రికార్డు కెక్కనున్న జానారెడ్డి

రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకతను చాటుకున్న పంచాయితీ రాజ్‌ శాఖామంత్రి కుందూరు జానారెడ్డి మరోవారంరోజుల్లో రికార్డు సృష్టించనున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌నుండి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జానారెడ్డి తెలుగుదేశం అభ్యర్దిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలచి పలుసార్లు ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో అనేక శాఖలు నిర్వహించారు. తరువాత కాంగ్రెస్‌ లో మరో 3 సార్లు ఎన్నికయ్యి పదవులు దక్కించు కున్నారు. ఆయన 7 సార్లు ఎన్నికల్లో పోటీచేయగా కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. గెలచిన ప్రతిసారీ క్యాబినెట్‌ మంత్రిగా పని చేశారు. ఈనెల 24తో రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా కొనసాగిన వ్యక్తిగా చరిత్రకెక్కనున్నారు. వివాదాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండే జానారెడ్డి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సల్స్‌ అణచివేతలో కీలక పాత్ర వహించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ పరిణామాలు మారినప్పుడల్లా ముఖ్యమంత్రి పదవికి జానారెడ్డి పేరు వినిపిస్తూ ఉంటుంది. అయితే అత్యధిక కాలం రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభవం ఉన్న తమ నాయకుడు ఏనాటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న విశ్వాసంతో ఆయన అనుయాయులు ఉన్నారు.

కిరణ్‌కు ధర్మ సంకటం!

సీనియర్‌ మంత్రి ధర్మాన రాజీనామా రాష్ట్రంలో సంచలనం రేపింది. వాన్‌పిక్‌ కుంభకోణం వ్యవహారంలో సీబిఐ చార్జ్‌షీట్‌లో ఐదవ నిందితుడిగా ఉన్న దర్మాన నైతిక విలువలకు కట్టుబడి తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడిరది. రాజీనామా ఆమోదించనందువల్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. న్యాయనిపుణుల సలహా తీసుకొని నిర్ణయం తీసుకుంటాననడం మరిన్ని ఆరోపణలకు తావిస్తుంది. ధర్మానను ప్రాసిక్యూట్‌ చేయడానికి అనుమతించాలని సిబిఐ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. సీబిఐ నిర్ణయం మీదా, రాజీనామా విషయమూ రెండూ గవర్నర్‌తో కిరణ్‌కుమార్‌ రెడ్డి సంప్రదించవలసిందే. ఒక సారి కోర్టునుండి చార్జిషీటు దాఖలైతే మంత్రులు రాజీనామా చేయాల్సివుంది.   2జి స్పెక్ట్రమ్‌ విషయంలో కేంద్రమంత్రి రాజా రాజీనామాను ప్రధాన మంత్రి మన్మోహన్‌ ఆమోదించారు. అదే సంప్రదాయాన్ని కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా అమలు చేయవలసి ఉంది. అయితే ధర్మాన రాజీనామా అంగీకరిస్తే మిగతా మంత్రుల విషయంలో కూడా అదే పద్దతి కొనసాగించవలసి ఉంది. రాజశేఖర రెడ్డి హయాంలో 26 జివోల కోసం ఇప్పటికే ఆరుగురు మంత్రులు సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్నారు. ఇదే కేసులో మోపిదేవి వెంకటరమణ జైలులో ఉన్నారు. మంత్రి పొన్నాల సిబిఐ విచారణ నెదుర్కుంటున్నారు. వీరితో పాటు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌కేసులో న్యాయశాఖమంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఫెరా కేసులో విద్యామంత్రి పార్ధసారధి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ధర్మాన రాజీనామా ఆమోదిస్తే మిగతా మంత్రుల విషయంలోనూ అదే న్యాయాన్ని అనుసరించాల్సి ఉంది. ఏది ఏమైనా ధర్మాన రాజీనామా ఆమోదిస్తే ఒక బాధ ... ఆమోదించకపోతే మరో బాధ.. ముఖ్యమంత్రిని కలవరపెడుతుంది.

పోరుబాటలో ఓపెన్‌ కాస్ట్‌ నిర్వాసితులు

ఓపెన్‌కాస్టు గనులు సృష్టిస్తున్న విధ్వంసంతో పాటు నిర్వాసితులైన వేలాది మంది ప్రజలకు ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. అరకొరగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కనీసవసతులు లేక ఆధ్వాన్నంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌, కరీంనగర్‌,వరంగల్‌, ఖమ్మం జిల్లాలలోని నిర్వాసితులు పోరాటాలకు దిగుతున్నారు. అదే సమయంలో ఓపెన్ కాస్ట్ కు తమ భూములను ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని 12 గ్రామాలు ఖమ్మంజిల్లాలోని ఎనిమిది గ్రామ ప్రజలకు పరిహారం సక్రమంగా అందచేయలేదని ప్రజలు చెబుతున్నారు.   ఆదిలాబాద్‌లో ఓపెన్ కాస్ట్ కోసం 350 ఎకరాల భూమి అప్పచెప్పారు. ఎలాగూ ఈ గ్రామం ఓసీ కింద పోతుంది కదా అని ఆరేళ్లనుండీ ఇక్కడ అభివృద్ది పనులు చేపట్టటం లేదు. శ్రీరాంపురం ఓపెన్‌ కాస్టు గనిలో తాళ్లపల్లి గ్రామస్తుల భూములన్నీ పోయాయి. వీరికి ఇప్పటివరకు పునరావాసం ఏర్పాటు చేయలేదు. ఇంకా 4 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. వీటిక్రింద భూములు కోల్పోయిన వారు 4500 మంది ఉన్నారు. 4 వేల ఎకరాల వ్యవసాయ భూమి పోయింది. చుట్టుప్రక్కల 2 వేల ఎకరాల్లో పంటలు పండని స్థితి నెలకొంది. ఓపెన్‌కాస్టు త్రవ్వకాల మూలంగా ఇళ్లు పాడయ్యాయి. మట్టి పెళ్లలు పడి పిల్లలు చనిపోయారు. తిర్యాణి మండలంలో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన కాలనీలు ఆద్యాన్నంగా ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు లేవు. మొబైల్‌వైద్యం ప్రహసనంగా మారింది. పునరావాసం కోసం యాజమాన్యం కోట్ల నగదును ప్రభుత్వం వద్ద డిపాజిట్‌ చేసినప్పటికీ నిర్వాసితులకు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి సహాయం అంద చేయటం లేదు. యాజమాన్యాలు పని కల్పించడంలోనూ విఫలం చెందుతున్నాయి. లారీలలో లెవలింగ్‌ చేసే పనులుకూడా తమకు అప్పగించడంలేదని నిర్వాసితులు వాపోతున్నారు. కొందరికే పరిహారం చెల్లించారు. పునరావాస కేంద్రాలలో ఇళ్లు వేయలేదు. వైద్య సౌకర్యాలు లేవు. పాఠశాలల ఊసే లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 18 ఏళ్లు నిండిన వారికి పునరావాసం తో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నా ఇంతవరకు అతీగతీ లేదని ప్రజలు వాపోతున్నారు. అందువల్లే తాము పోరాటానికి సిద్దమయ్యాం అని తెలిపారు.

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ సాద్యమేనా?

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠతో ఉంది. ఇప్పటివరకు 2011 జనాభాలెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం, లెక్కల వివరాలందటానికి ఇంకా సమయం పడుతుందన్న విషయాన్ని తెలుసుకొని ఎన్నికల నిర్వహణం పై మల్లగుల్లాలు పడుతుంది. 2013 మార్చివరకు జనాభా లెక్కల వివరాలు ఇవ్వలేమని కేంద్ర జనగణన మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పటంతో ప్రభుత్వానికి ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి కేంద్ర ఆర్దిక సంఘంనుండి నిథులు రావని, నిర్వహిస్తే పార్టీ పరిస్థితేమిటని ప్రభుత్వం మధన పడుతుంది. అయితే త్వరలో 2001 జనాభా ప్రాతిపధికన ఎన్నికలు జరుపుతామని అందుకు చర్యలు తీసుకోవాలని, అధికారలను ఆదేశించడంతో మున్సిపల్‌ శాఖ అధికారులు అడ్వకేట్‌ జనరల్‌తో సమావేశమయ్యి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది.అందుకు సంబంధించి హైకోర్టులో అఫిడవిట్‌ వేసేందుకు సమాయత్తమైంది. పాలకమండళ్లు ముగిసి సంవత్సరం గడచినా ఎన్నికలు నిర్వహించడంలో జాగు చేయడంతో ప్రణాళికా సంఘం నిథులు నిలుపు చేసింది.గత ఆర్ధిక సంవత్సరం చివరివిడతతో పాటు ఈ ఆర్దిక సంవత్సరం కూడా చిల్లి గవ్వ విదల్చలేదు. అయితే కోర్టు తీర్పుమేరకే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి మహీధర్‌రెడ్డి తెలిపారు.

పార్లమెంట్ ప్రాంగణంలో పింగళి ప్రతిమ కలేనా?

భారత దేశ స్వేచ్ఛా స్వాతంత్య్ర సార్వభౌమాధికారాలను నలుదిశలా చాటిచెప్పే జాతి జనుల హృదయ స్పందన త్రివర్ణపతాకం! దీని సృష్టికర్త మనదేశ తెలుగు వాడైన పింగళి వెంకయ్య ! కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన పింగళి వెంకయ్య క్రమశిక్షణ గలిన దేశభక్తుడు! భరతమాత దాస్యవిముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడిన స్వాంతంత్య్ర సమరయోధుడు! ఈయన జాతీయ కాంగ్రెస్‌కోసం 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులలో కూడిన ఒక జెండా రూపొందించారు. అప్పట్లో ఇది కాంగ్రెస్‌ అనధికార పతాకం. ఆ తర్వాత 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చరంగులలో, మధ్యలో రాట్నం బొమ్మగల పతాకాన్ని కాంగ్రెస్‌ అధికార పతాకంగా స్వీకరించింది. స్వాతంత్య్ర సమర జైత్రయాత్రలో ప్రజలంతా ఒక్కటై నడవడానికి ఈ జెండా మంచి స్ఫూర్తిగా నిలిచింది. మనదేశానికి స్వాతంత్య్రం రావడానికి కొద్దిరోజుల ముందు దేశ జాతీయపతాకాన్ని రూపొందించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న పింగళి వెంకయ్య త్యాగానికీ, స్వచ్ఛతకూ, పవిత్రతకూ, సంపదకూ, అభివృద్ధికీ సంకేతంగా రూపొందించిన మువ్వెన్నెల పతాకం 1947 జులై 22 తేదీన భారత జాతీయ పతాకంగా రాజ్యంగసభ ప్రత్యేక సమావేశం ఆమోదించింది.   భారతీయుల హృదయ స్పందంగా ప్రజాజీవితంలో మమేకమై పోయిన మువ్వెన్నెల జెండాను గౌరవిస్తున్నామే తప్ప, అటువంటి అపురూప కానుకను దేశానికి అందించిన పింగిళి వార్ని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడంటూ వెంకయ్యగారి స్వగ్రామమైన భట్ల పెనుమర్రు గ్రామస్తులు వాపోతున్నారు. జాతిపిత బిరుదు ఎప్పుడు వచ్చిందో ఎవరిచ్చారో ఎవ్వరికీ తెలియకపోయినా, జాతిపితగా మహాత్మాగాంధీని గౌరవించి స్మరించే మనం మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి గౌరవార్థం ఏం చేస్తున్నాం? అంటూ ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు! తన అహింసాయుధంలో దేశ విముక్తికి అహర్నిశలు కృషిచేసిన మహాత్ముని జయంతి వర్ధంతులను జాతీయ సెలవు దినాలు ప్రకటించినట్లుగానే మన జాతీయజెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతిని వర్ధంతులను జాతీయ సెలవు దినాలు ప్రకటించాలనీ, పార్లమెంటు ప్రాంగణంలో వెంకయ్య విగ్రహం ప్రతిష్టించాలని ఆగ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో హామిలిచ్చి ఆ తర్వాత మర్చిపోయే నేతలు పింగళి వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేస్తామని గతంలో అనేకసార్లు చెప్పినప్పటికీ ఇంత వరకూ అది అమలుకు నోచుకోలేదు! నేటి తరానికి స్ఫూర్తినిచ్చే ఇలాంటి విషయాల్లో అలసత్వం వహించడం ప్రతి భారతీయుడినీ ముఖ్యంగా ప్రతి తెలుగు వాడి హృదయాన్ని గాయపరుస్తోందన్నది నిజం!

మంత్రుల మధ్య గొడవలు పెడుతున్న బొత్స ?

బొత్స సత్యన్నారాయణ మంత్రుల మద్య చిచ్చు పెడుతున్నారని, సిఎంకు సహకరిస్తూ తటస్తంగా ఉన్న మంత్రులను దూరం చేసే పనిలో ఉన్నారని మంత్రులు వాపోతున్నారు. ముఖ్యమంత్రికి కొందరు మంత్రులకు మద్య చిచ్చు పెట్టి తద్వారా ముఖ్యమంత్రిని ఒంటరి చేయాలనే వూహ్యంతో బొత్స ఉన్నారని తెలుస్తుంది. దీనికి మంత్రులు కూడా నిజమేనని అంటున్నారు.   ఈ విషయమై ఇప్పటికే 7గురు మంత్రులు అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడని సీనియర్‌ మంత్రి లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి కాబోతున్నారని, ప్రమాణస్వీకారం 27న అ ని బొత్స చేసిన ప్రచారం చేసి సీఎం కు కన్నాను దూరం చేశారని చెబుతున్నారు. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ పిసిసి రేసులో ఉన్నారు. కన్నా పిసిసి కి ఎన్నికైతే తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని బొత్స  ఇలా చెబుతున్నారని తెలిసింది.   బొత్స బిసి కాపుగా ఉండి అసలైన కాపులకు గండి కొడుతున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా ఉండే యువమంత్రి శ్రీధర్‌బాబును బొత్స తన ప్రచారంలో ముఖ్యమంత్రిని చేసారు. ఈ విధంగా తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డువస్తానరుకున్న వారిపై మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రులు వాపోతున్నారు. బిసిల రీఎంబర్స్‌మెంట్‌ విషయంలో కూడా ఇలాగే చేశారని 31 వేలు మాత్రమే ఇస్తామని మంత్రి పీతానితో చెప్పించి డిల్లీలో ఎంత అయినా ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించి  ద్వంద వూహ్యం అమలు చేశారని మంత్రులు ఆరోపిస్తున్నారు. లోపల ఒకటి బయట ఒకటి చెబుతున్న బొత్స సత్యన్నారాయణ వల్ల రాజకీయంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నామని మంత్రులు అధిష్టానికి ఫిర్యాదు చేసారు.  

కాంగ్రెస్‌కు ఎన్నికల కలవరం

రాష్ట్రంలో 2014 లో జరిగే ఎన్నికలకోసం కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే భయం పట్టుకుంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చతి పార్టీశ్రేణులను, సిట్టింగ్‌ ఎంపి, ఏమ్మేల్యేలనూ గందరగోళానికి గురిచేస్తున్నాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రానున్న ఎన్నికల్లో గెలవటం కష్టమని వారు వాపోతున్నారు. ఇదే ఆవేదనను వాయిలార్‌ రవి ఎదుట వ్యక్తంచేశారు.ఆయన వారి ఆందోళనతో ఏకీభవించి మార్పు తీసుకొస్తానని హామీ ఇవ్వడం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులే కొనసాగితే 2014 లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ అడిగే వారు కూడా ఉండరని సీనియర్లు కలవరపడుతున్నారు.   పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో రవిని రాష్ట్రానికి సంబంధించిన కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కలిసి మాట్లాడారు.  పిచ్చాపాటీ అయినా మన రాష్ట్ర వ్యవహారాలపై సీరియస్‌గానే చర్చలు జరిగాయి.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్లు పలువురు ప్రస్తావించారు.జగన్‌ పార్టీని అణచివేసే వూహ్యాలు, నాయకులు కనిపించడం లేదని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు జగన్‌, మరోవైపు తెలంగాణ సమస్య పార్టీని ఆందోళనకు గురి చేస్తుందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు రవిని కోరారు. రాష్ట్రంలో పదవులు తీసుకొనే ముందు చేసిన వాగ్ధానాలను కిరణ్‌, బొత్స మరిచారని కూడా తెలిపారు. ఆలస్యం చేసేకొద్దీ పార్టీకి నష్టం అని స్వయంగా వాయిలార్‌ రవి తెలపటంవల్ల ఆధిష్టానంలో కూడా అదేభావన ఉందని దీన్ని బట్టి కిరణ్‌కుమార్‌ను, బొత్సను తొలగించడం జరుగుతుందని పార్టీ వర్గాల వారు తెలిపారు.

రైతును కాటేసిన ఖరీఫ్‌

రాష్ట్రంలో ఖరీఫ్‌ పంట సాగుకు కటాఫ్‌ డేట్‌ ప్రకటించారు .ఈనెల 15తో ఖరీఫ్‌ సాగును ముగించి, ఇప్పటినుండి వేసే పంటలకు ఎర్లీ రబీ పంటలుగా పరిగణించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. నీటి ప్రాజెక్టుల క్రింద కూడా వరిసాగుకు ఇదే తేదీ వర్తిస్తుంది. రెవెన్యూ వ్యవసాయమంత్రులు రఘవీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఆయా జిల్లా కలెక్టర్లకు ఇతర అధికారులకు వీడియో కాన్పరెన్సులో ప్రత్యామ్న పంటలకు రైతుల్లో అవగాహన పెంచవలసినదిగా సూచించారు. జిల్లాలు, ప్రాంతాల వాతావరణానికి తగ్గట్లు మొక్కజొన్న, జోన్న,ప్రొద్దుతిరుగుడు,సజ్జ తదితర పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే పంటల సాగు ప్రణాళికలను సిద్దంచేశారు.   రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు80 లక్షల హెక్టాంర్ల కు గాను 60 లక్షల హెక్టార్ల దగ్గర నిలచిపోయింది. ఇప్పటివరకు పంటల విస్తీర్ణం ప్రాంతాలవారీగా కోస్తాంద్రలో 24.96 లక్షల హెక్టార్లకు గాను 13.65 లక్షలు హెక్టార్లు సాగయ్యాయి. రాయలసీమలో 18.50 గాను 12.77 లక్షల హెక్టార్లు సాగు చేశారు.తెలంగాణలో 37.29 గాను 34.22లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు.మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలోనే పంటల సాగు ఇతర ప్రాంతాలకంటే మెరుగ్గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌ వరి సాగుకు భారీగా గండి పడిరది. ఖరీఫ్‌ వరి సాగు విస్తీర్ణం 26.47 లక్షల హెక్టార్లు కాగా 11.83 లక్షల హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు వేశారు.

కాటేస్తున్న కల్తీసారా

రాష్ట్రంలో మరోమారు కల్తీసారా పడగ విప్పింది.కల్తీసారా, కల్తీకల్లుకు నిరుపేదలు బలి అవుతున్నారు.కిక్‌ కోసం కల్తీసారాలో కలిపే మిధనాల్‌, కల్తీకల్లు తయారీకి వాడే అల్ఫాజోలం డోస్‌ పెరిగి తాగిన వారి ప్రాణాలు హరిస్తున్నాయి. మంగళవారం మెదక్‌జిల్లా ఘటన రాష్ట్రంలో కొత్తదేమీ కాదు. ఆదివారం మెదక్‌జిల్లాలో 65 మంది అస్వస్తతకు గురిఅయ్యారు. దానిలో 5 గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు కారణం ప్రక్కనే ఉన్న మహారాష్ట్ర గీత కార్మికులు నిషేదిత అల్ఫాజోలం మత్తుమందును కల్లులో కలిపారని తెలిసింది. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు.ఇందుకు కారకులైన వారిని అరెస్టు చేశారు.   గత ఏడాది డిసెంబరు 31న కృష్ణా జిల్లా మైలవరంలో కల్తీ మద్యంతాగి  17 మంది మరణించారు. నల్గొండలోని చౌటుప్పల్‌ మండలంలో కల్తీ కల్లు తాగి అదే రోజు మరొకరు మరణించారు. కొత్తసంవత్సరం వేడుకులకు మద్యాన్ని కొనుగోలు చేయలేని కృష్ణాజిల్లా మైలవరంలోని గిరిజనులను తక్కువ ధరలకు లభించే నాటు సారాను ఆశ్రయించిన వారికి మిధనాల్‌ రూపంలో మృత్యువు కబలించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిషేధిత రెక్టిపైడ్‌ స్పిరిట్‌ను 40 శాతం మరో 60 శాతం నీటితో కలిపి నాటు సారా తయారు చేయటం సులువు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ పట్టించుకోకపోవడం వల్ల  ఇలాంటివి జరుగుతాయని విమర్శలు వెల్లు వెత్తు తున్నాయి.   మరో విధానంలో  కల్లును, నల్లబెల్లాన్నీ పులియబెట్టి నాటు సారా తయారు చేస్తారు. ఈ విధానాన్ని తెలంగాణాలో అధికంగా వాడుతున్నారు. ఇదంత ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లగా కల్తీకల్లు, కల్తీమద్యం మరణాలు ఎక్కువయ్యాయి. 2009-2010 లో నాటుసారాకు తూర్పుగోదావరి జిల్లాలో 18 మంది మృత్యువాత పడ్డారు. వివిధ ప్రాంతాల్లో మరో 13 మందితో కలిపి మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 2010-11లో ప్రభుత్వం లెక్కకు అందినవి 20 కాగా లెక్కకు అందనివి అంతకన్నా ఎక్కువే అని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగుచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మహాత్మా గాంథీ తో జగన్‌కు పోలికా?

వైకాపా అథినేత జగన్మోహనరెడ్డిని గాంథీజీతో పోలుస్తూ గుంటూరు లార్జ్‌సెంటరులో నెలకొల్పిన ఫ్లెక్సీ వివాదాలు సృష్టిస్తోంది. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రీనివాసరావు తన స్వామిభక్తిని నిరూపించుకునేందుకు ఈ ఫ్లెక్సీని తయారు చేయించారు. నగరమంతా ఈ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న జగన్‌ను ఉద్దేశించి రూపొందించిన ఈ ఫ్లెక్సీ తయారు చేసిన తీరుపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. జాతి మొత్తం గర్వించే మహాత్ముడిగా  ప్రపంచదేశాల ప్రసంశను అందుకున్న గాంథీజీతో జగన్‌ను పోల్చటం అమానుషమైన చర్య అని సామాజికవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ ఫ్లెక్సీలు తొలగించాలని పలువురు డిమాండు చేస్తున్నారు. ఫ్లెక్సీల్లో ఈ కింది విథంగా రాయటమే వివాదానికి హేతువైంది. ‘‘తెల్లదొరల పాలనలో గాంథీజీ జైలుకు వెళితే...ఈనాడు నల్లదొరల పాలనలో జగనన్న జైలుకు వెళ్లాడు...ఓ గాంథీ న్యాయం ఎక్కడ?’’ అని ఫ్లెక్సీలో రాశారు. ఈ వివాదస్పద ఫ్లెక్సీలపై స్పందించిన కార్పొరేషను అథికారులు వాటిని తొలగించారు.

ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్న మాఫియా?

కోర్టు తీర్పులు, ప్రభుత్వ నిర్ణయాల అనంతరమూ ఇసుక వ్యవహారం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రతీజిల్లాలోనూ డిపోలను నిర్వహించైనా ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఇచ్చిన భరోసా కాలగర్భంలో కలిసిపోయింది. అటు కాంట్రాక్టర్లు, ఇటు ప్రభుత్వమూ కాకుండా ఇసుకతవ్వకాలపై మాఫియా పెత్తనం చేస్తోంది. బండెడు ఇసుకను వేలకు విక్రయించే స్థితికి మాఫియా చేరుకుంది. తమ ప్రైవేటు సేనలను రంగంలోకి దింపిన మాఫియా ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతోంది. ప్రత్యేకించి వాహనాలను ఆపేందుకు విజిలెన్స్‌, రెవెన్యూశాఖలు ప్రయత్నిస్తే వారిపై నుంచి నడిపేయమని సినీతరహాలో డ్రైవర్లకు ఆదేశాలిచ్చిందట. దీంతో డ్రైవర్లు రెచ్చిపోయి ఆగినట్లే ఆగి విజిలెన్స్‌శాఖాథికారులపైకి వాహనాలు నడిపి వారిని భయభ్రాంతులను చేసి తప్పించుకుంటున్నారు.   ఈ విషయం బయటికి తెలిస్తే తమను ఇంకెవరూ ఖాతరు చేయరని విజిలెన్స్‌ అథికారులు కూడా నోరునొక్కుకుంటున్నారు. హైదరాబాద్‌, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, కర్నూలు తదితర ప్రాంతాల్లో మాఫియా ఇసుక సామ్రాజ్యాన్ని నెలకొల్పిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్నందుకు వీఆర్వో వాసుపై ఇసుకమాఫియా దాడి చేసింది. దాడిలో గాయపడిన వాసు పోలీసులను ఆశ్రయించారు. ఇలా ప్రతీప్రాంతంలోనూ మాఫియా ఎదురుతిరుగుతుంటే రెవెన్యూ, ఇతర ప్రభుత్వశాఖలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. ముదిరిన ఈ వ్యవహారంపై ఇకనైనా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించకపోతే విధులు నిర్వహించటమే కష్టమవుతుందని ఉద్యోగసంఘాలు రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

ఇడ్లీ నూకగా మారుతున్న రూపాయి బియ్యం

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన కిలో రూపాయి బియ్యం పేదలకు చేరటం లేదు. ఈ బియ్యాన్ని ఉప్పుడుబియ్యంగా మార్చి కొందరు ఇడ్లీనూకకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెలా కోటాలో తీసుకోకుండా మిగిలిపోయిన బియ్యం అంతా ఈ ఇడ్లీనూక తయారు చేసే పరిశ్రమలకు తరలిస్తున్నారు. కోటాకు రాని వారి పేరిట మిగిల్చేసిన బియ్యం అంతా దుకాణదారులు కిలో పదిరూపాయలకు ఇడ్లీనూక పరిశ్రమలకు అమ్ముతున్నారు. నూకగా పట్టిన తరువాత దాన్ని రూ.30 నుంచి ఆ పరిశ్రమయాజమాన్యం అమ్ముకుంటోంది. భారీస్థాయిలో బియ్యం ఈ పరిశ్రమలకు తరలుతోందని ఆరోపణలు వస్తున్నా రెవెన్యూశాఖ ఎటువంటి దాడులు నిర్వహించటం లేదు. ఎందుకంటే వారికి రావాల్సిన ఆమ్యామ్యాలు అందేస్తున్నాయని ఆరోపణలు ఎక్కువయ్యాయి. తాజాగా కృష్ణాజిల్లా గంపలగూడెం నుంచి తరలిస్తున్న లారీలో 220 బస్తాల చౌకబియ్యాన్ని విజయవాడ విజిలెన్స్‌ అథికారులు పట్టుకున్నారు. లారీని సీజ్‌ చేసి సంబంధిత యజమానులపై కేసు నమోదు చేశామని విజిలెన్స్‌ అథికారులు స్పష్టం చేశారు. దీనికి ముందుగా గుంటూరు జిల్లాలోనూ 550బస్తాల చౌకబియ్యం, తూర్పుగోదావరి జిల్లాలో 127బస్తాల చౌకబియ్యం దొరికాయని విజిలెన్స్‌ అథికారులు ధృవీకరించారు. ప్రభుత్వం ఈ పథకం పెట్టినప్పటి నుంచి చౌకధరల దుకాణదారుల జీవితాలే మారిపోయాయంటున్నారు. ఈ బియ్యం కోసమే ఎదురుచూసే పరిశ్రమలు చౌకథరల దుకాణదారులకు సరుకు చేరవేయగానే సంతృప్తికరంగా పేమెంటు చేస్తోంది అందుకే దుకాణదారులు కార్డుదారులన ఒప్పించి మరీ ఈ బియ్యం సేకరిస్తున్నారట. చివరికి ముఖ్యమంత్రి ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇబ్బందుల పాలవుతూనే ఉన్నారు. ఈ పథకం క్యాన్సిల్‌ చేస్తే కాంగ్రెస్‌ మాట తప్పిందంటారని సిఎం ఈ పథకానికి ప్రాధాన్యత కల్పిస్తూనే ఉన్నారు.

ప్రాణాలు తీస్తున్న హైద్రాబాద్‌ పరిశ్రమలు

హైదరాబాద్‌ నగరం శివార్లలోని పలు పరిశ్రమల్లో భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. తరుచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కార్మికులు గాయాలపాలవుతున్నారు. వరుసగా నెలరోజుల్లో కనీసం 20రోజుల పాటు నగర సమీపంలోని పలు ప్రాంతాల్లో పేళుళ్లు సంభవిస్తున్నాయి. ఒకసారి టపాకాయల మందు వల్ల ప్రమాదం సంభవిస్తే, మరోసారి గ్యాస్‌పేలి ప్రమాదం జరుగుతోంది. ఇలా ప్రమాదాల పరంపరలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఇలానే కనిపిస్తోంది. అదీ పక్క జిల్లాలకు కూడా పాకినట్లుంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని షాద్‌నగర్‌పట్టణ శివార్లలోని స్టీలుకోర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది.   ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. సిలెండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. అందుకే వీరిని హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరుచుగా ఇటీవల కాలంలో ఈ తరహా వార్తలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా కార్మికశాఖ నిద్రలేచినట్లు లేదని కార్మికసంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ముందస్తు భద్రతాచర్యలు పాటించని పరిశ్రమల లైసెన్సులు క్యాన్సిల్‌ చేసే అథికారం ఉన్నా కార్మికశాఖ కనీస చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు ఎక్కువయ్యాయి. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా లేబర్‌బోర్డును నెలకొల్పిన ప్రభుత్వం ఈ భద్రతాచర్యలు అంశంపై ముందస్తుగా చర్చించి సరైన పరిష్కారం చూపకపోతే కార్మికశాఖను పరిశ్రమల యజమానులు కొనుగోలు చేసుకుంటారన్న విమర్శలను అంగీకరించాల్సిందేనని కార్మికప్రతినిధులు డిమాండు చేస్తున్నారు. కనీసం హెల్మట్లు ధరించి పనికి వెళ్లే పరిశ్రమల సంఖ్య నానాటికీ తగ్గిపోయిందని వారు అంటున్నారు. కార్మికభద్రతపై ప్రభుత్వం స్పందించి పరిశ్రమలకు కఠినతరమైన హెచ్చరికలు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు తప్పవని ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.

వన్యప్రాణుల కోసం హత్యలకు తెగబడుతున్న వేటగాళ్లు?

వన్యప్రాణుల సంరక్షణ అన్నది కాగితాలపైన రాసుకోవటానికే అన్నట్లుంది మన రాష్ట్రంలోని అడవుల పరిస్థితి. వేటగాళ్ల బారి నుంచి ఈ వన్యప్రాణులను కాపాడటం నానాటికీ కష్టమవుతోంది. విలాసవంతమైన జీవితం గడిపేవారు ఈ వన్యప్రాణుల కోసం లక్షలాది రూపాయల వరకూ వెచ్చించటానికైనా సిద్ధమంటున్నారు. దీంతో వేటగాళ్లు తమ కుటుంబపోషణ కోసం కక్కుర్తిపడుతున్నారు. వేటగాళ్లకు, వన్యప్రాణుల కొనుగోలుదారులకు మధ్య దళారీవ్యవస్థ కూడా పుట్టుకొచ్చిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ దళారులు వన్యప్రాణులను తెచ్చిస్తే ఎంత డబ్బు ముడుతుందో చెబుతూ వేటగాళ్లను రెచ్చగొడుతున్నారు. వీరు కూడా రెచ్చిపోయి తాము వన్యప్రాణులను వేటాడటానికి వెళ్లేటప్పుడు ఎవరైనా అడ్డుపడితే హత్య చేయటానికి కూడా వెనుకాడటం లేదు.   చిత్తూరు జిల్లా కెవీపల్లి మండలం మారెళ్ల అటవీప్రాంతంలో పోలీసులు, వేటగాళ్ల మథ్య కాల్పులు జరిగాయి. అడవిలో వేటగాళ్లను గుర్తించి పోలీసులు వెంబడిరచారు. దీంతో ఆగ్రహించిన వేటగాళ్లు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా పోలీసులు కూడా నాలుగురౌండ్ల కాల్పులు జరిపారు. మొత్తానికి ఒకవేటగాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నలుగురు వేటగాళ్లు పరారయ్యారు. అడవిలో పోలీసులను ఎదిరించి కాల్పులు జరిపేందుకు వేటగాళ్లు పూనుకోవటం అరుదైన సంఘటన. పోలీసులను చూస్తేనే భయంతో పారిపోయే వేటగాళ్లు ఎదురుకాల్పులకు తెగబడటం వెనుక నిషేథిత ప్రాణుల వేటకోసం వెడుతున్న వేటగాళ్లను అడ్డుకోవటమే కారణమై ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.

ఆమ్యామ్యాల దందా ఆత్మహత్య దాకా తీసుకువచ్చిందా?

అథికారుల ఆమ్యామ్యాల దందా ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకునేంత తీవ్రమైన స్థితికి తీసుకువెళ్లింది. ఈ సంఘటన ప్రభుత్వ అథికారుల నిర్లక్ష్యం, బిల్లుల విషయంలో జాప్యం తేటతెల్లం చేస్తోంది. ఉన్నతస్థాయిలో బిల్లుల గురించి పర్యవేక్షణ అసలు ఉండదన్న విషయాన్ని ఈ సంఘటన చాటుతోంది. నిజామాబాద్‌ జిల్లా నిజామాబాద్‌ పట్టణంలోని ఇరిగేషను ఈఈ కార్యాలయం సంఘటనకు వేదికైంది. జెరాక్స్‌ మిషను పెట్టుకుని వ్యాపారం చేసుకునే ప్రకాష్‌కు ఈ కార్యాలయం సుమారు 4.25లక్షల రూపాయల వరకూ బకాయిపడిరది. ఈ బకాయి గురించి ప్రకాష్‌ అడిగినప్పుడల్లా రేపురా, ఎల్లుండరా అంటూ అథికారులు తెగ తిప్పేస్తుండేవారు. కొందరు ప్రకాష్‌ వద్దకు వచ్చి అసలు ఆమ్యామ్యాలు లేకుండా ఆ కార్యాలయంలో చిన్న ఫైలు కూడా కదలదని తేల్చిచెప్పారు. ఇదెంత వరకూ నిజమో అన్న విషయాన్ని ప్రకాష్‌ స్వయంగా పరిశీలించారు. అయితే అర్థికంగా జెరాక్స్‌ సెంటర్‌పై ఆథారపడే ప్రకాష్‌ తనకు స్తోమత లేదు కాబట్టి మంచిగా డబ్బులు వసూలు చేసుకోవాలని ప్రయత్నించారు. ఎంతకీ అథికారులు తమ వాయిదాపద్దతిని మానలేదు. దీంతో విసిగిపోయి ఆర్థికసమస్యలూ ఎక్కువ అవటంతో తట్టుకోలేకపోయిన ప్రకాష్‌ కిరోసిన్‌ తీసుకుని ఈఈ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం గదిలోకి వెళ్లాక ఇప్పటికైనా నా బిల్లు చెల్లించాలని కోరుతూ కిరోసిన్‌ శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నారు. హతాశులైన అథికారులు పోలీసుల సహాయంతో ప్రకాష్‌ను రక్షించే పనిలో పడ్డారు.

బాబు కిరణ్‌ పోటాపోటి డిక్లరేషన్లు

బీసి డిక్లరేషన్‌, ముస్లిండిక్లరేషన్‌, తాజాగా వర్గీకరణ ఇవ్వాలనే డిమాండులతో తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబు నాయుడు రాజకీయ తెరపై తెగహడావుడి చేసేస్తున్నారు. తమలా దమ్ముంటే డిక్లరేషను ప్రకటించమని సిఎంకు ఆయన సవాల్‌ కూడా విసిరారు. కులాలవారీగా సమీకరణల ఆథారంగా బాబు ఈ డిక్లరేషను ప్రకటిస్తే సిఎం ఇంకో రెండాకులు ఎక్కువ చదివి గిరిజన డిక్లరేషన్‌ ప్రకటించారు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా పెద్దగా హడావుడి కనపడనీయని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా ప్రకటించిన ఈ డిక్లరేషను యావత్తుదేశంలోనే పెద్దసంచలనం.     ఎందుకంటే అభివృద్థికి నోచుకోని గిరిజన ప్రాంతాలు నక్సల్‌ అడ్డాలుగా మారిపోయాయి. మావోయిస్టులకు గిరిపుత్రుల సహకారం ఎక్కువ. అటువంటిది ఆ  గిరిజనప్రాంతాలే అభివృద్థి చెందితే గిరిపుత్రుల జీవితాల్లో పెనుమార్పులు ఖాయం. అంతేకాకుండా ఈ డిక్లరేషను వల్ల యావత్తు రాష్ట్రం అంతా ఒక్కసారిగా తమ ఏజెన్సీ ప్రాంతాలపై ఏకాగ్రతతో కూడిన దృష్టిపెట్టకతప్పదు. ఎందుకంటే గిరిజనులకు మౌళికసదుపాయాలు కల్పించాల్సింది మైదానప్రాంతాల వారే కాబట్టి. మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగాలు ఇటువైపు దృష్టిసారిస్తే ఖచ్చితంగా దాని ఫలితాలు ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి అనుకూలమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా గిరిజనులు ఎవరినైతే నమ్ముతారో వారిని చివరి వరకూ అంటే జీవితాంతం మోసేస్తారు.    గతంలో ఎన్టీఆర్‌ తరహాలో ఏజెన్సీలో బస చేసిన కిరణ్‌ ఇప్పుడు ఆయన తరహాలోనే సాహసవంతమైన డిక్లరేషను ప్రకటించారని మేథావులు సైతం అభిప్రాయపడుతున్నారు. మైదానానికి దూరంగా బతుకుతున్న గిరిజనుల అభివృద్థికి 8 ఐటిడిఎ పరిథుల్లో  22 స్కిల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తామని సిఎం కిరణ్‌ ప్రకటించారు. సెంటరుకు మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఐటిడిఎల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. మౌళికవసతులకు రూ.600కోట్లు కేటాయిస్తామన్నారు. గిరిజనపాఠశాలలు అన్నింటికీ ఒకడాక్టరు, సిబ్బంది, మెడికల్‌కిట్లు, 104 సదుపాయం కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.   ఏజెన్సీ ప్రాంతాల్లో దళారులు, వడ్డీ వ్యాపారుల బారి నుంచి గిరిజనులను రక్షించేందుకు పెద్దఎత్తున బ్యాంకుశాఖలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతానని సిఎం ప్రకటించారు. సిఎం గిరిజన డిక్లరేషను ప్రకటించి దానికి తగ్గట్లుగా ప్రణాళిక రూపొందిస్తున్నందుకు పలు ప్రాంతాల గిరిజనులు ఆయన్ని క్యాంపుకార్యాలయంలో కలిసి అభినందించారు. ఏమైనా ఇంత భారీస్థాయిలో గిరిజనడిక్లరేషను కనుక అమలు చేస్తే తెలుగుదేశం పార్టీయే కాదు ఇతర పార్టీలు కూడా ఏజెన్సీలో కాలుమోపటానికి ఇబ్బంది పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

తీవ్రమవుతున్న థర్మల్‌పవర్‌ప్లాంటు వ్యతిరేక ఉద్యమం?

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ అరెస్టుతో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బీలలో ధర్మల్‌ ప్లాంట్‌ వ్యతిరేక ఉద్యమం తీవ్రతరమవుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పర్యావరణానికి థర్మల్‌ విద్యుత్తు ప్లాంటు ముప్పు తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ మూడేళ్ల నుంచి రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. మూడేళ్లు పూర్తయ్యే సమయంలోనే ఎమ్మెల్యే అరెస్టు కూడా జరగటంతో నిరసనకారులతో తెలుగుదేశం నేతలు జతకట్టారు. సామూహికంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని నిశ్చయించుకున్నారు.    పర్యావరణపరిరక్షణసమితి, మత్స్యకార ఐక్యవేదికలతో కలిసి పని చేయటానికి తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత కింజరపు ఎర్రంనాయుడు, మాజీస్పీకర్‌ కావలి ప్రతిభాభారతి, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, పార్టీ జిల్లాఅథ్యక్షుడు చౌదరి బాబ్జీ, అమదాలవలస టిడిపి ఇన్‌ఛార్జి కూస రవికుమార్‌ తదితరులు సిద్ధమయ్యారు. వీరంతా తమ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. పర్యావరణానికి ముప్పుతెచ్చే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తుతున్నారు. భారీస్థాయిలో ఈ నిరసన ఉద్యమాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మహాసభ ఏర్పాటు చేయాలని నిరసనకారులు నిర్ణయించారు. ఈ నెల 17నుంచి సామూహిక దీక్షలకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, పర్యావరణ పరిరక్షణసమితి, మత్స్యకార ఐక్యవేదిక ఈ నిరసనకార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రభుత్వం థర్మల్‌పవర్‌ప్లాంటు రద్దు చేసేంత వరకూ తీవ్రస్థాయిలో స్పందించాలని ఈ మూడు నిశ్చయించాయి.  

నల్లధనానికి చట్టాలు చుట్టాలా?

నల్లధనంపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) అనుకుంటోంది. ఎంత బ్లాక్‌ మనీ ఉంటే అంత గొప్ప వ్యక్తులుగా కొనియాడబడుతున్న నేటి ప్రపంచంలో నల్లదనం వెలికితీతకు కొత్తచట్టాలు రావడంతో పాటు ప్రస్తుతం ఉన్న చట్టాలు బలోపేతం కావాలని, అంతేకాకుండా అధికారం నుండి వైదొలగే సమయంలో ఆస్తుల ప్రకటన తప్పనిసరిచేయాలనీ, వీటితో పాటు పన్ను చట్టాలు ఉల్లంఘించిన వారికి భారీ పెనాల్టీలు విధించడం వంటి పలు అంశాలను సిబిడిటి పరిశీలిస్తోంది. ఏవైనా చట్టాలు అమలు చేయాలంటే ఆ చట్టాలు ప్రజలకోసమే కాని రాజకీయనాయకులు, మంత్రులకు కాదనీ, నల్లధనాన్ని కూడబెట్టే పెద్దలు ఆ చట్టానికి అతీతులన్నది నేడు జరుగుతున్న కుంభకోణాల తీరు చూస్తే తెలుస్తోంది.   నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నంలో తొలి అడుగే రాజకీయం అన్నది నేటి మాటగా వినిపిస్తోంది.  భవిష్యత్‌లో క్రిందిస్థాయి నుండి పాలకుల వరకు వారి వారి హోదాలను బట్టి నల్లధనం సంపాదించుకోవచ్చునంటూ ఓ చట్టం తెచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని జాతీయ సంపదగా ప్రకటించాలన్న డిమాండ్‌ వల్ల  దేశానికి పెద్దగా ప్రయోజనం ఉండదని అధికారం ప్రతిపక్షవర్గాలే చెప్పడం విడ్డూరమే! కాబట్టి  నల్లధన కుబేరులు మనసులో ‘ఆనందమానంద మాయే, మది ఆశలనందనమాయే’ అంటూ పాడుకుంటున్నారు.   ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు ప్రజలకే కాని దాని పరిధిలోకి పాలకులు, పెద్దలు రారని ఇప్పటికే ప్రజలకు అర్ధమైపోయింది. పన్నుపోట్లు, ధరల గాట్లు, సామాన్యులను దరిద్రానికి దగ్గరచేస్తుంటే, పన్ను ఎగవేతలు, నల్లధనం దాచివేతలు పాలకులను, పెద్దలను ప్రపంచ కుబేరులను చేస్తాయన్నది  ఇప్పటినిజం! రేపటిసత్యం! అవినీతికి కళ్ళాలు వెయ్యాలంటే అందుకు ఖచ్చితంగా ఏదైనా అద్భుతం జరిగి తీరాల్సిందే?

జాతీయ పండుగలనగా నేమి?

జాతీయ పండుగలంటే ‘స్వాతంత్య్రదినం, గణతంత్రదినం, గాంధీజయంతి...’ తదితరాలు చెప్పేస్తారు. అయితే 65 ఏళ్ళ ప్రజాస్వామ్యదేశంలో ప్రకటనలకే తప్ప ఆయా పండుగలను జాతీయ పండుగలుగా గుర్తిస్తూ నేటివరకూ అధికారిక ఉత్తర్వులు రాలేదంటే మన పాలకుల నిర్లక్ష్యానికి, అలక్ష్యానికి అద్దంపడుతోంది. పైన తెలిపినట్లు ఏ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్‌ 2లను జాతీయపండుగలుగా ప్రకటిస్తున్నారు అని ఆ ఉత్తర్వుల నకలును పంపించండి’ అంటూ సమాచార హక్కుచట్టం పరిధిలో పదేళ్ళ ఓ బాలిక కోరగా, అలాంటి ఉత్తర్వులు ఏదీ జారీ కాలేదని తెలుపగా, తిరిగి ఆ మూడు రోజులను జాతీయపండుగదినాలుగా ప్రకటించినట్లు పాఠ్యపుస్తకాలలో ఉంది కనుక పంపించండి’ అని మళ్ళీ అప్పీలు చేసుకుంటే సంబంధిత సిబ్బంది, శిక్షణ శాఖలోని ఆర్కైవ్స్‌ విభాగం సిబ్బంది పైళ్ళన్నిటిని వెతికి వెతికి అసలు అలాంటి ఉత్తర్వు ఏదీ లేదని తేల్చి చెప్పారు. దాంతో ఆ బాలిక రాష్ట్రపతికి, ప్రధానికి వినతి పత్రం సమర్పించింది.   ఈ సంఘటనను బట్టి చూస్తే పాలకుల పనితీరు, అధికారుల అలసత్వం తెలుస్తోంది.  ఇదంతా చూస్తుంటే నాయకులు ఎన్నిక కావడానికి తప్పనిసరైన ఎన్నికల నోటీఫికేషన్‌ తప్ప ఏదీ సక్రమంగా అమలుకావని అర్ధం చేసుకోవచ్చు. ప్రజలకు అద్దంలో చందమామను చూపించే ప్రయత్నాలే తప్ప అసలు ‘విషయం’ ఏదీ వుండదని, మనదేశంలో జాతిపితగా పిలుచుకునే గాంధీగారికి  జాతిపిత పేరు  ఎప్పుడు వచ్చింది? ఎవరిచ్చారు? ఏ సందర్భంలో ఆయన్ను  ఈవిధంగా సంబోధించారంటూ ఓ తొమ్మిదో తరగతి అమ్మాయి ఇటీవల అడిగిన ప్రశ్నకు  కూడా ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం చెప్పలేకపోయింది మరి!  జాతీయ పండుగలో లెక్కా!