ఇక పాతకాలమే బెటర్‌!

సామాన్యుడిపై మరోసారి ఇంధనభారం మోపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వచ్చే నెలలో పెట్రోలు, డీజిల్‌ ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయసంస్థలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లీటర్‌పెట్రోల్‌కు 3 రూపాయలు, డీజిల్‌పై 4నుండి 5 రూపాయలకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు వంటగ్యాస్‌ ధరలను కూడా 50 నుండి 100 రూపాయల లోపు పెంచే అవకాశం ఉంది. అలాగే సబ్సిడీపై ఇచ్చే సిలిండర్ల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసే అవకాశం ఉంది. అయితే ఏం ఆలోచనలో ఉందో పాపం.. కిరోసిన్‌ను మాత్రం ఈ ధరల పెంపునుండి మినహాయించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వరస చూస్తుంటే సామాన్యుడు వినియోగించే గ్యాస్‌అంటేనే వారికి ఎంతో ప్రేమ అనిపిస్తోంది. నష్టాలనో, ఆదాయం లేదనో ఇలా.. పలు కారణాలు చెప్పి వడ్డించేస్తున్నారు. ప్రభుత్వంలో ఎందరో ఆర్ధిక మేధావులున్నారు. సామాన్యులు వాడే గ్యాస్‌ తదితరాలను పెంచకుండా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలో వారిని అడిగితే చెబుతారు.   యేరులై పారుతున్న నల్లధనాన్ని పట్టి ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలపై భారంపడకుండా దాన్ని ఉపయోగించవచ్చు. ఇలా ఏడాదికి నాలుగైదు సార్లు పెట్రోలు, గ్యాస్‌, కరెంట్‌ ధరలు పెంచుతూ పోతే ఇక సామాన్యుడు .. తిరిగి పాతకాలంలోనే వెళ్ళవస్తుంది. అదేనండీ.. ఎడ్లబండ్లు, గుర్రపుబండ్లు, కట్టెలపొయ్యిలు, తదితరాలు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాన్యుడు అదే బెటర్‌ అనుకుంటాడు. అప్పుడు ప్రభుత్వానికి ఏ ఖర్చు ఉండదు. అంతా ఆదాయమే. మంత్రివర్గంలో ఎంతమందినైనా చేర్చుకోవచ్చు. ఎన్ని సౌకర్యాలైనా కల్పించవచ్చు. ఎన్ని కుంభకోణాలైనా చెయ్యవచ్చు... సామాన్యుడు ఏమైపోతే వారికేం...! వారు చల్లగా ఉంటే చాలు...

భయం... భయం..

పిల్లలకు పరీక్షలంటే భయం... ఆటగాళ్ళకు ఛాంపియన్స్‌తో ఆడే సమయంలో గెలుస్తామోలేదో నన్న భయం... ఉద్యోగికి అధికారి భయం... అవినీతిపరులకు అరెస్టుల భయం...కాని అన్ని భయాలకు మించినది.. అందరికి వచ్చే భయం... అనారోగ్య భయం.. ప్రస్తుతం మన్యప్రాంతంలో ఉన్నదదే. ప్రజలకు ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియక పల్లెలు, పట్టణ ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంపై రోగాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా మన్యం ప్రజలకు విషజ్వరాలతో సరైన చికిత్సకు సైతం నోచుకోలేక అల్పాయుష్కులవుతు న్నారు. వరంగల్‌ జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో ప్రజలు వీటిబారిన పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ..ఇలా విషజ్వరాలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో డాక్లర్ల పోస్టులు ఖాళీగా ఉంటే డాక్టర్లున్న మరెన్నో చోట్ల కనీస సౌకర్యాలుకూడా లేవు. రాష్ట్రంలోని 10 బోధనాసుపత్రులుకు, 17 జిల్లా ఆసుపత్రులకు, 1580 పిహెచ్‌పిలకు, ఏరియా ఆసుపత్రులకు ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుండే మందులు సరఫరా అవుతుంటాయి. వాస్తవానికి 644 రకాల మందులను సరఫరాచేయాల్సి ఉండగా, కేవలం ప్రస్తుతం 224 మందులనే సరఫరా చేస్తున్నారు.   మిగిలిన మందులను కొనుక్కోమంటూ డిఎంహెచ్‌ఓలకు నిధులు కేటాయిస్తున్నారు. అయితే డిఎంహెచ్‌ఒ నిధులు ఖర్చుచేయకుండా చాలా జాగ్రత్త చేస్తోంది. ఇప్పటివరకు దాదాపుగా రూ. 44కోట్లు డిఎంహెచ్‌ఓల దగ్గర మూలుగుతున్నాయంటే అది ఎంత భద్రంగా కాపాడుతోందో ఆలోచించవచ్చు.! మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకినప్పుడు వాటినుండి రోగులను కాపాడేందుకు సెలైన్‌ బాటిళ్లు ఎంతో అవసరం. వాటికి సైతం తీవ్ర కొరత ఏర్పడిరది. అలాగే వైద్య సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టుల పోస్టులు లేకపోయినా.. కనీసం వైద్యం అందించే నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయడంలో ఎప్పటిలాగే నాన్చుడుధోరణి అవలంభిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యమన్నది ఎండమావే. కాస్తోకూస్తో గ్రామీణ ప్రజలకు సేవచేయాలని తలంపు వుండి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యసిబ్బందికి తగిన ప్రోత్సహకాలు లేవు. ఎంతోమంది అధికారులు మొదలు మంత్రుల వరకు కూడా వారి మాటలు ప్రజారోగ్యమే మా ధ్యేయం అన్నట్లుగా ఉంటాయి కాని అమలువిషయం వచ్చేసరికి అడుగు కూడా ముందుకు పడనివ్వరు. అయినా.. మనపిచ్చిగాని.. రాజధానిలోను, ప్రముఖ పట్టణాల్లోని ఆసుపత్రుల్లోనే ఎంతోమంది పిల్లలు మరణిస్తుంటే ఎక్కడో మన్యంలో మరణఘోష వారికి ఏం వినపడుతుంది.? వ్యాధులు ప్రారంభదశలో ఉన్నప్పుడే అప్రమత్తమైతే మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు వాటి బారిన పడకుండా ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత పరామర్శలు గుర్తుకు వచ్చి ఏం ప్రయోజనం? రోగాలబారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఏడాది లక్షలు ఖర్చుపెట్టాం! లక్ష్యం సాధించాం! అంటుంటారు. వాస్తవంలో అందుకు భిన్నంగా ఉంటోంది పరిస్థితి. ఇప్పటికైనా మేలుకుంటే ప్రజలకు ఎంతోమేలు..! ప్రభుత్వ చర్యల గురించి ప్రస్తావిస్తే మాత్రం చేస్తుందా.. ఎక్కడో కొద్దిగా ఆశైతే ఉన్నా.. సామాన్యుడికి ‘నేతిబీరలో నెయ్యిలాంటిదే’నన్న సామెత గుర్తుకువస్తోంది!

ఏం పలుకులవిలే... అయ్యారే!

‘ఆహారపదార్ధాల ధరల పెరుగుదల యూపిఎకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. పప్పు, ధాన్యం, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలతో రైతులకు లబ్ది చేకూరుతోంది. దీని పట్ల యూపిఎ ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది’ అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణి ప్రసాద్‌ వర్మ ధరల పెరుగుదలపై పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ జవాబిచ్చారు. అయ్యారే! ఏం సెలవిచ్చారు. ఇంకా ఏమైనా అడిగితే మా పాలన స్వర్ణయుగమని, మాది కృష్ణదేవరాయల పాలనని ఇలా... వారిని కూడా తీసుకువచ్చేస్తారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ... దానివల్ల రైతులకు లబ్ది చేకూరునుందని పొంతన లేని జవాబులిచ్చారు. ఇంకా..ధరల పెరుగుదలపై మీడియా అతి చేస్తోంది. ధరల పెరుగుదలతో రైతులకే లాభం చేకూరుతోంది. రైతులకు మేలుచేయడమే మా ప్రభుత్వ లక్ష్యం..’ అని అన్నారు.     ఈ మంత్రిగారి వరస చూస్తుంటే ధరలు పెరిగితే రైతులకు మేలు జరుగుతుందని చెప్పినట్లుగా ఈ శాఖకు సంబంధించిన సరుకుల, ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆయా పారిశ్రామిక వేత్తలకు లాభం, దానివల్ల సంబంధిత పారిశ్రామికవేత్తలకు లాభాలు వస్తాయని, వారు మరిన్ని కంపెనీలు పెడతారని.. కూడా అంటారు. రైతులకు లాభాలు రావాలంటే వారు పంటలు పండిరచేందుకు కావలసిన ఎరువులు, విత్తనాలు, విద్యుత్‌, పంటరుణాలను వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, నిజాయితీగా వారికి అందజేయడం, ప్రకృతి విపత్తుల వల్ల పంటనష్టం వస్తే.... వారికి చేయూతనిస్తే చాలు. అయినా... మంత్రిగారి మాటలు కాని.. రైతులకు లాభాలు ఎలా అందుతాయి..? మధ్య డేగల్లాగా దళారులుంటే...?! కనుక లాభాలు వచ్చినా అవి రైతులకు వరకు చేరడమన్నది ఓ వింతే. రైతులు కూడా సామాన్యుల లాగానే మార్కెట్లో కొనుక్కొవలసిందే. అటువంటప్పుడు రైతులు ఎలా సంతోషంగా ఉంటారు.? సదరు మంత్రిగారు గ్రామంలోని ఓ సామాన్య రైతుకుటుంబం ప్రక్కనే కేవలం ఓ పదివేల జీతంతో (ఈ డబ్బు ఎక్కువే అనుకోండి) కుటుంబంతో సహా నివాసముంటూ ఇంటిల్లిపాదిని ఓ మూడునెలలు పోషించినట్లయితే తెలుస్తుంది ధరలు ఎంత మండుతున్నాయో.. సామాన్యుడి కడుపు ఎంత మండిపోతోందో..! రైతన్న ఓ సామాన్యుడు.. నేతల మాటలకు, అధికారుల హామీలకు మోసపోవడం మాత్రమే పాపం అతనికి తెలుసు.

ఏపిబీసిఎల్‌ షాపులకు ఆదిలోనే హంసపాదు?

రంగారెడ్డి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ బేవరేజస్‌ కార్పొరేషను లిమిటెడ్‌ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలం కొరత ఆటంకంగా ఏర్పడిరది. మొత్తం 21దుకాణాలకు 14స్థలాల కోసం ధరఖాస్తులు వచ్చాయి. ఆరుగురు విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వాటికి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా రిక్రూట్‌మెంట్లు చేయాలని కార్పొరేషను నిశ్చయించుకుంది. ఈ మేరకు ఔట్‌సోర్సింగు ఏజెన్సీలకు పిలుపులు కూడా ఇచ్చింది. ఈ ఏజెన్సీలకు ఉద్యోగుల అవసరాన్ని తెలియజేసి దానికి తగ్గట్టుగా కోడ్‌ చేయాలని కార్పొరేషను ఆదేశాలు కూడా ఇచ్చింది.   వాస్తవానికి జిల్లా మొత్తం 390 మద్యం దుకాణాలు మంజూరయ్యాయి. వీటిలో నగరశివారుల్లో 96షాపులకు ధరఖాస్తులు అందలేదు. ఇక్కడ దుకాణం ఏర్పాటు చేయాలంటే ఒక్కొక్కదాని విలువ రూ.1.04కోట్లు. అంతవెచ్చించి దుకాణం ఏర్పాటు చేశాక లాభం వస్తుందా? లేదా? అన్న అంశంపై చాలా మంది వెనక్కితగ్గారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్పొరేషను స్వయంగా దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ 96 దుకాణాల స్థానంలో 21ఏపీబిసీఎల్‌ షాపులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ 96 దుకాణాల సెంటర్లకు మధ్యస్థంగా ఉండేలా ఈ 26దుకాణాలను ఎంపిక చేశారు. స్వయంగా కార్పొరేషను నడిపే ఈ దుకాణాలు గురించి ఎన్ని ప్రకటనలు చేసినా విశ్రాంతి ఉద్యోగులు కూడా అంతగా స్పందించలేదు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ఔట్‌సోర్సింగ్‌ సహాయంతో దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. అలానే రెండో ఫేజ్‌ కింద మరో మూడు దుకాణాలకు శాఖ కమిషనర్‌ సమీర్‌శర్మ ఆదేశాలు ఇచ్చారు.

నల్గొండ జిల్లాలో వైద్యం అందని ద్రాక్షేనా?

నల్గొండ జిల్లాలో వైద్యం అందని ద్రాక్ష మాదిరిగా ఉందని విమర్శలు వ్యాపిస్తున్నాయి. ఇక్కడ ఇటీవల శిశుమరణాల సంఖ్య గతంలో కన్నా ఎక్కువయ్యాయని వైద్యరంగ పరిశీలకులు వెల్లడిరచారు. ఈ జిల్లాలో 12ఏరియా ఆసుపత్రులున్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, రామన్నపేట, చౌటుప్పల్‌, కోదాడ, హుజూర్‌నగర్‌, నకిరేకల్‌ , నాగార్జునసాగర్‌ల్లో ఏరియా ఆసుపత్రులున్నాయి. కోదాడ, ఆలేరు, రామన్నపేటల్లో అసలు చిన్నపిల్లల వైద్యులే లేరు. 37 పీహెచ్‌సీల్లో 24గంటలు వైద్యం చేస్తున్నా సౌకర్యాలు అంతంత మాత్రమే.     ఏరియా ఆసుపత్రుల్లోనూ పుట్టిన శిశువులకు ఉపయోగించే వెంటిలేటర్లు లేవు. భూవనగిరి, రామన్నపేట, హుజూర్‌నగర్‌, దేవరకొండ, నాగార్జున సాగర్‌, మిర్యాలగూడ సూర్యాపేటల్లో నాలుగుపడకలతో న్యూబార్న్‌ స్టెబిలైజేషన్‌ యూనిట్లు మంజూరు చేశారు. వీటికి భవనాలు, గదులు నిర్మాణం చేసినా వైద్యపరికరాలు సరఫరా చేయలేదు. సూర్యాపేటలో ఇంక్యుబేటర్లు మూడుంటే రెండు పని చేయటం లేదు. మిర్యాలగూడలో నియోనెటల్‌ ఇంటెన్సికేర్‌ యూనిట్‌ అసలు ప్రారంభించనేలేదు. నాలుగు ఇన్‌క్యూబిలేటర్లు ఉన్నా ఉపయోగించటం లేదు. ప్రతీ ఏడాది50మంది చిన్నపిల్లల మరణిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య మౌళికవసతుల సంస్థ ద్వారా నిధులు విడుదల చేశారే కానీ, మందులు సక్రమంగా సరఫరా చేయటం లేదు. దీంతో రోగుల బంధువులు మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక్కడి వైద్యపరిస్థితులు మెరుగుపరచాలని రాష్ట్రవైద్య,ఆరోగ్యశాఖకు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

కోడిమాంసంపై మార్కెట్టుసెస్‌ ఎత్తివేత

ఎట్టకేలకు గుడ్డు, కోడిమాంసంపై రాష్ట్రప్రభుత్వం విధించే మార్కెట్టుసెస్‌ను ఎత్తివేసింది. ఈ సెస్‌ వల్ల ధర పెరిగి వినియోగదారునిపై అదనపు భారం పడుతోందన్న ఉత్పాదకుల సూచనను రాష్ట్రప్రభుత్వం పరిశీలించింది. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీనిపై స్పందించి మార్కెట్టుసెస్‌(సుంకం) ఎత్తివేయాలని ఆదేశించారు. అలానే మత్స్య, కోళ్ల రంగాలకు నాలా రద్దు చేసి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలుగా గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఈ రెండు రంగాలు అభివృద్థి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని సిఎం ఆదేశించారు.     దీంతో ఈ రెండు రంగాలకు బ్యాంకు రుణాలు లభించే అవకాశాలూ మెరగుపడ్డాయి. ప్రత్యేకించి ఈ రంగం విస్తరించేందుకు ఈ ఉత్తర్వులు దోహదపడతాయని ఈ రంగ పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గుడ్డు, కోడిమాంసం ధరలను నియంత్రించేందుకు మార్కెట్టుసెస్‌ ఎత్తివేత ఉపయోగపడుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వపథకాలు తమ రంగానికి అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సిఎం దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే గుడ్డు, కోడిమాంసం వినియోగం పెరిగిందని, దానికి తగ్గట్టుగా తాము ఏర్పాట్లు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం గుడ్డుపై చేసే ప్రచారం ఇంకా పెంచితే ప్రజలకు అది పౌష్టికాహారమన్న విషయంపై అవగాహన కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఎరువుల బ్లాక్ మార్కెటింగ్

కర్నూలు జిల్లా నంద్యాలలో ఎరువులను ఎంఆర్‌పి కన్నా ఎక్కువకు అమ్ముతుండటంతో రైతులు వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల బస్తాకు రూ.70 నుంచి వంద రూపాయల వరకూ అదనంగా చెల్లిస్తేనే అమ్ముతామని దుకాణదారులు చెప్పారు. ఎక్కువ మంది రైతులు ఒకేసారి దుకాణాలకు వచ్చి తమను నిలదీస్తున్నారని అర్థం చేసుకున్న బాలాజీకాంప్లెక్స్‌ వ్యాపారులు తమ దుకాణాలను మూసేశారు. దీంతో కోపం నషాళానికి అంటిన రైతులు అప్పటికప్పుడే నంద్యాల బైపాసురోడ్డుపై బైఠాయించారు. మూడుగంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ ఏడి వీరభాస్కరరెడ్డి రైతులను సముదాయించారు. దుకాణ యజమానులను వెంటనే షాపులు తెరవాలని సెల్‌ఫోనులో కోరారు. దీనికి ఒప్పుకోకుండా వ్యాపారులు దుకాణాలు మూసి ఉంచారు. వెంటనే ఏడి పది దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు చక్కదిద్ది రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఏడి ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఇదే విధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎరువులపై అదనపు ధరలు వ్యాపారులు వసూలు చేస్తున్నారని, వ్యవసాయశాఖ రాష్ట్రస్థాయి అధికారులు కూడా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని పలు రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు.

శెలవుపెడితే చెప్పుతో కొడతారా?

15 రోజుల పాటు శెలవుపెట్టారన్న కోపంతో శ్రీకాకుళం జిల్లా పోలాకి మండల పరిషత్తు సీనియర్‌ అసిస్టెంట్‌ శివప్రసాదును ఎంపీడీవో రమణ మూర్తి చెప్పుతో కొట్టారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. తన కంటి ఆపరేషను కోసం శివప్రసాద్‌ జూన్‌లో 15రోజుల పాటు శెలవుపెట్టారు. ఈ శెలవుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేయాలని ఎంపీడీవోను శివ ప్రసాదు కోరగా మొదట మౌనంగా ఉన్నారు. ఆ తరువాత కార్యాలయానికి వచ్చిన గతంలో ఇన్‌ఛార్జి ఎంపీడీఓగా పని చేసిన పొన్నాన లక్ష్మణరావుకు శివప్రసాద్‌ తన గోడు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఎంపీడీవో రమణమూర్తి ఈ మాటలను విని కోపం పట్టలేక నానా దుర్భాష లాడుతూ బయటకు వచ్చి లక్ష్మణరావు సమక్షంలోనే శివప్రసాద్‌ను చెప్పుతో కొట్టారు. అక్కడే ఉన్న ఇంజనీరింగు అధికారి జనార్దనరావు, ఇతర సిబ్బంది దీన్ని గమనించారు. ఈ విషయం బయటకు పొక్కితే తనకు చెడ్డపేరు వస్తుందని భయపడ్డ రమణమూర్తి ముందస్తుగా తానే పోలీసుస్టేషనుకు వెళ్లి శివప్రసాద్‌ తనను కులంపేరుతో ధూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసుపెట్టారు. ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. చెప్పుతో దెబ్బలు తినటమే కాకుండా శివప్రసాద్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని సహోద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు కేసు పెట్టినందుకు రమణమూర్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఉద్యోగులను మానసికంగా దెబ్బతీస్తాయని, బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి కూడా ఎంపీడీవో ఇలా ప్రవర్తించటం బాగోలేదని వారు అంటున్నారు.

విశాఖ ఉక్కుకు విద్యుత్తు దెబ్బ! ఆగిన ఉత్పత్తి?

ప్రపంచప్రఖ్యాత విశాఖ ఉక్కుకర్మాగారాన్ని విద్యుత్తుకోతలు దెబ్బతీస్తున్నాయి. ఈ కోతల కారణంగా బ్లాస్‌ఫర్నేస్‌ 1,2,3 యూనిట్లు పని చేయటం లేదు. దీని వల్ల ఆ మూడు యూనిట్ల ఉత్పత్తి ఆగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్టులో భారీ డిమాండు ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం విద్యుత్తు సంక్షోభం వల్ల నష్టాల దిశగా పయనించే అవకాశాలున్నాయని యాజమాన్య ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.     ఈ మూడు యూనిట్ల ప్రభావం వల్ల ఇతర ప్రాంతాలకు ఉక్కు ఉత్పత్తి ఆగిపోతుందంటున్నారు. ప్రత్యేకించి కర్మాగారంలో పని చేసే కార్మికులకు వేతనం చెల్లించటం కూడా వృథా అనే పరిస్థితి విద్యుత్తుసంక్షోభం వల్ల ఏర్పడుతోంది. ఆ మూడు యూనిట్లు ఆగిపోవటం వల్ల తమ ఉపాథిని ప్రభుత్వమే దెబ్బ తీసిందని విశాఖ ఉక్కుకార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలుగువన్‌.కామ్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ విద్యుత్తు సంక్షోభం ముదరితే పరిశ్రమలో పని చేసే కార్మికులందరికీ ఉపాథి సమస్య తప్పదంటున్నారు. ఉత్పాదనే లేకపోతే ఎగుమతులు అసాధ్యమని యాజమాన్యం ఆందోళనతో ఉందన్నారు. ప్రత్యేకించి పెద్దపరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చేసే అంశం గురించి రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు. పరిశ్రమ సజావుగా నిర్వహించే అవకాశం ప్రభుత్వం కల్పించాలని డిమాండు చేస్తున్నారు.

పెరిగిన ఆటోఛార్జీలతో విసిగిన ప్రజలు?

ఒక్కసారిగా ఆటోఛార్జీల కనీస రుసుం రూ.16కు చేరుకుంది. 1.6కిలోమీటర్ల వరకూ ఈ 16రూపాయల ఛార్జీపై ప్రయాణం చేయవచ్చు. ఆపై ప్రతీ కిలోమీటరుకు రూ.9 లెక్కన చెల్లించాలి. ఇలా ఆటోఛార్జీ 10 కిలోమీటర్లకు రూ.92.50కు చేరుకుంది. ఇప్పుడు చెల్లిస్తున్న ఆటోఛార్జీలు చాలవని డ్రైవర్లు చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఛార్జీలను మార్చింది. దీంతో ఆటోల కన్నా బస్సు ఛార్జీలే తక్కువ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇరవైరూపాయల్లోపు ఛార్జీతో బస్సులో ప్రయాణించే దూరానికి 92.50 రూపాయలు చెల్లించటం అవసరమా అని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు.   ఆటోఛార్జీలు భారీగా పెంచటం తమ వంటి నిత్య ప్రయాణీకులకు ఇబ్బందికరంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినమమ్‌ రూ.16చెల్లించి ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న తమ కార్యాలయానికి చేరుకోవటమూ అదనపు భారంగా ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయి. దీన్ని తక్షణం అమలు చేసేస్తామని ఆటోడ్రైవర్లు అంటున్నారు. ఈ అర్ధరాత్రి తరువాతే ఈ ఛార్జీలను అమలు చేయాలని రవాణా శాఖాధికారులు కోరుతున్నారు. ఆటోడ్రైవర్లు ప్రభుత్వం తమ మొరవిని ఛార్జీలు పెంచినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రయాణీకులు మాత్రం తమకు ఆటోసౌకర్యం లేకుండా చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే మధ్యలో ఎక్కడైనా ఆటో ఆపితే వెయిటింగ్‌ఛార్జి నిమషానికి 25పైసల చొప్పున చెల్లించాలి. గరిష్టంగా వందకిలోల లగేజీని అనుమతించారు. దాన్ని దాటితే ప్రతీ వస్తువుకు 25పైసలు చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. ఈ పెంపుదలకు అనుగుణంగా మీటర్లలో మార్పులు చేయాలని సిఎం రవాణాశాఖా ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.

నిద్రపోతే చనిపోతారనే వదంతులతో జాగారం!

రాత్రిపూట హాయిగా పడుకుంటే(నిద్రపోతే) చనిపోతారనే వదంతులు వ్యాపించటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జాగరం చేశారు. హైదరాబాద్‌, కర్నూలు, అనంతపురం, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఈ వదంతులు వ్యాపించాయి. ఈ వదంతులను నమ్మిన కొందరు తమ సన్నిహితులకు, స్నేహితులకు ఎస్‌ఎంఎస్‌ చేశారు. దీంతో అప్పటి దాకా కునుకు తీస్తున్న వారు కూడా లేచి కూర్చున్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులను నిద్రలేపి కాలక్షేపం చేశారు. ప్రత్యేకించి అర్ధరాత్రి నుంచి ఈ జిల్లాల్లోని ఇళ్లలో దీపాలు వెలగటం, రాత్రంతా టీవీలతో కాలక్షేపం చేయటం గమనార్హం. కుటుంబసభ్యు లందరూ దాదాపు శివరాత్రి పర్వదినంలా జాగరం చేశారు. పక్కఇళ్లలో వారిని కూడా లేపి కొందరు కబుర్లతో కాలక్షేపం చేశారు. మరికొందరు మేడలపైన మూడుముక్కలాటతో గడిపేశారు. కొన్ని ప్రాంతాల్లో క్యారంబోర్డు టోర్నీలు నడిచాయి. అర్ధరాత్రి వ్యాపించిన వదంతులను ఎంత వేగంగా నమ్మారంటే దాదాపు పగలు కన్నా రాత్రి ఎక్కువ మంది షికార్లు చేస్తూ కనిపించారు. చిన్నారులను కూడా నిద్రపోనీయకుండా ఆడించారంటే ఈ వదంతులను ఎంతలా నమ్మారో ఇట్టే అర్థమైపోతోంది. ఇదంతా వట్టి ట్రాష్‌ అని, రాత్రంతా ఎవరో కావాలని వదంతులు సృష్టించారని గురువారం ఉదయం ఈ జిల్లాల్లో వారు గుర్తించారు.

ప్రత్యేక కోర్టుకి ఎమార్ ఎండీ వినతి

 సీబీఐ చార్జ్ షీట్ లో 15వ నిందితుడిగా ఉన్న ఎమార్ ఎంజీఎఫ్ ల్యాండ్ ఎండీ శ్రవణ్ గుప్తా తనను విచారణ జరిపేటప్పుడు వీడియో తీయించాలని ప్రత్యేక కోర్టుకి విన్నవించుకున్నారు. విచారణ పారదర్శకంగా జరగాలన్న ఆశతోనే తను ఇలా కోరుతున్నానని శ్రవణ్ కోర్టుకి తెలిపారు. ఆగస్ట్ 24 నుంచి నిందితుడిని సీబీఐ ప్రశ్నించే అవకాశముంది. సీబీఐ మాత్రం ఈ వాదనను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. స్థలాల్ని అమ్ముకుని సొమ్ముచేసుకోవడంలో ఆరితేరిన చాకచక్యం చూపించిన నిందితుడి వాదనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సీబీఐ డెప్యూటీ లీగల్ అడ్వయిజర్ రవీంద్రనాథ్ వాదించారు. విచారణ జరిగేటప్పుడు తన న్యాయవాది పక్కనే ఉండాలంటూ శ్రవణ్ అర్జీపెట్టుకోవడంకూడా హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. మహామేధావి అయిన శ్రవణ్ కు విచారణ సమయంలో లాయర్ అవసరం లేదన్నారు. ఇప్పటికే సీబీఐ శ్రవణ్ ని విచారించేందుకు ఓ ప్రశ్నావళిని సిద్ధం చేసిందని, ఆయన ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే సరిపోతుంది కనుక వీడియో తీయించడం లేదా విచారణ జరిగేటప్పుడు వ్యక్తిగత న్యాయవాదిని అనుమతించడంలాంటి సౌకర్యాలు అవసరం లేదని సీబీఐ లీగల్ అడ్వయిజర్ ప్రత్యేక న్యాయస్థానానికి విన్నవించారు. 

పోచమ్మతల్లికి కోపమొచ్చిందట!

పోచమ్మతల్లి విగ్రహం మసకబారింది. అందుకే భూకంపం భయం వెంటాడుతోంది. అమ్మతల్లి విగ్రహానికి నోటిదగ్గర రంధ్రం పడింది. అందుకే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. ఇది.. ఆదిలాబాద్ జిల్లా ఇందిరాయి వాసుల నమ్మకం. ఆ భయంతోనే ఆలయంలో ఈ మధ్యే హోమం కూడా జరిపించారు. ఈ ప్రత్యేక పూజలకు జైనూర్, సిర్పూర్ గిరిజనులు తండోపతండాలుగా తరలివచ్చారు. పూజలతోపాటుగా మూడు గ్రామాల శుద్ధి కార్యక్రమంకూడా.. మూడురోజులపాటు మూకుమ్మడిగా ఉపవాసాలు చేస్తూ మూడూళ్లలో ఉన్న ఆలయాల్ని పరిశుభ్రం చేస్తారు. వీటికోసం తలకింత వేసుకుని కావాల్సిన డబ్బుని పోగుచేసుకున్నారు. ప్రత్యేకంగా పూజలకోసం ఒక్కో గిరిజనుడూ రూ. 25 సమర్పించుకున్నారు. కార్యక్రమం అంతా పూర్తయ్యాక ఆగస్ట్ 27న ఉపవాస విరమణ. తరతరాలుగా వస్తున్న నమ్మకాలే తమ తలరాతల్ని మారుస్తున్నాయని ఇప్పటికీ గిరిజనులు బలంగా నమ్ముతున్నారు.  

చెరువుగట్టున రెండువేల సిమ్ కార్డులు?

సామాన్యుడికి సిమ్ కార్డు ఇవ్వాలంటే సవాలక్ష ప్రొసీజర్లు. అవిలేవు ఇవి లేవంటూ వందసార్లు సర్వీస్ ప్రొవైడర్లు తిప్పుకుంటారు. అన్నీ సవ్యంగానే ఉన్నా అసలు నువ్వోకాదో ఫోటోలో సరిగ్గా కనిపించడంలేదంటూ తెగ యాతన పెట్టేస్తారు. కానీ తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ధర్మగుండం చెరువదగ్గరమాత్రం రెండు వేల సిమ్ కార్డులు గుట్టగా పడున్నాయ్. అవసలు అక్కడికెందుకొచ్చాయో, ఎవరు అక్కడ పడేశారో కూడా అంతుచిక్కని పరిస్థితి. అసలా సిమ్ కార్డులన్నీ సరైనవేనా లేకా అసాంఘిక శక్తులు ఉపయోగించుకుని, వదిలించుకోవడానికి అక్కడ పారేసిపోయారా అన్న ప్రశ్నలకూ సమాధానం లేదు. వేలకొద్దీ సిమ్ కార్డులు గుట్టగా పడున్న చోద్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలనుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారు. పత్రాలన్నీ సవ్యంగానే ఉన్నా వందసార్లు తిప్పుకునే సర్వీస్ ప్రొవైడర్లు ఈ సిమ్కార్డుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో చూసి ముక్కన వేలేసుకుంటున్నారు. అసలన్ని సిమ్ కార్డులు చెరువగట్టుకు ఎలాచేరాయన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.  

ఇంజనీరింగు కళాశాలకు 350కోట్లు చెల్లించండి: హైకోర్టు ఆదేశం

ఇంజనీరింగు కళాశాలలకు బోధనా ఫీజు కింద రూ.350కోట్లు బకాయి పడిరదని, దీన్ని రెండు వారాల్లోపు చెల్లించాలని రాష్ట్రహైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమకు నిర్వహణే పెద్దభారమైందని, ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను బకాయిపెట్టుకుంటూ పోతోందని ఇంజనీరింగుకళాశాలలు హైకోర్టులో పిటీషను వేశాయి. ప్రత్యేకించి ప్రభుత్వం ఒక విధానం పాటించటం లేదని కళాశాలలు స్పష్టం చేశాయి. తమను ఆదుకోకపోతే కళాశాలల పేరిట అప్పులు కూడా పెరిగిపోతాయని వాపోయాయి. సిబ్బంది జీతాలు బకాయిపడేంత దారుణమైన స్థితికి ఈ ఫీజు రియంబర్స్‌మెంట్‌ వల్ల తప్పలేదని స్పష్టం చేశాయి. అలానే భవిష్యత్తులో ఈ భారం మరింత పెరుగుతుందని విశదీకరించాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగు కళాశాలలు పూర్తిగా తమ సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాయి. దీనికి స్పందించిన హైకోర్టు మొత్తం కేసు పూర్వాపరాలు విచారించి బకాయిపడిన ఇంజనీరింగు కళాశాలల ఫీజును వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో మొత్తం రూ.350కోట్లను చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి అభ్యర్థుల కేటాయింపు సమయంలోనే చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదన పంపాలని న్యాయస్థానం పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి బకాయిలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ధర్మాన విషయంలో సిఎం మౌనంపై మంత్రుల ఆగ్రహం!

రాష్ట్రరెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా విషయంలో ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో కిరణ్‌సర్కారులోని మంత్రులందరూ కళంకితులుగా ప్రతిపక్షాల ద్వారా గుర్తింపును పొందుతున్నారు. ఈ విషయం తెలిసినా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం మౌనాన్ని వీడలేదు. ఈ మౌనం చూసి ప్రతిపక్షాలు గట్టిగానే గొంతువిప్పుతున్నాయి. తాజాగా సిఎంతో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్‌, ఏరాసు ప్రతాపరెడ్డి, దానం నాగేందర్‌, గల్లా అరుణకుమారి, ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, డికె అరుణ సమావేశమయ్యారు. వీరంతా తాము కళంకిత మంత్రులమంటూ నిందలు మోస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం మౌనం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని గుర్తు చేశారు. దీన్ని నివారించాలని కోరారు. ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ట కూడా దిగజారుతోందన్నారు. క్యాబినేట్‌ సమిష్టినిర్ణయాలకు కొందరినే బాధ్యులను చేయటం తగదని హితవుపలికారు. 22మంది మంత్రులు ఈసమావేశానికి హాజరయ్యారు. అయితే ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి నగరంలో ఉన్నా సమావేశానికి గైర్హాజరు అయ్యారు. తాను త్వరలో ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుగొంటానని ఈ సందర్భంగా సిఎం కిరణ్‌కమార్‌రెడ్డి ప్రకటించారు.

సాంప్రదాయంగా గొర్రెపొట్టేళ్ల పందేలు?

భారతీయసాంప్రదాయం ఎంతో ప్రాచీనమైంది. ఆ ప్రాచీన సాంప్రదాయంలోనే ధనవంతులు కోరినట్లు పోటీలు, పందేలు జరిగేవి. భారీగా డబ్బును ఈ పందేల్లో పెట్టడం కూడా ఆనవాయితీ అయింది. అటువంటి కోవలోనే గొర్రెపొట్టేళ్ల పందేళ్లు జరుగుతుండేవి. ఇంకా ప్రాచీన సాంప్రదాయాన్ని పాటించే ప్రాంతాల్లో ఈ పందేళ్లు జరుగుతుంటాయి. ధనవంతులు తమ ఇళ్లల్లో పెంచిన గొర్రెపొట్టేళ్లతో ఇతర గ్రామాల పెద్దలను పందేనికి పిలిచే ఆనవాయితీ ఇంకా వెనుకబడిన జిల్లాల్లో కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి వంటి జిల్లాల్లో ఎడ్లపందేలు, గుర్రపుపందేలు, కోళ్లపందేలు, గొర్రెపొట్టేళ్ల పందేలు తరుచుగా వార్తలకెక్కుతుంటాయి. ఈ నాలుగైదు జిల్లాల్లో డబ్బున్న వారి ఈ పందేలు చూసేందుకు గ్రామీణులు ప్రేక్షకులు అవుతుంటారు. అలానే కొందరు కాపరులు ఈ పందేల కోసం గొర్రెపొట్టేళ్లకు శిక్షణలు కూడా ఇస్తుంటారు. తాజాగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఎన్‌.నర్సాపురంలో  గొర్రెపొట్టేళ్ల పోటీ పందెం జరిగింది. దీనిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 30మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 50వేల రూపాయలు, 20సెల్‌ఫోన్లు, ఆరుఆటోలు స్వాధీనపరుచుకున్నారు. ఈ దాడికి వచ్చిన పోలీసులను గుర్తించి కొందరు పందెం స్థలం నుంచి పారిపోయారని తెలుస్తోంది.

నెమళ్ళ వేటని ఆపలేమా?

భారతజాతీయపక్షి నెమలి వేటను ఆపటం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దసవాల్‌గా మారింది. నెమలిని భుజిస్తే స్థూలకాయులు బరువు తగ్గుతారని ప్రపంచ అథ్యయన సంస్థలు ప్రకటన చేసినప్పటి నుంచి వీటిని రక్షించటం ప్రభుత్వాలకు పెద్దసవాల్‌గా మారింది. కనీసం రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలన్న అంశంపై అథ్యయనం చేస్తూ అటవీశాఖ కాలం గడుపుతోంది. దీంతో నెమలికి వేలాది రూపాయలు వెలకట్టి మరీ కొందరు వేటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు.     వేటగాళ్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడ నెమళ్లు దొరుకుతాయో అక్కడికి వెళ్లి వాటిని చంపి పార్శిల్‌ చేసేస్తున్నారు. దీంతో అటవీశాఖ గిరిజనులకు నెమలివేట నిషిద్ధమని ప్రత్యేకించి చెప్పాల్సి వస్తోంది. అటవీఅధికారుల కన్నుగప్పి వేటగాళ్లు ఈ వేటకు ఉపక్రమిస్తున్నందున ప్రభుత్వం ఈ పక్షిని రక్షించుకునేందుకు చట్టానికి పదును పెట్టింది. కోర్టుల్లోనూ కఠినశిక్షలు విధిస్తున్నా నెమలివేట నేరాన్ని అదుపు చేయటం కష్టతరంగా మారింది.   నల్గొండజిల్లా భువనగిరి మండలం  ముత్యాలపిల్ల`పెద్దగోరి చెక్‌డ్యాం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నెమళ్లను వేటాడారు. నెమళ్లను సంహరించి ఈకల్ని అక్కడ గుట్టగా పేర్చారు. గ్రామస్తులు బహిర్భూమికి వెళ్లినపుడు ఈ విషయాన్ని గుర్తించారు. కొంతకాలంగా ఈ ప్రాంతంలో నెమళ్ల సంచారం పెరిగింది. నెమలి మాంసం కోసం కొందరు ఐదు నుంచి ఏడు నెమళ్లను వేటాడి చంపినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిందితుల గురించి పోలీసులు, అటవీశాఖాధికారులు అన్వేషణ ప్రారంభించారని సమాచారం.

మానుగుంటపై ఉన్న నమ్మకం గంటాపై లేకుండా పోయిందా?

విశాఖ జిల్లా నక్కపల్లిలో ఓడరేవు మంజూరయ్యే సమస్యేలేదు కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మంజూరై తీరుతుందని విశాఖజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మకంగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఓడరేవు మానుగుంట మహీధరరెడ్డి చిరకాల కోరిక కాబట్టి అది తీరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అస్సలు ఓడలరేవు మంజూరుపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి గంటాశ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నా తెలుగుదేశం నేతలు మాత్రం నమ్మటం లేదు.  అందుకే నక్కపల్లిలో ఓడరేవు ఏర్పాటు విషయమై అఖిలపక్షనేతలతో మంత్రిగంటాశ్రీనివాసరావు ఏర్పాటు చేసిన సమావేశాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు బహిష్కరించారు. పైగా ఈ సమావేశ వేదిక వద్ద ప్రకాశం జిల్లాకు పోర్టు మంజూరవుతుందని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ నక్కపల్లికి ఓడరేవు రాకపోతే గంటా మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. పోర్టుశాఖ ఓడరేవు గురించి ఒక నిర్ణయానికి రాలేదని మంత్రి గంటా చెబుతుంటే వారు నిరసన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా వారు వెళ్లిపోవటంతో గంటా మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు సేకరించిన తరువాతే ఓడలరేవును ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం వెలువడే లోపు ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు బహిష్కరించటంతో తప్పని సరి పరిస్థితుల్లో మంత్రి గంటాశ్రీనివాసరావు వెనుదిరిగారు.