విశాఖలో ప్రేమమ్... ప్రభుత్వానికి ప్రమాదమ్!

  ప్రేమోత్సవం... ఈ సంగతేంటో మీ దాకా వచ్చిందా? మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ అయితే మీకు తెలిసే వుంటుంది! లేకపోతే ప్రేమోత్సవం విషయం పెద్దగా ఐడియా లేకపోవచ్చు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే... ఫిబ్రవరీ 12, 13, 14 తేదీల్లో బీచ్ సిటీ విశాఖలో ఓ ఉత్సవం చేయదలుచుకున్నారు. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమోత్సవం నిర్వహించాలనుకున్నారు. అదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారిపోయింది! అటు పోయి ఇటు పోయి ఏపీ సర్కార్ కు చుట్టుకుంటోంది...  ఫిబ్రవరీ 14వస్తుందంటే ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునేది హిందూ మత సంస్థలు. కాని, ఈసారి వీహెచ్ పీ, బజరంగ్ దళ్ లాంటి వాటికంటే ముందే చంద్రబాబు సర్కార్ గొడవలో పడింది. విశాఖ బీచ్ లో ప్రేమోత్సవం అంటూ కలకలం రేగింది. అసలు విషయం ఏంటంటే... ఒక ప్రైవేట్ సంస్థ ప్రతీ యేడు లాగే ఈ సారి లవ్ ఫెస్ట్ నిర్వహించాలనుకుంది. అందుకోసం నవ్యాంద్రలోని అద్భుత నగరం విశాఖను ఎంచుకుంది. వెంటనే గవర్నమెంట్ ను అప్రోచ్ అయ్యి పర్మిషన్ అడిగింది. కాని, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, లవ్ ఫెస్టివల్ ఆషామాషీగా జరగదట! 9వేల జంటలు ప్రపంచం నలుమూలల నుంచీ తరలి వస్తాయట. వాళ్లకు బీచ్ లోనే టెంట్లు ఏర్పాటు చేస్తారు. బికినీల్లో అమ్మాయిలు భీభత్సమైన గ్లామర్ ఒలకబోస్తారు. ఇదీ... సదరు కంపెనీ వారి ప్రేమ! మనమైతే కామం అంటాం. అదీ వేరే విషయం...  షకీరా లాంటి హాట్ పాప్ సింగర్ కూడా వస్తుండటంతో కొంత మంది ఈ ఈవెంట్ మొత్తాన్ని పెద్ద పాపపు కార్యంగా డిసైడ్ అయిపోయారు. పోయిన సంవత్సరం ఇదే ఉత్సవం గోవాలో జరిగింది. కాని, పెద్దగా వివాదాలేం తలెత్తలేదు. కాని, ఈసారి విశాఖ అనే  సరికి అంతా ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే, షకీరా పాటలు, బికినీ వేసుకున్న భామలు, టెంట్లలో టెంపరరీ కాపురాలు... ఇవన్నీ విశాఖ కల్చర్ కావు. గోవాలో పోర్చుగీసు వాళ్లు వదిలి వెళ్లిన సంస్కృతి ఎప్పట్నుంచో వుంది. అక్కడ ఉత్సవం కుదిరింది కాబట్టి ఎక్కడైనా చేస్తామంటే వీలు కాదు. మరీ ముఖ్యంగా, విశాఖ లాంటి ప్రశాంతమైన నగరంలో! ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వపడేలా స్థాపించిన పార్టీ టీడీపీ. అది అధికారంలో వుండగానే ఈ బీచ్ ఫెస్టివల్స్ , బికినీ సెలబ్రేషన్స్ ఏంటని కొంత మంది మండిపడుతున్నారు. ఇలా అయితే తెలుగు సంస్కృతి మరింత వేగంగా తుడిచి పెట్టుకుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ , ప్రభుత్వం స్టాండ్ ఏంటి? ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పటమే ప్రభుత్వ వ్యూహం!  ప్రేమోత్సవం కాన్సెప్ట్ లేనిపోని గొడవలకు కారణం అవుతుండటంతో ఏపీ సర్కార్ కూల్ గా చేయి వెనక్కు తీసుకునే పనిలో పడింది. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని, అసలు ఆ ఈవెంట్ తో గవర్నమెంట్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తోంది. ఇంకా అనుమతి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారట అధికారులు! అయితే, బికినీ లవ్వుకు నో చెప్పటమే చంద్రబాబు ప్రభుత్వానికి మేలు చేస్తుంది. ఆఫ్ట్రాల్ ఒక ప్రైవేట్ ఈవెంట్ వల్ల విశాఖకొచ్చే విపరీతమైన లాభం, రాబడీ ఏం వుండదు.పై పెచ్చు పంతానికి పోయి పర్మిషన్ ఇస్తే ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా వాడుకునే ప్రమాదం వుంది. కాబట్టి సీఎం ఈ గాలిన పోతున్న కంపని గాలికే వదిలేస్తే బెటర్...  

కిరణ్ కు పవన్ లాభామా? పవన్ కు కిరణ్ నష్టమా?

కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో టపాసు లాంటి వాడే! కాని, తారజువ్వ! అమాంతం వెలుగులు చిమ్ముతూ పైకెగుస్తాడు! మళ్లీ అంతలోనే మాయం! కొన్నాళ్ల వరకూ ఇక నో సౌండ్... ఇదీ మన మాజీ సీఎం స్టైల్!  సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. కాని, నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఆయన అసలు సీన్లోనే లేకుండా పోయారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. తరువాత ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలా పూర్తిగా తనని తాను ఎవ్వరికీ కనపించకుండా దాచేసుకున్నారు. అసలు అంతకు ముందు వైఎస్ హయాంలో ఆయన స్పీకర్ గా వున్నప్పుడు ఏ ఒక్కరూ ఈయన సీఎం అవుతాడని భావించను కూడా భావించలేదు. కాని, అనూహ్యంగా రోషయ్య తరువాత ముఖ్యమంత్రిగా వెలుగులు విరజిమ్ముతూ హైలైట్ అయ్యారు. కాని, ఎంత ఫాస్ట్ ఎదిగారో అంతే ఫాస్ట్ గా ఆఫ్ స్క్రీన్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఆకాశంలో తన కిరణాలు ప్రసారించాలనుకుంటారు... తాజా గుసగుసల్ని బట్టీ చూస్తే కిరణ్ ఇప్పుడు జనసేన వైపు చూపు పెట్టారట. ఆయన బీజేపీలో చేరతారని చాలా రోజులుగా టాక్ నడుస్తున్నా అలాంటి కదలికలు మాత్రం కనిపించలేదు. ఇప్పడు సడన్ గా పవన్ కళ్యాణ్ పార్టీపై మనసు మళ్లిందంటున్నారు. అటు జనసేనకు కూడా ఇప్పటి వరకూ పవన్ తప్ప రెండో నేతే లేకపోవటంతో కిరణ్ కలయిక ఓకేలాగానే వుంది. కాని, అఫీషియల్ గా జనసేన నుంచి మాత్రం ఇంత వరకూ ఎలాంటి ఆహ్వానం రాలేదు కిరణ్ కి. అతి త్వరలో వెల్ కమ్ నోట్ వచ్చేస్తుందంటున్నారు ఇరువర్గాల జనం. కాని, ఇక్కడే బోలెడన్ని ప్రశ్నలున్నాయి విమర్శించే వారికి...  కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినా పెద్దగా లాభం వుండదు.ఆంధ్రప్రదేశ్ లో కమలం ఇప్పుడప్పుడే వికసించే సూచనలు అస్సలు కనిపించటం లేదు. అలాగని బీజేపి జోడీ కట్టిన టీడీపీలోకి కిరణ్ వెళతారా అంటే అదీ సాధ్యం కాదు. చంద్రబాబు కటాక్షం కోసం ఎదురు చూసే నేతల సంఖ్య తెలుగుదేశంలో ఇప్పటికే చాంతాడంత వుంది. వాళ్ల వరుసలో ఒక మాజీ సీఎం అయ్యి వుండి కిరణ్ కుమార్ రెడ్డి కూర్చోలేకపోవచ్చు. పోనీ... మిగిలిన జగన్ పార్టీలోకి వెళదామా అంటే అది కూడా పెద్ద రిస్కే. జగన్ కిరణ్ కంటే జూనియర్. పైగా పార్టీని పూర్తిగా ఏక ఛత్రాధిపత్యంలో నడిపిస్తున్నాడు. వైసీపీ ఫ్యాన్ గాలిలో కూర్చోవటం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏసీ వాతావరణానికి అలవాటు పడ్డ కిరణ్ కి చాలా అసౌకర్యంగా వుండవచ్చు! ఇక మిగిలింది ఇంకా పురివిప్పని జనసేన. అందుకే, కిరణ్ పవర్ స్టారే బెటరని లెక్కలు వేసుకుంటున్నారంటున్నారు. అక్కడైతే పవన్ సినిమా హీరోగా ఫేమస్. అతనితో కలిసి నడిస్తే తనకు ప్లస్ అవుతుంది. మరో వైపు కొత్తగా వస్తోన్న పార్టీ కాబట్టి జనసేన కిరణ్ న్ని సీనియర్ గా బాగానే గౌరవించుకునే ఛాన్స్ వుంది.  కిరణ్ కుమార్ కోణం నుంచి చూసినప్పుడు జనసేన ఆలోచన బాగానే వున్నా పవన్ వైపు నుంచి చూసినప్పుడే అనేక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అసలు పవన్ అన్న చిరు పెట్టిన ప్రజా రాజ్యం ఎందుకు ఢమాల్ అయిపోయింది? ఇలా ఏ పార్టీ నుంచి ఎవరు వస్తే వాళ్లను వెల్ కమ్ చేసేయటంతోనే జనంలో క్రేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు కిరణ్ లాంటి ఒక మాజీ కాంగ్రెస్ సీఎంని తీసుకుని జనసేన కూడా అదే తప్పు చేయవద్దంటున్నారు క్రిటిక్స్. ఎందుకంటే, ఓటర్లు ఒక కొత్త పార్టీ వస్తే కొత్త నాయకత్వాన్ని కూడా ఆశిస్తారని వారంటున్నారు. అలా కాకుండా కొత్త సీసాలో పాత మందు ఫార్ములా వాడితే బెడిసికొట్టొచ్చంటున్నారు!  జనసేనలోకి కేవలం కిరణ్ రాకతో వ్యవహారం ఆగిపోకపోవచ్చు. ఆయన బాటలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీల్లోని అసంతృప్తి బ్యాచ్ మొత్తం జై పవనిజం అనవచ్చు. అలా అంటే ఎన్నికల ముందు హడావిడి బాగానే వుంటుంది కాని ఎన్నికల తరువాత ఓట్లే నిరాశపరుస్తాయి. ఇది ఆల్రెడీ పీఆర్పీ నిరూపించిన బ్యాలెట్ సత్యం! అంతే కాదు, కిరణ్ కుమార్ చేరిక జనసేనకు ప్రాక్టికల్ గా కూడా అనేక నష్టాలు తెచ్చే ఛాన్స్ వుందంటున్నారు. ముఖ్యంగా, ఆయన సీఎంగా వుంటూనే రాష్ట్ర విభజన జరగనిచ్చారు. ఢిల్లీ పరిణామాలు అన్నీ తెలిసినా హైద్రాబాద్ లేకుండా ఆంధ్రాను విడదీస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. లాస్ట్ లో రాజీనామా, ప్రెస్ మీట్లు ఎన్ని చేసినా అసలు ఆయన విభజనని మొదట్లోనే అడ్డుకోలేకపోయారని జనంలో అసంతృప్తి వుంది. కనీసం యూపీఏ ఆలోచన ఏంటో కూడా కిరణ్ సామాన్య ఆంధ్ర ప్రజలకి చెప్పలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ జనసేనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరో వైపు తెలంగాణలో ఇప్పటికే జనసేనకి పెద్దగా అవకాశాలు కనిపించటం లేదు. కిరణ్ లాంటి కరుడుగట్టిన సమైక్యవాది కూడా చేరితే పవన్ పార్టీ కేసీఆర్ సంస్థానం పై ఆశలు వదులుకోవాల్సిందే! తెలంగాణలో జనసేన ఆశలు, ఆశయాలు పక్కన పెడితే ఆంధ్రాలో మాత్రం చక్కటి స్కోప్ వుంది. అధికార పక్షం మ్యానిఫెస్టోలో చెప్పిన దాంట్లో సగం కూడా డెలివర్ చేయలేకపోయింది. 2019 కల్లా జనంలో అసంతృప్తి పెరిగే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరో వైపు, ప్రభుత్వ వ్యతిరేకతని జగన్ ఎంత మాత్రం వాడుకోలేకపోతున్నారని అంటున్నారు మేధావులు. ప్రతిపక్షంగా వైసీపీ ప్రజలకు దగ్గరవ్వలేకపోతోందని వారి ఆరోపణ. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన సంచలనాలు సృష్టిస్తూ దూసుకొచ్చే చక్కటి సమయం ఇప్పుడు వుంది. కాని, పవన్ కళ్యాణ్ చేయాల్సిందల్లా పీఆర్పీ ఎందుకు ఫ్లాపైందో గుర్తు పెట్టుకోవటమే! అన్ని పార్టీల్లో ఆరితేరిన ఓల్డ్ మాంక్స్ అందర్నీ తన టేబుల్ మీదకి తెచ్చుకుంటే ... ఎన్నికల సమయంలో తూళి పడాల్సి వస్తుంది. అలా కాకుండా కొత్త నాయకత్వం, కొత్త భరోసా ప్రజలకి చూపిస్తే ఒకప్పటి ఎన్టీఆర్ ప్రభంజనం లాంటిది జనసేన నుంచి కూడా ఆశించవచ్చు!   

అమరావతిని ఆవిష్కరించే దిశగా మరో అడుగు!

  తెలంగాణ ఏర్పాటు తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇప్పుడు రెండు ప్రత్యేకతలు వచ్చి చేరాయి. ఒకవైపు కేసీఆర్ విజయవంతంగా ఉద్యమం నడిపించి అధికారంలోకి వస్తే మరో వైపు చంద్రబాబు విజయవంతంగా నవ్యాంధ్రను ఆవిష్కరిస్తున్నారు. కేసీఆర్ కు వడ్డించిన విస్తరి లాంటి భాగ్యనగరం వుండటంతో ఆయన బంగారు తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. కాని, బాబు అమరావతిని పునాదుల్నుంచీ పైకెత్తుతున్నారు. ఇది ఒక విధంగా సవాలే అయినా ఆయన రాజకీయ జీవితానికి పెద్ద ప్లస్ పాయింట్ కూడా! చంద్రబాబు హయాంలో అమరావతి తొలి అడుగులు వేసిందని చరిత్ర ఎప్పుడూ చెప్పుకుంటూనే వుంటుంది...  జనం టీడీపిని నమ్మి అధికారం ఇచ్చినా... ప్రతిపక్షం, అలాగే కొంత మంది గిట్టనివారూ అమరావతిపై ఆరోపణలు చేస్తూనే వున్నారు. రైతుల భూములు తీసుకోవటం నుంచి మొదలు పెడితే ప్రతీ దాంట్లో చంద్రబాబుకు అడ్డంకులే ఎదురయ్యాయి. అయినా ఆయన తన అపార అనుభవం రంగరించి రాష్ట్రాన్ని, రాజధాన్ని ఒక కోలిక్కి తీసుకొస్తున్నారు. అందుకు తాజాగా జరిగిన విట్ శంఖుస్థాపనే నిదర్శనం... వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షార్ట్ గా విట్ అని పిలవబడే ప్రతిష్ఠాత్మక సంస్థ ఇప్పుడు ఆంధ్రాకి తరలి వచ్చింది. 2వందల ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పబడుతోన్న ఈ విద్యా సంస్థ ఖచ్చితంగా క్యాపిటల్ సిటీకి హైలైట్ కానుంది. అంతే కాదు, ముందు ముందు రాబోయే మరిన్ని ప్రెస్టేజియస్ ఇన్ స్టిట్యూట్స్ కి మార్గం సుగమం చేయనుంది. మొత్తంగా అమరావతిలో విద్యా రంగం త్వరలోనే పురివిప్పుతుందని మనం ఆశించవచ్చు...  విట్ లాంటి ఒక ప్రైవేట్ సంస్థ అమరావతికి రావటం పెద్ద విశేషమేం కాదనే వారు కూడా వుంటారు. కాని, ఉన్నత విద్యని అందించే ఒక పేరెన్నికగన్న ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆంధ్రా విద్యార్థులకి అందుబాటులోకి రావటం ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే, ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ హైద్రాబాద్ తో సహా అనేక ఇతర నగరాల్లో వుంటూ చదువుకుంటున్నారు. కొందరైతే విదేశాలకు కూడా వెళుతున్నారు. మరి ఇంతటి డిమాండ్ విద్యా రంగంలో వున్నప్పుడు అమరావతిలో ఆ దిశగా అభివృద్ధి జరిగిలే చూసుకోవటం మంచిదే కదా! విట్ ఏర్పాటు అటు వేపుగా తొలి అడుగు అనుకోవాలి... ఏ నగరమైనా విద్యా రంగం, విద్యా సంస్థల వల్లే ప్రపంచ ప్రాఖ్యాతి పొందుతుంటుంది. ప్రైవేట్ , ప్రభుత్వ విద్యా సంస్థలతో త్వరలోనే అమరావతి అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని ఆశిద్దాం...  

ప్రపంచ మార్కెట్లో... యుద్ధం ఒక వ్యాపారం!

  ఐసిస్... ఇక మీదట ఈ పేరు ఇంతకు ముందు వినిపించినంత వినపడకపోవచ్చు. ఎందుకంటే, ఇరాక్ లో ఆ ఉగ్ర సంస్థ మీద యుద్ధం దాదాపుగా చివరి అంకానికి చేరుకుంది. ఐఎస్ఐఎస్ ఆయువు పట్టులాంటి మోసుల్ నగరం ఇరాకీ సేనల నియంత్రణలోకి వచ్చేస్తోంది. క్రమంగా అమెరికా సాయంతో ముందుకు దూసుకొస్తున్న సాయుధ దళాలు టెర్రరిస్టుల్ని అన్ని దిక్కుల్నుంచీ చుట్టుముట్టేస్తున్నాయి. ఇక రేపో, మాపో ఐసీస్ అధినేత అల్ బగ్ధాదీ నేలకూలటమో, పట్టుబడటమో జరగాల్సి వుంది... అంత్య కాలం సమీపిస్తున్నా బగ్ధాదీ తనదైన స్టైల్లో ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టే పని చేస్తున్నాడు. ఇంటర్నెట్ లో మనోడి ఆడియో చక్కర్లు కొడుతోంది. దాంట్లో తన ఉన్మాద సైనికుల్ని ఇరాకీ సేనల మీద తిరగబడమని పిలుపునిచ్చాడు. అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందోగాని ప్రస్తుతానికైతే ఐసిస్ పని అయిపోయినట్టే కనిపిస్తోంది. అసలు ఆ సంస్థ తరుఫున పోరాడాల్సిన జిహాదీలే బురఖాలు వేసుకుని తప్పించుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారంటే యుద్ధం ఎక్కడి దాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు! ఇప్పుడు ఐసిస్ కత ఖతం అనుకంటున్నాం. గతంలో ఇదేలా అల్ ఖైదా కలకలం రేపింది. కాని, లాడెన్ హతంతో అది చల్లబడింది. ఇప్పటికీ అల్ ఖైదా వున్నా ఒకప్పటి జోరు లేదు. దాని ప్లేస్ లోనే ఐసిస్ రాక్షసిలా నోరు తెరిచింది. ఇప్పుడు దాని పని కూడా అయిపోతోంది. కాని, విషాదం ఏంటంటే, ఆయుధాల ఫ్యాక్టరీల ఓనర్లే ప్రభుత్వాలు నడుపుతున్న ప్రస్తుత ప్రపంచంలో మరో ఐసిస్, మరో అల్ ఖైదా పుట్టటానికి పెద్ద టైం పట్టకపోవచ్చు! అందుకు , ఐఎస్ఐఎస్ , అల్ ఖైదాల పుట్టుక, పతనాలే నిదర్శనం...  అల్ ఖైదా, ఐసిస్ లు ఎలా పుట్టాయి ? సూటిగా చెప్పుకుంటే అమెరికా, దాని మిత్ర దేశాల యుద్ధ కాంక్ష వల్ల పుట్టాయి! ఒకప్పుడు రష్యాపై తిరగబడ్డ జనాలకి అమెరికా శిక్షణ, ఆయుధాలు ఇచ్చింది. తరువాత అదే అల్ ఖైదాగా మారి, లాడెన్ రూపంలో అగ్ర రాజ్యాన్ని గడగడలాడించింది. రష్యాతో కోల్డ్ వార్ అయిపోయాక అమెరికా పోషించిన ఉగ్రవాదులు ఖాళీగా కూర్చోలేదు. అమెరికాకే శత్రువులయ్యారు. అదే వాల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడుల దాకా దారి తీసింది. తరువాత ఆఫ్గనిస్తాన్, ఇరాక్ ల పై యద్ధం రూపంలో మరింత సంక్షోభం తలెత్తింది. అదే ఐసిస్ కి కారణమైంది!  ఇరాక్ లో సద్దాంను, అలాగే, లిబియాలో గడాఫీని వరుసగా గద్దె దించుతూ పోయిన అమెరికా అక్కడి స్థానికులకి అన్ని సౌకర్యాలు కల్పించింది. ఆయుధాలు, శిక్షణ ఇచ్చి ఉగ్రవాదుల్ని ఉసిగొల్పింది. వాళ్లు సద్దాం, గడాఫీ లాంటి నియంతల పతనం తరువాత అరాచకులైపోయారు. అమెరికా మాట కూడా వినకుండా ఐసిస్ రూపంలో అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నారు. అమెరికా రాజేసిన వదిలిన అల్ బగ్ధాది తన సైన్యంతో ఎంత మంది యాజ్దీల్ని చంపాడో లెక్కేలేదు. ఎందరు ఇరాకీ మైనార్టీ స్త్రీలు రేపులకి, బానిసత్వానికి గురయ్యారో అంచనానే లేదు. 2014 నుంచీ ఇప్పటి వరకూ ఐఎస్ఐఎస్ కిరాతక పర్వం నడుస్తూనే వుంది.  అల్ ఖైదా, ఐసిస్ ల తరువాత నెక్ట్స్ ఏంటి? అమెరికాలో హిల్లరీ గెలిస్తే తక్కువ అవకాశాలు...  ట్రంప్ గెలిస్తే ఎక్కువ అవకాశాలు వుంటాయి... మరో అమానుషమైన ఉగ్ర సంస్థ పుట్టడానికి. కాకపోతే, ఇవాళ్ల కాకుంటే రేపు అమెరికా మరో ఉన్మాద ముఠాని ప్రపంచం మీదకి వదులుతుంది. అప్పుడే యుద్ధం చెలరేగి వెచ్చటి నెత్తురు భూమిపై పారుతుంది! ఆ వెచ్చదనమే అమెరికా లాంటి దేశాల్లోని ఆయుధ కర్మాగారాలకి, కార్పొరేట్లకి కావాల్సింది!  

రాంకిషన్ లు ముద్దు... రాంశంకర్ లు వద్దు!

  దేశంలో ఇప్పుడు రాంకిషన్ వర్సెస్ రాంశంకర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా? మన దేశంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఇంకా బోలెడు రకాల రాజకీయాలు మామూలే. కాని, మోదీ ప్రధాని అయ్యాక కొత్త కొత్త రకాల రాజకీయాలు ప్రాణం పోసుకుంటున్నాయి. అదీ విషాదంగా... పోయిన ప్రాణాల సాయంతో కొత్త పాలిటిక్స్ ప్రాణం పోసుకుంటున్నాయి. ఆ కోవకు చెందినవే తాజా రాంకిషన్ వర్సెస్ రాంశంకర్ పాలిటిక్స్! ముందుగా రాంకిషన్ ఎవరో తెలుసుకుందాం. రాంకిషన్ 70ఏళ్ల మాజీ సైనికుద్యోగి. ఆయన విభ్రాంతికర రీతిలో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే చెలరేగిన దుమారం తెలిసిందేగా? దేశాన్ని గతంలో ప్రాణాలకి తెగించి సేవించిన ఒక జవాను ఇప్పుడు నేల రాలిపోతే కాంగ్రెస్, ఆప్ లు తమ రేస్ మొదలుపెట్టాయి. ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆప్ అధ్యక్షడు రంగంలోకి దిగి పరామర్శల పరంపర మొదలు పెట్టారు. వాళ్లని చనిపోయిన రాంకిషన్ డెడ్ బాడీ వద్దకి పోలీసులు అనుమతించలేదు. రాహుల్, కేజ్రావాల్ మీడియా ముందు హంగామాకి సిద్ధపడ్డారు. మోదీ సర్కార్ ఆర్మీ జవాన్లకు వ్యతిరేకమని స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే, ఇక్కడ ఒక అనుమానం రావొచ్చు. ఒక సోల్జర్ మనసును కలచి వేసే రీతిలో ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్షాల నేతలు పరామర్శించవద్దా అని! తప్పకుండా పరామర్శించాలి. కాని, ఇక్కడే రాంశంకర్ తెరపైకి వస్తాడు! ఆయనెవరు?  రాంశంకర్ ఈ మధ్య భోపాల్ సిమి ఉగ్రవాదుల ఉదంతంలో అంతమైన పోలీస్. మరొ నెలలో ఆయన కూతురు పెళ్లి వుండగా టెర్రరిస్టులు తనని గొంతు కోసి చంపారు. తరువాత పారిపోయిన ఆ 8మంది దుర్మార్గుల్నీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయితే, ఓవైసీ, కాంగ్రెస్ నేతలు మొదలైన వారందరికీ ఈ ఎన్ కౌంటర్ పై అనేక అనుమానాలున్నాయి. పెద్ద రచ్చ చేశారు కూడా. కాని, అందరూ కన్వీనియంట్ గా మరిచిపోయిన విషయం ఒకటి వుంది! ఉగ్రవాదుల చేతిలో మరణించిన రాంశంకర్ కు ఏ ఒక్క సో కాల్డ్ సెక్యులర్ నేత కూడా శ్రద్ధాంజలి ప్రకటించలేదు. కేవలం బీజేపి నేతలు మాత్రమే పోలీస్ రాంశంకర్ అంత్యక్రియలకు హాజరై, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు! ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన రాంశంకర్ కి, ఆత్మహత్య చేసుకున్న రాంకిషన్ కి చాలా తేడా వుంది. అయినా వారిద్దరివీ అమూల్యమైన ప్రాణాలే. పైగా ఇద్దరూ భద్రతా దళాల సభ్యులు. మన దేశానికి ఎంతో కీలకం. అటువంటి పోలీస్, ఆర్మీలకు సంబంధించిన వారితో రాజకీయ నేతలు ఆటలాడుకోవటం అతి పెద్ద విషాదం. అసలు తనకు పెన్షన్ సరిగ్గా రాలేదని ఆత్మహత్య చేసుకున్న రాంకిషన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లిన రాహుల్, కేజ్జీవాల్... ఎందుకని, డ్యూటీలో భాగంగా దేశం కోసం బలి అయిన రాంశంకర్ అంత్యక్రియలకి వెళ్లలేదు? దీనికి సమాధానం చెప్పే వారు ఎవ్వరూ లేరు! కేవలం మోదీ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు సరిగ్గా చేయటం లేదని గోల మాత్రమే వినిపిస్తోంది! ఓఆర్ఓపీ అమలుపై ప్రతిపక్షలు నిరసనలు చేయటం వాటి హక్కు, బాధ్యత కూడా. కాని, అదే సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం బలవుతోన్న ఆర్మీ, పోలీసుల కుటుంబాల్ని పరామర్శించటం కూడా ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆరితేరిన మన నేతల బాధ్యత. ఎందుకంటే, కేవలం కొన్ని ఓట్ల కోసం చూసుకుని... ఒక వర్గంలోని అతివాదాన్ని మౌనంగా సమర్థించటం ఎప్పటికైనా ప్రమాదమే. రాంకిషన్ ఆత్మహత్యకి హడావిడి చేసి రాంశంకర్ ను అస్సలు పట్టించుకోకపోవటం అమానుషం తప్ప మరొకటి కాదు. గతంలోనూ రాహుల్, కేజ్రీవాల్, ఓవైసీ లాంటి వాళ్లు దాద్రి మృతుడి కుటుంబాన్ని , రోహిత్ వేముల ఫ్యామిలీని సెలక్టివ్ గా పరామర్శించారు. కాని, అదే సమయంలో దేశంలో వరుసగా ఆర్మీ జవాన్లు మరణిస్తున్నా... ఎక్కడా ఏ ఒక్క రోజూ ఎవరి అంత్యక్రియల్లోనూ కనిపించలేదు! ఇది దేనికి సంకేతం? శుద్ధమైన సెక్యులరిజమ్ అయితే కాదు... అదో రకపు కరుడుగట్టిన సెక్యులర్ రాజకీయం!  

కొత్త జిల్లాల లెక్కలు..పాస్‌పోర్ట్ తిప్పలు

పరిపాలనా సౌలభ్యం కోసం..ప్రజలకు సంక్షేమ ఫలాలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.  కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పరిపాలనా సంస్కరణగా చెప్పుకుంటున్న ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలకు అప్పుడే చుక్కలు చూపెడుతోంది. జిల్లాలు ఏర్పడి నెల రోజులు కావొస్తున్నప్పటికి పాస్‌పోర్ట్‌ సంబంధిత సేవలు ఇంకా పట్టాలెక్కలేదు. విద్య, ఉపాధి అవసరాల నిమిత్తం తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకునేవారు పెరుగుతున్నారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, కొత్త రాష్ట్రంలోనూ ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగింది.  కాని కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత మాత్రం ఈ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. ఇప్పటిదాకా ఎవరు ఏ జిల్లా కిందకు వస్తారో అర్థంకాలేదు. పాస్‌పోర్టు దరఖాస్తులను పాత జిల్లాల అధికారుల వద్దకు తీసుకెళితే, కొత్త జిల్లాల అధికారుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. తీరా గంపెడాశతో కొత్త జిల్లాల అధికారుల వద్దకు వెళితే, ఇంకా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రాలేదని, మరో రెండు వారాలు పడుతుందని చెబుతున్నారు. దీంతో మధ్యలో విదేశాలకు వెళ్లాల్సిన ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలను కూడా కోల్పోతున్నారు.   ఇటీవల రెండు జిల్లాల ఎస్పీలు ఎండార్స్ చేసి పంపించినా, కొత్త జిల్లా నుంచి దరఖాస్తు రాలేదన్న కారణంతో పాస్‌పోర్ట్‌ను తిరస్కరించిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన నివేదికను ఎస్పీలు ఆన్‌లైన్‌లోనే పంపించాలి. సంబంధిత సాఫ్ట్‌వేర్ రాకపోవడంతో కొత్త జిల్లాల ఎస్పీలు రిపోర్టులు పంపించలేకపోతున్నారు. పాత జిల్లాల ఎస్పీలు మాకు సంబందం లేదంటున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కొత్త జిల్లాల ఎస్పీలకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అందలేదు. అది వస్తే తప్పితే, ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తులను పరిష్కరించడం సాధ్యం కాదు. అయితే న్యూఢిల్లీ నుంచి రెండు, మూడు వారాల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పంపుతామని విదేశాంగశాఖ అధికారులు చెప్తున్నారు. 

టీడీపీలో... కార్యకర్తలు వర్సెస్ కార్పోరేట్స్!

ఒక పార్టీ వ్యవసాయ క్షేత్రమైతే... దాన్లోని మొక్కలు కార్యకర్తలు! క్షేత్రం, దాంట్లో మొక్కలు వుంటేనే యూరియా లాంటి మందులు అవసరం అవుతాయి! ఇంతకీ పొలిటికల్ పార్టీల్లో యూరియా ఏంటో తెలుసా? బడా బడా కార్పోరేట్లు ఇచ్చే పార్టీ ఫండ్స్! అవ్వి అవసరమే... కాని, అసలు పొలమూ, మొక్కలు వుంటే కదా, మందుతో పని! ఇప్పుడు ఇదే టీడీపీ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది...  మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా కార్యకర్తల పార్టీయే. ఎందరో కొత్త నేతల్ని తెలుగు రాష్ట్రాలకి అందించింది కూడా టీడీపీయే. ఇది సాధ్యమవ్వటానికి కారణం మొదట ఎన్టీఆర్ , తరువాత చంద్రబాబు నిజాయితీగా జెండాలు ఎత్తిన కార్యకర్తల్ని ఎంకరేజ్ చేయటమే. తెలుగు దేశంలో కింది స్థాయి వర్కర్ల దగ్గర నుంచీ అన్ని స్థాయిల వారికి దొరికినంత ప్రొత్సాహం మరే పార్టీలోనూ దొరకదన్నది నిజం. ప్రత్యక్ష నిదర్శనం... పాతికేళ్ల ప్రస్థానంలో ఎక్కడా ఎప్పుడూ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేయని టీడీపీ ఇప్పుడు కార్పోరేట్ ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ప్రస్తుతం పార్టీలో అలజడి రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారమే. జనవరి తరువాత ఏ క్షణాన్నైనా జరగనున్న నెల్లూరు, ప్రకాషం, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక టగ్ ఆఫ్ వార్ కి కారణమవుతోంది. ఒకవైపు సంవత్సరాలుగా పార్టీని నమ్మకున్న కార్యకర్తలు, నేతలు వుంటే... మరో వైపు అమాంతం వచ్చిపడ్డ కార్పోరేట్ శక్తులు వున్నాయి. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ చంద్రబాబు, లోకేష్ లు కార్యకర్తల్లోనే ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని భావించారు. గెలిచే వ్యక్తులపై దృష్టి కూడా సారించారు. కాని, అంతలోనే టీడీపీకి ఈ మధ్య అత్యంత కీలకమైన కార్పోరేట్ నేతలు రంగంలోకి దిగారు. ప్రతీ విషయంలో జోక్యం చేసుకున్నట్టే ప్రకాషం, నెల్లురు, చిత్తూరు జిల్లాల నియోజక వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కూడా తమ ప్రభావం చూపారు. అధ్యక్షుల వారికి ఇష్టం లేకున్నా , లోకేష్ బాబు కూడా అంగీకరించకున్నా తమ వారికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో వున్నారు. తమ కార్పోరేట్ ధన బలంతో తాము నిలబెట్టిన అభ్యర్థి గెలిచేస్తాడని వారి ధీమా! పట్టభద్రుల ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగవు కాబట్టి గ్రాడ్యుయేట్స్ ని డబ్బు పెట్టి ఇన్ ఫ్లుయెన్స్ చేయటం అనుకున్నంత ఈజీ కాదు. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ పని చేస్తే ఓట్లు పడతాయి. అయినా కూడా పెద బాబు, చిన బాబుల్ని ఈ కార్పోరేట్ శక్తులు నిజమైన కార్యకర్తకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయి. వాళ్ల మాటలు సీఎం వినరనే ప్రస్తుతానికి నెల్లురు, ప్రకాషం, చిత్తూరు జిల్లాల టీడీపీ తమ్ముళ్లు భావిస్తున్నారు! అతి త్వరలో ఎదురవనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త నాయకత్వాన్ని సృష్టించుకునేందుకు పార్టీకి మంచి అవకాశం. ఇలాంటి ఒక ప్రయోగం సాధారణ ఎన్నికల్లో, ప్రజలంతా ఓటు వేసే సమయంలో చేయలేము. కాబట్టి చంద్రబాబు సరైన నిర్ణయం సాహసంగా తీసుకుంటేనే బావుంటుంది. అలా కాక కార్పోరేట్ శక్తులకి ప్రసన్నమై వారు చెప్పిన అబ్యర్థిని నిలబెడితే... వర్కర్లకి తప్పుడు సంకేతాలు వెళతాయి. మిగతా పార్టీల్లాగే టీడీపీలో కూడా జెండాలు మోయకుండా కార్పోరేట్ ఎజెండా పెట్టుకుని పని చేస్తే సక్సెస్ వస్తుంది అనుకుంటారు! ఇది దీర్ఘ కాలంలో చంద్రబాబుతో పాటూ యువనేత లోకేష్ కి కూడా ప్రమాదం. ఎందుకంటే, మొదట్లోనే చెప్పుకున్నాం కదా... పార్టీ పొలం. కార్యకర్తలు మొక్కలు. కార్పోరేట్ శక్తులు కేవలం పురుగు మందులు! అంతే ...   

పవన్ రాజకీయమంతా 'గోదాట్లోనేనా'?

  ఆంధ్రా పాలిటిక్స్ త్వరలో కంప్లీట్ గా ఛేంజ్ అవ్వనున్నాయా? పరిస్థితి చూస్తుంటే అలానే వుంది. 2014లో ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరిగాయి. అయినా కూడా తెలంగాణ, ఆంద్రా వేరు వేరు రాష్ట్రాలుగానే స్పందించాయి. అప్పటికే పార్లమెంట్లో బిల్లు పాసైపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఏపీ ప్రజలు టీడీపీ అన్నారు. తెలంగాణ వాళ్లు టీఆర్ఎస్ అన్నారు. కాని, 2019 ఎన్నికలు మొత్తం భిన్నంగా వుండేలా కనిపిస్తున్నాయి. అందుక్కారణం... పవర్ స్టార్ పవన్ కళ్యాణే! తెలంగాణలో టీఆర్ఎస్ కి ఇప్పుడు తిరుగులేదు. ఓ రీసెంట్ సర్వేలోనైతే వెంటనే ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీదే క్లీన్ స్వీప్ అని తేలిపోయింది! కాని, సమస్యంతా ఆంధ్రాలోనే వుంది. ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపిలు కాక వైసీపీ మాత్రమే వుంది. జస్ట్ మూడు పార్టీలే ప్లోర్ పై రాజకీయం చే్స్తున్నాయి. అందులోనూ గోలంతా టీడీపీ, వైసీపీల మధ్యే. ఆరోపణలు, ప్రత్యారోపణలు, మైక్ లు విరిచేయటాలు, బూతులు తిట్టుకోవటాలు అన్నీ సైకిల్ కి, ఫ్యాన్ కి మధ్యలోనే! కాని, పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం 2019 ఆంధ్రా అసెంబ్లీ రూపు రేఖల్ని మార్చేసేలా వుంది!     ఇంత కాలం ప్రశ్నిస్తా అంటూ అప్పుడప్పుడూ ప్రత్యక్షం అయిన పవన్ ... ఓ ప్రెస్ మీటో, బహిరంగ సభో పెట్టేవాడు. మీడియాలో నానా హడావిడి అయ్యాక అమాంతం మాయం అయ్యే వాడు. ఆయన మీద ఆరోపణ కూడా అదే. పాలిటిక్స్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వటం లేదని క్రిటిక్స్ గోల చేసేవారు. కాని, ఇప్పుడు పవన్ ఏలూరులో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అది వాళ్ల స్వంత జిల్లా ముఖ్య కేంద్రం కాబట్టి అక్కడే ఓ ఇల్లు కూడా తీసుకోవాలని పవన్ నిశ్చయించుకున్నాడు. అంటే, దాదాపూ 2019 ఎన్నికల్లో ఆయన అక్కడ్నుంచీ పోటీ చేయటం ఖరారైపోయినట్టే! ఇదే ఇప్పడు ఏపీ పొలిటికల్ ఫేస్ మార్చేసే పరిణామం! జనసేన అధినేత ఎమ్మేల్యేగా అసెంబ్లీలో కాలుపెడితే ఆయన వెంట భారీగానే ఎమ్మేల్యేలు వచ్చే అవకాశం వుంది. పవన్ తన స్వంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? లేదా? అనేది ఇప్పుడు చెప్పగలిగేది కాదు. అంత వీక్ గా టీడీపీ లేదు. వైసీపీ కూడా పవన్ ప్రభంజనానికి కొట్టుకుపోయే స్థితిలో ఏం లేదు. అయినా పవన్ ప్రభావం అస్సలు వుండదని కూడా చెప్పే వీలు లేని పరిస్థితి వుంది! అంటే... వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో పాటూ జనసేన సీట్లు షేర్ చేసుకోనుందన్నమాట. దాంతో హంగ్ కూడా అనివార్యం కావొచ్చు!   పవన్ తీసుకున్న ఏలూరు నిర్ణయం... రానున్న రోజుల్లో ఆయన్ని కింగ్ ను చేయోచ్చు. లేదంటే కింగ్ మేకర్ ను చేయోచ్చు. ఏది ఏమైనా, ఆంద్రా పాలిటిక్స్ ని మాత్రం గబ్బర్ సింగ్ ఎంట్రీ ఖచ్చితంగా రక్తి కట్టిస్తుంది! లెట్స్ అండ్ వెయిట్ సీ...  

మోదీ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన బాబు, కేసీఆర్!

  గుజరాత్... ఈ పేరు బిజినెస్ కి మారు పేరు. అంతే కదా? అఫ్ కోర్స్, కొంత మందికి దీనిపై భిన్నాభిప్రాయలు వుండొచ్చు. కాని, గుజరాత్ మాత్రం బిజినెస్ హబ్ గా ప్రచారంలో వుంటూ వస్తోంది. కాని, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు గుజరాత్ ని బీట్ చేశాయి. అదీ బిజినెస్ విషయంలో!   మొత్తం దేశంలో ఎక్కడ వ్యాపారానికి అనువైన వాతావరణం వుంది? ఎక్కడ సంస్కరణలు వేగంగా అమలవుతున్నాయి? ఈ ప్రశ్నలకి సమాధానం, కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు. 2015 జూలై నుంచి 2016 జూన్ వరకూ జరిపిన అధ్యయనంలో ఏపీ, తెలంగాణ టాప్ లో నిలిచాయి. 98.78శాతం మార్కులతో తెలంగాణ, ఆంధ్రా రెండూ సేమ్ ర్యాంక్ కొట్టేశాయి. వీటి తరువాత మూడో స్థానానికి పడిపోయింది వ్యాపారానికి స్వర్గం లాంటి గుజరాత్! 98.21శాతం మార్కులు సంపాదించింది మోదీ స్వరాష్ట్రం. ఇక ఆ తరువాతి స్థానాల్లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, హర్యాణా, జార్ఖ్ ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలు నిలిచాయి.    ఈ ర్యాంక్స్ ఆయా రాష్ట్రాల్లో వున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అద్దం పడతాయి. అంటే, వ్యాపారం చేసుకోటానికి సదరు రాష్ట్రాల్లో ఎంత అనుకూల వాతావరణం, ఎంత ప్రొత్సాహకర పరిస్థితులు వున్నాయన్నది తెలుస్తుంది. అంతే కాదు, సంస్కరణల అమలు విషయంలో కూడా ఈ అధ్యయనంలో ప్రధానంగా దృష్టి పెట్టారు. అందులోనూ  మన రెండు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. ఆర్దిక సంస్కరణలు వేగంగా అమలుచేస్తూ సాధ్యమైనంత ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి.    సమైక్యాంధ్ర ప్రదేశ్ పదేళ్ల పాటూ పాలించి పూర్తిస్థాయి గందరగోళానికి కారణమైంది కాంగ్రెస్. చివరకు, విభజన కూడా చేసి జనాల ఆవేశానికి, ఆగ్రహానికి గురైంది. ఆలస్యంగా ఇచ్చిందన్న చెడ్డ పేరు తెలంగాణలో, విభజించిందన్న కోపం ఆంద్రాలో మూటగట్టుకుంది. అటువంటి పార్టీ హయాంలో పూర్తిగా అభివృద్ధి మందగించింది తెలంగాణ , ఆంద్రాల్లో. ఇప్పుడు మళ్లీ ఈ ర్యాంకింగ్స్ మనం రైట్ ట్రాక్ మీదకు వచ్చామని సూచిస్తున్నాయి. వాల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా అధ్యయనం చేసి ఇచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినస్ ర్యాంకులు మరింత మేలు చేస్తాయి కొత్త రాష్ట్రాలకి. మరీ ముఖ్యంగా, కొత్త రాజధానితో సరికొత్తగా రేసులోకి వచ్చిన నవ్యాంధ్ర ఇంకా ఉధృతంగా వ్యాపారాన్ని వృద్ధి చేయాలి. వ్యాపారానికి అనుకూల వాతావరణం మరింత పెంపొందించాలి! అప్పుడే స్వవర్ణాంద్ర, బంగారు తెలంగాణ నినాదాలు సాకారం అవుతాయి...   

స్వతంత్ర భారత్ కి ఉక్కు పునాదులేసిన ఉక్కు మనిషి!

  కాలు, చెవ్వు, ముక్కు, ఆఖరుకు గుండె... ఇవన్నీ అంగాలు. అంతే కాదు, ఇవన్నీ ఒక నిర్ధిష్ట ఆకారంతో శరీరంలో ఏదో ఒక చోట వుంటాయి. కాని, రక్తం అలా కాదు. అసలు చాలా మంది రక్తం ఒక అంగం అనుకోరు కాని... అది మన శరీరమంతా వ్యాపించిన అతి కీలకమైన అంగం! రక్తం లేకుంటే మిగతావన్నీ వున్నా జీవితం నిరర్ణకమైపోతుంది! ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ మన ఆధునిక స్వతంత్ర భారతదేశానికి రక్తం లాంటి వాడే!   మన హైద్రాబాద్ సంస్థానంతో సహా వందలాది చిన్న చిన్న రాజ్యాల్ని భారతదేశంలో విలీనం చేసిన పటేల్ 31 అక్టోబర్ 1875న గుజరాత్ లో పుట్టారు. ఆయన ఒకవేళ అన్ని రాజ్యాల్ని అంత నేర్పుగా, ఓర్పుగా ఢిల్లీ కంట్రోల్ లోకి తీసుకుని రాకపోయి వుంటే ఇవాళ్ల భారతదేశం ఇలా వుండేదే కాదు. వందలాది కాశ్మీర్లలా రగులుతూ వుండేది. ఆఫ్రికా లాంటి ఖండంలా భారత ఉపఖండం చిన్న చిన్న పేద దేశాల సమూహం అయ్యేది. కాని, పటేల్ తానే భారతదేశానికి రక్తంలా మారి ఆసేతు హిమాచలం ప్రవహించారు! ఒక్కో రాజ్యాన్ని విలీనం చేసుకుంటూ... వినకపోతే విమోచనం చేసుకుంటూ ముందుకు పోయారు! అదే ఆయన అతి పెద్ద విజయం...    వల్లభ్ భాయ్ పటేల్ గాంధీ, నెహ్రులతో పాటూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. 1947లో మనకు స్వేచ్ఛ కలిగేనాటికి ఆయన అత్యంత కీలకమైన నేతల్లో ఒకరు. నిజానికి అప్పటి దేశంలోని అన్ని కాంగ్రెస్ కమిటీలు పటేల్ కే ప్రధానిగా ఓకే చెప్పాయి కూడా. కేవలం ఒకట్రెండు పీసీసీలు మాత్రమే నెహ్రు కావాలని మద్దతు ప్రకటించాయి. అయినా గాంధీ సమక్షంలో నెహ్రునే తొలి ప్రధాని అయ్యారు. పటేల్ హో మంత్రిగా నిలువరింపబడ్డారు. అయినా కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా తన దేశ సేవ విరమించలేదు. నిస్వార్థంగా అరేబియా సముద్ర తీరంలోని జునాగఢ్ మొదలు ఎక్కడో వున్న అసోంలోని చిన్న చిన్న సంస్థానాల వరకూ అన్నిట్నీ భారతదేశం మ్యాపులోకి చేర్చారు.   సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ హ్యాండిల్ చేసిన వ్యవహారాల్లో మన హైద్రాబాద్ అత్యంత కీలకమైంది. ఇక్కడ నిజాంకి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పటికీ 1948 వరకూ జనానికి స్వాతంత్ర్యం రాలేదు. మిగతా దేశమంతా స్వేచ్ఛగా మారిపోయినా హైద్రాబాద్ రాజ్యంలోని ప్రజలు నిజాం నిరంకుశ పాలనలోని చీకటిలో మగ్గిపోయారు. చివరకు, ఆపరేషన్ పోలోతో పటేల్ హైద్రాబాద్ ను బేషరతుగా భారత్ లో విలీనం చేశారు. ఆయన ఆర్మీ బలంతో అలా చేయకుంటే ఇవాళ్ల హైద్రాబాద్ కూడా కాశ్మీర్ లా కాష్ఠమై రగిలిపోతూ వుండేది. అలా జరగనీయక భాగ్యనగరాన్ని భద్రంగా భారత్ లో ఐక్యం చేసిన ఆయనకు తెలుగు వారంతా ఎప్పటికీ ఋణపడి వుంటారు. అంతే కాదు, గుజరాత్ లోని జునాగఢ్ రాజ్యం కూడా పటేల్ హైద్రాబాద్ లాగే విజయవంతంగా విలీనం చేశారు. కాని, కాశ్మీర్ విషయంలో నెహ్రు తొందర పాటు చర్యల వల్ల ఇప్పటికీ సమస్య కొనసాగుతూనే వుంది. ఒకవేళ సర్ధార్ జీ కాశ్మీర్ రాజ్యంపై కూడా కన్ను వేసి వుంటే... ఈ పాటికి పాకిస్తాన్ బెడద మనకు వుండేదే కాదంటారు ఆయన అభిమానులు! ఎవరి మాట ఎలా వున్నా జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకునే పటేల్ జయంతినాడు మనం ఆయన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఎందుకంటే, వల్లభ్ భాయ్ పటేల్ యావత్ జాతికి హాని చేసే చేత కాని శాంతి వచనాలు పలికిన వాడు కాదు. భరతమాతకి ఏదో మేలో అది మౌనంగా చేస్తూ పోయిన వరుణాస్త్రం...  

ఆమె పాక్ ను తుడిచిపెట్టేయమని మోదీని కోరుతోంది...

  పాకిస్తాన్ తో యుద్ధం మొదలైపోయిందా? మనం కాలేదని అనుకుంటున్నాం కాని బార్డర్ లో యుద్ధం నడుస్తూనే వుంది. ఇటు మనవాళ్లు, అటు వాళ్ల సైనికులు రోజూ మరణిస్తూనే వున్నారు. ఇంత కాలం ఇలా జరగకూడదని భారత్ పట్టిన ఓపికని పాక్ దుర్వినియోగం చేసింది. పదే పదే రెచ్చిగొట్టి ఇప్పుడు విలయం తెచ్చి పెట్టుకుంది.   మోదీజీ! అసలు పాక్ అనేది లేకుండా చేసేయండి... ఈ మాట అన్నది ఎవరో ఆవేశపరుడైన కాలేజ్ యువకుడు కాదు. పాక్ బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాను భార్య. హర్యాణాలోని కురుక్షేత్రాకు చెందిన మన్ దీప్ సింగ్ యుద్ధంలో ప్రాణత్యాగం చేశాడు. ఆయన అంత్యక్రియల తరువాత భార్య ఇలా నేరుగా మోదీని ఉద్దేశించి ఓ మాట చెప్పింది. పాకిస్తాన్ కు మంచిగా చెప్పి చూడండి. వినకపోతే అసలు పాక్ అనేది లేనే లేకుండా తుడిచిపెట్టేయండి. అంతే కాని, ఇలా ప్రతీ రోజూ చీకటి దీపావళి జరుపుకునేలా చేయకండి... అందామె! ఈ మాటల్లో ఆమె విషాదం, బాధ అర్థం చేసుకోవచ్చు...   ఒక్క మన్ దీప్ సింగే కాదు పాక్ కాల్పుల్లో ఈ మధ్య మన వాళ్లు చాలా మందే మరణించారు. అంతకంటే ఎక్కువ మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమైతున్నప్పటికీ అమరులైన జవాన్ల కుటుంబాల నష్టం, కష్టం మాత్రం దేనితోనూ తగ్గేది కాదు. అయినా వాళ్లంతా ప్రాణత్యాగం చేసిన తమ వారి చితి మంటల సాక్షిగా పాక్ అంతం కోరుతున్నారు. మరో వైపు పాక్ మాత్రం తన సైన్యం ఎంత మరణించినా ఎవ్వరూ చావలేదని బుకాయిస్తోంది. రక్తపు క్రీడ రెచ్చగొట్టికొనసాగిస్తోంది. ఇక ఇంచుమించూ ఒకే ఒక్క మార్గం మిగిలేలా పరిస్థితులు తీసుకొస్తోంది!    పాక్ యుద్ద పిపాస, ఉన్మాదం చివరకు దాని అంతానికి ఆరంభం అయ్యేలా వున్నాయి. చిలికి చిలికి గాలివానలా యుద్ధంగాని పూర్తి స్థాయిలో రాజుకుంటే... బలూచిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ పాక్ చేతిలోంచి జారిపోవటానికి వారం సమయం కూడా పట్టదు. మోదీ యుద్ధంతోనో, యుద్ధం లేకుండానో పాకిస్తాన్ ను ముక్కలు చేసే వ్యూహం అమలు చేయాలి. అదే మనకి, ప్రపంచానికి, ఆఖరుకి పాక్ లోని ఉన్మాదం లేని అమాయకులకి ... మంచిది! అప్పడే ప్రాణత్యాగాలు చేసిన జవాన్ల కుటుంబాలకి న్యాయం జరిగినట్టు...     

ఈ ఇద్దరూ... జనాన్ని ఎలా మాయ చేస్తున్నారు?

  నమోన్నమః... ఇంకా భారతదేశం 2014 మూడ్ లోనే వుందంటున్నారు సర్వేకారులు! మోదీకి నమోన్నమః అంటున్నారట జనం! ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ విజయకేతనం రెపరెపలాడుతూనే వుంది! ఇంకా చెప్పుకోవాలంటే కేసీఆర్ క్రేజ్ ఇంకా కొంచెం పెరిగింది కూడా! అసలు మోదీ, కేసీఆర్ ల సక్సెస్ సీక్రెట్ ఏంటి?   కొన్ని సార్లు నాయకులకి పార్టీ ఉపయోగపడుతుంది. మరి కొన్ని సార్లు నాయకులే పార్టీకి ఉపయోగపడతారు! ఈ రెండో కోవకి చెందిన వారే మోదీ, కేసీఆర్. ఇద్దరిదీ వేరు వేరు రాజకీయ నేపథ్యం అయినా ఇద్దరి విజయం మాత్రం ఒకేలా మెస్మరైజ్ చేస్తుంది. అందుకు తాజా ఉదాహరణ వీడీపీ అసోసియేట్స్ చేసిన సర్వే. మొత్తం 420 లోక్ సభ నియోజక వర్గాల్లో ఈ సర్వే నడిచింది. అనేక ప్రశ్నలకు ఇందులో సమాధానాలు రాబట్టారు. జనం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఢిల్లీకి ఎవర్ని పంపిస్తారు? రాష్ట్రాల్లో ఎవర్ని ఎన్నుకుంటారు? అలాగే ఏ సీఎం ఎంత జనాకర్షణ కలిగి వున్నారు? పీఎం పరిస్థితి ఏంటి? ... ఇలాంటి బోలెడు ప్రశ్నలకి సమాధానాలు సర్వే!   ఢిల్లీలో బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏకి, తెలంగాణలో టీఆర్ఎస్ కి తిరుగులేదని తేల్చింది సర్వే. కాకపోతే, అన్ని ఫలితాల్లోకి అత్యంత ఆసక్తికర విషయం ఏంటంటే... కేసీఆర్, మోదీల జనాకర్షణ! దేశ ప్రధానిగా 2014లో ఎన్నికైన మోదీ అప్పట్లో ఒక ప్రభంజనం. కాని, గత రెండున్నరేళ్లలో సామాన్య జనానికి ఒదిగిందేం లేదు. ధరల తగ్గుదల, ఉద్యోగాలు వగైరా వగైరా అన్నీ అలానే వున్నాయి. అవినీతి మాత్రం తగ్గింది. కుంభకోణాలు వినిపించటం లేదు. అయినా కూడా మోదీ జాతీయ నాయకుల్లో ఎవరికి అందనంత ఎత్తులో వున్నాడు! 67శాతం మంది ఆయన్నే మళ్లీ ప్రధానిగా కోరుకుంటున్నారు. దీనికంటే ముఖ్యమైంది ఆయన తరువాతి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేసే స్థితిలోనే లేరు. రాహుల్, కేజ్రీవాల్ ఇద్దరూ కలిపి కూడా 8శాతానికి మించి మద్దతు సంపాదించలేకపోయారు. అంత డిఫరెన్స్ వుంది మోదీకి ప్రత్యర్థుల నుంచి. అయితే, దీనికి కారణం ఏంటి?    మోదీ పాప్యులారిటీకి కారణం ఆయన సిన్సియారిటీ అనే అనుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు ఇంకా నెరవేర్చకపోయినా ఆయన మీద జనం నమ్మకంతో వున్నారు. తప్పక అచ్చే దిన్ తెస్తాడని నమ్ముతున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకూ ఎక్కడా తన మీద మచ్చ పడేలా ప్రవర్తించలేదు నరేంద్ర మోదీ. అంతే కాదు, పాకిస్తాన్ తో ఆయన డీల్ చేస్తున్న తీరు భారతీయుల్లో ఆత్మవిశ్వాసం నింపింది. ఇదే మోదీ దూకుడుకి కారణం...   మోదీ జనాకర్షణకి పూర్తి భిన్నమైంది కేసీఆర్ ఫాలోయింగ్. ఆయన డైనమిజమే ఆయనకు క్రేజ్ గా మారుతోంది. పది జిల్లాల్ని 31గా చేసిన కేసీఆర్ మొదటి రోజు నుంచీ అన్నీ సెన్సేషనల్ నిర్ణయాలే తీసుకుంటున్నాడు. వాటి వల్ల కలిగే పలితాలు ఎలా వున్నా జనం మాత్రం హిప్పాటైజ్ అవుతున్నారు. దాని ఫలితమే ఏకంగా 87శాతం తెలంగాణ ప్రజలు ఆయనకు జైకొట్టడం! అర్జెంట్ గా ఎన్నికలొస్తే హైద్రాబాద్ లోని ఎంఐఎం ఎంపీ సీటుతో సహా అన్నీ టీఆర్ఎస్ కే దక్కుతాయని సర్వే అంటోంది! అంత భారీగా కేసీఆర్ జనం అభిమానాన్ని పొందాడు. దీనికి కారణం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే. గోల్కొండపై జెండా ఎగరవేయటం మొదలు జిల్లాల విభజన దాకా అన్నీ అనూహ్య విధానాలే వుండటం కేసీఆర్ కు ప్లస్ గా మారుతోంది. వచ్చే ఎన్నికల నాటికి జనానికి ఎంత వరకూ మేలు జరుగుతుందో కాని ఇప్పటికిప్పుడు మాత్రం టీఆర్ఎస్ హవానే కొనసాగబోతోందని తేలిపోయింది!   మోదీకి, కేసీఆర్ కి కలిసి వస్తోన్న అత్యంత ముఖ్య విషయం మరొకటి వుంది! వీళ్లిద్దరికి పోటీగా బరిలో వున్న వారెవరూ అసలు వీళ్ల స్థాయికి ఏ మాత్రం సరిపోని వారు. దాంతో ఆటోమేటిక్ గా ప్రజలు ఈ ఇద్దరు నాయకుల వైపే మూకుమ్మడిగా వచ్చి చేరిపోతున్నారు!    

బంగారు దుకాణాలకి బంగారు బాతు... దంతేరస్!

  ఒక్కసారి పొద్దున్న లేచి పేపర్ చూడండి. లేదంటే టీవీ ఆన్ చేయండి. రేడియో వినండి. కాదంటే ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వండి. అన్ని చోట్లా దర్శనం ఇచ్చేవి ఏంటి? యాడ్స్! అవును... అడ్వర్టైమెంట్లు ఇప్పుడు విశ్వరూపం ఎత్తేశాయి. మీరు సినిమాకి పోతే పెద్ద తెర మీద కనిపించే ప్రకటనలు మొదలు యూ ట్యూబ్ చూసేప్పుడు వచ్చే యాడ్స్ వరకూ అంతటా క్రియేటివ్ మసాలానే! నల్ల చర్మం తెల్లబడటానికి క్రీమ్, తెల్ల జుట్టు నల్లబడటానికి హెయిర్ డై... ఇలా మాయ చేసి అమ్మేస్తున్నారు జనానికి అవసరం వున్నవీ, లేనివి! రకరకాల ప్రాడక్ట్స్ అమ్మే కార్పోరేట్ కంపెనీలు సహజంగానే పండగల్ని కూడా వదలటం లేదు. మరీ ముఖ్యంగా, బంగారు బాతు లాంటి దంతేరస్ వస్తే బంగారు దుకాణాలకి పండగే! లక్ష్మీ దేవి భక్తుల కంటే ఎక్కువ ఈ షాప్ లు, షోరూంల వాళ్లు హైపర్ అయిపోతున్నారు. అసలు ఒకప్పుడు తెలుగు వారికి దంతేరస్ అంటే ఏంటో కూడా తెలియదు. ధన త్రయోదశి మాత్రం నరకచతుర్ధశికి ముందు రోజుగా చెలామణిలో వుండేది. ఈ రోజున లక్ష్మీ దేవీ , ధన్వంతరి భగవానుడు పాల సముద్రం నుంచి ఉద్భవించారని పురాణం కథనం. కాకపోతే, తెలుగు ప్రాంతాల్లో ధన్వంతరి ఆరాధన కూడా పెద్దగా వుండేది కాదు. కాని, ఇప్పుడు ప్రకటనల ప్రళయం వచ్చేసరికి మొత్తం అంతా మారిపోయింది...  గత కొన్నేళ్లుగా దంతేరస్ అంటూ ఉత్తరాది వారి పండుగని మనకి పరిచయం చేసేశాయి అడ్వర్టైమెంట్లు. వరస పెట్టి వచ్చే ప్రకటనలు, పేపర్స్ లో కనిపించే ఫుల్ పేజ్ యాడ్స్ మాయ చేసేశాయి. దంతేరస్ నాడు, అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు, దీపావళికి ముందు రోజున... బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవీ నడుస్తూ వచ్చి బీరువాలో సెటిలైపోతుందని ప్రచారం చేశారు. అసలు ఒక దశలో ఈ గోల్డ్ రష్ ఎక్కడిదాకా వెళ్లిందంటే ధనత్రయోదశి నాడు బంగారం కొనకపోతే లక్ష్మీదేవీ ఆగ్రహిస్తుందన్నంత విపరీతంగా అయిపోయింది. ఎవరైనా బంగారానికి డబ్బులు లేక కొనలేకపోతే మనస్తాపానికి గురయ్యేలా తయారైంది. ఇక బంగారు దుకాణాల వద్ద అయితే రేషన్ షాపుల వద్ద నిలబడ్డట్టు క్యూలో నిలబడ్డారు జనం! ఇదంతా చూశాక బంగారం తెచ్చి పెట్టుకున్న వాడికంటే ఎక్కువ లక్ష్మీ కటాక్షం అమ్మిన షాపు వాడికొచ్చిందని ఈజీగా అర్థమైపోతుంది! ఎప్పటిలాగే ఈ యేడు కూడా దంతేరస్ అంటూ యాడ్స్ దంచుకున్నారు గోల్డ్ బిజినస్ మెన్. ఎంత వరకూ జనం షాపుల వైపు పరుగులు తీశారో తెలియదు కాని ముందు కన్నా పిచ్చి తగ్గిందని చెప్పవచ్చు. అయినా కూడా బంగారం కొని తీరాలన్న ఆవేశంతో వున్నా వారు ఇంకా వున్నారు. కాని, మరో వైప పండితులు బంగారం మాత్రమే కొనాలని ఎక్కడా లేదంటున్నారు. అసలు హిందూ మతంలో లక్ష్మీ దేవీ అంటే బంగారమో, డబ్బులు మాత్రమో కాదనీ... ఆమె సకల సందలకూ ప్రతిరూపమని చెబుతున్నారు. అందుకే, దంతేరస్ రోజు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు మట్టి కుండ మొదలు బంగారం, వజ్రాల వరకూ ఏదైనా కొనవచ్చని... అన్నీ లక్ష్మీ రూపాలేనని అంటున్నారు. అంతే కంటే ముఖ్యంగా, మన వద్ద ఏదైతే వుందో దాన్ని దానం చేయాలని చెబుతున్నారు. స్వార్థంతో బంగారం కొని బీరువాలో దాచుకుంటే లాభం లేదంటున్నారు. ఎంతో కొంత దాన , ధర్మాలు చేస్తే అది ఎప్పటికైనా మంచి చేస్తుందంటున్నారు! జనం పండితుల మాట వింటారో లేక యాడ్స్ చెప్పేదే వింటారో ... చూడాలి! 

టాటా పరివార్ లో... ధర్మానికి, ధన లాభానికి మధ్య వార్!

  టాటాల ప్రపంచంలో తుఫాన్ ఇంకా సద్దుమణగటం లేదు. ఒకవైపు అవమానకరంగా తొలగింపబడ్డ సైరస్ మిస్త్రి, మరో వైపు విజయానికి, నైతికతకి ప్రతి రూపంగా ఇంతకాలం చెబుతూ వచ్చిన రతన్ టాటా! వీళ్ల మధ్య టాటా సన్స్ బోర్డు, దాని డైరెక్టర్స్... మొత్తం అంతా గందరగోళంగా వుంది బయట నుంచి చూసేవారికి! మరీ ముఖ్యంగా, టాటాలో షేర్స్ వున్న షేర్ హోల్డర్స్ కి అంతా అయోమయంగా వుంది...    వున్నట్టుండీ తమ చైర్మన్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు టాటా గ్రూప్ ప్రకటించింది. అయితే, ఎవ్వరూ ఊహించని ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. కాని, మెల్ల మెల్లగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చైర్మన్ తొలగింపు అనూహ్యంగా జరిగిందేం కాదనిపిస్తోంది. చాలా రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయని అర్థమవుతుంది. వాటి ఫలితమే మిస్త్రీ తొలగింపు అనే తుఫాన్!   సైరస్ మిస్త్రీని చైర్మన్ గా ఎంచుకుంది , ప్రకటించింది రతన్ టాటానే. కాని, తనని కుర్చీలోంచి పక్కకు తప్పించగానే మిస్త్రీ మొదట ఆరోపణలు చేసింది ఆయన మీదే. అసలు తనకి స్వేచ్ఛగా పని చేసుకునే అవకాశమే ఇవ్వలేదని సైరస్ తన లేఖలో రాశారు. అయితే, టాటా డైరెక్టర్స్ కి పంపిన ఈ కాన్ఫిడెన్షియల్ ఈమెయిల్ కూడా మీడియాకి లీకైంది. ఈ పని మిస్త్రీనే చేశాడని టాటా డైరెక్టర్స్ అంటున్నారు. ఆయన తన చైర్మన్ గిరి కాలం మొత్తంలో అంతా అనైతికంగా ప్రవర్తించాడని వాళ్లు చెబుతున్నారు. సైరస్ చేసిన ప్రతీ ఆరోపణకి రివర్స్ ఎటాక్ ఇచ్చింది టాటా గ్రూప్!   చాలా కంపెనీలు, ముఖ్యంగా, టాటా నానో సంస్థ లాస్ లో వుందని మిస్త్రీ ఎత్తి చూపాడు. ఆ నష్టాల వల్ల టాటా గ్రూప్ భవిష్యత్ ఆందళనకరంగా మారిందన్నాడు. కేవలం రతన్ టాటా తృప్తి కోసమే నానో ఉత్పత్తి చేస్తున్నారని అన్నాడు. ఇలా రతన్ టాటాని, టాటా సంస్థల్ని మిస్త్రీ నేరుగానే టార్గెట్ చేశాడు. అందుకు తగ్గట్టే టాటా డైరెక్టర్స్ కూడా ఘాటుగా స్సందించారు. మిస్త్రీ తనకిచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయాడని, టాటా కంపెనీల నైతిక పరమైన కీర్తి, ప్రతిష్ఠల్ని ఆయన దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడని అన్నారు. నిజంగా కూడా సైరస్ లాస్ లో వున్న కంపెనీల్ని క్రమంగా వదిలించుకుంటూ వచ్చాడు.   ఖరీదైన కార్లని కొనలేని మధ్యతరగతి ఇండియన్స్ కోసం రతన్ టాటా పట్టుదలతో తీసుకొచ్చిన కలల కారు నానో. అది మార్కెట్లోకి తేవటం గొప్ప విషయమని మారుతి సంస్థ చైర్మన్ ప్రశంసలు కురిపించారు. కాని, అదే నానోపై రతన్ టాటాకు మిస్త్రీ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీన్నంతట్ని బట్టి చూస్తుంటే... టాటాల సామ్రాజ్యంలో జరిగింది నైతిక విలువలకి, ఫక్తు బిజినెస్ నిర్ణయాలకి మధ్య గొడవగా అర్థం చేసుకోవచ్చు! మరి దీర్ఘ కాలంలో రతన్ టాటా ఎంచుకున్న నైతికత, సామాజిక బాధ్యత వంటి అంశాలు విజయవంతం అవుతాయో... లేక మిస్త్రీ సమర్థించిన కఠిన వ్యాపార నిర్ణయాలు సరైనవని ప్రూవ్ అవుతాయో వేచి చూడాలి...   

పీఓకేలో... పాక్ పైశాచికత్వం!

గురివింద గింజ సామెత తెలుసు కదా? అలాగే వుంది పాకిస్తాన్ పరిస్థితి. ఆ దేశం భారత్ లో అంతర్భాగంగా వున్న కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ నానా రచ్చ చేస్తుంటుంది. మొన్నటికి మొన్న ఉరీ ఉగ్ర దాడి తరువాత కూడా ఐక్య రాజ్య సమితిలో నవాజ్ షరీఫ్ పాత పాటే పాడాడు. ఇండియా కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయోలేషన్ చేస్తోందంటూ రికార్డ్ వేశాడు. పనిలో పనిగా బుర్హాన్ వని స్వాతంత్ర సమరయోధుడు అని కూడా చెవిలో పువ్వు పెట్టాడు. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ చేస్తోన్నఅసలు సిసలు మానవ హక్కుల ఉల్లంఘన బయటకొచ్చింది...   1947లో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచినప్పటికీ కాశ్మీర్లో కొంత భాగం మనం కోల్పోయాం. అందుక్కారణం నెహ్రు కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితిలో పెట్టడమే. ఇక అప్పటి నుంచీ భారత్, పాక్ మద్యలో వుండిపోయిన స్వతంత్ర కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ గా చెలామణి అవుతోంది! కాని, విషాదం ఏంటంటే... ఆజాద్ కాశ్మీర్ పేరులో మాత్రమే ఆజాదీ వుంటుంది. నిజంగా మాత్రం మొత్తం పాకిస్తాన్ పెత్తనమే. ఇంకా దారుణం ఏంటంటే... గత కొన్ని సంవత్సరాలుగా పాక్ తన ఆక్రమిత కాశ్మీర్ ను ఉగ్రవాదుల అడ్డగా మార్చేసింది! వందల కొద్దీ టెర్రరిస్టు క్యాంపులు నడుస్తుంటాయి అక్కడ. అలాంటి వాటి మీదే ఈ మధ్య మన ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. రాత్రికి రాత్రి 40 నుంచీ 50మంది ఉగ్రవాదుల్ని తుడిచి పెట్టింది!   ఒకవైపు ఉగ్రవాదులు, మరో వైపు పాక్ సైన్యం... ఇలా రెండు వైపులా దుర్మార్గం, దౌర్జన్యంతో చిక్కి శల్యమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు ఎదురు తిరుగుతోంది. అక్కడి ప్రజలు మొన్న అక్టోబర్ 22న బ్లాక్ డే పాటించారు. ఆ రోజు కాశ్మీర్ ను అనాటి రాజు భారతదేశంలో విలీనం చేశాడు. అది జరిగి డెబ్బై ఏళ్లు కావొస్తోన్నా పీఓకేలోని కాశ్మీరీలకు స్వాతంత్ర్యం రావటం లేదు. పాక్ వాళ్లని రాక్షసంగా బంధించి వుంచుతోంది. అందుకే, కొందరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ తో కలుస్తామంటున్నారు. మిగతా వారు కూడా స్వాతంత్ర్యం కావాలంటున్నారు. రోడ్లపైకి వస్తున్నారు.   పాక్ దౌర్జన్యాలకి వ్యతిరేకంగా గళం విప్పిన కాశ్మీరీలని దారుణంగా హింసిస్తోంది పాక్ సైన్యం. తీవ్రంగా కొట్టడమే కాదు కాల్పులు జరపటం, కిడ్నాప్ లు చేయటం వంటివి కూడా చేస్తోంది. కాని, ప్రపంచం ముందు ఇండియా కంట్రోల్ వున్న కాశ్మీర్ లోనే అరాచకం రాజ్యమేలుతోందని కల్లబొల్లి కబుర్లు చెబుతుంటుంది. సాధారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిగే దాష్టీకాలు బయటకు రావు. కాని, తాజాగా పాక్ సైనికుల దుర్మార్గాల్ని పట్టి చూపించే వీడియో లీకైంది. దీంతో మోదీ సర్కార్ కి అన్ని దేశాల ముందు పాక్ ని దోషిగా నిలబెట్ట గట్టి ఆయుధం దొరికిన్నటైంది.   పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే కాదు బలూచిస్తాన్ లో కూడా పాకిస్తాన్ రక్తపు వరదలు పారిస్తోంది. అక్కడి ప్రజలు ప్రత్యేక దేశమే కోరుకుంటున్నారు. అటు బలూచిస్తాన్ పై, ఇటు పీఓకే పై మోదీ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. రెండు వైపులా పాక్ ను టార్గెట్ చేస్తేనే మన దేశంలో అంతర్భాగంగా వున్న కాశ్మీర్ కి పక్క దేశం పీడ విరగడ అవుతుంది. ఇండియా పీఓకే, బలూచిస్తాన్ ప్రజల పోరాటానికి అన్ని రకాల మద్దతు ఇవ్వాలి...  

లోకేష్ ను చంపుతామని మావోలు మళ్లీ అదే తప్పు చేశారా?

  మావోయిజం... ఇది ఆదర్శాల శంఖాలు, యుద్ధ భేరీల శబ్దాల మధ్య సాగే అమానుష రణం! ఇప్పటికి ఎందరు పోరాట యోధులు పోలీసు తూటాలకు బలయ్యారో లెక్కే లేదు. అలాగే, నక్సల్స్ మందుపాతరలకి ఎన్ని ప్రాణాలు గాల్లో కలిశాయో, ఎన్ని పోలీసుల కుటుంబాలు, ఇన్ పార్మార్ల కుటుంబాలు కుమిలిపోతున్నాయో అంచనా లేదు. దశాబ్దాలుగా రక్తం పారుతూనే వుంది. అయినా రెండు వైపుల నుంచి వెనక్కి తగ్గటం అనే మాట వినిపించటం లేదు. తాజాగా ఏఓబీలో జరిగినా ఎన్ కౌంటర్ మరో మారు మావోయిజంలోని హింసాత్మక ధోరణి బయటకి తీసుకొచ్చింది...    నక్సలైట్లను ఎన్ కౌంటర్ చేసి చంపటం తప్పా ఒప్పొ అనేది పెద్ద చర్చ. ఏకపక్షంగా పోలీసులను, గ్రేహౌండ్స్ ను సమర్థించటం కరెక్ట్ కూడా కాకపోవచ్చు. కాని, అసలు సమస్యంతా మావోలు గన్నులు పట్టడంలో వుంది. తమ ఆశయాలు, ఆదర్శాల కోసం వారు ఆయుధాలు పట్టడంతో సామాన్య జనంలో రాను రాను సానుభూతి తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా, ఒకప్పటిలా ఇప్పుడు యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూపులు చూడటం లేదు. చిన్న పల్లెటూరులోని వాళ్లు కూడా నగరాలకి వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ ప్రైవేట్ ఉద్యోగాల ప్రపంచంలో మావోయిజం చెప్పే సాయుధ పోరాటం, విప్లవం లాంటి మాటలకి చోటే లేదు. అందుకే, రాను రాను యువత నక్సలిజం వైపు వెళ్లటం తగ్గిపోతోంది. క్రమంగా మావోయిస్టు పార్టీ బలహీనపడుతోంది. దానికి తోడు ప్రభుత్వాల ఉక్కుపాదం వున్న కొద్ది పాటి శక్తిని కూడా నీర్వీర్యం చేసేస్తోంది. మొత్తంగా వామపక్ష సాయుధ పోరాటం కోలుకోలేని దెబ్బలు చవిచూడాల్సి వస్తోంది...    యుద్ధంలో తీవ్ర నష్టం ఎదుర్కొంటోన్న మావోయిస్టులు తాజా ఎన్ కౌంటర్ తరువాత ఎప్పటిలానే మరోసారి తప్పు చేశారు. చంద్రబాబును, ఆయన కుమారుడ్ని టార్గెట్ చేశారు. చంపేస్తామని లేఖలో పేర్కొన్నారు. నిజానికి చంద్రబాబు మీద గతంలో చేసిన అలిపిరి దాడే ప్రజల్లో పెద్దగా మద్దతు సంపాదించి పెట్టలేదు. మావోయిస్టులు చెప్పినట్టుగా బాబు అంతటి దుర్మార్గుడే అయితే ఆయనని పదేళ్ల తరువాత కూడా జనం ముఖ్యమంత్రిని చేసే వారు కాదు. ఇక ఇప్పుడు సీఎంని మరోసారి టార్గెట్ చేసి నక్సల్స్ తప్పే చేశారు. దీని వల్ల ప్రజల్లో మావోయిస్టులు హింసాత్మక శక్తులనే అభిప్రాయం బలపడిపోతుంది. అదీ కాక ఇంత వరకూ పార్టీకే పరిమితం అయినా లోకేష్ ను కూడా చంపేస్తామని చెప్పటం మరో రాంగ్ సిగ్నల్. ఆయనకు పోలీసులపై ఎలాంటి అధికారం వుండదు. అప్పుడు లోకేష్ ను ఎన్ కౌంటర్ కు బాద్యుడిగా ఎలా చేస్తారు? పోనీ... చంద్రబాబు కొడుకు అవ్వటం వల్లే మావోలు చంపేద్దామనుకుంటున్నారా? అలా చేస్తే మతోన్మాదంతో మరిగిపోయే పాక్ ఉగ్రవాదులకి , వీరికి తేడా ఏముంటుంది? ఆదర్శాలు, సిద్ధాంతాలు అన్నీ ఎక్కడికి పోయినట్టు?   చంద్రబాబు, లోకేష్ హై సెక్యురిటీతో వుండే వీవీఐపీలు. వాళ్లని చంపటం దాదాపు అసాద్యం. కాని, మావోలు లేఖ ద్వారా తమ కోపాన్ని వెళ్లగక్కారు. రేపు ఎప్పుడైనా గట్టి ప్రయత్నం కూడా చేయవచ్చు కూడా. కాని, అసలు ఇప్పుడు అడవిలోని అన్నలు ఆలోచించాల్సింది ఎవర్ని చంపటం గురించి కాదు... తాము ఎంచుకున్న చంపుతూ పోవటం అనే మార్గం సరైందా? కాదా? జనం మెచ్చుతారా? అని!    మావోయిస్టుల నుంచి వచ్చిన లేఖ నిజమైంది కాకపోవచ్చని కూడా అంటున్నారు కాబట్టి చంద్రబాబు, లోకేష్ ల మీద దాడి విషయం ఇప్పటికి్ప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సింది కాదు. అయినప్పటికీ పోలీసులు ఎప్పటిలానే అప్రమత్తంగా వుండటం మంచిది! ఉనికిని కాపాడుకునే క్రమంలో ఆత్మాహుతి దాడి జరగదనటానికి అవకశం లేదు. ప్రపంచం వ్యాప్తంగా సాయుధ పోరాటాల్లో అది చాలా సార్లు జరిగింది!   

నాయకుడికి చెలగాటం... నేతలకి ప్రాణ సంకటం!

  సామెత పాతదైనా మళ్లీ చెప్పుకోవాల్సిందే! పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణ సంకటం!ఇంతకీ పిల్లి ఎవరు? ఎలుకలెవరు అంటారా? ఆ విషయం తరువాత మాట్లాడుకుందాం గాని... ముందు జగన్ పార్టీ ఎంపీల టెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం...  వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపి కాకుండా వున్న ఏకైక పార్టీ ఆయనదే! ప్రతిపక్షంలో అయితే రెండో పార్టీనే లేదు. మొత్తమంతా ఆయనే, ఆయన ఎమ్మేల్యేలే! నిజానికి ఇలాంటి పరిస్థితి చాలా గొప్ప అవకాశం. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం చాలా తేలిక. అసెంబ్లీలో , బయట తనకున్న అనేక మంది ప్రజా ప్రతినిధులతో అద్భుతంగా పోరాటాలు చేయవచ్చు. కాని, యువనేత అలాంటిదేం చేస్తున్నట్టు లేదు. పైగా అనాలోచిత నిర్ణయాలు, ప్రకటనలతో స్వంత పార్టీ నాయకుల్నే బెంబేలెత్తిస్తున్నారు. దూరం చేసుకుంటున్నారు.    దివంగత వైఎస్ తనయుడుగా జనంలో వున్న క్రేజ్, సానుభూతి అన్నీ కలుపుకుని జగన్నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేత అయ్యారు. ఆయన నేరుగా సీఎం అవ్వాలని అనుకున్నా జనం చంద్రబాబుకి పట్టం కట్టారు. అయితే, అపోజిషన్ గా వైసీపీ తగిన పాత్ర పోషించటం లేదని మొదట నుంచీ ఆరోపణ వుంది. తాజాగా ప్రత్యేక హోదా రచ్చ మరోసారి జగన్ నాయకత్వ పటిమపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు తన ఎంపీలు రాజీనామా చేస్తారని బాంబు వేశారు. ఇమీడియెట్ గా కాకున్నా శీతకాల పార్లమెంట్ సమావేశాల తరువాత రిజైన్ చేస్తారని ఆయన సెలవిచ్చారు! కాని, ఇందులో ట్విస్ట్ ఏంటంటే... అలా రాజీనామా చేయాలని మనందరితో పాటూ వైసీపీ ఎంపీలకు కూడా అప్పుడే తెలిసింది. టీవీల్లో లైవ్ చూస్తూ జగన్ మాటలు విన్న వారంతా దెబ్బకి షాకయ్యారట!   ఎన్నికల్లో జనం జగన్ ముఖం చూసి ఓటేసినా, వైఎస్ బొమ్మ చూసి గెలిపించినా ఎంపీలుగా గెలవాలంటే డబ్బులు ఖర్చు చేయాలా వద్దా? బోలెడు చేయాలి. కోట్ల రూపాయలు చిత్తు కాగితాల్లా విసరాలి. అలా చేస్తేనేగాని ప్రస్తుతం వైసీపీ ఎంపీలుగా వున్న వారు గెలవలేదు. వాళ్లే కాదు అన్ని పార్టీల వారు అదే చేస్తున్నారు. కాని, జగన్ నాయకత్వంలోని ఎంపీలకు మాత్రం ఊహించని విధంగా బంపరాఫర్ తగిలింది! ఆయన ఎవరితోనూ చర్చించకుండా రాజీనామా అనౌన్స్ మెంట్ చేశారట నిండు సభలో! ఒకవేళ ఆయన అన్నమాటే నిజమైతే... ఎంపీలుగా వున్న వారు మళ్లీ కోట్ల రూపాయలు సూట్ కేసుల్లో సర్దుకోవాలి. అవన్నీ ఎవరిస్తార్రా దేవుడా అనుకుంటున్నారట వారు!   వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి వుంది. అందులో చర్చించిగాని కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. కాని, అది ఇప్పటి వరకూ జగన్ ఏర్నాటు చేయలేదట. ఎప్పుడో ఒకట్రెండు సార్లు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పొలిటికల్ అడ్వైజర్ కమిటీతో సంబంధం లేకుండానే అధినేత డిసీషన్ తీసుకుంటారట. వైసీపీ ఎంపీలు, ఎమ్మేల్యేలు వాట్ని మారు మాట్లాడకుండా ఫాలో అయిపోవాలి. కాని, ఏవో చిన్నా చితకా నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు అంటే ఓకే. కాని, తమకు చెప్పుకుండా ఏకంగా రాజీనామాల నిర్ణయం జగన్ ఎలా తీసుకుంటారని నేతలు లోలోన ఉడికిపోతున్నారు. ఒకవేళ రేపు రాజీనామాల కారణంగా ఉప ఎన్నికలు వస్తే తిరిగి గెలుస్తామన్న గ్యారెంటీ కూడా లేదని వారు మథనపడిపోతున్నారు...   తెలంగాణలో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉప ఎన్నికలు తీసుకొచ్చే వారు. అక్కడ జనం కూడా సెంటిమెంట్ కి విలువనిచ్చి ఓట్లు వేసేవారు. కాని, ఆంద్రాలో ప్రత్యేక హోదాకి అంత సీన్ వుందా? జనం ఆల్రెడీ ప్యాకేజ్ వచ్చాక కూడా హోదా కావాలని సీరియస్ గా డిమాండ్ చేస్తారా? అంత సెంటిమెంట్, కోరిక వుంటే పరిస్థితి ఇంత సైలెంట్ గా వుండేదా? బీజేపీ, టీడీపీ ప్యాకేజ్ గురించి ఇప్పటికే జనానికి తమకు చేతనైనంత వివరంగా చెప్పేశాయి కదా? ఇలా బోలెడు ప్రశ్నలు వైసీపీ ఎంపీల్ని తొలిచేస్తున్నాయట! ప్రస్తుతానికి ఎవ్వరూ బయటపడటం లేదుగాని జగన్ తమలో ఎవరికీ చెప్పకుండా రాజీనామా నిర్ణయం తీసుకోవటం అందర్నీ ఇబ్బంది పెడుతోందట. తమ భవిష్యత్ తో ఇలా ఆటాలు ఆడుకోవటం సబబు కాదని వారు దగ్గరి వారితో వాపోతున్నారు. చూడాలి మరి... జగన్ ప్రకటించిన రాజీనామాల నిర్ణయం వైసీపీలో ఎంతటి తుఫాన్ అవుతుందో! చివరకు, అసలు రాజీనామాలే చేయకుండా టీ కప్పులో తుఫాన్ గా మార్చేసిన మార్చవచ్చు! ఎందుకంటే, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు రాజీనామా చేసినా, ఎన్ని రాజీనామాలు చేసినా హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఆల్మోస్ట్ చెప్పకనే చెప్పేసింది కదా...   

మళ్లీ వచ్చిన 'హోదా' సీజన్!

దాదాపు దశాబ్దమున్నర కాలం తెలుగు నేల ప్రత్యేక రాష్ట్రం నినాదాలతో దద్ధరిల్లింది! ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం స్థానంలో ప్రత్యేక హోదా మార్మోగుతోంది! తెలంగాణ వాదులు యూపీఏను ముప్పతిప్పలు పెట్టి రాష్ట్రం సాధించుకుంటే ఆంధ్రా నేతలు, ఉద్యకారులు, సినిమా వాళ్లు ... ఇలా అందరూ ఎన్డీఏను టార్గెట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీజేపికి, మోదీకి ప్రత్యేక హోదా పెద్ద కొరకరాని కొయ్యలా మారిపోయింది!   నిజానికి ఆ మధ్య వెంకయ్య నాయుడు, తెలుగు దేశం పార్టీ నేతలు కొందరు ఢిల్లీలో చాలా హడావిడి చేశారు. దాని ఫలితమే ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజ్. కాని, బీజేపి అద్భుతం అంటూ చెబుతోన్న ప్యాకేజ్ పై టీడీపీ మనస్ఫూర్తిగా స్పందించలేదు. ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూనే ఇంకా కావాల్సింది వుందని చెప్పింది. ఇలా బీజేపి, టీడీపీల మధ్య ఫ్రెండ్లీ రాజకీయాలు నడుస్తుండగానే పవన్ , జగన్ తమ పని తాము చేసుకుపోతున్నారు. మైక్ చేతికి దొరికినప్పుడల్లా ప్రత్యేక హోదా అంటూ జనాల్ని అలెర్ట్ చేస్తున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు వస్తుండటంతో ఇప్పుడు మరోసారి హోదా పాలిటిక్స్ మొదలయ్యాయి...    ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాని మన గబ్బర్ సింగ్... పవన్ కళ్యాణ్ వున్నట్టుండీ మూడో సభ అన్నాడు. అసలు తిరుపతి , కాకినాడ మీటింగ్ ల తరువాత ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారో ఎవరికీ అర్థం కాలేదు. పైగా కాకినాడలో ఒక అభిమాని చనిపోవటంతో మళ్లీ సభలుండవని కూడా అన్నాడు. కాని, ఇప్పుడు ఏమైందోగాని అనంతపురంలో పబ్లిక్ మీటింగ్ ప్రకటించాడు. అది కూడా స్పెషల్ స్టేటస్ కోసమే అని క్లారిటీ ఇచ్చాడు!   హోదా ఇవ్వటం కుదరదని మోదీ గవర్నమెంట్ ఇప్పటికే తేల్చేసింది. నీతి ఆయోగ్, ప్లానింగ్ కమీషన్ ఇలా చాలా కారణాలే చూపించింది కూడా! అందుకే, ఆంద్రాలో చిన్న పిల్లలు కూడా స్పెషల్ స్టేటస్ చాప్టర్ ఓవర్ అనుకున్నారు. కాని, పవన్ రంగంలోకి దిగి మళ్లీ హోదా అంటుండటంతో ప్రతిపక్ష నేత జగన్ కూడా అలెర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ యూత్ ను పోగేసి హోదా కావాల్సిందేనని స్పీచ్ లు ఇస్తున్నాడు. ఇంకా ఓ అడుగు ముందుకేసి తన పార్టీ ఎంపీలు అవసరమైతే రాజీనామాలు చేస్తారని ఆఫర్ ఇచ్చాడు కూడా!    హోదా కోసం పవన్ , జగన్ ఎవరి పొలిటికల్ స్టెప్పులు వారేస్తుంటే చంద్రబాబు మరో వైపు నుంచి నరుక్కొస్తున్నారు. ఇచ్చిన ప్యాకేజ్ కు చట్టబద్ధత కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఊరికే హామీలు ఇవ్వటం కాకుండా పార్లమెంట్లో భరోసా ఇవ్వాలంటున్నారు. జైట్లీ లాంటి మంత్రులు ప్యాకేజ్ చట్టబద్ధతపై ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఇది జరిగితే హోదాపై పవన్, జగన్ ఎలాంటి పోరాటాలు చేసినా టీడీపీ క్రెడిట్ టీడీపికి దక్కుతుందని ఆయన కాలిక్యులేషన్...   చంద్రబాబు, పవన్, జగన్ ... ఇప్పుడు మరోసారి అందరూ హోదా, ప్యాకేజ్ లపై దృష్టి సారించారు. పార్లమెంట్ సమావేశాలే దీనికి కారణం అనేది క్లియర్. మరి ఢిల్లీ పెద్దలు ఈ హోదా ఫీవర్ కి ఎలాంటి మందు వేస్తారో చూడాలి! లేదంటే ఎప్పటిలానే టెంపరరీగా ప్యారసెటమాల్ పరిష్కారం ఏదైనా చూపుతారేమో...   

చైనా... అ దేశమంతే! అదో టైపు...

చైనా అనగానే ఇండియన్స్ కి అదో లాంటి ఫీలింగ్ కలుగుతుంది. కారణం... డ్రాగన్ మనల్ని పదే పదే మోసం చేయటమే! ఇప్పటి వరకూ ఇండియా ఓడిన ఏకైక యుద్ధం చైనాతోనే. మనం కొంత భూభాగం కూడా కోల్పోయాం. అంతే కాదు, చైనా పాకిస్తాన్ తో కలిసి చేసే న్యూసెన్స్ కూడా ఇండియాకి చిరాకు పుట్టించేదే. మొన్నటికి మొన్న ఉరీ ఉగ్రదాడి తరువాత కూడా అంతర్జాతీయంగా ఒంటరైన పాక్ కు అండగా నిలిచిన ఏకైక కరుడుగట్టిన దేశం చైనా! అయితే, చైనా కేవలం ఇండియానో, మరో దేశాన్నో విసిగిస్తుంది అనుకుంటే పొరపాటే. తన స్వంత ప్రజల్ని కూడా చైనా గవర్నమెంట్ , అధికార పార్టీ ఒక ఆటాడుకుంటున్నాయి...    చైనాలో మన దగ్గరిలా బోలెడు పార్టీలుండవు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనానే ప్రధానమైన పార్టీ. దానిదే అధికారం. పైగా ప్రజలకి ప్రజాస్వామ్యంలో వున్నట్టు అత్యధిక స్వేచ్ఛ కూడా వుండదు. చైనీయులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం చాలా స్వల్పం. అలాగే, ఎన్నికల్లో ఓట్లతో సాధించేది కూడా పెద్దగా ఏం వుండదు. ప్రతీసారి కమ్యూనిస్ట్ పార్టీనే మళ్లీ మళ్లీ ఎన్నికైపోతుంటుంది. మొత్తంగా చూస్తే చైనాలో వుండేది కమ్యూనిజం పేరుతో నడిచే నిర్బంధం....    చైనాలో ప్రజాస్వామ్యం లేకపోవటం, చాలా సార్లు అక్కడి పాలకులు విధించే నిర్భందం ఇవన్నీ కొత్త అంశాలేం కాదు. కాని, తాజా షాకింగ్ న్యూస్ ఏంటంటే... అక్కడ అధికార పార్టీ 70కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ పై నిఘా పెట్టనుందట! మన దగ్గర ఆ మధ్య పోర్న్ సైట్లు కొన్ని నిషేదిస్తేనే ఎంత గొడవైపోయిందో గుర్తుందిగా? కాని, చైనాలో కమ్యూనిజం ముసుగులో ఏకంగా జనాలపై నిరంతర నిఘా పెట్టనున్నారట!    చైనాలోని సోషల్ మీడియా యూజర్స్, ఇతర ఇంటర్నెట్ యూజర్స్ అంతా కలిపి 70కోట్లకు పైగా వుంటారు. వీళ్లందరిపై ప్రభుత్వం కూడా కాదు అధికార పార్టీ దృష్టి పెట్టబోతోంది. అనేక అంశాలు, రూల్స్ ఆధారంగా సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఏర్పాటు చేసి జనానికి గ్రేడింట్ ఇస్తారట. ఏ గ్రేడ్ వచ్చిన వారికి ప్రభుత్వం నుంచీ, పార్టీ నుంచీ అన్ని వసతులూ అందుతాయి. డి గ్రేడ్ వచ్చిన వారికి ఎలాంటి సౌకర్యాలు, ప్రొత్సాహం వుండవు! అయితే, ఈ గ్రేడింగ్ ఇయ్యటానికి తల్లిదండ్రుల్ని చూసుకోకపోవటం, ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయటం, సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేయటం వంటి పనులు చేశారా లేదా అని చెక్ చేస్తారట. చేస్తే మాత్రం వారికి గ్రేడ్ తగ్గిపోతుంది. ఏ నుంచి డి వరకూ పతనం అవుతూ వస్తుంది. ఎంత గ్రేడ్ పడిపోతే సదరు చైనీస్ సిటీజన్ కి అంత గండంగా మారుతుంది జీవితం! ప్రభుత్వం నుంచీ ఎలాంటి ప్రోత్సాహమూ వుండదు వారికి!   అసలు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ వారికి జనాన్ని మంచోళ్లు, చెడ్డోళ్లుగా విభజించే హక్కు ఎక్కడిది? అదీ సోషల్ మీడియా లాంటి డూప్లికేట్ ప్రపంచంలో ఏ ఆధారంగా న్యాయ నిర్ణయం చేస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు. అన్నిటికంటే ముఖ్యంగా జనం పై నిరంతర నిఘా పెట్టడం సమంజసమేనా? అడిగేవాడే లేడు చైనాలో. ఎవరన్నా జనం నిరసన తెలుపుతూ రోడ్డుపైకి వస్తే వాడి ప్రాణానికే ప్రమాదం కమ్యూనిస్టు కంట్రీలో. అందుకే, రాజ్యం చేసే దౌర్జన్యాన్ని ఇప్పటికైతే కోట్లాది చైనా జనం నోరు మూసుకుని భరిస్తున్నారు! ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి...