జగన్ బయటకు వస్తే ఏం జరుగుతుంది?

        దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అధికార, ధన దాహంతో అనేక ఆర్థిక నేరాలకు పాల్పడడం వల్లే ఆయనకు ఈ దుస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఆయన జైలు నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తారని నిలదీశారు. అనివార్య కారణాలవల్ల విద్యుత్ చార్జీలు పెంచినప్పటికీ పేదలపై ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతో తాను చేసిన విన్నపం మేరకు 200 యూనిట్ల దాకా చార్జీలు పెంచవద్దని నిర్ణయం తీసుకున్న సీఎం కిరణ్‌కు చిరు కృతజ్ఞతలు తెలిపారు.

'బాద్‌షా' ఎప్పుడు డిసైడ్ చేస్తాడు?

  తెలుగుదేశం పార్టీలో మరియు నందమూరి కుటుంబ సభ్యుల మద్య చిచ్చుపెడదామనే పక్కా ప్రణాళికతో వైయస్సార్ కాంగ్రెస్ అమలు చేస్తున్న ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహం బాలకృష్ణ జూ.యన్టీఆర్ కు హెచ్చరిక జారీ చేయడంతో అనుకొన్న ఫలితం సాదించినట్లే చెప్పవచ్చును. బాలకృష్ణ హెచ్చరించినప్పటికీ, జూ.యన్టీఆర్ కానీ, అతని తండ్రి హరికృష్ణ గానీ ఇంతవరకు పెదవి విప్పక పోవడంతో, తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది.   పార్టీలో హరికృష్ణకు తగిన ప్రాదాన్యం ఈయకపోగా, ఆయన కుమారుడు జూ.యన్టీఆర్ ను కూడా పక్కన పెడుతూ, చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ ను క్రమంగా పార్టీలోముందుకు తీసుకురావడంపై ఆగ్రహించడం వలననే బహుశః వారిద్దరూ వైకాపా తమ పార్టీ మీద ప్రకటించిన ఈ యుద్ధానికి మౌనంగా ఉండి పరోక్ష సహాయం చేస్తున్నారని భావించవచ్చును. తద్వారా పార్టీలో తమకున్న ప్రాదాన్యతను చంద్రబాబుకు తెలిసి వచ్చేలా చేయడం వారి ప్రధాన ఉద్దేశ్యం తప్ప, అందరూ ఊహిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచన మాత్రం చేయరని చెప్పవచ్చును. వైయస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ఈ యుద్ధంలో తెదేపాపై మరింత ఒత్తిడి పెరిగినప్పుడు పార్టీ అధిష్టానమే తమ సహాయం అర్దించివస్తే అప్పుడు తమది పై చేయి అవుతుందని వారిరువురి ఆలోచన కావచ్చును. బహుశః అందువల్లే వారిరువురూ కూడా ఇంతవరకు బాలకృష్ణ హెచ్చరికలను పట్టించుకోలేదని అనుకోవచ్చును.   అయితే, హరికృష్ణ వంటి కోపిష్టిని వదులుకోవడానికి చంద్రబాబు పెద్దగా సంకోచించకపోయినా, అతనితో పాటు పార్టీకి స్టార్ ఎట్రాక్షన్ అని చెప్పదగ్గ జూ.యన్టీఆర్ కూడా దూరమవుతాడని కొంచెం సంయమనం పాటిస్తున్నట్లు ఉంది. అంతే గాక వారిరువురినీ పార్టీ నుండి బయటకి పంపినట్లయితే నందమూరి వారు స్థాపించిన తెదేపాలో నందమూరి వారికి స్థానం లేదనే సరికొత్త ప్రచారం మొదలవడమే కాకుండా, అలనాడు యన్టీఆర్ ని పార్టీ నుండి బయటకి గెంటినట్లే, ఇప్పుడు ఆయన కుమారుడిని, మనుమడినీ కూడా బయటకి గెంటారనే అపఖ్యాతి కూడా చంద్రబాబు మెడకి చుట్టుకోవడం ఖాయం గనుక, ఈ వ్యవహారంలో ఆయన ఇంతవరకు కలిగించుకోకుండా బాలకృష్ణకే అప్పగించారు.   కానీ, పార్టీలో కోడెల శివప్రసాద్ వంటి ఇతర నేతలు ఆయన అనుమతి లేకుండా జూ.యన్టీఆర్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారని భావించలేము. అంటే, చంద్రబాబు వారిని స్వయంగా విమర్శించకపోయినప్పటికీ వారిరువురికీ చాల స్పష్టమయిన సందేశమే ఇస్తున్నట్లు భావించవచ్చును. వారిని తానూ స్వయంగా పూనుకొని పార్టీలోంచి బయటకి పంపడం కంటే, వారంతట వారే పార్టీని వీడిపోయేలా చేయడం చంద్రబాబు అభిమతం కావచ్చును. మొన్న బాలకృష్ణ జూ.యన్టీఆర్ ను తీవ్ర స్వరంతో హెచ్చరించడమే అందుకు మొట్ట మొదటి సంకేతంగా భావించవచ్చును.   కానీ, ఈ సమస్య టీ కప్పులో తుఫానులా త్వరలోనే చల్లారిపోయే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చును. ఎందుకంటే, జూ.యన్టీఆర్ వంటి అతిముఖ్యమయిన వ్యక్తిని చంద్రబాబు చేజేతులా ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తారని కానీ, తన స్వంత ఇల్లువంటి తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని వీడి జూ.యన్టీఆర్ అవినీతి కేసుల్లో ఇరుకొన్న జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని గానీ భావించలేము.   ఈ వ్యవహారాన్ని చూసి మురిసిపోతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఫ్లెక్సీ బ్యానర్ యుద్దానికి మరింత ముందుకు తీసుకు వెళుతూ ఆ పార్టీ బాకా మీడియా సాక్షిలో తమను విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ మీద ప్రతివిమర్శలు గుప్పించడమే కాకుండా తాము చేస్తున్న పనిలో తప్పేమీ లేదని వితండవాదన కూడా మొదలుపెట్టింది. అయితే, బాద్ షా ఏమి డిసైడ్ చేస్తాడనేదానిమీదనే క్లైమాక్స్ సీన్ ఆధారపడి ఉంటుంది. ఒకసారి బాద్ షా డిసైడ్ అయితే ఇక వార్ వన్ సైడవుతుందని ని వేరే చెప్పనవసరం లేదు.

జూ.ఎన్టీఆర్ నోరు తెరవాలి: కోడెల

        టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ పై భారీ అస్త్రాలనే సంధించారు. ఫ్లెక్సీల విషయంలో ఆయన మాట్లాడుతూ…కొడాలి నానికి ఎవరైతే ఒత్తిడి తెచ్చి టీడీపీలో సీటు ఇప్పించారో ఆ వ్యక్తి నోరు తెరవాలని అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో కోడెల ఫ్లెక్సీల గురించి స్పందించారు. జూనియర్ తెలియకుండానే కొడాలి నాని పార్టీ వదిలవెళ్లారా అన్నట్టుగా మాట్లాడారు…''ఆయనకు తెలియకుండానే పార్టీ నుంచి నాని బయటకు వెళ్లారా…” అని కోడెల వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. “ఆయనకు తెలియకుండానే ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో వాడుకుంటున్నారా…” అని కోడెల అన్నారు.

ఎన్టీఆర్ అందరివాడు: పురందేశ్వరి

  ఇప్పటి రాజకీయ నేతల్లో చాలా హుందాగా ప్రవర్తించే అతికొద్ది మందిలో కేంద్రమంత్రి పురందేశ్వరి కూడా ఒకరు. నేటి రాజకీయనేతలకి భిన్నంగా ఆమె మాట్లాడటం కంటే ఎదుట వారు చెప్పే విషయం గురించి శ్రద్దగా వినడానికే ప్రాదాన్యం ఇస్తారు. అదే విధంగా ఆమె ఎవరినీ వ్యక్తిగత విమర్శలు చేయడం లేదా అనవసరమయిన మాటలు మాట్లాడటం కానీ చేయరు. గత కొద్ది రోజులుగా వైకాపా నేతలు ఆమె తండ్రి గారయిన స్వర్గీయ యన్టీఆర్ బొమ్మను తమ ఫ్లెక్సీ బ్యానర్లపై వేసుకొని చేస్తున్న రాజకీయంపై స్పందించమని మీడియా కోరగా ఆమె సున్నితంగా తిరస్కరించినప్పటికీ, యన్టీఆర్ ప్రజలందరి సొత్తు అని ఆమె చూచాయగా తన అభిప్రాయాన్ని తెలియజేసారు. తెదేపా, వైకాపాల పాదయాత్రలపై స్పందిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, అధికారం కోసమే పాదయాత్రలు చేస్తున్నాయని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ ఫోటోతో వైకాపాకి సంబంధం లేదు

        వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ టిడిపిల మధ్య ఫ్లెక్సీ ల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ కూడా స్పందించారు. ఆ పార్టీ నేతల ఫోటోలు బ్యానర్లలో పెట్టుకొంటే ఓట్లు రాలవనే ఆలోచనతోనే వారు ఎన్టీఆర్ ఫోటోలు వాడుకొంటున్నట్లున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని జూ.ఎన్టీఆర్ వెంటనే ఖండించాలని అన్నారు.   ఈ వివాదం పై జూ.ఎన్టీఆర్ స్పందించలేదు, కాని జగన్ పార్టీ మాత్రం స్పందించింది. ఈ వివాదం పై వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత కొణతల రామకృష్ణ మాట్లాడుతూ..స్వర్గీయ ఎన్టీఆర్ గారికి చాలా మంది అభిమానులున్నారని, అలాంటి వారిలో కొంతమంది తమ పార్టీలోవున్నారని, వారెవరైనా ఫోటో పెట్టుకుంటే అది తమ సంబందించిన విషయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొడాలి నాని ఎన్టీఆర్ అభిమాని అని, ఆయనపై అభిమానంతో ఎవరైనా ఫ్లెక్సీ లలో ఎన్టీఆర్ ఫోటో పెట్టి వుంటారన్నారు. ఎన్టీఆర్ ఫోటోతో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని రామకృష్ణ స్పష్టం చేశారు.   

హమ్మయ్యా..దీక్ష భగ్నం చేశారు!

        విద్యుత్ ఛార్జీల పెంపుపై వైకాపా నేతలు చేస్తున్న నిరవదిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శిభిరంలో నిరాహార దీక్ష చేస్తున్న చాలా మందికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో ఆరోగ్యాలు క్రమంగా క్షీణించడం మొదలు పెట్టాయి. దీంతో నిన్న అర్ధరాత్రి వైఎస్ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు.   అయితే అందరూ చేసినట్లే తాము ఓ మూడు, నాలుగు రోజులు దీక్షలు చేసి పోలీసుల చేత భగ్నం చేయించుకొని వీరులు అనిపించుకొని బయట పడదామని అనుకొంటే కిరణ్ కుమార్ ప్రభుత్వం చల్లగా కూర్చొని చూస్తుండటంతో వైకాపా నేతలు ఖంగుతిన్నారు. ఆఖరికి  ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు వారి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అరెస్టు చేయనంతవరకు తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించిన వైకాపా నేతలు, అరెస్టు తర్వాత తమపై ఉక్కుపాదం మోపుతారా అంటూ విమర్శిస్తున్నారు.

వైయస్ జగన్, కొడాలి నానిని ఏ మగాడు అడ్డుకోలేడా?

        నేను శాసన సభ్యుడిని కాకుండా, జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఏ మగాడు అడ్డుకోలేడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. చంద్రబాబు తప్ప ఎవరైనా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవచ్చని, టిడిపి నుంచి ఎన్టీఆర్ గెంటేసిన చంద్రబాబుకు ఆయన ఫోటో పెట్టుకునే హక్కులేదని నాని ధ్వజమెత్తాడు. షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.   కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపాయని, జగన్ పార్టీలో చేరినందుకు నన్ను నానా మాటలు అన్నారు. నేను డబ్బులు తీసుకుని జగన్ పార్టీలో చేరానని ప్రచారం చేశారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కుటుంబానికి అండగా ఉంటామని కృష్ణా జిల్లా మొత్తం చెబుతుందని, ఎన్టీఆర్ ఫోటో వాడుకున్నానని అవాకులు, చవాకులు పేలుతున్నారని, అసలు చంద్రబాబుకే ఆయన ఫోటో వాడే హక్కులేదని అన్నారు.

చంద్రబాబుకి ఆ అర్హత లేదా?

  వైకాపా మొదలు పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ నాటకంలో క్రమంగా పాత్రదారులు పెరుగుతున్నారు. అందరూ తలో చేయి వేసి మంచి రసవత్తరంగా నడిపిస్తున్న ఈ డ్రామాలో స్వర్గీయ యన్టీఆర్ మీద పేటెంట్ హక్కులున్న తానూ మాత్రం ఎందుకు పాలుపంచుకోకూడదని ఎన్టీర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నేడు ప్రవేశించారు.   కేవలం ఆవు గురించే తెలిసిన పిల్లాడికి ఏ ప్రశ్న అడిగినా దానికి జవాబు ఆవుతోనే ముగించినట్లు, విషయం ఏదయినప్పటికీ చివరికి చంద్రబాబును ఆడిపోసుకోవడంతోనే సంబాషణ ముగించే లక్ష్మీపార్వతి, వైకాపా ఫ్లెక్సీలో తన భర్త స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటో గురించి తెదేపా నేతలు అభ్యంతరాలు తెలుపుతుంటే, తన ప్రియ శత్రువు చంద్రబాబును ఎండగట్టడానికి ఇంత కంటే మంచి అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అన్నట్లు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి “అసలు నా భర్త ఫోటో వాడుకొనే హక్కును తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కోల్పోయింది. అయినప్పటికీ, గత్యంతరం లేక ఆయన బొమ్మను పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. ఆయన కుమారుడు బాలకృష్ణకు తన తండ్రి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఆయన తన తండ్రికి అన్యాయం చేసిన చంద్రబాబు పంచన చేరారు. నా భర్త మీద అభిమానం ఉన్న వారెవరయినా ఆయన ఫోటో పెట్టుకోవచ్చును. అందులో తప్పేమీ లేదు. కానీ, తెలుగుదేశం పార్టీ కి మాత్రం ఆ హక్కు లేదు. నిజంగా చంద్రబాబుకు తన నాయకత్వం మీద అంత గొప్ప నమ్మకం దైర్యం ఉంటే, ముందు నా భర్త స్వర్గీయ యన్టీఆర్ ఫోటోను తీసేసి ఆ స్థానంలో తన ఫోటోను పెట్టుకొని ఎన్నికలకి వెళ్ళమనండి. ఏమవుతుందో అప్పుడు ఆయనే చూస్తారు,” అని లక్ష్మీ పార్వతి ఆవేశపడిపోయారు. ఇంకా మిగిలిన పాత్రదారులు, ముఖ్యంగా మన బాద్షా రేపయినా ప్రవేశిస్తారో లేదో చూడాలి.

విజయమ్మ దీక్షను పట్టించుకోని ప్రభుత్వం

        విద్యుత్ ఛార్జీల పెంపు పై ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అస్వస్థతకు గురయ్యారు. విజయమ్మతో పాటు నిరహారదీక్షలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు సుచరిత, గుర్నాథరెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, షుగర్ లెవల్స్ పడిపోవటంతో శోభా నాగిరెడ్డి, సుజయ రంగారావు పడిపోయారు. కాగా గొట్టిపాటి రవికుమార్, జోగి రమేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అమర్నాథరెడ్డిలకు బీపీ లెవల్ పూర్తిగా పడిపోయింది. వీరి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించడం కంటే, వారంతట వారే తమని ఆసుపత్రికి తరలించామని అడిగినప్పుడే తరలించాలని ప్రభుత్వ ఆలోచన కావచ్చును.

ప్రభుత్వ వైఖరితో ఖంగు తిన్న వైకాపా నేతలు

  వైకాపా నేతలు నిరవదిక నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇప్పటికి 5వ రోజు. కానీ, ఇంతవరకు పోలీసులు వారి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించలేదు. నిన్నసాయంత్రం పోలీసులు రావడంతో ఇక మరో గంటో గడియలోనో తమ దీక్షను భగ్నంచేసి ఆసుపత్రికి తరలిస్తారని అందరూ ఊహించారు. కానీ వచ్చిన పోలీసులు, దీక్షా శిబిరం దగ్గర కుర్చీలలో కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ప్రభుత్వ ఆదేశాల కోసం ఇంతవరకు కూడా ఎదురు చూస్తున్నారు.   ఈ లోగా శిభిరంలో నిరాహార దీక్ష చేస్తున్న చాలా మందికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో ఆరోగ్యాలు క్రమంగా క్షీణించడం మొదలు పెట్టాయి. నిన్న సాయంత్రం శాసన సభ్యురాలు వనిత షుగర్ లెవెల్ 40 కంటే తక్కువ స్థాయికి పడిపోవడంతో ఆమెను అక్కడున్న వైద్యులు అంబులెన్స్ లో నీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థిని దృష్టిలో ఉంచుకొని వైకాపా నేతలు సైతం ఆమెను తరలించడానికి అంగీకరించక తప్పలేదు.   ప్రస్తుతం మళ్ళీ శాసన సభ్యులు శోభానాగి రెడ్డి, సుజయ్ రంగ రావుల షుగర్ లెవెల్స్ పడిపోగా, జోగి రమేష్, సుచరిత, గురునాథ రెడ్డిల బీపీ లెవెల్స్ క్రమంగా పడిపోతున్నాయని సమాచారం. అదే విధంగా పార్టీ గౌరవధ్యక్షురాలు విజయమ్మ ఆరోగ్యం కూడా నిన్న రాత్రి నుండి క్షీణించ సాగింది. అయినప్పటికీ, ప్రభుత్వం మాత్రం పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇంత వరకు జారీ చేయలేదని సమాచారం. వారి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించడం కంటే, వారంతట వారే తమని ఆసుపత్రికి తరలించామని అడిగినప్పుడే తరలించాలని ప్రభుత్వ ఆలోచన కావచ్చును.   ఊహించని ఈ పరిణామానికి వైకాపా నేతలు కంగుతిన్నారు. అందరు చేసినట్లే తాము ఓ మూడు నాలుగు రోజులు దీక్షలు చేసి పోలీసుల చేత భగ్నం చేయించుకొని వీర త్రాళ్ళు వేసుకొని బయట పడదామని అనుకొంటే కిరణ్ కుమార్ ప్రభుత్వం చల్లగా కూర్చొని చూస్తుండటంతో వైకాపా నేతలకు ఇప్పుడ ఏమి చేయాలో పాలు పోవడం లేదు. దీక్ష మద్యలో లేచిపోతే నవ్వులపాలవుతారు గనుక దీక్ష కొనసాగించక తప్పట్లేదు. బహుశః ప్రభుత్వమే వారి ఆరోగ్య పరిస్థితి చూసి జాలిపడి దీక్ష భగ్నం చేయమని ఆదేశించవచ్చును, లేదా ఒకరొకరిగా అందరినీ ఆసుపత్రికి తరలించవచ్చును. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వం తమ డిమాండ్ల గురించి హామీ ఈయకపోయినా పరువలేదు కానీ, దయతలచి ముందు తమ దీక్షను భగ్నం చేసి తమ పరువు, ప్రాణాలు కాపాడితే అదే పదివేలని కోరుకొంటున్నట్లుంది.

జగన్ అవినీతికి సూత్రధారి కేవీపీ

        కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బినామీలు, అడ్రసులేని కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. జగన్, గాలి, రఘురామరాజు సంస్థలో ఒకే కంపెనీ ఎలా పెట్టుబడులు పెడుతుందని ప్రశ్నించారు. కేవీపీ పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసులో కేవీపీ పాత్ర ఉందని ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నరేంద్ర విమర్శించారు. కేవీపీ బినామి రఘురామరాజు అని, జేడీ కాల్‌డేటా లిస్టులో ఆయనే ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకే విదేశాలకు వెళ్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రఘురామరాజును వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని వైఎస్ విజయలక్ష్మి కలిసిన తర్వాత జగన్ కేసులో అరెస్ట్ తగ్గాయని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.

జూ.ఎన్టీఆర్ కు బాలయ్య వార్నింగ్, ఫ్లెక్సీలపై స్పందించాలి

  వైకాపా మొదలుపెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ యుద్దంలోకి ఇప్పుడు బాలకృష్ణ కూడా ప్రవేశించారు. వైకాపా యన్టీఆర్ ఫోటోలు వాడుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ పార్టీ నేతల ఫోటోలు బ్యానర్లలో పెట్టుకొంటే ఓట్లు రాలవనే ఆలోచనతోనే వారు యన్టీఆర్ ఫోటోలు వాడుకొంటున్నట్లున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలోజూ.ఎన్టీఆర్ వెంటనే స్పందించవలసి ఉందని, లేకుంటే దాని పరిణామాలు వేరేలా ఉంటాయని అన్నారు. నిత్యం సినిమా షూటింగు హడావుడిలో ఉండే జూ.ఎన్టీఆర్ కి ఒకవేళ ఇక్కడ జరుగుతున్న సంగతులు తెలియకపోవడం వలన ఆయన స్పందించకపోయి ఉంటే, తానూ ఆయనతో మాట్లాడుతానని, ఈ విషయాలు అన్నీ తెలిసి కూడా స్పందించకపోయి ఉంటే ఆయన తను ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలనీ అన్నారు.   కొడాలి నాని తెదేపా నుండి వెళ్ళిపోయిన తరువాత పార్టీలో అందరూ చాల సంతోషించారని, ఆయన వెళ్ళిపోవడం వలన పార్టీకి వచ్చిన నష్టం ఏమిలేదని అన్నారు. తానూ జూ.ఎన్టీఆర్ కు సహకరించవద్దని ఎన్నడూ ఎవరికీ ఆదేశాలు జారీ చేయలేదని, అవన్నీ ఊహాగానాలేనని ఆయన అన్నారు. ఇక పార్టీ నాయకత్వం విషయంలో కూడా భిన్నాభిప్రాయాలకు తావు లేదని, వచ్చే ఎన్నికల తరువాత కూడా చంద్రబాబు నాయుడి సారద్యంలోనే అందరూ పనిచేస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్న జయప్రద తమ పార్టీలో చేరాలనే ఆలోచన కనుక ఉంటే తనను సంప్రదిస్తే విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. త్వరలోనే తానూ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశిస్తానని తెలిపారు. రెండు రోజుల కృష్ణా జిల్లా పర్యటన కోసం తిరువూరు నియోజకవర్గంలోని కొమరోలు వచ్చిన బాలకృష్ణ ఈ రోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించారు.   ఇప్పటికయినా బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ఖండించడం బాగానే ఉన్నపటికీ, ఆయన జూ.ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విధంగా కొంచెం కరుకుగా మాట్లాడటం చూస్తే, జూ.ఎన్టీఆర్ కి ఈ విషయాలు తెలిసినా ఖండించట్లేదని ఆయన కూడా అభిప్రాయపడుతున్నట్లు ఉంది. ఆయన ఆవిధంగా భావించడంలో తప్పులేదు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఏమూల ఏమి జరిగిన క్షణాలలో ఆ సమాచారం అందరికీ తెలుస్తున్నపుడుజూ.ఎన్టీఆర్ కి వైకాపా ఆడుతున్న ఆట గురించి తెలియదని భావించలేము. అందుకే బాలకృష్ణ కొంచెం తీవ్ర స్వరంతోనే మాట్లాడవలసి వచ్చింది. ఇక, జూ.ఎన్టీఆర్ వైకాపా పై విరుచుకుపడతారో లేకపోతే వేరేమయినా సమాధానం చెప్పబోతున్నారో త్వరలోనే తేలిపోవచ్చును.   ఇక, వైకాపా తన ఫ్లెక్సీ బ్యానర్ బాణాలను సరిగ్గా గురిచూసి కొట్టినట్లే కనిపిస్తోంది. ఒక దెబ్బకి రెండు పిట్టలు కొట్టినట్లు. తెదేపాలో ఆశించిన విదంగా చిచ్చుపెట్టడమే కాకుండా, పార్టీలో జూ.ఎన్టీఆర్ ఒంటరి అయిపోయాడనే భావన ఆయన అభిమానులలో బాగా వ్యాపింపజేయగలిగింది.ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న విడుదల అయిన బాద్షా సినిమా విజయవంతం అయినందుకు జూ.ఎన్టీఆర్ అభిమానులతో సమానంగా వైకాపా కూడా సంబరాలు చేసుకొంది. తద్వారా జూ.ఎన్టీఆర్ కి తెదేపా మద్దతు ఈయకపోతే తాము మద్దతుగా ఉంటామని స్పష్టంగా సందేశం పంపగలిగింది. గమ్మతయిన విషయం ఏమిటంటే, తెదేపాలో ఉన్న జూ.ఎన్టీఆర్ అభిమానుల హడావుడి ఎక్కడా కనబడలేదు.

బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది

        "మా హయాంలో వైర్లు పట్టుకుంటే షాక్ కొట్టేవి... ఇపుడు బిల్లులు చూస్తేనే షాక్ కొడుతోంది'' అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. గొర్రెల కాపరుల సంఘాలకు ఐదు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. చెంచల్‌గూడ జైలునే పార్టీ కార్యాలయంగా పెట్టుకుంటే బాగుంటుందని వైసీపీకి సలహా ఇచ్చారు.   టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే..జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తున్నదని చంద్రబాబు ధ్వజమెత్తారు. "ఉప ప్రణాళిక తెచ్చామని గొప్పగా ప్రకటించుకొని.. ఆ మరునాడే ఆ నిధులను బ్యాలెట్ బాక్సుల గోదాములకు తరలించారు. నాడేమో ఆ నిధులతో వైఎస్ ఇడుపులపాయకు రోడ్డేయించుకున్నారు.. కాదేమో ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను చెప్పమనండి? ఈ విషయంలో వారితో చర్చకు నేను సిద్ధమే'' అని సవాల్ విసిరారు.  

ఓట్ల కోసమే ఎన్టీఆర్ ఫోటో

        ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరి౦చడంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని ప్రముఖ సినీ నటుడు, నందమూరి బాలకృష్ణ విమర్శించారు. రెండు రోజుల కృష్ణా జిల్లా పర్యటనలో బాగంగా కొమరవోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువు కాలంలో రైతులకు టిడిపి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని అన్నారు.   టిడిపి హయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఓట్లు రాలుతాయనే వైకాపా ప్లేక్సిల్లో ఎన్టీఆర్ బొమ్మను పెడుతున్నారని..అది సరైనది కాదని అన్నారు. ప్లేక్సిల్లో బొమ్మ పెట్టడం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని చెప్పారు. ఎన్టీఆర్ పర్యటనకు కార్యకర్తలు రాకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. 

స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణ: కట్జూ

        తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమ నేతలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. తెలంగాణ డిమాండ్ న్యాయమైనది కాదని, కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నరన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని జస్టిస్ కట్జూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాయన్నారు. మరి జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై టి.నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

నేడు జగన్ అక్రమాస్తులపై మరో చార్జ్ షీట్ ...

  వై.ఎస్. జగన్ కంపెనీల్లో పట్టుబడులు పెట్టిన పెన్నా కంపెనీపై సిబీఐ అభియోగాలు మోపిన సంగతి విధితమే. తాజాగా పెన్నా సిమెంట్స్ కు చెందిన సున్నపురాయి మైనింగ్ లీజు దరఖాస్తులు వైఎస్.ఆర్. ప్రభుత్వంలో ఆగమేఘాలపై కదిలాయి. ప్రభుత్వం చెబితేనే అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసుతో సంబంధం వున్న జీవోలకు బాధ్యులుగా గుర్తించి మంత్రులు సబిత, పొన్నాల, గీతారెడ్డిలను సహనిన్డులుగా చేరుస్తారా, లేక సాక్ష్యులుగా చూపిస్తారా అనేది తాజా చార్జిషీట్ లో తేలనుంది. 2008 మార్చి 12న అనంతపురం జిల్లా తలారిచెరువు గ్రామంలో సున్నపురాయి నిక్షేపాలున్న 264 ఎకరాల కేటాయింపు, కర్నూలు జిల్లాలో 807 ఎకరాల సున్నపురాయి ప్రాస్పెక్తింగ్ లైసెన్స్, రంగారెడ్డి జిల్లాలో 548 ఎకరాల మైనింగ్ లీజు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెన్నా సిమెంట్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి పొందిన మేళ్ళుకు బదులుగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబీఐ ఆధారాలు సేకరించింది. అలాగే దాల్మియా సిమెంట్ జగన్ సిమెంట్ కంపెనీ ఇండియా సిమెంట్ లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం సేకరించింది. ఇంకొక సిమెంట్ కంపెనీ రఘురాం సిమెంట్స్ పేరుతొ గనులు పొందిన భారతీ సిమెంట్ వై.ఎస్. జగన్ దే అనేది బహిరంగ రహస్యం. కాబట్టి ఇప్పుడు తాజాగా సిబీఐ వై.ఎస్. జగన్ పై మరొక చార్జి షీట్ నేడు దాఖలు చేయనుంది.

ఎస్సీ, ఎస్టీ లకు ముఖ్యమంత్రి వరాల జల్లు

  పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీలపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 50 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వాడుకునే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఈ రుసుమును ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికల వ్యయం నుంచి ఖర్చు చేస్తామని, ఎస్సీ, ఎస్టీల కాలనీలలోని వారు బకాయిపడిన 268 కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్నట్లు, ఇందిరమ్మ గృహ రుణం ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు 1.05 లక్షల రూపాయలు చెల్లిస్తామని వివరించారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 50 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు ఏడాదికి 110 కోట్ల రూపాయలు వస్తున్నాయి, వారు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇకపై వారు బిల్లులు చెల్లించకుండా చర్యలు తీసుకున్నామని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ ఎస్సీ, ఎస్టీ నిధుల్ని వారికే చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారని, ఆమె ఆదేశాల్లో భాగంగానే దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నిధుల్ని వారికీ మాత్రమే కేటాయించేలా చట్టం తీసుకువచ్చామని, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక బాబూ జగ్జీవన్ రాం జయంతి రోజున ప్రారంభిస్తామని, అంబేద్కర్ జయంతి ఏప్రిల్14 వరకు కొనసాగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.

అమెరికాతో అణ్వస్త్ర యుద్దానికి ఉవ్విళ్ళూరుతున్న ఉత్తర కొరియా

  తీవ్ర యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న ఉత్తర కొరియా దేశ ప్రభుత్వం తన శక్తికి మించినదని తెలిసి ఉన్నపటికీ దక్షిణ కొరియాకు అండగా నిలబడ్డ అగ్రరాజ్యం అమెరికాతో ఏకంగా .అణ్వస్త్రయుద్దానికి సిద్దపడుతూ ఇరుదేశాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ రోజు ఆ దేశ విదేశాంగ శాఖ రాజధాని పయోంగ్ యాంగ్ లో గల అన్ని దేశాల రాయభార కార్యాలయాలకు వెంటనే తమ దేశం విడిచివెళ్ళడం వారికే క్షేమమని లేఖలు వ్రాసింది. ఈ నెల 10వ తేదీ తరువాత ఏ క్షణానయినా అణుయుద్ధం జరిగే అవకాశం ఉంది గనుక ఆ లోగా వారు దేశం విడిచి వెళ్ళకపోతే వారికి రక్షణ కల్పించలేమని తెలిపింది. బ్రిటన్, రష్యా, చైనా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు లేఖలు అందుకొన్నట్లు దృవీకరించాయి.   దక్షిణ కొరియా దేశంతో దశాబ్దాల తరబడి వైరం పెంచుకొంటూ వస్తున్న ఉత్తర కొరియా ఏనాటికయినా ఆ దేశాన్ని ప్రపంచ పటంలోంచి కనబడకుండా చేరిపేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే అణ్వస్త్రాలను సైతం సమకూర్చుకోవడంతో, ఉత్తర కొరియాను అణ్వస్త్ర దేశంగా గుర్తించబోమని ఖరాఖండీగా చెప్పడమే కాకుండా అణు నిరాయుధీకరణకు కూడా అమెరికా పట్టుపట్టింది. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ (30) అణ్వస్త్ర పరీక్ష జరిపి అగ్రరాజ్యానికి సవాలు విసరడంతో పరిస్థితులు విషమించాయి.   అమెరికా కూడా దానికి దీటయిన జవాబుగా దక్షిణ కొరియా దేశంతో కలిసి సైనిక విన్యాసాలు చేసి ఉత్తర కొరియా సరిహద్దులో ఒక డమ్మీ అణ్వస్త్ర బాంబు జారవిడిచింది. అమెరికా చర్యతో మరింత ఆగ్రహించిన ఉత్తర కొరియా, ఉభయ దేశాల సరిహద్దుల వద్దగల రెండు దేశాల సహకారంతో నడుస్తున్నపారిశ్రామికవాడను మూసివేసి యుద్ధ ప్రకటన కూడా చేసింది. తన అణ్వస్త్రాలను దక్షిణ కొరియా వైపు మొహరించిన ఉత్తర కొరియా ఈ రోజు రాజధానిలో గల అన్ని దేశాల రాయభార కార్యాలయాలకు ఈనెల 10లొగా ఖాళీచేసి వెళ్ళిపోవడం మేలని లేఖలు వ్రాసింది. 10వతేదీ నుండి ఏరోజయినా అణ్వస్త్ర యుద్ధం జరుగవచ్చని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉత్తర కొరియా మిత్ర దేశాలయినా చైనా, రష్యాల తో సహా వివిధదేశాలు వారిస్తున్నపటికీ ఆ దేశం యుద్ధానికే ఇష్టపడుతోంది.   ఒకసారి అణ్వస్త్ర యుద్ధం మొదలయితే అది ఎంత దారుణంగా ఉంటుందో తెలిసినప్పటికీ, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్నఅమెరికా వంటి దేశంతో యుద్ధానికి సై అనడం చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ది అనే మన పెద్దల మాటలు గుర్తుకు రాకమానవు. ప్రభుత్వ దురహంకారానికి, యుద్ధ కాంక్షకు అక్కడి అమాయక ప్రజలు, పిల్లలు, మహిళలు అందరూ బలవబోతుంటే ప్రపంచం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం విచారకరం.