హస్తినకు చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం... ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఓటర్ల జాబితా నుంచి ప్రతిపక్ష టీడీపీ సానుభూతి పరుల ఓట్లను భారీగా తొలగించడమే కాకుండా.. దొంగ ఓట్లను సైతం అత్యధిక సంఖ్యలో ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసి ఈ అంశాన్ని వివరించనున్నారు.   అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎంకే మీనాను ఢిల్లీకి పిలుపించుకొని.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొంటున్న అవకతవకలపై వివరణ కోరడం.. వాటిని సాధ్యమైనంత త్వరగా సరి చేయాలని.. ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. కానీ ఆ ఆదేశాల అమలు  మాత్రం రాష్ట్రంలో నత్తనడకతో పోటీ పడుతున్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆ సంగతిని కూడా  చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు.  మరోవైపు వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా అధికార జగన్ పార్టీ పావులు కదుపుతోంది. ఆ క్రమంలో.. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో ఓటర్లను తొలగించి ఆ స్థానంలో దొంగ ఓట్లను చేర్చిందనే ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న వ్యవహరాన్ని.. స్థానిక శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్.. కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాదారాలతో సహా ఫిర్యాదు చేయడంతో.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి.. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిజమేనని నిర్ధారించుకొని.. అందుకు సంబంధించి    పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం.. ఆ క్రమంలో సదరు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే.    ఇంకోవైపు రాష్ట్రంలోని వివిధ  జిల్లాల్లో ఓటర్ల జాబితాను దొంగ ఓటర్లతో నింపేస్తున్నారని.. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు   స్పందించడం లేదని.. సదరు అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.  ఓ వైపు ఎన్నికలకు అట్టే సమయం లేదు... మరోవైపు మళ్లీ వరుసగా రెండో సారి అధికారంలోకి రావడం కోసం.. ఈ తరహా అరాచకానికి జగన్ పార్టీ తెర తీసిందనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో జీరో హౌస్ నెంబర్లతో.. లక్షలాది ఓటర్ల పేర్లుతో జాబితాలు సైతం ఇప్పటికే సిద్దం చేసినట్లు పోలిటికల్ సర్కిల్‌లో  ఓ చర్చ అయితే హల్ చల్ చేస్తోంది.

జాబిల్లిపై ఇండియా వెన్నెల అడుగు

బాబిల్లిపై వెన్నెల అడుగు.. చంద్రయాన్ 3  కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఘట్టం మరి కొద్ది సేపటిలో సాక్షాత్కారం అవుతుంది. భారత దేశ చరిత్రలో  మహోజ్వల ఘట్టం చంద్రయాన్ 3 మిషన్ కీలక దశకు చేరుకుంది. ఒక ఇండియానే కాదు యావత్ ప్రపంచం చంద్రయాన్ 3   జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనున్న మహత్తర సన్నివేశాన్ని వీక్షించేందుకు కళ్లు విప్పార్చుకుని చూస్తోంది.  ఈ అద్భుత ఘట్టాన్ని యావత్ భారత్ ప్రత్యక్షంగా వీక్షించనుంది. ఇందుకు  ఇస్రో ఏర్పాట్లు చేసింది.   చంద్రయాన్-3 ల్యాండింగ్​ ప్రక్రియను యావత్ దేశంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. బుధవారం( ఆగస్టు 23) సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3  కాలూనుతుంది ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై పరిశోధనలు చేస్తోంది.   చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూలై 14న చేపట్టగా.. అప్పటి నుంచి క్రమక్రమంగా చంద్రయాన్ చంద్రుడి వద్దకు  వెడుతూ.. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలో ప్రవేశించింది. ఆ తర్వాత క్రమంగా దూరాన్ని అధిగమిస్తూ  బుదవారం (ఆగస్టు 23)  చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది.  సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగిడనుంది. వాస్తవానికి 17 నిమిషాలు ముందుగా అంటే 5.47 నిమిషాలకు ల్యాండ్ కావల్సి ఉండగా..  షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసి 6.04 గంటలకు ఫిక్స్ అయ్యింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడి పైకి ల్యాండర్, రోవర్ పంపిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా చంద్రుడి పైకి రోవర్లను పంపాయి. అయితే చంద్రుని దక్షణ ధృవాన్ని టార్గెట్ చేసిన తొలి దేశం మాత్రం ఇండియాయే అవుతుంది.  అంటే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తయితే దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశం గా జాబిల్లిపై భారత పతాకం సగర్వంగా రెపరెపలాడుతుంది.   నిజానికి  చంద్రుడిపై అడుగిడేందుకు భారత్ కు ఇది  రెండో ప్రయత్నం. దాదాపు నాలుగేళ్ల క్రితం చంద్రయాన్-2ని ప్రయోగించి విఫలమైంది. చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యే సమయంలో సమస్యల్లో చిక్కుకుంది. ఆ మిషన్‌ విఫలమవ్వడంతో ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. ఇస్రో, చంద్రయాన్‌ 2 అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకుందని, చంద్రయాన్-3 మిషన్‌ను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్-2లో ఉపయోగించిన ‘సక్సెస్‌-బేస్డ్‌ డిజైన్’ కాకుండా చంద్రయాన్-3 కోసం ఇస్రో ‘ఫెయిల్యూర్‌-బేస్డ్‌ డిజైన్’ వ్యూహాన్ని అనుసరించింది. ఈ విధానం పొటెన్షియల్‌ ఫెయిల్యూర్‌ సినారియోలను అంచనా వేస్తుంది, వాటిని ఎదుర్కోవడానికి చర్యలను అమలు చేస్తుంది. తద్వారా విజయవంతమైన ల్యాండింగ్‌ను నిర్ధారిస్తుంది. కాగా, గతంలో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయిన చంద్రయాన్ 2 ఆర్బిటార్ మాత్రం ఇంకా పనిచేస్తోంది. ఇప్పుడీ ఆర్బిటార్.. విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేట్ అయినట్టు ఇస్రో తెలిపింది. వెల్‌కం బడ్డీ అంటూ చంద్రయాన్ 2 ఆర్బిటార్.. ల్యాండర్ మాడ్యూల్ కు స్వాగతం పలికింది.   చంద్రుని దక్షణ ధృవంపై అడుగు పెట్టనున్న మధుర క్షణాల కోసం ఇండియాతోపాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అద్భుత ఘట్టాన్ని యావత్ భారత్ లైవ్​లో వీక్షించనుంది. ఎక్కడికక్కడ స్కూల్స్, కాలేజీలతో పాటు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ ప్రయోగాన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దాయాది దేశం పాకిస్థాన్​ కూడా మన చంద్రయాన్ 3పై ప్రశంసలు కురిపించింది. పాకిస్థాన్‌ మాజీ మంత్రి ఫవాద్‌ ఛౌదరీ చంద్రయాన్-3 ప్రయోగాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పాక్‌ మీడియా ఈ చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రయోగాన్ని ప్రసారం చేయాలని కూడా పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు మన దేశంలో ప్రముఖ దేవస్థానాలలో కూడా చంద్రయాన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రతి భారతీయుడు చంద్రయాన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

కవిత మాటల మర్మంమేటి? కామారెడ్డి మతలబేంటి?

రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్లుగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే ఆయన సేఫ్ సైడ్ గా  కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారని విపక్షాలు అంటుంటే.. సొంత పార్టీలోని అసమ్మతి నేతలు, నిరాశ చెందిన ఆశావహులు మాత్రం తన కుమార్తె కల్వకుంట్ల కవిత కోసమే ఆయన కామారెడ్డిని కూడా ఎంచుకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. రెండు స్థానాలలోనూ విజయం సాధించి.. ఆ తరువాత కామారెడ్డి స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో కవితకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలన్న వ్యూహం కేసీఆర్ ది అని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం లక్ష్యంగా కసరత్తులు ప్రారంభించేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, అసమ్మతి వంటి అంశాలను అధిగమించడానికి తనదైన శైలిలో వ్యూహాలు రూపొందిస్తున్నారు. అన్నిటికీ మించి మిగిలిన రాజకీయ ప్రత్యర్థుల కంటే ముందుగానే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేశారు. అలా ప్రకటించి తాంబూలాలిచ్చేశాను ఇక తన్నుకు చావండి అన్నట్లుగా పార్టీలోని అసమ్మతికి ఆయన టార్గెట్ నిర్దేశించేశారు. అసమ్మతి ఏమైనా భగ్గు మంటే రోజుల వ్యవధిలో అది పార్టీపై చూపే ప్రభావాన్ని తగ్గించేయవచ్చన్నది ఆయన వ్యూహంలా కనిపిస్తోంది. అలాగే జాబితా అనంతరం పార్టీలో ఉండేవారెవరు? వెళ్లే వారెవరు అన్నది తేలిపోతే ఇక ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే జాబితాలో పేరుండి  కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్న మైనంపల్లిని ఎలా డీల్ చేయాలన్న విషయంలో ఆయన తొలుత ఉదారంగా వ్యవహరించినా.. రోజులు గడిచే కొద్దీ కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. బుధవారం (ఆగస్టు 23)  ఆమె మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న నిర్ణయం తనకోసమే అంటూ వస్తున్న విమర్శలకు ఆమె ఇసుమంతైనాన స్పందించలేదు. అలసా విషయమే తనకు తెలియనట్లుగా పూర్తిగా నాన్ సింక్ ఇష్యూ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పార్టీలను చెరిగి పారేశారు. నెహ్రూ నుంచి మొదలు పెట్టి మోడీ వరకూ అందరిపైనా విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తాను టేకప్ చేస్తాననీ, ఈ విషయంలో అన్ని పార్టీలనూ కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు. ఆమె మాటలు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ అంశాన్ని డైవర్ట్ చేసి డైల్యూట్ చేయడమే లక్ష్యంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మహిళలకు సరైన ప్రాతినిథ్యం లేదంటూ వస్తున్న విమర్శలపై ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అంశం పూర్తిగా తన సొంత అంశమన్నారు.  దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలకు చట్ట సభలలో సరైన ప్రాతినిథ్యం లేకపోవడం దారుణమని పునరుద్ఘాటించిన కవిత..  దేశ వ్యాప్తంగా 14 లక్షల పైచిలుకు మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారన్నారు. కానీ పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా వుందన్నారు.   తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో  మహిళలకు సముచిత స్థానం దక్కలేదన్న విమర్శలకు ఆమె బదులిస్తూ కేసీఆర్ ను సమర్ధించారు. నెహ్రూ కేబినెట్ లో ఒకే ఒక్క మహిళలకు స్థానం ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.  అలాగే ప్రస్తుత మోడీ కేబినెట్ లో నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ మాత్రమే ఉన్నారని ఎత్తి చూపారు.  బీజేపీ పాలిత రాష్ట్రమైన  యూపీలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవని విమర్శించారు. 1996 లో తొలిసారి దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. 2010 లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందన్నారు. కానీ ఇప్పటి వరకూ ఆ బిల్లుకు మోక్షం కలగకపోవడానికి కారణమెవరని నిలదీశారు.   దశాబ్ద కాలంగా  లోక్ సభలో  సంపూర్ణ మెజారిటీ ఉన్నా..  మహిళా రిజర్వేషన్ బిల్లు ను పాస్ చేయకుండా మోడీని అడ్డుకున్నదెవరని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో  డిసెంబర్ లో ధర్నా చేస్తానని తెలిపారు. సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీకి, బీజేపీ మహిళా నేతలకు ఆహ్వానాలు పంపుతామన్నారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకి పడుతుంది అన్న ఎంపీ ఆరవింద్ వ్యాఖ్యలతో ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానం వాస్తవమేనని అనిపిస్తోందని కవిత అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

రాజకీయ వైరంతో దార్శనికుడి ప్రతిభను మరుగున పడేయలేరు!

రాజకీయవైరంతో ఒక దార్శనికుడిని మరుగున పడేయాలను కోవడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోగలమనుకోవడం లాంటి భ్రాంతి మాత్రమే. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విషయంలో అది పదే పదే రుజువౌతోంది.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సాధించిన నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారు  చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే  ఉన్నారు. ఉంటారు.    రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న, వచ్చిన గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తుందేమో కాని అనితర సాధ్యం అనదగ్గ రీతిలో ఆయన సాధించిన విజయాలు, ఆయన చొరవవల్లే.. ఔను కేవలం ఆయన చొరవ, దూరదృష్టి కారణంగానే  జంటనగరాలకు అదనంగా ఆయన నిర్మించిన సైబరాబాద్ మహానగరం, హైదరాబాద్ కు అనేమిటి.. యావద్దేశానికే తలమానికం అనదగ్గ  ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్, ఇండియన్ ఇనిస్టిట్యట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన క్రీడా ప్రాంగణాలు.. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా ఒకటనేమిటి హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు దోహదపడిన ప్రతి ప్రగతి నిర్మాణంలోనూ చెరిగిపోని విధంగా చంద్రబాబు ముద్ర ఉంది. ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి కార్యక్రమం, ఏర్పాటు చేసిన ప్రతి సంస్థ.. రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంతోనే చేశారు. వర్తమానం గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగారు.  ఆ దార్శనికతే  చంద్రబాబుకు ఒక విశిష్ట నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా ఆయన అమెరికా వీధుల్లో ఫైళ్లు పట్టుకుని తిరిగి మరీ ప్రపంచ ప్రఖ్యాల సంస్థలను ఆహ్వానించారు. ఆయన సింప్లిసిటీ, ఆయన దూరదృష్టి కారణంగానే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సమయంలో దేశంలో ఏ రాష్ట్రానికీ రాని విధంగా ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు హైదరాబాద్ కు తరలివచ్చాయి. అలా చంద్రబాబు కృషి వల్ల హైదరాబాద్ వచ్చిన ఐఐఐటీ హెచ్  బుధవారం (ఆగస్టు 23) సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు   పాల్గొంటున్నారు.  ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఆయన బుధవారం ( ఆగస్టు 23) విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చిస్తారు. వారి ప్రశ్నలకు సమాధానమిస్తారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే  1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ రంగాలలో దేశంలోనే నంబర్ వన్ గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ బెంగళూరును అధిగమించి మరీ ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.  హైదరాబాద్ నలుచెరగులా జరిగిన అభివృద్థిలో ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే రాజకీయంగా ఉన్న విభేదాలతో దార్శనికుడి ప్రతిభ మరుగున పడేయాలన్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి.  ఐఐఐటీ హెచ్  సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా దాదాపుగా జాతీయ పత్రికలన్నీ ఆ సంస్థ ఉన్నతి గురించీ, అది హైదరాబాద్ లో ఏర్పాటు కావడం వెనుక ఉన్న చంద్రబాబు దార్శనికత గురించీ  ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాయి. చంద్రబాబు వంటి దార్శనికుడి అవసరం దేశానికి ఎంతో అవసరమంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. 

పాలేరు పాయే... తుమ్మల చూపు ఎటో...? 

బీఆర్ఎస్  జాబితా రిలీజ్ అయింది.. కొందరు నేతలకు టిక్కెట్లు దొరకలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే... ఇద్దరు సీనియర్ నేతలకు మొండి చేయి ఇచ్చారు కేసీఆర్.  కీలక నేతలుగా ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు టికెట్లు దక్కకపోవడం పట్ల జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి పాలేరు నుంచి మాజీమంత్రి తుమ్మలకు అవకాశం కచ్చితంగా ఉంటుందని, సర్వేల్లోనూ ఆయనకే మొగ్గు ఉందన్న ప్రచారం జరిగింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌‌లో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించడంతో పాలేరు టికెట్‌పై ఆశపెట్టుకున్న తుమ్మల భవితవ్యం ఏంటా అన్న చర్చ జరుగుతోంది. ఆయకు సీఎం కేసీఆర్‌ ఎలాంటి భరోసా ఇస్తారన్నది దానిపై ఆయన అభిమానులు....కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అయితే తమ పార్టీలో చేరితే పాలేరు లేదా ఖమ్మం నుంచి బరిలో దింపుతామని కొందరు కాంగ్రెస్‌ నేతలు తుమ్మలకు ఆఫర్లు ఇస్తుండగా.. తుమ్మల మాత్రం తాను బీఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేస్తానన్న ధీమాతో ఇప్పటి వరకు వేచి చూశారని చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తుమ్మల పాలేరులో తాను పోటీ చేయడం ఖాయమని, గోదావరి జలాలతో పాలేరును సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు. కానీ బీఆర్‌ఎస్‌ జాబితాలో ఆయనకు చోటు లేకపోవడంతో ఆయన భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై ఊహాగానాలు నడుస్తున్నాయి. కేసీఆర్‌ ఇచ్చే భరోసాతో తుమ్మల నిర్ణయం ముడిపడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే   జలగం వెంకటరావు తనకు కొత్తగూడెం అభ్యర్థిత్వం దక్కుతుందని ధీమాతో ఉండగా...తాజా జాబితాలో ఆయనకు మొండి చేయి ఇచ్చారు కేసీఆర్.  చోటివ్వకపోవడంతో జలగం కాంగ్రెస్‌ వైపు చూస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికే కొత్తగూడెం టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలో ఉండటంతో.. ఒకవేళ పొంగులేటి పాలేరు లేదా ఖమ్మం వైపు వస్తే జలగం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరి కొత్తగూడెం అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ విషయమై జలగం ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి తుమ్మల, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుల నిర్ణయం కోసం జిల్లా రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉండగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల అభిమానుల సమావేశం స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం జరుగినట్లు సమాచారం. ఈ సమావేశంలో జరిగిన అభిప్రాయ సేకరణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎదుట ఉంచుతామని, తుమ్మల నాగేశ్వరరావు బాటలోనే నడుస్తామని అనుచరుల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలి వెళ్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిసే యోచనలో ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలిసింది. తుమ్మల, జలగం ఎపిసోడ్ లకు ముగింపు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

ఏపీ కాపు నేతతో కేసీఆర్ వరుస సమావేశాలు.. అధికారమే టార్గెట్..?

ఆంధ్రాలో భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ను బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత. కేసీఆర్ ప్రధాన దృష్టి పెట్టారు. ప్రధానంగా అధికారానికి దూరంగా ఉన్న కాపు వర్గాన్ని చేరదీయాలని నిర్ణయిం చుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ సామాజికి వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలను కూడా ఆకర్షించే పని ఒకవైపు సాగుతూనే ఉండగా మరోవైపు ముఖ్యంగా కాపులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో కాపుల భవనానికి అత్యంత ఖరీదైన స్థలం కేటాయించింది. దీంతో కాపుల్లో. కేసిఆర్ పట్ల సానుకూలత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వరుసగా కాపు నేతలు, ప్రముఖులతో కేసీఆర్ సమావేశ మవుతున్నారు. విశ్రాంత ఇన్ కంట్యాక్స్ ఆఫీసర్ మంగిశెట్టి రంగబాబు తమిళనాడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైరైన రామ్మోహనరావులు ఇటీవలే కేసీఆర్ ను కలిసారు. వీరే కాక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ రిటైర్డ్ కాపు అధికారులు, కాపు వ్యాపారస్తులు, కాపు బిల్డర్లు, కాపు సంఘ నేతలు వరుస పెట్టి కేసిఆర్ ను కలుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 మంది నేతలను కలిసి ఉంటారనేది ఒకఅంచనా.  వీరిందరితోనూ ఏపీలో భారసను బలోపేతం చేయడంపై  కేసిఆర్ చర్చిస్తున్నారు. వీరందరూ బీఆర్ ఎస్ కు మద్దతుగా నిలవాలని నిర్ణయిం చుకున్నట్లు సమాచారం. కాపులకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏపీలో రాజకీ యాలు నడపాలని బీఆర్ఎస్  భావిస్తోంది. బీఆర్ఎస్  అధికారం లోకి వస్తే కాపు నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించనున్నారు. ఈ విధంగా కాపుల్లోకి చొచ్చుకుపోవాలని బీఆర్ఎస్  భావిస్తోంది. ఇందుకు మొదటి మెట్టుగా కావులతో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కాపు నేతల నేతృత్వంలో చలో విజయవాడకు పిలుపునివ్వనున్నారు.

రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. కేసీఆర్ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ

కేబినెట్ విస్తరణ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదే. తేన కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఎవరిని తొలగించాలన్న నిర్ణయాధికారంలో మరొకరి జోక్యానికి తావేలేదు. రాజ్యాంగ బద్ధంగా అది ముఖ్యమంత్రికి సంక్రమించిన అధికారం. సీఎం ప్రతిపాదించి పంపిన వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం మాత్రమే గవర్నర్ చేయాల్సింది. చేయగలిగింది. ఈ వ్యవహారంలో కానీ విషయంలో కానీ ఎవరికీ ఎటువంటి అనుమానాలూ, సందేహాలూ లేవు. కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ రాజకీయవర్గాలలోనే కాదు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ రేపుతోంది. ఏం జురుగుతుంది? ఏం జరగబోతోంది? అన్న సస్పెన్స్ రేపుతోంది. ఇంతకీ విషయమేమిటంటే.. రానున్న అసెబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను 105 పేర్లతో కేసీఆర్ ప్రకటించారు. అలా ప్రకటించిన  వెంటనే ఇలా మంత్రివర్గ విస్తరణకు రెడీ అయ్యారు. మంత్రివర్గంలోకి   పట్నం మహేందర్‌రెడ్డిని  తీసుకోవాలని ప్రభుత్వం భావించారు. ప్రమాణ స్వీకారం కోసం సమయం కేటాయించాలంటూ  రాజ్‌భవన్‌కు సోమవారమే ప్రభుత్వం వర్తమానం పంపింది. సప్తమి రోజున మంచి ముహూర్తం కనుక ఆ రోజు అంటే బుధవారం(ఆగస్టు 23)న ఆ కార్యక్రమం  ఖరారు చేయాలని విజ్ణప్తి కూడా చేసింది.  ఉదయం 11.30 గంటలకు మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు  ప్రభుత్వం నుంచి లీకులు కూడా వచ్చాయి. స్వయంగా  పట్నం  మహేందర్ రెడ్డే మీడియాతో చిట్ చాట్ చేస్తూ తన ప్రమాణ స్వీకారం బుధవారం (ఆగస్టు 23) ఉదయం పదకొండున్నరకు ఉంటుందని కూడా చెప్పారు.  అయితే రాజ్ భవన్ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. అప్పాయింట్ మెంట్ కూడా ఫిక్స్ కలేదు.   ఆమె డెంటల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనీ,  అందుకే అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదనీ రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.   గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్  సోమవారం (ఆగస్టు 21 వరకూ  పుదుచ్చేరిలో ఉన్నారు. మంగళవారం అంతా ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం తమ వినతి మేరకు  బుధవారం (ఆగస్టు 23) ప్రమాణ స్వీకార  కార్యక్రమం బుధవారం జరిపించేందుకు ఎటువంటి అవాంతరం ఉండదని భావించినప్పటికీ రాజ్‌భవన్ నుంచి  సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ మొదలైంది. ఆమె నుంచి ఎప్పుడు సమాచారం వస్తుందా అని టెన్షన్ పడుతోంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ విభేదాలే ఈ జాప్యానికి కారణమా అన్న అనుమానాలూ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

వైసీపీలో తెరపైకి వారసులు.. రెడ్డి సామాజిక వర్గ వారేనా?

పాత తరం పోతే కొత్త తరం వస్తుంది. రాజకీయాలలోనే కాదు ఏ రంగంలో అయినా ఈ మార్పు అనివార్యం. అవసరం కూడా. అయితే, రాజకీయాలలో కొందరి వారసులు మాత్రమే కొత్త తరం నేతలుగా ఎదుగుతుంటారు.  గతంలో వారసులంటే కేవలం కుమారులే కాగా ఇప్పుడు వారసురాలుగా కుమార్తెలు కూడా రాజకీయాలలో అడుగు పెడుతున్నారు. కాగా  ఏపీలో కూడా ఎన్నికల కదలిక మొదలవుతున్నది. ఇప్పటికే తెలంగాణ అధికార బీఆర్ఎస్  అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. మిగిలిన పార్టీలు కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక లో ఉన్నాయి.  నేడో రేపో జాబితాలు ప్రకటించేస్తాయి. కాగా ఏపీ విషయానికి వస్తే అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే పలు సర్వేల ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు  మొదలు పెట్టింది. గత ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం దక్కించుకోగా ఇప్పుడు ఆ 151 మందిలో ఎంతమందికి టికెట్లు దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది. యాభైకి పైగా స్థానాలలో ఈసారి మార్పు తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల వారసులను రంగంలోకి దింపాలని సీనియర్ నేతలు ఆశపడుతున్నారు. తమ ఆశ నెరవేర్చుకునేందుకు తమ వంతు కృషి కూడా చేస్తున్నారు. ఈసారి ఎన్నికలకు తమ స్థానంలో తమ వారసులకు టికెట్లు కేటాయించాలని కొందరు నేతలు ఆశపడుతుంటే.. మరి కొందరు మాత్రం తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లు కావాలని అధిష్ఠానం వద్ద పట్టుబడుతున్నారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే తన వారసుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. రామచంద్రాపురం నుంచి పిల్లి సూర్య ప్రకాష్ పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. ఇక్కడ చెల్లుబోయిన గోపాలక్రిష్ణకు మరోసారి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు వెనుకాడబోమని కూడా సుభాష్ పేర్కొన్నారు. అధిష్టానం పిలిచి బుజ్జగించడంతో కాస్త సైలెంట్ గా ఉన్నారు. అయితే  టికెట్ కేటాయించకపోతే అనుకున్నది చేసేలా ఉన్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే తన   కుమారుడు అభినయ్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ్ రెడ్డి నియోజకవర్గంలో అన్నీ తానై నడిపిస్తున్నారు.  అలాగే ఇదే చిత్తూరు జిల్లా నుండి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మోహిత్ రెడ్డి ఈ మధ్యనే తుడా చైర్మన్ పదవి కూడా అప్పగించారు. మోహిత్ కూడా చంద్రగిరి రాజకీయాలన్నీ తన చేతుల మీదుగానే నడిపిస్తున్నారు. ఇక మరో ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మంత్రి విశ్వరూప్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా చాలామంది తమ వారసులను ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికలలోకి దింపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఇప్పటికే కొంతమంది అధిష్టానం వద్ద విన్నపాలు చేసుకోగా ఒకరిద్దరు అయితే ఏకంగా అల్టిమేటం జారీచేసినట్లుగా చెప్తున్నారు.  అయితే, ఎంతమంది నేతలు తమ వారసుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి మాత్రమే ఈ విషయంలో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రెడ్డి సామజిక వర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిలకు ఇప్పటికే టికెట్లు ఖరారు కాగా.. శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్రారెడ్డి పోటీ చేయడం కూడా దాదాపుగా ఖరారైనట్లేనని చెప్తున్నారు. ఇక బాలినేని, వైవీ సుబ్బారెడ్డిల వారసుల ఎంట్రీపై కూడా కసరత్తులు మొదలు కాగా.. రానున్న ఎన్నికలలో వారికి టికెట్లు దక్కినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. ఈ రెడ్డి సామాజికవర్గ నేతల వారసులు కాకుండా మిగతా నేతల వారసులకు మాత్రం ఈసారి కూడా మొండి చేయే అనే ప్రచారం వైసీపీ వర్గాలలో జోరుగా  సాగుతోంది.   ఉదాహరణకు పిల్లి సుభాష్ వారసుడి స్థానంలో చెల్లుబోయినకే దాదాపుగా టికెట్ ఇవ్వనున్నారు. ఇక పేర్ని నానీ, ధర్మాన, తమ్మినేని వారసులకు ఇంకా సమయం ఉందని ఇప్పటికే పరోక్షంగా జగన్ సూచనలు చేసినట్లు తెలుస్తున్నది. దీని బట్టి చూస్తే వైసీపీలో వారసులు వస్తారు.. కానీ ఒక సామజిక వర్గానికి చెందిన యువనాయకులకు మాత్రమే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

టీటీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 21వ తేదీన తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడన జాబితాను విడుదల చేశారు. దీంతో తెలంగాణలోని మిగిలిన రాజకీయ పార్టీలు టీ కాంగ్రెస్, టీ బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపిక పనిలో ఆయా పార్టీ అధినేతలు నిమగ్నమయ్యారు.   అలాంటి వేళ.. తెలంగాణ టీడీపీ అభ్యర్థుల ఎంపికకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో ఆగస్ట్ 21వ తేదీన చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్‌తోపాటు రావుల చంద్రశేఖరరెడ్డి భేటీ అయ్యారు. అందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల ఎంపికపై వారు ఈ సందర్భంగా కూలంకుషంగా చర్చిస్తున్నారు.  అయితే తొలి విడతగా కొంత మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేయాలని.. వారిని సైతం ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి విడతగా 36 మంది అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారని సమాచారం. అలాగే మరికొంత మంది అభ్యర్థులతో భేటీ అయి... వారి జాబితాను సైతం మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత వారంత.. దాదాపుగా సైకిల్ దిగి.. కారు పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో పసుపు పార్టీ ప్రాభావం కొంత తగ్గింది. ఇక 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం రెండు సీట్లను మాత్రం గెలుచుకొంది.  ఆ తర్వాత వారు సైతం కారు పార్టీలోకి జంప్ జిలానీ రాగం ఆలపించడంతో.. తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి నాయకులు లేకపోయినా.. కేడర్ మాత్రం కేసీపీ సిమెంట్‌లాగా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్న సంగతి విషయం అందరికీ తెలిసిందే.  అటువంటి పరిస్థితుల్లో.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ మార్చేశారు. దీంతో బీఆర్ఎస్‌లో తెలంగాణ పదం లేకుండా పోయింది. మరోవైపు 2022, నవంబర్‌లో ఖమ్మంలో టీటీడీపీ శంఖారావం పేరిట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది.   ఈ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అంతే తెలంగాణలో పసుపు పార్టీ.. రంగు ఏ మాత్రం వెలిసిపోలేదని తెలుగు రాష్ట్ర ప్రజలకు క్లియర్ కట్‌గా అర్థమై పోయింది. అంతే.. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా.. టీడీపీ మరో సభ నిర్వహించగా.. ఈ సభకు సైతం భారీగా తెలుగు తమ్ముళ్లు పోటెత్తారు. ఈ ఊపు ఉత్సాహంతో ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టిందీ టీటీడీపీ. అందులోభాగంగా మొత్తం నియోజకవర్గాల్లోని ప్రతీ మారుమూల ప్రాంతానికి ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు తీసుకు వెళ్లాయి. తీసుకు వెళ్తున్నాయి.  అందులోభాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు... అలాగే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లీ మరి వివరిస్తున్నాయి పార్టీ వర్గాలు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో సైతం చైతన్యం విల్లువిరుస్తోంది. అలాగే సైకిల్ పార్టీ శ్రేణుల్లో సైతం నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  మరోవైపు ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఈ సారి ఎలాగైనా కేసీఆర్ ‌ను గద్దె దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం సైతం పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకు వెళ్తోంది.  అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన నిత్యం  ప్రజల్లోనే ఉంటూ... సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఆయన సారథ్యంలో దౌడు తీయిస్తున్నారు.  అలాంటి వేళ తెలంగాణలో టీడీపీ సైతం.. ఆయా పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి.. సైకిల్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వచ్చి.. తన సత్తా చాటేందుకు టీడీపీ శ్రేణులు.. పక్కా వ్యూహాంతో కదం తొక్కుతూ ముందుకు సాగుతోన్నాయి.

షాక్‌లో పుష్ప ఫ్యామిలీ..!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ఫ. ఈ చిత్రం మొదటి భాగం.. దేశవ్యాప్తంగా వసూళ్ల రికార్డ్‌ సృష్టించింది. ఈ చిత్రం రెండో భాగం.. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. అయితే ఈ చిత్ర తొలి భాగంలో హీరో అల్లు అర్జున్.. ఎర్రచందనం స్మగ్లర్‌గా అందరికీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంటే.. రియల్ లైఫ్‌లో మాత్రం.. అల్లు అర్జున్‌తో పాటు ఆయన మామ గారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు.  అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు.. తన వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారు. అయితే ఆగస్ట్ 19వ తేదీన నాగార్జున సాగర్‌లో కంచర్ల కన్వెన్షన్ ప్లేస్‌ పేరుతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  అయితే ఆ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన రెండు రోజులకే అంటే ఆగస్ట్ 21వ తేదీన.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగనున్న 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో అల్లు అర్జున్ మామ గారు పేరు లేదు. ఆ అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే నోముల భగత్ పేరునే పార్టీ అధినేత ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్‌ మామకు కేసీఆర్ ఝలక్ ఇచ్చినట్లు అయింది. మరోవైపు 2014లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహింపట్నం అసెంబ్లీ స్థానం నుంచి నాటి టీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. ఇక నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ కోసం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనే ఓ చర్చ సైతం స్థానికంగా కొన.. సాగుతోంది.  ఇక 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, హోం శాఖ మాజీ మంత్రి కె. జానారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత నోముల నర్సింహయ్య మరణంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన కుమారుడు నోములు భగత్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయన ఘన విజయం సాధించారు. కానీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ నోముల భగత్‌కే బీఆర్ఎస్ అధినాయకత్వం టికెట్ కేటాయించడం గమనార్హం.

యార్లగడ్డ జంప్.. జగన్ రాయబారం !

గన్నవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావ్.. అధికార ఫ్యాన్ పార్టీ వీడి.. సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. ఆ క్రమంలో ఆదివారం అంటే ఆగస్ట్ 20వ తేదీ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో యార్లగడ్డ వెంకట్రావ్‌ భేటీ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు గన్నవరం నియోజకవర్గ వ్యవహారంపై స్తబ్దుగా ఉన్నా.. ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ అదే రోజు.. అంటే ఆగస్ట్ 20వ తేదీ.. గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఫ్యాన్ పార్టీ కీలక నేత దుట్టా రామచంద్రరావుతోపాటు అతడి కుమార్తె, అల్లుడు శివభరత్‌రెడ్డిని.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలుపించుకొని..  వారితో వైయస్ జగన్ భేటీ అయి.. వారికి భవిష్యత్తు భరోసా ఇచ్చారు.  ఈ బేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని.. త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన ప్రకటించడం.. నాయకులు వస్తుంటారు, వెళ్తూంటారు.. కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతమని.. అలాగే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. ఇక వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌ని గెలిపించుకొనేందుకు మనమందరం కష్టపడాలంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. తమకు వైయస్ కుటుంబంతో 45 ఏళ్లు అనుబంధం ఉందని ఈ సందర్భంగా దుట్టా గుర్తు చేసుకొన్నారు.  అయితే ఇటు యార్లగడ్డ సైకిల్ పార్టీలోకి దూకేయడం.. అటు సీఎం జగన్‌తో దుట్టా రామచంద్రరావు భేటీ కావడం.. ఈ రెండు భేటీలు ఒకే రోజు కావడం.. ఆ వెంటనే దుట్టా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్ పార్టీ శ్రేణులకు ధైర్య వచనాలు చెప్పడంపై పోలిటికల్ సర్కిల్‌లో ఊహాగానాలు ఊపందుకొన్నాయి.    యార్లగడ్డ వెంకట్రావ్ ఇటీవల ఆయన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్ పార్టీ అగ్రనేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం వైయస్ జగన్ అపాయింట్‌మెంటి ఇవ్వడం లేదని.. అలాగే పార్టీ స్థాపించిన నాటి నుంచి వైయస్ జగన్ కోసం కష్టపడుతోన్న దుట్టా రామచంద్రరావు లాంటి వారిని సైతం పదవులకు దూరంగా పెట్టారని..... అంతేకాకుండా వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వారం, రెండు వారాల ముందు ఫ్యాన్ పార్టీలో చేరిన.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి చెందిన మాజీ మంత్రి ఎం హనుమంతరావు లాంటి వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారంటూ వైయస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. మరి ఫ్యాన్ పార్టీ ఎదుగుదల కోసం కష్టపడిన దుట్టా రామచంద్రరావులాంటి వారు.. మీకు గుర్తుకు రాలేదా? అంటూ ఇదే సమావేశంలో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలను యార్లగడ్డ వెంకట్రావ్ కడిగి పారేశారు.   దీంతో యార్లగడ్డ వెంకట్రావ్ సైకిల్ పార్టీలోకి వెళ్లిపోతే.... దుట్టా రామచంద్రరావుతోపాటు ఆయన వర్గం సైతం యార్లగడ్డ బాట పట్టేస్తారని సీఎం జగన్ భావించి.. తనతో భేటీ కావాలంటూ దుట్టా రామచంద్రరావుకు ఆగమేఘాల మీద ఫ్యాన్ పార్టీ అధినేత రాయబారం పంపినట్లు ఓ టాక్ అయితే పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్రరావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. దీంతో దుట్టా సైతం పార్టీ మారితే.. గన్నవరంలో ఫ్యాన్ పార్టీ గెలుపు గల్లంతు అయ్యే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆ తర్వాత ఆయన జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో గన్నవరం నుంచి గట్టి అభ్యర్థిని బరిలో దింపేందుకు టీడీపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. అలాంటి వేళ... యార్లగడ్డ సైకిల్ పార్టీలో చేరడం వల్ల... పసుపు పార్టీకి మరింత బలం చేకూరుతోందనే ఓ చర్చ సైతం నడుస్తోంది. ఇంకోవైపు.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని.. దుట్టా రామచంద్రరావు అల్లుడు, సీఎం వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ సమీప బంధువు శివ భరత్ రెడ్డి ఆశిస్తున్నారు. గత ఎన్నికల వేళే.. దుట్టా అల్లుడు గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదు. కానీ ఈ సారి ఆయన సైతం తన ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదీకాక గన్నవరం సీటు వల్లభనేని వంశీకే అని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారని ఓ చర్చ అయితే ఆ నియోజకవర్గంలో ప్రచారంలో ఉంది. మరి అలాంటి వేళ వచ్చే ఎన్నికల్లో వంశీ, శివభరత్ రెడ్డి మధ్య పోటీ ఉండే అవకాశాలు లేకపోలేదనే ఓ చర్చ సైతం వాడి వేడిగా సదరు సర్కిల్‌లో నడుస్తోంది.  ఎందుకంటే గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని ప్రజల్లో వల్లభనేని వంశీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అదీ కూడా చాపకింద నీరులా ఉందనే ఓ చర్చ అయితే ఉందని... దీంతో ఎన్నికలు సమీపించగానే.. ఇదే అంశాన్ని సాకుగా చూపి... వైయస్ భారతీ సమీప బంధువు శివ భరత్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ తెరపైకి తీసుకు వచ్చినా అందులో ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో కొన.. సాగుతోంది.  మరి వచ్చే ఎన్నికల్లో అదీ.. గన్నవరం లాంటి హాట్ సీట్‌ కోసం టీడీపీ నుంచి యార్లగడ్డ బరిలోకి దిగితే.. ఫ్యాన్ పార్టీ నుంచి వల్లభనేని వంశీనా? లేకుంటే శివ భరత్ రెడ్డా? ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అనే అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగినా.. ఆ ఎమ్మెల్యే స్థానాన్ని ఏ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకొంటారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో మాత్రం అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది.

కవిత కోసం కామారెడ్డికి..

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. తనపై, తన పరిపాలనపై తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం క్లియర్ కట్‌గా అర్థమైందా? ఆ క్రమంలోనే ఆయన కామారెడ్డి నుంచి కూడా ఎన్నికల బరిలోకి దిగాలని  నిర్ణయించుకొన్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలోకి దిగితే.. ఆ చుట్టు పక్కల ఉన్న జిల్లాలు.. నిజామాబాద్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్‌లపై కూడా ఆయన గెలుపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని... అలాగే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్లీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. పోటీకి దిగితే.. ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందనే ఓ చర్చ సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.  ఎందుకంటే.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మపూరి అర్వింద్ చేతిలో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఈ సారి ధర్మపూరి అర్వింది.. ఎంపీగా లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. అలాంటి వేళ.. ఈ జిల్లాలో కేసీఆర్ పోటీ చేస్తే... అతడి విజయాన్నే కాదు.. బీజేపీ ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు అడ్డుకోవచ్చుననే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.  అదీకాక.. దక్షిణ తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా వేళ్లూనుకొంటొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాల నుంచి బరిలో దిగే కంటే.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కారు పార్టీని షికార్ చేయిస్తే.. అది తనకు తన ఫ్యామిలీకి రాజకీయంగా కలిసి వస్తుందనే ఓ ఆలోచనతో కామారెడ్డి నుంచి బరిలోకి దిగేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది.  అదీకాక.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిని గంపగుత్తగా గెలుచుకొంటే.. దేశ రాజధాని హస్తిన పీఠాన్ని సునాయాసంగా కైవనం చేసుకోవచ్చునన్న విషయం అందరికి తెలిసిందే.  అందుకే ప్రధాని మోదీ గతంలో సొంత రాష్ట్రం గుజరాత్‌లోని బరోడా నుంచే కాకుండా.. యూపీలోని వారణాసి నుంచి కూడా పోటీ చేసి.. రెండు చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బరోడా లోక్‌సభ స్థానాన్ని వదులుకోగా.. సదరు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందిన విషయం విధితమే.   దాదాపుగా అటువంటి ఆలోచనే.. గులాబీ బాస్ చేస్తున్నారని.. అయితే తన సొంత జిల్లా ఉమ్మడి మెదక్ నుంచి దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నా.. ప్రస్తుతం సదరు జిల్లాలో తనకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు రావడంతో.. ఆయన అప్రమత్తమై.. అటు గజ్వేల్ నుంచి ఇటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం... ఓ వేళ రెండు చోట్లు నుంచి గెలుపొందితే.. ఆ తర్వాత కామారెడ్డికి కేసీఆర్ రాజీనామా చేసి.. ఆ స్థానం నుంచి తన కుమార్తె కవితను గెలుపించుకొని.. అసెంబ్లీకి తీసుకువెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం తెలంగాణ పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.       మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత....తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ ఫలితాలతో తెలంగాణలో బీజేపీ కొద్దిగా డల్ అయింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పుకు కమలం పార్టీ అగ్రనేతలు శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపుతో తెలంగాణలోని ఆ పార్టీకి నయా జోష్ వచ్చినట్లు అయింది. ఆ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ సారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అలాంటి పరిస్థితుల్లో ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడం కోసం.. తెలంగాణలో కారు పార్టీని షికార్ చేయించడం కోసం.. గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే కామారెడ్డి నుంచి పోటీ చేయమని పార్టీ శ్రేణులు కొరాయంటూ.. ఆయన కొత్త పల్లవి అందుకోవడం వెనుక ఇంత కథ ఉందని పోలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

గోషామహల్, నాంపల్లి అభ్యర్థులు ఎందుకు పెండింగ్ ?

కేసీఆర్ మొదటి జాబితాలో  పెండింగ్ లో పెట్టిన నాలుగు స్థానాల్లో రెండు అసెంబ్లీ హైద్రాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఒకటి గోషామహల్ అయితే రెండోది నాంపల్లి. గోషామహల్ అసెంబ్లీ స్థానానికి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిద్యం వహిస్తుండగా నాంపల్లి నియోజక వర్గానికి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రాతినిద్యం వహిస్తున్నారు.  ప్రస్తుతం రాజాసింగ్ బిజెపి నుంచి బహిష్కృతులయ్యారు. ఈ సారి ఆయన రాజకీయ భవితవ్యం ఇంకా తేల లేదు. తాను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవచ్చని రాజాసింగ్ ఇప్పటికే ప్రకటించారు. బిజెపి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. సిట్టింగ్ బిజెపి స్థానాన్ని బిఆర్ఎస్ వదులుకోబోతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. 2018లో ఈ స్థానం నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి రాజా సింగ్ చేతిలో పరాజయం చెందారు. అంతకుముందు ప్రేమ్ సింగ్ రాథోడ్ బిజెపి నుంచి మహరాజ్ గంజ్   ఎమ్మెల్యేగా గెలిచారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యధికంగా ఉన్నారు.  ఉత్తరాది అభ్యర్థిని రంగంలో దించాలని బిఆర్ఎస్ భావిస్తోంది. తన ఓటమి తర్వాత గోషామహల్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా కొనసాగిన రాథోడ్ ప్రస్తుతం తప్పుకున్నారు.టిక్కెట్ కోసం కూడా ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. అయితే బిఆర్ఎస్ నుంచి మరో నేత నందకిషోర్ పేరు గోషామహల్ అభ్యర్థి అని వినిపిస్తుంది. బిజెపి బీ టీం అని నింద ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ అభ్యర్థి గోషామహల్ నుంచి బలహీన అభ్యర్థిని రంగంలో దించవచ్చన్న టాక్ ఉంది.  కాగా నాంపల్లి స్థానానికి ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ మిత్ర పక్షం అని ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీలతో మిత్ర ధర్మం నెరవేర్చని కేసీఆర్ మజ్లిస్ తో  మిత్ర ధర్మం పాటించవచ్చు అని పరిశీలకులు అంటున్నారు. కాని పైకి మాత్రం వెల్లడించకపోవచ్చు. 

కాంగ్రెస్ తరఫున పోటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దరఖాస్తు

గత ఎన్నికల తరువాత ఆపరేషన్ ఆకర్ష్ పేర ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గూటికి చేర్చుకున్న కేసీఆర్ కు ఇప్పుడు ఈ ఏడాది చివరిలో జగనున్న ఎన్నికల సమయంలో అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఎదురు కానున్నాయా? బీఆర్ఎస్ సిట్టింగులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారా? వారు జెండా మార్చేసేందుకు రెడీ అవుతున్నారా? అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయడమే లక్ష్యంగా ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్.. ఇక పార్టీలో ఇంత కాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సెగలను ఎదుర్కొనక తప్పదా? ఇప్పటికే కేసీఆర్ జాబితా ప్రకటించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంగళవారం (ఆగస్టు 21) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రేఖా నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. రేఖానాయక్ పీఏ గాంధీ భవన్ కు వెళ్లి అక్కడ రేఖా నాయక్ దరఖాస్తును అందించారు. కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన గంటల వ్యవధిలో రేఖా నాయక్, ఆమె భర్త శ్యాం నాయక్ లు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇప్పుడు రేఖా నాయక్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి గాంధీ భవన్ లో దరఖాస్తు చేయగా, ఆమె భర్త శ్యాం నాయక్ కూడా ఆసీఫా బాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ఓ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు.  

ఉద్యమ కారులకు కారులో చోటేది?

తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. అధికారికంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి ఎన్నికల నగారా మోగించేశారు. సీఎం కేసీఆర్ సోమవారం(ఆగస్టు 21) 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం సిట్టింగ్ లకే సీట్లు కేటాయించారు. అటు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుండగా.. మిగతా కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా వారి వారి సిట్టింగ్ స్థానాలలోనే సీట్లు ఖరారు చేశారు. బీఆర్ఎస్ జాబితా బయటకు రావడంతో ఇక అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టగా.. టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తులు మెల్లిగా తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలు రచించుకొనే పనిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు. మరొక్క వారం రోజులు ఆగితే ఈ అసంతృప్తులలో ఎంత మంది పార్టీలో ఉంటారో.. రెబల్స్ గా మారేది ఎవరో.. పార్టీని వీడి మరో పార్టీకి జంప్ చేసేది ఎవరో   స్పష్టత వచ్చే అవకాశం ఉంది.   యధావిధిగా ఈసారి ఎన్నికలలో కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కాలం నుండి కీలకంగా పని చేసిన కొందరిని పక్కన పెట్టేశారు. గత ఎన్నికలలో కూడా తెలంగాణ ఉద్యమ నేతలకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. ఈసారి కూడా అదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఉద్యమకారులకు కొందరికి మొండి చేయి మిగిలించి బంగారు తెలంగాణ కోసమే అంటూ పక్క పార్టీల నుండి వచ్చిన వలస వచ్చిన నేతలకు టికెట్లు లభించాయి. నిజానికి 2014లో పెద్ద ఎత్తున ఉద్యమ నేతలకు టికెట్లు ఇచ్చారు. వారిలో కొద్ది మంది మినహా అంతా ఓటమి పాలయ్యారు. ఆ  తరువాత బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేర టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వలసలను ప్రోత్సహించారు. అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీలో వారిదే హవా.. వారికే సీట్లు దక్కుతున్నాయి. దీంతో ఉద్యమకారులకు ఎలాంటి పదవులూ లేకుండా పోయాయి. దీంతో కొంతమంది ఇప్పటికే తమదారి తాము చూసుకోగా.. ఒకరిద్దరు సొంత పార్టీలతో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.  టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కలిసి నడిచిన నల్గొండ జిల్లాకు చెందిన చాడ కిషన్‌ రెడ్డి, వేముల వీరేశం, ఖమ్మం జిల్లాకు చెందిన బొమ్మెర రామ్మూర్తి, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్‌ గౌడ్‌, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కేఎస్‌ రత్నం లాంటి చాలామంది సీనియర్‌ నేతలకు ఈ సారి జాబితాలో కూడా చోటు దక్కలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్య, ఉప్పల్‌ సుభాష్ రెడ్డి, ఖానాపూర్‌ రేఖా నాయక్, వేములవాడ చెన్నమనేని రమేష్, వైరా రాములు నాయక్, బోథ్ రాథోడ్ బాపూరావు, అసిఫాబాద్ ఆత్రం సక్కు,  కామారెడ్డి గంప గోవర్ధన్ తదితరులు సిట్టింగులే అయినా వీరెవరికీ   ఈసారి కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదు. వీరిలో దాదాపుగా అందరూ ఉద్యమ కాలం నుంచీ పార్టీతో కలిసి నడిచిన వారే. ఒకరిద్దరు మాత్రమే ఇతర కారణాల చేత టికెట్లు దక్కించుకోలేకపోయారు. దీంతో వీరంతా అసంతృప్తితో తమ తదుపరి కార్యాచరణను రచించుకొనే పనిలో పడ్డారు.  ఈ నేతల్లో చాలామంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. విలువైన భవిష్యత్తును వదులుకొని ఆనాటి టీఆర్ఎస్ జెండా మోశారు. సకల జనుల సమ్మె నుండి వంటా వార్పు వరకు వారే ముందు నడిచారు. పోలీసులతో దెబ్బలు తిన్నారు. కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత తమ త్యాగానికి గుర్తింపు లభిస్తుందని సంబరపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ఉద్యమ కాలంలో ఎవరి చేతిలో అయితే వారు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొన్నారో.. ఇప్పుడు  వారే అధికారాన్ని చెలాయిస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. కొద్దో గొప్పో మొన్నటిదాకా ఎంతో కొంత విలువ ఉంది. ఈసారి అయినా టికెట్లు దక్కకపోతుందా అని ఆశతో ఉన్నా.. ఇప్పుడిక ఆ ఆశలు కూడా ఆవిరవడంతో తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు‌... జగన్‌పై బండి సంజయ్ ఫైర్

బీజేపీ నేత బండి సంజయ్ ... వైసీపీపై దాడి మొదలెట్టారు.. జగన్ ఈ సారి అధికారంలోకి రావడం అసంభవం అన్నారు.  తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్‌దే. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం  బ్రాండ్లు రిలీజ్ చేస్తారా?... అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బండి విరుచుకుపడుతున్నారు. ఇప్పుడున్న ఏపీలో మాదిరిగా దేశంలోనూ ఆనాడు బీజేపీని హేళన చేశారు. ఏమైంది?. హేళన చేసిన పార్టీలే నామరూపాల్లేకుండా పోయాయి. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది. కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందనేదని బండి సంజయ్ ఆంటున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. అనంతపురం జెడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన సృష్టిస్తూ రాకుండా చేస్తున్నారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా?. వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలి. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ. ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా?. నేను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా?. ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నాడట.మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో. నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారు. పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణనమని బండి సంజయ్ మండిపడుతున్నారు. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. మనమధ్య మనస్పర్ధల్లేవ్. అందరం బాగుండాలని అనుకుంటున్నాం. ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. మీరు హిందువులుగా ఆలోచించండి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నయ్. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఒక మతానికే కొమ్ముకాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు?. జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు. ఓటర్ చైతన్య మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్... వైసీపీపై ఈ విధంగా దాడి చేశారు. భవిష్యత్తులో... బండి విమర్శల చక్రాల కింద... వైసీపీ నలగక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాటికొండ రాజయ్య... నీ టైం అస్సలు  బాగోలేదయ్య...!

అది ముందుగా ఊహించినదే...  మొదటి నుంచి జరిగిన ప్రచారమే..చివరికి నిజమైంది.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు చుక్కెదురైంది. ఈ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అభ్యర్థుల మొదటి జాబితాలో కడియం పేరును ప్రకటించారు. దీంతో  టికెట్ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతోపాటు ఆయన అనుచరులకు భంగపాటు తప్పలేదు. తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్‌ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగారని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ లేదా బీఎస్‌పీలో చేరాలంటున్నట్టు రాజయ్య వర్గీయులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజయ్య మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అసలు..రాజయ్యకు టిక్కెట్ రాకపోవడానికి పెద్ద కారణం.. జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలు. ఈ వ్యవహారం తాటికొండ రాజయ్య ఇమేజ్‌ని బాగా దెబ్బతీసింది. నవ్య ఎపిసోడ్‌ రచ్చకెక్కడం, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారంతో ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికెళ్లింది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కడియం శ్రీహరి ఈసారి స్టేషన్‌పూర్ టికెట్ ఇస్తే గెలిపించి చూపిస్తానని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ అధిష్టానం కడియం వైపే మొగ్గుచూపింది. బీఆర్ఎస్ మొదటి జాబితాలో కడియం శ్రీహరి పేరు రావడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఏదైనా... లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్యకు... జనం ఆదరిస్తారా...? ఇప్పుడైతే.. ఆయన టైం అసలు ఏమీ బాగోలేదు.. టైం బాగోనప్పుడు... ఏది చేసినా... కలిసి రాదు.

కేసీఆర్ కోసం జగన్.. జగన్ కోసం షర్మిల.. పాపం కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో నానాటికీ తీసికట్లు నాగంభొట్లు అన్నట్లుగా తయారౌతోంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో నామ మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ ను బలోపేతం చేసే ఉద్దేశంతో అధిష్ఠానం షర్మిల అనే తురఫు ముక్కను ఉపయోగించాలని శతథా ప్రయత్నిస్తోంది. అందుకే తెలంగాణలో వైఎస్సార్టీపీ పేర సొంత కుంపటి పెట్టుకుని తన మానాన తాను నడక దారిలో సాగుతున్న షర్మిలకు కాంగ్రెస్ గాలం వేసింది.  2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ష‌ర్మిల స్థాపించారు. తానే అధ్య‌క్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో ప‌రుగులు పెట్టించారు. ఫండింగ్ ఎంత ఖర్చు చేశారు.. ప్రణాళికలు ఎవరు రచించారన్నది తెలియదు కానీ వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది. నాయ‌కుల చేరిక‌లు, పాద‌యాత్ర‌, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు.. ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది. కానీ ఆ త‌ర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్ర‌జ‌ల్లోకి పార్టీ వెళ్ల‌లేక‌పోయింది. మ‌రోవైపు కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. షర్మిల ఎంత కష్టపడినా, పాదయాత్ర, దీక్షలు, ప్రధాన రాజకీయ పార్టీలను మించి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించినా ఆ రాష్ట్ర జనం మాత్రం షర్మిలను పదె్దగా విశ్వసించినట్లు కనబడదు. సమైక్య వాది అయిన రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని తీసుకు వస్తానంటూ ఆమె తెలంగాణలో చేస్తున్న రాజకీయం ఏ మాత్రం ఆమెకు ప్రజాదరణను తీసుకువస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లైంది. కర్నాటకలో సాధించగలిగినప్పుడు దేశం మొత్తం ఎందుకు సాధించలేం అనుకుంది. అలాగే ఏపీలో కూడా బలోపేతం కాగలమన్న విశ్వాసం వచ్చింది. అప్పుడే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని ఆమెకు ఏపీ పగ్గాలప్పగిస్తే తమ పని సులువు అవుతుందని భావించింది. అంతే వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న కేవీపీ, కర్నాటక డిప్యూటీ సీఎం డీకేలను రంగంలోకి దింపింది. కాగల కార్యం వారే తీరుస్తారని భావించింది. అనుకున్నట్లే  అంతా జరుగుతోందని కాంగ్రెస్ భావించింది. అంతా బానే ఉందనుకుంటున్న సమయంలో కథ మళ్లీ మొదటికి వచ్చింది.   ఏపీలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన సూచనల్ని షర్మిల తిరస్కరించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు.  తన రాజకీయం తెలంగాణకు మాత్రమే పరిమితమని కాంగ్రెస్ కు తేటతెల్లం చేశారని అంటున్నారు.  అయితే  షర్మిల పార్టీని విలీనం చేసుకుని ఆమె తెలంగాణలో క్రియాశీలంగా పని చేస్తే అది తమకు తీరని నష్టం చేస్తుందని భావించిన కాంగ్రెస్ అందుకు తిరస్కరించిందని చెబుతున్నారు. దీంతో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదన ప్రతిపాదన దశలోనే ఆగిపోయిందని చెబుతున్నారు.  షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ బాధ్యతలు తీసుకుంటే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ బావిస్తోంది. మొత్తంగా షర్మిల రాజకీయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్ రెడ్డి, కేసీఆర్ ల మైత్రిలో భాగంగానే షర్మిల తెలంగాణలో పని చేస్తున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఆమె తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువ కాలాని ప్రయత్నిస్తున్నా జనం పట్టించుకోలేదు. కానీ ఆమెను అందరి కన్నా ఎక్కువగా పట్టించుకుని ఆమెకు, ఆమె పార్టీకి హైప్ ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ చేయగలిగినంతా చేసింది. చేస్తోంది. అరెస్టులు, హౌస్ అరెస్టులతో ఆమె నిత్యం వార్తలలో నిలిచేలా కేసీఆర్ సర్కార్ సహకారం అందిస్తోంది. దీంతో ఆమె కేసీఆర్ కోసం తెలంగాణలో జగన్ బాణంగా పని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నతో విబేధాల కారణంగా తెలంగాణలో పార్టీ అని షర్మిల చెప్పడంలో లాజిక్ కనిపించడం లేదనీ, నిజంగా అన్న జగన్ తో విభేదాలు ఉంటే.. ఆమె ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు.