ఈగలు తోలుకుంటున్న యాంటీ నార్కోటిక్స్ సెల్

హైదరాబాద్ పోలీసులు ఆర్భాటంగా మొదలుపెట్టిన యాంటీ నార్కోటిక్స్ సెల్ సిబ్బంది ఇప్పుడు కేసుల్లేక ఈగలు తోలుకుంటున్నారు. 2012 ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఈ సెల్, మొదలైన రోజుకి ఉన్న కేసుల్ని మాత్రమే పరిష్కరించగలిగింది. తర్వాత కాలంలో ఒక్కటంటే ఒక్కకేసుకూడా కొత్తగా నమోదు కాలేదు. మారువేషాల్లో డ్రగ్ రాకెట్లను ఛేదించాల్సిన పోలీసులు, అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక, తమకు భారీగా నిధులిస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితంటూ చేతులెత్తేస్తున్నారు. సిసిఎస్, డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ లో భాగంగా పనిచేస్తున్న యాంటీ నార్కోటిక్స్ విభాగంలో ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం కొత్త కేసులకోసం భూతద్దంపెట్టిమరీ వెతుక్కుంటున్నారు.

రాజకీయ రాబందులు మాత్రమే మిగిలాయ్

రాబందులు అంతరించి పోయాయ్.. రాజకీయ రాబందులు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయ్.. నొప్పి, జ్వరం తగ్గడానికిచ్చే డైక్లోఫినాక్ పుణ్యమా అని రాబందుల జాతి అంతరించిపోయింది. ఎన్నిమందులేసినా రాజకీయరాబందులుమాత్రం, అంతకంతకూ బలంపుంజుకుంటూ దేశాన్ని దోచుకుతింటూనే ఉన్నాయ్. రాబందుని చూపిస్తే రెండు లక్షలు బహుమానమిస్తామంటూ జీవ వైవిధ్యమండలి ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజకీయ రాబందులకైతే రెండు లక్షలు మీరు ఇవ్వాల్సిన పనిలేదు. సీన్ లోకి ఎంటరైన పదినిముషాల్లో చకచకా అవి పనిచేసుకుపోతాయ్. స్పాట్ లో ఏమీ లేకుండా ఊడ్చిపారేస్తాయి. సుడిగాలిలా ఎంత స్పీడ్ గా వచ్చాయో.. అంతే స్పీడ్ గా పనిపూర్తికాగానే ఎగిరిపోతాయ్.. రోజురోజుకీ పెరిగిపోతున్న రాజకీయ రాబందుల్ని చూసి.. జనం భయపడుతున్నారు. ఎన్ని యుగాలు గడిచినా భూమ్మీద రాజకీయ రాబందుల మనుగడకు మాత్రం ఏమాత్రం ఢోకా లేదు.

కోరిక తీర్చలేదని అబ్బాయిని పొడిచిన అమ్మాయి

లండన్ లో ఓ మహిళ తన కోరిక తీర్చాలేదని కోపం వచ్చి ట్యాక్సీ డ్రైవర్ ని పన్నెండు చోట్ల పొడిచింది. దీంతో లుమినిటా పెరిజోక్ (30) అనే ఆ మహిళపై రొమేనియన్ టాక్సీ డ్రైవర్ నికోల్ స్టాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెరిజోక్  ట్యాక్సీ దిగిన తర్వాత లాగేజ్ ఎక్కువగా ఉందని డ్రైవర్ నికోల్ ను అపార్ట్‌మెంట్ వరకు తీసుకురమ్మని కోరింది. అతను లాగేజ్ తీసుకొని లోపలి వెళ్ళిన తరువాత శృంగారానికి రమ్మంటే తాను నిరాకరించగా కత్తి చూపించి బట్టలు విప్పమని చెప్పింది. ఎలాగోలా బెడ్‌రూంలోకి దూరిన అతను పోలీసులకు ఫోన్ చేసి వారి సాయంతో బయటపడినట్లు చెప్పాడు. అతడిని ఆస్పత్రికి తెసుకొని వెళ్లగా పన్నెండు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కానీ కత్తి చూపించి బెదిరిస్తే మిస్ రొమేనియా వచ్చినా శృంగారం చేయడం అసాధ్యమని స్టాన్ అంటున్నాడు.

తడిసి ముద్దైన దేశ రాజధాని

దేశ రాజధాని న్యూఢిల్లీ వర్షంతో తడిసి ముద్దైంది. న్యూఢిల్లీలోని రోడ్లు కాలువలను తలపించాయి. గత తొమ్మిదిరోజులుగా వర్షాలు పడుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో హత్నికుండ్ బ్యారేజీ నుండి విడుదలైన నీటితో యమునా నది ప్రమాద స్థాయిని దాటుతుంది. యుమునా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. యమునానది మామూలు స్థాయి 202.30 మీటర్ల కన్నా స్థాయిలో ప్రవహిస్తుంది. యమునానది పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 307.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది.

టిటిడి కొత్త పాలకమండలి ప్రమాణస్వీకారం

టిటిడి పాలకమండలి పాలనా గడువు ముగియడంతో కొత్త పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టిటిడి చైర్మన్ బాపిరాజు మరో రెండు సంవత్సరాల పాటు చైర్మన్ పదవిలో కొనసాగేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిటిడి చైర్మన్ పదవి కోసం రాయపాటి సాంబశివరావు, మాజీ టిటిడి పాలకమండలి చైర్మన్లు టి.సుబ్బిరామిరెడ్డి, ఆదికేశవులు నాయుడు పోటీ పడినప్పటికీ ప్రభుత్వం బాపిరాజుకు చైర్మన్ పదవిని కట్టబెట్టింది. బుధవారం 13 మంది సభ్యుల్లో చైర్మన్ బాపిరాజుతో పాటు ఎనిమిది మంది సభ్యుల ప్రమాణ స్వీకారం ఉన్నందువల్ల జేఈవో శ్రీనివాసరాజు బుధవారం రాత్రి విఐపి దర్శనాలను రద్దుచేశారు. మిగిలిన్ ఐదుగురు సభ్యులు ఈనెల 30 లేదా 31న గానీ ప్రమాణస్వీకారం చేస్తారు.

బిసిలను సెలబ్రిటీలను చేసిన పార్టీలు

రాత్రికే రాత్రే బిసిలను సెలబ్రిటీలను చేస్తున్నాయి రాష్ట్రంలోని రాజకీయపార్టీలు. మొదట వైసిపి పార్టీ ఉప ఎన్నికల తర్వాత సిరిపురంలో నేత కార్మికులకు దన్నుగా ఒకరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దాంతో దెబ్బతిన్న పులిలా ముందుకు దూకింది టిఆర్‌యస్‌ పార్టీ. తమ ప్రాంతంలోకి రావడానికి ముందు తెలంగాణకు సానుకూలమో కాదోతేల్చమంది. అనేక నాటకీయ పరిణామాల మద్య వైసిపి గౌరవాధ్యక్షురాలు ఆ సభను విజయవంతం చేశారు. దానితో మిగతా పార్టీలన్నీ బిసిలను గుర్తించడంలో వెనుకబడ్డామని తెలుసుకున్నాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు బిసిలకు 100 సీట్లు రానున్న ఎన్నికల్లో వారికోసం 1000 కోట్లతో ప్లానింగ్‌ కమీషన్‌ వేస్తానన్నారు. దాంతో తేరుకున్న వైసిసి సీట్లు కాదు 100 స్ధానాలకే పాటుపడదాం... చర్చలకు రండని సవాలు విసిరారు. దీంతో ఖంగుతిన్న అధికారపక్షం కులాల జనాభా నిష్పత్తిని బట్టి సీట్లు ఇద్దాం మీరు రెడీయేనా అంటూ ఈ విషయంపై తాము తమ అధినేత్రిని ఒప్పిస్తానని సవాల్‌ విసిరారు పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ. ఇప్పటికే కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ, ఎస్టీ ప్లానింగ్‌ దిశలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఉన్నతవర్గాలు గుబులు చెందుతున్నాయి. ఎవరికి వారు ఓటర్లను ఆకర్షించడంలో ముందుండాలని తమకు తామే గోతులు తీసుకుంటున్నాయి. ఎందుకంటే తక్కువ జనాభాకలిగి ఎక్కువ పదవులు పొందుతున్న వారు అగ్రకులానికి చెందిన రెండు కులాలవారు మాత్రమే. ఇప్పుడు ఎవరు దీన్ని సమర్ధించినా అంతే సంగతులు.....

అధికారుల మధ్య కోల్డ్‌వార్‌

అత్యున్నత స్ధానాల్లో ఉన్న ఉన్నతాధికారులుకూడా నువ్వానేనా అని అహంకారాలతో మండిపోతూ పాలనా యంత్రాగాన్ని బ్రస్టు పట్టిస్తున్నారనటానికి ఇటీవల చాలా సంఘటనలు జరిగాయి. రాష్ట్ర డిజిపి పదవి ఎంపికలో ప్రభుత్వం సీనియారిటీని కాదని జూనియర్‌ దినేష్‌రెడ్డికి ఇచ్చారని, ఉమేష్‌కుమార్‌, గౌతమ్‌కుమార్‌ కోర్టుల కెక్కారు. ఒక కోర్టునుండి మరోకోర్టుకు వెళుతూ ప్రభుత్వం కాలయాపన చేయటాన్ని సహించలేని గౌతం కుమార్‌ స్వచ్చంధ పదవీ విరమణ చేశారు అలాగే మరో సీనియర్‌ అధికారి ఉమేష్‌కుమార్‌పై అవినీతి ఆరోపణలుచేశారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని చెప్పటానికి సరైన ఆధారాలు లేవని కోర్టు రెండు రోజుల క్రితం పేర్కొంది. అలా రాష్ట్ర డిజిపి పదవికోసం అత్యున్నతులు అభాసుపాలవుతున్నారు.   ఆగస్టు 15న జెండా ఎగురవేతలోనూ మరికొన్ని పాలనా పరమైన విషయాల్లోనూ గిల్లీకజ్జాలు పెట్టుకున్న విశాఖజిల్లా ఐఎఎస్‌ అధికారులైన కలెక్టర్‌ లవ్‌అగర్వాల్‌, కమీషనర్‌ రామాంజనేయులను భరించలేని ప్రజలు వీరిని ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కోరారు. దాంతో ప్రభుత్వం రెండు రోజుల క్రితం వారిరువురినీ ట్రాన్స్‌ఫర్‌ చేసి పోస్టింగ్‌ ఇవ్వకుండా వుంచారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్పీ, ఎఎస్‌పీ ఇద్దరూ వివాదాల్లోకి వచ్చారు. ఎస్పీ త్రివిక్రమవర్మపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించిన ఎఎస్పీ నవీన్‌ కుమార్‌ తనకు ఎస్పీ నుండి ప్రాణభయం వుందని కేసునమోదు చేశారు. ఏజెన్సీనుండి గంజాయి రవాణాను అడ్డుకుంటుంన్నందునే తనను ఎస్పీ వేధిస్తున్నారని, లారీ గంజాయిని తరలించడానికి గానూ 1.40 లక్షలు తీసుకుంటున్నారని నవీన్‌కుమార్‌ ఆరోపిస్తూ తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు.   పాతకార్లు ఇవ్వడం, వాటికి మరమ్మత్తులు జరపకపోవడంతో కారు బోల్తాపడి గాయాలయ్యాయన్నారు. పోనీ సెలవుపై వెళదామనుకుంటే సెలవు కూడా మంజూరు చేయకుండా తనను వేధింపులకు గురిచేస్తున్నారని నవీన్‌కుమార్‌ ఆరోపించారు. అంతకు ముందు ఇదే జిల్లాలో పనిచేసిన ఎస్పీ నాగిరెడ్డి, ఎఎస్పీ రంగనాధ్‌కు మద్య ఇలాంటి పొరపచ్చాలే చోటు చేసుకున్నాయి. జిల్లా ఎస్పీగా ఉన్న నాగిరెడ్డి ఆయిల్‌ దొంగలను ప్రోత్సహించారని రంగనాధ్‌ ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా ప్రజలకు రక్షణగా వుండాల్సిన అధికారులు పరస్పర ఆరోపణలకు, కేసు నమోదు చేసుకోవడం సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇకనైనా నీతిబాహ్యమైన చర్యలకు పాల్పడకుండా, బాధ్యతాయుతంగా, సమర్ధవంతమయిన పరిపాలనను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

బాలయ్య ఎక్కడినుండి పోటీచేస్తాడు?

నందమూరి బాలకృష్ట రానున్న ఎన్నికల్లో ఎక్కడనుండి పోటీ చేస్తే బావుంటుందా అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, బాలయ్య తండ్రి అయిన ఎన్టీరామారావు మూడు చోట్లనుండి పోటీ చేసినట్లుగా బాలయ్య కూడా చేస్తారా అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. గుడివాడ, తిరుపతి, హిందూపూర్‌ వీటినుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సీనియర్లు. ఇంతకు ముందు పార్టీ చురుకుగా ఉన్నందున మా దగ్గరనుండి అంటే మాదగ్గర నుండి పోటీ చెయ్యండని తెలుగుతమ్ముళంతా అడిగేవారు. అయితే ఇప్పడు పరిస్థితి చాలా వ్యతిరేకంగా ఉంది. కొన్ని చోట్ల పోటీ చేయడానికి సరైన నాయకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరీముఖ్యంగా కృష్టాజిల్లాలో గుడివాడనుండి పోటీ చేయించడానికి కొడాలినానీకి ముందు పార్టీలో ఉన్న వారిని పార్టీ బ్రతిమిలాడవలసి వస్తుంది. బాలయ్య ఇకపై పార్టీకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏ పదవీ ఇవ్వలేదు. కేవలం బాబు బిసి మంత్రంతోనే 2014 ఎన్నికలను గట్టెక్కుదాం అనుకుంటున్నారు. మిగతానాయకులతో పోలిస్తే తెలంగాణ కెసిఆర్‌, కోస్తాంద్రలో బాబు ప్రకటనలకు స్పందన తక్కువ. వీరి ప్రచారాన్ని అంతగా ప్రజలు పట్టించుకోరన్న అపవాదు వుంది. కెసిఆర్‌ ఎప్పుడూ అదిగో తెలంగాణా, ఇదిగో తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెడుతుంటారని ప్రతిపక్షాల ఆరోపణ. అలాగే బాబు ఇదివరలో వ్యవసాయం దండగ అనడం, కరెంటు చార్జీలు పెంచడం లాంటివి మరికొన్ని చేసి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. బాలయ్య యాక్టివ్‌ రాజకీయాల్లో పాల్గొనటానికి ఎంతవరకు సహకరిస్తారో , తద్వారా ఎక్కడినుండి పోటీ చేస్తారో వేచి చూడవలసిందే.

ఇంజనీరింగ్‌కి తగ్గిన మోజు

మీడియా వారు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రక్క రాష్ట్రాలకు వెళ్లి పోతున్నారని ఎంతమొత్తుకున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలలేదు. మొదటిరోజే దాదాపు సగం మంది విద్యార్దులు సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు రాకపోవడం చూస్తే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రభుత్వం కాలేజీ ఫీజలుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి రాలేదు. కాలేజీల ఎంపికకు 31నుండి వెబ్‌ ఆప్షన్లు. అప్పటికైనా కాలేజీఫీజుల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకురాగలిగితే ఇంజనీరింగ్‌ విద్యార్ధులు ఆఫ్షన్లు ఎంచుకుంటానికి వీలుగా ఉంటుంది. రాష్ట్రం మొత్తంమీద 53 హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 67 ఇంజనీరింగ్‌ కాలేజీలూ, 5 ఫార్మసీ కాలేజీల్లోనూ పెరిగే ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని విద్యార్ధిసంఘాలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వవిధానాలపై విద్యార్ధులూ, వారి తల్లిదండ్రులూ నిప్పులు చెరుగుతున్నారు .   ప్రభుత్వం ఎప్పుడో 5 నెలల క్రిందట నిర్ణయించాల్సిన ఫీజులను ఇప్పటికీ నిర్ణయించకుండా జాగుచెయ్యటం విద్యార్ధిలోకాన్ని అసహనానికి గురిచేసింది. కాలేజీ యాజమాన్యాలు నష్టపోతున్నాయంటూ నూతనంగా చేరే విద్యార్ధులపై నాలుగేళ్ల ఖర్చును లెక్కపెట్టి వేయడమేమిటో అని విద్యార్ది సంఘాలు, పేదవిద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులకు అనుగుణంగా కొంచెం కూడా అలోచించి న్యాయస్ధానంలో వాదించలేదని వాపోతున్నారు. యాజమాన్యాల ఇన్‌ఫ్రాస్రక్టర్‌ పైనాకూడా ఆదాయం కలిగేలా కాలేజీయాజమాన్యాలకు అణుగుణంగా ప్రభుత్వం స్పందించింది. దీంతో విద్యార్ధులు నాణ్యమైన విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నాన్చుడు ధోరణి విద్యార్ధులకు శాపంగా పరిణమించింది. ఇప్పటికైనా విద్యార్ధుల సమస్యలపట్ల ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని, అందుకుగానూ అధికారులతో చర్చించి మేధావుల సలహాను పాటించి న్యాయనిపుణులను సంప్రదించాలని విద్యార్ధిసంఘాలు కోరుతున్నాయి.

రాష్ట్ర విభజనపై గవర్నర్‌తో కిరణ్ చర్చలు?

సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. వీరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. విద్యుత్‌ సంక్షోభం, ధర్మాన రాజీనామా, యస్‌సి, యస్టీ సబ్‌ ప్లాన్‌, రాష్ట్ర విభజన లేదా సమైఖ్యతా వాదం ముందుకొస్తే జరిగే పరిణామాలపై ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురవుతాయో అన్న విషయాలపై చర్చించినట్లు తెలిసింది. విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి వివరిస్తూ ఎన్‌.టి.పి.సి. ఛైర్మన్‌ అనూప్‌ అగర్యాల్‌ తో మాట్లాడి 335 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని రాష్ట్రానికి అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధర్మాన రాజీనామా విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుందని, ప్రతిపక్షాలకు, ప్రజలకు ఎటువంటి అపోహలకు తావివ్వకుండేందుకు సరైన నిర్ణయం తీసుకుంటామని తెలియచేశారు. ఎస్‌సి, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ విషయాలను వివరించి దానిని చట్టబద్దత కల్పించే దిశగా చేపడుతున్న మార్గాల గురించి వీరిరువురూ చర్చించినట్లు తెలిసింది.   అలాగే ఇంజనీరింగ్‌ విద్యార్థుల ఫీజుల నిర్ణయం, 78 కాలేజీల ఫీజు పెంపు కూడా వారి మద్య చర్చకు వచ్చింది. ఫీజును అధికంగా పెంచిన కాలేజీలలో టాస్క్‌ఫోర్సు తనిఖీలు జరిపితే చాలావరకు కాలేజీలలో అన్ని వసతులు లేవన్న విషయం బయటపడుతుందని తద్వారా కేవలం 24 కాలేజీలు మాత్రమే అధికఫీజులు రాబట్టే కాలేజీలుగా ఉంటాయని, యాజమాన్య సీట్ల భర్తీని కూడా ఆన్‌లైన్‌లోనే జరిపే విధంగా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే సమైఖ్యరాష్ట్రంగా ప్రకటించినా లేదా రెండుగా విభజించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటే తలెత్తే సమస్యలు దానికి తీసుకునే చర్యలు కూడా వారిరువురూ మాట్లాడినట్లు తెలిసింది.

ప్రభుత్వం చెప్పుచేతల్లోకి ప్రసారమాధ్యమాలు

అసోం అల్లర్లలో విద్యేషాల్ని రెచ్చగొట్టడానికి ఫేస్ బుక్ ని కొందరు అడ్డంగా వాడుకున్నారన్న విషయం బైటపడిపోయింది. ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చిత్రాల్ని ఈ మాధ్యమం ద్వారా చాలామందికి సర్క్యులేట్ చేసి నష్టాన్ని భారీగా పెంచారన్న విషయం ప్రాథమిక విచారణలో తేలింది. దీన్ని సాకుగా చూపిస్తూ మొత్తం ప్రసారమాధ్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రతిపాదనకు ప్రభుత్వం పదునుపెడుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు చెప్పుకుంటున్న స్వీయనియంత్రణ ఒట్టిమాటేనని చెబుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలతోపాటు ఇంటర్ నెట్ మాధ్యమాల్నికూడా చెప్పుచేతల్లో పెట్టుకునే ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించింది. 1978 ప్రెస్ కౌన్సిల్ చట్టానికి సవరణలు చేసి వెంటనే మీడియాపై అదుపును సాధించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సూచించింది. పాత్రికేయుల నియామకాల విషయంలో ప్రింట్ మీడియాలో ఉన్న భద్రత ఎలక్ట్రానిక్ మీడియాలో లేకపోవడం విచారకరమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియాలోకూడా ప్రింట్ మీడియా అనుసరిస్తున్న విధానాల్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిసిఐ గట్టిగా వాదిస్తోంది. పిసీసీ పేరును మీడియా కౌన్సిల్ మార్చాలనికూడా తీర్మానం జరిగింది.

బోగస్ చిట్ ఫండ్ కంపెనీల లిస్ట్

కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆర్‌పిఎన్‌ సింగ్‌ త్వరలో జనానికి టోపీపెట్టబోతున్న చిట్ ఫండ్ కంపెనీల వివరాల్ని రాజ్యసభకు సమర్పించారు. ఆ లిస్ట్ లో మా కంపెనీ పేరు కూడా ఉందేమోనన్న భయం ఇప్పుడు రాష్ట్రంలో జనానికి కుచ్చు టోపీ పెడుతున్న చాలా చిట్ ఫండ్ కంపెనీలకు ఎక్కువైపోయింది. ఏదోఒకటి జరిగేలోపే జెండా ఎత్తేస్తే అసలు ఏ సమస్యా ఉండదని భావిస్తున్న కంపెనీలు ఇప్పటికే ఆ పనిలో బిజీగా ఉన్నాయ్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బోగస్ చిట్ ఫండ్ కంపెనీల హవా మూడుపూలూ ఆరుకాయలుగా సాగుతోంది. వీటిల్లో చాలాకంపెనీలకు కనీసం రిజిస్ట్రేషన్ కూడా ఉండదు. కొందరైతే బాహాటంగానే ప్రైవేట్ దందా నడిపించేస్తుంటారు. వాళ్లమీద పూర్తి నమ్మకంతో డబ్బులిచ్చి అడ్డంగా బుక్కైపోయిన జనం తమకు ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రం నెత్తీ నోరూ కొట్టుకుంటారు. అంతా అయిపోయాక ఆకులు పట్టుకున్నట్టు, బోగస్ కంపెనీల చేతిలో మోసపోయిన జనం చివరికి లబోదిబోమని ఏడుస్తారు. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా కొత్త డ్రైవ్ ని చేపట్టింది. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్న చిన్నాచితకా ప్రైవేట్ కంపెనీల చిట్టాని తయారుచేసి రాజసభకు సమర్పించింది. పూర్తిస్థాయిలో అవకతవకలకు పాల్పడి రేపో మాపో జెండా ఎత్తేయబోతున్న చిట్ ఫండ్ కంపెనీలు 87 ఉన్నాయని మంత్రి రాజ్యసభకు నివేదించారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అంతా గుర్తించారు. ఆ లిస్ట్ లో తమ పేరు ఉందేమోనన్న భయంతో కొన్ని కంపెనీల యజమానులు తప్పించుకుతిరిగేందుకు దేశమంతా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు.

రెవెన్యూ ఉద్యోగులకు అడ్డదారి రెవెన్యూ

రెవెన్యూ శాఖలో లంచగొండులెక్కువైపోయారు. మన రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అవినీతికి అలవాటుపడిపోయిన ఉద్యోగులు ఎక్కువసంఖ్యలో రెవెన్యూ శాఖలోనే ఉన్నారని లేటెస్ట్ సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయ్. గడచిన మూడేళ్లలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఉద్యోగుల్లో ఎక్కువశాతంమంది రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే. మూడేళ్లుగా రెవెన్యూ శాఖ ఉద్యోగులపై నమోదైన అవినీతి కేసులు 267. 2009లో 123 అవినీతి కేసులు విచారణకొచ్చాయి. 2010లో 41, 2011లో జూలై నెలవరకూ 33 కేసులు కేవలం రెవెన్యూ శాఖ ఉద్యోగులమీదే నమోదయ్యాయి. రెవెన్యూ శాఖకు పనిభారం కూడా ఎక్కువే. దానికితోడు ప్రజలకు ఎక్కువ అవసరాలు ఈ శాఖతోనే ఉంటాయి కనుక లంచాల వసూలుకూడా ఎక్కువేనన్న విషయంకూడా బహిరంగ రహస్యమే. రోజులకొద్దీ ఆఫీసులచుట్టూ తిరగడంకంటే టిక్కెట్టు కొట్టేసి వెంటనే పనిచేయించుకోవడమే మేలన్న ఉద్దేశానికి చాలామంది వచ్చేయడంతో ఎంతగా కంట్రోల్ చేయాలని చూసినా, ఎన్ని ఆంక్షలు విధించినా రెవెన్యూశాఖ ఉద్యోగుల చేతివాటాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు.

అంతా అమ్మదయే!

రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా బలహీనపడిపోయింది. అధిష్ఠానం ఆజ్ఞల్ని శిరసావహిస్తూ, సోనియా అడుగులకు మడుగులొత్తుతూ ఉండేవాళ్లు మాత్రమే పదవుల్లో ఉంటారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. అందుకే ఎవరూ ఏం మాట్లాడ్డంలేదు. ఢిల్లీకెళ్లి చేతులు కట్టుకుని నిలబడ్డం తప్ప స్టేట్ లీడర్లు సాధించగలిగేదేం లేదన్న విషయం ప్రజలక్కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఎలాంటి మార్పులు చేర్చులు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నట్టుగా అంతా అన్నింటికీ సిద్దపడే కూర్చున్నారు. కాకుంటే ఎవరి కుర్చీని కాపాడుకోవడానికి వాళ్లు ఢిల్లీ చుట్టూ పదిసార్లు ప్రదక్షిణలు చేసి అమ్మదయకోసం పాకులాడుతున్నారు. పైకిమాత్రం మేకపోతు గాంభీర్యం.. మంత్రులతో కిరణ్ రెండుసార్లు సమావేశమయ్యారు. పిసిసి చీఫ్ బొత్స మూడసార్లు పార్టీలోని కీలక నేతల్నికలిసి మాట్లాడారు. డెప్యూటీ సీఎం, చిరంజీవితో ఓసారి, ముఖ్యమంత్రితో ఓ సారి మాట్లాడారు. సీఎం, పిసిసి చీఫ్ గవర్నర్ తో విడివిడిగా భేటీ అయ్యారు. ఇన్ని భేటీల తర్వాత తేలిన విషయం ఏంటయ్యా అంటే మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో త్వరలో పెద్దఎత్తున మార్పులు చేర్పులు జరుగుతాయన్న ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో, అధిష్ఠానం ఎవరికి అవకాశమిస్తుందో, ఎవరికి ఎర్త్ పెడుతుందో తెలియక అంతా జుట్లు పీక్కుంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఒకళ్లతో ఒకళ్లు బాధను పంచుకుంటూ పైకిమాత్రం అవేవో పేద్ద ప్రాముఖ్యమున్న భేటీల్లా ఫోజులిస్తున్నారు. ఎవరేమనుకున్నా చివరికి అమ్మచెప్పిన మాటే ఫైనల్. ఎవరెన్ని తిట్టుకున్నా చివరికి అమ్మ తీసుకున్న నిర్ణయమే ఫైనల్.. అంతా అమ్మదయమీదే ఆధారపడుంది.

రాహుల్ మార్క్ పిసిసి ప్రెసిడెంట్

కాంగ్రెస్ లో రాబోయే తరానికి కాబోయే మహారాజుగా చెలామణీ అవుతున్న రాహుల్ గాంధీ.. రాష్ట్ర రాజకీయాలమీదకూడా అప్పుడప్పుడూ దృష్టి సారిస్తున్నారు. ఆరునెల్లపాటు గట్టిగా శోధించి పీసీసీ పీఠానికి సరిపోయే వ్యక్తిని ఆయన ఎంపిక చేశారు. ఎవరికి అవకాశం దక్కబోతోందన్న విషయాన్ని మాత్రం ఆయన సీక్రెట్ గా ఉంచారు. ఎంతమంది ఎన్నిరకాలుగా తలల పగలగొట్టుకుని ఆలోచించినా రాహుల్ మదిలో ఉన్న ఆ కొత్త పిసిసి చీఫ్ ఎవరన్న విషయం మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ముద్దులకొడుకు ఏపీ రాజకీయాలపై ఇంతగా పట్టుసాధించిన విషయం తెలుసుకున్న సోనియా తెగ మురిసి పోతున్నారు. సమర్ధుడైన నేత ఉండాలో చెప్పేందుకు రాహుల్ పీకుతున్న క్లాసులుకూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెగ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కొందరైతే నేరుగా ఢిల్లీలోనే మకాంపెట్టి రాహుల్ మనసును గెలుచుకున్న ఆ మరో నేత ఎవరన్న విషయాన్ని తెలుసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అదృష్టం అడ్డదారిలో కలిసొచ్చి రాహుల్ తమపేరు చెబుతాడేమోఅన్న ఆశ చాలామంది నేతలకు రోజురోజుకీ పెరగిపోతోంది.

బైరెడ్డి బాటపట్టిన టి.ఆర్.ఎస్

రాయలసీమను ప్రత్యేకరాష్ట్రంగా గుర్తించాలంటూ టిడిపి నేత, రాయలసీమ పరిరక్షణ సమితి ఛైర్మన్ బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో చేస్తున్న ఆందోళనవల్ల ఇన్నాళ్లూ మరుగునపడి పోయిన అసలు సమస్యలు వెలుగులోకొస్తున్నాయి. రాయల సీమకి తీరని అన్యాయం జరుగుతోందంటూ బైరెడ్డి గొంతెత్తి మాట్లాడేసరికి మిగతా వేర్పాటువాదులు సైలెంటైపోతున్నారు. ఇప్పటివరకూ తమ ప్రాంతానికి ఎంతగా అన్యాయం జరిగిందో చెప్పేందుకు బైరెడ్డి వాడుతున్న పదాలు కొందరికి సూదుల్లా గుచ్చుకుంటున్నాయ్. బైరెడ్డి పుణ్యమా అని తెలంగాణ వాదులుకూడా అనవసరమైన గొడవలు మానేసి.. కరెంటు కష్టాలు, మంచినీళ్ల కష్టాలగురించి మాట్లాడ్డ మొదలుపెట్టారు. తెలంగాణ మొత్తం మంచినీళ్ల సమస్యతో అల్లాడిపోతోందని కెటిఆర్ తెగబాధపడిపోతున్నారు. సాగర్ నీళ్లను కిందికి వదలడానికి వీల్లేదని, డ్యామ్ లోనే స్టోర్ చేయాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ విషయంలో బైరెడ్డికి కనిపిస్తున్న ఆదరణను చూసి టి.ఆర్.ఎస్ కూడా తీవ్రస్థాయిలో రెచ్చిపోతోంది. బైరెడ్డి ఆందోళన పుణ్యమా అని తెలంగాణ రగడ కాస్త నిదానించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

కడిగిపారేసేందుకు కొత్త కోర్ కమిటీ

కడిగిపారేసేందుకు కొత్త కోర్ కమిటీ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పరువు ప్రతిష్టలు ఇప్పటికే మురుక్కాలవలో కలిసిపోయాయ్. కుర్చీల కుమ్ములాటలతో పార్టీ రోజురోజుకీ దిగజారిపోతోంది. బెదిరిపోయిన హై కమాండ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలనుంచి ఎప్పటికప్పుడు కోర్ కమిటీకి ఆదేశాలందుతాయి. 2014 వరకూ పార్టీని ఇలాగే నడపడం బెస్టని తల్లీకొడుకులు గట్టిగా భావిస్తున్నారని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు. ధర్మాన కమిటీ చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని.. కోర్ కమిటీ వాటి ప్రకారం ముందుకెళ్తుంది. ఎఐసిసి సమావేశంలో ఈ విషయాలన్నీ చర్చకొచ్చాయి. నియమకాలు, విభేదాలు, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని స్పష్టంగా అందరికీ తెలిసేలా చేయాలనికూడా హై కమాండ్ భావిస్తోంది. కోర్ కమిటీలో జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీనివాస్ లకు స్థానం కల్పించాలని అధిష్ఠానం అనుకుంటోంది. ఈ నలుగురితో కమిటీని సమర్ధంగా నడపొచ్చని రాహుల్ గాంధీ కూడా అన్నట్టు భోగట్టా.. పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా కడిగిపారేసి ముత్యంలా మెరిపించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని హై కమాండ్ గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం. ఈ కోర్ కమిటీమీదకూడా పట్టుసాధించేందుకు కిరణ్, బొత్స మళ్లీ కొత్త పోరాటం మొదలుపెడతారేమోనన్న అనుమానంకూడా కాంగ్రెస్ పెద్దలకు లేకపోలేదు.

గాలి.. జైలర్నికూడా కొనేశాడా?

బెయిల్ కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించి జడ్జీల్నే కొనేసిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు జైలర్నికూడా కొనేశాడన్న వదంతులు గట్టిగా వినిపిస్తున్నాయి. చంచల్ గూడ సూపరిండెంట్ కేశవనాయుడు గాలికి గంటలకొద్దీ ములాఖత్ లు ఏర్పాటు చేస్తున్నాడని లోకల్ మీడియా కోడైకూస్తోంది. ఇందుకోసం గాలి కేశవనాయుడిక్కూడా కోట్లరూపాయలు సమర్పించుకున్నాడని డెక్కన్ క్రానికల్ పత్రిక వార్తని ప్రచురించింది. భారీగా డబ్బుతీసుకున్న కేశవనాయుడు జైల్లో గాలికి భారీ సౌకర్యాలు కల్పించాడన్న వార్తలు గుప్పుమనడంతో ప్రభుత్వం ఆయన్ని మరో పదవికి మార్చేసింది. చంచల్ గూడ జైలుకి కొత్త సూపరింటెండెంట్ గా సైదయ్యను నియమించారు. అప్పట్లో జగన్ కి రాచమర్యాదలు చేసేందుకు యమా ఉత్సాహం చూపించిన జైలు అధికారి వెంకటేశ్వర్ రెడ్డిమీదకూడా వేటుపడింది. రెండువారాల క్రితం చంచల్ గూడ డెప్యూటీ సూపరింటెండెంట్ల బదిలీలుకూడా రాత్రికిరాత్రే చకచకా జరిగిపోయాయ్. జైల్లో ఉంటున్న వీఐపీ ఖైదీల ములాఖత్ ల గోల భరించలేక తమను ట్రాన్స్ ఫర్ చేయమని అధికారులు తెగ మొరపెట్టుకున్నారన్న విషయంకూడా వార్తల్లోకెక్కింది. వీటిలో నిజమెంతో.. అబద్ధమెంతో గాలివాటానికి పవరెంతో నిలకడమీదగానీ తేలాలి.