పేకాట రాయుళ్ల పరారీ కేసులో సిఐ, ఎస్సై సస్పెన్షన్

 పేకాటరాయుళ్ల పరారీ కేసులో నందిగామ సీఐ నాదెండ్ల మురళీకృష్ణ, కంచికిచర్ల ఎస్సై శివశంకర్ లను ఏలూరు రేంజ్  డిఐజి సూర్యప్రకాశరావు సస్పెండ్ చేశారు. రెండునెలల క్రితం కంచికిచర్ల సమీపంలోని ఉమా హాలిడే ఇన్ పై దాడిచేసిన  పోలీసులు 44మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తీసుకొస్తుండగా 14 మంది నిందితులు పరారుకావడం కలకలం రేపింది. ఎస్పీతో విచారణ జరిపించి పదిమంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వుల అమలుని నిలిపేశారు. ఈ ఘటనకు సీఐ, ఎస్సై లను బాధ్యులుగా భావిస్తూ ఇద్దరిపై సస్పెన్షన్ వేటువేశారు. 

వయలార్ రవితో కిరణ్ భేటీ

                                                                                                                                                                                              కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రథాని మన్మోహన్  సింగ్ లతోకూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే మకాంపెట్టి అధిష్ఠానంతో చర్చలు జరుపుతుండడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకునేందుకే అధిష్ఠానం కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం పాలనకు సంబంధించిన విషయాల్ని తెలుసుకునేందుకే సీఎంని ఢిల్లీకి పిలిపించామని చెబుతోంది. బొత్సకు పదవీగండం, ధర్మాన రాజీనామా విషయాలపైకూడా ఢిల్లీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయ్.        

జగన్‌ కార్యాలయంగా మారిన చంచల్‌గూడ జైలు?

ఒక రిమాండు ఖైదీతో ప్రవర్తించినట్లు చంచల్‌గూడజైలు అధికారులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహనరెడ్డితో ప్రవర్తించటం లేదు. నిబంధనల ప్రకారం అనుమతించాల్సిన ములాఖత్‌ల కన్నా అదనంగానే ఆయనకు జైలు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా విఐపి ఖైదీలందరి లోనూ జగన్‌ను ప్రభుత్వ అతిధిగా చూసుకుంటున్నారు. ఆయన కోరిన తిండి సదుపాయం కల్పిస్తున్నారు. అలానే జ్యూస్‌లూ అందిస్తున్నారు. కొత్తగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కాలుమోపాలనుకునే వారికి చంచల్‌గూడాజైలులో ముందు వరసలో ములాఖత్‌ కల్పిస్తున్నారు. అసలు రోజుకు ఎన్ని ములాఖత్‌లు జరిగినా జైలు అధికారులు ఆయనను ఇష్టపడి మరీ అవకాశం కల్పిస్తున్నారు. ఎవరో అన్నట్లు సేవ చేయవచ్చు కానీ, బానిసచాకిరీలు ఎందుకు అని ఎవరన్నా కూడా జైలు అధికారులు స్పందించటం లేదట. ఇప్పటికే రోజూ ఈ జైలుకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగిపోతోందని, ఒక్కోసారి ట్రాఫిక్‌ సమస్య కూడా ఎదుర్కొంటున్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ, జైలు అధికారులు మాత్రం ములాఖత్‌ల సంఖ్య పెంచటానికి వీలులేదన్న కోర్టు తీర్పునూ బేఖాతరు చేస్తున్నారు. రోజూ జగన్‌ను కుటుంబసభ్యులు, అభిమానులు, కొత్తగా పార్టీలో చేరాలనుకున్న వారు కలుస్తున్నారు. చంచల్‌గూడ జైలు బయట నుంచి చూసేవారికి ఆ జైలు జగన్‌ కార్యాలయమా అనే అనుమానం వస్తోంది.

‘చిరు’కు పీసిసి అప్పగిస్తే కేంద్రమంత్రి పదవి హుష్‌కాకేనా?

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ చిరంజీవికి తాజాగా పీసిసి చీఫ్‌ అయ్యే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న అఖిలభారత కాంగ్రెస్‌ నేతలకు తలనొప్పిగా మారింది. అయితే అందరూ మాత్రం పీసిసి కళ్లాలు చిరంజీవికి అప్పగిస్తే మటుకు కేంద్రమంత్రి పదవి గురించి మర్చిపోవాలన్న విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిసింది. జోడు పదవులు ఇస్తే రాజ్యసభలో రాష్ట్ర అంశాలపై చిరంజీవి రగడ చేసే అవకాశాలున్నాయని నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన రెండుస్థానాల్లోనూ మాజీ పీఆర్పీనేతలు ఉండటంతో చిరంజీవి తన వాచాలతను ప్రదర్శించారని సోనియా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎక్కువ అవకాశాలు కల్పిస్తే తమను చిరంజీవి లెక్కచేయకపోవచ్చనే ఢల్లీ నేతలు సోనియాతో చర్చిస్తున్నారు. అయితే మేడమ్‌ దృష్టిలో చిరంజీవికి పీసిసి అప్పగించాలని ఉందని, అందుకే చర్చను ఇంకో రోజు పొడిగించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారని తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవి కాకపోతే సౌమ్యంగా పార్టీని నడపగల నేతల జాబితానూ ఎఐసిసి పరిశీలిస్తోంది. దానిలో మంత్రి కన్నాలక్ష్మినారాయణ, జెసి దివాకరరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. అలానే తెలంగాణా ప్రాంతం నుంచి మంత్రి జానారెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణా గొడవలను అదుపు చేయటానికి జానారెడ్డికి పీసిసి చీఫ్‌ ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించాలని రాష్ట్రం నుంచి సూచనలు వెళ్లాయి. ఏమైనా ఇంకో రెండు రోజుల్లో కొత్తచీఫ్‌ పేరును ఎఐసిసి ప్రకటించనున్నది. అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, జార్కండ్‌ రాష్ట్రాల పీసిసి చీఫ్‌లు కూడా మారుతారని తెలిసింది.

సత్తిబాబుకు షాక్‌ట్రీట్‌మెంట్‌ తప్పదా?

పీసిసి చీఫ్‌ బొత్సా సత్యన్నారాయణ(సత్తిబాబు)కు కాంగ్రెస్‌ అధిష్టానం షాక్‌ ‘ట్రీట్‌’మెంట్‌ ఇచ్చేలా ఉంది. ఇటీవల చాలా విషయాల్లో ఆయన సీఎంతో విభేదించి చేసిన పత్రికాప్రకటనలతో దొరికిపోయారు. అవన్నీ ఒకవైపు పార్టీకి, రెండోవైపు ప్రభుత్వానికీ ఇబ్బందికరంగా పరిణమించాయని అధిష్టానం కూడా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏకీభవించింది. అందుకని ఆయన్ని పార్టీ పదవి అంటే పీసిసి చీఫ్‌ స్థానం నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకుందని తాజా సమాచారం తేటతెల్లం చేస్తోంది. ఇప్పటి దాకా సీఎంపై ఒంటికాలిపై లేచిన సత్తిబాబు పదవి మారుతోందన్న విషయం తెలిసి డిఫెన్స్‌లో పడి చివరాఖరుగా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం.     ఎఐసిసి నేత వాయలార్‌రవికి తనను కాపాడే బాధ్యతను అప్పగించేందుకు సత్తిబాబు తెగకష్టపడ్డారని తాజా సమాచారం. అయితే వాయలార్‌రవి కూడా తెలివిగా అవకాశముంటేనే చూడగలనని తప్పించుకున్నారని తెలుస్తోంది. దీంతో తనకు ఇతర నేతలతో ఉన్న పరిచయాలను కూడా సత్తిబాబు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అకస్మాత్తుగా అధిష్టానం నిర్ణయం మార్చుకోవటానికి మాత్రం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢల్లీి పర్యటనే కారణమని విశ్లేషకులు తేలుస్తున్నారు. బొత్సా తరువాత రేసులో ఉన్న నేతల జాబితాను ముందేసుకుని ఎఐసిసి నేతలు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మేడమ్‌ సోనియాతో మాట్లాడటానికి ముందుగానే నేతలు ఈ హోంవర్కు చేస్తున్నారు. ఈసారి ప్రకటించే నేత 2014 ఎన్నికల నేపథ్యానికి సహకరించేలా ఉండాలని మైనస్‌, ప్లస్‌లు నేతల పేర్ల పక్కన రాసుకుని దాన్ని మేడమ్‌తో చర్చించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండురోజుల సుదీర్ఘచర్చ తరువాతే కొత్తనేత పేరు ప్రకటించాలని కాంగ్రెస్‌అధిష్టానం భావిస్తోందట. ఏమైనా బొత్సా తనకు జరుగుతున్న ఈ షాక్‌ట్రీట్‌మెంట్‌తో దారి కొస్తారా? లేక పక్కదారి పడతారా? అని పలువురు నేతలు గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు.

ఎర్రబెల్లి ఎందుకు చిందులేస్తున్నారు?

ఏమిటో తెలుగుదేశం సారధ్యబాధ్యతలన్నీ ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావే మోసేస్తున్నట్లున్నారు. అంతకష్టపడి మోయటం వరకూ బాగానే ఉంది కానీ, తాము ప్రతిపక్షమన్న విషయం కూడా ఆయన మరిచిపోయినట్లున్నారు. అందుకే ముందురోజేమో పంజాగుట్ట పోలీస్‌స్టేషనులో విద్యుత్తు సమస్యపై కారాలు, మిరియాలు నూరిన దయాకరరావు రెండో రోజుకే కరిగిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ పాపం ఆ విద్యుత్తుశాఖను నడపలేకపోతోంది కాబట్టి తమకు అప్పగించేయాలని దయాకరరావు ప్రభుత్వంపై దయతలచారు. ఇంతకీ తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా విదేశాలకు వెళ్లినప్పుడే ఎర్రబెల్లి ఎందుకు అంతబాగా ఫైరయ్యారు? ఓ తమ నేత వచ్చేటప్పటికీ తానే హాట్‌ సబ్జెక్టు అవ్వాలనుకున్నారేమో! అంత వరకూ ఓకే కానీ, ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రభుత్వంలో ఒకశాఖను తమకు అప్పగించటం ఎంత వరకూ కరెక్టు? పోనీ ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దయాకరరావు మీద దయతలచి ఆ శాఖను అప్పగించాలంటే ఆయన ఏమి చేయాలి? అసలు దయాకరరావు ఒక్కసారైనా ఆలోచించి మాట్లాడావా? అని రాష్ట్రం మొత్తం ఈయన రెండు రోజుల చేష్టలు చూసి ప్రశ్నిస్తోంది. తెలుగుతమ్ముళ్లు మాత్రం దయాకరరావు మీద దయచూపారు లేకపోతే ఈపాటికి ఫోన్లుతో ఆయన్ని ఊదరగొట్టి చంపేసేవారే కదా! మళ్లీ తెరపైకి, మీడియా దగ్గర కొచ్చి ఆ శాఖను అప్పగించమంది ఆవేశంలోనే అని తప్పుదిద్దుకునే అవకాశం తమ్ముళ్లు ఆయనకు ఇవ్వలేదు. మరి బాబు తిరిగి వచ్చాక ఈయన్ని సంస్కరిస్తారో లేక తాను కూడా కాంగ్రెస్‌ పార్టీని విద్యుత్తు శాఖ ఇచ్చేయమని కోరుతారో చూద్దాం!

జనం సొమ్ము పోస్టాఫీసులపాలు!

ఏడొందల యాభైకోట్లు.. ప్రజాధనం.. నిరుపయోగంగా పడుంది.. ఇప్పుడా డబ్బు పరిస్థితి న ఘరకా.. న ఘాట్ కా అన్నట్టుగా తయారైంది. ఇంతకీ ఎక్కడుందా డబ్బు..? ఎందుకలా నిరుపయోగంగా పడుంది..? ఎవరు దాచిపెట్టారో.. ఎందుకలా పడుందో చెప్పడం కష్టమే కానీ ఆ డబ్బు గుట్టలు, కొండలుగా పేరుకుపోతోందన్న నిజాన్ని మాత్రం బల్లగుద్ది మరీ చెప్పేయొచ్చు. సరదాగా నెలకింత పొదుపుచేస్తే ఎప్పుడో ఓ సారి అక్కరకొస్తుందిరా అబ్బాయ్.. అంటూ అమ్మలు కొడుకులచేత కట్టించిన డబ్బు.. కొడుకులు ఖర్చులకని ఇచ్చిన డబ్బుని దాచిపెట్టి కొంతమొత్తమయ్యాక తిరిగి వాళ్లకే ఇచ్చేద్దామని, తల్లులూ, తండ్రులూ సేవ్ చేసిన డబ్బు. నెలకింత చొప్పున దాచిపెట్టుకుని ఎవరికీ చెప్పాపెట్టకుండా బాల్చీ తన్నేసిన వాళ్ల డబ్బు.. ఎప్పుడో ఏళ్ల క్రితం జమచేసి ఇప్పుడు పూర్తిగా దానిగురించి మర్చిపోయినవాళ్ల డబ్బు.. ఏదైతేనేం.. ఇలా ఎవరెవరో, ఎక్కడెక్కడో పోస్టాఫీసుల్లో జమచేసిన బోల్డంత డబ్బు పోస్టాఫీసుల్లో అనామతు ఖాతాల్లో మూలుగుతోంది.   

ఉప్పల్ స్టేడియంలో రచ్చ రచ్చ!

 అనుకున్నంతా అయ్యింది. బోల్డు రూపాయలు పోసి కొనుక్కున్న టిక్కెట్లు నిరుపయోగమైపోయాయ్. ఆన్ లైన్ లో టిక్కెట్లు కొనుక్కున్న అభిమానుల్ని పోలీసులు స్టేడియంలోకి అనుమతించలేదు.. సరికదా జింఖానాకు వెళ్లండంటూ ఆదేశాలు జారీ చేశారు. డబ్బుపోసి టిక్కెట్లు కొనుక్కుని కష్టాలు కోరి తెచ్చుకున్నట్టైందని కొందరు లెంపలేసుకుని ఇంటిదారి పడితే.. బాధను బైటపెట్టుకోలేకుండా ఉండలేని కొందరు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లని అక్కడ్నుంచి తరిమేసేదాకా ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. అరిచీ అరిచీ అలసిపోయిన అభిమానులుకూడా చేసేదేంలేక చివరికి ఇంటిదారి పట్టారు. డబ్బుపోయి శని పట్టడమంటే ఇదేనేమో..   

పాన్ నెంబర్ చోరీ స్కామ్!

తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు పాన్ నెంబర్ ఇస్తున్నారా..? కాస్త ఆలోచించండి! మీ పాన్ నెంబర్ ని ఎవరైనా అక్రమంగా వినియోగించుకునే ప్రమాదం ఉంది.. ఎలా అంటారా..? టిక్కెట్ కోసం ఇచ్చిన పాన్ నెంబర్ ని రైల్వే శాఖ బోగీమీద అంటించే చార్ట్ లో పేరుపక్కన ముద్రించడం వల్ల.. ఎవరుపడితేవాళ్లు పరాయి పాన్ నెంబర్లను కొట్టేస్తున్నారు. వాటిని ఎక్కడపడితే అక్కడ కోట్ చేసి పబ్బం గడిపేసుకుంటున్నారు.    ముఖ్యంగా నగల వ్యాపారులకు దో నెంబర్ దందాకోసం పరాయివాళ్ల పాన్ నెంబర్లు విరివిగా అవసరమౌతున్నాయట. తాజాగా కొందరు ఇలా బోగీమీద చార్ట్ లో ఉన్న నెంబర్లను సేకరిస్తుండగా కొందరు ప్రయాణికులు చూసి పట్టుకున్నారు. గట్టిగా నాలుగు తగిలించి ఆరాతీస్తే అసలు బండారం బైటపడింది. రెండు లక్షల రూపాయలకంటే ఎక్కువ మొత్తం చెల్లించి నగలు కొనుక్కునేవాళ్ల దగ్గర్నుంచి కొత్త ఫైనాన్స్ చట్టం ప్రకారం వ్యాపారులు పన్నును సేకరించాలి. అలా జరక్కుండా ఉండాలంటే ప్రతిసారీ మరో కొత్త పాన్ నెంబర్ని కోట్ చేయడమే మార్గమని చాలామంది వ్యాపారులు భావిస్తున్నారు.      దో నెంబర్ దందా చేసే బంగారం వ్యాపారులు ఇలా సేకరించి ఇచ్చిన పాన్ నెంబర్లకు ఒక్కోదానికీ పదేసి రూపాయల చొప్పున చెల్లించి అడ్డదారిలో సేకరించి విచ్చలవిడిగా తమ అవసరాలకోసం వాడుకుంటున్న విషయం బైటపడింది. రైలు టిక్కెట్టుమాట దేవుడెరుగు.. మరొకరెవరైనా పాన్ నెంబర్ ని అడ్డదారిలో వాడుకుంటే లేనిపోని తిప్పలు ఎదురౌతాయేమోనని చాలామంది ప్రయాణికులు భయపడుతున్నారు.   

గోపాల్ కందా గీతికను హర్ట్ చేశాడా!

 ఎయిర్ హోస్టెస్ గీతికాశర్మ ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాని పెళ్లాడలేకపోయానన్న దిగులుతోనే ఆమె ప్రాణాలు తీసుకుందన్న వదంతులు గట్టిగా వ్యాపిస్తున్నాయి. గోవాలో కందా కేసినోలో పనిచేస్తున్న మరో యువతితోకూడా కందాకి దగ్గరి సంబంధాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనివల్లే గీతిక మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుందన్న ప్రచారం జోరుగా పాకిపోతోంది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ప్రియుడు మరో భామతో ఎఫైర్ నడపడాన్ని గీతిక జీర్ణించుకోలేకపోయుంటుందని ప్రచారం జరుగుతోంది.

దయచేసి... కనిపెట్టండి!

‘మా చంటాడి మందుపట్టే ఉగ్గుగిన్నె కనిపించలేదు అక్కయ్యా’ అని ఒకరంటే.. మొన్నటి నుంచి మా ఆయన ఉంగరం కనిపించ లేదు. ఎక్కడ పెట్టారో ఏమో...అన్న సంభాషణలు అప్పుడప్పుడు చుట్టుప్రక్కల వారినుండి వినే ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని లోకోషెడ్‌కు చెందిన రైలింజన్‌ నాలుగునెలలు గా కనిపించడం లేదని సంబంధిత అధికారులు ప్రకటించారు. ఎట్టకేలకు ఈ రైలింజన్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ముంబై సమీపంలోని కళ్యాణ్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆ కనిపించకుండా పోయింది నల్లపూసేం కాదు..., విరిగిపోయిన రైలు పట్టా అసలే కాదు.... ఏకంగా రైలింజన్‌...! అంత పటిష్టంగా భద్రతాచర్యలున్నాయి మరి...! ఈ సంఘటనపై సంబంధిత అధికారులను సస్పెండ్‌ చెయ్యడం అనేదానికంటే, కనిపించకుండా పోవడానికి మూలమైన భద్రతాలోపాలను గుర్తించి అందుకు కావలసిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే బావుంటుంది. ఇలాంటి ఆలోచనలు ఏలినవారికి అస్సలు కలగవంటే కలగవుమరి...!

బాధ్యత లేని మనుష్యులా!

ఒకప్పుడు సినిమాలంటే ఇంటిల్లిపాది కూర్చుని ఆనందంగా చూసేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో కలిసిచూడాలన్నా, తోబుట్టువులతో చూడాలన్నా ఆలోచించాల్సి వస్తున్న రోజులివి. అలా వుంటున్నాయి నేడు అధిక సినిమాలు. వీటికి తోడు సంఘంలో అన్ని వృత్తులపైన, వ్యక్తుల మీద చులకన భావం పెరిగిపోతోంది. తల్లిదండ్రులను కూడా సినిమాల్లో పేర్లతో పిలిపిస్తూ అదో కొత్తదనంగా చూపించే రోజులివి. సంఘంలో ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ, అర్చక తదితరాలను సైతం హాస్యంపేరుతో వ్యంగ్యాన్ని జతచేసి సినిమాల్లో పాత్రలను రూపొందించడంతో వాటి ప్రభావం వల్ల యువతలో ఆయా వృత్తులలోని వ్యక్తులపై సైతం చులకనభావం నెలకొంది. తల్లిదండ్రులతో సమానమైన గౌరవాన్ని పొందే ఉపాధ్యాయ వృత్తికి సైతం ఆ జాఢ్యాన్ని అంటించి యువతను ఆకర్షించేందుకు, పలురకాల అసభ్య, అవమానకరరీతిలో పేర్లను పెడుతూ సినిమాలను తీయడం అన్నది ఎంతవరకు సమంజసమో ఆయా చిత్ర దర్శకనిర్మాతలు ఆలోచించాలి. అటువంటి సినిమాలు తయారుచేయడం, దానిపై ఆందోళనలు నేడు పరిపాటిగా మారిపోతోంది. నైతికవిలువలన్నది సినిమా తీసే వారికి ముఖ్యమన్నది పెద్దలమాట. సినిమాల్లో సంఘంలో గౌరవప్రదమైన వృత్తులను హాస్యంపేరుతో చులకనగా చూపించకుండా, అటువంటి హాస్యాన్ని సినిమాల్లో లేకుండా పరిశ్రమలోని పెద్దలు ఆలోచించాలని, ఆదాయమే ప్రధానమైన ధ్యేయంతో సినిమాలు నిర్మించవద్దని మంచిని కోరుకునే సగటు ప్రేక్షకుని విన్నపం.

వెయిట్‌ అండ్‌ సీ.. యేనా!

భయం కావచ్చు... లేదా ఇతరులు చేసిన పనులకు మేం బలి అవుతున్నామన్న బాధ కావచ్చు... ఏదేమైనా జగన్‌ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేయడం, ఆ వెంటనే ఆయన రాజీనామా, ఆయన్ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం వెంటవెంటనే జరిగిన నేపథ్యంలో .. ధర్మాన విషయంలో జరిగింది రాబోయే కాలంలో తమకు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్న మంత్రులు.. ధర్మాన రాజీనామాను ఆమోదించవద్దని, ఆయన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వొద్దని ముఖ్యమంత్రికి మంత్రులనుండి ఆల్టిమేటం వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ విషయంతో తమకు అండగా ఉండని పక్షంలో పార్టీకి నష్టం జరుగుతుందని, అది అంతమంగా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే ధర్మాన విషయంలో డైలమాలో పడిన ముఖ్యమంత్రి.. తాజాగా 24మంది మంత్రులు అధిష్టానంపై తిరుగుబాటు చేసినట్లుగా వ్యవహరించడంతో ఆయన పూర్తి నిస్సహాయుడైనట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.     అయితే ఈ తిరుగుబాటు వెనుక రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుని ఆశీస్సులు తెలుస్తోంది. క్యాబినెట్‌లోని మెజారిటీ సీనియర్‌ మంత్రుల డిమాండ్‌ను వారి అభిప్రాయాలను అధిష్టానం ముందు పెడతానని సముదాయించినట్లు తెలుస్తోంది... ఈ విషయాలపై మంత్రులు తమ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధర్మాన చెప్పిన విషయంపై ఇతర మంత్రులు కూడా జోక్యం చేసుకుంటూ నాటి ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖరరెడ్డికి ఎవరూ ఎదురుచెప్పే అవకాశమే లేదని, వైఎస్‌కు అధిష్ఠానంలోనూ... రాష్ట్రంలోనూ పలుకుబడి ఉన్నందున మంత్రులందరూ ఒక్కో సందర్భంలో క్యాబినెట్‌ మీటింగుల్లోనూ ప్రేక్షకపాత్ర వహించే పరిస్థితి ఉండేదని, ఇది అధిష్టానానికి కూడా తెలుసని ఓ సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు. సమావేశంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఇతర మంత్రులు కూడా తమ తమ కేసుల వివరాలను ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన మీటింగ్‌లో వివరించినట్లు తెలుస్తోంది.   అన్నీ క్యాబినెట్‌ నిర్ణయాల మేరకు నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని, రాష్ట్ర పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే జీవోలు జారీ అయ్యాయని, అయితే ఈ జీవోల జారీతో జగన్‌కు లబ్ది పొందితే అప్పటి ముఖ్యమంత్రి వైస్‌ బాధ్యులవుతారు కానీ క్యాబినెట్‌లో ఉన్న తమను బాధ్యులుగా చేయటంలో ఔచిత్యం లేదని వారు పేర్కొన్నారు. అయితే, సిబిఐ తాజా ఛార్జిషీట్‌లో వైఎస్‌పేరును కూడా ప్రస్తావించడంతో కేసు ఏ మలుపులు తిరుగుతుందోనని మంత్రులు ఆందోళనలో ఉన్నారు. అయితే, ఇది సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన మంత్రుల వరకే పరిమితమవుతుందా? వైఎస్‌ వారసునిగా లబ్దిపొందిన జగన్‌పైకేసు మరింత బిగుసుకుంటుందా? అనేది తేలాల్సి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఒకరిద్దరు చేసిన పాపం ఎందరికో చుట్టుకుని, కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాయ పండి పక్వానికి వచ్చిన తర్వాత చెట్టునుండి పడక తప్పదు, లేదా ఎవరైనా కోయకతప్పదు. అప్పటివరకు వెయిట్‌ అండ్‌ సీ...యే!

నాయకత్వం మార్పు నిజమేనా?

రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితికి తోడు ముఖ్యమంత్రిని, పిసిసి చీఫ్‌ బొత్సను కూడా మారుస్తారని డిల్లీ నుండి గల్లీ వరకు వార్తలు జోరందు కుంటున్నాయి. దానికి ముహూర్తం ఈ నెల 27 అనికూడా కొందరు జోస్యం చెపుతున్నారు. 27లోపు దాని తాలూకూ ప్రకటన కూడా వెలువడుతుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రిగా జానారెడ్డి పేరు దాదాపు ఖరారైదని కూడా చెబుతున్నారు. ఆయనకు సంబందించిన పూర్తి వివరాలను ఇంటిలిజెన్స్‌ అధికారులనుండి తెప్పించుకున్నారని కూడా చెబుతున్నారు. జానారెడ్డి అయితే అటు సీమాంద్రకు, ఇటు రాయలసీమకు కావల్సిన వ్యక్తిగా ఉండటమే కాక, అందరికీ కావల్సిన పనులను చేసి పెడతారని ఆ విషయంలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విఫలమయ్యారని ఎమ్మేల్యేలను సంతృప్తి పరచి వారిని సమన్వయంతో ముందుకు తీసుకు పోయే నాయకుడు కావాలని భావించిన అధిష్టానం జనార్ధనరెడ్డి పేరు పరిశీలనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే రేసులో మర్రి శశిధర్‌రెడ్డికూడా ఉన్నట్లు ఆయన తన లాబీతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో పిసిసి ప్రసిడెంట్‌గా కన్నా లక్ష్మీనారాయణ పేరు దాదాపుగా ఖరారయ్యారన్న వార్తలు వినవస్తున్నాయి.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీకి ఒక బలమైన సామాజిక వర్గం అండ అవసరం ఉందని గత ఎన్నికల్లో కాపులు పార్టీకి దన్నుగా ఉన్నారని అదే వర్గాన్ని తమ వెంట ఉంచుకోవడం వల్ల పార్టీకి లాభంగా భావిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్‌ కన్నాకు పిసిసి పగ్గాలు ఇవ్వాలని సూచన ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. బొత్స ఎవరినీ సమన్యయం చేసుకోలేక పోతున్నారని, ఒకవర్గానికి చెందిన వారికే ప్రాతినిత్యం వహిస్తూ పార్టీ గురించి ఆలోచించడం లేదని ఆగ్రహం అధిష్టానంలో ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అదే కన్నా అయితే మొదటినుండి ఏ వర్గానికి అనుబంధంగా లేరని అందుకే తనకంటే జూనియర్‌ అయిన బొత్స పిసిసి అద్యక్షుడయినా కన్నా కలత చెందకపోవడం తన పరిణితికి నిదర్శనమంటున్నారు.

రైస్ మిల్లర్ల ఆగడాలకు అడ్డేలేదా?

అప్పో సప్పో చేసి పంటపండిరచిన రైతులు గిట్టుబాటు ధరలేక, పంటమీద తెచ్చిన రుణంకు వడ్డీలు కట్టలేక , వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే మిల్లర్ల పరిస్థితి దీనికి వ్యతిరేకంగా ఉంది. మితిమీరిన స్వలాభంకోసం అధిక ధరలను సృష్టించి అమాయక ప్రజల జీవితాలతో ఆడు కుంటున్నారని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌లో బియ్యం అధిక ధరలకు కారణం దళారీ వ్యవస్థ ద్వారా అప్పటికప్పుడు కృత్రిమ కొరత సృష్టించడమే అని వారు వివరిస్తున్నారు. గడచిన కొన్నేళ్లుగా లక్షలాది రూపాయలు వెనుక వేసుకొనే రైసు మిల్లర్లకు చెందిన యజమానులు ఎప్పుడైనా నష్టాల బాటను పడి ఆత్మహత్మలు చేసుకోలేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. మిల్లర్లు కోట్లాది రూపాయల విలువ చేసే బియ్యాన్ని మిల్లుల్లోనే నిల్వ ఉంచుకొని బియ్యం స్టాకు లేదంటూ బోర్డు తిప్పేస్తున్నారని మార్కెట్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఒక ప్రక్క విజిలెన్స్‌ అధికారలులు దాడులు చేస్తున్నా అవి సరిపోయేంతగా లేవని చెబుతున్నారు. చాలా వరకు రైసు మిల్లర్లంతా రాజకీయ నాయకులు కావడం, మరి కొంతమంది అధికార పార్టీనాయకులకు అనుచరులుగా ఉండటం వల్ల వారిపై అధికారలు దాడులు చేసేందుకు జంకుతున్నారు. ఈ విధానంతో ప్రజలతోపాటు పంట పండిరచిన రైతులు కూడా నష్టపోవల్సి వస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రైసు మిల్లర్ల ఆగడాలను వెంటనే అరికట్టాలని, లేకపోతే ప్రజలు బాగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తచేశారు. ప్రభుత్వం వెంటనే మిల్లర్ల ఆగడాలపై కొరడా జుళిపించాలని లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.

జెడిలక్ష్మీనారాయణ బదిలీకై మంత్రుల ఒత్తిళ్లు

జగన్‌ అక్రమార్జన కేసులో దర్వాప్తు చేస్తున్న సిబిఐ డైరెక్టర్‌ వివి లక్ష్మీ నారాయణను బదిలీ చేయించాలని కొందరు మంత్రులు అధిష్టానం పై వత్తిళ్లు తెస్తున్నారని తెలిసింది.ఇంకా ఆయనను బదిలీ చేయకపోతే తమ రాజకీయ జీవితాలు ముగిసి పోవడమే కాక, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగవ్వటం తప్పదని వారు అధిష్టానానికి తెలిపారని సమాచారం. కేంద్రం ఈ విషయమై సత్వరమే స్పందించాలని అలాకాని పక్షంలో తమ దారి తాము చూసుకోక తప్పదని హెచ్చరించినట్లు కూడా చెబుతున్నారు.హైకోర్టు ఆదేశం మేరకు దర్యాప్తు ప్రారంభించినా కేవలం వైయస్‌ జగన్‌ ఆస్తుల లక్ష్యంగా దర్యాప్తు జరుగుతుందని ఆదిలో భావించారు. అధిష్టానం కూడా అదే విధంగా భ్రమ కల్పించారు. కాని సిబిఐ జాయింట్‌ డైరక్టర్‌ లక్ష్మీనారాయణ మంత్రులందరినీ బాధ్యులను చేయటంతో కాంగ్రెస్‌ నాయకుల్లో కలవరం మొదలయ్యింది. ఐఏఎస్‌ అధికారులను,మంత్రిని జైలు పాలు చేయటంతో నాయకుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.నాటి రెవెన్యూ, నేటి రోడ్లుభవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్‌ను ఎ5గా చేర్చి చార్జిషీటు దాఖలు చేయడంతో పరిస్థితులు చేయిదాటి పోతున్నవనే ఆందోళన నాయకుల్లో ఎక్కువయ్యింది. ఈ నేపధ్యంలో డిల్లీ పెద్దలపై వత్తిడి తెచ్చి ఆయన్ను బదిలీ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆయన రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఆయనపై ఇతర ప్రభావాలు కూడా పడుతున్నాయని వారి ఆరోపణ. ఏదిఏమైనా జగన్‌ వ్యవహారంతో పోతుంది మనకేం పర్వాలేదనుకున్న మంత్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ్‌ పడినట్లయింది.

వరదగోదావరితో వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్‌

మూడు రోజులుగా ఎగువరాష్ట్రాలయిన చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రాలతో పాటు, ఆదిలాబాద్‌,వరంగల్‌ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. కాళేశ్వరం వద్ద నీటిమట్ట 11.094 మీటర్లు, రామన్నగూడెం వద్ద7.5 దేవాదులవద్ద 82 మీటర్లు, భద్రాచలంలో 33.8 అడుగులకు చేరింది. వరంగల్‌లో కురుస్తున్న చెరువులు, వాగులు,వంకలు విపరీతంగా పారుతుండటంతో పెన్‌గంగ, ప్రాణహిత ఇంద్రావతి, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఆదిలాబాద్‌ కండెం ప్రాజెక్టునుండి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాగులు పొంగి పొర్లుతుండటంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలచి పోయాయి. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.     పెన్‌గంగ పొంగటంతో 70 గ్రామాలకు ముప్పు పొంచి వుంది. వాగులు పొంగిపొర్లుతుండటంలో మహారాష్ట్ర , చత్తీస్‌ఘడ్‌ తోపాటు జిల్లాల్లోని వందలాది గ్రామాలకు రాకపోకలు నిలచి పోయాయి. కరీంనగర్‌జిల్లా మహదేవ్‌పురా మండలంలోని కాళేశ్వరం వద్ద ప్రవాహం 13 మీటర్లు దాటితే మండలంలోని అన్ని గ్రామాలు మునుగుతాయని ప్రజలు భయబ్రాంతలకు గురి అవుతున్నారు. గోదావరి వరద రాకుండా ఉండేందుకు ఏటూరు నాగారం, రామన్నగూడెం చుట్టూ నిర్మించిన కరకట్ట షట్లర్లను రిపేరు చేయక పోవడంతో అక్కడిక్కడే లీకేజీలు అవుతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ఆదివారం 19 అడుగులు ఉండగా సోమవారం సాయంత్రానికి 33.8 అడుగులకు చేరుకుంది. దీంతో రామాలయం స్నానాలఘట్టాలు మునిగాయి. భద్రాచలం డివిజన్‌ పరిధిలోని చర్లలోని తాలిపేరులో వరదనీరు భారీగా చేరుకోవడంతో ప్రాజెక్టు అధికారులుసోమవారం 3 గేట్లు ఎత్తి5,466 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టారు. వాజేడు మండలంలో చీకుపల్లి కాజ్‌వే నీట మునగటంతో 26 గ్రామాలకు రాకపోకలు నిలచి పోయాయి. దీంతో ప్రజలు నాటు పడవల ద్వారా ప్రయాణిస్తున్నారు. వాజేడులో గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరింది. గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని సీడబ్యుసీ అధికారలు పేర్కొంటున్నారు.

మురికి కూపంగా తయారైన కాకినాడ జిజిహెచ్‌

అరకొర సౌకర్యాలతో వైద్య సేవలు అందజేస్తున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఇప్పుడు మరింత దుర్బర పరిస్థితులకు చేరుకుంది. పారిశుద్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న ఆందోళన ఉదృత రూపం దాల్చింది. తాజాగా ఆసుపత్రి సూపరెండెంట్‌ కామేశ్వరరావు సమక్షంలో కాంట్రాక్టర్‌,కార్మికులకు మద్య జరిగిన చర్చలు బెడిసికొట్టడంతో ప్రస్తుత పరిస్థితి దాపురించింది. ప్రతీనెల జీతం చెల్లించాలని, బకాయిపడిన జీతాలు వెంటనే మంజూరు చేయాలని కార్మికులు కోరుతున్నారు. దీంతో పారిశుద్యం లోపింపించి ఆసుపత్రంతా దుర్గంధం నిండి ఉంది. ముక్కు మూసుకొని వైద్యులు రోగులకు సేవ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. మెడికల్‌, సర్జికల్‌ వార్డులు, బాత్‌రూం ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ బాధపడలేని డాక్టర్లు సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారు.చేతిలో చిల్లి గవ్వకూడా లేని నిరుపేదలు మాత్రం కంపుకొడుతున్న వార్డుల్లోనే ఉండి అందీ అందని వైద్యసేవలు పొందుతున్నారు. అత్యవసరకేసులకు సంబందించిన ఆపరేషన్లుకూడా వారంనుండి ఆగిపోయాయి. మాతాశిశు విభాగం,సర్జికల్‌ వార్డులు,వెన్నెముక, ప్రశూతి విభాగం,చిన్నపిల్లల విభాగం దుర్గంధంతో నిండాయి. ఆందోళన విరమింపచేసి కార్మికులను ఒప్పించడానికి హాస్పిటల్‌ యాజమాన్యం,పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌ జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.