చలి చంపేస్తోంది.. హస్తినలో ఆరెంజ్ అలర్ట్

దేశ రాజధాని నగరం ఢిల్లీని చలి వణికించేస్తోంది.   నైనిటాల్ తో పోటీ పడేలా న్యూఢిల్లీ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.  తాజాగా  హస్తినలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదైంది.  విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. కంటి ముందున్నవి కూడా కనిపించని స్థాయిలో దట్టమైన  మంచు దుప్పటి ఢిల్లీ నగరాన్ని కప్పేసింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి ఈదురు గాలులతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  లోఢి రోడ్ వంటి ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు ఏకంగా 2.2 డిగ్రీలకు పడిపోవటం విశేషం. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ సెక్టర్ అంతా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ కోడ్ లాంగ్వేజ్ లో ఆరెంజ్ అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్ అని అర్థం. ఇక ఢిల్లీ నగరంలోని వీధులు సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున చాలావరకు నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల  పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

మోడీ విధానాలతో పెచ్చరిల్లిన నిరుద్యోగం.. దేశంలో పెళ్లికాని ప్రసాదులు

నిరుద్యోగం యువత జీవితాలపై మరో విధంగా కూడా ప్రభావం చూపుతోందా? అంటే ఔననే అంటున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. విద్యావంతులై ఉండి కూడా ఉద్యోగం లేకపోవడం వల్ల యువకులు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. ఉన్నత విద్య అభ్యసించినా దేశంలో యువత సామర్ద్యానికీ, అర్హతకు తగిన ఉద్యోగాలు లభించడం గగనమైపోయిందని అన్నారు. ఈ పరిస్థితి కారణంగానే వారు వయసు మీరిపోతున్నా అవివాహితులుగా మిగిలిపోతున్నారన్నారు. నిరుద్యోగం కారణంగానే తమకు ఎవరూ పిల్లనివ్వడం లేదని పాతిక నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు పలువురు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారని శరద్ పవార్ చెప్పారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ రక్కసి విలయ తాండవం చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విధానాల కారణంగానే దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిందని విమర్శలు గుప్పించారు.   పుణెలో జరిగిన ‘జన్ జాగర్ యాత్ర’లో పాల్గొన్న పవార్.. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలైన సమస్యలపై దృష్టి సారించకుండా ఉండేలా విభజన రాజకీయాలు చేస్తూ కేంద్రం ప్రజా దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. 

తెలంగాణ కాంగ్రెస్ ఇక ఇంతేనా?

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో.. అన్న చందంగా తెలంగాణ కాంగ్రెస్ తీరు ఉంది.  ఆ పార్టీకి జనంలో ఆదరణ ఉన్నా.. అంతర్గత విభేదాల కారణంగా ఆ ఆదరణను ఓట్ల రూపంలో మార్చుకోలేని దుస్థితి. గత పదేళ్లుగా వరుస పరాజయాలతో ఆ పార్టీ ఎన్నికలంటేనే భయపడే పరిస్థితికి దిగజారింది. ఇక తెలంగాణలో అయితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలూ విబేదాలను పరిష్కరించుకుని ఏకతాటిపై ఎన్నికల సమరంలో విజయం కోసం పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరయి  ఉనికినే కొల్పోయే పరిస్థితికి వచ్చింది.   శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ తీవ్ర అసమ్మతితో, అసంతృప్తితో సతమతమౌతోంది వాస్తవానికి గత ఏడాది కాలంగా  కాంగ్రెస్ అసమ్మతి మంటల్లో మగ్గుతూనే ఉంది. అయితే  ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కానీ, సమస్య పరిష్కరించడానికి కానీ  ఎటువంటి ప్రయత్నాలూ జరగలేదు. ఇప్పుడు పుణ్య కాలం కాస్తా ముగిసి పోయిందన్న పరిస్థితి దాపురించిన తరువాత హడావుడిగా పార్టీలో అసమ్మతి సమస్య పరిష్కారానికి హై కమాండ్ చర్యలు ప్రారంభించింది.   రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన దగ్గర నుంచి పార్టీలో సిగపట్లు ప్రారంభమయ్యాయి. పార్టీలో అంతకు ముందు కుమ్ములాటలు, లుకలుకలు ఉన్నప్పటికీ, తెలుగు దేశం పార్టీ నుంచి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిస్థానం పార్టీ పగ్గాలు అప్పగించడం   సీనియర్లకు మింగుడు పడలేదు.  వాస్తవానికి రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాతే.. పార్టీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు నూతనోత్సాహం వచ్చింది.  అయితే తమను కాదని రేవంత్ కు పగ్గాలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకే సీనియర్ల అసమ్మతి కుంపటి రగిల్చారు.  రేవంత్ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నాకా.. తెలుగుదేశం పార్టీ నుంచి తన గ్రూపు వారిని పార్టీలోకి తీసుకురావడం వారికి పీసీసీ కమిటీల్లో పెద్ద పీట వేయడంతో బహిరంగంగా అసమ్మతి రాగం ఆలపించారు. దీంతో  అధిష్టానం హుటాహుటిన సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను పంపించింది కానీ, ఆయన దౌత్యం పెద్దగా పనిచేసిన దాఖలాలు కనిపించడం లేదు.  పార్టీ కమిటీలన్నిటినీ రేవంత్ తన వర్గం వారితోనే నింపేస్తున్నారని, తమను పక్కన పెట్టేస్తున్నారని సీనియర్లు దిగ్విజయ్కు ఫిర్యాదు చేశారు.   రేవంత్ రెడ్డి వర్గం కూడా పార్టీ సీనియర్ నాయకుల తీరుతెన్నులను బాహాటంగానే ఎండగడుతోంది పార్టీలో రేవంతు పెరుగుతున్న పట్టు, పలుకుబడిని చూసి సీనియర్లు ఓర్వ లేకపోతున్నారని, సరిగ్గా ఆయన పాదయాత్ర చేయదల చుకున్నప్పుడే వారంతా గొంతెత్తడం ప్రారంభించారని వారు దిగ్విజయ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. రేవంత్ పాదయాత్ర ద్వారా తన పట్టును పెంచుకోవడం ఈ నాయకులకు ఏమాత్రం గిట్టడం లేదని కూడా వారు ఆయనకు చెప్పారు. నిజానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర ప్రతిప క్షాల కంటే కొద్దిగా మంచి స్థాయిలో ఉంది. ముఖ్యంగా, బీజేపీ, తెలుగుదేశం   తదితర పార్టీల కంటే పటిష్ఠంగా ఉంది. పాలక పక్షం మీద సంధించడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలన్నీ ఆ పార్టీ దగ్గర ఉన్నాయి. పాలక పక్షం మీద పోరాటాన్ని ఉధృతం చేయడానికి తమకే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ అధిష్టాన వర్గం సైతం భావిస్తోంది. ఈ దశలో పాత కాపులు, కొత్త కాపుల మిశ్రమంగా పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అయితే  ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదనడానికి బుధవారం (జనవరి 4)న టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల్లో రేవంత్ ప్రసంగమే నిదర్శనం. పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను టీపీసీసీ పగ్గాలు వీడడానికి సిద్దమని రేవంత్ బేలగా చెప్పడం ఆయనపై సీనియర్లు పై చేయి సాధించారనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే మాణికం ఠాగూర్ లో కలిసి జోడు గుర్రాల్లా రాష్ట్ర పార్టీని పరుగులెట్టించాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్న రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి నుంచి ఠాకూర్ ను తప్పించడం కచ్చితంగా రేవంత్ కు ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ కమలంలో కాక.. తెలంగాణపైనా ప్రభావం?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు లేకపోయినా.. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కమలం ప్రాపకం కోసం అర్రులు చాస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి సానుకూల వాతావరణంలో కూడా ఏపీలో బీజేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకొనే పరిస్థితులను చేజార్చుకుంటోంది. అంతర్గత కుమ్ములాటలతో పరిస్థితిని మరింత దిగజార్చుకుంటోంది. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రయోజనం చేకూరే విధంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు అటు మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా బీజేపీ ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. తాజాగా  ఏపీ బీజేపీలో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకి ఏపీకి చెందిన  వారిని చేర్చుకోవడం.. అలా చేరిన వారిలో అత్యధికులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం వెనుక ఏపీ బీజేపీలోని కీలక నేత ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆ కీలక నేత వేరెవరో కాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజేనని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండగా నియమించిన పార్టీ జిల్లాల అధ్యక్షులను ఒక్కరొక్కరిగా సోము వీర్రాజు తొలగించి, ఆ స్థానంలో వేరే వారిని నియమించడం పై కన్నా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు కూడా ఉండటాన్ని ఎత్తి చూపుతూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో దుమారం లేపుతున్నాయి. ఒక్క కన్నా వ్యాఖ్యలనే కాకుండా  ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరికల వెనుక సోము వీర్రాజు ఉన్నారన్న అనుమానాలు పార్టీలోని పలువురు నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జగన్ కు మేలు చేకూరేలా సోము వీర్రాజే ఏపీలో బీఆర్ఎస్ లోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారని కూడా పలువురు ఏపీ బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో జనసేనాని పవన్ కల్యాణ్ కు నష్టం చేకూరే విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను బీఆర్ఎస్ లో చేరే విధంగా సోము పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్నే కన్నా పలు సందర్భాలలో కుండ బద్దలు కొట్టారు. అదలా ఉంచితే.. జిల్లా అధ్యక్షుల తొలగింపు విషయంలో  సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలపై ఏపీ బీజేపీలో నిరసన వ్యక్తమౌతోంది. కన్నా వర్గీయులను టార్గెట్ చేసే ఈ తొలగింపులు ఉంటున్నాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ ఏకపక్ష తొలగింపులకు నిరసనగా ఏపీ బీజేపీకి పలువురు రాజీనామాలు చేస్తూ ఆ రాజీనామా లేఖలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు.  అదే సమయంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో పార్టీ పరంగా చేపట్టిన రాజకీయ కార్యక్రమం ఒక్కటీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే కన్నా  ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో  ప్రభుత్వంపై.. అవినీతిపై క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారని అంటున్నారు. ఇప్పుడు సోము ఏకైక అజెండా పార్టీలో కన్నాను ఏకాకిని చేసి ఆయన బయటకు వెళ్లేలా చేయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతారు, జనసేనలో చేరుతారు అని జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్నది కూడా సోము వీర్రాజు వర్గమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నా తన మౌనాన్ని వీడి సోముపై విమర్శలు చేస్తున్నారనీ, అధిష్ఠానం సూచనతో కొద్ది రోజులు మౌనంగా ఉన్నా.. సోము వీర్రాజు వర్గం తనపై దుష్ప్రచారం కొనసాగిస్తుండటంతో మళ్లీ నిరసన గళం ఎత్తారని చెబుతున్నారు. దీంతో కన్నా కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ చర్చలు వేడెక్కాయి. జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణలో కూడా తమ పార్టీ పోటీ చేయనుందని ప్రకటించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీలో ముసలానికి కారణాలపై ఒక స్పష్టత వస్తోందన్న విశ్లేషణలూ జోరందుకున్నాయి.   ఏపీలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం అంటే ... ఎవరి కోసం అనే ప్రశ్న సహజంగానే తెరపై కొచ్చింది.  వాస్తవానికి ఏపీలో   బీజేపీ, జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నా.. ఎవరి దారిలో వారు పోతున్నారు.    ఈ మైత్రీ బంధం ఉండీ లేనట్టేనని రాజకీయ వర్గాలు అభిప్రా యపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే   మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారయణ బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక ఉన్నది సోము వీర్రాజు అన్న అనుమానాలను కన్నా వర్గం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిని చేరుకున్న కన్నా, గత కొంత కాలంగా పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోందనే అసంతృప్తిని  వ్యక్తం చేస్తున్న మాట వాస్తవమే. ఆ కారణంగానే కన్నా పార్టీ మార్పు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.  వీటికి తోడు గత ఏడాది నవంబర్ లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నా నివాసానికి వెళ్లి మరీ భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.   ఈ భేటీకి కొద్ది రోజుల ముందు   పార్టీని నడిపే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని, మిత్రపక్షమైన   జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని  కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుపై పరోక్షంగానైనా ఘాటు విమర్శలు చేశారు.  అలాగే రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించాలని హై కమాండ్ కు సూచించారు.  ఆ తరువాత కొద్ది రోజులకే ఆయనతో నాదెండ్ల భేటీ కావడంతో కన్నా పార్టీ మార్పు తథ్యమని పరిశీలకులు విశ్లేషణలు చేశారు.  అయితే కన్నా అదేం లేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చినా ఊహాగానాలు ఆగలేదు.   అయితే  కన్నా  పార్టీ మారడం విషయం పక్కన పెడితే ఏపీలో బీఆర్ఎస్ అడుగు పెట్టడం జనసేనను బలహీన పరిచేందుకు  కేసేఅర్,  జగన్ రెడ్డి పన్నిన ఉమ్మడి వ్యూహమేనన్న అనుమానాలకు మాత్రం తాజాగా బీజేపీలో సంభవిస్తున్న పరిణామాలు తావిస్తున్నాయి. ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి ఈ పరిణామాలు ఏ మంత మేలు చేయవు సరికదా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ప్రయోజనాలకు గండి కొడతాయనడంలో సందేహం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఏపీలో  పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడానికి బీజేపీ హై కమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.

టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణికం ఠాకూర్ ఔట్?!

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మాణిక్కం ఠాగూర్ రాజీనామా లేఖను పంపారు . దీంతో.. మాణిక్కం ఠాగూర్ ను తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా తప్పించాలని కోరుతున్న తెలంగాణ సీనియర్లు రేవంత్ వర్గంపై పైచేయి సాధింనట్లైంది. నిజానికి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించటానికి రావడానికి ముందే తనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని మాణికం ఠాకూర్ హై కమాండ్ ను కోరారు.  ఇంత రాలం టీ కాంగ్ సీనియర్ల డిమాండ్ ను పట్టించుకోకుండా వదిలేసిన పార్టీ హైకమాండ్ ఎన్నికల సంవత్సరం కావడంలో అనివార్యంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించింది. కాగా తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌గా  మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.   మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.  

కుప్పం రణరంగం.. పోలీసుల దాష్టీకం.. బాబు చంద్ర నిప్పులు

చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం రణరంగంగా మారింది. చంద్ర కుప్పం పర్యటనను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ సర్వ విలువలకూ, నిబంధనలకూ తిలోదకాలిచ్చేసింది. పోలీసుల అత్యుత్సాహం కారణంగా కుప్పం యుద్ధ భూమిగా మారిపోయింది. చంద్రబాబు కుప్పం పర్యటన సీఎం జగన్ కు ఇష్టం లేదు కనుక.. ఎవరూ ఆయనకు స్వాగతం చెప్పడానికి వీళ్లేదు, ఆయన ప్రసంగం వినడానికి వీళ్లేదు అన్న రీతిలో పోలీసులు వ్యవహరించారు. దీంతో వైసీపీ చీకటి జీవో లక్ష్యమేమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. కుప్పం పర్యటనకు ముందు చంద్రబాబు ప్రచార రథం డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రచార రథాన్ని సైతం సీజ్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలో తిరగడానికి అవకాశం లేకుండా చేయడం కోసమే జగన్ సర్కార్  ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించిందన్నది దీనితో  తేలిపోయింది.   చంద్రబాబు పర్యటన సాగిస్తే జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడం తథ్యమన్నసమాచారంతోనే.. రోడ్ షోకు చంద్రబాబు వెళ్లే అవకాశం లేకుండా చేయాలన్నఉద్దేశంతోనే వైసీపీ నిషేధం విధించిందని తేటతెల్లమైపోయింది.  ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే.  కందుకూరులో జరిగిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా..  గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే.   ఈ సంఘటనలను సాకుగా తీసుకుని ఏపీలో సభలు, ర్యాలీ లు, రోడ్ షోలను ప్రభుత్వం నిషేధించింది.  నిషేధం అమలులోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ రాజమండ్రి, ఉత్తరాంధ్రలో వేలాది మందిలో కార్యక్రమాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు కుప్పం పర్యటన కు మాత్రమే నిషేధం విషయం పోలీసులకు గుర్తు వచ్చింది.  చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు చూపిన అత్యుత్సాహం కారణంగానే కుప్పం రణరంగమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన ప్రచార రధాన్ని సీజ్ చేశారు. ఆ రథం డ్రైవర్ ను అదుపులోనికి తీసుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. సభా వేదికను కూల్చేశారు. దీంతో జనం పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ లాఠీ చార్జిలో పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్ఫృహ తప్పి పడిపోయారు.  కుప్పం నియోజకవర్గంలో బాబు అడుగుపెట్టీ పెట్టగానే అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వబోయారు. అయితే నోటీసు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరో రాతపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కుప్పం నియోజకవర్గంలోని పెద్దూరు చేరుకున్న చంద్రబాబును అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తన సొంత నియోజకవర్గంలో ప్రవేశించవద్దనడానికి పోలీసులు ఎవరని నిలదీశారు.  రాజమహేంద్రవరంలో రోడ్లు బ్లాక్‌ చేశారు. విద్యా సంస్థలు మూసేశారు. ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు. జగన్‌కు ఓ రూలు.. నాకు ఓ రూలా? అని ప్రశ్నించారు.   ఈ నెల2నజీవో తెచ్చారు, ఆ జీవో ఈనెల 1 నుంచే అమలులో ఉందని పలమనేరు డీఎస్పీ చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.   ఏ చట్టం కింద తనను తన సొంత నియోజకవర్గానికి రానీయకుండా అడ్డుకుంటున్నారని నిలదీశారు.    ప్రచార వాహనం తీసుకు రాకుంటే ఇక్కడే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ప్రచార రథం తెచ్చే వరకు పెద్దూరులో పాదయాత్ర చేస్తానని అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్లారు.  అయితే ఇక్కడ తప్పని సరిగా గుర్తించాల్సిన అంశమేమిటంటే.. చంద్రబాబు రోడ్ షోలలో తొక్కిసలాటలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం ఆ తొక్కిసలాటలు జరిగిన సభలలో పోలీసుల వైఫల్యం గురించి మాట్లాడటం లేదు. తొక్కిసలాట జరిగిన రెండు సందర్భాలలోనూ కూడా పోలీసుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. అయితే కుప్పం పర్యటనను అడ్డుకోవడానికి మాత్రం జిల్లా మొత్తం పోలీసు యంత్రాంగమంతా ఇక్కడే ఉందా అన్నట్లుగా వేల సంఖ్యలో పోలీసులు మోహరించారు.  ప్రత్యేక బలగాల్ని తరలించారు.  ఒక విధంగా చెప్పాలంటే గత ఏడాది ఆగస్టులో చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సమయంలో వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తించారో..ఇప్పుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు అదే విధంగా వ్యవహరించారు.   కాగా చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకోవడంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు.  జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందన్నారు.    జీవో నంబర్ 1 జగన్ కు వర్తించదా అని ప్రశ్నించారు. మంగళవారం (జనవరి 3) రాజమహేంద్రవరంలో పర్యటించిన జగన్ చేసిన షోకు నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు.  చీకటి జీవోలతో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జ్ షీట్.. రేవంత్

టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల్లో  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సంభాని చంద్రశేఖర్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాములు నాయక్, నిరంజన్, పీఏసీ, పిఈసి సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, పీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో ధరణి, హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్‌ మీడియా వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్ కు మంచి నాయకత్వాన్ని అందించింది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ పదవుల కోసం, అధికారం కోసం పాకులాడలేదనీ, దేశ ప్రగతి, పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేసింన్నారు. అవకాశం వచ్చినా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని పదవిని తృణ ప్రాయంగా తిరస్కరించారని రేవంత్ చెప్పారు.  చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కృషి చేసిందని చెప్పారు. ఇక కాంగ్రెస్ కీలక నేత భారత్ జోడో యాత్ర దేశంలో వైషమ్యాలను రూపు మాపి ఐక్యత కోసం సాగుతోందని చెప్పారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ గాంధీ బీజేపీ ప్రజలలో కలిగించిన  ద్వేష భావనలను పోగొట్టి ఐక్యత కోసం ప్రాణాలకు తెగించి నడుస్తున్నారని రేవంత్ అన్నారు. రాహుల్ సందేశాన్ని ప్రతి గడపకూ చేరవేసేందుకు రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టనుందని అన్నారు. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మాత్రం దేశ రక్షణను సైతం విస్మరించి సరిహద్దుల్లో దురాక్రమణలను సైతం పట్టించుకోకుండా అలాంటివేమీ లేవని బుకాయిస్తోందని విమర్శించారు. మీడియా చేతిలో ఉందని ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఏం ఒరగదని పరోక్షంగా బీఆర్ఎస్ ను హెచ్చరించారు. గతంలో మీడియా మొత్తం తెలుగుదేశంను, చంద్రబాబును సమర్దించినా వైఎస్ రాజశేఖరరెడ్డి విజయాన్ని సాధించారని అన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్, తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ల వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేయనున్నామన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందనీ, దాని నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. బండ్ల తోటి, గుండ్ల తోటీ జరిగేదేం లేదని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పని చేయాలన్నారు. ఓటరు జాబితాలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారన్న రేవంత్,  అలా తొలగించిన ఓట్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్పించాలని అన్నారు. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటు న్నారన్నారు.   అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాల పరిష్కారానికి అధిష్ఠానం ఎంత ప్రయత్నిస్తున్నా పూర్తిగా సఫలం కాలేకపోతున్నది. టీపీసీసీ ఆధ్వరంలో కాంగ్రెస్ శిక్షణ తరగతులుకు హాజరు కావాలన అధిష్ఠానం ఆదేశించినప్పటికీ పలువురు నేతలు డుమ్మా కొట్టారు.  పార్టీ సీనియర్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మధుయాష్కి, వీహెచ్‌ హనుమంత రావు, శ్రీధర్‌ బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్‌ రెడ్డి.. శిక్షణా కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. 

టీమ్ ఇండియానా టీమ్ గుజరాతా?!

ప్రధానిగా మోడీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ దేశంలో ఆయన స్వరాష్ట్రం అయిన గుజరాత్ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎంతలా అంటే 2014 ఎన్నికలకు ముందు మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ గుజరాత్ మోడల్ అభివృద్ధి అన్న నినాదం అందుకుంది.  తదాదిగా దేశంలో గుజరాత్ మోడల్ గా మారిందో లేదో పక్కన పెడితే.. మోడీ మాత్రం గుజరాత్ ప్రధాని అన్న ముద్ర వేసుకున్నారు. ఆయన హయాంలో చేపట్టిన నియామకాలు, చేసిన కేటాయింపులూ అన్నీ గుజరాత్ కు అగ్ర తాంబూలం... తర్వాతే మిగిలిన దేశం అన్న చందంగా సాగాయి. సాగుతున్నాయి. ఇవి విమర్శకుల మాటలని కొట్టిపారేయడానికి లేదు. వాస్తవం కూడా అదే. ఈ నేపథ్యంలోనే మోడీ దేశానికి కాదు, గుజరాత్ కు ప్రధానిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కొట్టిపారేయలేమని పరిశీలకులు సైతం అంగీకరించారు. ఇప్పటి వరకూ కేటాయింపులు, నియామకాలలోనే గుజరాత్ కు ప్రాధాన్యత ఇచ్చినా.. ఇప్పుడు అది క్రీడా రాంగానికి కూడా పాకిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గుజరాత్ ఫస్ట్ విధానం టీమ్ ఇండియా సెలక్షన్స్ ను కూడా ప్రభావితం చేసినట్లుగా కనిపిస్తోందని క్రీడాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సామాజాకి మాధ్యమంలో అయితే ఇది టీమ్ ఇండియా జట్లు కాదు.. టీమ్ గుజరాత్ జట్టుగా కనిపిస్తోందని సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విమర్శలకూ, సెటైర్లకూ కారణం లేకపోలేదు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న శ్రీలంకతో టి20 సిరీస్ కు ఎంపికైన జట్టును చూస్తే ఎవరికైనా ఇది టీమ్ గుజరాత్ జట్టులా ఉందే అనిపించక మానదు.  ప్రస్తుతం శ్రీలంకతో టి20 సిరీస్ కు ఎంపికైన జట్టును గమనిస్తే హార్థిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ మావి, దీపక్ హుడా... వీళ్లంతా గుజరాత్ కు చెందిన వారే. గతంలో అంటే 80, 90 దశకాల్లో భారత జట్టులో ముంబై అప్పటి బొంబాయి ఆటగాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అయితే అదేమీ ఎవరికీ పెద్దగా అభ్యంతరకరంగా అనిపించలేదు. ఎందుకంటే..దేశవాళీ క్రికెట్ లో, ముఖ్యంగా భారత జట్టుకు ఎంపిక అవ్వాలంటే రంజీల్లో రాణించి తీరాల్సిన అప్పటి పరిస్థితుల్లో రంజీల్లో తిరుగులేని జట్టుగా వరుస విజయాలతో దూసుకుపోయే బొంబాయి జట్లు ఆటగాళ్లకే ఎక్స్ పోజర్ అధికంగా ఉండేది. ఇప్పటికీ దేశ వాళి క్రికెట్ లో రంజీకి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. కానీ ఆ రంజీల్లో గుజరాత్ ప్రదర్శన అప్పుడే కాదు, ఇప్పుడూ అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తూ టీమ్ ఇండియాలోకి ప్రవేశం గ్యారంటీ అన్న పరిస్థితి ఉంది. అయినా కూడా టీమ్ ఇండియా టి.20 జట్టులో ప్రతిభ గలిగి, రుజువు చేసుకున్న క్రీడాకారులను పక్కన పెట్టి మరీ ఇంత మంది గుజరాతీ క్రీడాకారులకు స్థానం కల్పించడం  మోడీ గుజరాత్ మోడల్ క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.   

ఉచితాలపై మోడీ నీతులు... చెప్పేటందుకేనా?

మాకు ఓటేయండి చాలు... ఇంక మీరేం చేయనవసరం లేదు. మీ అవసరాలన్నీ మేమే ఉచితంగా తీర్చేస్తాం. కాలు బయటపెట్టకుండా మీకు సకల సౌకర్యాలూ ఇంటి ముంగిటకు తీసుకువచ్చి అమరుస్తాం అన్న రీతిలో  ఎన్నికలలో  విజయమే  లక్ష్యంగా పార్టీలు, ప్రభుత్వాలూ  పోటీలు పడి మరీ  హామీలు గుప్పించేస్తున్న సంగతి విదితమే. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ హామీలు గుప్పించేసి, తీరా అధికారం చేపట్టిన తరువాత వాటి అమలుకు  రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా సరే   నిబంధనలన్నిటికీ తిలోదకాలిచ్చేసి మరీ  అప్పులు  చేస్తున్నాయి. ఇంత  చేసినా ఇచ్చిన హామీల  అమలుకు సరిపోక.. రాష్ట్రాలకు రాష్ట్రాలు దివాళా ముంగిట నిలబడుతున్నాయి. అన్నీ ఉచితమంటూనే.. రోజు గడవడానికి ఆదాయం కోసం ప్రజలపైన పన్నులు విధించి ముక్కు పిండి వసూలు చేస్తూ వారి జీవితాలనూ కుదేలు చేస్తున్నాయి. తెలుగు  రాష్ట్రాల ప్రభుత్వాల  ప్రస్తుత స్థితి ఇందుకు ఉదాహరణగా  చెప్ప వచ్చు. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్  విషయాన్నే తీసుకుంటే..  అప్పులు చేసి మరీ ఉచితాలకు లక్షల కోట్లు ఖర్చు వ్యయం చేస్తోంది.  అదే చేత్తో నిత్యావసర ధరలన్నీ విపరీతంగా  పెంచేసి ఆ ప్రజల నెత్తినే భారం పడేస్తోంది. పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి  రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది జగన్ సర్కార్. ఏపీ  దుస్థితికి  పరోక్షంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా కారణమే. రాజకీయ ప్రయోజనం ఆశించి కేంద్రం ఏపీ అడ్డగోలు అప్పులకు అంతకంటే అడ్డగోలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. వాస్తవం ఇలా ఉంటే.. ప్రధాని మోడీ  మోడీ ఉచితాలు ప్రమాదకరం అంటూ తనదైన స్టైల్ లో రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  మోడీ ఆశీస్సులు లేకుండానే కుప్ప తెప్పలుగా అప్పులు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు తిలోదకాలిచ్చేసి మూడేళ్లలోనే రాష్ట్ర భవిష్యత్ ను అంధకార బంధురంగా మార్చేసిన ఏపీ గురించి ఆయన ఏం చెబుతారనీ ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు దేశ భవిష్యత్ కు ప్రతిబంధకం కాదా అని ప్రశ్నిస్తున్నారు.  ఏపీ అడగడమే ఆలస్యం అన్నట్లుగా అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఏపీలా అడ్డగోలుగా అప్పులు చేసి మరీ ఓట్ల కోసం పెట్టుబడిగా పెట్టిన రాష్ట్ర్రాల నిగ్గు తేల్చి వాటిని నియంత్రించడమే కాకుండా నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తేనే మోడీ మాటలకు విశ్వసనీయత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పేరిట ఓట్ల భద్రత కోసం కొనసాగిస్తున్న ఉచిత బియ్యం పథకం మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.  పేదలకు ఆహార భద్రత అంటూ మోడీ సర్కార్ 2020 నుంచి 2022 డిసెంబర్ వరకూ అమలు చేసిన ఉచిత బియ్యం పంపిణీని మరో ఏడాది పటు కొనసాగించడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు.   దేశంలో  దేశంలో 81.35 కోట్ల మంది అర్హులైన వారికి ఉచిత ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం అమలు కోసం కేంద్రం మోయలేని ర్థిక భారాన్నితలకెత్తుకునేందుకు కూడా వెరవడం లేదు. ఈ పథకాన్ని మరో ఏడాది పొడిగించడానికి ఏకైక కారణం ఈ ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుండటమే. ఔను నిజం.. 2023 సంవత్సరంలో  దేశంలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇంత కీలకమైన సమయంలో  ఉచిత పథకాలను కేంద్రం ఎలా రద్దు చేస్తుంది? ఉచితాలు అనర్ధాలన్న ఆయన సూచన చెప్పడానికే కాదు ఆచరించడానికి కాదు అని స్వయంగా మోడీయే తన చేతల ద్వారా నిరూపించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.  దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్ల సంఖ్యే అత్యధికం.   ఎన్నికలలో మళ్లీ అధికారం అన్నదే మోడీ టార్గెట్. ఈ పరిస్థితుల్లోనే మోడీ ఆహార భద్రత పథకాన్నిమో ఏడాది పాటుపొడిగించారు. దీంతో ఇది పేదలకు ఉచిత ఆహార భద్రత కోసం కాదనీ.. మోడీకి  అధికార భద్రత అన్న విర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ముగ్గురు పెళ్లాలు.. 60 మంది పిల్లలు.. మళ్లీ పెళ్లికి రెడీ

ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల రావు నూతన్ ప్రసాద్ ని నిత్య పెళ్లి కొడుకా అని పిలుస్తాడు. సమాజంలో అలాంటి నిత్య పెళ్లి కొడుకులను చాలా మందే ఉన్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వారి గురించి వార్తల్లో వింటూనే ఉంటాం. అయితే బహుభార్యలు ఉన్న మొగుళ్ల సంగతీ తెలిసిందే. పదుల సంఖ్యలో పిల్లల్ని కన్నవారూ ఉన్నారు. అయితే వీరందరికీ భిన్నంగా ఓ వ్యక్తి ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలతో వార్తల్లోకి ఎక్కడమే కాకుండా మరింత మంది పిల్లలు కావాలంటున్నారు. ఇందు కోసం ఇంకా పెళ్లిళ్లు చేసుకుంటానంటున్నారు. అలా చెబుతున్న వ్యక్తి యువకుడేం కాదు..  వృద్ధుడు. ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటే ఇహనో ఇప్పుడో రిటైర్మెంట్ కు సిద్ధంగా ఉండే వయస్సు. అయితే ఆయన 60 మంది పిల్లల్లో ఓ ఐదుగురు మరణించారు. అతడి పేరు హాజీజాన్ మహ్మద్. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి. మరింత మంది పిల్లలు కావాలన్నది అతని కోరిక. అందుకు అతడి ముగ్గురు భార్యలు సై అన్నారట. అయితే పిల్లల కోసం మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. విశేషమేమిటంటే.. అతడి పెద్ద కూతురుకి ఇప్పడు పెళ్లీడు వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలన్న విషయాన్ని  పట్టించుకోకుండా తాను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని వెతుక్కుంటున్నాడు.  మరో పెళ్లితో ఆగుతానని అనడం లేదు. మరింత మంది పిల్లల్ని కనడం కోసం ఇంకా ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవడానికి రెడీ అంటున్నాడు. 

మెట్రో స్టేషన్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య

హైదరాబాద్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఒక వృద్ధు రాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద బుధవారం ఈ ఘటన జరిగింది.  ప్రయాణికులతో పాటు మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించిన వృద్ధురాలు అకస్మాత్తుగా కిందికి దూకేసింది. పై నుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలతో  అక్కడికక్కడే మరణించింది. ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలిని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మ (70) గా గుర్తించారు. మారెమ్మ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని చెబుతున్నారు. మారెమ్మ హైదరాబాద్ కు ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటనే వివరాలు తెలియాల్సి ఉంది.  

కుప్పం పర్యటన ముంగిట..బాబు ప్రచార రథం డ్రైవర్ అరెస్టు..

వైసీపీ చీకటి జీవో లక్ష్యమేమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. కుప్పం పర్యటనకు ముందు చంద్రబాబు ప్రచార రథం డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలో తిరగడానికి అవకాశం లేకుండా చేయడం కోసమే జగన్ సర్కార్  ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించిందన్నది ఈ అరెైస్టుతో తేలిపోయింది. నిషేధం అమలులో ఉన్నా చంద్రబాబు పర్యటన సాగిస్తే జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడం తథ్యమన్నసమాచారంతోనే.. రోడ్ షోకు చంద్రబాబు వెళ్లే అవకాశం లేకుండా చేయాలన్నఉద్దేశంతోనే ఆయన ప్రచార రథం డ్రైవర్ ను అరెస్టు చేశారని తెలుగు దేశం శ్రేణులు అంటున్నాయి.  ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే.  కందుకూరులో జరిగిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా..  గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే.   ఈ సంఘటనలను సాకుగా తీసుకుని ఏపీలో సభలు, ర్యాలీ లు, రోడ్ షోలను ప్రభుత్వం నిషేధించింది.  నిషేధం అమలులోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ రాజమండ్రి, ఉత్తరాంధ్రలో వేలాది మందిలో కార్యక్రమాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు కుప్పం విషయం  వచ్చే సరికి నిషేధం విషయం పోలీసులకు గుర్తు వచ్చింది. చంద్రబాబు కుప్పంలో నిర్వహించనున్నరోడ్ షో, సభలకు అనుమతి లేదంటూ మంగళవారం (జనవరి 3) రాత్రి చంద్రబాబు వ్యక్తిగతకార్యదర్శికి నోటీసులు ఇచ్చారు.  చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు.    అంతకముందు చంద్రబాబు పర్యటనపై పలమనేరు డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. జీవో నెం.1 ప్రకారం సభలపై ముందుస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఇరుకు సందుల్లో, నేషనల్ హైవేలపై సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సభలు, రోడ్ షోల వివరాలను అందించాలని సూచించారు. దీనిపై పోలీసులకు టీడీపీ నేతలు..చంద్రబాబు పర్యటనపై వివరాలు అందించారు. అయితే చంద్రబాబు వ్యక్తి గత కార్యదర్శికి ఇచ్చిన నోటీసుపై సమాధానం ఇవ్వడం ఆలస్యమైందని రోడ్ షోలు, సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. న్యాయ పరీక్షకు నిలబడని జీవోను విడుదల చేసి జగన్ సర్కార్ చంద్రబాబు పర్యటనలు అడ్డుకోవాలని చూస్తున్నదన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యటన జరిగి తీరుతుందని తెలుగుదేశం వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ షో కోసం రథాన్ని శుభ్రం చేస్తున్న డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

దూకుడేది.. బీజేపీ, బీఆర్ఎస్ లు లాలూచీ పడ్డాయా?

తెలంగాణలో ఇటీవలి కాలంలో  తీవ్ర సంచలనం సృష్టించిన రెండు కేసుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. రాజకీయ లెక్కలు సరి చేసుకునేందుకు తమ అధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలను తమ ఇష్టం వచ్చనట్లు వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరిగింది. బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ రెండు కేసుల విషయంలో పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. మద్యం కుంభకోణం కేసు లో కవిత అరెస్టే తరువాయి అన్నట్లుగా హడావుడి జరిగింది. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులోనూ కేసీఆర్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేసి నంత బిల్డప్ ఇచ్చారు. కేంద్రానికేనా మాకు లేవా దర్యాప్తు సంస్థలంటూ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సిట్ కు అప్పగించారు. ఈ రెండు కేసులలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ కేసులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు తమ తమ ప్రభుత్వాల జేబు సంస్థలు అన్నట్లుగా వ్యవహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టే తరువాయి అంటూ బీజేపీ,  ఎమ్మెల్యేల కుంభకోణం కేసులు బీఎల్ సంతోష్ నిండా ఇరుక్కున్నారు, ఆయన సిట్ దర్యాప్తునకు ఇహనో ఇప్పుడో రాక తప్పదంటూ బీఆర్ఎస్ హడావుడి చేసింది. అయితే.. ఈ హంగామా, హడావుడీ అంతా ఒక్కసారిగా ఆగిపోయింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో   నిందితులకు బెయిల్స్  వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలుబేరసారాల కేసు సిట్ నుంచి సీబీఐకి చేరింది.అయితే ఇంకా సీబీఐ కేసు తీసుకోలేదు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత లాంటి వారి ప్రమేయం బట్టబయలైందరనీ, వారి అరెస్టులు అనివార్యమన్నంత బిల్డప్ ఇచ్చిన  ఈడీ , సీబీఐ  ఇప్పటి వరకూ వారిపై కనీసం ఎఫ్ఐఆర్. చార్జిషీటు కూడా దాఖలు చేయలేదు.   ఇక ఎమ్మెల్యేల ఎర కేసులు సిట్ దర్యాప్తు కుదరదంటూ సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం  హైకోర్టు డివిజన్ బెంచ్ కు  వెళ్లలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించ లేదు.అయితే అదీ జరగలేదు. ఈ రెండు కేసులలోనూ కూడా దర్యాప్తు సంస్థల దూకుడు హఠాత్తుగా ఆగిపోయింది.  దీంతో ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  అదే జరిగితే ఈ రెండు కేసుల కథ కంచికి వెళ్లినట్లేనని కూడా అంటున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన రెండు కీలక కేసుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మౌనం ఆ రెండు పార్టీల మధ్యా లాలూచీకి నిదర్శనం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

వెంకటగిరి ఇన్ చార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.. ఆనంకు జగన్ షాక్

వైసీపీ సీనియర్ నాయకుడు, వెంటకగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ షాక్ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆయనను తప్పించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు.  గత కొంత కాలంగా జగన్ తీరుపై, ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డిని ఆయన సొంత నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం ద్వారా ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు అయ్యింది. క్రమశిక్షణ చర్య పేరుతో నియోజకవర్గ ఇన్ చార్జ్ గా తొలగించి రామ్ కుమార్ రెడ్డిని జగన్ తొలగించారు.   ఆనం రామనారాయణ రెడ్డి గత కొద్ది కాలంగా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని,  ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడంలేదని మండిపడ్డారు.   సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అన్నారు.  అలాగే  ఏం పనులు చేశామని ప్రజలకు వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి ? అని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేనో కాదో అనే అనుమానం వస్తోందన్నారు.   వెంకటగిరి అభ్యర్థిగా కొత్తవారిని ఎవరినైనా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్ల ప్రాతిపదికన వెంకటగిరి ప్రజలు తనకు ఓటేస్తే గెలిచానని, మరో సంవత్సరం పాటు తానే ఎమ్మెల్యేనని, కానీ ఓ పెద్దమనిషి అప్పుడే తాను ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారని   విమర్శించారు.     అలాగే  చీరాల  ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా షాకిచ్చిన జగన్ ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు ఇంఛార్జ్‌గా నియమించారు.     ఆ విధంగా  కరణం బలరాం, ఆమంచిల మధ్య పంచాయతీకి చెక్ పెట్టారు

లంకతో తొలి టి20.. టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. శ్రీలంకతో ముంబై వాంఖడే స్టేడియంలో బుధవారం (జనవరి 3)జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్  2 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది.తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్ కు దిగిన  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 160 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. శ్రీలంక ఇన్నింగ్స్ లో కెప్టెన్ దసున్ శనక 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి హసరంగ (10 బంతుల్లో 21) నుంచి సహకారం అందింది. ఓ దశలో శ్రీలంక 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా ఈ జోడీ ఆదుకుంది. అయితే హసరంగను శివమ్ మావి ఔట్ చేయగా, శనకను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు. చివరి ఓవర్లో లంక విజయానికి 13 పరుగులు అవసరం కాగా, కరుణరత్నే (23 నాటౌట్), కసున్ రజిత (5) పోరాడారు. విజయం సాధించాలంటే ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా, అక్షర్ పటేల్ వేసిన బంతిని కరుణరత్నే బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆఖరి ఓవర్లో ఇద్దరు రనౌట్ అయ్యారు.  టీమిండియా బౌలర్లలో డెబ్యూ బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. కేవలం 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది.  అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసిందంటే అందుకు చివర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ రెచ్చిపోవడం వల్లే సాధ్యమైంది. హుడా 23 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య 29, ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ దూకుడు చూస్తే భారత భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. అయితే లంక స్పిన్నర్లు భారత్ దూకుడును అడ్డుకున్నారు. దాంతో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. శుభ్ మాన్ గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 7, సంజు శాంసన్ 5 నిరాశపరిచారు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాక, ఆ బాధ్యతను హుడా, అక్షర్ పటేల్ తీసుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆఖర్లో బ్యాట్లు ఝుళిపించి భారత్ స్కోరును 162 పరుగులకు చేర్చారు. ఈ విజయంతో లంకతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. రెండో మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది.

సత్యం కవచం.. దేవుడు రక్ష

రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రతో ఇప్పటి వరకూ తనపై ఉన్న విమర్శలన్నిటికీ సమాధానం చెప్పేశారు. పప్పు అన్నారు. రాజకీయాలకు పనికి రాడన్నారు. ప్లే బోయ్ ముద్ర వేశారు. అన్నిటికీ మౌనమే సమాధానంగా ఆయన మాత్రం అడుగులు వేసుకుంటూ ముందుకు సాగారు. చివరికి ఇప్పుడు ఎలాంటి ఆశా లేని స్థితి నుంచి కాంగ్రెస్ కు మరో సారి దేశంలో అధికార పగ్గాలు దక్కే అవకాశాలున్నాయన్న ధీమాను తీసుకు వచ్చారు. ఔను భారత్ జోడో యాత్ర రాహుల్ పై విపక్షాల్లోనే కాదు జనంలో ఇంత వరకూ ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. వణికించే చలి, కాల్చేసే ఎండ ఇలా వేటికీ వెరవకుండా ఒక దీక్షతో తన జోడో యాత్ర సాగిస్తున్నారు. యాత్ర సాగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలను ఆయన పట్టించుకోలేదు. పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతున్నా ఎక్కడా జోక్యం చేసుకోలేదు. పైగా పార్టీ అధ్యక్ష ఎన్నికలో తమ కుటుంబ  సభ్యులెవరూ పోటీ చేయరనీ, పార్టీయే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని స్వేచ్ఛ నిచ్చేశారు. ఫలితంగా దశాబ్దాల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది.  గెలుపు ఓటములను సమానంగా తీసుకునే స్థిత ప్రజ్ణత రాహుల్ లో కనిపించింది. జనంలో మమేకమౌతూ సాగుతుండటంతో ప్రజలు ఆయనను చూసే దృక్కోణమూ మారింది. యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆరు రోజుల విరామం తరువాత రాహుల్ మంగళవారం (జనవరి 2)న తిరిగి ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ యాత్ర సందర్భంగా ధరించిన దుస్తులపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఉత్తర భారతాన్ని చలి వణికించేస్తోంది. అయినా రాహుల్ కనీసం స్వెట్టర్ కూడా ధరించడం లేదు.   దీనిపైనే ఆయన సోదరి ప్రియాంకను మీడియా ప్రశ్నించింది. ఆయన సరే పట్టించుకోవడం లేదు.. కనీసం మీ సోదరుడిపై మీకైనా శ్రద్ధ ఉండొద్దా? చలి నుంచి రక్షణకు కనీసం స్వెట్టరైనా వేసుకోమని సలహా ఇవ్వండి అని సూచించింది. అయితే ప్రియాంక చిన్న చిరునవ్వుతో ఆ ప్రశ్నకు రాహుల్ కు సత్యమే కవచం, దేవుడే రక్ష అని బదులిచ్చారు. ఇదే ప్రశ్నకు రాహుల్ మరింత హృద్యంగా బదులిచ్చాడు. ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు సరే.. మరి  రైతులూ, కూలీలు, పేద పిల్లలను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అయితే విపక్షాల విమర్శలకు తావీయరాదన్న ఉద్దేశంతో రాహుల్ యాత్ర ఆరంభంలో ధరించిన బ్రాండెడ్ టీ షర్టును వదిలేశారు. మామూలు నాన్ బ్రాండెట్ టీషర్ట్ మాత్రమే వేసుకుంటున్నాడు. రాహుల్ జోడో యాత్ర మరో రెండురోజుల్లో హర్యానా చేరుకుంటుంది. 

వ్యాపారాలు, ఆస్తుల కోసమేనా.. బీఆర్ఎస్ రాగం?

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబులు సోమవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వారికి బీఆర్ఎస్ ఏమీ రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెప్పలేదు. బలవంతపు బ్రాహ్మణార్దం అన్నట్లుగా పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ పంపిన కార్లలో వచ్చిన వీరు కేసీఆర్  చేత పార్టీ కండువా కప్పించుకోవడానికి   దాదాపు నాలుగు గంటల పాటు తెలంగాణ భవన్ లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఔను ఏపీ నుంచి కేసఆర్ పంపిన కార్లలో ర్యాలీగా వచ్చిన వీరు తెలంగాణ భవన్ చేరుకుని బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి నాలుగు గంటల సేపు పడిగాపులు కాసారు. వీరు తెలంగాణ భవన్ చేరుకున్న నాలుగు గంటల తరువాత తీరిగ్గా కేసీఆర్ వచ్చి వీరికి బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పారు. సముచిత స్వాగతం లేకపోయినా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ కుమార్ తదితరులు బీఆర్ఎస్ గూటికి చేరడానికి ఎందుకు తహతహలాడారు? అంటే వారికి హైదరాబాద్ లో ఉన్న బాదరాయణ సంబంధాలే అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలు, ఆస్తుల కారణంగానే ఒక విధంగా అనివార్యంగా వారు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు హైదరాబాద్ లో కనస్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఆదిత్య కనస్ట్రక్షన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్యా హౌసింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఆదిత్యా ఇన్ఫ్రాటెక్,  డెక్కన్ ఇండియా కార్పొరేషన్ తోట చంద్రశేఖర్ కు చెందినవే. ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నడుపుతున్నాయి. దీంతో ఆయన వీటి పరిరక్షణ విస్తరణ అవసరాల కోసమే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అంటున్నారు. అలాగే టీవీ 99 అనే చానల్ నడుపుతున్న ఈయన ఒక సమయంలో సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇక మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు కూడా వికారా బాద్ లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది. ఇలా తమ ఆస్తులు, వ్యాపారాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ గూటికి చేరారని చెబుతున్నారు.  మంత్రిగా ఉన్న సమయంలో రావెల పేషీలో ఒక నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు పీఏలు మారారంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అవగతమౌతుంది. ఇటు తమ ఆస్తుల భద్రత, అటు ఏపీలో ఏదో మేరకు రాజకీయ ప్రాధాన్యత దక్కుతాయన్న ఉద్దేశంతోనే వీరు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఆసక్తి చూపారని అంటున్నారు. అందుకే వీరి చేరికను బీఆర్ఎస్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. వీరిని అడ్డు పెట్టుకుని ఏపీలో కాలూనవచ్చని భావించిన కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి కొన్ని బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. అటు ఏపీలో కూడా వీరు బీఆర్ఎస్ లో చేరడాన్ని అక్కడి రాజకీయ పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.  అదీ గాక తోట చంద్రశేఖర్ ఏపీలో ఇప్పటి వరకూ మూడు పార్టీల తరఫున మూడు సార్లు ఎన్నికల బరిలోకి దిగి మూడు సార్లూ పరాజయం పాలయ్యారు. అలాగే రావెల కూడా తెలుగుదేశం హయాంలో మంత్రిగా పని చేసి ఆరోపణలు ఎదుర్కొని ఉద్వాసనకు గురయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరి 2019 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ  తరువాత వైసీపీ, తెలుగుదేశం పార్టీలలో చేరేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బీఆర్ఎస్ గూటికి చేరారు.   

జగన్ సభలో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు

రాజమండ్రిలో జరిగిన ముఖ్యమంత్రి జగన్   బహిరంగసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వృద్ధులకు ఈ నెల నుంచి రూ. 250 పెన్షన్ పెంచినందున వారితో ముఖా ముఖి కార్యక్రమాన్ని రాజమండ్రిలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లు పొందుతున్న వృద్ధులను వాలంటీర్లు సభకు తీసుకు వచ్చారు. చాలా మంది 70 ఏళ్లు పైబడిన వాళ్లు కావడం.. బస్సులు ఎక్కి , దిగలేని ఆరోగ్య పరిస్థితుల్లో  ఉన్నారు. వాళ్లు రాలేమన్నా కూడా  వాలంటీర్లు అంగీకరించలేదు.రాకుంటే పెన్షన్లు ఆపేస్తామని హెచ్చరించి మరీ బలవంతంగా తీసుకు వచ్చారు. ఇలా తీసుకువచ్చిన ఓ 70 ఏళ్ళు పైబడిన ఓ వృద్ధురాలు  జారిపడిపోయింది. రోడ్డు మీద పడిపోవడంతో..  వెంటనే పక్కన వేరే వాహనం  ఆ వృద్ధురాలు కాళ్లు మీదకు ఎక్కింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయపడింది. ఆమె  పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు.  ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగసభల్లో  తొక్సిసలాటలు జరిగిన కారణంగా   బహిరంగసభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషేధం  విధించింది.   అయితే సీఎం జగన్ సభకు మాత్రం.. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా.. పించన్ అందుకుంటున్న వృద్ధులను వాలంటీర్ల సాయంతో తరలించారు. పెద్ద వయసు ఉన్న వారు ఇబ్బంది పడినా.. పట్టించుకోలేదు. తామే తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకు  వస్తామని చెప్పి తీసుకెళ్లారు కానీ.. ఆ వృద్ధులు కొన్ని గంటల పాటు సభలో నిల్చుకోవడానికి .. కూర్చోవడానికి ఇబ్బందులు పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.   సీఎం రాక సందర్భంగా రాజమహేంద్ర వరంలో బారీకేడ్లు, పరదాలు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.  ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా 70 ఏళ్ల వృద్ధ మహిళ తీవ్రంగా గాయడ్డారు.  తీవ్రంగా గాయపడిన ఆమెను  ఆస్పత్రికి తరలించి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి.  2023-24 వార్షిక బడ్జెట్ ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. సమావేశాల మొదటి రోజు అంటే జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్ట నుంది  బడ్జెట్‌ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనుంది. మొదటి సెషన్‌ జనవరి 31నుంచి ఫిబ్రవరి 10వరకూ,  రెండో  సెషన్‌ మార్చి 6నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరుగుతుందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలి విడతలో   రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై  సభ్యులు ప్రసంగాల అనంతరం తీర్మానాన్ని ఆమోదిస్తారు.  అలాగే ఫిబ్రవరి 1న విత్తమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చ ఉంటుంది. చర్చ అనంతరం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తారు.  .రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చ జరుగుతుంది. బడ్జెట్‌కు సభ ఆమోదం తెలుపుతుంది.   పార్లమెంటు కొత్త భవనం సెంట్రల్‌ విస్టా పనులు చురుగ్గా సాగుతున్నాయి.  బడ్జెట్ రెండో విడత సమావేశాలను  సెంట్రల్‌ విస్టా హాలులోనే నిర్వహించేందుకు వీలుగా చర్యలు  ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.