చంద్రబాబు వల్లే బాంబు ప్రేలుళ్ళు ఆపలేకపోయారుట!
హైదరాబాదు బాంబు ప్రేలుళ్ళ ధాటి నుండి ప్రజలు పూర్తిగా కోలుకొనక మునుపే, అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ధం మొదలయింది. తెరాస నేత హరీష్ రావు, తెదేపా నేత రేవంత్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలనీ డిమాండ్ మొదలు పెట్టారు.
మరో వైపు కాంగ్రెస్ నేతలు వీ.హనుమంత్ రావు, పొన్నం ప్రభాకర్ వంటి వారు కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు పెట్టె పనిలో పడ్డారు. క్రమంగా స్వపక్ష విపక్షలనుండి విమర్శలు జోరందుకొంటున్న తరుణంలో కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట రావు, ఒక బలమయిన సాకుతో చంద్రబాబు మీద ఎదురు దాడి మొదలుపెట్టారు.
“గత నాలుగు నెలలుగా అంతూపొంతూ లేకుండా సాగుతున్న చంద్రబాబు పాదయాత్రకే సగం పోలీసు బలగాలు కేటాయించవలసి వస్తుంటే, ఇక ప్రజలను కాపాడటానికి పోలీసులు ఎక్కడ సరిపోతారు? ఆయన ఏ జిల్లాలో అడుగు పెడితే, ఆ జిల్లాలో వందలాది పోలీసులను ఆయన భద్రతకోసం వినియోగించవలసి వస్తోంది. అదే విధంగా మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల కూడా పాదయాత్ర మొదలు పెట్టడంతో మరింత మంది పోలీసులను పక్కన పెట్టవలసి వస్తోంది."
"ఈ విధంగా ఇద్దరు ప్రతిపక్షనేతలు సుదీర్గ కాలం పాదయాత్రలు కొనసాగిస్తుంటే, ఉన్న పోలీసు బలగాలలో సగం మంది వారి భద్రతకే వెళ్లిపోతుంటే, ఇక ఇటువంటి ఉగ్రవాదుల దాడిని సమర్దంగా ఎదుర్కోవడానికి పోలీసులెక్కడ సరిపోతారు?” అని ఆయన ప్రశ్నించారు.
ఆయన చెప్పిన దానిలో కొంత నిజం ఉన్నపటికీ, అది పూర్తిగా నమ్మ శక్యంగా లేదు. పాలడుగు చేసిన ఈ విమర్శలకు తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎలాగు జవాబు చెప్పుకొంటాయి గనుక, ఆ ప్రసక్తి పక్కన పెడితే, కేవలం ఇద్దరు ప్రతిపక్ష నేతలకి భద్రత కల్పించడమే తమ తలకు మించిన భారం అవుతోందని కాంగ్రెస్ నేత అంటున్నపుడు, మరి రాష్ట్రం ఇన్ని కోట్ల మందికి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా భద్రత కల్పించగలదూ? అనే ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పవలసి ఉంది.
అధికారంలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ నాయకుడు వెనుక ప్రస్తుతం ఎంతెంత మంది పోలీసు బలగాలను కేటాయించు కొన్నారో ఆయన లెక్క జెపితే, అప్పుడు ఇద్దరు ప్రతిపక్ష నేతల వెనుక అంతమంది ఉండటం సమజసమా కాదా? అనే సంగతి కూడా తేల్చవచ్చును.
అయితే, పాలడుగు చెప్పిన మాటను చంద్రబాబు, షర్మిల ఇద్దరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలకోసం ఈ విదంగా పాదయాత్రలు చేస్తున్నపుడు, ప్రజల కష్టార్జితంతో తమకు భద్రత కోరుకోవడం ఎంతవరకు సబబు అని వారిద్దరూ కూడా ఆలోచించుకోవాలి.
ప్రజల సొమ్మును విద్యుత్ చార్జీల పేరిట, అదిక పన్నుల పేరిట ప్రభుత్వం దోచుకొంటోందని నిత్యం విమర్శించే వారిరువురూ, తమ పాదయాత్రలు సజావుగా సాగడానికి, తమ స్వీయ భద్రతకోసం ఈవిధంగా ప్రజాధనంతో పోలీసు బలగాలను విరివిగా ఉపయోగించుకొంటూ, వారు కూడా ప్రభుత్వం చేస్తున్న పనినే చేస్తున్నారని తెలుసుకోవలసిన అవసరం ఉంది.వారిద్దరూ అవసరమనుకొంటే, తమ స్వంత ఖర్చుతో ఎంత మంది కావాలనుకొంటే అంతమంది ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకొని ఎంతకాలం పాదయాత్రలు చేసినా ఎవరూ ఆక్షేపించరు.