గౌతంకుమార్ కి కలిసిరాని కాలం

రాష్ట్ర ప్రభుత్వాలు సీనియరిటీని పక్కనపెట్టి అస్మదీయులకు డిజిపి పదవి ఇవ్వడం ఒక తంతుగా మారింది. కోర్టుల్ని కూడా లెక్కచేయకపోవడం అలవాటుగా మారిపోయింది. దీనివల్ల లౌక్యం తెలియని ఐపియస్‌ ఆఫీసర్లు బలౌతున్నారు.1975 బ్యాచ్ కు చెందిన గౌతంకుమార్  దీనికి మంచి ఉదాహరణ. అప్పట్లో సీనియారిటీని తోసిరాజని అరవింద్ రావుకి డిజిపి పదవిని కట్టబెట్టారు. తనకు న్యాయం చేయాలని గౌతంకుమార్ హైకోర్ట్ ని ఆశ్రయించడంతో ఆయనకే అనుకూలంగా తీర్పొచ్చింది. ప్రభుత్వం దీనిపై డివిజన్ బెంచ్ కి పిటిషన్ దాఖలు చేసింది. వ్యవహారం తేలేలోగా అరవింద్ రావు రిటైరైపోయారు.  తర్వాత కూడా గౌతం కుమార్‌కి ప్రభుత్వం మొండి చెయ్యి చూపి దినేష్‌రెడ్డిని డిజిపిగా నియమించింది. దినేష్‌ రెడ్డి డిజిపి నియామక సమయానికి కెఆర్‌ నందన్‌ కి సీనియారిటీ ఉంది. కానీ.. ఆయన ఆ కుర్చీలో కూర్చోవడానికి ఇష్టపడలేదు. తర్వాతి వంతు న్యాయనికి గౌతంకుమార్ ది. కానీ.. ప్రభుత్వం ఆయన్ని కాదని దినేష్ రెడ్డిని కుర్చీలో కూర్చోపెట్టింది. గౌతంకుమార్ కి సీనియారిటీతోపాటు సమర్థత కూడా ఉంది. కానీ లాబీయింగ్ లో మాత్రం చాలా వీక్.. అందుకే పదవిని రెండుసార్లు వేరేవాళ్లు తన్నుకు పోయారు.  దినేష్‌రెడ్డి 1977 బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్. కానీ.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాలు అదృష్టాన్ని మోసుకొచ్చాయి. క్యాట్ కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టింది. పట్టించుకోని ప్రభుత్వం మళ్లీ అప్పీలుకెళ్లింది. మనస్తాపంతో గౌతంకుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.   

అంతా మా ఇష్టం

తాము కోరిన పదవి ఇవ్వలేదనో, తామడిగిన పనిచేయించలేదనో... వంటి కారణాలతో ఒకరో, ఇద్దరో మంత్రులు రాజీనామాలు చేయడం మనదేశంలో పరిపాటి. అయితే రాష్ట్రంలో గత ఆరేళ్ళకాలంలో అధిక సంఖ్యలో ఎం.ఎల్‌.ఎ.లు రాజీనామా చేశారని తెలిసి బ్రిటీష్‌ పార్లమెంటరీ ప్రతినిధుల బృందం ఆసక్తిని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎంపి సర్‌ అలెన్‌ హసల్‌ హర్ట్స్‌ నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం అసెంబ్లీ సందర్శించి, కమిటీ హాలులో శాసనమండలి ఛైర్మన్‌, స్పీకర్‌, పలు పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశమయింది. అసెంబ్లీ చరిత్ర, ప్రత్యేకతలను తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో గత ఆరేళ్ళలో 60 ఉప ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళితో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పగా... అన్నిసార్లుఎందుకు జరిగాయంటూ బ్రిటీష్‌ ప్రతినిధులు ఆరా తీశారు. ఆయా కారణాలను వారు చెప్పగా తమ దేశంలో ఒకే ఒక్కసారి ఒక ఎం.పి. రాజీనామా చేస్తేనే అంతా ఆశ్చర్యపోయారంటూ బ్రిటీష్‌ ప్రతినిధులు మరింత ఆశ్చర్యంగా అన్నారట...!     ఎన్నుకున్నది పాపం పిచ్చి ప్రజలం మేమే అయినా.. ఎన్నికైన తర్వాత అంతా గెలిచిన మా అభ్యర్ధి ఇష్టం. అడిగే అధికారం లేదు! అడిగే ధైర్యం లేదు...! రాజీనామా చేసి ఉప ఎన్నికను కోరడానికి గల కారణాలు సముచితమైనా, కాకపోయినా.. అదంతా వారి ఇష్టమే. వారు రాజీనామా చేసిన మరుక్షణం మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టాల్సిందే..!  గెలిచేందుకు వారు వారి డబ్బులు ఎలాగైనా ఖర్చుపెడతారు ` గెలుపే ప్రధానలక్ష్యంగా...! అయితే ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి...! ఇదీ ప్రజాస్వామ్య తీరు...! ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అంటారు కాని.. అసలు నిర్ణయాలు ముందే అయిపోతే... ఇక ప్రజా నిర్ణయమేంటీ...వారి ఆకాంక్షలేంటీ...!? `పెద్ద భేతాళప్రశ్నేమరి! ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన వారు, వారి బంధు గణాలే ప్రజలు. మిగిలిన సామాన్యులు అంతా వారి వారి చేతుల్లో ఆటబొమ్మలే..! ఇవన్నీ తెలియకుండా, తెలుసుకోకుండా బ్రిటన్‌ ప్రతినిధుల బృందం అంత ఆశ్చర్యపోతే ఎలా!

కిరణ్ కుమార్ రెడ్డేమైనా హరిశ్చంద్రుడా?

                                                                                                                                                                           ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వై.ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలుచిక్కినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తోంది. జగన్ కి అధికార పీఠ ం దక్కేవరకూ నిద్రపోయేదిలేదన్న రీతిలో ఆ పార్టీలో ఉన్న వందిమాగధులు సమయం చిక్కినప్పుడల్లా చిక్కటి విమర్శల్ని కుప్పపోసి అవతలివాళ్లమీద గుమ్మరించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్తుడైన అంబటి రాంబాబు మాటల తూటాలు పేలుస్తూ సీఎంని మరింత ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి.. రోమ్న నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని అంబటి రాంబాబు తాజాగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రం అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీచుట్టూ చక్కర్లు కొడుతున్నారని ప్రతిపక్షాలతోపాటు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకూడా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. జగన్ కి బెయిల్ రాకుండా చూసేందుకు కాంగ్రెస్ నేతలు గల్లీనుంచి ఢిల్లీదాకా తిరుగుతూ విశ్వప్రయత్నం చేస్తున్నారని జగన్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు తమ పదవులు కాపాడుకోవడంకంటే జగన్ బైటికి రాకుండా చూడడమే పెద్ద ఎజెండాగా మారిందని జగన్ పార్టీ నేతలు అంటున్నారు.     

లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుకి హోల్ పడింది

లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుకి రెండు మీటర్ల గుంట పడింది. ఆ దారిలో రాకపోకల్ని పునరుద్ధరించేందుకు జీహెచ్ ఎంసీ ఆఖమేఘాలమీద మరమ్మతులు చేపట్టింది. సమీపంలోని నాలా ప్రవాహంవల్లే రోడ్డు దెబ్బతిందని అధికారులు చెబుతున్నారు. భారీవర్షాలకు వచ్చిచేరే వరదనీరు ఇదివరలో లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లమీదుగానే పల్లపు ప్రదేశాల్లోకి చేరి నాగమయ్య కుంటలాంటి బస్తీలు పూర్తిగా మునిగిపోయేయి. ఇప్పుడు ఏకంగా రోడ్డుకే రెండు మీటర్ల బొక్క పడడం మరీ విడ్డూరంగా ఉందని స్థానికులు అంటున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దారి కాకపోవడం వల్ల ఓ రకంగా పెద్ద ప్రమాదం తప్పినట్టేనంటున్నారు.  

వడ్డించేదెవరు....! అయితే... ఓ.కె.!

వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివరకూర్చున్న భోజనాలు అందుతాయన్నది ఓ సామెత. ఈ సామెత ఎవరు, ఎప్పుడు, ఎక్కడ పుట్టించారో తెలియదు కానీ, ఈ సామెత మాత్రం నేటి అధికారుల బదిలీల విషయంలో నిజమేననిపిస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా... లేదా మంత్రులు మారినప్పుడల్లా.. ఐఎఎస్‌., ఐ.పి.ఎస్‌.. తదితర శాఖలలోని వుండే అధికారులను బదిలీలు చేయడం ఆనవాయితీగా మారింది. తమకు నచ్చిన వారిని తమకు ఇష్టమైన స్థానంలో బదిలీచేయించుకుని.. తద్వారా ఏమైనా ప్రజాసేవ చేయిస్తున్నారా! లేక వారి సహాయంతో తాము ప్రజాసేవ చేస్తున్నారా...అంటే అబ్బే... అదేంకాదు.. ఐదేళ్ళపాటు పదవిలో ఉండే (ఇప్పుడయితే వారంరోజులు కావచ్చు, నెలకావచ్చు, సంవత్సరం కావచ్చు) నేతలు తమ పనులు చక్కపెట్టుకోవడానికి తమకిష్టమైన, అనుకూలమైన, తమవారిని ప్రమోషన్లతో బదిలీలు చేయడం పరిపాటైపోయింది.   గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ)లో పనిచేసిన అనుభవం కలిగిన పరీడాను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్ళలో పదిసార్లు బదిలీ చేసింది. ఇలా ఎంతోమంది ఐఎఎస్‌లు బదిలీలయ్యారు. ఎప్పటికప్పుడు సాధారణ పరిపాలన ప్రక్రియలో భాగంగానే బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన భూమిక అన్నది బహిరంగ రహస్యమే! కొన్నిసార్లు నేతలు తమకిష్టంలేని వారిని బదిలీలతో కక్షతీర్చుకుంటుంటే.. ఇంకొందరు అధికారులు తమ కిష్టమైన చోటుకు రాజకీయ ప్రోద్బలంతో బదిలీలను చేయించుకుంటున్నారు. బదిలీలకు కాని, ప్రమోషన్లకు కాని సీనియారిటీ, నిజాయితీలతో పనిలేదని, తమకిష్టమైతే తామున్నన్నాళ్లు తమ వారికీ ఎక్కడికైనా బదిలీ చేయించుకోవచ్చన్నది నేటి రాజకీయసూత్రంగా మారిందంటే అతిశయోక్తికాదు. అధికారుల బదిలీల వ్యవహారంలో ఓ ఖచ్చితమైన నిర్దేశక సూత్రాలను అమలు చేస్తే కొంతలోకొంత పరిపాలన సవ్యంగా సాగుతుందని ప్రజలకు ఓ నమ్మకం వస్తుంది.

కప్పగంతులు...

ఈ మధ్యకాలంలో పిచ్చివాడికి ఏదైనా గుర్తుకొచ్చి నవ్వినా .. అదిగో నన్నుచూసే నవ్వాడు.. నన్ను అవమానించాడు... కొంతమంది పార్టీలోని నేతలే దీని వెనుకవుండి చేయించారు. కనుక నేను ఈ పార్టీలో ఉండలేను.. అంటూ మరోచోటుకు గెంతడం..పరిపాటి! లేకుంటే.. నన్ను కాదని పార్టీలోని తన ప్రత్యర్ధికి పదవి ఇచ్చారనో.. ఇంట్లో చేసుకున్న వంకాయకూర.. వెంటవున్న నాకు పెట్టకుండా.. బయటనుండి వచ్చిన ఇంకొకరి పెట్టారనో... కూడా పార్టీ మారిపోవచ్చు. ఇలా పార్టీలు మారే ఉద్దేశమే ఉండాలికాని ఎన్నో... ఎన్నెన్నో... కారణాలు చెప్పుకోవచ్చు! ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. అందుకే ఈ పార్టీలో చేరా.. కాని నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు... మనస్తాపంతో బయటికివెళ్ళిపోతున్నా...ఇదీ నేటి నేతలు ఒకచోటునుండి మరోచోటుకు చేసే కప్పగంతులకు ఇచ్చే వివరణ.   గతంలో ఎంతోమంది నేతలు తామున్న పార్టీలోనుండి మరోపార్టీలోకి వెళ్ళారు. అదే రీతిలో ఉప్పునూతల కూడా జగన్‌పార్టీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. విలువలకు కట్టుబడి ఒకేపార్టీలో ఉండటమన్నది నేడు ఎక్కడా చూడలేం. ఇంద్రదనస్సులో ఏడువర్ణాలు ఉంటాయి. నేటి నేతలకు ఎన్ని వర్ణాలుంటాయో చెప్పడం కష్టమే సుమా! ఇసుకను పిండి తైలం తీసే ప్రయత్నం చేయవచ్చుగాని పార్టీలు మారే నేతల చేతలను, మాటలను అర్ధం చేసుకోలేం. ‘ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే...’ అన్నాడు ఓ సినీకవి. కాని నేటి రాజకీయాలను చూస్తుంటే... ‘నాయకులమాటలకు అర్ధాలే వేరులే...’ అని అనక తప్పదు.   ఒకరు ఓ పార్టీ తరపున ఎన్నికై తెల్లవారే సరికి మరోపార్టీలో ఉంటారు. ఇలా కప్పగంతులు గెంతుతూనే ఉన్నారు. ఉంటున్నారు. భవిష్యత్‌లో కూడా ఉంటారు! ఇలాగే ఉపేక్షిస్తే... ఇలా పార్టీలను మార్చే వారితో దేశం నిండిపోయి.. అత్యధికంగా పార్టీలు మార్చిన నేతలు గిన్నీస్‌ రికార్డులను బద్ధలు కొట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు. గతంలో ఎక్కువశాతంమంది ప్రజాసేవకోసం రాజకీయాల్లోకి వస్తే... నేడు తమ రక్షణకోసం, తమవారిసేవకోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారు.. పార్టీలు మారుతున్నారు. పార్టీలు మార్చే నేతల్ని చూసి ఊసరవెల్లి కూడా కాస్తంత ఫీలవుతోంది మరి! ఒక పార్టీ తరఫున ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పట్నుంచి అయిదేళ్ళపాటు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటామంటూ అభ్యర్ధుల నుండి అఫిడవిట్లు తీసుకుంటే బావుంటుందేమో...! ఆలోచించాల్సిందే!

ఊ కొట్టేదెవరో... ఉలిక్కిపడేదెవరో...!

రాజకీయాలంటే చదరంగం లాంటివని కొందరంటే... వైకుంఠపాళి ఆటలాంటిదని మరికొందరంటారు. ఎవరేమన్నా.. జనవాక్యం మాత్రం ఈ రెండు ఆటలు కలిపితేనే రాజకీయా లంటుంది. ఎన్నికల సమయంలో వైకుంఠపాళి ఆటలాంటిది. ప్రత్యర్ధుల బలాబలాలను బేరీజువేసుకుని నిచ్చెనల ఎక్కుతూ ఎవరు గెలుస్తారో.. ఇతరుల బలాబలాలను అంచనా వేయకుండా ఓటమి పామునోట్లో చిక్కి ఎవరు ఓడిపోతారో.. అదంతా పరమపదసోపానమే! రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తే తప్ప లేకుంటే... పెత్తనమంతా కేంద్రంలోవుండే అధినాయకుల చేతల్లో, చేతుల్లోనే ఉండి పాలన సాగుతుంది.   తుమ్మినా, దగ్గినా ఢల్లీకి ప్రయాణం కట్టాల్సిందే. ఇలాంటి ప్రయాణాలకే రాష్ట్ర ఖజానాలో సొమ్ము సగం ఖర్చవుతుందే మోనని సామాన్యుల అనుమానం. అసలు సంగతేమిటయ్యా అంటే.. ధర్మానగారి రాజీనామా నేపథ్యంలో సి.ఎం. మొదలు మంత్రులు, రాష్ట్ర అధ్యక్ష పదవుల వరకు ఎవరూ ఉంటారో, ఎవరు ఊడతారో... తెలియదు. అధిష్టానం వద్ద తమ పలుకుబడిని ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తే వారికే ఆయా పదవులు అన్నది జగద్విదితం. మహాభారతంలోని రాజకీయ ఘట్టాలకు ఏ మాత్రం తీసిపోవు హస్తిన రాజకీయాలు. బొత్సకు ఉద్వాసన...? సిఎం. స్థానానికి ఎసరా? కొత్తగా పిసిసి చీఫ్‌గా ఎవరు ఎన్నికవుతారు? మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన..? ఇవన్నీ ప్రజలకు కాకపోయినా కాంగ్రెస్‌పార్టీలోని నాయకులను వేధిస్తున్న యక్షప్రశ్నలు...!   ఇవి ఇప్పుడే రావడానికి ప్రధాన కారణాలు ‘తెలంగాణా ఉద్యమ తీవ్రత, జగన్‌పై సిబిఐ కేసుల వ్యవహారం, పెద్దాయన మంత్రివర్గంలో వున్న పలువురు మంత్రులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణల గోల.. తదితరాలు. ఎంత మెజారిటీతో ఎన్నికైనా స్వంత వ్యక్తిత్వమంటూ లేకుండా తుమ్మినా.. దగ్గినా రాజధాని విమానమెక్కేయడం... ఎన్నికయ్యేందుకు... ఎన్నికైన తర్వాత కృతజ్ఞతలు తెలిపేందుకు.. వచ్చిన పదవిని కాపాడుకునేందుకు విమాన ప్రయాణాలు...! ఇంట్లో తనకిష్టమైన కూరచేయించుకు తినాలన్నా.. అమ్మదయ కావాల్సిందే... అన్నట్లుగా ఉంటున్నాయి కాంగ్రెస్‌ పార్టీలోని నేతల తీరు! అమ్మ చెప్పిన దానికి ఎంతమంది నేతలు ఊ కొడతారో... అమ్మనిర్ణయానికి ఎంతమంది ఊలిక్కిపడతారో... వేచిచూడాల్సిందే..!

కార్యకర్తలే కాంట్రాక్టర్లుగా చెలామణి

రాష్ట్రంలో పనికి ఆహార పధకం క్రింద గ్రామీణ ప్రాంతాలలో 100 రోజుల పనులను కేంద్రం చేపట్టటం తెలిసిందే . దీనికి గానూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నిధులను కెటాయించి ఆయా జిల్లాల మండల కేంద్రాలలో పనులు చేయిస్తుంటారు. అయితే దీన్ని అధికార పార్టీ చేతుల్లో ఉండటంవల్ల ఆయా మండలాలలో కార్యకర్తలే కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్నారు .దీంతో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి, అభివృద్ది పధకాల పేరిట అధికార పార్టీ కార్యకర్తలు కాంట్రాక్టులు దక్కించుకోవడంతో అడిగేవారు లేరనే ధీమాతో నాణ్యతలేని పనులుచేసి, నిధులు బొక్కేస్తున్నారన్నారు. ఎందుకూ పనికి రాని రోడ్లువేసి నాయకులు దోచుకు తింటున్నారని ప్రజలు వాపోతున్నారు. నాణ్యతలేని రోడ్లు, తూతూ మంత్రంగా నాణ్యతలేని కంకరతో నిర్మించడంవల్ల వేసిన నెలకే అస్ధవ్యస్దంగా తయారవుతున్నాయి. దీంతో వర్షాకాలంలో వర్షాలకు స్ధానికులు ఆరోడ్లనుండి వెళ్లటానికి నానా అవస్దలూ పడుతున్నారు.ఇవేకాకుండా చెరువులు, కంకరరోడ్లు,గ్రావెల్‌రోడ్లు, మెటల్‌రోడ్ల మరమ్మతుల పేరు చెప్పి ఎన్‌ఆర్‌జిసి నిధులు దొడ్డిదారిని కాంట్రాక్టర్లు,ప్రభుత్వాధికారలు దోచేస్తున్నారని గ్రామీణులు వాపోతున్నారు. దీని పై ఆయా జిల్లా అధికారులు పర్యవేక్షించి నాణ్యతలేని పనులను సమీక్షించి సంబంధిత అధికారలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ నిధులు గోల్‌మాల్‌ కాకుండా ప్రజలకు ఉపయోగ పడేవిధంగా చర్యలు చేపట్టాలని స్ధానికులు కోరుతున్నారు.

రావణాకాష్టానికి కేంద్రమే కారణమా?

తెలంగాణ వాదం మరోసారి తెరపైకి వచ్చింది. విభజనవాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రాంతీయ పార్టీలు ప్రాంతాల మద్య చిచ్చుపెట్టి, విద్వేషాలను రగుల్చుతుండగా కేంద్రం గుడ్లప్పగించి చూస్తుందని సమైఖ్యతావాదులు మండిపడుతున్నారు. ఢిల్లీ వరకు వెళ్లి తమ సమైఖ్యతా వాదాన్ని వినిపిస్తామని, తెలుగు జాతిని విడగొట్టాలనుకునే ఏ పార్టీనైనా సీమాంద్రలో బహిష్కరిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. దీనికి గానూ సీమాంద్రకు చెందిన 13 జిల్లాలు, 14 యూనివర్సిటీలకు సంబందించిన విద్యార్ధి జెఏసి నేతలు బేటీ అయ్యారు.     రాష్ట్రంలో నెలకొన్న అస్ధవ్యస్త పరిస్థితులకు కేంద్రప్రభుత్వమే కారణమని చెబుతున్నారు.నిష్టాతులైన శ్రీకృష్టా కమిటి ఏడాది పాటు రాష్ట్రంలో పర్యటించి సమగ్ర విచారణ జరిపి అందచేసిన నివేదికను కేంద్రం చెత్త బుట్టలో పడేసిందని ద్వజమెత్తుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రాంతీయ పార్టీలను విలీసం చేసుకునే ఎత్తుగడలో కేంద్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని సమైఖ్యాంద్ర జెఎసి నేతలు ద్వజమెత్తుతున్నారు. వేర్పాటు వాదాలను, ఉద్యమాలను అరికట్టిదేశ సమగ్రతను కాపాడాల్సిన కేంద్రమే రాష్ట్రంలో రావణకాష్టాన్ని పెంచి పోషిస్తుందని మండి పడుతున్నారు. సీమాంద్ర ప్రజాప్రతినిధులు కూడా సమైఖ్యరాష్ట్రాన్ని కాకుండా అధిష్టానం మాటవిని వేర్పాటు వాదాన్ని సమర్ధిస్తే సీమాంద్రనుండి వారిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.

సీనియర్‌ మంత్రుల్లో అంతర్మధనం

మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామాను గురించి మాట్లాడటానికెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్‌ బొత్స సత్యన్నారాయణ బుక్‌ అయ్యినట్లు తెలుస్తుంది. ధర్మాన రాజీనామాను అంగీకరించడమే కరెక్టు అని చెప్పిన అధిష్టానం పనిలో పనిగా వీరిరువురి పైనా వేటుకు సిద్దంగా ఉండటంతో బిక్కచచ్చిన మొహాల్తో వీరిద్దరూ ఉన్నారనే విషయం తెలిసింది. ధర్మాన రాజీనామాగురించి మాట్లాడుతూ ఇప్పుడు మంత్రులకు సంబంధం లేదంటే జగన్‌ తప్పించుకో వచ్చు గనుక వారిని కూడా సిబిఐ విచారణకు సిద్దపడాల్సిందే నని అధిష్టానం తేల్చింది. మంత్రులను తప్పించడం వల్ల ప్రజలమద్యకు తప్పుడు సంకేతాన్ని అందించినట్లవుతుందని అందువల్ల రాజీనామాను ఆమోదించటం సరైన మార్గంగా కేంద్రం భావిస్తుంది.   దీంతో రాష్ట్రంలోని మిగతా సీనియర్‌ మంత్రులు హతాషు లయ్యారు. వారంతా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరుగా జైలు జీవితం రుచి చూడవలసి వుంది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి మోపిదేవి చంచల్‌గూడా జైలులో ఉన్నారు. మంత్రుల మీద చార్జిషీటు పెట్టినప్పుడే క్యాబినెట్‌కు సంబంధంలేదని చెపితే బావుండేదని, అయితే జగన్‌ కు క్విడ్‌ప్రోకో కేసుగా మాత్రమే ఉంటుందని చెప్పటం వల్ల తమంతా నమ్మినందుకు కేంద్రం తమకు నమ్మక ధ్రోహం చేసిందని మంత్రులంతా మధన పడుతునన్నారు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా పిసిసి చీఫ్‌ బొత్సకు, ముఖ్యమంత్రికి కూడ చుట్టుకుంది. ఇప్పటికి అందిన వివరాల ప్రకారం సోనియా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ గంటసేపు మంతనాలు జరిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆజాద్‌, వాయిలార్‌రవి, అహ్మద్‌పటేల్‌ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం ముఖ్యమంత్రి విచారవదనంతో డిల్లీలో తిరుగుతున్నారు. గురువారం నాటికే పిసిసి నుండి బొత్సకు రాంరాం అని తెలిసి పోయింది. ఈ ప్రక్షాళన ఎంతటితో ఆగుతుందో తెలియని మంత్రులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఏది ఏమైనా హస్తిన రాజకీయాలతో రాష్ట్రంలోని హస్తానికి పునాదులు పడిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పడకేసిన గురుకులాలు

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో జ్వరాలు విజృంభించడం వల్ల విద్యార్దులు జ్వరాలకు తట్టుకోలేక ఇళ్లకు వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వారిలో సగం మంది జ్వరంతో ఉన్నారు. ఇరుకు గదులు, వర్షం వస్తే అన్నీ ధారలుగా కురవాల్సిందే. అయినా చేసేదేమీ లేక ఒక్కోగదిలో దాదాపు 20 మంది చిన్నారులను కుక్కుతున్నారు. దానికి తోడు కిటికీ అద్దాలు పగిలి రాత్రిళ్లు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. తాగేందుకు రక్షిత మంచి నీరులేదు. ఆవరణలో ఉన్న బోరింగో లేదా చెరువులో గతి. వారానికి ఒక్కసారి కూడా క్లోరినేషన్‌ చేసే దిక్కులేదు. హాస్టల్‌ పరిసరాలు కూడా అపరిశుబ్రంగా ఉన్నాయి.ఒక్కసారి హాస్టల్‌ భవనాన్ని చూస్తే భూత్‌బంగాళాగా కనిపిస్తుంటాయి. ఇటీవలే ఇందిరమ్మబాటకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఖమ్మంజిల్లా హాస్టల్‌లో ఒక్కరోజు భోజనం చేసి అక్కడే బస చేశారు. వసతి గృహంలో ఇబ్బందులను తొలగించాలని అధికారులకు ఆదేశించారు అయినా ఫలితం శూన్యం. రాష్ట్రంలోని గురుకులాల్లో జ్వరాల బారిన పడిన పిల్లలను క్రిందనే పడుకోబెడుతున్నారు. మంచాలన్నీ తుప్పుపట్టి వాటిపై దుప్పట్లు లేకుండా ఉండటమే దానికి కారణం. నిబంధనల ప్రకారం ప్రభుత్వవైదునితో ప్రతినెలా గురుకులాల్లోని విద్యార్దులకు వైద్య పరీక్షలు చేయాలి.అయితే ఇంతవరకు అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. మైదాన ప్రాంత గురుకులాల్లోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విద్యార్దుల పరిస్దితి ఇలాగే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు చేపట్టాలని విద్యార్ధులు కోరుతున్నారు

టి.టి.డి. ఛైర్మన్‌ కోసం పైరవీలు

ఈనెల 25 తో టిటిడి పాలకమండలి పదవీ కాలం ముగియ నుండటంతో దీనిపై ప్రస్తుత ఛైర్మన్‌, కనుమూరితో పాటు రాయపాటి సాంబశివరావు, టి సుబ్బిరామిరెడ్డి, ఆదికేశవుల నాయుడు ప్రయత్నింస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రితో సిఫారసు చేస్తారు. టిటిడి నిబంధనల ప్రకారం ఆయనకు రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంది. అయితే 2011 లో ఆగస్టులో కనుమూరిని చైర్మన్‌గా చేస్తూ ఇచ్చిన జివోలో బాపిరాజు ఆగస్టు 25 తేదీవరకు మాత్రమే పదవిలో ఉంటారని పేర్కొన్నారు. బాపిరాజుకు రెండేళ్ల పదవీ కాలం ఇవ్వనందున మరో అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.లేదంటే సెప్టెంబరులోజరిగే బ్రహోత్సవాల వరకైనా ఉంచాలని కోరుతున్నారు. రాయపాటి 2004 నుండి టిటీడీ చైర్మన్‌ పదవికోసం రాజీలేకుండా పైరవీ చేస్తున్నారు.టిసుబ్బిరామిరెడ్డి,ఆదికేశవుల నాయుడును నియమించినప్పుడు కూడా రాయపాటి రేసులో ఉన్నారు. కాకపోతే వీరిరువురూ రెండు సార్లు టిటిపి చైర్మన్లగా పని చేశారు. టిటిడి నిబంధనలమేరకు ఒక వ్యక్తి కేవలం రెండు సార్లు మాత్రమే చైర్మన్‌గా కొన సాగటానికి అవకాశం ఉంది. అంతకు మించి చేయాలంటే టిటీడి చట్టాన్ని మార్చవలసి వస్తుంది. కాబట్టి సుబ్బిరామిరెడ్డి, ఆదికేశవులకు అవకాశం అంతంత మాత్రమే అని తెలిసింది.

ఇప్పటికింతేనా...?

ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రయత్నించినప్పటికీ జాప్యం తప్పలేదని.. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం పునఃప్రారంభ సమయానికి పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందజేసేందుకు ఇప్పట్నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రాథమిక విద్యాశాఖా మంత్రి సెలవిచ్చేస్తున్నారు. ప్రతి విద్యా సంవత్సరం పాఠ్ యపుస్తకాలు ఆలస్యంకావడం... దానికి అమాత్యులు స్పందిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ ఇబ్బందులుండ వని చెప్పడం ప్రతిఏడాదీ సహజంగా జరిగేదే! అవేకాకుండా విద్యార్ధులకు పాదరక్షల పంపిణీపై సమాలోచనలు కొనసాగుతున్నాయని.. బూట్లు ఇవ్వాలా, చెప్పులు ఇవ్వాలా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని మంత్రిగారు కాస్త ఆశ కూడా చూపించారు. పుస్తకాల్లేవు మొర్రో అంటూ ఓ పక్క పిల్లలు గోలెడుతుంటే మంత్రిగారు వచ్చే ఏడాది నుంచి పుస్తకాలతో బాటు చెప్పులు, బూట్లూ అంటూ చెప్పుకుపోతున్నారు.. ఇదంతా చూస్తుంటే` గంజికి నూకలు లేవంటే... పాయసంలోకి పంచదారే ఇస్తానన్నాడట... (ఇదో కొత్తసామెతలెండి..) అన్నట్టుగా ఉంది కదూ....

మా ఆశ... అభిమానుల కోరిక...

కొందరు అభిమానులు నన్ను సిఎంగా చూడాలను కుంటున్నారు. అది వాళ్ళ అభిమానంగానే చూడాలి తప్ప వేరుగా అర్ధం చేసుకోకూడదు. ప్రజల్లో నాపై ఉన్న అభిమానం తోనే అలా కోరుకుంటున్నారు. ప్రత్యేకించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా అభిమానులు అలా కోరుకోవడాన్ని తప్పుగా చూడకూడదు’ అని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన 57వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు తనను అభిమానించే ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోయేలా సుస్థిర స్థానాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజల ఆశీస్సులు ఎల్లకాలం తనకు ఉంటాయని, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ప్రతిభ ఉండాలేకాని సినీరంగంలో ఎంతమంది కొత్తవారికైనా అవకాశాలు ఉంటాయని చెప్పారు. అలాగే ఉద్దండులైన ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు అప్పటికే సినీరంగంలో ఉన్నా కొత్తగా వచ్చిన తనలాంటి వారిని కూడా ప్రజలు చక్కగా ఆదరించారని చిరంజీవి తెలిపారు. ‘నేను కొత్తగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినా, కొద్దిరోజుల్లోనే ప్రజల అభిమానం పొందగలిగాను. ఇంకా కృషి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో తప్పకుండా స్థానం దక్కుతుంది.’ అన్నారు. తన 150వ సినిమా గురించి చెబుతూ.. మంచి కథ నచ్చితే తప్పకుండా చేస్తానన్నారు. అయినా నేను 150వ సినిమా గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైతే రాజకీయాల్లో బిజీగా ఉన్నానని అన్నారు. నిజమే ఏ హీరో అభిమానులైనా తమ హీరో ఎన్నో అద్భుతాలు చేయాలని, తాము ఆశించే, ఎవరికి అందనంత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. అది అభిమానుల నిస్వార్ధమైన అభిమానానికి నిదర్శనం. అభిమానుల కోరిక మేరకే ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి కొంతకాలం అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అందుకుప్రతిగా ఉన్నతపదవిలో ఉన్న చిరంజీవి తన రాజకీయ ఎదుగుదలకు మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. ఈ కృషిలో భాగంగానే, కోస్తాజిల్లాలకు చెందిన ఓ పెద్దమనిషి తన అభిమాన నాయకుడిని ఎలాగైనా సిఎం. చేయాలంటూ కంకణం కట్టేసుకుని ఏకంగా ఓ టీవీ ఛానల్‌ పెట్టేసే సన్నాహాల్లో ఉన్నాట్ట...!

విద్య, వైద్యం నేతిబీర చందం...

మనిషిని ఇతర ప్రాణులనుండి వేరు చేసేది జ్ఞానం. అది విద్య ద్వారానే ప్రధానంగా వస్తుంది. అంతేకాదు మనిషి మంచిచెడుల విచక్షణ తెలుసుకుని బ్రతకడానికీ, బ్రతుకుతెరువుకోసం కూడా విద్య ఉపయోగపడుతుంది. అటువంటి విద్యకు ధనిక, పేద అన్న బేధంకాని, గ్రామాలు, నగరాలు అన్న భేదం కాని లేదు. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే విద్యను అభ్యసించాలంటే ఎల్‌కెజి నుండే వేలకు వేలు ఖర్చు తప్పనిసరి అవుతోంది. ప్రకటనలు, ప్రచార హోరుతో అందరికీ విద్య అని చెప్పే ప్రభుత్వాలు మాత్రం గ్రామీణులకు సరైన విద్యను అందించలేకపోతున్నాయి.       ఆర్థికంగా వెనుకబడిన అన్నితరగతులవారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించడం పరిపాటి. అయితే నేడు ప్రాథమిక విద్య అంపశయ్యపై ఉందని, పాఠశాల విద్య కోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నా కనీస సౌకర్యాలను కూడా కల్పించలేకపోతున్నారని పిఎసి సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలోని హాల్లో పిఎసి ఛైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ప్రభుత్వం పాఠశాల విద్యపై నిర్లక్ష్యం చూపుతోందని సభ్యులు విమర్శించారు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లేరు, నీటివసతిలేదు. మరుగుదొడ్డి సౌకర్యం లేదు. మరుగు దొడ్డి ఉన్నా నీటిసమస్యతో అవి నిరుపయోగంగా మారాయి. కాంపౌండ్‌ వాల్స్‌ లేవు, కరెంటు సౌకర్యం కల్పించలేదు. కరెంటు లేక పోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని’ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పాఠశాలల నిర్వహణ సరిగా లేక ప్రతి మండలంలో కనీసం ఐదు పాఠశాలలు మూతపడ్డాయన్నారు. దీని బట్టి తెలిసింది ఏంటయ్యా అంటే అందరికి విద్య అన్నది అందని ద్రాక్షే. కేవలం నేతిబీరలో నెయ్యిలాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, అక్కడి వసతులు. పథకాలు ప్రకటనల వరకే. ఇక ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలు విద్యావంతులు కావాలంటే ఎలా అవుతారు? ఒకవేళ వీటిపై ఎవరైనా అడిగినా ‘వెంటనే అమలుచేస్తాం’ అంటుంటారు. వెంటనే అంటే సంబంధిత శాఖల, అధికారుల, మంత్రుల దృష్టిలో మళ్ళీ వారికి అక్కడ పని పడినప్పుడో, లేదా ఎన్నికలు వచ్చినప్పుడో లేదా ముఖ్యమంత్రి గారికి సరదాగా పిల్లల్తో క్రికెట్‌ ఆడాలనిపించినప్పుడో అని అర్ధం చేసుకోవాలని సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏమిటీ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు అక్రమంగా నడుపుతున్నారా?

ఈ ప్రశ్న విలేకరులను ఆర్‌టిఓ కార్యాలయంలో అధికారులు రివర్సుగేరులో తరుచుగా వదులుతుంటారు. అయితే ఈసారి అందరూ రవాణాశాఖాధికారులను ఈ ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే వారు తాజాగా హైదరాబాద్‌ నగరశివార్లలో బెంగుళూరు జాతీయరహదారిపై తనిఖీలు చేపట్టి ఐదు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేశారు. ఇవి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నారని అధికారులే స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా ఆ బస్సులను స్వాధీనం కూడా చేసుకున్నారు. అంటే అక్రమపద్దతి కొనసాగుతోందని రవాణాశాఖాధికారులు కూడా అంగీకరించినట్లే కదా! ఒక వేళ అంగీకరించకపోయుంటే ఆ బస్సులు స్వాధీనం చేసుకునేవారే కాదు కదా! ఇంత కాలం వారికి కనిపించని ఈ ఉల్లంఘనలు ఇప్పుడు ఎందుకు రవాణాశాఖాధికార్లకు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి దాడుల్లోనే గుర్తించేంతలా రవాణాఅధికారుల ఐక్యూ ఎప్పుడు పెరిగింది? రాష్ట్రంలోని కీలకమైన కొన్ని జిల్లాల్లో రవాణాశాఖాధికారులను ఏ విలేకరి అయినా ప్రశ్నిస్తే పాపం! ప్రైవేటు ట్రావెల్స్‌ వారు తమ పొట్ట నింపుకోవటానికి నానాపాట్లు పడుతున్నారని అంటుండేవారు. అలా కాదండీ బాబూ ఒకే బస్సు నెంబరుతో రెండేసి ట్రావెల్స్‌ బస్సులు బయటకు వెళుతున్నాయంటే బతుకుదెరువు కద సార్‌! అనేవారు. మరి రవాణాశాఖాధికారులు ఎందుకు ఇంత నిర్దయగా మారిపోయారు? ఎవరికీ చెప్పలేని అవసరాల వల్ల రవాణాశాఖాధికారులు లొంగిపోయారా? ఈ ప్రశ్నలకు ఆ శాఖాధికారులే సమాధానాలు రాబట్టుకుంటే బాగుంటుంది.

అడ్డూఅదుపులేని హరీశ్‌రావు? పార్టీకి చెడ్డపేరు వచ్చినా పట్టించుకోని కేసిఆర్‌?

తెలంగాణారాష్ట్రసమితి(టిఆర్‌ఎస్‌) నేత హరీష్‌రావు ఎప్పుడూ వివాదస్పద వ్యక్తిగా నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈయన చేతికి అడ్డూఅదుపు కూడా ఉండవని, నోటిలో నుంచే మాటలు కూడా అలానే శృతి మించుతుంటాయని ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ అడ్డూ అదుపూ లేని ఈయన ఒకసారి ఢల్లీలోని ఆంధ్రాభవన్‌లో ఉద్యోగిపై చేయి చేసుకుని నాయకుడుగా ఎదిగాం కాస్త జాగ్రత్తగా ఉండాలనే ఇంగితాన్ని కూడా మరిచినట్లు ప్రవర్తించిన విషయం మీడియాలో క్లిప్పింగుల ద్వారా బహిర్గతమైంది. అలానే యావత్తు రాష్ట్రం కూడా అతని దురుసుస్వభావానికి సిగ్గుపడిరది. ఒక్క టిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే ఇంత దురుసైన నాయకుడు ఉన్నాడని ఆనందించినట్లుంది. అందుకే ఢల్లీ నుంచి వచ్చాక హరీష్‌రావుకు అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. పైపెచ్చు మీడియాలో తెలంగాణాకు వ్యతిరేకంగా ఎవరు ప్రచారం చేసినా ఆగలేక ఈయన చేతికి పని చెబుతూనే ఉన్నారు. ఇలానే తాజాగా హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీసుస్టేషనులో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసుఅధికారిపై ఆయన దురుసుగా ప్రవర్తించినందుకు ఐపీసీ సెక్షను 128, 353,297,506,349 కింద కేసు నమోదు చేశారు. అయినా ఆయన పక్కా రాజకీయవాది కాబట్టి ఏమాత్రం సిగ్గుపడరనుకోండి. ఇక ఆ పార్టీ అధినేత కేసిఆర్‌ గురించి కూడా ఈ విషయంలో చెప్పుకోవాలి. ఇంతలా పలుమార్లు హరీష్‌రావు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ఆయనేమి చేస్తున్నారు? కనీసం పార్టీపరంగా క్రమశిక్షణాచర్యలు తీసుకోలేదు సరికదా అదనపు బాధ్యతలను అప్పగించేస్తుంటారు. సో! నోరున్న హరీష్‌రావు తన చేతి దమ్ము నిరూపించుకుంటున్నాడని కేసిఆర్‌ మద్దతు ఇస్తున్నారన్న మాట. అయితే హరీష్‌రావుపై ఎవరు కేసు పెట్టాలన్నా ముందుగా ఆయన్ని అదుపు చేయలేని చవటపై కూడా కేసు పెడితే సరి అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.

నిషావ్యాపారుల ఆస్తుల పత్రాలు, అఫిడవిట్లు పరిశీలన ఇప్పట్లో పూర్తికాదా?

నూతన ఎక్సయిజ్‌ పాలసీ కింద మద్యం దుకాణాల లైసెన్సులు మంజూరు చేసి దాదాపు రెండు నెలలవుతోంది. పాత వ్యాపారులతో ఒప్పందాలు కానీ, స్వయంగా కొత్తవారు నడుపు కోవటం కానీ, ప్రారంభమై రెండు నెలలైనా ఎక్సయిజ్‌ శాఖ కొత్తదుకాణదారుల ఆస్తుల పత్రాలను పరిశీలించలేక పోయింది. కల్తీమద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవటం, ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మకాలు జరిగేలా చూడటం వంటి పలు అంశాలపై శాఖాపరంగా దృష్టిసారించటంతో ఈ పత్రాల పరిశీలనను ప్రభుత్వ సూచనల మేరకు రెవెన్యూశాఖకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,596 మద్యం దుకాణాలకు ధరఖాస్తులు ఆహ్వానిస్తే 5,959 దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేశారు. ఒకవేళ వ్యాపారి ఎప్పుడైనా లైసెన్సు ఫీజు చెల్లించకపోతే అఫిడవిట్ల ద్వారా డబ్బు రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కొందరు వ్యాపారులు నకిలీ పత్రాలు సమర్పించారని వెలుగులోకి వచ్చింది. అందువల్ల శ్రద్ధగా ఈ పత్రాల పరిశీలన చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖ ఇంకా ఈ పత్రాలు ఎంతవరకూ పరిశీలించిందో? వివరాలు వెల్లడిరచలేదు. దీంతో ఆ పరిశీలన ఎప్పటికి పూర్తవుతుందో కూడా అంచనా వేయటమే కష్టంగా ఉంది. ఇంకా ఎంత సమయం కావాల్సి ఉందో కూడా రెవెన్యూశాఖ ఎక్సయిజ్‌కు తెలియజేయలేదు. దీంతో ఈ పరిశీలన ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని మాత్రం అర్థమవుతోంది.