మిస్త్రీకి 'టాటా' వెనుక మిస్టరీ ఏంటి?

టాటా... ఈ పేరు ఇండియాలో ఒక తిరుగులేని బ్రాండ్. ఏదైనా వస్తువుపై టీ, ఏ, టీ, ఏ అన్న నాలుగు అక్షరాలు వుంటే చాలు నాలుగు కాసులు ఎక్కువైనా ... జనం కళ్లు మూసుకుని కొనేస్తారు. స్వతంత్ర భారతదేశం కంటే వయస్సులో పెద్దదైన టాటా గ్రూప్ తన సుదీర్ఘ ప్రయాణంలో సాధించుకున్న అసలు లాభం అదే! దాని బ్రాండ్ వాల్యూ! జనంలో దానిపై వుండే చెక్కుచెదరని విశ్వాసం! టాటా సంస్థల చైర్మన్ గా ఎవ్వరూ ఊహించని రీతిలో సైరస్ మిస్త్రీని తొలగించటం నిజంగా ఒక షాకే! ఎందుకంటే రిలయన్స్ లాంటి సంస్థలు అప్పుడప్పుడూ అంతర్గత గొడవలకి, సంక్షోభాలకి, సంచలనాలకి లోనైనా టాటా గ్రూప్ ఎప్పుడూ అలా అవ్వలేదు. దశాబ్దాలుగా వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తూపోతున్నా ఎక్కడ అలజడి కనిపించదు టాటాలో. తమ టాటా ప్రాడక్ట్స్ లాగే చాలా అత్యున్నత నాణ్యతతో సంస్థ మ్యానేజ్ మెంట్ కూడా నడిపిస్తుంటారు. కాని, సోమవారం అనూహ్యంగా చైర్మన్నే పదవి నుంచి తొలగించారు డైరెక్టర్స్! ఇది టాటా సంస్థల్లోని వారికంటే ఎక్కువ యావత్ దేశానికి ఆశ్చర్యకరం, ఆందోళనకరంగా మారింది... టాటా అంటే కేవలం వ్యాపారం కాదు. టాటా అంటే కొన్ని లక్షల మంది ఉద్యోగులు, అంతకంటే ఎక్కువ మంది షేర్ హోల్డ్రర్స్. అంతే కాక టాటా గ్రూప్ నడిపే అనేక ట్రస్టులు బోలెడు సామాజిక కార్యక్రమలు చేస్తుంటాయి. వాటి వల్ల లాభం పొందే వారు కూడా ఎంతో మంది. అందుకే, టాటా చైర్మన్ అనూహ్య తొలగింపు చాలా పెద్ద విషయం. అది ఒక సంస్థకి సంబంధించిన మ్యానేజ్మెంట్ ఇష్యు కాదు. అయితే, ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు ... నాలుగేళ్ల కింద చైర్మన్ గా ఎన్నికైన సైరస్ మిస్త్రీని ఎందుకుని పదవి నుంచి తొలగించారు? టాటాకి ఏమైనా ప్రమాదం వుందా? మళ్లీ రతన్ టాటానే ఎందుకు పీఠంపై కూర్చోబెట్టారు?  టాటా సంస్థకి ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే, దాదాపు వంద సంస్థల సమాహారమైన టాటా గ్రూప్ చాలా కంపెనీలు లాసులో వుండటంతో మెల్లగా ముందుకు పోతోంది. మరీ ముఖ్యంగా, మిస్త్రీ లీడర్ షిప్ తీసుకున్నాక చాలా చోట్ల టాటా కంపెనీల్ని, ఆస్తుల్ని, షేర్లని అమ్మేస్తూ వచ్చాడు. ఏ సంస్థ నష్టాల్లో వున్నా దాన్ని భరించే ప్రశ్నే లేదని ఆయన తేల్చేశాడు. పక్కా బిజినెస్ మ్యాన్ లా ప్రవర్తించాడు. కాని, అనేక సంస్థల్ని, వాటిల్లోని ఉద్యోగుల్ని ఒక సామాజిక బాధ్యతతో నిర్వహిస్తూ వచ్చింది టాటా గ్రూప్ చాలా ఏళ్లుగా. ఇక్కడే తేడా వచ్చింది మిస్త్రీకి, టాటా డైరెక్టర్స్ కి. ఆయన కరుడుగట్టిన లాభ, నష్టాల లెక్కలు వేస్తూ సంస్థల్ని , వాటిల్లోని ఉద్యోగుల్ని పట్టించుకోకపోవటం ఒత్తిడికి దారి తీసింది. చివరకు, సైరస్ మిస్త్రీ తొలగింపు దాకా వెళ్లింది. నెక్ట్స్ టాటాలో భాగమైన మిస్త్రీ కుటుంబానికి చెందిన పల్లోంజీ గ్రూప్ కోర్టుకు కూడా వెళ్లనుంది. అంటే టాటా ప్రపంచంలో ఇప్పుడప్పుడే గొడవలు సద్దుమణిగే అవకాశాలు లేవు...  సైరస్ మిస్త్రి తొలగింపు సరైందా కాదా అనే విషయం టాటా గ్రూప్ కు బయట వున్న వాళ్లెవరికి తెలిసే ఛాన్స్ లేదు. కాకపోతే, రతన్ టాటా మరోసారి చైర్మన్ కుర్చీ అలంకరించటం శుభ సూచకం. తాత్కాలికంగానే అయినా ఆయన తిరిగి రావటం టాటాకి, దాని ఉద్యోగులకి, మొత్తంగా దేశ ఆర్దిక వ్యవస్థకి నిస్సందేహంగా మంచిదే!  

ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లపై... హిందూత్వాస్త్రం!

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరికి వస్తున్న కొద్దీ బీజేపి నేతల గొంతుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి మంత్రం ఎంత పఠించినా యూపీ లాంటి రాష్ట్రంలో హిందూత్వ వాదం ఎత్తుకోకుంటే వర్కవుట్ కాదని నిర్ణయించుకున్నట్టుగా వుంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీయే కరుడుగట్టిన బీజేపి , ఆరెస్సెస్ అంశాల్ని లేవనెత్తుతున్నారు! ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఒక ర్యాలీలో ట్రిపుల్ తలాఖ్ అంశంపై కామెంట్ చేశారు. ముందుగా హిందువుల్లో వున్న భ్రూణ హత్యల అమానుషాన్ని ఆయన ఖండించారు. ఆడపిల్లల్ని చంపుకోవటం దారుణం అన్నారు. ఆ పని చేస్తే హిందువైనా సరే జైలుకి వెళ్లాల్సిందే అన్నారు. కాని, వెంటనే ముస్లిమ్ ల మీదకు టార్గెట్ గురిపెట్టారు. ఫోన్ లో మూడుసార్లు తలాఖ్ చెప్పేస్తే ముస్లిమ్ స్త్రీల జీవితాలు నాశనం అవ్వటం తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తేల్చేశారు. సుప్రీమ్ గవర్నమెంట్ ను అడిగితే ట్రిపుల్ తలాఖ్ ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పామన్నారు. మొత్తం మీద మోదీ ముస్లిమ్ స్త్రీల మేలు కోరుతూనే యూనిఫామ్ సివిల్ కోడ్ తుట్టె కదిపారు! ట్రిపుల్ తలాఖ్ పై సుప్రీమ్ తీర్పు ఇస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తుందనేదే ఇప్పుడు చాలా ముస్లిమ్ ల భయం...  యూనిపామ్ సివిల్ కోడ్ ఇప్పటికిప్పుడు అమల్లోకి వస్తుందా లేదా అంటే చెప్పే పరిస్థితి లేదు. కాని, కోర్టు తీర్పు త్వరలోనే రావొచ్చు. అందుకే, ఆ విషయంపై ఎన్నికల సభల్లో ప్రస్తావించి మోదీ దాన్ని ఎన్నికల అంశంగా మార్చేశారు. యూపీలో హిందూ, ముస్లిమ్ విభజన చాలా ఎక్కువగా వుంటుంది. అందుకే, యూనిఫామ్ సివిల్ కోడ్, అయోధ్య రామ మందిరం లాంటి అంశాలు బీజేపికి హిందూ ఓట్లు సంపాదించి పెట్టే ఛాన్స్ వుంది. కాని, అదే సమయంలో ముస్లిమ్ లు ఎప్పటిలాగే కమలదళానికి దూరంగా వుండిపోయే అవకాశం వుంది...  మోదీనే కాదు బీజేపి నేతలందరూ కాస్త ఘాటైన హిందూత్వ ఎజెండానే అమలు పరుస్తున్నారు. బీజేపి కాంట్రవర్సియల్ ఎంపీ గిరి రాజ్ సింగ్ మరోసారి నోరు విప్పారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలనే తిరిగి చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందూ జనాభ తగ్గిపోతోందని... హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని... ఆయన అన్నారు! స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 90శాతం వున్న హిందూ జనాభా ఇప్పుడు 76శాతానికి తగ్గిపోయిందని అన్నారు. అలాగే, 10శాతం కూడా లేని ముస్లిమ్ లు 24శాతం అయ్యారన్నారు!  గిరి రాజ్ సింగ్ మాటలు విని హిందువులు ఎక్కవ మంది పిల్లల్ని కంటారో లేదోగాని ఈ వాఖ్యలు రాజకీయ దుమారం మాత్రం తప్పకుండా రేపుతాయి. ఎన్నికల్లో తమని తాము యాంటీ ముస్లిమ్ అన్నట్లు బీజేపి ప్రొజెక్ట్ చేసుకుని కరుడుగట్టిన హిందూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేయవచ్చు! అభివృద్ధి మంత్రంతో సాధారణ హిందువుల్ని కూడా తన వైపు తిప్పుకునే ఆలోచనలో వుంది బీజేపి. మొత్తానికి ఉత్తర్ ప్రదేశ్ యుద్ధంలో ఏ అస్త్రమూ వదలటం లేదు మోదీ సేన! చూడాలి మరి... రామ మందిర రాష్ట్రంలో రానున్న కాలపు రాజకీయాలు ఎలా వుండబోతున్నాయో!    

తండ్రి, సవితి తల్లి, ఓ సీఎం!

భారతదేశంలోని అతి పెద్ద ప్రాంతీయ పార్టీ ఏదో తెలుసా? సమాజ్ వాది పార్టీ! దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ ను ఏలే ఎస్పీ ఇండియాలోనే అతి పెద్ద రీజినల్ పార్టీ. కాని, ఇది త్వరలోనే వమ్ము కాబోతోంది! సమాజ్ వాది పార్టీ అతి పెద్ద నుంచి ఒకానొక ప్రాంతీయ పార్టీగా మారబోతోంది! అందుక్కారణం ఎవరో కాదు పార్టీ వ్యవస్థాపకుడు, ఆయన కుమారుడే...  సమాజ్ వాది పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది ములాయం సింగ్ యాదవ్. ఇప్పుడు ఆ ములాయం ఇంట్లోనే ముసలం పుట్టింది. మొత్తం కుటుంబం రెండు వర్గాలుగా చీలి పార్టీని కూడా చెరి సగం చేసుకునే పరిస్థితికి వచ్చేశారు. ఒకవైపు ములాయం , ఆయన చిన్న తమ్ముడు, చిన్న భార్య, చిన్న కొడుకు వుంటే... మరో వైపు ప్రస్తుత యూపీ సీఎం అఖిలేష్, ఆయన పెద్ద బాబాయి, ఇంకా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్నారు! మొత్తానికి వ్యవహారం ఎంత దాకా వచ్చిందంటే అఖిలేష్ వేరు కుంపటి పెట్టడం దాదాపు ఖాయమైపోయింది. కాని, కుంపటి ఎప్పుడు రాజేస్తాడన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్...  అగ్రకులాల ఆధిపత్యానికి పెట్టింది పేరైన ఉత్తర్ ప్రదేశ్ లో బీసీల రాజ్యం తెచ్చాడు ములాయం. ఇంకా స్పష్టంగా చెప్పుకుంటే యాదవుల రాజ్యం తెచ్చాడు. ముస్లిమ్ నేతల హంగామాకి కారకుడయ్యాడు. కాని, గత ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయం సాధించాక కొడుకు అఖిలేష్ ను సీఎం చేసి తాను సెంట్రల్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టాడు. కాని, నితీష్ కుమార్, మాయావతి లాగే ప్రధాని అవుదామనుకున్న మన సైకిల్ పార్టీ బాస్ మోదీ హవాలో కొట్టుకుపోయాడు. ఇక ఇప్పుడు పీఎం అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు. మరో ములాయం ఇంట్లో కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ బాగా దెబ్బతిన్నాయి...  ములాయం మొదటి భార్య కొడుకు అఖిలేష్. రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్. ఇప్పుడు సమాజ్ వాది పార్టీలో గందరగోళానికి ఈ ఇద్దరు వారసులే కారణం. అఖిలేష్ ఆల్రెడీ సీఎంగా జనం ముందుకి వచ్చేస్తే... అతని సవతి తమ్ముడు ప్రతీక్ యాదవ్ తల్లి సాధన గుప్తా వ్యూహంతో ముందుకొస్తున్నాడు. ములాయం రెండో భార్య సాధన తన కొడుకు ప్రతీక్ ని నెక్స్ట్ సీఎం చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆమెకు అండగా ములాయం చిన్న తమ్ముడు శివపాల్ యాదవ్ కూడా వున్నాడు. ఈ టీంలోనే అమర్ సింగ్, మన జయప్రద కూడా వున్నారు! ఇక అఖిలేష్ ని నాయకుడుగా కోరుకుంటున్న వారు కూడా తక్కువేం లేరు. ముఖ్యంగా ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ బలంగా మద్దతిస్తున్నాడు. అంతే కాదు, మొత్తం 229 మంది ఎమ్మేల్యేల్లో అఖిలేష్ వైపు 183మంది ప్రజా ప్రతినిధులు వున్నారు. వీళ్లందరి అండతోనే అఖిలేష్ తిరుగుబాటుకి రెడీ అయ్యాడు! ములాయం తనని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే అఖిలేష్ ఆయన మనుషులుగా ముద్రపడ్డ నలుగురు మంత్రుల్ని క్యాబినేట్ నుంచి తొలగించాడు! ఉత్తర్ ప్రదేశ్ లో నేతాజీ అని అందరూ గొప్పగా చెప్పుకునే ములాయంకే చుక్కలు చూపిస్తున్నాడు! వచ్చే సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు వెళ్లబోతోంది. ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ బీజేపి అతి పెద్ద పార్టీ అని చెబుతున్నాయి. అంటే ఎస్పీ అధికారం కోల్పోవటం దాదాపు ఖాయం. ఆ భరోసా ఇచ్చేలాగే అఖిలేష్ అరాచక పాలన సాగింది గత నాలుగు సంవత్సరాల్లో. కాని, అసలు వచ్చే అవకాశమే లేని అధికారం కోసం ములాయం కుటుంబ సభ్యులు, పార్టీ వారు రోడ్డున పడి గొడవ పడుతున్నారు. ఇది నిజంగా విచిత్రమే! రాజకీయ వినోదమే! అటు పోయి ఇటు పోయి బీఎస్పీకో, బీజేపికో మేలు చేసేది కూడా కావొచ్చు! కాని, ఆశ్చర్యం ఏంటంటే... ఉత్తర్ ప్రదేశ్ లో అయోధ్య వుంది! అక్కడే తండ్రి మాట కోసం రాజ్యాన్ని వద్దన్న రాముడు పుట్టాడు! ఇప్పుడు ఈ కలియుగంలో ... అక్కడే... తండ్రిని ధిక్కరించి రాజ్యాధికారం సంపాదించాలనుకుంటున్న అఖిలేష్ వార్తల్లో నిలుస్తున్నాడు! కాకపోతే, ఈ యువరాజు రాముడూ కాదు... ఆ ముసలాయన, ములాయం... దశరథుడంతటి వాడూ కాదు!  

'లీకై'పోతున్న హిల్లరీ ఆశలు...

అమెరికా అయినా అమేథి అయినా రాజకీయం రాజీకయమే! ఎన్నికలు వస్తే ఎన్ని కథలైనా పడతారు పొలిటీషన్స్! ఇప్పుడు అగ్ర రాజ్యంలో అదే జరుగుతోంది. మన దగ్గర ఎలక్షన్స్ టైంలో స్టింగ్ వీడియోలు వెలుగు చూస్తుంటాయి. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే వారు, లేదా కులాన్నో, మతాన్నో తిడుతు కెమెరాకు బుక్కయ్యే వారు... ఇలా బోలెడు రకాల వీడియోలు వస్తుంటాయి. అవ్వి కాకుండా ఇంక్ చల్లుకోవటాలు, చెప్పులు విసరటాలు వంటి వీడియోలు సంచలనం సృష్టిస్తుంటాయి. అమెరికాలో మన దగ్గర వీడియోలు చేసిన పనే ఈమెయిల్స్ చేస్తుంటాయి.... అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతాయి. ఓటర్లు ప్రతీ అంశం పరిగణలోకి తీసుకుని ఓట్లు వేస్తారు. మన దగ్గరిలా కులం కోసమో, భాష కోసమో, ప్రాంతం కోసమో గుడ్డిగా ఓట్లు వేసేయరు. అందుకే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రత్యర్థులు అస్త్ర శస్త్రాలన్నీ బయటకు తీస్తుంటారు. వాటిల్లో మెయిన్ ఈమెయిల్సే! మరీ ముఖ్యంగా ఈ ఈమెయిల్స్ గొడవ హిల్లరీకి చాలా ఎక్కువగా వుంటోంది. గతంలో ఆమె సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా వున్నప్పుడు పర్సనల్ ఈమెయిల్స్ గొడవ తలెత్తింది. మంత్రిగా హిల్లరీ గవర్నమెంట్ సర్వర్ నుంచి కాకుండా తన పర్సనల్ సర్వర్ నుంచి ఈమెయిల్స్ పంపిందని ఆరోపణ వుంది. ఇలా తన పర్సనల్ సర్వర్ వాడటం వల్ల ఆమె ఏం సమాచారం ఎవరెవరికి పంపింది సీక్రెట్ గా మారిపోయింది. ఇది చట్ట విరుద్ధమంటారు ఇప్పటికీ. అయితే, హిల్లరీ తాను అలాంటి పనేం చేయలేదని చెబుతూ వస్తోంది. ఇప్పటికే గతంలో తాను చేసిన ఈమెయిల్స్ తప్పిదం హిల్లరీని వెంటాడుతుంటే ఇప్పుడు మరో సారి ఈమెయిల్స్ భూతం ఆమె మీదకి వచ్చింది. అయితే, ఈసారి ఒబామా రూపంలో గండం ఎదురవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పంపినా, అందుకున్నకొన్ని ఈమెయిల్స్ ఏకంగా వికీలీక్స్ కే దొరికాయి. వాళ్లు కొన్నిట్ని ట్విట్టర్ లో బయటపెట్టారు! ఒబామా, హిల్లరీ ఇద్దరూ డెమొక్రాట్ పార్టీ అభ్యర్థులే కావటంతో ఇప్పుడు తాజా ఈమెయిల్స్ ఎఫెక్ట్ మిసెస్ క్లింటన్ మీద పడేలా వుంది! ఒబామాకు సంబంధించిన ఈమెయిల్స్ లో ఒకదాంట్లో జీ 20 సదస్సు గురించి చర్చ వుంది. ఆయన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఎన్నికైన తరువాత అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ సదస్సుకు రమ్మన్నాడు. కాని, వెళ్లవద్దని ఒబామా టీమ్ మెంబర్ జాన్ పొడెస్టా చెప్పాడు. ఎందుకు అన్న వివరణ ఇంకా బయటకి రాలేదు. కాకపోతే, 2008నాటి అప్పటి ప్రెసిడెంట్ బుష్ ఆహ్వానిస్తే కూడా వాషింగ్ టన్ లోనే జరిగిన మీటింగ్ కి ఒబామా డుమ్మా కొట్టాడు. ఈ విషయం పొడెస్టా చెప్పినందుకే జరిగిందని ఇప్పుడు ఈమెయిల్స్ లో బయటపడింది. అమెరికన్ ప్రెసిడెంట్ అలా మరొకరు చెబితే వినటం ఓటర్లపై ప్రభావం చూపవచ్చు! ఒబామాకు సంబంధించిన హైలీ కాన్ఫిడెన్షియల్ ఈమెయిల్స్ వికీలీక్స్ కి దొరకటం మామూలు విషయం కాదు. దీని వెనుక రష్యా హస్తం వుందని కొందరు భావిస్తున్నారు. కాని, ట్రంప్ కైతే ఈ తాజా ఈమెయిల్ లీక్ అస్త్రం హిల్లరీపై గురి పెట్టటానికి చక్కగా దొరికింది!అతడు దీన్ని సూపర్ గా యూజ్ చేసుకుంటాడంటున్నారు క్రిటిక్స్!   

జియో... 'స్పీడ్' బ్రేకర్ దగ్గర 'స్లో' అయిపోతోంది!!

ముఖేష్ అంబానీ జియో 4జీ ఎందుకు మార్కెట్లోకి తెచ్చాడో తెలుసా? ఆయన కూతురు ''నాన్న ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా వుంది'' అంటూ కంప్లైంట్ చేసిందట! మామూలు నాన్నైతే స్లోగా నెట్ వర్క్ వున్న కంపెనీ మార్చేసి మరో కంపెనీ సర్వీస్ తీసుకోమనే వాడు. కాని, ముఖేష్ అంబానీ అసలు సిసలు బిజినెస్ మ్యాన్ కాబట్టి తన కూతురు అడిగిన స్పీడ్ తో తానే ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించాడు. అదే జియో!  జియో మార్కెట్లోకి రావటం వెనుక వున్న అసలు కారణమే స్పీడ్! మా అంత వేగంగా మరెవ్వరూ మీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయరు అన్నాడు అంబానీ. పైగా 90రోజులు ఫ్రీగా మా ప్రాడక్ట్ రుచి చూడండి అనేసరికి మిగతా కంపెనీలు గడగడలాడిపోయాయి! ఎయిర్ టెల్, ఐడియా లాంటి సంస్థలు ఊపిరిబిగబట్టి పరిణామాల్ని గమనించాయి. కాని, తీరా ఇప్పుడు మార్కెట్లో వున్న జియో... ప్రచారం జరిగినంత సంచలనం ఏం సృష్టించటం లేదు! జియో అంటేనే డేటా! 4జీ కాబట్టి హై స్పీడ్ డేటా వుంటుందని అందరూ ఆశిస్తారు. పైగా జియోలో ఫోన్ కాల్స్ కూడా ఇంటర్నెట్ ద్వారానే వెళతాయి కాబట్టి డేటా సర్వీస్ చాలా ముఖ్యం. కాని, నిజం ఏంటంటే జియో డేటా సేవలు దారుణంగా వున్నాయట! ఇది చెప్పింది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు. స్వయంగా ప్రభుత్వ సంస్థ అయిన ట్రాయ్ జియో గుట్టు రట్టు చేసేసింది. ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, ఆర్ కామ్ లాంటి కంపెనీలన్నిటి కంటే తక్కువ స్పీడ్ జియోకు వుందని తేల్చేసింది. ఎయిర్ టెల్ ఇంటర్నెట్ సర్వీస్ లో తొలి స్థానంలో వుండగా, తరువాత ఐడియా, వోడాఫోన్, ఆర్ కామ్ లు వున్నాయి. కొత్తగా వచ్చిన జియో అన్నిటికంటే తక్కువ స్పీడ్ తో రన్ అవుతోంది. ఫలితంగా టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్స్ తో జియోదే ఆఖరు స్థానమైంది! జియో తక్కువ స్పీడ్ తోనే కాదు చాలా చోట్ల కనెక్టివిటి లేక కూడా వెనుకబడిపోతోంది. అయితే, టెలికాం రెగ్యులేటరీ అథారటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్, ఇచ్చిన రిపోర్ట్ తో జియో విభేదిస్తోంది. తమ సర్వీస్ ట్రాయ్ చెప్పినంత దారుణంగా లేదని వాదిస్తోంది. కస్టమర్ వాడుకోవాల్సిన డైలీ ఫ్రీ లిమిట్ అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుందని.... అప్పుడు గమనించి తమ ఇంటర్నెట్ స్పీడ్ అంచనా వేయడం సరికాదంటోంది! ఏదీ ఏమైనా జియో మార్కెట్లోకి వచ్చినప్పుడు సంచలనంగా వచ్చింది! కాని, సంచలనంగానే ఇక మీద కొనసాగుతుందా అంటే డౌటే! మరో వైపు ఎయిర్ టెల్ , ఐడియా లాంటి ప్రత్యర్థి కంపెనీలు మాత్రం జియో బాలారిష్టాలు చూసి ఫుల్ ఖుష్ అవుతున్నాయి...   

ఉమ్మడి పౌరస్మృతి... మైనార్టీల భయాలపై ఉప్పు!

కామన్ సివిల్ కోడ్ ... దీని గురించి మీకు పూర్తిగా తెలుసా? చాలా మంది ప్రజలకు తెలియదు. ఆ విషయాన్నే క్యాష్ చేసుకుంటారు మన రాజకీయ నేతలు. మరీ ముఖ్యంగా దేశంలోని ముస్లిమ్ నేతలు, ముస్లిమ్ ఓట్ల కోసం ఆశించే వీర సెక్యులర్ హిందూ నేతలు! ఈ ఇద్దరూ ముస్లిమ్ లను కామన్ సివిల్ కోడ్ పేరు చెప్పి భయభ్రాంతుల్ని చేసేస్తున్నారు...  ఈ మధ్య ఎంఐఎం హెడ్డాఫీస్ వుండే ఓల్డ్ సిటీలోని దారుస్సలాంలో ఓ మీటింగ్ జరిగింది. ముస్లిమ్ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆ బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ తనదైన స్టైల్లో మాట్లాడాడు. ఉమ్మడి పౌరస్మృతి భారతదేశంలోని ముస్లిమ్ లను అణగదొక్కే ప్రయత్నమట! అసలు మొత్తం భారతదేశాన్నే హిందూ దేశంగా మార్చేసే కుట్రనట! ఈ మాటలకి ఏమైనా లాజిక్ వుందా అనేది ఎవ్వరికీ పట్టదు! మరీ ముఖ్యంగా ఓవైసీ అభిమానులు గుమికూడిన సదరు పాతబస్తీ మైదానంలో ఎవ్వరూ ఆలోచించరు. అసదుద్దీన్ దురుద్దేశాలకి హాహాకారాలు చేస్తూ ఊగిపోతారు! ఒక్క అసదుద్దీనే కాదు... దేశంలోని చాలా మంది నేతలు కామన్ సివిల్ కోడ్ వ్యతిరేకిస్తున్నారు. అందుక్కారణం మైనార్టీ ఓట్లు, బీజేపి వ్యతిరేకత! ఇంతకు మించి ఏమీ వుండదు. తమ రాజకీయ పబ్బం గడుపుకునే క్రమంలో మన నేతలు ముస్లిమ్ లను దేశానికి ఎంత దూరం తీసుకెళ్లమన్నా తీసుకెళతారు. మోదీ మీద విష ప్రచారం చేస్తూ చాలా మంది ముస్లిమ్ లకు ప్రధాని మీద కనీస గౌరవం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి వారిలో అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ములాయం, నితీష్... వీళ్లంతా ముందు వరుసలో వుంటున్నారు. ఉమ్మడి పౌరస్మృతి కూడా ఇలాంటి వారి వల్లే దుష్ప్రచారానికి గురవుతోంది...  కామన్ సివిల్ కోడ్ అంటే మతాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం. ఇందులో ఎంత వెదికినా దురుద్ధేశాలు ఏమీ వుండవు. కాని, దశాబ్దాలుగా మన దేశంలో దీనిపై కావాల్సినంత రాజకీయం, రాజకీయ దుష్ప్రచారం జరుగుతున్నాయి. కేవలం ముస్లిమ్ లలో వున్న భయాల్ని , అభద్రతల్ని అడ్డుపెట్టుకుని ఓవైసీల నుంచీ రాహుల్ గాంధీ దాకా అందరూ లబ్ధి పొందేస్తున్నారు. అసలు కామన్ సివిల్ కోడ్ బీజేపీ, అరెస్సెస్ లు భుజాన వేసుకోవటం వెనుక వాళ్ల స్వార్థాలు వాళ్లకు వుండవచ్చు. హిందూత్వ కోణం కూడా వుండవచ్చు. కాని, ఒక ప్రజాస్వామ్య దేశంలో కామన్ సివిల్ కోడే సమంజసం. మతానికి ఒక చట్టం వుండటం చట్ట విరుద్ధం.  ముస్లిమ్ పర్సనల్ లా వలన ముఖ్యంగా ముస్లిమ్ మహిళలు చాలా నష్టపోతున్నారు. మూడు సార్లు తలాక్ చెప్పేసి భర్త భార్యను విడిచేయవచ్చు. అలాగే, బహుభార్యత్వం కూడా చట్ట వ్యతిరేకం కాదు. ఇలాంటి ఇంకా అనేక ఇబ్బందికరమైన అంశాలున్నాయి ముస్లిమ్ పర్సనల్ లాలో. నిజంగా ట్రిపుల్ తలాఖ్ ఎంత విరివిగా జరుగుతోంది, బహుభార్యత్వం ఎంత మంది పాటిస్తున్నారు వంటివి కూడా మనం చర్చించాలి. కాని, అసలు మతానికొక ప్రత్యేక చట్టం చొప్పున వుండటం ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం. దీన్ని మన నేతలు తమ సెక్యులర్ రాజకీయాల కోసం అంగీకరించటం లేదు. ఓవైసీ కామన్ సివిల్ కోడ్ ను బీజేపి, మోదీ చేస్తున్న కుట్రగా అభివర్ణించాడు. బాబ్రీ కూల్చటం, గుజరాత్ అల్లర్లు అన్నీ మరోసారి జనం ముందు వల్లే వేసేశాడు. ఏదో జరిగిపోతందని ముస్లిమ్ లలో భయబ్రాంతులు కలిగించాడు. కాని, నిజంగా జరుగుతోన్నది ఏంటి? సుప్రీమ్ కోర్టు కామన్ సివిల్ కోడ్ పై ఏదో ఒకటి తేల్చబోతోంది. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేయాలని కొందరు ముస్లిమ్ మహిళలే కోర్టును ఆశ్రయించారు. దాని ఫలితమే అన్నీ మతాలకు ఒకే చట్టం అనే చర్చ రావటం. ఇందులో తెర వెనుక బీజేపి, ఆరెస్సెస్ పాత్ర ఎంత వుంటుందో మనకు తెలియదుగాని... ప్రత్యక్షంగా మాత్రం ఏం లేదు. కోర్టు చెప్పిందే అందరూ పాటించాలి. సుప్రీమ్ తీర్పును కూడా ఓట్ల కోసం పార్టీలు వ్యతిరేకిస్తే... అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకి దారి తీస్తుంది...   

'డ్రోనా'చార్యుడి చూపు ఇకనైనా నేల మీదకి రావాలి!

షిమ్లాలో వున్నవాడు స్వెట్టర్ వేసుకున్నాడని... రాజస్థాన్ లోని వాడు కూడా స్వెట్టర్ వేసుకుంటే ఏమవుతుంది? ఎర్రటి ఎడారి లాంటి రాజస్థాన్ లో చెమటలు కారి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు! అంతే కాదు, స్వెట్టర్ కొన్నందుకు డబ్బులు కూడా వృథా అవుతాయి! ఇవన్నీ కాకుండా చూసే వాళ్లు నవ్వుకుంటారు కూడా!ఈ విషయం అర్థం కావటం లేదు మన ముఖ్యమంత్రివర్యులకి...  ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన వారు కాదు!ఆయన గతంలోనే సమైక్యాంధ్రను ఏలిన నాయకుడు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పగ్గాలు పట్టుకుని తోలిన వాడు. కాబట్టి ఆయనకు పరిపాలనలో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాని, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్రమంగా  చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు! అదే ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది!  ఆంద్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయాక ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అమరావతితో సహా సిటీలు వున్నా , పరిశ్రమలు వున్నా గ్రామాలు, పొలాలు, రైతులు... ఈ మూడు అంశాలే ఏపీకి ఆయువుపట్టు. అందుకే, చంద్రబాబు కూడా ఎంతో కీలకమైన వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మధ్య వర్షాభావ పరిస్థితులు వస్తే రెయిన్ గన్స్ తెప్పించారు. ఎండిపోతున్న మొక్కలకి మరింత నష్టం కలగకుండా రైతులకి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు! ఇప్పుడే కాదు చంద్రబాబు మొదటి నుంచీ టెక్నాలజీ అంటే అమాంతం ఆసక్తి చూపిస్తారు! అదే ఆయన బలం... బలహీనత కూడా! భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సాంకేతికత చాలా ముఖ్యం. పైగా ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి దాని పట్ల ఆసక్తి కలిగి వుంటే ప్రజలకు చాలా మంచిది. కాని, మన దేశంలో చంద్రబాబులా న్యూ టెక్నిక్స్ పై దృష్టి పెట్టే పొలిటీషన్స్ చాలా అరుదు. అయినా కూడా ఎప్పటికప్పుడు టెక్నలాజికల్ గా అప్ డేట్ అయ్యే బాబు ఇప్పుడు ఆ అలవాటే మైనస్ గా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ డ్రోన్స్! డ్రోన్స్ అంటే సాధారణంగా పోలీసులు, ఆర్మీ వాళ్లు వాడే నిఘా పరికరాలు. మనిషితో పని లేకుండా గాల్లో ఎగురుతూ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీసి సాయం చేస్తుంటాయి. ఈ డ్రోన్స్ తోనే సరిహద్దుల్లో చాలా దేశాలు పక్క దేశాలపై నిఘా పెడుతుంటాయి. ఇండియా, పాక్ కూడా డ్రోన్స్ ను ఎక్కువగానే వాడుతుంటాయి! డ్రోన్స్ ఉద్ధేశం భద్రత సంబంధమైన విషయాల్లో వాడకమే అయినా పాశ్చాత్య దేశాల్లో ఈ డ్రోన్స్ ను పంట, పొలాలకు కూడా ఉపయోగిస్తుంటారు. డ్రోన్స్ వ్యవసాయ క్షేత్రాలపై చక్కర్లు కొడుతుంటే వాటి చేత మందు పిచికారి చేయించటం లాంటివి చేస్తుంటారు. అలాగే వాటికుండే కెమెరాలు సువిశాలమైన పొలంలోని ప్రతీ మూలా రైతుకి కనిపించేలా చేస్తాయి. అయితే, ఇవి భారతీయ రైతులకి అస్సలు అవసరం లేదు...  పాశ్చాత్యులు వాడిన డ్రోన్స్ మన రైతులు కూడా వాడితే బాగుంటుంది కదా అని ఆలోచించారు చంద్రబాబు. అందుకు తగ్గట్టే డ్రోన్స్... ఆంధ్రా పంట, పొలాల్లో చక్కర్లు కొట్టే ఏర్పాటు చేయించారు. కాని, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, వెస్టన్ ఫార్మర్స్ ఇక్కడి వాళ్లలా చదువుకోని వాళ్లు కాదు. అలాగే వాళ్ల ఫామ్స్ మన వాటిలా రెండు, మూడు ఎకరాల్లో వుండవు. చాలా వరకూ పదులు, వందల ఎకరాల్లో విస్తరించి వుంటాయి. తన పొలమంతా రైతు తిరగాలంటేనే అసాధ్యంగా వుంటుందక్కడ! అందుకే, డ్రోన్లు వాడతారు పాశ్చాత్య రైతులు.  ఇండియాలోని రైతులు, అందులో ఆంధ్రా రైతుల సంగతి అందరికీ తెలిసిందేగా! వుండేదే చిన్న చిన్న పొలాలు, వాటిల్లో పంటలు పండటమే పెద్ద తపస్సులా మారిపోతోంది. అందుక్కారణాలు అనేకం.... విత్తనాలు కల్తీవి వస్తే రైతు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎన్ని మొక్కలు మొలుస్తాయో, ఎన్ని మట్టిలో కలిసిపోతాయో దేవుడికే తెలియాలి. అలాగే, పురుగు మందులు కూడా రైతుని నిండుగా దగా చేసేస్తుంటాయి. ఎక్కడెక్కడికో పోయి డబ్బులు ఖర్చు చేసి... తీసుకొస్తే లాభం కంటే ఎక్కువ నష్టం చేసే పురుగు ముందులున్నాయి మార్కెట్లో! ఇంతే కాకుండా గతంలో వ్యవసాయ శాఖ నుంచి అనుభవం వున్న శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడేవారు. ఏ పంట వేయాలి, ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి లాంటి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఈ వ్యవస్థ మొత్తం వైఎస్ హయాంలో నీర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు అక్కడక్కడా గవర్నమెంట్ నియమించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వున్నా రైతులకి అవసరమైన సమాచారం అంతా సమయానికి అందటం లేదు! ఇవన్నీ కాకుండా చివరగా రైతుకి అసలు పెద్ద సమస్య విత్తనాలు, మందులు వగైరా వగైరా లాంటి వాటి మీద లేని ప్రభుత్వ పెత్తనం రైతు పండించిన పంట మీద వుండటం! విత్తనాలకు, యూరియాకి ఎక్కడా ఫిక్స్ డ్ రేట్ వుండదు. కాని, రైతు దిగుబడికి మాత్రం ప్రభుత్వం అరకొరగా మద్దతు ధర ఇస్తుంది! ఆంధ్ర ప్రదేశ్ రైతులకి ఇన్ని రకాల సమస్యలున్నాయి. అవన్నీ కలిసి రైతుని అప్పులు, ఆత్మహత్య అనే రాళ్లతో తిరిగే తిరగలిలోకి విసిరేస్తున్నాయి! కాని, సీఎం చంద్రబాబు వాటి మీద కంటే కొత్తగా వచ్చిన డ్రోన్లపై ఎక్కువ దృష్టి పెట్టి కాలం వృథా చేసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఎంతో ఖర్చు చేసి గాల్లోకి ఎగిరించే డ్రోన్ల వల్ల ఎటువంటి లాభం లేదంటున్నారు. అంతకంటే ముందు బాబు విత్తనాలు, మందులు, మద్దతు ధర వంటి రైతుల నిజమైన సమస్యల నివారణకి కృషి చేస్తే బావుంటుందంటున్నారు... టెక్నాలజీని అందిపుచ్చుకోవటం మంచి విషయమే. కాని, టెక్నాలజీ మన టెంప్టేషన్ అయితేనే కష్టం. చంద్రబాబు ఈ సత్యం తెలుసుకుంటారని ఆశిద్దాం. డ్రోన్ల కోసం గాల్లోకి ముఖం పెట్టిన ఆయన తొందర్లోనే నేల వైపు చూసి... రైతులకి అండగా నిలవాలని కోరుకుందాం...   

పాలనలో పెదబాబు... పార్టీకి చినబాబు!

నాయకత్వం అంటే వారసత్వం కాదు. అది ఎవరికి వారు పుణికిపుచ్చుకోవాలి. ఉబికి తెచ్చుకోవాలి! అయితే, కొన్నిసార్లు వారసత్వం నాయకత్వాన్ని కాస్త తేలిక చేసి పెడుతుంది. అంతే తప్ప పూర్తిగా వారసత్వమే నాయకత్వం అయిపోదు. ఈ విషయం దేశాన్ని ఏలాలని ప్రయత్నిస్తోన్న రాహుల్ గాంధీ మొదలు మన చాలా మంది రాజకీయ నేతల వారసుల వరకూ పదే పదే ఋజువు అవుతోంది. వారసత్వం వుంటే చేతికి మైక్ తేలిగ్గా దొరుకుతుందేమోగాని... ఏం మాట్లాడాలో తెలివిగా నేర్చుకోవాలి. అనుభవంతో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు తన వారసుడు లోకేష్ విషయంలో అదే నిరూపించే పనిలో వున్నట్టు కనిపిస్తోంది... ఎన్టీఆర్ ప్రభంజనంలా ప్రారంభించిన పార్టీ టీడీపీ. దాన్ని ఆయన అద్భుతంగా నడిపించారు. అటు తరువాత చంద్రబాబు ఎన్నేళ్లు ప్రతిపక్షంలో వున్నా పార్టీని భద్రంగా కాపాడుతూ వచ్చారు. టీడీపి కంటే ముందు నుంచే రంగంలో వున్న కాంగ్రెస్ ని ఢీకొంటూనే ... తరువాత వచ్చిన టీఆర్ఎస్, పీఆర్పీ, వైఎస్ఆర్సీపీ.... ఇలా ఎన్నో పార్టీల్ని టీడీపీ తట్టుకుని నిలబడింది. నిలబడుతోంది. నవ్యాంధ్రని ఏలుతోంది. ఈ మొత్తం ప్రస్థానంలో చంద్రబాబు పాత్ర ఎంతో కీలకం. ఆయన ఒక సామాన్య విద్యార్థి నేత స్థాయి నుంచీ తెలుగు నేలని అత్యధిక కాలం ఏలిన సీఎం స్థాయి వరకూ ఎదిగారు! ఇది నిస్సందేహంగా రాజకీయ అద్భుతమే...  చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని సహజంగానే అందుకోవాల్సిన వ్యక్తి లోకేష్. ఇటు నారా కుటుంబానికి, అటు నందమూరి కుటుంబానికి ... రెండిటికి ఆయన ఎంతో కీలకం. అందుకు తగ్గట్టే లోకేష్ గత కొన్నేళ్లుగా తండ్రి నాయకత్వంలో రాటుదేలుతున్నారు. ప్రభుత్వంలో పదవి చేపట్టకపోయినా పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కాబోయే సీఎంగా కార్యకర్తల నుంచి నేతల వరకూ అందరితో దగ్గరి సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. అయితే, ఇంత చేస్తున్నా చంద్రబాబు పూర్తి స్థాయిలో లోకేష్ పై సంతృప్తిగా లేనట్లు వార్తలొస్తున్నాయి. అవ్వి ఎంత వరకూ నిజమో తెలియదుగాని పార్టీకి మాత్రం మరింత దగ్గరవ్వాలని సీఎం చినబాబుని ఆదేశించారట! ముందు ముందు పూర్తిగా గుంటూరులోని పార్టీ ఆఫీస్ లోనే మకాం వేసి నేతలు, కార్యకర్తలతో లోకేష్ చర్చలు జరపనున్నారు. వాళ్ల సాధకబాధకాలు విననున్నారు.  ప్రస్తుతం లోకేష్ వారంలో కొన్నాళ్లు హైద్రాబాద్ లో , కొన్నాళ్లు గుంటూరు, విజయవాడల్లో వుంటున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆయన ఆంధ్రకు మకాం మార్చేస్తారంటున్నారు. అప్పుడు పార్టీలోని వివిధ స్థాయుల్లోని నేతలు, కార్యకర్తలు అందరూ యువనేతతో మాట్లాడవచ్చు. తమ గోడు చెప్పవచ్చు అంటున్నారు. ఇదంతా నిజమే అయితే అది మంచి పరిణామమే. కాబోయే నాయకుడిగా లోకేష్ కు పార్టీపై, నేతలు, కార్యకర్తలపై పట్టు వుండటం చాలా అవసరం...   

హిల్లరీ, ట్రంప్, మధ్యలో ఇండియా!

చాలా చిన్న చిన్న దేశాలు మొదలు భారతదేశం లాంటి పెద్ద దేశాల దాకా ఎక్కడ ఎన్నికలు జరిగినా, చర్చలు జరిగినా అమెరికా పేరు ఆటోమేటిక్ గా వస్తుంది. అగ్ర రాజ్యం అలా తన ప్రభావం విస్తరించింది. కొన్ని దేశాల్లో అమెరికా గొప్ప దేశమని టాక్ వుంటే మరి కొన్ని దేశాల్లో అమెరికా వల్లే విధ్వంసం జరుగుతోందని అంటుంటారు. ఇక మన దేశం లాంటి చోట్లలో అమెరికా మద్దతుదారులు, వ్యతిరేకులు ఇద్దరూ బలంగానే వుంటారు!  అమెరికా గురించి దేశదేశాల్లో మాట్లాడుకోవటం చాలా రోజులుగా మనకు అలవాటైపోయింది. కాని, అమెరికాలో , అదీ ఎన్నికల వేళ మన దేశం గురించి మాట్లాడుకోవటం... నిజంగా ఆశ్చర్యకరమే! కాని, అనూహ్యం మాత్రం కాదు! ఈ మధ్యే డానాల్డ్ ట్రంప్ తనకు హిందువులన్న , భారతీయులన్నా అభిమానం అన్నాడు. మోదీ గొప్ప నేత అని కూడా కితాబు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తాను గెలిస్తే వైట్ హౌజ్ లో ఇండియాకు మంచి మిత్రుడు వున్నట్టే అంటూ భరోసా ఇచ్చాడు! అసలు ఇంతగా ఇండియా గురించి అమెరికన్ ఎన్నికల్లో చర్చకు రావటం ఇదే మొదటిసారి! అంతే కాక, ఏ మోదీనైతే తమ దేశంలోకి రానీయకుండా అమెరికా అడ్డుకుందో... అదే మోదీ మహానుభావుడంటూ ట్రంప్ మాట్లాడటం... మన సత్తాని చాటుతోంది! అమెరికాలోని అనివార్యమైన స్థితిని ప్రతిబింబిస్తుంది...  అమెరికాలో ఇప్పడు ఇండియా గురించి డిస్కషన్ కంపల్సరీ అయిపోయింది. అందుకు ఒక కారణం అక్కడి మన లక్షలాది భారతీయుల ఓట్లు హిల్లరీకి , ట్రంపుకు ఇద్దరికీ అవసరం కావటమే. రెండోది ... ప్రపంచంలోనే మనం అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్దిక వ్యవస్థ కావటం! ఈ కారణంతోనే తన లాస్ట్ డిబేట్ లో హిల్లరీతో పోటిపడ్డ ట్రంప్ ఇండియాను గుర్తు చేసుకున్నాడు! ప్రపంచంలో ఇప్పుడు ఇండియా, చైనా మాత్రమే అత్యధిక వృద్ధి రేటుతో ముందుకు పోతున్నాయన్నాడు. అందులోనూ చైనా 7శాతం అయితే భారత్ 8శాతంతో టాప్ లో వుంది. కాని, అమెరికా అభివృద్ధి రేటు ఒక్క శాతం మాత్రమే వుంది. ఇలా అయితే ముందు ముందు అగ్రరాజ్యానికి గడ్డు కాలమే అన్నాడు ట్రంప్. హిల్లరీ తనకు తోచిన రీతిలో దీనికి రిప్లై ఇచ్చింది....  ట్రంప్, హిల్లరీ మధ్య చర్చలో ఇండియా పేరు రావటం మారుతున్న ప్రపంచ పటానికి సంకేతం! ఒకప్పటిలా భూగోళం అంటే అమెరికా , యూరప్ మాత్రమే అని పరిస్థితి ఇక మీదట వుండదు. వాల్డ్ అంటే... అమెరికా, యూరప్ లతో కూడుకున్న ఇండియా అండ్ చైనా అని కూడా అంగీకరించాల్సిందే! లేటెస్ట్ యూఎస్ ఎలక్షన్స్ దాన్ని చెప్పకనే చెబుతున్నాయి!   

అమరావతి అభివృద్ధికి... ముందు ఇవ్వి వుండాలి!

దేశమంటే మట్టికాదోయ్.... దేశమంటే మనుషులోయ్ అన్నాడు కవి. కాని, ఇప్పుడు మారిపోయిన ప్రపంచ పరిస్థితుల్లో దేశమంటే మట్టిలాగే తయరైపోయింది! భూమి, భూమిలో వేసే వాటర్, సుయెజ్ పైపులు, భూమిపై వేసే రోడ్లు... ఇలాంటి మౌలిక సదుపాయాలే ఇప్పుడు అభివృద్ధిని నిర్దేశిస్తున్నాయి. నిర్వచిస్తున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతికి కూడా ఇప్పుడు కావాల్సింది మౌలిక సదుపాయాలే...  హైద్రాబాద్ నుంచి అమరావతికి గవర్నమెంట్ ఆఫీసుల షిఫ్టింగ్, తాత్కాలిక సెక్రటేరియట్ ఇలాంటి పరిణామాలు ఎన్ని జరుగుతున్నా కొత్త రాజధానిలో ఇంత వరకూ ప్రత్యక్ష అభివృద్ధి ప్రజలకు కనిపించటం లేదు. అందుకే, ఏపీ సీఏం చంద్రబాబు డెవలప్ మెంట్ కి ఊతమిచ్చే కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకి దిశా నిర్దేశం చేశారు.  రాష్ట్రానికి రాజధాని అంటే అత్యంత ప్రధానం కనెక్టివిటి. అందుకే, రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అలాగే, తాగు నీరు, మురుగు పారుదల వ్యవస్థలపై కూడా రానున్న నాలుగేళ్లలో పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టాలన్నారు. ఇక అభివృద్ధికి అత్యంత ప్రధానమైన విద్యుత్ సరఫరా పై కూడా సమరోత్సాహంతో పని చేయాలని సూచించారు. విద్యుత్, తాగు నీరు, రోడ్లు... ఇలాంటివి అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి అభివృద్ధి ఆసాధ్యమేం కాదు! అమరావతి నగర అభివృద్ధి కోసం రానున్న నాలుగేళ్లలో దాదాపు 33వేల కోట్లు, మొత్తం పదేళ్ల కాలంలో 43వేల కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఇంత పెద్ద మొత్తం సమర్థంగా రాజధాని నగరంపై పెట్టుబడి పెడితే ఖచ్చితంగా అమరావతి రూపు రేఖలే మారిపోయే అవకాశం వుంది. కాకపోతే, సీఎం సారథ్యంలో ప్రభుత్వం, అటు బ్యూరోక్రాట్స్ చిత్తశుద్ధితో కృషి చేయాలి. నిధుల్ని సాధ్యమైనంత త్వరగా పోగు చేసి ప్రజలకి అభివృద్ధి అనుభవంలోకి వచ్చేలా చేయాలి. అత్యునత స్థాయి విద్యా సంస్థలు, ఇతర సంస్థలు, పేరు మోసిన హోటల్స్... ఇలాంటివన్నీ తమ సిటీలోకి వస్తేనే జనం సంతోషించేది. లాభపడేది. అదే 2019లో టీడీపికి అతి పెద్ద బలం కూడా అవుతుంది!  

తెలంగాణ రైతులకి గులాబి ముళ్లు గుచ్చుకుంటున్నాయా?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆంధ్రుల మీద కోపంతో వచ్చింది కాదు. తమకు దక్కని నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజల్లోంచి పుట్టింది. అది దశాబ్దాల పాటూ సాగి చివరకు కేసీఆర్ నేతృత్వంలో సాకారమైంది. ఇప్పుడు బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోంది! కాని, అంతలోనే స్వరాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రిగారు సురాష్ట్రం కూడా చేసుకునే దిశగా మనసుపెట్టాలి. లేకపోతే ఇప్పుడి్ప్పుడే బలం పుంజుకుంటున్న ఆరోపణలు కొత్త రాష్ట్రం దశని, దిశని చెడగొట్టే ప్రమాదం వుంది.  నిజానికి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోయారు. మొదట్లో విపక్షాలు కూడా ఎలా విమర్శించాలో అర్థం కాక కన్ ఫ్యూజ్ అయ్యాయి. అంతే కాక ఉద్యమ నాయకుడన్న క్రేజ్ జనంలో వుండటంతో ఎవ్వరూ ఏదీ గట్టిగా అనలేని స్థితి వచ్చింది. అయితే, ఇప్పుడు క్రమంగా ఆరోపణల ఘాటు పెరుగుతోంది.  సహజంగానే టీఆర్ఎస్ వ్యతిరేక మీడియా తన వంతు కృషి చేస్తోంది. అలాంటి ఓ మీడియా రిపోర్టే తెలంగాణలో తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. తెలంగాణలో యంత్రలక్ష్మీ పేరుతో సబ్సిడి రేట్లకు వ్యవసాయ యంత్రాలు అందించే పథకం వుంది. దీంట్లో అవకతవకల గురించి మీడియా రాసింది. దాని సారాంశం ఏంటంటే... అర్హులైన రైతులకి తక్కువ ధరకి అందించాల్సిన ట్రాక్టర్లను టీఆర్ఎస్ నేతలు తమ వారికి ఇప్పించుకుంటున్నారు. ఇది ఏ పార్టీ అధికారంలో వున్నా జరిగేదే. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాని, మీడియా రిపోర్ట్స్ ప్రకారం సబ్సిడి ట్రాక్టర్స్ లో తొంభై శాతానికి పైగా పార్టీ వాళ్లకే వెళ్లిపోతున్నాయట. ఇది ఒక్క జిల్లాలో వ్యవహారం కాదు. పాత పది జిల్లాల్లో, కొత్త ముప్పై ఒక్క జిల్లాల్లో... రాష్ట్రమంతటా అదే పరిస్థితి.  మీడియా రిపోర్ట్ చేసినంత మాత్రాన అంతా నిజమని నమ్మేయాల్సిన పని లేదు. కాని, టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి వరకూ తెలంగాణ ప్రజలకి ప్రత్యక్షంగా లబ్ధి కలిగేలా చేసిన పనంటూ ఏం లేదు. అధికార పార్టీ తాము చేసిన పనులు లిస్ట్ వేసుకొని చెప్పొచ్చు. కాని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా వున్నాయి. రైతులు, నిరుద్యోగులు, మహిళలు... ఇలా అన్ని వర్గాల వారు అసంతృప్తిగానే వున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుందన్న వాళ్ల ఆలోచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దీని ప్రభావం వచ్చే ఎన్నికల పై కూడా అవకాశం వుంది. ఇక ఇలాంటి క్రమంలో కేసీఆర్ గవర్నమెంట్ పై అవినీతి ఆరోపణలు కూడా వస్తే అది మరింత ప్రమాదకరం. ప్రభుత్వం ఇచ్చే ట్రాక్టర్లు అర్హులైన రైతులకి అందిలే సీఎం స్థాయి నుంచి చర్యలు చేపట్టాలి. లేదంటే ఊళ్లలో రోజు రోజుకి చెడు ప్రచారం ఎక్కువవుతుంది.  ఏ ప్రభుత్వమైనా తిరిగి ఎన్నిక కావాలంటే ఒక వైపు అభివృద్ధి చేస్తూనే మరో వైపు అవినీతి , అక్రమాల ఆరోపణలు లేకుండా చూసుకోవాలి. వీటికి తోడు శాంతి భద్రతలు చెడకుండా వుండాలి. కేసీఆర్ శాంతి భద్రతల విషయంలో వంద మార్కులు, అభివృద్ధి విషయంలో పాస్ మార్కులు వేయించుకుంటున్నా... పార్టీ నేతల, ప్రజా ప్రతినిధుల ప్రవర్తన విషయంలో కాస్త పట్టించుకుంటున్నట్లు కనిపించటం లేదు! ఇది దీర్ఘ కాలంలో కాలి కింద ల్యాండ్ మైన్ అవ్వొచ్చంటున్నారు విమర్శకులు. గులాబీ బాస్ ఎలా ఈ విమర్శని స్వీకరిస్తారో చూడాలి....    

బాలీవుడ్ కంటే భారతే ముఖ్యం!

ఇండియా, పాకిస్తాన్, సర్జికల్ స్ట్రైక్స్, బాలీవుడ్ లో పాకిస్తానీ కళకారులపై నిషేధం.... వీటన్నటి మధ్యలోకి ఇప్పుడు ముఖేష్ అంబానీ అనే పదం కూడా వచ్చి చేరింది! ఈ సారి మీరు గూగుల్ సర్చ్ లో ఇండియా , పాకిస్తాన్ అని టైప్ చేస్తే అంబానీ ఏమన్నాడో కూడా దర్శనమిస్తుంది! రోజుకొకరి చొప్పున ఈ మ్యాటర్ లో సెలబ్రిటీలు, వీఐపీలు కాలు పెడుతుండటంతో తానూ ఎంట్రీ ఇచ్చాడు ది రిచ్చెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా!  ఏదో ఎప్పటిలాగే ఓ ఉగ్రవాద దాడి జరిగిందనుకున్నారు అంతా. కాని, మన జవాన్లు 19మంది చనిపోయారంటే అందరూ రగిలిపోయారు. తరువాత సర్జికల్ స్ట్రైక్స్ చేసి దాదాపు 40మంది ఉగ్రవాదుల్ని మన సైన్యం మట్టుబెడితే మళ్లీ ఉత్సాహం రేగింది దేశంలో. కాని, అప్పట్నుంచే సమస్య కూడా మొదలైంది. ఒకవైపు మోదీ ఎక్కడ సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ కొట్టేస్తాడోనని అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ లాంటి వారు భయపడుతుంటే... రాజ్ థాక్రే లాంటి వాళ్లు లోకల్ గా నానా రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్లో పాకిస్తాన్ కళాకారులు కనిపించటానికి వీలు లేదని ఆర్డర్ లు వేశారు. దాని ఫలితంగా మళ్లీ గొడవ పెద్దదైపోయింది. మహేష్ భట్ నుంచి అనురాగ్ కశ్యప్ దాకా అందరూ పాకిస్తానీ కళాకారులు కావాలని తెగ ఫీలైపోయారు. అదెలా కుదురుతుందని అనుపమ్ ఖేర్ లాంటి బి-టౌన్ సెలబ్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.  ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఒక వైపు ఆందోళన కలిగిస్తుంటే రోజుకో వింత స్టేట్మెంట్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రతీ వారూ మోదీని టార్గెట్ చేసి హైలైట్ అవ్వాలనుకుంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మొదలు అనురాగ్ కశ్యప్ వరకూ అందరిదీ ఇదే పద్ధతి! కాని, మోదీకి అండగా ఇప్పుడు అత్యంత బలమైన వ్యక్తి వచ్చి నిలబడ్డట్టైంది! అతనే ముఖేష్ అంబానీ! రెలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఢిల్లీలో ప్రభుత్వాల్ని శాసిస్తాడని అందరికీ తెలిసిందే. అయితే, ఆయన ఎలాంటి ముసుగులో గుద్దులాట లేకుండా తన అభిప్రాయం చెప్పాడు. కళలు, సంస్కృతి అన్నిటికంటే తనకు దేశమే ముఖ్యమని అన్నాడు. అందరు భారతీయుల్లాగే తాను కూడా ఇండియా ఫస్ట్ అనుకుంటానన్నాడు! పైగా తాను మేధావిని కానని... పాకిస్తాన్ తో మైత్రి, పాకిస్తాన్ కళాకారుల్ని ఇక్కడ నిషేధించకపోవటం... ఇవి తనకు అర్థం కావని  ముక్తాయింపు ఇచ్చాడు! అంబానీ మేధావి కాకపోవచ్చుగాని వ్యాపార మేధావి మాత్రం తప్పుకుండా. అందుకే, జియోను మార్కెట్లోకి తెచ్చి సంచలనం సృష్టించిన అంబానీ దేశం వైపు, మోదీ వైపు నిలిచాడు. ఇది ఆయన ప్రాడక్ట్ కి మంచి పబ్లిసిటీనే కాక అంబానీపై యావత్ దేశానికి మంచి అభిప్రాయం కలిగేలా చేస్తుంది! ముఖేష్ అంబానీ పాకిస్తానీ కళకారులైనా ఎవరైనా దేశం తరువాతే అనటమే కాదు... తాను స్పాన్సర్ చేసిన ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక పాకిస్తానీ సినిమా ప్రదర్శన కూడా నిలిపి వేయించాడు! మొత్తానికి దేశం యుద్ధం ముంగిట్లో నిలుచున్నా ఇంత కాలం పాక్ కళకారులు కావాలని అల్లాడిపోయిన బాలీవుడ్ వాల్లు, మీడియా వాళ్లు అంబానీ స్టాండ్ చూసి ఆలోచన మార్చుకునే అవకాశం వుంది! ఎందుకంటే, ఇండస్ట్రీలో అత్యంత గొప్ప వాడితో విభేదించటం ఎవరికైనా, ఎప్పటికైనా ప్రమాదకరమే! కాబట్టి అంబానీకి తమ విదేయత చాటే ఉద్దేశ్యం వున్న చాలా మంది బాలీవుడ్ వాళ్లు కూడా ఇక ధైర్యంగా జై భారత్ మాతా అంటారు!   

ఆగ్గితో చెలగాటం... ఆసుపత్రుల్లో హాహాకారం!

ఓ అభాగ్యుడెవరో వర్షం పడుతోందని గుడిలోకి వెళితే... ఆ గుడి పైకప్పే మీద కూలిందట! పాపం... అలా అయింది భూవనేశ్వర్ లోని రోగుల పరిస్థితి. మరో పది కాలాలు బతకాలని వాళ్లు నగరంలోని అతి పెద్ద కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లారు. కాని, తీరా అక్కడే వార్ని మృత్యువు వేటాడింది. మంటల రూపంలో వచ్చింది మింగేసింది...  ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని ఎస్ యూఎం హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం ఎవర్నైనా కదిలించేస్తుంది. ఎందుకంటే, అమాంతం చెలరేగిన మంటలు నిర్ధాక్షిణ్యంగా అభాగ్యుల్ని తినేశాయి. ఎందుకంటే, వాళ్లంతా కనీసం మంచం పై నుంచి లేచి పరుగులు కూడా తీయలేని డయాలిసిస్ చేయించుకుంటున్న రోగులు. భయంకరమైన అగ్ని కీలలు ఎర్రటి నాలుకలు తెరుచుకుని పైకొస్తుంటే నిస్సహయంగా వాటిలో కలిపోయారు! కాని, దీనికి ఎవరిది బాద్యత? దేశంలో ఎక్కడ ఏ పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా రెడీ మేడ్ గా దొరికే సమాధానం షాక్ సర్య్యూట్. ఎస్ యూఎం హాస్పిటల్ విషయంలో కూడా అదే చెబుతున్నారు. డయాలిసిస్ వార్డ్ లో కరెంట్ తీగల్లోంచి పుట్టిన నిప్పులు మొత్తం ఫ్లోరంతా బూడిద చేసేశాయి. దాదాపు 25మందిని బలి తీసుకుని, 70మందికి తీవ్రగాయాలు చేశాయి. అయితే, ఒడిషాలో జరిగిన ఈ దారుణమే మొదటిది కాదు. మన దేశంలో పదే పదే అగ్ని ప్రమాదాలకు జనం బలవుతుంటారు. మరీ ముఖ్యంగా, లేచి నడవలేని స్థితిలో వుండే పేషెంట్స్ వుండే ఆసుపత్రులు అగ్నికి ఆహుతైతే పరిస్థితి దయనీయంగా వుంటుంది.  2011లో కోల్ కతాలో ఇలాంటి దుర్ఘటనే జరిగింది. ఏఎంఆర్ ఐ హాస్పిటల్ బిల్డింగ్ లో షాక్ సర్య్యూట్ అయ్యి మంటలు పుట్టాయి. 89మందిని కర్కశంగా మాడ్చేశాయి. అయినా మన వ్యవస్థలో ఏ మార్పూ రాలేదు. మళ్లీ నిన్న భువనేశ్వర్ లో అదే దుర్ఘటన జరిగింది. ఇంకో హాస్పిటల్ . వేరే మృతులు అంతే తేడా...  అగ్ని ప్రమాదాలు ఎక్కడ జరిగినా మూల కారణం నిర్లక్ష్యమే. అలాంటిది హాస్పిటల్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అది మరింత దారుణం. మానవ తప్పిదం, నిర్లక్ష్యాల ఖరీదు ఎందరో అమాయకులు, అభాగ్యుల ప్రాణాలు. వాళ్ల కుటుంబాల తీరని వేదన. అయినా కూడా మన ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు శాశ్వత ప్రాతిపదికన ఏ చర్యలూ చేపట్టవు. ఇలాంటి షాకింగ్ ఇన్ సిడెంట్స్ జరిగినప్పుడు హడావిడి. తరువాత అంతా మామూలే. హాస్పిటల్స్ మొదలు మల్టీప్లెక్సుల వరకూ ఎక్కడా ఫైర్ నామ్స్ పాటించిన పాపన పోరు. ఫలితంగా వందల మంది జీవితాలు నిరంతరం ప్రమాదం అంచున వేలాడుతుంటాయి. కాపాడాల్సిన మన వ్యవస్థలు నిర్లక్ష్యం, లంచాల మత్తులో తూగుతుంటాయి... ఈ పరిస్థితి మారాలి!   

సోషల్ మీడియా వెనుక దాగిన సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్!

ఇంట్లో వున్నా, ఆఫీస్ లో వున్నా, జర్నీలో వున్నా, ఔట్ స్టేషన్లో వున్నా... ఎక్కడున్నా ఇప్పుడు అందరూ వుండేది, వుంటోన్నది మాత్రం... సోషల్ మీడియాలో! అవును, ఫేస్బుక్ , ట్విట్టర్ వగైరా వగైరాల్లో జనం పగలు , రాత్రి తేడా లేకుండా లాగిన్ అయిపోతున్నారు! గంటలు గంటలు లాగించేస్తున్నారు. ఏం పనిలేక తీసుకునే సెల్ఫీ మొదలు హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లే ముందు తీసుకున్న ఫోటో వరకూ... అన్నీ పోస్ట్ చేయాల్సిందే! అలా తయారైంది కొందరి పరిస్థితి! సోషల్ మీడియా పిచ్చి ఒక్కొక్కరికీ ఒక్కో రేంజ్లో వుంటుంది. కొందరికి కంట్రోల్ లో వుంటే కొందరికి పీక్స్ కి వెళ్లిపోతోంది. అంతే కాదు, కొందరు ఫేస్బుక్ లాంటి చోట్లలో ఎక్కువగా పర్సనల్ ఫోటోలు, వీడియోలు, స్టేటస్ లు పెడితే మరి కొందరు ఎక్కువగా సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. అయితే, ఇదంతా మన పర్సనల్ అనుకుంటే పొరపాటే! ఒక్కసారి సోషల్ మీడియాలో మన పోస్టింగో, ఫోటోనో పెట్టేశాక అది ప్రపంచం ముంగిట నిలుస్తుంది! మీ పేరు తెలిస్తే చాలు ఎవరు ఎక్కడైనా మీ పోస్టు, మీ ప్రొఫైలు చూసేయోచ్చు! అంటే... క్షణాల్లో మిమ్మల్ని అంచనా వేయవచ్చన్నమాట! సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి ఎలాంటి వాడు అన్న నిర్ణయానికి రావటం పెద్ద విషయమేం కాదు. ఆఫ్ట్రాల్, మనమూ ఎవరైనా కొత్త వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే ఏం చేస్తాం? మ్యుచువల్ ఫ్రెండ్స్, వరుసగా చేసిన పోస్ట్స్, కామెంట్లో వాడిన భాష, భావం... ఇలాంటివన్నీ గమనిస్తాం. అప్పుడే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాం. అంటే సదరు మనిషిని అతడి ప్రొఫైల్ చూసి పసిగట్టేస్తున్నామన్నమాట!  సోషల్ మీడియా అకౌంట్లో చూసి ఎదుటి వారిని అంచనా వేయటం ఇప్పుడు కంపెనీలు కూడా చేస్తున్నాయట! కార్పోరేట్ కంపెనీలు తమ ఎంప్లాయిస్ సెలక్షన్ సోషల్ మీడియా ఆధారంగా చేస్తున్నాయి. ఇంటర్వ్యూ లాంటి పాత పద్ధతులు పాటిస్తూనే వున్నా తమ వద్దకొచ్చిన అభ్యర్థి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ లాంటివి కూడా ట్రాక్ చేస్తున్నాయి. వాటిల్లో ఆ వ్యక్తి ఏం పోస్ట్ చేశాడు, ఎలా చేశాడు, ఎవరి గురించి, ఎందు గురించి వంటివన్నీ స్టడీ చేస్తున్నారు. దాన్నుంచి క్యాండిడేట్ పై ఓ అవగాహనకు వస్తున్నారు.  సాధారణంగా ఎక్కువగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేది నిరుద్యోగులు. ఎక్కువ ఖాళీ సమయం వుండేది కూడా వారికే. అందుకే, నిరుద్యోగులు తమ ఇష్టానుసారం సోషల్ మీడియా పోస్టులు చేయోద్దంటున్నారు నిపుణులు. కంపెనీలు తరువాత చూసినప్పుడు నెగటివ్ ఫీలింగ్ వచ్చే ప్రమాదం వుందట! రాత్రి బాగా తాగి ఇంకా దిగలేదు లాంటి పోస్టులు పెడితే ఎవ్వరూ ఉద్యోగానికి తీసుకుని టెన్షన్ కొనితెచ్చుకోరు కదా? అలాగే, రకరకాల జనంపై, వివిధ అంశాలపై, సామాజిక వర్గాలపై , మతాలు, కులాలపై నెగటివ్ కామెంట్స్ కూడా ఇబ్బందులు తేవచ్చంటున్నారు! వీటన్నటి కారణంగా సోషల్ మీడియాలో మరీ ముసుగు వేసుకుని రోజూ ఆదర్శాలు వల్లించమని కూడా ఇక్కడ ఉద్దేశ్యం కాదు. అలా చేస్తే నటన కాస్తా ఈజీగా అర్థమైపోతుంది. కాని, మన ప్రోఫైల్ లో సాధ్యమైనంత వరకూ నిజాయితీగా వుండాలి. ఎవ్వర్నీ కించపరటం, దేన్నీ చులకనగా మాట్లాడటం చేయకుండా సంస్కారవంతంగా వుండాలి. ఆ పై మన నిజమైన వ్యక్తిత్వం అంచనా వేసుకున్న సదరు కంపెనీ ఉద్యోగం ఇస్తే ఇస్తుంది. లేదంటే లేదు! ఉద్యోగాల్లో సోషల్ మీడియా అకౌంట్లు బ్లడ్ రిపోర్ట్స్ లా తయారవుతున్నాయి కాబట్టి అసలు వాడకుంటే అయిపోతుందిగా? లేదంటే దొంగ ప్రొఫైల్ పేర్లు , దొంగ ప్రొఫైల్ పిక్స్ పెట్టుకుంటే అయిపోతుందిగా?ఇలాంటి ఆలోచనలు కూడా చేటు చేస్తాయి. ఎందుకంటే, ప్రస్తుతం నడుస్తోన్న స్మార్ట్ ఫోన్స్ అండ్ 4జీ కాలంలో ఫేస్బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ ఎక్కడా లేనంటే నమ్మటానికి కార్పోరేట్ కంపెనీలు సిద్ధంగా వుండవు. ఒకవేళ వున్నా... టెక్నాలజీకి దూరంగా వుండిపోవటాన్ని మైనస్ గానే పరిగణిస్తాయి... సో సోషల్ మీడియా... హ్యాండిల్ విత్ కేర్!  

బాలీవుడ్డోళ్ల... మోదీ ఫోబియా... పాక్ సిండ్రోమ్!

సినిమా గొప్పదా? దేశం గొప్పదా? సినిమానే గొప్పది! ఏంటి చిర్రెత్తుకిచ్చిందా? దేశం కంటే ఎక్కడైనా సినిమా గొప్పదవుతుందా? కాదు కదా! కాని, కొందరు బాలీవుడ్ వాళ్లకు సినిమానే గొప్పదైపోతోంది! ఇంకా చెప్పాలంటే తాము నాలుగు డబ్బులు పెట్టి తీసిన తమ సినిమానే ... దేశం కంటే గొప్పదైపోతోంది!  ఇండియాలో ఉగ్రవాదానికి కారణం ఎవరు? ఈ కొశన్ ఎవరికి వేసినా పాకిస్తాన్ అని ఠక్కున సమాధానం చెబుతారు. కాని, ఎందుకో కొందరు మన బాలీవుడ్ మేధావులకి మాత్రం ఆ విషయం అర్థం కావటం లేదు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చినా, ఇక్కడి మన అమాయకుల్ని, ఆర్మీ వాళ్లని చంపినా, పాకిస్తాన్ సైన్యం మన జవాన్ల తలలు నరికినా ... ఇన్ని చేసినా బాలీవుడ్ గాళ్లకు పక్క దేశంపై ప్రేమపోవటం లేదు! ఈ కోవలో మొట్ట మొదట పెంటలో కాలేశాడు సల్మాన్. పాకిస్తాన్ కళకారులు ఉగ్రవాదులు కాదు. వాళ్లనెందుకు బ్యాన్ చేయటం అన్నాడు! ఇక అక్కడ్నుంచీ రోజుకొకరు తమ పాకిస్తాన్ ప్రేమ చాటుకుంటున్నారు. మహేష్ భట్, కరణ్ జోహర్, ఓంపురి... ఇలా బోలెడు మంది! వీళ్లెవరూ మన మీద ఉగ్ర దాడులు జరిగినా, జవాన్లు మరణించినా అంతకు ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని, మహారాష్ట్రాలోని ఎంఎన్ఎస్ లాంటి పార్టీలు పాకీల్ని దేశంలోకి రానివ్వద్దని అల్టిమేటం ఇవ్వగానే మాత్రం కన్నల్లోంచి బయటకొచ్చారు...  పాకిస్తాన్ ప్రేమతో కోట్లాది మంది దేశభక్తులకు విలన్ అయ్యాడు అనురాగ్ కశ్యప్. ఆ మధ్య పంజాబ్ లో తన ఉడ్తా పంజాబ్ సినిమా విడుదల కానీయకుంటే కూడా నానా రచ్చ చేశాడు ఈ మేధావి. క్రియేటివ్ సినిమాలు తీస్తాడని పేరున్న అనురాగ్ ఎప్పుడు ఏ సమస్య వచ్చిన ట్విట్టర్ లో తాగుబోతులా ట్వీట్స్ చేయటం పనిగా పెట్టుకున్నాడు. పంజాబ్ లో సినిమా విడుదల అవ్వటం కష్టమైతే కూడా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు మాట్లాడాడు అప్పట్లో. ఇక ఇప్పుడు కూడా ఏకంగా మోదీని టార్గెట్ చేసి తన పైత్యం ప్రదర్శించాడు! అనురాగ్ కశ్యప్ తన కుక్క తోక వంకర బ్యాచీ మిత్రుడైన... కరణ్ జోహర్ గురించి మోదీతోనే యుద్ధానికి దిగాడు. కేజో తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ప్రస్తుతం రిలీజ్ విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుక్కారణం ఆ సినిమాలో హీరోగా పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించటమే. ఉరి ఉగ్రదాడుల్ని ఖండించకుండా తన దేశం చెక్కేసిన ఆ మహానుభావుడు తెరపై కనిపిస్తే ఊరుకునేది లేదని ఎంఎన్ఎస్ , ఆ పార్టీ అధినేత రాజ్ థాక్రే హెచ్చరించారు. ఇప్పుడు అందరి టెన్షన్ అదే...  తన మిత్రుడు కరణ్ జోహర్ సినిమా విడుదల ఆగిపోతే కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అనురాగ్ కశ్యప్ బాధ అర్థం చేసుకోవచ్చు. కాని, అందుక్కారణం హెచ్చరికలు జారీ చేసిన రాజ్ థాక్రే, ఆయన పార్టీ ఎంఎన్ఎస్. కాని, ట్విట్టర్ వీరుడు అనురాగ్ కశ్యప్ మోదీని టార్గెట్ చేశాడు. పైగా అతి తెలివిగా పాకిస్తాన్ హీరోని పెట్టుకుని తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ఆడనివ్వాలని కోరకుండా... నరేంద్ర మోదీ పాకిస్తాన్ పర్యటన గురించి మాట్లాడాడు. ఆయన ట్యాక్స్ పేయర్స్ డబ్బులతో నవాజ్ షరీఫ్ ఇంట్లో విందుకి వెళ్లొచ్చాడట. అందుకు ఈయనగారికి సారీ చెప్పాలట! అసలు దేశ ప్రధానితో ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు బాలీవుడ్ వాళ్లు! ఎవరో రాజ్ థాక్రే సినిమాని ఆపిస్తే మోదీ సారీ చెప్పటం ఏంటి? అనురాగ్ వెర్రి బుర్రకే తెలియాలి! తమకు ఏ ఇబ్బంది కలిగినా మోదీని టార్గెట్ చేస్తూ ట్విట్స్ చేయటం ఈ మద్య ప్రతీ వాళ్లకూ ఫ్యాషన్ అయిపోయినట్టుగా వుంది. ఆ మధ్య తనని ఎవడో మున్సిపల్ అధికారి లంచం అడిగాడని కపిల్ శర్మ అనే టీవీ కమెడియన్ మోదీని ప్రశ్నించాడు. అచ్చే దిన్ ఏవీ అంటూ పిచ్చి వాగుడు వాగాడు! నిజానికి కపిల్ శర్మ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టాడు. అలాంటి ప్రబుద్ధుడు మోదీని కార్నర్ చేయాలని తాపత్రయపడ్డాడు...  బాలీవుడ్లో ఒక సైడు మహేష్ భట్లు, ఓంపురీలు, కరణ్ జోహర్లు, అనురాగ్ కశ్యప్ లు, ప్రియాంక చోప్రాలు పాకిస్తాన్ కు అనుకూలంగా వేషాలు వేస్తుంటే... మరో సైడు అనుపమ్ ఖేర్లు, మథుర్ బండార్కర్లు, రవీనా టాండన్లు భారతదేశం వైపు నిలుస్తున్నారు. కాకపోతే, తమ సినిమాల గురించి కాకుండా అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు ప్రతీ చిన్న దానికి మోదీని చర్చలోకి తేవటం... శుద్ధమైన అహంకారం, అజ్ఞానం అనిపించుకుంటుంది తప్ప... ఏదో పెద్ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ఛేంజ్ అనిపించుకోదు!  

ప్రపంచ దేశాల... నమోన్నమః

మోదీ అనే పేరు లేకుండా ఇప్పుడు భారతదేశంలో రోజు గడవటం లేదు. అది సహజం కూడా! ఎందుకంటే, ఆయన మన ప్రధాని. ప్రధాని చుట్టూ వార్తలు రాయటం, చెప్పటం పత్రికలు, ఛానల్సు చేస్తూనే వుంటాయి. కాని, మోదీ పేరు ఇండియాలోనే కాదు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రముఖంగా వినిపిస్తోంది! అసలు నమోకి నమస్కారాలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది! ఆ లిస్ట్ లో తాజా పేరు... డొనాల్డ్ ట్రంప్! అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న డొనాల్డ్ ట్రంప్ మోదీని ఆకాశానికి ఎత్తేశాడు. అక్కడితో ఆగకుండా హిందువులన్నా, ఇండియన్స్ అన్నా తనకు చాలా అభిమానం అన్నాడు. తాను ప్రెసిడెంట్ అయితే వైట్ హౌజ్ లో ఇండియన్స్ మేలు కోరే మంచి మిత్రుడు వున్నట్లే లెక్కా అంటూ చెలరేగిపోయాడు! అఫ్ కోర్స్, ఇదంతా ట్రంప్ పబ్లిసిటీలో భాగం. అమెరికాలోని ఇండియన్స్ ఓట్లు దండుకోటానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. ఇదేం పెద్ద రహస్యం కూడా కాదు. కాని, మోదీ పేరు ఒక అమెరికా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ తలుచుకోవటం... నాట్ ఏ సింపుల్ థింగ్! గతంలో ఒబామా ఎన్నికల్లో పోటీపడ్డప్పుడు మన్మోహన్ పేరు తలుచుకోలేదుగా? అంతకంటే ముందు అమెరికాలోని భారతీయుల ఓట్ల కోసం ఇందిరా, రాజీవ్ లాంటి ప్రధానుల పేర్లు కూడా అక్కడి అధ్యక్ష అభ్యర్థులు స్మరించుకోలేదు కదా? మోదీని మాత్రమే ఇప్పుడు ట్రంప్ ఎందుకు గుర్తుకు చేసుకోవాల్సి వచ్చింది?  నరేంద్ర మోదీ వచ్చాక అచ్చే దిన్ వస్తాయని భారతదేశం అశించింది. ఆశించినంత ఉత్సాహంగా పరిస్థితులు లేవు. అయినా కూడా గత అరవై ఏళ్ల పరిపాలన చూసిన ఇండియన్స్ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తోన్న కర్మయోగిని బలంగా నమ్ముతున్నారు. ఇవాళ్ల కాకపోతే రేపు భారత్ ఉజ్వలంగా వెలిగిపోతుందని ధీమాతో వున్నారు. అదే ప్రపంచ వ్యాప్తంగా మోదీ పేరు మార్మోగటానికి కారణం! ట్రంప్ అంతటి వాడు కూడా ఆయన పేరు చెప్పి ఓట్లు అడగాల్సి రావటానికి కారణం కూడా అదే! మోదీ ఖ్యాతి ఇప్పుడు దేశంలో కంటే అంతర్జాతీయంగానే ఎక్కువగా వెలిగిపోతోంది. గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశం అందుకు అత్యంత తాజా ఉదాహరణ! ప్రపంచపు అతి శక్తవంతమైన దేశాల్లో ఒకటైన రష్యా ... బారత్ కు పూర్తి మద్దతు ప్రకటించింది. పాక్ విషయంలో రెండో మాట లేకుండా ఇండియా వైపే నిలిచింది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాద దేశానికి తాము ఆయుధాలుగాని, యుద్ధ విమానాలుగాని అమ్మం అని తేల్చేసింది. స్వయంగా పుతిన్ ఇండియా పట్ల తమ స్నేహాన్ని సుస్ఫస్టం చేశాడు! ఇది ద్వైపాక్షికంగా చాలా పెద్ద విజయం...  రష్యానే కాదు బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భూటాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా మోదీ ముందు తమ భారత్ విధేయతను ప్రకటించుకున్నాయి. ఉగ్రవాదంపై పోరులో తాము ఇండియా వైపే అని మరోసారి చెప్పాయి. పాక్ అంతకంతకు ఒంటరిగా మిగిలిపోతోంది! ఇక బ్రిక్స్ లో భాగమైన బ్రెజిల్, సౌతాఫ్రికా కూడా టెర్రరిజమ్ పై యుద్ధంలో మన వెంట వుంటామని గట్టిగానే చెప్పాయి. ఒక్క చైనా తప్ప మోదీ సారథ్యంలోని ఇండియాకు ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంలో మరే దేశమూ కనిపించలేదు! మన దేశంలోని కొన్ని పార్టీలు, కొందరు నేతలు, కొన్ని సంస్థలు, కొందరు మేధావులు, ఉద్యమకారులకు నమో నచ్చకపోవచ్చు. వాళ్లు అంతర్జాతీయంగా కూడా ఆయనను అవమానించేందుకు ఎంతకైనా తెగించవచ్చు. కాని, ప్రధానిగా మాత్రం మోదీ మొత్తం ప్రపంచం ఆమోదం పొందుతున్నారు. ఇందుకు సగర్వ ఉదాహరణ... ఆయనను తమ దేశంలోకి రానీయమని వీసా నిరాకరించిన ఆమెరికా... ఇవాళ్ల అధ్యక్ష ఎన్నికల బరిలో ఆయన పేరునే తలుచుకోవటం! అదృష్టం బావుంటే అమెరికాని ఏలే ట్రంపే... మోదీ గ్రేట్ అంటూ కితాబునివ్వటం! ఇదంతా మన మోదీకే కాదు... మన దేశం మొత్తానికీ ఆనంద కారణమే!   

తెలంగాణలో... దీపావళి నుంచీ సెకండాఫ్?

ప్రజల దృష్టిలో ప్రభుత్వం అంటే తమ సంక్షేమం, అభివృద్ధి చూసే వ్యవస్థ. కాని, నేతల దృష్టిలో ప్రభుత్వం అంటే పదవులు, అధికారాలు, బుగ్గ కార్లు... ఇంతే! ఇది అన్ని రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా వర్తిస్తుంది. అందుకే, ఎక్కడ ఏ పార్టీ ప్రభుత్వం వున్నా అయిదేళ్లూ పదవుల పందెం నడుస్తూనే వుంటుంది. ముఖ్యమంత్రినో, ప్రధానినో ప్రసన్నం చేసుకుని మంత్రులమైపోవాలని ఎమ్మేల్యేలు, ఎంపీలు తహతహలాడుతుంటారు. ఇప్పుడు ఆ వంతు తెలంగాణ అధికార పక్షం నాయకులకు వచ్చినట్టు కనిపిస్తోంది...  తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అప్పుడే రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. అయితే, సీఎం కేసీఆర్ పాలనలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రమాణస్వీకరం చేసిన కొత్తలో రాష్ట్రం మొత్తం హెలికాప్టర్ వేసుకుని తిరగటం మొదలు మొన్న దసరాకి జిల్లాలు విభజించటం వరకూ ఆయన తనకు తోచినవన్నీ చకచకా చేసుకుంటూపోతున్నారు!   కేసీఆర్ పాలనలో, పాలసీల్లో కొత్తదనం తీసుకువస్తున్నా క్యాబినేట్ లో మాత్రం పెద్దగా సంచలనాల జోలికి పోవటం లేదు. అసలు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో క్యాబినేట్ పునర్ వ్యవస్థీకరణ జరగలేదు. అంతే కాదు, పదే పదే మహిళా మంత్రి ఒక్కరు కూడా లేరని విమర్శలు వస్తున్నా పట్టించుకోవటం లేదు. అయితే, ఎట్టకేలకు క్యాబినేట్ పై కూడా సీఎం దృష్టి పడిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. దసరాకు జిల్లాల హంగామా నడిస్తే దీపావళికి క్యాబినేట్ పునర్ వ్యవస్థీకరణ కోలాహలం వుంటుందంటున్నారు! క్యాబినేట్లో కదిలిక అంటే ఖచ్చితంగా కొందరికి ఎంట్రీ, కొందరికి ఎగ్జిట్ వుంటుందనే కదా? కేసీఆర్ కూడా అదే మూడ్ లో వున్నారట. కొందర్ని 2019 ఎన్నికల కోసం పార్టీ పనులకి కేటాయించాలని నిర్ణయించారంటున్నారు! అలాగే, కొంత మంది కొత్త వార్ని బుగ్గ కార్లు ఎక్కించే ఆలోచనలో కూడా వున్నారట. వాళ్లెవరు? వీళ్లెవరు? ఇప్పుడే తెలియదు! కాని, దీపావళి నాటికల్లా దాదాపుగా క్యాబినేట్ రీషఫుల్ బాంబు పేలనుందని ఇన్ సైడ్ టాక్.  ఒట్టి మంత్రి పదువులే కాదు అధికార పక్షంలో వున్న చాలా మంది నేతలు ఆశించే నామినేటెడ్ పోస్టులు కూడా కేసీఆర్ టేబుల్ పైకి వచ్చే ఛాన్స్ వుందంటున్నారు. మార్కెట్ కమిటీలు మొదలు దేవాలయ కమిటీల దాకా అన్నిట్లో గులాబీ నేతలకి పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందట! దీపావళి నాటికి నిజంగా తెలంగాణలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగితే అది పెద్ద న్యూసే. కాకపోతే, కేసీఆర్ సంగతి తెలిసిన వాళ్లు మాత్రం ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం అంటున్నారు. ఆల్రెడీ దసరాకి కొత్త జిల్లాలతో రాష్ట్రం రూపు రేఖలు మార్చిన ఆయన దీపావళికి క్యాబినేట్ రూపు రేఖల్ని కూడా మార్చవచ్చు అంటున్నారు! చూడాలి మరి....

ఇండియా ఇకనుం'చైనా' తేరుకోవాలి...

మన ప్రధాన శత్రువు అమెరికా. భారత్ తో మనకు సఖ్యత అవసరం. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? హఫీజ్ సయీద్! పాకిస్తాన్ లోని పేరుమోసిన ఉగ్రవాదుల్లో హఫీద్ సయీద్ ఒకడు. ముంబై ఉగ్రదాడులకి, కసబ్ లాంటి పది మంది కసాయిల్ని మన దేశంపైకి పంపింది అతనే. కాని, ఇప్పుడు హఠాత్తుగా హఫీజ్ స్వరం మారింది. సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బకి దెయ్యం దిగివచ్చింది! ఇండియా పాక్ పై చేసిన మిలటరీ దాడి అద్భుత విజయం సాధించింది. పాకిస్తాన్ పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోలోన అవమానంతో రగిలిపోతోంది. కాని, ఏం చేయలని స్థితి. అయితే, ఇదంతా చూస్తూ మనం సంతోషించాల్సిన పరిస్థితి కూడా లేదు. పాక్ పై ఒక్క అంతిమ సమరం చేసి కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని సుబ్రమణ్యం స్వామి లాంటి వారు అంటున్నప్పటికీ కిటుకంతా చైనా వద్ద వుంది! ఇండియా ప్రధాన శత్రువు పాక్ కావొచ్చు. కాని, ప్రమాదకర శత్రువు చైనానే. ఈ విషయం మన వాళ్లకు తెలియంది కాదు. అయినా కూడా చైనా రోజు రోజుకు తన ప్రాబల్యం పెంచుకుంటూ పోతోంది. ఇండియాకి ప్రతీ చోటా అడ్డుపడుతోంది. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించమని ఇండియా ఐక్యరాజ్య సమితిని అడిగితే అక్కడ చైనా వీటో చేసింది. అలాగే, పాకిస్తాన్ పై ఇప్పటికిప్పుడు మనం యుద్ధానికి వెళితే ఆ దేశం తరుఫున ఎదురు నిలిచే శక్తి కూడా చైనానే. మరో వైపు ఇండియాను అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సరిహద్దుల్లో డ్రాగన్ విసిగిస్తూనే వుంది. ఇలా ఏ విధంగా చూసినా మన మీద చైనా దాదాగిరి సుస్పష్టం... చైనా అన్ని విధాలా మన మీద ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలు వున్నా ఒక్క చోట మాత్రం కాస్త బలహీనంగా వుంది. అదే వాణిజ్య సంబంధాలు. గత కొంత కాలంగా ఇండియా చైనా నుంచి భారీగా వస్తువులు కొనుగోలు చేస్తుంది. బిలియన్ల డాలర్ల లాభం చైనాకు ఈ వ్యాపారం వల్ల లభిస్తోంది. అదే భారత్ ను తీసుకుంటే... చైనాకు మనం పంపే వస్తువులు చాలా తక్కువ. కొన్ని మిలియన్ల డాలర్ల ఎక్స పోర్ట్స్ తప్ప మనకు చైనాతో పెద్దగా ఆర్దిక లావాదేవీలు లేవు. అందుకే, ఇప్పటికిప్పుడు  చైనా వస్తువుల్ని మనం బహిష్కరిస్తే ఆ దేశానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది! చైనా వస్తువులు ఇండియా వాడకపోతే ఆ దేశానికి నష్టం. ఈ ఫార్ములాతోనే సొషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది ఈ మధ్య. ఫలితంగా చైనా వస్తువుల వాడకంలో దాదాపు 20శాతం తరుగుదల కనిపించిందని కూడా అంటున్నారు. అది నిజమో కాదోగాని చైనీస్ మీడియా మాత్రం భారతదేశంలో తమ ప్రాడక్ట్స్ పై వివక్ష కొనసాగుతోందని బెంబేలెత్తుతోంది. ఫ్రీ మార్కెట్ లో ఇలా దుష్ప్రచారం చేయకూడదని నీతులు చెబుతోంది! కాని, పాకిస్తాన్ కు చైనా చేస్తోన్న సపోర్ట్ గురించి ఒక్క మాటా మాట్లాడటం లేదు...  భారతదేశానికి ఎప్పటికైనా అతి పెద్ద ముప్పు చైనానే. పాకిస్తాన్ ను మూడు ముక్కలు చేశో... నాలుగు ముక్కలు చేశో పీడ విరగడ చేసుకోవచ్చు. కాని, డ్రాగన్ అలా కాదు. ఆ దేశంతో మనం మొండిగా ముందుకు పోయి యుద్ధం చేయలేం. అలాగని సంధి కూడా చేసుకోలేం. సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు అమాంతం చైనీస్ గూడ్స్ బాయ్ కాట్ చేయటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, చైనీస్ వస్తువుల్ని మనం వాడటం మానేస్తే చైనా కన్నా తీవ్ర నష్టం మన వ్యాపారులకు వస్తుంది. ఇంత కాలం చీప్ చైనీస్ వస్తువుల్ని అమ్మిన ఇండియన్ ట్రేడర్స్ ఒక్కసారిగా దుకాణాలు మూసుకోవాల్సి వస్తుంది. అందుకే, చైనా పై ఎక్స్ పోర్స్ట్ , ఇంపోర్ట్స్ యుద్ధం అంత ఈజీ కాదు. ఇండియా ముందు పాక్ కన్నా ఎక్కువ దృష్టి మన అంతర్గత మార్కెట్లపై పెట్టాలి. చైనీస్ వాళ్లు చీప్ గా అమ్ముతున్న వస్తువుల్ని మనం మన దేశంలోనే ఎందుకు ఉత్పత్తి చేసుకోకూడదు. ఎందుకు చేసుకోలేం ఆలోచించుకోవాలి. పరిష్కారాలు, మార్గంతరాలు కనుక్కోవాలి. అప్పుడు చైనీస్ దిగుమతులపై ఆధారపడ్డ మన వ్యాపారస్తుల బతుకులు దుర్భరంగా మారకుండా బండ కింద నుంచి చేయి తీసుకున్నట్టు వ్యవహారం నుంచి బయటపడవచ్చు. ఒక్కసారి మన ఈ మేకిన్ ఇండియా ఐడియా వర్కవుట్ అయితే డ్రాగన్ ను ఆటాడుకోవటం పెద్ద కష్టమేం కాదు! మోదీ ఈ దీర్ఘకాలిక వ్యూహం పై కన్నేయాలి...   

యూనిఫామ్ సివిల్ కోడ్ తేనె తుట్టె కదులుతోందా?

బీజేపికి ఒకప్పుడు రెండు సీట్లు వుండేవి పార్లమెంట్లో. ఇప్పుడు రెండు వందల ఎనభై రెండు సీట్లున్నాయి. ఇన్ని రెట్లు ఎంపీలు పెరిగినా కాషాయ దళం ఎజెండాలో మారకుండా వున్న ఒకట్రెండు అంశాలు మాత్రం ఎప్పుడూ వివాదాస్పదమే. అయోధ్యలో రామ మందిరం అలాంటిదే! కాశ్మీర్లో ఆర్టికల్ 370 మరొకటి! ఇక దేశ వ్యాప్తంగా ప్రతీసారి తీవ్ర చర్చకు కారణమయ్యేది... యూనిఫామ్ సివిల్ కోడ్! ఈ మాట వినగానే మైనార్టీలు, సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే వారు అందరూ అమాంతం ఉలిక్కిపడుతుంటారు. అంతటి పొలిటికల్ ఎఫెక్ట్ దీని స్వంతం...  సుప్రీమ్ కోర్టులో ప్రస్తుతం ట్రిపుల్ తలాక్ పై కేసు నడుస్తోంది. భారతీయ ముస్లిమ్ లలో మూడు సార్లు తలాక్ చెప్పి భర్త భార్యను వదిలేయటం పదే పదే వివాదాస్పదం అవుతూనే వుంది. అదేమంత దారుణం కాదని ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ వాదిస్తున్నా ఆధునిక వాదులు దాన్ని అంగీకరించటం లేదు. షరియా చట్టం ప్రకారం మూడు సార్లు తలాక్ అనేసి... అదీ కాక ఎస్ఎంఎస్, స్కైప్ లాంటి వాటి సాయంతో కూడా విడాకులు ఇచ్చేయటం.... కలకలం రేపుతోంది. మొత్తంగా ట్రిపుల్ తలాక్ వ్యవహారమే వుండవద్దని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కోర్టులో కూడా అదే కోరుతు పిటీషన్స్ వేశారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం ఈ మూడు సార్లు తలాక్ అనేసే షరియా చట్టాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. త్వరలో తలాక్ పై తీర్పు కూడా రానుంది...  పరిస్థితి చూస్తుంటే సుప్రీమ్ దాదాపూ ట్రిపుల్ తలాక్ రద్దు చేసే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ముస్లిమ్ స్త్రీల భద్రతని, గౌరవాన్నిదారుణంగా దెబ్బతీసే ట్రిపుల్ తలాక్ పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా లేదు. షరియా చట్టం పుట్టిన సౌదీ అరేబియాలో కూడా లేదు. కాని, మన దేశంలో మాత్రం ముస్లిమ్ పర్సనల్ లా పేరుతో చెలామణి అవుతోంది. దీని కారణంగా ఎంతో మంది పేద ముస్లిమ్ అమ్మాయిలు, ఆడవాళ్లు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. భర్త తన ఇష్టానుసారం వదిలేస్తే రోడ్డున పడుతున్నారు. సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది కూడా బాధిత ముస్లిమ్ స్త్రీలే...  అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో ప్రస్తుతానికి సస్పెన్సే కాని ట్రిపుల్ తలాక్ వ్యవహారం రాజకీయ వేడి కూడా రాజేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో వున్నంత కాలం ముస్లిమ్ లను హర్ట్ చేయకుండా బండి లాక్కొచ్చింది. కాని, మోదీ సర్కార్ సుప్రీమ్ కు స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేసింది. ట్రిపుల్ తలాక్ ఖచ్చితంగా తప్పేనని అభిప్రాయపడింది. దీంతో ఆలిండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్ట్ అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. బీజేపి పుట్టినప్పటి నుంచీ ఎజెండాలో వున్న యూనిఫాం సివిల్ కోడ్ ఈ విధంగా అమలు చేసే కుట్ర జరుగుతోందని పర్సనల్ లా బోర్ట్ ఆరోపిస్తోంది. వాళ్ల మాటల్లో నిజాలు లేకపోలేదు. ఎందుకంటే, ఒక్కసారి సుప్రీమ్ ట్రిపుల్ తలాక్  రద్దు చేస్తే షరియా చట్టం మొత్తం అదే కోవలో అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం మద్య యుగాల నాటి దారుణమైన శిక్షలు అందులో వుంటాయి. అంతే కాదు బహు భార్యత్వం లాంటివి కూడా అనుమతింపబడతాయి. ఇవేవీ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే కుదిరేవి కావు. అంటే... ట్రిపుల్ తలాక్ తో మొదలు పెట్టి సుప్రీమ్ మొత్తానికి మొత్తంగా ముస్లిమ్ పర్సనల్ లా అనేదే లేకుండా చేయవచ్చు. దీనికి పూర్తి మెజార్టీతో అధికారంలో వున్న హిందూత్వ పార్టీ బీజేపి ఎలాగూ కృషి చేసే అవకాశాలే ఎక్కువగా వున్నాయి...  యూనిఫామ్ సివిల్ కోడ్ తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే, ముస్లిమ్ ల ఓట్లతో నెట్టుకొచ్చే ఎంఐఎం, సమాజ్ వాది లాంటి ఇంకా బోలెడు సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు కూడా అంగీకరించే అవకాశమే లేదు. అయినా కూడా పాలిటిక్స్ కు అతీతంగా చూసినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆహ్వానించదగ్గదే. బీజేపి అభిమానులో, ఆరెస్సెస్ వాదులో దీన్ని మైనార్టీల మీద రుద్దుతున్నట్టు పైకి కనిపించినప్పటికీ ఆధునిక సమాజంలో అందరికీ ఒకే చట్టం వుండటం సమంజసం. న్యాయబద్ధం కూడా. ఎందుకంటే, మతం ఆధారంగా ఎవరి చట్టం వారికి వుంటే ఆయా మతాల్లోని బలహీన వర్గాలు అన్యాయమైపోయే అవకాశమే ఎక్కువ. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వల్ల ఇస్లామ్ లోని స్త్రీలకు అదే జరుగుతోందని చాలా మంది వాదిస్తున్నారు. ఇక దీనిపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీమ్ కోర్టే!