌స్తుత ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్నాయి. తెలంగాణ‌లో ఎక‌రం భూమి అమ్మితే.. ఏపీలో మూడెక‌రాల భూమి వ‌స్తోంద‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్ప‌డం వాస్త‌వ స్థితికి నిద‌ర్శ‌నం.ఏపీ దుస్థితిపై క్లారిటీకి వ‌చ్చేసిన రియ‌ల్ వ్యాపారులు త‌మ పెట్టుబడుల‌ను హైద‌రాబాద్‌కు షిఫ్ట్ చేస్తున్నారు.  గ‌త కొన్ని నెల‌లుగా కేవ‌లం బ్యాంకుల ద్వారానే 5వేల కోట్లు ఏపీ నుంచి తెలంగాణ బ్రాంచీల‌కు మ‌ళ్లాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అన‌ధికారికంగా ఏకంగా 50వేల కోట్ల రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి త‌ర‌లి వెళ్లిపోయాయంటే న‌మ్మాల్సిందే. పెట్టుబ‌డులు ఇలానే పోతే.. జగన్ రెడ్డి పాలనలో ఏపీ గ‌తి అథోగ‌తే...  

కరోనా సోకిందని వివక్ష.. సూసైడ్ చేసుకున్న వృద్ధుడు 

కరోనా మహమ్మారి మనుషులను మృగాలుగా మారిస్తోంది. మానవత్వాన్ని మంటకలిపేస్తోంది. వైరస్ భయానికి సొంత వారిపైనే వివక్ష చూపుతున్నారు జనాలు. కనీస మానవత్వం కూడా లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోన్న ఓ వృద్ధుడిని కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్థులు వివ‌క్ష‌తో చూశారు. ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చిందేమోన‌ని దూరంగా పెట్టారు. అస‌లే అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆ వృద్ధుడు.. గ్రామ‌స్థుల అవ‌మానాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేకున్నాడు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో చోటు చేసుకుంది ఈ అమానుష ఘటన. మ‌ర్ల‌పాలేనికి చెందిన గాసర్ల హరిబాబు (74) మూడు రోజులుగా అనారోగ్యంతో  బాధపడుతున్నాడు.  ఆయ‌న ప‌ట్ల జాలి చూపించి, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సాయం చేయ‌డం మానేసి అంద‌రూ వివ‌క్షతో చూశారు. దీంతో ఆయన మ‌న‌స్తాపానికి గురయ్యారు. క‌రోనా సోకిందా?  లేదా? అన్న విష‌యాన్ని నిర్ధారించుకునేందుకు పరీక్ష కూడా చేయించుకోకుండానే భయంతో  చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆయ‌న‌ మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు పోలీసులు. 

డబుల్ కాదు ట్రిపుల్ మ్యూటెంట్‌! కరోనాపై మరో షాకింగ్ 

కరోనా మహమ్మారితో దేశంలో ఇప్పటికే ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇండియన్ వేరియంట్‌గా చెబుతున్న డబుల్ మ్యూటెంట్ బి.1.617 రకం ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్టు గుర్తించారు. దీనికి కూడా రోగ నిరోధకశక్తిని విచ్ఛిన్నం చేసే శక్తి ఉండడంతో ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే డబుల్ మ్యూటెంట్‌తో భయపెడుతున్న కరోనా వైరస్ పై మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. డబుల్ మ్యూటెంట్‌ ఉత్పరివర్తనం చెంది ట్రిపుల్ మ్యూటెంట్‌గా మరింత బలంగా తయారైందని సీసీఎంబీ ప్రకటించింది. ప్రత్యేక జన్యువుతో రోగ నిరోధకశక్తిని దాటుకుని మరీ చొచ్చుకుపోయే కొత్త రకం మ్యూటెంట్ బి.1.618ను పశ్చిమ బెంగాల్‌లో గుర్తించినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. వ్యాధికి కారణమయ్యే స్పైక్ ప్రొటీన్ భాగంలో ఈ484 క్యూ, ఎల్ 452 ఆర్‌తో కలిసి ఇది డబుల్ మ్యూటెంట్‌గా మారింది. ఈ484క్యూ మ్యుటేషన్ బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి, కాలిఫోర్నియా నుంచి ఎల్452ఆర్ నుంచి వ్యాప్తి చెందాయి. ఈ రెండింటి కలయికతో దేశీయంగా డబుల్ మ్యూటెంట్ ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. తాజాగా బయటపడిన ట్రిపుల్ మ్యూటెంట్ బి.1.618 రకం వైరస్‌లో స్పైక్ ప్రొటీన్‌ ఈ484కె, డి614జి రకాలను కలిగి ఉంది. దీంతో వైరస్ సంక్రమణ సామర్థ్యం పెరుగుతోందని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్తలు  చెబుతున్నారు.

ఒకే దేశంలో రెండు ధరలా! కేంద్రంపై కేటీఆర్ ఫైర్ 

ఒకే దేశం.. ఒకే పన్ను .. ఇది కేంద్ర సర్కార్ విధానం. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రేట్లను ఒకేలా అమలు చేస్తోంది మోడీ సర్కార్. కాని కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో మాత్రం తేడా చూపిస్తోంది. మే 1నుంచి 18 ఏండ్లు నిండన ప్రతి ఒక్కరికి టీకా వేయాలని నిర్ణయించింది కేంద్రం. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేంద్రంతో రాష్ట్రాలకు టీకాలు పంపిస్తుండగా.. ఇకపై రాష్ట్రాలు నేరుగా ఫార్మా కంపెనీల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం కోవిషీల్ట్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు పంపిణి చేస్తున్నారు.  కేంద్ర సర్కార్ నిర్ణయంతో రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ సంస్థలకు టీకాలు విక్రయించేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధవుతున్నాయి. కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరమ్ రేట్లను కూడా ప్రకటించింది. అయితే కేంద్రానికి ఒక్క డోసును 150 రూపాయలకు అందిస్తున్న సీరమ్.. రాష్ట్రాలకు మాత్రం ఒక్క డోసు ధర 4 వందల రూపాయలుగా ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు 6 వందలకు ఒక్క డోసు విక్రయిస్తామని తెలిపింది. ఇప్పుడు ఇదే వివాదాస్పదమవుతోంది. కేంద్రానికి 150 రూపాయలకు ఇస్తూ.. రాష్ట్రాలకు 4 వందల రూపాయలకు పెంచడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ ధరలకు సంబంధించి కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఒకే దేశం- ఒకే పన్ను సిస్టమ్ అమలులో ఉండగా.. వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకని ఆయన ట్వీట్ చేశారు. కేంద్రానికి 150 రూపాయలకే ఇస్తూ.. రాష్ట్రాలకు ధర పెంచడం ఏంటని కేటీఆర్ నిలదీశారు. పీఎం కేర్ ఫండ్స్ డబ్బులు ఉపయోగించి వ్యాక్సిన్ ఉత్పత్తిని ఎందుకు పెంచలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకే దేశం – ఒకే పన్ను కోసం జీఎస్‌టీని అంగీకరించామని, కానీ, ఇప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు చూస్తున్నామని విమర్శించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్‌ నుంచి భరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశమంతా వ్యాక్సినేషన్‌ పూర్తికి కేంద్రం ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.

ప్రాణాలు పోతుంటే ఎన్నికలా? కేసీఆర్ కు మాయని మచ్చేనా? 

కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోంది. వైరస్ వేగంగా విస్తరిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కరోనా విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. సరైన చికిత్స అందక నరకయాతన పడుతున్నారు. ఆక్సిజన్ సకాలంలో అందక పిట్టల్లా రాలిపోతున్నారు. తమ కండ్ల ముందే రోగులు చనిపోతున్నా వైద్యులు ఏమి చేయలేక కన్నీళ్లు పెడుతున్నారు.  కరోనాతో పరిస్థితులు దారుణంగా ఉన్నా పాలకుల తీరు మాత్రం మారడం లేదు. తమకు ప్రజల ప్రాణాల కంటే ఓట్లు, సీట్లే ముఖ్యమన్నట్లుగా ప్రవరిస్తున్నారు. తెలంగాణలో  పరిస్థితి  చేయిదాటి పోయే పరిస్థితుల్లో ఉన్నా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఏప్రిల్ 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నిక జరగనుంది. కరోనా కల్లోల సమయంలో ఎన్నికలు వద్దని విపక్షాలు మెత్తుకుంటున్నా పట్టించుకోలేదు. కేసీఆర్ సర్కార్ ఆదేశాలతో హడావుడిగా షెడ్యూల్ ఇచ్చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియను చేపట్టింది. దీంతో కేసీఆర్ సర్కార్ తీరుపై జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏండ్ల కొద్ది ప్రత్యేక అధికారుల పాలన సాగిన సందర్బాలు ఉన్నాయని చెబుతూ.. జనాల భధ్రతపై కనీసం ఆలోచన లేకుండా పట్టుబట్టి మరీ ఎన్నికలు జరపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది. అన్ని పార్టీలు తమ బలగాలను అక్కడ మోహరించాయి. కరోనాను పట్టించుకోకుండానే అంతా ప్రచారం చేశారు. మాస్కులు లేవు... భౌతిక దూరం అసలే లేదు. దీంతో నాగార్జున సాగర్ ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. సాగర్ ప్రచారంలో పాల్గొన్న నేతలందరికి వైరస్ సోకింది. హాలియా బహిరంగసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నియోజకవర్గంలో గత నాలుగు రోజుల్లోనే దాదాపు వెయ్యి మందికి కరోనా నిర్దారణ అయిందంటే పరిస్థితి ఎంత డేంజర్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాగార్జున సాగర్ పరిస్థితి కళ్ల ముందు ప్రత్యక్షంగా కనబడుతున్నా... మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం ముందుకెళ్లడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.  నిజానికి నాగార్జున సాగర్ ఎన్నికల సమయం  కంటే ప్రస్తుతం కరోనా మరింతగా విజృంభిస్తోంది. గాలిలో కూడా వైరస్ వ్యాపిస్తుందనే పరిశోధనలు చెబుతున్నారు. ఎక్కడ పరీక్షలు చేసినా భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయినా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లడంపై వైద్య రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనాలకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికే కరోనా సోకిందని.. ఇక జనాల్లో తిరిగే స్థానిక నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఐదు వందల రూపాయలు, మద్యం బాటిల్ ఇచ్చి ఎన్నికలకు సభలకు రప్పిస్తూ.. వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు.  మరోవైపు ఎన్నికలు జరగుతున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు..  సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల ,అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీ లీడర్లు సైతం కరోనాతో భయపడిపోతున్నారు. ఎన్నికల ప్రచారం ఎలా చేయాలని ఆందోళన చెందుతున్నారు. జనమంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి సమయంలో ఎలా ప్రచారం చేస్తామని చెబుతున్నారు. అయితే స్థానిక నేతల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలకు ప్రచారం చేసుకునే సమయం లేకుండా ఎన్నికలు నిర్వహించి.. తమ ఖాతాలో వేసుకోవాలని కేసీఆర్ వ్యూహమని చెబుతున్నారు. అధికారం కోసం ఆయన వ్యూహం ఎలా ఉన్నా.. ప్రజల్లో మాత్రం కేసీఆర్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కేసీఆర్ కు కూడా కరోనా సోకినందున... ఆయన ఇప్పటికైనా పరిస్థితి గమనించి ఎన్నికలను వాయిదా వేస్తే బెటరని సూచిస్తున్నారు. లేదంటే కేసీఆర్ రాజకీయ జీవితంలో ఈ ఎన్నికలు మాయని మచ్చలా మిగిలిపోతాయని చెబుతున్నారు.