గంగకు సైతం రాజకీయ కాలుష్యం

భారతదేశంలో నదులకు ప్రత్యేకమైన, పవిత్రమైన స్థానం ఉంది. ముఖ్యంగా గంగానది. అయితే ప్రజలందరూ ఎంతో పవిత్రంగా భావించే గంగాజలం కలుషితమైపోతోంది. నది పొడవునా ఉన్న జనావాసాల్లోని మురుగునీరు, నదికి సమీపంలోని పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధాలతో పాటు, వ్యవసాయంలో ఉపయోగించే నిషేధిత క్రిమిసంహారక మందులు సైతం గంగానదిలో చేరి ఆ జల కాలుష్యం ఏర్పడుతోందని ఢల్లీ ఐఐటీ అధ్యయనంలో వెల్లడయింది. అయితే గంగానదిలోకి చేరిన పలు కాలుష్యాలను ప్రక్షాళన చేసేందుకు 1985 నుండి గంగా కార్యాచరణ ప్రణాళిక (జిఎపి) అమలు జరుగుతోంది.   జాతీయ గంగానదీ పరీవాహక సంస్థ  క్రింద రూ.7.000కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణకు అనుమతి లభించగా, గంగానదీ పరివాహక పట్టణాలలో గంగానది కాలుష్య నివారణ చర్యలను చేపట్టేందుకు రూ.1,441 కోట్లు విడుదల చేశారు.  గంగానదీ పరీవాహక ప్రాంతంలో జలకాలుష్యంఎక్కువవుతున్నది. పరిశ్రమల కారణంగా 20శాతం వరకు గంగానదీ కాలుష్యం జరుగుతోందని  సంబంధిత మంత్రివర్యులు తెలియజేశారు. 1985 నుండి అమలులోకి వచ్చిన జిఎపి ఇప్పటికి సుమారుగా 27 సంవత్సరాలు గడిచినా ఇంకా గంగానదిలోని కాలుష్యాన్ని అరికట్టలేకపోవడం చూస్తే గంగ ప్రక్షాళనకు సైతం రాజకీయ కాలుష్యం అంటుకుందేమో అనిపిస్తోంది.  గంగానదే  మానవరూపమెత్తి ఎన్నికల సమయంలో మీకు ఓటేస్తానంటే  తప్ప గంగానదీ కాలుష్య నివారణచర్యలు పూర్తికావేమో! నివారణ చర్యలకోసం నిధులనయితే విడుదల చేస్తారు కాని పూర్తి స్థాయిలో వాటి అమలే ప్రశ్నార్ధకంగా మారుతోంది.

విశ్వాసం లేని దర్శనాలు వద్దు

కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమలేశుని దివ్యదర్శనం ఇకపై విశ్వాసం పాతిపదికపై మాత్రమే హిందూయేతరులకు లభిస్తుందట! అన్యమతస్థులు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు శ్రీవారిపై తమకు విశ్వాసం ఉన్నట్లుగా విధిగా డిక్లరేషన్‌ ఇవ్వాలన్న నిబంధన చాలాకాలం నుంచే ఉన్నా ఏనాడూ అది అమలుజరుపనేలేదు! ఈమధ్యకాలంలో వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చినప్పుడు ఎటువంటి డిక్లరేషన్‌ ఇవ్వనేలేదు. ఈ విషయం వివాదాస్పదం కావడంతో డిక్లరేషన్‌ నిబంధనను టిటిడి కఠినతరం చేసింది. ఇది సమసమే అయినప్పటికీ` కేవలం అన్యమతస్థుల నుంచి మాత్రమే డిక్లరేషన్‌ తీసుకోవాలన్న నిబంధనను శ్రీవారి దర్శనార్ధం వచ్చే అందరికీ వర్తింపచెయ్యడం మంచి పద్దతంటూ భక్తులు సూచిస్తున్నారు. తద్వారా విశ్వాసం లేని దర్శనాలు పూర్తిగా నియంత్రణ జరిగి ఆలయ పవిత్రత మరింతగా పెరుగుతుందని వారంటున్నారు!

దుర్భర దారిద్య్రంలో బ్రాహ్మణ వర్గం

అగ్రవర్గరంగా అందరూ భావించే బ్రాహ్మణ సామాజిక వర్గం ఆర్థికంగా చితికిపోయి దుర్భర దారిద్య్రంతో అలమటిస్తున్నదని బిజేపి నేత ఎన్‌.ఇంద్రసేనారెడ్డి ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పధకాన్నీ అగ్రవర్ణంగా ముద్రపడిన బ్రహ్మణులకు అందకుండా రక్తహస్తం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు! ఈ రాష్ట్రంలో అన్ని రకాల వివక్షలకు గురౌవుతున్న అగ్రవర్ణంగా బ్రాహ్మణ వర్గాన్ని చెప్పవచ్చు. పౌరహిత్యం, అర్చకత్వం వంటి ఆధ్యాత్మిక జీవనంతో అభివృద్ధికి దూరంగా ఉంటూ ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మణులకు ప్రత్యేక రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తూ వారి పురోగతికి కృషి చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది!

యువరాజు ప్రయివేటు పాట

వారసత్వంతో అధికార పీఠం అలంకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న రాహుల్‌ గాంధీ గారి దృష్టిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయివేటు పార్టీలేనట! 2014లో ప్రధాన మంత్రి పదవిని అలంకరిస్తారని అందరూ భావిస్తున్న రాహుల్‌ గాంధీని మన రాష్ట్రం నుంచి కొంత మంది బిసీ నేతలు వెళ్ళి కలుసుకున్నారట! రాబోయే ఎన్నికలలో బిసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేసారట!   గత ఎన్నికల సమయంలో సామాజిక న్యాయం చేస్తామని చెప్పి పార్టీ ప్రారంభించి ఎన్నికల అనంతరం తన ప్రజారాజ్యాన్ని ‘‘చేతి’’ లో పెట్టి అధిష్ఠానం అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి అప్పటి తన పార్టీలో బిసిలకు ఎక్కువ సీట్లు ఇచ్చారనీ, అలాగే తెలుగు దేశం పార్టీ కూడా బిసిలకు ఎక్కువ సీట్లు కేటాయించిందనీ, ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి కూడా బిసిలకు ఎక్కువ సీట్లు కేటాయించనుందనీ వారు రాహుల్‌కు వివరించారట! అదంతా శ్రద్దగా విన్న రాహుల్‌ ఈ ప్రయివేటు కంపెనీల వల్ల బిసిలకు న్యాయం కలగదని చెప్పారంటూ రాయబారం మోసుకెళ్ళిన నేతలు మీడియాతో చెప్పారు. నిజమే...చేసినా చెయ్యకపోయినా చేసే ‘చెయ్యి’గా చెప్పుకోవడం యువరాజుకు వంశపారంపర్యంగా వచ్చిన వాక్చాతుర్యం అంటూ మన తెలుగు సోదరులు వ్యాఖ్యానిస్తున్నారు మరి!

ప్రజలపై భారం మోపుతున్న ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్ధలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు సంస్థలకు గ్యాస్‌ సరఫరా నిలిపివేసి ప్రభుత్వరంగ సంస్ధలయిన ఏపి జన్‌కో ఆద్వర్యంలోని నేదునూరు, శంకరపల్లి సరఫరా చేయాలని ప్రతిపక్షపార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. తద్వారా విద్యుత్‌ చార్జీలను బాగా తగ్గించవచ్చని ఆ పార్టీల నాయకులు అంటున్నారు.నాలుగేళ్ల నుండి ల్యాంకో, జిఎంమ్మార్‌ లాంటి ప్రయివేట్‌ సంస్థలకు గ్యాసు ఇవ్వడం ద్వారా ప్రజలపై 2,850 కోట్ల రూపాయల భారం పడింది.     అధిక ధర చెల్లించి ప్రవేటు సంస్థలనుండి రాష్ట్ర ప్రభుత్వం విధ్యుత్‌ కొనుగోలు చేయడం పూర్తిగా అనాలోచిత చర్యగా వినియోగదారులు భావిస్తున్నారు.ఎపి జెన్‌కో ప్రాజెక్టులు గ్యాస్‌ ఆధారంగా 2,500 మెగావాట్ల విద్యుత్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు 1.85 నుండి 2.20 రూపాయలు వుండగా ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల నుండి యూనిట్‌ విద్యుత్‌ను రూ 5.70 చెల్లించి కొనుగోలు చేయడం ప్రజలపై భారాన్ని మోపటమే. అలాగే విద్యుత్‌ టారీఫ్‌లను క్రమబద్దీకరించేందుకు ఆ ప్రైవేటు సంస్ధలపై ఒత్తిడి కూడా ప్రభుత్వం ఇంతవరకు తీసుకురాలేక పోయింది. జిఎంఆర్‌, ల్యాంకో సంస్థలు యధేచ్చగా ఎలక్ట్రిక్‌ రెగ్యులేషన్స్‌ను ఉల్లంఘించినా ఎటువంటి చర్యలూ ప్రభుత్వం తీసుకోవడం లేదు. ప్రజలపై భారాన్ని మోపే ప్రైవేట్‌ సంస్థల్ని కాక, ప్రభుత్వరంగ సంస్ధలను ప్రోత్సహించి విద్యుత్‌ కొరత తీర్చాలని ప్రతిపక్షాలు పట్టు పడుతున్నాయి.

వృత్తి పన్ను నుండి గీత కార్మికులకు ఉపశమనం

గీత వృత్తి కార్మికుల ప్రధాన డిమాండ్‌గా ఉన్న వృత్తి పన్నును ఎత్తి వేస్తూ ,ప్రభుత్వం వారికి ఊరట కలిగించింది. ఈ మేరకు జి ఓ 512 జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.62 లక్షల మంది గీత కార్మికులకు ప్రయోజనం కలుగ చేసింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో మూడు రకాల పన్నులు అంటే చెట్టుపన్ను, గీసిన పన్ను, కల్లు అమ్మిన పన్ను కడుతున్నారు. 2006 కేంద్రప్రభుత్వం కల్లుగీత వృత్తి దారులపై సేవా పన్నును విధిస్తూ నిర్ణయించింది. ఈ విధానం ద్వారా సొసైటీ ఏడాదికి ఒక్కొక్కరికీ 750రూపాయలు పన్నుగా నిర్ణయించారు. అయితే అప్పటినుంచే ఈ పన్ను కార్మికుల నుంచి వసూలు చేయలేక పోయింది. ఈ నేపధ్యంలో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పన్నునుంచి గీత కార్మికులకు మినహాయింపు నిస్తూ ఆదేశాలిచ్చింది. వైయస్‌ హయాంలో పన్ను భారం 75 శాతం తగ్గింది. జివొ నెంబరు 555 ప్రకారం కల్లు డిపో లో జిల్లా కేంద్రాలలో నిషేదం పెట్టి 1400దుకాణాలు రద్దు చేశారు. ఆతర్యాత చెట్లు లేని చోట కల్లు దుకాణాలు రద్దు చేశారు. ఈ నేపధ్యంలో వృత్తి పన్ను మినహాయించడం కల్లు గీత కార్మికులకు ఉపశమనం లభించినట్టయ్యింది.

నీటి ప్రాజెక్టుల క్రింద చిగురిస్తున్న ఖరీఫ్‌ సాగు

ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్టానదిలో నీటి మట్టం పెరుగుతోంది . గత రెండు నెలలుగా డెడ్‌స్టోరేజ్‌ కంటే దిగువకు పడిపోయిన నీటితో ఎడారులను తలపించిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుంన్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టి ఇప్పటికే పూర్తి స్ధాయిలో నిండిపోవడంతో అక్కడి అధికారలు 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.దీంతో మన రాష్ట్రంలోని శ్రీశైలం ,నాగార్జున సాగర్‌ మెరుగుపడుతున్నాయి.     శ్రీశైలం జలాశయాల నీటి మట్టం గరిష్టంగా 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 801 అడుగుల వుంది. నాగార్జున సాగర్‌ ఇన్‌ప్లో పెద్దగా లేకపోవడంతో పరిస్ధితి ఆశాజనకంగా లేదు. సాగర్‌దిగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్‌ప్లో 3.88 లక్షల క్యూసెక్కుల నీరుండగా దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో సరిపడినంత నీరు లేదు. సాగునీటి ప్రాజెక్టులక్రింద ఖరీఫ్‌ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జూరాల నిండిపోవడంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. వరినాట్లు వేసే పనులు కూడాపుంజుకుంటు న్నాయి. శ్రీశైలం నీటిమట్టం పెరగంగానే రాయలసీమకు నీటిని విడుదల చేయనున్నారు.కర్నూలు, కడప కాలువతోపాటు తెలుగుగంగ, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 840 అడుగులకు చేరుకునేదాక డ్యాంనుండి నీటిని విడుదల చేయరాదని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు దీన్ని అమలుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో రోజుకు 10 మందిబాలికలు, 12 మంది మహిళల అదృశ్యం

మానవ అక్రమరవాణా రోజురోజుకూ పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా బాలికలను, స్త్రీలను వ్యభిచార గృహాలకు అమ్మేవారి వల్ల వీరికి ముప్పు వాటిల్లుతుంది. మిసింగ్‌ కేసులకు సంబందించి రాష్ట్రపోలీసు శాఖ, చైల్డ్‌ వెల్ఫేర్‌ సంస్థ సంయుక్తంగా జరిపిన సర్వేలో దిగ్రాంతికరమైన నిజాలు తెలిసాయి. 2009 నుండి 47,181మంది మిస్సింగ్‌ కేసులు నమోదు అయ్యాయి దానిలో 16,787 బాలికలు, 12,882 మహిళలు. 2009లో కనిపించకుండా పోయిన వారిలో 66 శాతం మంది బాలికలే. ఈ సంవత్సరం జూలై వరకు కనిపించకుండా పోయిన వారు 2,786 మంది కాగా వారిలో 70 శాతం మంది బాలికలే వారి సంఖ్య 1,955 . అంటే ప్రతిరోజు సగటున 10 మంది బాలికలు అపహరణకు గురిఅవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సంవత్సరం జూలైవరకు 2,519 మంది స్త్రీలు తప్పిపోయిన కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజు 12 మంది స్త్రీలను అపహరిస్తున్నారని తెలుస్తుంది. గత నాలుగేళ్లనుండి 23,760 మంది కనబడకుండా పోయారు. ఇప్పటి వరకు వీరి జాడ తెలియలేదు. వీరిలో చాలా మందిని వేశ్యా గృహాలకు అమ్మి వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కనబడకుండా పోయిన వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేసేందుకు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించామని అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ వియస్‌కె కౌముది తెలిపారు. స్ధానికంగా ఉండే పోలీస్‌ స్టేషన్‌లో గాని, స్వచ్చంధ సంస్థల సహకారం గాని తీసుకోవచ్చని వారు తెలిపారు. దీనిలో గుర్తింపబడని మృతదేహాల వివరాలను కూడా పొందుపరిచారు. ఇంటినుండి తప్పిపోయి లేదా తప్పించుకొని వచ్చిన పిల్లలను రైల్యే పోలీసుల లేదా స్వచ్చంధ సంస్థల ద్వారా చిల్డ్రన్స్‌ హోమ్‌కు గాని తల్లిదండ్రుల వద్దకు గాని పంపడం జరుగుతుంది. తప్పిపోయిన బాలబాలికల ఫోటోను, వివరాలను తమ దగ్గర ఉన్న ఫోటోలతో సరి పోల్చుకొని వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందని ఎడిజి కౌముది తెలిపారు.

ఎడ్లబండ్లే బెటరా?

గతంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మంటలు... ప్రయాణీకుల మరణం దుర్ఘటనను మరచిపోకముందే.. సోమవారం మధ్యాహ్నం త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌`7 బోగీ కింద మంటలు రావడం... ప్రయాణీకులు తీవ్ర భయంతో చైన్‌ లాగటం.. తమ్మిలేరు వాగుపై నున్న బ్రిడ్జిపై రైలు ఆగటం.. ప్రయాణీకులు ప్రాణభయంతో వాగులోకి దూకడంతో పలువురు తీవ్రంగా గాయపడటం జరిగింది. ప్రతిరోజు ఎక్కడోచోట రైలు ప్రమాదం, బస్సుప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ప్రయాణమంటేనే భయపడుతున్న ప్రయాణికులు ఈ ప్రమాదాల నేపథ్యంలో.. పోను పోను పూర్వంలాగా ఎడ్లబండ్లు, గుర్రపుబండ్లే శ్రేయస్కరమని భావించినా ఆశ్చర్యపోనక్కరలేదు. సంబంధిత బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నా స్పందన లేనట్లుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు, మంత్రులు ఇకనైనా బాధ్యతగా వ్యవహరించకపోతే ‘రవాణాసౌకర్యాలు ప్రమాదాలకు నిలయాలు, మరణానికి రహదారులు’ అన్న వ్యంగ్యోక్తి అక్షరసత్యంగా నిలుస్తుంది. అరవై అయిదేళ్ళ స్వతంత్రభారతంలో ప్రజల భద్రతకోసం ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాల్సిఉంది మరి!

ఫీజు రగడపై కోర్టు జోక్యం అనివార్యమేనా?

ఫీజుల తగ్గింపుపై ప్రభుత్వ ప్రకటనలు, యాజమాన్యాల నిరసనల నేపథ్యంలో .. కాలేజీల మేనేజ్‌మెంట్‌ ఫీజులు భారీగా తగ్గింపుతోపాటు అలా తగ్గించిన ఫీజును రెండేళ్ళపాటు కొనసాగించాలన్న నిబంధనలను ప్రభుత్వం విధిస్తుంటే... కాలేజీ యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఈసిఈ, సిఎస్‌సి, ఈఈఈ తదితర కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా క్రింద కాలేజీల మేనేజ్‌మెంట్‌ కనీసం 60వేలరూపాయల వరకు తీసుకుంటుంటే.. దాన్ని 35వేల రూపాయలకే తగ్గించడంవల్ల క్యాపిటేషన్‌ ఫీజులు భారీగా వసూలు చేసే కాలేజీలు లాభపడతాయని, మాకు ఆదాయం పడిపోతుందని, సంక్షోభంలో పడిపోతామని కనుక 40వేలుగా ఫీజును మార్చాలని, ముందుగా చెప్పినట్లు ‘ఏడాది’ నిబంధననైనా అమలు చెయ్యాలంటూ కాలేజీ యాజమాన్యాలు డిమాండ్‌చేస్తున్న తీరు విద్య వ్యాపారంగా మారిందని తెలియజేస్తోంది.   ప్రభుత్వం ఆయా యాజమాన్యాలు తమ షరతులకు ఒప్పుకున్నాయంటూ విద్యార్ధులను మభ్యపెట్టడం తగదంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యపై ప్రభుత్వానికి ఉన్న అలసత్వానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదేమో...! ఈ తతంగమంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుండటంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని అయోమయంలో పడిపోతున్న విద్యార్ధిలోకం ఈ వివాదం ఇలాగే కొనసాగితే విద్యాసంవత్సరం నష్టపోవలసివస్తుందని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎవరేమైపోతే మాకేం... రాజుగారొచ్చారు మొదలెట్టండి...’ అన్నట్లుగా చర్చల పర్వం సుదీర్ఘంగా కొనసాగిపోతోంది. హైకోర్టు జోక్యం అనివార్యమే మరి!

జగన్‌ ఆర్థిక మేధావా? రాజకీయ నిపుణుడా?

అక్రమాస్తుల కేసులో సిబిఐ పుణ్యమా అని చంచల్‌గూడా జైలులో ఖైదీగా మిగిలిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆర్థికమేథావా? లేక రాజకీయ నిపుణుడా అని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. రోజు రోజుకు మారుతున్న సమీకరణల్లో ఎక్కువ ప్లస్‌గా కనిపిస్తున్నది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకేనని అందరూ అంగీకరించక తప్పటంలేదు. ఒకవైపు తండ్రి సిఎం కావాలని బలమైన కోరిక ఉన్న కుమారుడిగా జగన్‌కు మొదట్లో ముద్రపడింది. ఆనాటి అధికార తెలుగుదేశం పార్టీ లోపాలు ఎత్తిచూపటంలో వైఎస్‌రాజశేఖరరెడ్డికి తన తెలివితేటలతో కొంత సమాచారం జగనే సేకరించి ఇచ్చేవారట.   ఆ సమాచారం ఆధారంగా వైఎస్‌ చేసిన ప్రకటనలు సంచలన మయ్యాయి. మొత్తం అన్ని పత్రికల్లోనూ పతాకశీర్షికలతోనూ, ఎలక్ట్రానిక్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గానూ రాజశేఖరరెడ్డి మిగిలేవారు. ఇలా రాష్ట్రవ్యాప్త సంచలనంగా మారిన రాజశేఖరరెడ్డిని పాదయాత్రకు పురికొల్పినది కూడా జగన్‌ అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎక్కడికి వెళ్లినా అక్కడి స్థానిక సమస్యలపై భరోసా ఇవ్వాలని తండ్రికి జగన్‌ చెప్పి పంపినట్లు ప్రచారం జరిగింది. రాజమండ్రిలో అస్వస్థతకు గురైన వై.ఎస్‌.ఆర్‌. ఒక దశలో పాదయాత్రను నిలిపివేయాలని భావించిటనట్లు తెలిసింది. అయితే జగన్‌ జోక్యం చేసుకుని ఈ స్దితితో పాదయాత్ర కొనసాగిస్తే సిఎం కావడం ఖాయమన్న నమ్మకాన్ని వై.ఎస్‌.లో కల్పించారని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి.   తన కుమారుడి మాటల ఫలితం అప్పటికే చవిచూసిన రాజశేఖరరెడ్డి కూడా దాన్ని అమలు చేయటంతో ఆయనకు అధికారపీఠం దక్కింది. దీంతో జగన్‌ మాటకు వైఎస్‌ఆర్‌ ఎక్కువ విలువ నివ్వటం అన్నదానికి బీజం పడిరదని వైఎస్‌ సన్నిహితులు చెబుతుంటారు. అలానే సిఎంగా రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు అక్రమాస్తులను కూడబెట్టగలిగిన జగన్‌ సిబిఐ ముందు ఆర్థికమేధావిలా కనిపించారు.ఇంటరాగేషన్‌లో జగన్‌ తెలివిగా సమాధానం ఇస్తున్నారని స్వయంగా సి.బి.ఐ. తరపు న్యాయవాదులు కోర్టుకు తెలపడం విశేషం. సిబిఐ తన దర్యాప్తులో జగన్‌ అక్రమాస్తులగురించి ఇప్పటి దాకా పెద్దగా ఆధారాలు సేకరించలేకపోయింది. విదేశాల నుంచి కూడా సమాచారం సేకరించలేకపోయింది. దీంతో జగన్‌ను ఆర్థికమేధావిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తించారే తప్ప ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సిబిఐ చూపిన నేరగాడిగా అంగీకరించటం లేదు.   ప్రత్యేకించి వైఎస్‌ఆర్‌ ప్రతిపాదించిన పథకాల లబ్దిదారులు జగన్‌పై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ఇక ఉప ఎన్నికల్లో 18అసెంబ్లీ స్థానాలకు 15లో గెలుపుబావుటా ఎగురవేయటం ద్వారా జగన్‌ను రాజకీయనేర్పరిగా మారుమూలప్రాంతాల ప్రజలు, గ్రామీణులు గుర్తించారు. అందువల్లే ఆ పార్టీ చేరాలన్న క్రేజ్‌ రోజురోజుకు ఎక్కువ అవుతోంది. దీన్ని ఆపటం ఒకవైపు చంద్రబాబుకు, మరోవైపు అధికార కాంగ్రెస్‌కు సాథ్యం కావటం లేదు. పైగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ప్రకటించి కాంగ్రెస్‌ శ్రేణుల్లోనూ జగన్‌ ఒక ప్రత్యేకముద్రను వేసుకున్నారు. కోర్టులు మాత్రమే ఆయన బయటకు రావటానికి అడ్డు పడుతున్నాయని వైకాపా ప్రచారం చేస్తున్నాయి. దీన్నే ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఫెరా చట్టం కింద జగన్‌ నేరస్తుడన్నది సిబిఐ ప్రకటిత అంశంగానే ప్రజలు భావిస్తున్నారు. జగన్‌ ఏ నేరమూ చేయలేదనీ, కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని ఎక్కువమంది నమ్ముతున్నారు.

ఇరకాటంలో కిరణ్‌ సర్కార్‌ ?

వాన్‌పిక్‌ భూముల కుంభకోణం కాంగ్రెస్‌పార్టీని ఇరకాటంలో పడేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహనరెడ్డి సూచనల మేరకు ఈ వాన్‌పిక్‌ భూముల కొనుగోళ్లు జరిగాయి. దీనిలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, తాజాగా రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావు, మరికొందరు మంత్రులు జీఓల పేరిట ఇరుక్కున్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన ఈ కుంభకోణం వల్లే పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే మంత్రి మోపిదేవి వెంకటరమణ తనపేరును సిబిఐ తెరపైకి తీసుకురాగానే తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అలానే ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఢల్లీి నుంచి తిరిగి వచ్చిన వెంటనే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.   ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌సర్కారులోనూ వీరు మంత్రులుగా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలన్నీ మంత్రులకు న్యాయసహాయం చేస్తూ ప్రభుత్వం దోషపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మానప్రసాదరావుకు కూడా ప్రభుత్వం న్యాయసహాయం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీసి సంఘాలన్నీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. కిరణ్‌ కుమార్‌ తన పదవిని కాపాడుకునేందుకు బి.సి.లను బలిపశువులుగా వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు.   తెలుగుదేశం పార్టీ పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు బాటలో బీసి డిక్లరేషన్‌ చేసింది. ఈ బీసి డిక్లేరేషను వల్ల కులసంఘాలన్నీ తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమద్దతును ప్రకటిస్తున్నాయి. అన్ని పార్టీల్లోని బీసి సంఘాలూ కూడా టిడిపికి వచ్చే ఎన్నికల్లో సంపూర్ణమద్దతును ముందు నుంచే ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన సంఘాలన్నీ ఆల్‌రెడీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించు కున్నాయి. ఈ దశలో మంత్రి పదవికి ధర్మానప్రసాదరావు చేసే రాజీనామా బీసి సంఘాలను కాంగ్రెస్‌పార్టీకి దూరం చేస్తాయన్నది నిర్వివాదాంశం. పైగా శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాల్లో వేళ్లతో లెక్కబెట్టదగిన వారే మంత్రులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురీత తప్పదని రాజకీయవిశ్లేషకులు తేలుస్తున్నారు.   ఎందుకంటే రాజకీయంగా ఎదిగిన కుటుంబాల్లో ధర్మాన కుటుంబానికి అక్కడ పలుకుబడి ఉంది. అందుకే ప్రసాదరావు సోదరుడు రామదాసు ఇటీవల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ తరుపున అక్కడ విజయం సాధించగలిగాడు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వాన్‌పిక్‌ భూములున్నాయి. ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి డిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈ భూముల కుంభకోణం జరిగింది. దీని కోసం మంత్రులందరినీ వైఎస్‌ ఏకతాటిపై నడిపించి ప్రత్యేక జీఓలను విడుదల చేశారు. ఈ జీఓల విడుదల తరువాత రైతుల నుంచి వాన్‌పిక్‌ సంస్థ భూములను స్వాధీనం చేసుకుంది. అయితే ఇటీవల ఆ భూముల కుంభకోణాన్ని పరిశీలించిన రైతులు తిరిగి తమ భూములను సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీ నేతల సహకారంతో స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ భూములను అమ్మటం వల్ల తాము కూడుకు కూడా నోచుకోవటం లేదని రైతులు కూడా సెంటిమెంటుగా ఫీలయ్యారు.   అయితే విచిత్రమేమిటంటే అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న బాలినేని ఈ కుంభకోణానికి కారణమైన జగన్‌ నెలకొల్సిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారి మళ్లీ మూడోసారి శాసనసభ్యునిగా గెలుపొందారు. అదే ఆయన కనుక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఓటమిపాలయ్యేవారని, వాన్‌పిక్‌ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్‌పై దాని ప్రభావం పడిరదని పరిశీలకులు స్పష్టం చేశారు. ఈ కుంభకోణం నేపథ్యంలో కాంగ్రెస్‌కు ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కాంగ్రెస్‌కు తీవ్రమైన వ్యతిరేకత తప్పటం లేదు. దీన్ని ఎదుర్కొనేందుకైనా ఈ నాలుగుజిల్లాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం బీసి సంఘాలకు ఊరట కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు వస్తున్నాయి. ధర్మాన రాజీనామా తరువాతైనా కాంగ్రెస్‌ బీసిల కోసం ప్రత్యేకంగా బ్యాంకర్ల సహాయంతో సబ్సిడీ రుణాలు వంటివి మంజూరు చేస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా బీసి మంత్రుల రాజీనామా కాంగ్రెస్‌పార్టీని లొంగదీస్తోందన్నది అక్షరసత్యం.

జైపాల్‌` కిరణ్‌ మధ్య గొడవే లేదా ?

కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సిఎంగా రాబోయేది లేదని స్పష్ట మవుతున్నది. ఒకవేళ తెలంగాణను వివాదం లేకుండా ప్రకటిస్తే, వాటాల పంపిణీకి జైపాల్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించే అవకాశం ఉన్నది. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన అభిప్రాయం లేనిది ముఖ్యమంత్రిగా వచ్చే ప్రసక్తే లేదని గతంలోనే ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ విషయంలో కూడా జైపాల్‌రెడ్డి తనదైన పాత్రను పోషించి 11 నెలల పాటు అనధికారికంగా గత నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టి, ప్రధాని సమీక్షకు పంపారు. ఈ కారణంగానే గ్యాస్‌ విషయంపై ప్రధాని జోక్యం చేసుకున్నట్లు తెలుస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువ. ముఖ్యమంత్రిగా జైపాల్‌ను పంపించే అవకాశం ఒక ఐచ్ఛికమే తప్ప కచ్చితం కాదు. దీనిపై ముఖ్యమంత్రి భయపడాల్సిన పనిలేదని జైపాల్‌ సన్నిహితులు పేర్కొంటున్నారు. జైపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి విమర్శలు ఎదుర్కోవడం కొత్త కాదు.     రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్వకుర్తి లేదా రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ సీటు కావాలని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఆయన కోరారు. అయితే దీనిలో మేడ్చల్‌ నియోజకవర్గం మాత్రం అప్పట్లో వైఎస్సార్‌ ఇవ్వలేదు. జిల్లా రాజకీయాలను ఆయనకు వ్యతిరేకంగా క్రియేట్‌ చేశారు. ఇదే జిల్లా చేవెళ్ళ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో మేడ్చల్‌లో టికెట్‌ పొందని అభ్యర్థినే జైపాల్‌ ప్రతిపాదించారు. అయితే దీనికీ కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుపెట్టారు. రాష్ట్ర మంత్రి వర్గంలో హోంమంత్రి సబితారెడ్డి, జానారెడ్డి జైపాల్‌రెడ్డి నిర్ణయాన్ని సమర్థించినప్పటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త వ్యక్తిని రంగంలోకి తీసుకుని వచ్చి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డిపై జైపాల్‌రెడ్డి చేసింది ఏమీ లేదు. తాజాగా ముఖ్యమంత్రిగా జైపాల్‌ వస్తారేమోనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అనుయాయుల వ్యాఖ్యలను జైపాల్‌రెడ్డి అనుయాయులు ఖండిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో చీలిక?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్‌లో నిలిచే పక్షంలో చాలా మంది నాయకులు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రకటించకపోతే ప్రజల ఎదుటకు వెళ్ళలేమని, అవసరమైతే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో కొందరు కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ అనే పేరు లేకుండా తెలంగాణ పదం కలిపి ఒక కొత్త పార్టీ రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు పొన్నం ప్రభాకర్‌, జానారెడ్డి, మధుయాష్కీ తదితరులు కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ భావోద్వేగంపై ఎన్నికలకు వచ్చే పార్టీలకు, సంస్థలకు తెలంగాణలో తిరుగుండదు. అటు కాంగ్రెస్‌ను, ఇటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను, టిడిపిని ఎదుర్కొనేందుకు ఇదే మంచి కూటమిగా తెలంగాణ మేధావులు భావిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉన్నది. టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలుస్తున్నది.

త్వరలో వైసిపిలోకి గంగుల భానుమతి?

భాను చేతిలో హత్యకు గురి అయిన మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి త్వరలో వైయస్సార్‌ పార్టీలో చేరుతున్నారని తెలిసింది. తన జిల్లా నాయకత్వంగాని, ముఖ్యమంత్రిగాని తనను పట్టించుకోక పోవడం వల్ల ఆమె వైసిపి కి ప్రాధాన్యత నిస్తున్నారని తెలిసింది. అలాగే సూరిని హత్య చేసిన భానుకు కూడా అనేక మంది కాంగ్రెస్‌ నాయకలతో సంబంధాలు ఉండటం వల్ల బెయిల్‌పై బయటకు వస్తే భానుతో తనకు ప్రమాదం ఉందని ఆమె కలత చెందుతున్నారు. ఇదే విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆమె పలుమార్లు కలసి చర్చించినా సరైన హామీ లభించనందువల్ల ఆమె ఈ నిర్ణయానికి వచ్చారు. దీనితో రాయలసీమలో వైసిపి బలమైన పార్టీగా ఉన్నందువల్ల తనకు రక్షణగా ఉంటుందని ఆమె భావిస్తున్నారు. అంతేకాక తన పొలిటికల్‌ భవిష్యత్తుకు కూడా డోకా వుండదని గంగుల భానుమతి భావిస్తున్నారు. తనకున్న ఆస్తులను కాపాడుకోవాలంటే పదవులుండాలని, పదవులుండాలంటే భవిష్యత్‌ ఉన్న రాజకీయపార్టీలో ఉండాలని ఆమె ముందుచూపుతో వైసిపిలో చేరుతున్నారనుకోవచ్చు.

రిపబ్లిక్‌ డే , ఇండిపెండెంట్స్‌ డే మధ్య తేడా తెలియదా?

కార్పొరేట్‌ విద్యపేరుతో విలువలు లేని , దేశభక్తికి చోటులేని పాఠాలను చెబుతున్నారు. ఇప్పటి మిడిల్‌ స్కూలు నుండి కాలేజీ స్ధాయివరకు ఎంత మంది పిల్లలకు స్వాతంత్య్ర సమర యోధుల గురించి తెలుసు? ...ఎంత మంది దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఈ దేశం స్వాతంత్య్రం సాధించిందో ఈ నాటి విద్యార్దులలో ఎంతమందికి అవగాహన వుంది? ఎల్‌కెజి నుండి ఐఐటిలు, జిప్‌మర్లు అని క్యాష్‌ చేసుకునే విద్యాలయాలు ఈ నాటి విద్యార్దులకు ఏం బోధిస్తున్నారు? సమాజం బాగుండాలంటే విద్యాలయాలు బాగుండాలి. విద్యాలయాలు బాగుండాలంటే గురువులు క్రమశిక్షణ, సామాజిక విలువలు తెలిసున్న వారు కావాలి. ఈ రెండు తెలియాలంటే విద్యనేర్పించే వారికి సామాజి బాద్యత ఉండాలి.ఇటీటల నిర్వహించిన ఒక సర్వేలో ఢల్లీలోని ఇంటర్‌, డిగ్రీస్ధాయి విద్యార్దులో చాలామందికి గణ తంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం మధ్య తేడా తెలియదని తేలింది. ఈతరం పిల్లలది టెక్నికల్‌ బ్రెయిన్‌ వారు కంప్యూటర్‌ గురించి లేదా ఏదైన మెషినరీ గురించి అడిగితే టక్కున సమాధానం చెబుతారు.   సినిమాల గురించయితే చెప్పనక్కర్లేదు. ఏ చానల్‌ చూసినా జరిగే కార్యక్రమాలన్నీ సినిమాల మీదనే కాబట్టి పిల్లలకు ఏ సినిమాలు ఏ హీరో చేశాడు దగ్గర్నుంచి ఏంత కలెక్షన్‌ కూడా చెప్పగలుగుతున్నారు. అంతే కాకుండా కాస్త చురకైన యువత హీరోలను ఆదర్శంగా తీసుకొని బైకు రైడిరగ్‌లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆడపిల్లలు హీరోయిన్స్‌ను ఆదర్శంగా తీసుకొని కాస్టూమ్స్‌లో పొదుపు పాటిస్తున్నారు. ప్రభుత్వం, తల్లిదండ్రులూ, మేధావులూ, సామాజిక శాస్త్రవేత్తలు ఈ విషయంలో సరైన చర్యలు చేపట్టాలి. విద్యను వ్యాపారంగా మార్చి ఫీజులు గుంజుతుంటే తల్లి దండ్రులు ఫాల్స్‌ ప్రెస్టీజ్‌ కి పోయి లంచాలు తీసుకొని కార్పొరేట్‌ స్కూల్స్‌లో కట్టి పిల్లలను డబ్బును ప్రింట్‌ చేసే మిషన్లనుగా పెంచుతున్నారు. దేశ భక్తి ఇప్పుడు ఎందుకూ పనికి రానిదిగా మహా అయితే అది మిలట్రీకి సంబందించినవిషయంగా చూస్తున్నారు. నేషనల్‌ సెంటిమెంట్‌లేని చదువు ఎంత చదివినా ఫలితం శూన్యం.   ఇదివరలో పాఠశాలలో స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌డేల సందర్బంగా దేశభక్తులకు సంబందించిన పాటలు, నృత్యరూపకాలు, ఏకాపాత్రాభినయాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ సినిమా పాటలకు డాన్సులకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా స్కూళ్ల యాజమాన్యాలు దేశభక్తులకు సరైన ప్రాధాన్యత నిచ్చి విద్యార్ధులకు అవగాహన కల్పించాలి. సామాజిక సృహకలిగిన భావిభారత పౌరులను పెంపొందించుకున్నప్పుడే సమాజం పురోభివృద్ది చెందటంతో పాటు ప్రస్తుతం సమాజంలోఉన్న అవలక్షణాలైన లంచాలు, క్విడ్‌ప్రోకో, నల్లధనం,విదేశీ ఎకౌంట్లకు కాలం చెల్లుతుంది. సమసమాజం నిర్మించబడుతుంది.

టిటిడి డిక్లరేషన్‌ పై వెల్లువెత్తుతున్న విమర్శలు

అన్యమతస్తులు తిరమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో స్వామివారిపై తమకు నమ్మకముందని డిక్లరేషన్‌ను తప్పని సరిచేస్తూ టిటిపి చేసిన నిర్ణయం అనేక విమర్శలకు తెరతీసింది. రోజుకు వేలమంది దర్శించుకునే తిరుమలలో ఎవరు ఏ మతస్తులో ఎవరికి తెలుసు.....అయినా దర్శించుకొనేందుకు వస్తున్నారంటేనే నమ్మకంతోనే కదా... మన దేశం లౌకిక రాజ్యం దీనిలో ఎవరు ఏమతాన్ని అయినా అనుసరించే స్వేచ్చ ఉంది. అయినా సాక్షాత్తూ స్వామి వారే బీబీ నాంచారిని పరిణయమాడి లౌకిత్యాన్ని చాటితే పర మతస్తులకు డిక్లరేషన్‌ ఏమిటి దీన్ని రాజకీయ నాయకుల కోసమే ప్రయోగిస్తున్నారని మరీ ముఖ్యంగా వైసిపి నేత వైయస్‌ జగన్‌ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత జరిగిన పరిణామంలో ఈ డిక్లరేషన్‌ను తెరపైకి తెచ్చారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.     ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దర్శనంతోరాని డిక్లరేషన్‌ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని వారు అడుగుతున్నారు. వాస్తవానికి ఈ నిర్ణయం 1997 లోనే ఉన్నా ఇప్పుడు అమలు చేయవలసిన అగత్య మేమిటని లౌకిక వాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కుల, మత బేధాలు లేకుండా సహజీవనం చేస్తున్నప్పుడు ఇలాంటి సున్నితమైన అంశాలను లేవనెత్తకూడదని అంటున్నారు. ప్రజలకు సమస్యలున్నంత వరకు దేవుళ్లు ఉంటారు. వారి సమస్య పరిష్కారం కోసం ఏ దేవుడిదగ్గరకైనా వారు వెళ్లవచ్చు. అమితాబచ్చన్‌ లాంటివారే తిరుపతిని దర్శించారు. కడపలోని దర్గాను దర్శిచారు. చాలా మంది హిందువులు దర్గాలకు కూడా వెళుతుంటారు. ఇలాంటి వారి మద్య మతాలకు సంబందించి చిచ్చుపెట్టకూడదని ప్రజలు కోరుతున్నారు. అలాగే రాజకీయనాయకులు ఓటర్లను ఆకర్షించడానికి గానూ అన్ని మతాలకు చెందిన మందిరాలను సందర్శిస్తారు. ప్రజలు కూడా ఎప్పుడూ వారిని తప్పు పట్టలేదు. అన్ని మతాలకు సంబందించిన వారు ఓట్లు వేయడం ద్వారానే వారు వారి నియోజక వర్గాల్లో గెలుపు సాధిస్తారని మరచిపోకూడదు. దేవుడిని ప్రజలకు దగ్గరగా వుంచడమే తిరుమల దేవస్దానం లక్ష్యంగా వుండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

జగన్‌ పంచన చేరుతున్న వై.ఎస్‌. శతృవులు!

రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం గాని శాశ్వత మిత్రత్వం గాని ఉండదనేది పి.జానార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి వైసిపి కాంగ్రెస్‌లో చేరటంతో రుజువయ్యింది. బ్రతికన్నప్పుడు వైయస్సార్‌, పిజెఆర్‌ ఉప్పు నిప్పు గా ఉండేవారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ నిర్ణయాలను పిజెఆర్‌ శాసనసభ సాక్షిగా వ్యతిరేకించి సభాసంఘాల కోసం పట్టుపట్టిన సంఘటనలు ఉన్నాయి. ఏలేరు కుంభకోణాన్ని వెలికి తీసి అసెంబ్లీలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడవేసిన సందర్బంలో పిజెఆర్‌కు ఎలాంటి సహాయ సహకారాలు వైయస్‌ అందించలేదు.   పిజెఆర్‌ కుమార్తె గృహప్రవేశం నాడు పిజెఆర్‌ కారు నిలచి ఉండటంతో దానివెనుక వెనుక వచ్చిన కారులో వైయస్‌ సోదరుడు వైయస్‌ రవీంద్రనాధ్‌రెడ్డి, అతనికుమారుడు కారు హారను మ్రోగించినప్పటికి కారు ప్రక్కకు తీయలేదని పిజెఆర్‌ అతని కుమారుడు ప్రస్తుత ఎమ్మేల్యే విష్ణువర్ధన్‌ రెడ్డిడి గొడవ జరిగింది. తమపై దాడి జరిగిందని వైయస్‌ సోదరుడు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ లో పిజెఆర్‌ అతని కుమారుడిపై ఫిర్యాదు చేశారు. ఫలితంగా జనార్దన్‌రెడ్డి, కుమారుడు విష్టువర్దన్‌ రెడ్డి, అతని అల్లుడు మహిపాల్‌రెడ్డిని అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పిజెఆర్‌ తన అనుచరులతో జూబ్లీ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వైయస్‌ సోదరుడు ఆయన కుమారుడిపై పిజెఆర్‌ భార్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైయస్‌ సోదరుడిని అరెస్టు చేయాలని ఆందోళన చేశారు. తనకు జరిగిన అన్యాయం పై ఏకంగా నిరాహార దీక్ష చేపడతానని కూడా ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలపై కలత చెందిన కాంగ్రెస్‌ అధిష్టానం తన దూతలను పంపి ఆయన్ను సముదాయించింది. ఈ విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి హన్మంతరావు మద్యవర్తిత్యం ఫలించింది.దాంతో ఆయన తన నిరాహార దీక్షను విరమించుకున్నారు. కొన్నాళ్లకు జనార్దన్‌రెడ్డి గుండెపోటుతో హఠాత్మరణం చెందారు. అయితే విజయారెడ్డి దానం నాగేందర్‌కు చెక్‌ చెప్పటానికే వైసిపిలో చేరారు.   దానం తన సోదరిని ఖైరతాబాద్‌ స్ధానానికి పోటీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి విజయా రెడ్డి వైసిపి గూటికి చేరుకున్నారు. ఒకప్పుడు వైయస్‌కు సన్నిహితంగా ఉండి ఆతరువాత వైరం పెరిగి తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపి అయిన మైసూరరెడ్డి సైతం ప్రస్తుతం వైయస్సార్‌ పార్టీలో కీలక స్ధానంలో ఉండటం విశేషం. ఇలా ఒకప్పటి వైయస్‌ శత్రువులంతా తిరిగి ఆయన కుమారుడి పార్టీలోకే చేరుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

వలసబాటలో ఇంటర్‌ విద్యార్దులు

గత సంవత్సరం ఎమ్‌సెట్‌ కౌన్సిలింగ్‌ను జూలై 13 నుండే మొదలు పెట్టారు. జూలై 1న ర్యాంకుల విడుదల, రెండవవారం నుండే కౌన్సిలింగ్‌ ప్రారంభించడం జరిగింది. సర్టిఫికెట్లు పరిశీలనాంతరం జూలై 22, 23 తేదీల్లో లక్షలోపు ర్యాంకులు గల విద్యార్దులకు ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించారు.కానీ ఈ విద్యా సంవత్సరం ఆగస్టు రెండోవారం గడచిపోయినా ఇంతవరకు కౌన్సిలింగ్‌ తేదీలను కూడా ప్రకటించలేదు. కౌన్సిలింగ్‌ తేదీలు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. రెండు మూడు నెలలముందు జరగాల్సిన ఫీజుల పెంపు ప్రక్రియను ప్రభుత్వం తాపీగా ఇప్పుడు ఆరంభించింది. దీంతో విద్యార్దుల భవిష్యత్తు ప్రశ్నార్దకంగా మారింది. ఇప్పటికే నెల ఆలస్యమైన కౌన్సిలింగ్‌ ఎప్పటికి ప్రారంభం అవుతుందో కూడ తెలియని అయోమయంలో విద్యార్దులు ఉన్నారు.     ఇంతవరకు ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదీలను ప్రకటించక పోవడానికి కారణం యాజమాన్యాల ప్రయోజనాలను కాపాడటానికే అని విద్యార్దుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా విద్యార్దులే బలిపశువులుగా మారుతున్నారు.విద్యార్ది జీవితం మొత్తంలో ఇంటర్మీడియట్‌ తర్వాత ప్రొఫెషనల్‌ కోర్సుల ప్రవేశం కీలకం కాబట్టి విద్యార్దులు ప్రతిరోజు ఉద్వేగంగా ఎదురు చూస్తుంటారు.ఈ ఉత్కంటతో కౌన్సిలింగ్‌కు జరుగుతున్న కాలయాపనల వల్ల ఇప్పటికే వేలాది మంది విద్యార్దులు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లారు. మరి కొంత మంది మన రాష్ట్రంలోనే ఉన్న డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలలో చేరారు. ఇలా చేరిన విద్యార్దుల శాతం 30 కి వుంటుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఆర్ధికంగా స్తోమత లేనివారు మాత్రం కౌన్సిలింగ్‌ ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారు.