బొగ్గు ప్రైవేటుపాలు, నుసి ప్రభుత్వపాలు

అదేమి చిత్రమో కాని యుపిఎ ప్రభుత్వం పాలనలో అంతులేని అవినీతి, కుంభకోణాలు బయటపడుతూ ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అయితే వీటిల్లో ఉన్నది చిన్నస్థాయి అధికారులు కాక, ప్రభుత్వానికి తోడ్పాటు అందించేవారో, లేదా మంత్రివర్గంలోని మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కావడం విశేషతను సంపాదించుకుంటోంది. తాజాగా రూ.1.85 లక్షల కోట్లు బొగ్గు స్కాం జరిగినట్లు కాగ్‌ నివేదిక తెలిపింది. బొగ్గు గనుల కేటాయింపుకు పోటీయుత బిడ్డింగ్‌ విధానాన్ని సకాలంలో అమలు చేయకపోవడం వల్ల... వాటిని దక్కించుకున్న ప్రైవేటు సంస్థలకు రూ.1.85 లక్షల కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఈ కేటాయింపులను పోటీయుత, పారదర్శక, నిష్పాక్షిక బిడ్డింగ్‌ ద్వారా జరిపి ఉంటేపైన పేర్కొన్న లబ్ధిలో అధిక భాగం ప్రభుత్వ ఖజానాకు చేరివుండేద’ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తెలిపింది.     అంతేకాక బొగ్గు శాఖ ప్రధాని చేతిలో ఉన్నప్పుడే ఈ కేటాయింపులు జరిగినట్లు ఆరోపణలు. దీంతో ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడని ప్రతిపక్షాలు  ప్రధాని తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తుంటే, అంతా పాదరర్శకంగానే జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బొగ్గుగనులను ఇష్టారాజ్యంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంతో ఆయా సంస్థలు లాభపడగా, ప్రభుత్వానికి అంతమేర నష్టం వచ్చింది. ఏం ఆశించి ఆయా సంస్థలకు గనులను కేటాయించారో అధికార వర్గాలు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కాంలతో  ప్రజల్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తే యుపిఎ పాలనలో ఇంకొన్ని రోజులకు మరో స్కాం బయటపడితే ఈ స్కాం కొంత కాలానికి మరుగున పడిపోతుంది. ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చిప్‌...!ప్రభుత్వ ఖజానాకు పడిన గండిని పూడ్చాలంటే మళ్ళీ ప్రజలపై పన్నుల రూపంలో బాదుడు తప్పదు. ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే బొగ్గు అమ్మగా వచ్చిన లాభాలు సంబంధిత లబ్ధిదారులు పొందితే, మిగిలిపోయిన మసి, నుసి పన్నుల రూపంలో ప్రజల ముఖాలకు రాసేందుకు పథకాలు సిద్ధం చేస్తారు. సర్‌ఛార్జీ వెసులుబాటు ఉన్నదందుకే కాబోలు...!

అవినీతిసొమ్ము కలెక్షన్లల్లో ఆర్‌టిఓ సిబ్బంది ఫస్ట్‌!

దేశంలో అత్యున్నత ఆదాయం,సంపాదన ఉన్న దేవాలయం ఏదీ? అని ఇప్పుడు ఎవరినడిగినా టక్కున అనంతపద్మనాభస్వామి గురించి గుర్తు చేస్తున్నారు. అలానే మామూళ్ల వసూళ్లలో వేగవంతమైన శాఖ ఏదీ అని ప్రశ్నిస్తే అందరూ ఇక నుంచి ఆర్‌టిఓ కార్యాలయంను చూపుతారు. ఎందుకంటే ఈ కార్యాలయంలో ఏసిబి అధికారులు రెండు గంటల పాటు తిష్టవేసి మామూళ్ల వసూళ్లును లెక్కిస్తే రూ.20,050 ఆదాయం వచ్చింది. దీంతో నొరెళ్లబెట్టడం ఏసిబి వంతైంది. చిత్తూరు జిల్లాలో ఒక్కరోజు ఏసిబి పూర్తిస్థాయి దాడులకు వ్యూహరచన చేసింది.     ఆ వ్యూహంలో భాగంగానే 20మంది ఏసిబి సిబ్బంది నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని రెండు చెక్‌పోస్టులపైన, ఆర్టీఓ కార్యాలయం పైన ఏకకాలంలో దాడులు చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఏడుగురి నుంచి లక్షా 20వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది. నెల్లూరు జిల్లా తడమండలం భీములవారిపాళెం ఉమ్మడి చెక్‌పోస్టులో ఏసిబి సోదాలు నిర్వహించగా, రూ.56,975 అక్రమసొమ్ము లభించింది. ఆర్టీఓ కార్యాలయం ముందు నిలబడిన ఇద్దరు ఏజెంట్లలో ఒకరిని పట్టుకోగా అతని వద్ద రూ.13వేలు దొరికాయి. అలానే కార్యాలయంలో రెండు గంటల పాటు వసూలు చేసిన మామూళ్లను లెక్కిస్తే అది రూ.20,050 వచ్చింది. అక్కడి వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో రూ.15,325, మిగతాచోట్ల రూ.8,600 స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ల ఫిర్యాదుల నేపథ్యంలో తాము ఈ దాడులు చేశామని ఏసిబి డిఎస్పీ భాస్కరరావు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో సిసికెమేరాలు అమరుస్తున్నామని, ఏసిబి దాడుల్లో దొరికిన సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తున్నామని రవాణాశాఖ కమిషనరు సంజయ్‌కుమార్‌ తెలిపారు. కంప్యూటర్లు ద్వారా టాక్స్‌ చెల్లించేలా వేయింగ్‌మిషన్లు కూడా అమరుస్తున్నామని వివరించారు.

యూనివర్సిటీల్లో రీసెర్చిస్కాలర్స్‌పై లైంగికవేధింపులు?

దేశంలోని పలు యూనివర్సిటీల్లో రీసెర్చిస్కాలర్స్‌పై ప్రొఫెసర్ల జరుపుతున్న లైంగికవేధింపులు ఎక్కువగా వెలుగులోకి రావడం లేదు. కానీ, కొందరు స్కాలర్స్‌ భరించలేని స్థితిలో బయట పడుతుంటారు. అప్పుడు మీడియా ద్వారా కథనాల రూపంలో ఈ వేధింపులు బయటపడతాయి. వెంటనే సంబంధిత ప్రాంతంలోని విద్యార్థిసంఘాలు ఆ ప్రొఫెసర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో యూనివర్సిటీ పెద్దలు కూడా విచారణ చేస్తుంటారు. ఒక్కోసారి పోలీసులు ఈ వేధింపుల ఆథారాలు సేకరించి ప్రొఫెసర్లపై కేసులు కూడా పెడుతుంటారు. అయితే ఈ వేధింపుల వ్యవహారం మాత్రం పలురూపాల్లో ఉంటుంది.     దీనిపై కన్నేసిన కొన్ని అంతర్జాతీయసంస్థలు ఈ వేధింపులను నీలిచిత్రాలుగా కూడా ప్రదర్శిస్తుంటారని సమాచారం. తాజాగా తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో ప్రొఫెసరు రాజేశ్వరరావు, ఆయన భార్య ప్రొఫెసర్‌ విజయకుమారి ఇటువంటి లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్నారు. ఈ దంపతుల్లో భర్త రాజశ్వేరరావు లైంగికంగా వేధిస్తుంటే భార్య విజయకుమారి ఆయనకు మద్దతు పలికేదట. అందుకే పోలీసులు రంగప్రవేశం చేసి ఈ దంపతులను అరెస్టు చేశారు. సీిఐడీ డిఐజి దామోదర్‌ కేసునమోదు చేశామని ధృవీకరించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రొఫెసర్లు రాజేశ్వరరావు అరెస్టు వార్త తెలుసుకుని తాము జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ఉన్నతచదువులు చదివిన వారే ఇలా తయారైతే ఎలా అని పలువురు విద్యావంతులు ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువుకు విద్యార్థులు తమ పిల్లలతో సమానమని, ఆ తరహాలో నైతికప్రవర్తన అలవర్చుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

వణికిస్తున్న అతిసార

నిజామాబాద్‌ జిల్లా బిక్కనూరు మండలంలో అతిసార వ్యాథివ్యాపిస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే మండలంలోని రేగట్లపల్లి గ్రామంలో మాత్రం అతిసార వ్యాధి లక్షణాలు పదిమందిలో బయటపడ్డాయి. దీన్ని వైద్యులు కూడా ధృవీకరించారు. పరిసరాల పరిశుభ్రత పాటించనందు వల్ల ఈ వ్యాథి వచ్చి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ జిల్లాలో సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేదు. అందుకని ఇక్కడి నుంచి గ్రామస్తులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వ్యాధి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు పంచాయతీ కూడా ముందుకు వచ్చింది. దీంతో వీధులన్నీ శుభ్రం చేస్తున్నారు. క్లోరినేషన్‌ కార్యక్రమం కూడా పంచాయతీని చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ముందస్తు చర్యల్లో భాగంగా రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరి సూచనలు పాటించి తగిన జాగ్రత్తచర్యలు పాటిస్తే అతిసార వ్యాధి ప్రబలే అవకాశాలు తగ్గుతాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కూడా స్పందిస్తోంది. అయితే తాజాగా అతిసార వల్ల మధుప్రియ అనే చిన్నారి మరణించింది. మరో పది మంది వ్యాథితో బాధపడుతున్నారు. వీరందరినీ వాహనాల్లో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మండలంలోని మిగిలిన గ్రామాల వారు అతిసార వ్యాథి ప్రబలకుండా తమను కాపాడాలని కోరుతున్నారు.

భూకంపం వచ్చేస్తోందంటున్న ఆకతాయిలు?

భారీస్థాయిలో భూకంపం వచ్చేస్తుందని అదిలాబాద్‌జిల్లాలోని మూడు మండలాల వారిని ఆకతాయిలు భయపెట్టారు. ఆకతాయిల వదంతులు నమ్మి రాత్రంతా రోడ్డుపైనే ఆ మండలాల్లో వారు జాగారం చేశారు. అయితే వారు చెప్పినట్లు ఎటువంటి భూకంపం రాలేదు సరి కదా! నిద్రలేని రాత్రిని గడపాల్సి వచ్చిందని మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి రెండుగంటలకు భూకంపం వస్తుందని ఆంధ్రా`మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వారిని ఆకతాయిలు భయపెట్టారు. దీంతో అర్థరాత్రి రెండుగంటలకు గ్రామస్తులు ఇళ్లు వదిలేసి బయటకు వచ్చారు. ఒకవైపు నిరక్షరాస్యత, మరోవైపు అవగాహన లేమి వల్ల నిర్మల్‌, ఉట్నూరు, సారంగపూర్‌ మండలాల్లో భూకంప వదంతులు బలంగా నమ్మారు. అందుకే భూకంపం వల్ల తమ ఇళ్లు కూలిపోయి దారుణమైన పరిస్థితులు ఎదురవ్వవచ్చని వారు ఆందోళన చెందారు. ఒకదశలో ఈ మండలాల్లో వారు వీధుల్లో పరుగులు కూడా తీశారు. ఇరుగుపొరుగు వారికీ విషయం చెప్పి వారిని కూడా బయటకు తీసుకువచ్చారు. అసలు భూకంపం వస్తే ఆ ప్రకంపనలు ముందుగా అర్థమవుతాయని, ఆ ప్రకంపనలు వచ్చినప్పుడే బయటకు రావాలని, ముందస్తుగా ఒక సమయం పెట్టుకుని భూమికంపించదని, ఆకతాయిలు ఎవరో సృష్టించిన వదంతులను నమ్మి ఇంకోసారి పొరబడవద్దని అథికారులు విశదీకరించారు. భయపడాల్సిన పనేమీ లేదని వారు స్పష్టం చేశారు. భూకంపం వచ్చేటప్పుడు రెక్టార్‌స్కేలుపై దాని తీవ్రత నమోదవుతుందని, అప్పుడు కూడా తామే అప్రమత్తమవుతామని అధికారులు స్పష్టం చేశారు.

నమ్మకాన్ని పొగొట్టుకుంటున్న టిఆర్‌ఎస్‌?

ఒకవైపు ఆందోళనలు చేస్తేనే తెలంగాణా సాధ్యమవుతుందని సూచనలొస్తున్నాయి. మరోవైపు స్వాతంత్య్రసమర యోధులందరూ ప్రత్యేక తెలంగాణా అవసరాన్ని తెలియజేసి జనసమీకరణ చేస్తామంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణాపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది రాజ్యసభలో తెలంగాణాపై పెట్టిన ప్రైవేట్‌ బిల్లు వీగిపోయింది. అనుకోకుండా సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకుని హోదాలో ప్రత్యేక తెలంగాణాకు తమ అభ్యంతరం ఉండబోదంటూ లేఖ కూడా రాస్తామంటున్నారు. ఇన్ని ఘటనలు ఒకదాని తరువాత ఒకటి జరుగుతుంటే టిఆర్‌ఎస్‌ పార్టీ అసలు తామేమి చేయాలనే దానిపై తలలు పట్టుకుంటోంది. ఒకవైపు జెఎసి, మరోవైపు తెలంగాణావాదులు టిఆర్‌ఎస్‌ నేతలను నమ్మటం లేదు. అందుకే ఎవరికి తోచినదారిలో వారు టిఆర్‌ఎస్‌ను మినహాయించి తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణారాష్ట్రసమితి (టిఆర్‌ఎస్‌) అధినేత కె.చంద్రశేఖరరావు తన ప్రకటనల్లో చెప్పిన గడువు ఎప్పుడో దాటేసింది. దీంతో మరోసారి ఆయన తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ప్రకటనకు ఇంకో ముహుర్తం ప్రకటించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.   రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ పదవీప్రమాణస్వీకారం చేసిన రోజునే ప్రత్యేకరాష్ట్ర బిల్లు అమోదం పొందినా అమలు జరగదని నిపుణులు తేల్చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనటం లేదని ప్రకటించినప్పుడే టిఆర్‌ఎస్‌ కూడా అదేవిధమైన ప్రకటన జారీ చేసింది. టిడిపి ఎందుకు ఎన్నికల్లో పాల్గొనలేదంటే తమ పార్టీపై ఉన్న అసమ్మతినాయకుల గుట్టువిప్పేందుకే అన్నది జగమెరిగిన సత్యం. అటువంటి అవసరమే లేకపోయినా టిఆర్‌ఎస్‌ గొప్పగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవటం వల్ల ప్రణబ్‌కు టిఆర్‌ఎస్‌పై ఎటువంటి సాఫ్ట్‌కార్నర్‌ ఉండదని తేలుతోంది. ఉద్యమం చేసేద్దామంటున్న తెలంగాణాలోని విద్యార్థి సంఘాలూ టిఆర్‌ఎస్‌ను పట్టించుకోవటం లేదు. తమ సొంత బలంపై ఆ సంఘాలు ఆధారపడ్డాయి. దీంతో టిఆర్‌ఎస్‌ను తెలంగాణాలో అందరూ ఏకాకిని చేసేసి వాతావరణం కనబడుతోంది. కేసిఆర్‌ ఎప్పుడు ఏం ప్రకటన చేసి ఇంకా పార్టీపై నమ్మకం పోగొడతారో అని కూడా ఆ పార్టీనేతలే తలలు పట్టుకుంటున్నారు. ఇంకోసారి అటువంటి గడువుతో కూడిన ప్రకటనలు చేయోద్దని బిజెపి నేతలతో వార్నింగ్‌ ఇప్పించినా కేసిఆర్‌ వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. అలానే ఇప్పటి దాకా తెలంగాణా తెస్తారన్న నమ్మకంతో టిఆర్‌ఎస్‌ వెనుక ఉన్న కార్యకర్తలు కూడా ఆ తెచ్చింది ఇక చాల్లే అని తప్పుకోవటం కూడా ప్రారంభించారు. బాలకృష్ణ ప్రకటన వల్ల తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు తెలంగాణాలో కొత్తగా ఆదరణ లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలు చేయాల్సిన పని టిఆర్‌ఎస్‌ చేస్తానంటే అది అవుతుందా అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వేసిన ప్రశ్న ఇప్పుడు తెలంగాణావాదులను ఆలోచింపజేస్తోంది. 2014ఎన్నికల్లో తమను ఆదరిస్తే ఖచ్చితంగా తెలంగాణా ఇస్తామన్న కిషన్‌రెడ్డి భరోసా గురించి కూడా తెలంగాణాప్రాంతంలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా నమ్మకాన్ని కోల్పోయి టిఆర్‌ఎస్‌ ఎదురీతలో ఎంతవరకూ నెట్టుకురాగలదో తెరపైనే చూడాలి.

వరంగల్‌ నిట్‌లో జైలు వాతావరణం

వరంగల్‌లోని నిట్‌ దేశంలోనే పేరుపొందిన సాంకేతిక విద్యాసంస్ధగా రూపొందింది. ఈనేపధ్యంలో పరిస్థితులను చక్కదిద్దుకోవటంలో డైరెక్టర్‌ విఫలమవుతున్నారు. ఈ ఏడాది ట్రిపుల్‌ ఈ అడ్మిషన్లు పూర్తయ్యి నెలరోజులనుండి క్లాసులు జరుగుతున్నా ఇంతవరకు ఏంటీ ర్యాంగింగ్‌ చర్యలేవీ కాలేజీ యాజమాన్యం చేపట్టలేదు. గత ఏడాది వైజాక్‌కు చెందిన బిటెక్‌ విద్యార్ధిని మాధురి ర్యాగింగ్‌ కారణంగా లేడీస్‌ హాస్టల్‌ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.       అంకుర్‌భరద్వాజ అనే జూనియర్‌ విద్యార్ధికూడా మెగా హాస్టల్‌ భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నప్పటికి ర్యాగింగ్‌ నివారణా చర్యలు మాత్రం నిల్‌.ప్రొఫెసర్లతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి రాత్రిళ్లు కూడా నిఘాపెంచాలి. కానీ ఇవేమీ నిట్‌లో ఇవేమీ కనిపించవు.సీనియర్లు ఎవరెవరు జూనియర్లను తమరూంలకు పిలిపించుకుంటున్నారో తెలియదు.సమస్యను పరిష్కరించడం కంటే ముందుగా మీడియాకు తెలియ కూడదనే అధికారులు జాగ్రత్తపడుతున్నారు.ఎన్‌ఆర్‌ఐ హాస్టల్‌లో విద్యార్ధులు తప్పతాగి కొట్టుకుంటున్నా ఏమీ పట్టనట్లు ఉంటారు.క్లాసు రూంలలోనే గంజాయి తెప్పించుకున్నా అడిగే వాళ్లే లేరు.నేడు సమాచర వ్యవస్దతో ప్రతీదీ బహిర్గతం అవుతున్నా నిట్‌లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. లోపల ఏమి జరిగినా బయటకు ఏమీ తెలియకూడదనేది నిట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆలోచన.ప్రస్తుతం నిట్‌ పరిస్థితి జైలుకన్నా దారుణంగా ఉందని సాక్షాత్తూ దానిలోని ఉద్యోగులే చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు చేపట్టాలని విద్యార్దులు, ఉద్యోగులు కోరుతున్నారు.

ఫలిస్తున్న బాబు బి.సి. వ్యూహం

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తనపార్టీని ముందుకు నడిపించడానికి కావల్సిన అన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. ముఖ్యంగా బిసిలకు రానున్న ఎన్నికలలో 100 సీట్లు కల్పిస్ తానని,  బిసి నాయకుల మన్ననలు పొందుతున్నారు. బిసిలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యికోట్లు మంజూరు చేస్తానని కూడా చెప్పారు. ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న చంద్రబాబు బిసిలకన్నా ఎస్‌ సి, ఎస్‌టిల కన్నా ఎక్కువ వెనుకబడిన వారు ముస్లింలే అని వారి అభివృద్దికి తెలుగుదేశం కట్టుబడి ఉంటుందని హామీలు కురిపించారు. యస్‌సి వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేస్తామని దానికి సంబందించిన బిల్లును కూడా ప్రవేశ పెడతామని కూడా ముందుకు సాగుతున్నారు. అయితే అధికార కాంగ్రెస్‌ పార్టీకి తన మంత్రులపై సిబిఐ చార్జ్‌ షీట్లు పెట్టటంతో తల బొప్ పికట్టింది. ఏ నిముషానికి ఎవరి పేరు సిబిఐ బయట పెడుతుందోనని మంత్రులందరూ టెన్షన్‌తో ఉన్నారు.వారికి ఇప్పుడు వచ్చే ఎన్నికల సంగతటుంచి ఈ ఆగస్టు గండం గడిచేదెలా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలేవి పట్టని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఇందిరమ్మ బాటలో ఉన్నారు. ఇక వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకూడా ఉత్సాహం కరువైంది. మొన్న రీఎంబర్స్‌మెంట్‌ను అమలు చేయాలంటూ విజయలక్ష్మి విద్యార్ధులకు మద్దతుగా దీక్ష చేపట్టటం కంటే ఇంకేమీ చేయలేదు. యస్‌ సి వర్గీకరణ మీద పెదవి విప్పటం లేదు. పార్టీ అద్యక్షుడు జగన్‌ జైల్లో ఉండటం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీని ఉత్సాహంగా ముందుకు నడపాలన్నా కష్టంగానే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌కు బెయిల్‌ ఎప్పుడు వస్తుందో చెప్పడం ఎవరికీ తెలియటంలేదు. అయితే పార్టీ గౌరవాద్యక్షురాలు మాత్రంజగన్‌ బాబు వస్తాడు...వస్తాడు అని చెబుతూనే ఉన్నారు. త్వరిత గతిని నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్లకపోతే పార్టీకి కష్టమే.

రాష్ట్రానికి యూరియా కొరత చోద్యం చూస్తున్న ఎంపీలు

ఖరీఫ్‌ సాగు రైతులకు శాపంగా పరిణమించింది. ఒకవైపు ముఖం చాటేసిన వర్షాలు మరొక వైపు ఎంతకి తమ వైపు చూడని పాలకులు వెరసి సాగు ముందుకు సాగని పరిస్థితులు. యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా రైతులను వేధిస్తోంది. ఎరువుల దుకాణాల వద్ద యుద్దం చేసినా బస్తా యూరియా దొరకని పరిస్థితి. వరి నాటులో యూరియా తప్పని సరి. దానికోసం రైతులు సీజన్‌ ఆరంభం నుండి ఎదురు చూపులు చూస్తుంటారు. సీజన్‌ ఆరంభమైనెలలు గడుస్తున్నా అన్నదాత నిరీక్షణ ఫలించ లేదు. ఇప్పటివరకు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీ చేయవల్సి ఉండగా కేవలం 1 లక్ష టన్నుల యూరియాను మాత్రమే రాష్ట్రంలో పంపిణీ జరిగింది.అంటే 3 లక్షల టన్నుల యూరియా కొరత ఉందన్న మాట. యూరియాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కెటాయిస్తుంది. ఈ కేటాయింపుల్లో కూడా మనకు సక్రమంగా జరగటం లేదని దీనివల్ల తెలుస్తుంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాత్రం మన రాష్ట్రానికే ప్రాధాన్యత నిస్తుంది కేంద్రం అంటారు కాని చేతల్లో మాత్రం శూన్యం. ఎరువుల కోసం ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావాలని వ్యవసాయ అధికారులు, రైతులు కోరుతున్నారు. కేంద్ర ఎరువుల సహాయక మంత్రి ఒడిశ్శాకు చెందినవారవటంతో ఒడిశ్శా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో ఎరువుల కొరతలేవని చెబుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లోనూ ఎరువుల కొరత లేదు. అందరికన్నా ఎక్కువ ఎంపీలు మనరాష్ట్రంలో నుండి ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మోపిదేవికోన్యాయం, ధర్మానికి మరో న్యాయమా ?

రాష్ట్రప్రభుత్వ పరిపాలనని విశ్లేషించడం ఎవరివల్లా కాదు. ఏ విధివిధానాన్ని నమ్ముకున్నారో ఎంతకీ అంతుబట్టదు. వాన్‌పిక్‌ కేసులో 5వ నిందుతుడిగా సిబిఐ చార్జ్‌ షీట్‌ దాఖలు చేసిందని మోపిదేవిని దగ్గరకు పిలచి బలవంతంగా రాజీనామా చేయించారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. అదే సిబిఐ 4వ ముద్దాయిగా ధర్మానపై చార్జ్‌ షీటు దాఖలు చేయగానే ఆయన రాజీనామా చేసినా ఆమోదం తెలుపకుండా తాత్సారం చేస్తున్నారు. ధర్మానకు మంత్రులందరూ సంఫీుభావం ప్రకటించడం, ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేకపోతున్నారు. ఈ మంత్రులే మోపిదేవినైతే పట్టించుకున్న ధాఖలాలే లేవు. ముఖ్యమంత్రి మోపిదేవికి న్యాయసహాయం అందించడానికి నిరాకరించారు.   సీనియర్‌ ఐఏఎస్‌లకు కూడా ఇదే పద్దతి. కొదరిని విచారణకు అనుమతించ లేదు. అయితే ఇద్దరికి మాత్రం అనుమతించారు. వారు ఇప్పటికే చెంచల్‌ గూడా జైల్లో ఉన్నారు. మరికొందరు త్వరలో రాబోతున్నారు. మోపిదేవి రాజీనామాతోనే మంత్రులందరూ కలసికట్టుగా తమది క్యాబినెట్‌ నిర్ణయమని తెలపవలసింది.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు గోల చేసి ఏం లాభమన్న విమర్శలు వస్తున్నాయి. ఏవ్యక్తి మీదో, కుటుంబం మీదో కక్ష సాధించాలనుకుంటే ఇలాగే జరుగుతుందని సి.బి.ఐ. దర్యాప్తు ప్రారంభించినప్పుడే జీవోలన్నీ క్యాబినెట్‌ నిర్ణయమని చెప్పుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాబినెట్‌ నిర్ణయాలను ఎవరూ కాదనటానికి వీలు లేదనే మంత్రి వట్టివసంతకుమార్‌ ఇప్పటి వరకు ఎక్కడున్నారు. సి.బి.ఐ దర్యాప్తు పేరిట ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్న కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని నోరు తెరిచే నాయకులే కరువయ్యారన్న ఆవేదన మంత్రుల్లో వ్యక్తం అవుతోంది.

పడగ విప్పిన అరాచకం! ప్రక్షాళన చెయ్యడం అవసరం!

రాష్ట్రంలో అరాచకం తాండవం చేస్తోంది...! అవినీతి, లంచగొండితనం, బరితెగింపుధోరణి, జవాబుదారీ లేని వ్యవహారశైలి రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్నాయి...! ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ పెద్దలే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొవడం... అధికార రక్షణే ధ్యేయంగా అమాత్యులు తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం, అధికార పక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజాసమస్యలు పట్టనట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తూండటం... ప్రజారక్షణ కోసం ఏర్పాటైన పోలీసువ్యవస్థ చోద్యం చూస్తూండటం... న్యాయపరిరక్షణా వ్యవస్థకు సైతం అవినీతి చెదలు పట్టడం.... రాష్ట్రాన్ని ఆటవిక సమాజంలోకి నెట్టేస్తున్నాయి! అవును... ఈ సమాజం ఎటు పోతోంది? మన రాష్ట్ర భవిష్యత్‌నడక ఎలా ఉంటుంది?` ఆలోచించాలంటేనే భయమేస్తుంది...!   ఎటుచూసినా అవినీతి జడలు విప్పింది! ప్రజలకు సుద్దులు చెప్పాల్సిన పెద్దలు తమ స్వలాభంకోసం యధేచ్ఛగా పాల్బడిన అవినీతి చర్యలకు ఫలితం అమాయకపు ప్రజలు అనుభవించాల్సి వస్తోంది! రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్డుప్రమాదాలే` వాహనాలకు ఫిట్‌నెస్‌ ఉండదు...! దేశంలో ఇంకెక్కడా లేనన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు మనరాష్ట్రంలోనే చాలా కాలేజీల్లో ప్రాథమిక సౌకర్యాలే ఉండవు...! రాష్ట్రంలో విచ్చలవిడిగా కార్పొరేట్‌ విద్యావ్యాపారం` అబద్ధాల ప్రచారంతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నవైనం ! పచ్చని పసిడి పంటలతో ప్రజల ఆకలిని సంపూర్ణంగా తీర్చగలిగే సారవంతమైన భూమి పొలాలకు విద్యుత్‌ ఉండదు, నీటికి దిక్కుండదు...! మార్కెట్లో మినరల్‌ వాటర్‌బాటిళ్ళు వెక్కిరింపు...! పండిన పంట పొరుగు రాష్ట్రాలకు రవాణా` మన రాష్ట్రంలో ధరల విశృంఖల వీర విహారం! మన రాష్ట్రంలో ఉత్పత్తయిన విద్యుత్‌, గ్యాస్‌ పక్కరాష్ట్రాలకు సరఫరా.. చిమ్మ చీకట్లో రాష్ట్ర జనం జాగారం! అప్పుడెప్పుడో వాడుకున్నారంటూ ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న భారీ సర్‌ఛార్జీలు..! ప్రభుత్వ వైద్యశాలల ఆలనా పాలనా పక్కన పెట్టి, ప్రయివేటు మేలుకోసం ఆడంబరంగా ప్రవేశపెట్టిన ఆర్యోగ్యశ్రీ నిధుల కొరతతో నిర్వీర్యమైపోయిన సర్కారు ఆస్పత్రులు! వందలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నా చలించని అధికార గణం...!   ప్రభుత్వభూములు ప్రయివేటుపరం కృతజ్ఞతా పూర్వ కానుక ప్రయివేటు పెట్టుబడిగా రూపాంతరం! చేవ్రాలు చేసిన అమాత్యుల ‘హస్తా’లకు అవినీతి మరకలు! చెంచల్‌ గూడా జైలు గదులు విఐపిలతో సందడి! తప్పును ఒప్పుచెయ్యడం కోసం నిందితులకు ప్రభుత్వమే న్యాయసహాయం కల్పించడానికి కంకణ బద్ధం! పెద్దయ్య పెద్దరికం చూసి ఎదురు మాటడలేక బుద్ధిగా చేవ్రాలు చేశామంటూ సర్దిచెప్పుకోవాలని చూసినా ఆస్తుల అసలు చిట్టా విప్పితే అసలు బండారం సత్యపీఠంపైనే వెల్లడౌతుంది! తప్పును తప్పంటూ వేలెత్తి చూపిన పరిశోధనా బృందానికి మరకలంటించ చూసిన కాల్‌డేటా సేకరణ అధికారమద్దతు అస్సల్లేకుండానే జరిగిందా? ప్రశ్నార్థకమే! నిస్పక్షపాతంగా న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు రూపాయిలగని కోసం పాపాల చిట్టాను ఆవలకు నెట్టి చటుక్కున బెయిలిచ్చి ఇంచక్కా జయిలూచలు లెక్కెయ్యడం న్యాయం కోసం ఇంక్కెక్కడి కెళ్ళాలన్న సందేహం ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసింది!   సమాజానికి సరైన మార్గ నిర్దేశకత్వం చెయ్యాల్సిన బాధ్యతాయిత తెలుగు ఛానెళ్ళు కొన్నయితే` పగలంతా విలువల గురించి వల్లిస్తూ అర్థరాత్రి మద్దెలదరువన్నట్లు రాత్రి 11గం.లకు పచ్చిశృంగార నీతి పాఠాలు వివరిస్తూ విలువల వలువలు వలిచేస్తున్నాయి! రియాలటీషోల పేరుతో పసిపిల్లల మనసుల్ని కలుషితం చేస్తున్న ‘విచిత్ర విన్యాసాలు’ ఏ పెద్దవాళ్ళకీ కనిపించడమే లేదు! క్రైం కార్యక్రమాలు క్రిమినల్స్‌కు చక్కటి తర్ఫీదునిచ్చే ఇన్స్‌పిరేషన్‌ ప్రోగ్రాములయ్యాయనడం విశ్లేషకులు చేస్తున్న ఆరోపణ! ఆర్టీసి కండక్టరు చిల్లర మాయాజాలం, ఆటోరిక్షావాలాల దందాగిరీ, జేబుదొంగల హస్తలాఘవం, దొంగనోట్ల చెలామణీ, ఈవ్‌ టీజింగ్‌, పబ్బుల పచ్చి శృంగారం, విచ్చల విడిగా వ్యభిచారం, అత్యాచారం, హత్య, దోపిడీ, చదవకుండానే చేతికొచ్చే డిగ్రీ సర్టిఫికెట్లు, పెరిగిపోతున్న ఇంటద్దెలు, సరఫరాకాని తాగునీరు, అడ్డగోలుగా లైసెన్సులు పొంది బళ్ళూగుళ్ళూ అనే తేడాలేకుండా జనావాసాల మధ్య వెలసి ‘రా రమ్మంటూ’ సాదరంగా ఆహ్వానించే బార్లూ బీర్లు, నియంత్రణలేని కూరల ధరలు, మళ్ళీ విజృంభిస్తున్న మట్కాలు, హుక్కాలూ, నెంబర్లూ, మాదక ద్రవ్యాలూ, ఆఫీసు వేళల్లో కుర్చీల్లో కనిపించని అధికారులు, చదువుకునే పసిపిల్లలపై వికృత చేష్టలకు పాల్పడుతున్న టీచర్లు, పుట్టుకొస్తున్న కొత్తబాబాలు., రేష్‌ షాపుల్లో దొరకని తిండిగింజలు, కడుపులో కాళ్ళు పెట్టుకొని నిస్తేజంగా శూన్యంలోకి చూస్తున్న సామాన్యుడి కళ్ళు.. రాష్ట్రంలో అరాచకం ప్రబలిందనడానికి నిలువెత్తు సాక్ష్యాలు! మంత్రులంతా అవినీతి ఆరోపణలతో కేబనేట్‌కి దూరమైతే అధికారం నిలుపుకునేదెలా? అంటూ మల్లగుల్లాలు పడటంతోనే కాలం వెళ్ళబుచ్చుతూ పరిపాలనా వ్యవస్థను అస్థవస్థం చేస్తున్న అధికారపార్టీ ఇందుకు బదులివ్వాల్సి ఉంటుంది...! అరాచకం మరింత ముదరక ముందే ప్రజాసంక్షేమంకోసం ప్రక్షాళనా కార్యక్రమం తక్షణం చేపట్టవలసి ఉంటుంది...!

దీనిభావమేమి ఓ ప్రజాస్వామ్యమా?

జాతిపిత మహాత్మాగాంధీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఫోటోలను ఒకే ఫ్లెక్సీలో పెట్టి గుంటూరులో ప్రదర్శించినందుకుగాను కాంగ్రెస్‌ ఎం.పి. వి. హనుమంతరావు సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి తన నిరసన వ్యక్తం చేశారు. బిందెలతో పాలను తెప్పించి పైరింజన్‌ ద్వారా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇందుకుగాను ఫైరింజన్‌కు అడ్డొచ్చిందని ఫుట్‌పాత్‌ను సైతం పగులగొట్టించగా, దానికి నిరసనలు తెలపడంతో తన స్వంత ఖర్చుతో ఫుట్‌పాత్‌ను కట్టిస్తానని హామిఇచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ ఫోటోపక్కన జగన్‌ ఫోటో పెట్టడం బాధించిందని, అందుకు తాను పాలాభిషేకం ద్వారా మనశ్శాంతి పొందానని చెప్పారు.   సాధారణంగా మన ప్రజాస్వామ్య దేశంలో అధికారంలో ఉన్నవారు అధికారాన్ని నిలుపుకోవడానికి, అధికారంలో లేనివారు అధికారంలోకి రావడానికి ఎన్నికలు వచ్చి అవి జరిగేవరకు కూడా ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరెవరు ఏ ప్రయత్నం చేసినా దాని అంతిమ లక్ష్యం గుర్తింపుకోసమో, అధికారంకోసమో. ప్రజల్లో సానుభూతి కోసమో, లేదా వారిలో మంచిపేరును సంపాదించేందుకో.. అయ్యుంటుందన్నది జగమెరిగిన వాస్తవం...! ‘ఉప్పు కర్పూరంబు నొక్కపోలికనుండు, చూడచూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అని వేమన సెలవిచ్చాడు. నేటి ఈ రాజకీయాల్లో ‘నేతలందు అసాధారణ నేతలు వేరయా’ అని అనాల్సి వస్తోంది ఈ సంఘటన చూస్తే. మన ప్రజాస్వామ్యదేశంలో ఏ నాయకుడు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనే దానికి ఇవే ఉదాహరణలేమో!ఏదేమైనా మహాత్ముల విగ్రహాలు సైతం అధికారకాంక్షకు పావులుగా ఉపయోగపడుతున్నాయా అనిపిస్తోంది!

అమ్మకానికి తెలుగు టీవీఛానెళ్ళు

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలుగులో 13 టీవీ న్యూస్‌ ఛానెళ్ళు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి...! రేటింగుల కోసం పడరాని పాట్లు పడుతూ.. యాడ్‌రెవిన్యూ తెచ్చుకోవడం కోసం అన్ని రకాల మార్గాలనూ అన్వేషిస్తూ...ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తగినంత రాబడి లేక, జీతాలు చెల్లించలేక, నిర్వహణ సామర్థ్యం కొరవడి కుదేలవుతున్నాయి...! అయినకాటికి అమ్మేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి!   అవసరాన్ని మించి... ఒకటి కొత్త...రెండోది పోటీ...మూడోది అవసరం...నాలుగోది పర్లేదు...ఉండొచ్చు...!  అంతేగానీ... ఏకంగా 13 టీవీన్యూస్‌  ఛానెళ్ళు అవసరమా? ఇదే ప్రస్తుతం తెలుగునాట వినిపిస్తున్న ప్రశ్న...! ఇదిలా ఉంటే మరో అయిదారు న్యూస్‌ ఛానెళ్ళు ఊపిరిపోసుకో బోతున్నాయి కూడా! ఇన్ని టీవీలు చెప్పేందుకు తెలుగునాట కొత్తవార్త లేముంటాయి? కొత్తగా వీరు చెప్పేందుకు కొత్తసంగతులు ఎప్పటికప్పుడు ఎక్కడినుంచి పుట్టుకొస్తాయి.   మీడియా అంటే అంత ఆకర్షణ ఎందుకు? మీడియాలో ఏముందని ఇంత మంది పెద్దలు పోటీపడుతున్నారో అర్థంకాని పరిస్థితి తెలుగు జనాలది! పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొత్తటీవీల్లో నిలబడేవి ఎన్ని? ప్రజాదరణ పొందేవిఎన్ని? పుబ్బలో పుట్టి మఖలో మూతబడేవి ఎన్ని! రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు టీవీఛానెళ్ళు స్వంతంగా ప్రారంభించేందుకు ఎందుకింత ఉత్సాహపడుతున్నారు? టీవీల ద్వారా వీళ్ళు సాధించాలనుకునేది ఏమిటి? ఏ ప్రయోజనం కోసం కోట్లాది రూపాయల పెట్టుబడుల ప్రవాహం టీవీఛానెళ్ళు కోసం, తరలిస్తున్నారు! అసలు వీళ్ళ టార్గెట్‌ ఏమిటి? అన్నీ ప్రశ్నలే! అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే!   ఇన్ని ఛానెళ్ళు అవసరమా ? ఇన్ని ఛానెళ్ళకు మన తెలుగుగడ్డపై స్పేస్‌ ఉందా? అని ఆలోచిస్తే..జనం నుంచి సమాధానం వచ్చేలోగానే ‘ఇంకా చాలా స్పేస్‌ ఉంది..’ అంటూ మీడియా పీపుల్‌ ఠక్కుమంటూ చెప్పేస్తుంటారు. వాస్తవం ఆలోచిస్తే ఇన్ని టీవీన్యూస్‌ ఛానెళ్ళు అవసరం లేదనే అనిపిస్తుంది. జనం ఎప్పుడూ గుంభనంగానే ఉంటారు. వాళ్ళ వెర్షన్‌ స్పష్టంగా ఎప్పుడూ చెప్పట్లేదు. అందుకే మౌనం అర్ధాంగీకారమంటూ టీవీన్యూస్‌ ఛానెళ్ళ ఏర్పాట్లలో పారిశ్రామికవేత్తలు, పొలిటికల్‌ లీడర్లూ బిజీబిజీగా ఉంటున్నారు మరి!   వార్తను వార్తగా చెబ్తున్నారా ? వార్తను వార్తగా చెప్పే న్యూస్‌ ఛానెల్‌ ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదు...! చిన్నపాటి సమాచారం లభిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేసి, సొంతభాష్యం జోడిరచి న్యూస్‌గా ప్రెజెంట్‌ చేస్తున్నారు. చాలాసార్లు ఆ వార్తను వార్తగా చెప్పకుండా కంక్లూజన్‌ కూడా వీళ్ళే చెప్పేయడం చాలాసార్లు ఎబ్బెట్టుగానే ఉంటోంది!   వార్త నిజమా? కాదా? టీవీలో వార్త వస్తే అది నిజమో కాదో మనకస్సలు అర్థం కాదు. ఆ వార్త నిజమోకాదో తెలుసుకోవాలంటే మరో రెండు మూడు ఛానెళ్ళు చూడాల్సిందే! వార్తకు స్వంత భాష్యం జోడిరచి, స్వప్రయోజనాల ప్రాతిపదికగా న్యూస్‌ ప్రసారం అవుతుంటే ‘అసలు విషయం’ అర్థమయ్యేదెలా? కొత్తగా వచ్చే ప్రతీ ఛానెల్‌ ‘తాజా వార్తల సమాహారం’గానే చెప్పుకుంటుంది’ తీరా చూస్తే అంతా ఒకటే మూసపోసిన విధానమే!   పెరగని వ్యూయర్స్‌ ఇన్ని ఛానెళ్ళు వచ్చినా టీవీ న్యూస్‌ వ్యూయర్స్‌ సంఖ్య అస్సలు పెరగలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది! కేవలం 15 శాతం మందే న్యూస్‌ ఛానెల్స్‌ చూస్తుండగా మిగిలిన 85శాతం మంది ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటే న్యూస్‌ ఛానెల్స్‌ కొత్తగా సాధించినది ఏమీ లేదని స్పష్టమౌతోంది మరి! అయినా ఇన్ని ఛానెళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే`రాజకీయ ప్రచారం కోసం స్వంత వాణిని స్వంత బాణీలో వినిపించడం కోసమేనని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల ప్రచారం కోసం, తద్వారా స్వప్రయోజనాల సిద్ధికోసం పారిశ్రామిక వేత్తలు టీవీ న్యూస్‌ ఛానెళ్ళు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు! ఇదీ ఓ రకమైన వ్యాపారమే! టీవీ ఛానెల్‌ ఏర్పాటు చేసి, జనంలోకి తీసుకు వెళ్ళి, కొద్దిరోజుల పాటు నిర్వహించి అధిక లాభం కోసం ఇంచక్కా అమ్మేసుకోవచ్చన్న మాట! అదే ఇప్పుడు తెలుగు టీవీ న్యూస్‌ ఛానెళ్ళ పరిస్థితి!   న్యూస్‌ ఛానెళ్ళ జాతర!  తెలుగునాట వార్తలకు కొదవలేదు. పిల్లినాలుగు  పిల్లల్ని కంటే వార్త...! కుక్క తోక ఊపకపోతే వార్త...!బ్రేకింగ్‌ న్యూస్‌... అతిసాధారణ అంశాన్ని సెన్సేషనల్‌ వార్తగా టీవీలో ప్రసారం చేసేస్తుంటే` చూడటం ఎంత ఇబ్బందిగా ఉంటుందో` ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది! ప్రతినిమిషం కొత్తగా చూపించ డానికి ఏమీ ఉండదు కాబట్టి` చెప్పిన విషయాన్నే మళ్ళీ చెబ్తూ... మళ్ళీ మళ్ళీ చెబ్తూ న్యూసెన్స్‌ సృష్టిస్తున్న న్యూస్‌ ఛానెళ్ళు ప్రజాప్రయోజనాలకు ఏం ఉపయోగపడక పోయినా, అధికార, రాజకీయ నాయకుల్ని అడ్డంపెట్టుకుని స్వంత ప్రయోజనాలు సాధించుకోడానికి మాత్రం చక్కగా ఉపయోగపడుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.    ఛానెల్‌ చేతిలో ఉంటే పవర్‌ ఉన్నట్లే...! న్యూస్‌ ఛానెల్‌ చేతిలో ఉంటే పవర్‌ ఉన్నట్లే...! కావల్సిన పనులు చకచక జరిగిపోతాయి...! ఛానెల్‌ వాళ్ళంటే అందరూ అంతో ఇంతో భయపడతారు...! మనజోలికి ఎవరూరారు...! మనకు కావల్సిన వాళ్ళ గురించి ఇంద్రుడూ చంద్రుడూ అంటూ పొగడ్తలవర్షం కురిపిస్తూ, వాళ్ళ వ్యతిరేకుల్ని దుర్మార్గులుగానో, అవినీతిపరులుగానో, ప్రజాప్రయోజనాలకు విఘాతం  కలిగించే వారిగానో చిత్రీకరిస్తే స్వంత ప్రయోజనాలు  నెరవేరుతాయి...! ఇదే ఆలోచన ఛానెళ్ళ ప్రారంభానికి కారణమౌతోంది.! మీడియా అంటే తెలియనివాళ్ళు కూడా డబ్బు ఉందికదా అని ఈ రంగం లోకి అడుగుపెడుతున్నారు. ఒకళ్ళను చూసి మరొకళ్ళు... వీళ్ళను చూసి వాళ్ళు... వాళ్ళను చూసి వీళ్ళు...ప్రత్యర్థులు పెట్టారని ఇంకొకళ్ళు... ఇలా...ఒకళ్ళ తర్వాత మరొకళ్ళుగా టీవీ న్యూస్‌ ఛానెళ్ళు ప్రారంభించేస్తున్నారు.   టీవీ ఛానెల్‌ ప్రారంభించడం చాలా ఈజీ...! ఈ రోజుల్లో టీవీ ఛానెల్‌ ప్రారంభించడమంటే చాలా ఈజీనే! కేవలం ఓ రూ.30 కోట్లు ఉంటే చాలు... టీవీ న్యూస్‌ ఛానెల్‌  ప్రారంభించేయవచ్చు...! లైసెన్సులు వగైరాలన్నీ మిగతా వ్యాపారాలతో పోలిస్తే చాలా సులభమే! ఎలాగూ రాజకీయ నాయకుల వత్తాసు ఉండనే ఉంటుంది...! వారి వారి ప్రయో జనాల కోసమైనా లైసెన్సులు త్వరగా వచ్చేటట్లు రికమెండ్‌ చేసేస్తారు...! ఆఘమేఘాలమీద ఛానెల్‌ ఎయిర్‌లోకి వెళ్ళి పోతుంది..! స్వంత వ్యాఖ్యానాల ఊకదంపుడు కార్యక్రమాలతో తెలుగు వాకిళ్ళు దద్దరిల్లిపోతాయి...! ఉపాధి అవకాశాలు పెరిగాయి....! ఇబ్బడిమబ్బడిగా తెలుగులో టీవీ న్యూస్‌ ఛానెల్స్‌ ప్రారంభం కావడంతో ఉపాధి అవకాశాలు పెరిగిన మాట వాస్తవం! అయితే దీనివల్ల కొత్త ఎంప్లాయీస్‌ పుట్టారేగానీ...జర్నలిస్టులు మాత్రం తయారు కాలేదు....! న్యూస్‌ ప్రెజెంటేషన్‌ అంటే అస్సలు తెలియని వాళ్ళు ఈ రంగంలోకి వచ్చి జర్నలిస్టులుగా చలామణీ అయిపోతూండటంతో వార్తల ప్రెజెంటేషన్‌లో నాణ్యత కొరవడిరదనే చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో చెలామణీ అవుతున్న కొత్త జర్నలిస్టుల్లో చాలా మంది యజామాన్యం చెప్పినట్లు చేసే సాధారణ ఎంప్లాయీస్‌గానే భావించబడుతున్నారు. జర్నలిస్టుల విలువ నానాటికీ దిగజారిపోతోందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   న్యూస్‌ ఛానెల్స్‌తో బాటే...  న్యూస్‌ ఛానెల్స్‌తో బాటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ కూడా ఇటీవలికాలంలో ఎక్కువగానే పెరిగాయి. నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువభాగం సినిమా బేస్డ్‌ కార్యక్రమాలతో ఊదరగొట్టేస్తున్నాయి! అలాగే మెడికల్‌ ఛానెళ్ళూ, ఎడ్యుకేషన్‌ ఛానెళ్ళు అంటూ కూడా కొత్తగా తెరపైకి రాబోతున్నాయి. వీటికిమార్కెట్‌పరంగా అంత లాభసాటి ఉండదని తెలిసినప్పటికీ ఛానెల్స్‌ ప్రారంభానికి ముందుకు వస్తున్నరంటే` కేవలం స్వప్రయోజనాల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న విమర్శలూ ప్రజల్లో ఉన్నాయి!   తగ్గిపోయిన యాడ్‌ రెవెన్యూ ఒకటి తర్వాత మరొకటిగా 13 న్యూస్‌ ఛానెల్స్‌...! అలాగే రెండు పదులకు చేరిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌.. మరో మెడికల్‌ ఛానెల్‌...! సుమారు 30 కోట్లతో ఛానెల్‌ ప్రారంభించినా ఆ తర్వాత సీన్‌ రివర్సయ్యింది! నిర్వహణ వ్యయం భరించలేనంతగా మారిపోయింది! యాడ్‌రెవెన్యూ పూర్తిగా తగ్గిపోయింది! అడ్వర్టయిజ్‌మెట్ల వల్ల వచ్చే రూపాయిని ఇంతమందీ పంచుకోవాల్సి వస్తోంది! రేటింగ్స్‌ పూర్తిగా పడిపోయాయి! ప్రకటన కర్తల్ని ఆకర్షించేందుకు నాలుగు యాడ్స్‌ ఇస్తే రెండు ఫ్రీ అనే స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది! కొన్ని ఛానెళ్ళయితే ఒకటిస్తే ఒకటి ఫ్రీగా ముందుకెళ్తున్నాయి! ఈ నేపథ్యంలోనే` తగినంత ఆదాయం లేకపోవడంతో ఉద్యోగులకు నెలనెలా జీతాల చెల్లింపులు జరగటం లేదనే విమర్శలూ ఉన్నాయి. సంక్షోభంలో పడిన ఎలక్ట్రానిక్‌ మీడియా తీరుతెన్నుల్ని  సరిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది!    

రాజకీయాల్లో శ్రీహరి రియల్‌స్టార్‌గా మిగులుతారా?

నిన్నటి తారలు నేటి నేతలు అన్న మాట నిజం చేసేందుకు మరో నటుడు నాయకునిగా అవతారం ఎత్తేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. వెండితెరపై రియల్‌స్టార్‌గా వెలిగిన శ్రీహరి తాను ప్రజలకు ప్రత్యక్షంగా ప్రజాసేవ చేసుకోవాలనుకుంటున్నానని ప్రకటించారు. ఈయన ప్రకటన అయితే చేశారు కానీ, ఇంకా ఏ రాజకీయపార్టీలో చేరాలనుకుంటున్నారో తెలియలేదు.    ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయానికి శ్రీహరి రాలేకపోయారట. ఆయన తన సందిగ్థం వీడిన తరువాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకుని ఆ తరువాత ప్రకటిస్తామన్నారు. అయితే 2009లో వచ్చినట్లే ఇది కూడా పుకారేనా? అని  అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే శ్రీహరి మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలిపారు. వెండితెరపై ఫైట్లు ద్వారా ఆగ్రనటుల్లో ఉత్తమగుర్తింపు సాథించుకున్న శ్రీహరి తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ ఎక్కడ నుంచి చేయమంటే అక్కడి నుంచే పోటీ ఉంటుందన్నారు.   శ్రీహరి తన కుమార్తె పేరిట ఇప్పటికే ఓ ట్రస్టు నడుపుతున్నారు. ఈ ట్రస్టుద్వారా సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మమేకమయ్యేందుకు కృషి చేస్తున్నారు. రాజకీయంలో చేరినా సేవాకార్యక్రమాలను వదలనని శ్రీహరి స్పష్టం చేశారు. రాజకీయతెరపై కూడా శ్రీహరి రియల్‌స్టార్‌గా వెలుగొందాలని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో ప్రాంతీయపార్టీలదే హవానా?

నిన్నటిదాకా(2012 ఉప ఎన్నికలకు ముందు) రాష్ట్రంలో హంగ్‌ ఖాయమని అందరూ భావించారు. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించి ఉప ఎన్నికల్లో 18స్థానాలకు 15స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రరాజకీయాల్లో హంగ్‌ ఊసే ఎత్తనక్కర్లేదనింపించింది. అయితే ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా చంచల్‌గూడజైలులో ఉన్నారు. ఈయనకు రాష్ట్రంలో లభించిన ఆదరణ తాజాగా కొత్తపార్టీలు, కొత్త సంస్థలను ఆకర్షిస్తోంది. దీంతో ప్రాంతీయపార్టీలు పుట్టుకొస్తున్నాయి.   ఇవి 2014నాటికి ఎన్నికల్లో ప్రధానపార్టీలను ప్రభావితం చేస్తాయని పరిశీలకులు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకూ సంఘసేవకుడిగా పేరు గడిరచిన హైకోర్టు న్యాయవాది కళ్యాణ్‌రామకృష్ణ నవభారత్‌పార్టీని స్థాపించారు. అదీ 65ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేళ పార్టీ రాష్ట్ర అథ్యక్షునిగా ప్రకటించుకుని కొత్తపార్టీని రాజకీయతెరపైకి తీసుకువచ్చారు. ఇది రాజకీయంగా ఎటువంటి పరిణామమైనా భవిష్యత్తులో మరిన్ని కొత్తపార్టీలు ఆవిర్భవించగలవన్న సంకేతాలు దీనితో ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా రాష్ట్రీయప్రజాకాంగ్రెస్‌ పార్టీ నడుస్తోంది. దీనికి మేడాశ్రీనివాస్‌ పార్టీ అథ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఈ రెండు పార్టీల్లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన నవభారత్‌ ఇంకా కార్యకర్తల కోసం ఎదురు చూడాలి. రాష్ట్రీయప్రజాకాంగ్రెస్‌కు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఆల్‌రెడీ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి సేవలందించే నాయకులే అందులో ఉన్నారు. అయితే చిత్రంగా ఈ రెండు పార్టీల అథినేతలు మనస్సులు కలిసినట్లు ప్రకటనలు కూడా ఒకటే అయ్యాయి. రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్‌ ప్రారంభసమయంలో మేడాశ్రీనివాస్‌ ఇచ్చిన ఉపన్యాసమే కళ్యాణ్‌రామకృష్ణ కూడా చేయటం గమనార్హం. పదేళ్ల క్రితం మేడా చేసిన ఆ ప్రసంగం చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు కళ్యాణ్‌రామకృష్ణ కూడా అదే స్టయిల్‌లో ప్రసంగించారు. సమాజంలో ప్రజలకు రక్షణ కరువైందని, రాజకీయంలో అవినీతి చోటు చేసుకుందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నివర్గాలకు న్యాయం చేసేందుకే తాను పార్టీ నెలకొల్పానని ఆయన తెలిపారు. అయితే ఇది తొలిఅడుగుగా మాత్రమే రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.  

గౌతంకుమార్‌కు గేట్లు మూసుకుపోయాయా?

క్యాట్‌ ఆదేశాలు పాటించనందుకు రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వానికి ఐదువేల రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వ పిటీషను, డీజిపి దినేష్‌రెడ్డి పిటీషను కొట్టివేసింది. అంతేకాకుండా ప్రసుత్త డీజిపి దినేష్‌రెడ్డిని ఇన్‌ఛార్జిగా కొత్తడీజిపిని నియమించేంత వరకూ కొనసాగాలని స్పష్టంగా ఆదేశించింది. వారం రోజుల్లోపు డీజిపి నియామకకమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అథికారుల జాబితాను యుపిఎస్సీకి అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా తొందరపడి డీజిపి దినేష్‌రెడ్డి నియామకాన్ని తప్పుపట్టిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారని సీనియర్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.   గతంలో ఈ వివాదం రాష్ట్రవ్యాప్త సంచలనమైంది. డీజిపి దినేష్‌రెడ్డి కన్నా సీనియర్లు ఉండగా ఆయనకు ప్రభుత్వం అక్రమపద్ధతిలో నియమించిందని సీనియర్‌ ఐఎఎస్‌ అథికారి గౌతం కుమార్‌ కేంద్రట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌ దీనిపై విచారణ జరిపి గౌతంకుమార్‌ ఫిర్యాదులో ఉన్న వాస్తవాన్ని గమనించింది. వెంటనే ఆ నియామకం చెల్లదని, కొత్తగా సీనియార్టీ తీయాలని క్యాట్‌ ఆదేశాలు ఇచ్చింది. క్యాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా క్యాట్‌ను సమర్థించింది. దీంతో డీజిపి దినేష్‌రెడ్డి ఇప్పుడు ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. 

ధర్మానను కాపాడబోయి డిఫెన్సులో పడ్డ సిఎం?

రాష్ట్రరెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావును కాపాడబోయి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డిఫెన్సులో పడేలా రాజకీయవాతావరణం మారిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ విచారణ పేరిట సిబిఐ వరుసగా అరెస్ట్‌ చేస్తే ప్రభుత్వమనుగడే ప్రశ్నార్థకమవుతుందని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపుడుతున్నారు.   తన అభిప్రాయాన్ని గవర్నర్‌ నరసింహన్‌తో పంచుకున్న సిఎం చివరాఖరికి గవర్నర్‌కు పంపించే లేఖలో కిరణ్‌ ఇదే విషయాన్ని నొక్కి చెప్పనున్నారు. ఒకవేళ మంత్రి ధర్మాన అరెస్టు కనుక ప్రభుత్వం అడ్డుకుంటే వాన్‌పిక్‌ కేసు నుంచి చంచల్‌గూడ జైలులో ఉన్న వైకాపా అధినేత జగన్‌ను కూడా కిరణ్‌ తప్పించడానికి దారి ఇచ్చినట్లు అవుతుందని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. తన మంత్రులపై అభిమానంతో కిరణ్‌ సిబిఐ దర్యాప్తు చేస్తున్న జగన్‌ అక్రమాస్తుల కేసును నీరుకారుస్తున్నారని, నిందితులందరికీ ప్రభుత్వమే దారి చూపుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ధర్మానను వెనుకేసుకు వస్తున్న ప్రభుత్వంపై  ప్రతిపక్షాలు  ఇప్పటికే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అవసరమైతే సిఎంను నిలదీసేందుకు సైతం ప్రతిపక్షనేతలు సిద్ధపడుతున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లోని సీనియర్లు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో సిఎం జోక్యం చేసుకోవటాన్ని సహించటం లేదు. పార్టీపై ఇప్పటికే అవినీతి బురద పడినందున వచ్చిన ప్రతీ అవకాశాన్ని సిఎం నిజాయితీ చాటేలా ఉపయోగించుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు. తమ మాట వినకుండా మంత్రుల కోసం పీకమీదకత్తి పెట్టుకుంటే సిఎంకు వ్యతిరేకంగా కేంద్రానికి సిఫార్సు చేసేందుకైనా వెనుకాడబోమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణా కోసం సాయుధ పోరాటం ?

గతచరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకుండా తెలంగాణావాదులు తప్పటడుగులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న కేసిఆర్‌ తన మాటల్లో నన్నయ్యను అనువాదకవిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. నిన్న నాటి రజాకర్లపై తెలంగాణా తిరుగుబాటును ప్రత్యేకరాష్ట్రం కోసం కూడా అనుసరించాలని కొందరు పిలుపు ఇచ్చారు. అంటే అప్పట్లో సాయుథపోరాటాన్ని నేటి తరం అనుసరించాలని అపార్థం చేసుకునేలా కొందరు నేతలు ప్రసంగించారు.  దీంతో మావోయిస్టుల తరహాలో ఆయుధ పోరాటంతోనే తెలంగాణా సాధిస్తామని దసర్ల శ్రీశైలం ఓ పదిమందితో మిలిటెంట్‌ గ్రూపును తయారు చేశారు. ఆ పదిమంది ప్రధానలక్ష్యం మంత్రులను హత్య చేయటమే. ఇలా హత్య చేస్తేనే తెలంగాణా వచ్చేస్తుందని ఈ గ్రూపు భావించేలా శ్రీశైలం కృషి చేశారు. అయితే విషయం బయటకు పొక్కటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈసారి ఎటువంటి అవాంఛనీయసంఘటనలకు తావులేకుండా ముందుగానే పూర్తి ఆధారాలతో పోలీసులు శ్రీశైలాన్ని అరెస్టు చేశారు. ఈయనతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  శ్రీశైలం ఓయూ స్వతంత్య్రజాక్‌ కో`కన్వీనర్‌గా పని చేస్తున్నారు. ఎల్‌ఎల్‌బి మూడో సంవత్సరం చదువుతున్న శ్రీశైలం మిలిటెంట్‌ గ్రూపును తయారు చేయటమే కాకుండా మథ్యప్రదేశ్‌ను రూ.35వేలకు ఒక పిస్టల్‌ను, మూడు తపంచాలను కొనుగోలు చేశారు. మంత్రులు డికె అరుణ, జానారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఇంజనీరు కాశిలను శ్రీశైలం ఫోను ద్వారా బెదిరించారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న శ్రీశైలం తాము మంత్రులను హత్య చేద్దామనుకున్నా లక్ష్యాన్ని నిర్ధారించుకోలేని స్పష్టం చేశారు. చరిత్రను అపార్థం చేసుకునే ఈ మిలిటెంట్‌గ్రూపు ఏర్పాటుకు శ్రీశైలం కారణమయ్యారని పరిశీలకులు అంటున్నారు. అయితే శ్రీశైలంకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కెసిఆర్‌ రెండంచల రాజకీయ పోరాటం

టిఆర్‌యస్‌ నేత కెసీఆర్‌ ఒకవైపు పార్టీని పటిష్టపర్చడానికి, మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకునే లక్ష్యంతో ఆయన ఇప్పటినుంచే కసరత్తు చేయక తప్పటం లేదు. ఆగస్టు 20 తర్వాత తెలంగాణా ఉద్యమాన్ని ఉదృతి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనికై ఈనెల24 నుండి 26 వరకు తెలంగాణభవన్‌లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు 42 రోజులపాటు ఉద్యోగ , ఉపాద్యాయ విద్యార్ధి, కార్మిక వర్గాలతో జరిపిన సకలజనుల సమ్మె తెలిసిందే.   అయితే ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తారని ఇటీవల పదవీవిరమణ చేసిన టిఎన్‌జివో పూర్వాదక్షుడు స్వామిగౌడ్‌ చెప్పటంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి రేగింది. జీతాలకు ఢోకా లేకుండా ఉద్యమంలో ఎలా కొనసాగుతారో అని అన్ని ప్రధానపార్టీలు, ప్రభుత్వం ఉత్కంఠతో ఉన్నాయి. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవ్వబోతుండటంతో ఈవిషయం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించి అన్నిఅంశాలను లేవదీయనున్నారు. దానిలో మెడికల్‌ సీట్లు, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్లయిన నేదునూరు, శంకరంపల్లి ప్రాజెక్టులకు గ్యాస్‌ కెటాయించకపోతుండటం కూడా లేవనెత్తనున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసిచైర్మన్‌ కోదండరామిరెడ్డి వ్యవహారశైలిపై కూడా దుమ్మెత్తి పోయనున్నారని తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీతో అది చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరగడమే కారణంగా చెప్పవచ్చు. ఇప్పటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు యస్‌ చెబితే తన కూటమిలోకి చేర్చుకోవాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు.