జగన్ దృష్టిలో కొడాలి నాని కూరలో కరివేపాకేనా?

 అధినేత అండ తనకు మెండుగా ఉందనుకున్నారు.. ఆపైన మంత్రి పదవి కూడా ఇవ్వడంతో రెచ్చిపోయారు.. తనకు ఇక తిరుగే ఉండదనుకున్నారు. అబ్బో.. అధినేత తనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేస్తున్నారో.. అని ఊహించుకుని ఓవర్ యాక్షన్ డోస్ పెంచేశారు.  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , ఇతర టీడీపీ నేతల పై  నిత్యం నోటికొచ్చిన మాటలతో హద్దులు దాటి విమర్శలు చేశారు. చంద్రబాబును తిడితే చాలు తన స్థానం పదిలం అనుకున్న ఆయన ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిన మాజీ మంత్రి కొడాలి నాని. జగన్ రెడ్డి తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొడాలి నాని అమాత్య పదవి పీకేశారు. దాంతో కంగు తిన్న కొడాలిని పల్నాడు ప్రాంతీయ సమన్వయకర్త అనే ముద్ర వేసి కొద్దిరోజులు సంతృప్తి పడమన్నారు. తాజాగా ఆ పదవి నుంచి కూడా పీకేసి నీ స్థాయి ఇదే అని చెప్పకనే చెప్పారు. దీంతో కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు కూరలో కరివేపాకులా అయిందని  వైసీపీ శ్రేణులో జోకులేసుకుంటున్నాయి. అచ్చోసిన ఆంబోతులా రెచ్చిపోయిన కొడాలి నానికి తగిన శాస్తే జరిగిందని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. నోరు తెరిస్తే.. బూతులు మాట్లాడే మాజీ మంత్రి కొడాలి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందన్న భావన ఇటు సొంత పార్టీలోనూ, అటు విపక్ష నేతల్లోనూ వ్యక్తమౌతోంది. గతంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవి  కోల్పోయిన సందర్భంలో కొన్ని రోజులు తన పశువులపాకలో నులక మంచంపై వెల్లకిలా పడుకుని దిగులుగా కనిపించిన కొడాలి నాని   ఉన్న ఒక్క చిన్న పదవి కూడా చేజారడంతో ఇప్పుడెలా కనిపిస్తారో చూడాలన్న ఆసక్తి వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతోంది. సరే మంత్రి పదవి పోయినప్పుడు కొంతకాలం స్తబ్ధుగా ఉన్న కొడాలి.. మళ్లీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే లీకులు రావడంతో మరోసారి తన బూతుల విశ్వరూపం ప్రదర్శించారు. ఆ తర్వాత కేబినెట్ రీ షఫిల్ విషయాన్ని సీఎం జగన్ పక్కన పెట్టేయడంతో మళ్లీ మౌనంలోకి జారుకున్నారు. తర్వాత విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తొలగించి, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మార్చినప్పుడు అధినేత ఆదేశానుసారం కొడాలి నాని కిమ్మనకుండా ఉన్నారు. ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు ప్రశంసించని వారు వర్శిటీ పేరులో ఎన్టీఆర్ తొలగించడంపై ఎందుకు స్పిందిస్తున్నారంటూ తన సహజ బూతుల ధోరణిలో కొడాలి ఆని స్పందించడం గమనార్హం. ఇంకో పక్కన గుడివాడ నియోజకవర్గంలో తనను గెలవనివ్వకూడదని టీడీపీ అధినేత కంకణం కట్టుకుని బలమైన అభ్యర్థిని బరిలో దింపే యత్నాలు చేస్తుండడంతో మళ్లీ రెచ్చిపోయారు. తనపై గుడివాడ బరిలో నేరుగా చంద్రబాబు దిగినా.. నారా లోకేశ్ నిలబడినా.. లేదా కోట్ల రూపాయలు తెచ్చి ఎన్నారైతో ఢీకొట్టాలని చూసినా.. ఓటర్లు తనకే  పట్టం కడతారని కొడాలి నాని గొప్పలు పోయారు. ఇత తాజాగా వైసీపీ కేబినెట్ లో కమ్మ సామాజికవర్గానికి చోటు లేకుండా చేసిన జగన్ తీరును తప్పుపట్టిన మాజీ మంత్రి, సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు పై కొడాలి నాని తీవ్రంగా స్పందించడం విశేషం. కేబినెట్ మంత్రి పదవి ఇస్తేనే కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టా? అని ప్రశ్నించారు. చివరికి కొడాలి నాని ఎంతదాకా వెళ్లారంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కదా..! ఆయనది కేబినెట్ ర్యాంకే కదా అని  వ్యాఖ్యానించేంత వరకూ వెళ్లారు.   ప్రతిపక్షనేత పోస్టును కూడా ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు కూడా కొడాలి తెగించేశారు. వైసీపీ అధినేతకు కొడాలి నాని ఎంత గట్టి మద్దతుదారుగా ఉన్నప్పటికీ ఆయన ఒక్కొక్క పదవినీ పీకేస్తూ.. జగన్ నిర్ణయాలు తీసుకోవడం చూస్తే   ఆయన గుడివాడలో  నెగ్గడం  సంగతి దేవుడెరుగు.. అసలు పోటీ చేయడానికి పార్టీ టికెట్టైనా వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలు కలుగుతున్నాయి.  జగన్ ఇప్పటి వరకూ వాడుకుని వదిలేసిన నాయకుల జాబితాలో తాజాగా ఇప్పుడు కొడాలి నాని పేరు కూడా చేరింది. 

మంత్రి కాకాణి ఇరుక్కున్నట్లేనా?.. ఫైల్స్ చోరీ కేసు సీబీఐకి

ఏపీ మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఉన్న ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.  ఈ ఏడాది ఏప్రిల్‌ 13న నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఓ చోరీ జరిగింది. కొన్ని కీలకమైన ఫైళ్లు మాయం కావడం అప్పట్లో కలకలం రేపింది.  ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని..  స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే  వాస్తవాలు బయటపడతాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో ఇచ్చిన అప్పట్లో నివేదికను సుమోటో పిల్‌గా పరిగణించి విచారణకు స్వీకరించింది. అసలింతకీ  ఏం జరిగిందంటే..  అప్పటి కి ఎమ్మెల్యే అయిన కాకాణి గోవర్థన్  తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని.. కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. వెంటనే స్పందించిన చంద్రమోహన్ రెడ్డి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు ఫేక్ అని ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలోనే  కాకాణికి జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి  దక్కింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో నెల్లూరులోని కోర్టులో చోరీ జరిగింది.  ఈ దొంగతనం కేసులో.. కోర్టు నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చోరీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కాకాణి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాయం అయ్యాయని గుర్తించడంతో ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసునే సీబీఐకి అప్పగిస్తూ ఇప్పుడు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా    మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  ఫైల్స్ చోరీ ఘటనపై దర్యాప్తు  సీబీఐకి అప్పగిస్తే కాకాణి ఇరుక్కోవడం ఖాయమన్న చర్చ అప్పట్లోనే జోరుగా సాగింది.    నెల్లూరు కోర్టులో ఉన్న ఫైల్స్ చోరీ అయ్యాయని ముందుగా ఒప్పంద బెంచ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై అసలా ఫైల్స్ కోర్టు అధీనంలోనే లేవని, అవి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని హైకోర్టుకు నివేదిక సమర్పించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.   గుర్తు తెలియని వ్యక్తులతో బెంచి క్లర్కు నాగేశ్వరరావు కుమ్మక్కై కట్టుకథ అల్లాడని, పత్రాలు చోరీ అయ్యాయని కోర్టును తప్పదారి పట్టించాడని ఆ నివేదికలో జస్టిస్ యామిని పేర్కొన్నారు. అంతే కాకుండా  ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని తన నివేదికలో జస్టిస్ యామిని హైకోర్టుకు విన్నవించారు.  ఆ మేరకే ఇప్పుడు హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. 

ఏపీలో 2024లో 2014 ..?

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు పరిచయం అక్కరలేదు.ఆయన పేరుకు ముందు వెనక వైసీపీ రెబెల్ ఎంపీ అనే విశేషం తగిలించవలసిన అవసరం అసలే లేదు. ఆయన జగమెరిగిన రెబెల్. సన్నికల్లు తొక్కిన నాడే సంసారం యోగం తెలిసొచ్చింది’ అన్నట్లు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రఘురామ కృష్ణం రాజు, పొంచి ఉన్నజగన్ రెడ్డి సుందర ముదనష్ట పాలన ప్రమాదాన్నిగుర్తించారు. ఇక అక్కడి నుంచి, రచ్చబండ పెట్టి, జగన్ రెడ్డి దుర్మార్గ, దుష్ట పాలనను ఎండగడుతూ వస్తున్నారు. అందుకు, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. ఒక విధంగా అనేక కష్టాలను ఎదుర్కున్నారు.  అవును, అసలే ఆయన జగన్ రెడ్డి, పైగా ఏసు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే హాట్లైన్ సౌలభ్యమున్న దేవుని పుత్రుడు. దైవాంశ సంభూతుడైన ప్రభువు. అలా  అన్ని మహిమలు, మహత్తులు, అరాచక శక్తులు ఉన్న ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఆయన ఊరుకుంటారా? ఊరుకోరు, ఊరుకోలేదు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది .సామ దాన దండోపాయాలు ప్రయోగించి, ఆయన నోటికి తాళం వేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు పోలీసులకు పని చెప్పింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఒక ఎంపీ అని అయినా చూడకుండా తమదైన పద్దతిలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.ఆయన మారలేదు దారికి రాలేదు. అన్నిటినీ మించి ఆయన తన సొంత నియోజక వర్గంలో కాలుపెట్టకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఆయన ఎంపీగా గెలిచి మూడున్నరేళ్ళు అవుతున్నా,మొదటి ఐదారు నెలల్లో తప్పించి, ఆ తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో కాలు పెట్టలేదు. పెట్టలేదు అంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకత్వం ఆయన నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంది.   ఇదంతా నడుస్తున్న చరిత్ర. ఇక ప్రస్తుతంలోకి వస్తే, ఆయన ఐదేళ్ళ పదవీ కాలం ముగింపు కోస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.రాజకీయ యుద్ద సన్నాహాలు, పొత్తులు ఎత్తులపై చర్చలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా  ఉన్న నేపధ్యంలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపధ్యంలో రఘురామ కృష్ణం రాజు రాజకీయ భవిష్యత్ ఏమిటి? ఆయన మళ్ళీ నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? చేస్తే, ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.  వైసీపీ ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వదు. ఒక వేళ ఇచ్చినా,పుచ్చుకునేందుకు అయన సిద్దంగా లేరు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సో... ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న మళ్ళీ మరో మారు చర్చకు వచ్చింది. ఒకప్పుడు ఆయన బీజేపీలో చేరతారనే  ప్రచారం జరిగింది. మీడియాలో ముహూర్తాలు కూడా ఖరారయ్యాయి.మరోవంక  ఆయన కూడా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ నాయకులతో పాటుగా,నాగపూర్  ఆర్ఎస్ఎస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. పార్లమెంట్ లోపల వెలుపల కూడా ఆయన ఆర్ఎస్ఎస్ భాషలో మాట్లాడుతూ వచ్చారు. బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనకు వై కేటగిరీ రక్షణ కలిపించడంతో పాటుగా ఇతర సదుపాయాలు కల్పించింది. అయితే, ఏమైందో ఏమో కానీ,ఆయన బీజేపీలో అయితే చేరలేదు.  అయితే అదలా ఉంటే, ఇప్పడు పుణ్య కాలం పూర్తవుతున్న నేపధ్యంలో, ఆయన తమ రాజకీయ భవిష్యత్ తో పాటుగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ముఖ చిత్రం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.ఎవరు ఏ పార్టీలో చేరతారు,ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది,అనేది అప్రస్తుతం. ప్రజలు అయితే, ఒక నిర్ణయానికి వచ్చారు. అంతే కాదు, 2024 ఎన్నికలలో రెండు కాదు,మూడు ప్రధాన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తాయి, నిజానికి, జనం ఇప్పటికే జగన్ రెడ్డి పాలనకు వీడ్కోలు పలికేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి నాయకుల చేతిలో ఉందని, పార్టీలు కలవకపోతే నాయకులకే నష్టమన్నారు. ఇక తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమధానమే ఇచ్చారు. వైసీపీని ఓడించే ప్రధాన కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తానని, మర్మగర్భంగా అయినా, ఆయన ప్రధాన ప్రతిపక్ష (టీడీపీ) కూటమి తరపున పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. సరే, నేరుగా తెలుగు దేశం పార్టీలో చేరతారా లేక మరో రూట్’లో టీడీపీ కూటమితో జట్టు కడతారా అనే విషయాన్ని పక్కన పెడితే, నిస్సందేహంగా ఆయన టీడీపీ, చంద్రబాబు నాయుడు సారధ్యంలో టీడీపీ, బీజేపీ,జన సేన కూటమి ఏర్పడాలని కోరుకుంటున్నారు అనేది మాత్రం స్పష్టం చేశారు. అలాగే, ఆయన గద్దె దించేందుకు జట్టు కట్టే కూటమిలో రెండు పార్టీలు (టీడీపీ, జనసేన) ఖచ్చితంగా ఉంటాయని, మూడో పార్టీ (బీజేపీ) కూడా ప్రధాన ప్రతిపక్ష కూటమిలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని.. తేల్చి చెప్పారు. అంతే కాదు  కొంత తటపటాయిస్తూనే అయినా, ముసుగులో గుద్దులాట ఎందుకు.. ఓపెన్‌గా చెబుతున్నా, కచ్చితంగా మూడు పార్టీలు ఉంటాయన్నది తన నమ్మకమని స్పష్టం చేశారు. కొంతమంది రాష్ట్ర నాయకులు ఏమి చెప్పినా, ఏమి మాట్లాడినా, ఢిల్లీ నాయకత్వం మాత్రం మూడు పార్టీల కూటమి వైపే మొగ్గు చూపుతోందని, తన మనసులోని మాటను రఘురామ రాజు బయట పెట్టారు.  రఘురామ కృష్ణం రాజు వ్యక్త పరిచిన అభిప్రాయాన్ని, ఆయన ఆ మనసులోని మాటను, జరుగతున్న పరిణామాలను గమనిస్తే, 2024 లో 2014 పునరావృతం కావడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను, అదే విధంగా వైసేపీ ప్రభుత్వం గడప గడపన ఎదుర్కున్న వ్యతిరేకతను గుర్తించే, బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడిందని, అందులో భాగంగానే, జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై చర్చినేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో, వచ్చే నెల ( డిసెంబర్) 5న ఢిల్లీలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ఆహ్వానం అందిందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, బీజేపీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడుతో మైత్రీని కోరుకుంటున్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారని, గతంలో ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆజాదీకా అమృతోత్సవ్ పై జరిగిన సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రాబాబు నాయుడుతో కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడారు, ఢిల్లీ వస్తూ ఉండండని చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పలికారు. ఇక అప్పటి నుంచీ కూడా తెలుగుదేశం, బీజేపీల మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. డిసెంబర్ 5 సమావేశం తర్వాత ఈ దూరం మరింత తగ్గుతుందని, అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తెర వెనక సాగిస్తున్న  రాజకీయాలను పసిగట్టిన మోడీ, వారికి చెక్ పెట్టేందుకు చంద్రబాబుతో సఖ్యత కోరుకుంటున్నారని అంటున్నారు. అందుకే రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును అంటారు.అది నిజమే అనిపిస్తోంది.

మంత్రి మల్లారెడ్డిపై ఆర్నెళ్ల ముందునుంచే ఐటీ నజర్?!

ఐటీ దాడుల్లో మంత్రి మల్లారెడ్డి అడ్డంగా దొరికేశారా? కేంద్రంతో కాలు దువ్విన కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకే వరుసగా తెరాస నేతల నివాసాలు, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టాయా అంటే ఔననే పరిస్థితులే ఉన్నా.. మల్లా రెడ్డి వ్యవహారం కొంచం డిఫరెంట్ అంటున్నారు పరిశీలకులు. మల్లారెడ్డి వ్యాపారాలు, నివాసాలపై ఐటీ అధికారుల దాడులు కేవలం ప్రస్తతం ఉన్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో చేసినవే అనుకోవడానికి వీల్లేదంటున్నారు.  గత కొన్ని నెలలుగా మల్లారెడ్డి వ్యాపార కార్యక్రమాలపై, కార్యకలాపాలపై ఐటీ నజర్ పెట్టిందంటున్నారు. ఏదో రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించేందకు జరిగిన దాడులలో వీటిని లైట్ తీసుకోవడానికి వీల్లేనంతగా మల్లారెడ్డి ఇరుక్కున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి వ్యాపార కార్యక్రమాలు మ‌ల్లారెడ్డి వ్యాపారాల‌పై ఐటీ అధికారులు దాడులను ఒక‌టిరెండు రోజుల్లో ప్లాన్ చేసింది కాద‌ట‌. గ‌త ఆర్నెళ్లుగా ఐటీ అధికారులు మంత్రి మ‌ల్లారెడ్డి, వారి కుటుంబ స‌భ్యుల అకౌంట్‌ల‌లో న‌గ‌దు వివ‌రాల‌పైనా ఆరా తీస్తున్నారంటున్నారు.   రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులుగా, తమ భూమిని కొనుగోలు చేయాలంటూ మంత్రి వ‌ద్ద‌ ఐటీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించారని విశ్వసనీయంగా తెలిసింది. వీటన్నిటినీ బట్టి చూస్తే పక్కా ప్రణాళికతోనే మల్లారెడ్డి వ్యాపారాలపై  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.  మంగ‌ళ‌వారం(నవంబర్ 22) రాత్రి వేర్వేరు చోట్ల నిర్వహించిన సోదాలలో దాదాపు రూ.4 కోట్ల రూపాయల నగదు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన సీడీలు, కంప్యూటర్ డిస్క్ లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బుధ‌వారం(నవంబర్ 23)సైతం కీల‌క ప‌త్రాల‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం.   మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన ఐటీ దాడులు ముగిశాయి. సోమవారం నాడు తమ విచారణకు హాజరుకావాలంటూ మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  ఇప్పటి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో జరిపిన సోదాలలో స్వాధీనం చేసుకున్న నగదు వివరాలనూ ఐటీ అధికారలు వెల్లడించారు. ఆ ప్రకారం మల్లారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు, మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో - రూ. 12 లక్షలు, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసంలో - రూ. 3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో - రూ. 1.5 కోట్లు, త్రిశూల్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు, రఘునందన్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు, ప్రవీణ్ కుమార్ నివాసంలో - రూ. 2.5 కోట్లు, సుధీర్ రెడ్డి నివాసంలో - రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. 

ఎంసీడీ ప్రచారంలో బీజేపీ మోడీ భజన

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ తో రగిలిపోతోంది. అదేంటి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం సమయం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలూ ఇప్పట్లో లేవు. ఇక ఎన్నికల ఫీవర్ ఏమిటంటారా? ఔను మరి ఇప్పుడు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి వచ్చే నెలలో ఎన్నికలు జరగరనున్నాయి. అందుకు సంబంధించిన ప్రచారమే ఇప్పుడు ఢిల్లీని వాయు కాలుష్యాన్ని మించిన శబ్ద కాలుష్యంలో తల్లడిల్లేలా చేస్తోంది.  కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీజేపీ దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా విజయమే లక్ష్యం అన్నట్లుగా హడావుడి చేస్తోంది. హంగామా సృష్టిస్తోంది. అవి ఏ ఎన్నికలు, అక్కడ మనకు పార్టీ నిర్మాణం ఉందా, పార్టీ నిర్మాణం ఉందా? కార్యకర్తల బలగం ఉందా ఇవేమీ పట్టవు. రాజకీయం చేసైనా, ఇతర పార్టీలలో చిచ్చు రగిల్చి అయినా కాషాయ జెండా ఎగుర వేయాలి అంతే అన్నదే కమల నాథుల లక్ష్యంగా కనిపిస్తోంది. అవి అసెంబ్లీ ఎన్నికలైనా చివరాఖరికి స్థానిక ఎన్నికలైనా ఒకటే జపం, ఒకటే మంత్రం గెలుపు. ఇందు కోసం పార్టీ సిద్ధాంతాలను బీజేపీ ఎప్పుడో అంటే కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాడే పక్కన పెట్టేసింది. అప్పటి నుంచీ దేశ వ్యాప్తంగా అధికార విస్తరణ అన్నదే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలలో మునిగి తేలుతోంది. ఇప్పుడు ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల విషయంలోనూ బీజేపీ అదే పంథాను అనుసరిస్తోంది. అయితే ఢిల్లీలోనైనా, మరెక్కడైనా ఓటు అడగాలంటే తామేం చేశామో, ఏం చేస్తామో చెప్పుకోవాలి. కానీ ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ ఏం చేశామో చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేస్తామో చెప్పుకుంటే జనం నమ్ముతారన్న నమ్మకం లేదు. అందుకే బీజేపీకి ఎన్నికల ప్రచారంలో ఒకటే మంత్రం, ఒకటే జపం అదే మోడీ. నమో..నరేంద్రమోడీ. ఎన్నిక ఏదైనా, ఎన్నిక ఎక్కడైనా నమో జపమే గెలిపిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది. డబుల్ ఇంజిన్ లాంటి గంభీరమైన ప్రకటనలు.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, అభివృద్ధి లేమి ఇవే ఆ పార్టీకి ఇప్పటికీ ప్రచారాంశాలు.. అంటే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిదేళ్ల తరువాత కూడా బీజేపీకి తాను చేసిందేమిటో చెప్పుకోవడం కంటే.. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు, తప్పిదాలే ప్రచారాంశాలుగా మిగిలాయి. అందుకే మోడీయే పార్టీ ముఖచిత్రం అన్న నినాదంతో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రచారంలోకి దిగిపోయింది. మునిసిపల్ ఎన్నికలకు కూడా మోడీయేనా అన్న విపక్షాల విమర్శలను కమలనాథులు ఖాతరు చేయడం లేదు. తమ ప్రచారార్భాటంలో కాంగ్రెస్ విమర్శలు వినబడవన్నదే ఆ పార్టీ నేతల ధైర్యంగా కనిపిస్తోంది. ఢిల్లీ అభివృద్ధికి చేసిందేమైనా ఉంటే.. దానిని చూపి, వివరించి ఓట్లు అడగాలి.. కానీ అదేమీ లేనందునే మోడీ ముఖాన్ని ముందు పెట్టుకుని ప్రచార పర్వంలోకి దిగింది. స్టార్ క్యాంపెయినర్లను ప్రచారంలోకి దించేసింది. సినిమా సహా వివిధ రంగాల సెలబ్రిటీల సేవలనూ బీజేపీ వినియోగించుకుంటోంది. విశేషమేమిటంటే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కేంద్రంలో మోడీ సర్కార్ సాధించిన విజయాలనే ఏకరవు పెడుతోంది. మునిసిపల్ ఎన్నికలలో ఢిల్లీ గురించి మాట్లాడకుండా కేంద్రం విజయాలను వల్లెవేస్తోందేమిటని హస్తిన వాసులు ఆశ్చర్యపోతున్నారు. వారి ఆశ్చర్యాలూ, అభ్యంతరాలూ పట్టని బీజేపీ శ్రేణులు మోడీయే పార్టీకి దిక్కు అన్న రేంజ్ లో ఆయనను కీర్తించడానికే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని పరిమితం చేశారు. పైగా మోడీ మోడల్ ను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో తప్పేముంది అంటూ కమలనాథులు తమ ప్రచార తీరును సమర్ధించుకుంటున్నారు. ఆశ్చర్యమేమిటంటే.. 2007 నుంచీ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమలం అధీనంలోనే ఉంది. అంటే గత 15 సంవత్సరాలుగా ఎంసీడీలో కాషాయ జెండాయే ఎగురుతోంది. అంటే బీజేపీయే అధికారంలో ఉంది. మరి దశాబ్దంనరగా అధికారంలో ఉండి కూడా ఇన్నేళ్లలో ఢిల్లీ అభివృద్ధికి తామేం చేశామో చెప్పుకోగలిగే పరిస్థితి లేక మోడీ కరిష్మా మీదే ఆధారపడిందన్న మాట.  ఎంసీడీ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటి వరకూ కనీసం నలుగురు బీజేపీ ముఖ్యమంత్రులు హస్తినలో పర్యటించారు. అసోం ముఖ్యమంత్రి  హిమంతా బిశ్వా శర్మ, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్,  హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి లు ఎంసీడీ ప్రచారంలో పాల్గొన్నారు. రానున్న రోజులలో మరింత మంది జాతీయ స్థాయి నేతలు కూడా డిల్లీలో ప్రచారానికి వరుస కట్టనున్నారు.  ఇందుకు పకడ్బందీ ప్రచార ప్రణాళికను  రూపొందించారు. ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో రోడ్ షఓలు, బహిరంగ సభలకు ప్రణాళికలు రూపొందించారు. అలాగే బీజేపీ ప్రచార రథాలు సైతం ఎంసీడీ ఎన్నికలలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఆ ప్రచార రథాల నిండా మోడీ ఫటోలే. నుక్కడ్ నాటక్స్ పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున ఫ్లాష్ మాబ్స్ ను   నిర్వహిస్తోంది. లోకల్ రాక్ బ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇవి  యువ ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈ ప్రచార ఆర్భాటం చూసి ఢిల్లీ వాసులు విస్తుపోతున్నారు. ఎంసీడీ ఎన్నికల తరువాత మోడీ దేశ ప్రధానిగా ఉంటారా? లేక ఎంపీడీ మేయర్ గా బాధ్యతలు చేపడతారా అని ప్రశ్నిస్తున్నారు.    

ఆసుపత్రిలో చేరిన కమల్.. కారణమేమిటంటే?

సుప్రసిద్ధ నటుడు కమల్ హసన్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త ఆయన అభిమనాలల్లో కలవరం నింపింది. కమల్ హసన్ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఖంగారు పడాల్సిందేమీ లేదనీ, గురువారం(నవంబర్ 24) డిశ్చార్జ్ చేస్తామనీ వైద్యులు తెలిపారు. చాలా కాలం పాటు సరైన హిట్ లేక వెనుకబడిన కమల్ హసన్ ఇటీవలె విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టారు. దీంతో ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. కమల్ హసన్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీ అయినట్లు చెబుతున్నారు. విక్రమ్ సినిమా దాదాపు 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో కమల్ హసన్ ఫుల్ జోష్ మీద ఉన్నారు.  కాగా ఆయన బుధవారం(నవంబర్ 23) హైదరాబాద్ వచ్చి కళాతపస్వి విశ్వనాథన్ తో భేటీ అయ్యారు. ఇదేమైనా కథా చర్చల్లో భాగమా లేక మర్యాదపూర్వక భేటీయా అన్నది పక్కన ఉంచితే.. సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి గొప్ప సినిమాలు వీరి కలయికలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కమల్ హసన్, విశ్వనాథ్ ల బేటీ  సినీ వర్గాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వనాథ్ తో భేటీ తరువాత చెన్నై వెళ్లిన కమల్ హసన్ అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కమల్ హసన్ జ్వరంతో బాధపడుతున్నారనీ, అంతకు మించి మరే అనారోగ్యం లేదనీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనను గురువారం డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నాయి.  

పాపం శ్రద్ధావాకర్.. రెండేళ్లుగా నిత్యనరకం!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రేమించి ప్రియుడి కోసం తల్లిదండ్రులను వీడి వచ్చేసిన శ్రద్ధా వాకర్ 2019 నుంచి తనకు నచ్చిన అప్థాబ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. ఏడాది పాటు వారి సహజీవనం సంతోషంగానే సాగింది. అయితే 2020 నుంచి అప్తాబ్ ఆమెకు నిత్యం నరకం చూపేవాడని విచారణలో వెలుగులోకి వచ్చింది. అప్తాబ్ తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ శ్రద్ధావాకర్ 2020లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హత్య చేయడానికి ప్రయత్నించాడని కూడా ఆ లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా 2019లో దగ్గరైన శ్రద్ధ, అఫ్తాబ్‌లు అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్నారు.   శ్ర‌ద్ధావాకర్ పెళ్లి కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించినప్పటి నుంచీ అంటే వారి సహజీవనం మొదలైన ఏడాది తరువాత నుంచి అప్తాబ్ చిత్రహింసలు మొదలయ్యాయని ఆమె ఫిర్యాదును బట్టి అర్ధమౌతుంది.  అప్తాబ్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయం అతని తల్లిదండ్రులకూ తెలుసునని శ్రద్ధావాకర్ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ తరువాత అప్తాబ్ తల్లిదండ్రుల జోక్యంతో ఇకపై గొడవలు పడకుండా జీవిస్తామని అప్తాబ్ పోలీసులకు మరో లేఖ ఇచ్చింది. కానీ అప్తాబ్ తనను చిత్రహింసలకు గురి చేసిన సందర్భంగా గాయాలతో ఉన్న తన ఫొటోలను స్నేహితులకు షేర్ చేసింది. ఆ సమయంలోనే ఆమె గాయాలతో ఆసుపత్రిలో కూడా చేరింది. పెద్దల జోక్యంతో శ్రద్ధా మళ్లీ అప్తాబ్ తో కలిసి సహజీవనం కొనసాగించింది. అయితే శ్రద్ధావాకర్ కు అప్తాబ్ నిత్యనరకం చూపాడు. ఆ విషయాలన్నీ స్నేహితులకు చెప్పుకుని బాధపడేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ క్రమంలోనే అప్తాబ్ శ్రద్ధాను ఈ ఏడాది మేలో హత్య చేశాడు. శ్ర‌ద్ధాను హ‌త్య‌ చేయాల‌ని  ఆఫ్తాబ్ ప్లాన్ వేసుకొని ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆఫ్తాబ్ మాత్రం ఆవేశంలో శ్ర‌ద్ధాను హ‌త్య‌చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో, ఇటీవ‌ల కోర్టులో చెప్పాడు. ఆఫ్తాబ్ నుంచి అస‌లు నిజాలు రాబ‌ట్టేందుకు కోర్టు నార్కో పరీక్షలకు  అనుమ‌తినిచ్చింది. కాగా న‌మ్మి వ‌చ్చిన ప్రియురాలిని అతి కిరాత‌కంగా హ‌త్య‌చేసిన ఆఫ్తాబ్‌ను ఉరితీయాల‌ని దేశ‌వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు.. సూర్యకుమార్ యాదవ్

టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశం లేటైందేమో రావడం అయితే వచ్చాడు. వచ్చీ రావడంతోనే రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాడు. డివీలియర్స్ తరువాత 360 డిగ్రీల బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనతి కాలంలోనే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి ఎగబాకాడు. అంతే కాదు ర్యాంకింగ్ లో రెండో స్థానంలో బ్యాటర్ తొలి స్థానం గురించి ఊహించడానికే అవకాశం లేనంత అంతరం ఉంచుకున్నాడు. ఔను ఐసీసీ తాజాగా వెలువరించిన టి.20 ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే.. రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ రేటింగ్ పాయింట్స్ 836. అంటే ఇద్దరి మధ్య ఉన్న తేడా 54 రేటింగ్ పాయింట్స్ మూడో స్థానంలో కివీస్ బ్యాటర్ డేవన్ కాన్వే 788 పాయింట్లు, నాలుగో స్థానంలో బాబర్ అజాం 778 పాయింట్లు ఉన్నారు. ఇక కింగ్ కోహ్లీ న్యూజిలాండ్ లో సిరీస్ కు దూరం అవ్వడంతో రెండు స్థానాలు దిగజారి 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 బౌలింగ్ విభాగంలో ఒక్క భార‌త బౌల‌ర్ కూడా టాప్‌-10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. సీనియ‌ర్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 11 స్థానంలో నిలువ‌గా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన అర్ష‌దీప్ సింగ్ ఒక స్థానం ఎగ‌బాకి 21వ స్థానం, చాహ‌ల్ 40వ స్థానంలో కొన‌సాగుతున్నారు. 704 పాయింట్ల‌తో లంక స్పిన్న‌ర్ హస‌రంగా అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకోగా అఫ్గాన్ స్పిన‌ర్ ర‌షీద్ ఖాన్‌, ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్ లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

గురివింద.. పరనింద

ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం సాక్షిగా.. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అంటూ.. జనసేన పార్టీ అంటే రౌడీల పార్టీ అంటూ కొత్త భాష్యం చెప్పడంపై నెటిజనులు...  సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  అంతేకాదు వైసీపీ అధినేత వైఖరి గురివింత సామెతను గుర్తుకు తెస్తోందంటూ.. సోషల్ మీడియాలో సోదాహరణలతో ఎండగడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన తొలి కేబినెట్‌లోని పంచ్ పటాకాలు.. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు.. ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై బూతుల వర్షం కురిపించేవారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇక పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేరు అయితే.. బూతు సరఫరాల శాఖ మంత్రిగా ముద్ర పడిపోయిందని... అలాగే నాటి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నోటి పారుదల శాఖ మంత్రిగా ఖ్యాతి  గడించారని గుర్తు చేస్తున్నారు...  పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, కురసాల కన్నబాబులు కూడా  ప్రెస్ మీట్ పెట్టి సామిరంగా.. రంగ రంగా అంటూ ఊగిపోయే వారని నెటిజనులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. అంతదాక ఎందుకు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేశ్‌ తదితరులకు జగన్ మలి కేబినెట్‌లోని చోటు దక్కిందంటే.. అదంతా.. బూతుల మహిమే కదా అని ప్రశ్నిస్తున్నారు. అదీకాక.. విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా మంత్రి ఆర్కే రోజా.. మిడిల్ ఫింగర్ చూపించడం పట్ల.. ఎయిర్ పోర్ట్ సిబ్బందే కాదు.. అక్కడి వారంతా ముక్కు మీద వేలేసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు సైతం పేర్కొన్నారని సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. జగన్ తొలి కెబినెట్‌లో అయినా.. మలి కేబినెట్‌లో అయినా.. మంత్రిగిరి దక్కిందంటే.. అదంతా.. బూతు కాల మహిమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన... ఈ మూడున్నరేళ్ల కాలంలో .. ఆయన కేబినెట్‌లోని మంత్రులు చేసిన బూతు  పద ప్రయోగాలు.. సదరు ముఖ్యమంత్రి గారికి కడు కమనీయంగా.. రమణీయంగా.. వినసొంపుగా ఉన్నాయని.. నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యంగ్య బాణాలు  సంధిస్తున్నారు. అదీకాక అధికార ఫ్యాన్ పార్టీలోని నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతి, దాడులు, ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలు పడుతోన్న ఇబ్బందులును ఏ మాత్రం ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని.. వాటిని ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు.. ఎప్పటి కప్పుడు ఎత్తి చూపడంతో.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తట్టుకోలేక ఓ విధమైన ఆందోళనకు గురవుతున్నారని.. ఆ ఆందోళనే నరసాపురం వేదికగా.. ముఖ్యమంత్రి మాటల్లో ప్రతిఫలించిందనీ అంటున్నారు. ఏదీ ఏమైనా ముఖ్యమంత్రి   జగన్‌ తీరు గురివింద సామెతను గుర్తుతెస్తోందనీ, అని.. ఆయన నైజం  పరనింద అని తేటతెల్లమైందని నెటిజన్లు అంటున్నారు. 

చాలు బాబూచాలు.. ప్రభుత్వ సలహాదారు నియామకాలపై పార్టీ శ్రేణుల్లోనే పెదవి విరుపు !

ఈ కలికాలంలో దేవుడు కరుణిస్తాడో? లేదో? కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అస్మదీయులను తెగ కరుణించేస్తున్నారు. అయితే ఆయన కరుణ.. వైసీపీ శ్రేణుల్లోనే ఒకింత అసంతృప్తికి కారణమౌతోందంటున్నారు. సలహారుల పేరిట జగన్ ఎడాపెడా చేస్తున్న నియామకాల పట్ల వైసీపీలోనే చిర్రుబుర్రులు మొదలయ్యాయని అంటున్నారు. తాజాగా గాయని మంగ్లీని.. శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ)లో సలహాదారుగా నియమించడం పట్ల  వైసీపీలోనే  విస్మయం  వ్యక్తమౌతోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నటులు ఆలీ, పోసాని కృష్ణమురళీలకు ఇటీవల జగన్ ప్రభుత్వం.. సలహాదారు పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలువురు సలహాదారుల నియామకాలు జరిగాయి. ఈ సలహాదారు నియామకాల పట్ల విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లల చెల్లింపులకు ఎగనామం పెట్టి, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలన్న ధ్యాసే లేకుండా వ్యవహరిస్తున్న సర్కార్ అస్మదీయులకు ఎడాపెడా లక్షల రూపాయల వేతనాలతో సలహాదారు పదవులు పందేరం చేయడమేమిటని వైసీపీ శ్రేణుల్లోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జగన్ సర్కార్ బిల్లులు ఎగ్గొట్టిన కాంట్రాక్టర్లలో వైసీపీ వారూ ఉన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.  తాజాగా మంగ్లీకి సలహాదారు పదవిని కట్టబెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ఈ నియామకాల వెనుక పెద్ద కథే ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  గతంలో అంటే.. 2019 ఎన్నికల వేళ.. అలీ, పోసాని, మంగ్లీలు ముగ్గురూ కూడా  వైసీపీ కోసం పని చేశారనీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలలో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వీరికీ పదవులను కట్టబెట్టారని అంటున్నాయి. ఒక వేళ పదవులు ఇవ్వకుంటే వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయరన్న భయంతోనే జగన్ ముగ్గురికీ సలహాదారు పదవులు కట్టబెట్టారని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో అలీ, పోసానిలకు మంచి స్థానాలు కల్పిస్తానని జగన్ వాగ్దానం చేశారనీ, అందుకే సలహాదారు పదవులను వారికి కట్టబెట్టినా వారు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారనీ, ఈ పరిస్థితుల్లో వారు వచ్చే ఎన్నికల్లో గతంలోలా పార్టీ కోసం చురుగ్గా పని చేసే అవకాశాలు అంతంత మాత్రమేనని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక మంగ్లీ విషయానికి వస్తే అలీ, పోసానిలకు పదవులు ఇచ్చి.. మంగ్లీని వదిలేస్తే ఆమె చిన్నబుచ్చుకుంటుందన్న ఉద్దేశంతోనే ఆమెకూ ఒక పదవి ఇచ్చారని అంటున్నారు.  అదీకాక.. వచ్చేది ఎన్నికల సీజన్.. ఇప్పటికే జగన్ ఫ్యామిలీలోని వారంతా దాదాపుగా దూరం జరిగిపోయారని.. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున, పార్టీ కోసం సెలబ్రిటీల ప్రచారం లేకుంటే.. ఓట్లు రాలే పరిస్థితులు లేవన్న బెదురు జగన్ లో ఏర్పడిందంటున్నారు. అందుకే ఇప్పటికీ పార్టీనే అంటిపెట్టుకుని అసంతృప్తిని పెదవుల బిగువున అదిమిపెట్టుకుని సహనంతో వేచి చూస్తున్న ముగ్గురికీ సలహాదారు పదవులు కట్టబెట్టారన్న చర్చ అయితే పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ మాత్రం పదవులైనా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో వీరు కూడా పార్టీ ప్రచారానికి అందుబాటులోకి రారన్న జంకే వారికి పదవులు కట్టబెట్టేలా చేసిందని అంటున్నారు. లేకపోతే మూడేళ్ల పాటు వారిని పూర్తిగా విస్మరించిన జగన్ ఇప్పటి కిప్పుడు హడావుడిగా సలహాదారు పోస్టులను వారి కట్టబెట్టి ఉండరని అంటున్నారు. అదలా ఉంచితే.. మంగ్లీకి ఎస్వీబీసీ సలహాదారు పోస్ట్ కట్టబెట్టడంతో.. గత ఎన్నికల సందర్భంగా ఆమె జగన్ కోసం ప్రచారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గత ఎన్నికల వేళ ప్రచారం చేసినందుకు...  దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఆలీ, పోసాని, మంగ్లీలకు పదవులిచ్చి జగన్ వచ్చే ఎన్నికల్లో   పార్టీ కోసం పని చేస్తామన్ వాగ్దానం తీసుకున్నారని అంటున్నారు.   ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. జగన్ సలహాదారుల నియామకాలు మరింత జోరందుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జగన్ సలహాదారులుగా నియమిస్తున్న వారి ప్రచారం రానున్న ఎన్నికలలో పార్టీకి ఎంత వరకూ మేలు చేస్తుందన్న అనుమానాలు పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. అలీ కానీ, పోసాని కానీ, చివరాఖరికి మంగ్లీ కానీ పెద్దగా ప్రజాకర్షణ శక్తి ఉన్నవారు కాదని వారీ సందర్బంగా అంటున్నారు.  

ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల పస్తులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరికి రోగులకు కూడా అన్నం పెట్టలేని దౌర్బాగ్య స్థితికి చేరుకుంది. కోససీమలోని ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం(నవంబర్ 22) నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు భోజనం సరఫరా బంద్ అయ్యింది. దీంతో ప్రభుత్వాస్పత్రులలో రోగులు రెండు రోజులుగా పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. నెలల తరబడి  భోజనం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడంతో వారు భోజన సరఫరా బంద్ చేసేశారు. కొనసీమలోని మొత్తం 11 ప్రభుత్వాసుపత్రుల్లోనే ఇదే పరిస్థితి.. లక్షల్లో బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తామింక ప్రభుత్వాస్పత్రులకు భోజనాలు సరఫరా చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.  కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 38లక్షల రూపాయలకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. భోజనాల సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రుల్లో రోగులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. జగన్ సర్కార్ నిర్వాకం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ పనులు అవి ఎంత చిన్నవైనా సరే చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమే కాదు.. బిల్లుల గురించి అడిగితే బెదరింపులూ, దబాయింపులూ ఎదురౌతున్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిల్లులు పెండింగ్ లో పడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారిలో వైకాపాకు చెందిన వారూ ఉన్నారు. డబ్బుల ఎగవేతలో జగన్ సర్కార్ కు తనా పరా బేధం లేదని అంటున్నారు. వాడుకోవడం.. ఆపై ఎంగిలి విస్తరాకులా విసిరేడం అనేది జగన్ సర్కార్ తీరుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇక కోనసీమ ప్రభుత్వాప్పత్రుల్లో భోజన కాంట్రాక్టులకు సంబంధించిన బకాయిల విషయానికి వస్తే అత్యధికంగా అమలాపురం  ప్రభుత్వాసుపత్రిలో అత్యధికంగా 13 లక్షల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే  రామచంద్రాపురంలో రూ. 9 లక్షలు, కొత్తపేటలో రూ. 6 లక్షలు, రాజోలులో రూ. 5 లక్షలు, అల్లవరం, కపిలేశ్వరంలో రూ. లక్ష, చొప్పున, ఆలమూరులో రూ. 91వేలు, ముమ్మడివరంలో రూ. 81వేల బిల్లులు నిలిచిపోయినట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.  కు భోజనాలు అందిస్తున్నాయి.

కెప్టెన్సీకి విండీస్ స్టార్ బ్యాటర్ పూరన్ గుడ్ బై

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఆ వరల్డ్ కప్ లో విండీస్ ఘోరంగా ఆడి కసీనం సూపర్ 12 దశకు కూడా వైదొలగిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ లోనే జింబాబ్వే చేతిలో చిత్తై పూరన్ సేన ఇంటి ముఖం పట్టింది. టి20లలో రెండు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన విండీస్ ఇంతఘోరంగా విఫలం కావడంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి గుడ్ పై బెబుతున్నట్లు పూరన్ ప్రకటించారు. ఇన ఇస్టాలో ఈ విషయాన్ని పూరనే స్వయంగా వెల్లడించాడు. కీరన్ పోలార్డ్ రిటైర్ మెంట్ తో పూరన్ కు విండీస్ క్రికెట్ జట్టు సారథ్య  బాధ్యతలను ఆ దేశ క్రికెట్ బోర్డు పూరన్ కు అప్పగించింది. కానీ కనీసం ఏడాది కూడా పూరన్ కెప్టున్ గా కొనసాగకుండానే సారథ్యాన్ని వదులుకున్నాడు. “టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న   తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. అప్ప‌టి నుంచి కెప్టెన్ గా కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నా.. చివరకు సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు. 15 వన్డేలు, 15 టి20లకు విడీస్ కెప్టెన్ గా పూరన్ ఉన్నాడు. 

మంత్రి మల్లారెడ్డి.. అతికి పోయి అడ్డంగా దొరికారా ?

మంత్రి మల్లారెడ్డి ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ నాయకునిపై ప్రశంసలు కురిపిస్తారు. వీర విధేయత చూపిస్తారు. తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆయన ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే, పార్టీ మారి తెరాసలో చేరిన తర్వాత ఆయన ఇన్స్టంట్ గా గులాబీ బాస్ కి వీరాధీ వీర విధేయుడిగా మారిపోయారు. చంద్రబాబును స్తుతించిన కీర్తనలనే, పేరు మార్చి, కేసీఆర్ పేరున ఆలపించారు. అదే సమయంలో ఆయన, తనను తాను గొప్పగా చూపుకున్నారు. మోడీ చాయి అమ్మి ప్రధాని అయితే, తను పాలమ్మి మంత్రిని అయ్యాయని గొప్పలు చెప్పుకున్నారు.  సైకిల్ మీద ఇంటినికి వెళ్లి పాలు అమ్ముకున్న రోజుల నుంచి విద్యా వ్యాపారంలో ఆయన  ఎక్కిన మెట్లు, సంపాదించిన కరెన్సీ కట్టలు మొదలు, రాజకీయాల్లో ఎదిగిన తీరు గురించి... బహిరంగంగా దాపరికం లేకుండా, చెప్పుకుంటారు. వందల వేల కోట్ల రూపాయలు, లెక్కకు చిక్కని ఆస్తులు సంపాదించిన వైనాన్ని, బహిరంగ వేదికల నుంచి హరి కథ, బుర్ర కథ చెప్పినట్లు, అన్నీ నేనే, అంతా నేనే’ అని చెప్పుకుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ఒక విధంగా, ముక్కలు తిని బొక్కలు మెళ్ళో వేసుకున్నట్లుగా, గుంభనంగా దాచుకోవలసిన రహస్యాలను ప్రపంచం ముందు చాటింపు వేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. ఇది ఆయన అమాయకత్వం అనాలో, బోళాతనం అనాలో లేక అతి తెలివి అనాలో తెలియదు కానీ, ఒక విధంగా ఆయన స్వయంగా చాటింపు వేసుకున్న,‘సుగుణాలే’ ఇప్పడు ఆయం మెడకు చుట్టూ కున్నాయని, ఆయన సన్నిహితులు అంటున్నారు.  నిజానికి నేటి రాజకీయాల్లో, వ్యాపారంలో నీతివంతులు,నిజాయతీ పరులు ఉంటారని అనుకోవడం అయితే మన అజ్ఞానం కాదంటే మన అవివేకం అనిపించు కుంటుందే కానీ, మరొకటి కాదు. నేతి బీరకాయలో నెయ్యి, రాజకీయాల్లో నీతి ఉండవుగాక ఉండవని అందరికీ అర్థమై పోయింది. అలాగని మల్లా రెడ్డి, ఏ తప్పు చేయలేదని కానీ, ఆయన సినిమాల్లో చిరంజీవి రిక్షా తొక్కి, రాళ్లు కొట్టి  కోట్లు సంపాదించినట్లు, నిజజీవితంలో మాలా రెడ్డి కష్టపడే, కోట్లకు పడగ లెత్తారని కాదు. ఆయన చేసిన తప్పులను సమర్ధించడం అసలే కాదు కానీ, మల్లా రెడ్డిని మించిన మహాను భావులు, మహా కుబేరులు తెరాసలోనే చాలా మంది  ఉన్నారు.నిజానికి, అక్రమమా, సక్రమమా,అనేది పక్కన పెడితే మల్లారెడ్డి రాజకీయాలలోకి రాక ముందే కోట్లలో ఆస్తులు సంపాదించారు.విద్యావ్యాపారంలో,కాంట్రాక్టులు ఇతర వ్యాపారాలలో కోట్లకు కోట్లు సంపాదించారు. రాజకీయాలలోనూ ఆయన మరిన్ని కోట్లు సంపాదించి ఉంటే సంపాదించి ఉండవచ్చును కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో చిల్లి గవ్వకు టికాన లేని చాల మంది, పెద్దలు, ముఖ్య నాయకుల కుటుంబాలు ఈరోజున కుబేరుని సరసన కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఎవరి దాకానో ఎందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే అలాంటి ఆరోపణలు ఎదుర్కుంటోంది. నిజా నిజాలు ఎలా ఉన్నప్పటికీ  తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యుల అస్తుల లెక్కలు తీస్తే, మల్లారెడ్డి చాల గొప్పగా చెప్పుకునే వేల కోట్ల ఆస్తులు చిన్నబోతాయని అంటారు.  సరే, ఆ విషయం ఎలా ఉన్నా, ఇప్పడు  మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై జరుగుతున్న దాడులు,ఆయన్ని,ఆయన కుటుంబం మొత్తాన్ని, చిక్కులోకి నెట్టివేసిందని,ఆయన సన్నిహితులే అంటున్నారు. రేపు కేసు ఏమవుతుంది, ఏమిటనేది పక్కన పెడితే,  మంగళవారం(నవంబర్22) ఉదయం నుంచి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, వ్యాపార, విధ్యా సంస్థలు లక్ష్యంగా సాగుతున్న ఐటీ దాడులు సృష్టించిన టెన్షన్ కారణంగా  కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్నాయి. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి హైపర్ టెన్షన్ వల్ల అస్వస్ధతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. సూరారంలోని నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న కుమారుని పరామర్శించేందుకు వెళ్ళిన మల్లారెడ్డిని, ఐటీ అధికారులు లోపలి అనుమతించే లేదు. దీంతో ఆయన, ఐటీ అధికారులు తన కొడుకుని చూడనివ్వడం లేదంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు అనుచరులు కూడా ఆస్పత్రి ముందు మెట్లపై కూర్చోని ఆందోళనకు చేపట్టారు. అయితే, మల్లారెడ్డి కుమారుడు, మహేందర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని, హైపర్ టెన్షన్ వల్ల అస్వస్ధతకు గురైనట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పారు. మరోవంక మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి కూడా అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అతడిని కూడా ఐటీ అధికారులు సూరారంలో మహేందర్ రెడ్డి చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.  అయితే ఈ మొత్తం వ్యవహారంలో మల్లారెడ్డి తనకు తానుగా సమస్యలు సృష్టించుకున్నారని, అతికి పోయి అనర్ధాలు కొని తెచ్చుకున్నారని, ఆయన సన్నిహితులు అంటున్నారు. అందుకే ఇప్పటికైనా, మల్లారెడ్డి మాత్రమే కాకుండా, తమను తాము అతిగా ఉహించుకుని, హద్దులు దాటుతున్న రాజకీయ నాయకులు అందరికీ ఈ ఉదంతం ఒక గుణపాఠం కావాలని అంటున్నారు.

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు నోటీసులు

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఐటీ, ఈడీ, సీబీఐ ఇంకా సిట్ నోటీసుల హంగామా నడుస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు ఇప్పుడు నోటీసులు అంటే ఉలిక్కి పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు కూడా ఓ నోటీసు అందింది.   అయితే ఈ నోటీసు ఏదో దర్యాప్తు సంస్థ నుంచి కాదు. అక్రమ సంపాదన, కబ్జాలు, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించినది అంత కంటే కాదు. కానీ గోవాలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించాడంటూ ఆయనకు టూరిజం శాఖ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ యువరాజ్ సింగ్ చేసిందేమిటయ్యా అంటే.. గోవాలోని తన విల్లాను అద్దెకు ఇస్తానంటూ  ఒక ఆన్లైన్ ప్రకటన ఇవ్వడం.  ఆన్లైన్ ప్రకటన ఇస్తే నోటీసులేమిటంటారా.. గోవాలో ఎవరైనా సరే తమ విల్లాలు కానీ, నివాసాలు కానీ అద్దెకు ఇవ్వదలచుకుంటే తప్పని సరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. అయితే యువరాజ్ సింగ్ అలా రిజిస్టర్ చేయించుకోకుండా తన విల్లాను అద్దెకు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. దీంతో యువరాజ్ సింగ్ కు నోటీసులు జారీ చేసిన గోవా టూరిజం శాఖ వచ్చే నెల 8న వ్యక్తిగతంగా తమ ఎదుటకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

జాతీయ రాజకీయాలలో చంద్రబాబుకు పెరిగిన ప్రాధాన్యత!

టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ స్థాయిలో మళ్లీ చక్రం తిప్పేందుకు రాజకీయ వాతావరణం అనుకూలంగా మారుతోందా? అంటే.. తాజాగా  పరిణామాలను గమనిస్తే.. అవుననే సమాధానం రాక తప్పదు. మొన్నా మధ్య ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ విషయమై చర్చించేందుకు రాజకీయ దురంధరుడైన చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ జరిగిన ఆ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడి చేయి పట్టుకుని మరీ ప్రధాని మోడీ ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడడం యావత్ ప్రపంచాన్నీ ఆకర్షించింది.  2019 ఎన్నికల తర్వాత మోడీ- బాబు కలుసుకోవడంపై అదే మొదటి సారి కావడంతో ఆ ప్రత్యేక మాటా ముచ్చట రాజకీయంగా ఆసక్తి రేపింది. తాజాగా.. మరోసారి ఢిల్లీ పెద్దల నుంచి చంద్రబాబు   ఆహ్వానం వచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరవ్వాలని చంద్రబాబును కేంద్రం కోరింది. 2022 డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. జీ20 దేశాల కూటమికి  వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి 2023 నవంబర్ 30 తేదీ వరకూ భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఈ క్రమంలో భారత్ లో నిర్వహించే జీ10 భాగస్వామ్య దేశాల సమావేశాలపై దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో  చర్చించి, వారి నుంచి సూచనలు, సలహాలూ తీసుకోవాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. అందుకోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ లో వచ్చే నెల 5న  జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపడం గమనార్హం. ఆ సమావేశం ప్రాధాన్యతను   చంద్రబాబుకు ప్రహ్లాద్ జోషి ఫోన్ లో వివరించి మరీ హాజరు కావాలని కోరారు. కేంద్రప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు మరోసారి డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్తారు.   అయితే.. చంద్రబాబుకు కేంద్రం నుంచి తరచుగా ఆహ్వానాలు వస్తుండడం    తెలుగు రాష్ట్రాల్లో  ఉత్కంఠ రేపుతోంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు.. పొలిటికల్  స్ట్రాటజీల్లో అపర చాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు అవసరాన్ని మోడీ గుర్తించారని అంటున్నారు.  ఏపీలో ఎలాగైనా తన ఉనికిని ప్రదర్శించాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న బీజేపీకి ఇప్పుడు చంద్రబాబుతోనే అది సాధ్యం అవుతుందనే వాస్తవం బోధపడి ఉంటుందని, అందుకే బాబుతో చెలిమి కోసం, ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు కమలం పార్టీ పెద్దలు యత్నాలు చేస్తున్నారని  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేస్తానంటూ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ చీఫ్ పవన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. అది కేవలం జనసేన- బీజేపీ పార్టీల మైత్రితో మాత్రమే సాద్యం కాదనే తత్వం బీజేపీ పెద్దలకు బోధపడిందని, చంద్రబాబు సహకారం కూడా ఉంటేనే  వైసీపీని మట్టికరిపించగలమనే నిర్ణయానికి మోడీ-షా డబుల్ ఇంజిన్ వచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. మరో పక్కన రాష్ట్రస్థాయిలోని టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయి పార్టీగా మారుస్తూ.. బీఆర్ఎస్ ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక విధంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపైన మోడీ-షా ద్వయంపైన యుద్ధం ప్రకటిస్తున్నారు. పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా బీఆర్ఎస్ ను పోటీలో దింపే వ్యూహాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. దూకుడుగా అడుగులు వేస్తున్న కేసీఆర్ కు చెక్ చెప్పాలంటే.. చంద్రబాబు తోడ్పాటు కూడా అవసరం అని ఢిల్లీ పెద్దలు గుర్తించారంటున్నారు. దాంతో పాటు.. తెలంగాణలో ఎలాగైనా అధికార పీఠం ఎక్కాలని తహతహలాడుతున్న కమలం పార్టీ అక్కడ గట్టెక్కాలంటే పూర్తిస్థాయిలో తన బలాన్ని మోహరించినా ఫలితాలు అటూ ఇటూ కావచ్చనే అనుమానం ఏదో అంతర్లీనంగా బీజేపీలో ఉందనే అంచనాలు ఉన్నాయి. అందుకే తెలంగాణలో మంచి కేడర్ బలం ఉన్న టీడీపీని, చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటే.. రాష్ట్రంలో అధికారం తమకు దక్కుతుందన్న భావన   బీజేపీ పెద్దల్లో ఉందని తెలుస్తోంది. గతంలోనే కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా చక్రం తిప్పిన అనుభవం చంద్రబాబుకు ఉంది. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మద్దతుతో పాటు.. కేంద్ర రాజకీయాల్లోనూ ఆయన గత అనుభవాన్ని కేంద్రంలోని పెద్దలు వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సమయం చిక్కినప్పుడల్లా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవాలని, తద్వారా దక్షిణ భారత దేశంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ తన ఉనికిని చూపించుకోవాలని భావిస్తోందనే అంచనాలు వస్తున్నాయి.

చంద్రబాబుతో మోడీ మరోసారి... హస్తినకేగనున్న తెలుగుదేశం అధినేత

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో సారి హస్తిన నుంచి పిలుపు వచ్చింది. ఏదో ఆహ్వానం పంపాం అన్నట్లుగా కాకుండా.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన హస్తినకు రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇంతకీ కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం ఎందుకు అందిందంటే.. భారత్ లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో చర్చించి సలహాలు తీసుకోవాలని మోడీ భావించడం వల్ల. ఇందు కోసం అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో డిసెంబర్ 5న హస్తినలో మోడీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికే చంద్రబాబుకు ఆహ్వానం అందింది. మామూలుగా అయితే దేశంలో అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు అందినట్లుగానే చంద్రబాబుకు ఆహ్వానం అందింది అనుకోవాలి.. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబుకు ఆహ్వానం, ఆ తరువాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేకంగా ఫోన్ చేయడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా అంటే ఈ ఏడాది ఆగస్టులో మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ పై జరిగిన సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అప్పటి నుంచీ కూడా తెలుగుదేశం, బీజేపీల మధ్య మరో సారి సఖ్యత కుదురుతుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతూనే వస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబుతో మోడీ కొద్ది సమయమే అయినా ప్రత్యేకంగా సంబాషించడం ఎనలేని రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే వచ్చే నెల 5న చంద్రబాబు హస్తిన పర్యటనలో కూడా మోడీ, బాబుల మధ్య ప్రత్యేక భేటీ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

భారత్ జోడో యాత్ర సక్సెస్.. మరి కాంగ్రెస్ జోడో మాటేమిటి ...?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. సెప్టెంబర్ 7 న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన యాత్ర, తమిళ నాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహరాష్ట్ర మీదగా, మధ్య ప్రదేశ్ లో ప్రవేశించింది. రాహుల్ యాత్ర సాగిన అన్ని రాష్ట్రాలలో ప్రజల స్పందన అధ్బుతంగా ఉందని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. అంతే కాదు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే మరో అడుగు ముందుకెళ్ళి, రాహుల గాంధీ జోడో యాత్రకు వస్తున్న విశేష స్పందన, ప్రధాని మోడీని భయపెడుతోందని, ఆయన వెన్నులో చలి పుట్టిస్తోందని అన్నారు. మోడీని రాహుల్ భయం పట్టుకుందని, అందుకే ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని, నిరాధార నిందలు మోపుతున్నారని ఖర్గే  అంటున్నారు.  నిజమే  రాహుల్ గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ముఖ్యంగా రాజకీయాలతో సంభంధం లేకుండా యువతీ యువకులు, విద్యార్ధులు, చిన్నారులు, మహిళలు,  రైతులు, కార్మికులు ఇలా అన్నివర్గాల ప్రజలు రాహుల్ గాంధీ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆటపాటలతో, ఆడుతూ పాడుతూ రాహుల్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మధ్య మద్యలో సినిమా స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇంకో విశేషం ఏమంటే, తెలంగాణ సహా రాహుల్ గాంధీ యాత్ర జరిగిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నాయకులు  తమ మధ్య ఉన్న విభేదాలు మరిచి, అంతా ఒకటిగా కష్టపడి యాత్రను సక్సెస్ చేశారు. అయితే, అసలు కథ ఆతర్వాతనే ప్రారంభమవుతోంది. కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత రాహుల్ యాత్ర వరకే పరిమితమనే విషయం తేలిపోయింది.  తెలంగాణ విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో రాహుల్ గాంధీ యాత్ర ఒక విధంగా జరగ కూడని సమయంలో జరిగింది. ఓ వంక మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యనేతలంతా మునిగి తేలుతున్న సమయంలో రాష్ట్రంలో రాహుల్ యాత్ర మొదలైంది. అయినా నాయకులు ఇటు యాత్రను, అటు ఉప ఎన్నిక ప్రచారాన్నిసమాంతరంగా సాగించారు. సరే  మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయినా రాహుల్ యాత్ర మాత్రం సక్సెస్ అయిందనే సంతోషం కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గానికి  ఒక విధమైన ఊరట మిగిల్చింది.   కానీ ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అన్నది గమనిస్తే రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలు మళ్ళీ  మొదటి కొచ్చాయి. మొదటికి రావడం కాదు  పతాక స్థాయికి చేరాయి. కాంగ్రెస్ సీనియర్లకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య ఇంతవరకు కొంత చాటుమాటుగా సాగుతున్న తగువు బహిరంగంగా బయట కోస్తోంది. రోజుకో  కొత్త వివాదం తెరపైకి వస్తోంది. నిజమే కావచ్చు  కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు తెరాస, బీజేపీ షాడో ఫైట్ చేస్తున్నాయని  రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉన్నా ఉండవచ్చును కానీ, బీజేపీ,తెరాసల షాడో ఫైట్ విషయం ఎలా ఉన్నా, మునుగోడు ఓటమికంటే, కాంగ్రెస్  నాయకుల మధ్య  భగ్గుమంటున్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ప్రతిష్టను మరింతగా దిగజార్చి వేస్తున్నాయనేది కాదనలేని నిజం. ఓ వంక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంతి మర్రి చెన్నారెడ్డి కుమారుడు, మర్రి శశిధర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న డైరెక్ట్ ఫైట్, చిలికి చిలికి గాలివానగా మారి,క్లైమాక్స్ కు   చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ, శశిధర్ రెడ్డిని ఆరేళ్ళ పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, శశిధర్ రెడ్డి శాశ్వతంగా పార్టీకి రాజీనామా చేశారు. తాను  బీజేపీ లో చేరనున్నట్లు ప్రకటించేశారు. అదొకటి అలాఉంటే, మునుగోడుకు ముందు నుంచి భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండానే మంటలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఇక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, వెంకటరెడ్డి సోదరుడు, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా  చేసి, బీజేపీలో చేరడంతో, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య వైరం మరింతగా ముదిరి పాకాన పడింది. వెంకటరెడ్డి  కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన సోదరుడు  రాజగోపాల రెడ్డికి ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్  స్టార్ క్యాంపైనర్  కూడా అయిన ఆయన, మునుగుడు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతే కాకుండా, అదే సమయంలో ఆస్ట్రేలియా వెళ్ళిన ఆయన మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతుందని, ఆ విషయం స్పష్టంగా  తెలిసి కూడా  ప్రచారం చేయడం ఎందుకని తాను దూరంగా ఉన్నానంటూ  పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. అ లాగే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అవహేళన చేస్తూ, ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది, కానీ చర్యలు తీసుకునే సాహసం మాత్రం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ అయన పై చర్యలు తీసుకుంటే, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి, తమ్ముడి బాటలో బీజేపీ గూటికి చేరతారని, అందుకే, మర్ర శశిధర్ రెడ్డి విషయంలో తీసుకున్న శీఘ్ర నిర్ణయం, కోమటి రెడ్డి విషయంలో తీసుకోలేక పోతోందని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్’కు గైర్హాజరైన 11 మంది పీసీసీ అధికార ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి వ్యవహర శైలిపై, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో మారు ధ్వజ మెత్తారు. పార్టీని నడిపించే పద్దతి ఇది కాదని చురకలు అంటించారు. ఇలా, తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రజలను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయినా, పార్టీలోని అంతర్గత విభేదాలను చల్లబరచడంలో సక్సెస్ కాలేక పోయిందని కాంగ్రెస్ నాయకులే వాపోతున్నారు. నిజానికి ఒక్క తెలంగాణలోనే కాదు, ఇప్పటికే రాహుల్ యాత్ర పూర్తిచేసుకున్న కేరళలో, మరో కొద్ది రోజులలో రాహుల్ కాలు పెట్టనున్న, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. పార్టీ అధ్యక్ష పదవివికి పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్ తమ స్వరాష్ట్ర కేరళలో సాగిస్తున్న రాజకీయ యాత్ర పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అలాగే, రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, పార్టీ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ వర్గాల మధ్య విబేధాలు మళ్ళీ మరో మారు భగ్గుమంటున్నాయి. రాహుల్ యాత్ర త్వరలో రాష్ట్రంలో ప్రవేశిస్తున్న నేపధ్యంలో పైలట్ వర్గానికి చెందిన ఒకరిద్దరుమంత్రులు,ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానం ఆదేశాలను ఉల్లంగించి, పార్టీ క్రమ శిక్షణను ఉల్లంగించిన గేహ్లోట్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.అది కూడా రాహుల్ యాత్రకు ముందే జరగాలని, లేదంటే ప్రజలో కాంగ్రెస్ పార్టీ చులకన అవుతుందని అంటున్నారు.  సో.. మొత్తంగా చూస్తే, రాహుల్ జోడో యాత్ర ప్రజలను ఏకం చేయడంలో సక్సెస్ అయినా, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ముఠాలను ఏకం చేయడంలో మాత్రం సక్సెస్ కాలేక పోతోంది. అంతే కాకుండా, రాహుల గాంధీ జోడో యాత్ర హిట్టా, ఫట్టా అనేది తేలాలంటే, హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే (డిసెంబర్ 8) వరకు ఆగక తప్పుదు. ఆ రెండు రాష్ట్రాలలో కూడా పంజాబ్,ఉత్తర ప్రదేశ్ ఫలితాలే పునరావృతమై, అక్కడా కాంగ్రెస్ పార్టీ ఓడిపొతే,రాహుల్ జోడో యాత్ర ... కూడా ఓడిపోయినట్లే భావించవలసి ఉంటుందని అంటున్నారు. ఇక ఆ తర్వాత తెలంగాణ సహా చాలా వరకు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణలు మారిపోతాయని అంటున్నారు.

హమ్మయ్య వార్నర్ శతక్కొట్టాడు!

డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్. స్టార్ బ్యాటర్ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్ట్రాలలో మాత్రం అసంఖ్యాకంగా అభిమానులున్నారు. ఐపీఎల్ లో చాలా కాలం పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న వార్నర్ ను తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు వేరే దేశం క్రికెటర్ గా భావించరు. తమ సొంత జట్టు కెప్టెన్ గానే తలపోస్తారు. దీనికి తోడు తెలుగు హీరోలను అనుకరిస్తే షేన్ వార్న్ చేసే స్ఫూఫ్ లకు చాలా చాలా బిగ్ ఫ్యాన్ లు ఉన్నారు. అలాంటి షేర్ వార్న్ ఇటీవలి కాలంలో క్రికెట్ లో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. గత మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆసీస్ టి20 టీమ్ కు నాయకత్వం వహించాలన్న ఆయన కోరిక తీరడం మాట అటుంచి అసలు జట్టులో స్థానం ఉంటుందా అన్నంతగా వార్నర్ ను అతడి ఫామ్ ఇబ్బంది పెట్టిది. అలాంట్ వార్న్ ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు. ఆల్ మోస్ట్ మూడేళ్ల తరువాత వార్న్ తన ఖాతాలో సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇందుకు మెల్ బోర్న్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డే వేదిక అయ్యింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో వార్నర్ 102 బంతులు ఎదుర్కొని 106 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వార్నర్ కు అన్ని ఫార్మాట్ లలోనూ కలిపి ఇది 44వ సెంచరీ.. కాగా వన్డేలలో 19వది. ఈ సెంచరీకి ముందు వార్నర్ 2020 జనవరిలో  ముంబై లో ఇండియాపై సెంచరీ చేశాడు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డే విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది.  

సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఆప్ కార్యకర్తల దేహశుద్ధి

సొంత పార్టీ ఎమ్మెల్యేకే ఆమ్ ఆద్మీపార్టీ కార్యకర్తలు  దేహశుద్ధి చేశారు. ఢిల్లీ  మటియాలా నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే గులాబ్‌సింగ్ కు ఆప్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. కారణమేమిటంటే.. డిసెంబ‌ర్ 4న మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో గులాబ్ సింగ్ కార్యకర్తలతో సోమ‌వారం రాత్రి  ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమవేశంలో పార్టీ టికెట్ల‌కు సంబంధించి ఎమ్మెల్యేకు కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఒకింత సీరియస్ అయ్యారు. ఒకింత పరుషంగా మాట్లాడారు. దీంతో ఆగ్ర‌హానికి లోనైన కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. పార్టీ ఆఫీసు నుంచి ఆయ‌న్ను   త‌రిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.   మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన టికెట్ల‌ను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ అమ్ముకుంటున్న‌ందునే సొంత పార్టీ  కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై దాడి చేశార‌ని బీజేపీ ఆరోపిస్తోంది.  అయితే.. ఈ ఆరోప‌ణ‌ల‌ను గులాబ్ సింగ్ ఖండించారు. తనపై దాడి వెనుక  బీజేపీ పార్టీ నేత‌ల హ‌స్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.