మళ్ళీ విద్యార్ధుల మద్దతు కోరుతున్న తెరాస
తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయికి చేరడంలో విద్యార్ధుల పాత్ర ఎంతయినా ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. వారి పోరాటాలు, బలిదానాల వలననే ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చి కేంద్రంపై విపరీతమయిన ఒత్తిడి పెరిగేందుకు దోహదపడింది.
అయితే ఉద్యమాన్ని నడుపుతున్న నాయకులలో చిత్త శుద్ధి లోపించడం, వారి రాజకీయ చదరంగాలు చూస్తున్న విద్యార్ధులు క్రమంగా ఉద్యమాల పట్ల విరక్తి చూపడం మొదలుపెట్టారు. ఉద్యమాన్ని నడుపుతున్న నేతలందరూ తమ తమ పదవులకు అంటిపెట్టుకొని పూర్తి ప్రయోజనాలు పొందుతుంటే, తాము మాత్రం తమ చదువులు, భవిష్యత్తూ చివరికి జీవితాలను కూడా పణంగా పెట్టి చేస్తున్న పోరాటాలు ఉద్యమ నేతల కారణంగానే తరచూ విఫలమయిపోవడం చూసిన విద్యార్ధులు తెరాస మరియు తెలంగాణ జేఏసీల పిలుపులకు స్పందించడం మానేశారు.
ముఖ్యంగా తెలంగాణా ఉద్యమాలకు నిలయమయిన ఉస్మానియా, కాకతీయ తదితర విశ్వవిద్యాలయాలలో వివిధ పార్టీలకు అనుబంధంగా ఏర్పడిన విద్యార్ధి జేఏసీలు తలోదారి పట్టడంతో రాన్రాను విద్యార్ధులలో ఉద్యమం పట్ల నమ్మకం సడలసాగింది.
దానికి తోడూ ఉద్యమాన్ని నడిపిస్తున్న తెరాస అధినేత కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణలు, తెలంగాణా జేఎసీలో పదవుల కోసం జరిగిన కుమ్ములాటలు, తెలంగాణా ఉద్యమాలనే తమ రాజకీయ సోపానాలుగా చేసుకొని పైకెదుగుతున్నచోటామోటా నేతలను చూస్తున్న తెలంగాణా విద్యార్దులు తమ త్యాగాల వృదా అవుతున్న తీరు చూసి ఉద్యమాలపట్ల నిరాసక్తి కనబరుస్తున్నారు.
ఇక, తన ఉద్యమ లక్ష్యాన్నిపక్కన పెట్టి ఎన్నికల బాట పట్టిన తెరాస కూడా ఈ పరిణామంతో చాలా కంగారుపడింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ తరువాత సాధారణ ఎన్నికలలో తన సత్తా చాటుకొని వీలయినన్ని సీట్లు గెలచుకొని తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకొంటున్న తెరాస ఈ తరుణంలో కీలకమయిన విద్యార్దుల మద్దతు కోల్పోవడం అసలుకే మోసం అవుతుందని గ్రహించిన వెంటనే, వారిని బుజ్జగించి తిరిగి తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఆ ప్రయత్నంలోనే నిన్న వరంగల్ జిల్లా హన్మకొండలోరాంనగర్ లో గల టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో టీఆర్ఎస్వీ జిల్లా స్థాయి సదస్సు జరిగింది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ విద్యార్ధి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచం లో ఎక్కడా జరగని విధంగా తెలంగాణ కోసం ఆ త్మ బలిదానాలు జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం చాల విచారకరం అని అన్నారు. అందువల్ల విద్యార్దులందరూ సైనికుల్లా పనిచేసి ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు వ్యాపింపజేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతీ నియోజకవర్గం నుంచి పది మంది చొప్పున సుశిక్షతులైన విద్యార్థి సైనికులను సిద్ధం చేస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో తెరాసకు సంపూర్ణ మద్దతు ఇవ్వలని కోరారు. తద్వారా తెరాస కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేయగలదని ఆయన అన్నారు.
కేంద్రంపై తెలంగాణకు వ్యతిరేఖంగా ప్రభావం చూపుతున్న సీమాంధ్ర పార్టీలను దెబ్బకొట్టాలంటే రానున్న ఎన్నికలలో తెరాస 100 మంది ఎమ్మెల్యేలను, 17 మంది ఎంపీలను గెలిపించుకోవాలసి ఉంటుంది గనుక, విద్యార్దులు పూర్తీ మద్దతు ఇవ్వలని ఆయన కోరారు. ఇప్పుడు తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థులు వచ్చే ఎన్నికలలో కూడా తెరాసకు అనుకూలంగా కీలక పాత్ర పోషించవలసిందిగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు త క్కళ్లపల్లి రవీందర్రావు కోరారు.