పడగ విప్పిన అరాచకం! ప్రక్షాళన చెయ్యడం అవసరం!

రాష్ట్రంలో అరాచకం తాండవం చేస్తోంది...! అవినీతి, లంచగొండితనం, బరితెగింపుధోరణి, జవాబుదారీ లేని వ్యవహారశైలి రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్నాయి...! ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ పెద్దలే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొవడం... అధికార రక్షణే ధ్యేయంగా అమాత్యులు తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం, అధికార పక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజాసమస్యలు పట్టనట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తూండటం... ప్రజారక్షణ కోసం ఏర్పాటైన పోలీసువ్యవస్థ చోద్యం చూస్తూండటం... న్యాయపరిరక్షణా వ్యవస్థకు సైతం అవినీతి చెదలు పట్టడం.... రాష్ట్రాన్ని ఆటవిక సమాజంలోకి నెట్టేస్తున్నాయి! అవును... ఈ సమాజం ఎటు పోతోంది? మన రాష్ట్ర భవిష్యత్‌నడక ఎలా ఉంటుంది?` ఆలోచించాలంటేనే భయమేస్తుంది...!

 

ఎటుచూసినా అవినీతి జడలు విప్పింది! ప్రజలకు సుద్దులు చెప్పాల్సిన పెద్దలు తమ స్వలాభంకోసం యధేచ్ఛగా పాల్బడిన అవినీతి చర్యలకు ఫలితం అమాయకపు ప్రజలు అనుభవించాల్సి వస్తోంది! రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్డుప్రమాదాలే` వాహనాలకు ఫిట్‌నెస్‌ ఉండదు...! దేశంలో ఇంకెక్కడా లేనన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు మనరాష్ట్రంలోనే చాలా కాలేజీల్లో ప్రాథమిక సౌకర్యాలే ఉండవు...! రాష్ట్రంలో విచ్చలవిడిగా కార్పొరేట్‌ విద్యావ్యాపారం` అబద్ధాల ప్రచారంతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నవైనం ! పచ్చని పసిడి పంటలతో ప్రజల ఆకలిని సంపూర్ణంగా తీర్చగలిగే సారవంతమైన భూమి పొలాలకు విద్యుత్‌ ఉండదు, నీటికి దిక్కుండదు...! మార్కెట్లో మినరల్‌ వాటర్‌బాటిళ్ళు వెక్కిరింపు...! పండిన పంట పొరుగు రాష్ట్రాలకు రవాణా` మన రాష్ట్రంలో ధరల విశృంఖల వీర విహారం! మన రాష్ట్రంలో ఉత్పత్తయిన విద్యుత్‌, గ్యాస్‌ పక్కరాష్ట్రాలకు సరఫరా.. చిమ్మ చీకట్లో రాష్ట్ర జనం జాగారం! అప్పుడెప్పుడో వాడుకున్నారంటూ ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న భారీ సర్‌ఛార్జీలు..! ప్రభుత్వ వైద్యశాలల ఆలనా పాలనా పక్కన పెట్టి, ప్రయివేటు మేలుకోసం ఆడంబరంగా ప్రవేశపెట్టిన ఆర్యోగ్యశ్రీ నిధుల కొరతతో నిర్వీర్యమైపోయిన సర్కారు ఆస్పత్రులు! వందలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నా చలించని అధికార గణం...!

 

ప్రభుత్వభూములు ప్రయివేటుపరం కృతజ్ఞతా పూర్వ కానుక ప్రయివేటు పెట్టుబడిగా రూపాంతరం! చేవ్రాలు చేసిన అమాత్యుల ‘హస్తా’లకు అవినీతి మరకలు! చెంచల్‌ గూడా జైలు గదులు విఐపిలతో సందడి! తప్పును ఒప్పుచెయ్యడం కోసం నిందితులకు ప్రభుత్వమే న్యాయసహాయం కల్పించడానికి కంకణ బద్ధం! పెద్దయ్య పెద్దరికం చూసి ఎదురు మాటడలేక బుద్ధిగా చేవ్రాలు చేశామంటూ సర్దిచెప్పుకోవాలని చూసినా ఆస్తుల అసలు చిట్టా విప్పితే అసలు బండారం సత్యపీఠంపైనే వెల్లడౌతుంది! తప్పును తప్పంటూ వేలెత్తి చూపిన పరిశోధనా బృందానికి మరకలంటించ చూసిన కాల్‌డేటా సేకరణ అధికారమద్దతు అస్సల్లేకుండానే జరిగిందా? ప్రశ్నార్థకమే! నిస్పక్షపాతంగా న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు రూపాయిలగని కోసం పాపాల చిట్టాను ఆవలకు నెట్టి చటుక్కున బెయిలిచ్చి ఇంచక్కా జయిలూచలు లెక్కెయ్యడం న్యాయం కోసం ఇంక్కెక్కడి కెళ్ళాలన్న సందేహం ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసింది!

 

సమాజానికి సరైన మార్గ నిర్దేశకత్వం చెయ్యాల్సిన బాధ్యతాయిత తెలుగు ఛానెళ్ళు కొన్నయితే` పగలంతా విలువల గురించి వల్లిస్తూ అర్థరాత్రి మద్దెలదరువన్నట్లు రాత్రి 11గం.లకు పచ్చిశృంగార నీతి పాఠాలు వివరిస్తూ విలువల వలువలు వలిచేస్తున్నాయి! రియాలటీషోల పేరుతో పసిపిల్లల మనసుల్ని కలుషితం చేస్తున్న ‘విచిత్ర విన్యాసాలు’ ఏ పెద్దవాళ్ళకీ కనిపించడమే లేదు! క్రైం కార్యక్రమాలు క్రిమినల్స్‌కు చక్కటి తర్ఫీదునిచ్చే ఇన్స్‌పిరేషన్‌ ప్రోగ్రాములయ్యాయనడం విశ్లేషకులు చేస్తున్న ఆరోపణ! ఆర్టీసి కండక్టరు చిల్లర మాయాజాలం, ఆటోరిక్షావాలాల దందాగిరీ, జేబుదొంగల హస్తలాఘవం, దొంగనోట్ల చెలామణీ, ఈవ్‌ టీజింగ్‌, పబ్బుల పచ్చి శృంగారం, విచ్చల విడిగా వ్యభిచారం, అత్యాచారం, హత్య, దోపిడీ, చదవకుండానే చేతికొచ్చే డిగ్రీ సర్టిఫికెట్లు, పెరిగిపోతున్న ఇంటద్దెలు, సరఫరాకాని తాగునీరు, అడ్డగోలుగా లైసెన్సులు పొంది బళ్ళూగుళ్ళూ అనే తేడాలేకుండా జనావాసాల మధ్య వెలసి ‘రా రమ్మంటూ’ సాదరంగా ఆహ్వానించే బార్లూ బీర్లు, నియంత్రణలేని కూరల ధరలు, మళ్ళీ విజృంభిస్తున్న మట్కాలు, హుక్కాలూ, నెంబర్లూ, మాదక ద్రవ్యాలూ, ఆఫీసు వేళల్లో కుర్చీల్లో కనిపించని అధికారులు, చదువుకునే పసిపిల్లలపై వికృత చేష్టలకు పాల్పడుతున్న టీచర్లు, పుట్టుకొస్తున్న కొత్తబాబాలు., రేష్‌ షాపుల్లో దొరకని తిండిగింజలు, కడుపులో కాళ్ళు పెట్టుకొని నిస్తేజంగా శూన్యంలోకి చూస్తున్న సామాన్యుడి కళ్ళు.. రాష్ట్రంలో అరాచకం ప్రబలిందనడానికి నిలువెత్తు సాక్ష్యాలు! మంత్రులంతా అవినీతి ఆరోపణలతో కేబనేట్‌కి దూరమైతే అధికారం నిలుపుకునేదెలా? అంటూ మల్లగుల్లాలు పడటంతోనే కాలం వెళ్ళబుచ్చుతూ పరిపాలనా వ్యవస్థను అస్థవస్థం చేస్తున్న అధికారపార్టీ ఇందుకు బదులివ్వాల్సి ఉంటుంది...! అరాచకం మరింత ముదరక ముందే ప్రజాసంక్షేమంకోసం ప్రక్షాళనా కార్యక్రమం తక్షణం చేపట్టవలసి ఉంటుంది...!

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”