దూసుకుపోతున్న హిల్లరీ.. ట్రంప్ ఇప్పుడైనా మారతాడా..!

  అమెరికా అధ్యక్ష పదవిపై ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ డొనాల్డ్ ట్రంప్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్నారు అందరూ. అంతే కాదు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ఆయన పాపులర్ అవ్వడానికి.. ఆయనకు ప్లస్ పాయింట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అవే ఆయనను ముంచేటట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న కంపు వల్ల ఇప్పుడు హిల్లరీకి మద్దతు పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో ఆంగ్లో ఇండియన్స్ తమ మద్దతును హిల్లరీకి తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిల్లరీ గెలిస్తే అందరికీ మేలు జరుగుతుందని.. ట్రంప్ తో అంతా నాశనమే అవుతుందని ఆరోపించారు. అంతేకాదు ఆమె ప్రచారంలో ఎలాంటి తప్పులు చేయలేదు.. ఆమెకు అన్ని విషయాలపై అవగాహన ఉంది.. ఇప్పటికే తనను తాను నిరపూపించుకున్నారు అని అన్నారు. ఇంకా ట్రంప్ కు భారతీయులంటే పడదు.. ముస్లింలు గిట్టదు.. మెక్సికన్లు అంటే అసహ్యం.. అలాంటి ట్రంప్ చేతిలో దేశాన్ని పెడితే సర్వనాశనం అవుతుందని అన్నారు.   మరోవైపు ట్రంప్ పై మాత్రం విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో కూడా విమర్శలు ఉన్నా.. అప్పుడు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు తాజాగా వెలువడ్డ అన్ని సర్వేల్లోనూ ట్రంప్ కంటే హిల్లరీకి 4 శాతం మేర విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ మద్దతు కూడా హిల్లరీకి లభించింది. దీంతో ఆమెకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుపుతున్నారు.   మరి ఇప్పుడైనా ట్రంప్ కాస్త తన నోటికి పని తగ్గిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలే ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడు అయితే సర్వనాశనం అవుతుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాబట్టి కొన్ని రోజులు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగ్గిస్తే గెలిచే అవకాశాలు ఉండవచ్చు. లేకపోతే ఇలానే కంటిన్యూ అయితే హిల్లరీకే ప్రజలు అధికార పగ్గాలు కట్టబెడతారు. ట్రంప్ ఇప్పుడైనా మారతాడో లేదో చూద్దాం..

సచిన్ టెండూల్కర్ పిటిషన్... కొట్టేసిన కోర్టు..

  క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సచిన్ కు భారతరత్న అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీకే నశ్వా అనే వ్యక్తి సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డును దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ కోర్టులో పిల్ దాఖలు చేశాడు. సచిన్ అవార్డును ప్రకటనలు పొందేందుకు ఉపయోగించుకున్నాడని.. అలాగే కొంతమంది రచయితలు సచిన్ మీద పుస్తకాలు రాశారని, ఆ పుస్తకాలకు భారతరత్న అని పేరు పెట్టుకున్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఎవరో రచయితలు సచిన్ పై పుస్తకం రాసి దానికి భారత రత్న అని పేరు పెడితే.. దానికి సచిన్ ఎలా బాధ్యులు అవుతారు.. ఇక ప్రకటనల విషయంలో కూడా చర్యలు తీసుకునేందుకు నియమాలేవీ లేవని తెలిపింది.

జగన్ కు భారీ షాకిచ్చిన మున్సిపల్ కార్పోరేటర్లు...

  వైసీపీ పార్టీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీలోకి వలసల పర్వం మళ్లీ మొదలైంది. ముందు ఎమ్మెల్యేలతో మొదలై..ఆ తర్వాత ఎమ్మెల్సీల వరకూ వెళ్లింది. ఇప్పుడు కార్పొరేటర్లు కూడా ఆ దారి పట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది కార్పోరేటర్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. నిన్న కడప నుంచి హైదరాబాదు వచ్చిన 8 మంది కార్పొరేటర్లకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో స్వయంగా కండువాలు కప్పి తన పార్టీలోకి ఆహ్వానం పలికారు. కాగా ఇప్పటికే ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి విదితమే. మరి ఇంకా ఎంతమంది టీడీపీ బాట పడతారో చూడాలి.

బీహార్‌లో మావోల ఘాతుకం..10 మంది జవాన్ల మృతి

బీహార్‌లో మావోయిస్ట్‌లు రెచ్చిపోయారు. ఔరంగాబాద్, గయ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన దుమారిలో గల అటవీ ప్రాంతంలో కోబ్రా బెటాలియన్‌పై మావోలు ఈఐడీలను పేల్చడంతో 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి..ఈ కాల్పుల్లో నలుగురు మావోలు మరణించినట్లుగా తెలుస్తోంది. కొంతమంది జవాన్లు గాయపడ్డారు..వారిని తరలించేందుకు హెలికాఫ్టర్‌ను పంపినా మావోయిస్ట్‌లు కాల్పులు జరుపుతుండటంతో హెలికాఫ్టర్ తిరిగి పట్నా చేరుకుంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఘటనా స్థలం నుంచి సమాచారం అందడం లేదు. మావోలపై పోరు కోసం కేంద్రం 205వ కోబ్రా బెటాలియన్ జవాన్లను అక్కడ మోహరించారు.

జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ ఓకే..!

  కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌(జీఎస్టీ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేసింది. అయితే ఈసారి మాత్రం ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపే అవకాశం ఉందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ బిల్లుకు ఆమోదం తెలుపడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని మోడీ కూడా పలుమార్లు ఈ బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇంకా కాంగ్రెస్ లో కీలక నేతలతో భేటీ అయ్యారు. అప్పుడు పలు అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి త్రప్రాయంగా అంగీకరించింది. దీనికి కాంగ్రెస్ ఓ షరతు పెట్టగా.. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి.. కాంగ్రెస్‌ డిమాండ్‌ మేరకు రాజ్యసభలో కనీసం 5 గంటలపాటు చర్చించడానికి అంగీకరించింది. అయితే చర్చ చేపట్టే తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు.   మరోవైపు కాంగ్రెస్ పార్టీ అయితే తమ మద్దతు తెలిపింది కానీ.. మిగిలిన పార్టీ కూడా ఆమోదం తెలిపితేనే బిల్లు పాస్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రథాని మోడీ మిగిలిన పార్టీల ఆమోదాన్ని పొందడానికి కూడా వారితో చర్చలు జరపాలని పార్టీ నేతలకు సూచించారట. ఇక అన్ని పార్టీలు కనుకు ఆమోదం తెలిపినట్టయితే.. బిల్లు అమలైనట్టే. చూద్దాం ఏం జరగుతుందో.

ఇన్ఫోసిస్ స్వాతిది పరువు హత్యా..?

గత నెలలో చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో హత్య చేయబడ్డ స్వాతిపై డీపీఐ ప్రధాన కార్యదర్శి తిరుమావళవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసు విచారణలో భాగంగా బన్రూటి కోర్టులో విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతి మతం మార్చుకుని ప్రేమలో పడిందని, ఆమెది పరువు హత్యని తిరుమావళవన్ ఆరోపించారు. రామ్ కుమార్ ఏకపక్ష ప్రేమ హత్యకు కారణం కాదని, రాష్ట్ర పోలీసులు ఎన్నో వాస్తవాలను దాచి పెట్టారని ఆయన అన్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, నిజాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని అన్నారు. రాష్ట్రంలో పరువు హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వెంకయ్య, మాయావతి.. ఢీ అంటే ఢీ

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా.. వెంకయ్య నాయుడికి, బిఎస్పీ అధినేత్రి మాయావతి కి మధ్య తీవ్ర వాగ్యాదం జరిగింది. గుజరాత్ లో దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాయావతి మాట్లాడుతూ.. దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని.. దీనికి కేంద్రానిదే బాధ్యత అని మండిపడ్డారు. గుజరాత్‌లోని యునా పట్టణంలో గో రక్షక దళం కార్యకర్తలు దళిత యువకులను బహిరంగంగా కొట్టి పేడ తినిపించారనే విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి దేశంలో దళితులపై దాడులు పెరిగాయని మాయావతి ఆరోపించారు.   దీనికి వెంకయ్య నాయుడు స్పందించి మాయవతి వ్యాఖ్యల్ని ఖండించారు. పార్టీ పేరు ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా అంశం గురించి మాట్లాడేప్పుడు దానిలో ఉన్న అంశాన్ని గురించి మాట్లాడాలి కానీ... పార్టీ పేర్లను ప్రస్తావించడం సబబు కాదని అన్నారు. మరి సమావేశాలు ప్రారంభమైన ఇప్పుడే ఇంతలా ఉంటే ముందు ముందు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.

శ్రీవారి దగ్గరా ఆధార్ కావాల్సిందే..

ఏ పథకం కింద ప్రయోజనాలు పొందాలన్నా..చివరికి సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డ్ కావాల్సిందే. తాజాగా కోట్లాది మంది ఇలవేల్పు తిరుమల శ్రీవారి దేవాలయంలోనూ ఆధార్ తప్పనిసరి కానుంది. స్వామి వారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని జేఏవో శ్రీనివాసరాజు కోరారు. వచ్చే గురువారం నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్టు ఆయన చెప్పారు. దీంతో పాటు శ్రీవారి కానుకల లెక్కింపునకు కొత్త కాంప్లెక్స్ నిర్మించనున్నట్టు వివరించారు. స్వచ్చ భారత్‌లో భాగంగా తిరుమలలో వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించనున్నట్టు వెల్లడించారు.

క్రికెటర్ కు తప్పిన ప్రమాదం..

  టీమిండియా క్రికెటర్, కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ కు ప్రమాదం తృటిలో తప్పింది. కరుణ్ నాయర్ నిన్న పంపానదిలో స్నేక్ బోట్ లో ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు పడిపోయింది. సుమారు 100 మంది ప్రయాణికులతో ఉన్న పడవ తల్లగిందులై పడిపోగా అందులో ఉన్న వారందరూ నదిలో పడిపోయారు. అయితే అదృష్టవశాత్తు..ప్రయాణిస్తున్న పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వారిలో ఇద్దరు మాత్రం గల్లంతైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయంలో జరిగే వాల్లా సద్యా ఉత్సవానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే అక్కడి రెస్యూ సిబ్బంది తక్షణం స్పందించడంతో ఇద్దరు మినహా మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారని ఆర్నామూలా పోలీసులు తెలిపారు.

అమ్మాయిలతో ఎమ్మెల్యే చిందులు..

  ఈ మధ్య జేడీయూ ఎమ్మెల్యేలు పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే అసెంబ్లీకి తాగి వచ్చిన నేపథ్యంలో జేడీయూకు చెందిన నేత సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నాడు. బీహార్లో జేడీయూ ఎమ్మెల్యే శ్యాం బహదూర్ సింగ్ డ్యాన్సింగ్ గర్స్త్ తో డ్యాన్స్ చేస్తూ బుక్కయ్యాడు. అది కూడా అభ్యంతరకరమైన పరిస్థితుల్లో. అయితే ఈ ఘటన గత ఏడాది చోటుచేసుకోగా.. ఇప్పుడు ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా తిరునాళ్లలో, జాతరల్లో నిర్వహించే అభ్యంతరకర నృత్యాలు దాదాపుగా బ్యాన్ అయిన విషయం తెలిసిందే. అలాంటిది వాటిని ఖండించాల్సిన నేతనే ఇలాంటి పనలు చేస్తున్నారంటూ అందరూ తిట్టి పోస్తున్నారు. మరి సదరు ఎమ్మెల్యే గారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

అమ్మాయిలు పందులు.. అసహ్యకరమైన జంతువులు.. ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పి వివాదంలో కూరుకుపోయాడు. అసలే ఎప్పుడు చూసినా వివాదాస్ప వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఈసారి ఏకంగా మహిళలపై తన నోరు పారేసుకున్నాడు. దీంతో మహిళలు నిరసనలు మొదలుపెట్టారు. అసలు సంగతేంటంటే..  జీఓపీ ప్రైమరీలో తనకు ప్రత్యర్థిగా నిలిచిన మహిళ కార్లీ ఫియొరినాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ముఖం చూడండి.. ఆ ముఖం చూస్తే ఎవరైనా ఓటేస్తారా?.. అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యే ముఖమేనా అది..! అంటూ విమర్శించారు. అంతేనా తనను ప్రశ్నలడిన ఓ యాంకర్ ను సైతం ఆమె ఒక తెలివి తక్కువ దద్దమ్మ అంటూ.. అక్కడితో ఆగకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశాడు. మహిళలంటే నాకు మహిళలంటే నాకు అసహ్యం.. అందంగా లేనివారంటే మరింత అసహ్యం.. వారు లావుగా ఉండే పందులు.. అసహ్యకరమైన జంతువులు.. ఐ హేట్ విమన్.. అంటూ తన ఇష్టం వచ్చేసినట్టు వ్యాఖ్యానించాడు.   అంతే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు మహిళలు ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను గౌరవించలేని వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడు ఎలా అవుతాడు.. అంటూ మహిళలు నిరసన చేపట్టారు. అదీ కూడా దుస్తులిప్పి.. అర్ధనగ్నంగా రోడ్డుపై ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రవేశించేందుకు అనర్హుడని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్లీజ్ జోక్యం చేసుకోండి.. మోడీతో కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నేరంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు పలు విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. అంతేకాదు కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేసీఆర్‌ వినతి చేశారు. ఇంకా ఏపీకి తమ రాష్ట్రానికి ఉన్న అనేక సమస్యల గురించి కూడా మోడీ దగ్గర చర్చించినట్టు సమాచారం. హైకోర్టు విభ‌జ‌న‌కు చ‌ర్య‌లు.. ఇంకా ఇతర సమస్యలపై జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో అభివృద్ధి పనులు మిషన్ బగీరధ, మిషన్ కాకతీయ, ఇటీవలే చేపట్టిన హరితహారానికి నిధులు కేటాయించాలని కోరారు.

గోల్డెమెన్ బంగారు చొక్కా ఎక్కడబ్బా..?

  గోల్డెమెన్ దత్తాత్రేయ ఫుగే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఫుగే కొడుకు స్నేహితులే ఇంతటి దారుణానికి ఒడిగట్టారన్న వార్తలు కూడా వచ్చాయి. దాదాపు కోటిన్నర విలువ చేసే బంగారు చొక్కాని ధరించిన దత్తాత్రేయ ఫేమస్ ఆ తరువాత గోల్డెమెన్ గా పేరుపొందాడు. అయితే అతని హత్య ఉదంతం తరువాత ఇప్పుడు అందరి సందేహం అతని బంగారు చొక్కాపై పడింది. ఇంతకీ ఫుగే బంగారు చొక్కా ఏమైందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫుగే కొడుకు శుభమ్ మాత్రం చించ్వాడ్‌లోని రాన్కా జ్యూయెలర్స్‌ వద్ద ఉందని తెలిపాడు. అయితే రాన్కా జ్యూయెలర్స్‌ యజమాని తేజ్‌పాల్ రాన్కా మాత్రం శుభమ్ వ్యాఖ్యల్ని ఖండించారు. గత మూడేళ్ల క్రితం ఫుగే తమకు చొక్కా తయారచేయమని ఆర్డర్ ఇచ్చాడని.. దానిని చేసి ఇచ్చామని.. ఇప్పుడు చొక్కాను తమ దగ్గర ఎందుకు ఉంచుకుంటామని అన్నారు. తాము వస్తువులను కుదవ పెట్టుకునే వ్యాపారం చేయడం లేదని, తమది కేవలం అమ్మకాలు, కొనుగోళ్ల బిజినెస్ మాత్రమేనని అంటున్నారు.   ఆయన ఇంకో వాదన కూడా వినిపిస్తున్నారు.ఆ చొక్కాను చెడగొట్టించి ఉండొచ్చని, ఆ పని చేయడం చాలా సులభమని తెలిపారు. అంతేకాదు ఆ తరువాత రెండుసార్లు వేరే వస్తువులు కొనేందుకు వచ్చారని.. అప్పుడు తమకు చెక్‌లు ఇచ్చాడని, అవి బౌన్స్ కావడంతో ఆయనపై కేసులు కూడా పెట్టామని రాన్కా అన్నాడు.   మరోవైపు ఫుగే మనీలెండరింగ్ కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అప్పుల్లో కూరుకుపోయి ఇన్వెస్టర్లకు లక్షల్లో బాకీ పడ్డాడని.. అప్పుల కారణంగా అమ్మేసి ఉండవచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. కానీ ఆఖరికి ఆ బంగారు చొక్కా ఎక్కుడున్నది మాత్రం మిస్టరీగానే ఉంది.

పబ్లిసిటీకి దూరంగా చంద్రబాబు...

  త్వరలో కృష్ణపుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో ఏపీ ప్రభుత్వం మునిగిపోయింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడటానికి పనులు చేపడుతున్నారు. అయితే ఈసారి మాత్రం కృష్ణ పుష్కరాలకు మాత్రం ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా చూస్తున్నారు చంద్రబాబు. ఎందుకంటే గతంలో గోదావరి పుష్కరాల సమయంలో ఎదురైన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు.   గోదావరి పుష్కరాల మొదలవుతాయి అన్న దగ్గర నుండి.. వాటి ఏర్పాట్ల నిర్మాణంతో పాటు అన్ని విషయాలపై ఊదరగొట్టారు. దీనికి గాను ప్రభుత్వం నిర్వహించిన భారీ ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. దీంతో ఆ పుష్కరాల సమయంలో జరిగిన తోపులాట.. ఏర్పాట్లు సరిగాలేవు అన్న చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో అప్పుడు జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరగకుండా ఉండటానికే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంట. సరిగ్గా ఇంకో 25 రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి.  కానీ ఇంకా ఏర్పాట్లు సరిగా పూర్తి కాలేదు. అందుకే ప్రచారం కనుక చేస్తే అసలే అరకొరవగా ఉన్న ఏర్పాట్లతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పి చంద్రబాబు కూడా ఈ దఫా ప్రచారంపై అంతగా ఫోకస్ చేయట్లేదని వార్తలు వస్తున్నాయి.

పాత్రలు కడిగి.. చీపురుతో ఊడ్చిన కేజ్రీవాల్..

  ఈమధ్య నేతలు చీపుర్లు పట్టి శుభ్రం చేయడం వంటి సామాజిక కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటున్నారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించాలనో.. లేక తమంతట తాము స్పూర్తి పొంది అలా చేస్తున్నారో తెలియదు మొత్తానికి పరిశుభ్రత కార్యక్రమంలో తాము కూడా ఒక చెయ్యి వేస్తున్నారు. ఇప్పుడు  ఆ జాబితాలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చేరిపోయారు. ఈరోజు కేజ్రీవాల్ పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలోని వంట శాలలో వంట పాత్రలు కడిగి.. హాళ్ళు చీపురుతో ఊడ్చారు. యూత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తాము చేసిన తప్పిదానికి క్షమాపణ కోరుతూ ప్రాయశ్చిత్తంగా తామీ పని చేసినట్టు కేజ్రీవాల్ ఆ తరువాత తెలిపారు.   కాగా సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయ ఫోటోను, తమ పార్టీ గుర్తు అయిన చీపురు తో కలిపి ఈ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేజ్రీవాల్ తప్పు చేశారని, సిక్కులకు అపాలజీ చెప్పాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సోమవారం ఉదయమే కేజ్రీవాల్ స్వర్ణ దేవాలయానికి చేరుకొని సామాజిక సేవ చేశారు.

ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాలను సుమిత్రా మహాజన్, హమీద్ అన్సారీలు లాంఛనంగా జరిపించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. ఒక్కొక్కరినీ పేరు పేరునా పరిచయం చేశారు. కాగా ఈ సమావేశాలుఆగష్ట్ 12 వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం దాదాపు 20 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు అందరూ సహకరించాలని..త్వరలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదం పొందే దిశగా విపక్షాలు సహకారం అందించాలన్నారు.

ఆత్మహత్య చేసుకుంటుంది.. కాపాడమంటే కొట్టి చంపారు..

గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యను ఆపమన్నందుకు.. ఇద్దరు యువకులను స్థానికులు చితక్కొట్టారు. వారిలో  ఒకరు మరణించగా.. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో 19 ఏళ్ల షేక్ జాస్మిన్ అనే యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని వారి స్నేహితురాళ్లకు కూడా ఫోన్ చేసి చెప్పింది. అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న వేముల శ్రీసాయి, జొన్నా పవన్ కుమార్ లు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి.. చుట్టుపక్కల వారికి చెప్పడానికి వెళ్లారు. ఈలోపు ఆమె ఉరేసుకొని మరణించింది. కానీ స్థానికులు మాత్రం వారే ఆమెపై అత్యాచారం చేసి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు వారు ఎంత చెప్పినా వినకుండా చితక్కొట్టారు. అయితే ఆఖరికి జాస్మిన్ స్నేహితురాళ్లు అసలు విషయం చెప్పగా వారికి క్షమాపణలు చెప్పి వదిలేశారు.   కానీ ఈ దాడిలో వేముల శ్రీసాయికి తీవ్ర గాయాలవ్వగా ఆస్పత్రిలోనే చికిత్స పొందతూ మరణించాడు. పవన్ కుమార్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. దీంతో తన బిడ్డను అనవసరంగా చంపారని శ్రీసాయి తల్లిదండ్రులు నిరసనలకు దిగారు.