పోర్ బందర్ నుంచి రాహుల్ రెండవ  జోడోయాత్ర ...ఎన్డీయేకి ఇక వణుకు మొదలైనట్టేనా...?

కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి విడత భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఆ యాత్ర ప్రభావం... అధికారమదంతో విర్రవీగుతున్న మోదీ ప్రభుత్వాన్ని... చావు దెబ్బ తినిపించి... కిందకు దించింది. ఆ సమయంలోనే ... కర్ణాటక ఎలక్షన్లు రావడంతో... రాహుల్ భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్  అద్భుతంగా పని చేసింది. బీజేపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. మొదటి విడత భారత్ జోడో యాత్రకు సీక్వెల్ గా... రాహుల్ గాంధీ రెండో విడత యాత్రకు సంసిద్ధులు అవుతున్నారు.  వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర రెండవ విడతకు రంగం అంతా సిద్ధమైంది. అక్టోబర్ రెండవ తేదీన మహా త్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గుజరాత్ లో ఆయన జన్మించిన పోర్ బందర్ నుంచి యాత్ర చేపట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గుజరాత్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఎన్నికలు ముంచు కొస్తున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల మీదుగా సాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ జిల్లాలో పరశురామ్ కుండ్ వద్ద ముగుస్తుంది. అయితే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే తెలంగాణ మీదుగా యాత్ర సాగే విషయమై ఇంకా ఒక స్పష్టత రాలేదని తెలిపాయి. రాహుల్ గాంధీతోపాటుగా ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను సంప్రందించిన అనంతరం పార్టీ అగ్రనేతలు జేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, తదితరులు యాత్ర మార్గాన్నిఖరారు చేస్తారని సమాచారం. తొలుత యాత్రను గువాహటిలో కామాఖ్య దేవి  దేవస్థానం వద్ద ముగించాలని భావించారు. అయితే మణిపూర్ లో సంక్షోభంతో సదరు ప్రతి పాదనను విరమించుకున్నారు. రెండవ విడత భారత్ జోడో యాత్ర నాలుగు నెలల పాటు సాగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈశాన్య భారతానికి కుంబ్షా పేరుగాంచిన పరశురామ్ కుంద్ మేళా జనవరిలో మకర సంక్రాంతి సమయంలో జరుగుతుంది. మేళాకు దేశం నలుమూలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివస్తారు. పరశురామ్ కుండ్ మేళా వద్ద భారత్ జోడో యాత్ర ముగుస్తుందని యాత్రను ఖరారు చేసి పనిలో ఉన్న కీలకమైన కాంగ్రెస్ నేతల నుంచి అందిన సమాచారం. గడచిన దశాబ్దాల్లో ప్రజలతో మమేకం కావడంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అత్యంత విజయవంతమైన కార్యక్రమంగా భారత్ జోడో యాత్ర నిలిచిందని చెప్పవచ్చు. తొలి విడత యాత్ర కర్నాటకలో 21 రోజులపాటు సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అనేక గ్రామాలను, పట్టణాలను, నగరాల గుండా కొనసాగింది. ఆ క్రమంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ కూడా  ఉందనేది సత్యం. రెండో విడత యాత్ర కూడా సక్సెస్ అయితే.... ఇక ఎన్డీయేకి బ్యాడ్ టైం మెదలైనట్లేనని రాజకీయ పండితుల విశ్లేషణ.

రాజస్థాన్ కాంగ్రెస్ ఇక గాడిన పడినట్లేనా?

రాజస్థాన్ లో పార్టీలో విభేదాలను చల్లార్చడానికి, రాష్ట్ర నేతలంతా ఐక్యంగా పని చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఫలిస్తుందా? సీడబ్ల్యుసిలోకి పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక కమిటీలోకి తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సంవత్సరం చివర్లో (నవంబర్, డిసెంబర్ నెలల్లో) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం కూడా లేదు. మరోవంక  ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. హోం మంత్రి అమిత షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఇతర  నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.  బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతమౌతోంది. రాష్ట్ర పార్టీలో ఉన్నత  స్థాయి నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీఎన్నికల సన్నాహకాలకు అడ్డంకిగా మారాయి.  కాంగ్రస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు, గ్రూప్ రాజకీయాలు కొత్త కాదు.  రాజస్థాన్ లో అయితే  గత నాలుగు సంవత్సరాలుగా గెహ్లాట్,  పైలట్ వర్గాల విభేదాలు, తగవులు, ఘర్షణలు    డైలీ సీరియల్ లా ఎండ్ కార్డ్ అనేదే లేకుండా సాగుతున్నాయి.  అవును, కథ పాతదే ...  గత నాలుగు సంవత్సరాలుగా వివిధ దశల్లో, వివిధ రూపాల్లో నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ మాజీ  అధ్యక్షుడు సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదేమీ రహస్యం కాదు. ఆ ఇద్దరి మధ్య గల శతృమిత్ర సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకరిని ఒకరు అనని మాట లేదు. ఒకరిపై ఒకరు చేయని ఆరోపణ లేదు. అశోక్ గేహ్లాట్ అయితే  సొంత పార్టీకి చెందిన పైలట్ ను ‘ద్రోహి’ అని దూషించారు. పైలట్ అదే మాటను ఇంకో భాషలో అన్నారు. నిజానికి, గడచిన నాలుగు సంవత్సరాలలో ఆ ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు అనేకం పతాక శీర్షికలకు ఎక్కాయి. ఒకటి రెండు సందర్భాలాలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇలా ఇద్దరి విభేదాలు తెరపైకొచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. అయినా, ప్రతి సందర్భంలోనూ గెహ్లాట్ దే పై చేయి అయింది. అన్ని సందర్భాలలో కాంగ్రెస్ అధిష్టానం, కారణాలు ఏవైనా,  గెహ్లాట్ కే జై కొట్టింది. చివరకు, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గెహ్లాట్ అధిష్టానం దూతలను (అందులో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆన్నారు) అవమానించి పంపినా ఆయన పై చర్యలు తీసుకునే సాహసం కాంగ్రెస్ అధిష్టానం, (సోనియా, రాహుల్) చేయలేక పోయింది. గత ఏడాది కాంగ్రెస్‌ అధ్యక్ష  ఎన్నిక సందర్భంగా గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు  అప్పగించి, పైలట్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కానీ, గెహ్లాట్ అందుకు పైకి అంగీకారం తెలుపుతూనే  తెర వెనక చక్రంతిప్పారు. ఆఖరు నిముషంలో గెహ్లాట్  ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఏగరేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానంనిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ అధిష్టానం లొంగక తప్పలేదు. చివరకు గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పైలట్‌ డిమాండ్‌ కూడా నెరవేరలేదు. ఇదిగో అదిగో అంటూ చివరకు ఆ ఉదంతానికి  ముగింపు పలికారు.  అందుకే ఇప్పుదు ఎన్నికల ముందు పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పై మరోమారు యుద్దాన్ని ప్రకటించారు. ఆయన ఎత్తుకున్న రాగం, గత బీజేపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలనే డిమాండే అయినా, ఆయన టార్గెట్ మాత్రం ముఖ్యమంత్రి గెహ్లాట్ అనేది వేరే చెప్పనక్కరలేదు. అవును,గెహ్లాట్ టార్గెట్ గానే పైలట్  మిస్సైల్ ఫైర్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలను బేఖాతారు చేస్తూ, ముందు ప్రకటించిన విధంగా, ఏప్రిల్ 11న తమ మద్దతుదారులతో కలిసి ఒక  రోజు నిరసన దీక్షకు కూర్చున్నారు.  గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ ఊసే ఎత్తకుండా రేపటి ఎన్నికల్లో ఏ ముఖంతో ప్రజలముందుకు పోగలమని సచిన్‌ ప్రశ్నిస్తున్నారు.  ప్రశ్న బానే వుంది, కానీ, నాలుగేళ్ళ తర్వాత, ఎన్నికలు తరుము కొస్తున్న సమయంలో పైలట్   రోడ్డెక్కడం ఏమిటీ ? ఎందుకు అంటే, అదేమీ బ్రహ్మ రహస్యం కాదు. గెహ్లాట్ ను ఆయనను వెనకేసుకువస్తున్న పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు పైలట్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారని వేరే చెప్పనక్కరలేదు.  గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను అస్త్రాలుగా చేసుకుని ముఖ్యమంత్రి గెహ్లాట్ ను డిఫెన్సులోకి నేట్టే  వ్యూహంతోనే పైలట్  పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే, గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. గెహ్లాట్ అవినీతి ఎండగట్టేందుకు సచిన్ పైలట్  బీజీపీ భుజాలపై తుపాకీ పెట్టి గెహ్లాట్   పైకి తూటాలు గురి పెడుతున్నారు.  దీంతో ఎన్నికల సన్నాహాల విషయంలో రాజస్థాన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే  అధిష్ఠానం ఓ రాజీ సూత్రంతో ముందుకు వచ్చింది. సచిన్ పైలట్ ను సీడబ్ల్యూసీలోకి తీసుకుని రాష్ట్ర కాంగ్రెస్ లో ఐక్యత సాధించేందుకు ఒక అడుగు వేసింది.   కాంగ్రెస్ అత్యున్న‌త నిర్ణాయ‌క విభాగం పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలో చోటు ద‌క్క‌డం ప‌ట్ల రాజ‌స్ధాన్ కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్  కూడా సంతోషం వ్యక్తం చే యడంతో ప్రస్తుతానికి రాజస్థాన్ కాంగ్రెస్ లో కుంపట్లు చల్లారాయనే భావించాల్సి ఉంటుంది. 

రజనీ వర్సెస్ విజయసాయి.. రసకందాయంలో గుంటూరు వైసీపీ రాజకీయం

తన దాకా వస్తేనే కానీ తత్వం బోధపడదంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి తత్వం బొధపడే పరిస్థితి వచ్చింది. వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పల్నాడు, బాపట్ల, ఒంగోలు జిల్లాల  బాధ్యతలను ఆ పార్టీ  సీఎం వైయస్ జగన్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే.  దీంతో ఆయన  జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఆ క్రమంలో పల్నాడు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ చేస్తున్న పవర్ పాలిటిక్స్ అర్థమై షాక్ అయ్యారని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. దీంతో  మంత్రి విడదల రజినీకి విజయసాయి గట్టిగానే క్లాస్ పికారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.   చిలకలూరిపేట నియోజకవర్గం.. గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని... దీంతో పార్టీ శ్రేణుల్లో  తీవ్ర గందరగోళం నెలకొందటూ ఇప్పటికే ఐ ప్యాక్ ఇచ్చిన నివేదికతో.. విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి..  సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశాల సందర్భంగా  మినిష్టర్ రజినీ పవర్ పాలిటిక్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విజయసాయిరెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారని పార్టీ వర్గాల ద్వరా తెలుస్తోంది.  విడదల రజినీ మంత్రి పదవి చేపట్టిన తర్వాత.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారనీ,  నరసరావు పేట ఎంపీ, వైసీపీ నాయకుడు లావు కృష్ణదేవరాయులుని  సైతం ఆమె లెక్క చేయకుండా.. వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా.. ఎంపీ కృష్ణదేవరాయులకు  ప్రోటోకాల్ ఉండడం లేదని.. అలాగే నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీలో స్థానిక ఎంపీగా లావు కృష్ణదేవరాయలు పర్యటించాలంటే.. మంత్రి రజనీ అండ్ కో అనుమతి మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు. దీంతో సదరు ఎంపీ చిలకలూరిపేట అసెంబ్లీ పరిధిలో పర్యటించడం దాదాపుగా మానేశార చెబుతున్నారు. అయితే రజినీ పవర్ పాలిటిక్స్‌పై గతంలోనే తాడేపల్లి ప్యాలెస్‌లోని పార్టీ పెద్దలకు ఆయన ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎంపీ లావు కృష్ణదేవరాయులు  హార్ట్ అయ్యారనీ, పార్టీ మారే యోచన చేస్తున్నారనీ కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఆయన సైకిల్ ఎక్కి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు  రాజకీయ వర్గాలలో ఓ చర్చ నడుస్తోంది.   గుంటూరు ప్రస్తుత తెలుగుదేశంఎంపీ గల్లా జయదేవ్.. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో  గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పోటీ చేసే విషయంపై లావు కృష్ణదేవరాయులు దృష్టిపెట్టారన్న చర్చ  ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతోంది.   ఈ నేపథ్యలోనే మంత్రి రజనీపై విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.   పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై   మంత్రి రజనీ కఠినంగా వ్యవహరిస్తున్నారని.. అంతేకానీ పార్టీకి ఎలాంటి చేటు తీసుకు రావడం లేదని.... అలాంటి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమేమిటంటూ రజనీ అనుచరులు విజయసాయిపై కారాలూ, మిరియాలూ నూరుతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  పల్నాడు జిల్లాలో వైసీపీ బలోపేతం కోసం చిత్తశుద్ధితో  పని చేస్తున్న పై ఎన్నికల వేళ విజయసాయి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రజనీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎన్నికల ముంగిట రజనీ వర్సెస్ విజయసాయిగా గుంటూరు వైసీపీ రాజకీయం రంజుగా మారిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.  

జానారెడ్డి సైలెన్స్ వ్యూహమేంటి?

తెలంగాణ కాంగ్రెస్ లో పరిచయం ఏ మాత్రం అక్కర్లేని పేరు ఏదైనా ఉందంటే అది జానారెడ్డి. పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి పొలిటికల్ సైలెన్స్ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయదలచుకున్న వారి నుంచి పార్టీ దరఖాస్తులు కోరింది.  అయితే జానారెడ్డి మాత్రం ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోలేదు. అసలు ఆయన ఎన్నికల బరిలో నిలుస్తారా? నిలవరా అన్న అనుమానాలు పార్టీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న జానా రెడ్డి.. పోటీ విషయంలో మౌనంగా ఉండటం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  జానారెడ్డి ఇన్ చార్జిగా ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన చిన్న కుమారుడు జై వీర్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఆయన పెద్ద కుమారుడుఅయితే ఆ స్థానంలో చిన్న కొడుకు జై వీర్ రెడ్డి గురువారం దరఖాస్తు చేయడంతో జనారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తారా? చేయరా? అనే అనుమానాలు పార్టీలో మొదలయ్యాయి. అప్లికేషన్‌కు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో చాలా మంది నేతలు జానారెడ్డి నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక జానారెడ్డి పెద్ద కుమారుడు  రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జానారెడ్డి పోటీకి దూరంగా ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల దరఖాస్తు గడువు శుక్రవారం ( ఆగస్టు 25)తో ముగుస్తుంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం పర్వదినం కూడా కావడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.  ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారిలో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ,   రఘు వీర్, రమ్యారావు తదితరులు ఉన్నారు. మొత్తం మీద పోటీ విషయంలో జానా మౌనం కాంగ్రెస్ వర్గాలలో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది.

కాళ్లు మొక్కినా ఫలితం లేకపోయే.. హెల్త డైరెక్టర్ కు కేసీఆర్ రిక్తహస్తం!

తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఒక అధికారిగా ఆయన ప్రతిభ, పని తీరు సంగతి ఏమో కానీ.. రాజకీయ ఆశావహుడిగా మాత్రం ఆయన రాష్ట్రంలో సుపరిచితుడు. కొత్తగూడెం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు.. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా తన హోదాను, పరపతిని కేసీఆర్ కాళ్ల దగ్గర పడేశారు. పలుమార్లు ఆయన కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు. పలుమార్లు రాజకీయ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన ఇవన్నీ తన రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికే చేశారనడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. అధికారిగా తన పరిధులు మీరి మరీ ఆయన చేసిన విన్యాసాలు చివరికి ఆయన ఆశించిన ఫలితాన్ని ఇచ్చాయా? ఆయన కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న కోరికకు కేసీఆర్ ఆమోదముద్ర వేశారా అంటే అదేం జరగలేదు. పాపం శ్రీనివాస్ కేసీఆర్ లైట్ గా తీసుకున్నారు.  ఇంతోటి దానికి ఆయన అధికారిగా పలుచన అయ్యారు. తన స్థాయిని మరిచి కాళ్లు మొక్కారు. భట్రాజును తలదన్నేలా నేతలను పొగడ్తలలో ముంచెత్తి నవ్వుల పాలయ్యారు. సరే అసలు విషయానికి వస్తే.. వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారో చెప్పలేం కానీ తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్   నిత్యం వివాదాలతో వార్తలలో ఉంటూ వచ్చారు.  ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయన్న వివాదాస్పద వ్యాఖ్యల నుంచి..  పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్  కాళ్లు మొక్కడం వరకూ ఆయన ఏం చేసినా కొత్తగూడెం అసెంబ్లీ  టికెట్ కోసమేనని అప్పట్లోనే పరిశీలకులు పలు ఉదాహరణలతో విశ్లేషణలు చేశారు. అలాగే రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని తనను తాను మరచి మరీ పొగడ్తల వర్షం కురిపించేశారు.  హరీష్ సిద్ధిపేటకు చేసిన దానిలో సగంపనులు చేసినా కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.  ఆయన  ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ అప్పట్లో నెటిజన్లు ఏకి పారేశారు.    గడల శ్రీనివాసరావు  కరోనా సమయంలో కరోనా కేసులు, చికిత్స పొందుతున్నవారు, మరణించినవారు.. ఇలా నిత్యం లెక్కలు చెప్పడానికి   మీడియా ముందుకొచ్చేవారు. ఆయన లెక్కలన్నీ  తప్పులతడకని పలుమార్లు హైకోర్టు చేత తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆయనా చీవాట్లు తిన్నారు.  కరోనా లెక్కలతో మీడియాలో పాపులరైన (అప్రతిష్ట పాలైన) గడల శ్రీనివాసరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందినవారు. మీడియాలో పాపులర్‌ కావడం ద్వారా  రాజకీయాలలో రాణించాలని తహతహలాడారు. అంతేనా  తరచూ  కొత్తగూడెంలో పర్యటించడం, ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించడం, పర్యవేక్షించడంతో ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించారు. కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేది కూడా తానేనంటూ పలుమార్లు  ప్రకటనలు సైతం చేశారు.  ప్రచారం కూడా చేసుకున్నారు.  కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన కుమారుడి వ్యవహారంలో వివాదాస్పదం కావడం, ఎన్నికల సమయంలో వేసిన అఫడివిట్‌ లో తప్పుల కారణంగా తెలంగాణ హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించడం వంటి కారణాలతో కొత్తగూడెం అభ్యర్థిని తానేనని గడల శ్రీనివాసరావు ఫిక్సైపోయారు.  వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర విమర్శలు కూడా సంధించారు. ఇదే సమయంలో కేసీఆర్‌ పై ప్రశంసలు కురిపించేశారు.  కట్ చేస్తే.. ఆశల పల్లకీలో ఊరేగిన ఆయన  కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన  తర్వాత బొక్కబోర్లా పడ్డారు. ఆ జాబితాలో శ్రీనివాసరావు పేరు లేదు.   మళ్లీ బీఆర్‌ఎస్‌ టికెట్‌ నున వనమా వెంకటేశ్వరరావుకే కట్టబెట్టారు. దీంతో తానే అభ్యర్థినని చెప్పుకుంటూ వచ్చిన గడల  కంగు తిన్నారు.   మీడియాకే కాదు.. ఎవరికీ ముఖం చూపకుండా సైలెంటైపోయారు. 

కామారెడ్డి బరిలో రాములమ్మ.. కేసీఆర్ కు చుక్కలేనా?

 తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విపక్షాలను డిఫెన్స్ లో పడేయాలన్న ఉద్దేశంతో సొంత పార్టీలో చెలరేగే అసమ్మతి జ్వాలల గురించి కూడా పెద్దగా పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేశారు. మిగిలిన పార్టీల కంటే ముందుగా 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితాలు విడుదల చేసేశారు. తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్లుగా కొన్ని నియోజవకర్గాలలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, అసమ్మతి జ్వాలలను చల్లార్చుకునే బాధ్యతను కూడా తాను ప్రకటించిన అభ్యర్థుల భుజస్కంధాలపైనే పెట్టేశారు. టికెట్లు దక్కని అభ్యర్థులు ఇప్పటికే తమ దారి ఎటు అన్నది తేటతెల్లం చేసేశారు. రేఖా నాయక్ అయితే ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు కూడా చేసేశారు. మరి కొందరు పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. ఈ వ్యవహారమంతా పక్కన పెడితే కేసీఆర్ స్వయంగా గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించేశారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ మొదలెట్టి.. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఒక చోటు కాదు ఏకంగా రెండు చోట్ల నుంచి పోటీ చేయడానికి కేసీఆర్ నిర్ణయించుకోవడంతోనే జాతీయ రాజకీయాలలో ఆయన పాత్ర నామమాత్రంగానే ఉండబోతున్నదని చెప్పకనే చెప్పేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు ఆయన పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు హాట్ సీట్లుగా మారాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే ఆయన కామారెడ్డి నుంచీ కూడా పోటీలో దిగుతున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే గజ్వేల్ లో ఆయన ప్రత్యర్థిగా తాను నిలబడతాననీ, అందుకు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తాననీ  మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ ప్రకటించేశారు. అసలు కేసీఆర్ మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి గజ్వేల్ లో ఈటల పోటీ సవాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ కు గట్టిపట్టున్న కామారెడ్డిని ఆయన ఎంచుకోవడంలోనే సేఫ్ గేమ్ ఆడుతున్నారని అవగతమైపోయిందని చెబుతున్నారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ విజయం నల్లేరుమీద బండి నడకేం కాదని బీజేపీ అంటున్నది. కామారెడ్డిలో కేసీఆర్ కు ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థిని రంగంలోనికి దింపాలని నిర్ణయించింది.  ఆ బలమైన అభ్యర్థి మరెవరో కాదు రాములమ్మ విజయశాంతి అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా  మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు  షబ్బీర్ అలీ  ఎలాగూ నిలబడతారు. ఇక ఇక్కడ బీజేపీ  మాత్రం స్థానిక నేతలన కాదని విజయశాంతిని బరిలో నిలపాలని నిర్ణయించిందని చెబుతున్నారు.  గతంలో మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి గెలిచిన విజయశాంతి మరోసారి అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా అదృష్ఠాన్ని పరీక్షించుకోవాలని బావిస్తున్నప్పటికీ.. పార్టీ  కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ కు ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగడం పై విజయశాంతి స్పందించారు. తాను ఎక్కడ నుంచి పోటీలోకి దిగాలన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కామారెడ్డి నుంచి పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే అక్కడ నుంచే రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఎవరిని ఎక్కడ నుంచి పోటీకి దించాలో అధినాయకత్వం నిర్ణయిస్తుంది, ఆ నిర్ణయాన్ని అంతా శిరసావహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.   ఆమె మాటలను బట్టి కామారెడ్డిలో కేసీఆర్ ను ఢీ కొనేందుకు ఆమె సానుకూలంగా ఉన్నారని చెప్పక తప్పదు.  

రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ.. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణకు తననూ ఆహ్వానించాలని వినతి

నందమూరి తారక రామా రావు...  తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు.   ఒక సినిమా హీరోగా ఆయన తాను  జీవించిన  పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.  రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.   రాముడు ఎలా ఉంటాడంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. అచ్చం ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, ఇటు రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అటువంటి శకపురుషుడి శత జయంతి జరుపుకున్నాం. ఆ సందర్భంగా కేంద్రం ఎన్టీఆర్ బోమ్మతో ముద్రించిన వందరూపాయల వెండి నాణేన్నా ఈ నెల 28న ఆవిష్కరించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి  ఎన్టీయార్ కుటుంబ సభ్యులు,  ఆయన సన్నిహితులు, ఆయనతో పరిచయం ఉన్నవారికి ఆహ్వానాలు అందాయి. అయితే ఎన్టీఆర్ మరణానంతరం ఎన్టీఆర్ కుటుంబానికి దూరంగా ఉంటున్న, రాజకీయంగా ఎన్టీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీతో కలిసి పని చేస్తున్న ఆయన భార్య లక్ష్మీ పార్వతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.   నేను లక్ష్మీ పార్వతిని.. దివంగత ఎన్టీఆర్ భార్యను.. అంటూ రాసిన ఆ లేఖలో ఎన్టీఆర్ బొమ్మతో ముద్రించిన వందరూపాయల వెండి నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తననూ ఆహ్వానించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీయార్ ఫ్యామిలీ మెంబర్స్ తో   తనను కూడా ఆహ్వానించాలంటూ ఆమె లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ లేఖలో ఆమె రాజకీయ ప్రస్తావన చేశారు. 1994 ఎన్నికలలో ఎన్టీఆర్ తో కలిసి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతిని ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా ఒక మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటూ నిర్వహించే ఒక కార్యక్రమాన్ని ఇలా వివాదాస్పదం చేయాలని చూడటం సమంజసం కాదంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న వందరూపాయల వెండి నాణెం ఆవిష్కరణ కుటుంబ కార్యక్రమం కాదనీ, అదొక ప్రభుత్వ కార్యక్రమమనీ, ఎవరికి ఆహ్వానం అందించాలి అన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమనీ, ఈ విషయంలో రాజకీయాలు, కుటుంబ విభేదాలను తీసుకురావడం మంచిది కాదనీ అంటున్నారు. 

ఓట్ల తొలగింపుతో విజయం.. జగన్‌ను భ్రమల్లో ముంచేశారా?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది. అధికార పార్టీ నేతలు ఎక్కడకి వెళ్లినా చెప్పిందేంటి? చేసిందేంటి? అంటూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టిన గడపగడప కార్యక్రమం పుణ్యమా అని ఈ అసంతృప్తిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చూశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఎక్కడ సభలు పెట్టినా తండోపతండాలుగా ప్రజలు పోగవుతున్నారు. ర్యాలీలు పెడితే పెద్దఎత్తున వెళ్లి మద్దతు తెలుపుతున్నారు.  ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుపడుతున్నారు. రాష్ట్రంలో నాశనమైన వ్యవస్థల నుండి నశించిపోయిన అభివృద్ధి వరకూ ఒక్కొకటి తూర్పార పడుతూ ప్రజలలోకి దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఇంతగా విమర్శిస్తున్నా వైసీపీ నేతల నుండి ఉలుకూ పలుకూ లేదు. విమర్శలను ఖండించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నేతలు తిరిగి ప్రతిపక్ష నేతలను మీరేం చేశారో చెప్పాలని అర్ధం పర్ధం లేని డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ సినారియోను చూస్తే అధికార వైసీపీ పార్టీ హ్యాండ్సప్ చెప్పినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అంతకు ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే వంద బూతులు మాట్లాడే నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. తత్వం బోధపడే ఇలా సైలెంట్ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే  సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ తనదే విజయమని నమ్ముతున్నారని, మరోసారి తానే సీఎం అవుతారని ధీమాగా ఉన్నారని కొందరు పరిశీలకులు బలంగా విశ్లేషిస్తున్నారు. తాను తెచ్చిన సంక్షేమ పథకాలే తనను మరోసారి అందలం ఎక్కిస్తాయని జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ  వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, జగన్ చుట్టూ చేరిన కోటరీనే ఆయన్ను   భ్రమల్లో ఉంచుతున్నదనీ, ఆయనను ఓ దైవాంశ సంభూతుడిగా చూపిస్తూ.. తాను తలచుకుంటే కానిది లేదన్న ధోరణితో ఆయనను ఒక ట్రాప్ లో ఉంచేసినట్లు కనబడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని టక్కుటమార విద్యలతో గట్టెక్కే ప్రణాళికలు రచిస్తూ దాన్ని జగన్ ఛరిస్మాగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుకు పాల్పడ్డారనే అభియోగాలపై అనంతపురం జిల్లా జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిబంధనలు పాటించకుండా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారంటూ గత కొంత కాలంగా టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది. ఈ క్రమంలో ఈసీకి చెందిన అధికారులు అనంతపురం జిల్లా ఉరవకొండలో నేరుగా క్షేత్ర స్థాయి పర్యటన సైతం నిర్వహించి అధికారిపై వేటు వేశారు. అనంతపురం అధికారి ఒక్కడే కాదు అక్రమంగా ఓట్లను తొలగించడంపై మరికొందరు అధికారులు కూడా బలి పశువులు కావడం ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని వైసీపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగిస్తుందని స్పష్టంగా ఈసీనే ఒక నిర్ణయానికి వచ్చి అధికారులపై వేటు వేస్తుంది. దీంతో వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలు పెట్టారు. తనది కాకపోయినా అన్ని శాఖలకు సంబంధించిన అంశాలపై మైకు ముందుకొచ్చే సలహాదారు సజ్జల రామకృష్ణ ఈ విషయంలో కూడా మీడియా ముందుకొచ్చారు. ఇంకేముంది యధావిధిగా ఇది కూడా చంద్రబాబు పనేనని.. చంద్రబాబు ఈసీని మ్యానేజ్ చేసి అధికారులపై చర్యలు తీసుకొనేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మేము తొలగించింది దొంగ ఓట్లు మాత్రమేనని.. చంద్రబాబే వ్యవస్థలను మ్యానేజ్ చేసి వైసీపీ వారి ఓట్లను తొలగించారని కూడా ఆరోపించారు. తాము అరవై లక్షల దొంగ ఓట్లు గుర్తించామని.. వాటిని తీసేస్తే తాము అనుకున్న ఫలితం వస్తుందని.. అదే అసలైన ఫలితమని కూడా సెలవిచ్చారు. మొత్తంగా ఈ ఓట్ల తొలగింపు, సజ్జల చెప్పిన థియరీ చూస్తే ఒక్కటి స్పష్టమవుతుంది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి తాము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డిని ఆయన నమ్మించినట్లు కనిపిస్తున్నది. అందుకే సజ్జల వాటిని తీసేస్తే తాము అనుకున్న ఫలితం వస్తుందని నిర్మొహమాటంగా చెప్తున్నారు. ఈ కుట్ర సిద్దాంతాన్ని అడ్డం పెట్టుకొనే ఎలాగైనా గెలుస్తామని ధీమాగా ఉన్నారని.. అదే భ్రమల్లో సీఎంను కూడా ఉంచేసి ఉంటారని రాజకీయ వర్గాలు అబ్బీప్రాయపడుతున్నాయి. అయితే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కనుక న్యాయం నాలుగు కాళ్ళ మీద నడుచుకుంటూ వస్తుందనే సూత్రం మర్చిపోయినట్లున్నారు.

కరెంట్ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి.. చేతులెత్తేసిన జగన్ సర్కార్

ముఖ్యమంత్రి అంటే కుటుంబం లాంటి రాష్ట్రానికి ఇంటి పెద్ద. కుటుంబ సభ్యుల అవసరాలేంటి? వారికి ఉపాధి ఎలా? ఆదాయాన్ని మదింపు చేసి అవసరానికి వాడుకోవడం ఎలా? అత్యవసరాల పరిస్థితి నుండి బయటపడడం ఎలా? ఇలాంటి అంశాలన్నీ ముందుగానే అలోచించి ఒక కంట కనిపెట్టి తీర్చాల్సిన బాధ్యత కుటుంబ పెద్దపై ఉంటుంది. సీఎం కూడా అంతే. రాష్ట్ర ప్రజల సంక్షేమం ఏంటి? వారికి కావలసిన కనీస సౌకర్యాల కల్పనకు తీసుకోవలసిన చర్యలు ఏంటి?  ప్రజలకు విద్యా, ఉపాధి ఎలా? రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడం ఎలా? విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా? ప్రకృతి వైపరీత్యాలను అధిగమించడం ఎలా? ఇలా ఎన్నో అంశాలలో సీఎం ముందు చూపుతో వ్యవహరించాలి. ఇందుకోసం సీఎం వెనక వందల మంది బలగం కూడా ఉంటుంది. వారందరి సహకారంతో సీఎం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. కానీ  ఏపీలో మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ పెద్దగా ఘోరంగా విఫలమయ్యారు.  నిలువెత్తు అనుభవరాహిత్యంతో  ఆరు కోట్ల ఆంధ్రుల సంరక్షణ బాధ్యతలను గాలికొదిలేశారు. పాలన విషయంలో జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తేశారు. ప్రజల అవసరాలను అంచనా వేయడంలో అవగాహనా లేకపోవడంతో ప్రజలకు తీవ్ర కష్టాలను మిగిల్చారు. ఇందుకు ఉదాహరణే ఏపీలో విద్యుత్ కోతలు. అవును.. ఏపీలో ఇప్పుడు విద్యుత్ కోతలు ఘోరంగా ఉన్నాయి.  ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు దాటిదంటే ఎప్పుడు కరెంట్ పోతుందోనని భయాందోళన లతో జనం గడుపుతున్నారు.  ఒక్కసారి కరెంట్ పోయిందంటే మళ్ళీ ఏ అర్ధరాత్రి తర్వాతనో వస్తుంది. ప్రతి రోజూ గంట నుండి ఐదారు గంటలు కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రధాన నగరాలు మినహా పట్టణాలు, గ్రామాలలో ఇదే పరిస్థితి. గత నెల రోజులుగా ఇలా విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఏపీలో  ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతమే ఎక్కువ కనుక ఎప్పుడూ ఇక్కడ ఉక్కపోత సర్వసాధారణం. దీనికి తోడు దోమల బెడదతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. అనధికారకంగా భారీ స్థాయిలో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో  ప్రజలు తెగ తిట్టిపోస్తున్నారు. ఘోరంగా విద్యుత్ కోత విధిస్తున్నారని లైన్ మెన్ ను సంప్రదిస్తే తమకేమీ తెలియదని సమాధానమిస్తున్నారు. ఇంజనీర్ స్థాయి అధికారిని సంప్రదిస్తే తమ వద్ద ఎలాంటి లోపాలు లేవని పై నుండే కోత ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇలా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్ 1902కు కాల్ చేస్తే.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్తున్నారు తప్ప కనీసం ఫిర్యాదు కూడా నమోదు చేయడం లేదు. ఇక విద్యుత్ శాఖకి చెందిన అధికారిక టోల్ ఫ్రీ నంబర్ 1912కు చేస్తే ఎమెర్జనీ లోడ్ ఇష్యు ఉందని.. డిమాండ్ కు తగిన సప్లై లేదని.. ఈ కారణంగానే ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలకు తప్ప మిగతా ప్రాంతాలకు కోత విధించమని ఆదేశాలు ఉన్నాయని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులపై కూడా ఉన్నతాధికారులకు ఇప్పటికే పలుమార్లు చెప్పినా వాళ్ళేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్పేస్తున్నారు. నిజానికి ఏపీలో విద్యుత్ కోతలకు ప్రధాన కారణం ప్రభుత్వం ముందు చూపులేకపోవడం.. ఆర్ధిక పరిస్థితి కారణంగా చెప్పుకోవాలి. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన మార్గమైన బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ల కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గును కొని నిల్వ చేసుకోలేదు. ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకొని కనీసం రెండు వారాలకు సరిపడా బొగ్గును నిల్వ ఉంచుకోవడం విద్యుత్ సంస్థలు చేయాల్సిన పని. కానీ బొగ్గును మోసుకొచ్చే గూడ్స్ రైలు ఒక్కరోజు రాకపోతే ఇక కోతలే అన్నట్లుంది ఇప్పుడు ఏపీ పరిస్థితి. అదే సమయంలో విద్యుత్ సంస్థల పేరుతో వేలకోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించి వీటి సామర్థ్యాన్ని పెంచడానికి పెద్దగా ఖర్చుపెట్టలేదు. పోనీ ఇప్పుడు అవసరాన్ని బట్టి బహిరంగ మార్కెట్లో కొంటున్నదా అంటే అదీ లేదు. కొనేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. గతంలో విద్యుత్ కంపెనీలను వేధించిన కారణంగా వారెవరూ ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ అమ్మే పరిస్థితిలో లేరు. దీంతో ప్రజలకు నిత్య నరకం తప్పడం లేదు. ఇక వాన ముసురు పడితే ఇది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకొనేందుకు కూడా వణుకు పుడుతుంది.

జాబిల్లిపై మానవుడి అడుగుజాడను నాడే స్వప్నించిన శ్రీశ్రీ

రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది అన్నాడో సినీ కవి.. కానీ ప్రజా కవి, మహాకవి శ్రీశ్రీ మాత్రం నేడు నెరవేరిన కలని ఎప్పుడో ఆరు దశాబ్దాల కిందటే కని అక్షర బద్ధం చేశారు. జాబిల్లిపై భారత్ జయపతాక ఎగురవేసింది. చంద్రయాన్ 3 ద్వారా చందమామపై విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ యావత్ దేశం గర్వించదగ్గ మహోజ్వల ఘట్టం.  కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి యువతకు పిలుపునిచ్చారు. చంద్రుడిమీద కాలూనాలన్న కలను మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల కిందటే కన్నారు. కని ఊరుకోకుండా దానిని కవిత్వీకరించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి గీతికగా మార్చారు.  నేడు ఇస్రో సాధించిన అద్భుత విజయాన్ని ఆయన ఎప్పుడో తన మానవుడి ప్రొగ్రెస్ రిపోర్ట్ కవితలో చూపించేశారు.  దాదాపు ఆరు దశాబ్దాల కిందటే మహాకవి శ్రీశ్రీ  తన  ఖడ్గ సృష్టి సంకలనంలో ని మానవుడి ప్రోగ్రస్ రిపోర్ట్ అన్న కవితలో మబ్బుతునక జేబురుమాలు  మాటు చేసుకున్న జాబిల్లీ ! ఏమో బహుశా త్వరలో  నీ ఇంటికి రావొచ్చు మేము  స్వాగతం ఇస్తావు కదూ ! ఆతిధ్యానికర్హులమే మేము ! చంద్ర మండలానికి ప్రయాణం  సాధించరాని స్వప్నం కాదు  గాలికన్నా బరువైన వస్తువుని  నేల మీద పడకుండా నిలబెట్ట లేదూ ? పరమాణువు గర్భంలోని  పరమ రహస్యాలు  మహాకాశ వాతావరణంలోని  మర్మాలు తెలుసుకున్నాక  సరాసరి నీదగ్గరకే  ఖరారుగా వస్తాంలే  అపుడు మా రాయబారుల్ని  ఆదరిస్తావు కదూ నువ్వు ?  అంటూ రాశారు.  ఆయన నాడు ఊహించి, ఆశించిన మహోజ్వల ఘట్టం నేడు ఇస్రో సాకారం చేసింది. 

విశాఖ ఎంపీ సీటు యమా హాటు గురూ!

ఏపీలో ఇటు రాజకీయంగా.. అటు పాలనా పరంగా హీటెక్కిస్తున్న నగరం విశాఖ. అధికారికంగానైనా.. అనధికారకంగానైనా విశాఖ నుండి పాలన సాగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి మొండిగా ఉన్నారు. విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా మార్చాలని చూస్తున్నా..  కోర్టులలో బ్రేకులు పడుతుండటంతో కనీసం తానైనా పరిపాలన అక్కడ నుండి సాగించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇందుకోసం అక్రమార్గంలో ఇక్కడ భవనాల నిర్మాణం కూడా మొదలెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిగా విశాఖ అనే ప్రకటన అనంతరం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం,  కబ్జాలు, రౌడీయిజం, గుండాయిజం కూడా విజృంఖలంగా విస్తరించింది. సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసి ఒక రోజంతా ముప్పతిప్పలు పెట్టి విడిచిపెట్టారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో ఇట్టే అవగతమౌతుంది. మరోవైపు గంజాయి వాడకంలో కూడా విశాఖ వేగంగా తొలి స్థానానికి చేరుకుంటోంది.  విశాఖలో దిగజారుతున్న పరిస్థితులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు రాజకీయంగా కూడా విశాఖ హాట్ సీట్ గా మారిపోయింది రాజధాని తెస్తాం, ఇస్తామని అధికార పార్టీ విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటే.. విశాఖలో పెరిగిన కబ్జాలు, రౌడీయిజం, ధ్వంసమవుతున్న ప్రకృతిని ప్రతిపక్షాలు హైలైట్ చేస్తున్నాయి. దసరా నుండి విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పరిపాలన చేయాలని ఆరాటపడుతుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ పర్యటనలు, యాత్రలు చేపడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. చంద్రబాబు తాజాగా విశాఖలో విజన్ 2047 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేయడమే కాకుండా.. విశాఖ వీధుల్లో ర్యాలీ కూడా నిర్వహించారు. ఇండియా అభివృద్ధికి ఏం చేయాలో మేధావుల మాటగా చెప్పిన చంద్రబాబు పనిలో పనిగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన నష్టాన్ని అక్కడి ప్రజలకు వివరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన మూడవ విడత వారాహీ యాత్రలో భాగంగా విశాఖ సహా ఉత్తరాంధ్రను చుట్టేశారు. టీడీపీ, జనసేన రుషికొండపై అక్రమ తవ్వకాలు, కట్టడాల నిర్మాణంపై తీవ్రంగా వైసీపీని టార్గెట్ చేసి ఏకిపారేశారు.  తన తల్లి విజయమ్మను ఓడించిన విశాఖలో ఎలాగైనా జెండా ఎగరేయాలని సీఎం జగన్ ఆశపడుతుంటే.. టీడీపీ తన సత్తా చాటుకొని విశాఖ రాజధాని సిద్దాంతం తప్పని నిరూపించాలని చూస్తున్నది. సామజికంగా  కలిసి వచ్చే అవకాశం ఉండడంతో జనసేన ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని చూస్తుండగా.. ఏపీ మొత్తం మీద బీజేపీకి ఎంతో కొంత కలిసి వచ్చే స్థానం ఇదే కావడంతో బీజేపీ కూడా  ఇక్కడ తిష్టవేసి వ్యవహారం నడిపించాలని చూస్తున్నది. ఇది కాకుండా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు చాప కింద నీరులా స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీచేసి తమ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు.   ప్రస్తుతం విశాఖ సిట్టింగ్   ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ. వ్యాపార వ్యవహారాలలో ఈయన కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేసి ఒక రోజంతా కస్టడీలో ఉంచుకున్నారు. ఆ తర్వాత పెద్దగా రాజకీయాల జోలికి రాని ఎంపీ మకాం కూడా హైదరాబాద్ కు మార్చనున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు మరోసారి రేసులో ఉంటారా ఉండరా అన్నది తేలాల్సి ఉంది. ఎంవీపీ అలా డైలమాలో ఉండడంతో  విజయసాయి రెడ్డి తన అల్లుడిని నిలబెట్టాలన్న యోచనలో ఉన్నారు. వాస్తవానికి అల్లుడి కోసమే కొన్నేళ్లుగా విజయసాయి ఇక్కడ రాజకీయ పునాది వేశారని వైసీపీలో టాక్ మొదలైంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుండి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల అధిపతి భరత్ మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిన భరత్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారని టీడీపీ క్యాడర్ గట్టిగా భావిస్తుంది. జనసేన కూడా ఈ సీటు మీద మక్కువ చూపిస్తుంది. ఆ పార్టీ నుంచి విశాఖ సీనియర్ లీడర్ 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ బరిలోకి దిగుతారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు రెండు లక్షల ఎనభై వేల ఓట్లు రాగా ఈసారి గట్టిగా ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుందని జనసేన నమ్ముతున్నది. మరోవైపు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా ఈ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచి  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె విశాఖ ఎంపీగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు.  జనసేన, బీజేపీ కలిసి టీడీపీతో పొత్తుకు వెళ్తే ఈ సీటు ఎవరు దక్కించుకుంటారన్నది మరింత ఆసక్తి కరం.  మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎంపీ సీటుపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. 

వల్లభనేని వంశి.. రెంటికి చెడ్డ రేవడేనా!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించి..  ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ పార్టీ పంచన చేరిన వంశీ నాటి నుంచి గన్నవరంలో తెలుగుదేశం కోటను పగలగొట్టడమే పనిగా  పని చేశారు. తెలుగుదేశం  పార్టీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగత విమర్శలు, అసభ్య దూషణలకు తెగబడి నియోజకవర్గంలోని తన సామాజిక వర్గానికే కాకుండా.. నియోజకవర్గ ప్రజలకు కూడా దూరమయ్యారు. అయితే అధికార  పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయారు. పూర్తిగా వైసీపీని నమ్ముకుని వచ్చే  ఎన్నికలలో ఆ పార్టీ  అభ్యర్థిగా పోటీకి రెడీ అయిన వంశీ.. ఆ క్రమంలో తనకు అడ్డువస్తాడన్న భయంతో గత ఎన్నికలలో తనకు ప్రత్యర్థిగా నిలిచి పరాజయం పాలైన యార్లగడ్డకు చెక్ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా, వికటించాయా అన్న అనుమానాలు ఇప్పుడు ఆయనలోనే వ్యక్తం అవుతున్నాయి. యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిపోయారు. గన్నవరం నుంచే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీకి రెడీ అయిపోయారు. అంటే వచ్చే ఎన్నికలలో కూడా వంశీ, యార్లగడ్డల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. వల్లభనేని వంశి పట్ల నియోజకవర్గంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను గమనించిన వైసీపీ అధిష్ఠానం పార్టీ టికెట్ పై ఆయనకు ఇచ్చిన హామీపై వెనక్కు తగ్గిన సంకేతాలను ఇస్తున్నది. అందుకు కారణంగా గన్నవరం పరిధిలోని నున్న  గ్రామంలో ఒక వార్డుకు జరిగగిన ఉప ఎన్నికలో వంశీ నిలబెట్టిన అభ్యర్థి పరాజయాన్ని చూపుతోంది.  నున్నవల్లభనేని వంశీ కొద్ది రోజులుగా ఏమీ మాట్లాడటం లేదు. హైకమాండ్ నుంచి సందేశం వస్తే చాలు బూతులతో విరుచుకుపడేందుకు ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. లోకేష్ గన్నవరం పర్యటనకు వస్తున్నారని.. బహిరంగసభ పెట్టబోతున్నారని తెలిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లారు… పారిపోయారని అంటారని చెప్పి మళ్లీ .. సభ రోజు గన్నవరం వచ్చారు కానీ మీడియాతో మాట్లాడలేదు. లోకేష్ పై ఎలాంటి ఆరోపణలు చేలేదు. నోరు చేసుకోలేదు. ఎందుకా అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో గన్నవరం పరిధిలోని నున్న గ్రామంలో ఓ వార్డు స్థానానికి ఎన్నిక జరిగింది. నున్న గ్రామం వైసీపీకి చాలా బలమైన స్థావరం.. అక్కడ రెడ్డి సామాజికవర్గం సంఖ్య ఎక్కువ. అటువంటి చోట కూడా ఒక వార్డు ఉప ఎన్నికలో వైసీపీకి చావుదెబ్బ తగిలింది. వంశీపై వ్యతిరేకతే అందుకు కారణమని వైసీపీ నిర్ధారణకు వచ్చింది. నియోజవర్గ వ్యాప్తంగా వంశీ పట్ల ఇదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గతంగా పార్టీ నిర్వహించుకున్న సర్వేలో కూడా ఇదే తేలడంతో వంశీకి గన్నవరం టికెట్ విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యార్లగడ్డ పార్టీని వీడేందుకు వంశీ తీరే కారణమనీ, యార్లగడ్డకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఒకింత గౌరవం, మర్యాద వంశీ ఇచ్చి ఉంటే ఆయన తెలుగుదేశం వైపు వెళ్లే వారు కాదనీ జగన్ ఇప్పుడు భావిస్తున్నారని అంటున్నారు.  దీంతో వంశీకి వ్రతమూ చెడి, ఫలమూ దక్కక రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే సమయం సందర్భం లేకున్నా  విమర్శలతో, తిట్లతో విరుచుకుపడే వంశీ తన గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రభంజనంలా సాగుతున్న సమయంలో కూడా నోరు మెదరపకుండా మౌనంగా ఉండిపోయారనీ, అసలు లోకేష్ పాదయాత్రకు ముందు ఆయన గన్నవరం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారనీ, అయితే చివరి నిముషంలో మనసు మార్చుకుని గన్నవరం వచ్చారనీ, అయినా లోకేష్ తనపై చేసిన విమర్శలపై స్పందించకుండా మౌనాన్ని ఆశ్రయించడానికి కారణం వైసీపీలో తనకు ఆదరణ తగ్గడమే కారణమని అంటున్నారు.  మొత్తం మీద వంశీకి నిన్న మొన్నటి దాకా గన్నవరం వైసీపీ టికెట్ పై ఉన్న ధీమా ఇప్పుడు పూర్తిగా పోయిందనీ, దీంతోనే మౌనం వినా మరో గత్యంతరంలేని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆముదాలవలస తమ్మినేని చేయి జారినట్లేనా? వైసీపీ ప్లాన్ ఏమిటి?

ఏపీలో ఎన్నికల కాక పెరిగింది. ముఖ్యంగా అధికార వైసీపీలో పార్టీ టికెట్ల లొల్లి ఆ పార్టీకి మొదటికే మోసం తెచ్చేదిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార వైసీపీ.. దానిని అధిగమించడానికి పేరుగొప్ప ఎమ్మెల్యే పదవి తప్ప.. ఇంకే ప్రాధాన్యతా లభించక ఇంత కాలం లోలోపలే ఆవేదనతో మగ్గిపోయిన ఎమ్మెల్యేలపైనే వేటు వేయాలని భావిస్తున్నది. ఆ విషయంలో వైసీపీ ఎటువంటి తారతమ్యాలకూ చోటివ్వడం లేదు. మంత్రులు కూడా పార్టీ టికెట్ విషయంలో గ్యారంటీ లభించక ఏం జరుగుతుందో? ఏం జరిగితే ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మధనపడుతున్నారు. అలా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కదు అన్న వారి జాబితాలో దాదాపు మొదటి పేరుగా స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు గట్టిగా  వినిపిస్తోంది.   శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో మరో సారి వైసీపీ జెండా ఎగురవేయాలంటే.. ఆ స్థానంలో కొత్త ముఖాన్నీ పోటీలో నిలబెట్టడమొక్కటే మార్గమన్న నిశ్చితాభిప్రాయానికి పార్టీ అధినేత జగన్ వచ్చేశారని అంటున్నారు.  అందుకోసం సమర్ధులైన అభ్యర్థి కోసం గాలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అసెంబ్లీ  స్పీకర్  తమ్మినేని సీతారాం   ఈసారి సీటు దక్కడం దాదాపు అసాధ్యం  అంటున్నారు. ఆయన పట్ల నియోజకవర్గ ప్రజలలోనే కాదు,  వైసీపీ క్యాడర్ లో కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమౌతోందంటున్నారు.  ఈ నేపధ్యంలో కొత్త ముఖాన్ని బరిలోకి దించితే తప్ప ఆముదాలవలస నియోజకవర్గంలో  కనీస పోటీ అయినా ఇచ్చే పరిస్థితి ఉండదని వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. దీంతో ఆ స్థానంలో వైసీపీ జెండా మరోసారి ఎగరేయాలంటే అందుకు సమర్ధుడైన, బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడమొక్కటే మార్గమని జగన్ నిర్ణయానికి వచ్చేశారనని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  దీంతో ఆయన  చూపు బోడేపల్లి వారసులపై పడిందని అంటున్నారు. జిల్లా   రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి వేడుకలను  ప్రభుత్వం ఇటీవల అధికారికంగా నిర్వహించడం వెనుక ఆయన వారసులను పార్టీలోకి ఆహ్వానించి ఆముదాల వలస నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బొడ్డేపల్లి రాజగోపాల్ కోడలు బొడ్డేపల్లి సత్యవతిని వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. బోడేపల్లి వారసురాలిగా సత్యవతి 2004, 2009 ఎన్నికలలో  ఆముదాల వలస నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.  విభజన అనంతరం 2014, 2019లలో అదే  స్థానం నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు. వరుసగా రెండు పరాజయాల తరువాత కూడా బోడేపల్లి సత్యవతి  కాంగ్రెస్ ని వీడకుండా ఆ పార్టీకి ఆముదాలవలసలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్  బాధ్యతలను చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆమె ఆముదాలవలస నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆమెను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి తీఎసుకుని రావడం ద్వారా 2024 ఎన్నికలలో లబ్ధి పొందాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగానే బోడేపల్లి రాజగోపాల్  శతజయంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే వైసీపీ  బొడ్డేపల్లి సత్యవతితో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.  ఇక పోతే బోడేపల్లి సత్యవతి వైసీపీ గూటికి చేరడం అంటూ జరిగితే.. తమ్మినేని తిరుగుబాటు చేయడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే తమ్మినేని ఇప్పటికే  ఆముదాలవలస టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో వైసీపీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు. 

అందెను నేడే అందని జాబిలి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రుడి దక్షిణ దృవంపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్.. నేడు అంటే ఆగస్ట్ 23వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడి దక్షిణ దృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ఖ్యాతి గాంచింది.  చంద్రయాన్ విజయవంతం కావడంతో.. భారత్‌కు ప్రపంచదేశాలు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు... ఈ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలు చేసుకొంటున్న సంబరాలు అంబరానంటాయి. మరోవైపు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెన్సెస్‌బర్గ్ వెళ్లారు. ఆ క్రమంలో ప్రదాని నరేంద్ర మోదీ.. విక్రమ్ ల్యాండర్.. చంద్రడిపై ల్యాండ్ అయ్యే దృశ్యాలను జోహెన్నెస్‌బర్గ్‌ నుంచి వర్చువల్‌గా వీక్షించారు.  చంద్రయాన్-3 విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసిన ఆయన ఇలా స్పందించారు... చంద్రయాన్- 3 ఘన విజయంతో తన జీవితం ధన్యమైందన్నారు. అమృత కాలంలో తొలి ఘన విజయంగా ఆయన దీనిని అభివర్ణించారు. ఈ విజయం దేశం  గర్వించే మహోన్నత ఘట్టమని మోదీ పేర్కొన్నారు.  ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూశారని ఆయన వివరించారు. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా.. తన మనస్సంతా.. చంద్రయాన్-3పైనే ఉందన్నారు. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ఈ క్షణం కోసం ఏన్నో ఏళ్లుగా ఎదురు చూశానని ప్రధాని మోదీ చెప్పారు.      ఈ ఏడాది జులై 14వ తేదీన శ్రీహరికోటలోని  షార్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ను ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. నాడు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మొత్తం 40 రోజుల్లో వివిధ దశలను పూర్తి చేసుకొని.. చంద్రుని మీదకు దిగింది. ఇస్రో గతంలో చేపట్టిన చంద్రయాన్- 2 విఫలం కావడంతో శాస్త్రవేత్తలు పలు జాగ్రత్తలు తీసుకొని.. చంద్రయాన్-3ని చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా రూపకల్పన చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ కొత్త ఇన్నింగ్స్

బూస్ట్, అనాకాడెమీ, క్యాస్ట్రోల్ ఇండియా ఎయిర్‌టెల్, బీఎండబ్ల్యూ, ఫియట్ పాలియో, లుమినస్ ఇండియా, సన్‌ఫీస్ట్ బ్రిటానియా, బజాజ్ అమిత్ ఎంటర్‌ప్రైజ్..  ఏమిటీ జాబితా అనుకుంటున్నారా? ఇవన్నీ దిగ్గజ సంస్థలు. దాదాపుగా దేశ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైనే. ఇప్పుడు ఈ జాబితాలోకి  కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిపోయింది. అసలింతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారు? ఉండడి అక్కడికే వస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కుపై ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చి వారిలో అవగాహన పెంపొందించేందుకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ను నియమించుకుంది. ఆ బ్రాండ్ అంబాసిడర్ వేరెవరో కాదు,  క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.  ఔను వంద సెంచరీల దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కరే.  సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి దశాబ్ద కాలం దాటి పోయింది. అయినా నేటికీ ఇండియన్ క్రికెట్.. ఒక్క ఇండియన్ క్రికెట్ అనేమిటి ప్రపంచ క్రికెట్  గురించి ప్రస్తావించాలంటే మొదటిగా ఎవరికైనా స్ఫురించే పేరు సచిన్ టెండూల్కర్ మాత్రమే. ఈ సచినుడు అనితర సాధ్యం అన్న చందంగా ఏకంగా వంద శతకాలు బాదేశాడు. ఇవన్నీ అంతర్జాతీయ మ్యాచ్ లలో చేసినవే. ఇవి కాక కౌంటీ క్రికెట్ లో పారించిన పరుగుల వరద అదనం. అటువంటి సచిన్ టెండూల్కర్ కు ఇప్పుడు సీఈసీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇంతకు ముందు పైన చెప్పుకున్న దిగ్గజ సంస్థలన్నిటికీ కూడా సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. వాటిలో కొన్నిటికి ఇప్పటికీ సచినే బ్రాండ్ అంబాసిడర్  అందుకే ఆ దిగ్గస సంస్థల జాబితాలోకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిందని చెప్పొచ్చు. భారత ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ బుధవారం ( ఆగస్టు 23) బాధ్యతలు చేపట్టారు.  రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం లక్ష్యంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  ముఖ్యంగా ఓటింగ్ పై అర్బన్ ఓటర్లు, యూత్ ఒకింత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారిలో అవగాహన పెంచి ఒటింగ్ దిశగా వారిని నడిపించేలా అవగాహన కల్పించేందుకు సచిన్ టెండూల్కర్ నడుంబిగించనున్ననారు.  భారత ఎన్నికల కమిషన్  బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ మూడేళ్ల పాటు ఉంటారు.  "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అటువంటి దేశంలో ఓటర్లు బాధ్యతగా ఓటేయాలి అని సచిన్ సీఈసీ బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పేర్కొన్నారు.   

28న ఢిల్లీకి ఎన్టీఆర్ ఫ్యామిలీ...!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.  అలాగే ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.   ఈ కార్యక్రమానినికి  ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరౌతారని చెబుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.  అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం.. ఆ చిత్రం కింద  శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించి. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.  మరో వైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలోభాగంగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా.. అందుకు తగిన సాక్ష్యాధారులను సైతం ఎన్నికల ఉన్నతాధికారులకు చంద్రబాబు అందజేయనున్నారు. అలాగే  రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని.. వాటిపై రాష్ట్రంలోని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని...ఈ అంశాన్ని సైతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకు వెళ్లనున్నారు. అలాగే ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొంటారు.