మహాత్మునికి అవమానం జరిగిన ప్రాంతంలో మోడీ

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ జాతిపిత మహాత్మాగాంధీని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చారిత్రక రైలు ప్రయాణం చేశారు. దక్షిణాఫ్రికాలో నాడు మహాత్మాగాంధీ ప్రయాణం చేసిన మార్గంలో ప్రయాణించారు. జాతిపితను రైల్లో నుంచి తోసేసిన పీటర్‌మారిజ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను మోడీ సందర్శించారు.   1893 జూన్ 7వ తేదీన ఈ మార్గంలో ప్రిటోరియా నుంచి డర్బన్ వెళ్తున్న గాంధీ వద్ద తగిన టికెట్ ఉన్నా ప్రధమశ్రేణి పెట్టెలో ప్రయాణించడం కుదరదంటూ శ్వేతజాతీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మూడో శ్రేణి పెట్టెలోకి వెళ్లాల్సిందిగా తెల్లదొర ఆదేశించినా గాంధీ వెళ్లకపోవడంతో పీటర్‌మారిజ్‌బర్గ్ స్టేషన్‌లో ఆయన్ను బయటకు గెంటివేశారు. ఎముకలు కొరికేసే చలిలోనే ఆ రాత్రంగా స్టేషన్లో గడిపిన మహాత్ముడు... తాను దక్షిణాఫ్రికాలోనే ఉండాలనీ, భారతీయులపై జాత్యాహంకార దాడులపై పోరాడాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటానికీ శ్రీకారం చుట్టారు. గాంధీని ఏ ప్రదేశంలో రైల్లోనుంచి బలవంతంగా కిందికి దించేశారో ఆ ప్రదేశాన్ని మోడీ సందర్శించి జాతిపితకు నివాళలుర్పించారు.

మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి రమ్య

తొమ్మిది రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్య ఇక లేదు. తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. చిన్నారి మరణించినట్టు కేర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇదే ప్రమాదంలో గాయపడి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తల్లి రాధికను చివరి చూపు కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో కేర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పాపను విగతజీవిగా చూడగానే తల్లిహృదయం విలవిల్లాడిపోయింది. రమ్య ఇక లేదని తెలిసి రాధికతో పాటు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.   మూడో తరగతి చదువుతున్న రమ్యను జులై 1న ఇంటికి తీసుకువస్తుండగా..పంజాగుట్ట శ్మశానవాటిక సమీపంలో ఎదురుగా వేరే లేన్‌లో వస్తున్న కారు ఎగిరి వీరి కారుపై పడటంతో ఒకరు చనిపోగా..మిగిలిన వారు మంచానికే పరిమితమయ్యారు. ఇక ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్యను కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పాప బ్రెయిన్‌డెడ్ అయినట్టుగా అప్పటికే వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న రమ్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు తాగి కారు నడిపి ఇంతటి దారుణానికి కారణమయ్యారు.

దాదాను పొగిడి కష్టాలు తెచ్చుకున్న భజ్జీ...

ఇదేంటి పొగిడితే కష్టాలు రావడమేంటి అనుకుంటున్నారా..? దీనికి కారణం ఉంది..జూలై 8న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలి పుట్టినరోజు సందర్భంగా గంగూలీని పొగుడుతూ హర్భజన్ ట్వీట్ చేశాడు. దీనిపై ధోని అభిమానులు మండిపడ్డారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే మండిపడటమేంటి అనేగా మీ డౌట్..భారత క్రికెట్ చరిత్రలోనే సౌరభ్ అత్యుత్తమ కెప్టెన్ అంటూ భజ్జీ దాదాను ఆకాశానికెత్తేశాడు. అయితే గంగూలి కెప్టెన్సీలో కంటే ధోని నాయకత్వంలోనే టీమిండియా అత్యధిక విజయాలు సాధించింది. అందుకే భజ్జీపై ధోని అభిమానుల ఆగ్రహం..అక్కడితో ఆగకుండా హర్జజన్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. టీమ్‌లో చోటు లభించకపోవడం వల్లే హర్భజన్ ధోని ఘనతను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ వారు తిట్టి పోశారు

కేసీఆర్‌కు అగ్రరాజ్యం నుంచి ఆహ్వానం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమెరికా ఆహ్వానం పంపింది. వచ్చే నెల 30, సెప్టెంబర్ 1న జరిగే ఫార్మ్ ప్రోగ్రెస్ షోలో పాల్గొనాలని కోరింది. ప్రపంచదేశాలతో వాణిజ్య సంబంధాలు పెంపోందించడంలో భాగంగా ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొంటూ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఫ్యాక్స్ ద్వారా సమాచారం తెలిపింది. సీఎంతో పాటు ఎంపీ వినోద్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథికి కూడా ఆహ్వానాలు పంపింది. యూఎస్‌లోని లోవా రాష్ట్రం బూన్ నగరంలో ఈ ఎగ్జిబిషస్ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం డిజిటల్ వ్యవసాయం విధానాన్ని అవలంబిస్తూ వ్యవసాయ ఆర్ధికాభివృద్ధిలో మంచి ఫలితాలు సాధిస్తున్నందున ఆహ్వానం పలుకుతున్నామని అమెరికా తరపున వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి జాన్ మెక్ కాస్లిన్ ఆహ్వానంలో తెలిపారు.

పులులు, సింహాలే డిజైనర్లు.. లేటెస్ట్ ఫ్యాషన్

  మార్కెట్లోకి రోజుకో ప్యాషన్ ఐటమ్ వస్తుంది. డిజైనర్లు కూడా ఎంతో ఇన్నోవేటివ్ గా ఆలోచించి.. వారి మెదడుకు పదునుపెట్టి ఎన్నో మోడల్స్ తయారు చేస్తున్నరు. అయితే ఇప్పుడు పులులు, సింహాలు కూడా మంచి డిజైనర్లుగా మారిపోయాయి. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. వినడానికి విచిత్రంగా ఉన్నా పులులు కూడా మండి డిజైనర్లు అయ్యాయి. అసలు సంగతేంటంటే.. మనకు టోర్న్ జీన్స్ తెలుసు.. ఎంత చిరిగితే అంత ఫ్యాషన్.. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ కూడా అవే. ఈనేపథ్యంలోనే డిజైనర్లు కొంచం వెరైటీగా ఆలోచించారు.  ముందుగా తయారు చేసిన జీన్స్ ను జూలో పులులు ఆడుకునే ఫుట్ బాల్, టైర్ వంటి వాటికి చుట్టి పులులు, సింహాలు తిరిగే బోనుల్లో వదిలేస్తారు. వీటితో ఆడుకునే పులులు అక్కడక్కడ పంటిగాట్లు, గోరు గాట్లతో ఈ జీన్స్ కు చిల్లులు పెడతాయి. వాటిని తీసుకుని మరమ్మతులు చేసి, ఆ పులులు చేసిన గాట్లు, గీకుల్లు తొడభాగంలో వచ్చేలా కుడతారు. వీటిని జూజీన్స్ బ్రాండ్ గా షాపింగ్ మాల్స్ లో విక్రయిస్తున్నారు. వీటికి జపాన్ లో మంచి ఆదరణ ఉందని ఈ బ్రాండ్ యజమానులు తెలిపారు. ఆఖరికి పులులను కూడా వదల్లేదు ఫ్యాషన్లో.. ఇంకా ఏ జంతువులను వాడతారో చూద్దాం..  

వాట్సాప్.. ఈ ఫీచర్ తో జాగ్రత్త..

వాట్సాప్ వాడుతున్నారా... అయితే ఈ ఫీచర్ ను డీయాక్టివేట్ చేసుకోండి అని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఎంటా ఫీచర్..? దానివల్ల సమస్య ఏంటని ఆలోచిస్తున్నారు కదా.. జిప్, PDF, వర్డ్ సహా ఇతర ఫార్మాట్ ఫైల్స్ పంపేందుకు వీలుగా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ లో ఓ ఫీచర్ అప్ డేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫీచర్ వల్ల వైరస్ చొరబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఫైల్స్ నుంచి వైరస్‌లు సెల్‌లోకి డౌన్‌లోడ్ అయి.. ఆ తర్వాత ఇబ్బందులకు గురి చేస్తాయని టెక్నికల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అంతగా అవసరం లేకుంటే ఈ ఫీచర్ డీ యాక్టివేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

'ఫ్రీడమ్ 251' వచ్చేస్తుందోచ్...

'ఫ్రీడమ్ 251' ఈస్మార్ట్ ఫోన్ పేరు మాత్రం అందరూ వినే ఉంటారు. అతి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందంటూ ఎంత ఫేమస్ అయిందో.. పలు వివాదాల్లో చుట్టుకొని అంతకంటే ఫేమస్ అయింది. రింగింగ్ బెల్స్ అనే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నా.. ఈ కంపెనీ మాత్రం వాటన్నింటిని అధిగమించి ఎట్టకేలకు ఫోన్లను డెలివరీ చేయడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా చేసింది. ఈరోజు నుండి డెలివరీ ప్రారంభంకానుందని.. తొలివిడతలో ముందుగా 2,240 ఫోన్లను డెలివరీ చేయనున్నట్టు తెలిపారు. అయితే మొదటగా నాలుగు రాష్ట్రాల్లో (హిమాచల్ ప్రదేశ్, బీహార్, హర్యానా, ఉత్తరాఖాండ్) మాత్రమే ఈ ఫోన్లను అందించనున్నారు. అయితే ఫోన్ ధర 251 రూపాయలు కాగా.. షిప్పింగ్ ఛార్జీలు 40 రూపాయలు కలిపి మొత్తం 291 రూపాయలు చెల్లించాలన్నమాట. మరి అతి తక్కువ ధరకే వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఎంత స్మార్ట్ గా పనిచేస్తుందో చూద్దాం.

ఉత్తర కొరియా మారదా ఇంకా..

  ఉత్తర కొరియా వ్యవహారం చూస్తుంటే.. నా దారి రహదారి అన్నట్టు ఉంది.. ఇప్పటికే పలుసార్లు క్షిపణి ప్రయోగం చేసి ప్రపంచ దేశాలను భయపెడుతుండగా.. మరోసారి ఆంక్షలను ధిక్కరిస్తూ ఉత్తర కొరియా సబ్‌మెరైన్‌ లాంచ్‌డ్‌ బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేసింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా అధికారికంగా వెల్లడించింది. అయితే తూర్పు తీరంలో ఈ ప్రయోగం జరిగిందని తెలిపింది కానీ.. ఎంతదూరం క్షిపణి వెళ్లిందో కచ్చితమైన వివరాలను ద.కొరియా రక్షణ శాఖ స్పష్టంచేయలేదు.   కాగా ఉత్తరకొరియా క్షిపణులను ఎదుర్కోవడానికి అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు సంయుక్తంగా ద.కొరియాలో అడ్వాన్స్‌డ్‌ అమెరికా మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించన మరుసటి రోజే ఉత్తర కొరియా ఇలా క్షిపణి ప్రయోగించడం గమనార్హం.

బీజేపీ షార్ట్ ఫిలిం ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

  బీజేపీ నేతలు ఓ షార్ట్ ఫిలిం తీయనున్నారు. బీజేపీ నేతలేంటీ..? షార్ట్ ఫిలిం ఏంటీ అనుకుంటున్నారా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం. ఇంతకీ షార్టి ఫిలిం ఎందుకనుకుంటున్నారా.. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం ఏపీ ప్రజల్లో ఉందని తెలిసిందే. అయితే వారి కోపాన్ని తగ్గించడానికే బీజేపీ నేతలు ఈ షార్ట్ ఫిలిం ప్లాన్ వేశారంట. అసలు సంగతేంటో చూద్దాం..   ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల ద్వారా ఇప్పటికే అర్దమైపోయింది. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ..ఇప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ప్రత్యేక హోదా కాదు కదా.. తగిన ఆర్దిక సాయం కూడా చేయట్లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం తాము ఏపీకి చాలా సాయం చేసేమన్నా ధోరణిలో ఉండటం ఆశ్చర్యం. దీనిలో భాగంగానే ఏపీ ప్రర్యటనలో ఉన్న జాతీయ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం తాము వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీకి మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. ఇది విన్న టీడీపీ నేతలు ఊరుకుంటారా.. ఏపీకి ఇస్తామన్న స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్‌కి బడ్జెట్‌లో నిధులు ఎక్కడ కేటాయించారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఇరుపార్టీ నేతల మధ్య మాటల యుద్దం జరిగింది.   దీంతో బీజేపీ నేతలంతా సమావేశమై.. ఏపీకి తాము ఏం చేయలేదన్న వాదనను తిప్పికొట్టాలన్న దానిపై చర్చకు దిగారు. దీనిపై బీజేపీ నేతలు ఎవరికి తోచిన సలహాలు వారు ఇచ్చారంట కూడా. అయితే ఆఖరికి ఏపీకి బీజేపీ ఏమి ఇచ్చిందో ఒక షార్ట్‌ఫిల్మ్ ద్వారా వివరిస్తే అప్పుడైతే జనం నమ్ముతారంటూ ఓ విన్నపం వచ్చిందట. అంతేకాదు ఈ విన్నపానికి బాగానే ఉందని చాలామంది ఓటేశారట కూడా. మరి బీజేపీ నేతలు షార్ట్ ఫిలిం ప్లాన్ వేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరుకుంటారా.. అసలే రాజకీయ చాణక్యుడు ఆయన. వారి ప్లాన్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబును దాటి మరి ఈ షార్ట్ ఫిలిం ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి. తీసినా జనానికి ఎంత వరకూ ఇంప్రెస్ చేస్తారో చూడాలి..

బైయిల్ పై జైలు నుండి బయటకి.. మళ్లీ అరెస్ట్..

  చిత్తూరు జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఘటనలో పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిన సంగతి తెలిసిందే. ఆయనపై నమోదైన ఓ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. వెంటనే మరో ఝలక్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని వడమాలపేట పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయగా.. బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఆయన అలా బెయిల్ పై బయటకు రావడానికి సిద్దంగా ఉన్నారో లేదో.. వెంటనే ఎంఆర్ పల్లి పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. తమ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలానే ఏపీ ప్రభుత్వం తనపై కక్ష్య కట్టి ఇలా చేస్తుందని ఆరోపించారు. మరోవైపు చెవిరెడ్డి అరెస్ట్ పై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బహిరంగగానే తిరిగేస్తున్న మాల్యా..

  బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యాను ఒకపక్క భారత ప్రభుత్వం ఇండియాకు రప్పించాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క విజయ్ మాల్యా మాత్రం ఎటువంటి భయం లేకుండా బహిరంగంగానే తిరిగేస్తున్నారు. ఇండియా నుండి లండన్ పారిపోయిన మాల్యా అక్కడ బహిరంగగానే తిరుగుతున్నారు. మొదట కాస్త ఇబ్బంది పడి.. ఎవరికి తెలియకుండా క్లబ్బులు, పబ్బులకు వెళ్లే మాల్యా ఇప్పుడు అవేమి ఖాతరు చేయకుండా చాలా నార్మల్ బయటకు వస్తున్నారు. ఈమధ్య కాలంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా ఓ మీడియా సమావేశంలో కూడా పాల్గొని ముచ్చటించారు. ఫార్ములా వన్ రేసుల్లో తన జట్టు ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంతే కాదు ఆఖరిలో అంతా బాగానే ఉందని కూడా కామెంట్ చేశారు.   ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం ఇప్పటికే మాల్యాను ఇండియా రప్పించడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే ఆయన పాస్ పోర్ట్ ను రద్దు చేసింది.. ఇంకా ఆయనను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా తేల్చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎన్ని చేసినా మాల్యా మాత్రం వాటన్నింటిని లెక్క చేయకుండా హాయిగా విదేశాల్లో ఎంజాయ్ చేసుకుంటూ తిరగడం గమనార్హం...

శ్రీనగర్‌లో కర్ఫ్యూ..

జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్, కశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిన్న అనంత్‌నాగ్‌లో మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బర్హణ్ వనీతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపింది. దీంతో శ్రీనగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి వాహనాల టైర్లు తగలబెట్టారు. అల్లర్లను అణచివేసేందుకు ప్రభుత్వం కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతనాగ్‌, పుల్వామా, షోపియాన్‌, సోపోర్‌ సహా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సంఘ విద్రోహశక్తులు వదంతులు ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. 

రష్యా పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు

ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రష్యా బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఆయన ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానంలో రష్యా చేరుకుంటారు. సీఎం వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, సీఎం కార్యదర్శులు సతీష్‌ చంద్ర, సాయిప్రసాద్‌, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఆరోక్యరాజ్‌, రాజధాని అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ లక్ష్మీ పార్థసారధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో కృష్ణ కిషోర్‌, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాసరావు, ప్రధాన భద్రతాఅధికారి నగేష్‌బాబు ఉన్నారు.   రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుంది. రష్యా పర్యటనకు ఒక్క రోజు ముందు కొత్తగా నిర్మించిన కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గతేడాది రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని కజకిస్థాన్ రాజధాని అస్తానా నిర్మాణశైలికి ముగ్దడై ఈ నగరాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారు. 

కుంబ్లేకు లండన్‌లో చేదు అనుభవం

భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుంబ్లేకు తొలి విదేశీ పర్యటనలోనే చేదు అనుభవం ఎదురైంది. భారత క్రికెట్ జట్టు వెస్టిండిస్ పర్యటన నిమిత్తం ముంబై నుంచి లండన్ మీదుగా సెయింట్‌కిట్స్‌లో దిగింది. అయితే కుంబ్లే లగేజీని బ్రిటీష్ ఎయిర్‌వేస్ లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసింది. దీంతో అతని దుస్తులతో పాటు తదితర వస్తువులన్నీ లండన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాయి. అయితే కుంబ్లే మాత్రం జట్టుతో కలిసి విండీస్ చేరుకున్నాడు. అనంతరం తన లగేజీ కోసం ఎయిర్‌వేస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ తాము చేసిన తప్పిదానికి క్షమించాలని, సాధ్యమైనంత త్వరగా కుంబ్లే లగేజీని అందజేస్తామని ట్విట్టర్‌లో తెలిపింది. 

మమ్మీలను ధ్వంసం చేసిన ఐఎస్ఐఎస్

మమ్మీలు..అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. వాటిని రక్షించి ముందు తరాలకు అందించేందుకు ఐక్యరాజ్యసమితి ఎన్నో చర్యలు చేపడుతోంది. అయితే దారుణ మారణకాండతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చివరికి ఆ వారసత్వ సంపదను వదలడం లేదు. సిరియాలోని పల్మిరా నగరంలోని శిల్పాలు, మమ్మీలను ఐసిస్ ఉగ్రవాదులు లారీలతో గుద్ది ధ్వంసం చేశారు. ఈ మేరకు వారు ఒక వీడియోను విడుదల చేశారు. పల్మిరా నగరంలోని ప్రఖ్యాత మ్యూజియంలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి వాటిని ధ్వంసం చేశారు. గతేడాది ఆగస్టులో ఈ నగరానికి చెందిన ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఖలిద్ అసాద్‌ను ఐసిస్ ఉగ్రవాదులు తల నరికి అత్యంత దారుణంగా చంపి, ఆలయాలు, సమాధులను ధ్వంసం చేశారు. ఈ ఏడాది మార్చిలో రష్యా దళాల సాయంతో సిరియా ప్రభుత్వ బలగాలు ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.  

బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు..?

  ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు ఏపీ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. రెండు విడతలుగా ఆయన జరిపిన భేటీలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. దీనిలో భాగంగానే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు మురళీధర్ రావు, రాం మాధవ్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్.. ఏపీకి చెందిన నేతలు పురందేశ్వరి, మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.