మంగళసూత్రాలు ఇవ్వలేదంటున్న షర్మిలా

      గుంటూరు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలా.. చంద్రబాబుకు హామీలు ఇవ్వడం తప్ప అవి తీర్చడం తెలియదని అంటోంది. 1999 ఎన్నికలకు ముందు ప్రచారంలో అధికారంలోకి వస్తే మహిళలకు మంగళసూత్రాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారని వైఎస్ షర్మిల అన్నారు. నిజంగా చంద్రబాబు ఆ హామీ ఇచ్చారో లేదో కాని, ఇప్పుడు షర్మిల ఆ వాగ్దానం చంద్రబాబు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు.   మరోవైపు ఈ రోజు మహాశివరాత్రి కావడం, గుంటూరు జిల్లాలో కోటప్పకొండ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని షర్మిల పాదయాత్రకు ఈ రోజు విరామం ప్రకటించారు. తిరిగి సోమవారం పాదయాత్ర ప్రారంభమవుతుంది.

శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

        మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోటప్పకొండ త్రికుటేశ్వరస్వామ్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకోనేందుకు తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.   కీసరకు పోటెత్తిన భక్తులు మహాశివరాత్రి సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి లయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము 4గంటల నుంచి దర్శనం కోసం ఆలయం వద్ద కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.    వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రం హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామిని దర్శించుకోనేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.  శివరాత్రి సంధర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

తూచ్! అవి తెదేపా గురించి కాదు: లోకేష్

  చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ వీలయినంత త్వరగా రాజకీయాలలో తన ఉనికిని చాటుకోవాలని, పార్టీలో ప్రధాన పాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతున్నసంగతి అందరికీ తెలిసిందే. తన రాజకీయ ఆరంగ్రేటం స్వస్థలం చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో మొదలుపెట్టడమే ‘తనకు అన్నివిధాల ఆరోగ్యకరం’ అనే ఆలోచనతో కుప్పం నియోజక వర్గంలో గత రెండు రోజులుగా ‘పల్లెపల్లెకు తెలుగుదేశం’ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని, చిన్న చిన్న ప్రసంగాలు చేస్తూ తన ‘రాజకీయ ఎప్రంటిస్’ మొదలుపెట్టారు కూడా. కానయితే, శిక్షణ ఇచ్చేందుకు పక్కన గురువు లేకపోవడం, అనుభవ రాహిత్యం వల్ల లోకేష్ చాలాసార్లు తడబడుతున్నారని సమాచారం.   లోకేష్ ముందే ప్రకటించినట్లు, తన తండ్రి పాదయాత్ర ముగించుకొని ఇంటికి వచ్చేవరకు కొంచెం ఓపికపట్టి ఉంటే, చంద్రబాబు ఆయనకి రక్షగా తన అతిరధ మహారధులను తప్పక పంపేవారు. కానీ, యువకుడయిన లోకేష్ అంతకాలం ఒపిక లేనట్లు నేరుగా కార్యక్షేత్రంలో దూకేయడంతో ఆయన యాత్రలో పదనిసలు మొదలయ్యాయి.   మొన్నజరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో, వారిని తమ పార్టీకే ఓటేయమని కోరడంతో నవ్వులు విరబూయించిన ఆయన, ఈ రోజు చిత్తూరు జిల్లా వి.కోటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అలవాటులో పొరబాటుగా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకి అన్వయించవలసిన లక్షణాలన్నిటినీ స్వయంగా తమ పార్టీకే అన్వయిస్తూ “'అవినీతి, బంధుప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనావుందంటే అది తెలుగుదేశం పార్టీ. అవునా, కాదా?” అంటూ కార్యకర్తలను అడిగారు. ఆయన మాటలకు షాకయిన కార్యకర్తలు గట్టిగా కేకలు వేయడంతో ‘లోకేష్ సర్దుకొని మళ్ళీ రెండు కాంగ్రెస్ పార్టీలకు ఆ అవలక్షణాలు బదలాయించేసి, తెదేపాను, తన తండ్రి చంద్రబాబును పొగుడుతూ ఉపన్యాసం ముగించారు.   ఇటువంటి సువర్ణావకాశం కొరకే ఓపికగా ఎదురుచూస్తున్న సాక్షి మీడియా ఆయన మాటలను వెంటనే ప్రచురించేసింది కూడా. రేపు, ఆయన మాటలను పట్టుకొని రెండు కాంగ్రెస్ పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీతో ఆడుకోక వదిలిపెట్టరు కదా!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల లిస్ట్ రెడీ

        కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక ఎట్టకేలకు రెడీ అయింది. ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, సోనియా గాంధీ తో సమావేశమై అభ్యర్ధులను ఖరారు చేశారు. అభ్యర్థుల పేర్లను ఇంకా బయటపెట్టలేదు.శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ప్రకటించే అవకాశాలున్నాయి.   ఎమ్మెల్సీ అభ్యర్థులకు రేపు బీఫామ్స్ ఇవ్వనున్నట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. నామినేషన్ల దాఖలుకు అమావాస్య అడ్డంకి కాదని ఆయన అన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధీరావత్ భారతి, వాణి, రఘురామిరెడ్డి, కంతేటి సత్యనారాయణ రాజు, దయాసాగర్, షబ్బీర్ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే షబ్బీర్ ఆలీకు టిక్కెట్‌కోసం అజాద్ గట్టిగా పట్టుపట్టినట్లు తెలియవచ్చింది.   ఎమ్మెల్సీ జాబితాను ఖరారు చేయించుకోవడానికి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం హైదరాబాదు తిరిగి వస్తున్నారు. బొత్స సత్యనారాయణ మాత్రం ఈ రాత్రి అక్కడే మకాం వేస్తున్నారు. కాంగ్రెసు ఐదుగురు అభ్యర్ధులను మాత్రమే పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది.  

చంద్రబాబును సీఎం చేసిన అభిమానులు

        గుడివాడలో టిడిపి అభిమానులు చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చేశారు. అదేంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం చంద్రబాబు "వస్తున్నా...మీ కోసం" పాదయాత్ర గుడివాడలో జరుగుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆయన ముఖ్యమంత్రి అయినట్లు, కుర్చీ మీద కూర్చున్నట్లు …రుణ మాఫీ ప్రకటించినట్లు..తొలిసంతకం ఆ ఫైలు మీద పెట్టినట్లు ఫ్లెక్సీలు తయారు చేసి కట్టేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని అభిమానులు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇవన్నీ ఖాయం అని అంటున్నారు. ఇది సహజంగానే టిడిపి అభిమానులకు సంతోషం కలిగించే వార్తే.

వెంకయ్య బిజెపిని బలోపేతం చేస్తారా?

        పార్లమెంటు సమావేశాల తరువాత తాను ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని వెంకయ్య నాయుడు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైన వచ్చే అవకాశం ఉందని, ఎన్నికల్లో ఎన్డీఎ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. ఆయన సొంత ఊరులో పార్టీని బలోపేతం చేయడం మానేసి, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాననడం కార్యకర్తలకు నవ్వు తెప్పిస్తోంది. ఇక ఆయన కేంద్రంలో చక్రం తిప్పినా ఆయన ఊరులో బిజెపి తరపున వార్డు మెంబరు కూడా గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. మరీ పార్లమెంటు సమావేశాల తరువాత పార్టీని ఎలా బలోపేతం చేస్తారో?

రాజకీయ అవినీతిని వివరించేందుకు వచ్చా: బాబు

        తాను అధికారంలోకి వస్తే మీ బాధలు తీరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు కొల్లేటి ప్రజలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న దారుణాలను చూడలేక, అవినీతి రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు మీముందుకు వచ్చానన్నారు. సేవదృక్పదమైన ప్రభుత్వాన్ని ఎంపికచేసుకోవాలని,అవినీతి పరులను తమిరికొట్టలని చంద్రబాబు కోరారు. మీ పిల్లలు చక్కటి చదువులు సాగాలన్న, ఉద్యోగాలు రావాలన్న టీడీపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. వృద్దులను, వికలాంగులను, చిరువ్యాపారులను, వ్యవసాయ కూలీలను, చేతివృత్తివారిని చంద్రబాబు పలకరిస్తూ ముందుకుసాగారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మళ్ళీ చేస్తాం. మా కష్టాలు మీరే తీర్చాలి అంటూ పలువురు చంద్రబాబుతో అన్నారు.

సైకిళ్లకు బాంబులు పెట్టిన వారిని గుర్తించాం: డీజీపీ

        దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో కీలక ఆధారాలు లభ్యమయినట్లు రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. ఈ జంట పేలుళ్లకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారన్నారు. సిసి కెమెరాలలో సైకిళ్లపైన బాంబులు తీసుకువెళుతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారని, వారిలో ఒకరిని స్పష్టంగా గుర్తించామని, మరో ఇద్దరు అస్పష్టంగా కనిపిస్తున్నారని దినేష్‌రెడ్డి తెలిపారు. సైకిళ్లు అక్కడ పెట్టిన మూడు నిమిషాల్లోనే బాంబులు పేలినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో శివరాత్రి వరకు తనిఖీలు చేస్తామని చెప్పారు. ఎన్ఐఏ బృందంతోపాటు రాష్ట్ర పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పై జయసుధ రాజీనామాస్త్రం

        ఎమ్మెల్సీ ఎన్నికలు నగర కాంగ్రెస్ లో సెగలు రేపుతున్నాయి. నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, కార్తీక రెడ్డికి ఎంఎల్సీ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జయసుధ హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలో జయసుధ ఎంఎల్ఏగా ఉన్న సికింద్రాబాద్ పరిధిలో ఆమె అనుమతి లేకుండా కార్తీకరెడ్డి భర్త చంద్రారెడ్డి పలు కార్యక్రమాలు చేశారు. దీంతో అప్పటి నుండి జయసుధకు వారికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.   కార్తీకరెడ్డి కి ముఖ్యమంత్రి కిరణ్ కు ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో భేటీ అయిన జయసుధ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.

ఆర్థికాభివృద్ధికి పూలబాట వేశా౦: ప్రధాని మన్మోహన్

        ఆర్థికాభివృద్ధికి పూలబాట వేశామని, దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల అమలులో ఎలాంటి మార్పు లేదని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు అలాగే కొనసాగుతాయని ఆయన చెప్పారు. వచ్చే మూడేళ్ళలో 8 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యమని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగానికి రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఆయన సమర్థిస్తూ ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీఠ వేసిందని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం చేస్తోన్న సంస్కరణలకు ప్రతిపక్షాలు సహకరించాలని మన్మోహన్ సింగ్ కోరారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగం లేకుండా చేయడమే యూపీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. మన దేశానికి 8 నుంచి 9 శాతం అభివృద్ధిరేటు అవసరమని, అది సాధించడమే యుపీఏ లక్ష్యమని ప్రధానమంత్రి తెలిపారు.

అవినీతికి ప్రతిరూపం జగన్ పార్టీ: లోకేష్

        టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు పల్లె పల్లెకు టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతికి ప్రతిరూపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ...అసమర్ధతకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు టిడిపిని అందలమెక్కిస్తే రాష్ట్రం తిరిగి అభివృద్ధిలో పుంజుకుంటుందన్నారు.రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వందమంది బిసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని తెలిపారు.

మళ్ళీ ఫిరాయింపుల సీజను మొదలయిందా?

  నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసినట్లు, గతంలో చిన్నాచితకా రాజకీయ పార్టీలన్నీ వెళ్లి కాంగ్రెస్ మహాసముద్రంలో కలిసేవి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీల నేతలందరూ వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకలుస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి ఆ వలసలు ఎక్కువగా కనిపించాయి. గత కొద్ది రోజులుగా ఆ వలసల జోరు కొంత తగ్గింది. కానీ, మళ్ళీ నేడు ఆ పార్టీకి చెందిన పరకాల మాజీ శాసన సభ్యుడు బొజ్జపల్లి రాజయ్య పార్టీకి రాజీనామాచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరుతున్నట్లు ప్రకటించడంతో మళ్ళీ వలసల సీజను మొదలయినట్లుంది.   ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా ఉన్న మరో 9మంది జగన్ వర్గానికి చెందిన శాసన సభ్యులు కూడా, తమపై అనర్హతవేటు పడదని రూడీ అయితే, చంచల్ గూడా జైలు బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, చంచల్ గూడా జైలు తలుపులు మూసి ఉన్నపటికీ, పార్టీ తలుపులు బార్లా తెరిచి అందరికీ స్వాగతం పలుకుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పార్టీలో చేర్చుకొంటున్న వారందరికీ రేపు ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ కేటాయించడం సాధ్యమేనా? అప్పుడు పార్టీలో చెలరేగే అసమ్మతి గురించి ఏమయినా ఆలోచన చేస్తోందా?   ఇప్పుడు పార్టీలో చేరుతున్న వారు మళ్ళీ తిరుగు ప్రయాణమయితే, అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి? ఒకనాడు ప్రజారాజ్యం పార్టీ కూడా ఇటువంటి పరిస్థితులవల్లనే కుప్పకూలిన సంగతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గుర్తులేదా?అనే సందేహాలున్నాయి.   ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్నందున, పార్టీలోకి వస్తున్నరాజకీయనేతల ప్రవాహమే పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ పార్టీకి శ్రీరామ రక్షగా ఉంటుందని బహుశః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తునందునే అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లుంది. జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి బయటకి వస్తే పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే ఎలాగు చక్కబెడతారు గనుక, ఇప్పుడు వచ్చే వారిని ఆపడం ఎందుకని అందరికీ ఆపార్టీ స్వాగతం పలుకుతునట్లు ఉంది.

చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ ప్రసంగం

  కేంద్రమంత్రి చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ భార్య శ్రీజతో విడిపోయిన తరువాత, ఆమె ఆయనపై పోలీసు స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు కూడా నమోదుచేసినట్లు ఆ మద్యన వార్తలు వచ్చాయి. అయితే, ఆ తరువాత ఆ కేసు కధ ఏమయిందో గానీ, శిరీష్ చాలారోజులుగా బయట ఎక్కడా కనబడలేదు. శిరీష్ కధ ఇక ముగిసిపోయినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఆకాశం లోంచి ఊడిపడినట్లు వచ్చి కొద్ది రోజుల క్రితమే బీజేపీలోచేరిపోయారు.   మళ్ళీ మద్యలో కొంత విరామం తరువాత ఈ మద్యనే హైదరాబాదులో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొని, తొలి రాజకీయ ప్రసంగం కూడా చేసారు. ఆయన ప్రసంగం అనగానే చిరంజీవిని తిట్లు లంకించుకొంటారని, చిరంజీవిపై విసుర్లు ఉంటాయని అందరూ ఆశించడం సహజం. కానీ, ఆయన తన మొట్టమొదటి ప్రసంగాన్ని కేవలం బీజేపీ అధిష్టానాన్ని భజన చేయడానికే అంకితం చేసేయడంతో కార్యకర్తలు కొంచెం నిరాశకు గురయారని సమాచారం. తనవంటి యువతకు రాజకీయాలలో చేరెందుకు చక్కటి అవకాశం కల్పించిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపి, నరేంద్ర మోడీ ఒక సమర్దుడయిన నాయకుడని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసారు. చప్పగా సాగిన ఈ చిరనజీవి చిన్నల్లుడి ప్రసంగం చూసిన కార్యకర్తలు, ‘ఈయన కూడా మామగారిలాగే ఆచితూచి మాట్లాడితే ఎవరు వింటారు’ అని గొణిగారుట.

'నిర్భయ'కు స్త్రీ శక్తి పురస్కారం

        ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురై ప్రాణాలు కోల్పోయిన వైద్య విద్యార్ధిని 'నిర్భయ'ను స్త్రీ శక్తి పురస్కారంతో గౌరవించనున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆమె చూపిన తెగువ, ఆత్మస్థైర్యాన్ని కి నివాళిగా మరణాంతరం ఈ అవార్డ్ ను అందజేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ చేతులు మీదుగా 'నిర్భయ' ఫ్యామిలీ ఈ అవార్డు ను స్వికరించనున్నారు.   ప్రతి సంవత్సరం అసాధారణ మహిళలకు ఇచ్చే స్త్రీ శక్తి పురస్కారాన్ని 'నిర్భయ'కు ఇవ్వాలని మహిళ, శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ బావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ''మానవ మృగాలతో పోరాటంలో 'నిర్భయ' అసాధారణ తెగువను ప్రదర్శించారు. ఆమె దేశంలో చైతన్య జ్వాలను రగిలించింది'' అని వివరించాయి. ప్రభుత్వం జాతీయ అవార్డులను స్త్రీ శక్తి పురస్కారాల కింద ప్రధానం చేస్తుంది. వీటిలో ఝాన్సీ లక్ష్మిభాయి అవార్డును నిర్భయ కు ప్రధానం చేస్తారు. 

బ్రదర్ అనిల్ కు క్లీన్ చిట్ ఇచ్చిన వెంకటరెడ్డి

  గత కొద్ది రోజులుగా బీజేపీ వైయస్సార్ కుటుంబం సభ్యులపై ముఖ్యంగా మతప్రచారకుడిగా పనిచేస్తున్న బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నసంగతి అందరికి తెలిసిందే. మళ్ళీ, ఇటీవల బ్రదర్ అనిల్ కుమార్ కు చెందిన మైనింగ్ కంపెనీకి బినామి యజమానిగా పేర్కొంటున్న తేళ్లూరి వీరభద్రారెడ్డి అనుమానాస్పద మరణానికి బ్రదర్ అనిలే కారకుడని ఆ పార్టీ ఆరోపించడంతో వైయస్సార్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురయినట్లు కనిపిస్తోంది.   గత మూడు రోజులుగా పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా మృతుడు వీరభద్రారెడ్డి స్వహస్తాలతో వివిధ సంస్థలకు వ్రాసిన ఉత్తరాలను, ఫైళ్ళను స్వాదీనం చేసుకొని తమ కార్యాలయానికి తరలించడంతో, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు బ్రదర్ అనిల్ కుమార్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తమ దాడి మరింత తీవ్రతరం చేసాయి.   వారి దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఈ రోజు వైయస్సార్ కుటుంబ పత్రిక ‘సాక్షి’ లో మృతుడు వీరభద్రారెడ్డి తండ్రి వెంకటరెడ్డి మీడియాతో చెప్పిన విషయలంటూ ఒక కధనం ప్రచురించింది. ‘తన కుమారుడు వీరభద్రారెడి గతనెల 25వ తేదిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని పోచంపల్లి గ్రామశివార్లలో మృతి చెందాడని, తన కుమారుడి మరణానికి బ్రదర్ అనిల్‌కుమార్‌కు ఎటువంటి సంబంధం లేదని, కానీ కొందరు రాజకీయ నాయకులూ వారి పార్టీలు తన కొడుకు మరణాన్ని రాజకీయం చేస్తున్నట్లు తెలిసి చాల బాధపడుతున్నానని వెంకటరెడ్డి తెలిపారు. కుమారుడుని పోగొట్టుకొని దుఃఖంతో ఉన్న తమ కుటుంబం పట్ల, మీడియా కూడా నిర్దయగా వ్యవహరిస్తూ, తన కుమారుడికీ బ్రదర్ అనిల్ కుమార్ కి ఏమి సంబంధాలున్నాయని ఆరాలు తీయడం చాలా బాధ కలిగించిందని అన్నారు. తన కుమారుడు చనిపోయేవరకు కూడా బ్రదర్ అనిల్ ఎవరో తమకు తెలియదన్నారు. తానూ నిరక్షరాస్యుడినని, అందువల్ల కాగితాలు, డాక్యుమెంట్ల గురించి తనకు ఏమి తెలియదని, పోలీసులే విచారణ చేసి తన కొడుకు మృతికి కారకులను, కారణాలను కనిపెట్టాలని ఆయన అన్నారు.”   అయితే, ఇప్పుడు మృతుడు తండ్రి వెంకట రెడ్డి చెప్పిన విషయాన్నే పోలీసులు, కోర్టులు కూడా ద్రువీకరిస్తే దానికి విలువుంటుంది తప్ప ఈ విధంగా వైయస్సార్ కుటుంబానికే చెందిన సాక్షి పత్రిక ద్వారా తమ కుటుంబానికే చెందిన వ్యక్తి బ్రదర్ అనిల్ కుమార్ కి క్లీన్ సర్టిఫికేట్ జారి చేయడంవల్ల ఏ ప్రయోజనం ఉండదు.   వైయస్సార్ కుటుంబంపై బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీలు చేస్తున్నఆరోపణలను ఈ విధంగా పత్రికల ద్వారా ఎదుర్కోవడం కంటే నేరుగా కోర్టులో వారిపై కేసులు వేసి వారు చేస్తున్న ఆరోపణలను నిరూపించమని సవాలు చేయడం ద్వారా వైయస్సార్ కుటుంబము తన నిజాయితీని రుజువు చేసుకోవడం మంచిది.

అవినీతి నాయకుడు లేక సమర్ధవంతమైన నేత

        టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు 'నారా లోకేష్' చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. “ఒకరు అసమర్ధ నాయకుడు, మరొకరు అవినీతి నాయకుడు, వారిని ఎంపిక చేసుకుంటారా?లేక సమర్ధవంతమైన నేతను ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సుధీర్ఘ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నారని, అధికారం కోల్పోయి పదేళ్లు అవుతున్నా తెలుగుదేశం పార్టీ అభివృద్దిని నినాదంగా చెబుతుందని అన్నారు. గత మూడేళ్లలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు కోట్లు వెచ్చించి చేపట్టామని అన్నారు. అప్పుడప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చి కార్యకర్తలతో భేటీ అవుతున్న నారా లోకేష్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది.