రాజకీయాలలోకి మేకలు, పులులు, నక్కలు

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జైల్లో ఉన్న తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి గురించి వర్ణిస్తూ ఆయన జైలులో ఉన్నపటికీ పులి వంటివాడని, పులి బోనులో ఉన్నా బయట ఉన్నా పులి పులే అని వర్ణించారు. ఆ తరువాత చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయనను నక్కతో పోల్చి పులి పులే నక్క నక్కే అని అన్నారు. తమ తండ్రిగారి పధకాలన్నిటినీ వేరే పేర్లతో తన స్వంత పధకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడాన్ని విమర్శిస్తూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకొనట్లుంది అని ఆమె అన్నారు.   ఆమె మొదలుపెట్టిన ఈ పులి-నక్కా ఆటలో ఇంకా తెదేపా నాయకులెవరూ ప్రవేశించకపోయినప్పటికీ, తెదేపా కార్యకర్తలు ఆమెకు దీటుగా బదులిస్తూ సమాజంలో మేకవన్నె పులులు కూడా తిరుగుతున్నాయని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండబోతే అవి తినేస్తాయని అన్నారు.   మరి వీరిద్దరూ పులీ నక్కా అయితే మరి తెరాస అధ్యక్షుడు కేసీఆర్, పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ నారాయణ, సీపీయం రాఘవులు తదితరులు ఏ జాతులను కేటాయించాలి? అనే ధర్మ సందేహం ఒకటి మిగిలిపోయింది. ఇంతకీ ఎవరు పులో ఎవరు నక్కో తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకు ఆగవలసిందే. అప్పుడు ప్రజలే ఎవరేమిటనేది నిర్ణయిస్తారు.

కింగ్ ఫిషర్ కు బాంబే కోర్టులో చుక్కెదురు

  కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తీసుకున్న రుణాలకు భద్రతగా తనఖా పెట్టిన యునైటెడ్ స్పిరిట్స్ షేర్లను బ్యాంకులు విక్రయించకుండా ఆదేశాలివ్వాలన్న కింగ్ ఫిషర్ సంస్థ విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. బ్యాంకులు, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ వాదనలు విన్న అనంతరం జస్టీస్ ఎస్.జె.కత్వాలా షేర్లను విక్రయించడానికి అనుమతిచ్చారు. వాదనల్లో భాగంగా ఇప్పటికే షేర్ల విక్రయ ప్రక్రియ మొదలైనట్టు బ్యాంకులు కోర్టుకు విన్నవించాయి. తీసుకున్న అప్పు చెల్లించడంలో విఫలమైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ తనఖా షేర్లను అమ్మడాయినికి నిర్ణయించినట్లు, ఇది ఒప్పందంలో భాగంగానే జరిగినట్లు బ్యాంకులు వెల్లడించాయి. కన్సార్టియంలో భాగం కాని బ్యాంకులు సైతం షేర్ల విక్రయాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించాయి.

మళ్ళీ విద్యార్ధుల మద్దతు కోరుతున్న తెరాస

  తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయికి చేరడంలో విద్యార్ధుల పాత్ర ఎంతయినా ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. వారి పోరాటాలు, బలిదానాల వలననే ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చి కేంద్రంపై విపరీతమయిన ఒత్తిడి పెరిగేందుకు దోహదపడింది.   అయితే ఉద్యమాన్ని నడుపుతున్న నాయకులలో చిత్త శుద్ధి లోపించడం, వారి రాజకీయ చదరంగాలు చూస్తున్న విద్యార్ధులు క్రమంగా ఉద్యమాల పట్ల విరక్తి చూపడం మొదలుపెట్టారు. ఉద్యమాన్ని నడుపుతున్న నేతలందరూ తమ తమ పదవులకు అంటిపెట్టుకొని పూర్తి ప్రయోజనాలు పొందుతుంటే, తాము మాత్రం తమ చదువులు, భవిష్యత్తూ చివరికి జీవితాలను కూడా పణంగా పెట్టి చేస్తున్న పోరాటాలు ఉద్యమ నేతల కారణంగానే తరచూ విఫలమయిపోవడం చూసిన విద్యార్ధులు తెరాస మరియు తెలంగాణ జేఏసీల పిలుపులకు స్పందించడం మానేశారు.   ముఖ్యంగా తెలంగాణా ఉద్యమాలకు నిలయమయిన ఉస్మానియా, కాకతీయ తదితర విశ్వవిద్యాలయాలలో వివిధ పార్టీలకు అనుబంధంగా ఏర్పడిన విద్యార్ధి జేఏసీలు తలోదారి పట్టడంతో రాన్రాను విద్యార్ధులలో ఉద్యమం పట్ల నమ్మకం సడలసాగింది.   దానికి తోడూ ఉద్యమాన్ని నడిపిస్తున్న తెరాస అధినేత కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణలు, తెలంగాణా జేఎసీలో పదవుల కోసం జరిగిన కుమ్ములాటలు, తెలంగాణా ఉద్యమాలనే తమ రాజకీయ సోపానాలుగా చేసుకొని పైకెదుగుతున్నచోటామోటా నేతలను చూస్తున్న తెలంగాణా విద్యార్దులు తమ త్యాగాల వృదా అవుతున్న తీరు చూసి ఉద్యమాలపట్ల నిరాసక్తి కనబరుస్తున్నారు.   ఇక, తన ఉద్యమ లక్ష్యాన్నిపక్కన పెట్టి ఎన్నికల బాట పట్టిన తెరాస కూడా ఈ పరిణామంతో చాలా కంగారుపడింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ తరువాత సాధారణ ఎన్నికలలో తన సత్తా చాటుకొని వీలయినన్ని సీట్లు గెలచుకొని తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకొంటున్న తెరాస ఈ తరుణంలో కీలకమయిన విద్యార్దుల మద్దతు కోల్పోవడం అసలుకే మోసం అవుతుందని గ్రహించిన వెంటనే, వారిని బుజ్జగించి తిరిగి తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.   ఆ ప్రయత్నంలోనే నిన్న వరంగల్ జిల్లా హన్మకొండలోరాంనగర్ లో గల టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో టీఆర్‌ఎస్వీ జిల్లా స్థాయి సదస్సు జరిగింది. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ విద్యార్ధి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచం లో ఎక్కడా జరగని విధంగా తెలంగాణ కోసం ఆ త్మ బలిదానాలు జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం చాల విచారకరం అని అన్నారు. అందువల్ల విద్యార్దులందరూ సైనికుల్లా పనిచేసి ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు వ్యాపింపజేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతీ నియోజకవర్గం నుంచి పది మంది చొప్పున సుశిక్షతులైన విద్యార్థి సైనికులను సిద్ధం చేస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో తెరాసకు సంపూర్ణ మద్దతు ఇవ్వలని కోరారు. తద్వారా తెరాస కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేయగలదని ఆయన అన్నారు.   కేంద్రంపై తెలంగాణకు వ్యతిరేఖంగా ప్రభావం చూపుతున్న సీమాంధ్ర పార్టీలను దెబ్బకొట్టాలంటే రానున్న ఎన్నికలలో తెరాస 100 మంది ఎమ్మెల్యేలను, 17 మంది ఎంపీలను గెలిపించుకోవాలసి ఉంటుంది గనుక, విద్యార్దులు పూర్తీ మద్దతు ఇవ్వలని ఆయన కోరారు. ఇప్పుడు తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థులు వచ్చే ఎన్నికలలో కూడా తెరాసకు అనుకూలంగా కీలక పాత్ర పోషించవలసిందిగా టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు త క్కళ్లపల్లి రవీందర్‌రావు కోరారు.

బిజెపి దీక్ష కూడా భగ్నం చేసిన పోలీసులు

విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరాహార దీక్షలు ప్రతిపక్ష పార్టీల దీక్షలు భగ్నం చేస్తూ వచ్చారు పోలీసులు. తాజాగా నాలుగు రోజులుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్షలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సోమవారం సాయంత్రం పోలీసులు దీక్షను భగ్నం చేసి వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా దీక్షలు చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, యెండల లక్ష్మీనారాయణల శరీరంలో చక్కరస్థాయిలో హెచ్చుతగ్గులు ఉండడంతో వారు తీవ్రంగా నీరసిన్చారని వైద్యులు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా నేతల ఆరోగ్యం గురించి మధ్యమండలం డిసిపి కమలాసన్ రెడ్డి, అదనపు డిసిపి రామచంద్రన్ శాసనసభ స్పీకర్ కు వివరించి, స్పీకర్ అనుమతి తీసుకున్నాకే బిజెపి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలను అడ్డుకుంటున్న కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు సమన్లు

  పెరిగిన విద్యుత్తు ఛార్జీలని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ అఫ్జల్, జస్టీస్ పి.పుర్కర్, జస్టీస్ ఎన్.వీ.రమణలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. విద్యుత్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి దగ్గర ప్రజలు తమ అభిప్రాయాల్ని చెప్పినా మండలి పట్టించుకోలేదని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభ్యుత్వం దగ్గర రాయితీలు పొంది ప్రక్క రాష్ట్రాలకు విద్యుత్తును అమ్ముకుంటున్న జీఎంఆర్, ల్యాంకో సంస్థలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గృహ వినియోగదారులు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని, వారిలో అత్యధికంగా పెదవారున్నారని పిటీషనర్ విన్నవించారు. విద్యుత్తు ఛార్జీలు ఏ ప్రాతిపదికన పెంచారో ఆ దస్త్రాల్ని కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

చంద్రబాబుకి ముందు నుయ్యి వెనుక గొయ్యి

  ఇటీవల కొంత కాలంగా తెలుగుదేశం పార్టీలో కూడా రాబోయే ఎన్నికల కోసం టికెట్లకి కుమ్ములాటలు, నాయకులలో అసంతృప్తి మొదలయింది. చంద్రబాబు కొద్ది రోజుల క్రితం కృష్ణాజిల్లా పార్టీలో చేసిన మార్పులతో జిల్లా నాయకుల మధ్య కొత్త విభేదాలు పుట్టుకొచ్చాయి. తనను అర్బన్ అధ్యక్షుడి పదవినుండి తొలగించినందుకు వల్లభనేని వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వల్లభనేనికి గన్నవరం టికెటు, కేసినేని నానికి విజయవాడ లోక్ సభ టికెట్ ఖాయం చేసినట్లు వస్తున్నవార్తలతో పార్టీ సీనియర్ నేత గద్దె రామ్ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అందువల్ల గద్దె రామ్ మోహన్ అనునయించే ప్రయత్నంలో తనను వచ్చి కలువమని చంద్రబాబు ఆయనకు కబురు పంపారు.   మరి ఆయనకి ఏవిధంగా నచ్చజెప్పుకొంటారో తెలియకపోయినా, ఆయనను చంద్రబాబు పిలవడంతో, ఇంతవరకు విజయవాడ లోక్ సభ టికెట్ తనదేననే నిశ్చింతగా ఉన్న కేశినేని నానికి కలవరం మొదలయింది. ఒకవేళ చంద్రబాబు గద్దె ఒత్తిడికి లొంగి మళ్ళీ విజయవాడ టికెట్ ను ఆయనకి ఇచ్చేస్తానని మాట ఇస్తారేమోనని ఆయన ఇప్పుడు కలవరపడుతున్నారు. చంద్రబాబు విజయవాడ టికెట్ గద్దెకు తిరిగి ఇస్తే కేశినేనికి కోపం రాక మానదు. ఒకవేళ గన్నవరం టికెట్ ఇస్తే వంశీకి, సిట్టింగ్ యంయల్యే దాసరి బలవర్ధన్ కి ఇద్దరికీ కూడా కోపం వస్తుంది. పోనీ గద్దెకి నచ్చజెప్పుదామన్నా అదీ కష్టమే. ఆయన ఈ సారి తప్పనిసరిగా విజయవాడ లేదా గన్నవరం నుండి ఎన్నికలలో పోటీ చేయాలని కోరుకొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. దీనిని ఆయన ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి.

ఇటలీ రాయభారిపై ఆంక్షలు తొలగించిన సుప్రీం కోర్టు

  కొద్ది రోజుల క్రితం ఇటలీ రాయభారి డానీయేలీ మంసినీని భారతదేశం విడిచి వెళ్ళడానికి వీలులేదని ఆదేశించిన సుప్రీం కోర్టు, ఇద్దరు భారతీయ మత్స్యకారులను కాల్చి చంపిన కేసులో అరెస్టయిన ఇద్దరు ఇటలీ నావికుల మాస్సిమిలానో లతోర్ మరియు సలవతోరే గిరోనే లను, ఆ దేశం తిరిగి భారత్ కు తిప్పి పంపడంతో తను ఇదివరకు ఇటలీ రాయభారిపకి జారి చేసిన ఆదేశాలను ఉపసంహరించుకొని ఆయన స్వదేశం తిరిగి వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది.   కొద్ది వారల క్రితం సుప్రీం కోర్టు ఇటలీ రాయభారి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీతో వారిని ఇటలీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఇటలీ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఆ తరువాత ఇటలీ ప్రభుత్వం మాట తప్పి వారిని వెనక్కి తిప్పి పంపే ప్రసక్తి లేదని అని స్పష్టం చేయడంతో పార్లమెంటులో చాల పెద్ద రాద్దాంతమే జరిగింది. ప్రతిపక్షాల ఒత్తిడి భరించలేక ఇటలీ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు భారత విదేశంగశాఖ తీవ్రంగా హెచ్చరించినప్పటికీ, ఇటలీ మొదట లొంగలేదు.   అయితే సుప్రీం కోర్టు తన రాయభారిని దాదాపు నిర్బందించినంత పనిచేయడంతో ఇక చేసేదేమీ లేక ఇటలీ ప్రభుత్వం తన ఇద్దరు నావికులను భారత్ కు త్రిప్పి పంపింది. అందువల్ల సుప్రీం కోర్టు కూడా తన ఆదేశాలను ఉపసంహరించుకొంది. అంతే కాకుండా ఇద్దరు ఇటలీ నావికులను విచారించేందుకు వెంటనే ఒక ప్రత్యేక న్యాస్థానం ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే, తమ నావికులను అరెస్ట్ చేయకూడదు, మరణ శిక్ష వేయకూడదు అనే రెండు ముందస్తు షరతులు పెట్టి మరీ భారత్ కు అప్పగింపబడిన ఇటలీ నావికులను ఇప్పుడు భారత ప్రభుత్వం ఇటలీ దేశానికి ఇచ్చిన హామీ ప్రకారం ఆ షరతులు ఉల్లంఘించకుండా, అదే సమయంలో భారతీయ మత్సకారులను చంపినందుకు తగిన శిక్ష విదిస్తూ సుప్రీం కోర్టు సున్నితమయిన ఈ కేసును ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి.

సర్వేను అడ్డుకున్న జగన్ కార్యకర్తలు

        సరైన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి సర్వే సత్య నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో దేశంలో ఇతర ప్రాంతాల ప్రజలు ఉన్నప్పుడు సీమాంధ్ర ప్రజలు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.   కాంగ్రెస్ లో ఉంటే జగన్ కు జైలు పరిస్థితి వచ్చేది కాదని సర్వే సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టారన్నారు. జగన్ ఆస్తులు సేకరిస్తే రాష్ట్ర ప్రజల సమస్యలు తీరుతాయని చెప్పారు.   మరోవైపు భీమవరం రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను వైసీపీ కార్యకర్తలు ఈ రోజు  అడ్డుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

దొంగే దొంగ, దొంగ అని అరిచినట్లుంది

        ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విధానాలే కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష చూస్తుంటే దొంగే దొంగ, దొంగ అన్నట్లుగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు వైయస్ కుటుంబ సభ్యులు స్థాపించిన పార్టీయే విద్యుత్ పైన దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు.   విద్యుత్ సంక్షోభం విషయంలో ఈ నెల 9వ తేది వరకు తెలుగుదేశం పార్టీ సంతకాల సేకరణ చేపడుతుందని సోమిరెడ్డి అన్నారు. టిడిపి, కాంగ్రెసు హయాంలోని విద్యుత్ పైన తాము ప్రజల ముందుకు వెళ్తామన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు టిడిపి తమ ఆందోళనను విరమించే ప్రసక్తి లేదన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యుత్ కోత కారణంగా రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. విద్యుత్ సమస్యపై సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజలపై కిరణ్ సర్కార్ పెనుభారం

        ప్రజలపై కిరణ్ సర్కార్ పెనుభారం మోపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు.   కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఛార్జీల రూపంలో రూ.2 వేల కోట్ల భారం మోపారని ఆమె ధ్వజమెత్తారు. కరెంట్‌ ఉండదు, బిల్లులు మాత్రం వస్తుంటాయని విజయమ్మ వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు చూసి చలించిపోయి అప్పట్లో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇచ్చారని విజయమ్మ గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఉచిత విద్యుత్‌ చక్కగా అమలైతే, వైఎస్‌ అనంతరం ఆ పథకానికి కిరణ్‌ సర్కార్‌ తూట్లు పొడిచిందని అన్నారు. కరెంట్‌ బిల్లులను రెట్టింపు పెంచేస్తే సామాన్యులు ఎలా చెల్లించగలరని విజయమ్మ ప్రశ్నించారు.

నన్నపనేని సుధకు సీటు డౌటే

  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కుమార్తె నన్నపనేని సుధ వైఎస్సార్సీపీ పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తున్నారు.  నన్నపనేని సుధ గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండడంతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం నన్నపనేని సుధను వినుకొండ సమన్వయకర్తగా నియమించింది. దీంతో ఆగ్రహం చెందిన టిక్కెట్ ఆశిస్తున్న ఆశావాహులు నన్నపనేని సుధను వెంటనే ఇంచార్జ్ పదవి నుండి తప్పించాలని పట్టుబిగిస్తున్నారు. ఈ నియోజకవర్గమనే కాదు వైఎస్సార్సీపీ లో ప్రతి నియోజకవర్గంలోనూ రోజుకో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి.

చంద్రబాబుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ

  చంద్రబాబు కాకినాడలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీక్ష అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థ నష్టాల బాటలో పయనించడానికి వై.ఎస్. ప్రభుత్వం, రోశయ్య ప్రభుత్వం, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుకు చంద్రబాబే కారణమని, తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు పాల్గొనివుంటే ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు పాడేది కాదని, పేదలకు అండగా ఉండేందుకే వై.ఎస్. విజయమ్మ దీక్ష చేపట్టారని, రైతులకు నిబంధనలు లేకుండా ఉచిత విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీల పంపు వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం ఛార్జీలు తగ్గించేవరకూ తమ దీక్షలు ఆగవని చంద్రబాబుపై మండిపడుతున్నారు.

వైయస్ విజయమ్మ ఆమరణ దీక్ష

        రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం విశేషమే. బషీర్బాగ్లో విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఆమె అక్కడ నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కరెంట్ సత్యాగ్రహం దీక్ష వేదిక వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు. ఆమె వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు ఉన్నారు. సత్యాగ్రహం దీక్షావేదికపై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల్పించిన అనంతరం విజయమ్మ ఆమరణ దీక్షకు కూర్చున్నారు.   అయితే అనూహ్యంగా విజయమ్మ ఆమరణ దీక్షకు పూనుకోవడం ఆసక్తి కరంగా ఉంది. ఇప్పటికే వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ విద్యుత్ చార్జీల మీద నిరవధిక దీక్షలు చేపట్టాయి. అయితే ప్రభుత్వం వారిని బలవంతంగా విరమింపచేసింది. ప్రస్తుతం బీజేపీ నిరవధిక దీక్షలో ఉంది. ఇప్పుడు విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టింది. మిగిలిన పార్టీలు ఆందోళన చేస్తుంటే తాము వెనకబడతామన్న ఆలోచనే ఆమరణ దీక్షకు కారణం అయి ఉండవచ్చు.  

త్రీడీ ప్రింటింగ్ తో కొత్త జీవితం

        బ్రిటన్ వైద్యులు ప్రపంచలో తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం తో కృత్రిమ ముఖాన్ని తాయారు చేశారు. దీని సాయంతో కేన్సర్ బాధితుడికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. బ్రిటన్‌లోని ఎసెక్స్‌కు చెందిన ఎరిక్ మోగర్ (60) ఒక రెస్టారెంట్ మేనేజర్. నాలుగేళ్ల క్రితం అతని ముఖం ఎడమ భాగంలో ఒక కణితి ఏర్పడి పెరగడం ప్రారంభమైంది. అది కేన్సర్ కణితి అని, దాన్ని తీయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి కణితిని తీసేశారు.ఈ ప్రయత్నంలో అతడి ఎడమకన్ను, దవడ ఎముక భాగం మొత్తాన్ని తీసేయాల్సి వచ్చింది. ఈ శస్త్రచికిత్స వల్ల ఎరిక్ కేన్సర్ బారి నుంచి బయటపడిన...ఆ తరువాత అతనికి అనేక సమస్యలు మొదలైయాయి. అతడి ముఖం అతడికే భయంగొల్పే విధంగా మారిపోయింది. ఆహారం, నీరు తీసుకోవడటం కూడా సాధ్యం కాలేదు. పొట్టలోకి అమర్చిన ట్యూబ్ ద్వారా మాత్రమే ఆయన ఆహారం తీసుకొనేవారు. అయితే ఇటీవలికాలంలో కొత్తపుంతలు తొక్కుతున్న అవయవాల త్రీడీ ముద్రణ పరిజ్ఞానం అతడికి వరంలా అందివచ్చింది. ఎరిక్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బ్రిటన్ వైద్యులు.. స్కానింగ్ ద్వారా అతడి పుర్రె కొలతలు తీసుకున్నారు. ఈ వయసులో సహజంగా ఎరిక్ ముఖం ఎలా ఉంటుందో కంప్యూటర్ మోడలింగ్ ద్వారా సృష్టించారు.   ఆయన ముఖంలో ఖాళీగా ఉన్న ఎడమవైపు భాగాన్ని ఒక్కొక్కపోర చొప్పున పేర్చుకుంటూ కృత్రిమ ముఖాన్ని రూపొందించారు. అది  ఎరిక్ కు అతికినట్లు సరిపోయింది. ఆ కృత్రిమ ముఖాన్ని తన చేతిలో ఉంచినప్పుడు.. తన ముఖాన్ని తానే చేతుల్లో చూసుకున్నట్టుగా అనిపించిందని ఎరిక్ పేర్కొన్నాడు. "దాన్ని మొదటిసారి నా ముఖం మీద పెట్టుకున్నప్పుడు.. నమ్మలేకపోయాను, అదెంత అందంగా ఉందో'' అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

50 శాతం మూగబోయిన టీ.వీ.లు

  జంటనగరాలలో 50 శాతం పైగా టీ.వీ.లు  మూగబోయాయి. సోమవారం ఉదయం జంటనగరాలలో అనలాగ్ ప్రసారాలను సిటీకేబుల్, హాత్ వె నిలిపివేశారు. హైదరాబాద్ పలక సంస్థ పరిథిలో దాదాపు 25 లక్షల టీవీలు ఉన్నాయని ఎం.ఎస్.ఓ. లు వెల్లడించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలో 8.96 లక్షల ఇళ్లలో టీవీలు ఉన్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ లెక్కలు వేసింది. 10 లక్షలకుపైగా టీవీలకు సెట్ టాప్ బాక్స్, డి.టి.హెచ్. కనెక్షన్ లు ఉన్నాయనే భావనతో పైగా డిజిటలైజేషన్ పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. సిటీకేబుల్, హాత్ వె ప్రసారాలను నిలిపివేయడంతో ప్రజలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో సోమవారం ఉదయం ప్రసారాలు ప్రారంభించాయి. సమాచార, ప్రసార శాఖ పరిథిలో కేబుల్ డిజిటలైజేషన్ ను పర్యవేక్షిస్తున్న బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు (బేసిల్) కేబుల్ కార్యాలయాలకు వచ్చి ప్రసారాలు నిలిపివేయించారు. మరో 30-45 రోజుల గడువిస్తే అందరికీ సెట్ టాప్ బాక్స్ లు అమర్చగలమని ఎం.ఎస్.ఓ. ప్రతినిధి బేసిల్ ప్రతినిథులకు తెలపడంతో వారు ఈ విషయాన్ని నాట్ చేసుకుని వెళ్ళిపోయారు. దీంతో జంటనగరాలలోని 50 శాతం పైగా టీ.వీ.లు మూగబోయాయి. ప్రభుత్వం దీనిపై తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కిరణ్ కు చంద్రబాబు సవాల్ ...

  ఎవరి హయాంలో విద్యుత్తు వ్యవస్థ మెరుగ్గా వుందో, ఎవరి హయాంలో విద్యుత్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందో చర్చ జరగాల్సిన అవసరం ఉందని , దీనిపై చర్చించడానికి కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. 1994 నుండి 2013వరకు విద్యుత్ వ్యవస్థపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిందేనని, మా హయాంలో 25 నుంచి 30పైసలు పెంచితే నానా రాద్ధాంతం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 35వేల కోట్ల రూపాయలు పెంచిందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల్లో 2014 వరకు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ళలోనే మూడుసార్లు పెంచారని, 2004లో తమ ప్రభుత్వ హయాంలో మిగులు విద్యుత్ ను సాధించామని, 2009కు ముందు 70శాతం పీ.ఎల్.ఎఫ్.పై గ్యాస్ ప్లాంట్లు పనిచేసేవని ఇప్పుడు 24శాతం పి.ఎల్.ఎఫ్.పై పనిచేసే దుస్థితి ఏర్పడిందని తన తరువాత వచ్చిన ముఖ్యమంత్రుల అవినీతి వల్లే విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని అన్నారు. అందుకే విద్యుత్ వ్యవస్థను ఎవరు భ్రష్టుపట్టించారో చర్చలో  తేలిపోవాలి అని చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ కు నేరుగా సవాల్ విసురుతున్నారు.

రఘురాజు అక్రమాల చిట్టా ... ఈడీ

  రఘురాజు కెవిపి రామచంద్ర రావు వియ్యంకుడు. ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండ్ భారత్ ఇన్ ఫరా లిమిటెడ్ కంపెనీలకు రఘురాజు అధిపతి. 800కోట్ల రూపాయల పెట్టుబడులలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ ఆరోపణ. 2007-08లో ఇండ్ భారత ఇన్ ఫరా లిమిటెడ్ లోకి 600 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు, ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 200 కోట్ల రూపాయలు 2011లో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇండ్ భారత్ సన్ ఎనర్జీలోకి వచ్చిన విదేశీపట్టుబడులలో నిబంధనల ఉల్లంఘనకు రఘురాజు పాల్పడినట్టుగా తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంటుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్.ఐ.పి.బి.)అనుమతి లేకుండానే ఈ ఇన్వెస్ట్ మెంట్ ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ స్వీకరించింది. విద్యుత్ ప్రాజెక్టుల్లో మాత్రమే విదేశీ పట్టుబడులను అనుమతిస్తారు.ఇండ్ భారత్ సన్ ఎనర్జీ కేవలం ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ మాత్రమే. ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు, ట్రేడింగ్ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులు రావాలంటే ఎఫ్.ఐ.పి.బి. అనుమతి తప్పనిసరి. ఈ విషయాలపై ప్రశ్నించేందుకు ఈడీ రఘురాజుకు సమన్లు జారీ చేసింది.