కేసీఆర్ ఫ్యామిలీ కబ్జాలో దేవాలయ భూములు! 

అసైన్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ తొలగింపు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార పార్టీ నేతల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ విపక్షాల నుంచి వస్తోంది. ఈటలకు విపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్‌పై ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేవరయంజాల్ సీతారామస్వామి ఆలయ భూముల్లో కేసీఆర్ కుటుంబం, సన్నిహుతుల భూములున్నాయన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న 437 సర్వేలో మంత్రి కేటీఆర్, ఓ పత్రిక సీఎండీ దామోదర్‌రావుకు భూములున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సేల్ డీడ్ కాపీలను బయటపెడుతున్నానని చెప్పారు. గత 95 ఏళ్లకు సంబంధించినదేవరయాంజాల్ దేవాలయ భూముల వివరాలను బయట పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీగా రికార్డులు, జరిగిన లావాదేవీల చిట్టాను తాను అడిగితే ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ బండారం బయటపడుతుందనే ప్రజలకు చెప్పడంలేదని రేవంత్ మండిపడ్డారు. దేవరయంజాల్ దేవాలయ భూముల పేరుతో రాజకీయ కక్షకు దిగుతున్నారని ఆరోపించారు. ఈటలను తొలగించిన విధంగానే మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలను శాఖల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి దిగే ప్రమాదం ఉన్నందున వెంటనే తొలగించాలన్నారు రేవంత్ రెడ్డి. బ్యాంకులను తప్పుదారి పట్టించినందున సీబీఐ విచారణ జరపాలన్నారు.  దేవాదాయ భూముల ఆక్రమణలపై కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

సెంటిమెంట్‌తో సారుకు షాక్? ఈటల సినిమా చూపిస్తారా?

అయ్యో పాపం ఈట‌ల రాజేంద‌ర్‌. ఆయ‌న‌కు కేసీఆర్ ఎంత అన్యాయం చేస్తున్నారు. ఆ బ‌క్క మ‌నిషిని ఎంత‌గా ఇబ్బంది పెడుతున్నారు. ఇన్నాళ్లూ త‌న చుట్టూ తిప్పుకొని.. ఇప్పుడు క‌రివేపాకులా ఎలా తీసిపాడేశాడో. అబ్బో కేసీఆర్ మ‌హా ఖ‌త‌ర్నాక్‌. పాపం రాజేంద‌ర్‌కు ఎంత అన్యాయం జ‌రిగిందో. కేసీఆర్ ఎంత ఆయ‌న‌కు ఎంత అన్యాయం చేశాడో. భూములు ఆక్ర‌మించుకున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ భూములు క‌బ్జా చేయ‌లేదా? ఈట‌ల‌నే టార్గెట్ చేయాలా?.. ఇలా మూడు రోజులుగా తెలంగాణ‌లో ఒక‌టే చ‌ర్చ‌. ఈట‌ల టాపిక్‌పైనే ర‌చ్చ‌. ఈట‌ల రాజేంద‌ర్‌కూ కావ‌ల‌సింది ఇదే. ఇలాంటి చ‌ర్చే ఆయ‌న కోరుకుంటున్నారు. ప్ర‌జ‌ల నుంచి, తెలంగాణ స‌మాజం నుంచి సానుభూతి రావాల‌నుకుంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే.. ప‌క్కా క‌థ‌, క‌థ‌నం, స్క్రీన్‌ప్లేతో రాజ‌కీయం ర‌క్తి క‌ట్టిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే.. ఈట‌ల ముందే ఊహించిన దాని ప్ర‌కార‌మే కేసీఆర్ న‌డుచుకుంటున్నారు. యాక్ష‌న్ కేసీఆర్‌దిలా క‌నిపిస్తున్నా.. డైరెక్ష‌న్ మాత్రం ప‌క్కా ఈట‌ల‌దే అంటున్నారు విశ్లేష‌కులు. ఈట‌ల‌పై పింక్ మీడియాలో మొద‌ట బ్రేకింగ్ న్యూస్ న‌డిచింది. ఆ త‌ర్వాత ఆయ‌న‌పై విచార‌ణ మొద‌లైంది. ఆరోగ్య శాఖ‌ను లాగేసుకున్నారు. అయినా, మంత్రి ప‌ద‌విని వీడ‌క‌పోవ‌డంతో ఈట‌ల‌ను రాత్రికి రాత్రే కేబినెట్ నుంచి గెంటేశారు. అంతా ప‌క్కా ప్లాన్డ్‌గా లేదూ.  మ‌రి, ఈట‌ల అంత‌టి వాడిని అలా నిర్దాక్షినంగా వెళ్ల‌గొట్ట‌డం కేసీఆర్‌కు ఏమైనా స‌ర‌దా? అందుకు, పెద్ద కార‌ణ‌మే ఉండి ఉంటుందిగా? అదేంటో కేసీఆర్ అంత‌రాత్మ‌కే తెలుసంటున్నారు ఈట‌ల‌. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కేసీఆర్ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ఈట‌ల చ‌క్రం తిప్పార‌ని.. మంత్రివ‌ర్గ స‌మావేశ సారాంశాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు లీక్ చేసేవార‌ని.. స‌హ‌చ‌రులు, అధికారుల ద‌గ్గ‌ర కేసీఆర్‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడేవార‌ని.. ఇలా ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హార శైలి ఉండేద‌ని అంటున్నారు. అందుకే, చాలా కాలంగా గులాబీ బాస్‌పై రెబెల్ జెండా ఎగ‌రేస్తూ వ‌చ్చారు ఈట‌ల‌. ఇంత కాలానికి అది క్లైమాక్స్‌కి చేరింది. కేసీఆర్ యాక్ష‌న్ ఇలానే ఉంటుంద‌ని ఈట‌ల‌కు బాగా తెలుసు. అందుకే, త‌న‌పై దేవ‌ర‌యాంజిల్ భూముల అక్ర‌మాలంటూ కేసులు పెడ‌తార‌ని ఆయ‌న ముందే చెప్పారు. త్వ‌ర‌లో తాను పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యాల‌పైనా కేసులు బ‌నాయిస్తార‌ని చెబుతున్నారు. ఇలా జ‌రుగుతుంద‌ని త‌న‌కు ముందే తెలుసున‌ని.. అయినా తాను భ‌య‌ప‌డే మ‌నిషిని కాదంటూ సుతిమెత్త‌గా స‌వాల్ చేశారు.  కేసీఆర్‌ను పైకి ప‌ల్లెత్తు మాట కూడా అన‌కుండా.. సంద‌ర్భం కాకున్నా, అవ‌స‌రం లేకున్నా.. గులాబీ బాస్‌ను పొగుడుతూ.. ప‌క్కా వ్యూహాత్మ‌కంగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. కేసీఆర్ ధ‌ర్మాన్ని న‌మ్మాడు, ప్ర‌జ‌ల‌ను న‌మ్మాడు.. అంటూ పొగిడుతూనే.. అంత‌లోనే ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఈట‌ల‌. ప్రేమ‌తో లొంగ‌దీసుకుంటే లొంగేవాడిని. భ‌య‌పెడితే లొంగేవాడిని కాదంటూ.. కేసీఆర్‌పై ఈటెల్లాంటి ప‌దునైన మాట‌లు సంధించారు ఈట‌ల రాజేంద‌ర్‌. కోర్టులు, చ‌ట్టం అంటూ ఏవేవో చెప్పినా.. ఏం చేసుకుంటావో చేసుకో..పో.. అన్న‌ట్టుగా మాట్లాడారు ఈట‌ల రాజేంద‌ర్‌. తాను జీరో నుంచి వ‌చ్చాన‌ని.. అవ‌స‌ర‌మైతే తాను మ‌ళ్లీ జీరో నుంచి మొద‌లుపెడ‌తాన‌ని.. ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.  స్వ‌త‌హాగా విప్ల‌వ భావాలు, ఉద్య‌మ ఆశ‌యాలు క‌లిగిన ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ‌పై త‌న‌దంటూ ఓ ముద్ర ఉండాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఎన్నాళ్లైనా కేసీఆర్ కిందే ఉండాలా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త ఉండొద్దా.. అనే ఆలోచ‌నా ధోర‌ణిలో ఆయ‌న ఉన్నార‌ని తెలుస్తోంది. వేరే పార్టీలో చేరేక‌న్నా.. త్వ‌ర‌లోనే ఆయ‌న సొంత పార్టీతో తెలంగాణ ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తార‌ని అంటున్నారు. ముదిరాజ్ ముద్ర‌తో బీసీల‌ రాజ్యాధికార స్వ‌ప్నం నెర‌వేరుస్తానంటున్నారు. త‌న భార్య సామాజిక వ‌ర్గ‌మైన..రెడ్డి.. అండ‌దండ‌లూ త‌న‌కు ల‌భిస్తాయ‌ని ధీమాగా ఉన్నారు. అందుకే, త‌న కొడుకుని నితిన్‌రెడ్డి పేరుతో స‌మాజానికి పరిచ‌యం చేశారు ఈట‌ల‌ రాజేంద‌ర్ ముదిరాజ్‌. మ‌రి, ఈట‌ల రాజ‌కీయ ఎత్తుగ‌డ ఫ‌లిస్తుందా? లేక‌, మ‌రో దేవేంద‌ర్‌గౌడ్‌లా చ‌రిత్ర‌లో మిగిలిపోతారా? ఇలా, ఈట‌ల ఎపిసోడ్‌తో తెలంగాణ రాజ‌కీయ భ‌విష్య‌త్తు రంజుగా మార‌బోతోంది.

ఆక్సిజన్ కొరతతో ఏపీలో మరణ మృదంగం! 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి వేగంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలను తీసేస్తోంది. ఇప్పటికే ఎందరో రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా కన్నుమూశారు. తాజాగా అనంతపురం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు.  హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడంపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడం బాధాకరమని ఆమె అన్నారు. ఆక్సిజన్ అందించలేని స్థితిలో ఉన్న సీఎం జగన్ కు అధికారంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో హిందూపురం ఆసుపత్రిలో 12 మంది చనిపోయారని... మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తాడేపల్లిలో కూర్చుని చోద్యం చూస్తున్నారని... ఇది సిగ్గుచేటని అన్నారు. వైసీపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఎంత మంది బలికావాలని ప్రశ్నించారు. అనంతపురం, కర్నూలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక 26 మందికి పైగా చనిపోయారని అన్నారు. కరోనా సోకిందనే ఆందోళన కంటే ఆక్సిజన్ దొరుకుతుందా? లేదా? అనే ఆందోళనే ప్రజలకు ఎక్కువగా ఉందని సునీత అన్నారు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం... మోసపూరిత మాటలతో రాజకీయ పబ్బం గడుపుకోవడంపైనే జగన్ దృష్టి సారిస్తున్నారని చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటిలేటర్లను అందజేశారని... వాటిని ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. జగన్ ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలని... తాడేపల్లి ప్యాలస్ ను దాటి ఆసుపత్రులను సందర్శించాలని చెప్పారు. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరతపై దృష్టిని సారించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ ఆసుపత్రిలో ఒకే రోజు సుమారు 15 మంది చనిపోవడం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తొలిసారిగా దీనిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారన్నారు. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  వ్యాక్సినేషన్ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. రంగుల కోసం రూ.3000 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిందన్నారు. గోరంతల్ని కొండంతలుగా చేసి ప్రచారం నిర్వహిస్తోందన్నారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి సాక్షిలో ఫుల్ పేజీ యాడ్స్ కోసం వందలకోట్లు దుబారా చేసిందన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టాలన్నారు. బెడ్లు-ఆక్సిజన్ సరఫరా పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

ఐపీఎల్  టోర్నీ రద్దు! ఐదుగురికి కరోనా నిర్దారణ 

ఐపీఎల్ టోర్నీపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడగా, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కొవిడ్ కలకలం రేగింది. ఆ జట్టు మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆటగాళ్లెవరికీ కరోనా సోకలేదని వెల్లడైంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన ముగ్గురికి మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా ఫలితాలను రెండుసార్లు నిర్ధారించుకోవాలని చెన్నై యాజమాన్యం భావిస్తోందని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. తదుపరి పరీక్షలు నిర్వహించేంత వరకు ఆటగాళ్లను ఐసోలేషన్ లో ఉండాలని సూచించినట్టు అధికారులు చెప్పారు. ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు చివరగా గత శనివారం ముంబయి ఇండియన్స్ తో తలపడింది. ఐపీఎల్ 14వ సీజన్  ఆరంభానికి ముందు పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడినా, ఆ తర్వాత వారు కోలుకున్నారు. తాజాగా టోర్నీ మధ్యలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మరోసారి కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో, ముందుజాగ్రత్తగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తానికి కరోనా టెస్టులు నిర్వహించారు. కోల్ కతా జట్టులో కరోనా కలకలం రేగడంతో సోమవారం జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేశారు. ఇదే తీరులో మరో రెండు, మూడు జట్లలో కరోనా కేసులు వస్తే టోర్నీ నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి క్రికెటర్లను అత్యంత కఠినమైన బయో బబుల్ లో కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఆటగాళ్లకు కరోనా సోకుతుండడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఐపీఎల్ ను రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది. విదేశీ ఆటగాళ్లు కూడా భయాందోళనలో ఉండటంతో ఐపీఎల్ నిర్వహించడం కష్టమేనని తెలుస్తోంది.

తల్లి ప్రియుడికి.. కూతురు బలి..  

ఆమెకు పెళ్లి అయింది. అయినా పాడుబుద్ది ఒక్క చోట ఉండనియ్యదు అన్నట్లు.. ఆమె పక్కింట్లో ఉన్న వ్యక్తి తో సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి రోజు ఇంటికి వాస్తు ఉండేవాడు. ఇదే క్రమంలో తరుచూ ఇంటికొచ్చే ఆ దుండగుడి కన్ను.. తన ప్రియురాలి కూతురు మీద పడింది. ఇక అంటే ఆ ప్రబుద్దుడు ఆ బాలికను లైన్ లో దించడానికి పధకం పన్నాడు. తరుచు  లైంగికంగా వేధించాడు. ఆ విషయం గురించి ఆ కూతురు తన కసాయి తల్లికి చెప్పింది. కానీ ఆ తల్లి మాత్రం ఆ నీచుడికి సహకరించాలని సూచించింది. అదేంటి అనుకుంటున్నారా.. ఏం చేస్తాం ఆ తల్లి అలా దిగజారింది మరి. తన ప్రియుడు ఎక్కడ దూరం అవుతాడోనాని, బయపడినట్లుంది. కని, కళ్ళ ముందు పెంచి.. అలారుముద్దుగా పెంచించిన కూతురును ఎవరైనా పల్లెత్తు మాట అంటేనే తట్టుకోలేరు  తల్లులు. మరి ఆ కసాయి తల్లి మాత్రం కూతురు బతుకులో నిప్పులు పోయడానికి రెడీ అయింది. నిత్యం అదే సంఘర్షణ.  కట్ చేస్తే.. ఆ తల్లి పట్టించుకోలేదు. ఆయినా చూసీ చూడనట్టు ఉండాలని.. ఇవన్నీ పట్టించుకోవద్దని.. సర్దుకుపోవాలని చెప్పిందా తల్లి. అలా చేసి చివరికి తల్లీ కూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చిపెట్టింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ కూతురును లైంగికంగా వేధింపులకు గురి చేసి.. ఆమెకు గర్భం వచ్చేలా చేసింది.  ఇదే అదునుగా తీసుకున్న ఆ నిందితుడు ఆ మైనర్ ను పూర్తిగా తన మాయ మాటలతో లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆ బాలిక గర్భవతి అని తేలింది. దీంతో ఆమె తల్లి.. ఆ కూతురును తన సోదరుల ఇంట్లో ఉంచింది. వారికి కూడా ఆమె గర్భవతి అన్న విషయం చెప్పలేదు. కొద్దిరోజుల పాటు ఆ కూతురు.. తల్లిని కలవడానికి ప్రయత్నించినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. ఇక లాభం లేదనుకున్న ఆమె.. ఈ విషయాన్ని తన మామలతో చెప్పింది. ఆ అమ్మాయి మేన మామ.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఆమెను బాలల సంరక్షణ గృహానికి పంపారు. ఆమె తల్లి, బాలికను గర్భవతిని చేసిన ఆ దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. వారిని కటకటాల వెనక్కి పంపారు. 

ఏపీలో ఎల్లుండి నుండి ఆంక్షలు.. 

కరోనా తో సంవత్సరం నుండి ఫైట్ చేస్తున్నారు ప్రజలు. కరోనా మొదటి వేవ్ ప్రపంచంతో పాటు మన దేశం కూడా ఇరుకున పడేసింది. కొంత కాలం తర్వాత  కొంత ఉపశమనం ఇచ్చింది అనుకునే లోపు. మళ్ళీ సెకండ్ వేవ్ విరుచుకుపడింది. కరోనా మరణాలతో దేశం మొత్తం అట్టుడుకుతోంది.. నిత్యం ప్రజలు కరోనా భారీన పడి పిట్టలా రాలిపోతున్నారు. ఒక వైపు నిరుపేదలకు కరోనా వస్తే.. హాస్పిటల్ లో ఫీజులు కట్టలేక చివరికి  వారికి స్మశానమే హాస్పిటల్ బెడ్లు అవుతున్నాయి. వారి శవాలకు స్మశానాలు స్వాగతం పలుకుతున్నాయి. ఒక వైపు  ఆక్సిజన్ అందక మరో వైపు వ్యాక్సిన్ అందరికి అందుబాటులో లేక శవాలతో స్మశానాలు కలకళలాడుతున్నాయి.    కరోనా అంతకంతకూ పెరుగుతుండటంపై కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఉ.6 నుంచి మ.12 వరకే దుకాణాలకు అనుమతిచ్చారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. కొవిడ్‌ నియంత్రణపై సీఎం జగన్‌ మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. కొవిడ్‌ నివారణ చర్యలతో పాటు ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు ఆయన వివరించారు. నిర్ణీత సమయాల్లో కర్ఫ్యూ విధించాలని సూచించారన్నారు.    

టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూత 

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నాయకుడు సబ్బం హరి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. సబ్బం హరిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి పూర్తిగా విషమించి.. సోమవారం మధ్యాహ్నం సబ్బం హరి చనిపోయారు. సబ్బం హరి మరణంతో టీడీపీలో విషాదం అలుముకుంది. హరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.  ఏప్రిల్  15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అప్పటికీ కోలుకోకపోవడం, ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.69 ఏండ్ల సబ్బం హరికి భార్య ,ముగ్గురు పిల్లలు. తాను రాజకీయాల్లో ఉన్న పిల్లలను మాత్రం పాలిటిక్స్ కు దూరంగా ఉంటారు సబ్బం హరి. రాజకీయాల్లో అవినీతికి దూరంగా ఉన్నారనే పేరు సబ్బం హరికి ఉంది.  జూన్ 1, 1952 న విశాఖపట్నంలో జన్మించారు సబ్బం హరి. తగరపువలస సమీపంలోని చిట్టివలస ఇతడి సొంతూరు. నాన్న బంగారునాయుడు. అమ్మ అచ్చియ్యమ్మ. ఆరుగురి తర్వాత ఆఖరివాడు హరి. సొంతూరులోనే పాఠశాల చదువు పూర్తిచేసి ఇంటర్‌ ఏవీఎన్ కళాశాలలో చేరారు. అక్కడే డిగ్రీ పూర్తిచేశారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. 1985లో విశాఖ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు సబ్బం. 1989 ఎన్నికల్లో విశాఖలో ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించారు.1995లో కార్పొరేటర్ గా గెలిచి విశాఖ మేయగ్ ఎన్నికయ్యారు. మేయర్ లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు సబ్బం హరి  కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు సబ్బం. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో మాజీ ఎంపీ సబ్బం హరి ఒకరు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను ధిక్కరించి వేరు కుంపటి పెట్టిన సందర్భంలో, ఓదార్పు యాత్రలో ఆయన వెన్నంటి ఉన్నారు. అయితే.. ఆ తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్‌కు సబ్బం హరి బద్ధ శత్రువుగా మారారు. చాలా కాలం పాటు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2019లో టీడీపీలో చేరారు సబ్బం హరి.  గత ఎన్నికల్లో భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు సబ్బం హరి. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ యాక్టివ్ గా ఉంటున్నారు. అమరావతి, మూడు రాజధానుల ప్రతిపాదన, ఇసుక మాఫియా, మద్యం పాలసీ, వాలంటరీ వ్యవస్థ. .ఇలా అన్ని అంశాలపై సబ్బం హరి గట్టిగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఆదర్శ నేతగా ఉన్న సబ్బం హరి... ముక్కుసూటిగా మాట్లాడుతారనే టాక్ ఉంది. తప్పు అని తెలిస్తే.. సొంత మనుషులను కూడా ఆయన వ్యతిరేకిస్తారని చెబుతారు. 

అత్త మీద కోపం.. దుత్త మీద.. చివరికి అల్లుడు బలి..  

ఎక్కడైనా ఎప్పుడైనా పెళ్ళాం వివాహేతర సంబంధం పెట్టుకుంటే.. భర్త చనిపోవడమో లేక భార్యని చంపడమో చేస్తుంటారు. ఆ వార్తలు మనం చాలానే చూశాం, చదివాం. కానీ అత్త అక్రమ సంబంధం పెట్టు కుంటే అల్లుడు కి ఇసుర్రాయి బొడ్డుకు వచ్చిన విషయం ఎక్కడైనా చూశారా..? చూడకపోతే చూడండి..  తన అత్త వివాహేతర సంబంధం పెట్టుకుందని. ఫీల్ అయ్యాడు ఒక అల్లుడు. అక్కడితో ఊరుకోక అత్తతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి వ్యక్తిని మందలించాడు. అంతే ఆ అత్త అల్లుడి కంటే ఎక్కువ ఫీల్ అయ్యింది. తన పని తాను చేసుకుంటుంటే మధ్యలో అల్లుడు పానకంలో పుడకలా తయారయ్యాడని భావించిన ఆ అత్త.. అల్లుడి పై  వేధింపుల అస్త్రం వేసింది. దీంతో కొత్తగా పెళ్లైన ఆ అల్లుడు.. అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు. అత్త మీద కోపం కాస్త భార్య పై చూపించాడు బాబు. భార్యతో తరుచూ గొడవలు పడి.. వారిద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. ఓవైపు అత్త, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి వేధింపులు.. మరోవైపు భార్య తో మనస్పర్థలు అతడి ఉసురు తీశాయి.. చూడండి చివరికి కథ ఎక్కడికి చేరిందో..   అతని పేరు బాబు. అతని సొంతూరు నల్గొండ జిల్లా. తిరుమల గిరి. అతను హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి ఎనిమిది నెలల క్రితమే పెళ్లి అయింది. అమ్మాయిది చందంపేట మండలం తెల్దార్ పల్లి. వీరిద్దరూ కర్మాన్ ఘాట్ లో గల శ్రీరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు చీటికి మాటికి గొడవ పడుతుండటంతో బాబు తండ్రి రాములు వచ్చాడు.. ఆ విషయం పై ఆరా తీశాడు. అప్పుడు బాబు అత్త అసలు విషయం చెప్పాడు. తన అత్త వివాహేతర సంబంధం పెట్టుకున్నదని.. ఆ విషయం తనకు తెలిసేసరికి.. ఆ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి ఆమె కూడా తనను వేధింపులకు గురిచేసస్తున్నారని బాబు మొరపెట్టుకున్నాడు. ఇదే విషయంపై తన భార్యతో కూడా గొడవలు వస్తున్నాయని బాబు తండ్రికి వివరించాడు. దీంతో వారిద్దరినీ పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇప్పించాడు రాములు. కానీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. పోగా.. వాగ్వాదాలు ఇంకా ముదిరాయి. దీంతో బాబు భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో బాబు అత్తతో సన్నిహితంగా ఉండే వ్యక్తి.. అతడికి ఫోన్ చేసి బెదిరించేవాడు. అత్త కూడా ఫోన్ చేసి మానసిక వేధింపులకు గురి చేసేది. వేధింపులతో విసిగిపోయిన బాబు కొద్దికాలంగా ముభావంగా ఉంటున్నాడు.     కట్ చేస్తే.. ఈ  క్రమంలో మంగళవారం ఉదయం బాబు తమ్ముడు జబ్బర్ ఆటో తీసుకుని బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం బయటనుంచి వచ్చి చూసేసరికి తలుపు గడియపెట్టి ఉంది. జబ్బర్ తో పాటు అతడి చెల్లెలు, ఇంటి యజమాని తలుపును తెరిచి చూడగా.. ఎదురుగా బాబు శవం ఫ్యాన్ కు వేలాడి ఉంది. బాబు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన కుమారుడిని అతడి అత్త వేధింపులకు గురి చేసిందని.. అత్తతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి బెదిరింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై విచారణ చేపట్టారు. అయితే బాధితుడి భార్య మాత్రం తనకేం పాపం తెలియదని.. తన భర్త ఆత్మహత్య చేసుకుంటాడని తాను ఊహించలేదని చెప్పుకురావడం విడ్డూరం.   

వైసీపీ ఓట్ల‌కు తూట్లు.. టీడీపీకే భ‌విష్య‌త్తు..

తిరుప‌తిలో గెలిచామంటూ వైసీపీ సంబ‌రాలు. 2.7 ల‌క్ష‌ల మెజార్టీ అంటూ వేడుక‌లు. ఇదంతా పైపైనే. లోలోన ఆ పార్టీ నేత‌ల్లో ఒక‌టే గుబులు. త‌మ అధినేత‌ జ‌గ‌న్‌రెడ్డికి ఏం స‌మాధానం చెప్పాల‌నే వ‌ణుకు. 5 ల‌క్ష‌ల ఆధిక్య‌మంటూ బిల్డ‌ప్ ఇచ్చి.. 3 ల‌క్ష‌ల లోపు మెజార్టీతో బ‌య‌ట‌ప‌డి.. గెలిచి ఓడినంత ప‌ని అయింది. ఇక గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌తో పోలిస్తే ప‌లు చోట్ల వైసీపీకి ఓట్లకు భారీగా కోత ప‌డ‌టం అధికార పార్టీలో క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది.   2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికల్లో వైసీపీకి జిల్లాలో ఓట్లు తగ్గాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో 2,88,012 ఓట్లు ఆ పార్టీకి వ‌చ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 2,60,891. అంటే మునుపటి కంటే 27,121 ఓట్లు వైసీపీకి కోత ప‌డ్డాయి.  పోలింగ్‌ శాతం ఆధారంగా చూస్తే 2019 ఎన్నికల కంటే ఎక్కువే అని కనిపిస్తున్నా,  ఓట్ల సంఖ్య పరంగా చూస్తే ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో మాత్రం గతానికంటే వైసీపీకి ఆధిక్యత తగ్గింది. శ్రీకాళహస్తిలో గత ఎన్నికల్లో వైసీపీకి 32,919 ఓట్లు మెజారిటీ రాగా, తాజా ఓట్ల లెక్కింపులో 31,469 మెజారిటీ వచ్చింది. సత్యవేడు సెగ్మెంట్‌లో కిందటి ఎన్నికల్లో వైసీపీకి 42,196 ఓట్ల మెజారిటీ వస్తే.. ఇపుడు ఆధిక్యత 38,144కు తగ్గిపోయింది. ఇలా తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచినా.. ప‌లు సెగ్మెంట్‌ల‌లో ఓట్లు త‌గ్గ‌డం అధికార పార్టీపై మిన్నంటిన వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం.   తిరుప‌తి ప్ర‌చార స‌మ‌యంలోనే ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. శ్రీకాళ‌హ‌స్తిలో చంద్ర‌బాబు ప్ర‌చారానికి ప్ర‌జ‌లు పోటెత్తారు. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో శ్రీకాళ‌హ‌స్తిలో అదే చోట జ‌రిగిన చంద్ర‌బాబు స‌భ‌ జ‌నం లేక వెల‌వెల‌పోయింది. 2021 వ‌చ్చే స‌రికి సీన్ రివ‌ర్స్ అయింది. శ్రీకాళ‌హ‌స్తిలో చంద్ర‌బాబు ర్యాలీల‌కు జ‌నం తండోప‌తండాలుగా వ‌స్తే.. వైసీపీ స‌భ‌ల‌కు జ‌న‌మే క‌రువ‌య్యారు. స‌త్య‌వేడులోనూ అదే త‌ర‌హా సీన్లు క‌నిపించాయి. తిరుప‌తి వ్యాప్తంగా టీడీపీ ప్ర‌భంజ‌నం.. వైసీపీ ప‌రాభ‌వం స్ప‌ష్ట‌మైంది.  అయితే, ప్ర‌జాభిమానం వేరు.. పోలింగ్ వేరు. అధికార బ‌లంతో, దొంగ ఓట్ల‌తో ఎలాగోలా గెలివ‌గ‌లిగారు.  అస‌లు, ఉప ఎన్నికంటే వార్ వ‌న్ సైడ్‌గా ఉండాలి. సిట్టింగ్ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మ‌ర‌ణంతో వైసీపీకి సానుభూతి ఓట్లు వెల్లువెత్తాలి. మంత్రులు చెప్పిన‌ట్టుగానే 5 ల‌క్ష‌ల మెజార్టీతో గెలుపొందాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఉప ఎన్నిక‌ల్లో వార్ వ‌న్ సైడ్ అవ‌లేదు. సానుభూతి ఓట్లు రాల‌లేదు. ల‌క్ష‌ల కోట్లు సంక్షేమ ప‌థకాల‌కు ఖ‌ర్చు చేస్తున్నా.. అవి ఓట్లుగా మార‌లేదు. దొంగ ఓట్లు, బెదిరింపు ఓట్లే.. అధికార పార్టీని గెలిపించాయి. మెజార్టీ స‌గానికి స‌గం ప‌డిపోయింది. తిరుప‌తి ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచి ఓడింది. టీడీపీలో మాత్రం.. ఓడినా గెలిచినంత జోష్ వ‌చ్చింది. ఇదే జోరుతో.. ఇదే స్పూర్తితో.. ప‌ని చేస్తే.. భ‌విష్య‌త్ తెలుగుదేశానిదే అన‌డం అతిశ‌యోక్తి కాక‌పోవ‌చ్చు.

బీజేపీకి షాక్‌.. లింగోజిగూడలో ఓట‌మి.. ఆధిప‌త్య‌పోరే కార‌ణ‌మా?

గ‌త‌ డిసెంబ‌ర్‌లో జ‌రిగిన జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భంజ‌నం. మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్క‌కున్నా.. భారీగా కార్పొరేట‌ర్ల‌ను గెలిపించుకొని క‌మ‌ల‌ద‌ళం స‌త్తా చాటింది. హైద‌రాబాద్ షెహ‌ర్ హ‌మారా అంటూ విజ‌య‌కేతనం ఎగ‌ర‌వేసింది. ఎన్నిక‌లు ముగిసిన కొన్ని రోజుల‌కే లింగోజిగూడ డివిజ‌న్‌లో గెలిచిన బీజేపీ కార్పొరేట‌ర్ క‌న్నుమూశారు. దీంతో.. లింగోజిగూడ‌కు ఇటీవ‌ల ఉప ఎన్నిక జ‌రిగింది. తాజాగా, అనూహ్య ఫ‌లితం వెలువ‌డింది. బీజేపీ ఓడిపోయింది. లింగోజిగూడ బీజేపీకి సిట్టింగ్ సీటు. బై పోల్‌లో లింగోజిగూడ బీజేపీ నుంచి చేజారిపోయింది. ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గెలిచారు. దీంతో, లింగోజిగూడ ఫ‌లితం క‌మ‌ల‌ద‌ళంలో కాక రేపుతోంది.  అంత‌కుముందు, లింగోజిగూడ కేంద్రంగా బీజేపీలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డిచింది. ఉప ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసేందుకు స‌హ‌క‌రించాలంటూ స్థానిక బీజేపీ నాయ‌కులు క‌లిసిక‌ట్టుగా వెళ్లి మంత్రి కేటీఆర్‌ను క‌ల‌వ‌డం క‌ల‌క‌లంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు తెలీకుండా కిందిస్థాయి నేత‌లు వెళ్లి కేటీఆర్‌ను క‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ప‌రిణామంపై బండి.. ఓ రేంజ్‌లో సీరియ‌స్ అయ్యారు. గెలిచే చోట‌.. సిట్టింగ్ స్థానంలో.. టీఆర్ఎస్ స‌పోర్ట్ మ‌న‌కెందుకంటూ సంజ‌య్ మండిప‌డ్డారు.  అయితే, లింగోజిగూడ ఎపిసోడ్ బీజేపీ అగ్ర నాయ‌క‌త్వంలో ఆధిప‌త్య పోరుకు నిద‌ర్శ‌నమంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. బండి సంజ‌య్ ఒంటెద్దు పోక‌డ ఇష్టం లేని రాష్ట్ర బీజేపీ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లోనే కిందిస్థాయి నాయ‌కులు బండిని కాద‌ని వెళ్లి కేటీఆర్‌ను క‌లిశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యం బీజేపీ కేంద్ర అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. అప్ప‌టి నుంచి లింగోజిగూడ బైపోల్ బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. అనూహ్యంగా ఓట‌మి పాల‌వ‌డంతో పార్టీ ప‌రువు పోయింది.  లింగోజిగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిని కూడా నిల‌ప‌లేదు. కాంగ్రెస్ మాత్రం బ‌రిలో దిగింది. హ‌స్తం, క‌మ‌లం మ‌ధ్య హోరాహోరీ న‌డిచింది. టీఆర్ఎస్ సైడ్ అవ‌డంతో.. కారు ఓట్లు చేతి గుర్తు వైపు మ‌ళ్లిన‌ట్టున్నాయి. బీజేపీ శ్రేణులు కేటీఆర్‌ను క‌ల‌వ‌డాన్ని కూడా స్థానికులు అంగీక‌రించ‌లేక‌పోయారు. దీంతో.. బీజేపీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. లింగోజిగూడలో అనూహ్య‌ గెలుపుతో జీహెచ్ఎమ్‌సీలో కాంగ్రెస్ బ‌లం 3కి పెరిగింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌కు జ‌రిగే లాభ‌మేమీ లేకున్నా.. బీజేపీకి క‌లిగే న‌ష్టం చాలా ఉంటుంది. ముఖ్యంగా.. బీజేపీలో అధిప‌త్య పోరుకు లింగోజిగూడ కేంద్రం కావ‌డం.. ఈ ప‌రాభ‌వం.. క‌మ‌ల‌ద‌ళంలో క‌ల్లోలానికి కార‌ణంగా మారుతోంది. 

ఎమ్మెల్యేగా రోజు కూలీ..  బెంగాల్ లో సంచలనం 

దేశ వ్యాప్తంగా రాజకీయ కాక రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి తృణామూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. అయితే నందిగ్రామ్ లో మాత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరాజయం పాలయ్యారు. అంతేకాదు ఓ సాధారణ రోజు కూలీ కూడా శాసనసభకు ఎన్నికైంది. బెంగాల్‌లోని సల్తోరా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ తరఫున బరిలోకి దిగిన చందనా బౌరి.. అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ మండల్‌పై 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు. టికెట్ దక్కించుకోవడాన్నే పెద్ద విజయంగా భావించిన చందన.. ఇప్పుడు ఏకంగా తృణమూల్ కంచుకోటనే బద్దలుగొట్టారు. గత రెండు పర్యాయాలూ ఈ నియోజక వర్గంలో టీఎంసీనే గెలుపొందింది. ఆమె భర్త కూడా రోజు కూలీనే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. అయితేనేం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సాధించిన అపూర్వ విజయం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది.  కరెంటు సదుపాయం కూడా లేని ఒక గుడిసె.. మూడు మేకలు.. మూడు ఆవులు.. తన పేరిట రూ.31,985, తన భర్త పేరిట రూ. 30,311.. ఇవే చందన అస్తుల వివరాలు. ఎస్సీ మహిళ అయిన చందనా బౌరి ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన తన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన చందన అనూహ్యంగా బీజేపీ నుంచి టికెట్ దక్కించుకుని చారిత్రాత్మక విజయం సాధించింది.  చందనా బౌరి విజయంపై ప్రముఖ రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది సామాన్య మహిళ విజయమంటూ నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. చందన విజయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇది `సామాన్య మహిళ సాధించిన అసాధారణ విజయమ`ని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది చందన విజయం కాదని, అలాంటి సాధారణ మహిళను గెలిపించిన సల్తోరా నియోజకవర్గ ప్రజల విజయమని కొందరు అభివర్ణిస్తున్నారు. ట్విటర్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ చందన విజయానికి సంబంధించిన పోస్టులు వైరల్‌గా మారాయి.    

కేసీఆర్ తో యుద్ధానికి రెడీ.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా! 

టీఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ తో అమితుమీకి సిద్ధమవుతున్నారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఈటల రాజేందర్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. తన నియోజకవర్గమైన హుజూరాబాద్ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు ఈటల రాజేందర్. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రభుత్వంలో ఒక కమిట్‌మెంట్‌తో పనిచేశానన్నారు. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదని చెప్పారు. నాగార్జున సాగర్‌లో కేవలం కేసీఆర్ ప్రచారం వల్లే గెలవలేదన్నారు. కార్యకర్తలందరి సమిష్టి కృషి వల్లే పార్టీ గెలిచిందన్నారు. గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందని ఈటల మరోసారి స్పష్టం చేశారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు.  కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు.  తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని ఈటల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు.  గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ వాపోయారు. తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.  ఏమాత్రం తప్పున్నా తనను శిక్షించాలన్నారు. ఉద్దేశ పూర్వకంగానే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని ఈటల పేర్కొన్నారు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులేనన్నారు. జమున హ్యాచరీస్‌లో తాను డైరెక్టర్‌ను కానన్నారు. 

ఫాంహౌజ్ లో అసైన్డ్ భూముల్లేవా! కేసీఆర్ పై ఈటల ఫైర్ 

తెలంగాణ ఉద్యమంలో ముందున్న తనపై సీఎం స్థాయి వ్యక్తి కుట్ర చేయడం దారుణమన్నారు ఈటల రాజేందర్. రైతులను ప్రలోభ పెట్టి తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. ఉద్యమ నేత ఇలాంటి పనులు చేస్తే ఆయన గౌరవం పెంచదని, తెలంగాణ ప్రజలు హర్షించరని చెప్పారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఈటల. నయీం వంటి హంతక ముఠా బెదిరింపులకే తాను భయపడలేదన్నారు. అసైన్డ్ భూముల పేరుతో కుట్రలు చేస్తున్నారన్న రాజేందర్.. ముఖ్యమంత్రి ఫాంహౌజ్ లో అసైన్డ్ భూములు లేవా అంటూ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ఫాంహౌజ్ కోసం ప్రభుత్వ భూముల గుండా రోడ్లు వేయలేదా అని ప్రశ్నించారు. ఏది పడితే అది చేస్తే చట్టం ఒప్పుకోదన్నారు ఈటల రాజేందర్. ఫాంహౌజ్ లో భూములు కొన్నప్పుడు రేటు ఎంత.. ఇప్పుడు రేటు ఎంత అని నిలదీశారు.  తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. బాస్ ఏది చెబితే అది నడవదన్నారు. తన భార్య వ్యాపారం చేస్తుంటే తనపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తో 19 ఏండ్లు పని చేశానని.. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా పనిచేశానని చెప్పారు.  2008లో కేసీఆర్ ఆదేశిస్తే రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలకు అండగా నిలిచానని వెల్లడించారు ఈటల రాజేందర్. ఎన్ని కుట్రలు చేసినా ఆత్మను చంపుకునే ప్రశ్నే లేదన్నారు. భూముల కేసులో న్యాయ పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ ప్రజలకు మద్దతుతో విజయం సాధిస్తానని చెప్పారు

బీజేపీది బ‌లుపా? వాపా? బండి వ‌ల్లే ఓట‌మా?

దుబ్బాక‌లో దుమ్మురేపింది. జీహెచ్ఎమ్‌సీలో ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇక తెలంగాణ గ‌డ్డ‌.. బీజేపీ అడ్డా.. అనుకున్నారు అంతా. కానీ, అంత‌లోనే బీజేపీ అధ్య‌క్షుని పొలిటిక‌ల్‌ హ‌నీమూన్ పీరియ‌డ్ ముగిసింది. హైద‌రాబాద్‌ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కోల్పోయింది. వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నాలుగో స్థానానికి ప‌డిపోయింది. ఇప్పుడిక‌ నాగార్జున‌ సాగ‌ర్‌లో ఏకంగా డిపాజిటే గ‌ల్లంతైంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామ‌ని క‌ల‌లు కంటున్న‌ జాతీయ పార్టీకి ఇది ఘోర ప‌రాభ‌వ‌మే. ఇక ఆ పార్టీ ఆశ‌లు అడియాశ‌లేనా? తెలంగాణ‌లో బీజేపీ అంద‌ల‌మెక్క‌డం అంత ఈజీ కానే కాదా?  కేసీఆర్ చాణ‌క్యం ముందు క‌మ‌ల వ్యూహాలు వ‌ర్క‌వుట్ అవ‌డం లేదా? అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆ పార్టీకి బ‌ల‌మా? బార‌మా? ఇలా, కాషాయపార్టీ భ‌విష్య‌త్‌పై అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి.      నాగార్జున సాగ‌ర్ ఓట‌మిని పూర్తిగా బండి సంజ‌య్ ఖాతాలోనే వేస్తున్నారు విశ్లేష‌కులు. బీజేపీ అభ్య‌ర్థిగా ర‌వి నాయ‌క్ ఎంపిక చేసిన నాడే ఆ పార్టీ ఓడిపోయింద‌ని అంటున్నారు. రెడ్లు, యాద‌వుల హ‌వా ఉన్న జ‌న‌ర‌ల్ స్థానంలో ఎస్టీని బ‌రిలో దింపి.. సాగ‌ర్‌ను రాజ‌కీయ ప్ర‌యోగ‌శాల‌గా మార్చేసింది. ఇప్పుడిప్పుడే బీజేపీ హ‌వా పెరుగుతున్న స‌మ‌యంలో.. నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల్సింది పోయి.. ఇలా డిపాజిట్ కూడా రానంత ఘోరంగా ఓడిపోవ‌డం ఆ పార్టీకి తీర‌ని లోటు.. రాజ‌కీయంగా చేటు.. బీజేపీ అభ్య‌ర్థి ర‌వి నాయ‌క్ అన‌గానే.. కేడ‌ర్‌లో తీవ్ర నిరుత్సాహం. ఓవైపు జానారెడ్డి, భ‌గ‌త్‌లాంటి బ‌ల‌మైన నాయ‌కులు, సామాజిక వ‌ర్గం బ‌రిలో ఉన్న చోట‌.. రాజ‌కీయంగా కీల‌క ప్ర‌భావం చూపే స‌మ‌యంలో.. పేల‌వ‌మైన అభ్య‌ర్థిని ఎంపిక చేసి బండి సంజ‌య్ పెద్ద త‌ప్పిద‌మే చేశాడ‌ని అంటున్నారు. అందుకే, ప్ర‌చార స‌మ‌యంలోనూ బీజేపీ జోష్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. క‌మ‌ల‌నాథులు ముందే ఓట‌మిపై అంచ‌నాకు వ‌చ్చేశారంటున్నారు. ఫ‌లితాలూ వాళ్లు ఊహించిన దానికంటే దారుణంగా రావ‌డం బీజేపీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  అలుపెర‌గ‌ని పోరాట‌మే బీజేపీ బ‌లం. ఎంత చిన్న ఎల‌క్ష‌నైనా.. గెలుపు కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతుంది క‌మ‌ల‌ద‌ళం. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, బెంగాల్‌లో అదే జ‌రుగుతోంది. తెలంగాణ‌లో ఇంకాస్త గట్టిగా ప్ర‌య‌త్నిస్తే బీజేపీదే ఈ రాష్ట్ర‌మనేది ఢిల్లీ నేత‌ల ధీమా. దుబ్బాక గెలుపు ఆ పార్టీలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. బ‌ల‌మైన అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు పోటీలో ఉండ‌టంతో గెలుపు సునాయాస‌మైంది. దుబ్బాక దూకుడు ఇచ్చిన స్పూర్తితో జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల్లో మ‌రింత క‌ష్ట‌ప‌డ్డారు క‌మ‌ల‌నాథులు. స్వ‌త‌హాగా గ్రేట‌ర్ ప‌రిధిలో బీజేపీ బ‌లంగా ఉండ‌టం.. ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో  ప్ర‌భుత్వ వైఫ‌ల్యంతో.. వ్య‌తిరేక ఓటు అంతా బీజేపీ వైపు మ‌ళ్లింది. మేయ‌ర్ పీఠం ద‌క్క‌కున్నా.. మెజార్టీ స్థానాల‌తో దాదాపు గెలిచినంత ప‌ని చేసింది బీజేపీ. బండి సంజ‌య్ సార‌ధ్యంలోనే దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌డంతో.. ఆ క్రెడిట్ అంతా బండి ఖాతాలో చేరింది. బండి.. మొన‌గాడంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీదే గెలుపంటూ ప్ర‌చారం మొద‌లైంది.  క‌ట్ చేస్తే..  సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద‌ర్‌రావు.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఇక వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ స్థానంలోనైతే ఏకంగా నాలుగో స్థానానికే ప‌రిమిత‌మ‌య్యారు. క‌నీసం కోదండ‌రాంకు, స్వ‌తంత్ర అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు వ‌చ్చిన‌న్ని నోట్లు కూడా రాలేదు బీజేపీకి. దుబ్బాక‌, గ్రేట‌ర్ విజ‌య ప‌రంప‌ర‌తో విర్ర‌వీగుతున్న క‌మ‌ల‌నాథుల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఊహించ‌ని షాక్ ఇచ్చాయి. బండి సంజ‌య్ ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. పోయిన ప‌రువు తిరిగి ద‌క్కించుకోవ‌డానికి నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక రూపంలో మంచి ఛాన్స్ వ‌చ్చింది. అంది వ‌చ్చిన అవ‌కాశాన్ని.. మొద‌ట్లోనే నేల‌పాలు చేసుకున్నారు క‌మ‌ల‌నాథులు. కేండిడేట్ ఎంపిక నుంచి.. ప్ర‌చారం వ‌ర‌కూ అన్నిట్లోనూ విఫ‌లం చెందారు. అందుకే.. ఈ ఓట‌మిని సైతం బండి సంజ‌య్ ఖాతాలోనే వేస్తున్నారు.  దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్ హ‌వా, గ్రేట‌ర్‌లో బీజేపీ ఓట్ బ్యాంక్‌తోనే క‌మ‌లం పార్టీ స‌త్తా చాటిందే కానీ.. అందులో బండి గొప్ప‌త‌నం ఏమీ లేదంటూ విమ‌ర్శ‌లు మొద‌లైపోయాయి. రెండు ఎమ్మెల్సీ  స్థానాల్లో ఓటమి, సాగ‌ర్‌లో డిపాజిటే రాకుండా ఘోర ప‌రాభ‌వంతో పాటు.. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌లోనూ బీజేపీ ప్ర‌భావం అంతంత మాత్ర‌మే అంటున్నారు. ఇదంతా రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ వైఫ‌ల్య‌మేన‌ని భావిస్తున్నారు. బండి సంజ‌య్ నోటి దురుసుత‌నం, సిల్లీ పాలి..ట్రిక్స్‌, నాయ‌క‌త్వ లోపం, మిగ‌తా బీజేపీ అగ్ర నాయ‌క‌త్వంతో క‌లుపుగోలుత‌నం లేక‌పోవ‌డం లాంటి కార‌ణాలు బీజేపీకి మైన‌స్‌గా మారాయ‌ని అంటున్నారు. ఇటీవ‌ల గ్రేట‌ర్‌లో బండిని కాద‌ని స్థానిక బీజేపీ నాయ‌క‌త్వం నేరుగా కేటీఆర్‌ను క‌లిసి కార్పొరేష‌న్ ఉప ఎన్నిక‌లో ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్త చేయ‌డం.. బండిపై తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేయ‌డ‌మే అంటున్నారు. స్థానిక కేడ‌ర్‌పై ఆయ‌న‌కు ప‌ట్టు లేక‌పోవ‌డంతో పాటు నాయ‌క‌త్వ లోప‌మే ఇందుకు కార‌ణం అని చెబుతున్నారు. బీజేపీని విప‌రీతంగా అభిమానించే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం.. తెలంగాణ బీజేపీని తీవ్రంగా విమ‌ర్శించారంటే అందుకు బండి సంజ‌య్ అడ్డ‌గోలు విధానాలే కార‌ణ‌మ‌ని అంటున్నారు. గిట్లైతే.. తెలంగాణ‌లో బీజేపీ గెల్చుడు క‌ష్ట‌మే. అందుకే, నాగార్జున సాగ‌ర్ ఎన్నిక ఫ‌లితం.. బీజేపీలో అంత‌ర్‌మ‌థ‌నానికి.. బండి నాయ‌క‌త్వంపై చింత‌న్ బైఠ‌క్‌కు దారి తీస్తోంది. 

క‌రోనా కేసులు 2 కోట్లు!.. మ‌ర‌ణాలు 2 ల‌క్ష‌లు..

త‌గ్గేదే లే.. అంటోంది క‌రోనా. వైర‌స్ ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. ల‌క్ష‌ల్లో కేసులు.. వేల‌ల్లో మ‌ర‌ణాలు.. దేశం క‌రోనా భార‌త్‌గా మారిపోతోంది. గడిచిన 24 గంటల్లో మరో 3.68 లక్షల మందికి కొవిడ్ సోకింది. ఆ ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, కొవిడ్ టెస్టుల సంఖ్య తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది.  ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 15,04,698 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,68,147 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.99 కోట్లకు చేరింది.    అటు, వైరస్‌ నుంచి కోలుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కొవిడ్‌ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది.   అయితే, మరణాల సంఖ్య కూడా పెర‌గుతుండ‌టం ఆందోళ‌నక‌రం. మృతుల సంఖ్య రోజుకి 3వేలకు పైనే  ఉంటోంది. తాజాగా 3,417 మంది కొవిడ్ వల్ల మృత్యువాతపడ్డారు. కరోనాతో ఇప్ప‌టి వ‌ర‌కూ 2,18,959 మంది వైరస్‌కు బలైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.   దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 34 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,13,642 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 17.13శాతానికి చేరింది.   ఇక దేశంలో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల వ్యాక్సిన్లు  అందుబాటులో లేవు. ఆదివారం 12లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఇప్పటి వరకు 15.71కోట్ల మంది టీకాలు తీసుకున్నారు.   

వామ్మో ఇదేం కరోనా.. దేశంలో ఇన్ని మరణాల?

దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతూనే ఉంది. విచ్చలవిడిగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి రోజూ లక్షల మందిపై ప్రతాపం చూపుతూ వికటాట్టహాసం చేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 3.68లక్షల మంది కొవిడ్‌ బారిన పడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.   దేశవ్యాప్తంగా 15,04,698 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,68,147 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.99కోట్లకు చేరింది. ఇదే సమయంలో వైరస్‌ నుంచి కోలుకునేవారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కొవిడ్‌ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది.  మరణాల సంఖ్య మరోసారి 3వేలకు పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 3,417 మంది కొవిడ్ వల్ల మృత్యువాతపడ్డారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2,18,959 మంది వైరస్‌కు బలైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు 34లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,13,642 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 17.13శాతానికి చేరింది.   ఏపీలో 83 మరణాలు..  రాష్ట్రంలో ప్రతి గంటకూ సగటున 996 మంది కరోనా బారిన పడుతుండగా.. ముగ్గురికి మించి ప్రాణాలు కోల్పోతున్నారు. తొలి, మలి దశల్లో ఎన్నడూ లేని విధంగా 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 23,920 కరోనా కేసులు నమోదయ్యాయి. 83 మంది మరణించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 నమూనాలు పరీక్షించారు. 20.92 శాతం మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 11,45,022కు, మరణాలు 8,136కు చేరాయి.    ఈ  జిల్లాల్లోనే ఎక్కువ..    24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసుల్లో 13,400 (56.02 శాతం) చిత్తూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే వచ్చాయి.  మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 1,43,178కు చేరింది. 24 గంటల్లో 11,411 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తంగా 1,66,02,873 నమూనాలు పరీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట వద్దనున్న గురుకుల(ఏపీఆర్‌) పాఠశాల-కళాశాలలో 29 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మత్తి కమలాకరరావు కరోనాతో పోరాడి ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని మచిలీపట్నంలోని నివాసానికి తీసుకొచ్చి, తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆసుపత్రుల్లో కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం 10 మంది మృతి చెందారని అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌  తెలిపారు. కిమ్స్‌లో 8 మంది, శ్రీనిధి ఆసుపత్రిలో ఒకరు, ఏరియా ఆసుపత్రిలో ఒకరు మృతి చెందారని అన్నారు.   తెలంగాణాలో 49 మరణాలు..     తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 58,742 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,695 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,417కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1352 కేసులు నమోదయ్యాయి.           

పాజిటివ్ అని తెలిసి.. బస్సు కింద తల పెట్టి.. 

అతని పేరు శ్రీనివాస్. గోదావరిఖని లో సూర్యనగర్ లో తన భార్య, తల్లి తో నివాసముంటున్నాడు. కుటుంబం గడవడం కోసం స్థానిక రెస్టారెంట్ లో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో ఆదివారం సీటీ స్కాన్‌ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఆ వార్త వినగానే శ్రీనివాస్ గుండె బద్దలైయింది. సరైన వైద్యం తీసుకుంటే కరోనా తగ్గుతుందని ఆలోచించ లేక పోయాడు. మనోడు  టెన్షన్ పార్టీ అనుకుంటా ఇంట్లో వాళ్లకు ఎవరికి చెప్పకుండా.. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్‌ ఆస్పత్రికి వెళ్తున్నానంటూ ఇంట్లోంచి వచ్చి నగరపాలక కార్యాలయం సమీపంలో బస్సు వెనకచక్రం కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిగ్నల్‌ తర్వాత బస్సు బయల్దేరే సమయంలో ఒక్కసారిగా వెనకచక్రం కింద తల పెట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వారు తెలిపారు.    ఆక్సిజన్‌ అందక.. మరో ముగ్గురు మృతి..  అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఉదయం ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఆక్సిజన్‌ అందకే వీరు మరణించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ముగ్గురు మృతిచెందడానికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.  మరో ఇద్దరు ఇలా.. పొట్టకూటి కోసం, కూలికోసం వేరే రాష్ట్రానికి వెళ్లిన యువకులు కరోనా విరుచుకుపడుతున్న కారణంగా తమ సొంత రాష్ట్రానికి పయనమయ్యారు ఇద్దరు యువకులు. అందుకోసం  మహారాష్ట్ర నుంచి ఒడిశాకు స్కూటీపై సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధపడ్డారు. ఆ ప్రయాణం మధ్యలోనే ముగిసిపోయింది. వారి సుదీర్ఘ ప్రయాణం వారిని అనంతలోకానికి తీసుకుళ్లింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని బలితీసుకుంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పి.ఎల్‌.పురం వద్ద ఆదివారం జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఏఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. వీరు ప్రయాణిస్తున్న వాహనం పి.ఎల్‌.పురం వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులకు రెండు కాళ్లు విరిగిపోయి బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధార్‌కార్డుల చిరునామా ఆధారంగా మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. పాదచారులను ఢీకొన్న కారు..ఇద్దరి మృతి.. పాదచారులను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం వెంకటాపురంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. మృతులను తూర్పుగోదావరి జిల్లా వంగలపూడికి చెందిన కె.నాగరాజు, డి.కాంతారావుగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇలా రోజు కరోనా కారణం గా కాకుండా చాలా మంది యాక్సిడెంట్ జరిగి, పరీక్షలు తప్పమని, ఇంట్లో అమ్మానాన్నలు తిట్టారని, అమ్మాయి ప్రేమించలేదని. పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని. పెళ్ళాం వేరే వాడితో అక్రమసంబంధం పెట్టుకుందని ఇలాంటి సంఘటనల్లో చనిపోతున్న వాళ్ళు మన  దేశం రోజుకు కుప్పలా కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి.  ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి మరణాలతో పోలిస్తే కరోనా మరణాలు ఇచ్చు మించు  తక్కువే అని చెప్పుకోవచ్చు అంటున్నారు ప్రముఖులు.            

ప్రేమించి పెళ్లి.. ఆ తర్వాత భార్య బలి..  

మహిళల జీవితాలు సమస్యలతో , వేధింపులతో నిత్యం మండే స్మశానాలుగా మారుతున్నాయి. బయట సమాజంలో, ఇంట్లోనూ వారికీ తిప్పలు తప్పడం లేదు. అది ప్రేమించి పెళ్లి చేసుకున్న. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి ఏదైనా గానీ పెనిమిటి మంచోడు కోకపోతే ఆ మహిళ కు బాధలు తప్పడం తప్పడం లేదు.  తన బాధలు చెప్పుకోవడానికి ఆ ఇంటి గోడలు చాలవు. ప్రేమించలేదని  గొంతు కోసేవాడు ఒకడు. పెళ్లి చేసుకున్న తర్వాత మరింత ఎక్కువ వరకట్నం కోసం వేదించే మొగుడు. అన్నట్లుగా మారింది.    అది తెలంగాణ. హుజూర్ నగర్. సుందరయ్య కాలనీ కి చెందిన ఆత్కూరి సుజాత. ఆమె రెండో కూతురు మౌనిక. వయసు 19 సంవత్సరాలు. అదే ప్రాంతానికి చెందిన నాగరాజు ను ప్రేమించింది.  ఇద్దరు మనసులు ఇచ్చుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అత్తకు నచ్చని అల్లుడైన, కూతురి భవిష్యత్తు కోసం వరకట్నం కింద 20 కుంటల పొలం ఇస్తానని చెప్పింది.   సరిగ్గా సంవత్సరం కింద మే నెలలో మౌనిక మేడలో మూడు ముళ్ళు పడ్డాయి. ఇద్దరు కలిసి ఏడు అడుగులు నడిచారు. సంవత్సరం అయినా వారి పెళ్ళికి వేసిన పందిరి ఇంకా తియ్యనేలేదు. అప్పుడు ఆ ప్రబుద్దుడుకి ఏం ఆలోచనలు వచ్చాయో ఏమో..?  మొదటి పెళ్లిరోజు కూడా చేసుకోకముందే భర్త వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి సమయంలో వరకట్నం కింద 20 కుంటల భూమిని ఇచ్చేందుకు మౌనిక తల్లి అంగీకరించింది. భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకొని రావాలని భర్త నాగరాజు కొంతకాలం నుంచి ఇంట్లో గొడవ స్టార్ట్ చేశాడు. తట్టుకోలేక పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది ఆత్కూరి మౌనిక. శనివారం సాయంత్రం పురుగుమందు తాగడంతో ఆమెను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు అర్ధరాత్రి మృతి చెందింది. ఈ మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. గొడవలు జరగకుండా పోలీసుల బందోబస్తు మధ్య భర్త నాగరాజుతో అంత్యక్రియలను పూర్తిచేయించినట్లు ఎస్సై చెప్పారు.    

కేబినెట్ నుంచి ఈటల బర్తరఫ్

ఈటల రాజేందర్ కు మరో షాకిచ్చారు సీఎం కేసీఆర్. మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేశారు. కేబినెట్ నుంచి ఈటలను తొలగిస్తూ ముఖ్యమంత్రి చేసిన సిఫారస్ ను ఆమోదిస్తూ గవర్నర్ కార్యాయం ప్రకటన విడుదల చేసింది. మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఈటల రాజేందర్ పై ఆరోపణలు వచ్చాయి. ఈటలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని మెదక్ కలెక్టర్ తో పాటు విజిలెన్స్ కు ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. ఈటల నుంచి వైద్యశాఖను తొలగించి తనకు అలాట్ చేసుకున్నారు. తాజాగా ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  మరోవైపు ఈటల భూ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదిక సీఎస్​కు చేరింది. మెదక్​ జిల్లా కలెక్టర్​ హరీష్​ ఈ నివేదికను అందించారు. మొత్తం 20 మంది బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితుల వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చారు. మంత్రి ఈటలకు చెందిన జమునా హాచరీస్​ 66.01 ఎకరాల అసైన్డ్​ భూమిని కబ్జా చేసినట్లు సూచించారు. మొత్తం 315.3‌‌0 ఎకరాల భూమి ఉండగా… ఇందులో 121.27 ఎకరాల భూమిని ఆదీనంలో పెట్టుకున్నట్లు నివేదికల్లో వెల్లడించారు. మరో 3.11 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రహారీ గోడను నిర్మాణం చేసినట్లు రిపోర్ట్​లో వివరించారు. మంత్రి ఈటలకు సంబంధించిన జమునా హాచరీస్​ ఈ భూములను కబ్జా చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా అసైన్డ్​ ల్యాండ్​ నుంచే రోడ్డు నిర్మాణం చేశారని, వాల్టా చట్టానికి విరుద్ధంగా చెట్లు నరికివేసినట్లు ఫారెస్ట్​ అధికారుల విచారణలో తేలిందని కలెక్టర్​ నివేదికల్లో పేర్కొన్నారు. వ్యవసాయ భూమిలో నాలా చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని నివేదికల్లో వెల్లడించారు. ఈ నివేదికను సీఎస్​కు సమర్పించారు.