రాజస్థాన్ కాంగ్రెస్ ఇక గాడిన పడినట్లేనా?
రాజస్థాన్ లో పార్టీలో విభేదాలను చల్లార్చడానికి, రాష్ట్ర నేతలంతా ఐక్యంగా పని చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఫలిస్తుందా? సీడబ్ల్యుసిలోకి పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక కమిటీలోకి తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సంవత్సరం చివర్లో (నవంబర్, డిసెంబర్ నెలల్లో) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం కూడా లేదు. మరోవంక ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. హోం మంత్రి అమిత షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఇతర నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు.
కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతమౌతోంది. రాష్ట్ర పార్టీలో ఉన్నత స్థాయి నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీఎన్నికల సన్నాహకాలకు అడ్డంకిగా మారాయి. కాంగ్రస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు, గ్రూప్ రాజకీయాలు కొత్త కాదు. రాజస్థాన్ లో అయితే గత నాలుగు సంవత్సరాలుగా గెహ్లాట్, పైలట్ వర్గాల విభేదాలు, తగవులు, ఘర్షణలు డైలీ సీరియల్ లా ఎండ్ కార్డ్ అనేదే లేకుండా సాగుతున్నాయి.
అవును, కథ పాతదే ... గత నాలుగు సంవత్సరాలుగా వివిధ దశల్లో, వివిధ రూపాల్లో నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదేమీ రహస్యం కాదు. ఆ ఇద్దరి మధ్య గల శతృమిత్ర సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకరిని ఒకరు అనని మాట లేదు. ఒకరిపై ఒకరు చేయని ఆరోపణ లేదు. అశోక్ గేహ్లాట్ అయితే సొంత పార్టీకి చెందిన పైలట్ ను ‘ద్రోహి’ అని దూషించారు. పైలట్ అదే మాటను ఇంకో భాషలో అన్నారు.
నిజానికి, గడచిన నాలుగు సంవత్సరాలలో ఆ ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు అనేకం పతాక శీర్షికలకు ఎక్కాయి. ఒకటి రెండు సందర్భాలాలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇలా ఇద్దరి విభేదాలు తెరపైకొచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. అయినా, ప్రతి సందర్భంలోనూ గెహ్లాట్ దే పై చేయి అయింది. అన్ని సందర్భాలలో కాంగ్రెస్ అధిష్టానం, కారణాలు ఏవైనా, గెహ్లాట్ కే జై కొట్టింది. చివరకు, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గెహ్లాట్ అధిష్టానం దూతలను (అందులో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆన్నారు) అవమానించి పంపినా ఆయన పై చర్యలు తీసుకునే సాహసం కాంగ్రెస్ అధిష్టానం, (సోనియా, రాహుల్) చేయలేక పోయింది. గత ఏడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి, పైలట్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కానీ, గెహ్లాట్ అందుకు పైకి అంగీకారం తెలుపుతూనే తెర వెనక చక్రంతిప్పారు. ఆఖరు నిముషంలో గెహ్లాట్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఏగరేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానంనిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ అధిష్టానం లొంగక తప్పలేదు. చివరకు గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పైలట్ డిమాండ్ కూడా నెరవేరలేదు. ఇదిగో అదిగో అంటూ చివరకు ఆ ఉదంతానికి ముగింపు పలికారు.
అందుకే ఇప్పుదు ఎన్నికల ముందు పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పై మరోమారు యుద్దాన్ని ప్రకటించారు. ఆయన ఎత్తుకున్న రాగం, గత బీజేపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలనే డిమాండే అయినా, ఆయన టార్గెట్ మాత్రం ముఖ్యమంత్రి గెహ్లాట్ అనేది వేరే చెప్పనక్కరలేదు. అవును,గెహ్లాట్ టార్గెట్ గానే పైలట్ మిస్సైల్ ఫైర్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలను బేఖాతారు చేస్తూ, ముందు ప్రకటించిన విధంగా, ఏప్రిల్ 11న తమ మద్దతుదారులతో కలిసి ఒక రోజు నిరసన దీక్షకు కూర్చున్నారు.
గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఊసే ఎత్తకుండా రేపటి ఎన్నికల్లో ఏ ముఖంతో ప్రజలముందుకు పోగలమని సచిన్ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న బానే వుంది, కానీ, నాలుగేళ్ళ తర్వాత, ఎన్నికలు తరుము కొస్తున్న సమయంలో పైలట్ రోడ్డెక్కడం ఏమిటీ ? ఎందుకు అంటే, అదేమీ బ్రహ్మ రహస్యం కాదు. గెహ్లాట్ ను ఆయనను వెనకేసుకువస్తున్న పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు పైలట్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారని వేరే చెప్పనక్కరలేదు.
గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను అస్త్రాలుగా చేసుకుని ముఖ్యమంత్రి గెహ్లాట్ ను డిఫెన్సులోకి నేట్టే వ్యూహంతోనే పైలట్ పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే, గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. గెహ్లాట్ అవినీతి ఎండగట్టేందుకు సచిన్ పైలట్ బీజీపీ భుజాలపై తుపాకీ పెట్టి గెహ్లాట్ పైకి తూటాలు గురి పెడుతున్నారు. దీంతో ఎన్నికల సన్నాహాల విషయంలో రాజస్థాన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానం ఓ రాజీ సూత్రంతో ముందుకు వచ్చింది. సచిన్ పైలట్ ను సీడబ్ల్యూసీలోకి తీసుకుని రాష్ట్ర కాంగ్రెస్ లో ఐక్యత సాధించేందుకు ఒక అడుగు వేసింది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగం పార్టీ వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం పట్ల రాజస్ధాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా సంతోషం వ్యక్తం చే యడంతో ప్రస్తుతానికి రాజస్థాన్ కాంగ్రెస్ లో కుంపట్లు చల్లారాయనే భావించాల్సి ఉంటుంది.