జకీర్ నాయక్ తలకి రూ. 15 లక్షలు

  ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కు మహారాష్ట్ర స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ (ఎస్ఐడీ) క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఆయనపై ఇంకా విమర్శలు తగ్గినట్టు కనిపించడంలేదు. ఏకంగా ఆయన తలకి రూ. 15 లక్షల రూపాయలను ప్రకటించారు. జకీర్ నాయక్ ఒక కల్ నాయక్ అని.. ఇస్లాం ప్రవక్తను ఆయన అవమానించారు. ఆయనను (జకీర్) చంపిన వారికి 15 లక్షల రివార్డు ఇస్తాం' అని 'హుస్సైని టైగర్స్' నేత సైయద్ కల్బె హుస్సైని నఖ్వి ప్రకటించారు.   కాగా ‘పీస్ టీవీ’లో ప్రసారమైన ఆయన ప్రసంగాలను పరిశీలించిన ఎస్ఐడీ అధికారులకు జకీర్ నాయక్ వివాదాస్పద ప్రసంగాలు చేసినట్లు ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరలేదని.. ఈ నేపథ్యంలో భారత్ కు తిరిగివచ్చాక కూడా ఆయనను అరెస్ట్ చేసే ఉద్దేశమేదీ లేదని కూడా ఎస్ఐడీ అధికారులు వెల్లిడించారు.   ఇదిలా ఉండగా ఈనెల 1న ఢాకాలోని రెస్టారెంట్‌పై దాడికి పాల్పడి 22 మందిని ఊచకోతకోసిన కొందరు మిలిటెంట్లు..జకీర్ ప్రసంగాల ప్రేరణతోనే తాము ఈ దాడులకు పాల్పడినట్టు చెప్పడంతో జకీర్ చుట్టూ వివాదాలు కమ్ముకున్నాయి.

ఎమ్మెల్యేలు అయిపోయారు.. టీడీపీలోకి ఎమ్మెల్సీల వలసలు..

ఇప్పటివరకూ ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల వలసలు అయిపోగా.. ఎమ్మెల్సీల వంతు మొదలైనట్టుంది. ఇప్పటికే వైసీపీ నుండి ఒక ఎమ్మెల్సీ పార్టీ నుండి వెళ్లిపోగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి అప్పారావు. ఈయన కూడా టీడీపీ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.   కాగా గతంలో ఆదిరెడ్డి టీడీపీలోనే ఉండేవారు. అయితే 2014 ఎన్నికల ముందు ఈయన వైసీపీలోకి జంప్ అయ్యారు. అప్పటి నుండి జిల్లాలో జగన్ ఏ కార్యక్రమం చేపట్టిన దానికి ఆదిరెడ్డినే ఖర్చుచేసేవాడట. ఒక్కో కార్యక్రమానికి దాదాపు 15 నుండి 20 లక్షలు ఖర్చుచేసేవాడట. దీంతో  తమ పార్టీకి అధికారం మాట దేవుడెరుగు.. పార్టీ తలపెట్టే కార్యక్రమానికి ఖర్చు తీవ్రమవుతుందని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఈక్రమంలో పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్టు ఆదిరెడ్డి సహచరులు చెబుతున్నారు.

వావ్... ఇంటర్నెట్ లేకుండా వాట్సప్

  ఇంటర్నెట్ లేకుండా వాట్సప్.. వావ్ వాట్ ఏ బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా.. ఇంకేముంది వాట్సప్ యూజర్లకి ఈ విషయం తెలిస్తే ఎగిరిగంతేస్తారు. అయితే ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ ఉపయోగించాలంటే దానికో చిట్కా వాడాల్సిందే. అదేంటంటే.. మీరు మెసేజ్ పంపించాలని కోరుకొనేవారికి కనెక్ట్ అయిన సిమ్‌ను ఉపయోగించడమే. అయితే అది ఎలా అనుకుంటున్నారా.. ఆ అవకాశాన్ని చాట్ సిమ్ కల్పిస్తుంది. చాట్‌సిమ్.కామ్ వెబ్‌‌సైట్‌కి లాగాన్ అయి ఆర్డర్ ప్లేస్ చేసి చాట్ సిమ్‌ను కొనుక్కోవచ్చు. దీని ఖరీదు చాట్ సిమ్ ఖరీదు రూ.745. యూసేజ్ ఛార్జీలు 10 యూరోలు చెల్లించాలి. వ్యాలిడిటీ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది. ఇమేజెస్, వీడియోలు షేర్ చేసుకోవడానికి అదనంగా చెల్లించాలి. చాట్ సిమ్‌ను ఇండియాకు తెప్పించుకోవాలంటే షిప్పింగ్ ఛార్జీలు భరించాలి. ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ అంటే వినడానికి బానే ఉంది కానీ.. దాని కోసం ఇంత ప్రాసెస్ చేయాలంటే కష్టంగానే ఉంది కదా...

ఏపీ నిర్ణయం వల్ల తెలంగాణకు దెబ్బ..!

  ఏపీ రాష్ట్రంలో ఫోన్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెల్‌ఫోన్ చార్జర్లు, బ్యాటరీలపై, స్టిల్ ఇమేజ్, వీడియో కెమెరా, బ్యాటరీ చార్జర్లపై వ్యాట్ తగ్గిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 5 శాతం తగ్గనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిపోయింది.ఏపీలో విభజన అనంతరం సెల్ ఫోన్ అమ్మకాలు పెద్దగా పెరగలేదు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో వాటి ధర ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఏపీ ప్రజలకు పెద్ద గుడ్ న్యూసే.   అయితే ఇది ఏపీ ప్రజలకు శుభవార్తనే కానీ.. పొరుగురాష్ట్రమైన తెలంగాణకు మాత్రం దెబ్బే అని అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నా కానీ.. తెలంగాణ పరిస్థితి ఇప్పుడు నిధులు లేక కటకటలాడిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోసం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొండి బకాయిలను ముక్కుపిండి వసూలు చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ఆదాయానికి గండిపడే అవకాశాలు వున్నాయన్నది అధికారుల మాట. తెలంగాణలో గతంలో వ్యాట్‌ని 5 శాతానికి తగ్గించారు.. దాని ప్రభావం, ఇప్పుడు ఆదాయంపై పడింది. ఇప్పుడు ఏపీ కూడా ఇప్పుడు ఇదేబాట పట్టింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

వైస్ ప్రెసిడెంట్ ను కుక్కతో పోల్చిన ట్రంప్...

  రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనం గురించి తెలిసిందే. ఏ విషయాన్ని కూడా ఆయన నార్మల్ చెప్పరు. ఆయన చేసే వ్యాఖ్యలు ఖచ్చితంగా వివాదాస్పదం కావాల్సింద్. ఇప్పుడు కూడా తన నోటి దురుసుతనాన్ని మరోసారి బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఉపాధ్యక్షుడిగా ఎవరికి ఎంచుకుంటారని ప్రశ్నించగా.. దానికి ఆయన.. నాపై అన్ని వైపుల నుండి దాడులు జరుగుతున్నాయని.. వాటిని ఎదుర్కోవాలంటే, వేటకుక్క ఉండాల్సిందేనని అన్నారు. ఉపాధ్యక్ష పదవికి  క్రిస్ లేదా న్యూట్ లు సరిపోతారని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ గా ఇండియానా గవర్నర్ మైక్ మెన్స్, మాజీ స్పీటర్ న్యూట్ గిన్ గ్రిచ్, న్యూజర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్తే, అలబామా సెనెటర్ జెఫ్ సెషన్స్ తదితరులను ట్రంప్ పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.

మోడీ కేబినెట్ నుండి ఇద్దరు ఔట్...

  ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే కేబినెట్ ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ విస్తరణలో పలువరికి కొత్త పదవులు దక్కగా.. మరికొంత మందికి శాఖల మార్పులు జరిగాయి.. ఇంకొంత మంది పదవులు కోల్పోయారు. కొత్తగా వచ్చిన 19 మంది మంత్రులతో కేంద్ర మంత్రివర్గం సంఖ్య 78 కి చేరింది. అయితే ఇప్పుడు ఇందులో ఇద్దురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తులా, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జీఎం సిద్దేశ్వర తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలకు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. దీంతో మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీకి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ పూర్తి బాధ్యతలు అప్పగించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియాకు భారీ పరిశ్రమల శాఖ బాధ్యతలను అదనంగా ఇచ్చారు.

ఇకపై చంద్రబాబుకు ఓటు హక్కు ఉండదు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు హైదరాబాద్ ను వదిలేసినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుండే పాలన సాగించిన చంద్రబాబు.. అలా అయితే వర్కవుట్ కాదని భావించి.. అక్కడి నుండి విజయవాడకు మకాం మార్చి.. ఇప్పుడు పూర్తిగా విజయవాడకే అంకితమైపోయి అక్కడి నుండే పాలన సాగిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన చిరునామా కూడా పూర్తిగా మారిపోనుంది. ఆయన స్వయంగా తన చిరునామాను మార్చేయాలని అధికారులను కోరారు.   చంద్రబాబు విజయవాడ సమీపంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని లింగమనేని హౌస్ ను నివాసంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన అధార్ కార్డులోని హైదరాబాద్ చిరునామాకు బదులుగా.. ఇక్కడి చిరునామాను మార్చేయాలని ఉండవల్లి గ్రామ పంచాయితీ అధికారులను కోరడంతో.. అధికారులు ఆపనిలో పడ్డారట. అంతేకాదు పనిలో పనిగా ఓటరు కార్డులోని తన హైదరాబాద్ చిరునామాను కూడా మార్చేసి ఉండవల్లి అడ్రస్ నే చేర్చాలని కూడా చంద్రబాబు అదేశాలు జారీ చేసేశారట. ఇక చంద్రబాబు చెప్పినట్టు అధికారులు అడ్రస్ మార్చడం జరిగితే.. ఇకపై చంద్రబాబుకు హైదరాబాద్లో ఓటు హక్కు ఉండదు. ఉండవల్లి పంచాయితీలోనే ఆయనకు ఓటు హక్కు ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు హైదరాబాద్ ను వదిలించుకోవాలనుకున్నట్టు ఉన్నారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..

రెండు రైళ్లు ఢీ.. తుక్కుతుక్కుయిన భోగీలు

  ఎదురెదురగా వచ్చి రెండు రైళ్లు ఢీకొట్టుకొని ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఇట‌లీ ద‌క్షిణ ప్రాంతంలోని బారి నగర సమీపంలో జరిగింది. ఇట‌లీలో ఒకే రైల్వే ట్రాక్‌పై  ఎదురెదురుగా వ‌చ్చిన రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ప్ర‌మాదంలో రెండు రైళ్ల‌కు చెందిన‌ ప‌లు బోగీలు ధ్వంస‌మ‌య్యాయి.  ఇంకా 12 మంది ప్రయాణికులు మరణించగా.. చాలామందికి తీవ్రగాయాలయ్యాయి.  గాయ‌ప‌డిన వారికి ప్ర‌థ‌మ చికిత్స అందించి, ఆసుప‌త్రికి తర‌లిస్తోంది. బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బ‌య‌ట‌కు తీస్తోంది. స‌హాయ‌కచ‌ర్య‌లు చేప‌డుతోంది. కాగా ఈ ట్రాక్‌పై 200 రైళ్లు ప్రయాణిస్తుండటంతో ట్రాక్ పై నుంచి వెళ్లే ఇత‌ర రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం కలిగింది.

మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్...

  హైదరాబాద్ నగరంలో ఐసిస్ సానుభూతి పరులంటూ 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నసంగతి తెలిసిందే. వీరిని కోర్టులో హాజరుపరచగా నలుగురు సానుభూతి పరులకు కోర్టు 10 రోజుల కస్టడీ విధించింది. దీంతో ఎన్ఐఏ అధికారులు వారి దగ్గర నుండి మరింత ఉగ్ర సమాచారం రాబట్టనున్నారు. అయితే కోర్టుకు ఐఎస్ ఉగ్రవాదుల అప్పగింత సమయంలోనే హైదరాబాదులో మరో ఇద్దరు లియామత్‌, అతావుల్లాలను అనే ఐఎస్ సానుభూతిపరులు అరెస్టయ్యారు.    కాగా తాజాగా అరెస్టైన ఇద్దరు ఐఎస్ సానుభూతిపరులను మొఘల్ పురా, బండ్లగూడకు చెందిన అహ్మదుల్లా, యాసిర్ గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదులతో వీరికి సంబంధాలున్నాయని పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

50 లక్షల సమాధులు.. ఇంకేం కనిపించవు..

  ఒకటి కాదు రెండు కాదు ఆ శ్మశానంలో ఏకంగా 50 లక్షల సమాధులు ఉన్నాయి. ఇంతకీ ఆశ్మశానం ఎక్కడ అనుకుంటున్నారా.. ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ లో ఉంది. ప్ర‌పంచ‌ంలోనే అతి పెద్ద శ్మశానంగా రికార్డులకెక్కిన ఈ శ్మశానం..అక్క‌డికెళ్లి చూస్తే కనుచూపు మేరలో ఇంకేమీ క‌నిపించ‌వు.. అన్నీ స‌మాధులే క‌నిపిస్తాయి. అంతేకాదు కొత్తగా ఏటా 5 లక్షల సమాధులు కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీని వెనుక ఓ స్టోరీ కూడా ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం షియా ముస్లింల ప‌విత్ర న‌గ‌రంగా ఉండేదట. ఇక్కడే షియాల మొదటి మతగురువుని ఖ‌న‌నం చేశారట. అందుకే దీన్ని వదీ అల్ సలామ్(శాంతి లోయ) అని పిలుస్తారు. ఆయ‌న స‌మాధికి ద‌గ్గ‌ర‌లోనే క్రీస్తు శ‌కం 600 సంవ‌త్స‌రం నాటి స‌మాధులు ఉండేవి. ఈ ప్ర‌దేశంలోనే భారీగా స‌మాధులు నిర్మించారు.

కోడిపుంజును అరెస్ట్ చేసిన పోలీసులు..

  ఈ మధ్యకాలంలో మనుషులనే కాదు జంతువులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇటీవలే గుజరాత్ లో మనుషులను చంపి తిన్నందుకు సింహాలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోడిపుంజును అరెస్ట్ చేసి లాకప్‌లో వేశారు. ఈ విచిత్రమైన ఘటన ఖమ్మంలో జరిగింది. ఇంతకీ ఆ కోడిపెట్ట అంత నేరం ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా..వివరాల ప్రకారం..ఖమ్మం నగర శివారులో కోడి పందెలు నిర్వహించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. ఆ స్థావరంపై దాడి చేశారు. పాపం అక్కడ అందరూ తప్పించుకున్నా ఒక్క కోడిపుంజు మాత్రం పోలీసుల కంటపడింది. అంతే దానిని తీసుకొచ్చి మన పోలీసులు లాకప్‌లో వేసేశారు. మరి దానికి ఏం శిక్ష విధిస్తారో పోలీసులు చూడాలి.

జకీర్ నాయక్ తప్పేం లేదట..

ఇస్లామిక్ మత గురువు జకీర్ నాయక్ కు ఊరట లభించింది. తాను చేస్తున్న ప్రసంగాల ద్వారా యువత ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని ఆయనపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఎప్పుడు భారత్ తిరిగి వస్తే అప్పుడు సమన్లు జారీ చేయాలని చూస్తున్నారు. దీంతో జకీర్ నాయక్ కూడా ముంబై రావాల్సి ఉండగా అది కూడా రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు మహారాష్ట్ర స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ (ఎస్ఐడీ) క్లీన్ చిట్ ఇచ్చేసింది. ‘పీస్ టీవీ’లో ప్రసారమైన ఆయన ప్రసంగాలను పరిశీలించిన ఎస్ఐడీ అధికారులకు జకీర్ నాయక్ వివాదాస్పద ప్రసంగాలు చేసినట్లు ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరలేదని అన్నారు. ఈ నేపథ్యంలో భారత్ కు తిరిగివచ్చాక కూడా ఆయనను అరెస్ట్ చేసే ఉద్దేశమేదీ లేదని కూడా ఎస్ఐడీ అధికారులు వెల్లడించారు.

మారని పాకిస్థాన్.. మీ పని చూస్కోండి అన్న భారత్..

  భారత్ కు ప్రత్యర్ధ దేశమైన పాకిస్థాన్ కు మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో విభేధాలు తలెత్తుతూనే ఉంటాయి. రెండు దేశాలు ఎంత స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుందామని చూసినా అది మాత్రం ఎప్పటికీ కలలాగనే మిగిలిపోతుంది. అందుకే రెండు దేశాల మధ్య ఎప్పుడో జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య మరో వివాదం తెరపైకి లేచినట్టు తెలుస్తోంది.   అదేంటంటే ఇప్పటికే  హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మృతికి కాశ్మీర్లో చెలరేగిన మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు దీనిపై స్పందించిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుర్హాన్ వనీ మృతి విషయం విని షాక్ కు గురైనట్టు..  కశ్మీర్ నేతలను, ప్రజలను ఆర్మీ చంపేస్తోందని వ్యాఖ్యానించారు. వనీ మృతికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రజలపై భారత్ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ మిలటరీని ఉపయోగించి కాల్పులకు పాల్పడుతోందని ఆరోపించింది. అంతేకాక కశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నవాజ్ డిమాండ్ చేశారు. తద్వారా కశ్మీర్.. పాకిస్థాన్‌లో ఉండాలో, భారత్‌లో ఉండాలో ప్రజలే తేల్చుకుంటారని పేర్కొన్నారు   దీంతో నవాజ్ వ్యాఖ్యలకు స్పందించిన భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగు దేశం గురించి కాకుండా, సొంత దేశం గురించి ఆలోచించుకుంటే మేలని హెచ్చరించింది. పాకిస్థాన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ ప్రతినిధి వికాశ్ స్వరూప్ పేర్కొన్నారు. పొరుగు దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం ఆ దేశానికే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై రెండు దేశాల మధ్య ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి.

పోలీసుల అత్యుత్సాహం.. కుటుంబాన్ని చితకబాదిన వైనం..

ఒక్కోసారి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్సించి చిక్కుల్లో పడుతుంటారు. ఇప్పుడు అలా అత్యుత్సాహం ప్రదర్శించే బదిలీ అవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల ప్రకారం.. రాజా(45), ఉష(40) దంపతులు తమ కుమారుడు సూర్య(18)తో క‌లిసి బంగారు దుకాణానికి వెళ్లి బయటకు వస్తుండగా... ఏదో విషయంలో వారిలో వారు గొడవపడుతున్నారు. అయితే ఇది గమనించిన పోలీసులు కల్పించుకొని వారిపై దురుసుగా ప్రవర్తించారు. తాము ఒకే కుటుంబమని.. చిన్న గొడవ మాత్రమే అని చెబుతున్నా వినకుండా.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు లాఠీల‌తో కొట్టారు. దీంతో వారికి తీవ్ర‌గాయాల‌య్యాయి. రాజా, ఉష, సూర్య ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఘ‌ట‌న‌పై స్పందించిన పోలీసు ఉన్న‌తాధికారులు కుటుంబంపై విరుచుకుప‌డ్డ పోలీసుల‌ని వేరే ప్రాంతానికి బ‌దిలీ చేశారు.

చంద్రబాబు టూర్ వెనుక మోడీ హస్తం..!

  ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన కజకిస్థాన్ ను కూడా సందర్సించిన సంగతి విదితమే. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబు కజకిస్థాన్ పర్యటన వెనుక ప్రధాని నరేంద్ర మోడీ హస్తం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించేసరికి అందరూ అవాక్కవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. చంద్రబాబు కంటే ముందే మోడీ కజకిస్థాన్లో పర్యటించిన సంగతి తెలసిందే. అయితే అక్కడ పర్యటించిన ఆయన కజకిస్థాన్ రాజధానిని చూసి ముగ్ధుడైపోయారట. దీంతో అక్కడ పర్యటించాలని తనకు పదే పదే చెప్పారని చంద్రబాబు వెల్లడించారు.   ఇక ఆస్తానాను చూసిన చంద్రబాబు కూడా.. ఈ రాజధాని తరహాలోనే ఏపీ రాజధాని అమరావతిని నిర్మించాలని అక్కడి అధికారులను కోరారట. అంతేకాదు రష్యా నుంచి విడిపోయిన తరువాత కేవలం పదేళ్లలోనే రాజధానికి అద్భుతంగా నిర్మించుకోగలిగారని.. తనకు ఇక్కడికి వచ్చిన తరువాతే ఆస్తానా రాజధాని ఈ స్థాయిలో ఉందన్న విషయం అర్ధమైందని.. కజకిస్థాన్ అధికారులు అమరావతిలో పర్యటించి కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు వారిని కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికి మోడీ గారు రాజధానికి నిధులు కేటాయించడంలో ఎలా వ్యవహరించినా.. ఇలాంటి సలహాలు మాత్రం బాగానే ఇస్తున్నారు.

కాశ్మీర్లో ఇంకా హైటెన్షన్..

  కాశ్మీర్లో ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అక్కడి అల్లర్ల వల్ల మృతుల సంఖ్య 30 కి పెరుగగా.. పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. భద్రతా దళాల సంఖ్య కూడా కేంద్రం పెంచినా.. ఆందోళనకారులు మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తీవ్రవాదులు హ్యాండ్ గ్రనేడ్ దాడి చేశారు. దీంతో పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలో.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది కుల్గాంలోని దమ్హల్ హంజిపోరాలో ముగ్గురు పోలీసుల ఆచూకీ లభించడం లేదు. పోలీస్ స్టేషన్‌పై దాడిచేసిన దుండగులు ఆయుధాలు, పోలీస్ రికార్డులు, వైర్‌లెస్ సెట్లను ఎత్తుకుపోయారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

చంద్రబాబు రష్యాలో.. మనసు ఏపీలో..

  ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తూ.. విదేశీ పర్యటనల ద్వారా... రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి గట్టిగా ప్రయత్నిస్తూ... రాష్ట్ర పరిస్థితులను ఎప్పుటికప్పుడు సమీక్షిస్తూ.. ఆదిశగా పాలన సాగిస్తున్నారు. అయితే ఇది మరోసారి నిరూపించారు చంద్రబాబు. ఆయన రష్యా పర్యటనలో ఉన్నాగానీ.. ఆయన దృష్టి మాత్రం రాష్ట్రంపైనే ఉంది. అక్కడి నుండే రాష్ట్రంలోని పరిస్థితుల గురించి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. గత మూడు నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తింది. దీంతో పట్టిసీమకు కూడా వరద ముప్పు పొంచి ఉండటంతో పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన అక్కడి నుంచే ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి చంద్రబాబు ఎక్కడ ఉన్నా మనసు మాత్రం ఏపీపైనే ఉంటుందని దీనిద్వారా తెలుస్తోంది.

కాశ్మీర్లో ఆరని మంటలు..

కాశ్మీర్లో పరిస్థితి ఇప్పుడు ఇంకా ఆందోళనకరంగా తయారైంది. గత రెండు రోజుల నుండి జరుగుతున్న అల్లర్లు.. ఈరోజు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు ఈ ఆందోళనల వల్ల 23 మంది మృతి చెందారు. మరో 250 మందికి పైగా గాయాల‌పాల‌య్యారు. పలు చోట్ల కర్ఫ్యూ విధించారు కూడా. అయితే ఆందోళనకారులు ఇంకా రెచ్చిపోతున్న నేపథ్యంలో కేంద్రం మరో 800 మంది సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపింది. ఇప్పటికే 1200 మంది సహాయక సిబ్బందిని కశ్మీర్‌కు పంపగా.. అల్ల‌ర్లు రోజురోజుకీ పేట్రేగిపోతుండ‌డంతో కేంద్రం బలగాలను మరింత పెంచాలని నిర్ణ‌యం తీసుకొని 100 మంది సిబ్బంది చొప్పున ఎనిమిది బృందాల‌ను అక్క‌డి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పంపించింది.