సుదర్శన్ మృతి ఆరెస్సెస్ కి తీరని లోటు

ఆర్ ఎస్ ఎస్ అంటే సుదర్శన్, సుదర్శన్ అంటే  ఆర్ ఎస్ ఎస్. ఏళ్లపాటు ఆరెస్సెస్ తో సుదర్శన్ కి అంతగా బంధం బలపడిపోయింది. వాజ్ పేయ్ ప్రథానిగా ఉన్నప్పుడు సుదర్శన్ ఏది చెబితే అది క్షణాల్లా జరిగిపోయేది. నమ్మిన సిద్ధాంతంకోసం ప్రాణం పోయేవరకూ నిలబడ్డ గొప్ప మనిషి సుదర్శన్. కరుడుగట్టిన హిందూ తత్వవాది అనే ముద్ర బలంగా ఉన్నా సుదర్శన్ అతివాది కాదని పార్టీలో చాలామంది చెప్పుకుంటారు. తన తర్వాత మరో పది తరాలవరకూ ఆరెస్సెస్ పై సుదర్శన్ చెరగని ముద్ర వేశారని బీజేపీ సీనియర్ నేతలంతా ఒప్పుకుని తీరాల్సిందే. చాలాకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ రాయపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంలోనే తుది శ్వాస విడిచారు. 1954 నుంచి కుప్పిలి సీతారామయ్య సుదర్శన్ ఆర్ ఎస్ ఎస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2000 నుంచి 2009 వరకూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 మార్చ్ 31న పదవినుంచి వైదొలిగారు.

డీజిల్‌ మండింది...గ్యాస్‌ బరువైంది!

దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా జీవితం గడిపేస్తున్న సామాన్యుడంటే ఏలినవారికి చాలా చులకన! అందుకే ఉన్నవాడూ లేనివాడూ అనే తేడా లేకుండా అందరూ వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను  ప్రభుత్వం విపరీతంగా పెంచేస్తోంది. ఈ క్రమంలోనే మొన్న విద్యుత్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వడ్డిస్తే... నేడు కేంద్రం డీజిల్‌ ధరని పెంచేసి గ్యాస్‌ సిలిండర్లపై పరిమితి విధించింది.నిత్యావసర వస్తువుల పంపిణీ డీజిల్‌తో నడిచే మోటార్‌ వెహికల్స్‌పైన ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచేసినట్లుగా భావించాల్సిఉంటుంది. వంటగ్యాస్‌ను ఒక కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్ల వరకే పరిమితం చేసింది. ఆ కుటుంబం టైమ్‌ బాగోలేక ఏడోబండకోసం ప్రయత్నిస్తేమాత్రం సుమారుగా 750 రూపాయలు చెల్లించాల్సిందే! అంటే మామూలుగా తీసుకునే గ్యాస్‌ సిలిండర్‌  ధరకు సుమారుగా రెట్టింపు చెల్లించుకోవల్సి వస్తుంది.  ఇది ఏంటని అడిగితే ‘ చేప..చేప... ఎందుకెండలేదు...’ కథ చెప్పుకొస్తారు. నిత్యావసర ధరలు నింగినంటి అందకుండా పోతుంటే... గ్యాస్‌ బరువై...దాని క్రింద పడి నలిగిపోయే పరిస్థితే వస్తుంటే.. సామాన్యుడు... పచ్చికూరలే శరణమని భావించి.. ఆదిమానవుని అలవాటులోకి మారినా ఆశ్చర్యపోనక్కరలేదు.!

వైకాపా కాంగ్రెస్ లో కలిసిపోతుందా...?

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి ఇప్పుడు ముందుగొయ్యి వెనక నుయ్యిలా తయారయ్యింది. పార్టీని తిరిగి కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో జగన్ వర్గం నేతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. వై.ఎస్ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీని ముక్కతిట్లు తిట్టి జగన్ పక్షాన చేరినవాళ్లకు ఇప్పుడు పరిస్థితి అర్ధంకావట్లేదు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే అప్పట్లో అంతగా తిట్టిపోసి బైటికొచ్చిన నేతలు ఇప్పుడు ఏముఖం పెట్టుకుని తిరిగెళ్లాలో అర్థం కావట్లేదు. వైఎస్సార్ సీపీ నిజంగా కాంగ్రెస్ లో కలిసిపోతే జగన్ కచ్చితంగా సీఎం అయి తీరతాడన్న నమ్మకంతో వేరేపార్టీలనుంచి వలసొచ్చి వైకాపాలో చేరుతున్న వాళ్ల పరిస్థితి దారుణాతి దారుణంగా తయారవుతుందన్న భయాలుకూడా విపరీతంగా పెరిగిపోతున్నాయ్. ఉన్నపార్టీలో కాస్త నిమ్మళంగానే ఉన్నా సీటుకోసం జగన్ పార్టీవైపుకి దూకుతున్న నేతలు తీరావచ్చాక చేతికి చిప్పే మిగులుతుందేమో అన్న భయంతో వణికిపోతున్నారు.     పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జగన్ వర్గం నేతలు బజారునపడి అధికార వ్యామోహంతో నడిరోడ్డుమీద బలాబలాలు తేల్చుకుంటున్న తీరునుకూడా ప్రజలు నిశితంగా గమినిస్తూనే ఉన్నారు. పార్టీ ఇప్పటివరకూ సంస్థాగతంగా పటిష్టం కాలేదని వై.ఎస్ సతీమణి విజయలక్ష్మి బలంగా నమ్ముతున్నారని, అందుకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే దిశగా ప్రకటనలు చేస్తున్నారనీ వైకాపా నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఉపఎన్నికల్లో వైకాపా సత్తాని చాటగలిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం డొల్లతనం బైటపడుతుందన్న భయం పై స్థాయిలో గట్టిగానే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ నేతలుకూడా అనుకుంటున్నారు. వై.ఎస్ జగన్ మాత్రం తన సత్తాని కాంగ్రెస్ కి ఇంకా గట్టిగా రుచిచూపించాలన్న ఉబలాటంలోనే ఉన్నారని, విజయమ్మ సలహాకి మొగ్గుచూపడం లేదని మరో టాక్ కూడా గట్టిగా నడుస్తోంది. ఇప్పుడు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ప్రజల్లో వ్యతిరేకతవస్తుందన్న భావనని జగన్ గట్టిగా వెలిబుచ్చుతున్నట్టు సమాచారం. జగన్ కి కుర్చీని కట్టబెట్టడానికి సోనియా నుంచి గట్టి హామీ వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ని తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సబబని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి గట్టిగా అభిప్రాయపడుతున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా..

చంద్రబాబు పేరిట ఉన్నది 31.97లక్షలే

వై.ఎస్ బతికుంటే, ఆయన ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండుంటే “డబ్బున్నోళ్లలో చంద్రబాబుది నిజంగా చాలా నిరుపేద స్థితి” అంటూ చంద్రబాబు మీద కచ్చితంగా సెటైర్లేసేవాళ్లు. ఇప్పుడాయనకు ఆ పదవీలేదు. రాజకీయాలమీద అంత ఆసక్తీ లేదు. ఏదో కృష్ణా, రామా అనుకుంటూ, వీలైనప్పుడల్లా లంకపొగాకు చుట్ట కాల్చుకుంటూ తమిళనాడు గవర్నర్ గిరీలో హాయిగా సేదతీరుతున్నారు. రాజకీయాల్లో పారదర్శకంగా ఉండాలన్న ఆలోచనతో తాను నిజంగా తనపేరిట ఉన్న ఆస్తుల్ని ప్రకటించానని చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు. సింగపూర్ లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా ప్రకటిస్తే బాగుండేదంటూ చురకలు వేస్తున్న ప్రతిపక్ష నేతలకు బాబు దీటుగానే సమాధానం చెబుతున్నారు. నిజంగా సింగపూర్ లో తనకు ఆస్తులున్నాయని నిరుపిస్తే మొత్తం ఆస్తులన్నీ, నిరూపించినవాళ్లకే రాసేస్తానని సవాల్ చేస్తున్నారు. ఏతావాతా చంద్రబాబు ఈసారి ప్రకటించిన ఆస్తుల వివరాలమీద ఓ లుక్కేస్తే .. కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.35.59 కోట్లు. చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 31.97 లక్షలు. 1985 నుంచి 1992 మధ్య కట్టిన ఇల్లు, కొనుక్కున్న కారు చంద్రబాబు పేరుమీదే ఉన్నాయ్. బాబు భార్య భువనేశ్వరి పేరుమీదున్న ఆస్తుల విలువ రూ.24.57 కోట్లు. కుమారుడు లోకేష్ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 6.62 కోట్లు. కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 2.09 కోట్లు.

ఆడపిల్లలతో వెకిలివేషాలేస్తున్న స్కూల్ మాస్టర్

కడపజిల్లా తాళ్లపాక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మాస్టారికి కామరోగమొచ్చింది. కూతుళ్ల వయసులో ఉన్న స్కూల్ పిల్లల్ని ఎక్కడపడితే అక్కడ తడుతున్నాడట. బండబూతులు మాట్లాడుతూ పిచ్చి చేష్టలు చేస్తున్నాడట. అయ్యగారి వెకిలి చేష్టలతో విసిగిపోయిన పిల్లలు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. మూకుమ్మడిగా పాఠశాలమీదికి దండెత్తిన పిల్లల తల్లిదండ్రులు హెడ్మాస్టర్ సర్దిచెప్పడంతో కాస్త శాంతించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న కామాస్టారు కూడా దిగొచ్చి లెంపలేసుకోవడంతో గ్రామస్తుల ఆగ్రహం చల్లారింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరిగితే తోలు వలుస్తామని వార్నింగిచ్చి వదిలేశారు. చాలారోజులుగా జరుగుతున్న ఈ తంతుగురించి మనోడు హెడ్మాస్టారిక్కూడా తెలీకుండా మ్యానేజ్ చేశాడు. తెలిసుంటే పాపం ఆవిడకూడా ఓ ఆడమనిషే కనక వీడికి ముందే సీన్ సితారయ్యేదేమో..

ఆ ఊరికి దెయ్యంపట్టిందంట!

మహబూబ్ నగర్ జిల్లా దర్గా గ్రామానికి దెయ్యం పట్టింది. ఐదేళ్లక్రితం ఆత్మహత్య చేసుకున్న మహిళ దెయ్యమై తిరుగుతోందని ఊరివాళ్లంతా బలంగా నమ్ముతున్నారు. ఆ దెయ్యం ఎప్పుడు ఎవర్ని పట్టుకుంటుందో తెలియక అనుక్షణం భయంతో వణికిపోతున్నారు. ఊరివాళ్లందరికీ ఐదేళ్లుగా ఆరోగ్యం సరిగా ఉండడంలేదని, దీనికి కారణం మహిళ ఆత్మహత్యేనని అంతా బలంగా నమ్ముతున్నారు. పిల్లలకోసం సర్కారు కట్టించిన స్కూల్ ఖాళీగా పడుంది. ఊళ్లో ఉన్న ఇళ్లన్నీ మూఢనమ్మకం కారణంగా ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయ్. బతికుంటే బలుసాకు తినొచ్చన్న నమ్మకంతో కన్నతల్లిలాంటి ఉన్న ఊరిని వదిలేసి గ్రామస్తులు పక్కూళ్లకు వలసపోతున్నారు. ఏ దిక్కూ లేనివాళ్లుమాత్రం ఊళ్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

జగన్‌ పార్టీ నేతల కుమ్ములాటలు

అధికారం అంతా అధిష్టానం చేతిలోనే ఉన్నా లోకల్‌గా తానే గొప్పంటూ నిరూపించుకోవాలన్న తపన కాంగ్రెస్‌ లోనే ఎక్కువగా వుంటుందన్నది నిజం ! ప్రాంతీయ పార్టీల హవా మొదలయిన తర్వాత ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకోవడంతో దేశం లోనూ ఆధిపత్య పోరు మొదలైంది. అదిప్పుడు నారా, నందమూరి వంశాల మధ్య నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. ఇదిలా వుంటే` రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అవిర్భవించిన వైఎస్‌ఆర్‌సిపి పేద ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీగా చెప్పుకుంటున్నప్పటికీ, జగన్‌ తన సంక్షేమం కోసమే పార్టీ పెట్టారన్నది విమర్శకుల మాట! అక్రమాస్తుల కేసులో జగన్‌ చంచల్‌గూడా జైలుకు వెళ్ళడంతో పార్టీ పగ్గాల కోసం షర్మిల పోటీపడుతున్నారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఆ నేపధ్యంలోనే షర్మిల ఉప ఎన్నికలయ్యిం తర్వాత ఉన్నట్టుండి బెంగళూరు వెళ్ళిపోయారంటారు. అసలు నేత జగన్‌ జైలుకెళ్లడం ఎన్నికల ప్రచారంలో ఫ్యానుగాలి హోరు బలంగా వినిపించిన షర్మిల బెంగళూరుకు వెళ్ళిపోవడం నేపథ్యంలో లోకల్‌గా తామే హీరోలం కావాలని ఆ పార్టీకి చెందిన చాలా మందే ప్రయత్నాలు చేసేసుకుంటున్నారు. అందుకు మొన్న ఇబ్రహీంపట్నం, మాల్కాజ్‌గిరి, నిన్న జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలే సాక్షి! తూర్పు పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో కూడా పార్టీలో పట్టుకోసం లోకల్‌ నేతల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోందని తెలుస్తోంది. ఇవన్నీ`2014 ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల కోసం ఇప్పట్నుంచే జరుగుతున్న ప్రయత్నాలేనంటూ ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

పండగ బహుమానంగా ధరల పెరుగుదల

పండగ సీజన్‌ వస్తోందంటే చాలు... సామాన్యుడి గుండె భయంతో వణకిపోతోంది. అడపాదడపా పెంచేస్తున్న ధరలు ప్రభుత్వ నేతలకు అంత సంతృప్తిగా లేవేమోమరి... ఈ సారి పండగ సీజన్లో పెట్రోలుతోబాటు నిత్యావసర వస్తువుల ధరలుకూడా పెంచెయ్యాలని ప్రభుత్వం కంకణం కట్టేసుకుంది. పెట్రోలుతో సహా ఇతర ఇంధనధరలు ఈవారంలోనేపెంచాలని ప్రభుత్వం అనుకున్నప్పటీకీ ` బొగ్గుకుంభకోణం నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసిన ప్రతిపక్షాలు ధరల పెంపును మరో పెద్ద ఇష్యూ చేస్తాయని భావించి, ముందుజాగ్రత్తగా వచ్చే వారానికి ఈ ప్రతిపాదనను వాయిదా వేసేసింది. అలాగే పండగ సీజన్‌లో నిత్యావసర వస్తువులకు ఉండే డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని చక్కెర, వంటనూనెలు, పప్పుదినుసులు సుమారు 15 శాతం మేరకు ధరలు పెరగనున్నాయని ఇటీవల జరిగిన సర్వేలు హెచ్చరిస్తున్నాయి. వినాయకచవితితో ప్రారంభమైన పండగాల సీజన్‌ దసరా, దీపావళి, సంక్రాంతి వంటి వరుస పండుగలతో సుమారు ఉగాది వరకూ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు పెరిగిన ధరలు దాదాపుగా ఆర్నెల్లపాటు కొనసాగి, ఆ తర్వాత అక్కడే స్థిరపడి పోతాయన్నమాట ! అందుకే` దీన్ని పండగ సీజన్‌ అనేకన్నా వడ్డింపు సీజన్‌ అంటే సమంజసంగా ఉంటుందంటున్నారు సామాన్యజనం.

అమెరికా అద్యక్షుడి ఎన్నికకూ స్టార్ల సాయం కావల్సిందే !

  ఫిల్మ్‌ స్టార్ల సాయంలేకుండా ప్రస్తుతం ఏదేశంలోనూ ఎన్నికలు జరగటం లేదు ! భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో సిన్మాస్టార్లు రాజకీయ ప్రచారంలో పాల్గొనడం అతిమామూలు విషయమై పోయింది ! ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక్క భారతదేశంలోనే సినీస్టార్స్‌ రాజకీయప్రచారం ఎక్కువని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఈ విధానం తెగనచ్చేసిందో ఏమో గానీ, తనకు మద్దతుగా ఫిల్మ్‌స్టార్ల చేత ప్రచారం చేయించేసు కుంటున్నారు. కోరిక ఒబామాదే అయినా` స్టార్లు మాత్రం తమంతట తాముగా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తామంటూ చెప్పేస్తున్నారు. ఇటీవల జరిగిన డెమోక్రాటిక్‌ ప్రతినిధుల సభలో హాలీవుడ్‌ తారలు ఈవా లాంగోరియా, స్కార్‌లెట్‌ జోహన్‌సన్‌, కేర్రీ వాషింగ్టన్‌లు పాల్గొని ఒబామా వల్ల మాత్రమే అమెరికా మరింత పురోగమిస్తుందని గట్టిగా చేప్పేశారు !

పెంపులతో సామాన్యుడి (ఇం)ధనం ఆవిరి!

  ఇంధన ధరల పెంపు ప్రతిపాదన వచ్చే వారానికి వాయిదా పడింది. పెట్రోల్‌తో సహా ఇతర ఇంధన ధరలను తక్షణమే పెంచే ఆలోచనైతే లేదని కేంద్ర చమురుశాఖా మంత్రి స్పష్టం చేశారు. ఆయనే సామాన్యులపై పెనుభారం మోపే ఇంధన ధరల పెంపు బాధాకరమైన నిర్ణయమైనప్పటికి తీసుకోక తప్పదని కూడా ఆయన సెలవిచ్చారు. ‘అహా! ఆయనకు సామాన్య ప్రజలపై ఎంత ప్రేమ. ఒకవారంరోజుల పాటు ధరలు పెంచకుండా వాయిదా వేసి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నియంత్రిత ధరలకు డీజిల్‌, ఎల్‌పిజి, కిరోసిన్‌ విక్రయించడంతో ఐఓసి, హెచ్‌పిసిఎల్‌, బిపిసిఎల్‌ సంస్థలు రోజుకు రూ.560 కోట్లు నష్టపోతున్నాయి. సబ్సిడీ ధరలకు విక్రయించడం వల్ల లీటర్‌ డీజిల్‌పై రూ19.28, కిరోసిన్‌పై రూ.34.34, ఇంట్లో వాడుకునే వంటగ్యాస్‌ సిలిండర్‌ ఒక్కింటికి రూ. 347 నష్టం చవిచూడాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్‌పై నియంత్రణ ఎత్తివేసినప్పటికి పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగడంతో ధర పెంచడానికి కేంద్ర ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు అనుమతివ్వలేదు. అంటూ చెప్పుకొచ్చారు. వాయిదాపడే కొద్దీ పెంపుకూడా పెరుగుతుంటుంది. ఏతావాతా చెప్పేదేంటయ్యా అంటే ` మోటారు బండ్ల కంటే ఎడ్లబండ్లే శ్రేయస్కరమని! ఇది చాణ్యుకునికి సైతం అందని రాజనీతి.

వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు పీవీ అని..

  ప్రపంచంలో ఏ రాజకీయనాయకుడైనా నదిలేని చోట వంతెన కడతానని, భోజనం మీ చేతులతో తినకుండా నాచేత్తోనే ప్రేమగా తినిపిస్తానన్నట్లుగా చెబుతారు. అలాగే వుంది అమెరికా అధ్యక్షుడు ఒబామా గారి మాటలు వింటుంటే. గెలిచిన తర్వాత వంతెన సంగతి ఎలావున్నా మంచినీటికి సైతం కొట్టుకోవాల్సిందే. తన చేత్తో తినిపించడం సంగతి ఎలా వున్నా... తినేందుకు దొరికితే చాలు. ప్రపంచంలోని దేశాలన్నిటిలో అత్యంత అబద్ధాలు, జగడాలమారి దేశం (పాలకులు సుమా, ప్రజలు కాదు) ఏది అని ఓటింగ్‌ పెడితే ప్రథమ స్థానం అమెరికాకే వస్తుంది. అది ముమ్మాటికి నిజం. అమెరికా చేసిన యుద్దాలమీద ఒట్టు. అటువంటి అమెరికా మొదటినుండి ప్రపంచంలోని దేశాలన్నిటికి పెద్దన్నగా తనను తాను ప్రకటించుకుంది, చెప్పుకుంటుంది. అమెరికా అధ్యక్ష పీఠానికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షపీఠంపైనెక్కి అమెరికా ప్రజల ఆకాంక్షలు తీరుస్తున్నానంటూ మరోసారి తననే ఎన్నుకోమని ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. గతంలో కూడా ఆయన డెమోక్రాటిక్‌ అభ్యర్థిగానే పోటీచేశారు. మరోసారి అవకాశమిస్తే నాలుగేళ్ళలో దేశరూపురేఖలు మారుస్తానని, యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, ఆర్థికవ్యవస్థను చక్కబెడతానని, ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందిస్తానని, అమెరికన్ల భద్రతకు పాటుపడతానని చెప్పుకున్నారు. అంతేకాదు తన అధ్యక్ష పీఠానికి ప్రత్యర్ధిగా నిలబడిన రోమ్నీ గెలుపొందితే దేశ సంక్షోభంలో పడిపోతుందని హెచ్చరించారు. గతంలో వున్న చాలామంది అధ్యక్షుల తీరు కూడా ‘నెమలికంట కన్నీరు కారితే, వేటగాడికి ఏమైనా ముద్దా’ అన్నట్లు ఉండేవి. గత ఎన్నికల్లో ఒబామా మాటలు, ప్రపంచదేశాలపై చూపించిన ప్రేమ, వాగ్ధానాలు, నేటి ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన స్థితిగతులు గుర్తున్న అమెరికా ప్రజలు ‘కుప్ప తగులబెట్టి పేలాలు ఏరుకుతిన్నట్లు, (ఇతరదేశాలమీద యుద్ధాలపేరుతో ఆర్థికవ్యవస్థ విచ్ఛిన్నం) కోడిగుడ్డుపై ఈకలు పీకిన’ (యువతకు ఉద్యోగాలు, శాంతిభద్రతలు) చందమని తెలుగువారి నానుడులను ఇంగ్లీష్‌ భాషలో తర్జుమా చేసుకుని చెప్పుకుంటారు.

ఎంత లేటయితే.. అంత గ్రేటు....!

  ఒకప్పుడు ఏమోకాని ఇప్పుడు మాత్రం పేదవాడికి సెంటు భూమి అందిందంటే అందరికీ ఇట్టే తెల్సిపోతుంది! అదే ఏ పారిశ్రామికవేత్తో రాజకీయనాయకుడో వేల ఎకరాలు అందుకున్నాడనుకోండి (పేరుకు కంపెనీలు కోసమని చెప్పడం రివాజు) దానిగురించి ఎప్పటికోగాని తెలియదు. అప్పటికి సదరు వ్యక్తులు పెట్టిన పెట్టుబడి లాభం రానే వస్తుంది. ఇలా వుంటుంది నేటి పాలకన్యాయం. వివిధ రాష్ట్రాలకు సంబంధించి 24 లక్షల ఎకరాల ‘భూదాన’ భూములకు సంబంధించిన రికార్డులు గల్లంతవడంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈనెల 20న ఢల్లీిలో జరగనున్న రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.   వినోభా భావే 1951లో చేపట్టిన భూదానోద్యమంలో 48 లక్షల ఎకరాల భూములను ‘భూదానం’ కింద భూములు లేని పేదలకు దానం చేయగా, అందులో సగం భూములు మాత్రమే ఇప్పటివరకు పేదలకు పంపిణీ అయ్యాయని, అలాగే మిగిలిన భూముల సమస్యలు సంక్లిష్టమైనవని గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి జైరాం రమేష్‌ అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడచినా కొన్ని భూముల్లో వున్న సంక్లిష్టమైన విషయాలను ఇంతవరకూ పరిష్కరించలేదంటే లోపం ఎక్కడుంది? పాలకుల్లోనా? ఆ భూముల్లోనా? ఇచ్చిన దాతల్లోనా? తీసుకున్న గ్రహీతల్లోనా..?! ఇదంతా చూస్తే ‘నే ఎక్కే బండి జీవితకాలం లేటు..’ అన్న సామెత గుర్తుకువస్తోంది కదూ...!

కాంగ్రెస్‌.. ‘రిచ్‌’ రేసులో ముందు!

  సాధారణంగా ఒక కంపెనీ వ్యవస్థాపకుడు అధికమొత్తంలో పెట్టుబడి పెట్టి స్థాపిస్తే, ఆ తర్వాత అతని ఉత్సాహన్ని బట్టి మరికొందరు అందులో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలా.. అలా.. ఆ కంపెనీలో ఎంతోమంది పెట్టుబడులు పెడతారు. ఎవరు పెట్టుబడి పెట్టినా లాభాలు రావాలనే ఆశిస్తారు. సదుపాయాలు పొందాలనే కోరుకుంటారు. నేడు రాజకీయ పార్టీలు కూడా కంపెనీల్లా తయారయ్యాయి. ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇస్తున్నారు. అలా విరాళాలతో దేశంలోని రిచ్‌పార్టీలలో మొదటిస్థానంలో కాంగ్రెస్‌ ఉంటే, రెండోస్థానంలో బి.జె.పి. ఉంది. అంతర్గత గొడవల్లోనేకాదు, ‘రిచ్‌’ విషయంలో కూడా ముందే. శభాష్‌! అలాగే రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రాలలోని ప్రముఖ ప్రాంతీయపార్టీలు ప్రథమ, ద్వితీయ స్థానాలను ఆక్రమిస్తున్నాయి. ఈ పార్టీలన్నీ ఇలా రిచ్‌పార్టీలుగా మారడానికి ఎంతోమంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు విరాళాలు అందించారు. విరాళాలు స్వచ్చంధ సంస్థలు ఇవ్వడం పరిపాటి. ఎందుకంటే తద్వారా ఎంతోమంది ప్రజలకు సేవ చేసినట్లుగా ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయి. మరి పార్టీలకు ఏం ఆశించి విరాళాలు ఇస్తారు? దీనికి సమాధానం కొంచెం రాజకీయం తెలిసిన ఎవరికైనా అర్ధం అవుతుంది. కాకుంటే అందరిలా మనం అనుకోవాల్సిందే ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక...’ అని...!

లడాయిలు తప్పనిసరి!

  ఏ పార్టీ అయినా అప్పుడప్పుడు ఆ పార్టీలోని కొందరివల్ల ఇబ్బందులు పడకతప్పదు. అది తప్పనిసరి. కాని కాంగ్రెస్‌పార్టీలో మాత్రం ప్రతి విషయంలోను నాయకుల మధ్య లడాయిలు తప్పవు. అసలు లడాయిలు లేందే ఆ పార్టీలోని నాయకులకు అస్సలు తోచనే తోచదు! పబ్లిసిటీ కోసం కూడా లడాయిలు సృష్టించుకుంటారనడం సత్యదూరమేంకాదు! ఇటీవల లేక్‌వ్యూ అతిథి గృహంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ అజాద్‌ను పెద్దపల్లి ఎం.పి. వివేక్‌, విజయవాడ ఎం. లగడపాటి కలిశారు.     ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్‌కు నష్టమని కనుక ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని వివేక్‌ కోరగా, లగడపాటి తెలంగాణా ఇస్తేనే కాంగ్రెస్‌ నష్టమని అనడంతో వివేక్‌, లగడపాటి మధ్య లడాయి ప్రారంభమై తెలంగాణా విషయంలో ఎందుకు అడ్డుపడుతున్నారని, విజయవాడ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసుకుంటే మీకొచ్చే ఇబ్బంది ఏంటని వివేక్‌ అంటే, పెద్దపల్లిని రాజధానిగా చేసి తెలంగాణా రాష్ట్రం ఇస్తే తమకేమి అభ్యంతరం లేదని లగడపాటి ఎద్దేవా చేసినట్లు తెలిసింది. దీని బట్టి ఏం అర్ధమయిందయ్యా అంటే ఏ విషయంలోనైనా ఆ పార్టీలో లడాయిలు లేందే పొద్దుపోదు. లడాయిలు లేంది పార్టీ లేదు, లడాయిలంటే ఇష్టపడని నాయకులు ఈ పార్టీలో మమేకం కాలేరని అర్ధమవుతోంది.

సింగరేణి బొగ్గు స్మగ్లింగ్

వరంగల్ జిల్లా భూపాలపల్లి బొగ్గుగనులనుంచి తరలిపోతున్న నాణ్యమైన బొగ్గుని మార్గమధ్యంలో మార్చేస్తున్నారు. రైలు వరంగల్ జిల్లా సరిహద్దులోని బావుపేట దగ్గర ఆగినప్పుడు నల్లబంగారాన్ని దొంగలు దొంగిలించి ఆ స్థానంలో పనికిరాని బొగ్గుని నింపుతున్నారు. లారీ డ్రైవర్లతో కుమ్మక్కైతే చాలు లోడ్లకి వేసి సీళ్లుకూడా కొత్తవి పుట్టుకొచ్చేస్తాయ్. రైలు ఆగీ ఆగగానే చకచకా పనిమొదలుపెట్టేస్తారు.. బొగ్గు దొంగలు.. అంతా పథకం ప్రకారం సాగిపోతుంటుంది. చాలా వేగంగా దొంగిలించిన బొగ్గు స్థానంలో నాసిరకం బొగ్గునికూడా నింపేస్తారు. మళ్లీ రైలు బయలుదేరే సమయానికి అంతా సవ్యంగానే కనిపిస్తుంది. ఈ అక్రమ దందా చాలాకాలంగా సాగుతున్నా పట్టించుకునేవాళ్లే లేకుండా పోయారని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీలకు నాసిరకం బొగ్గు చేరడంవల్ల తాము పెనాల్టీలు చెల్లించాల్సొచ్చి ఆదాయానికి గండిపడుతోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సొంత నియోజకవర్గంలో ధర్మాన పర్యటన

వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో తనపేరుండడంపై స్పందించిన ధర్మాన ప్రసాదరావు బాధ్యత వహిస్తూ మంత్రిపదవికి రాజీనామా చేశారు. ధర్మాన గతి ఇలాగైతే రేపు మన పరిస్థితేంటి అన్న భయం మిగతా మంత్రులకుకూడా పట్టుకుంది. హైలెవెల్లో తర్జనభర్జనలు జరిగాయి. రాజీనామాని ఆమోదించాలా వద్దా అనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అధిష్ఠానానికే వదిలేశారు. సోనియా ఆశీస్సులతో ధర్మాన రాజీనామాని పెండింగ్ లో పెట్టారు. తన నియోజకవర్గంలో తిరగడానికి ముఖం చెల్లక హైదరాబాద్ లోనే కాలం గడిపిన ధర్మాన ప్రసాదరావ్, అధిష్ఠానం తన రాజీనామాని పెండింగ్ లో పెట్టేసిన తర్వాత మొదటిసారిగా తన నియోజకవర్గానికి వెళ్లారు. తనని నమ్ముకున్న వాళ్లకు, తన మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, జరిగిన విషయాల్ని పూర్తిగా ఏకరువు పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనివల్ల తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని సమర్ధంగా తిప్పికొట్టొచ్చని ధర్మాన గట్టిగా నమ్ముతున్నారు.

బాల్‌ థాక్రే మాటే ఇప్పుడు బర్నింగ్‌ టాపిక్‌

సంచలనాలకు మారుపేరుగా శివసేన అధినేత బాల్‌ థాక్రేను చెప్పుకోవచ్చు. ఒకానొక డబ్బింగ్‌ సినిమాలో ‘నా దారి రహదారి’ అన్నట్లుగా ఆయన దారే వేరు. రాజకీయాల్లో సందర్భం ఏమీ లేకపోయినా ప్రకంపనలు సృష్టించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా! అవును... బాల్‌మాటే ఇప్పుడు బర్నింగ్‌ టాపిక్‌ అయ్యింది! ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అంటే బి.జె.పి.లో ప్రస్తుతం ప్రధాని పదవికి పూర్తి అర్హతలున్న వ్యక్తి సుష్మా స్వరాజ్‌ మాత్రమేనని బాల్‌ థాక్రే స్పష్టం చేశారు. కోల్‌గేట్‌ కుంభకోణానికి సంబంధించి సుష్మా భేటీ అనంతరం శివసేన పత్రిక సామ్నాలో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయం చెప్పారు. ఆమె తెలివైన నాయకురాలు. చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. అని అన్నారు. దీనిపై బి.జె.పి. నాయకుడు బల్బీర్‌ పుంజ్‌ స్పందిస్తూ ప్రధాని కాగలిగిన వారు తమ పార్టీలో చాలామంది నేతలే ఉన్నారని వ్యాఖ్యానించారు. బల్జీర్‌ పుంజ్‌ వ్యాఖ్యల్ని పలువురు నేతలు బి.జె.పి.సమర్ధించారు. ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్‌వారు అప్పుడే ప్రధాని పదవిపై కలలా అంటూ ఎద్దేవా చేస్తున్నారు! ప్రధాని పదవికి అర్హత కలిగిననేత సుష్మా అని అన్నది థాక్రే అయితే దాన్ని బి.జె.పి. నాయకుల కలగా అభివర్ణించింది కాంగ్రెస్‌. ఓ వెంట్రుక దొరికింది. దాన్ని ప్రతిపక్ష పార్టీ అనే కొండకు ముడేశారు. పోతే మాటే, వస్తే ప్రతిపక్షంలో ముసలం! ఇది కాంగ్రెస్‌వారి ఆలోచన! చూద్దాం... ఏం జరుగుతుందో....?

ఇంటి ఇల్లాలికీ ఇక జీతం ఇవ్వాల్సిందే

భర్తకూ, పిల్లలకూ వండిపెడుతూ, బండెడు చాకిరీని తన భుజాలపై మోస్తూ జీతం బత్తెం లేని ఉద్యోగం చేస్తున్న ఇంటి ఇల్లాలికి ఇక మంచి రోజులు రాబోతున్నాయి! ఇదే విషయాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మంత్రి కృష్ణా తీర్ధ్‌ చెబుతూ, ఇంటిఇల్లాలు చేసే బండెడు చాకిరీకి తగిన విలువను చెల్లించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నామన్నారు!ఇంటి ఇల్లాలి పని ఒత్తిడ, ఆర్థిక స్వాతంత్య్రం పై ఇటీవల సర్వే నిర్వహించామనీ, ఆ సర్వేలో అత్యధిశాతం మందిమహిళలు ఆర్థిక స్వేచ్ఛ లేనట్లుగా పేర్కొన్నారనీ ఆయనన్నారు. ఇంటి ఇల్లాలికి నెల నెలా భర్త జీతం చెల్లించాలన్న ప్రతిపాదన హర్షనీయమే అయినప్పటికీ, ఎవరెవరికి ఎంత చెల్లించాలన్న దానిపై స్పష్టత కోసం అధ్యయనం చెయ్యవలసి ఉంటుంది. ఇంటి పనంతా ఇల్లాలిపై వేసి ఆమె చేత చాకిరీ చేయించు కోవడమే కాకుండా, అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అంటూ అధికారం చెలాయించే మగమహారాజులు ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారో మరి!

ప్రాణాంతకంగా మారిన బయో మెడికల్‌ వ్యర్ధాలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల నుండి వెలువడుతున్న బయోమెడికల్‌ వ్యర్ధాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. భూమిలో కలిసిపోయే గుణంలేని ఈ వ్యర్ధాలను ప్రత్యేక ప్లాంట్లలో నిర్వీర్యంచేయకపోవడంతో భవిష్యత్‌లో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసివస్తుందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల నుండి నిత్యం టన్నులకొద్దీ వ్యర్ధాలు వెలువడి ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 6వేలకుపైగా ప్రైవేట్‌ ఆసుపత్రులున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే బయో మెడికల్‌ వ్యర్ధాల నియంత్రణను అమలుచేస్తున్నారు. మిగిలిన వాటి నుండి టన్నుల కొద్దీ వ్యర్ధాలను జనావాసాల్లోకి తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 377 క్లినిక్‌లు తమ వ్యర్ధపదార్ధాల పరిష్కారం కోసం ఉమ్మడి బయో మెడికల్‌ వ్యర్ధాల శుద్ధి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. మిగిలిన ఆసుపత్రుల గురించి పర్యవేక్షించే యంత్రాంగం పనిచేస్తున్న దాఖలాలు కనిపించటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.