చచ్చి బతికిన అవయవదాత

మన శరీరంలోని అవయాలను మనం బతికుండగా దానం చెయ్యడం కొద్దిగా కష్టమే! కాదనలేం! కానీ`మనం చనిపోయిన తర్వాత ఆ అవయవాలను అవసరమైన వారికి అమరిస్తే` మరోప్రాణం నిలబెట్టిన వారమౌతాం! సరిగ్గా అదే చేశాడో ఎనభై ఎనిమిదేళ్ళ వృద్ధుడు! అనారోగ్యంతో బాధపడుతున్న ఢల్లీికి చెందిన తేజ్‌రామ్‌(88) అనే ఆయన తన మరణానంతరం తన అవయవాలను పేదలకు దానం చెయ్యాలని లేఖ రాశాడు. సెప్టెంబర్‌ మూడో తేదీన ఆయన మరణించడంతో గంగారామ్‌ ట్రస్ట్‌వారు తేజ్‌రామ్‌ దేహంలోని కాలేయం, కిడ్నీలను సేకరించి, ముగ్గురు పేదలకు పునర్జీవితాన్ని ప్రసాదించారు. కాలేయాన్ని ఓ 35ఏళ్ళ వ్యక్తికి అమర్చగా, మరో ఇద్దరికి తేజ్‌రామ్‌ కిడ్నీలను అమర్చారు. దాంతో వీరు ముగ్గురు పరిపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. అవయవాలను దానం చేసిన అత్యంత వయోవృద్ధుడిగా రికార్డుల కెక్కిన తేజ్‌రామ్‌ ఎందరికో స్ఫూర్తి! మన మరణానంతరం కూడా మరొకరికి బతికే అవకాశం కల్పించే అవయదానం ఆహ్వానించదగిన, ఆచరించదగిన మంచి నిర్ణయం! మానవత్వానికి నిజమైన నిదర్శనం!

కడపజిల్లాలో ఓ పల్లెకి గురువారమంటే భయం

కడపజిల్లా జి.వెంకటాపురానికి గురువారం భయం పట్టుకుంది. గురువారమొస్తేచాలు వెంకటాపురంలో ఓ శవం లేస్తోంది. దెయ్యం భయం కాదు. రోగాలూ రొప్పులూ లేవు. కానీ.. ఓ సైకో గురువారం రోజున ఊరిమీదపడి కనిపించినవాళ్లనల్లా కాల్చిపారేస్తున్నాడు. ఇంతకీ ఆ సైకో చంపుతోంది ఎవర్నో తెలుసా.. వాళ్ల సొంత బంధువుల్నే. క్రికెట్టాడేటప్పుడు మొదలైన చిన్న గొడవని మనసులో పెట్టుకుని ఆస్తి తగాదాల్ని తిరిగి తవ్వుకుని వెంకటరమణ అనే యువకుడు ప్రత్యర్థుల్ని కాల్చి చంపుతున్నాడు. ఇదే గొడవలకు సంబంధించి జైలుకెళ్లొచ్చిన నిందితుడు జైలు పరిచయాల సాయంతో ఓ తుపాకీని సంపాదించి ప్రత్యర్థుల్ని ఇష్టంవచ్చినట్టు కాల్చిపారేస్తున్నాడు. 21 జూన్ 2102 గురువారం రోజున వెంకటరమణ ఊళ్లో మొదటి హత్య చేశాడు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తిని కాల్చిపారేశాడు. ప్రతిసారీ గురువారం రోజున మాత్రమే హంతకుడు దాడిచేస్తుండడంతో ఊరివాళ్లకు గురువారం రోజున తిండీ నిద్రా కరువయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు, ఊరివాళ్లకు రక్షణ కల్పించేందుకు ఓ పోలీస్ బెటాలియన్ ఊరంతా తిరుగుతూ కాపలా కాస్తోంది.

చంద్రబాబు తెలంగానం!

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విషయంలో చంద్రబాబు కాస్త దూకుడుగానే ముందుకెళ్తున్నారు. తెలంగాణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబుకి గట్టిగా లెసన్ తీసుకున్నాక ఆయన ధోరణిలో కాస్త దూకుడుతనం బైటపడుతోంది. దీంతో పార్టీకి చెందిన సీమాంధ్రనేతల గుండెల్లో గుబులు బయలుదేరింది. తెలంగాణ విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై నిర్ణయం తీసుకోవడానికి ముందు చంద్రబాబు సీమాంధ్ర నేతలతోకూడా భేటీ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో అనుకూల వైఖరివల్ల ఏం లాభాలున్నాయో, ప్రతికూల వైఖరివల్ల ఏం లాభాలున్నాయో చంద్రబాబుకి వివరించే ప్రయత్నం చేశారు సీమాంధ్ర నేతలు. మొత్తానికి పార్టీ అధ్యక్షుడిగా బాబు ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ అది తమకు ప్రతికూలంగానే ఉన్నా బాబు చెప్పిన మాటకి తుచతప్పకుండా కట్టుబడి ఉంటామన్న నిర్ణయాన్ని మాత్రం సీమాంధ్ర నేతలు గట్టిగానే వ్యక్తం చేస్తున్నారు.

రైతుల గతి ఇంతేనా...?

నాగర్‌కర్నూల్‌లో యూరియా కోసం ఎగబడిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.  ఈ దాడిలో నలుగురు రైతులు గాయపడ్డారు.   యూరియా కొద్దిగానే వచ్చిందని తెలిసి, తమదాకా రాదేమోనన్న ఆందోళనతో గుమికూడిన రైతులమీద పోలీసులు ప్రతాపం చూపించారు. అంతా అయింతర్వాత తీరుబడిగా తప్పులు దిద్దుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయిందన్న భావన ప్రజల్లో బాగా బలపడిపోయింది.  దాన్ని వదులుకోవడం ఇష్టంలేదేమో ప్రభుత్వంకాని, అధికారులు కాని  అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ధరలు పెరుగుతూనే ఉన్నాయ్. ధరలెందుకు పెరిగాయ్ అని అడిగితే పంటలు పండట్లేదు, దిగుబడులు సరిగ్గా లేవు అని చెప్పడంకూడా మామూలైపోయింది. పంటలు పండాలన్నా,  దిగుబడులు ఎక్కువ రావాలన్నా ముందు ఆయా పంటలను పండించే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, మందులు,  నీరు, కావలసిన ఆర్థిక సహాయం, సలహా సహకారాలు అందించాలి.   అయితే ఎరువుల కోసం ఆరాటపడిన రైతన్నకు పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలే దక్కాయి. చేప... చేప... ఎందుకు ఎండలేదంటే.. గడ్డివాము అడ్డమొచ్చింది..’ అన్నట్లు ... అమాయకులైన రైతుల్ని చావగొట్టిన పోలీసులు మీరంతా గలాటాచేశారు కాబట్టే మేం లాఠీ చార్జ్ చేయాల్సొచ్చిందంటూ సన్నాయి నొక్కులు నొక్కుటం విచిత్రంగా ఉంది.

చదువులతీరు మారాలి!

కొత్తకాపురానికి వెళ్ళే కూతురుకు  అత్త, ఆడపడుచులతో జాగ్రత్తగా మసలుకోమని అమ్మ చెప్పి పంపిస్తుంది. ఒకప్పుడు కొత్తగా కాపురానికి పంపించే కూతుళ్లకి పండంటి కాపురానికి పదో, పన్నెండో సూత్రాలుచెప్పి పంపించేవాళ్లు. ప్రస్తుతం రాష్ట్రంలో వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న విద్యార్ధుల పుణ్యం పుచ్చి సర్కారు వాళ్లక్కూడా ఈ సూత్రాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. అందుకోసం భారీ ఎత్తున కసరత్తుకూడా జరుగుతోంది. రాష్ట్రంలో  ఇంజనీరింగ్‌ విద్యార్ధుల్లో వృత్తినైపుణ్యాన్ని,  ఇంజనీర్లలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి  కృషిచేయాలని ప్రభుత్వానికి  రాష్ట్ర ఐటీ ఐటీఈఎస్‌ పరిశ్రమల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై ఇట్స్‌ఏపీ ప్రభుత్వానికి పది సూత్రాలతో ఓ ప్రణాళికను అందజేసింది. ఇవి సరిగ్గా అమలయ్యేలా చూస్తే, రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు, విద్యార్ధులకు మంచిరోజులు వచ్చినట్టే. భావి ఇంజనీర్లలో వృత్తినైపుణ్యం పెంచాలన్న ప్రభుత్వాశయం నిజంగా మెచ్చుకోదగిందే. ఎందుకంటే.. ఇప్పటివరకూ టెక్నికల్ చదువు తెలివితేటలమీద కాక, ర్యాంకులు, డొనేషన్ల మీద మాత్రమే బతుకుతోంది. వీలైతే ఈ సూత్రాన్ని కేవలం ఇంజినీరింగ్ విద్యకి మాత్రమే కాదు.. కిందిస్థాయినుంచి అన్ని తరగతులకూ వర్తింపజేయాలని రాష్ట్రంలో పిల్లల్ని చదివించుకుంటున్న తల్లిదండ్రులంతా కోరుకుంటున్నారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని, విద్యార్ధుల భవిష్యత్‌కై రూపొందించిన ఇలాంటి ప్రణాళికలు, విధానాల్ని నిజాయితీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

క్షణక్షణముల్ అధికారుల చిత్తముల్‌...

పుట్టుకతో వచ్చింది పుడకలతోగానీ పోదని పెద్దవాళ్లు చెబ్తూ ఉంటారు. ఈ మాటల్ని మన అధికారులు అక్షరాలా నిజంచేస్తున్నారు. మిగతా శాఖల్లో పనిచేస్తున్న అధికారులతో పోలిస్తే దేవాదాయశాఖ అధికారులతీరు కాస్త వేరుగానే ఉంటుంది. మా దారి అడ్డాదారి అంటూ అడ్డమైన నిర్ణయాలు తీసుకోవడంలో దేవాదాయశాఖ అధికారులకు సాటిలేని మేటి వేగాన్ని ప్రదర్శిస్తారుకూడా. ప్రజల, భక్తుల మనోభావాలతో వాళ్లకస్సలు పనిలేదు. డోన్ట్ కేర్ .. అన్నట్టుగా ఉండే తీరు మార్చుకునే ప్రసక్తే లేదు. బెజవాడ కనకదుర్గ ఆలయ అధికారుల సంగతైతే అసలు చెప్పాల్సిన పనేలేదు. అమ్మవారికి మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు 10వేల రూపాయల పట్టుచీర తీసుకొస్తే అధికార్లు దాన్నసలు తీసుకోనేలేదు. దసరా ఉత్సవాల్లో  అమ్మవారి అలంకారాలకోసం భక్తులిచ్చే చీరలు తీసుకోకూడదన్న నిర్ణయమే దీనికి కారణమనికూడా చెబుతున్నారు. ఈ రోజుల్లో మొక్కు తీర్చుకోవాలనే భక్తులు చీరలకు బదులుగా దానికి సరిపడా సొమ్ము ఇవ్వాలని సిబ్బంది సూచన. అధికారుల తీరుకి విసుగెత్తిపోయిన భక్తులు ‘గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా?’.  ‘అధికారులకు డబ్బిస్తే,  మొక్కుతీరుతుందా?’ అని తిట్టుకుంటున్నారు.

అంతా మంచోళ్లే.. మరి పాలకుండలోకి నీళ్లెలా వచ్చాయ్?

రాష్ట్రంలోని కార్పొరేట్‌  విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయని  ఉపముఖ్యమంత్రిగారన్నారు. అంతేకాదు కార్పొరేట్‌ విద్యాసంస్థలు  నాణ్యమైన విద్యను బోధించడం లేదని, విద్యను వ్యాపారంగా మార్చేశాయని తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయని  ఆవేదన చెందారు.  ఉపాధ్యాయ వృత్తికి క్రమంగా విలువ తగ్గిపోతున్నదని, బాలలకు విలువలతో కూడిన విద్యను అందించాలని, అప్పుడే సమాజంలో కుల, మత, ప్రాంత తారతమ్యాలను దూరంచేయవచ్చునని అన్నారు.  ఇలా  రవీంద్రభారతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు వ్యక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాళ్ళు చెప్పిన దాంట్లో  ఎంతో వాస్తవముంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలు  నాణ్యమైన విద్యను బోధించడం లేదని,   విద్యను వ్యాపారంగా మార్చేశాయని చెబుతున్నారు.. సరే కానీ.. అలా జరగకుండా చూసేందుకు ఎవరైనా నిజాయితీగా పనిచేశారా? అంటే మాత్రం నిశ్శబ్దమే సమాధానమౌతుంది.   భావితరం బాగుండాలంటే  నిజాయితీగల నేతలు ముందుకురావాలి! “నిజాయితీ అంటే ఏంటి? “ అని మన ప్రియతమ నేతలు మరో ప్రశ్నని సంధిస్తే మాత్రం మనం నోరెళ్లబెట్టకతప్పదుమరి.  

చూడు.. చూడు.. రాజధానిలో రోడ్ల తడాఖా!

సంపూర్ణ ఆరోగ్యవంతులకు సవాల్‌! ఇదేమిటి అనుకుంటున్నారా! నాకు ఇప్పటివరకు వళ్ళునొప్పులంటే ఎరుగను...అని ఎవరైనా సవాల్‌ చేస్తే.. వెంటనే మన రహదారులపై ప్రయాణించమనండి... భవిష్యత్‌లో మళ్ళీ అటువంటి సవాల్‌ చెయ్యరు... ఇదీ మన రహదారుల తడాఖా! రాష్ట్రంలో రహదారుల వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు  రహదారులు వాటి ఆనవాళ్ళు కోల్పోతున్నాయి.  సాధారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులు మరమ్మతులు చేయాలన్నా, కొత్త రోడ్లు వేయాలన్నా వర్షాకాలం రాకముందే పని చేయాల్సి ఉంటుంది.  కానీ ఆర్‌ అండ్‌ బి మాత్రం అందుకు విరుద్ధంగా  వర్షాకాలం మొదలైన తర్వాత  కొన్ని జిల్లాల్లో మరమ్తతులు,  కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టింది.  రాజధానిలో రోడ్ల పరిస్థితి గురించి ఆయా అధికారులను కదిలిస్తే జీవవైవిధ్య సదస్సు జరిగే సమయానికి కొత్త రోడ్లు వేయాల్సి ఉందని, అందుకే ఇప్పుడు వేయటం లేదని సమాధాన మిస్తున్నారట.  కనీసం  రోడ్లకు మరమ్మతులైనా చేస్తే పరిస్థితి కొంతవరకైనా  మెరుగుపడే అవకాశం ఉంటుంది. గుంతలు పడిన రోడ్లపై ప్రయాణిస్తున్నవారిలో కొందరికి నడుం నొప్పి వస్తుంటే, ఇంకొందరు  వెన్నెముకలోని డిస్క్‌లు దెబ్బతింటున్నాయి. 25`30 సంవత్సరాల మధ్య వయసు వారు  ఎక్కువగా నడుంనొప్పితో తన దగ్గరికి  వస్తున్నారంటూ ఓ ఆర్థోపెడిక్‌ వైద్యుడు తెలిపారంటే  రహదారుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రతీదీ వ్యాపారం అయిపోయింది. రోడ్లేయడంకూడా వ్యాపారమే. వర్షాకాలంలో రోడ్లేస్తారు, సీజన్ పూర్తయ్యేసరికి ఆ రోడ్లు కనిపించకుండా పోతాయ్. మళ్ళీ టెండర్లు గట్రా మామూలే.. మళ్ళీ వర్షాకాలంలోనే కొత్త రోడ్లొస్తాయ్. బ్రిటీషోళ్లేసిన వందల యేళ్ళనాటి వంతెనలు నేటికి చెక్కుచెదరకుండా ఉంటే కొత్తగా కట్టిన వంతెనలు మాత్రం కుప్పకూలుతున్నాయ్. మన రోడ్లమీద గర్బిణీ ఆసుపత్రికి బయలుదేరితే.. దారిలోనే ప్రసవమైపోతుంది. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే నేతలు కనిపించినట్టు, వర్షాకాలంలోనే వర్షాకాలంలో మాత్రమే రోడ్లేసేవాళ్లు కనిపిస్తారు. ఆ తర్వాత పరిస్థితి మళ్ళీ మామూలే! ప్రభువులు అలాగే ఉంటారు. ప్రజలు ఇలాగే బాధలు పడుతుంటారు. రోడ్లు కనిపించినంత కాలం కనిపించి మాయమైపోతుంటాయ్.

మాయా...మాయా... అంతా మాయా...!

మాయా... మాయా... అంతా మాయ... ఆధునికత మనిషికి ఎంత సౌలభ్యాన్ని ఇస్తుందో.. అంతకంటే ఎక్కువగా ప్రమాదానికి కారణమవుతోంది. మార్కెట్‌ల్లోకి ఒక వస్తువు వచ్చిన మరుక్షణంలోనే అటువంటి వస్తువే.. క్లోనింగ్‌ రూపంలో మార్కెట్‌లోకి విడుదలవుతుంది. మంచి`చెడులు ఎంచుకునే సమయం వచ్చేసరికి ఎంతోమంది నష్టపోతుంటారు. ... ఎటిఎంలను ఇప్పుడు ప్రతి బ్యాంకు ఇస్తోంది. వాటికి మంచి భద్రత కూడా ఉంది. అయితే.. కాదేదీ క్లోనింగ్‌కు అనర్హం... అన్న రీతిలో ఎటిఎం కార్డులను క్లోనింగ్‌ చేయడం ద్వారా కొందరు డబ్బులను డ్రా చేయడంతో బ్యాంకుల్లో వున్న తమ డబ్బు పోయి ఎంతోమంది బాధితులు విలవిలలాడిపోతున్నారు. గతంలో ఢల్లీ, బీహార్‌ రాజధాని పాట్నాలలో ఇలా విత్‌ డ్రా అయ్యాయి. కొత్తగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఈ సంఘటన జరిగింది. అయితే ఇటువంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి. నేడు ప్రతి సంస్థ జీతాలు బ్యాంకుల నుండే ఇస్తున్నాయి. అందుచేత ఇకనుంచి ఇటువంటి వాటిపై మరింత భద్రతను ఆయా బ్యాంకులు తీసుకోవలసి ఉంది. లేదంటే ఎటిఎం కార్డుల క్లోనింగ్‌ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు వింటూ వుంటే సాంకేతికంగా మనిషి సాధించిన ప్రగతి పురోగమనానికి దారితీస్తోందా... తిరోగమనానికా...! అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అనేముందు ఆలోచించండి !

రాజకీయాల్లో ఎప్పుడు తమ పేరు కనపడుతుండాలంటే ఏం చేయాలి..అన్న సందేహం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి వస్తే... వారంతా మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధినేత రాజ్‌ ఠాక్రేను అనుసరిస్తే చాలు...! నిత్యం మన గురించి ప్రజలు చెప్పుకునేలా ఎలా చేయాలో బహుశా రాజ్‌ఠాక్రే.. బాల్‌ ఠాక్రే నుండి స్ఫూర్తి పొందిఉంటారు. అసలు విషయం ఏంటయ్యా అంటే ముంబైలో ఇటీవల జరిగిన అల్లర్లలో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు అతన్ని ఆ రాష్ట్రంలో అరెస్ట్‌ చేశారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ ముంబై పోలీసులపై చర్యలకు బీహార్‌ పోలీసులు సంసిద్ధమయ్యారు. దీంతో మహారాష్ట్రలో ఉన్న బీహార్‌ వాసులను చొరబాటుదారులుగా ముద్రవేసి, ఇక్కడి నుండి వెళ్ళగొడతామని రాజ్‌ ఠాక్రే హెచ్చరించడం అక్కడ పెనుదుమారానికి కారణమయింది. ఇటువంటి నేతల మాటలు,లోపాయికారిగా చేసే చేష్టలు... ‘మేం తాంబూలాలు ఇచ్చేసాం. ఇక మీ ఇష్టం...’ అనేట్లుగా వుంటాయి. ఆ తర్వాత మీ దయ... మా ప్రాప్తం!

అంతా మామూలేనా...!

సందర్భం ఏదైనా.. కొన్ని సందర్లాల్లో ఆయా వ్యక్తులు చేసే పనులు కొంతకాలం గుర్తుండి పోతాయి. అది ఏయే సందర్భాల్లో చేశారన్న విషయం నామమాత్రంగా గుర్తున్నా ఆ చర్య మాత్రం... అలా.. గుర్తుండిపోతుంది. గతంలో ఓసారి ఇండియా అద్భుత విజయం సాధించిన సందర్భంలో... ఆ సమయంలో ఇండియన్‌ క్రికెట్‌ టీంకు కెప్టెన్‌గా వున్న గంగూలీ చొక్కా గాలిలో తిప్పుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.     సినిమాల్లో అయితే చొక్కా లేకుండా చాలా సార్లు నటించిన నటుడుగా సల్మాన్‌ఖాన్‌ గుర్తుండిపోతాడు. చాలామంది సల్మాన్‌ కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభమయిందంటే చాలు.. అందులో చొక్కా విప్పదీసే సీన్‌ ఉంటుంది... అని రూఢీ అయిపోయేవారు. అలాగే జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా పార్టీకి చెందిన ఎం.ఎల్‌.ఎ. సమరేష్‌సింగ్‌ అసెంబ్లీలో తన చొక్కాను చించుకుని ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు. బొకారో నిరాశ్రయులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిరాశ్రయులైన వారికోసం ఓ కమిషన్‌ను వేయాలన్న తన డిమాండ్‌కు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అందుకు నిరసనగా సింగ్‌గారు తన చొక్కాచించుకుని వినూత్నరీతిలో తన నిరసనను తెలియజేశారు. ఆ రోజు అసెంబ్లీలో మాత్రం ఈ విషయంపై ఈ సింగ్‌గారు ఈజ్‌ కింగ్‌ అనిపించుకున్నారు. కాకుంటే వచ్చిన చిక్కల్లా ఏంటయ్యా...! అంటే... స్కూల్లో పిల్లలు టీచర్‌ తను చేసిన హోమ్‌ వర్క్‌ను ముందు దిద్దలేదని చొక్కా చించుకున్నాడనో.... రైళ్ళు గంటలతరబడి ఆలస్యంగా వస్తున్నాయంటూ ఎవరైనా చొక్కాలు చించుకున్నారనుకోండి... పరిస్థితి ఏంటీ..! అబ్బే! ఏం కాదు...చినిగిన చొక్కా మళ్ళీ కుట్టిచ్చుకుంటారు అంతే...! అంతా మామూలే...!

హింస ఓ ఫ్యాషనైంది..!

తూర్పు ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా వస్తున్న వాహనదారుడిని పోలీసులు ఆపాలని కోరినా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో ఓ కానిస్టేబుల్‌ వాహనదారుడిపై లాఠీవిసరడంతో బండిపై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారని, ఒకరికి గాయాలయ్యాయని సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అయితే పోలీసులు హెల్మెట్‌ లేకుండా వెళుతున్న వాహనదారుడిని ఆపమని కోరామని మద్యం సేవించివుండటంతో వాహనాన్ని అదుపుచేయలేకపడిపోయారని పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే నేను కుందేలుకు ఒక కొమ్ము చూశానని ఒకడంటే, మరొకడు నేను రెండు చూశానన్నట్ట...! అలాగే వాహనదారుడికి గాయాలయ్యాయని కొందరు, కాదు ఒకరు చనిపోయారంటూ మరికొందరు అంటున్న నేపథ్యంలో స్థానికంగా నివశించే కొందరు యువకులు ప్రయాణికుల బస్సులు, పలుషాపులు, ద్విచక్రవాహనాలకు నిప్పంటించేశారు. అంతేకాకుండా, సమీప పోలీస్‌పోస్ట్‌ వద్దకు వెళ్ళి రాళ్లు రువ్వడం ప్రారంభించేశారు. ఈ గొడవలు చేసేది వాహనదారుడికి సంబంధించనవారేనా అంటే నిజం తెలియదు.. ఏదో అల్లర్లు చేయాలి కాబట్టి... దానికి ఒక కారణం.. కావాలి... అన్నట్లుగా తయారయ్యంది నేటి పరిస్థితి. వాస్తవాలను గుర్తించి తప్పుచేసింది ఎవరైనా శిక్షపడాల్సిందేనంటున్నారు సాధారణ ప్రజానీకం...!

అధికారంకోసం చంద్రబాబు కొత్తపాట్లు!

ఒకనొకప్పుడు హైటెక్ ముఖ్యమంత్రి అని పిలిపించుకున్నారు. ఇప్పుడేమో అధికారం కోసం నానా అవస్ధలు పడుతున్నారు. తన తొమ్మిదేళ్ల పాలన ఓ అద్భుతమని ఆయన అనుకుంటున్నారు. అప్పటి కరువుకష్టాలను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. అయితే ఇటీవల బీసి డిక్లరేషను ప్రకటించి ఆ కులసంఘాలను తనవైపుకు తిప్పుకోవటం ద్వారా 49శాతం ఓటుబ్యాంకు మళ్లిందని అభిప్రాయపడుతున్నారు. వందస్థానాల్లో అవకాశమిస్తానని ఆయన బీసిలకు ఇచ్చిన భరోసా కూడా ఫలవంతమవుతుందని ఆశిస్తున్నారు. తాను ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే 2012 ఉపఎన్నికల్లో పార్టీ ఘోరంగా వోడిపోయిందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. అందుకని తాను, తన పార్టీ కార్యకర్తలూ ప్రజల్లో ఉండేందుకు 117రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన 2014 ఎన్నికలయ్యేటప్పటికి మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని తెలుగుదేశం శ్రేణులు కూడా నమ్ముతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీసబ్ప్లాన్పై దృష్టి సారించిన నేపథ్యంలో గిరిజనుల ఓటుబ్యాంకు సాధించుకునేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నారు.  ప్రజల వద్ద  117రోజులు గడిపిన తరువాత బాబు రాష్ట్రస్థాయిలో బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అదీ జనవరి 14వతేదీ అని కూడా ప్రకటించారు. పనిలోపనిగా అన్ని జిల్లాల్లోనూ మినీమహానాడు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతున్నారు. మిగిలిన స్థానాల్లో 58నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించటం ద్వారా పార్టీని కూడా పట్టిష్టం చేయాలని బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏమైనా ఈసారి మా చంద్రబాబు పక్కా ప్లానింగ్తో పర్యటిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

కాంగ్రెస్ లో కుల సమీకరణాలు?

కాంగ్రెస్ పార్టీ కులసమీకరణల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నతస్థాయి మార్పులు తప్పవంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం కదలకపోయినా డిప్యూటీ సిఎం, పీసిసి అధ్యక్ష స్థానాలు కొత్తగా కుల సమీకరణల ఆధారంగానే మారబోతున్నాయి. ఇప్పటి దాకా బీసిల్లో మంచి పట్టున్న పీసిసి చీఫ్ బొత్సా సత్యన్నారాయణని ఉప ముఖ్యమంత్రి పదవి వరిస్తుందన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయ్. ఇదేగనక నిజమైతే ఓ రెడ్డి, ఓ బీసి రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చాటింపేసుకునే అవకాశం కాంగ్రెస్ కి దొరుకుతుంది. రెడ్డికులానికి కాంగ్రెస్ కొమ్ము కాస్తోందంటూ కాపులనుంచి వినిపిస్తున్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు చిరంజీవికి కేంద్ర మంత్రిపదవి ఇవ్వొచ్చనే ఊహాగానాలుకూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. పీసిసి చీఫ్ పదవికి మంత్రి కన్నా లక్ష్మినారాయణను ఎంపిక చేయొచ్చని మరో ప్రచారం జరుగుతోంది. డెప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క కూడా ఈ రేసులో ఉన్నారు. ఒకవైపు రెడ్డి సామాజికవర్గాన్ని సంతృప్తిపరుస్తూనే రెండోవైపు కులాల ఆధారంగా మార్పులు చేసి 2014 నాటికి తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకొన్ని మార్పులు చేర్పులుకూడా ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్ఆర్సిపిలో ఉప్పునూతలను ఆకట్టుకున్నదేమిటో?

ఒకప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులై చెట్టాపట్టాలేసుకోవటం రాజకీయంలో షరా మామూలే అంటుంటారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి కూడా మినహాయింపుకాదు. ఒకప్పుడు వైఎస్ను వ్యతిరేకించేవారు. అసలు తెలంగాణా రాకపోవటానికి వైఎస్ఆర్ కారణమని చిటపటలాడిన వ్యక్తిగా పురుషోత్తమరెడ్డికి బాగా గుర్తింపొచ్చింది. అప్పట్లో వై.ఎస్ మీద అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడ్డ పెద్దాయన ఇప్పుడు పూర్తిగా మాటమార్చారు. అదే నోటితో తాను వైఎస్ హయాంలో చూసినంత అభివృద్థి మళ్లీ చూడలేదంటూ డంకా బజాయించి చెబుతున్నారు. ఉప్పునూతలకి మొదట్నుంచీ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. అతిగా ప్రేమించడం, అతిగా ద్వేషించడం ఆయనకు అలవాటేనని ఆయన సన్నిహితులంటుంటారు.   ఇప్పుడు మళ్లీ వైఎస్ మీద పెద్దాయనకి బాగా ప్రేమపుట్టుకొచ్చిందేమో.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అందరూ లబ్ది పొందారని, అప్పటి సంక్షేమపథకాలు అన్ని వర్గాలకు మేలు చేశాయని, రాష్ట్రంలో ప్రస్తుతం పాలన స్తంభించిపోయిందని,  తాను ఈ నెల 9న వైకాపాలో చేరనున్నానని, జగన్మోహనరెడ్డి సమర్ధవంతమైన నేతగా ఎదుగుతాడని ఉప్పునూతల ప్రకటించారు. మరి వైఎస్ బతికున్న రోజుల్లో ఆయన తెలంగాణారాష్ట్రం రాకుండా అడ్డుపడుతున్నారని, వైఎస్ అభివృద్థి నిరోధకుడని చేసిన ప్రకటనల మాటేంటి? అసలు ఉప్పునూతల జగన్ వర్గంలో చేరడానికి బలమైన కారణాలేంటోనని అంతా అనుకుంటున్నారు.    కేవలం జగన్మోహనరెడ్డి పిలుపు ఇచ్చారని ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక తెలంగాణావాదులు పట్టించుకోలేదని అలిగారా? కాంగ్రెస్లో ఉంటే టిఆర్ఎస్తో ఉండే దోస్తానా దెబ్బతింటోందనిపించిందా? వైఎస్సార్సీపీలో చేరితే ఈసారి ఎన్నికల్లో తేలిగ్గా విజయం సాధించేయొచ్చనా? ఏమో.. ఉప్పునూతల మనసులో ఉన్న మాటని ఆయనంతట ఆయన బైటపెడితేతప్ప కనుక్కోవడం చాలా కష్టమే.

కొత్తవిత్తన చట్టం ప్రభుత్వానికి మంత్రదండమా?

రాష్ట్రంలో కొత్తవిత్తన చట్టాన్ని అమలు చేయబోతున్నామని ప్రకటించిన వ్యవసాయశాఖా రాష్ట్రమంత్రి కన్నాలక్ష్మినారాయణ మాయలు మంత్రాలు చేయబోతున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి పూర్తి వివరాలు చెప్పకుండా మంత్రి ఈ ప్రకటన చేయటం రైతులకు తీరని అసహనాన్ని కలిగిస్తోంది. అసలు కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ఏ ప్రతిపాదనలు పంపించింది? వాటిలో ఏవి అమలు చేయబోతున్నారు? కేంద్రం ఆమోదించిన కొత్తవిత్తన చట్టంలో రాష్ట్రం సూచించిన 17సవరణలేంటి? అవి నిజంగా రాష్ట్రరైతులకు ఉపయోగపడతాయా? లాంటి సందేహాలు మంత్రి ప్రకటన తరువాత రైతులకు బాగా పెరిగిపోయాయ్. రాష్ట్రంలో విత్తన చట్టం అమలు చేసేందుకు మంత్రి ఏర్పాటు చేసే కమిటీలో అసలు రైతుల పాత్ర కానీ, రైతు సంఘాల నాయకుల పాత్ర కానీ ఉంటుందా అన్న కొత్త అనుమానం కూడా బయలుదేరింది. రైతులు కాని వారికి అధికారం అప్పగించి వ్యవసాయరంగ నష్టాలకు ప్రభుత్వమే కారణమవుతోందని తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ కి ప్రభుత్వ విధానాలే కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కిరణ్ కి జలగండం?

శ్రీశైలం నీటిని విడుదల చేస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన కర్నూలు పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి తన డిమాండును నెరవేర్చుకోవటంలో విజయం సాధించారు. ఆయన పట్టుదలకు సిఎం కిరణ్కుమార్రెడ్డి తలొగ్గారు. అలానే నాగార్జునసాగర్ నీటిని డెల్టాకు వదలొద్దని లేఖ రాసిన నల్గొండ జిల్లా పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేంద్రరెడ్డి, సిఎం స్పందిస్తారని ఎదురుచూస్తున్నారు. డెల్టాకు నీరివ్వకపోతే మేమెలా పంట వేయాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైతులకు మద్దతుగా దీక్షలు చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తదనుగుణంగా పాచికలు కదుపుతోంది. తాజాగా మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్ అవనిగడ్డలో కృష్ణా డెల్టా నీటికోసం నిరవధిక దీక్ష ప్రారంభించారు. అయితే సిఎం మాత్రం కృష్ణా నీటితగవులు తీర్చలేక ఇదేం జలప్రళయంరా నాయనోయ్.. అంటూ తలపట్టుకుని కూర్చుంటున్నారు. ఒకవైపు రాజీనామాలు, మరోవైపు దీక్షలు కిరణ్ తలకు బొప్పికట్టిస్తున్నాయి. ఇవి చాలక తెలుగుదేశం పార్టీ నేతలు తాము రైతుల పక్షాన నిలబడ్డామని నిరూపించుకునేందుకు కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయాలన్న డిమాండుతో చేస్తున్న ఆందోళన కిరణ్ కుమార్ రెడ్డికి మరింత తలనొప్పిగా మారింది. కిరణ్ పరిస్థితి ఇప్పుడు ముందునుయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది.

వైఎస్సార్సీపీవైపు మంత్రి పినిపే చూపు

రాష్ట్రపశుసంవర్థకశాఖా మంత్రి పినిపే విశ్వరూప్ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. తొలిసారి ఎంపితో పాటు అవకాశం కలిసి వస్తే కేంద్ర మంత్రి అయి రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందాలని ఆయన కోరుకుంటున్నారు. ఈయన అంచనాల ప్రకారం వైకాపా కేంద్రంలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తే 2014లో యుపిఎలో వైఎస్సార్సీపీ భాగస్వామి అవుతుంది. లోక్సభ స్పీకర్గా జిఎంసి బాలయోగి కోనసీమ నుంచి ఇలానే ఎంపికయ్యారని పినిపే గట్టిగా నమ్ముతున్నారు. అవకాశంకోసం, సమయం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారు. అందుకే ముందస్తుగా తన కొడుకుని వైఎస్సార్సీపీలో చేర్చారు. కాంగ్రెస్ నేతలకు తెలియకుండా తన రహస్య ఆలోచనను జగన్ ముందుకు కుమారుని ద్వారా పినిపే చేరవేశారని తెలుస్తోంది. ఇప్పటికే తన సొంత నియోజకవర్గమైన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని సన్నిహితుల్ని మంత్రిగారు మచ్చికచేసుకుంటున్నారు. జైభీమ్ అసోసియేషన్లను పక్కకు పిలిచి మీకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాను కానీ, నేను వైకాపా తరుపున పోటీ చేస్తానని ప్రచారం చేయాలని కోరుతున్నారట. రాజకీయపరిశీలకులు విశ్వరూప్పై నిఘా పెడితే తెలిసిన విషయమేంటంటే మంత్రిగారు ఆల్రెడీ ఛోటా, మోటా నేతలను వైకాపాలో చేరుస్తూ వారిని అస్తమాను పిలిపించుకుని అక్కడి పరిస్థితి కనుక్కొంటున్నారట.