కేసీఆర్ తో యుద్ధానికి రెడీ.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా!
posted on May 3, 2021 @ 11:56AM
టీఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ తో అమితుమీకి సిద్ధమవుతున్నారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఈటల రాజేందర్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. తన నియోజకవర్గమైన హుజూరాబాద్ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు ఈటల రాజేందర్. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రభుత్వంలో ఒక కమిట్మెంట్తో పనిచేశానన్నారు. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదని చెప్పారు. నాగార్జున సాగర్లో కేవలం కేసీఆర్ ప్రచారం వల్లే గెలవలేదన్నారు. కార్యకర్తలందరి సమిష్టి కృషి వల్లే పార్టీ గెలిచిందన్నారు. గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందని ఈటల మరోసారి స్పష్టం చేశారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు.
కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్తో కలిసి పనిచేశానని ఈటల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు.
గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ వాపోయారు. తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఏమాత్రం తప్పున్నా తనను శిక్షించాలన్నారు. ఉద్దేశ పూర్వకంగానే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని ఈటల పేర్కొన్నారు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులేనన్నారు. జమున హ్యాచరీస్లో తాను డైరెక్టర్ను కానన్నారు.