'బాద్షా' ఎప్పుడు డిసైడ్ చేస్తాడు?
తెలుగుదేశం పార్టీలో మరియు నందమూరి కుటుంబ సభ్యుల మద్య చిచ్చుపెడదామనే పక్కా ప్రణాళికతో వైయస్సార్ కాంగ్రెస్ అమలు చేస్తున్న ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహం బాలకృష్ణ జూ.యన్టీఆర్ కు హెచ్చరిక జారీ చేయడంతో అనుకొన్న ఫలితం సాదించినట్లే చెప్పవచ్చును. బాలకృష్ణ హెచ్చరించినప్పటికీ, జూ.యన్టీఆర్ కానీ, అతని తండ్రి హరికృష్ణ గానీ ఇంతవరకు పెదవి విప్పక పోవడంతో, తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది.
పార్టీలో హరికృష్ణకు తగిన ప్రాదాన్యం ఈయకపోగా, ఆయన కుమారుడు జూ.యన్టీఆర్ ను కూడా పక్కన పెడుతూ, చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ ను క్రమంగా పార్టీలోముందుకు తీసుకురావడంపై ఆగ్రహించడం వలననే బహుశః వారిద్దరూ వైకాపా తమ పార్టీ మీద ప్రకటించిన ఈ యుద్ధానికి మౌనంగా ఉండి పరోక్ష సహాయం చేస్తున్నారని భావించవచ్చును. తద్వారా పార్టీలో తమకున్న ప్రాదాన్యతను చంద్రబాబుకు తెలిసి వచ్చేలా చేయడం వారి ప్రధాన ఉద్దేశ్యం తప్ప, అందరూ ఊహిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచన మాత్రం చేయరని చెప్పవచ్చును. వైయస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ఈ యుద్ధంలో తెదేపాపై మరింత ఒత్తిడి పెరిగినప్పుడు పార్టీ అధిష్టానమే తమ సహాయం అర్దించివస్తే అప్పుడు తమది పై చేయి అవుతుందని వారిరువురి ఆలోచన కావచ్చును. బహుశః అందువల్లే వారిరువురూ కూడా ఇంతవరకు బాలకృష్ణ హెచ్చరికలను పట్టించుకోలేదని అనుకోవచ్చును.
అయితే, హరికృష్ణ వంటి కోపిష్టిని వదులుకోవడానికి చంద్రబాబు పెద్దగా సంకోచించకపోయినా, అతనితో పాటు పార్టీకి స్టార్ ఎట్రాక్షన్ అని చెప్పదగ్గ జూ.యన్టీఆర్ కూడా దూరమవుతాడని కొంచెం సంయమనం పాటిస్తున్నట్లు ఉంది. అంతే గాక వారిరువురినీ పార్టీ నుండి బయటకి పంపినట్లయితే నందమూరి వారు స్థాపించిన తెదేపాలో నందమూరి వారికి స్థానం లేదనే సరికొత్త ప్రచారం మొదలవడమే కాకుండా, అలనాడు యన్టీఆర్ ని పార్టీ నుండి బయటకి గెంటినట్లే, ఇప్పుడు ఆయన కుమారుడిని, మనుమడినీ కూడా బయటకి గెంటారనే అపఖ్యాతి కూడా చంద్రబాబు మెడకి చుట్టుకోవడం ఖాయం గనుక, ఈ వ్యవహారంలో ఆయన ఇంతవరకు కలిగించుకోకుండా బాలకృష్ణకే అప్పగించారు.
కానీ, పార్టీలో కోడెల శివప్రసాద్ వంటి ఇతర నేతలు ఆయన అనుమతి లేకుండా జూ.యన్టీఆర్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారని భావించలేము. అంటే, చంద్రబాబు వారిని స్వయంగా విమర్శించకపోయినప్పటికీ వారిరువురికీ చాల స్పష్టమయిన సందేశమే ఇస్తున్నట్లు భావించవచ్చును. వారిని తానూ స్వయంగా పూనుకొని పార్టీలోంచి బయటకి పంపడం కంటే, వారంతట వారే పార్టీని వీడిపోయేలా చేయడం చంద్రబాబు అభిమతం కావచ్చును. మొన్న బాలకృష్ణ జూ.యన్టీఆర్ ను తీవ్ర స్వరంతో హెచ్చరించడమే అందుకు మొట్ట మొదటి సంకేతంగా భావించవచ్చును.
కానీ, ఈ సమస్య టీ కప్పులో తుఫానులా త్వరలోనే చల్లారిపోయే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చును. ఎందుకంటే, జూ.యన్టీఆర్ వంటి అతిముఖ్యమయిన వ్యక్తిని చంద్రబాబు చేజేతులా ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తారని కానీ, తన స్వంత ఇల్లువంటి తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని వీడి జూ.యన్టీఆర్ అవినీతి కేసుల్లో ఇరుకొన్న జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని గానీ భావించలేము.
ఈ వ్యవహారాన్ని చూసి మురిసిపోతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఫ్లెక్సీ బ్యానర్ యుద్దానికి మరింత ముందుకు తీసుకు వెళుతూ ఆ పార్టీ బాకా మీడియా సాక్షిలో తమను విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ మీద ప్రతివిమర్శలు గుప్పించడమే కాకుండా తాము చేస్తున్న పనిలో తప్పేమీ లేదని వితండవాదన కూడా మొదలుపెట్టింది. అయితే, బాద్ షా ఏమి డిసైడ్ చేస్తాడనేదానిమీదనే క్లైమాక్స్ సీన్ ఆధారపడి ఉంటుంది. ఒకసారి బాద్ షా డిసైడ్ అయితే ఇక వార్ వన్ సైడవుతుందని ని వేరే చెప్పనవసరం లేదు.