తెలంగాణ‌లో ఆంధ్రా మేయ‌ర్లు!.. అక్క‌డ సెటిల‌ర్ల‌దే రాజ్యం..

ఖ‌మ్మం కార్పొరేష‌న్ టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది. మ‌హిళ‌ల‌కే మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వులు వ‌రించాయి. ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ. డిఫ్యూటీ మేయర్‌ షేక్‌ ఫాతిమా జోహ్రా. అయితే, వీరిద్ద‌రు తెలంగాణ రాష్ట్రీయ స‌మితి నుంచే ఎన్నికైనా.. వీరి స్వ‌స్థ‌లం మాత్రం ఆంధ్రా ప్రాంతం కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ గ‌డ్డ‌పై.. ఆంధ్ర‌లో పుట్టిన ఇద్ద‌రు మ‌హిళ‌లు.,. అధికార పీఠంపై కూర్చోవ‌డం విశేషంగా మారింది. ఏపీకి స‌రిహ‌ద్దు జిల్లా అయిన ఖ‌మ్మం రాజ‌కీయ భిన్న‌త్వం  చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  ఖ‌మ్మం మేయ‌ర్‌గా ఎన్నికైన‌ నీరజ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామం. ఆమెకు పెదపారుపూడికి చెందిన పునుకొల్లు రామబ్రహ్మంతో వివాహం జ‌రిగింది. ఈ కుటుంబం 1988లో ఖమ్మం వచ్చి వ్యాపార రంగంలో సెటిల్‌ అయ్యారు. 2005లో టీడీపీ తరపున 23వ డివిజన్‌ నుంచి తొలిసారిగా కౌన్సెలర్‌గా పోటీచేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత‌ 2016లో 17వ డివిజన్‌ కార్పోరేటర్‌గా గెలిచారు. తాజా, ఎన్నికల్లో 26వ డివిజన్‌లో గెలిచి.. ముచ్చ‌ట‌గా మూడోసారి కార్పొరేట‌ర్ కావ‌డ‌మే కాకుండా.. ఏకంగా మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సుల‌తోనే మేయ‌ర్ పీఠం ద‌క్కింది. క‌మ్మ సామాజిక వ‌ర్గం కావ‌డ‌మూ క‌లిసొచ్చింది. మేయ‌ర్ నీర‌జ భ‌ర్త రామ‌బ్ర‌హ్మం.. మంత్రి పువ్వాడ‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకూ సన్నిహితుడే. రామబ్రహ్మం మూడు దఫాలుగా డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. మొద‌ట తెలుగుదేశం పార్టీలో ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌గా ఎదిగారు.  ఇక డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన షేక్‌ ఫాతిమా జోహ్రా స్వస్థలం గుంటూరు. 1984 మే 10న జన్మించిన ఆమె పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆమె భర్త ముక్తార్‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. గతంలోనే ముక్తార్‌కు సుడా డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ప్ర‌స్తుతం మైనారిటీ కోటాలో ముక్తార్‌ భార్యకు డిప్యూటీ మేయర్‌ పదవి వ‌రించింది.  ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఇద్ద‌రూ సెటిల‌ర్సే కావ‌డం ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఖమ్మంను సెటిలర్ల గుమ్మం అంటారు. పేరుకు తెలంగాణ అయితే.. ఇక్కడి భాష, యాస‌, అలవాట్లు, ఆచారాలపై ఆంధ్ర ప్ర‌భావం ఎక్కువ‌. ఏపీతో సుదీర్ఘ సరిహద్దులు.. విస్తృత బంధుత్వాలు.. ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప‌లు జిల్లాల నుంచి అనేక మంది ఖ‌మ్మంకు వ‌ల‌స వ‌చ్చి.. వ్య‌వ‌సాయంతో పాటు వివిధ‌ వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇలా సెటిల్ అయిన వారిలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే అధికం. విద్య‌, వైద్య రంగం, మైనింగ్‌, సింగరేణి, కేటీపీఎస్‌ తదితర రంగాలలో ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్‌ అయిన వారి సంఖ్య చెప్పుకోదగినదే. ఈ క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పలు ఉద్యమాల్లోనూ ఆంధ్ర సెటిలర్లు పెద్ద సంఖ్య‌లో భాగ‌స్వామ్య‌మై గ‌ట్టిగానే పోరాడారు. ఉద్యమంలో త‌మ వంతుగా చురుకైన పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ సాకారం అనంతరం.. సీఎం కేసీఆర్ సైతం సెటిల‌ర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్నారు. గణనీయంగా ఉన్న సెటిలర్ల ఓటు బ్యాంకును టీఆర్ఎస్ వైపున‌కు తిప్పుకున్నారు. తాజాగా, ఖ‌మ్మం కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్లుగా ఆంధ్రా ప్రాంతం నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు ఇచ్చి.. రెండు ప‌ద‌వుల‌తో.. రెండు సామాజిక వ‌ర్గాలు.. రెండు ప్రాంతల ఓట‌ర్ల‌ను గంప‌గుత్త‌గా త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. 

జాతీయ రాజకీయాలపై బెంగాల్ ఫలితాల ప్రభావం?

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు, పలికే ప్రగల్బాలు ఎలాఉన్నా అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పే ప్రజాస్వామ్య మనుగడకు మూల ఔషదంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు నిస్సందేహంగా ప్రజాస్వామ్య పునాదులను  బలోపేతం చేసింది. అందులో ఏ మాత్రం సందేహంలేదు. ముఖ్యంగా అధికారాన్ని ఎవరికీ ఇచ్చిన ప్రతిపక్షాన్ని విస్మరించలేదు. ప్రజాస్వామ్యం మనుగడకు ప్రతిపక్షాల అవసరాన్ని ప్రజలు గుర్తించారు. ఇదొక శుభ పరిణామం.  ఎన్నికలు జరిగన ఐదు రాష్ట్రాలలో  మూడు రాష్ట్రాలు  అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళలలో ఓటర్లు అధికార పార్టీకి మళ్ళీ మరో అవకాశం ఇచ్చారు. అస్సాంలో బీజేపీ, బెంగాల్లో తృణమూల్, కేరళలో వామపక్షకూటమి  అధికారాన్నినిలబెట్టుకున్నాయి.తమిళనాడులో,అన్నాడీఎంకే,పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయాయి.డిఎంకే అధినాయకుడు కరుణానిధి,అన్నా డిఎంకే అధినాయకురాలు జయలలిత లేకుండా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంకే స్టాలిన్ సారధ్యంలోని డిఎంకే అధికారాన్ని హస్త గతం చేసుకుంది. పుదుచ్చేరీలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరీలో బీజేపీ బలం నామమాత్రమే. 30 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి దక్కింది ఆరు స్థానాలు మాత్రమే. అయితే బీజేపీ మిత్ర పక్షం ఎన్ఆర్సీ 10 స్థానాలు గెలుచుకుంది. దాంతో, తొలిసారిగా, బీజేపీ శాసనసభలో అడుగుపెట్టింది. అది కూడా అధికార పార్టీగా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, ఉత్తరాది పార్టీగా అక్కడి ప్రజలు ఇంతవరకు దూరం పెట్టిన, ద్రవిడ రాష్ట్రం తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇన్నేళ్ళలో తొలిసారిగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. సంఖ్యా పరంగా చూస్తే, ఇదేమంత గొప్ప విజయం అనిపించుకోదు, కానీ, ఇంతవరకు ఉనికే లేని తమిళ రాజకీయాల్లో అంతో ఇంతో స్థానం సంపాదించుకోవడం చెప్పుకో దగ్గ విశేషమే. పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంలో  అధికారంలోకి రావడం ఒక విధంగా విశేషమే.  అందరి చూపు బెంగాల్ పై కేంద్రీకృతం కావడంతో, మిగిలిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పక్కకు పోయి, బెంగాల్ ఒక్కటే, నేషనల్ ఫోకస్’లోకి వచ్చింది.అయితే, బెంగాల్ విషయంలోనూ, బీజేపీ అధికారంలోకి రాలేదన్న ఆనందమో మరేమో గానీ, చాలా వరకు మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు బెంగాల్లో బీజేపీ బలం గణనీయంగా పెరిగిందనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. అలాగే, రాష్ట్రాన్ని సుమారు 60 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు నామరూపాలు లేకుండా తుడిచి పెట్టుకో పోయాయి అనే విషయాన్ని కూడా మేధావులు, విశ్లేషకులు అంతగా పట్టించుకోవడం లేదు. బహుశా ఆ రెండు పార్టీలను  మేథావులు, విశ్లేషకులు చరిత్రలో కలిపెసారో ఏమో.. అదలా ఉంచి బీజేపీ విషయానికి వస్తే ఐదేళ్ళ క్రితం, 2016లో కేవలం మూడంటే మూడు అసెంబ్లీ స్థానాలలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికలలో అదే మూడు తక్కువ 80 స్థానాల్లో (77) విజయం సాధించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 70 స్థానాలో గెలిచిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి  కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేక పోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాన్ని కమల దళం పూర్తిగా కబ్జా చేసింది. ఇది కూడా మాములు విజయం కాదు. అసలు ఉనికే లేని చోట ఇతర ప్రతిపక్షాలను పూర్తిగా భూస్థాపితం చేసి, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఎదిగి రావడం సామాన్య విషయం, సాధారణ విజయం కాదు. అయితే, సంవత్సరం క్రితం జరిగిన లోక్ సభ  ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 స్థానాలు గెలుచుకోవడంతో , ఆ ఫలితాలతో పోల్చుకుని బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశించిన కమల దళం అభిమానులకు, బీజేపీ అధికారంలోకి వస్తుందని భయపడిన మిత్రులకు మాత్రం నిరాశే మిగిలింది.  లోక్ సభ ఎన్నికల నుంచి బెంగాల్లో బీజేపీ  అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెంచుకుంది. అధికారం కోసం ‘అతిగా’ శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి, పార్టీ ప్రధాన వ్యూహ కర్త అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర అగ్ర నేతలు, చాలా ముమ్మరంగా ప్రచారం సాగించారు. ముఖ్యంగా అమిత్ షా 200 ప్లస్ మంత్రంతో సాగించిన ప్రచారం ఫలించక పోవడంతో, బీజేపీ ఓడి పోయిందనే భావన ఏర్పడింది. కానీ, నిజానికి ఓడి పోయింది కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, తృణమూల్ అధికారాన్ని నిలుపుకుంది. బీజేపీ ఒక్కటే బలాన్ని పెంచుకుంది.  ఒక్క బెంగాల్ లోనే కాదు మొత్తంగా చూసినా, ఈ ఎన్నికలలో ఎక్కువగా లాభపడిన, బలపడిన పార్టీ బీజేపీ. అస్సాంలో అధికారం నిలుపుకుంది. పుదుచ్చేరీలో అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో బలమైన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది. తమిళనాడులోనూ, ‘ఉన్నాను’ అనుపించుకుంది. ఒక్క కేరళలో మాత్రమే ఉన్న ఒక్కసీటును కూడా నిలుపుకోలేక పోయింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. కేరళలో ఆనవాయితీకి భిన్నంగా కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ కూటమి ఓడి పోయింది. గత లోక్ సభ ఎన్నికల్లో  మొత్తం 20 స్థానాలకు గానూ 15 స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. తమిళనాడులో, డిఎంకే మిత్ర పక్షంగా కొద్దిగా  మెరుగైన ఫలితాలు సాధించింది. కొద్దిపాటి ఊరట లభించిది.  జాతీయ రాజకీయాలను విశ్లేషించుకుంటే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యాన్మాయంగా నిలవగలిగే జాతీయ పార్టీ, ప్రస్తుతానికి అయితే ఏదీ లేదు. అది బెంగాల్లో మమత అయిన మరో రాష్ట్రంలో మరో పార్టీ అయినా బీజేపీకి ప్రాంతీయ పార్టీలే ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు.  బెంగాల్లో, బీజేపీ ఓటమికి ఇంకా చాలా కారణాలు ఉన్నా, ముఖ్యమంత్రి ‘చెహరా’ ముఖం లేక పోవడం కూడా ఒక ప్రధాన కారణం. లోక్ సభ ఎన్నికల్లో, ప్రతిపక్షాల పరిస్థితి కూడా అదే. అదీగాక, పరిణతి చెందిన భారతీయ ఓటరు ఏ ఎన్నికలకు ఆ ఏన్నికల్లో ప్రత్యేకంగానే తీర్పు నిస్తున్నారు. కాబట్టి, బెంగాల్లో, ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది కాబట్టి, బీజేపీ పనైపోయిందని అనుకోవడం రాజకీయ విజ్ఞత, వివేకం అనిపించుకోదు. అలాగే, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనుకోలేము. రాజకీయాలు నిశ్చలన చిత్రాలు కాదు.. చలనచిత్రాలు ఏఆటీఆఊడూ సీన్ మారుతూ ఉంటుంది.  అందుకే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని అంటారు.  

స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగువారు

తమిళనాడులో  డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్... 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో ఐదుగురు తెలుగువారికి అవకాశం దక్కింది. తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల ద్వారా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో కేకేఎస్ రామచంద్రన్, ఏ వేలు , ఆర్ గాంధీ , పీకే శేఖర్ బాబు, కేఎన్ నెహ్రూకు స్టాలిన్ మంత్రివర్గంలో చోటు దక్కింది.  తెలుగువారందరికీ స్టాలిన్ కీలక శాఖలను అప్పగించారు. అరుప్పుకొట్టై ఎమ్మెల్యేగా గెలిచిన కేకేఎస్ రామచంద్రన్ కు  కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించగా..  తిరువణ్ణామలై ఎమ్మెల్యే ఏ వేలుకుడబ్ల్యూడీ శాఖ దక్కింది. రాణిపేట నుంచి విజయం సాధించిన ఆర్ గాంధీకి టెక్స్ టైల్ శాఖను కట్టబెట్టారు.  చెన్నై దురైముగం నియోజకవర్గం ఎమ్మెల్యే పీకే శేఖర్ బాబుకి దేవాదాయశాఖ మంత్రిగా అవకాశం లభించింది. తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూకు మున్సిపల్ శాఖ మంత్రి కేటాయించారు స్టాలిన్.  గతంలో సీఎంలుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, పళనిస్వామి, పన్నీర్ సెల్వం అందరూ తమ కేబినెట్లో తెలుగువారికి ప్రాతినిధ్యాన్ని కల్పించారు. స్టాలిన్ కూడా అదే ఒరవడిని కొనసాగించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి టికెట్లు ఇస్తుంటాయి.గతంలో బాలకృష్ణారెడ్డి, కదంబురు రాజు వంటి వారు పదేళ్ల పాటు మంత్రులుగా పని చేశారు.

కారులో నలుగురు చిన్నారుల మృతి.. 

చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు. మారం చేస్తుంటారు. కొన్ని సార్లు పిల్లలకు ఏదైనా కావాలి అంటే తెచ్చి పెట్టాల్సిందే.. వాళ్ళు అడిగింది చెయ్యాల్సిందే. లేదంటే వారి ఏడుపు ద్వారా తల్లి దండ్రులకు మనశాంతి ఉండదు. అలాంటి అల్లరి చేయడం వాళ్ళ కొంత మంది పిల్లలు అనర్ధాలకు దారి తీస్తుంది. తాజాగా అలా అల్లరి చేసిన నలుగురు పిల్లలు చివరికి మృత్యువాత పడ్డారు..  ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉంది. ఆ కారును చూడగానే అక్కడ ఉన్న ఐదుగురు పిల్లలు సరదాపడ్డారు. అందరూ ఆ కారులోకి వెళ్లారు.. సంతోషంగా ఆదుకున్నారు. అసలే చిన్న పిల్లలు ఒక చోటు ఉండరు. అలా అని వాళ్ళ చేతులు కూడా ఊరుకోవు.. ఆ నలుగురిలో ఎవరు ఏం చేశారో. ఏమో ఒక్కసారిగా కారు లాక్ పడింది..  దీంతో వారంతా అందులోనే ఉండిపోయారు. అందరూ ఆందోళన చెందారు. గట్టిగా అరిచారు అయినా ఎవరు వినిపించలేదు. కనీసం అటువైపు ఎవరు చూడలేదు. ఆ పిల్లలకి  ఊపిరాడ‌లేదు. వారిని గుర్తించి బ‌య‌ట‌కు తీసే స‌మ‌యానికే న‌లుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ చిన్నారులు అంద‌రూ పదేళ్ల‌లోపు వ‌య‌సున్న వారే అని వివ‌రించారు. చిన్నారుల‌ మృత‌దేహాల‌ను పోస్టుమార్టంకు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. వారు ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని చెప్పారు. మ‌రొక చిన్నారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో చోటు చేసుకుంది.   

కేసుల భయంతోనే ట్వీట్! మోదీకి జగన్ మద్దతుపై రచ్చ..

ట్విట‌ర్‌లో మోదీకి జ‌గ‌న్ స‌పోర్ట్‌. క‌ట్ చేస్తే, సాక్షి మీడియాలో కేంద్ర వైఫ‌ల్యాల‌పై న్యూస్‌. ఓవైపు ప్ర‌ధానికి అండ‌గా ఉండాలంటూ జ‌గ‌న్ హిత‌వు. మ‌రోవైపు, మోదీ చేత‌గాని త‌నం వ‌ల్లే దేశంలో క‌రోనా క‌ల్లోల‌మంటూ సాక్షి పేప‌ర్లో క‌థ‌నాలు. ఇలా.. మోదీ, కేంద్రం, క‌రోనా అంశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి డ‌బుల్ గేమ్ ఆడుతున్నాడ‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్ చేసిన ట్వీట్‌.. సాక్షిలో వ‌స్తున్న స్టోరీస్‌.. జ‌గ‌న్‌రెడ్డి కాంట్ర‌వ‌ర్సీ పాలిటిక్స్‌పై జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు.. ఇవ‌న్నీ ఏపీ కేంద్రంగా ఢిల్లీ స్థాయిలో కాక రేపుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌ను దోషిగా బోనులో నిల‌బెడుతున్నాయి. దేశంలో క‌రోనా క‌ల్లోలం. ఇప్ప‌టికే 2కోట్ల మందికిపైగా పాజిటివ్‌. 2 ల‌క్ష‌ల మందికి పైగా మృత్యువాత‌. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితికి కార‌ణం ఎవ‌రంటే అన్ని వేళ్లూ ప్ర‌ధాని వైపే. అంత‌ర్జాతీయ మీడియా మోదీని నిప్పుల‌తో క‌డిగేస్తోంది. విమ‌ర్శ‌ల‌తో శ‌ల్య‌ప‌రీక్ష చేస్తోంది. నిపుణులు హెచ్చ‌రిస్తున్నా.. సెకండ్ వేవ్‌పై చేతులెత్తేసిన మోదీని ఇంటా, బ‌య‌టా అంతా ఏకిపారేస్తున్నారు. వ్యాక్సిన్ కొర‌త‌కు, ఆక్సిజ‌న్ లోటుకు ఆయ‌న చేత‌గాని త‌న‌మే కార‌ణ‌మంటూ మోదీని తూట్లు పొడుస్తున్నారు. జన‌మంతా క‌రోనా దోషిగా న‌రేంద్ర మోదీపై దుమ్మెత్తిపోస్తుంటే.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఆయ‌న్ను ఏమీ అనొద్దంటూ వెన‌కేసుకు వ‌స్తున్నారు.  కరోనా నియంత్రణపై ప్రధాని మోదీ గురువారం జరిపిన ఫోన్‌ సంభాషణను విమర్శిస్తూ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేయడం.. దాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఖండించడం జాతీయ, ప్రాంతీయ‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్‌ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట  చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అంటూ హిందీలో ట్వీట్‌ చేశారు హేమంత్‌ . ఈ ట్వీట్‌కు ఏపీ సీఎం జగన్‌ కౌంట‌ర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన హేమంత్‌ సోరెన్‌, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మన మధ్య ఎన్ని విభేదాలున్నా ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని, అది మన జాతిని బలహీనపరుస్తుందని ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కొవిడ్‌పై పోరాడుతున్నాం. ఇది ఒకరినొకరు వేలెత్తి పించుకునే తరుణం కాదు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనమంతా చేయీచేయి కలిపి ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది’అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  సీఎం జ‌గ‌న్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజ‌కీయ మంట రాజేస్తోంది. ప్ర‌ధాని మోదీకి స‌సోర్ట్ చేస్తూ.. స్వ‌యంగా మ‌రో రాష్ట్ర సీఎంకు కౌంట‌ర్ ఇస్తూ.. జగన్ ట్వీట్ చేయ‌డం వెనుక పెద్ద రాజ‌కీయ‌మే న‌డిచింద‌నే అనుమాన‌మూ వ్య‌క్తం అవుతోంది. సాధార‌ణంగా ఇలాంటి మోదీ వ్య‌తిరేక ట్వీట్ల‌పై బీజేపీ నాయ‌కులే కౌంట‌ర్ల‌తో విరుచుకుప‌డుతుంటారు. కానీ ఈసారి ఆ పనిని ఏపీ సీఎం జగన్ తీసుకున్నారు. ప్రధాని మోడీని మద్దతుగా జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్ కు కౌంటరిచ్చారు. జగన్ ట్వీట్ జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. గతంలో ఆయన జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు జగన్. ఏ క్షణాన్నైనా ఆయన బెయిల్ రద్దై జైలుకు వెళ్లేదు తెలియదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మద్దతు ఉంటేనే జగన్ కు రాజకీయ మనుగడ సాధ్యం. అందుకే మోడీకి మోకరిల్లుతూ అడక్కుండానే జగన్ ట్విట్టర్ లో మద్దతు ఇచ్చి కేంద్రాన్ని మచ్చిక చేసుకుంటున్నారనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. ఇదే అర్ధం వచ్చేలా కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.  ‘కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి పెద్ద నాయకుడి కుమారుడివై ఉండి.. సీబీఐ, ఈడీ దాడులకు భయపడి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో ఇలా లాలూచీ పడటం సరికాదు. మీరు ఎదగాలి జగన్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు’అంటూ సూటిగా, ఘాటుగా ఒడిశా కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి ఉలాకా చేసిన రీట్వీట్‌ రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నిచ్చెలి శ‌శిక‌ళ సైతం జ‌గ‌న్ తీరుపై ట్విట్ట‌ర్‌లో వ‌రుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇంత‌టి వెన్నుముఖ లేని నాయ‌కుడు జ‌గ‌న్ అని తాను అనుకోలేద‌న్నారు. జ‌గ‌న్ ట్విటర్ ఐడీని.. బీజేపీ ఐటీ సెల్ హ్యాండిల్ చేస్తోందా? అని అనుమానం వ్య‌క్తం చేస్తూనే.. షేమ్ మిస్ట‌ర్ జ‌గ‌న్‌.. అంటూ శ‌శిక‌ళ ట్వీట్ చేశారు. మోదీ చెప్పిన‌ట్టు చేసే మ‌నిషి జ‌గ‌న్ అంటూ..  మ‌రో ట్వీట్ కూడా చేశారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌లో లాక్‌డౌన్ పెట్టినా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. త్వ‌ర‌లో ఆ రాష్ట్రాల‌ను చూసి సిగ్గులేకుండా ఆయ‌న లాక్‌డౌన్ పెడ‌తారంటూ ఎద్దేవా చేశారు. ఇలా మోదీకి మ‌ద్ద‌తుగా జ‌గ‌న్‌రెడ్డి చేసిన ట్వీట్ పై..  మోదీ మ‌నిషంటూ జాతీయ స్థాయి నాయ‌కులు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని విమ‌ర్శ‌ల‌తో కుళ్ల‌బొడుస్తున్నారు.  అయితే నేష‌న‌ల్ లీడ‌ర్స్‌కి జ‌గ‌న్‌రెడ్డి నిజ‌స్వ‌రూపం గురించి స‌గం మాత్ర‌మే తెలుసు. ఆయ‌న‌లోని అప‌రిచితుడి స్వ‌భావం వారికి పూర్తిగా తెలుసుండ‌దు. జ‌గ‌న్‌రెడ్డి రాజ‌కీయంగా ఎంత క‌న్నింగ్, ఎంత ఖ‌త‌ర్నాక్‌, ఎంత డ‌బుల్ గేమ్ లీడ‌రో ఏపీలోకి తొంగి చూస్తే కానీ అర్థం కాదు. తాజా  మోదీ ఎపిసోడ్‌నే తీసుకుంటే.. మ‌రింత లోతుగా ప‌రిశీలిస్తే.. జ‌గ‌న్‌రెడ్డి ఆడుతున్న రెండు నాలుక‌ల పొలిటిక‌ల్ గేమ్‌పై కాస్తైనా క్లారిటీ వ‌స్తుంది. బీజేపీ జాతీయ స్థాయి నాయ‌కులంతా ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. అక్క‌డ ఏ చిన్న మాట అన్నా.. వారి దృష్టిలో ఇట్టే ప‌డ‌తారు. అందుకే మోదీపై త‌న‌కున్న భ‌క్తిని, భ‌యాన్ని చాటుకునేందుకు ఆయ‌నే సొంతంగా ఈ ట్వీట్ చేశారని అంటున్నారు.   క‌ట్ చేస్తే.. బీజేపీతో మిలాఖ‌త్ అనే విష‌యం తెలిస్తే.. ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను అస‌హ్యించుకుంటారు. అందుకే, ఇక్క‌డి వారిని బురిడీ కొట్టించేందుకు.. త‌న సొంత సాక్షి మీడియాలో కేంద్రానికి వ్య‌తిరేకంగా వ‌రుస‌గా ఆర్టిక‌ల్స్ వ‌చ్చేలా చూసుకుంటున్నారు. క‌రోనా కట్ట‌డి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైందంటూ సాక్షి పేప‌ర్‌లో గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి.  "డొల్ల పాల‌న‌.. గుల్ల ప్ర‌జాస్వామ్యం"..  "వ్యాక్సిన్ కూడా స‌రుకేనా?".. "ఈ ఫ‌లితాలు కారుచీక‌ట్లో కాంతిరేఖ‌లు" .. ఇలా ర‌క‌ర‌కాల హెడ్డింగ్స్‌తో.. వేరు వేరు వ్యాస‌క‌ర్త‌ల‌తో.. కేంద్రానికి వ్య‌తిరేకంగా నిత్యం సాక్షి పేప‌ర్లో విశ్లేష‌నాత్మ‌క క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. అన్ని స్టోరీస్‌లోనూ క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్ర ప్ర‌భుత్వ‌ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూనే ఉన్నారు.  వ్యాక్సిన్ కొర‌త‌, ఆక్సిజ‌న్ లోటుకు కేంద్ర ప్ర‌భుత్వ చేత‌గాని త‌న‌మే కార‌ణం అనిపించేలా సాక్షి పేప‌ర్లో క‌థ‌నాల‌తో క‌డిగిపారేస్తున్నారు. మ‌రి, ఇదేంటి? ట్విటర్‌లో జ‌గ‌న్ చెప్పిన నీతులేంటి? సాక్షి పేప‌ర్లో వ‌స్తున్న నీతిమాలిన క‌థ‌నాలేంటి? ప్ర‌స్తుత సంక‌ట స‌మ‌యంలో మోదీని అండ‌గా ఉండాలంటూ, రాజ‌కీయాలు త‌గ‌వంటూ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ట్విట‌ర్‌లో నీతులు చెప్పి.. బీజేపీ జాతీయ నాయ‌కుల మ‌న్న‌న‌లు పొందారు జ‌గ‌న్‌. కానీ, రాష్ట్రానికి వ‌చ్చే సరికి త‌న సొంత సాక్షి పేప‌ర్‌లో కేంద్రాన్ని, మోదీని ఏకిపారేస్తూ క‌థ‌నాలు రాయించ‌డం.. జ‌గ‌న్ డ‌బుల్ గేమ్ అడుతున్నార‌న‌డానికి నిద‌ర్శ‌నం అంటున్నారు విమ‌ర్శ‌కులు.  ఏపీలో క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంది. ఆ ప్ర‌జా వ్య‌తిరేక‌త నుంచి త‌ప్పించుకోడానికే.. టీడీపీ నేత‌ల‌పై ప‌లు ర‌కాల క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కూ దిగింది. మ‌రోవైపు, సాక్షి మీడియాలో క‌రోనా పాపం కేంద్రానిదే అంటూ వార్త‌లు వ‌చ్చేలా చేసి.. ఆ త‌ప్పు త‌మ‌ది కాద‌ని.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించి.. త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డుతోంది విప‌క్షం. అటు, జాతీయ స్థాయిలో కేంద్రానికి ఊడిగం చేస్తూ.. ఇటు రాష్ట్ర ప్ర‌జ‌ల ముందు కేంద్రాన్ని దోషిగా చూపిస్తూ.. సాక్షి మీడియా ద్వారా మోదీపైకి ప్ర‌జ‌ల‌ను ఉసిగొల్పుతూ.. జ‌గ‌న్‌రెడ్డి అప‌రిచితుడిలా బిహేవ్ చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇదంతా జ‌గ‌న్‌రెడ్డి ఆడుతున్న రాజకీయ డ‌బుల్ గేమ్ అంటున్నారు. అందుకే, బీవేర్ ఆఫ్ జ‌గ‌న్‌రెడ్డి అంటున్నారు రాజ‌కీయ విమ‌ర్శ‌కులు, త‌ట‌స్థులు.  

కడపలో 9 మంది మరణం ఎందుకో తెలుసా... 

క‌డ‌ప జిల్లాలో క‌ల‌కలం చెల‌రేగింది. భారీ పేలుడు సంభ‌వించి  తొమ్మిది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. వారి మృత‌దేహాలు అక్కడికక్కడే చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంత మందికి గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. క‌డ‌ప జిల్లా క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ల‌ప‌ల్లె శివారులో ఈ రోజు ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిసింది. ప్ర‌మాద‌వ‌శాత్తు వాహ‌నంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. బ‌ద్వేలు నుంచి ముగ్గురాళ్ల‌గ‌నికి జిలెటిన్‌స్టిక్స్ త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ.. మృతుల ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు చంద్రబాబు తన ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క‌డ‌ప పేలుడు ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించాలని  చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మళ్ళీ జరగకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. 

బీజేపీ కథ మళ్లీ మొదటికి! వర్గ పోరే కారణమా? 

దుబ్బాక గెలుపు ఊపు నిచ్చింది. హైదరాబాద్ విజయంతో జోష్ పెరిగింది. ఇక, తెలంగాణలో, తెరాసకు ప్రత్యాన్మాయం బీజేపీనే, అని అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు, సామాన్య ప్రజలు కొంతవరకు రాజకీయ విశ్లేషకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో, ఇక పార్టీ పరుగులు తీస్తుందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని కూడా, అనుకున్నారు. బండి సంజయ్ అయితే, తెరాసను గద్దె దింపుతామని బల్లగుద్దారు.    అయితే ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం (హైదరాబాద్)లో బీజేపీ ఓడిపోయింది. మరో స్థానం (ఖమ్మం) లో ఎక్కడో  నాలుగో స్థానానికో అయిదో స్థానానికో పడిపోయింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి డిపాజిట్ గల్లంతయింది. అలాగే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇతర నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ కమలం కనీసం గౌరవప్రదమైన ఓటమికి కూడా నోచుకోలేదు. ఎక్కడా పట్టుమని పది సీట్లు గెలవలేదు. అంటే, బీజేపీ కథ మళ్ళీ  మొదటికి వచ్చింది.  ఇవన్నీ ఒకెత్తు అయితే, పార్టీలో, అంతర్గత విబేధాలు బుసలు కొడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, అనుకూల వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలి పోయిందా అనేవిధంగా, రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. అంతే కాదు, తెరాస అనుకూల వ్యతిరేక వర్గాలగానూ పార్టీలో కొందరు అటూ కొందరు ఇటూ అన్నట్లుగా  వ్యవహరించి  పార్టీకి తలవంపులు తెస్తున్నారు.ముఖ్యంగా జీహెచ్ఎంసిలో లిగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక, విషయంలో తలెత్తిన వివాదం, చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకగ్రీవం చేయాలని కోరుతూ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సహా కొందరు నాయకులు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్’ను కలవడంతో మొదలైన బండి వర్సెస్ స్టొరీ చివరకు సిట్టింగ్ స్థానంలో బీజేపీ ఓడిపోవడంతో మరో మలుపు తిరిగింది.  అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, ఒక్క నాగర్జున సాగర్ మినహా ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా, గొప్పగా జెండా ఎగరేయలేదు. మరో వంక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షాక్’కు గురైన అధికార తెరాస, పొంచి ఉన్న ప్రమాదాన్ని పసికట్టి, దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, కారు పార్టీ ఎన్నికల స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు, మున్సిపల్  ఎన్నికల వరకు పార్టీని విజయపధంలో ముందుకు నడిపించారు. అంతే కాదు, అదే ఊపులో, యువరాజ పట్టాభిషేకానికి అవరోధం అనుకున్న వారి అడ్డుతొలిగించే పనికి శ్రీకారం చుట్టారు.అయితే అలాగని పార్టీలో, అంతా బాగుందని అనుకుంటే, అది పొరపాటే అవుతుంది.  గతంలో కేసీఆర్ అనేక మంది పార్టీ సీనియర్లను, చివరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంత కీలక పాత్రను పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ సహా అనేక మందిని ఇదే తరహాలో, ఇంతకంటే అవమానకంరంగా సాగనంపినా, ఎవరూ కూడా కేసీఆర్’ను రాజకీయంగా దేబ్బతీయలేక పోయారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోదండరామ్ ఓడిపోయారు. అలాగే, తెరాస నుంచి వెలికి గురై సొంత కుంపట్లు పెట్టుకున్నవారు కానీ, ఇతర పార్టీలలో చేరినవారు కానీ, కేసీఆర్ నాయకత్వాన్ని సవాలు చేయలేక పోయారు. కానీ, మారిన  పరిస్థితుల్లో ఈటల నాయకత్వంలో కీసీఅర్ వ్యతిరక శక్తులు అన్నీ ఏకమయ్యేందుకు, ఏకం చేసేందుకు జరుగతున్నప్రయత్నాలు ఫలిస్తే, రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేక పోలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఈటల కొత్త పార్టీ పెట్టినా, మరో జాతీయ పార్టీతో పొట్టు లేకుండా, తెరాస, కేసీఆర్’ను ఎదుర్కోవడం సాధ్యం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అదలా ఉంటే, ఈటల వ్యవహారం కూడా బీజేపీలో చిచ్చుకు కారణం అయింది. ఈటల వ్యవహారంలో పార్టీ సీనియర్ నాయకుడు, మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఈటల పై వేటును పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షడు బండి సంజయ్ సహా పార్టీనాయకులు అందరు కేసీఆర్  ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నారు. ఈటలకు అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించారు. అయినా,  మోత్కుపల్లి మాత్రం అందుకు విరుద్ధంగా, బీసీ నేతకు మంత్రి పదవి ఇచ్చినందుకు, ఈటల ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకుని పూజ చేయాలని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని, అన్నారు. అయన ఈటల తీరును తీవ్రం తప్పు పట్టారు. ఇలా పార్టీ విధానానికి విరుద్ధంగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని, కేటీఅర్’ను కలసిన నాయకులపై చర్యలు తీసుకున్నట్లుగానే మోత్కుపల్లి పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని  కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి  పార్టీ క్రమశిక్షణ నిబంధనల విషయంలో కొంత కాలం పాటు, కొంత  వెసులుబాటు ఇవ్వాలని అంటున్నారు.  ఇదిలాఉంటే, రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తోంది. గీత దాటితే ఎవరినైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, మొత్తంగా చూస్తే, దుబ్బాక ఊపు, జీహెచ్ఎంసీ జోష్ చల్లారి, పార్టీ ఇమేజ్ మళ్ళీ మొదటికి వచ్చిందని, కొందరు పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే, జాతీయ స్థాయి పరిణామలు, ముఖ్యంగా కొవిడ్కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆశించిన  ఫలితాలు రాక పోవడం, పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని పార్టీ సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో  పార్టీ నాయకత్వం ఎరువు నేతల కోసం ఎదురు చూడకుండా,పార్టీని సంస్థాగతంగా, సిద్ధాంతపరంగా బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తేనే,ఎప్పటికైనా పార్టీకి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు.

కరోనా గురించి చెప్పడానికి మాటలు లేవు.. 

కరోనా  గురించి చెప్పడానికి మాటలు లేవు.. రాయడానికి పదాలు లేవు.. ఏదేమైనా కరోనా భార‌త్‌లో ముమ్మరంగా విస్తరిస్తుంది. విరుచుకు పడుతుంది. దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న‌ కొత్త‌గా 4,01,078  మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,18,92,676కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,79,30,960 మంది కోలుకున్నారు. 37,23,446 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,04,10,043 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,08,344 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. తెలంగాణలో కరోనా..  గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,559 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు రావడం తాజా బులెటిన్ లో చూడొచ్చు. అదే సమయంలో 8,061 మంది కరోనా నుంచి కోలుకోగా 41 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,199కి పెరిగింది. 4,13,225 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 71,308 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 2,666కి చేరింది. తెలంగాణ ప్రభుత్వం ఫీవర్ సర్వే..   కోవిడ్ నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 1,82,924 ఇళ్లలో సర్వే నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన ఈ సర్వేలో ప్రతి రోజు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్దఎత్తున చేపట్టాయి. ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. ఈ బృందాలు జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. నగరంలో ఇవాళ ఒక్కరోజే 720 బృందాలతో 53,002 ఇళ్లలో సర్వేను నిర్వహించారు.    

పుట్ట మధు అరెస్ట్‌.. ఈట‌ల టార్గెట్‌గానే..నా?

అనుకున్న్ట‌టుగానే అయింది. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధును భీమ‌వ‌రంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రామగుండం టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. అరెస్ట్‌తో వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పుట్ట మ‌ధు ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. పుట్ట మధు వారం రోజులుగా కనిపించకపోవడంతో ఆయన అదృశ్యానికి సంబంధించి కారణాలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని అంటున్నారు. అయితే, పైకి వామ‌న‌రావు కేసును చూపిస్తున్నా.. లోలోన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టార్గెట్‌గా పుట్ట మ‌ధును టార్గెట్ చేశార‌ని తెలుస్తోంది.  ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తర‌ఫ్ అయిన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు చాలా సన్నిహితుడు. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ పుట్ట మ‌ధు. ఇద్దరు వేరు వేరు జిల్లాల‌ నేత‌లు. కానీ తాజా ఈట‌ల ఎపిసోడ్‌లో పుట్ట మ‌ధు పేరు సైతం తెర‌పైకి వ‌చ్చింది. మాజీ మంత్రి ఈట‌ల‌పై భూక‌బ్జా కేసు ఫైల్ కాగానే.. పుట్ట మ‌ధు ఎస్కేప్‌. అప్ప‌టి నుంచీ ఇప్పుడు అరెస్ట్ అయ్యే వ‌ర‌కూ ఆయ‌న అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్‌. ఇంత‌కీ, ఈట‌ల వ్య‌వ‌హారంతో పుట్ట మ‌ధుకు ఏం సంబంధం? ఈట‌ల రాజేంద‌ర్‌పై కేసు న‌మోదైన‌ప్ప‌టి నుంచీ పుట్ట మ‌ధు ఎందుకు ప‌రారీలో ఉన్నారు?  వాళ్లిద్ద‌రి మ‌ధ్య మిలాఖ‌త్ ఏంటి?  తెర‌వెనుక జ‌రుగుతున్న రాజ‌కీయ కుట్ర ఏంటి? ఇవే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కాక రేపుతున్నాయి.  పుట్ట మ‌ధు. కొన్ని నెల‌ల క్రితం న‌డిరోడ్డు మీద జ‌రిగిన‌ లాయ‌ర్ వామ‌న‌రావు దంప‌తుల హ‌త్య‌లో.. పుట్ట మ‌ధు పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. పుట్ట మ‌ధు నేర చ‌రిత్ర‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ఈ కేసులో పట్ట మధు మేనల్లుడు కీలక సూత్రదారిగా తేల్చారు పోలీసులు. ఆ త‌ర్వాత అంతా సైలెంట్‌. ఇటీవ‌ల స‌డెన్‌గా ఈట‌లపై భూక‌బ్జా కేసు న‌మోద‌వ‌డం.. మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం జరిగిపోయాయి. మాజీ మంత్రిపై మ‌రింత ఉచ్చు బిగించేందుకు ఆయ‌న గ‌తాన్ని త‌వ్వి పోస్తున్నారు పోలీసులు. ఈ విష‌యం తెలిసి పుట్ట మ‌ధు ఉలిక్కిప‌డ్డాడని అంటున్నారు. ఎందుకంటే, ఈట‌ల‌తో ప‌లు వ్య‌వ‌హారాల్లో, దందాల్లో ఆయ‌న‌కూ ప్ర‌ధాన భాగ‌స్వామ్యం ఉంద‌ని అంటున్నారు. ఇప్పుడు ఈట‌ల‌ను ఆ కేసుల్లో ఇరికించాలంటే.. పుట్ట మ‌ధును కార్న‌ర్ చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన మ‌ధు.. రాత్రికి రాత్రే  ప‌త్తా లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది.      మ‌ధు ఎక్క‌డు ఉన్నాడ‌నేది ఇన్ని రోజులూ మిస్ట‌రీగా మారింది. మంథ‌ని నుంచి నేరుగా మ‌హారాష్ట్ర‌కు వెళ్లిన‌ట్టు స‌మాచారం. ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారమూ జ‌రిగింది. మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్‌, వేముల ప్ర‌శాంత్‌ల స‌హాయంతో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు.. త‌న కుటుంబ స‌భ్యుల ద్వారా పుట్ట మ‌ధు ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈట‌ల‌తో ఇన్నేళ్లూ స్నేహం చేసిన మాట వాస్త‌వ‌మే అయినా.. ప్ర‌స్తుతం ఇక ఆయ‌న‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోనంటూ సీఎం ముందు స‌రెండ‌ర్ అయ్యేందుకు మ‌ధు ట్రై చేశాడ‌ని అన్నారు.   అయితే, పుట్ట మ‌ధు.. సీఎం కేసీఆర్‌ను క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం తెగ ప్ర‌య‌త్నించినా దొర‌క‌లేద‌ట‌. కేసీఆర్‌ను క‌లిసి కాంప్ర‌మైజ్ కావాల‌ని త‌న గాడ్‌ఫాద‌ర్స్‌తో అన్ని విధాలుగా లాబీయింగ్ చేశాడ‌ట‌. ఈ లోగా భీమ‌వ‌రంలో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పుట్ట మ‌ధును అదుపులోకి తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వామ‌న‌రావు దంప‌తుల మ‌ర్డ‌ర్ కేసునా?  లేక‌, ఈట‌ల భూదందాల విష‌య‌మై ఆరా తీసేందుకా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. మాజీ మంత్రి ఈట‌ల డొంక క‌దిలించ‌డానికి.. పుట్ట మ‌ధు తీగ‌ను లాగుతుండ‌టం.. తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తెలంగాణాలో ఆక్సిజన్ స్పీడ్.. 

దేశం అంతటా ఆక్సిజన్ కొరత ఉంది. తెలంగాణాలో కూడా ఆ ఆక్సిజన్ కొరత లేకపోలేదు. సకాలంలో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది ఆ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుండి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటుంది. అందుకు సంబందించిన పనులను వేగవంతం చేస్తుంది.  తెలంగాణలో మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాను వేగవంతం చేయడంతో పాటు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ, టీఎస్‌ఆర్టీసీ అధికారులతో బీఆర్కే భవన్‌లో సీఎస్ సమావేశమయ్యారు. ఒడిషాలోని అంగూరు, కర్ణాటకలోని బళ్లారి నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా వేగవంతంగా జరిగేలా నిపుణులతో బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో చర్చించి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కు  గ్రీన్ ఛానల్ సదుపాయం కల్పించేలా చూడాలన్నారు. తద్వారా రవాణాకు పట్టే సమయం ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గుతుందని సీఎస్‌ తెలిపారు.   మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు మెకానిక్స్, ఇతర నిపుణులను కూడా పంపాలని సూచించారు. కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ల ద్వారా సులువుగా తరలించేలా ట్యాంకర్లకు అవసరమైన మార్పులు చేయాలన్నారు. ట్యాంకర్ల రవాణా ప్రక్రియ నిరంతరం సాఫీగా సాగేలా డ్రైవర్లు, మెకానిక్స్‌తో బృందాలను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 30 ట్యాంకర్లకు అదనంగా ప్రైవేటు గుత్తేదార్ల నుంచి అదనపు ట్యాంకర్లను సమకూర్చుకోవాలని సీఎస్ ఆదేశించారు.       

 భార్యను మర్డర్.. డాటర్ పై టీచర్..

సదుకున్నోడి  కంటే అదేదో కులం వాడు మేలు అన్నట్లు ఉంది. సమాజం లో అక్షర జ్ఞానం లేని వాడు ఏదైనా నేరం చేస్తే అజ్ఞానం లో చేశాడు అని అనుకోవచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు చేస్తే.. ఆ చదువుకు అర్ధం ఏంటి..? అది కూడా అజ్ఞానమే అనాలా.. లేక విజ్ఞానం ఎక్కువై వికృతం చేశాడు అనాలా... ఈ ప్రపంచంలో లో మనిషి జీవితం చాలా ఉన్నతమైనది. కానీ ఆ మనిషి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. అర్ధాన్ని మారుస్తున్నారు. చివరికి మనిషి మానవత్వాన్ని మారుస్తున్నాడు. బంధాలను వీడుతున్నాడు. వరసలు మరిచి వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. బహుశా అంతమవ్వడానికి అనుకుంటాను. తన రక్తం పంచుకుని పుట్టిన వారి పైనే వంకరగా ప్రవర్తిస్తున్నాడు. తల్లి, చెల్లి, కూతురు అని తేడాలేకుండా అత్యాచారానికి పాలుపడుతున్నాడు. అసలు ఏం జరిగిందో మీరే చూడండి.   మీ అమ్మను  చంపేశా. నిన్నూ చంపేస్తా. తర్వాత నేను చచ్చిపోతా’.. ఎక్కడో సినిమాలో డైలాగ్ లా ఉందనుకుంటున్నారా..? కానే కాదు.. ఈ మాటలు ఎవరో ఆగంతుకుడు, అపరిచితుడు అన్న మాటలు కాదు. సాక్షాత్తు ఓ కసాయి తండ్రి తన కుమార్తెతో అన్నవి. మాటలతో సరిపెట్టు కోవడమే కాదు. అన్నంత పని చేసి చివరికి కట్టుకున్న భార్యను కడతేర్చిన ఆ పైశాచికుడు.. ఆ తరువాత కన్న కూతురిపై హత్యాయత్నానికి పాల్పడుతూ.. స్థానికులు రావడాన్ని గుర్తించి.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.  ఓపెన్ చేస్తే అది నెల్లూరు. బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ నగర్‌.  ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని వాకముళ్లవారిపాలేనికి చెందిన బ్రహ్మారెడ్డికి ఏఎస్‌పేట మండలం శ్రీకొలను గ్రామానికి చెందిన రమణమ్మ(46)తో 20 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఖ్యాతి లక్ష్మీశాయి ఈశ్వరి అనే కుమార్తె ఉంది. బ్రహ్మారెడ్డి తన కుటుంబంతో కలిసి ఆరేళ్లకిందట నెల్లూరుకు వచ్చారు. ఎన్టీఆర్‌ నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.. దాన్ని మానేసి వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. తెలిసివారికి అప్పులు ఇచ్చేవాడు. కొందరు తీసుకున్న నగదు చెల్లించకపోవడంతో వ్యాపారంలో నష్టాలొచ్చాయి. నగదు విషయమై భార్యభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఘర్షణలు కూడా జరిగాయి. ఇటీవల బ్రహ్మారెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు నగదు విషయమై భార్య ఒత్తిడి తాళలేక... చంపేస్తానని తల్లి, కుమార్తెను బెదిరించడం ప్రారంభించాడు.  కట్ చేస్తే.. ఆ క్రమంలోనే శుక్రవారం రమణమ్మ హాలులో నిద్రిస్తుండగా- ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం జ్వరంతో బాధపడుతూ పడకగదిలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లి.. ‘మీ అమ్మను హత్య చేశా.. నిన్ను చంపేస్తా’నంటూ దాడి చేశాడు. అప్రమత్తమైన ఆమె.. తండ్రి నుంచి తప్పించుకుని కిందకు పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని అక్కడున్న వారికి, బంధువులకు తెలిపింది. ఇంతలో బ్రహ్మారెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ మేరకు హతురాలి కుమార్తె ఖ్యాతి లక్ష్మీశాయి ఈశ్వరి బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లిని హత్య చేసిన తండ్రిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఇన్‌స్పెక్టర్‌ మంగారావు, ఎస్సై అంకమ్మ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.          

వ్యాక్సిన్ బంద్‌!.. చేతులెత్తేసిన తెలుగు స్టేట్స్..

క‌రోనాకు స‌రైన మందు లేదు. నివార‌ణ ఒక్క‌టే మార్గం. అందుకు, వ్యాక్సిన్ ఏకైక మార్గం. ఇంత‌టి కీల‌క‌మైన వ్యాక్సిన్‌కు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా తీవ్ర కొర‌త‌. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం, పాల‌కుల ఉదాసీన వైఖ‌రే ఇందుకు కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు. ఓవైపు దేశంలో నిత్యం 4 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూ వైర‌స్ వ‌ణికిస్తోంది. మ‌రోవైపు, ఆక్సిజ‌న్ కొర‌త‌, బెడ్స్.. మెడిసిన్‌ షార్టేజ్‌తో ఆందోళ‌న పెరుగుతోంది. ఇంత‌టి క‌రోనా క‌ల్లోలంలో వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మ‌న‌ముందున్న ఆశాకిర‌ణం. క‌రోనా బారి నుంచి కాపాడే బ్ర‌హ్మ‌స్త్రం.  కీల‌క‌మైన వ్యాక్సినేష‌న్ విష‌యంలో అనేక అవ‌రోధాలు, ఆటంకాలు. ప్ర‌భుత్వాలకు స‌రైన ముందుచూపు లేక‌పోవ‌డంతో.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ అర‌కొర‌గా సాగుతోంది. తెలంగాణ స‌ర్కారు శ‌నివారం నుంచి ఏకంగా తొలి డోసు వ్యాక్సినేష‌న్‌ను ఆపేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. టీకాల కొర‌తే ఇందుకు కార‌ణ‌మ‌ని చెబుతోంది. ఈ నెల 15 వ‌ర‌కు క‌రోనా టీకా మొద‌టి డోసు ఇవ్వ‌డం ఆపేస్తున్న‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అయితే.. తొలి డోసు ఆపేసినా.. రెండో డోసు టీకా కార్య‌క్ర‌మం మాత్రం కొన‌సాగ‌నుంది. తెలంగాణ‌లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.   గతంలోనే దాదాపు 30 లక్షల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు కావాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేవలం 15 నుంచి 16 లక్షల డోసులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డోసుల కొరత కారణంగా ఇప్పటికే మూడు, నాలుగు సార్లు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆరోగ్య శాఖ నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడడంతో రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తొలి డోసు ప్రక్రియను నిలిపివేస్తూ కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని తాజాగా ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.   అటు, మ‌రో తెలుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ టీకాల కార్య‌క్ర‌మం న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఆల‌స్యంగా మేలుకోవ‌డంతో ఓపెన్ మార్కెట్లో వ్యాక్సిన్‌లు దొర‌క‌ని పరిస్థితి నెల‌కొంది. కోట్ల‌లో వ్యాక్సిన్ డోసుల అవ‌స‌రం ఉండ‌గా.. కేవ‌లం ల‌క్ష‌ల్లో మాత్ర‌మే ఆర్డ‌ర్ పెట్ట‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఇప్ప‌టికే మేలో ప్రారంభం కావాల్సిన‌ 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి టీకా ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసింది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. ఎందుకోగానీ, రాష్ట్రం త‌ర‌ఫున వ్యాక్సిన్‌లు కొనుగోళ్ల‌కూ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. స‌రిప‌డా టీకాలు ఉంటేనే వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం చేప‌డ‌తామ‌ని తాజాగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డం ఆందోళ‌న రేపుతోంది. టీకాల కొనుగోలుకే ఏపీ స‌ర్కారు అర‌కొర ఆర్డ‌ర్లు ఇవ్వ‌గా.. ఇక స‌రిప‌డా వ్యాక్సిన్లు ఎక్క‌డి నుంచి వ‌స్తాయ‌ని విప‌క్షం ప్ర‌శ్నిస్తోంది.  దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇమ్మని కేంద్రం స్పష్టం చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పటం తగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్‌ కోసం రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టకుండా కేంద్రం అనుమతులు లేవంటూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రభుత్వ సహకారం లేనిదే కరోనా నియంత్రణ సాధ్యం కాదని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ గళం గట్టిగా వినిపించి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  కరోనా వైరస్‌ రెండో దశ 20ఏళ్లు పైబడిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడో దశలో చిన్నారులపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగానే సమగ్ర ప్రణాళికలు చేపడితే భవిష్యత్తు ప్రమాదాలను నివారించగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  

కర్నూల్ లో చంద్రబాబుపై కేసు 

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కర్నూలులో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు భయపెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదును స్వీకరించిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు, చంద్రబాబుపై 188, 505/1/బి/2, 54 సెక్షన్లు, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు.  ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏపీలో గుర్తించిన కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరించారు. అత్యంత వేగంగా విస్తరించడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఏపీ నుంచి వచ్చేవారిపై అంక్షలు విధించింది ఢిల్లీ సర్కార్. ఒడిశా సర్కార్ కూడా ఆంక్షలు అమలు చేస్తోంది. ఏపీ వైరస్ డేంజర్ కాబట్టే రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు. ఏపీలో కోవిడ్ పరిస్థితులపై పార్టీ నేతలతో సమీక్షించిన చంద్రబాబు... ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కరోనా విజృంభిస్తున్నా సరిగా స్పందించడం లేదని మండిపడ్డారు. వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు.  రోజుకు 20 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 25 శాతానికి పెరిగింది. అయినా సీఎం కరోనాపై సమీక్షలు జరపడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్‌ ట్యాంకులు, కరెంటు స్తంభాలకు వైసీపీ రంగులు వేయడానికి... తీయడానికి రూ.3,000 కోట్లు తగలేశారు. ఆ మాత్రం ఖర్చు కూడా వ్యాక్సిన్లపై చేయలేరా? ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.45 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకొంటారా? ప్రజల ప్రాణాలు కాపాడే పద్ధతి ఇదేనా’’ ప్రశ్నించారు. వ్యాక్సిన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాలని సూచించారు.  రాష్ట్రప్రభుత్వానికి చంద్రబాబు సలహాలు ఇస్తే వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న 108, 104 వాహనాలు అందుబాటులో  లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే జేబులు గుల్లవుతున్నాయని మాజీ మంత్రి అయ్యన్న చెప్పారు. కరోనా పరీక్షలు చేయించుకొన్న వారికి ఫలితం రావడానికి 4 రోజులు పడుతోందని, ఈలోపు కు టుంబంలో అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తోందని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కామెంట్లపై సుబ్బయ్య ఫిర్యాదు చేయడంతో కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పుట్ట మ‌ధు ఎక్కడ? ఈట‌ల కేసుతో లింకుందా?  

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ పుట్ట మ‌ధు. ఇద్దరు వేరు వేరు జిల్లాల‌ నేత‌లు. కానీ తాజా ఈట‌ల ఎపిసోడ్‌లో పుట్ట మ‌ధు పేరు సైతం తెర‌పైకి వ‌స్తోంది. మాజీ మంత్రి ఈట‌ల‌పై భూక‌బ్జా కేసు ఫైల్ కాగానే.. పుట్ట మ‌ధు ఎస్కేప్‌. అప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్‌. ఫ్యామిలీకీ కాంటాక్ట్‌లో లేడు. అస‌లాయ‌న ఎక్క‌డున్నాడో పోలీసులూ స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. ఇంత‌కీ, ఈట‌ల వ్య‌వ‌హారంతో పుట్ట మ‌ధుకు ఏం సంబంధం? ఈట‌ల రాజేంద‌ర్‌పై కేసు న‌మోదైన‌ప్ప‌టి నుంచీ పుట్ట మ‌ధు ఎందుకు ప‌రారీలో ఉన్నారు?  వాళ్లిద్ద‌రి మ‌ధ్య మిలాఖ‌త్ ఏంటి?  తెర‌వెనుక జ‌రుగుతున్న రాజ‌కీయ కుట్ర ఏంటి? ఇవే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కాక రేపుతున్నాయి.  పుట్ట మ‌ధు. కొన్ని నెల‌ల క్రితం న‌డిరోడ్డు మీద జ‌రిగిన‌ లాయ‌ర్ వామ‌న‌రావు దంప‌తుల హ‌త్య‌లో.. పుట్ట మ‌ధు పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. పుట్ట మ‌ధు నేర చ‌రిత్ర‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ఈ కేసులో పట్ట మధు మేనల్లుడు కీలక సూత్రదారిగా తేల్చారు పోలీసులు. ఆ త‌ర్వాత అంతా సైలెంట్‌. ఇటీవ‌ల స‌డెన్‌గా ఈట‌లపై భూక‌బ్జా కేసు న‌మోద‌వ‌డం.. మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం జరిగిపోయాయి. మాజీ మంత్రిపై మ‌రింత ఉచ్చు బిగించేందుకు ఆయ‌న గ‌తాన్ని త‌వ్వి పోస్తున్నారు పోలీసులు. ఈ విష‌యం తెలిసి పుట్ట మ‌ధు ఉలిక్కిప‌డ్డాడని అంటున్నారు. ఎందుకంటే, ఈట‌ల‌తో ప‌లు వ్య‌వ‌హారాల్లో, దందాల్లో ఆయ‌న‌కూ ప్ర‌ధాన భాగ‌స్వామ్యం ఉంద‌ని అంటున్నారు. ఇప్పుడు ఈట‌ల‌ను ఆ కేసుల్లో ఇరికించాలంటే.. పుట్ట మ‌ధును కార్న‌ర్ చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన మ‌ధు.. రాత్రికి రాత్రే  ప‌త్తా లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది.      మ‌ధు ఎక్క‌డు ఉన్నాడ‌నేది ఇప్పుడు మిస్ట‌రీగా మారింది. హైద‌రాబాద్ వెళ్తున్నానంటూ మంథ‌ని నుంచి బ‌య‌లుదేరిన మ‌ధు.. న‌గ‌రానికి చేరుకోలేద‌ని తెలుస్తోంది. మంథ‌ని నుంచి నేరుగా మ‌హారాష్ట్ర‌కు వెళ్లిన‌ట్టు స‌మాచారం. ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారమూ జ‌రుగుతోంది. మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్‌, వేముల ప్ర‌శాంత్‌ల స‌హాయంతో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు.. త‌న కుటుంబ స‌భ్యుల ద్వారా పుట్ట మ‌ధు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈట‌ల‌తో ఇన్నేళ్లూ స్నేహం చేసిన మాట వాస్త‌వ‌మే అయినా.. ప్ర‌స్తుతం ఇక ఆయ‌న‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోనంటూ సీఎం ముందు స‌రెండ‌ర్ అయ్యేందుకు మ‌ధు ట్రై చేస్తున్నార‌ని అంటున్నారు.  అయితే, పుట్ట మ‌ధు.. సీఎం కేసీఆర్‌ను క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తున్నా.. దొర‌క‌డం లేద‌ట‌. ఆ లోగా ఏ పోలీసులో త‌న‌ను ఏదో ఓ కేసులో క‌స్ట‌డీకి తీసుకోక‌ముందే.. కేసీఆర్‌ను క‌లిసి కాంప్ర‌మైజ్ కావాల‌ని త‌న గాడ్‌ఫాద‌ర్స్‌తో అన్ని విధాలుగా లాబీయింగ్ చేస్తున్నాడ‌ట‌. ఈట‌ల విష‌యంలో కేసీఆర్ నుంచి అభ‌యం వ‌చ్చే వ‌ర‌కూ..  అజ్ఞాతం వీడేది లేదంటున్నాడ‌ట పుట్ట మ‌ధు. మాజీ మంత్రి ఈట‌ల డొంక క‌దిలించ‌డానికి.. పుట్ట మ‌ధు తీగ‌ను లాగుతుండ‌టం.. తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సంగంలో మ‌ళ్లీ సోదాలు.. హైకోర్టు ఆదేశాలు బేఖాత‌రు..

హైకోర్టు చెప్పినా విన‌టం లేదు. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరు మార‌డం లేదు. పాల‌కుల ఒత్తిడితో పోలీసులు సంగం డెయిరీ మీద కుట్ర‌లు ఆప‌డం లేదు. సాక్షాత్తూ రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పునే తుంగ‌లో తొక్కుతున్నారు. న్యాయ‌స్థానం ఆదేశాల‌కూ బెద‌ర‌కుండా బ‌రితెగిస్తున్నారు. మ‌రోసారి సోదాల పేరుతో సంగం డెయిరీ రోజువారీ కార్య‌క్ర‌మాల డేటాను త‌స్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. డెయిరీ సిబ్బంది ఎదురు తిర‌గ‌డంతో సంస్థ కార్యాల‌యం ముందు ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు వెంట‌నే సోదాలు ఆపి అక్క‌డి నుంచి వెళ్లిపోవాలంటూ ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగడంతో హైటెన్ష‌న్ నెల‌కొంది.  శుక్ర‌వారం ఉద‌యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనంపై సర్కార్ ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంగం డెయిరీని ఏపీ డెయిరీలో విలీనం చేస్తూ సర్కార్ ఇచ్చిన జీవో చెల్లదని  హైకోర్టు స్పష్టం చేసింది. సంగం డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుత డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోజువారి డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుత డైరెక్టర్లు పర్యవేక్షించాలని సూచించింది ధర్మాసనం. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది .  సంగం డైయిరీలో ఏసీబీ సోదాలు పేరిట డేటా చౌర్యం జరగబోతోందని పాలకవర్గం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఎఫ్ఐఆర్లో తెలిపిన అంశాలు మినహా.. మిగతా పాల కొనుగోళ్లు, అమ్మకాలు, మార్కెటింగ్ తదితర విషయాలలో ఏసీబీ పోలీసులు జోక్యం చేసుకోరాదని.. డేటాను యాక్సెస్ చేయడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ధ‌ర్మాస‌నం ఇంత సుస్ప‌ష్టంగా ఆదేశాలు ఇచ్చినా.. తీర్పు వెలువ‌డిన కొన్ని గంట‌ల్లోనే ఏసీబీ మ‌ళ్లీ సంగం డెయిరీలో చొర‌బ‌డింది. త‌నిఖీల పేరుతో.. సంగం డెయిరీ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. సోదాలంటూ రోజువారీ కార్య‌క‌లాపాల డేటాను హ్యాక్ చేసి ప‌రిశీలిస్తుండ‌గా.. డెయిరీ సెక్యూరిటీ వింగ్ ఆ విష‌యాన్ని గుర్తించారు. వెంట‌నే సోదాల‌ను ఆపేయాల‌ని ఉద్యోగులంతా ధ‌ర్నాకు దిగారు. ఏసీబీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. వంద‌లాది మంది సిబ్బంది ధ‌ర్నాతో సంగం డెయిరీ కార్యాల‌యం ముందు తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. హైకోర్టు ఆదేశాల‌ను ఇంత బ‌హిరంగంగా ఉల్లంఘించ‌డంపై సంగం ఉద్యోగులు మండిప‌డుతున్నారు. త‌నిఖీల‌ను కోర్టు దృష్టికి తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.   

ఏపీలో కరోనా శరవేగం.. 

ఏపీలో కరోనా వేగం పెరుగుతుంది. కరోనా తీవ్రత రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. గతంలో పది వేలకు పైగా కేసులు వెలుగుచూడగా, సెకండ్ వేవ్‌లో 20 వేలకు పైగా కొత్త కేసులు రోజువారీగా నమోదవు తున్నాయి. దీనికి తోడు ప్రతీరోజు మరణాలు కూడా హాఫ్ సెంచరీ దాటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం 10 రోజుల్లో 18 మంది మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతులంతా వాంతులు, వీరేచనాలు, గుండెపోటు వంటి లక్షణాలతో మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు కరోనా కారణమా, కలుషిత నీరు కారణమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వరుస మరణాలకు గల కారణాలంటే తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రతిఒక్కరూ కరోనా టెస్టు చేయించుకోవాలని సర్పంచ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జగన్ పై సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు..   ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కదిరిలో 24 గంటల్లో కరోనాతో 8 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కదిరి ప్రాంతంలో 24 గంటల్లోనే ఇంత మంది మరణించడం చాలా బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు  రామకృష్ణ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు.. ప్రభుత్వంపై ప్రశ్నలు, విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతటా మృత్యు ఘంటికలు మోగుతున్నా.. జగన్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.

కరోనాపై ఇద్దరు సీఎంల ట్వీట్ రచ్చ! 

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృందం మోగిస్తోంది. రోజురోజుకు మరణాలు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్స్ నిండిపోవడంతో కరోనా రోగులకు చికిత్స అందడం లేదు. ఆక్సిజన్ అందక చూస్తుండగానే పిట్టల్లా రాలిపోతున్నారు. కోవిడ్ కట్టడిపై కేంద్రం సీరియస్ యాక్షన్ చేపట్టింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడి చర్యలపై సమీక్షించారు.  ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కాస్త అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు. గౌరవనీయ ప్రధానమంత్రి తనతో మాట్లాడారని, కానీ ఆయన ఏమనుకుంటున్నారో అదే చెప్పారు తప్ప, తన మాటలేవీ ఆయన వినిపించుకోలేదని సోరేన్ వాపోయారు. కరోనా కష్టకాలంలో ఏంచేయాలో దాని గురించి మాట్లాడితే బాగుండేదని, తాము తీసుకుంటున్న చర్యల గురించి వింటే సంతృప్తికరంగా ఉండేదన్నారు.  ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ ట్వీట్ ద్వారా స్పందించారు."డియర్ హేమంత్ సొరేన్... మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఓ సోదరుడిగా మిమ్మల్ని కోరేదేమిటంటే... మనమధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో విమర్శనాత్మక రాజకీయాలు సరికాదు. అవి దేశాన్ని మరింత బలహీనపరుస్తాయి. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో ఒకరిని వేలెత్తి చూపేందుకు ఇది తగిన సమయం కాదు. అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రధాని మోదీకి మరింత మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. మనందరం మోదీకి సంఘీభావం ప్రకటిస్తే ఆయన కరోనా మహమ్మారిపై మరింత సమర్థంగా యుద్ధం చేయగలరు" అని సీఎం జగన్ హితవు పలికారు.  

అక్క, తమ్ముడి లవ్.. పెద్దల పరేషాన్.. 

ప్రేమ.. ఈ పేరు చెప్పుకొని ఆ ప్రేమ చాటున చేయని తప్పులు లేవు. ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధానికి,  ప్రేమ అని పేరు పెట్టి, ఆ ముసుగులో ఎన్నో తప్పులు చేస్తున్నారు నేటి యువత. ఎవరి మీద ప్రేమ పుట్టాలి, ఎలాంటి పుడుతుంది  అని ఆలోచించడం లేదు. ఒక అక్క , ఒక తమ్ముడు. ఒక అన్న , మరో చెల్లెలు, 30 ఏళ్ళ ఉన్న ఆవిడ. 19 సంవత్సరాలు ఉన్న అబ్బాయి, స్కూల్ టీచర్ స్టూడెంట్ ఇలా ఒక్కటే రెండా.. ? ఏ పేపరు తిరిగేసిన, ఏ టీవీ మార్చిన నిత్యం ఈ వార్తలే తరసపడుతాయి. నేటి సమాజంలో  ప్రేమ ఎవరి మధ్య పుడుతుందో ..? ఎప్పుడు పుడుతుందో అర్ధం కావడం లేదు. వారలేదు వావి లేదు హోలీ.. చెమ్మకెలీలా హోలీ అని పాట పడుకున్నట్లు.  వావి వరసలు మరిచి యువత ప్రేమ మోజులో మునిగి  తప్పులు  చేస్తున్నారు. వారి తల్లిదండ్రులను రోడ్డున పడేలా చేస్తున్నాయి. ప్రేమించడం తప్పు కాదు.. కానీ వావివరసలు మరిచి ప్రేమించడం తప్పు.  ఓపెన్ చేస్తే..  అది మెదక్ జిల్లా. పట్టణంలో  ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఓ విద్యార్థిని, కరోనా కారణంగా కాలేజ్ కి సెలవులు కావడంతో యువకుడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని బయటకు వెళ్లడం మొదలుపెట్టింది.  కట్ చేస్తే.. ఆ అమ్మాయి ప్రేమించింది పక్కింటి అబ్బాయినో.. అత్త కొడుకునో.. ఏ బావ నో, ఏ తన తోటి విద్యార్థినో కాదు.. తన సొంత బాబాయ్ కొడుకు, వరసకు తమ్ముడు అయ్యే యువకునితో ప్రేమలో పడింది. ప్రేమతో ఆపకుండా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అతడితో కలిసి వెళ్ళిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు ఊర్లో తలెత్తుకోలేని పరిస్థితి దాపురించింది.  ఇంట్లో వాళ్లిదరి వ్యవహారం చూసిన అక్కా, తమ్ముడే కదా అని ఎవరు వారిని పట్టించుకోలేదు. ఇలా కొన్నిరోజులు సాగిన వీరి ప్రేమాయణం, పెళ్లి చేసుకోవాలనుకొనేవరకు వచ్చింది. విషయం తెలిస్తే ఇంట్లో ఒప్పుకోరని అనుకున్న ఈ అక్కాతమ్ముళ్లు ఇంట్లోనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లపోవడానికి ప్లాన్ వేసింది. తమ్ముడిని ఇంటికి రప్పించి ఇంట్లో ఉన్న నానమ్మకు  తమ్ముడితో కలిసి మామిడి తోటకు వెళ్తున్నా అని అబద్దం చెప్పి అతడితో వెళ్ళిపోయింది. సాయంత్రం పనినుండి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురికోసం ఆరాతీయగా తమ్ముడితో కూతురు వెళ్లిపోయిందని తెలిసి కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్కాతమ్ముళ్ల  కోసం గాలింపు చర్యలు చేపట్టారు.         

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

తమిళనాడులో కొత్త సర్కార్ కొలువు దీరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే వరాల జల్లు కురిపించారు స్టాలన్.  తొలి రోజే ఆయ‌న కీల‌క ఉత్త‌ర్వుల‌పై సంత‌కాలు చేశారు.  ప్ర‌భుత్వ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణించే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు స్టాలిన్. రేష‌న్ కార్డు ఉన్న దాదాపు రెండు కోట్ల కుటుంబాల‌కు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సాయాన్ని కొవిడ్ ఆర్థిక‌ సాయం కింద ఇస్తున్న‌ట్లు  వివ‌రించారు. ఇందులో భాగంగా తొలి విడ‌త కింద త్వ‌ర‌లో రూ.2 వేల చొప్పున జ‌మ చేస్తామ‌ని తెలిపారు. త‌మిళ‌నాడు వ్యాప్తంగా లీట‌రు పాల‌పై రూ.3 త‌గ్గిస్తూ త‌మిళ‌నాడు కొత్త‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వందరోజుల్లో  అమలు చేసేందుకు స్టాలిన్ కార్యాచరణ ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాకు. క‌రోనా వేళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్ర‌జ‌ల‌కు స్టాలిన్ సర్కార్ ప్ర‌క‌టించిన వ‌రాలు ఉపశ‌మ‌నం క‌లిగించేలా ఉన్నాయి.