జల్లి కట్టుకు తమిళనాడు సర్కార్ లైన్ క్లియర్

తమిళనాట సంక్రాంతి సంబరాలు, సంస్కృతిలో జల్లికట్టుదే అగ్రస్థానం. ఏటా జనవరి 1వ తేదీ నుంచే సంక్రాంతి సంబరాలు మొదలైపోతాయి. అంటే జల్లి కట్టూ సందడీ ఆరంభం అయిపోతుంది. అయితే ఈ సారి మాత్రం కొత్త సంవత్సరం వచ్చి వారం రోజులైనా జల్లి కట్టు సందడి ఎక్కడా కనిపించలేదు. ఇందుకు కారణం ఇప్పటి వరకూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడమే. అయితే ఎట్టకేలకు శనివారం (జనవరి 7) జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం నుంచీ తమిళనాటలో జల్లి కట్టు సందడి ప్రారంభం కానుంది.  ఒక్క తమిళనాడులోనే కాకుండా ఏపీలోని చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్లు నిర్వహిస్తారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జల్లికట్టుకు అనుమతి ఇచ్చే విషయంలో స్టాలిన్ ప్రభుత్వం ఒకింత వెనుకాడటంతో తమిళనాట ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శనివారం జల్లికట్టు నిర్వహణకు సర్కార్ ఓకే చెప్పింది. కోవిడ్ ప్రొటోకాల్ తప్పని సరిగా పాటించాలని పేర్కొంటూ వీక్షకుల సంఖ్యపై ఆంక్షలు విధించింది. మూడు వందల మందికి మించి వీక్షకులను అనుమతించబోమని స్పష్టం చేసింది. అంతే కాకుండా జల్లికట్టుకు హాజరయ్యేవారంతా వ్యాక్సినేషన్ వేయించుకుని ఉండాలనీ, అలాగే కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉండాలని ప్రభుత్వం షరతులు విధించింది. ఇలా ఉండగా సంప్రదాయ క్రీడ జల్లి కట్టును చెన్నైలో కూడా నిర్వహించేదుంకు అనుమతించాలని ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హసన్ డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున చెన్నైలో జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉత్తమ్ వ్యాఖ్యలు.. దేనికి సంకేతం ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య తలెత్తిన వివాదం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి  మార్పుతో సమసి పోయినట్లేనా? మాణిక్యం ఠాగూర్ స్థానంలో మాణిక్‌రావు థాకరే  నియామకంతో, సీనియర్లు సంతృప్తి చెందినట్లేనా? ఇక సీనియర్, జూనియర్ కొత్త పాత నాయకులు అంతా కలిసి పనిచేస్తారా? అంటే, అలాంటి సూచనలు ఏవీ కనిపించడం లేదని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మార్పు తర్వాత జరిగిన,  కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో   శిక్షణ తరగతులకు కూడా జానా రెడ్డి, భట్టి విక్రమార్క తప్ప మిగిలిన జీ 9 నాయకులు ఎవరూ హాజరు  కాలేదు. ఆ ఇద్దరు కూడా  మొక్కుబడిగా వచ్చి వెళ్ళారే తప్ప  రేవంత్ రెడ్డితో సయోధ్య  కుదిరిందనే సంకేతలేవీ ఇవ్వలేదు.   అదొకటి అలా ఉంటే  ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు ఎవరి దారిన వారు సొంత బాటలు వేసుకుంటున్నారని, ఎవరికి వారు తమ తమ సొంత నియోజక వర్గాలలో విజయం కోసం సొంత పంథాలో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. నిజానికి ఖమ్మం జిల్లాలో భారాస నాయకులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి సుధాకర రెడ్డి ఎలాగైతే స్వతంత్రంగా సొంత పంధాలో   ఆత్మీయ సదస్సుల  పేరిట సొంత ఇంటిని చక్కబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారో అదే పంథాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు సొంత నియోజక నియోజక వర్గాలపై దృష్టిని కేద్రీకరించారని అంటున్నారు. నిజానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అయితే  ఇక తానూ తన నియోజక వర్గానికే పరిమితం అవుతానని ప్రకటించారు. గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్నారు.   ఈనేపధ్యంలోనే టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన  హుజూర్‌నగర్ కోదాడ స్థానాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు తెర తీశాయి.  నూతన సంవత్సరం  సందర్భంగా  ఈ రెండు నియోజక వర్గాలకు సంబంధించిన తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఉత్తమ కుమార్ రెడ్డి  ఈ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్‌ వేనంటూ జోస్యం చెప్పారు. అంతే అయితే, అది పెద్ద విషయం కాకపోవునేమో, కానీ, ఆయన అంతటితో ఆగలేదు.  హుజూర్‌నగర్‌లో మళ్లీ తానే పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని పేర్కొన్నారు. ఒక వేళ మెజార్టీ 50 వేలకు ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటాననని ప్రకటించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. ఎంపీగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి పార్టీ ప్రమేయం లేకుండా అసెంబ్లీకి పోటీ చేస్తానని తనంతట తానుగా ప్రకటించుకోవడం రేవంత్ రెడ్డి ని గిల్లడం కోసమేనా అనే చర్చ జరుగుతోంది.   మరోవంక ఉత్తమ కుమార్ రెడ్డి సవాలు విసిరిన కొద్ది రోజులకే, మంత్రి కేటీఆర్ హుజూర్ నగర్ లో పర్యటించి ఎప్పుడో మూడున్నర ఏళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు సంబందించిన శంకు స్థాపనలు  చేశారు. బహిరంగ సభలో ప్రసంగించారు. కానీ ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన తీసుకు రాలేదు. ఉత్తమ కుమార్ రెడ్డి పేరు అసలే ప్రస్తావించలేదు.  బీజేపీ, కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గానే కేటీఆర్ ప్రసంగం సాగింది.  రాష్ట్రం పన్నుల రూపంలో కేద్రానికి ఇచ్చిన నిధుల కంటే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎక్కువని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాలు విసిరారు.  కానీ ఉత్తమ కుమార్ రెడ్డి పేరైనా ఎత్తలేదు. దీంతో చర్చ కొత్త మలుపు తిరిగింది. నిజానికి, ఉత్తమ కుమార్ రెడ్డికి భారాస ముఖ్యనాయకులతో మంచి సంబంధాలున్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ  రహస్యమే. నిజానికి, కాంగ్రెస్, భారాసల పొత్తుకు సుముఖంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఉత్తమ కుమార్ రెడ్డి ఉన్నారని అంటారు. అలాగే  రేవంత్ రెడ్డి వర్గం కోవర్టులుగా ముద్ర వేసిన సీనియర్లలోనూ ఉత్తమ్ పేరు ఉందనే ప్రచారం జరుగుతోంది.  నిజమే ఉత్తమ కుమార్  రెడ్డి గతంలో రెండు పర్యాయాలు కోదాడ నుంచి, మూడు పర్యాయాలు హుజూర్ నగర్ నుంచి ఎన్నికయ్యారు. కాబట్టి  ఆయనకు ఆ నియోజక వర్గాలపై పట్టున్న మాట నిజమే.  అయితే, అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ  నల్గొండ ఎంపీగా ఎన్నికయ్యారు. హుజూర్‌నగర్ శాసనసభ స్థానాన్నికి రాజీనామా చేశారు. కానీ  ఆయన రాజీనామా కరాణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య, పద్మావతి పోటీ చేసి ఓడి పోయారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి సిట్టింగ్ స్థానంలో భార్యను ఉత్తమ్ గెలిపించుకోలేక పోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. కాగా.. అంతకుముందు 2018 జరిగిన ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేవలం 7466 ఓట్లతో గెలుపు సాధించారు. ఇదిలా ఉండగా..  తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉన్న ప్రస్తుతపరిస్థితుల్లో మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి  గెలవటం.. అది కూడా 50 వేల మెజార్టీతో విజయం సాధించడం కొంత ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.  అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత గట్టిగా ఆ రెండు నియోజక వర్గాలు మావే.. మెజారిటీ 50వేలకు తగ్గితే రాజీనామా చేస్తాను అంటున్నారంటే అది కూడా ఆలోచించవలసిన విషయమే అంటునారు. మరో వంక నియోజక వర్గానికి వచ్చీ మంత్రి కేటీఆర్  ఉత్తమ్ సవాలుపై స్పందించకే పోవడం సైతం ఆలోచించవలసిన విషయమే అంటున్నారు. అంతేకాదు నియోజక వర్గానికి వచ్చి భారాసకు  ప్రధాన ప్రత్యర్ధిగా బావిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరైనా ఎత్తక పోవడం ఇంకా  ఇంకా ఆలోచించ వలసిన విషయమే అంటున్నారు.  ఈ నేపధ్యంలోనే భారాస నేతలో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనే పాత అనుమానాలు కొత్తగా తెర పైకి వస్తున్నాయి.

న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినా మారని జగన్ సర్కార్

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం ప్రసిద్ధ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సమాజంలో స్పందనా రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ రాసిన పాట. ఈ పాటను జగన్ సర్కార్ కు అతికినట్లు సరిపోతుంది. కోర్టులు ఎన్ని మొట్టి కాయలు వేసినా స్పందనే లేనట్టుగా, తనను కానట్టుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. ఏపీ సర్కార్ కు హైకోర్టు మొట్టి కాయలు వేయని రోజంటూ లేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఏపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు నష్టం చేకూరేదిగానే ఉంటుందనడానికి కోర్టులలో తగులుతున్న ఎదురు దెబ్బలే నిదర్శనం. జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు పెద్ద ఎత్తున దాఖలౌతున్నాయి. ఆ కేసులలో దాదాపు అన్నిటిలోనూ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తాజాగా ఎస్సీ కార్పొరేషన్ నిధుల దారి మళ్లింపుపై హైకోర్టు జగన్ సర్కార్ కు గట్టిగా మొట్టికాయలు వేసింది. ఎస్సీ కార్పొరేషన్ పోటీ పరీక్షల శిక్షణకు బిల్లులు ఇవ్వడం లేదని.. ఎస్సీ కార్పొరేషన్​ నిధులు నవరత్నాలకు మళ్లిస్తున్నారని ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్​ను విచారించిన ఏపీ హై కోర్టు  ఎస్సీ కార్పొరేషన్ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిధుల మళ్లింపు కుదరదని 2003లోనే స్పష్టం చేశామని పేర్కొన్న ధర్మాసనం ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు.. దాన్ని మూసేయడం మేలని అభిప్రాయపడింది. ప్రభుత్వ కార్పొరేషన్లు నామమాత్రంగా మారిపోయాయని..  బిల్లులు చెల్లింపు వివరాలతో అదనపు అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని హైకోర్టు ఆదేశించింది. సాధారణంగా కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడితే ఏ ప్రభుత్వమైనా నైతిక బాధ్యత వహిస్తుంది. నిర్ణయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. తప్పు సరిదిద్దుకుంటుంది. కానీ జగన్ సర్కార్   నైతికత అంటే అర్దం తెలియదన్నట్లుగా వ్యవహరిస్తోంది. కోర్టులు తలంటితే తల తుడుచుకుని మళ్లీ అదే తీరులో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ అప్పులపాలై గత్యంతరం లేని పరిస్థితుల్లో చోరీకి పాల్పడిన సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోనికి వచ్చింది. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఇక పెన్షనర్లను జేబు దొంగలుగా మారుస్తారా అని ప్రభుత్వాన్నిప్రశ్నించింది. ఇంతటి ఘాటు వ్యాఖ్యలను కూడా జగన్ సర్కార్ దున్నపోతుమీద వాన పడ్డ చందంగా దులిపేసుకుంటోంది. కోర్టు ఆదేశాలను కానీ, సూచనలను కానీ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. పై పెచ్చు కోర్టు తీర్పులు, వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పడానికి కూడా జగన్ సర్కార్ వెనుకాడటం లేదు.  ఇందుకు అమరావతి పిటిషన్లపై సుప్రీం తీర్పుపై జగన్ రెడ్డి పార్టీ నేతలు చేసిన ప్రకటనలూ వ్యాఖ్యలే నిదర్శనం. అలాగే  ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా సర్కార్ కోర్టు ఆదేశాలను అమలు చేయకపోడంతో  హైకోర్టు బాధ్యులైన అధికారుల్ని న్యాయస్దానానికి పిలిపించి మరీ బిల్లులు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ ేసింది. ఆ ఆదేశాలు కూడా అమలు కాకపోవడంపై కాంట్రాక్టర్లు మరో సారి కోర్టును ఆశ్రయించారు.  ఈ నేపథ్యంలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులపై  హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఏకంగా 102 రివ్యూ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే హైకోర్టు మొత్తం 102 రివ్యూ పిటిషన్లనూ కోట్టి వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వ తీరు మారలేదు. కోర్టు తీర్పుల దారి కోర్టు తీర్పులదే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.   ఈ నేపథ్యంలో మరోమారు జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కేసులో హైకోర్టు రూ.40 లక్షలు బకాయిలు కట్టలేదని గ్రానైట్ పరిశ్రమకు కరెంటు నిలిపివేశారని.. మరి కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని.. మరి ప్రభుత్వ పవర్ ను ప్రజలు ఎప్పుడు తీయాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.     అందుకే.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని.. అని జగన్ సర్కార్ ను ఉద్దేశించి పాడుకోవాలేమో అని పరిశీలకులు అంటున్నారు. 

రేవంత్ కాంగ్రెస్ కాడి వదిలేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ లో వర్గ పోరు చినికి చినికి గాలివానగా మారిందా?  అధిష్ఠానం జోక్యం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మార్పు తర్వాత కూడా విభేదాలు సమసి పోలేదా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.  అసమ్మతి నేతల తీరుతో రేవంత్ రెడ్డి విసిగిపోయారని ఆయన మాటలను బట్టే అర్ధమౌతుంది. పార్టీ కోసం అవసరమైతే తాను టీ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ అనడం వెనుక ఆయన ఫ్రస్ట్రేషనే కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తాను ఎంత ప్రయత్నిస్తున్నా అసమ్మతి నేతలు పడనీయడం లేదన్న భావన రేవంత్ లో నెలకొందన్న విషయాన్ని ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ లోని కొందరు నేతలు  బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ భావిస్తున్నారు.   ఆ విషయం తెలిసినా అధిష్ఠానం కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం రేవంత్ మనోభావాలను గాయపరిచిందని అంటున్నారు. అసమ్మతి వర్గం డిమాండ్ మేరకు   తెలంగాణ కాంగ్రెస్   వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ను అధిష్ఠానం పక్కన పెట్టడం ఒక రకంగా తన దూకుడు తగ్గించాలని హెచ్చరించడంగానే రేవంత్ పరిగణిస్తున్నారని అంటున్నారు.  అసలు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి  నుంచీ పార్టీలో సీనియర్లుగా చెప్పుకుంటున్న వారి నుంచి ఎటువంటి సహకారం అందలేదన్నది వాస్తవం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ ఒక అడుగు ముందుకు వేస్తే.. అసమ్మతి వర్గం తన చర్యలతో పది అడుగులు వెనక్కులాగేసే ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం నుంచి నిన్న కాక మొన్న పార్టీలో చేరిన రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడమేమిటన్న దుగ్ధ వినా పార్టీలో అసమ్మతి నాయకులు రేవంత్ కు వ్యతిరేకంగా జట్టు కట్టడానికి మరో కారణం కనిపించదు.   రాష్ట్రంలో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లాలని భావించినా రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో అంతర్గత సమస్యలు అడుగడుగునా అడ్డం పడుతున్నాయి. తొలి నుంచీ  టీపీసీసీ చీఫ్ రేవంత్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు, ఇటీవల పీసీసీ కమిటీల్లోనూ  రేవంత్ వర్గానికి పెద్దపీట వేశారన్న నెపంతో ఒక్కసారిగా అసమ్మతి స్వరం పెంచడంతో పంచాయతీ రోడ్డెక్కింది. ఇంత కాలం పట్టీపట్టనట్టు వ్యవహరించిన అధిష్ఠానం రంగంలోకి దిగింది. అయితే కర్రా విరగకుండా, పామూ చావకుండా పంచాయతీని పరిష్కరించడానికి హై కమాండ్ చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు సరికదా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరింత బలహీన పరిచిందని పార్టీ వర్గాలే అంటున్నాయి.  పార్టీలో ఉన్న పంచాయితీలు మరింత రచ్చకెక్కాయి.  రేవంత్ రెడ్డికి  సహకరించాడని, రేవంత్ వర్గం వద్ద డబ్బులు తీసుకుని పదవులు కట్టబెట్టారని పార్టీ సీనియర్లు మాణిక్కం ఠాగూర్ ను ఆ పదవి నుంచి తొలగించాలని ఇటీవల తెలంగాణా కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ వద్ద డిమాండ్ చేశారు. ఇక దిగ్విజయ్ సింగ్ నివేదిక మేరకు అన్నంత పని చేసిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను పక్కన పెట్టి ఆయన స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా మాణిక్యరావు ఠాక్రేకు అవకాశం కల్పించింది. అయితే ఈ నిర్ణయం ఇటు రేవంత్ రెడ్డిని కానీ, అటు ఆయన వ్యతిరేక వర్గం వారిని కానీ సంతృప్తి పరచలేదనే చెప్పాలి. తన వ్యతిరేకుల డిమాండ్ కు తలొగ్గి అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం తనను బలహీనుడిని చేసిందని రేవంత్ భావిస్తుంగా, మాణిక్కం ఠాగూర్ ను మాత్రమే కాదు, రేవంత్ ను కూడా టీపీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలన్న తమ డిమాండ్ ను హై కమాండ్ పూర్తిగా నెరవేర్చలేదన్న అసంతృప్తి  రేవంత్ వ్యతిరేక వర్గంలో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ కాడె మోయడం అనవసరమన్న భావనకు వచ్చారని ఆయన వర్గీయులు అంటున్నారు. పార్టీ బలోపేతం చేయడానికి రేవంత్ చేపట్టదలచిన పాదయాత్రను సైతం తన వ్యతిరేక వర్గం అంటే సీనియర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని రేవంత్ ఏ విధంగానూ సహించలేకపోతున్నారని అంటున్నారు. అంతే కాకుండా పార్టీ హైకమాండ్ కూడా సీనియర్లు అన్న ఒకే ఒక్క కారణంతో తన వ్యతిరేక వర్గం మాటకు విలువనిస్తుండటం కూడా రేవంత్ రెడ్డికి మింగుడు పడటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నోటి వెంట రాజీనామా మాట వచ్చిందని అంటున్నారు.   టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలను సీనియర్లు తప్పుపడుతుండటాన్ని కూడా రేవంత్  సీరియస్ గా తీసుకున్నారంటున్నారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ తన భవిష్యత్ కార్యాచరణపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ ఏర్పాటు చేయడమా లేక తెలంగాణలో బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం గూటికి చేరడమా అన్న ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఒకే దెబ్బకు రెండు పిట్లలు.. ఇదే బీఆర్ఎస్ స్కెచ్

 ఒకే దెబ్బకు రెండు పిట్టలు..  బిఆర్ఎస్ వెనుక దాగి ఉన్న భారీ స్కెచ్ ఇదేనా? అంటే రాజకీయ వర్గాలు ఔననే అంటున్నాయి.  తెలంగాణలో కె. చంద్రశేఖర్ రావు,  ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఇద్దరు మళ్ళి అధికారంలోకి వచ్చేందుకు వేసిన మాస్టర్ ప్లానే బీఆర్ఎస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ ఒక్కటే రాష్ట్రాలే రెండు అన్నట్లుగా ఒకే పార్టీతో ఇటు తెలంగాణ, అటు ఏపిలోనూ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేసిన బృహత్తర ప్రణాళికే బిఆర్ఎస్ అంటున్నారు ప్రాంతీయ సెంటిమెంట్ రగిలించి, దానిని  ఓట్ల రూపంలో దండుకోవాలి,  ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించిందంటున్నారు   బిఆర్ఎస్ విస్తరణ పేరిట ఏపిలో నాయకులను కొందరిని చేర్చుకొని, వారితో ప్రకటనలు చేయించడం, సమావేశాలు, సభల నిర్వహణకు సమాయత్తం కావడం ఇదంతా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. బీఆర్ఎస్ సాకుతో కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడంపై ఏపీ నేతల నుంచి విమర్శలను ఆహ్వానించడం, వీటికి ప్రతిగా ఏపీ నేతలపై తెలంగాణలో ఆగ్రహజ్వాలలు ఎగసి పడటం జరగాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఏపీలో విస్తరణకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విశేష ప్రచారం చేశాయంటున్నారు.  బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏపీలో, బీఆర్ఎస్ పై విమర్శలకు నిరసనగా తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ రగల్చాలన్నదే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంగా చెబుతున్నారు.    ఆ వ్యూహంలో భాగంగానే తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ లో చేరగానే వైసిపి నేతలు, మంత్రులు తమ గళానికి పదును పెట్టారు. మంత్రులైతే.. ఏకంగా సిగ్గుండాలి.. బుద్ది  చెప్పుతారు.. అంటూ కేసీఆర్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. ఏపీకి వెన్నుపోటు పొడిచింది చాలదా..? శ్రీశైలంలో, నాగార్జున్ సాగర్ లలో విద్యుత్  దోచుకుంటూ.. నీటిని సముద్రంలోకి వదులుతున్న వాళ్ళు ఇక్కడకు వచ్చి  చేసేదేంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి రోజా కూడా తనదైన శైలితో స్పందించారు. విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే ప్రజలే బుద్ది చెప్పుతారంటూ నిప్పులు చెరిగారు.  కెసిఆర్ జాతీయ స్థాయిలో కొట్లాడాలే గానీ, ఆంధ్రప్రదేశ్ లో చేసేదేమిటి..? రాష్ట్ర విభజనలో,  ఏపీ నష్టపోవడంలోనూ ఆయన పాత్ర ఉందంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. ఈ విమర్శలు, నిప్పులు చెరగడాలు అన్నీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంలో భాగమేననీ అంటున్నారు.  ఇక ఏపీలో బీఆర్ఎస్ సభ తరువాత నుంచీ తెలంగాణ నుంచి ఏపీ నేతలపై విమర్శలు ప్రారంభమౌతాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇప్పటికే కేసీఆర్, ఆ తరువాత మంత్రులు ఏపీలో అభివృద్ధి లేమి గురించిన విమర్శలు మళ్లీ మొదలెట్టేశారు. తాజాగా స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు భారీగా రావడంపై హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో   కేటీఆర్ ప్రసగించారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పుకోవాలంటే పోలిక ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూపించారు. ఆ రాష్ట్రం వెళ్లి చూసి వస్తే తేడా తెలుస్తుందన్నారు. ఏపీలో గుంతల రోడ్లు, విద్యుత్ కష్టాలు, తరలిపోతున్న పరిశ్రమలు,  కరవైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తెరాస ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇటీవల తిరుమల శ్రీవారి దర్వనం చేసుకున్నారు. ఆ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలలో మార్పు రావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. ఏపీలో చాలామంది ఎమ్మెల్యేలు, మాజీలు బీఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉన్నారని త్వరలో అందరూ బీఆర్ఎస్ లో చేరతారని అన్నారు. సరైన నాయకత్వం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఒక పక్కా వ్యూహం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమ తమ రాష్ట్రాలలో తమ విజయం ఖరారు చేసుకోవడానికి, ఇరు రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంట్ రగిల్చి.. ప్రాంతీయ చిచ్చు రగిల్చి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ను వాడుకుంటున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.

తెరాస... భారాస డీఎన్ఏ ఒకటేనా?

ఉభయ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒకటవుతాయా? ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడంలో కీలక భూమిక పోషించిన, తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడం వెనక ఇతరేతర కారాణాలు ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాలను ఏకం చేసే ఆలోచన కూడా వుందా, అంటే, ఉన్నదని కాకున్నా, ఉంటే ఉండవచ్చే అనే అభిప్రాయం   అనుమనాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన సమయానికి,ఆయన ప్రధాన లక్ష్యం రాష్ట్ర విభజన కాకపోవచ్చని, దివంగత  మాజీ ముఖ్యమంత్రి  చెన్నారెడ్డిని బాటలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన తెరాస స్థాపించారని, అనుమానించిన వాళ్ళు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ను సభలోనే వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.  సరే  అదంతా గతించిన చరిత్ర. అందులో ఏది నిజమో ఏది కాదో, ఇప్పడు అపస్తుతం. అలాగే  కేసీఆర్ కావాలనుకున్నా, మరొకరు వద్దనుకున్నా విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కలపడం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ, ఏపీలో అడుగు పెట్టేందుకు కదులుతున్న బీఆర్ఎస్  స్వరంలో మార్పు అయితే స్పష్టంగా వినిపిస్తోందని అంటున్నారు. ఒకప్పుడు ఆంధ్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని, ‘బ్యాన్’ చేశారని ఆరోపించిన నాయకులే  ఇప్పడు తెలంగాణ పేరు ఉచ్చరించేందుకు కూడా వెనకాడుతున్నారని అంటున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో  ‘వందే మాతరం’ నినాదం  ఎంత ప్రభావం చూపిందో, అంత కంటే ఎక్కువగా, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ  ఉద్యమాలను ప్రభావితం చేసిన, ‘జై తెలంగాణ’ నినాదం భారాస వేదికల నుంచి వినిపించడం లేదని తెలంగాణ ఉద్యమ ప్రజానీకం ఆవేదన, వ్యక్త పరుస్తున్నారు.  అలాగే, ఇంతవరకు రాష్ట్ర విభజన క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పడు, తిలా పాపం తల పిడికెడు అన్నరీతిలో కొత్త స్వరాన్ని ఎత్తుకున్నారు. అయితే ఆ మాట నేరుగా కేసీఆర్, కేటీఆర్ లేదా మరో తెలంగాణ నాయకుడో కాకుండా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు, తోట చంద్రశేఖర్ నోటి ద్వారా చెప్పించారు. చంద్రశేఖర్  ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు.   రాష్ట్ర విభజనకు ఒక్క తెరాస మాత్రమే కారణం కాదు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అందరూ ఓకే చేస్తేనే రాష్ట్ర విభజన జరిగింద నే కొత్త స్వరాన్ని ఎత్తుకున్నారు.  అంతే కాకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ లిఖిత పూర్వకంగా లేఖ  ఇచ్చారని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయితే, ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరులు సహా ఉద్యమంలో భాగస్వాములైన అయిన అందరినీ పక్కన పెట్టి,  ఒక్క  కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని కేసీఆర్ లేకుంటే తెరాస లేదు  తెరాస లేకుంటే తెలంగాణ లేదు అంటూ రాష్ట్ర విభజన క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఇలా స్వరం మార్చడం దేనికి సంకేతం? అనే ప్రశ్నకు తెలంగాణ సమాజానికి సమాధానం చిక్కడం లేదు.  అదలా ఉంటే పూర్వాశ్రయంలో  తెరాస నాయకులుగా పిడికిలి బిగించి, ‘జై తెలంగాణ’ అని నిందించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు  తెలంగాణ పేరు ఉచ్చరించేందుకు కూడా  జంకుతున్నారు. ఎవరో కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం, ‘జై తెలంగాణ’  నినాదాన్ని నాలుక మీద నుంచి చెరిపేశారని  తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు  మేథావులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఏదో ఆశించి తెలంగాణ నాదాన్ని, నినాదాన్నివదులుకోవడం ఒక్క రోజు భాగోతానికి మీసాలు గోరుకున్నట్లుందని, కోదండరాం వంటి  ఉద్యమ నేతలు  అంటున్నారు.   అలాగే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని మరో మారు కేసీఆర్  ప్రశ్నార్ధకం చేస్తున్నారని కేసీఆర్ ధోరణి   పట్టి పట్టి పంగనామాలు పెడితే, పక్కకెళ్ళి తుదిచేసుకున్నట్లు  ఉందని అంటున్నారు. అయితే మరోవంక మంత్రి కేటీఆర్, తెరాస పేరు భారాసగా మారిందే కానీ, పార్టీ డీఎన్ఎ మారలేదని, అదే రంగు, అదే రుచి, అదే వాసన కొనసాగుతుందని అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏది నిజం ... కేసీఆర్ తల్లి పేరును తుడిచేసుకుంది నిజమా .. అదే డీఎన్ఎ అంటున్న కేటీఆర్ మాటలు నిజామా ? అని ప్రశ్నిస్తున్నారు.

కేంద్రం,రాష్ట్ర్రం మధ్య మళ్ళీ అదే పైసల పంచాయతీ

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య చాల కాలంగా సాగుతున్న పైసల పంచాయతీ, మళ్ళీ మరో మారు తెర వచ్చింది. ఓ వంక కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్ళిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతుంటే, మంత్రి కేటీఆర్ మరో మారు,లెక్కల పంచాయతీని తెరపైకి తెచ్చారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం గద్దలా ఎగరేసుకు పోయిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.5,080 కోట్లను, పంచాయతీల ప్రమేయం లేకుండా ఒకే ఒక్క గంటలో రాష్ట్ర ప్రభుతం ఉడ్చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే, కిషన్ రెడ్డి  చేసిన ఆరోపణపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసలు విషయాన్ని వదిలేసి  ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన పైసలను బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెడుతున్నారని.. ఇది తప్పని నిరూపిస్తే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిజానికి మంత్రి కేటీఆర్  ఇదే సవాల్ గతంలోనూ చేశారు. అంతే, పంచాయతీ నిధుల దారి మళ్ళింపుకు సంబంధించి  కేంద్ర మంత్రి కొంచెం చాలా ఆలస్యంగా స్పందించారు. పంచాయతీ సర్పంచ్ లు కేంద్ర నిధుల దారి మళ్లింపు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగతనానికి పాల్పడిందని మీడియా సాక్షిగా ఆరోపించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లు లేదు. కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలపై మాత్రం రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు.  సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌  పర్యటనలో భాగంగా, నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. సవాల్ విసిరారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన పైసలను బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెడుతున్నారని.. ఇది తప్పని నిరూపిస్తే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేంద్రం నిధులను పక్కదారి పట్టించారంటూ.. కిషన్‌రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.   ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన 3 లక్షల 68 వేల కోట్ల డబ్బును వెనుకపడిన బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెట్టింది నిజం కాదా అని కేటీఆర్ నిలదీశారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వ్యయాలు, నిధుల పంపాకాలకు సంబంధించి ఆరోపణలు రావడం కొత్తకాదు. నిజానికి  నిధుల పంపకానికి సంబంధించి రాజ్యాగం నిర్దేశించిన నిర్దిష్ఠ  నియమ నిబంధనలున్నాయని నిపుణులు చెపుతుంటారు. దేశ రక్షణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దేశ రక్షణకు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయవు, చేయవలసిన అవసరం ఉండదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక విధులుంటాయి. ఇది అందరికీ తెలిసిందే అయినా తరచూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ.. రాజకీయ పార్టీల నడుమ వివాదాలు తలెత్తడం ... విమర్శలు .. సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయ విచికిత్స తప్ప మరేమీ కాదు. అందుకే, ఇలాంటి వివాదాలు కొద్ది రోజులు మీడియాలో హల్ చల్ చేసి కనుమరుగై పోతుంటాయని అంటారు. నిజంగా జరుగుతున్నది కూడా అదే.  అయితే.. తెలంగాణ, కేంద్ర ప్రభూత్వాల నడుమ, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ల మధ్య ఈ విమర్శలు, ప్రతి  విమర్శలు శృతితి మించి రాగాన పడుతున్నాయని విజ్ఞులు, విమర్శకులు అంటున్నారు.

అప్పుడు ఇందిరమ్మ .. ఇప్పడు జగనన్న

వినాశకాలే విపరీత బుద్ధి  1975 జూన్ 25న అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించారు. రాత్రికి రాత్రి వందల సంఖ్యలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో పముఖ సోషలిస్ట్ నాయకుడు, సంపూర్ణ క్రాంతి ఉద్యమ నిర్మాత  లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. తలుపు తట్టారు. నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చిన జేపీతో పోలీసు అధికారులు దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం చెప్పారు. తాము ఆయన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చామని తమతో సహకరించాలని కోరారు.అప్పుడు జేపీ ... ఎక్కువ తక్కువ లేకుండా ఒకే ఒక్క మాటన్నారు. ఆ మాటే .. వినాశకాలే విపరీత బుద్ధి.  ఆమాటకు అర్థం విడమరఛి చెప్పవలసిన అవసరం లేదు.ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పట్టిస్తుంది.అలాంటి పెడ ధోరణిని పెద్దలు వినాశ కాలానికి, పతనానికి సంకేతంగా నిలిచే విపరీత బుద్ధి అన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎలాంటి రాజకీయ పరాభవాన్ని ఎదుర్కొన్నారో వేరే చెప్పనక్కరలేదు. అత్యవసర పరిస్థితి తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడి పోవడం కాదు, స్వయంగా ఇందిరా గాంధీ తమ సొంత నియోజక వర్గం రాయిబరేలి (యుపీ)లో ఓడిపోయారు. ఆమె కుమారడు సంజయ్ గాంధీ అమేథిలో ఓడి పోయారు.   ఇక ఇప్పుడు ఏపీకి వస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల కదలికలకు సంకెళ్ళు వేశారు. రాజకీయ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ   జీవో (నంబర్ 1) తెచ్చారు.  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అప్పుడు ఇందిరా గాంధీ అనుసరించిన మార్గంలోనే జగన్ రెడ్డి  ప్రతిపక్షాల పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు కాదు  స్వపక్షీయులే అంటున్నారు. అందుకే  వినాశకాలే విరీత బుద్ధి  ‘దీవెన’ జగన్ రెడ్డికు కూడా వర్తిస్తుందని అంటున్నారు. ఇలా ఇంకెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో, రాజకీయ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధించడం  చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ ఆయన పర్యటను అడ్డుకోవడం  పోలీసుల దౌర్జన్యం ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్ట్ పాలన, నియంతృత్వ పోకడలకు అద్దం పడుతున్నాయి.ఇందిరమ్మ అత్యవసర పరిస్థితిని గుర్తు తెస్తున్నాయని అంటున్నారు.  నిజానికి  జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు నియంతృత్వ పోకడలు పోతున్నారనే ఆరోపణలున్నాయి.ఇప్పడు ఆయనకు సహజ సిద్ధంగా అబ్బిన కక్షపూరిత రాజకీయ సు...గుణాలకు ఓటమి భయం తోడవడంతో జగన్ రెడ్డి  వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వ్యవ్హరిస్తున్నన్నారని అంటున్నారు. ఆయన తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారనీ అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాయి. చేయాలి .. అందులో భాగంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన  కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ధర్నాలు, రోడ్డు షోలు, బహిరంగ సభల ద్వారా ప్రజా వ్యతీరేక ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెడతాయి.ఇవన్నీ, కూడా ఒక విధంగా ప్రజాస్వామ్య ఆభరణాలు. ఇప్పడు జగన్ రెడ్డి  ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, అరాచక పాలనను, మరో మెట్టు పైకి తీసుకు పోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.   అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమి ఆశించి  ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఇంకేమి ఆశించి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారో కానీ,రాజకీయ వినాశనాన్ని ఆయన కోరి తెచ్చుకుంటున్నారని ప్రత్యర్ధి పార్టీల నాయకులే కాదు, సొంత పార్టీ, సొంత కుటుంబ సభ్యులే అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు  నాయుడు  సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి ముఖ్యమంత్రి రాజకీయ సభలు, ర్యాలీలపై విధించిన ఆంక్షలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అధికార పక్ష నేతలే ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలను చూసి జగన్ భయపడుతున్నాడనే సంకేతం పంపినట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికలలో 151 సీట్లు మాత్రమే గెల్చుకున్నామని,ఈ సారి కుప్పంతో సహా మొత్తం 175 నియోజకవర్గాలలో ఎందుకు విజయం సాధించలేమని  గొప్పలకు పోయిన జగన్ రెడ్డి, ఇప్పడు ప్రతిపక్ష నాయకులకు భయపడి జీఓల చాటున దాక్కోవడం  ఎలాంటి సంకేతాలు పంపుతుందని ప్రశ్నిస్తున్నారు. నిజానికి, నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి మీటలు నొక్కుతూ ఓట్లు లెక్కేసుకుంటూ  ప్యాలెస్  లో కులాసాగా గడిపేశారు, కానీ  ఒక సారి బయటకు వచ్చిన తర్వాత కానీ, ఆయనకు సత్యం బోధ పడలేదు. మనము కట్టుకున్నవి దేవతా వస్త్త్రాలనే నిజం తెలిసి రాలేదు. ఇప్పుడు తెలిసొచ్చినా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఆయన విపరీత పోకడలు పోతున్నారని  వైసీపీ నేతలే వాపోతున్నారు.

ఇండియాలో విదేశీ వర్సిటీ బ్రాంచ్ లు.. మోడీ సర్కార్ కసరత్తు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన వర్సిటీలు తమ క్యాంపస్ లను ఇండియాలో ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ద విశ్వవిద్యాలయాలలో చదవాల్సిన అవసరం లేకుండా ఆయా క్యాంపస్ లు ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆక్స్ ఫర్డ్, స్టాన్ఫోర్డ్, యేల్ తదితర యూనివర్సిటీలు ఇండియాలోనే తమ క్యాంపస్ లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది. ఇందుకు సంబంధించిన ముసయిదా డ్రాఫ్ట్ ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇప్పటికే రూపొందించింది.  ఆ ముసాయిదాను త్వరలోనే పార్లమెంటు ఆమోదానికి యూజీసీ పంపనుంది. ఈ వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి అధికారాలు కల్పించనుంది. అంటే భారత్ లో క్యాంపస్ లు ఏర్పాటు చేసే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వ విద్యాలయాలు బొధనా సిబ్బందిని తామే స్వయంగా నియమించుకునే వెసులు బాటు ఉంటుంది.   విదేశీ యూనివర్సిటీలు స్థానిక సంస్థలతో భాగస్వామ్యం లేకుండానే సొంతంగా ఇండియన్ బ్రాంచ్ ను ప్రారంభించే వెసులు బాటు ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలను భారతీయ విద్యార్థులు స్వదేశంలోనే అందుకునేలా మోడీ సర్కారు ప్రయత్నాలు చస్తోంది.  భవిష్యత్తులో మ ఇండియా  గ్లోబల్ స్టడీ డెస్టినేషన్ గా  నిలవాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటోంది.   2022 గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ నెస్  ఇండెక్స్ ప్రకారం 133 దేశాలలో ఇండియా ర్యాంకు 101 స్థానంలో ఉంది. దీనిని మెరుగుపరచాలంటే.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యావకాశాలు భారత్ లో అందుబాటులోకి తీసుకురావడమొక్కటే మార్గంగా మోడీ సర్కార్ భావిస్తోంది. 

సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. చంద్రబాబుకు మద్దతుగా కుప్పంలో జనం నినాదం

చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆ పేరంటేనే అధికార వైసీపీలో వణుకు మొదలైంది. అయన ఎక్కడకు వెళితే అక్కడ జనం ప్రభంజనంలా పోటెత్తుతున్నారు. ప్రభుత్వంపై, జగన్ పై ఆయన చేసే విమర్శలకు హర్ష ధ్వానాలతో ఆమోదం తెలుపుతున్నారు. ఇదే అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేస్తోంది. దీంతో ఆయనను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఆయన సభలు, సమావేశాలు నిర్వహించడానికీ, రోడ్ షోలు చేయడానికీ వీల్లేకుండా చీకటి జీవోలతో ఆంక్షలు విధించింది. అయితే కుప్పం పర్యటన చంద్రబాబులోని పోరాట యోధుడిని మరో సారి లోకానికి చూపింది. సొంత నియోజకవర్గంలో అడుగడుగునా పోలీసులు అవరోధాలు కల్పిస్తుంటే.. తనను కలవడానికి వచ్చిన వాళ్లపై లాఠీచార్జి చేసి గాయపరుస్తుంటే.. చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. పోలీసుల తీరును ఎండగట్టారు. సైకో పాలనలో బానిసలుగా మారారని పోలీసులపై జాలీ చూపారు. అయితే ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఏడు పదువ వయస్సులో గ్రామాలలో పాదయాత్ర చేశారు. ప్రచార వాహనాన్ని పోలీసులు దొంగిలించారని ఆరోపిస్తూ.. రోడ్డుపై పక్కన నిలిపి ఉన్న వాహనం టాప్ పైకి ఎక్కారు. వాన్ పక్కన నిట్ట నిలువుగా ఉన్ననిచ్చెనను అవలీలగా ఎక్కేసిన చంద్రబాబును చూస్తుంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్న మాట ఆయన విషయంలో అక్షర సత్యం అనిపించక మానదు. వ్యాన్ పై నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తం కుప్పం అంతా సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న నినాదాలతో మార్మోగిపోయింది. కుప్పం పర్యటన మూడో రోజు చంద్రబాబు గుడిపల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలోకి వెళుతుంటే పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించిన నిరసనకు దిగారు. ఎక్కడ మాట్లాడాలో చెప్పండంటూ పోలీసులను నిలదీశారు. దొంగల్లా తన ప్రచార రథాన్ని ఎత్తుకు పోయిన వారు పోలీసులు ఎలా ఔతారన్నారు.  ఓటమి భయంతోనే జగన్ నల్ల జీవోలతో విపక్షాలను అణచివేయాలని   యత్నిస్తున్నారని చంద్రబాబు  విమర్శించారు.  ప్రజలు గమనిస్తున్నారని...  వాళ్లు తలచుకుంటే గుడ్డలు ఊడదీసి నిలబెడతారని హెచ్చరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ కు శిక్షపడటం ఖాయమని అన్నారు.  గొడ్డలి పోటుతో లేపేసి గుండెపోటు అని చెప్పింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. తన ప్రచార రథాన్ని పోలీసులు దొంగిలించారనీ, అందుకే ఇక్కడ ఉన్న వ్యాన్ ఎక్కి ప్రసంగిస్తున్నానన్నారు.  

యువ‘గళం’ నొక్కేస్తారా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యవగళం పేరిట నిర్వహించే పాదయాత్రకు మరోవైపు.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వారాహి బస్సు యాత్రకు ఫూల్ స్టాఫ్ పెట్టేందుకు వైయస్ జగన్ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? అందుకే అర్థరాత్రి జీవో నెంబర్ 1 తీసుకు వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించగా.. జనవరి ఒకటోవ తేదీన గుంటూరులో జరిగిన తోపులాటలో ముగ్గురు మరణించారు.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభల్లో జరుగుతున్న విషాద ఘటనలపై జగన్ సర్కార్ ఆగమేఘాల మీద స్పందించింది.   రాష్ట్రంలో రోడ్ షో, సభలు, ర్యాలీలకు చెక్ పెడుతూ,  జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చింది. ఈ జీవో ప్రకారం ఎంపిక చేసిన  ప్రదేశాల్లోనే సభలు, సమావేశాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.  అయితే ఈ జీవోపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. లోకేష్ పాదయాత్రపై ప్రభుత్వ ఉత్వర్వులు అమలు కానున్నాయా? జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ బస్సు యాత్రకు ఈ నిషేధం వర్తించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు.  ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దాదాపు 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడమే కాదు.. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. అయితే లోకేష్ పాదయాత్ర రహదారులపై జరగనుంది. అంతేకాదు.. వేలాది మంది ఈ పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి అడుగులు వేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో.. హాజరైన ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగించాల్సి ఉంటుంది. అలాంటి వేళ.. లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా? లేదా? అంటే సందేహమే అని వారు స్పష్టం చేస్తున్నారు.  దాదాపు 4 వేల కోలోమీటర్ల మేర జరగనున్న ఈ పాదయాత్రలో చాలా చోట్ల లోకేశ్.. ప్రజలతో మాట్లాడతారు.. పలు చోట్ల ఆయన సభలు ఏర్పాటు అవుతాయి.   అందుకోసం ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. అందుకు అనుమతులు కావాలంటే ఇస్తారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  బస్సు యాత్రకు తాజాగా విడుదలైన జీవో ప్రకారం.. అనుమతి లభిస్తోందనే ఆశలు అయితే లేవని రాజకీయ విశ్లేషకలు స్పష్టం చేస్తున్నారు.  ఓ వేళ.. ఒకరి పాదయాత్రకు.. మరొకరి బస్సు యాత్రకు అనుమతి ఇచ్చినా.. ఆవి ప్రారంభమైన కొద్ది రోజులకే వైయస్ జగన్..ముందుస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు.

కేంద్ర కాబినెట్లో టీ ఓకే.. ఏపీకి బెర్త్ అనుమానమే

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఇంచుమించుగా ఖరారైంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ రాజకీయ వరగాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే సంక్రాంతి పండగకు ముందా తర్వాతా  అనే విషయంతో పాటుగా, జనవరి 16, 17 తేదీలలో ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందా వెనకా  అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంవత్సరం (2023) ఒక విధంగా ఎన్నికల నామ సంవత్సరం. ఈ ఏడాది తెలంగాణ సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  సో .. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వచ్చే ఏడాది  ( 2024)లో జరిగే  సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇటు పార్టీలో, అటు కేంద్ర మంత్రి వర్గంలో ఒకేసారి సమాంతరంగా మార్పులు చేర్పులు చేసే ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నారని  అంటున్నారు.అందుకే ప్రధాని నరేంద్ర మోడీ, భారీ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.  కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు దాదాపు ఏడాది పైగా గడువు ఉంది. మరోవంక బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. దీంతో పాటు జనవరిలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ నేపధ్యంలో, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకుని, మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు ప్రధాని మోడీ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైనా ప్రధాని మోడీతో పాటుగా  బీజేపీ సంఘ పరివార్ పెద్దలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. నిజానికి, ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితిని, సంఘ్ పరివార్ సంస్థలు వేటికవి నివేదికల రూపంలో కేంద్ర కార్యాలయానికి అందజేశాయని వాటి ఆధారంగా ఎన్నికల వ్యూహరచన సాగుతోందని అంటున్నారు.  కాగా  2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పడింది. 2021 జులై ఏడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్‌ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు అంటే.. మోదీ కేబినెట్‌లో మొత్తం 78 మంది ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అంటే మరో ఐదుగురి అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు  చెరో బెర్త్ కన్ఫర్మ్  అయిందని అంటున్నారు.  తెలంగాణ నుంచి, యూపీ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్  తో కలిపి మొత్తం ఐదుగురు ఎంపీలున్నారు. అందులో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో పర్యాటక, సాంస్కృతిక శాఖల  మంత్రిగా ఉన్నారు. క రీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్  బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఏ ఒకరినీ ప్రస్తుతానికి కదిల్చే ఆలోచన కేంద్ర నాయకత్వానికి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ధర్మపురి అరవింద్, సోయం బాబురావులలో ఒకరికి అవకాశం ఉంటుందని అంటున్నారు. నిజానికి గత విస్తరణ సమయలోనే సోయం బాబు రావు పేరు ప్రముఖంగా వినిపించింది. పేరు ప్రముఖంగా వినిపించడమే కాదు ఢిల్లీ నుంచి పిలుపు కూడా వచ్చింది.  అయితే ఆఖరి క్షణంలో వచ్చిన పదవి చేజారిపోయింది. సో  ఈ సారి, ఫస్ట్ ప్రిఫెరెన్సు  గిరిజన బిడ్డకే ఉంటుందని అంటున్నారు.  అయితే, బండి సంజయ్ పదవీ కాలం వచ్చే నేలతో ముగియనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో వేరొకరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే పక్షాన బండి పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఇక మూడేళ్లుగా  కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కని ఏపీకి ఈ సారి తప్పక ప్రాతినిధ్యం ఉంటుందని అంటున్నారు. ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నందున ఈసారి ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఏపీకి చెందిన సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు (యూపీ నుంచి) రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరి లేదా గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవంఉన్న, దగ్గుబాటి పురందేశ్వరిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆరు నెలలోగా ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే ఆలోచన లేక పోలేదని అంటున్నారు. అయితే, ఏపీ విషయంలో అంత ఖచ్చితంగా ఏదీ చెప్పలేమని, నిజానికి కేంద్ర నాయకత్వానికి ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది, ఏపీ ఒక్కటేనని, అందుకే బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేమని అంటున్నారు.

ఏపీలో ఫాసిజానికి ప్రజాస్వామ్యానికీ మధ్య యుద్ధం... ఆర్ ఆర్ ఆర్

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. వెంటనే కేందా్రం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది. ఇదీ ఏపీలో అన్ని రాజకీయ పార్టీలూ చెబుతున్న మాట. వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు కూడా ఇదే అంటున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ కూడా రాశారు. ఈ విషయాన్ని ఆయన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గురువారం (జనవరి 5) విలేకరుల సమావేశంలో చెప్పారు.  రాష్ట్రంలో ఫాసిజానికి, ప్రజాస్వామ్యానికి మధ్య యుద్ధం జరుగుతోందా? ఈ యుద్దంలో బ్యాలెట్ ద్వారా ఏపీ జనం జగన్ ఫాసిజ పాలనకు చరమగీతం పాడనున్నారా అంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఔననే అంటున్నారు.    ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డివన్నీ ఫాసిజం పోకడలేనని దుయ్యబట్టారు.   కుప్పం ప్రజలు పోలీసులపై తిరగబడిన తీరు, రేపు రాష్ట్ర నలుమూలలకూ  వ్యాప్తి చెందుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ప్రతిపక్ష నేత, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ని కుప్పంలో పోలీసులు దారుణంగా అవమానించి, వేధించారు. గూండాల్లాగా వ్యవహరించారన్నారు.   గతంలో జగన్ , ఆయన తల్లి, చెల్లి ఇరుకు రోడ్లలో  సమావేశాలను ఏర్పాటు చేయలేదా?. అప్పటి ప్రభుత్వం, పోలీసులతో రక్షణ కల్పించి సహకరించలేదా? అన్నారు. చంద్రబాబు రోడ్ షో ను అడ్డుకోవడానికి వినియోగించిన పోలీసులలో, పది శాతం మంది పోలీసులను రక్షణ కోసం వినియోగించి ఉంటే రోడ్ షో సజావుగా సాగేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదిగా ఉందన్నారు. రాజకీయ పార్టీల సమావేశాలకు, సభలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో ఫాసిస్టు పాలన సాగిస్తున్న జగన్ కు హిట్లర్ కు పట్టిన గతే పడుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా కొనసాగిన ఆనం రామనారాయణ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని తొలగించడం కక్షపూరిత రాజకీయాలకు ఇది పరాకాష్టగా అభివర్ణించారు.  

పుణె వైద్యుల ఘనత.. 400 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు ప్రాణం పోశారు!

తొమ్మది నెలలు అమ్మకడుపులో ఉండి ఎదిగి భూమ్మిదకు వస్తుంది నవజాత శిశువు. అరుదైన సందర్భాలలో ఏడు నెలలకే నవజాత శిశువులు జన్మించడం కద్దు. అలా జన్మించిన వారు సాధారణంగా బరువు తక్కువగా ఉంటారు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.  తల్లి గర్భంలో తొమ్మది నెలలూ ఉండి భూమి మీదకు వచ్చిన శిశువులు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. అయితే కేవలం 24 వారాలకే అంటే ఆరు నెలలకే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన శిశువును వైద్యులు ప్రాణం పోశారు. సాధారణంగా ఆరు నెలలకే జన్మించిన శిశువు బతకడం అంటే వైద్య శాస్త్రంలో అసాధారణ విషయమేనని నిపుణులు చెబుతున్నారు. వైద్యులు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.  అసాధ్యమే సుసాధ్యమయ్యింది. 6 నెలలకు జన్మించిన శిశువును వైద్యులు కాపాడారు. పుణెలోని వాకాడ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ  శిశువును వైద్యులు కాపాడారు. మహారాష్ట్రలోని పూణెలో ఇది   గతేడాది మే 21న నెలలు నిండకుండానే.. ఆరు నెలలకే ఓ బిడ్డకు జన్మ నిచ్చింది. అప్పటి నుంచీ ఆ బిడ్డను వైద్యులు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి  కాపాడారు. చిన్నారి శివన్య పూర్తిగా ఎదిగినట్టు గుర్తించిన తర్వాత 2022 ఆగస్ట్ 23న డిశ్చార్జ్ చేశారు.  గ్రాములకు చేరింది. ఆ చిన్నారి జన్మించినప్పుడు ఆమె బరువు కేవలం 400 గ్రాములు మాత్రమే.  ప్రస్తుతం ఈ బేబీ 4.5 కిలోల బరువుకు చేరుకుంది. అందరి పిల్లల్లా ఆరోగ్యంగానే ఉండడమే కాకుండా, ఆహరం కూడా తీసుకుంటోంది.  

కమల దళానికి రాముడే రక్ష..!

భారతీయ జనతా పార్టీ, (బీజేపీ) ఈ రోజున జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. వరసగా రెండు సార్లు (2014, 2019) సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది. స్వయంగా సంపూర్ణ మెజారిటీ సాధించి, మూడు దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను తిరగరాసింది. ఈ రోజున కేంద్రంలో, సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో వుంది.  అయితే, బీజేపీ విజయం వెనక, కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీల బలహీనతలతో పాటుగా ఇంకా అనేక కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, మూల కారణం మాత్రం, 1990 దశకంలో దేశాన్ని కదిలించిన  రామజన్మ భూమి ఆందోళన.. అద్వానీ రథ యాత్ర. అవును 1990 లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం  మండల్ కమిషన్  సిఫార్సుల ఆధారంగా వెనక బడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ అప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఇతర సంఘ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అందుకు అనుగుణంగా అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ 1990లో రథ యాత్రను చేపట్టారు. ఇక ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడంబాబ్రీ మసీదుకూల్చివేత వరకుసాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే, బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర.  ఇక అప్పటి నుంచి బీజేపీ, ప్రతి ఎన్నికలలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే, రామజన్మభూమి అయోధ్యలో దివ్య భవ్య రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానం చేస్తూనే వుంది. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరే రోజు దగ్గరకొచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు 2019 నవంబర్ లో అనుమతి ఇచ్చింది.  ప్రధాని నరేంద్ర మోడీ, 2020 ఆగష్టులో శంఖుస్థాపన చేశారు. ఇదంతా మన కళ్ళముందు కదులుతున్న  చరిత్ర.  కాగా, ఈసంవత్సరం జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, వచ్చేస సంవత్సరం ( 2024) లోక్ సభ ఎన్నికల విజయానికి ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించిన బీజేపీ మరో మారు రామ మందిర్ అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వినియోగించుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల సన్నాహక యాత్రలు సాగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. వచ్చే సంవత్సరం (2024) జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభిస్తామని ఆయన గురువారం(జనవరి 5) ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో నిర్వహించిన సభలో అమిత్ షా ఈ ప్రకటన చేశారు. అంతే కాదు  అదే సమయంలో అమిత్ షా, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ పేరు తీసుకున్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి  అడుగో ..అయోధ్య రాముడు  వస్తున్నాడు కాసుకో ... అన్నట్లుగా, సవాలు విసిరారు.  “రాహుల్ బాబా విను, .2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.  అంటే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని, రామమందిర్ వివాదంలోకి లాగేందుకే అమిత్ షా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ పేరు తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు షా సవాలును విశ్లేషిస్తున్నారు.  అలాగే, అయోధ్యలో రామ మందిర్ నిర్మాణాన్ని కాంగ్రెస్, వామపక్ష, లౌకిక వాద పార్టీలు అడ్డుకున్నాయని  ఆరోపించారు. అయోధ్య అంశాన్ని కోర్టు పరిధిలో సుదీర్ఘ కాలం ఉండేలా చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను,ఇతర లౌకికవాడ పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలుగా చిత్రించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అంటే 2024 ఎన్నికలలో బీజేపీ మరోమారు రామ మందిర్ అంశాన్ని ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రం చేసుకునేందుకు సిద్డంవుతోందనే సంకేతాలు అమిషా ఇచ్చారు. నిజానికి అయోధ్య రామమందిర్ ఇష్యూని బీజేపీ  ప్రతి ఎన్నికలలోనూ ఉపయోగించుకుంటూనే వుంది. అయితే, ఈసారి రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన నేపధ్యంలో హిందూ ఓటు బ్యాంకును మరింత పటిష్ట పరచుకునే ప్రయత్నం మొదలెట్టిందని పరిశీలకులు షా ప్రసంగాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ  మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ సవాలును ఎలా స్వీకరిస్తారు అనేది  చూడవలసి వుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

దేశం గూటికి కన్నా.. సత్తెన పల్లి నుంచి బరిలోకి!

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరనున్నారా? వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అయితే ఈ  విషయాన్ని తెలుగువన్ గత ఏడాది అక్టోబర్ లోనే  అంటే  మూడు నెలల ముందే వెల్లడించింది. అప్పట్లో  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను   కలవడం.. భవిష్యత్తులో కలిసి పని చేస్తామంటూ పొత్తుపై సంకేతాలు ఇవ్వడంతో ఏపీలో రాజకీయవేడి రగిలింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి రాగం భగ్గుమంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అసమ్మతి గళం విప్పారు. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో కుండబద్దలు కొట్టారు.  ఏపీ బీజేపీలో సమస్య అంతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోనే అని చెప్పారు.  బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లోనే విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు.  అప్పట్లో కన్నా వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకున్న బీజేపీ అధిష్ఠానం ఆయనపై చర్యలకు సిద్ధమైందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పరిస్థితి సద్దుమణిగిందని అంతా భావించారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ కావడం, ఆ తరువాత రాష్ట్ర బీజేపీ వైఖరిలో ఒకింత మార్పు కనబడటంతో బీజేపీలో ముసలం సద్దుమణిగిందని అంతా భావించారు. అయితే ఏపీ బీజేపీలో విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయనీ, లోలోన రాజుకుంటూనే ఉన్నాయనీ ఇటీవలి పరిణామాలు తేల్చేశాయి. బీజేపీ జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించడంతో రాష్ట్ర బీజేపీలో కన్నాను ఏకాకిని చేయడమే లక్ష్యంగా సోము వీర్రాజు పావులు కదుపుతున్నారన్నవిషయం స్ఫష్టమైంది. ఈ నేపథ్యంలోనే కన్నా మరోసారి తన అసమ్మతి గళం విప్పారు.    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకి ఏపీకి చెందిన  వారిని చేర్చుకోవడం.. అలా చేరిన వారిలో అత్యధికులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం వెనుక ఏపీ బీజేపీలోని కీలక నేత ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆ కీలక నేత వేరెవరో కాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజేనని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండగా నియమించిన పార్టీ జిల్లాల అధ్యక్షులను ఒక్కరొక్కరిగా సోము వీర్రాజు తొలగించి, ఆ స్థానంలో వేరే వారిని నియమించడం పై కన్నా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు కూడా ఉండటాన్ని ఎత్తి చూపుతూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీని వీడి ఏ పార్టీలోకి చేరుతారన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఇటీవల పవన్ కల్యాణ్ పార్టీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన జనసేన గూటికి చేరుతారని అంతా భావించారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కన్నా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మూడు నెలల కిందటే తెలుగువన్ చెప్పింది. అమరావతి విషయంలో  తెలుగుదేశం స్టాండ్ కు పూర్తి స్థాయిలో  మద్దతుగా నిలుస్తున్న కన్నా ఆ పార్టీలోనే చేరుతారని పేర్కొంది.   సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని అప్పట్లోనే తెలుగుదేశం అధినేతను కన్నా కోరారు.   అందుకు తెలుగుదేశం అధినేత ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అదీ కాకుండా దాదాపుగా తెలుగుదేశం, జనసేనల మధ్య దాదాపుగా పొత్తు కుదిరిందనీ, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు కూడా వచ్చాయనీ వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన సత్తెనపల్లిని కోరుతున్నప్పటికీ.. కన్నా తెలుగుదేశం తరఫుర ఆ స్థానం నుంచి పోటీలో దిగితే జనసేన ఆ స్థానాన్ని వదులుకోవడానికి అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. 

నరేష్.. పవిత్ర.. పబ్లిసిటీ స్టంటేనా?

ఒకనాటి హీరో... ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేశ్, పవిత్ర లోకేశ్ ఇద్దరు మళ్లీ పీటలెక్కబోతున్నారంటూ ఇ  ఓ ప్రచారం అయితే గత కొంత కాలంగా జోరుగా సాగింది.    కొత్త ప్రారంభం.. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలంటూ.. ఈ జంట.. కన్నుల పండగగా.. అదీ కొవ్వొత్తల వెలుగులో లిప్‌లాక్ చేసుకొంటూ ఓ వీడియో నూతన సంవత్సరం ప్రారంభ వేళ.. విడుదల చేశారు. సదరు వీడియో చివరల్లో.. గెట్టింగ్ మ్యారీడ్ సూన్ అంటూ మూక్తాయింపు ఇవ్వడంతో ఇంత కాలం జోరుగా సాగిన ప్రచారం వాస్తవమే అని అందరూ అనుకున్నారు.  అంతేకాదు దీనికి మళ్లీ పెళ్లి అనే ప్రకటనతోపాటు #పవిత్రానరేశ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సదరు వీడియో విడుదల కావడంతో వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని కన్ ఫర్మ్ చేసేసుకున్నారు.   అయితే ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం ఈ వీడియో కేవలం పబ్లిసిటి జిమ్మిక్కేనని అంటున్నాయి.  మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నరేశ్, పవిత్రా లోకేశ్ జంట కలిసి నటిస్తున్నారని.. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగానే దీనిని విడుదల చేశారని.. ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నరేశ్, పవిత్రా లోకేశ్‌లు ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. మరో వైపు నరేశ్ భార్య రమ్య రఘుపతి.. ఈ జంటని కర్ణాటకలోని మైసూర్‌లోని ఓ హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొవడానికి  సంబంధించిన వీడియోలు.. ఇటీవల హల్ చల్ చేసిన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే   నరేశ్, పవిత్రా లోకేశ్‌తో ఓ వీడియో తీసి వదిలితే.. మంచి పబ్లిసిటి వస్తోందనే ఆలోచనతో ఈ వీడియోను రూపొందించార ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఓ వదంతిని జస్ట్ అలా వదిలితే.. వచ్చే పబ్లిసిటి అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో ఉంటుందనే ఓ ఆలోచనతో ఈ వీడియోను షూట్ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ సాగుతోంది.    మరో వైపు.. ఈ చిత్రం నరేశ్, పవిత్రల బయోపిక్ అని కూడా ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది. వీరిద్దరిపై ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఓ రియల్ స్టోరీతో....రీల్ స్టోరిగా తెరకెక్కించాలని చూస్తున్నారనే టాక్ సైతం హల్ చల్ చేస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇంకోవైపు.. ఈ జంట సహజీవనంలో ఉందో లేదో.. అలాగే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో ఎవరికీ తెలియదని.. కానీ ప్రస్తుతం ఈ జంట వెండి తెరపై నటిస్తోందని.. దానిని తెలివిగా క్యాష్ చేసుకోవడం కోసం.. ఈ వీడియోని రిలీజ్ చేశారని అంటున్నారు.   

ఏపీని కేటీఆర్ మళ్లీ అనేశారు.. జగన్ కు కావలసిందీ అదేనా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో తన ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతోందని గుర్తించిన ప్రతి సందర్బంలోనూ పొరుగు రాష్ట్రాన్ని అంటే ఏపీని చులకన చేయడం.. అక్కడి పరిస్థితులు నరకంతో సమానంగా ఉన్నాయంటూ చులకన చేసి.. తాము చేసిన అభివృద్ది గురించి గొప్పలు చెప్పుకోవడం కామనైపోయింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదిన్నరేళ్లు గడిచిపోయింది.   ఉమ్మడి రాష్ట్రం నాటి భావోద్వేగాలు, సెంటిమెంట్లు ఇప్పుడు పెద్దగా లేవు కూడా. అయితే రాజకీయంగా తమకు అవసరమనిపించిన ప్రతి సందర్బంలోనూ తెలంగాణ మంత్రులు తమ ప్రభుత్వ గొప్ప చాటుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని చూపి తమ భుజాలను తామే చరుచుకుంటూ ఉండటం సర్వ సాధారణమైపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగినప్పుడూ, ప్రభుత్వం ఇబ్బందులలో పడినప్పుడూ  తెలంగాణ మంత్రులకు తమ గొప్పలు చాటుకోవడానికి ఏపీ దుస్థితినే ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే  తెలంగాణలో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువే ఉన్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడే స్థిరపడిన ఆంధ్రా ప్రజలు ఇప్పటి తెలంగాణలో కూడా చెప్పుదగ్గ స్థాయిలో ఇక్కడి రాజకీయాలను మలుపు తిప్పగలరు. దాదాపు పాతిక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరని కూడా  ఇక్కడి రాజకీయాలలో ఓ లెక్క ఉంది. అందుకే తెలంగాణలో అధికారం దక్కాలంటే ఇక్కడ స్థిర పడిన వారి  మద్దతు అవసరం కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులకు బాగా తెలుసు. అందుకే స్థిరపడిన ఆంధ్రుల ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలచుకోవాలంటే ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణను మా ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ది చేసిందని చెప్పుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని అండగా తెచ్చుకోవడం అలవాటుగా మారిపోయింది.  అవినీతి, రెండు కళ్ల సిద్ధాంతంలో ఏపీ ప్రయోజనాలను దెబ్బతీశారంటూ, సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడి ఆంధ్రుల మద్దతు పొందే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. గత ఏడాది మేలో  కేటీఆర్ ఇక్కడ స్థిర పడిన ఆంధ్రుల్లో జగన్ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికే.. ఏపీలో రోడ్లు, విద్యుత్ పరిస్థితి అధ్వానంగా ఉంటే తెలంగాణలో అద్భుతంగా ఉన్నాయయంటూ చెప్పుకున్నారు.   గత ఎన్నికల్లో ఎలాగైతే ఏపీలో చంద్రబాబుపై వ్యతిరేకతను తెరాస ఇక్కడ ఓట్లుగా మార్చుకుందో.. అదే విధంగా   జగన్ పై అక్కడి వ్యతిరేకతను క్యాష్ చేసుకునే వ్యూహంతోనే కేటీఆర్ తెలంగాణతో ఏపీలో పరిస్థితులను పోలుస్తూ అభివృద్ధి చిరునామాగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పుకున్నారు.  ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. కేటీఆర్ మరో సారి ఆంధ్రలో పరిస్థితులపై తనదైన శైలీలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధిని తెలుసుకోవాలంటే ఓ సారి ఏపీ వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి రండంటూ వ్యాఖ్యలు చేశారు.   స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు భారీగా రావడంపై హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో   కేటీఆర్ ప్రసగించారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పుకోవాలంటే పోలిక ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూపించారు. ఆ రాష్ట్రం వెళ్లి చూసి వస్తే తేడా తెలుస్తుందన్నారు. ఏపీలో గుంతల రోడ్లు, విద్యుత్ కష్టాలు, తరలిపోతున్న పరిశ్రమలు,  కరవైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు పొరుగురాష్ట్రం చులకనగా చేసిన వ్యాఖ్యలను పట్టించుకునే తీరిక లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం విమర్శలను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. రాష్ట్రంలో విపక్షాలు సభలు, సమావేశాలు, రోడ్ షోలను అడ్డుకోవడానికే జగన్ సర్కార్ సర్వ శక్తులను వెచ్చిస్తోంది. పైగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలో అబద్ధమేముంది? నిజమే కదా అని తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులే కాదు.. ఏపీ ప్రజలు కూడా అంటున్నారు. ఇలాంటి భావన ఏపీలో ఎంతగా వ్యాపిస్తే  తనకు అంత ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ రావాలన్న భావన కొద్ది మందిలోనైనా ఏర్పడితే.. ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందన్న ఆశాభావంతో జగన్ ఉన్నారనీ, అందుకూ కూటీఆర్ ఏపీని చులకన చేస్తూ, అభివృద్ధి లేమికి ఆనవాలుగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేసినా స్పందించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తన గ్రాఫ్ పడిపోయిందని గుర్తించిన జగన్ ఇప్పుడు తన సర్వ శక్తులనూ విపక్షాల గ్రాఫ్ పెరగకుండా ఉండటంపైనే కేంద్రీకరించారని అంటున్నారు. ఇందు కోసం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వెల్ కం చెప్పడం దగ్గర నుంచీ... తెలంగాణ మంత్రులు ఏపీ పరిస్థితులపై విమర్శలు చేసినా మౌనమే భూషణంగా భరించడం వరకూ అన్నీ చేస్తున్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైనా జనంలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత విపక్ష తెలుగుదేశం కు అనుకూలంగా మారకుండా ఉంటే చాలని భావిస్తున్నారు. ఇందుకు బీఆర్ఎస్ ఏపీపై విమర్శలతో దూకుడు పెంచాలని కోరుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కమల దళంలో కొత్త నేతలకు పెద్ద పీట

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ  పాతకొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ పూర్తి సమయ కార్యకర్తల సమావేశంలో, పార్టీ  మిషన్ 90  టార్గెట్  గా రోడ్ మ్యాప్ సిద్దం చేసిన విషయం తెలిసిందే. సరే నిజంగా బీజేపీ  ప్రస్తుతమున్న మూడు సీట్ల నుంచి ఒకేసారి 90 సీట్లకు చేరుకుంటుందా? అది అయ్యే పనేనా అనే విషయాన్ని పక్కన పెడితే, కమల దళం ‘మిషన్ టార్గెట్’ విషయంలో తగ్గేదేలే అంటోంది. పక్కగా ప్రణాళికలను రచించుకోవడమే కాకుండా కార్య క్షేత్రంలో అడుగులు వేయడం ప్రారంభించింది.  అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీరియస్ గా దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ పోలింగ్ బూత్ స్థాయి నుంచి కేడర్ ను పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7,61,200 మంది పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ నెల 7న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వారందరితో వర్చువల్ గా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. తెలంగాణ కోసం బీజేపీ ప్రత్యేకంగా సరళ్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఆ యాప్ లో బూత్ కమిటీల వివరాలు, పార్టీ వ్యవహారాలు పొందుపరచనున్నారు. ఇదిలా ఉంటే ఎంపిక చేసిన పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ బీజేపీ ఐడీ కార్డులతో పాటు డైరీలు అందజేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డైరీలు మెయింటెన్ చేయాలని వారికి ఆదేశించింది. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ పరంగా బూత్ స్థాయిలో సమస్యలు, వాటి పరిష్కారానికి చర్యలతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి అన్ని వివరాలు సేకరించాలని కార్యకర్తలకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,600 పోలింగ్ బూత్ లు ఉండగా.. ఒక్కో దానికి 22 మంది కార్యకర్తల్ని నియమించారు. వారిలో ఒకరు సోషల్ మీడియా బాధ్యతలు చూసుకోనున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు.  అదలా ఉంటే, రానున్న రోజుల్లో రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈనెల ( జనవరి) 16, 17 తేదీలలో ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో..పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగించే అంశంతో పాటు, ఈ సంవత్సరం జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావడంపై కూడా లోతుగా చర్చించనున్నారు.  ఎన్నికలే ప్రధాన ఎజెండా జరుగతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, ఇతర రాష్ట్రాలతో పాటుగా ఈ సంవత్సరం చివర్లో జరిగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ‘ప్రత్యేక’ చర్చ ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చే విషయంతో పాటుగా, ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలోనూ నాయకులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షునిగా కొనసాగిస్తూ, ఈటలకు పదోన్నతి కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ కు అన్ని విధాల సమ ఉజ్జీగా నిలిచి, కేసీఆర్ శక్తియుక్తులను సమర్ధవంతంగా ఎదుర్కోగల సత్తా సామర్ధ్యం ఉన్న ఈటల రాజేందర్  కు పార్టీలో సీఎం స్థాయి హోదాను కల్పిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అటు తెలంగాణ ఉద్యమ నేతల్లో, ఇటు బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మంచి పటున్న ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తెర మీదకు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించక పోవచ్చును కానీ, పార్టీ నేతలకు క్లారిటీ  అయితే ఇస్తారని, అంటున్నారు.  ఏది ఏమైనా, ఈటలతో పాటుగా  ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కొందరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఖాయంగా ఉందని అంటున్నారు.