ఘర్షణాత్మక స్థాయి దాటిన గవర్నర్, తెరాస సర్కార్ విభేదాలు!
వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం ఎంత మాత్రం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటున్న రాష్ట్రాలలో గవర్నర్లు చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి.
గతంలో బెంగాల్ లో ధన్కడ్ వ్యవహరించిన విధానం, తమిళనాడులో గవర్నర్ తీరు, ఇక కేరళలో అయితే చెప్పనవసరం లేదు, ఏకంగా మంత్రుల్ని తీసేయాలని కూడా గవర్నర్ ఆదేశాలిచ్చేస్తున్నారు. జార్ఖండ్లో గవర్నర్ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉన్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇక తెలంగాణలో అయితే అయితే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక స్థాయి దాటేసిందనడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లలను గవర్నర్ తిరస్కరించడమూ లేదు.. ఆమోదించడమూ లేదు. పెండింగ్ లో పెట్టేసి వివరణ ఇవ్వాలంటూ మంత్రులకు సమాచారం ఇస్తున్నారు. యూనివర్శిటీలకు సంబంధించిన ఓ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం యూనివర్శిటీలకు చాన్సలర్గా గవర్నర్ ఉంటారు.
కానీ అది గౌరవ మర్యాదల వరకే. పాలన అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై మాత్రం ఈ బిల్లులపై చర్చించాలని.. కొన్ని డౌట్స్ క్లియర్ చేయాలని విద్యా మంత్రి సబితకు ఏకంగా ఆదేశాలిచ్చేశారు. మంత్రి సబిత అయితే.. తనకు ఎలాంటి ఆదేశాలు లేఖ రాలేదని.. అందువల్ల తనకు రాజ్ భవన్కు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు.
ఒక్క యూనివర్శిటీలకు సంబంధించిన సవరణ బిల్లులే కాకుండా.. మరో నాలుగైదు బిల్లులు రాజ్ భవన్లోనే పెండింగ్ లో ఉన్నాయి. అలా అనే కంటే తిరస్కరణకూ, ఆమోదానికీ కూడా నోచుకోకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. గత అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటి నుంచి పరిస్థితి స్టాండ్ స్టిల్ గా అలాగే ఉంది. వాటికి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే గెజిట్ విడుదల చేసి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ వాటిని వెనక్కి పంపితే.. తెలంగాణ సర్కార్ ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. కానీ అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా తమిళిసై చేస్తున్న రాజకీయం టీఆర్ఎస్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
నిజానికి, ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య ఘర్షణాత్మక వైఖరి పాలనకు అవరోధంగా ఉంది. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ సీఎం కేసీఆర్ ఘర్షణాత్మక వైఖరి ఒక్క గవర్నర్’తో మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీతో కూడా. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించలేదు. ముఖం చాటేశారు.
సరే అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్’గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్ మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు.
ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలనే తానీ విషయం చెబుతున్నారని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు. ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని ఆమె గుర్తు చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని ఈ సందర్భంగా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని తమిళిసై చెప్పారు. తనకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్భవన్ను గౌరవించాలి కదా అని కూడా ఆమె అంటున్నారు.
ఎన్నో యూనివర్సిటీలు, హాస్టళ్లను సందర్శించానని, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని గవర్నర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యలు చూసి చలించిపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాశానని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించానని తమిళిసై చెప్పారు.నిజానికి,గడచిన మూడు సంవత్సరాలు అనేకంటే, హుజురాబాద్’ పరాభవం మొదలు ముఖ్యమంత్రిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ ఓటమి తర్వాతనే ముఖ్యమంత్రి అటు ప్రధాని మోడీ ఇటు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’ తో దూరం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు.
రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి మాత్రమే ముఖ్యమంత్రి రాజ్ భవన్ గడప తొక్కారు. మరో వంక స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగానూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ , ముఖ్యమంత్రి ఎవరి దారి వారిది అన్నట్లుగా ఎడముఖం పెడ ముఖంగానే ఉంటున్నారు. చివరకు, రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో, గవర్నర్ ప్రసంగం లేకుండానే సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
మరో వంక గవర్నర్ ప్రొటోకాల్ వివాదం ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి, ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం సృష్టించాయి. కాగా, రాజ్యాంగబద్ద వ్యవస్థల మధ్య ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదని ఇలాంటి పరిస్థితి చిలికి చిలికి గాలివానగా మారి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేక పోలేదని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా వర్సిటీ నియామకాల విషయంలో మరో సారి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణాత్మక వైఖరి బట్టబయలైంది. ఇదెంత వరకూ దారి తీస్తుందో చూడాలి.