ఒకరినొకరు పొగిడేసుకున్న హరీశ్ రావు, గవర్నర్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. హరిత హారంలో భాగంగా ఆయన ఈరోజు ఇబ్రహీంపూర్ లో జమ్మి చెట్టు నాటిన ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తీసుకు వచ్చే ఏ పథకం విజయవంతం కావాలన్నా, సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలను, అధికారులను ముందుండి నడిపించే పాలకపక్ష నేత అవసరమని, ఆ లక్షణాలు హరీశ్ రావులో చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా హరీశ్ వంటి నేతలు ఎంతో అవసరమని అన్నారు. ఆయనో మాట అనుకున్నారంటే చేసే తీరుతారని, లక్ష్యం నెరవేరే వరకూ వదలబోరని, అటువంటి నేత మీకు అందుబాటులో ఉన్నారని తెలిపారు.
ఇక హరీశ్ రావు మాత్రం ఊరుకుంటారా ఆయన కూడా గవర్నర్ గారిపై కూడా ప్రశంసలు చేశారు. గవర్నర్ ది మాటంటే మాట, టైమంటే టైమని పొగిడారు. పదిన్నరకు వస్తానని చెప్పిన ఆయన, అంతకన్నా ముందే వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. వారి నుంచి తామంతా స్ఫూర్తిని పొందుతున్నామని అన్నారు.