జైలుకెళతారా.. సీఎంగా ఉంటారా! కేసీఆర్ పై క్లారిటీ తప్పిన సంజయ్  

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ సెంటర్ గా మారిపోయారు.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్.  ఆవేశపూరిత ప్రసంగాలు, పంచ్ డైలాగులతో ఆయన రాజకీయ కాక పుట్టిస్తున్నారు.  పార్టీ పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే అద్భుత ఫలితాలు సాధించారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ సొంత గడ్డ సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీకి సంచలన విజయం సాధించి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెమటలు పట్టించారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బండి వంద స్పీడులో పరుగులు పెడుతోంది. అయితే బండి పరుగులు పెట్టడంతో పాటు కొంత గందరగోళంలో పయనిస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. సంజయ్  చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనల్లో  క్లారిటీ మిస్ అవుతుండటమే ఇందుకు కారణమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ గానే దూకుడుగా వెళుతున్నారు బండి సంజయ్. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ..  వ్యక్తిగతంగానూ విమర్శలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని పదేపదే ప్రకటిస్తున్నారు బండి సంజయ్.  టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని కూడా చెబుతున్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం కేంద్రం దగ్గర ఉందన్నారు బండి. సీఎం పదవి లేకున్నా సరేకానీ.. తనను, తన కుటుంబాన్ని జైలుకు పంపవద్దని ఢిల్లీ వచ్చి సీఎం కేసీఆర్‌ పొర్లు దండాలు పెట్టుకున్నారని ఆరోపించారు.. పొర్లు దండాలు పెట్టినా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదని సంజయ్‌ స్పష్టం చేశారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలన్నింటి పై కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలను, అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు.    కేసీఆర్ కు జైలుకు వెళతారని చెప్పడమే కాదు.. 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పారు బండి సంజయ్. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు. తాము తల్చుకుంటే కేసీఆర్ సర్కార్  ఏ క్షణమైనా కూలిపోతుందన్నారు. బండి సంజయ్ పదేపదే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ అధ్యక్షుడు చెబుతుండటంతో ... తెలంగాణలో కీలక మార్పులు ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ జైలుకు వెళితే కేటీఆర్ సీఎం అవుతారని కూడా మాట్లాడుకుంటున్నారు. కేంద్రం కేసులు పెట్టకముందే కేసీఆరే సీఎం కుర్చి నుంచి దిగి.. తనయుడు  కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారన్న చర్చ కూడా కొన్ని వర్గాల్లో జరుగుతోంది.  కాని కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా బల్లగుద్ది మరీ చెప్పిన బండి సంజయ్ సడెన్ గా మాట మార్చారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.   మంగళవారం వరంగల్ లో పర్యటించిన బండి సంజయ్.. తెలంగాణకు మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొన‌సాగుతార‌ని చెప్పారు.  కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచ‌న కేసీఆర్‌కు లేద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు కూడా ఉండకపోవచ్చన్నారు. బండి చేసిన ఈ వ్యాఖ్యల వల్లే ఆయన గమనం గందరగోళంగా ఉందనే చర్చకు కారణమైంది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్న సంజయ్.. ఇప్పుడు కేసీఆరే మరో మూడేళ్లు సీఎంగా ఉంటారని ఎలా చెబుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. సంజయ్ చెప్పినట్లు కేసీఆర్ జైలుకు పోతే.. ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేసీఆరే మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారంటే.. మరో మూడేళ్ల వరకు కేసీఆర్ జైలుకు వెళ్లడని సంజయ్ క్లారిటీ ఇస్తున్నారా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ జైలుకు వెళతారో.. మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారో బండి సంజయ్  క్లారిటీ ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో  దోస్తీ చేస్తూ .. రాజకీయ ప్రయోజనాల కోసమే  టీఆర్ఎస్, బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ముసుగు వీడి అసలు నిజాలు జనాలకు చెబితే మంచిదని సూచిస్తున్నారు.

అంత్యక్రియల డబ్బులకోసం బ్యాంకుకు వచ్చిన మృతుడు.. అవాక్కయిన సిబ్బంది 

బీహార్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన బ్యాంకు ఖాతాలోని డబ్బుల కోసం సరాసరి ఒక మృతుడు రావడంతో బ్యాంకు సిబ్బంది భయపడిపోయారు. అయితే ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ.. అక్కడ నిజంగానే జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పాట్నా నగరం సమీపంలోని షాజహాన్‌పూర్ పరిధిలోని సిగరియావా గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న కెనరా బ్యాంకు బ్రాంచిలో ఆ గ్రామానికి చెందిన మహేష్ యాదవ్ (55) కు అకౌంట్ ఉంది. అయితే నిన్న అతడు అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు బ్యాంకుకు వెళ్లి అతని ఖాతాలోని డబ్బులు ఇవ్వాలని సిబ్బందిని అడిగారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు.   దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్తులు మహేష్ యాదవ్ మృతదేహాన్ని ఏకంగా బ్యాంకు కార్యాలయంలోకి తీసుకువచ్చారు. దీనిని చూసిన బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. దాదాపు మూడు గంటలపాటు మహేష్ మృతదేహాన్ని బ్యాంకులోనే ఉంచారు. బ్యాంకు మేనేజర్ గ్రామస్తులకు ఈ విషయంపై ఎంత నచ్చజెప్పినా వారు అతని మాట వినలేదు. దీంతో చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరు తన జేబులోని రూ. 10 వేలు తీసి గ్రామస్తులకు ఇచ్చి వారిని శాంతపరిచారు. గ్రామస్తులు ఆ సొమ్ముతో మహేష్ యాదవ్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసారు. ఇది ఇలా ఉండగా మహేష్‌కు వివాహం కాలేదు. అంతేకాకుండా అతనికి బంధువులు కూడా ఎవరూ లేరు. అయితే అతని బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలకు పైగా మొత్తం ఉంది. కానీ అతని బ్యాంకు ఖాతాకు నామినీగా ఎవరిని సూచించలేదు. దీంతో బ్యాంకు మేనేజర్ అతని సొమ్ము ఇవ్వడానికి నిరాకరించారని తెలుస్తోంది.

భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్... రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు 

భారత్ లో ఒకపక్క బ్రిటన్ నుండి వచ్చిన కొత్త కరోనా వైరస్ భయపెడుతుంటే మరోపక్క బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడిన ఈ వైరస్ ఇపుడు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు మృత్యువాత పడుతున్నాయి. హర్యానాలో గడచిన పది రోజుల్లోనే 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు చనిపోపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక్క పంచకుల జిల్లాలోనే ఇన్ని కోళ్లు మరణించాయి. దీంతో కొన్ని కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి జలంధర్ రీజినల్ డిసీస్ డయాగ్నసిస్ ల్యాబ్‌కు పంపించారు. ఐతే ఇప్పటి వరకైతే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా బయటపడలేదు. అయితే ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కేసులు బయటపడ్డాయి. తాజాగా జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోనూ నిన్న కొన్ని కేసులు బయటపడ్డాయి.   మనదేశంలో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ శాఖ సూచనలు జారీచేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే వెంటనే ఆ వివరాలను కేంద్రానికి అందజేయాలని సూచించింది. అంతేకాకుండా ఈ వింటర్ సీజన్‌లో విదేశాల నుంచి మన దేశానికి పెద్ద మొత్తంలో వలస పక్షులు వస్తాయని.. వాటిపై కూడా గట్టి నిఘా ఉంచాలని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తాజా ఆదేశాలలో స్పష్టంచేసింది.   హిమాచల్ ప్రదేశ్‌లోని ప్యాండ్ డ్యామ్ చట్టుపక్కల పెద్ద మొత్తంలో బాతులు ఈ వైరస్ కారణంగానే మరణించాయి. దీంతో అప్రమత్తమైన కంగ్రా జిల్లా యంత్రాంగం.. పాంగ్ డ్యామ్ చుట్టుపక్కల ఉన్న ఫతేపూర్, దెహ్రా, జవాలి, ఇందోరా ప్రాంతాల్లో చికెన్, గుడ్లు, చేపల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు. ఈ ప్రాంతాల్లో కోళ్ల ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. కఠిన ఆంక్షలు విధించింది. రాకపోకలను నిలిపివేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.50వేలు జరిమానా విధించనున్నారు.   అటు మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్ జిల్లాలోనూ పలు చోట్ల చికెన్,గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. కేరళలో కూడా 1700 బాతులు ఈ వైరస్ కారణంగా మరణించాయి. అలప్పుజ, కొట్టాయంలో ముందుజాగ్రత్తగా వేలాది బాతులను చంపి పూడ్చిపెట్టారు. ఈ నేపథ్యంలో తమిళనాడు, కేరళ నుంచి జరిగే కోళ్ల సరఫరాను నిలిపివేసింది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పౌల్ట్రీ వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు పెద్ద ఎత్తున మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సంక్రమిస్తుందని.. అందుకే ప్రతిఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ మృతి 

కరోనా మహమ్మారి నుండి తమ దేశ పౌరులను రక్షించుకునేందుకు అమెరికా, బ్రిటన్ వంటి కొన్ని దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చాయి. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొంత మంది హెల్త్ వర్కర్లకు సైడ్ ఎఫెక్ట్స్ బయట పడ్డాయి. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ ఒకరు మృతి చెందారు. పోర్చుగల్ దేశంలో న్యూ ఇయర్ రోజున ఆ ఘటన జరిగింది. సోనియా అసెవెడో (41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ మొదటి షాట్ తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల్లోనే ఆమె మృతి చెందింది.   అసెవెడో మృతిపై ఆమె కుమార్తె వనియా ఫిగరెడో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో తనకు కొంత అసౌకర్యంగా ఉందని తన తల్లి తనతో చెప్పిందని పేర్కొన్నారు. మిగిలినదంతా బాగానే ఉందని ఆమె చెప్పారన్నారు. అంతేకాకుండా ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాధితురాలి తండ్రి అబిలో అసెవెడో ఒక పోర్చుగీస్ డైలీతో మాట్లాడుతూ చెప్పారు. ఆమెకు కరోనా లక్షణాలు కూడా లేనప్పటికీ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని, తన కుమార్తె అసలు ఎలా చనిపోయిందో తనకు తెలియాలని అయన కోరుతున్నారు.   గత సంవత్సరం డిసెంబరు 30న ఆమె ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెలో ఎటువంటి అవాంఛనీయ ప్రభావం కనిపించలేదని పేర్కొన్నాయి. అసెవెడో ఆకస్మిక మరణం తమను కలచివేసిందని, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ తెలిపింది. ఫైజర్, బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను తీసుకున్న538 మంది ఆరోగ్య కార్యకర్తల్లో అసెవెడో ఒకరు. ఇది ఇలా ఉండగా పది మిలియన్ల మంది జనాభా ఉన్న పోర్చుగల్ దేశంలో 4.27 లక్షల మంది కరోనా బారినపడగా, 7,118 మంది మృత్యువాత పడ్డారు.

భూ వివాదంలోనే సీఎం బంధువుల కిడ్నాప్! 

ఐటీ అధికారుల వేషంలో వచ్చి  కిడ్నాప్..  పోలీసుల గాలింపుతో  అంతా సేఫ్.. కటకటాల్లో కిడ్నాప్ గ్యాంగ్..  హైదరాబాద్ లో మంగళవారం రాత్రి సినీ ఫక్కిలో జరిగిన కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కిడ్నాపైన వారంతా సేఫ్ గా బయటపడ్డారు. అయితే  కిడ్నాపర్లు బంధించి తీసుకెళ్లిన వారు.. తెలంగాణ ముఖ్యమంత్రి బంధువులు కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరకి అంతా సేఫ్ గా బయటపడటంతో అంతా  ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండ్ వివాదంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు తేలింది. తమ అదుపులో ఉన్న కిడ్నాపర్ల నుంచి పూర్తి సమాచాం రాబడుతున్నారు పోలీసులు.    హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో  ఉండే సీఎం కేసీఆర్ సమీప బంధువులు.. మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు (51), సునీల్‌రావు (49), నవీన్‌రావు (47)ను దుండగులు మంగళవారం కిడ్నాప్‌ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులం అని లోపలికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారని చెబుతున్నారు. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను కిడ్నాప్‌ చేశారు. ల్యాండ్ పత్రాలతో పాటు , ల్యాప్ టాప్ లను తీసుకెళ్లారు.  కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.  సీఎ బంధువులు కిడ్నాప్ కావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డైమండ్‌ పాయింట్, రాణిగంజ్‌ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి.. ఆ మార్గంలో గాలించారు. చివరికి కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను గుర్తించారు. ముగ్గురు కిడ్మాపర్లతో పాటు మరో 8 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్రహాస్‌ పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది.  కిడ్నాప్ కు గురైన   ప్రవీణ్, నవీన్, సునీల్  సీఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు. సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. తమ ముగ్గురు సోదరులు క్షేమంగా ఉన్నారని ప్రవీణ్‌ సోదరుడు ప్రతాప్‌ తెలిపారు. వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కిడ్నాప్ వివరాలను ఆయన తెలిపారు. ప్రొఫెషనల్స్ లా దుండగులు ఇంట్లోకి వచ్చారని.. నెట్ ద్వారా సీసీటీవీ కెమెరాల్లో ఇంటి దగ్గర ఏం జరిగిందో గమనించానని చెప్పారు. అనుమానం రావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. ఐటీ ఆఫీసుకు తీసుకెళ్లాలని చెప్పడం, పోలీసుల వేషంలో రావడంతో వాళ్లను గట్టిగా ప్రశ్నించలేకపోయారన్నారు. ముఖానికి మాస్కులు వేసి తమ సోదరులను కారులో తరలించారని ప్రతాప్ తెలిపారు. ఓ ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లి కొన్ని పేపర్ పైన సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. 50 ఎకరాల భూమి వివాదం లోనే ఈ కిడ్నాప్ జరిగిందని భావిస్తున్నామన్న ప్రవీణ్.. ఆ స్థలం ప్రభుత్వ భూమి కాదని, సుప్రీంకోర్టులో ఈ  కేసు క్లియరెన్స్ వచ్చిందని తెలిపారు. తమతో పాటు చాలామంది పాట్నర్లు  ఉన్నారన్నారు. 50 ఎకరాల స్థలాన్ని తాము కొనుగోలు చేశామని చెప్పారు ప్రవీణ్ రావు.  

బెంగాల్ బరిలో శివసేన! హిందూ ఓట్లనే చీల్చడమే టార్గెట్టా? 

దేశ వ్యాప్తంగా రాజకీయ కాక పుట్టిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు శివసేన ప్రకటించింది. హుగ్లీ, కోల్‌కతా, నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ, మిడ్నాపూర్, డుండుం, బర్రాక్‌పూర్, బంకుర, విష్ణుపూర్, ఝార్గావ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో శివసేన పోటీ చేయనుంది. దాదాపు 100 సీట్లలో పోటీ చేయాలని శివసేన అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  మరి కొన్ని వారాల్లోనే క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను తెలుసుకోడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి,  శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కోల్‌కతాలో పర్యటించనున్నారు. సీఎం ఉద్ధవ్ పర్యటన కంటే ముందు ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ దేశాయ్ బెంగాల్‌లో పర్యటించనున్నారు. కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు.  2019 ఎన్నికల్లోనూ బెంగాల్ లో  శివసేన బరిలోకి దిగింది. అయితే ఆ సమయంలో శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మహారాష్ట్రలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన బెంగాల్ లో కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే బీజేపీని దెబ్బ కొట్టేందుకే బెంగాల్ ఎన్నికల్లో శివసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. హిందుత్వ పార్టీగా చెప్పుకునే శివసేన పోటీ చేస్తే.. బెంగాల్ లో హిందూ కార్డునే నమ్ముకున్న కమలం ఓట్లకే గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు బెంగాల్ లో ఎంఐఎం కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లలో  పోటీ చేస్తామని ప్రకటించింది. ఎంఐఎంతో మైనార్టీ ఓట్లు చీలి బీజేపీకి లబ్ది కలిగే అవకాశం ఉంది. దీనికి కౌంటర్ గానే బీజేపీ టార్గెట్ గా శివసేన ఎక్కువ అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందనే చర్చ బెంగాల్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

 ఏపీ ప్రభుత్వం నన్ను వేధిస్తోంది: ఐపీఎస్ అసోసియేషన్‌కు ఏబీ లేఖ 

తప్పుడు కేసులతో తనను అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉందని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఐపీఎస్ అధికారుల సంఘానికి  ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశాడు. ఈ లేఖలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఏబీ ఆరోపించారు. త్వరలోనే క్రిమినల్ కేసుపెట్టి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి.. మళ్లీ సస్పెన్షన్ ఆర్డర్ విధించాలని కుట్ర పన్నుతోందంటూ ఆయన ఆరోపించారు. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. నెలల తరబడి తనకు పోస్టింగ్ జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని  ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ప్రాజెక్టులో తాను అవినీతిని చేశానని విచారణ జరిపారన్నారు.   తన సస్పెన్షన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని  లేఖలో గుర్తు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఐపీఎస్ అధికారుల సంఘం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు . ఐపీఎస్ అధికారుల నుండి ఎలాంటి ఫేవర్ అడగడం లేదన్నారు. అయితే ఐపీఎస్ ల సంఘం స్పందించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. జైల్లో పెట్టి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా అనుమానం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.  వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు ఆధారాలతో సహా వివరిస్తానని, నిష్పక్షపాత విచారణ జరగాలన్నది తన డిమాండ్ అని వెంకటేశ్వరరావు ఆ లేఖలో వివరించారు.  గత టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు విజయవాడ కమిషనర్‌గా ఇంటెలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది.ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. భద్రతా పరికరాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. సస్పెన్షన్‌పై ఏబీ క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. అయితే  ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది జగన్ సర్కార్. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు స్టే ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ గత నవంబర్ లో తీర్పు ఇచ్చింది.  

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై మంగళవారం తీర్పు వెల్లడించింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అయితే, నిర్మాణం మొదలుపెట్టే ముందు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్‌ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించింది   కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.20,000 కోట్లతో 'సెంట్ర‌ల్ విస్టా' ప్రాజెక్టును తలపెట్టింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు. పార్లమెంట్ భవనంలో ఒక పెద్ద‌ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ప్లేసులు, అన్ని సౌక‌ర్యాలు ఉంటాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి నివాసం సౌత బ్లాక్‌కు, ఉపరాష్ట్రపతి కొత్త నివాసాన్ని నార్త్ బ్లాక్ సమీపంలోకి త‌ర‌లిస్తారు.   ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి గత  డిసెంబర్ 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయితే, ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రాజెక్టు పలు నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ఏకీభవించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐదు రోజులైనా సీఎం ఏం గడ్డి పీకారు! 

ఆలయాలపై దాడులు , పోలీసుల తీరు, సర్కార్ నిర్లక్ష్యంపై మరోసారి  నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మతమార్పిడులు చేయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారని నిలదీశారు. హిందూ-ముస్లిం మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం పర్యటన చేపట్టడంతో ప్రభుత్వం భయపడి మాపై నిందలు వేస్తోందని, ఘటన జరిగి 5 రోజులైనా పట్టించుకోకుండా ఏం గడ్డి పీకారని చంద్రబాబు ప్రశ్నించారు. రామతీర్థం ఘటన అమానుషమన్న చంద్రబాబు..  మన దేవాలయాలను మనమే కాపాడుకుందామని ఏపీ ప్రజలకు  పిలుపు ఇచ్చారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అయినంత మాత్రాన..దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆపరా? అని టీడీపీ అధినేత ప్రశ్నించారు.  తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ మసీదు, చర్చిపై దాడి జరగలేదన్నారు చంద్రబాబు.  రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని మండిపడ్డారు. గ్రామాల్లో పెరుగుతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రంలో మతమార్పిడులు చేయించడానికి వీళ్లేదన్నారు. కులమతాలకు అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణాన్ని సీఎం జగన్ గుర్తించాలన్నారు చంద్రబాబు. పాస్టర్లకు రూ.5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. రాష్ట్రంలో హిందువులతో పాటు ముస్లింలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టే ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టమని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు 

టీఆర్ఎస్ కు వరంగల్, ఖమ్మం టెన్షన్ ! ఎన్నికల వాయిదాకు ప్లాన్ ?  

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఫలితాలతో షాకైన అధికార టీఆర్ఎస్ పార్టీ  ఎన్నికలంటేనే భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉండటంతో ఇప్పట్లో ఎన్నికల జోలికి వెళ్లకపోవడమే బెటరని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గడువుకన్నా రెండు నెలల ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ సర్కార్... వరంగల్,  ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు మాత్రం ప్లాన్ మార్చినట్లు చెబుతున్నారు. గడువు ముగిసిన తర్వాత కొంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలో పెట్టి పరిస్థితులు అనుకూలంగా వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది.  సోమవారం జరగాల్సిన మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన వాయిదా పడటంతో కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడటం ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది.  వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం మార్చి 14వ తేదీ వరకు ఉంది. పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో  ప్రతికూల పరిస్థితి ఉన్నట్లు తేలిందట. గతేడాది వచ్చిన వరదల సమయంలో ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోవడం, జీహెచ్ఎంసీ తరహాలో వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం లాంటి అంశాలు వరంగల్ లో అధికార పార్టీకి ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు.  దీంతో తొందరపడి ఎన్నికలకు వెళ్లడం కంటే. ఎన్నికల వాయిదా పద్ధతే ఉత్తమమన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.  సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాల్టీల పాలకమండళ్ల గడువు ఐదారు నెలల్లో ముగియనుంది. దీంతో  వాటితో పాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉందని చెబుతున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఆ  రెండు ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని కాస్త మెరుగుపర్చుకుని ఇప్పటివరకు జరిగిన డ్యామేజీని కాస్త చక్కిదిద్దుకోవచ్చన్నది గులాబీ పార్టీ ఆలోచనగా ఉందంటున్నారు.    గడువు ప్రకారమే ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది.  ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వరదసాయం, ఎల్ఆర్ఎస్ లాంటి అంశాలను ప్రచారం చేస్తోంది. రెండు నెలల ముందస్తు ఎన్నికలకు పోయి జీహెచ్ఎంసీలో చేదు అనుభవాలను చవిచూసినందువల్ల వరంగల్, ఖమ్మం ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వస్తే రాష్ట్రవ్యాప్తంగా గడ్డు పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోందట.  వరంగల్, ఖమ్మం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మంత్రి కేటీఆర్ రెండు చోట్ల టెక్స్‌టైల్ పార్కు, ఐటీ పార్కు లాంటి పలు ప్రకటనలు చేశారు. స్వయంగా ఈ రెండు జిల్లాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా  పాలనను గాడిలో పెట్టడానికి దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో సైతం లబ్ధి పొందడానికి కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.   టీఆర్ఎస్ సర్కార్ తీరుతో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు  ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడువు ముగియడానికి మూడు నెలల ముందునుంచే ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టాల్సి ఉంటుంది. కాని  ఇప్పటికింకా అలాంటి ప్రయత్నాలే ప్రారంభం కాలేదు. ఈలోగా కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయడం, దానికి అనుగుణంగా వార్డుల పునర్ వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల ఖరారు, పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించడం లాంటివన్నీ జరగాల్సి ఉంది. ఇవేని జరగకపోవడంతో గడువు లోగా  వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగడం కష్టమేననే అభిప్రాయమే అధికార వర్గాల నుంచి వస్తోంది.

నీ పాలనతో రాజారెడ్డి మనవడినని ప్రూవ్ చేసుకుంటున్నావా.. జగన్ పై మండిపడ్డ యువతి 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుపై ఓ యువతి తీవ్రస్థాయిలో మండిపడింది. "అబ్బబ్బబ్బబ్బా.. ఏం పరిపాలన జగన్మోహన్ రెడ్డి.. నీ పరిపాలనలో పేకాట ఆడినా తప్పులేదు.. ఆడపిల్లలను మానభంగాలు చేసినా, చంపేసినా తప్పులేదు.. నడిరోడ్డుపై పట్టపగలు ఓ మనిషిని నిర్ధాక్షిణ్యంగా చంపేసినా దిక్కూ మొక్కూ ఉండదు.. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసినా తప్పులేదు.. కానీ ప్రభుత్వం చేసిన తప్పులను ఎవరైనా ప్రశ్నించినా.. చిన్న పోస్టు పెట్టినా.. వాళ్లపై కేసులు పెట్టడం, చంపేయడం చేస్తున్నారు. ఏం రాజ్యమిది.. నువ్వు రాజారెడ్డి మనవడినని ఫ్రూవ్ చేస్తున్నావా? పులివెందుల పంచాయితీలు, రాజకీయాలను రాష్ట్రమంతటా పాకించాలని అనుకుంటున్నావా..?. రాజన్న రాజ్యం తీసుకువస్తానన్నావ్. కానీ నీ రాజ్యంలో సాక్షాత్తు రాముడికి కూడా సేఫ్టీ లేదు. ఇక ప్రజలు ఎలా బ్రతకాలి? రాష్ట్రాన్ని, ప్రజలను ఏం చేద్దామని అనుకుంటున్నావ్.. నీవు ఎలా ఉన్నావో.. నీ మంత్రులు కూడా అలాగే ఉన్నారు. నీవు రాజ్యాంగాన్ని గౌరవించి.. పాలించాలి, రాజ్యాంగమంటే నీవు రచించుకున్న రాజారెడ్డి రాజ్యాంగం కాదు జగన్మోహన్ రెడ్డీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం.. అది నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. దీనికి ఎవరూ అతీతులు కాదు.. అందులో నీవు మొదటివాడివి.. ఇదొక పరిపాలన అనుకుంటున్నావా? ఎన్ని రోజులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, చంపించి, కేసులు పెట్టించి పాలించాలనుకుంటున్నావ్.. దీనిపై తిరుగుబాటు తప్పదు.. ఒక్కసారి తిరుగుబాటు మొదలైతే నీ పతనం మొదలౌతుంది. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డీ’’ అంటూ ఆ యువతి మాట్లాడిన వీడియోను పోస్టు చేసింది. తాజాగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

పేకాట డెన్ తో ఆ మంత్రికి ఊస్టింగేనా ? జగన్ సర్కార్ కు ఆయన గండమేనా?  

గడ్డం గ్యాంగ్ తో గండం వచ్చిందా? కృష్ణా జిల్లా రాజకీయాల్లో మార్పులు జరగబోతున్నాయా? తాడేపల్లికి ఆయన పరుగులెందుకు? ఇదే ఇప్పుడు అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ లో చర్చగా మారింది. గుడివాడలో  పేకాట డెన్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది.  తమ్మిరిస పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేసి.. 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, భారీగా నగదు సీజ్ చేసింది.  అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే  పేకాట క్లబ్‌ నడుపుతున్నారని.. సాక్షాత్తూ మంత్రి అండ కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వైసీపీ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. దాడులతో  మంత్రి కొడాలి నాని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపువల్లే మంత్రి హడావుడిగా తాడేపల్లికి పరుగులు పెట్టారంటున్నారు.   కొద్ది రోజుల క్రితం గుడివాడలో జరిగిన బహిరంగ సభలో పేకాట క్లబ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు."మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగా లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?" అని మంత్రిని ప్రశ్నించారు. పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్ పై దాడులు జరగడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. గుడివాడ పేకాట డెన్ కొడాలి నానీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. పేకాట డెన్  వ్యవహారంపై సీఎం జగన్  సీరియస్ గా ఉన్నారని,  మంత్రి కొడాలిని  క్యాంప్ కార్యాలయానికి పిలిపించి చివాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. అంతే కాదు కొడాలి మంత్రి పదవికి ఎసరు వచ్చిందనే చర్చ జరుగుతోంది. పేకాట డెన్ తో ప్రభుత్వం అభాసుపాలైందని భావిస్తున్న జగన్.. కొడాలిని మంత్రి వర్గం నుంచి తొలగించి.. ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల సమాచారం.   జగన్ కేబినెట్ లో ఉన్న కొడాలి నాని వ్యవహారం మొదటి నుంచి వైసీపీకి ఇబ్బందిగానే మారిందనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. మంత్రిగా ఉంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు కొడాలి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై బూతులు మాట్లాడుతున్నారు. అమ్మ మొగుడు వంటి అన్ పార్లమెంటరీ పదాలు కొడాలి నానికి ఊతపదాలుగా మారిపోయాయి. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే కొడాలి అలా మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేబినెట్‌లోని 90 శాతం మంత్రుల పదవి కాలం రెండున్నర సంవత్సరాలేనని సర్కార్ ఏర్పాటు చేసిన కొన్ని రోజులపై  జగన్ స్పష్టం చేశారు. దీంతో అయిదు సంవత్సరాలు ఉండే 10శాతం జాబితాలో చోటు కోసం మంత్రులలో పోటీ నెలకొంది. ఇందు కోసం అందరికి భిన్నంగా పనితీరు కంటే.. బూతు సాహిత్యాన్నే కొడాలి అస్త్రంగా ఎంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.    గతంలో నరేంద్ర మోడీ, బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు సీఎం జగన్ సతీసమేతంగా రావాలని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు ప్రధాని నరేంద్ర మోడీని సతీసమేతంగా రామాలయానికి వెళ్లి భూమి పూజ చేసిన తర్వాత బీజేపీ ఆ మాటలు ఇతరులకు చెబితే బాగుంటుందని చెప్పారు. మోడీని ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీలోనూ కొంత ఆందోళన కలిగించింది. అందుకే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను తిట్టినప్పుడు శభాష్ అన్నవాళ్ళు, ప్రధాని మోడీని, ఇతర బీజేపీ నేతలను విమర్శించినప్పుడు మాత్రం కంగారు పడ్డారు.  దీంతో ఆ సమయంలోనే కొడాలిని జగన్ తన కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. మంత్రి పదవి ప్రతిష్టని దిగజార్చే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విపక్షాలతోపాటు సామాన్య ప్రజలలోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి బూతులు మాట్లాడుతున్నా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలెవరు అతన్ని వారించలేదని చెబుతున్నారు. అందుకే అతను మరింతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకి అవే ఆ మంత్రితో పాటు జగన్ సర్కార్ కు గండంగా మారాయంటున్నారు. కొడాలి నానికి సంబంధించి  మరో ప్రచారం కూడా జరుగుతోంది. గుడివాడ నుంచి ఎన్నికైనవారికి మంత్రి పదవి ఇస్తే .. ఆ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయదు అనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. 1955లో గుడివాడ నుంచి ఎంపికైన వేముల కూర్మయ్యకు ప్రకాశం పంతులు తన కేబినెట్ లో స్ధానం కల్పించారు. కాని ప్రకాశం పంతులు ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయలేదు. తరువాత 1983లో గుడివాడ నుంచి గెలిచిన టీడీపీ వ్యవస్ధాపకులు NTR ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే 1984లో నాదేండ్ల భాస్కరరావు కారణంగా ఎన్.టి.ఆర్ కు పదవి గండం ఎదురైంది. అందుకే 1985లో ఎన్.టి.ఆర్. గుడివాడ నుంచి శాసనసభ్యుడుగా గెలిచినా ..సెంటిమెంట్‌ భయంతోనే గుడివాడకు రాజీనామా చేశారని చెబుతారు. 1989లో గుడివాడ నుంచి ఎంపికయిన కఠారి ఈశ్వర్ కుమార్‌కు.. చెన్నారెడ్డి తన కేబినట్‌లో చోటు కల్పించారు. అయితే చెన్నారెడ్డి ప్రభుత్వం కూడా పూర్తికాలం కొనసాగలేదు. వీటన్నిటిని పట్టించుకోకుండా జగన్ గుడివాడ నుంచి ఎంపికయిన కొడాలి నానికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. దీనితో ఇప్పుడు కొడాలి నాని కారణంగా జగన్ సర్కార్‌కు కాలగండం ఏర్పడనుందా అనే చర్చ కూడా ఏపీలో జోరుగా సాగుతుంది.

చలో రామతీర్థం యాత్ర రగడ.. బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అరెస్ట్ 

విజయనగరం జిల్లా రామ‌తీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన పిలుపునిచ్చిన‌ ధర్మయాత్రను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ‌ అడ్డుకున్నారు. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన ప‌లువురు నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేయ‌గా.. రామతీర్థం జంక్ష‌న్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వాహ‌నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు, విజయసాయిరెడ్డిని రామతీర్థం గుట్టపైకి అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని వీర్రాజు ప్రశ్నించారు. ప్రస్తుతం అక్కడ సెక్షన్‌ 30 అమల్లో ఉంద‌ని.. ఎలాంటి ర్యాలీలకు అనుమ‌తి లేద‌ని పోలీసులు ఆయ‌న‌కు చెప్పారు. మరోపక్క ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారే అవ‌కాశం ఉండ‌టంతో.. వీర్రాజు‌తో సహా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయనను నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ప్రచార కమిటి చైర్మెన్ గా పాదయాత్ర! రాహుల్ , రేవంత్ ప్లాన్ ఇదేనా ?

తెలంగాణ కాంగ్రెస్ కమిటి కూర్పు ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నెలరోజుల మంత్రాంగం తర్వాత టీపీసీసీ పగ్గాలపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా ఎవరూ ఊహించని ట్విస్ట్ టీపీసీసీ ఎంపికలో కనిపిస్తోంది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలలో ఎవరో ఒకరికి పీసీసీ పగ్గాలు ఇస్తారని భావించినా.. హైకమాండ్ మాత్రం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఖరారు చేశారని తెలుస్తోంది.  పీసీసీ చీఫ్ ఖాయమనుకున్న రేవంత్ రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్‌గా , రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా,  సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించారని సమాచారం. పీసీసీ పగ్గాల కోసం తీవ్ర పోటీ ఉండటం, నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మధ్యే మార్గంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా జీవన్ రెడ్డి ఎంపిక చేశారని భావిస్తున్నారు.    టీపీసీసీ కూర్పు వెనక హైకమాండ్ భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నించినా..  సొంత పార్టీ నేతలే తనను వ్యతిరేకించడంతో  ఒక దశలో ఆయన అసంతృప్తి లోనయ్యారని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని తమ తురుపు ముక్కగా భావిస్తున్న మరో ఐడియా వేసిందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున... కొన్ని రోజుల వరకు జీవన్ రెడ్డిని పీసీసీగా కొనసాగించి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డికి అ బాధ్యత అప్పగించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. పీసీసీ పదవి వస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని గతంలో రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు ప్రచార కమిటి చైర్మెన్ గా రేవంత్ రెడ్డితో పాదయాత్ర చేయించే యోచనలో హైకమాండ్ ఉందట. వయసు రిత్యా ఎలాగూ జీవన్ రెడ్డి పాదయాత్ర చేయలేరు కాబట్టి.. రేవంత్ కు ఇక్కడ వచ్చిన ఇబ్బందేమి ఉండదు.    తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసే సరికి .. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చి... ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలు ఎదుర్కొవాలనే ఆలోచనతోనే హైకమాండ్ తాజా పీసీసీ కూర్పు చేసిందనే చర్చ గాంధీభవన్ లోనే జరుగుతోంది. అందుకే రేవంత్ రెడ్డి తనంతట తానుగా జీవన్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానానికి ప్రతిపాదించారని సమాచారం.  పీసీసీ రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ , శ్రీధర్ బాబుకు సీఎల్పీ, మల్లు భట్టి విక్రమార్కకు సమన్వయ కమిటి చైర్మెన్ పదవులు ఇచ్చినందున ఎవరిలోనూ నిరాశ ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందట.   రేవంత్ రెడ్డికి ప్రచార కమిటి చైర్మెన్ పదవి ఇవ్వడానికి మరో లాజిక్ కూడా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధాని కాక ముందు.. అంటే 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రచార కమిటి చైర్మెన్ గా పని చేశారు. ఆ పదవితోనే ఆయన దేశ మంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. ప్రచార కమిటి చైర్మెన్ గా పార్టీ బలోపేతానికి పాటుపడిన నరేంద్ర మోడీకే ప్రధానమంత్రి పదవి వరించింది. రేవంత్ కూడా అదే రూట్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ గా రాష్ట్ర మంతా పాదయాత్ర చేసి.. ప్రస్తుతం నిరాశలో ఉన్న కాంగ్రెస్ కేడర్ లో జోష్ తేవాలని రేవంత్ ఆలోచన. రేవంత్ ఈ ఆలోచనకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్  ఇచ్చిందని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఖాయమని అతని అనుచరులు కూడా  చెబుతున్నారు.      అందుకే ప్రచారకమిటీ చైర్మన్ అంటేనే  తనకు చాలా ఇష్టమని చెప్పారు రేవంత్ రెడ్డి.  ఆ పదవి ఇస్తే రాష్ట్రం మొత్తం  పాదయాత్ర చేస్తూ ప్రచారం  చేస్తానంటున్నారు. రాష్ట్రానికి , దేశానికి ప్రచార కమిటీ చైర్మన్ చాలా కీలకమైన పదవులన్న రేవంత్ రెడ్డి.. పీసీసీ పదవి కార్యక్రమాల రూపకల్పన,సమన్వయ చేసేందుకు మాత్రమే పని కొస్తుందన్నారు. రాష్ట్ర మొత్తం తిరగాలంటే ప్రచారకమిటీ చైర్మన్ పదవే కీలకమన్నారు. పీసీసీ పదవి ఎవరికి వచ్చిన సంతోశషంగా అందరితో కలిసి పనిచేస్తానని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ తను తీసుకున్న గోతిలో ఆయనే పడి కొట్టుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను నాశనం చేద్దామని గోయి తవితే ఆ గోయిలోనే కేసీఆర్ పడిపోయాడరన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ బొమ్మ బోరుసులాంటివని.. ఆ రెండు పార్టీలను ఓడించడమే తమ లక్ష్యమంటున్నారు రేవంత్ రెడ్డి.

రిపీటైన శుభలగ్నం సీన్.. భర్తను 15 కోట్లకు అమ్మిన భార్య

దాదాపు 25 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో జగపతిబాబు, ఆమని, రోజా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ "శుభలగ్నం" మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో హీరోయిన్ ఆమని డబ్బు ఆశతో తన భర్తను కోటి రూపాయలకు మరో యువతికి అమ్మేస్తుంది. అప్పట్లో ఈ సినిమాపై మహిళలలో విపరీతమైన చర్చ జరిగింది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళ తన భర్తను రూ.15 కోట్లకు ఆయనను ప్రేమించిన ప్రియురాలికి అమ్మేసింది. ఈ రియల్ లైఫ్ శుభలగ్నం స్టోరీ, తాజాగా మధ్యప్రదేశ్ లో వైరల్ అయింది.   ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు ఈమధ్య ఒక కేసు వచ్చింది. ఒక బాలిక తన తండ్రి అతని ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తన అమ్మతో తరచూ గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఇంట్లో ప్రశాంతత కరువైందని.. ఈ కారణంగా తాను, తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామని ఆ ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించగా.. ఆ బాలిక ఫిర్యాదు నిజమేనని వెల్లడైంది. అంతేకాకుండా అతను ఆ ప్రియురాలితోనే ఉండాలనుకుంటున్నట్లుగా స్పష్టం చేశాడు. అయితే దీనికి అతని భార్య ఒప్పుకోలేదు.   అయితే ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులు ఆ దంపతులకు పలు మార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో చివరకు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అతని భార్య ఒక షరతుపై తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. తాను భర్తను ఆమెకు అప్పగించాలంటే తనకు ఒక ఖరీదైన ఫ్లాట్‌తో పాటు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తారని స్పష్టం చేసింది. ఈ షరతుకు భర్త ప్రియురాలు ఒప్పుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ సందర్భంగా అతని భార్య మాట్లాడుతూ పెళ్లయి ఇన్నేళ్లు గడచిన తరువాత తన భర్త ఇలా ప్రవర్తించడం తనకు ఏమాత్రం నచ్చలేదని.. అయితే తన పిల్లల భవిష్యత్ దృష్ట్యా డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

టీపీసీసీ చీఫ్ గా చివరి నిమిషంలో జీవన్ రెడ్డి..?

టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాబోయే పీసీసీ చీఫ్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అంటూ కొంతకాలంగా వార్తలు వచ్చినప్పటికీ.. అనూహ్యంగా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్‌రెడ్డి చెపుతున్నారు. అయితే రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరీ ముఖ్యంగా కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది.   మరోపక్క ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు మాత్రం రేవంత్‌రెడ్డికే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ముఖ్యనేతలెవరూ ధ్రువీకరించడంలేదు. అలా అని ఖండించడమూ లేదు. దీంతో జీవన్‌రెడ్డి అధ్యక్షుడయ్యేందుకు 50-50 అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్‌ తదితర నేతల పేర్లను ఆమె పరిశీలించి.. ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించనున్నట్లు సమాచారం.    

వారంతా క్రైస్తవులే... అందుకే హిందూ దేవాలయాలపై దాడులు: కాల్వ ఫైర్ 

ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ముగ్గురూ క్రైస్తవులేనని.. మరి అటువంటి పరిస్థితుల్లో హిందూ మతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే జగన్ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం లేదని విమర్శించారు.   "మంత్రి కొడాలి నాని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు ఖండించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశృంఖలత్వం తాజాగా రాముని శిరచ్ఛేధనం వరకు తెచ్చింది. దీంతో ఏపీలో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. జగన్ తన నిర్వాకంతో మెజార్టీ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బ తీస్తున్నారు." అంటూ కాల్వ తీవ్ర విమర్శలు చేసారు.   "ప్రస్తుతం ఏపీలో దేవుడికే రక్షణ లేని అనాగరిక సమాజాన్ని స్థాపించేందుకే సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారు. రాముడు తల తీసేయడం ఒక అనాగరికమైన, ఆటవిక చర్య. వరుసగా జరుగుతున్న ఈ దుర్ఘటనల వెనుక ఎవరున్నారో తేలాలి. బ్రిటీష్ జమానాలో కూడా హిందూ దేవాలయాలపై ఈ స్థాయిలో దాడులు జరగలేదు. ఏ వర్గం మనోభావాలైనా దెబ్బతింటే.. ఆ వర్గం పక్షాన టీడీపీ నిలబడి పోరాడుతుంది. అయినా చంద్రబాబు రామతీర్ధం వెళ్లే దాకా ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది.. ఎక్కడ గడ్డి పీకుతోంది. చంద్రబాబు పర్మిషన్ తీసుకుని వెళ్లినరోజే.. విజయసాయి ఎందుకెళ్లారు..." అని జగన్ ప్రభుత్వంపై కాల్వ మండి పడ్డారు.   చంద్రబాబును రామతీర్ధం వెళ్లకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడంతో.. ఆయనను ప్రజలే వెంట బెట్టుకు తీసుకెళ్లారు. మరోపక్క రామతీర్ధం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి విశాఖ వెళ్లారు. అయినా విజయసాయిపై దాడితో టీడీపీకి, చంద్రబాబుకేం సంబంధం. హిందూ ఆలయాల రక్షణలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది..? అసలు హిందూ ధర్మంపై దాడి చేసే అధికారం సీఎం జగన్ కు ఎవరిచ్చారు..?" అని కాల్వ శ్రీనివాసులు నిలదీశారు.   అసలు "సీఎం, హోంమంత్రి, డీజీపీల పర్యవేక్షణలోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్రంలో ప్రచారం ఉంది. హిందూ ధర్మంపై ప్రభుత్వమే దాడులు జరుపుతోంటే ఇక ఎవరికి చెప్పాలి..? ఒకపక్క ఉత్తరాదిలోని అయోధ్యలో రాముని గుడి నిర్మిస్తోంటే.. ఇక్కడ ఏపీలో రాముని తల తీసేశారు. ఏపీలోని దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో సీబీఐ తో విచారణ జరిపించాలి. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలి" అని అయన డిమాండ్ చేశారు.

సోము భజన.. సంజయ్ గర్జన! ఏపీ బీజేపీ పరువు గోవిందా! 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల పరువు తీస్తూ నాయకుడంటే ఎలా ఉండాలో చూపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికార పార్టీకి తొత్తులుగా కాదు.. సర్కార్ వైఫల్యాలు, అరాచకాలపై ఉద్యమించాలనే సంకేతమిచ్చారు. ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా.. పోరాటం చేయలేని ఏపీ బీజేపీ నేతల దుస్థితిని పరోక్షంగా ఎండగడుతూ.. ఎలా ముందుకు వెళ్లాలో చూపించారు బండి సంజయ్. జగన్  ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.  దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు సంజయ్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినైన తాను... ఏపీలో జరుగుతున్న దారుణాలపై బాధతోనే మాట్లాడుతున్నానంటూ.. ఏపీ బీజేపీ నేతల చేతగాని తనాన్ని చెప్పకనే చెప్పారు బండి సంజయ్.   హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు సంజయ్. రెండు కొండలవాడా గోవిందా గోవిందా అనే వైసీపీకి ఓటు వేస్తారా? లేక ఏడు కొండలవాడా గోవిందా గోవిందా అనే బీజేపీకి ఓటువేస్తారా? అనే విషయాన్ని ఏపీలోని హిందువులందరూ ఆలోచించాలని అన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకున్న పార్టీ ఇప్పుడు ఏపీలో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని... అధికార పార్టీకి బుద్ధి చెపుతారని అన్నారు. ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు బండి సంజయ్.  తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ బీజేపీ కార్యకర్తలు బలవంతులని, దమ్మున్నవారని చెబుతూ.. జగన్ సర్కార్ ఉద్యమించడానికి ఓ రకంగా వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు  బండి సంజయ్.  ఆంధ్రప్రదేశ్ లో  జగన్ రెడ్డి పాలన వచ్చాకా  హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే 150కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయమయ్యాయి. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం రామతీర్థం  కోదండరామాలయంలోని రాముడి విగ్రహాన్ని రెండు ముక్కలు చేశారు దుండగులు.  ఆలయాలపై దాడులు జరుగుతున్నా హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించ లేదు. ఎక్కడో పాకిస్థాన్ లోని హిందూ దేవాలయంపై దాడి జరిగితే ఆవేశంగా స్పందించే ఏపీ బీజేపీ నేతలు.. సొంత రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతున్నా తమ జగన్ భక్తినే చాటుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండే ఉండేందుకన్నట్లు.. ఆలయాలపై దాడులను ఖండిస్తున్నట్లు పేపర్ స్టేట్ మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.      రామతీర్థంలో రాములోరి తల నరికినా.. నిత్యం  జై శ్రీరామ్ నినాదాలు చేసే ఏపీ కమలనాధులు ఏపీ సర్కార్ ను గట్టిగా నిలదీయలేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనతో మేల్కొని కొంత హడావుడి చేశారు. అక్కడ కూడా తమ రాజకీయ కుట్రను బయటపెట్టుకున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయకుండా  అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పటిలానే చంద్రబాబుపై పడ్డారు. రామతీర్థం ఘటనపై మాట్లాడకుండా.. టీడీపీలో హయాంలో కూల్చేసిన గుడుల గురించి ప్రస్తావించి తన జగన్ భక్తి చాటుకున్నారు. కేంద్రం నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న గుడులను తొలగించారని తెలిసినా.. అవే పసలేని ఆరోపణలు చేశారు విష్ణువర్దన్ రెడ్డి. జగన్ సర్కార్ కు ఇబ్బంది కాకుండా, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ కేడర్ నుంచే వస్తున్నాయంటే ఏపీ బీజేపీ నేతల తీరు ఎలా ఉందో ఊహించవచ్చు.  ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మన నేతలు చేయలేని పనిని తెలంగాణ అధ్యక్షుడు చేశారని కమలం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే సంజయ్ లాగా దూకుడుగా ఉండాలి .. కాని అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తే సాధ్యం కాదని చెబుతున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతల వల్లే ఏపీలో బీజేపీ నాశనం అవుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి భజన వీడి వైసీపీ కోసం కాకుండా పార్టీ కోసం బండి సంజయ్ లాగా పని చేస్తేనే ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి జగన్ రెడ్డి సర్కార్ పై బండి సంజయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా మారాయి. ఏపీ బీజేపీ కార్యకర్తలంతా బండికి ఫిదా అయిపోయారని తెలుస్తోంది. అదే సమయంలో సంజయ్ వ్యాఖ్యలతో తమ చేతకానితనం బయటపడిందని సోము వీర్రాజు టీమ్ వర్రీ అవుతోందని తెలుస్తోంది. 

'జాక్ మా' కనబడుటలేదు.. ఏమైపోయాడు?

చైనా కుబేరుడు, అలీ బాబా సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ మా గత రెండు నెలలుగా కనిపించడంలేదు. ఆయన ఆస్తుల విలువ కూడా పడిపోయింది. కొన్ని నెలల కిందట 61 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద ఇప్పుడు 50 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనంతటికీ ఆయన మాట్లాడిన ఒక్క మాటే కారణం. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్నే మార్చేసింది.    గత అక్టోబరులో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలు, బ్యాంక్ రెగ్యులేటరీలపై జాక్ మా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని, విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవర్చుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో జాక్‌ మాపై ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది. ఆయన సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా వేసింది. వ్యాపారాలపై విచారణకు ఆదేశించింది. జాక్ మా ఎదిగేందుకు ఉపకరించే చర్యలను అడ్డుకుంది.    చైనా ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో జాక్ మాకు గడ్డుకాలం మొదలైంది. ఆయన ఆస్తులు హరించుకుపోతున్నాయి. రెండు నెలల్లోనే 11 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంతేకాదు, రెండు నెలలుగా ఆసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడంలేదు. నిజానికి జాక్ మా స్వయంగా నిర్వహించే 'ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్' అనే టాలెంట్ షోలో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన ఆ షోకు కూడా రాలేదు. ఆయన తరపున ఆలీబాబా ఎగ్జిక్యూటివ్ ఒకరు పాల్గొన్నారు. జాక్ మా షెడ్యూల్ బిజీగా ఉన్నందునే రాలేకపోయారంటూ ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కానీ దీనిపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. జాక్ మా అదృశ్యం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది.