‘బాబు’లో మార్పుకు లోకేష్‌ కారణమా ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సహజ సిద్ధమైన తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ప్రతీ అంశాన్నీ పరిశీలిద్దామనే బాబు ఒక్కసారిగా తేల్చి పారేస్తున్నారు. హఠాత్తుగా బాబులో వచ్చిన ఈ మార్పులు రాష్ట్రంలోని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాను తెలంగాణా ఇవ్వాలని లేఖరాస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీని వెనుక అసలు రాజకీయ ఉద్దేశ్యం వేరేగా ఉందని ఆయన సన్నిహితులే అంటున్నారు. సీమాంధ్రలో వైకాపా అధినేత జగన్మోహనరెడ్డిని తట్టుకుని గెలవటం అసాధ్యమని చంద్రబాబునాయుడు 2012 ఉప ఎన్నికల ఫలితాల అనుభవంతో అంచనా వేస్తున్నారు.     దీన్ని తెలంగాణాలోనే భర్తీ చేయాల్సిన అవసరముందని బాబు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరో కూడా ఇదే అభిప్రాయానికి వచ్చింది. దీంతో బాబు కూడా తన పంధామార్చుకుని తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం ఇవ్వాల్సింది కాంగ్రెస్‌ కాబట్టి తమకేమీ నష్టం జరగదని అభిప్రాయానికి వచ్చారు. తాను ఒక లేఖరాసేస్తే పని అయిపోతుందని భావించిన చంద్రబాబు తెలంగాణాఓటర్ల కోసం తన నిర్ణయాన్ని మార్చేసుకున్నారు. ప్రతీపనీ ఆలస్యం చేసే బాబు తెలంగాణా ప్రత్యేకరాష్ట్రమే కాకుండా వర్గీకరణ చేయాల్సిందేననే డిమాండుతో ప్రజల ముందుకు రానున్నారు. ఏలాగూ వర్గీకరణ తన ప్రభుత్వ హయాంలో వచ్చిందే కాబట్టి ఇప్పుడు మాదిగలను సిద్ధం చేసుకుంటే 2014ఎన్నికల్లో బీసీలు, ఎస్సీల్లో మాదిగలు కష్టపడి పని చేస్తారని తెలుగుదేశం ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చింది. అలానే ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే చర్చించేయాలని చంద్రబాబు పొలిట్‌బ్యూరోను కంగారుపెడుతున్నారట. బాబు నిజంగానే మారిపోయారా? అన్నట్లుగా ఆయన తీరుందని ఆ పార్టీనేతలే చెబుతున్నారు. అయితే బాబును నడిపిస్తున్నది మాత్రం ఆయన కుమారుడు నారా లోకేశ్‌ అంటున్నారు. ఈ మార్పు లోకేశ్‌ మార్కు కావచ్చని తెలుగుదేశం పార్టీ శ్రేణులంటున్నాయి.

రెడీమేడ్‌ కార్యకర్తలతో వైకాపా రెడీ?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని ప్రాంతాల్లోనూ బలమైన శక్తిగా ఎదుగుతోందన్న విషయం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ గుర్తించారు. అయితే ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి కూడా రాజకీయ వంశానికి చెందిన వారికే ప్రాథాన్యత కల్పిస్తున్నారని ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. అంటే రెడీమేడ్‌గా మనం బట్టలు కొన్నట్లే రెడీమేడ్‌గా కార్యకర్తలున్న నాయకులను పార్టీలో చేర్చేసుకుంటున్నారన్న విషయం తేటతెల్లం అవుతోంది.     తాజాగా పీజెఆర్‌ కుమార్తె విజయ వైకాపాలో చేరారు. ఈమెతో పాటు కార్యకర్తలూ వలస వచ్చారు. పీ జనార్థనరెడ్డికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మథ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేది. అటువంటిది విజయ రెండుసార్లు జగన్‌ కోసం చంచల్‌గూడా జైలుకు వెళ్లారు. ఆ తరువాత విజయమ్మ సమక్షంలో వైకాపా తీర్థం తీసుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే కార్యకర్తల సమీకరణలోనూ, ప్రాంతాల వారీగా కలవాల్సిన వ్యక్తుల డైరీనీ విజయ సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. తెలంగాణాలో పీజెఆర్‌ అన్న పేరుకే ఒక ముఖ్యమంత్రికి ఇచ్చినంత విలువ ఇచ్చేవారు. ప్రజాసమస్యలపై ఆయన గళం ఎత్తాడంటే రాష్ట్రముఖ్యమంత్రి అయినా ప్రతిపక్షనాయకుడైనా హడలిపోవాల్సినంత వేగంగా చర్యలు తీసుకునేవాడు.   పీజెఆర్‌ మరణం తరువాత కాంగ్రెస్‌లో అటువంటి తెలంగాణా నేత లేడని ఇప్పటికీ కేంద్ర నాయకత్వం గుర్తుచేసుకుంటూనే ఉంటుంది. పీజెఆర్‌ కుమార్తె వైకాపాలో చేరటం ఒకరకంగా టిఆర్‌ఎస్‌కు మింగుడుపడని విషయం. ఎందుకంటే తెలంగాణాలో ఈమెకు ఉండే ఫాలోయింగు టిఆర్‌ఎస్‌కు ఎదురుగాలివంటిదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయలాగ ఉండే నాయకులకే పెద్దపీట వేయాలని, వలసతో పాటు పార్టీ బలోపేతం అయ్యే ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోకూడదని వైకాపా భావిస్తోంది. అందుకే వలస నాయకుల చేరిక కోసం ఎదురుచూస్తోంది.

చంచల్‌గూడా చేరుతున్న కిరణ్‌ క్యాబినేట్‌

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఒక్కొక్కటిగా ‘నిజాలు’ వెలుగు చూస్తుంటే ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం వేయటం లేదంటే నిజంగా ఆశ్చర్యపోవల్సిందే...! వైఎస్‌ పాలనలో ఇబ్బడి ముబ్బడిగా విడుదల చేసిన జీవోలు రాష్ట్ర సంక్షేమం కోసం కాదనీ, కేవలం పుత్రప్రేమతో చేసిన సంతకాలేననీ సిబిఐ రుజువులతో నిరూపించే ప్రయత్నాలు చేస్తుంటే... ఏదో ఒక క్షణంలో మంత్రులు కూడా బోనెక్కుతారని అందరూ ఊహించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసిన సిబిఐ సోమవారం నాలుగో ఛార్జిషీటు దాఖలు చెయ్యడంతో మరోమంత్రి ముద్దాయయ్యారు.     ‘నిన్న మోపిదేవి... నేడు ధర్మాన... మరి రేపు ఎవరో...’ అంటూ ఎవరికివారే అంచనాలు వేసేసుకుంటున్నారు. మోపిదేవి ఇప్పటికే చంచల్‌గూడా చేరుకున్నారు, నేడోరేపో ధర్మాన కూడా అరెస్టవుతారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే... వైఎస్‌ హయాంలో మంత్రులుగా చేసిన వారందరి ఆస్తులూ, అప్పుల చరిత్రపై నిశిత అధ్యయనం ఇప్పటికే ప్రారంభ మయ్యిందన్న గుసగుసలుకూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ విచారణపర్వం ఇలాగే కొనసాగుతూ రాబోయే కొద్దినెలల్లో కిరణ్‌ క్యాబినేట్‌ను చంచల్‌గూడాకు చేర్చడం ఖాయమంటూ దేశం వర్గాలు జోస్యం చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలతో అటు వైఎస్‌ఆర్‌సిపి, ఇటు కాంగ్రెస్‌ సతమతమౌతూ మంత్రుల సమీక్షాసమావేశాలు చంచల్‌గూడాలోనే జరుపుకోవల్సిన స్థితికి చేరుకున్నామంటూ దేశం వర్గాలు విమర్శనాస్త్రాలు సంధిస్తోంది...! ‘పిల్లుల మధ్య రొట్టెముక్క తగాదా’ కథను గుర్తు తెచ్చుకుంటూ సందట్లో సడేమియాగా 2014 ఎన్నికల్లో తాము అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని దేశం వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి...!

త్వరలో మళ్ళీ పెట్రో మంటలు

ప్రభుత్వరంగ చమురు సంస్ధలు మొదటి త్రైమాసికంలో కనీవినీ ఎరుగని రీతిలో నష్టాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలు రాకపోవడంతో కంపెనీ నష్టాలు మరింత పెరిగాయని తెలిస్తోంది. ఉత్పత్తి వ్యయాలంటే తక్కువ ధరకు ఉత్పత్తులు విక్రయించి నష్టపోయినట్లు మూడు ప్రభుత్వ రంగానికి చెందిన చమురు సంస్ధలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియంలు చెబుతున్నాయి. ప్రతిలీటరు పెట్రోల్‌పై 3.56 రూపాయలు నష్టపోతున్నామని తెలిపారు. దీంతో పెట్రోలియం పై మూడు రూపాయలు పెంచాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ దేశంలో అతి పెద్ద రిటైల్‌ సంస్థ. మొదట త్రైమాసికంలో భారత దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 22,451 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ప్రభుత్వం నుండి బకాయిలు రాకపోవడంతో పెద్ద మొత్తంలో బకాయిలు పెరిగిపోయాయని ఐఒసి తెలిపింది. మార్కెట్‌ ధరలకంటే తక్కువదరకు కిరోసిన్‌,వంటగ్యాస్‌, డీజిల్‌ విక్రయించడం వల్లే ఇంత భారీ నష్టాలు వచ్చాయని వారు తెలిపారు. వాస్తవానికి తమ క్రెడిట్‌ బిల్‌1,10,00,000 కోట్లరూపాయలని ఇప్పటికే 90,000 కోట్ల పైన క్రెడిట్‌ బిల్లు వాడుకున్నామని చమురు సంస్దలు తెలియచేశాయి. ఇకపై ప్రభుత్వం నుండి బకాయిలు అందకపోతే తాము అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు కొనలేమని ఐఓసి చైర్మన్‌ అన్నారు. దేశంలోని అతిపెద్ద సంస్థల్లో మూడోదైన హిందూపెట్రోలియం ఏప్రిల్‌ - జూన్‌ కి నికర నష్టం 9,249 కోట్లు ప్రకటించింది.

ముఖ్యమంత్రిగా జానా ? పిసిసి అధ్యక్షుడిగా కన్నా ?

రత్నగిరికి కేటాయించిన గ్యాసును ప్రధానమంత్రితో మాట్లాడి మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వెనక్కి తీసుకురావడం తన పనితనంగా చెప్పు కొస్తున్నారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. అందుకోసం కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని అసమర్దునిగా, ఎంపిలను రాష్ట్రానికి ఏమీ చెయ్యని వారిగా చిత్రీకరిస్తున్నారని జైపాల్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. నిజానికి 11 నెలల ముందుగానే జైపాల్‌రెడ్డి రత్నగిరికి గ్యాసు వెళుతున్నదన్న విషయాన్ని లీకు చేసి ప్రధాన మంత్రితో మాట్లాడాలని చెప్పి, 11 నెలల పాటు అడ్డుకున్నా దానికి కృతజ్ఞత తెలుపకుండా అభాండాలు వేస్తున్నారని వారు ఆగ్రహిస్తున్నారు. ఇప్పుడిది చిలికి చిలికి గాలివానగా మారింది. అసలే గవర్నర్‌కు ముఖ్యమంత్రికి సయోధ్య అంతంత మాత్రమే. దీనికి తోడు జైపాల్‌రెడ్డితో గొడవ. శనివారం జైపాల్‌రెడ్డితో గవర్నర్‌ భేటీ.. .ఆదివారం వాయిలార్‌రవి రాష్ట్రానికి రాకతో కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ నీయాంశమైంది. ఆగస్టు 15 తర్వాత పిసిసి అద్యక్షుడు, ముఖ్యమంత్రి మారతారని పార్టీలో జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికి తోడు గవర్నర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గులాం నబీఆజాద్‌ను కలవడం కీలకంగా మారింది. మంత్రులతో కిరణ్‌కుమార్‌రెడ్డికి సమన్యయం లేదని, సీఎం కార్యాలయ పని తీరు కూడా బాగోలేదని దీనివల్ల ప్రజలకు చెడుసంకేతాలు అందుతున్నాయంటూ గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్ర వ్యవహారల ఇన్‌చార్జ్‌ ఆజాద్‌ కి చెప్పినట్లు తెలుసింది.   2014 లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉండాలంటే కిరణ్‌కుమార్‌ని మార్చాల్సిందే అని కూడా తెలియచేశారు. దీంతో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా జానారెడ్డి, పిసిసి ప్రసిడెంటుగా కోస్తాకు చెందిన వ్యక్తిని నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. జానారెడ్డికి రాయలసీమ, కోస్తాంద్రవారితో సత్‌ సంబందాలన్నాయని జైపాల్‌రెడ్డి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయని తెలిసింది. తెలంగాణ నుండి మాజీ పిసిసి చీఫ్‌ డి శ్రీనివాస్‌కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మర్రి శశిధర్‌రెడ్డి కూడా చాపక్రింది నీరులా తన ప్రయత్నాలు చేస్తున్నారు. శశిధర్‌ రెడ్డికి గులాంనబీ ఆజాద్‌ ఆశీస్సులున్నాయంటున్నారు. పిసిసి ప్రసిడెంట్‌ బొత్స తన ప్రయత్నాలతో వారంలో రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటున్నారు. అయితే బొత్స మంత్రులకు మద్య చిచ్చుపెడుతున్నారని, ఏడుగురు మంత్రులు అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బొత్స స్ధానంలో మంత్రి కన్నాలక్ష్మీనారాయణను నియమిస్తారంటున్నారు.ఆయనకు చిరంజీవితో పాటు సీమాంద్రకు చెందిన పలువురు ఎంపీలు కూడా మద్దతిస్తున్నారు. రాష్ట్రంలో దళితులు, క్రైస్తవులు, రెడ్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ లో ఉంటున్నారని అలాగే బిసిలంతా తెలుగుదేశం వైపు ఆకర్షితులవుతున్నారని, కోస్తాలో బలమైన వర్గం కాపులు, రాయలసీమలో బలిజలు కాంగ్రెస్‌ పార్టీలో ఉండాలంటే కాపు వర్గానికే పిసిసి పదవివ్వడం సరైన నిర్ణయమంటున్నారు.

ఫలవంతమైన సబ్ కమిటీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల చర్చలు

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యాలకు మధ్య జరుగుతున్నా ఫలు దఫాల చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్‌లో మంత్రుల సబ్ కమిటీ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో ఆదివారం చర్చలు జరపడం దాదాపు 600లకు పైగా కళాశాలలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు అంగీకారం తెలపడం జరిగిపోయింది. అయితే కొన్ని కళాశాలలు మాత్రం ఇప్పటికీ ఫీజును మరింతగా పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.     గత ఏడాది వరకు 31 వేల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగగా ఈ ఏడాది నుంచి అది 35 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పట్ల కళాశాలల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమైనా చివరకు ఈ విషయంలో సింహభాగం కళాశాలలు ఆమోద ముద్ర వేయడంతో ఇంతకాలం వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌కు మార్గం సుగమమైంది. సోమ, మంగళవారాల్లో కౌనె్సలింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభమవుతాయని కూడా భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏకీకృత ఫీజుల విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం 35 వేల రూపాయల ఏకీకృత ఫీజును నిర్ణయించడంతో దీనిపై కోర్టును ఆశ్రయించడం సాధ్యంకాదన్న వాదన కూడా లేకపోలేదు. దీనికి తోడు ఇప్పటికే దాదాపు 35 శాతం మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారన్న గణాంకాలతో కళాశాలల యాజమాన్యాలు కూడా మరికొద్దికాలం గడిస్తే కళాశాలల మనుగడ కూడా దెబ్బతింటుందన్న ఆందోళనతో ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించినట్లు కనిపిస్తోంది.

మంది సొమ్మును మొబైల్‌ కంపెనీలకు దోచిపెడతారా?

అమ్మకు అన్నంపెట్టలేని వాడు పిన్నమ్మకు చీరపెడతానన్నాడని సామెత. ద్రవ్వోల్బణం అరికట్టలేని కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు నిత్యావసర సరుకుల రేట్లను అందుబాటులో ఉంచటం లేదు. పెట్రోలు, పాలు, గ్యాసు, కరెంటు ,రోడ్లు, ఉచితవిద్య, ఉద్యోగాలు ఏమీ ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు సెల్‌పోన్లు ఇవ్వాలని యోచిస్తోంది. మంది సొమ్ము మొబైల్‌ కంపెనీలకు దోచిపెడటం అంటే ఇదే. యుపిఎ గవర్నమెంట్‌ ఇప్పటికే 2 జి స్కామ్‌లో ఇరుక్కున్నా బుద్ది వచ్చినట్లులేదు. కోట్లాది రూపాయలు మొబైల్‌ కంపెనీలకు ధారాదత్తం చేసే మరో కార్యక్రమం చేపట్టారు. 65 సంవత్సరాల స్వతంత్య్ర దేశంలో సామాన్య ప్రజలకు తాగునీరు కనీసం మూడు పూటలు గడిచే మార్గం లేక నానా అవస్తలు పడుతున్నారు.   వాళ్లను ఆదుకునేది పోయి రోజుకు 17 రూపాయలు సంపాదించేవారు పేదవారు కాదన్నారు. పాలు, పంచదార, ఉప్పుతో సహా అన్ని రేట్లు పెరిగినా కేంద్రం నిస్సహాయంగా నిలవడం తప్పమరేమీ చెయ్యలేకపోవడం సామాన్యుడిని ఆవేదనకు గురిచేస్తుంది. పెరుగుతున్న ధరల గురించి, పన్నులు గురించి యువతను విద్యావంతులను చేయటం కాని వారికి ఉద్యోగ భద్రత గాని పెంచకుండా ఏం మాట్లాడాలని సెల్‌ఫోన్లు పంచుతారో తెలియడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.ప్రజల్ని మబ్య పెట్టే పనులు కాకుండా దేశ భవిష్యత్తుకు, ప్రజాశ్రేయస్సుకు ప్రాధాన్యతా పధకాలను చేపట్టాలని రాజకీయ మేధావులు కోరుతున్నారు.

అడకత్తెరలో పోకచెక్కలు ... ఎమ్‌సెట్‌ విద్యార్ధులు

సుప్రీంకోర్టు విద్యార్ధులందరికీ సమానమైన విద్య అందించాలని తీర్పు ఇవ్వటంతో పెరిగిన ఫీజులు ప్రభుత్వానికి ఆర్ధిక భారాన్ని, బిసి విద్యార్ధులకు ఫీజులు చెల్లించుకోలేని పరిస్థితులను కల్పించాయి. మొత్తం మీద రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్యార్దుల పరిస్థితి అస్తవ్యస్తంగా వుంది. ఈ నేపధ్యంలో విద్యార్దుల భవిష్యత్‌ ప్రశ్నార్దకంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పేదవారు ఉన్నత విద్యకు దూరం కాకూడదు అనే లక్ష్యంతో ఈ పధకాన్ని 2008లో ప్రవేశపెట్టారు. అప్పటికి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య 1,50,000 మాత్రమే. కానీ రాను...రానూ...రీఎంబర్స్‌మెంట్‌ ఉండటం వల్ల దీని సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని మేధావులు చెబుతున్నారు.   ఈ సంవత్సరం ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య మూడున్నర లక్షలవరకూ ఉన్నట్లు ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంటర్‌ అంటే ఇంజనీరింగ్‌ అనే పరిస్థితి ఏర్పడిరది. ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలన్నీ మూతపడి కార్పొరేట్‌ కాలేజీలు ఇంజనీరింగ్‌, ఐఐటి, కోర్సుంటూ అంటూ ఫీజులు గుంజుతున్నాయి. ప్రతి కార్పొరేట్‌కాలేజ్‌ సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని బ్రాంచీలతో కలిపి 350 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయనేది అక్షర సత్యం. క్యాలీఫై కాని వాళ్లుకూడా ఇంజనీరింగ్‌లో జాయిన్‌ అవటంవల్ల డిగ్రీలో ఎవరూ చేరని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నాసిరకం ఇంజనీరింగ్‌ చదువుల వల్ల కేవలం 20 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కామర్స్‌కి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్‌ ఉంది కాని ఆ వైపు చూసే విద్యార్దులే లేరు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లెక్కలేకుండా రాష్ట్రంలో 700 ప్రయివేటు కాలేజీలకు పర్మిషన్‌ ఇవ్వడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. యాజమాన్యాలు సరైన సదుపాయాలు లేకుండా ఫీజులు పెంచారన్నది ప్రభుత్వవాదన, అయితే గత ఆరేళ్లుగా 31,000 రూపాయల ఫీజులతో నెట్టుకొస్తున్నామనేది యాజమాన్యాల వాదన.   మంచి విద్య, ఎంప్లాయిమెంట్‌ స్కిల్స్‌, ఇండస్ట్రియల్‌ స్కిల్స్‌, ఫ్యాకల్టీ పెంచడం లేదని ప్రభుత్వం చెబుతుంటే ఇండస్ట్రియలిస్ట్‌లు సహకరించడంలేదని, లెక్చరర్లకి ఆరో వేతన సంఘం సిఫార్సులు వచ్చినా ఐదోవేతన సంఘం సిఫార్సులనే అమలు చేయడం కష్టంగా ఉందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే డీమ్డ్‌ కాలేజీలు మాత్రం సంవత్సరానికి 1,50,000 రూపాయల ఫీజు విద్యార్ధుల నుండి వసూలు చేస్తున్నాయని వారు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలు విద్యార్దులంతా వేసవి సెలవుల్లో మాత్రమే వచ్చి ప్రాజెక్టులు చేపడతామంటున్నారని అందుకే వారిని తీసుకోలేక పోతున్నామని చెబుతున్నారు. అలాగే రిసెర్చి పేరుతో మాకు టాక్సు మినహాయింపునిస్తే విద్యార్దులను మరింత ప్రోత్సహించగలమని కూడా వారు చెబుతున్నారు. కాలం చెల్లిన కోర్సులనే కాలేజీలు అందిస్తున్నాయని, అదీ కంప్యూటర్‌సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలవల్ల యూరప్‌ దేశాల ప్రభావం మన మీద పడుతుందని మేధావులు చెబుతున్నారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాలు, ఉద్యోగావకాశాలు కల్పించే ఇండస్ట్రీలు వీటిమధ్యలో విద్యార్దులు వారి తల్లి,తండ్రులు సమిధలవుతున్నారు. ఏది ఏమైనా విద్యార్దులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదే.

బి.సి.లకు దూరమవుతున్న కాంగ్రెస్‌

రాష్ట్రంలోని బిసి ఓటర్లను ఆకట్టుకుంటానికి తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో 100 సీట్లు, వారి సంక్షేమానికి రూ.10,000 వేల కోట్లు ప్రకటించి ముందంజలో ఉంది. వైసిపి పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి ఓటర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయకుండా వారికి ఫీజురీఎంబర్స్‌మెంటును పాక్షికంగా మాత్రమే చెల్లిస్తాననటం రానున్న ఎన్నికలలో బిసిలను దూరం చేసుకోవడమేనని పలువురు అధికార నేతలు ఆందోళన చెందుతున్నారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఏర్పడ్డ మంత్రుల ఉప సంఘం కూడా అన్ని వర్గాలను కలుపుకు పోవాలని నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ విద్యలో ఏకీకృత ఫీజువిధానం అమలులోకి తేవాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో ఫీజు రిఎంబర్స్‌మెంట్‌ చెల్లింపులపై గత కొద్దిరోజులుగా రాష్ట్ర సర్కార్‌ మల్ల గుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పీతాని సత్యనారాయణ నేతృత్వంలో ఒక ఉపసంఘం వేసింది. ఈ ఉపసంఘం ఇంజనీరింగ్‌ కాలేజీలో కన్వీనర్‌ కోటాకింద విద్యార్ధులు చెల్లించే ఫీజును 31 వేలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మిగాతాది బ్యాంకు రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనితో అధికార కాంగ్రెస్‌ పార్టీ లోని బిసి నాయకులు, సీనియర్‌ నాయకులు భగ్గుమంటున్నారు. బిసి వ్యతిరేక విధానాల వల్ల రానున్న ఎన్నికలలో బిసి ఓటర్లు కాంగ్రెస్‌కు దూరం అవుతారని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.

సత్తిబాబును ఎలా కంట్రోల్‌ చేయాలబ్బా !

ఆధిపత్యం చెలాయించాలంటే అవతలవాళ్లని మాట్లాడ నీయకుండా చేయటమే కరెక్టని చాలా మంది అనుకుంటారు. ఇది రాజకీయనాయకులలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్డర్లు జారీ చేస్తుంటారు. ఎలాంటి చర్చకు తావులేకుండా ఏక పక్ష ప్రకటనలు చేస్తుంటారు. అందులో అందవేసిన చెయ్యి పిసిసి ప్రసిడెంట్‌ బొత్స సత్యనారాయణది. అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఇందిరమ్మ బాట సందర్బంగా పార్టీకార్యకర్తల సమావేశం జరిపించి నువ్వేం చెబుతావ్‌.. ఇంకా ఏమిటి చెప్పేది... ఎంత సేపు మాట్లాడతావ్‌.. అంటూ కార్యకర్తలను మాట్లాడనీయకుండా సమావేశం ముగించేశారు. ఇదే తంతుగా ఇప్పుడు బిసి విద్యార్దుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సబ్‌కమిటీ సమావేశంలో కూడా ఎవరినీ మాట్లాడనీయకుండా పూర్తి స్ధాయి ఆధిపత్యం చెలాయించే దోరణి కనబరిచారని సబ్‌కమిటి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంటుకు 31 వేలకు మించి ఇవ్వలేం. అంతకు మించి ఇవ్వాలంటే ప్రభుత్వంపై భారం పడుతుంది.   దాన్ని భరించలేం. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి ఏమాత్రం బాగోలేదు అంటూ హడావిడి చేసి జనం కోసం మాత్రం పీతాని సత్యనారాయణను పిలచి మీడియాకు వివరించమని పురమాయించడం తమకు దిగ్రాంతి కలుగచేసిందని కమిటీ సభ్యులు వాపోతున్నారు. తర్వాతి రోజు ఫీజులను ఇదివరలో మాదిరిగానే ప్రభుత్వం భరిస్తుందని, కుదిస్తే అంగీకరించడం కుదరదని డిల్లీలో సత్తిబాబు ప్రకటన చేయడం ముఖ్యమంత్రిని ఇబ్బందికి గురిచేయడంకోసమేనని కిరణ్‌వర్గీయులు చెబుతున్నారు. ఇంతకు ముందు కేంద్రప్రభుత్వం రిలయన్స్‌ గ్యాసును మహారాష్ట్రలోని రత్నగిరికి కెటాయించినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు గ్యాసు తేలేనందుకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రిని ఇరకాటం పెట్టారు. తెరవెనుక ఒకలా, తెరపైన మరోలా మాట్లాడుతూ బొత్ససత్యనారాయణ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారని ముఖ్యమంత్రి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తిబాబును కంట్రోల్‌ ఎలా చేయాలో తెలియక వారు సతమతమవుతున్నారు.

భార్యకోసం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సబ్బం హరి

సబ్బం హరి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ నేత ! కాంగ్రెస్‌ పార్టీ ఎం.పీ.గా ఉంటూ ఎప్పుడూ సోనియా గాంధీని విమర్శిస్తూ విజయమ్మ, జగన్‌ క్షేమాన్ని కోరుకుంటుంటారు. జగన్‌ పార్టీ పెట్టిన వెంటనే చాలామంది నాయకుల మాదిరిగానే సబ్బం హరి కాంగ్రెస్‌కు బై చెబుతారని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు కాని అదేమీ జరగలేదు. ఇప్పటికీ ఆయన టెక్నికల్‌గా కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తిగానే కొనసాగుతున్నారు. అదేమంటే భార్యకు అనారోగ్యం కాబట్టి విదేశీ వైద్యానికి ఎంపిగా రాజనామా చేయకుండ వుంటేనే వెలుసుబాటుగా ఉంటుందంటారు. దీంతో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులంతా ఆయనపై గుర్రుగా ఉంటున్నారు. విహన్మంతరావు లాంటి సీనియర్లు కాంగ్రెస్‌ అధిష్టానికి అనేక మార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఫలితం శూన్యం. పిసిసి ప్రసిడెంట్‌ బొత్స సత్యన్నారాయణ సబ్బం మీద పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రకటన చేస్తే తాను ఎంపినని తన మీద చర్యలు తీసుకోవడం కుదరదని చెప్పారు.     ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవంలో సుధాకర్‌రెడ్డి పార్టీలో కోవర్టులున్నారని పరోక్షంగా సబ్బం హరిని ఉద్దేశించే అన్నారు. సబ్బం హరి సామాన్యుడేమీ కాదు వైసిపి నాయకులతో ఎంత సన్నిహితంగా ఉంటున్నారో కాంగ్రెస్‌ వారితోనూ అంతే సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తారు.లోక్‌సభలోనూ, లోక్‌ సభ ఆవరణలోనూ కాంగ్రెస్‌ ఎంపిలతో చలోక్తులు విసురుతూ కనిపిస్తుంటారు.సబ్బం హరి ఆడుతున్న ఈ ద్విపాత్రాభినయాన్ని ఎంత కాలం సహించాలని సీనియర్లు అధిష్టానంపై వత్తిడి పెంచుతున్నారని తెలుస్తుంది.

జగన్‌ శిబిరంలో నిరుత్సాహాం?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చేస్తాడని ఆ పార్టీ నేతలు ఆశలు పెంచుకున్నారు. సుప్రీంకోర్టులో తన అరెస్టుపై సిబిఐను సవాల్‌ చేస్తూ జగన్‌ దాఖలు చేసిన కేసును ధర్మాసనం డిస్మిస్‌ చేసింది. దీంతో ఆ పార్టీ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. అంతేకాకుండా ఇకపై నియోజకవర్గాల్లో ఎలా నెగ్గురావాలన్న ఆలోచనల్లో పడ్డారు. జగన్‌ కనుక బయటకు వస్తే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహంతో నింపాలని పలుప్రణాళికలు వేసుకున్న వారికి సుప్రీం తీర్పు శరాఘతంలా తోచింది. అందుకే దీనిపై వ్యాఖ్యానించటానికి కూడా మీడియా ముందుకు రాలేదు.   ప్రత్యేకించి ఏలూరులో విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ గురించి ధర్నా చేస్తామని ప్రకటించిన వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఒక్కరోజు తన కార్యక్రమం వాయిదా వేసుకోవటానికి కారణం జగన్‌కేసు అని తెలుస్తోంది. ఆమె అనుకున్నట్లు తన కుమారుడు ఇంటి వచ్చేస్తే తాను ధర్నా విజయవంతం చేసి జగన్‌ను గొప్పగా చూపాలని ప్రణాళిక వేసుకున్నారు. తీరా చూస్తే సుప్రీం కోర్టు కేసును డిస్మిస్‌ చేయటంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారని సమాచారం. ఏదేమైనా జగన్‌ అక్రమాస్తుల కేసులో సిబిఐ కొంత పట్టుదలగా వ్యవహరిస్తోంది. తన కాల్‌లిస్టు విషయంలో జోక్యం చేసుకున్నందుకు జెడి లక్ష్మినారాయణ కూడా కేసును సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా సమాచారహక్కు చట్టాన్ని ఆయన ఉపయోగించుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటి దాకా లేని ఒక కొత్త అంశం వైకాపాను వేధిస్తోంది. ఒకవేళ అక్రమాస్తులు సేకరించారన్న పూర్తి ఆధారాలతో జగన్‌కు శిక్షపడితే తమ పార్టీ భవిష్యత్తు ఏమిటనేది నేతలు ఆలోచిస్తున్నారు. దీని గురించి ఇటీవల కార్యకర్తల అభిప్రాయాలు కూడా పార్టీ నేతలు సేకరిస్తున్నారట. అయితే వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎంత కాలం పార్టీ గురించి పని చేయగలరన్న అంశంపై కూడా పార్టీలో అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో, తమ పార్టీ భవిష్యత్తు ఏమిటో అర్థం కాక వైకాపా నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు.

సబ్బం హరి ఏ పార్టీలో ఉన్నట్లు?

విశాఖజిల్లా ఎంపి సబ్బం హరి తాను గెలిచిన పార్టీనే విమర్శిస్తూ పబ్బ(కాల)ం గడుపుకుంటున్నారని కాంగ్రెస్‌నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అథినేత జగన్మోహనరెడ్డి అరెస్టు సమయంలో తెరపై ప్రత్యక్షమైన ఈయన ఆ తరువాత కాంగ్రెస్‌పై విమర్శలను చేశారు. పలురకాలు విమర్శలు చేస్తూ హరి తాను ప్రకటించినట్లు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదు. అంతేకాకుండా కాంగ్రెస్‌నాయకులను పలకరిస్తూ వారితోనే తిరుగుతూ అదేపార్టీని దూషించటం హరి ప్రత్యేకతలా ఇటీవల దుమారం లేస్తోంది. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో మాదిరిగా హరి ఎవరి ద్వారా లబ్దిపొందుతారో వారినే తిడతారని అన్నిపార్టీల నేతలు అంటున్నారు.   ఆయన్ని ప్రోత్సహించే వారిదే తప్పుకానీ, హరిది ఏ మాత్రం తప్పుకాదని కూడా తేలుస్తున్నారు. అలా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో పూర్తిగా చేరలేదు. కనీసం తన నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ వైకాపా అభివృద్థికి చేసిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదని ఈయన ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్రుగా ఉన్నారు. తమ ఎంపి అని చెప్పుకోవటానికే హరి ఉన్నాడని వైకాపా నాయకులు ఒకరు తాజాగా ఆరోపణ చేశారు. ఇంకా కాంగ్రెస్‌ కార్యకర్తలతోనే హరి కాలం గడుపుతున్నారని ఆయన వైకాపా సీనియర్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించాలో, లేక హరికి జగన్‌తో ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టించుకోకూడదో సీనియర్లకూ అర్థం కావటం లేదు. ఏమైనా హరి ఎక్కడ ఉంటే అక్కడ గందరగోళమని తాము నవ్వుతూ వ్యాఖ్యానించక తప్పదని వైకాపా నేతలు అంటున్నారు.

గంజాయి దొంగలు దొరకరా?

గంజాయి దొంగలను పట్టుకోవటమే మరిచిపోయిన ఎక్సయిజ్‌ చాలా కాలం తరువాత అరెస్టు చేసి కోర్టుదాకా వారిని తీసుకువెళ్లింది. ఇంత వరకూ బాగానే ఉంది కోర్టు ముందుకు వచ్చాక ఎక్సయిజ్‌ సిబ్బంది కళ్లు మూసుకున్నారు. అంతే కళ్లుతెరిచేలోపే దొంగలు పరారయ్యారు. రెండురోజుల పాటు వారికి కాసిన కాపాలా వృథా అయిపోయిందని ఎక్సయిజ్‌ సిబ్బంది తిరిగి గంజాయిదొంగల వేటకు బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరులో సంచలనమైంది.   ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయిసాగు విస్తరిస్తోందని ఆరోపణల నేపధ్యంలో అక్కడి ఎక్సయిజ్‌ సిబ్బంది దాడులకు ప్రణాళిక వేసింది. దాని ప్రకారం గ్రామాల వారీ శోధన, తనిఖీలు చేస్తూ చివరికి గంజాయిదొంగలను గుర్తించింది. వీరు ఒడిశ్శాకు గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారాన్ని ఎక్సయిజ్‌ పోలీసులు ధృవీకరించుకున్నారు. వెంటనే వీరిని పాడేరు ఎక్సయిజ్‌పోలీసుస్టేషనుకు తీసుకువచ్చారు. దొంగల నుంచి విషయం రాబట్టి మరుసటి రోజు ఉదయం కోర్టుముందు హాజరుపరచాలని నిశ్చయించుకున్నారు. వీరు అనుకున్నట్లే కోర్టుదాకా గంజాయిదొంగలను తీసుకువెళితే వారు అక్కడ అదును చూసుకుని ఉడాయించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఎక్సయిజ్‌ సిబ్బంది గత్యంతరం లేక తిరిగి గంజాయి దొంగల గురించి వేట కొనసాగిస్తున్నారు.

తెలంగాణాజిల్లాల్లో ఎరువుల నల్లవ్యాపారం?

తెలంగాణాజిల్లాల్లో ఎరువులను నల్లబజారుకు తరలిస్తున్నారు. ఇక్కడి రైతులను మభ్యపెట్టి నాసిరకం ఎరువులను మాములుధరలకు, కంపెనీ ఎరువులను 50నుంచి వందరూపాయలు ఎక్కువకు వ్యాపారులు అమ్ముతున్నారు. రైతులు కూడా తమకు పెరిగిన అవగాహన వల్ల కంపెనీ ఎరువులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కంపెనీ ఎరువులకు కొత్తడిమాండును వ్యాపారులు సృష్టిస్తున్నారు. నల్గొండజిల్లాలో 72వేల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం. దీనిలో 39వేల మెట్రిక్‌టన్నుల యూరియా నాగార్జునఫెర్టిలైజర్స్‌దే రైతులు వాడతారని తెప్పించి దాన్ని బ్లాక్‌లో వ్యాపారులు అమ్ముతున్నారు. బస్తాను 400 నుంచి 450రూపాయల వరకూ వ్యాపారులు అమ్ముతున్నారు. డిఎపీల్లో కోరమండల్‌కు, ఇఫ్కోకు రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇఫ్కో 50కిలోల బస్తా 1,250రూపాయలకు అమ్ముతున్నారు. నాగార్జున డిఎపి రూ.1250.35కు అమ్ముతున్నారు. వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము కొనుగోలు చేస్తుంటే బస్తాకు 50 నుంచి 75రూపాయల వరకూ కూలి వేస్తున్నారని చెప్పారు. నల్లబజారుకు తరలిస్తున్న ఈ ఎరువులపై జిల్లా వ్యవసాయాథికారులు, రెవెన్యూ సహకారంతో దాడులు చేయాలని పలురు కోరుతున్నారు.

చిత్తూరులో రోడ్డెక్కిన రవాణా శాఖ

రవాణాశాఖ నిజంగానే రోడ్డెక్కింది. దీంతో మంచి ఫలితాలను సాధించి మిగిలిన జిల్లాలకు ఆదర్శవంతంగా నిలుస్తోంది. చిత్తూరు రవాణాశాఖాధికారులు త్రైమాసికపన్ను చెల్లించని 20వేల వాహనదారులకు నోటీసులు జారీ చేసింది. ఇంత ఎక్కువమందికి నోటీసులు జారీ చేసిన కార్యాలయం మన రాష్ట్రంలోనే లేదని రవాణాశాఖ రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటి దాకా వాహనాల తనిఖీల ద్వారా 20లక్షల రూపాయలు వసూలు చేశామని డిటిసి ప్రకటించారు.   త్రైమాసికపన్ను చెల్లించని 280 వాహనాలు సీజ్‌ చేశారు. వాహనతనిఖీల్లో రవాణాశాఖ కార్యాలయంలో పని చేసే 22మంది పాల్గొన్నారు. తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తి, పుంగనూరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించామని డిటిసి విశదీకరించారు. తమ సిబ్బంది సహకారంతో మరిన్ని ఫలితాలు సాథిస్తామని ఆయన ‘తెలుగువన్‌.కామ్‌’కు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కండిషనులో లేని వాహనాలను రోడ్డుపైకి అనుమతించటం లేదన్నారు. అలానే రవాణాధరఖాస్తులకు కార్యాలయంలో సిబ్బంది పూర్తి సహాయసహకారాలందిస్తున్నారన్నారు. సిబ్బంది సహకారంతోనే రెవెన్యూ ఇంకా పెంచేందుకు కృషి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. అలానే స్కూలుబస్సులు, ప్రైవేటు బస్సుల గురించి  కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నామని వివరించారు.  

ఇన్‌పుట్‌సబ్సిడీలపై కఠిననిబంధనలు అవసరమా?

రైతులకు సరఫరా చేయాల్సిన ఇన్‌పుట్‌సబ్సిడీ సక్రమంగా రైతులకు అందజేసేందుకు కఠినతరమైన నిబంథనలు అవసరమని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సబ్సిడీ నేరుగా రైతులను చేరటం లేదు. ప్రత్యేకించి జిల్లా యంత్రాంగాల్లో ఉన్న అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం వెరసి రైతులకు సీజన్‌ పూర్తయ్యాక కూడా అందని పరిస్థితులను కల్పిస్తోంది. రాష్ట్రంలోని కడప, అనంతపురం, తెలంగాణా జిల్లాల్లోని కరువు ప్రాంత రైతులను ఒకవైపు అథికారులు, మరోవైపు బ్యాంకర్లు తిప్పుకుంటున్నారు. జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ అవసరం లేని వారికి మంజూరు చేసే బ్యాంకులు రైతుల విషయంలో రిక్తహస్తాలు చూపుతున్నాయి.   పైగా మినిమమ్‌ సేవింగ్స్‌ అకౌంటు పరిథిపెంచి మరీ రైతులకు బ్యాంకులు అంటగడుతున్నాయి. దీంతో కర్షకుని కష్టం తీరటం లేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. అనంతపురంలో జిల్లాకలెక్టర్‌ వి.దుర్గాదాస్‌ ఎన్నిసార్లు బ్యాంకర్లను కోరినా వారు పెద్దగా స్పందించటం లేదు. అకౌంట్‌ యాక్టివేట్‌ కావటం లేదనే సాకుతోనూ రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీని ఆలస్యం చేస్తున్నారు. నల్గొండజిల్లాలో 59మండలాల్లో కరువును కేంద్రప్రభుత్వం గుర్తించింది. 117 గ్రామపంచాయతీల్లో పంటనష్టం సంభవించిందని కలెక్టర్‌ ముక్తేశ్వరరావు స్వయంగా పరిశీలించి నిర్ధారణకు వచ్చారు. అందుకే ఇన్‌పుట్‌సబ్సిడీగా రూ.129.4కోట్లను ఆయన శాంక్షన్‌ చేయించగలిగారు. రైతులకు మాత్రం ఆయన చేరవేయలేకపోయారు. కారణం బ్యాంకర్ల సాకులే. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఇన్‌పుట్‌ సబ్సిడీపై కఠిన నిబంధనలు రూపొందించకపోతే రైతులకు ఇవి అందేటప్పటికి ఏళ్లుగడిచిపోతాయన్నది అనంతపురం జిల్లా అనుభవంగా గుర్తించాలి. నల్గొండ జిల్లా కూడా తాజాగా ఇదే అనుభవాన్ని చవిచూస్తోంది.

రాష్ట్రంలో ఆహార సంక్షోభం రూ.60కి చేరనున్న కిలో బియ్యం?

అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం వరిపంట దిగుబడి గణనీయంగా తగ్గబోతోంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో  26.48 లక్షల హెక్టార్ల భూముల్లో  పంటలు వేయాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 9.40 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేస్తున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆహార ధాన్యాల రేట్లు మరింత పెరగడం ఖాయమని బియ్యం ధర కిలో అరవై రూపాయలకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కేవలం 13 జిల్లాలో మాత్రమే వర్షం కురిసింది.మిగతా జిల్లాలో 3 నుండి 31 శాతం వరకు మాత్రమే వర్షంపడిరదని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.   అనంతపురంలో ఎప్పటిలాగానే కరువు పరిస్తితులు నెలకొన్నాయి. ఆ జిల్లాలో  31 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. నిజామాబాద్‌,నల్గొండ, విశాఖపట్టణం, కర్నూలులో వరుసగా 24,21,21,3 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. జూన్‌ మొదటి వారంలో సాగుచెయ్యవలసిన నారుమళ్లను సరైన వర్షపాతం లేకుపోవడంతో రైతులు సాగుచేయలేక పోయారు. ఈ పరిస్థితులను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, వ్యవసాయమంత్రి కన్నా లక్ష్మీనారాయణ,మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంత్రి మహీధర్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్సు ద్వారా సమీక్షించారు.   అంతే కాక సాగుకాలం పూర్తవడంతో తృణధాన్యాల సాగుచేపట్టాల్సిందిగా రైతుల్ని కోరాలని కూడా కలెక్టర్లకు సూచించారు. ప్రకాశం, విజయనగరం, విశాఖ పట్టణాలలోకూడా ఇదే పద్దతులు కొనసాగించాలని కలెక్టర్లను మంత్రులు కోరారు.  నైరుతి, ఈశాన్య ఋతుపవనాలు అనుకున్నంతగా వర్షాలను ఇవ్వకపోవడంతో రైతులు డీలాపడ్డారు. రాష్ట్రాన్ని  దుర్భిక్ష ప్రాంతంగా ప్రకటింపచేసి కేంద్రంనుండి   నిధులు తేవల్సిందేనని రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రిని కోరుతున్నారు.