అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమైంది?
posted on Nov 9, 2022 @ 2:38PM
ఒక ఎమ్మెల్యే అధికారులపై మండిపడతారు. మరో ఎమ్మెల్యే మహిళలను వెటకారం చేస్తారు. ఇంకో ఎమ్మెల్యే బూతులే స్తోత్రాలు మాదిరిగా మాట్లాడతారు. ఒక ఎమ్మెల్యే ప్రజల్ని ప్రాంతీయ విభేదాలతో రెచ్చగొడతారు. ఇంకొకరైతే రాజీనామా పేరుతో ఒక డ్రామాకు తెరలేపుతారు. ఒక మహిళా ఎమ్మెల్యే.. ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా ‘మధ్య వేలు’ చూపించి మరీ యువతను రెచ్చగొడతారు. మరో ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ మంత్రి చొక్కా చేతులు మడతపెట్టి రౌడీలా రంకెలు వేస్తారు. మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయితే.. ప్రతి మాటలోనూ వెటకారం నింపకుండా మాట్లాడరు. వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అయితే.. బిల్డప్ ల మీద బిల్డప్ లు ఇస్తుంటారు. వీరందరి ‘ముఖ్య’ నాయకుడు వారెవరినీ నియంత్రించే పనే చేయరు. పైగా వారిని ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో జనం మధ్యకు పంపిస్తుంటారు. ఇదండీ.. ప్రస్తుతం ఏపీలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, వారి ముఖ్య నేత తీరు.
వైనాట్ 175 అవుటాఫ్ 175 వైసీపీ అధినేతకు ఇప్పుడు పట్టుకున్న పిచ్చి ఇది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీని గెలిపించి, తమ నెత్తి మీదకు తెచ్చుకున్న ఆంధ్రా జనం వచ్చే ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో జగన్ పార్టీని గెలిపించాలట. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిపక్షం అనేదే లేకపోతే అధికార పార్టీకి కళ్లెం వేసేవారు ఎవరుంటారసలు? మొత్తానికి మొత్తం సీట్లలో వైసీపీయే గెలిచేస్తేనే.. తన అధికారదాహం తీరుతుందని ఆ పార్టీ అధినేత అనుకుంటున్నారా? అని జనం నుంచి ప్రశ్న వస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తన నేతృత్వంలో రాష్ట్రాన్ని ఇప్పటికే అదఃపాతాళానికి నెట్టేశారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఆమడదూరం పోయింది. రోడ్ల దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. ఖజానా ఖల్లాస్ అయిపోయింది. రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అవమానంగా మారింది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా జగన్ రెడ్డి ఏవేవో పనికిమాలిన పనులు చేస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల ముందు జగన్ గొప్పగా చెప్పిన ‘నవరత్నాలు’ ‘నవ ద్రోహాలు’గా మారాయంటూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు.
రాష్ట్రాన్ని, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మొత్తం ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ సీట్లలో విజయం సాధించాలట. లేదంటే సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్లకు ఎసరు తప్పదని, వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ వారిని బెదిరిస్తుండడం గమనార్హం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల చెవుల్లో తమ అధినేత వార్నింగే ‘రింగ్ రింగ్’మంటూ మోగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు దక్కే ఛాన్స్ లేదనుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలైతే.. అవకాశం లేని చోట ఎంత కష్టపడి ఏమి లాభం అనుకుని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారు. పార్టీని ఎలా గెలిపించాలి? తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దాని కంటే.. మళ్లీ ఎలా సీటు సంపాదించాలనే అంశంపైనే మల్లగుల్లాలు పడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.
ఒక పక్కన సొంతంగా చేయించుకుంటున్న సర్వేల నివేదికలు, ఇంకో పక్కన ‘ఐ ప్యాక్’ బృందం తరచుగా అందజేస్తున్న సర్వే ఫలితాలు జగన్ ను గందరగోళంలో పడేస్తున్నాయంటున్నారు. అయినప్పటికీ ఆయన ‘బురదపాము కోపం’ మాదిరిగా తన పార్టీ ఎమ్మెల్యేలపై కస్సుబుస్సులాడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఏతా వాతా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదనేది వాస్తవం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా సరే ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ చందంగా తనకు 175 సీట్లు వచ్చి తీరాలనే పంతానికి జగన్ పోతుండడం గమనార్హం. ఆ క్రమంలోనే తన సిటింగ్ ఎమ్మెల్యేలను జనంలోకి తోస్తుండడం విశేషం. పోనీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను స్థానిక ప్రజలు ఏమైనా గౌరవిస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. పైగా ముఖం మీదే వారిని సమస్యలపై కడిగిపారేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే.. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లు మారిపోయిందంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ విఫలమయ్యారని, తమ తమ నియోజకవర్గాల్లో అయినా.. తాము ఏవైనా జనాలకు ఉపయోగపడే పనులు చేయనిస్తారా? అంటే అందుకు కావాల్సి నిధులు ఇవ్వరని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలుస్తోంది.
ఒక పక్కన అభివృద్ధి చేయలేని దుస్థితి.. మరో పక్కన జనం నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత.. ఇవన్నీ వెరసి వైసీపీ ఎమ్మెల్యేల్లో అసహనం.. ఆక్రోశం, ఆగ్రహం పెరిగిపోతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాటి ఫలితంగానే వైసీపీ ఎమ్మెల్యేలు తన నిస్సహాయతను అధికారులపై రుద్దుతున్నారంటున్నారు. నిలదీసిన మహిళలను కూడా ఎగతాళి చేస్తున్న సంఘటలను జరుగుతున్నాయని చెబుతున్నారు. నోటికొచ్చినట్లు రంకెలేస్తున్నారని అంటున్నారు. జనం మధ్య విభేదాలు రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమైంది? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.