వాటర్ ట్యాంకెక్కిన తల్లీకూతుళ్లు

కట్నంకోసం అత్తింటి ఆరళ్లు.. కొత్తగా ఆడపిల్ల పుట్టిందని భర్త వేధింపులు.. పెళ్లాన్ని తీసుకెళ్లి అత్తగారింట్లో వదిలేశాడు.. ఏం చేయాలో పాలుపోని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులే తిన్నారో లేక పరపతే పనిచేసిందో తెలీదుకానీ.. సాయం చేయాల్సిన పోలీసులు రివర్స్ లో బాధితుల్నే బెదిరించడం మొదలుపెట్టారు. రోజూ మానసిక వ్యథ.. తట్టుకోలేని బాధితురాలు తన తల్లినీ, పసిపాపను తీసుకుని వాటర్ ట్యాంక్ మీదికెక్కేసింది. తనకు న్యాయం చేయకపోతే దూకేస్తానంటూ హల్ చల్ సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలో ఈ ఘటన జరిగింది. పెదపూడికి చెందిన విఘ్నేశ్వరి కూతురు రామతులసికి కాకినాడకు చెందిన శ్రీకాంత్ తో 2009లో పెళ్లైంది. రామతులసికి అప్పట్నుంచీ రోజూ వేధింపులే.. అదనపు కట్నం తీసుకురమ్మని భర్త, అత్తమామలు పెట్టే ఆరళ్లను కడుపులోనే పెట్టుకుని ఇన్నాళ్లూ బాధపడింది రామతులసి. ఆడపిల్ల పుట్టిందన్న నెపంతో శ్రీకాంత్ ఆమెని పుట్టింట్లో వదిలేశాడు. విడాకులివ్వమని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తన గోడుని పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన రామతులసి నేరుగా వాటర్ ట్యాంక్ మీదికెక్కేసింది. ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ వచ్చిన తమకు న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే కిందికి దిగుతానంటూ పట్టుబట్టింది. ఈ విషయాన్ని పోలీసులు స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డికి తెలిపారు. బాధితులుంటున్న నియోజకవర్గం ఎమ్మెల్యే శేషా రెడ్డి కూడా వెంటనే స్పందించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వాటర్ ట్యాంక్ దగ్గరికెళ్లి తల్లీకూతుళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ మీదినుంచి దిగొచ్చారు.  

కిరణ్‌ కొత్తపథకం‘ఇందిరమ్మ విసనకర్రలు’

రాష్ట్రంలో ఇప్పుడంతా ఇందిరమ్మ భజన జరుగుతోంది. కాంగ్రెస్ నేతలంతా నెహ్రూకుటుంబాన్ని, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని పొగుడుతూ కాలం నెట్టుకొస్తున్నారు. సోనియా ముందు భజన చేయనివాళ్లగతి అధోగతే అవుతోంది. వై.ఎస్ హయాంలో మొదలైన ఈ భజన ఇప్పుడు తారాస్థాయికి చేరింది. భజన చేస్తేనే అమ్మ వరాలిస్తుందన్న విషయం సాధారణ కార్యకర్తలకుకూడా తెలిసిపోయింది. వై.ఎస్ బతికున్నన్నాళ్లూ ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు తగిలించేశారు. వై.ఎస్ హఠాన్మరణం తర్వాత అధికారపీఠమెక్కిన రోశయ్యకూడా ఆ పద్ధతినే కొనసాగించారు. అధిష్ఠానం భజన చేయడంలో దిట్ట అయిన రోశయ్య మెల్లగా గవర్నర్ గిరీని చేజిక్కించుకుని ఒత్తిడినుంచి తప్పించుకున్నారు.     తర్వాత వంతు కిరణ్ కుమార్ రెడ్డిది. కిరణ్ కుమారెరెడ్డికూడా లౌక్యంగా సోనియా భజన చేసుకుంటూ కాలం గడుపుకొస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆయన ప్రారంభించిన మొదటి కార్యక్రమంపేరు ఇందిరమ్మ బాట.. ప్రభుత్వానికి ముందస్తు చూపులేని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదికూడా అధిష్ఠానం చలవేనంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ కోత అనే పవర్ కట్ పథకాన్ని ప్రకటించారని ప్రతిపక్షాల నేతలు ఛలోక్తులు విసురుతున్నారు. త్వరలోనే సీఎం ఇందిరమ్మ విసనకర్రలు పేరుతో కొత్త పథకాన్నికూడా ప్రారంభించబోతున్నారని అంతా చెవులుకొరుక్కుంటున్నారు. గాలికోసం విసనకర్రలతో విసురుకునేటప్పుడు వాటిమీదున్న ఇందిరమ్మ ఫోటోని చూసి జనమంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారతారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం సొంతమౌతుందని కిరణ్ గట్టిగా భావిస్తున్నారని విపక్షాల నేతలు అనుకుంటున్నారు.

కొణతాల కొంటెతనం

నిన్నటి వరకూ ఎమ్మెల్యేగా చిరపరిచితుడైన కొణతాల రామకృష్ణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాక తన రెండోరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. తాను కర్రపెత్తనం చేస్తానన్నట్లు, గుడ్లిరిమి పార్టీలోని కార్యకర్తలను క్రమశిక్షణలో ఉంచుతానన్నట్లు వ్యవహరిస్తున్నారని విశాఖజిల్లాలోని వైఎస్‌ఆర్‌సిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మీరనుకున్నట్లు ఇక్కడేమీ జరగదు...టిక్కెట్లు గురించి నేనేమీ హామీ ఇవ్వను...ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు కుదరదు...’’అని కొణతాల ఒక హెచ్చరిక జారీ చేశారు. తనకే టిక్కెట్టు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్న నర్సీపట్నం నేతలను వారించారు. అలానే పార్టీలో చేరికల గురించి కూడా ఆయన తరువాత చూద్దాం అన్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లా కన్వీనర్‌ మార్పుగురించి కొణతాల మాట్లాడుతూ మార్చాలని నేను చెప్పానే కానీ, ఎవరి పేరు సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. తనకే టిక్కెట్టు వచ్చిందన్నట్లు వ్యవహరిస్తున్న వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పెట్ల ఉమాశంకర్‌గణేష్‌పై కొణతాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకుపోవాలన్న విషయం అంగీకరించని గణేష్‌పై రుసరుసలు ఆడారు. జగన్‌ నేరుగా మీకు చెబితే తిరగండి మీ ఇష్టం అని కొణతాల పరోక్షంగా గణేష్‌ను హెచ్చరించారు. తాను హైదరాబాద్‌, చిత్తూరు జిల్లాల పర్యటన ముగించుకుని వచ్చేంత వరకూ పార్టీ నిర్దేశిత కార్యక్రమాలను సజావుగా చేయాలని జిల్లా నాయకులను కొణతాల కోరారు. తిరిగి వచ్చాక అన్ని సమస్యలూ పరిశీలిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇంతకీ ఇంత కర్రపెత్తనం చేయటం కొణతాలకు అవసరమంటారా అని ఆ పార్టీ జిల్లా నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

డబుల్ డెక్కర్ రైళ్లొచ్చేస్తున్నాయ్

దక్షిణమధ్య రైల్వే శాఖ పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఏసి డబుల్‌డక్కర్‌ రైళ్లను నిర్వహించేందుకు కేంద్రం అనుమతి కోరుతోంది. ప్రత్యేకించి ఈ డబుల్‌డక్కర్‌ వల్ల హైదరాబాద్‌ `విశాఖపట్టణం మధ్య ప్రయాణీకుల ఒత్తిడి కొంత వరకూ తగ్గవచ్చు అని అంచనాలు వినిపిస్తున్నాయి. అలానే హైదరాబాద్‌`విజయవాడ కూడా ఇదే తరహాసర్వీసు నడపాలని రైల్వేశాఖ అభిప్రాయపడుతోంది. ఇటీవల హౌరా`ధన్‌బాద్‌ మధ్య ఏడాది నుంచి నడుస్తున్న డబుల్‌ డక్కర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఉత్సాహంతోనే ఢల్లీి`జైపూర్‌ల మధ్య ఇంకో సర్వీసును నడిపేందుకు రంగం సిద్ధమైంది. దక్షిణమధ్య రైల్వే శాఖ ప్రవేశపెట్టాలనుకున్న ఈ డబుల్‌డక్కర్‌లపై కేంద్రం అథó్యయనం చేస్తోంది. ఈ అథ్యయనం ఒక కొలిక్కి రాగానే ఈ సర్వీసులకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఒక్కో కోచ్‌లో 300మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందువల్ల భారీసంఖ్యలో ప్రయాణీకులు ఒకేసారి హైదరాబాద్‌`విశాఖల మధ్య షటిల్‌ చేయటానికి వెసులుబాటు లభిస్తుంది. అలానే బస్సులపై ఒత్తిడి తగ్గి రైల్వేకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశమూ పెరుగుతుందని రైల్వేశాఖ అంగీకరిస్తోంది. అందువల్ల తమ ప్రతిపాదనలు త్వరగా మంజూరు చేయాలని కోరుకుంటోంది. కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తోంది.

కాంగ్రెస్‌ కి గుడ్ బై కొట్టేసిన రాయపాటి?

ఎంపి రాయపాటి సాంబశివరావుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మను పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్‌పార్టీని వదిలేయమని ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. తిరిగి ఛైర్మనుగా ఎంపి కనుమూరి బాపిరాజు నియమితులైనందుకు అసంతృప్తితో ఉన్న రాయపాటి అనుచరులు భారీసంఖ్యలో తమ నేత ఇంటికి చేరారు. ఉదయం నుంచి ఒకటే హడావుడిగా వచ్చిన అనుచరులు, కార్యకర్తలు రాయపాటిని కాంగ్రెస్‌పార్టీ వదిలేయమని కోరుతున్నారు. అసలు తమ నేత రాయపాటి అంతరంగం తెలిసినా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని రాయపాటి అనుచరులు అభిప్రాయానికి వచ్చారు. అసలు రాయపాటిని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవటమే మానేశారని అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పద్ధతి లేకపోవటం వల్లనే తమ రాయపాటికి అన్యాయం జరిగిందని అనుచరులు అభిప్రాయానికి వచ్చారు. అంతేకాకుండా ఈ విషయంలో తాము సిఎంను వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికల నేపథ్యంలో పీసిసి నేతలు కూడా రాయపాటి సాంబశివరావుకు అన్యాయం జరిగిందని అంటున్నారు. అయితే కొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. బాపిరాజు సహృదయత, భక్తిభావమే ఆయనకు పదవి తిరిగి ఇప్పించిందని అభిప్రాయపడుతున్నారు.

చెక్ పోస్ట్ దొంగలు

ఎర్రచందనం స్మగ్లర్లు అడవులను ఆక్రమిస్తున్నారు. దాదాపు కొన్ని ప్రాంతాల్లో తమను కవర్‌ చేసేందుకు గ్రామస్తులను కూడా లొంగదీసుకుంటున్నారు. ప్రత్యేకించి గిరిజనులు ఉండే అడవుల్లో వారిని మభ్యపెట్టి తమ పక్కన తిప్పుకుంటున్నారు. ఇటీవల దాడుల్లో స్మగ్లర్ల స్థానంలో గ్రామీణులు, గిరిజనులు పోలీసులకు, అటవీశాఖాధికారులకు దొరుకుతున్నారు. అంటే స్మగ్లర్లు తమ ఉనికిని చాటుకోకుండా తగిన జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. అయితే అటవీశాఖాధికారులు నెంబరింగ్‌ చేయని ఎర్రచందనం చెట్లను దర్జాగా ఎటువంటి అనుమతులు అవసరం లేకుండా స్మగ్లర్లు ఊర్లు దాటించేస్తున్నారు.   అయితే సినీఫక్కీలో అటవీశాఖాధికారులు, పోలీసులు మభ్యపడేలా స్మగ్లర్లు వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక చెక్‌పోస్టుకు దగ్గరగా అటవీశాఖా ధికారులకు ఒక వ్యాను పది దుంగలు దొరుకుతాయి. వీటిని చూడగానే అధికారులు దానిపై కేసు బుక్‌ చేసుకుంటుండగా, మరో వాహనంలో భారీసరుకు దారి మళ్లి వెళ్లిపోతుంది. పెద్దసరుకు దొరక్కుండా స్మగ్లర్లే ట్రిప్పుకు పది దుంగలు దొరికే ఏర్పాట్లు చేశారు. దొరికిన దుంగలను చూసి పోలీసు అధికారులు, సిబ్బంది కేసు నమోదు చేసే పనిలో ఉండగా కూడా భారీసరుకు గమ్యానికి చేరుకుంటోంది. అలానే అడవుల్లో నెంబరు వేయని చాలాచెట్లు స్మగ్లర్ల ధాటికి దుంగలుగా మారుతున్నాయి. ఇలా చెట్లు నరుకుతూ పోతుంటే భవిష్యత్తులో ఎలా బతకాలని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వర్షాలు వచ్చే అవకాశాలు కూడా కరువవుతాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా కడపజిల్లా సుండుపల్లి మండలం పింఛ అటవీప్రాంతంలో బీటుసున్నపుగుండు సమీపంలో పది ఎర్రచందనం దుంగలను అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. అయితే పది మంది స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని వీరంటున్నారు. దొరికిన స్మగ్లర్లు చిత్తూరు జిల్లా కలకడ మండలం నాయినివారిపల్లెకు చెందిన వారని గుర్తించారు.

లంచాలతో నడుస్తున్న ప్రైవేట్ బస్సులు

రెండు నెలల క్రితం షిర్డీ వెళ్లే టూరిస్టు బస్సు ప్రమాదం దాని ఆపరేటర్ల అక్రమాలను వెలుగులోకి తెస్తూనే ఉంది. ఒకే నెంబరుతో రెండేసి టూరిస్టు బస్సులను నడపటం, సీట్ల సంఖ్య తగ్గించి చూపటం, బోర్డుపై ఒక రూటు, తిరిగేది మరో రూటు అని చెప్పటం వంటి పలు రకాల అక్రమాలు ఒకదాని తరువాత మరొకటిగా ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయన్న విషయం రవాణాశాఖ గుర్తించింది. అయితే దానికి తగ్గట్టుగా టూరిస్టు సంస్థలు రవాణాశాఖా ఉద్యోగులను మర్యాదపూర్వకం(అదేనండీ! ఆమ్యామ్యాలతో చక్కగా) చూసుకుంటున్నారు. ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లలకు భారీగా చదివింపులు కూడా చేశారు. అయినా సంతృప్తికరంగా చెల్లించటం లేదని కొన్ని జిల్లాల్లో ఉద్యోగుల నుంచి బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా మాత్రం టూరిస్టుబస్సు అక్రమాలు వదిలేస్తే భవిష్యత్తులో విధినిర్వహణ చేయని శాఖగా మిగిలిపోతామని రవాణాశాఖ టూరిస్టు బస్సుల నిర్వాహకులతో చెప్పి మరీ, కొన్ని దాడులు చేస్తోంది. కేసుల కోసం జరిగే ఈ దాడులు కూడా అక్రమాలకు సాక్ష్యంగా తీసుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. షిర్డీ వెళ్లే బస్సు లోయలో పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా లెక్కిస్తే రాష్ట్రవ్యాప్తంగా వందలాది బస్సులు అక్రమమార్గంలోనే నడుస్తున్నాయని తేలింది. కొన్ని బస్సులు కట్టేఫైనులు రాష్ట్ర ఖజనాకు భారీగా వచ్చాయని కూడా గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ జాతీయరహదారిపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించి మూడు టూరిస్టు బస్సులను సీజ్‌ చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న ఏడు లారీలను పట్టుకున్నారు. యజమానులపై కేసులు నమోదు చేశారు.

తిరుమలలో పెప్సీ పాగా ?

గ్లోబలైజేషన్‌ పేరుతో ఇప్పటికే దేశంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలను ఆక్రమించుకున్న మల్టీనేషనల్‌ కంపెనీలు హిందూలను కూడా వదిలిపెటట్టటంలేదు. మరీ ముఖ్యంగా దేశంలో పేరుపొందిన దేవాలయాలలో పాగా వేశాయి. దానిలో భాగంగానే దక్షిణభారతదేశంలో పేరెన్నికగన్న ఆపదమొక్కుల వాడు వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. తిరుమలలోని వైకుంఠ మార్గంలో పెప్సీ కంపెనీ ఆధిపత్యం సాదించింది. అంతకు ముందు అదే ప్రదేశంలో అక్కడ చిరు వ్యాపారులు ఉండేవారు.వారిని భద్రతాకారణాల పేరు చెప్పి దేవస్దానం ఖాళీచేయించింది. ఇప్పుడు అదే ప్రాంతంలో పెప్సీకి అనుమతి ఇవ్వడం వల్ల చిరు వ్యాపారులు విస్తుబోయారు. స్వామి దర్శనానికి సాంప్రదాయ పద్దతులతో భక్తి ప్రభక్తుల్తో, సాంప్రదాయంగా రావాలని ఆదేశించిన దేవస్ధానం ఇలా మల్టీనేషనల్‌ కంపెనీల శీతల పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దానికన్నా సాంప్రదాయ పానీయాలైన పాలు, మజ్జిగ, పళ్ల రసాలు లాంటివి పెడితే భక్తులకు ఆరోగ్యానికి మంచిదని, అలాగే చిరువ్యాపారులకు ఊత మిచ్చినట్లుంటుందని సాంప్రదాయవాదులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సత్వరమే స్పందించి సరైన నిర్ణయం తీసుకొని సామాన్యులకు ఆసారాగా వుండాలని స్దానికులు అధికారులను కోరుతున్నారు.

సిఎం గాలి వాగ్థానాలు

ముఖ్యమంత్రి జిల్లాల్లో ఇందిరమ్మ బాట ద్వారా ఎస్‌సి, ఎస్టీ హాస్టల్స్‌లో నిద్రించినా విద్యార్ధుల వెతలు తీరలేదు. హాస్టళ్లలో మెరుగైన వసతులు నాణ్యమైన ఆహారం అందించి ఉత్తమ విద్యార్దులను అందిస్తామని అదికారులు, నాయకులు చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఒక్కో విద్యార్ధికీ 1 నుండి 7 తరగతి వరకూ ఇచ్చేది కేవలం 15 రూపాయలు, 7 నుండి 10 తరగతి విద్యార్దులకు 17 రూపాయలు. దీంతో మెనూ ప్రకారం మూడు రోజులు గుడ్లు, మూడు రోజులు పండ్లు, ఒక రోజు స్వీటు ఇవ్వటానికి కుదరటం లేదని వార్డెన్లు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఉదయం వారాల వారీగా పులిహోర, కిచిడి, ఉప్మా, వైట్‌రైస్‌, మద్యాహ్నం రాత్రికి పప్పు, కూరగాయలతో భోజనం వడ్డించడానికి కుదరటం లేదని వార్డెన్లు చెబుతున్నారు. హాస్టళ్లు మొదలై మూడు నెలలు గడుస్తున్నా అధికారులు ఇప్పటివరకూ వైద్య శిబిరాల ఊసే లేదు. దాంతో పిల్లలంతా రోగాల భారిన పడుతున్నారు. హాస్టళ్లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నాయి. అదే విధంగాహాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకు ఈనెల 8న అధికారులు టెండర్లు నిర్వహించాల్సి ఉండగా ఆలస్యంగా టెండర్ల ప్రక్రియ ముగించారు. దాంతో వార్డెన్లు ఇతర కిరాణా దుకాణాల నుండి సరుకులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అలాగే హాస్టల్‌లో వుండే బాలికలకు నూనె, సబ్బులు, వగైరాలకోసం నెలకు 75 రూపాయలు, బాలురకు 50 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఏడాదిలో జూన్‌ నెలలో ఒక్కో విద్యార్ధికీ కేవలం 35 రూపాయలు ఇచ్చారు. జూలై, ఆగస్టు నెలల బిల్లులు ఇవ్వవలసి ఉందని విద్యార్దులు తెలియచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్‌ చార్జీలను పెంచాలని, అలాగే నెలనెలా బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు.

మద్యానికి రెక్కలు

ప్రభుత్వానికి ఆదాయవనరులను సమకూరే ప్రతి వనరునీ ఉపయోగించు కుంటుంది. అలాంటి ఆదాయవనరుల్లో మద్యం తిరుగులేనిది.రాష్ట్రంలోని 6596 మద్యం దుకాణాలకు 637 మద్యం దుకాణాలు 2012-13 ఎక్సైజ్‌ సంవత్సరంలో మిగిలాయి. దీంతో ప్రభుత్వం సుమారు 2500 కోట్ల రూపాయలను లైసెన్సు రూపంలో కోల్పోయింది. వీటితో ఎలాగైనా ఖజానాకు డబ్బులు రాబట్టాలన్న ప్రభుత్వం ప్రీమియం మద్యంపై అదనపు ప్రివిలేజ్‌ పన్నును 12.5 శాతం పెంచింది. తాజాగా ఎపిబిసిఎల్‌ కు మద్యం సరఫరా చేసే తయారీ దారులనుండి ఒప్పందం ముగియటంతో త్వరలో మద్యం ధరలకు రెక్కలు రానున్నాయి. అలాగే సోమవారం నుండి మద్యం పైనుండే చిల్లరను సమీప రూపాయలకు రౌండప్‌ చేసి అమ్మనున్నారు.ఆంద్రప్రదేశ్‌ బ్రెవరేజస్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసే మద్యం ధరలు కూడా రౌండిరగ్‌ కారణంగా పెరగనున్నాయి. వ్యాపారులకు ఇష్యూ ప్రైజ్‌స్‌గా పిలిచే ఈ స్ధిర ధరలను చిల్లరపేరుతో మధింపు చేసారు. అంటే చిల్లరి తర్వాతి అధిక రూపాయితో సమానం చేస్తారు. దీంతో వ్యాపారులకు మద్యం సరఫరాచేసే రేట్లు పెరిగి మద్యం మరింత ప్రియం కానుంది. ఈ రెండు పద్దతుల్లో పెరుగుదల అంతిమంగా మందుబాబులపైనే పడుతుంది. అంటే 49.14 రూపాయలున్న బాటిల్‌ ధర ఇకపై 50 రూపాయలవుతుంది.అదేవిధంగా 47రూపాయలున్న బాటిల్‌ ఖరీదు 50 రూపాయలుగా మారుతుంది. అంటే గరిష్టంగా ఒక్కో బాటిల్‌ ఖరీదు 20శాతం పెరగనుంది. దీంతో ప్రతి లిక్కర్‌ కేస్‌కు 200 రూపాయలు పెరగనుంది. దీంతో మద్యం ధరలు పెరిగి మందుబాబులకు జెలక్‌ ఇస్తుంది. దీని ద్వారా ఏడాదికి 1000 కోట్లు ఖజనాకు చేరనుంది.

సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు.. రానూ వచ్చాడు

ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కాని బొత్స అక్కడ 5 రోజులున్నారు. కిరణ్‌కుమార్‌ రెండురోజులన్నారు. ఇద్దరూ అధిష్టానంతో విసృతమైన చర్చలు జరిపారు. కాసేపు గంభీరంగా ఉన్నారు. జర్నలిస్టులకు ఫోటో ఫోజులు ఇవ్వలేదు కేవలం ప్రభుత్వం శాఖ తీసిన ఫోటోలు మాత్రమే ప్రచురణకు వచ్చాయి. ఢిల్లీ నుండి ఆజ్మీర్‌ దర్గాకు వెళ్లిన బొత్స ఢిల్లీ విషయాల పై పెదవి విప్పటంలేదు. ఫలితంగా రాజకీయ వాతావరణం స్తబ్ధుగా మారింది. సీనియర్లు మాత్రం తుఫాను ముందు ప్రశాంతం అంటున్నారు. ఎప్పుడూ ఢిల్లీ నుండి రాష్ట్రానికి రాగానే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే వారు కాని ఈ సారి అదికూడా లేదు. అయితే శనివారం ఎస్సీ , ఎస్టీ ఉప ప్రణాళిక నివేదికపై మాట్లాడేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఢిల్లీ విషయాలు అడిగినా చెప్పకుండా దాటవేశారు .బొత్స కూడా అదే మెయిటైన్‌ చేస్తున్నారు.   మంత్రులతోనూ, ఎమ్మేల్యేల తోనూ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా కాస్త చొరవ చూపి ఏమైనా అడిగితే సమయం వచ్చినప్పుడు చెబుతానని చెబుతుండటంతో అశ్చర్యపడవలసి వస్తుంది. కళంకిత మంత్రులందరికీ ఉద్వాసన తప్పదని తెలిసినప్పటినుండి ముఖ్యమంత్రి, పిసిసి నేత గుంభనంగావుంటున్నారని కొందరంటున్నారు. పెదవి విప్పితే మంత్రులంతా ఎక్కడ తిరగబడతారోనని కూడా సైలెన్సు పాటిస్తున్నారని ప్రతిపక్షాలు గుసగుసలాడుతున్నారు. ఢిల్లీ నుండి రాగానే మంత్రి ధర్మాన రాజీనామాను గవర్నర్‌కు పంపుతారనుకున్న కిరణ్‌ ఇంతవరకు దాని మీద నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. గందరగోళ పరిస్థితిని అధిగమించడానికి అధిష్టానం మరో 48 గంటలు కావాలనుకున్నదని, అందుకే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా విపక్షాలకు తావివ్వకుండా మధ్యేయ మార్గంలో ఏదో ఒక నిర్ణయానికి రావడానికి గానూ సోమవారం ఢిల్లీకి రమ్మన్నారని తెలుస్తుంది. తినబోతూ రుచులడగటం ఎందుకు ఎలాగూ సోమవారం ఢిల్లీ వెళ్లి వచ్చి చెప్పాల్సిందేగా అంటున్నారు రాజకీయ మేధావులు.

ఎన్నికల్లో ఓడిపోతే పగబడతారా?

ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతే అవమానంగా భావించేవారు కొందరు. దీంతో పగబట్టి సాధించాలనుకునేవారు కొందరు. అసలు ఎన్నికలు కాబట్టి గెలుపు, ఓటములు సహజమని సర్దుకుపోయేవారు మరికొందరు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోరకంగా ఉంటుంది. గెలవటమే తమ జీవితం అనుకుని ప్రత్యర్థులతో నేరుగా గొడవపెట్టుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. రాష్ట్రం మొత్తం మీద పార్టీల కార్యకర్తలు కూడా ఈ తరహాలోనే పట్టుదలగా వ్యవహరించేవారూ ఉన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ కార్యకర్తలైతే కత్తులతో దాడులకు తెగబడిన రాజకీయ చరిత్ర రికార్డుల్లో నలుగుతోంది. ఎన్నికల్లో ఓడిన పార్టీ ఖచ్చితంగా దాడులకు తెగబడుతుందని గెలిచినపార్టీ ముందస్తుగా పోలీసులను ఆశ్రయించేది. ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక అభ్యర్థులు వ్యక్తిగతంగా పగబట్టడానికి కూడా సిద్దపడుతుంటారు. దీనికి తాజా ఉదాహరణ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తేర చన్నిపురెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ పడ్డారు. ఈ 2009 ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధించి మంత్రి అయ్యారు. దీంతో మంత్రిపై పగబూనిన చిన్నపురెడ్డి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా జానారెడ్డిపై దుష్ప్రచారం చేశారు. రెండునెలలుగా ఆగకుండా ఈ ప్రచారం సాగుతుండటంతో విసిగిపోయిన జానారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు సాక్ష్యులను విచారించి చిన్నపురెడ్డిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్నపురెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.

పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదో చూపించిందని..

రాష్ట్రవ్యాప్తంగా గాఢాంధకారం నెలకొంది. ఎప్పుడు విద్యుత్తు ఉంటుందో తెలియని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్తు ఉన్నప్పుడే పనులు చేసుకోవాలని కంగారుపండేంత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలున్నారు. దీనికి కారణాలు పరిశీలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్తు ఆధారిత పరిశ్రమలు దెబ్బతిన్నాయి. నష్టం అంచనాలు లక్షలాది కోట్లాది రూపాయలకు చేరుకుంది. నిరంతర విద్యుత్తుపై ఆధారపడే పరిశ్రమలు ప్రతీనెలా తమ లీజులను, అద్దెలను చెల్లించి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ తరహా పరిశ్రమలు ప్రతీజిల్లాలోనూ 50కు తగ్గకుండా ఉన్నాయి. 24గంటలు విద్యుత్తుపై ఆధారపడిన కోళ్లపరిశ్రమల్లోనూ అద్దెలు చెల్లించి అమ్మకాలు జరిపేసి కొత్త ఉత్పాదనను ఆపేస్తున్నారు. విశాఖ ఉక్కుకారాగారంలో మూడు యూనిట్లు ఇప్పటికే మూసేశారు. మిగిలిన రెండు యూనిట్లను కూడా వీలైనంత త్వరలో మూసేందుకు యాజమాన్యం సిద్ధం అవ్వొచ్చు.   సుప్రీం కోర్టు ఇచ్చిన నోవర్కు నోపే కింద ఇక్కడ కార్మికులకు పెద్ద దెబ్బతగులుతోంది. జలవిద్యుత్తు, గ్యాస్‌ఆధారిత విద్యుత్తు, బొగ్గుపై ఆధారపడే విద్యుత్తు తయారీల్లో కొత్తపరిశ్రమలకు అనుమతులు ఇవ్వలేదు. అలానే ఉత్పత్తిపై ప్రభుత్వ అజమాయిషీ కూడా కొరవడిరది. అందుకే ఒక్కసారిగా జలవిద్యుత్తు ఆగిపోతే ఏమి చేయాలో తెలియని స్థితికి రాష్ట్రప్రభుత్వం చేరుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సీలేరు తదితర జలవిద్యుత్తు కేంద్రాల్లో పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం విద్యుత్తు సమీక్షలు ఏడాదికోసారి అభివృద్థి దిశగా జరిపిన దాఖలాలు లేవు.   అలానే గ్యాస్‌పరిశ్రమలు రాష్ట్రంలో నెలకొల్పితే అజమాయిషీ కేంద్రానికి మాత్రమే ఉండేలా రాష్ట్రప్రభుత్వం తన హక్కును వదిలేసుకుంది. కాకినాడలో గ్యాస్‌ తయారు చేస్తే గుజరాత్‌కు అది తరలిపోతున్నప్పుడు రాష్ట్రప్రభుత్వం తన పర్సంటేజీని కోరకుండా గ్యాస్‌లిమిటేషను బాధ్యత కేంద్రానికి వదిలేసింది. దీంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది. గ్యాస్‌, పెట్రోలియం శాఖా మంత్రి జైపాల్‌రెడ్డి కూడా కళ్లున్నా కబోదిలా రాష్ట్రఉత్పాదన ఇతరరాష్ట్రాలకు పోతుంటే ప్రేక్షకపాత్ర పోషించాడు. ప్రధాని మందలిస్తే కానీ, జైపాల్‌రెడ్డి తన కదలలేనితనాన్ని చాటుకున్నాడు. ఓ అసమర్ధమంత్రి, ఓ అసమర్ధ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి విద్యుత్తు విషయంలో నాటకాలాడుతున్నాయని తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శ నూటికి నూరుపాళ్లు నిజమే. ఇక్కడ ఖనిజసంపదను, ఇక్కడి గ్యాస్‌ను దోచుకుంటున్న గుజరాత్‌తో కాంట్రాక్టును తెగతెంపులు చేసుకునే ఆలోచన ఇప్పటి దాకా రాష్ట్రప్రభుత్వం చేయలేదంటే దాని సమర్ధత ఇక ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు. ఓ రాష్ట్రప్రభుత్వం చేతకానిదైతే గాఢాంధప్రదేశ్‌గానే మిగులుతుందన్న విమర్శలకు తలొగ్గి కేంద్రం తాజాగా ఎన్‌టీపీసి సింహాద్రి నుంచి 350మెగావాట్ల విద్యుత్తు కేటాయించేందుకు సిద్ధమైంది. ఇదొక్కటీ రాష్ట్ర అవసరాన్ని తీర్చలేదన్న విషయం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గమనిస్తే బాగుంటుంది. గ్యాస్‌ప్లాంట్ల రద్దుకు ఉద్యమిస్తే కనీసం గ్యాస్‌సరఫరా అయినా మెరుగవుతుంది. ఈ విషయాన్ని ఈ దృతరాష్ట్ర ప్రభుత్వం గమనిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

బాపిరాజు భక్తి గెలిచింది

తిరుమల ... తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా కనుమూరి బాపిరాజుని మరోసారి ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమలేశుడే తనకు మరో అవకాశం ఇప్పించాడని కనుమూరి బాపిరాజు బలంగా నమ్ముతున్నారు. కొండలరాయడిమీద అత్యంత విశ్వాసాన్ని ప్రదర్శించే బాపిరాజు అత్యంత భక్తి ప్రపత్తులతో తన విధుల్ని నిర్వహిస్తారు. ఒక్కమాటలో చెప్పలంటే ఇప్పటివరకూ పాలకమండలి చైర్మన్ పదవిని చేపట్టిన మరే వ్యక్తీ ఇంత నమ్రతగా నడుచుకోవడాన్ని భక్తులు చూడలేదు. భగవంతుడి దర్శనంకోసం వచ్చే భక్తుల్ని ఆయన ప్రతీకలుగా భావించి గౌరవించాలనేది బాపిరాజు అభిమతం. అందుకే ఆయన ఎప్పుడూ మిగతావిషయాలమీదకంటే భక్తుల బాగోగులమీదే ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. వి.ఐ.పిలకు ఎంత ప్రాధాన్యమిస్తారో, సామాన్య భక్తులకు కూడా అంతే ప్రాధాన్యమిస్తారని బాపిరాజుకి భక్తుల్లో మంచిపేరుకూడా ఉంది. సౌమ్యగుణం, సత్ర్పవర్తన కలగలిసి బాపిరాజుకు మరోసారి టిటిడి చైర్మన్ పదవిని కట్టబెట్టాయన్నది చాలామంది అభిప్రాయం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి కనుమూరికి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సమయంలో మొదటి ఓటుని వేసే అవకాశం కనుమూరి బాపిరాజుకే వచ్చింది. ఆయన చెప్పులు విప్పి.. భక్తితో కోనేటిరాయణ్ణి తలుచుకుంటూ వెళ్లి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బాపిరాజు మంచితనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..? పాలకమండలిలోకూడా పెద్దగా మార్పులు చేర్పులు జరగకపోవడం మరో విశేషం. ఒకరిద్దరు సభ్యులు తప్ప మిగిలినవారందరికీ పాలకమండలిలో బాపిరాజుతోపాటుగా మరోసారి ఛాన్స్ దక్కింది.

ఏటీఎంలో రైలు టిక్కెట్టు

ఇకపై రైలు టిక్కెట్టు కొనాలంటే క్యూలో నిలబడాల్సిన పనిలేదు. నేరుగా వెళ్లి మిషన్ లో వివరాలు ఎంటర్ చేసి టిక్కెట్ కొనుక్కుని రైలెక్కేయొచ్చు. రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ఐదు స్టేషన్లలో ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్లని ఏర్పాటుచేస్తోంది. బేగంపేట, సికింద్రాబాద్‌, కాచిగూడ, మలక్‌పేట, సీతఫల్‌మండి స్టేషన్లలో ఈ మిషన్లను ఏర్పాటుచేస్తున్నారు. రిటైరైన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రయాణికులకు వీటిపై అవగాహనకల్పించేందుకు నియమిస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేసే మిషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ తోపాటు జనరల్, సెంకండ్ క్లాస్ టిక్కెట్లు తీసుకునే అవకాశంకూడా ఉంది. భవిష్యత్తులో మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ మిషన్లను అభివృద్ధిచేసి అన్ని స్టేషన్లలో పెట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకుల సాయంతో కాయిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసిన రైల్వేశాఖ కొత్తగా ఏర్పాటుచేస్తున్న టిక్కెట్ వెండింగ్ మిషన్లుకూడా బాగా సక్సెస్ అవుతాయని భావిస్తోంది.

ఎవడబ్బసొమ్మని..?

ఆరేళ్లలో రాష్ట్రంలో 60 స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. నేతలు పార్టీలు మారినప్పుడో, వేర్పాటువాదం పేరు చెప్పుకుని రాజీనామాలు చేసినప్పుడో ఆ స్థానాల్ని భర్తీ చేయడానికి ఉపఎన్నికలు జరపక తప్పని పరిస్థితి. టీ ఆర్ ఎస్ రాజీనామాల పర్వం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో బ్రహ్మకైనా చెప్పతరం కాదు. కాంగ్రెస్ లోంచి జగన్ వర్గాన్ని ఏరేసేందుకు చేసిన ప్రయత్నాలవల్ల మరోసారి ఉపఎన్నిక లొచ్చాయి. అయితే అభ్యర్థుల స్వలాభమో, లేక పార్టీలకు మూకుమ్మడి లాభమో రాజీనామాలు, కుప్పిగంతుల వెనకున్నఅసలు కాన్సెప్ట్ .. ఎన్నికల జరిపించిన ప్రతిసారీ కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. అభివృద్ధికి ఖర్చుపెట్టాల్సిన నిధుల్ని అనవసరంగా ఎన్నికలపేరుతో వృథాగా తగలేస్తే ఎవరికి లాభం అన్న ఆలోచనే ఏపార్టీకీ రాకపోవడం బాధాకరమైన విషయం. ఆరేళ్లలో ఇన్నిస్థానాలకు ఇన్నిసార్లు ఎన్నికలు జరిగాయాన్న విషయాన్ని తెలుసుకుని బ్రిటన్ నేతలు నివ్వెరపోయారు. కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాన్ని వ్యతిరేకించాల్సొచ్చినప్పుడు బ్రిటన్ లో కేవలం ఒకేఒక్క ప్రజాప్రతినిధిమాత్రం రాజీనామా చేసిన విషయాన్ని ఓ సారి తప్పకుండా గుర్తుచేసుకుని మన నేతలుకూడా తమనుతాము సరిదిద్దుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.

ఇంజినీరింగ్ చదువులకు ఫీజుల గ్రహణం

ఈ ఏడాది రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్య ప్రహాసనంగా మారింది. అన్నీ కాలేజీలకు ఒకే ఫీజు విధానం ఉండాలని ప్రయివేటు కాలేజీలు మొరాయిస్తున్నాయి. కొన్ని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ వత్తిడి మేరకు 35 వేల రూపాయలకు ఆమోదించినప్పటికీ మరికొన్ని కాలేజీలకు 50,200 రూపాయలు కోర్టు ఉత్తర్యుల ద్వారా పొందటంతో మరికొన్ని కళాశాలల ఫీజు ఎఐఆర్‌సి ద్వారా వెలువడనున్న నేపద్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీల సమస్య మళ్లీ సమస్య మొదటి కొచ్చింది. ఇప్పటికే ఆలస్య మయ్యిందని, రీఎంబర్స్‌మెంట్‌ ప్రభుత్వమే భరించాలని విద్యార్ధిసంఘాలు ఆందోళన  చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజును ఖరారు చేయకుండానే కౌన్సిలింగ్‌ తేదీలను ప్రకటించింది. రాష్ట్రంలో ఎమ్‌సెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో చేరాల్సిన విద్యార్ధులకు భవిష్యత్‌ అంధకారంగా మారింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో అడ్మిషన్లు పూర్తైపోయి నెలరోజులయ్యింది. రెగ్యులర్ గా క్లాసులుకూడా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటిదాకా కౌన్సిలింగ్ కే దిక్కులేదు. తీరా కౌన్సిలింగ్  తేదీల్ని ప్రకటించాక, కాలేజీ యాజమాన్యాలు.. ఫీజులు అందరికీ సమానంగా ఉండాలంటూ కొత్త ఆందోళన మొదలుపెట్టాయి. ఫీజలు పెంచకపోతే కాలేజీలు నడపలేమని యాజమాన్యాలు, పెంచితే బిసిలకు రిఎంబర్స్‌మెంట్‌ ఇవ్వటం కష్టమని ప్రభుత్వం గట్టిగా పట్టుపడుతున్నాయి. విద్యార్థులకు మాత్రం పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది. 

చేతులు కాలాక.. ఏవో పట్టుకున్నట్టుంది!

                                                                                                             చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది ప్రభుత్వం తీరు. కాస్తోకూస్తో కరెంటున్నప్పుడు చెప్పాల్సిన  మంచి మాటల్ని ఇప్పుడు పూర్తిగా అంధకారం చుట్టుముట్టాక  బైటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మన అమాత్యవర్యులు. అసలే కరెంటు లేక నానా.. అగచాట్లు పడుతున్న జనానికి ఈ మాటలు పుండుమీద కారం చల్లినట్టు సలపరం పెడుతున్నాయి. చేసేది లేదు చచ్చేది లేదుగానీ.. ఊరికే వచ్చాయని మాటలు మాత్రం చెబుతున్నారా అంటూ జనం మండిపడుతున్నారు. రైతులతోపాటుగా మామూలు జనంకూడా తిరగబడి ట్రాన్స్  ఫార్మర్ లను ధ్వంసం చేస్తూ, విద్యుత్ పంపిణీ కార్యాలయాలను ముట్టడిస్తూ, ఉద్యోగుల్ని చావగొడుతుంటే.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో మంత్రులు, అధికారులు ఈ  అదా సూత్రాన్ని వల్లెవేస్తున్నారన్న విషయంకూడా అందరికీ తెలిసిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరంగా నడుస్తున్న ఏసీల్ని, లైట్లను, ఫ్యాన్లను ఆపేయడం, హోర్డింగులకు కరెంట్ ని నిలిపేయడం లాంటి చర్యలు ముందుగా తీసుకునుంటే ఇంత గడ్డుపరిస్థితి ఎదురయ్యేది కాదన్నది సామాన్యులకుకూడా చాలా స్పష్టంగా అర్థమైన సత్యం. మరి మంత్రులకు ఇంత చిన్నవిషయం ఎందుకు అర్థంకాలేదోగానీ.. మొత్తంగా వ్యవస్థ కుప్పకూలిన తర్వాతే ఇలాంటి మంచి ఆలోచనలు అమాత్యులకు పుట్టుకొస్తున్నాయన్న విషయం మాత్రం అందరికీ తెలిసిపోయింది. జనానికి ఇప్పుడు కావాల్సింది ఇట్టాంటి పోచుకోలు కబుర్లు కాదు. ఇబ్బందిని తీర్చే మార్గాలు. ఉత్పత్తిని ఎలా పెంచాలి, అవసరమైతే పొరుగు రాష్ట్రాలనుంచి కొనైనా సరే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలా చూడాలి అన్న విషయంమీద  ముఖ్యమంత్రి, సంబంధిత  శాఖని చూస్తున్న మంత్రివర్యులు దృష్టిపెడితే కష్టంనుంచి గట్టెక్కడం  ఏమంత కష్టంకాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 

పగవాడిక్కూడా ఇలాంటి పాట్లొద్దు!

ముఖ్యమంత్రి పరిస్థితి, మంత్రుల పరిస్థితి క్షణం తీరికలేదు దమ్మిడీ ప్రజాసేవలేదు అన్నట్టుంది. కుర్చీలు కాపాడుకోవడానికి చిటికీమాటికీ ఢిల్లీ పెద్దలచుట్టూ చక్కెర్లు కొడుతున్న రాష్ట్ర  కాంగ్రెస్ నేతలు ప్రజాసేవను , పరిపాలనను పూర్తిగా గాలికొదిలేశారు. ఢిల్లీ పెద్దల అప్పాయింట్ మెంట్లకోసం రోజులకొద్దీ పడిగాపులు పడుతూ విలువైన సమయాన్ని వృథాచేస్తున్నారు. ప్రస్తుతం మన మంత్రులకు ప్రజల సమస్యలకంటే పదవుల్ని కాపాడుకోవడమే ఎక్కువైపోయిందని జనం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    రోజూ కనీసం 2000మందితో కళకళలాడుతూ కనిపించే సచివాలయం బోసిపోతోంది. పరిపాలన పూర్తిగా కుంటుపడింది. కరెంటు కష్టాలు, ఇంజినీరింగ్ కౌన్సిలింగ్  లాంటి ముఖ్యమైన సమస్యల్ని పట్టించుకోకుండా కుర్చీలాటలో తలమునకలైఉన్న నేతల్ని ప్రజలు తిట్టుకుంటున్నారు. సిబిఐ చార్జ్ షీట్, జగన్ వర్గాన్ని టార్గెట్ చేయడం, పదవులు కాపాడుకోవడానికి పైరవీలు చేసుకోవడం ప్రస్తుతం అధికారపక్షానికి పరమావధిగా మారిపోయింది.  అభివృద్ది మాట దేవుడెరుగు, రోజురోజుకీ రాష్ట్రం అధోగతి పాలవుతున్న సంగతిని మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదు.కేంద్రం నుండి పిలుపులు, ఢిల్లీలో మీటింగులు, రాష్ట్ర పరిపాలన ప్రక్షాళన లాంటి మాటలు తప్ప జనంగురించి పట్టించుకునే తీరిక , ఓపిక  ప్రభుత్వంలోఉన్న పెద్దలకు లేకుండాపోయింది. అనిశ్చితి, అప్పులు, ఆర్థికమాంద్యం జనంమీద పిడుగుపాటులా పడే రోజు ఎంతోదూరంలో లేదన్న విషయాన్ని అందరూ గాలికొదిలేస్తున్నారు.