భారాస తెలుగుదేశం జోరు పెంచేస్తుందా?

ఎన్నికల హడావుడి మొదలైపోయింది. దీంతో అన్ని పార్టీలూ ఓట్ల వేట ప్రారంభించాయి..   అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు వ్యూహాలు.. ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అందులోభాగంగా.. బీఆర్ఎస్  అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే టీఆర్ఎస్ .... బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడం.. ఈ సభకు దేశంలోని బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను సైతం ఆహ్వానించారు. వారిలో ఎవరు వస్తారు? ఎవరు రానన్నది పక్కన పెడితే.. సభ ఏర్పాట్లు మాత్రం వేగంగా జరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఇదే కావడంతో  అందుకు తగినట్లుగా ఘనంగా ఈ సభను నిర్వహించాలని  కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.  మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ఇటీవల ఖమ్మంలో శంఖరావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సభ సక్సెస్‌తో.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే బతికి ఉంది.. తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ సభ సక్సెస్‌  ఫుల్‌స్టాప్ పెట్టింది. దీంతో కొత్త ఊపు ఉత్సాహంతో తెలంగాణలో తెలుగుదేశం అడుగుల వేగం పెంచింది. అయితే బారాస అధినేత   కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు. అలాంటి వేళ.. ఆయన దేశంలో ఎక్కడైనా ఈ సభను నిర్వహించవచ్చు. కానీ అలా కాకుండా.. తెలంగాణలోని అదీ.. ఖమ్మం వేదికగా ఈ సభను ఏర్పాటు చేయడం ఏమిటనే చర్చ అయితే పార్టీ వర్గాల్లోనే మొదలైంది.   మరోవైపు గతంలో ఖమ్మం జిల్లాలోని పలు పార్టీలకు చెందిన కీలక నేతలు.. కారు పార్టీలోకి జంప్ కొట్టి.. షికారు కొట్టారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా వరుసగా ఒక్కొక్కరుగా కారు దిగి.. ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీజేపీలో  చేరేందుకు ముహూర్తం   ఫిక్స్ అయిందని సమాచారం. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైకిల్ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలే కాదు.. కేడర్ సైతం భారీగానే ఉన్నట్లు.. ఆ క్రమంలోనే వారంతా కలసికట్టుగా చంద్రబాబు సభను.. సూపర్ డూపర్ సక్సెస్ చేశారని సమాచారం. అయితే అదే ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తే... చంద్రబాబు సభకు తరలి వచ్చినట్లు జనం తరలి వస్తారా? అనే ఓ సందేహం  భారాస శ్రేణులను తొలిచేస్తోందని అంటున్నారు.  ఎందుకంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస పెద్దగా బలంగా లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే ఓ వేళ.. ఖమ్మంలో కేసీఆర్ సభకు జనం రాకుంటే.. బీఆర్ఎస్ పార్టీ సినిమా ఖమ్మం గల్లీలోనే ఆడలేదు.. ఇక ఢిల్లీలో ఏం ఆడుతుందనే  ఓ విమర్శనాస్త్రాన్ని  ప్రతిపక్ష పార్టీలకు అందించినట్లు అవుతుందని భారాసా శ్రేణులు భావిస్తున్నారని సమాచారం. దీంతో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ను   ప్రతిపక్షాలు డ్యామేజీ చేసినా చేస్తాయని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.   అయినా కేసీఆర్.. తెలంగాణలో ఇన్ని జిల్లాలు ఉండగా.. ఖమ్మంనే ఎందుకు ఎంచుకున్నారు... అక్కడే సభ ఎందుకు నిర్వహించాలని నిర్ణయించారనే అంశంపై క్లారిటీ రాకపోవడంతో.. కారు పార్టీలోని శ్రేణులంతా సందేహం తీర్చేవారి కోసం వెతుకుతున్నారు. ఏదీ ఏమైనా మళ్లీ పురిటిగడ్డపై తెలుగుదేశం పార్టీ పుంజుకొంటోంది... అలాంటి వేళ.. కారు పార్టీ తెలంగాణలో జోరు తగ్గిందని భారాస ఖమ్మం సభ తేలిస్తే..  ఇక తెలంగాణలో తెలుగుదేశంకు తిరుగుండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్ పై పీకే సర్వే ఏమి చేబుతోందంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ జాతకాలు నమ్ముతారు. వాస్తును విశ్వశిస్తారు. ఇక,యజ్ఞయాగాదుల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవెక్కడి మూఢ నమ్మకాలని ఎవరైనా తూల నాడినా ఆయన పట్టించుకోరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఇమాంలు మంత్రించి ఇచ్చిన ఆకుపచ్చ చేతి పట్టి మరిచి పోరు. ఇలాంటి నమ్మకాలు  ఆయనకు ఇంకా చాలానే ఉన్నాయని అంటారు. అయితే అదే సమయంలో ప్రశాంత్ కిశోర్ వంటి ఎన్నికల వ్యూహకర్తల సైంటిఫిక్  సర్వేలను, కంప్యూటర్ వ్యూహాలను కూడా కేసీఆర్ అంతగా విశ్వశిస్తారు. రిలీజియస్ గా భక్తిగా ఫాలో అవుతారు. అందుకే కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా, పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాదుల నిర్వహించడంతో పాటుగా సర్వేలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.   కాగా, ఇప్పడు కేసీఆర్ ... భారత రాష్ట్ర్ర సమితి విస్తరణలో భాగంగా, ఏపీలో మొదటి అడుగు వేశారు. తెలంగాణ వెలుపల, తెలంగాణ కంటే ముందుగా ఏపీలో పార్టీ నియామకాలు మొదలుపెట్టారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా  జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ను నిమించారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరు ముఖ్యనాయకులు, మరి కొందరు వారి అనుచరులు మందీ మార్బలంతో పనిగట్టుకుని మరీ హైదరాబాద్  వచ్చి పార్టీలో చేరారు. అయితే, తెలగాణ వెలుపల వేసిన తొలి అడుగు ఏమిటి  ఎలా పనిచేస్తుంది పొరుగు రాష్ట్రంలో తెలంగాణ నాయకుడి పార్టీకి  ఎంతవరకు ప్రజాదరణ లభిస్తుంది అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం గతంలో కొంత కాలం భారాస (అప్పట్లో తెరాస) ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్తో ఫ్రెష్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్  మీద  సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఏపీలో బీఆర్ఎస్ పోటీచేయడంవల్ల ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి? అసెంబ్లీ సీట్లు కానీ, లోక్ సభ సీట్లు కానీ గెలవడానికి అవకాశాలున్నాయా? ప్రజలు ఏమనుకుంటున్నారు? కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై కేసీఆర్ చేస్తున్న పోరాటం గురించి ఆంధ్రులు ఏమనుకుంటున్నారు? ఏపీలో వైసీపీ పాలనకు, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు మధ్య తేడాను గమనించారా? ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు? బీఆర్ఎస్ విస్తరణను స్వాగతిస్తారా? తదితర విషయాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు విస్వసనీయంగా తెలుస్తోంది.  అంతే కాకుండా ఏపీలో పోటీకి అనుకూల నియోజక వర్గాలను గుర్తించే బాధ్యతను కూడా కేసేఆర్ ఐ ప్యాక్  బృందానికే అప్పగించినట్లు చెపుతున్నారు. అలాగే  నేరుగా పొరుగు రాష్ట్త్రాల నట్టింటి నుంచి కాకుండా, తెలంగాణ-ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ గురి పెట్టారని అంటున్నారు. అందు కోసమే, ఢిల్లీ లేదా యూపీలో అనకున్న బీఆర్ఎస్ అవిర్భావ సభను, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు జిల్లా ఖమ్మంలో ఏర్పాటు చేశారు. అలాగే  ఎపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు పోటీ చేయడంకన్నా తనకు అనువుగా ఉన్న సీట్లలో పోటీచేసి విజయావకాశాలను పెంచుకోవాలని కేసేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో పోటీచేయాలనే ఆలోచనతో అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అలాగే, ఎపీతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాలలోనూ పరిమిత సీట్లలో పోటీచేసే అలోచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిలో అడుగు పెట్టే ముందు. బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోవడంకన్నా గణనీయ సంఖ్యలో ఓట్లను సాధించగలిగితే రాజకీయంగా ప్రయోజనం సిద్ధిస్తుందని బీఆర్ఎస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. జాతీయ పార్టీగా  గుర్తింపు పొందేందుకు అవసరమైన అర్హతలు సాధించి, ఆపైన  ఉత్తరాదిఫై దృష్టి కేద్రీకరించాలని కేసీఆర్ తాజా వ్యూహంగా చెపుతున్నారు.  కాగా  ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన - 1968 ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీనితో పాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. ఇందులో మొదటి నిబందన కష్టం కాదు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ సహా మరి కొన్ని రాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీకి నిలుపుతుంది. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. ఇక ఆరు శాతం ఓట్లు, నలుగురు ఎంపీ నిబంధనపైనే కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారని, అందులో భాగంగానే పార్టీ విస్తరణ కార్యక్రమానికి ఏపీలో సర్వేతో  శ్రీకారం చుట్టారని అంటున్నారు.

తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరంటే?

తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్న చర్చ తెరపైకి వచ్చింది. ఆయన తక్షణం ఏపీకి వెళ్లాల్సిందేనని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన వెంటనే తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది. అయితే సోమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. అయినప్పటికీ  కోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌ కుమార్‌ 2019 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్  మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు.  రెవెన్యూ, ఆబ్కారీ, వాణిజ్యపన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, భూపరిపాలన కమిషనర్‌ వంటి కీలక పోస్టులన్నీ ఆయనే   నిర్వహిస్తున్నారు. భూ రికార్డుల కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ధరణి వెబ్‌సైట్‌ రూపకల్పనలో సోమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఆయన పదవీ కాలం  ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతుండగా ప్రధానంగా ముగ్గురి పేర్లు ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. ప్రణాళికా సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖల స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ  స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న  డాక్టర్ రజిత్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ కే. రామకృష్ణారావులు  రాష్ట్ర తదుపరి సీఎస్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వీరిలో మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్న అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొడగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని చెబుతున్నారు.  కాగా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌లో బీహార్‌కు చెందిన అధికారులే ఉన్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన  అరవింద్ కుమార్ కే కేసీఆర్ అవకాశం ఇస్తారని అంటున్నారు.  

బీజేపీ విస్తరణకు విస్తారక్ లు!

దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో   హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవడం కోసం భారీ కసరత్తే జరుగుతోంది.  పార్టీకి మరింతగా బలోపేతం చేయడానికి కొత్త చేరికలకు ఆహ్వానం పలుకుతోంది బీజేపీ పార్టీ ఇందుకోసం పార్టీ విస్తరణ లక్ష్యంగా విస్తారక్ ల నియామకానికి నిర్ణయించింది.  సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాదిలో 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలలో పార్టీ విజయం లక్ష్యంగా తొలుత మూడు నుంచి మూడు వేల ఐదోందల మంది విస్తారక్ లను నియమించాలన్న నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత అవసరమైతే మరింత మందిని నియమించి 2024 ఎన్నికలలో విజయం కోసం బాటలు వేసుకోవాలని భావిస్తోంది. ముందుగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, త్రిపుర, కర్నాటక, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లపై దృష్టిసారించింది. ఈ తొమ్మిది రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీయే. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకోవడం, ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ విస్తరణ పనుల్లో జోరు పెంచేందుకు విస్తారక్ ల నియామకానికి శ్రీకారం చుడుతోంది.   ఈ విస్తారక్ లు నేరుగా పార్టీ కేంద్ర నాయకత్వానికే జవాబుదారీగా ఉంటారు.  వీరు వారికి అప్పగించిన నియోజకవర్గాలలో క్షేత్ర స్థాయి వరకూ చొచ్చుకుని వెళ్లి పార్టీ విస్తరణ, బలోపేతానికి కృషి చేస్తారు.  వీరు నేరుగా కేంద్ర నాయకత్వానికే జవాబుదారీ అయినా, స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తారు. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి, విజయావకాశాలు, అలాగే స్థానిక నేతల పనితీరుీతితర అంశాలపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదిస్తారు. అంటే కిందిస్థాయిలో ఏం జరుగుతోంది. పరిస్థితులు ఏమిటీ, పార్టీ పరిస్థితి ఎలా ఉంది. స్థానిక నాయకత్వం బలాబలాలేమిటి? వంటి అన్ని అంశాలూ ఎప్పటికప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళతారన్న మాట. కాగా ఇప్పటికే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో విస్తారక్ ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ విస్తారక్ ల నియామకం జరిగి పోయింది. అలాగే దేశ వ్యాప్తంగా పార్టీ ఒకింత బలహీనంగా ఉందని గుర్తించిన 160 వరకూ ఉన్న నియోజకవర్గాలకు కూడా విస్తారక్ ల నియామకం ఇప్పటికే పూర్తయ్యింది.   

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ.. ఏం చర్చించారంటే..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబునివాసానికి వెళ్లిన రజనీకాంత్ ఆయనతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేశారు. మిత్రుడు రజనీకాంత్ ను కలవడం సంతోషంగా ఉందంటూ వారిరువురూ కలిసిన ఫోటును కూడా ఆ ట్వీట్ కు జత చేశారు. సరే ఇంతకీ ఇరువురి మధ్యా ఏం చర్చ జరిగిందన్న విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ జరిగిన అనంతరం రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందన్న ఊహాగానాలూ వ్యక్తమౌతున్నాయి. మర్యాదపూర్వకంగానే చంద్రబాబుతో భేటీ అయినట్లు రజనీకాంత్ చెబుతున్నా.. అదొక్కటే కాదు ఇంకేదో కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ హయాం నుంచీ సినీ ప్రముఖులు సన్నిహితంగానే ఉంటూ వచ్చారు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే మాజీ ఎంపీ, ప్రస్తతుం వైసీపీలో ఉన్న మోహన్ బాబు సన్నిహిత మిత్రుడు. ఇటీవలి కాలంలో మోహన్ బాబు వైసీపీలో ఉక్కపోతకు గురౌతున్నారు. ఆ పార్టీలో ఎటువంటి గుర్తింపూ లేక, కనీసం పట్టించుకునే వారు కూడా కరవై ఇబ్బందులు పడుతున్నారు. తన స్థాయికీ, స్టేచర్ కు తగిన పదవి ఇస్తారని భావించినా జగన్ అసలు మోహన్ బాబును ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలాగే గతంలో ఒక సారి తిరుపతిలోని తన విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాయిబాబా విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు మోహన్ బాబు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. అప్పుడే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. కారణాలేమైనా అప్పట్లో అది జరగలేదు. ఆ ప్రచారమూ సద్దుమణిగింది. తాజాగా ఇప్పుడు రజనీకాంత్ చంద్రబాబుతో భేటీ కావడంతో ఆ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇ క పోతే మోహన్ బాబు, పవన్ కల్యాణ్  మధ్య అంతగా సయోధ్య లేదని చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది. పలు సందర్భాలలో ఆ విషయం నిజమేననిపించే సంఘటనలూ జరిగాయి. అయితే రజనీకాంత్ కు పవన్ కల్యాణ్ తోనూ, చంద్రబాబుతోనూ కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అలాగే మోహన్ బాబు ఆయనా కూడా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో రజనీకాంత్ మోహన్ బాబు తెలుగుదేశం ప్రవేశం గురించి చర్చించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, రజనీకాంత్ ల భేటీ  రాజకీయ చర్చకు తావిచ్చిందనడంలో సందేహం లేదు.  

చంద్రబాబు, పవన్.. తెలంగాణలో ప్రభావం ఎలా ఉంటుందంటే..?

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన సంగతి విదితమే.   వచ్చే ఎన్నికలలో ఏపీలో రాజకీయ సమీకరణాలేమిటన్నది ఈ భేటీ తేల్చేసిందనే పరిశీలకులు చెబుతున్నారు. వీరి భేటీపై అధికార వైసీపీ నేతల విమర్శలే.. రాజకీయ యవనికపై వీరి కలయిక ఎంతటి ప్రభావం చూపిందన్నది ఇట్టే అవగతమౌతుంది. జగన్  పాలనను  ప్రజా క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వ రాజ్యహింస, అణచివేత పతాక స్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదలాలని నిర్ణయానికి వచ్చాయా? ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? అంటూ వీరి భేటీ అనంతరం రాజకీయ వర్గాలలో చర్చ ప్రారంభమైంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. సరే ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే.. వీరి భేటీ ప్రభావం తెలంగాణలో ఎలా ఉంది.  ఉంటుంది అన్న విషయానికి వస్తే..  ఒక వేళ తెలుగుదేశం, జనసేనలు ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగితే పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అందుకే..  తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకులే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. అంటూ ఇంత కాలంగా వినవస్తున్న వ్యాఖ్యలన్నీ పూర్వపక్షమై పోయేలా ఇటీవలి చంద్రబాబు ఖమ్మం సభ సక్సెస్  అయ్యింది. తెలంగాణలో లీడర్ లేకపోయినా.. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్న విషయాన్ని తెలుగుదేశం సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది.  ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా తెలంగాణలో ఇప్పటికీ  తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ గట్టి పట్టు ఉంది. ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయనకు ఏపీలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో చంద్రబాబు, పవన్ కల్యాన్ భేటీ తెలంగాణలో కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.  జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ రణ క్షేత్రంలో  అడుగు పెడితే ఇక్కడ అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, జనసేనానికి ఉన్న ఆదరణ కలిసి రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావమే చూపే అవకాశం ఉంది.  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 14.7 శాతం ఓట్లతో 15 స్దానాలలో విజయం సాధించింది. అలాగే 2018 ఎన్నికలలో రెండు స్థానాలలో విజయం సాధించింది. ఇప్పటికీ   కనీసం పాతిక స్థానాలలో తెలుగుదేశం ప్రభావం గణనీయంగా ఉంటుందని పరిశీలకలు  విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయిన తరువాత తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైపోయిందనీ, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం మరింత ప్రభావమంతమైన పాత్ర పోషిస్తుందంటున్నారు. తెలుగుదేశం, జనసేనలు కలిస్తే ఆ ప్రభావం మరింతగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కలయిక వెనుక ఆర్ఎస్ఎస్ ఉండటంతో తెలంగాణలో  వీరి కలయికతో  అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అందులోనూ బీజేపీ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ తెలుగుదేశం, జనసేనల కలయిక వెనుక ఉందంటే కచ్చితంగా ఈ రెండు పార్టీల కు బీజేపీ మద్దతు కూడా తోడౌతుందనీ అంటున్నారు. ఉభయ తారకంగా తెలుగుదేశం జనసేనల పొత్తుకు ఏపీలో బీజేపీ సహకారం, అందుకు ప్రతిగా ఈ కూటమి తెలంగాణలో కమలం పార్టీకి  అండ  అన్న వ్యూహం అమలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. 

సెంట్రల్ విస్తాలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు?

ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నూతన పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయా అంటే కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. పార్లమెంటు కొత్త భవనం రెడీ అయ్యిందని, తుదిమెరుగులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ విస్తా పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పార్లమెంటు కొత్త భవనంలోనే రానున్న బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్న విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ.. ఈ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త బవనంలో సెంట్రల్ సెక్రటేరియెట్, ప్రధాని నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి నిలయం వంటివన్నీ ఉంటాయి. రెండేళ్ల కిందట ఈ నిర్మాణం మొదలైంది. 2020లో భూమి పూజ జరిగింది. టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులు చేపట్టింది. దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని చాటేలా జరుగుతున్న ఈ భవన నిర్మాణం తుదిమెరుగులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరుకు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్న పట్టుదలతో  కేందం ఉంది.   నిజానికి గతేడాది నవంబర్ లోనే పార్లమెంట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకుంది. మొత్తం మీద వచ్చే నెలలో జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పార్లమెంటు కొత్త భవనంలో జరుగుతాయా లేదా అన్న విషయంలో ఇప్పటికింకా క్లారిటీ రాకపోయినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. 

ఖమ్మం తరువాత నిజామాబాద్.. భారీ సభకు తెలంగాణ తెలుగుదేశం సన్నాహాలు

తెలంగాణలో తెలుగుదేశం మళ్లీ తనదైన శైలిలో పంజా విసురుతోంది. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభ... సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అదే జోష్‌తో మళ్లీ మరో చోట.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. ఆ క్రమంలో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కేంద్రంగా భారీ సభ నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అదీ ఈ జనవరి నెలాఖరులోగా ఉంటుందని తెలుస్తోంది. అందుకు త్వరలో తేదీ కూడా ఖరారు చేయనుందని సమాచారం.  ఆ క్రమంలో ఇప్పటికే టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇతర ముఖ్య నాయకులతో కూడా ఆయన భేటీ కానున్నారని సమాచారం. మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేసే అంశంపై కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఆ క్రమంలో గడప గడపకు మన టీడీపీ పేరుతో కార్యక్రమాలు సైతం చేపట్టనుందని తెలుస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వ హాయంలో చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోందని సమాచారం. ఇక గతంలో తెలుగుదేశం నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని సైతం..  తిరిగి ఆహ్వానించి.. అలా వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెట్టాలని.. అలాగే పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కష్టపడే వారికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు   ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామనే ఓ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతల్లోకి బలంగా వేళ్లేలా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే   ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  అలాగే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ పరంగా   తరచూ  సమీక్షా సమావేశాలు తరచు నిర్వహిస్తూ..  నిత్యం ప్రజల్లో పార్టీ ఉండేలా ప్రణాళికలు   సిద్దం చేసినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే.. కచ్చితంగా అభివృద్ధి జరుగుతోందనే ఓ విధమైన భరోసా ప్రజల్లో కల్పించాలనే లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.   మరోవైపు ఇప్పటికే ఖమ్మంలో ప్రారంభమైన టీడీపీ బహిరంగ సభల ఏర్పాటు.. నిజామాబాద్ మీదగా.. వరంగల్, మహబూబ్‌నగర్‌తోపాటు   అన్ని జిల్లాల మీదుగా సాగి.. చివరకు అంటే.. జస్ట్ ఎన్నికల ముందు హైదరాబాద్‌ మహానగరంలో అతి పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాలనే లక్ష్యంతో టీటీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.  ఇక తెలంగాణ సెంటిమెంట్‌ను పునాదిగా చేసుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని రగిలించిన.. టీఆర్ఎస్   స్థాపకుడు కేసీఆర్  పార్టీని తాజాగా బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. దీంతో గతంలో ఆయన రగలించిన తెలంగాణ సెంటిమెంట్ కాస్తా.. పార్టీ పేరులో కూడా లేకుండా పోయింది. అదీకాక..  తెలంగాణలో కేసీఆర్ పాలనపై ప్రజల్లో  వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాంటి నేపథ్యంలో కేసీఆర్‌ని.. ఆయన  బీఆర్ఎస్‌ని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? అంటే సందేహమేనని రాజకీయ విశ్లేషకులు   పేర్కొంటున్నారు.  మరోవైపు బీజేపీ సైతం తెలంగాణలో పాగా వేసేందుకు ఎంత చేయాలో అంత చేస్తోంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోలతో.. ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అన్న సంగతి తెలంగాణ ప్రజలు ఏమో కానీ .. హస్తం పార్టీ నేతలకే పూర్తిగా అర్థమైపోయింది.  తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. సైకిల్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఏక తాటిపైకి వచ్చి కొద్దిగా కష్టపడితే.. రానున్న ఎన్నికల్లో పురుటి గడ్డపై తెలుగుదేశం పార్టీ మళ్లీ సత్తా చాటుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషించి మరీ చెబుతున్నారు.

విపక్షాల ఐక్యతా యత్నాలు సవ్యంగా సాగేనా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే అధికార  పక్షంలో కాదు ప్రతి పక్షాల్లోనే  హడావుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత అనుభవం దృష్ట్యా  చివరి క్షణంలో  ఐక్యతా ప్రయత్నాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదని, అధికార బీజేపీని ఎదుర్కొవడం అంత తేలికైన టాస్క్ కాదనీ అర్దమవ్వడమే.   2014, 2019లో ఎన్నికలలో  విపక్షాల అనైక్యతే బీజేపీకి అదనపు బలంగా మారిందన్నసంగతి అన్ని రాజకీయ పార్టీలూ గ్రహించేశాయి.  అయినా విపక్షాల మధ్య ఐక్యతా యత్నాల ధోరణి ఎవరి దారి వారిదే అన్నట్లుగానే ఉంది.   భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ   ప్రతిపక్షాల ఐక్యత గురించి ప్రస్తావించారు. సరే ఇక ఆరంభం అవుతాయా అనుకునేలోగానే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు  కూటమి అయినా, పొత్తులున్నా.. రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా అంగీకరించాల్సిందే నంటూ కండీషన్ ను తెరమీదకు తీసుకు వచ్చారు. ఈ ఏడాదిలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు  ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఐక్యతా రాగం ఆలపించగలిగితేనే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నకల నాటికి ఐక్యత బలపడే అవకాశం ఉంటుంది.  అయితే ఈ ఏడాది వివిధ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలలో విపక్షాలు సంఘటితంగా సత్తా చూపే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రావడం లేదు.   2014, 2019 సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు  ఏక తాటి మీద నిలబడి పోటీ చేసి సత్ఫలితాలను అందుకున్నాయి. కానీ, సార్వత్రిక ఎన్నికల విషయం వచ్చే సరికి  ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ తిరుగులేని విజయం సాధించింది.   ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  ఆర్‌ఎల్‌.డి, బి.ఎస్‌.పి, ఎస్‌.పిలు కలిసి కేవలం 15 స్థానాలు మాత్రమే చేజిక్కించుకోగా, బీహార్‌లో ఆర్‌.జె.డి, జె.డి.యు, కాంగ్రెసులు ఒక్క స్థానానికే పరిమితమయ్యాయి.   ఈ విషయం ఎవరికి అర్ధమైనా కాకున్నా  రాహుల్‌ గాంధీకి మాత్రం   పూర్తిగా బోధపడిందని అర్ధమౌతున్నది.  ప్రతిపక్షాలు ఈ సారైనా ప్రజల దగ్గరికి ఒక విజన్‌తో వెళ్లాలి. ఈ విజన్‌ బీజేపీ విజన్ కు ప్రత్యామ్నాయంగా ఉండాలి. అది లేకుండా కలిసి కట్టుగా జనం ముందుకు వెళ్లినా ఫలితం ఆశించిన విధంగా ఉండదని ఆయన ఇప్పటికే తేటతెల్లం చేశారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్ వాదీ పార్టీ, డి.ఎం.కె, వామ పక్షాలు బీజేపీకి బద్ధ శత్రువులే అయినప్పటికీ, 2014 నుంచి ఈ పార్టీలు ప్రతిపక్షాల ఐక్యతకు దూరంగా  ఉంటున్నాయి.   రాహుల్‌ గాంధీ చెప్పినట్టు, ప్రతిపక్షాల ఐక్యత అనే ది సీట్ల పంపకం స్థాయి  దాటి లోతుకు వెళ్లాలి. కానీ బీజేపీ వ్యతిరేక కూటమికి  సారథి ఎవరు అనే విషయంలోనే విపక్షాల మధ్య బేధాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. ఇప్పటికింకా ఐక్యతా యత్నాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు కానీ,  విపక్ష ఐక్య కూటమికి నాయకుడెవరన్న విషయంలో చర్చోపచర్చలు అయితే మొదలైపోయాయి. మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌  సహా పలువురు నాయకులు ఈ రేసులో మేమున్నామంటూ అప్పుడే సంకేతాలు, సందేశాలు పంపుతున్నారు.   దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా,ఉన్నప్పటికీ విపక్షాల ఐక్యతకు సారథ్యం విషయంలో మాత్రం  కాంగ్రెస్‌ నేనున్నానంటూ అగ్రతాంబూలం కోసం రెడీ అయిపోతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవలం మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న సంగతి విదితమే.  అక్కడ కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయాలు సాధిస్తుందన్న విశ్వాసం అయితే ఆ పార్టీలో గట్టిగా కనిపించడం లేదు. ఈ కారణంగానే ప్రతిపక్షాలు కాంగ్రెస్ నాయకత్వంపై పెద్దగా విశ్వాసం కనబరచడం లేదు. ఇప్పటికిప్పుడైతే విపక్షాల ఐక్య కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని  మెజారిటీ పక్షాలు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా  ప్రతిపక్షాల ఐక్యత గురించి ముందుగా ప్రస్తావించారు. ఆయన ప్రతిపాదనకు, ఆయన చెబుతున్న డిఫరెంట్ విజన్ అంశానికీ విపక్షాల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.  ప్రతిపక్షాల మధ్య ఉన్న రాజకీయ వైవిధ్యాలను చక్కదిద్ది, వాటిని ఒకే తాటి మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్‌కు లేదా రాహుల్‌ గాంధీకి ఉన్న అర్హతలేమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాలలో సర్క్యలేట్ అవుతోంది. సొంత పార్టీలో విభేదాల పరిష్కారానికే చెమట్లు కక్కుతున్న కాంగ్రెస్ ఇక విపక్షాల మధ్య రాజకీయ ఐక్యత ఏ విధంగా తీసుకురాగలదని పరిశీలకులు అంటున్నారు. ఉదాహరణగా తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరి పాకాన పడ్డ విభేదాల పరిష్కారంలో కాంగ్రెస్ అధిష్ఠానం వైఫల్యాన్ని చూపుతున్నారు. 

గవర్నర్ వర్సెస్ సీఎం.. తమిళ సభలో కొత్త చిత్రం

తమిళనాడు అసెంబ్లీకి మంచి చరిత్ర వుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం.. కొండకచో ముష్టిఘాతలకు పాల్పడడం .. మొదలు మినీ వస్త్రాపహరణ యత్నాల వరకు.. చాలా చాలా అవాంఛనీయ సంఘటనలకు తమిళనాడు అసెంబ్లీ వేదికగా నిలిచిన ఘన చరిత్ర వుంది.  అఫ్కోర్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్త్ర ప్రదేశ్  రాష్ట్రాలలోనూ, నిండు సభలో ప్రతిపక్ష నేత కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనల వంటివి చాలానే జరుగుతున్నాయి  అది వేరే విషయం. ఇప్పుడు తమిళనాడు శాసనసభలో  మరో మారు...  మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.  ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం సాధారణం. అది ఎక్కడైనా ఉన్నదే. జరిగేదే. కానీ తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ఆర్ఎన్ రవి  తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని.. వాటిని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని,  తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలని చెప్పారు.  దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.  దీంతో ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేసి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు.  గవర్నర్ తన ప్రసంగంలో ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు పదాన్ని పలకలేదని ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగం కాపీల్లో తమిళనాడు అని ఉన్నా.. గవర్నర్ ప్రస్తావించకపోవడంపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా తమిళనాడు ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న ద్రావిడ మోడల్, తమిళనాడు అన్న చోట గవర్నర్ ప్రత్యామ్నాయ పదాలను వాడారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని,  గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ దాన్ని ఆమోదించింది. అయితే, ఇది ఎదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే కాదు, తెలంగాణలో ఎలాగైతే, గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధం నడుస్తోందో, తమిళ నాడులోనూ చాలా కాలంగా ముఖ్యమంత్రి గవర్నర్ మధ్య అలాంటి యుద్ధమే నడుస్తోంది. అందులో భాగంగానే ఈ పరిణామాన్ని చూడాలి. తమిళనాడు  గవర్నర్ ఆర్ఎన్ రవి. ముఖ్యమత్రి స్టాలిన్ ప్రభుత్వం మధ్య గతంలో ‘నీట్’ పరీక్ష విషయంలో, ఇటీవల కోయంబత్తూర్ లో జరిగిన కారు విష్పోటనం విషయంలో వివాదం తలెత్తింది.  ఈ వివాదాల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చందూ అసలు గవర్నర్ వ్యవస్థే అనవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర పదవి అనవసరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుల్ని గవర్నర్ పెండింగులో పెట్టడం ఏ మేరకు సమంజసమని జస్టిస్ చందూ ప్రశ్నించారు. అయితే  బిల్లులను పెండింగ్ లో పెట్టే అధికారం భారత రాజ్యాంగమే గవర్నర్ కి  కల్పించిందని, మరో వాదన వుంది. నిజానికి  కేంద్రంలో రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ ఎప్పటికప్పడు వివాదస్పద మవుతోందని, ఈ నేపధ్యంలో  బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను కొనసాగించడం అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇప్పడు మళ్ళీ మరో మారు  అదే  చర్చ మొదలైంది.

ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం అడ్డుగా మారుతోందా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగుతున్న తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయా? ఉభయ తెలుగు రాష్ట్రల సరిహద్దు జిల్లా రాజకీయాలు తెలంగాణ రాజకీయాలలో కీలకం కానున్నాయా  అంటే, అవుననే సమాధానమే వస్తోంది. తెలుగుదేశం పార్టీ గత డిసెంబర్ 21న ఖమ్మంలో శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించింది. అనూహ్యంగా  టీడీపీ సభ సూపర్ సక్సెస్ అయింది. సభ సక్సెస్ అవడమే కాదు  రాష్ట్ర రాజకీయాలని కొత్త మలుపు తిప్పింది. కొత్త చర్చకు దారి చూపింది. తెరాస, భారాసగా మారి జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అడుగులు వేస్తున్న నేపధ్యంలో టీడీపీలో చాలా కాలం తర్వాత తెలంగాణ గడ్డమీద సభ  నిర్వహించం, ఈ సభలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్  మారింది.  అదలా ఉంటే కొత్త సంవత్సరం (2023) జనవరి ఫస్ట్ న ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు అధికార భారాస ముఖ్య నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు,  మాజీ ఎంపీ పొంగులేటి  ఒకరు పాలేరులో ఇంకొకరు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు అధికార బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఇక అక్కడి నుంచి తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూతా  తిరుగుతున్నాయి. ఇటు తుమ్మల, అటు పొంగులేటి ఒకే సారి అసమ్మతి గళం వినిపించడం ఆ ఇద్దరు పార్టీతో సంబంధం లేకుండా రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించడం, అందుకు కొనసాగింపుగా ఆ ఇద్దరు పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరగడంతో అధికార బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తమయ్యారు.   జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ తో పాటుగా ఇతర మంత్రులు  ముఖ్య నేతలు ఉమ్మడి ఖమ్మం  జిల్లాలో  పర్యటిస్తున్నారు. మరో వంక పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమై, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ నెల 18న ఢిల్లీలో అనుకున్న భారాస ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఢిల్లీ  లేదా యూపీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందర్నీ పిలిచి..  కొత్త పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి ఖమ్మంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు. దీంతో ఖమ్మం రాజకీయాలపై మీడియా  ఫోకస్ పెరిగింది. అదలా ఉంటే అదే రోజున పొంగులేటి, ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. అయితే, పొంగులేటి ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారా లేక, ఒక రోజు తర్వాత  జనవరి 19 న హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో పార్టీలో చేరతారా అనే విషయంలో కొంత క్లారిటీ రావలసి వుంది. ప్రధాని మోడీ జనవరి 19న హైదరాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.  ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభలో పొంగులేటి పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు .అయితే చిత్రంగా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో కాలు పెట్టింది మొదలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయి.

తెలంగాణ సీఎస్ ఏపీకి వెళ్లాల్సిందే? హై కోర్టు తీర్పు.. కోరినా గడువు ఇవ్వని న్యాయస్థానం..

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ సీఎస్ గా ఆయన కొనసాగింపును రద్దు చేస్తూ  హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.  క్యాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ మంగళవారం (జనవరి 10)న తీర్పు వెలువరించింది.   రాష్ట్ర విభజన జరిగినప్పుడు సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేంద్రం 2017లో హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది.  సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్‌ను రద్దు చేస్తూ ఏపీకి వెళ్లాలని తీర్పు వెలువరించింది.  తీర్పు అమలుపై సోమేష్ కుమార్ తరఫు న్యాయవాది  మూడు వారాలు గడువు కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. ఆయన తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. 2019 డిసెబంర్ నుంచి సోమేశ్ కుమార్ తెలంగాణ సీఎస్‌గా కొనసాగుతున్న సంగతి విదితమే. హై కోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఇక ఏపీకి వెళ్లి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏపీకి వెళతారా? లేక ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ ప్రవేశం చేసి బీఆర్ఎస్ లో కొనసాగుతారా అన్న విషయం ఆయనే తేల్చుకోవలసి ఉంటుంది.  ఆంధ్రా కేడ‌ర్ కి చెందిన సోమేష్ పట్టుబట్టి  మరీ ఇంత కాలంగా తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఇందుకు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించి మరీ ఏపీకి వెళ్లకుండా తెలంగాణకే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా సోమేష్ కుమార్ ఇటీవలి కాలంలో ఈడీ నజర్ లో ఉన్నారని కూడా అంటున్నారు.  ముఖ్యంగా ఫీనిక్స్ కుంభ‌కోణంలో సోమేష్ ప్రమేయంపై  ఈడీ కూపీలాగుతోందని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే  కోర్టు తీర్పు ఆయనను మరిన్ని ఇబ్బందులలోకి నెట్టడం ఖాయమని అంటున్నారు. దీంతో ఆయన కేంద్రం కేటాయింపు ప్రకారం ఏపీకి వెళతారా? లేక రాజీనామా చేసి రాజకీయాలలో అడుగుపెడతారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. సీఎస్ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా కొనసాగుతున్న అంజనీ కుమార్ కూడా ఏపీ క్యాడర్ కు చెందిన వారే కావడంతో ఆయన భవిష్యత్ ఏమిటన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొని  ఉంది. అంజనీ కుమార్ తెలంగాణ క్యాడర్ అధికారి కాదు. ఆయన కూడా ఏపీ క్యాడర్ కు చెందిన అధికారే. ఇందుకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ కేసు తేలిన తరువాత మాత్రమే ప్రస్తుతం తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో  హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అంజనీ కుమార్ విషయంలో ఏం జరగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.  

ముందస్తు పై మళ్ళీ పిల్లి మొగ్గలు!

ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి .. ఎటూ పోలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం…కొట్టుమిట్టాడు తోందా అంటే,పబ్లిక్ అవుననే అంటున్నారు. మేథావులు అయితే, మహా కవి, శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు,(ఆ సాయంత్రం...ఇటు చూస్తే అప్పులవాళ్లూ..అటు చూస్తే బిడ్డల ఆకలి.. ఉరిపోసుకు చనిపోవడమో..సముద్రమున పడిపోవడమో-..సమస్యగా ఘనీభవించిందొక సంసారికి  గీతాన్ని గుర్తు చేస్తున్నారు.  ఏపీ ప్రభుత్వాన్ని కూడా అదిగో అలాంటి సంధ్యా సమస్యలే వెంటాడుతున్నాయి అంటున్నారు. అందుకే పరిస్థితి ఎటూ పాలు పోక గుడుగుడు గుంచం గుండేరాగం .. అన్నట్లు ముందస్తు ఎన్నికల చుట్టూ అక్కడక్కడే  గిరగిర తిరుగుతోందని, వైసీపీ నేతలు  పిల్లి మొగ్గలు వేస్తున్నారని అంటున్నారు. నిజానికి, ఓటమి భయం తోనే వైసీపీ నేతలు ఏమి  చేయడమో ... ఎటు పోవడమో పాలుపోని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు పోదామంటే, ముందస్తు ఎన్నికలకు పోతే ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. అలాగని అందాక అగుదామంటే.. అసలుకే మోసం వచ్చేలా వుంది. అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల అట్టును, ఒక రోజు ఇటు ఒక రోజు అటు తిరగేస్తున్నారు. నిజానికి  ముందస్తు ఎన్నికలను ముందుగా తెరపైకి తెచ్చిందే అధికార పార్టీ నాయకులు. ఒకసారి కాదు, ఒకటికి పది సార్లు వైసీసీలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో ‘ఆల్ ఇన్ వన్’ గా చెలామణి అవుతున్న   సజ్జల రామకృష్ణా రెడ్డి ముందస్తు ఉందనో లేదనో వాక్రుచ్చి, ఎప్పటికప్పుడు ముందస్తు చర్చను సజీవంగా ఉంచుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే, ముందస్తు ముచ్చటను తెర మీదకు తెచ్చారు.  నిజానికి  ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వ్యూహాత్మక తప్పటడుగులను పట్టించు కోవడం లేదు. ప్రభుత్వం వేస్తున్న పిల్లి మొగ్గలను అయితే అసలే పట్టించుకోవడం లేదు.  ఆ ముచ్చటను ఎప్పుడోనే వదిలేశాయి. అలాగే  ప్రజలు కూడా ముందస్తా వెనకస్తా అనేది పక్కన పెట్టి, ఎన్నికలు ఎప్పడు వచ్చినా, ఒక్క ఛాన్స్ మోసానికి గట్టిగా బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే వైసీపీ  నాయకులు మాత్రం ఇంకా తమను తాము మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేసే విఫల ప్రయత్నం చేస్తున్నారు.   ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు ముందు ఎందుకు వెళుతున్నారు అనేది కానీ, వెళ్లి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్లారు, ఏమి చేశారు అనేది కానీ ఓపెన్ గా చెప్పేస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం ఉండేది కాదు. కానీ, అలాంటిది ఎమీ లేకుండా  ఆయన ఎప్పుడు వెళ్ళినా విడుదల చేసే ‘ఆవు కథ’ వినతి పత్రాన్ని,తేదీలు  మార్చి విడుదల చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది ఎందుకనుకుంటున్నారు ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రధాని అనుమతి కోసం  అంటూ వైసీపీ నాయకులు, సోషల్ మీడియా చెవి కొరుకుడు ప్రచారం సాగించారు. తమకు మాత్రమే తెలిసిన ఈ ‘రహస్యా’న్ని  అడిగిన వారికీ, అడగని వారికీ మాత్రమే చెప్పి, ముందస్తు చర్చను ముందుకు తెచ్చారు. అయినా అప్పుడు  సజ్జల సహా పార్టీ పెద్దలు ఎవరూ బయటకు వచ్చి అలాంటిది ఏమే లేదని గట్టిగా చెప్పలేదు. ఏదో అలా ఓ చిన్న ప్రకటనతో సరిపెట్టారు. కాగా, ఇప్పడు తాజాగా తాజాగా పవన్, చంద్రబాబు భేటీ తర్వాత మరోమారు   సజ్జల అసలు ముందస్తు ఎన్నికల ఆలోచనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేయడం లేదని ప్రకటించారు. ప్రజలు మాకు ఐదేళ్లు పరిపాలించేందుకు అవకాశం ఇచ్చారని ఆయన చెబుతున్నారు. పవన్, చంద్రబాబు భేటీ అయ్యారని తెలియగానే సజ్జల రామకృష్ణారెడ్డి హఠాత్తుగా తెర ముందుకు వచ్చి. ముందస్తు ఎన్నికలు ఉండవని సెలవిచ్చారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకునేందుకు ఎన్ని అడ్డదారులు అయినా తొక్కేందుకు సిద్ధంగా ఉందని, ఆ వ్యూహంలో భాగంగా, విపక్షాల నడుమ సాగుతున్న పొత్తుల చర్చ ఒక కొలిక్కి రాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన జగన్ మదిలో  లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ అనిమనిస్తున్నారు.  అయితే విపక్ష పార్టీలు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజా బలమున్న తెలుగు దేశం, జనసేన జగన్ అంచనాలను తారుమారు చేసి.. వేగంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఇప్పుడు వెనక్కి తగ్గితే  బెటరని వైసీపీ వ్యూహకర్తలు  ఆలోచిస్తున్నారని చెపుతున్నారు. అందుకే సజ్జల మరో మారు తెర మీదకు వచ్చి పవన్,చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పడం లేదని  వాపోతున్నారు. నిజమే అది రహస్య సమావేశమే కావచ్చు, అయినా ప్రతిపక్ష పార్టీల సమావేశం వివరాలను బయట పెట్టాలి అనుకోవడం  ముఖ్యమంత్రి ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించినట్లు చేపుతున్న వివరాలను మాత్రం దాచి ఉంచడం ఏమిటో  సజ్జల వారే సెలవివ్వాలని అంటున్నారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో రహస్యం ఏమీ లేదు.  ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ జగన్ రెడ్డి తెచ్చిన అత్యంత ప్రమాదకరమైన జీఓ 1 పైనే వారు చర్చించారు. ఒక విధంగా ఆ ఇద్దరినీ కలిపింది కూడా ఆ దుర్మార్గ జీఓ నే. అంతే కాదు, ఆ ఇద్దరిని పీటల మీదకు చేర్చింది, పౌరోహిత్యం చేసింది కుడా మరెవరో కాదు వైసీపీ పెద్దలే. అయినప్పటికీ వాళ్లు ఓట్లు, సీట్లు గురించి చర్చించుకున్నారని చెప్పలేదని సజ్జల బాధపడిపోతున్నారు.అయితే, రాజకీయ పరిశీలకులు మాత్రం ఒకసారి ప్రజలు నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందస్తు అయినా వెనకస్తు అయినా  ఒకటే .. ముందు నుయ్యి వెనుక గొయ్యి ...ఎటు పడిపోవడమో .. తేల్చుకోవల్సింది ..ఆయనే అంటున్నారు.

రోజాతో మెగాఫ్యాన్స్‌ చెడుగుడు!

రోజా పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ముగ్గులోకి లాగారు. చిరంజీవి, ఆయన తమ్ముళ్ల వల్ల ప్రజలకు ఉపయోగమేమీ లేదు అంటూ విమర్శించారు. మంత్రి పదవి రాగానే రోజా హడావుడిగా తన కుటుంబ సభ్యులందరినీ వెంటేసుకొని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వారింటే భోజనం చేసి వస్తూ వస్తూ చిరంజీవితో నవ్వుతూ ఫోటోలు కూడా దిగారు. విమర్శలు అనేవి రాజకీయానికి పరిమితం కావాలి కానీ, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న చిరంజీవిపై విమర్శలు గుప్పించడానికి రోజా ఎవరు? చిరంజీవి వ‌ల్ల  ప్రజలకు ఉపయోగముందో లేదో ప్రజలకు తెలుసు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ లతోపాటు కరోనా సమయంలో రాష్ట్రం వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఘనత చిరంజీవిది. ఆమె అనుకున్నట్లు ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకులను రన్ చేయడం అంత సులభం కాదు. రోజుకి ఖర్చు లక్షల్లో ఉంటుంది. వాటిని భద్రపరచాలన్నా, చెడిపోకుండా వాటిని ఉపయోగంలో ఉంచాలన్నా భారీ వ్యయం అవుతుంది. అంతేనా సినీ కార్మికుల కోసం కూడా చిరు కరోనా సమయం నాటి నుండి తన స్థాయికి తగ్గట్టుగా సాయం చేస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో అసలు తన జీవితం మొత్తం జనాలకి అంకితం చేస్తానని తనకు పదవులు వద్దు అని దేవుడు తనకిచ్చింది చాలని చిరంజీవి చెప్పిన విషయాన్ని ఫ్యాన్స్ రోజాకు గుర్తు చేస్తున్నారు.   దేవుడు నాకు అనుకున్న దానికంటే   ఎక్కువే ఇచ్చారు.  ఇంతకాలం నా కుటుంబం గురించి ఆలోచించాను. ఇకపై మాత్రం నా సినిమా సంపాదన నుంచి ప్రతి ఒక్కటి సమాజానికే ఇచ్చేస్తాను అని ఓపెన్ గా చెప్పారు.  చిరంజీవి వ‌ల్ల  ప్రజలకు ఉపయోగపడలేదంటున్న రోజా వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని మోగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు   మాట్లాడే డిక్కీ బలిసిన కోడి, నన్ను రేప్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? వంటి మాటల భావితరాలకు ఇచ్చే సందేశం ఏమిటని నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రోజాని  మెగా ఫాన్స్ కడిగిపారేస్తున్నారు.బ్లడ్ బ్యాంక్ ద్వారా గొప్ప కార్యక్రమాన్ని చిరంజీవి చేపడుతున్న విషయాలన్నీ ప్రస్తావిస్తున్నారు. ఇవేవీ రోజా కి కనిపించడం లేదా? అని అంటున్నారు.  చిత్రమేమంటే ప్రతి విషయంలోనూ రోజాను వెనకేసుకొచ్చే వారు సైతం ఇప్పుడు రోజాను తప్పుపడుతున్నారు. కోవిడ్ కష్టకాలంలో వైసీపీ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చిరు తను రాజకీయాల్లో లేకపోయినా తన స్థాయిలో   ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర నుంచీ  ఎన్నో విషయాల్లో సాయం చేశారు. సినీ పరిశ్రమలోని ఎంతో మంది కార్మికులను ఆదుకున్నారు. మరి రోజా సినీ పరిశ్రమలో ఇంత సాధించి... సంపాదించిం కార్మికులకు ఏమైనా సాయం చేశారా?    ఒకనాడు టిడిపిలో చేరి చంద్రబాబు పంచన చేరి  వైయస్ రాజశేఖర్ రెడ్డిని తూల‌నాడిన రోజా ,ఇప్పుడు వైయస్ జగన్ పంచ‌న  చేరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ఏమిటని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఒక వేలు  ఎదుటివారిపై చూపించేటప్పుడు నాలుగు వేళ్లు  మన వైపే చూపిస్తాయి అన్న విషయం రోజా తెలుసుకోవాలని అంటున్నారు?

క్యాడర్ తో లోకేష్ పర్సనల్ టచ్!

రాజకీయ పార్టీల నాయకులు ఎంతగా ప్రజల్లో మెలగ గలిగితే అంతగా ప్రజలకు దగ్గరవుతారు. అలాగే నాయకులకు పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలు నాయకులు అనే కాదు, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ, వారి వారి పుట్టిన రోజున లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తారు. ప్రధాని సంతకంతో శుభాకాంక్షలు అందడం ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది. ఇక పార్టీ కార్యకర్తలకు అయితే కొత్త శక్తిని  ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులు ఇంకా ఉన్నారు.  ఆ కోవలోకే వస్తారు.. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన దుష్పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు త్వరలో,   ‘యువగళం’  పేరుతో ప్రారంభించబోతున్న పాదయాత్ర కోసం లోకేష్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో యువగళంలో యువతను ఆకట్టుకునేలా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. కొంచెం టచ్ లో ఉంటే చెపుతా .. అంటూ కార్యకర్తలను వాట్సప్  ద్వారా పలకరిస్తున్నారు.   పార్టీ కోసం పని చేస్తున్న యువ నాయకులు, కార్యకర్తల గురించి ఎక్కువ శ్రద్ద  తీసుకుంటున్నారు. తన పాదయాత్ర సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి ఎవర్నైనా కలవాలంటే ఇబ్బంది అవుతుందని.. సోషల్ మీడియా సైనికుల్ని..  యువ నేతల్ని పిలిచి వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు.. నేరుగా వారితో నేరుగా టచ్‌లోకి వెళ్తున్నారు. ఈ పరిణామం  టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని సంతోషానికి గురి చేస్తోంది.  డియర్ శ్రీనివాస్.. మీరు ప్రభుత్వ నిర్బంధాల్ని ఎదుర్కొని పోరాడుతున్న వైనం అద్భుతంగా ఉంది. నేను మీకు అండగా ఉంటాను అని నారా లోకేష్   పర్సనల్ వాట్సాప్ నెంబర్ నుంచి మెసెజ్ వస్తే.. సగటు టీడీపీ కార్యకర్తలకు ఎలా ఉంటుంది. గాల్లో ఎగురుతున్నట్లే ఉంటుంది. ఇలాంటి అనుభూతి చాలా మంది టీడీపీ కార్యకర్తలకు కలిగింది. ఎందుకంటే నారా లోకేష్ ఇలా వందల మంది టీడీపీ కార్యకర్తలకు మెసెజ్ చేశారు. అంత తీరిక ఆయనకు ఉందా .. ఇదంతా చాట్  బోట్ ద్వారా చేస్తున్నారని కొంత మంది అనుకున్నారు. ఎవరేమనుకున్నా.. తమను గుర్తించారన్న ఓ ఆనందం మాత్రం కార్యకర్తలకు కలిగింది.  ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ కోసం స్వచ్చందంగా పని చేసే కార్యకర్తలను  లోకేష్  వ్యక్తిగతంగానూ కలిశారు. ప్రతీ రోజూ పదుల సంఖ్యలో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందరితో సమావేశం పెట్టి ప్రసంగించి వెళ్లడం లాంటి పనులు చేయకుండా ఒక్కొక్కరితో సమావేశం అయ్యారు. వారికి ఎలాంటి  సమస్య వచ్చినా తానున్నానని భరోసా ఇచ్చి పంపించారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మరితం ఉత్సాహంగా పని చేస్తున్నారు. లోకేష్ పార్టీలోని యువశక్తిని యాక్టివేట్ చేస్తున్నారని .. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది.  నిజానికి తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా లోకేష్ పార్టీ కార్యకర్తల మంచి చెడులు చూసుకుంటున్నారు, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇష్తున్నారు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే సంప్రదాయాన్ని టీడీపీతోనే ప్రారంభించారు. ఈ ఆలోచన లోకేష్ బ్రెయిన్ చైల్డ్. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక  వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందివచ్చిన టెక్నాలజీ సాయంతో అందరితో దగ్గర సంబంధాలు పెంచుకుంటున్నారు. లోకేష్ తీరుతో పార్టీలో యువత మరింత చురుకుగా పని చేస్తోందని అంటున్నారు. ఇలాంటి పర్సనల్ టచ్ .. దీర్ఘ కాలంలో పార్టీకి  మేలు చేస్తుందని అంటున్నారు.

తెలంగాణకు కొత్త గవర్నర్ ?

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి ఇంచు మించుగా మూడున్నరేళ్లు పూర్తయ్యాయి. 2019 సెప్టెంబర్ లో ఆమె తెలంగాణ గవర్నర్  గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్  నుంచి  బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన ఆమె పదవీ కాలం ముగిసేందుకు ఏడాదిన్నరకు పైగానే సమయముంది. అయితే త్వరలోనే  ఆమె స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళి సై తెలంగాణ గవర్నర్ బాధ్యతలతో పాటుగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్  బాధ్యతలు పూర్తి స్థాయిలో ఆమెకు అప్పగించి, తెలంగాణకు కొత్త వారిని గవర్నర్  గా నియమించే ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రి  అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెల్సుస్తోంది.  అయితే  గవర్నర్ మార్పునకు, ఇదీ కారణం అని స్పష్టంగా తెలియక పోయినా ఇటీవల కాలంలో గవర్నర్ కు ముఖ్యమంత్రికి, రాజ్ భవన్ , ప్రగతి భవన్ (ముఖ్యమంత్రి నివాసం )కు మధ్య దూరం పెరిగిపోవడం, రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదాలు తలెత్తడం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ఒక కారణం అయితే  కావచ్చును కానీ, అదే ప్రధాన కారణం అయితే కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలకు సంబంధించి గవర్నర్ తమిళి సై పలు మార్లు కేంద్ర హోం మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతగల మంత్రులు ఇతర అధికారులు మీడియా ముఖంగా లేవనెత్తిన అంశాలను పరిశీలించిన మీదట  కేంద్ర హోం శాఖ అధికారులు, తెలంగాణకు రాజకీయ నాయకుల కంటే రిటైర్డ్  సివిల్ సర్వెంట్స్ గవర్నర్ గా నియమించడం అవసరమని నిర్ణయానికి వచ్చారని, అందుకే తమిళి సై స్థానంలో  రిటైర్డ్ సివిల్ సర్వెంట్  ను నియమించేందుకు వీలుగా ఆమెను పుదుచ్చేరికి పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణ ఆందోళన ఉదృతంగా ఉన్న రోజుల్లో (2010)లో ఉమ్మడి రాష్త్రం గవర్నర్ గా వచ్చిన మాజీ ఐపీఎస్ ఈఎస్ఎల్ నరసింహన్  రాష్ట్ర విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్  గా వరసగా 9 ఏళ్ళు కొనసాగడమే కాకుండా విభజన వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్న రోజుల్లో గవర్నర్, ముఖ్యమత్రి మధ్య సత్సంబంధాలు ఉండేవి ముఖ్యమంత్రి కేసీఆర్  రాజ్ భవన్   కు వెళ్లి గవర్నర్ తో అన్ని విషయాలు చర్చంచి, సలహాలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగత స్థాయిలోనూ ఇద్దరి మధ్య గౌరవప్రదమైన సంబంధాలే చివరి వరకు కొనసాగాయి. ముఖ్యమంత్రి గవర్నర్ దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆశీస్సులు అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పండగలు పబ్బాలకు శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.  ఈ అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని, ఉత్తరది రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ను తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించే అలోచనలో కేంద్ర హోం శాఖ ఉందని అంటున్నారు. అయితే, ఇప్పటికే గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మాజీ సివిల్ సర్వెంట్ ను నియమిస్తారా? లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా,అనేది ఇంకా తెలియవలసి వుంది. అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న గవర్నర్ మార్పు నిర్ణయం రాజకీయంగానూ చర్చనీయాంశం మవుతోందని అంటున్నారు. ముఖ్యంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారాసల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ మార్పుకు . రాజకీయ ప్రాముఖ్యతను కూడా కాదన లేమని అంటున్నారు.

బండికి బెర్త్ ఖాయం.. ఈటలకు పార్టీ పగ్గాలు

ఉత్తర భారత దేశంలోనే కాదు,తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి పెరుగుతోంది. జనం బయటకు రావాలంటే ఒణుకుతున్నారు. అయితే, దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రాష్ట్రం ఎన్నికల సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చేసిన నేపథ్యంలో ఎన్నికల వేడి అన్ని పార్టీల్లో, అందరు నాయకుల్లో కాక పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలు వ్యూహలకు పదునుపెడుతున్నాయి.  ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా  భారతీయ జనతా పార్టీ మాత్రం  ఇప్పడు కాకపొతే ఇంకెప్పుడు తెలంగాణలో అధికారంలోకి రాలేము అన్న నిర్ణయానికి వచ్చింది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (భారాస) ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోంది. అంతర్గత సమస్యలతో సతమత మవుతోంది. పార్టీ నాయకులను సిబిఐ, ఈడీ కేసులు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక  ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, అంతర్గత కుమ్ములాటలు, జూనియర్ సీనియర్, పాత, కొత్త కొట్లాటలతో పార్టీ దినదిన ప్రవర్త మానంగా దిగజారి పోతోంది. పీసీసీ అధ్యక్షుడు రెంత్ రెడ్డి కాడి తన్నేసేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి.  మరో వంక బీజేపీ దుబ్బాక, హుజురాబాద్ గలుపుతో పాటుగా, ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్’ను పడగొట్టి రెండవ స్థానంలోకి వచ్చింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో డిపాజిట్ కోల్పోవడంతో, పార్టీ మూడో స్థానానికి పడిపోయిందనే అభిప్రాయం బలపడిపోయింది. దీంతో బీజేపీలో జోష్ పెరిగింది. మునుగోడులో బీజేపీ అధికార భారాసకు గట్టి పోటీ ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఊరి కొకరు, వాడ కొకరు అన్నట్లు మోహరించినా, అధికార భారస అభ్యర్ధి  10,000 స్వల్ప మెజారిటీతో మాత్రమే బయట పడ్డారు. సో .. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసేందుకు ఇదే సరైన సమయమని, ఈ అవకాశం వదులుకుంటే ఇక మళ్ళీ ఇప్పట్లో మరో అవకాశం రాకపోవచ్చని బీజేపీ ఎట్టి పరిస్తితిలో  గెలిచి తీరాలనే పట్టుదలతో పావులు కదుపుతోంది.  అందులో భాగంగా, బీజేపీ అగ్ర నాయత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.ఇప్పటికే, రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం మొదలు బలాబలాలను బేరీజు వేసుకునేదుకు, మునుగోడు ఉప ఎన్నిక కోరి తెచ్చుకునేంత వరకు... చాలా చాలా ప్రయోగాలు చేసింది. చేస్తోంది. ఇక ఇప్పుడు తాజగా మరో పావు కదపటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో చేపట్టనున్న కేబినెట్ విస్తరణలో... తెలంగాణకు ఒక బెర్త్ ను ఖరారు చేసిందని విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజీపీ తరఫున నలుగురు ఎంపీలు గెలుపొందారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్-బండి సంజయ్, ఆదిలాబాద్-సోయం బాపురావు, నిజామాబాద్-ధర్మపురి అరవింద్ గెలిచారు. కిషన్ రెడ్డి ఇప్పటికే  కేంద్ర మంత్రిగా ఉన్నారు.  కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.  బండి సంజయ్ నాయకత్వం పట్ల ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పూర్తి విశ్వాసం వుంది. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది కానీ, తాజా సమాచారం  ప్రకారం, బండి సంజయ్ ని కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుని ఆయన స్థానంలో ఈటల రాజేందర్  కు పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిజానికి బండి సంజయ్  పార్టీ  అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాతనే పార్టీలో ఊపొచ్చింది. దుబ్బాక, జీహెచ్ఎంసి, హుజురాబాద్ విజయాలు పార్టీకి మరింత ఊపునిచ్చాయి. అందుకే మళ్ళీ ఎన్నికల వరకు బండినే అధ్యక్ష పదవిలో కొనసాగించాలని ముందు నిర్ణయించినా భారాస, కాంగ్రెస్ పార్టీలలో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో  ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే భారాస, కాంగ్రెస్ పార్టీలపై  ‘పైచేయి’ సాధించడం మరింత తేలిక అవుతుందని పార్టీ బావిస్తున్నట్లు చెపుతున్నారు. అందుకే బండికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించి, ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఉభయ  తారక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.    ఈటల రాజేందర్ కు భారాస లోగుట్లన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఉద్యమ పార్టీగా తెరాస పురుడు పోసుకున్నటి నుంచి, కుటుంబ పార్టీగా రూపాంతరం చెందేవరకు, అనంతర పరిణామాలు అన్నీఈటలకు కొట్టిన పిండి. అంతే కాకుండా  ఇప్పటికీ గులాబి పార్టీ నేతలు అందరితోనూ ఈటలకు సన్నిహిత సంబంధాలున్నాయి.  అలాగే ఒక బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈటల అన్ని వర్గాల ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాజేందర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఇచ్చి, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఫోకస్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జనవరి 16,17 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ  ముహూర్తం ఉంటుందని అంటున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నందున ఈ లోగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుదని అంటున్నారు. అలాగే  ఈ ఏడు జరగా నున్న9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటు పార్టీలో, అటు కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పుల ఉంటాయని అంటున్నారు.

ఇందిరను తాకిన ఎన్టీఆర్ ప్రభం‘జనం’

రామన్న శకం రానున్న శకం చైతన్య రథం సరి కొత్త పథం జన చిత్త రథం నెరవేర్చుటకై గురువేష పథం తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడిన రోజు.. రాజభవంతులను వీడి రాజకీయం పేడవాడి పూరిగుడిసెను చేరిన రోజు.. అదే తెలుగుదేశం పార్టీ తొలి సారి ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన రోజు.. అదే జనవరి 9, 1983. మూడున్నర దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో  ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ను గద్దె దించి  తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలను చేపట్టిన రోజు జనవరి 9.   ఔను నాలుగు దశాబ్దాల కిందట ఇదే రోజున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత తొలిసారిగా కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రిగా నాడు ఎన్టీఆర్ కొత్త చరిత్ర లిఖించారు. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్బావమే ఒక చరిత్ర, ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే అధికార పగ్గాలు చేపట్టడం మరో చరిత్ర. పార్టీ ఆవిర్బావం తరువాత ఆయన చేపట్టిన చైతన్య రథ యాత్ర చరిత్ర ఎన్నటికీ మరువని మహోన్నత చరిత్ర. 19 రోజుల పాటు ఎండ, వాన, రాత్రి, పగలు తేడా లేకుండా ఆయన రాష్ట్రం మొత్తం చుట్టేశారు. జనంతో మమేకమైపోయారు. అయితే అప్పట్లో అధికార మదంతో ఉన్న కాంగ్రెస్ ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తక్కువగా అంచనా వేసింది. అయితే ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. ఎన్నికలకు   రోజుల ముందు అంటే 1983, జనవరి 3న తిరుపతిలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. అదే రోజు అదే తిరుపతిలో ఎన్టీఆర్ ఎన్నికల సభ కూడా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాగాంధీ సభ అయితే సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ సభ. తొలుత ఇందిర సభకు జనం భారీగా హాజరయ్యారు. అయితే ఇందిర ప్రసంగిస్తుండగా..ఎన్టీఆర్ తిరుపతి చేరుకున్నారన్న సమాచారం వచ్చింది. అంతే నిముషాల్లో ఇందిర సభ ఖాళీ.. అమె ప్రసంగం అర్ధంతరంగా ఆపేసి వెళ్లిపోయారు. ఆమె వెళుతున్న హెలికాప్టర్ ఎన్టీఆర్ సభ మీదుగానే వెళ్లింది. అప్పుడు కానీ.. ఎన్టీఆర్ ప్రభజనం ఏమిటన్నది ఆమెకు అవగతం కాలేదు. అప్పుడు అర్దమై చేయగలిగిందేమీలేదు. అప్పటికే తెలుగుదేశం విజయం ఖరారైపోయింది. అదే  ఫలితాల్లో తేటతెల్లమైంది.  పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకుని ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ప్రజా సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార వేదికపైనే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఫైలుపై సంతకం చేసి పేదవాడి అన్నంగిన్నెగా మన్ననలు అందుకున్నారు.  

చంద్రబాబుతో పవన్ భేటీ వెనుక ఆర్ఎస్ఎస్?!

రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ వెనుక అసలు కారణమేమిటన్న ప్రశ్నకు అనూహ్యమైన సమాధానం పరిశీలకుల నుంచి వస్తున్నది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ కలవడం వెనుక ఉన్నది ఎవరన్న దానికి ఆర్ఎస్ఎస్ అన్న సమాధానం వస్తోంది. అసలు గత కొంత కాలం నుంచీ ఏపీలో అధికార వైసీపీ ఆగడాలను అడ్డుకోవడానికి, అరాచకాలను ప్రశ్నించి ఎదుర్కొనడానికి ఐక్య పోరాటం అవసరమన్న భావన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ చంద్రబాబుల భేటీకి అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఇంత కాలం ఎవరికి వారుగా ప్రజా క్షేత్రంలో జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ఇరు పార్టీల అధినేతలూ భేటీ అవ్వడాన్ని, రాష్ట్రంలో పరిస్ధితులపై మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని ఇరు పార్టీల శ్రేణులూ కూడా స్వాగతిస్తున్నాయంటేనే రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత అవగతమౌతుంది.  అయితే మరో వైపు జగన్ పూర్తిగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు దాసోహం అయిపోయారు. బీజేపీ అధినాయకత్వం తానా అంటే తందానా అంటున్నారు. అందుకు కారణమేమిటంటే.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తన దుర్మార్గ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అయితే మరొక్క చాన్స్ తనకు దక్కితే ఇక ఎదురే ఉండదన్న భావనతో ఉన్నారు. 2024 ఎన్నికలలో అధికారాన్ని నిలుపుకోగలిగితే.. ఆ తరువాత ఎన్నికల సమయానికి చంద్రబాబు వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉండదన్నది జగన్ భావన. అందు వల్ల ఈ సారికి ఎలాగైనా అధికారం నిలుపుకుంటే.. ఇక తిరుగుండదన్న భావనలో ఉన్నారు. అందుకే ఇటీవల సమీక్షల్లో కూడా ఆయన పార్టీ శ్రేణులకు ఇదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తే ముఫ్ఫై ఏళ్ల పాటు మనదే అధికారం అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో మరో చాన్స్ మామూలుగా అయితే కష్టమన్న ఉద్దేశంతో ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ ను శరణు జొచ్చారు. మోడీ సర్కార్, బీజేపీ అండతో రానున్న ఎన్నికల గండాన్ని దాటేస్తే.. రాష్ట్రంలో ఇక ఎదురుండదు కనుక అప్పుడు అవసరమైతే రాష్ట్రలో తన వల్ల ఇప్పుడు బలోపేతంగా కనిపిస్తున్న బీజేపీని నిర్వీర్యం చేయవచ్చని ఆయన యోచిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే.. బీజేపీ మెంటార్ గా చెప్పబడే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు.  రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ పోకడలు నచ్చని ఆర్ఎస్ఎస్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీ విజయం సాధించకూడదన్న భావనకు రావడం వల్లనే తెలుగుదేశం, జనసేనల మధ్య సయోధ్యకు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ హిందుత్వ వ్యతిరేక పోకడలు, వైసీపీ హయాంలో  దేవాలయాలపై దాడులు, పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారం వంటి సంఘటనల పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉందని అంటున్నారు. అంతే కాకుండా.. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా, ఒక ఆదాయవనరుగా భావిస్తూ..  కొండపై ఉన్న వసతి గృహాలలో రూము రెంట్  ను ఏకంగా ఒకేసారి రెండు రెట్లు అంతకంటే ఎక్కువగా పెంచడాన్ని కూడా ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది.  ఇంతవరకు  మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత వసతి గృహాల్లో రూ.500 నుంచి  రూ.600 వరకు ఉన్న గది అద్దెను ఒక్కసారిగా  రూ.1000కు పెంచేశారు. ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్  హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200కు పెంచారు. స్పెషల్‌ టైప్‌ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్‌ నగదుతో కలిపి రూ.3400 చెల్లించాల్సి ఉంటుంది.  ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అవసరాలకు మించిన ఆదాయం వస్తున్నా, కొండపై భక్తులకు కల్పించే సదుపాయాలుమెరుగుపరచడం గురించి పట్టించుకోకుండా, టీటీడీ ప్రధాన కర్తవ్యమైన   హిందూ ధర్మ ప్రచారం, జీర్ణ ఆలాయాల పునరుద్ధరణ, హిందూ ధార్మిక కార్యకలాపాల నిర్వహణకు తిలోదకాలిచ్చేసి తిరుమలను కేవలం ఒక ఆదాయ వనరుగా ఎంచి ఇష్టారీతిన  వసతి రెంట్ లను ఇష్టారీతిగా పెంచేయడాన్ని ఆర్ఎస్ఎస్ తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్రంలో  తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన ఒక్కటే మార్గమన్న భావనతోనే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనానితో ఉన్న పరిచయాలను పురస్కరించుకుని ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లేలా ప్రోత్సహించిందని చెబుతున్నారు. ఇరు పార్టీల మధ్యా సయోధ్య, అవగాహన తదితర అంశాలను పరిశీలించిన అనంతరం బీజేపీ స్టాండ్ ఏమిటన్నది తాము తేలుస్తామని ఆర్ఎస్ఎస్ పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే మొదట్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తాను అని చెప్పిన పవన్ కల్యాణ్ ఆ తరువాత స్టాండ్ మార్చుకున్నట్లు కనిపించినా ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో  వెనక్కు తగ్గి ఓటు చీలనివ్వనన్న స్టాండ్ ను పునరుద్ఘాటించారని చెబుతున్నారు. అందుకే చంద్రబాబుతో చర్చలలో ఇరు పార్టీల ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని అంటున్నారు.  జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలో పోరాడుతూ వచ్చినా ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలన్న నిర్ణయానికి రావడం వెనుక.  జీవో నంబర్ 1 తో పాటుగా బీజేపీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు.